రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జనవరి 2016, శుక్రవారం








దర్శకత్వం-మాటలు  : కళ్యాణ్ కృష్ణ

తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, బ్రహ్మానందం,
చలపతి రావు, సప్తగిరి, నాగబాబు, సంపత్ రాజ్, నాజర్, వెన్నెల కిషోర్,
బ్రహ్మాజీ, ఝాన్సీ, అనసూయ, హంసా నందిని
మూలకథ : పి. రామ్మోహన్ , స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కేకే, ఛాయాగ్రహణం : పి ఎస్ వినోద్, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ : రవిందర్,
నృత్యాలు : రాజూ సుందరం, విశ్వ, రఘు
http://www.filmyfreak.com/
http://www.filmyfreak.com/
బ్యానర్ :  అన్నపూర్ణా స్టూడియోస్, నిర్మాత : నాగార్జున
విడుదల : జనవరి 15, 2016
***
'యూ’ సర్టిఫికేట్ తో వినోదాత్మక సినిమాల్ని ఇహ దాదాపు మర్చిపోవాల్సిందే అనుకుంటున్న సమయంలో సంక్రాంతి కోతకి కొత్త వరి వంగడంలా కసకస లాడుతూ ప్రేక్షకుల  మధ్యకి వచ్చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’  కోసుకున్నవారికి కోసుకున్నంత వినోదం. కోసుకుంటున్న కొద్దీ కోతకి అందే కొత్త వంగడం. కోసికోసీ అలసిపోవాలే తప్ప తను మాత్రం కర్సవని విందువినోదాల పంట!

        పండగ రోజుకూడా పాత మొగుడేనా అన్నట్టు వచ్చిన పండగ సినిమాల మధ్య  ఏ పాత మొగుడు బెటరని చూస్తే, పండక్కి తగ్గట్టు తెలుగుదనపు  పంచె కట్టుతో అచ్చతెలుగు మాటాడుతూ విచ్చేసిన బంగార్రాజే కన్పిస్తాడు. పండగ మూడ్ కి న్యాయం చేస్తూ, పండగని పండగలా ఉండనిస్తూ, తెలుగు సినిమాని కూడా చాలా కాలానికి దయతల్చి తెలుగు సినిమాలానే  వుండనిస్తూ-  బంగార్రాజు బాక్సాఫీసుకి బాకా వేసి మరీ పసి నుంచీ ముసలి వరకూ పొలోమని బళ్ళు కట్టిస్తాడు. తనెవడో తెలియని పసి కీబోర్డు రాక్షసి వెధవకి, తానింకా ఇంతేనేమోలే  అనుకునే ముసలి నిరాశా జీవికీ,  పల్లెనంతా విప్పి చూపించి- పరికిణీల రెపరెపల కాడ్నించీ కాడెద్దుల గిట్టెల చప్పుళ్ళ వరకూ అన్నీ బతికే ఉన్నాయనీ; అమెరికా వెళ్లి చెడినా, ఆ బంధాల్ని  కలుపుకోవడానికి ఏ టూ జెడ్ మనిషితనం అంతా ఇక్కడే కుప్పపోసి ఉందనీ భరోసా కల్పిస్తాడు.

        కమర్షియల్ సినిమాల  పేరుతో తీస్తున్నవి నిజమైన కమర్షియల్ సినిమాల్లా వుండడం లేదు, కేవలం అవి ఫ్యాన్స్ కీ, పేదవర్గాలకీ పరిమితమైపోయిన ‘మాస్’ సినిమాల్లా ఉంటున్నాయి. ఈ గ్లోబల్ యుగంలో కూడా పేదల్ని ఇంకా పేదలుగానే చూపిస్తూ, వాళ్ళని నిరు పేదలుగానే వుండనిచ్చే రాజకీయం చేస్తూ, నెగెటివిజంతో  ఉత్పత్తి అవుతున్నవే ‘స్లమ్- లేదా బస్తీ’ మార్క్ సినిమాలు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ డానీ బాయల్ ని చాలా విమర్శించారు- ఇండియా అంటే  కంపుకొట్టే మురికి వాడలే అన్నట్టు చూపించాడని. అవసరం లేదు, టాలీవుడ్ లో  మాస్ (స్లమ్- బస్తీ) సినిమాల పేరుతో  ఈ పని ఎప్పట్నించో జరుగిపోతోంది. ప్రధాని స్వచ్చ భారత్ అంటూంటే తెలుగు సినిమాలు ఆ చెత్తనే చూపిస్తున్నాయి.  ఇహ హైటెక్ సిటీలొద్దూ, లోఫర్ స్లమ్సూ  వద్దూ అనుకుని, పచ్చని పల్లెని చూపించడానికి కూడా దమ్ము కావాలి. ఆ దమ్ముతో మీసం తిప్పుతూ బుల్లెట్ మీద వచ్చినవాడే బంగార్రాజు.

        ఈ బంగార్రాజు - నేను అక్కినేని నాగార్జుననీ- అని ఇగో చూపించి ఈలలు వేయించుకోడు, తనది ఏ వంశపు రక్తమో డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకోడు, థియేటర్ని ఒక పార్టీ సభలా మార్చి ఉపన్యాసాలిచ్చి కేరింతలు కొట్టించుకోడు. కృత్రిమత్వంతో సినిమా చూసే అనుభవాన్ని కల్తీ చెయ్యడు. అతనేం చెప్పినా, ఏం చేసినా పాత్ర స్వభావం కొద్దీ మాత్రమే స్వచ్చంగా చెప్పి, చేసి  నవ్విస్తాడు. కేవలం హృదయపూర్వకంగా నవ్విస్తూంటాడు. పాత్రలో అక్కినేని నాగార్జునని చేతనైనంత ఎంజాయ్ చేసుకోనిస్తాడు బంగార్రాజు కూడా. ఈ దశాబ్దపు మర్చిపోలేని కమర్షియల్ క్యారక్టర్ బంగార్రాజైతే, దాన్ని దుక్కిదున్ని పారేసిన స్టార్ నాగార్జున.
                                         ***
ఫాంటసీ లోకి ప్రయాణం 

        చ్చి నరకంలో వున్నాడు బంగార్రాజు. కారణం బతికున్నప్పుడు వూళ్ళో అతను మచ్చలేని మన్మథుడు. కాబట్టి యముడు ( నాగబాబు) నరకంలో సీటు రిజర్వ్ చేశాడు. అక్కడ కూడా కళ్లు తిరిగే మన్మథలీలల్ని చూపిస్తూంటే భూమ్మీదికి నెట్టేశాడు యముడు. భూమ్మీద అప్పటకే బంగార్రాజు భార్య సత్య ( రమ్యకృష్ణ) ఓ సమస్యకి సాయం అడుగుదామని అతడి ఫోటో ముందు వచ్చి నిలబడింది. బంగార్రాజు వచ్చి వాలిపోవడంతో షాకయ్యింది. 



        సమస్యేమిటంటే, అమెరికాలో డాక్టరుగా ఉంటున్న రాము ( యంగ్ నాగార్జున)  భార్య సీత ( లావణ్యా త్రిపాఠీ) తో వచ్చాడు. ఎడమొహం పెడమొహంగా వున్నారు. ఏంటంటే విడాకులు తీసుకోవడానికి వచ్చామన్నారు. షాకయిన సత్య భర్త ఫోటో దగ్గరి కెళ్ళింది. అక్కడకూడా షాక్ తిని ఆత్మరూపంలో ప్రత్యక్షమైన బంగార్రాజుని చూసింది.

        రాము సమస్యకి ప్రత్యక్షంగా సత్య, పరోక్షంగా బంగార్రాజులే కారణం. రాము కడుపులో ఉండగానే చనిపోయాడు భర్త బంగార్రాజు. ఆ భర్తలా నవమన్మథుడు  అవకూడదని, పుట్టిన రాముని ఆడగాలి అస్సలు తగలకుండా నిర్బంధంగా పెంచింది సత్య. ఇప్పుడు పెళ్ళయ్యాకా కూడా డాక్టర్ రాము భార్యగాలి అస్సలు తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు, ఏమంటే డాక్టర్ వృత్తిలో క్షణం తీరికలేని బిజీ. మూడేళ్ళుగా అక్షరాలా మూడే సార్లు ముద్దూ ముచ్చటా  తీరిన భార్య సీత, ఇక  బేజారెత్తి పోయి విడాకులకి రెడీ అయ్యింది. ఓకే అన్నాడు రాము.

      సమస్య తెలుసుకున్న బంగార్రాజు రంగంలోకి దిగాడు. పడగ్గదిలో రాము శరీరంలోకి దూరి తన బ్రాండ్ మన్మథలీలల్ని రేపాడు. రేపినంత  సేపే రెచ్చిపోయి-  లాప్ టాప్ తో మెడికల్ లోకంలో తలమునకలవడం రాము దినచర్య అయింది. రాముని ఎన్ని రకాలుగా మార్చాలని ప్రయత్నిచాలో అన్నిరకాలుగా ప్రయత్నించి చూశాడు బంగార్రాజు. బంగార్రాజుకి అనుకోకుండా ఇంకో సమస్య కూడా ఎదురై ఆ పనిమీద కూడా బిజీగా ఉండాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల క్రితం తను యాక్సిడెంట్ లోనే  చనిపోయాడని  అనుకుంటున్నాడు. అది యాక్సిడెంట్ కాదు హత్య అని అనుమానం కలిగే పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆత్మలతో మాటాడే బాబా ( బ్రహ్మానందం) ని సంప్రదించి అతడి ద్వారానే గుట్టు బయట పెట్టేందుకు తన పినతండ్రి ( నాజర్) దగ్గరికి తీసికెళ్ళాడు. ఇలా కొడుకు కోడళ్ళ సమస్య ఒకవైపు, తన మరణ రహస్యం తెలుసుకునే సమస్య ఇంకో వైపూ బంగార్రాజుని వేధించాయి...

         యముడు పెట్టిన గడువు శివరాత్రి ముందు రోజువరకే. ఆ లోగా పనులు ముగించుకుని వచ్చేయాలి. అసలు వూళ్ళో గుడిని అడ్డం పెట్టుకుని జరిగిన- జరుగుతున్న కుట్ర లేమిటి, ఈ కుట్ర కి ఇప్పుడు రాము కూడా ఎలా బలికాబోయాడు, బంగార్రాజు రాముని ఎలా కాపాడి, భార్యతో కలిపాడు- కుట్ర దారులకి ఎలా బుద్ధి చెప్పాడూ అన్నవి ఇక్కడ్నించీ మిగతా కథ.

ఎవరెలా చేశారు
      నిస్సందేహంగా  ఇది నాగార్జున  ఒన్ మాన్ షో- ఓవరాక్షన్ లేని ఒన్ మాన్ షో. తూర్పు పడమరల్లాంటి బంగార్రాజూ రామూల పాత్రల్ని అవలీలగా పోషించేశాడు. ఈ పాత్రలు కొంత కాలం గుర్తుండి పోతాయి. ఒక తెలుగు హీరో ధోవతీ కట్టుకుని గ్రామీణ పాత్ర పోషించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఒకే రకం మూస ఆవారా మాస్ పాత్రల్ని చూస్తున్న ప్రేక్షకులకి ఒక మార్పునివ్వడం నాగార్జున చేసిన మంచి ఆలోచన. రెండేళ్ళ క్రితం- ‘మనం’ కంటే ముందు తన మూడు నాల్గు సినిమాలకి ఓపెనింగ్స్, అభిమానులూ లేని దశనుంచి ‘మనం’ తో సంచలనం సృష్టించడానికి అందులో మూడు తరాలకి చెందిన  తన కుటుంబ స్టార్లు వున్నారు. అది జరిగిపోయిన రెండేళ్ళకి  ప్రస్తుత సినిమా సోలోగా చేసి బంపర్ ఓపెనింగ్స్ తో ఈలలేయించుకోవడం చూస్తే, ట్రేడ్ పండితులకే కళ్ళుతిరిగి పోతాయి. సినిమా చూస్తున్న యూత్ రెచ్చిపోయి కాగితాలు విసిరి అభిమానం ప్రకటించుకోవడం ఇదంతా నాగార్జున  పూర్వ వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ, పాత్ర బావుంటే- అదికూడా తెలుగుదనంతో కూడిన తెలుగు సినిమాలాగే  వుంటే, ఈ స్టారూ ఎప్పుడూ వెనకబడి పోడని తేల్చి చెప్పాడు  నాగార్జున.

        రమ్యకృష్ణ వల్ల చెప్పలేని గ్లామర్ వచ్చింది సినిమాకి- హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ  కంటే కూడా. లావణ్యా త్రిపాఠీ సామాన్య యువతి ముఖ కవళికలతో గ్రామీణ కథ నేటివిటీలో ఒదిగిపోయింది. బ్రహ్మనందం క్లీన్ కామెడీ చేశారు. కుటుంబ సభ్యులుగా చలపతి రావు,
వెన్నెల కిషోర్,  బ్రహ్మాజీ, ఝాన్సీ నటిస్తే,  నాగబాబు యముడిగా కన్పిస్తాడు. విలన్లు నాజర్, సంపత్ రాజ్ లు. ఇక అనసూయ, హంసా నందిని, అనూష్కా లు బంగార్రాజు రాసలీలకి తోడ్పడ్డారు.

        పాటలు వాటి చిత్రీకరణా, ఛాయాగ్రహణమూ ఇతర సాంకేతిక హంగులన్నీ పక్కా కమర్షియల్ విలువల్ని ప్రదర్శిస్తాయి. 


        కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, ఇతర కొత్త దర్శకుల్లా కాకుండా తనది కాని కథని ఓన్ చేసుకుని, మాటలు రాసి చిత్రీకరణ చూసుకోవడం, దీనికి నాగార్జున కావాల్సిన మంది బలాన్ని సమకూర్చడం- వంటి వికేంద్రీ కరణ కూడా ఈ సినిమా ఇంత  బాగా రావడానికి కారణం. సీనియర్ సత్యానంద్ స్క్రీన్ ప్లే  సమకూర్చడం ఈ గ్రామీణ కథకి న్యాయం. 

       


-సికిందర్ 


డబుల్ గేమ్





 దర్శకత్వం : మేర్లపాక గాంధీ  
తారాగణం :  శర్వానంద్, సురభి, ప్రభాస్ శీను, సప్తగిరి, షకలక శంకర్, బ్రహ్మాజీ, హరీష్ ఉత్తమన్, ఊర్వశి, సుప్రీత్, దువ్వాసి మోహన్, నాగినీడు, సూర్య, పోసాని తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : మేర్లపాక గాంధీ - షేక్ దావూద్ జి.,  మాటలు : మేర్లపాక గాంధీ
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం :  కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్ : యువి క్రియేషన్స్, నిర్మాతలు : వంశీ, ప్రమోద్
విడుదల :  జనవరి 14, 2016 

        చాపకింద నీరులా ఒక ట్రెండ్ తెలుగులో దారులు చూసుకుంటోంది. ఇది  దర్శకులకే తెలియకుండా జరిగిపోతోంది. అటు హిందీలో ఈ ట్రెండ్ ని ఉద్దేశపూర్వకంగా ప్రారంభించారు. తెలుగులో ఉద్దేశం లేకపోయినా, తెలియకుండా ఈ ట్రెండ్ లో భాగస్వాములై పోతున్నారు. దశాబ్దంన్నర క్రితం దేశంలో  మల్టీ ప్లెక్స్ థియేటర్లనే కాన్సెప్ట్ ఎప్పుడయితే ప్రారంభమయిందో, అప్పట్నించీ హిందీలో కేవలం అలాటి మల్టీప్లెక్స్ థియేటర్లకే ఉద్దేశించి,  లో- బడ్జెట్ సినిమాలు, ఆ తర్వాత ఇండీ ఫిలిమ్స్ అనే దర్శకుడి పర్సనల్ టేస్ట్ వున్న  సినిమాలూ తీయడం ప్రారంభించారు. మల్టీ ప్లెక్స్ థియేటర్ల  ప్రేక్షకులు వేరు. కేవలం నగరాలకే పరిమితమైన ఆధునికులు వాళ్ళు. మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రేక్షకులు  పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో సైతం క్లాస్- మాస్ ప్రేక్షకులుగా వుంటారు. మల్టీ ప్లెక్స్ లకే ఉద్దేశించిన లో- బడ్జెట్ సినిమాలతో బాటు, ఇండీ ఫిలిమ్స్,  సింగిల్  స్క్రీన్ థియేటర్ ప్రేక్షకులు చూసేందుకు పట్టణాల్లో, పల్లెల్లో  పనికిరావు. ఎందుకంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్ సినిమా అంటే అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా. వీటి పాత్రలు, కథల తీరుతెన్నులు, వాటి కాన్వాసులు, ఫార్మాట్ లూ విస్తృతమైనవి; కమర్షియల్- మూస ఫార్ములా మసాలా దినుసులతో కూడినవి. ఇలా కాకుండా మల్టీప్లెక్స్ సినిమాల పాత్రలు, కథల తీరుతెన్నులు, చిన్న చిన్న కథలతో వాటి కాన్వాసులు పరిమితమైనవి. సింగిల్  స్క్రీన్స్ కి నప్పని ఎలాటి కథయినా, పాత్రయినా  తీసుకునే స్వేచ్ఛ ఇక్కడుంటుంది. గత దశాబ్దం న్నర కాలంగా హిందీలో ఇలా వస్తున్నవే భేజా ఫ్రై, ఫస్ గయారే ఒబామా, కాఫీ బ్లూమ్, తిత్లీ వంటి అసంఖ్యాకమైన లో- బడ్జెట్ మల్టీప్లెక్స్ సినిమాలు. ఇవి నగరాల్లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో ఆడవు, బి-సి సెంటర్లకి అసలే వెళ్ళవు. అక్కడి  ప్రేక్షకులకి చూపిస్తే ఇదేం  సినిమారా బాబూ అని తిట్టుకుంటూ వెళ్లిపోతారు.

        సరీగ్గా చెప్పాలంటే,  ఆర్ట్ సినిమాలు అంతరించిపోయిన కాలంలో శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లవంటి దర్శకులు కింకర్తవ్యం ఆలోచించి,  ఇహ తమ ఆర్ట్ సినిమాలకి మళ్ళీ జనాకర్షణ తీసుకురావాలంటే బాలీవుడ్ స్టార్స్ తో తీయక తప్పదని రాజీ పడి, అలా తీసినవే కమర్షియలార్ట్ అనే క్రాసోవర్ సినిమాలు. ఇకప్పుడు చిన్న చిన్న న్యూవేవ్ కథలతో అవకాశాల కోసం చూస్తున్న ఎందరెందరో కొత్త కొత్త దర్శకులు, మల్టీ ప్లెక్స్ థియేటర్లు కూడా పెరగడంతో - ఈ మార్గం పట్టుకుని మల్టీ ప్లెక్స్ సినిమాలకీ, ఆ తర్వాత ఏ సినిమా రూల్సూ వుండని ఇండీ ఫిలిమ్స్ కీ దారి తీశారు.

        తెలుగులో ఇలాటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం అసలుండదు. తెలుగు సినిమా అంటే అది క్లాస్ -మాస్ అందరూ చూడాలని తీసే ఎ-బి-సి సెంటర్ సినిమాలై వుండాలని కోరుకుంటారు నిర్మాతలూ దర్శకులూ. అయితే ఈ సంధి కాలంలో వాళ్ళకే తెలియకుండా జరుగుతున్నదేమిటంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అనుకుని మల్టీప్లెక్స్ సినిమాలు తీసేస్తున్నారు. ఇటీవలే శంకరాభరణం, భలే మంచి రోజు, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా తీశారు. వీటికి ముందుకూడా కొన్ని తీశారు. వాటి సంగతి అలా ఉంచుదాం. 

        ‘ఫస్ గయారే  ఒబామా’  లాంటి ఒక పరిమిత కాన్వాస్ గల, నేపధ్యం గల, స్టార్ కాస్ట్ గల చిన్న కథతో కూడిన మల్టీ ప్లెక్స్ సినిమాని పూర్తి  స్థాయి కమర్షియల్ సినిమాకి పెంచి ‘శంకరాభరణం’ తీస్తే ఏం  జరిగిందో తెలిసిందే. అలాగే పరిమిత కాన్వాస్ తో కథ గల ‘భలే మంచి రోజు’ కూడా మల్టీ ప్లెక్స్ సినిమానే. ఈ సినిమా చివర్లో ఈ జానర్ కి అతకని పృథ్వీ  రెగ్యులర్ కమర్షియల్ కామెడీతో కిచిడీ చేసి అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకున్నారు.  అలాగే ఇప్పుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి చాలని అన్నివిధాలా చాలా చిన్న కథతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తీశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ని  హిందీవాళ్ళు తీస్తే అది కేవలం మల్టీ ప్లెక్స్ సినిమానే అవుతుంది. ఈ నేపధ్యంలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ దాని జానర్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని, తెలియకుండా మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ ల ట్రెండ్ లో అటూఇటూ కాని రోమాంటిక్ థ్రిల్లర్ గా తీసి మన ముందుంచారు.

ఎలాగంటే...
        ఇందులో  హీరోయిన్ ఓ చిన్న కుక్క పిల్ల గురించి విడిపోయే కథనం, అసలు ప్రేమ కుదరడానికి డిక్షనరీ తో ఎపిసోడ్లు అనే కథనమూ... రెగ్యులర్ కమర్షియల్ సినిమా పరిధికి/ ప్రేక్షకుల సంతృప్తికి చాలని అంశాలు. రెగ్యులర్ సినిమాల్లో కాన్ ఫ్లిక్ట్ అనే ప్రధాన మలుపుకి - కుక్క పిల్ల అనే తేలికపాటి చైల్డిష్ కారణం వుండదు. ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏదో వుంటుంది. బ్యాక్ డ్రాప్, కాన్వాస్ ఇంకా విస్తృత పరిథుల్లో వుంటాయి. 2006 లో  రవిబాబు అల్లరి నరేష్ తో తీసిన ‘పార్టీ’ మల్టీ ప్లెక్స్ సినిమా అనుకునే  ఫిక్స్ అయి మల్టీ ప్లెక్సుల్లోనే రిలీజ్ చేశారు. ఆ కథ, పాత్రల పరిధి ఎంతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లోనూ అంతే.

        కాకపోతే దీన్ని కమర్షియల్ ఫార్మాట్ తో కలిపి తీశారు. అలా మల్టీ ప్లెక్స్ కథ రెగ్యులర్ ఫార్మాట్ లో ఒదగనందువల్లే ఈ సినిమా ఒడిదుడుకుల ప్రయాణంలాగా అన్పిస్తుంది.  

ఇదీ అదే
        రెండోది, ఒక రోమాంటిక్ థ్రిల్లరో, సస్పెన్స్ థ్రిల్లరో అనగానే,  ‘స్వామి  రారా’  అప్పట్నించీ అదే మూసలో, అలాటివే కథలతో, అలాటివే పాత్రలతో తీయడం కన్పిస్తోంది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఇందుకేమీ తీసిపోలేదు. పెద్ద హీరోల సినిమా లనగానే అవే రొటీన్ గా ఫార్ములా కథలు, హార్రర్ సినిమా లనగానే అవే హార్రర్ కామెడీలు, థ్రిల్లర్స్ అనగానే అవే థ్రిల్లర్స్ తీస్తున్నారు. ఫస్టాఫ్ తో ముగిసిపోగల కుక్క పిల్లతో ప్రేమ కథ- ఫార్ములా కథలోకి తిరగబెట్టి- దాని బెల్టులో డైమండ్ పెట్టడంతో ఆ డైమండ్ కోసం వెంటపడే ముఠాలతో మళ్ళీ  ‘స్వామీరారా’ టైపు కాపీ థ్రిల్లర్ గా మారింది. ‘స్వామీరారా’ క్రాఫ్ట్ వేరు- అది ఎప్పుడో 1994లో ‘పల్ప్ ఫిక్షన్’ తీసిన క్వెంటిన్ టరాంటినో వాడిన మూడుకథలతో ఒక కథ అనే- ఒక కామన్ గా వుండే బిందువు దగ్గర్నుంచీ ప్రారంభమయ్యే వేట. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో హీరో ఇలాటి బిందువు దగ్గరే కుక్క పిల్లని కిడ్నాప్ చేసే ఘటన లోంచి ఇంకో మూడు ఉపకథలు పుడతాయి. ఇవి కథా క్రమంలో  కొత్త కొత్త పాత్రలతో ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటాయి. ఇదంతా ‘స్వామి రారా’ లో చూసిందే.

        టూకీగా ఈ కథ ఏమిటంటే, వైజాగ్ లో తాగుబోతుగా ఆవారాగా తిరిగే, తండ్రి మాటంటే గౌరవం లేని హీరో ( శర్వానంద్), ఆ తండ్రికి ఫ్రెండ్ అయిన పోలీసు అధికారి (పోసాని) వార్నింగ్ ఇచ్చి పంపిస్తే జాబ్ లో చేరేందుకు హైదరాబాద్ వస్తాడు ఫ్రెండ్ ( ప్రభాస్ శీను) తో కలిసి.

        రాగానే ఇక్కడ హీరోయిన్ ( సురభి) ని  చూసి ప్రేమలో పడతాడు. ఈమెకి తన బొచ్చు కుక్క అంటే ప్రాణం. ఒకరోజు తెలీక దాన్ని మునిసిపాలిటీ కుక్కల వ్యానులో పడేస్తాడు. దీంతో ఆమె హర్ట్ అయి విడిపోతుంది. ఆ బొచ్చు కుక్కని  వెతికి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అది ఒక డైమండ్ స్మగ్లర్  ఇంట్లో వుంటుంది. ఐటీ వాళ్ళు  రైడింగ్ కి రావడంతో, 75 కోట్లు విలువజేసే ఒక డైమండ్ ని కుక్క బెల్టులో దాచేస్తాడు. ఈ కుక్కని హీరోయిన్ కోసం హీరో కిడ్నాప్ చేస్తాడు- ఈ కిడ్నాప్ జరిగే స్థలంలో వేర్వేరు పన్ల మీద వెళ్తున్న బ్యాచులు ఢీ కొంటారు. వీళ్ళెవరు, వీళ్ళ కథలేమిటనేది తర్వాత్తర్వాత కథా క్రమంలో రివీల్ అవుతూంటాయి. కుక్క కోసం స్మగ్లర్, ఎమ్మెల్యేని పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ కోసం హీరో, రికార్డింగ్ డాన్స్ కెళ్ళే ప్రయత్నంలో ఇంకో గ్రూపూ..ఇలా సాగుతూంటుంది కథనం...’స్వామీరారా’ టైపు కథనం అన్నిసార్లూ బావుండదు.  ‘పల్ప్ ఫిక్షన్’ కథనంతోనే మళ్ళీ  హాలీవుడ్ లోనే తీయలేదు. తీస్తే కాపీ కొట్టారని పరువు పోతుంది.

        ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో దర్శకుడు మూస ఫార్ములాకి కూడా పాల్పడ్డాడు. తెలుగు సినిమా హీరో అనగానే, అదెలాటి కథయినా హీరో అనేవాడు సిగరెట్లు తాగే ఆవారా తాగుబోతులాగా వుండడం, ఓపెనింగ్ లో ఓ ఘనకార్యం చేసి గ్రూపుతో ఓ సాంగే సుకోవడం, హీరోయిన్ తో ఓ డ్రీమ్  సాంగ్ కలగనడం...అలాఅలా క్లయిమాక్స్ కి ముందు  హీరోయిన్ తో ఓ ఫోక్ సాంగ్, అ తర్వాత ఫైటింగ్ తో ముగించడమనే రొటీన్నే మళ్ళీ ఇందులో కలిపాడు. దీంతో  సినిమాని జానర్ పరంగా- మల్టీ ప్లెక్స్- సింగిల్ స్క్రీన్ అనే వర్గీకరణ పరంగా, పాత రొటీనై పోయిన సబ్జెక్ట్ పరంగా- అన్నీ కలగాపులగం చేసి కాక్ టెయిల్ మిక్చర్ గా అందించాడు.

        ఇప్పుడు తెలుగు సినిమాలకి జానర్స్ మర్యాద కాపాడ్డమే  ఒక సవాలుగా వుంటే, దీనికి అదనంగా మళ్ళీ ఆ తీసే జానర్స్ కూడా మల్టీ ప్లెక్స్ ట్రెండ్ లో పడకుండా ( మల్టీప్లెక్స్ సినిమాలు తీయరు కాబట్టి)  పూర్తి స్థాయి సింగిల్ స్క్రీన్ స్పృహతో తీయాల్సి రావడం కత్తి మీద సామే కావొచ్చు.

        గత సంవత్సరం సక్సెస్ అయిన సినిమాల్నిపరిశీలిస్తే, జానర్ మర్యాదని కాపాడిన సింగిల్ స్క్రీన్ కథలకే ప్రేక్షకులు ఓటేశారు. తెలుగు సినిమాకి ఇప్పటికి రెండే  : జానర్ మర్యాద, సింగిల్ స్క్రీన్ సెన్సిబుల్ కథ!

-సికిందర్ 



http://www.filmyfreak.com

13, జనవరి 2016, బుధవారం

నాన్నతో న్యూసెన్సు





రచన – దర్శకత్వం : సుకుమార్

తారాగణం : ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, అమిత్, తాగుబోతు రమేష్, నియోల్  తదితరులు
పాటలు : చంద్రబోస్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : చక్రవర్తి విజయ్, కళ : రవీందర్, ఎడిటింగ్ : నవీన్ నూలి, యాక్షన్ : పీటర్ హెయిన్స్, రామ్ –లక్ష్మణ్
బ్యానర్ :  బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర, నిర్మాత : బివి ఎస్ ఎన్ ప్రసాద్
విడుదల : జనవరి 13, 2016

***







టెంపర్’ లాంటి మాస్ యాక్షన్ తో ప్రేక్షకుల్ని, తన అభిమానుల్నీ సంతృప్తి పర్చగల్గిన ఎన్టీఆర్ ఈసారి ‘నాన్నకు ప్రేమతో’  అనే సెంటిమెంటల్ టైటిల్ తో ఇదొక క్లాస్ సినిమా అనే సూచనలిస్తూ సంక్రాంతి పోటీల్లో మొదటి సినిమాగా వచ్చేశాడు. రెండేళ్ళ క్రితం ‘నేనొక్కడినే’  అనే పరాజయంలోంచి తేరుకుని మళ్ళీ టాప్ స్టార్ తో దర్శకుడుగా నిరూపించుకునేందుకు సుకుమార్ పట్టుదలతో వచ్చేశాడు. అలాగే ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ తర్వాత ‘దోచేయ్’ తీసి నష్టపోయిన అగ్ర నిర్మాత బి వి ఎస్ ఎన్  ప్రసాద్ ఈసారి ఎన్టీఆర్- సుకుమార్ లతో అదృష్టాన్ని పరీక్షించుకుందామని  వచ్చేశారు. ఈ ముగ్గురూ కలిసి ‘నాన్నకు ప్రేమతో’ అంటూ పండక్కి ప్రేక్షకులకి పంచి పెట్టిందేమిటో  ఈ కింద చూద్దాం.

కథ
        లండన్లో ఒక ఉద్యోగం పోగొట్టుకున్న అభి ( ఎన్టీఆర్) ఆ ఎమోషన్ తో కంపెనీ అధికారిని కొట్టి వచ్చేస్తాడు. ఎమోషన్ ని ఎప్పటికప్పుడు తీర్చుకోవాలన్న ఫిలాసఫీ అతడిది. దాంతో కొట్టేస్తూంటాడు. బయటికి వచ్చిన అతను తనే ఒక కంపెనీ ప్రారంబిస్తాడు. ఇంతలో తండ్రికి బాగా లేదన్న కబురొస్తుంది. తండ్రి రమేష్ చంద్ర ( రాజేంద్ర ప్రసాద్) ఆరోగ్యం చెడి ఇంకో నెల మాత్రమే బ్రతికే స్థితిలో ఉంటాడు. ఒకప్పుడు బాగా బతికిన పారిశ్రామిక వేత్త అతను. కృష్ణ మూర్తి  ( జగపతి బాబు)  అనే ఇంకో పారిశ్రామికవేత్త మోసం చేయడంతో వీధిన  పడతాడు. అతికష్టంగా  తన ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. కానీ కృష్ణ మూర్తి చేసిన మోసానికి ప్రతీకార భావంతో  ఇంకా రగిలి పోతూనే ఉంటాడు. ఇదంతా ఇప్పుడు అభికి చెప్పేస్తాడు. దీంతో ఇంకో ముప్పై రోజుల్లో చనిపోయే తండ్రి కోసం కృష్ణమూర్తి మీద పగ సాధించాలని నిర్ణయించుకుంటాడు అభి. అన్నలు ( రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల) వారించినా విన్పించుకోడు.

        బ్రిటన్లో  అతిపెద్ద గ్యాస్ కంపెనీ నడుపుతూ కోట్లకి పడగలెత్తిన  కృష్ణమూర్తి కూతురు దివ్యాంక ( రాకుల్  ప్రీత్ సింగ్). ఈమెని అభి ట్రాప్ చేస్తాడు. అభి మేధస్సు, కుశాగ్ర బుద్ధీ అనంతం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమాటిక్స్, జామెట్రీ సమీకరణాలతో ప్రతీ సంఘటనా ఊహిస్తాడు, చూస్తాడు. సృష్టిలో ఎక్కడో జరిగే ఒక కదలిక ఇంకెక్కడో జరిగే ఇంకో కదలికని నిర్ణయిస్తుందని-
ఎడ్వర్డ్ లారెంజ్ కాయిన్ చేసిన పదం ‘బటర్ ఫ్లై ఎఫెక్ట్’ ని ఉటంకిస్తూంటాడు. 

        వీటినే ఆధారం చేసుకుని దివ్యని ప్రేమలో పడేస్తాడు. దివ్య తండ్రి కృష్ణమూర్తితో అపాయింట్ మెంట్ సంపాదిస్తాడు. కృష్ణ మూర్తికి  ఇంకేవో పజిల్స్ వ్యామోహం వుంటుంది. అభికి తన కూతుర్ని ఇవ్వడానికి ఇష్టం లేని తను- అభి ఎవరో చెప్పేసి, మీనాన్న పగ నువ్వు తీర్చుకోలేవని సవాలు విసురుతాడు. ఈ సవాలుని అభి ఎలా స్వీకరించాడు, ఇందుకు ఎలాటి ఎత్తుగడలు వేశాడు, పూర్తిగా కృష్ణ మూర్తిని జీరో స్థాయికి తెచ్చి ఎలా వీధిన పడేశాడు...మొదలైనవి మిగతా కథ.


ఎలావుంది కథ
        వినడానికి రొటీన్ గానే వుంటుంది. తండ్రి పగ దీర్చుకునే కొడుకు కథ. కమర్షియల్ గా  రకరకాలుగా ఈ లైను రిపీటవుతూ వస్తూనే వుంది.  చాలావరకూ సక్సెస్ అవుతూనే వుంది. కాకపోతే కేవలం ప్రతీకారపు ఎమోషన్ మీద మాత్రమే  ఆధారపడే యాక్షన్ లైనుగా కాక,  కాస్త సెంటిమెంట్లూ ఫీలింగులతో, తండ్రీ కొడుకుల బంధాన్ని కూడా బలీయంగా చూపించినప్పుడు సక్సస్ అవుతున్నాయి. తండ్రి మీద తల్లి పగ దీర్చుకునే హీరో లైన్ తో కూడా హిట్టయ్యాయి. హిందీలో తన తల్లిని మోసం చేసి పెద్ద బిల్డర్ గా ఎదిగిన తండ్రిని పూర్తిగా దివాలా తీయించే లైనుతో ‘త్రిశూల్’ అనే హిట్ వుంది.  ఇందులో అమితాబ్ బచ్చన్ కొడుకు, సంజీవ్ కుమార్ తండ్రి. దీన్నే  కమల్ హసన్ తో తమిళంలో ‘కాదల్ మీంగళ్’  గా రీమేక్ చేశారు. వీటిలో హీరోల ఎమోషన్స్ కి ఓవర్ ఇంటెలిజెంట్ కలర్ ఇవ్వలేదు. సామాన్య ప్రేక్షకుల దగ్గర్నుంచీ పై తరగతి ప్రేక్షకుల వరకూ సులభంగా అర్ధమయ్యే, ఫీలయ్యే కథనాలతోనే వుంటాయి. ప్రస్తుత సినిమా లైను వరకూ మాస్ నుంచీ ఫ్యామిలీ వరకూ సేఫ్ లైనే. కాకపోతే ఈ లైన్ చెప్పిన విధానంతోనే మనలాంటి  కాస్తో కూస్తో చదువు సంధ్యలున్న వాళ్లకి కూడా క్యాచ్ చేయలేక బుర్ర వేడెక్కి పోతుంది. దర్శకుడు ఒక ప్రొఫెసర్ లాంటి అవతారమెత్తి, రసాయన- భౌతిక- గణిత- మానసిక తదితర శాస్త్రాలు ససాక్ష్యంగా, అన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపిస్తూ చెప్పదలచుకున్న కథకి పాఠాలు బోధిస్తున్నట్టూ వుంటుంది. ప్రొఫెసర్ సుకుమార్, ‘నేనొక్కడు’ ఫ్లాప్ లోంచి ముందు తను నేర్చుకోవాల్సిన కమర్షియల్  పాఠాలు  నేర్చుకోకుండా, తిరిగి ప్రేక్షకులకి అవే ‘నేనొక్కడు’  నొక్కుడు లేసన్సే ఇవ్వడంతో ఈ కథతో  ప్రేక్షకుల సంక్రాంతి సంబరాలకి సంబంధం లేకుండా పోయింది. ‘బటర్ ఫ్లై ఎఫెక్ట్’ ని ‘కావోస్’ థియరీ అని కూడా అంటారు. కావోస్ థియరీతో కమల్ హసన్ తీసిన ‘దశావతారం’ సగటు ప్రేక్షకుడికి  కూడా అర్ధమైపోతుంది. సుకుమార్ కథ వెండి తెరలాంటి విజువల్ మీడియాకి  సంకల్పించాల్సింది కాదు, ప్రింట్ మీడియాకి పరిమితం చేసి నవలగా రాస్తే చదువుకోవడానికి బావుంటుంది. స్పిరిచ్యువల్ గురు దీపక్ చోప్రా రాసిన ‘సింక్రో డెస్టినీ’ పుస్తకం చదివి వుంటే, సుకుమార్ తన లైనుకి కమర్షియల్ కథనం ఎలా చేయాలో తెలుసుకునే వీలయ్యేదేమో.

ఎవరెలా చేశారు.
        ఎన్టీఆర్ సుకుమార్ తో సాహసించడంవరకూ మంచిదే. ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన ఎవరూ అస్పృశ్యులు కారు. అవే మూస సినిమాలు, అవే మూస పాత్రలూ రొటీన్ అయిపోయిన ఎన్టీఆర్ కాస్త వెరైటీ పాత్రకి ప్రయత్నించడం- ప్రస్తుత తెలుగు సినిమా దిగజారిన ప్రమాణాల దృష్ట్యా అత్యవసరమే. ఎన్టీఆర్ కి సుకుమార్ మళ్ళీ ‘నేనొక్కడినే’  లాంటి కథని ఒక లైనుగా చెపితే కనెక్ట్ అయ్యేవాడు కాదేమో. ఒక్క మాటలో పక్కా కమర్షియల్ గా కన్పిస్తున్న  తండ్రి పగ- కొడుకు సెగ అంటూ  సుకుమార్ లైను చెప్తే వెంటనే కనెక్ట్ అయిపోతుంది ఎన్టీఆర్ కి. దీంతో లైను బావుంది కదాని ఆ లైనుని కథనం చేసిన తీరుని లైట్ తీసుకున్నట్టుంది. ఇక్కడే ఫ్యాన్స్ కి కూడా మింగుడు పడని  స్క్రిప్టింగ్ తతంగం నడించింది.

తన పాత్ర వరకూ ఎన్టీఆర్ మాస్ లుక్ కి దూరంగా కొత్త మేకోవర్ తో గడ్డం పెంచి నీటుగా కన్పించే కాస్ట్యూమ్స్ తో, ఆ  పాత్ర ఎలా వున్నా దాంట్లో ఒదిగిపోయాడు. ఎక్కువ సమయ స్ఫూర్తిని డిమాండ్ చేసే ఈ ( ఓవర్ ) ఇంటలిజెంట్  పాత్రని  ‘స్పెక్టర్’  లో డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్ ని మించి  సూపర్ ఫాస్ట్ గా పోషించాడు. అయితే చాలా ప్రతీదానికీ సైంటిఫిక్ లాజిక్కులతో ఓవర్ యాక్షన్ లా తయారయ్యింది. ‘కిక్ -2’ లో రవితేజ యాక్టివ్ ని మిన్హ్సిన ఓవర్ యాక్టివ్ పాత్రతో ఎలా కనెక్ట్ కాలేదో, అలాగే ఎన్టీఆర్ పాత్ర పరిస్థితి కూడా. పాటలకి మంచి స్టెప్స్ వేశాడు, యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. స్క్రీన్ మీద  కన్పించినప్పుడల్లా ఒక అప్పీల్ ని, ఆకర్షణనీ తీసుకొచ్చాడు. అయితే ఎంత సేపూ యాక్షన్ తో విలన్ తోనే తప్ప, ఎమోషనల్ గా నాన్నతో కనెక్ట్ కావడం గురించి శ్రద్ధ తీసుకోలేదు. ముగింపులో మాత్రమే ఆ బాండింగ్, బాధ కనబరచాడు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్టివ్ పాత్రని పోషించింది. ఆమెకీ ఓ పర్సనల్ కథ వుంది. దీన్ని ఎన్టీఆర్ పాత్ర  తీర్చిన తీరూ బావుంది. రాజేంద్ర ప్రసాద్ కుర్చీకీ, హాస్పిటల్ బెడ్ కీ పరిమితయిన పాత్ర. కొడుకుల పాత్రల్లో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల అంటీ ముట్టనట్టు వుండే పాత్రలు. ఇక జగపతి బాబు విలన్ ప్రస్థానం గురించే వేరే చెప్పేదేముంది. ఆయనకకి  ఆయనే సాటి. 

        టెక్నికల్ గా, సంగీతపరంగా, లొకేషన్స్ పరంగా  మంచి విజువల్, మ్యూజికల్ అప్పీల్స్  తో వున్నాయి. సుకుమార్ దర్శకత్వం ఎప్పటిలాగే ఫ్రెష్ గా వుంది. కానీ కథకి ఉండాల్సిన ఫీల్, నేటివిటీ ( తెలుగుదనం) కొట్టొచ్చినట్టూ లోపించాయి.

చివరికేమిటి
తెలుగు సినిమా తీయాలనుకున్నప్పుడు అది పగా- ప్రతీకారాల కథైనా, కుటుంబ కథయినా ముందు నేటివిటీ అవసరం. విదేశీ నేటివిటీతో, అక్కడి మనుషుల మధ్య మనవాళ్ళ కథలు చూపించినంత  మాత్రాన తెలుగు సినిమా చూస్తున్న తృప్తి కలగదు. అలాంటప్పుడు ఇంగ్లీష్ సినిమా తీయడం బెటర్. ఈ సినిమాని కంటెంట్ పరంగా చూసినా, నేటివిటీ పరంగా చూసినా హాలీవుడ్ సినిమాగా తీస్తే ఏమీ తేడా రాదు. ఇప్పటికీ ఇంగ్లీషులో డబ్బింగ్ చేసి ఓవర్సీస్ లో విడుదల చేయొచ్చు. సుకుమార్ ఒక్కటి గ్రహించాలి: ఒకప్పుడు తను లెక్కల లెక్చరరే. కానీ విద్యార్ధుల కంటే తెలివైన వాడుగా కన్పించాలని మేధో ప్రదర్శన చేసి వుండరు ఆ వృత్తి ధర్మం రీత్యా. కానీ సినిమాలకి వచ్చేటప్పటికి తను చాలా ఇంటెలిజెంట్ అని అంతా ప్రదర్శించుకునే ఎగ్జిబిషనిజం బాగా కన్పిస్తోంది. దీనికి దూరంగా వుండి  అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ సీదా సాదా కమర్షియల్ సినిమాలు తీయడం ఎలాగో తెలుసుకుంటే అందరికీ మంచిది. కమర్షియల్ సినిమాలో వరల్డ్ సినిమా కథ రీతుల్ని ప్రవేశపెట్ట లేరు. ఇవి రెండూ వేర్వేరు జానర్స్. అలా మిక్స్ చేయాలనుకుంటే ‘మయూరి’ లాంటి క్రాసోవర్ తీయాలి- ‘నాన్నకు ప్రేమతో’ లాంటి ఫ్యామిలీస్ కూడా చూసే సబ్జెక్టు కాదు. 

 -సికిందర్ 

12, జనవరి 2016, మంగళవారం

బయోపిక్ తో లక్!





కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ

తారాగణం : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యజ్ఞా శెట్టి తదితరులు

సంగీతం : రవి శంకర్, నేపధ్యసంగీతం : శాండీ, సత్య, కాశ్యప్
ఛాయాగ్రహణం : రమ్మీ ,
 కూర్పు: అన్వర్ అలీ, మేకప్ : వికాస్ గైక్వాడ్, యాక్షన్ : అలన్ అమీన్, బ్యానర్ : జెడ్ 3 పిక్చర్స్
నిర్మాతలు : బి.వి. మంజు నాథ్, బి. ఎస్. సుధీంద్ర, ఇ. శివప్రకాష్
విడుదల : జనవరి 7, 2016
***
మధ్య తెలుగులో అల్లాటప్పా సినిమాలు తీస్తూ అల్లరి పాలవుతున్న రాం గోపాల్ వర్మ, కన్నడ వెళ్లి కంటెంట్ వున్న సినిమా తీసి నిరూపించుకునే పని చేశాడు వీరప్పన్ కథతో. ఈ మాత్రం కంటెంట్ తెలుగులో కన్పించలేదా అంటే, ‘రక్త చరిత్ర’ తర్వాత కన్పించలేదు. నడుస్తున్న చరిత్రతో ‘శివ’ లాంటిది తీసే ఆలోచన చేయలేక, కన్నడలో గతించిన వీరప్పన్ చరిత్రలో ఆ కంటెంట్ అంతా కన్పించి, బ్యాంగ్ ఇద్దామని అటెళ్ళిపోయాడు. అట్నుంచీ విజయఢంకా మోగించాడు దేశవ్యాప్తంగా విన్పించేట్టుగా.  
‘కిల్లింగ్ వీరప్పన్’ ని ఒక వ్యక్తి జీవిత చరిత్రని  ఎలా తెరకెక్కించాలన్నదానికి ఇంకో గైడ్ లా అందించాడు వర్మ. ఆల్రెడీ రిచర్డ్ అటెన్ బరో అందించిన గైడ్ లా ‘ గాంధీ’ వుండనే వుంది. దీన్నుంచి ఏమీ నేర్చుకోక దర్శకుడు గుణశేఖర్  ‘రుద్రమ దేవి’ తీసి రుద్రమదేవి చరిత్రని గజిబిజి చేశాడు. వీరప్పన్ ని తీసుకుని వర్మ బయోపిక్ (జీవిత చరిత్ర) చిత్రణకి ఎలా న్యాయం చేయవచ్చో తీసి చూపించాడు. జీవిత చరిత్ర తీయడమంటే మహాభారతంలా చాంతాడంత తీసుకుంటూ పోవడం కాదు. మహాభారతాన్ని కూడా ఎక్కడికక్కడ విడగొట్టి ఒక్కో కథగా- ఒక్కో పాత్ర కథగా - తీసిన సినిమాలు ఇందుకే వచ్చాయి. ఒక సినిమా తీసి భావి దర్శకులకి నేర్చుకోవడానికి ఏమీ ఇవ్వని సీనియర్ దర్శకుడు ఉన్నా లేనట్టే అన్పించుకుంటాడు. నేనున్నానూ అని నిరూపించాడు వర్మ  వీరప్పన్ తో.
వివరంగా తెలుసుకునేందుకు ముందు కథలోకి వెళ్దాం...


కథ
    ఇరవై ఏళ్లుగా దొరక్కుండా కర్నాటక- తమిళనాడు సరిహద్దుల్లో సత్యమంగళం  అడవుల్లో గడగడ లాడిస్తున్న అడవిదొంగ వీరప్పన్ ని పట్టుకునే ఆపరేషన్ కకూన్ పేరుతో  పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంఘర్షణ ఇది. అడ్డొచ్చిన 184 మందిని చంపి ( ఇందులో సగానికి సగం మంది పోలీసులే) కొన్ని వందల ఏనుగుల్నివాటి  దంతాలకోసం వధిస్తూ, మరోపక్క చందనపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూఇంకో పక్క కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కూడా కిడ్నాప్ చేసి  పెను సవాలుగా మారిన వీరప్పన్ ( సందీప్ భరద్వాజ్)  తనని ట్రాప్ చేయడానికి వస్తున్న పోలీసు దళాన్ని ఇన్ఫార్మర్ సహా హతమార్చడం తో ఈ కథ ప్రారంభమవుతుంది. పోలీసులు పన్నే మరికొన్ని పథకాల్ని కూడా తిప్పికొట్టి వాళ్ళని హతమార్చడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ  ( శివరాజ్ కుమార్ పోషించిన ఈ పాత్రకి పేరు పెట్టలేదు, నిజజీవితంలో  టాస్క్ ఫోర్స్ ఎస్పీ సెంతమరై కణ్ణన్ ఈ పాత్రకి ఆధారం) ఇక కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. వీరప్పన్ ని అడవిలో వేటాడి పట్టుకోలేమని, అతణ్ణి అడవిలోంచి బయటికి రప్పిస్తేనే పట్టుకోగలమని పై అధికారిని ఒప్పించి ఆ దిశగా ప్లాన్ చేస్తాడు.

సమీప గ్రామంలో శ్రేయ ( పారుల్ యాదవ్) అనే అమ్మాయిని ప్రోత్సహించి ఇన్ఫార్మర్ గా మార్చుకుంటాడు. ఆమె ఇంట్లోకి వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ( యజ్ఞా శెట్టి ) అద్దెకి దిగేలా చేసి శ్రేయ చేత ఆమెని వాచ్ చేయిస్తూంటాడు. ముత్తులక్ష్మిని కల్సుకోవాలని వీరప్పన్ నుంచి రహస్య సమాచారం అందినప్పుడు,  ఆ కలుసుకునే రహస్య ప్రదేశాన్ని ఒక ఫాం హౌస్ లో ఏర్పాటు చేస్తుంది శ్రేయ. ఆమెని నమ్మిన ముత్తులక్ష్మి అలాగే వీరప్పన్ ని అక్కడికి రమ్మనమని  కబురుపెడుతుంది ఇన్ఫార్మర్ ద్వారా. ఎస్పీ టీం అంతా మరు వేషాల్లో ఫాం వర్కర్స్ లా వచ్చి  పనులు చేసుకుంటూ వుంటారు. కానీ ఈ టీం లోనే  వీరప్పన్ తొత్తు ఒకడు వుండడం వల్ల  అసలు విషయం వీరప్పన్ కి తెలిసిపోయి వచ్చేసి ఫాం హౌస్  మీద దాడి చేస్తాడు.  మారు వేషాల్లో వున్న పోలీసుల్ని హతమారుస్తాడు. 

ఎస్పీ, వీరప్పన్ ముఖా ముఖీ తలపడతారు. కాల్పులు జరిపి వీరప్పన్ అడవిలోకి తప్పించుకుంటాడు. ఇంత ప్లానూ ఇలా బెడిసి కొట్టినందుకు నీరుగారిపోతాడు ఎస్పీ.

ఇప్పుడేం చేయాలి? వీరప్పన్ కి ఇంకెలా వలపన్నాలి? అసలీ అడవిలోంచి బయటికి రప్పించే ప్లాన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా? వీరప్పన్ పసిగట్టేస్తాడా? వీణ్ణి ఇంకెలా పట్టుకోవాలి? ..అన్నవి ఎస్పీ ఎదుటవున్న సవాళ్లు.

        పై అధికారి ఎస్టీ ఎఫ్ చీఫ్ ( నిజజీవితంలో ఎడిజిపి కె. విజయకుమార్ పాత్రని శ్రీధర్ పోషించాడు) కి ఏమని సమాధానం చెప్పుకోవాలి?
ఎలావుంది కథ 
న్నడ, హిందీ నటులతో ఇది డబ్బింగే  అయినా, ఈ నాన్ స్టాప్ అడ్వెంచర్- థ్రిల్లర్  ని చూడ్డం  మొదలెడితే  డబ్బింగ్ అనే సంగతే మర్చిపోతారు తెలుగు ప్రేక్షకులు. పైగా అంతో ఇంతో వీరప్పన్ గురించి తెలిసే వుంటుంది కాబట్టి, ఈ ఆసక్తికి  నేటివిటీ అడ్డురాదు. మామూలు కాల్పనిక కథల్ని డబ్బింగ్ చేస్తే వుండే నేటివిటీ సంబంధమైన అడ్డు, సమాజంలో ఒక వ్యక్తి జీవితం గురించి సినిమా తీసినప్పుడు,  ఆ వ్యక్తి ఏ ప్రాంతీయుడైనా  పాపులర్ అయివుంటే,  ప్రాంతీయతకి అతీతమైపోతుంది ఆ డబ్బింగ్. ఇదే ‘కిల్లింగ్ వీరప్పన్’ కి కలిసివచ్చిన అంశం. మామూలుగానైతే ఈ మధ్య తెలుగులో ఐస్ క్రీమ్ సినిమాలు తీస్తున్న వర్మ  తీసిన మరో సినిమాని ఎవరూ పట్టించుకోరు. కానీ ముందు కన్నడ ఒరిజినల్ విడుదలై అక్కడ మార్మోగడంతో తెలుగు ప్రేక్షకుల ఆసక్తి అలాకూడా పెరిగి,  అస్పృశ్యుడైన వర్మని సత్పురుషుడుగా నమ్మగలిగారు. వర్మ ఇంకో కల్పిత కథతో పైత్యం (సినిమా)  తీసివుంటే ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. వీరప్పన్ జీవిత కథతో తీయడంవల్ల- వీరప్పన్ కోసం మళ్ళీ వర్మ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. కనుక వీరప్పన్ వర్మకి పునర్జన్మనిచ్చినట్టే తన కథనంతా ధారబోసి.

ఎవరెలా చేశారు
       వీరప్పన్ కిడ్నాప్ చేసిన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడు, కన్నడ హీరో  శివరాజ్ కుమార్ ని ఈ సినిమాలో చూస్తే, నిజంగా తన తండ్రిని  కిడ్నాప్ చేసిన వీరప్పన్ మీద మాంచి కసితో నటించాడని ఆ ముఖకవళికలు చూస్తేనే  అర్ధమైపోతుంది. నిజజీవితంలో అలాటి బాధ అనుభవిస్తేనే అంత సహజంగా ఆ కసిని ప్రదర్శించగల్గుతారు. సినిమాలోనైనా అలాటి వీరప్పన్ ని చంపి కసి తీర్చుకునే అవకాశం రావడం ఒక గమ్మత్తయిన దైవలీల. కళ- జీవితం రెండిటి మధ్య విభజన రేఖ ఇలా చెరిగిపోయింది. ఇక మనం కళ, జీవితం రెండూ ఒకటేనని నమ్మితీరాలి! ఈ సినిమా బాక్సాఫీస్ అప్పీల్ కి ఇది కూడా కలిసివచ్చింది.  శివరాజ్ కుమార్ స్థానంలో మరొక నటుడు ఉండుంటే ప్రేక్షకులు ఈ సినిమాని ‘ఓన్’ చేసుకునే తీరు, ఆ ఫలితాలు  వేరేగా వుండేవి.
సందీప్ భరద్వాజ్ ....వీరప్పన్ గా....
        క్లోజప్స్ వర్మ ఆస్తి. శివరాజ్ కుమార్ భావోద్వేగాల్ని ఆ క్లోజప్స్ కళతో ప్రేక్షకుల మెదళ్ళలోకి బలంగా దిగ్గొట్టి వదిలాడు వర్మ. ఇక వెంటాడే ఫేస్ అయిపోయింది శివరాజ్ కుమార్ ముఖాకృతి ఎంత వద్దన్నా. వీరప్పన్ ని చుట్టుముట్టి సిబ్బంది చంపుతూంటే దూరంగా కూర్చుని వేడి వేడి కాఫీ తాగుతూ తాపీగా తిలకించే శివరాజ్ కుమార్ సంతృప్తి ఒక పతాక స్థాయి నటన. పాత్రని నిలబెట్ట గల్గితేనే సినిమా నిలబడుతుందని ఇందుమూలం గా ఫిలిం మేకర్లకి ఒక సూచన. 

        వీరప్పన్ పాత్రని  పోషించిన సందీప్ భరద్వాజ్ కూడా ఏమీ తీసిపోలేదు. ఎలాగైతే అమ్జాద్ ఖాన్ తొలి సినిమా ‘షోలే’ తో బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రని అజరామరం చేశాడో, అలా తన తొలి సినిమాతో వీరప్పన్ కి ప్రాణం పోశాడు సందీప్ భరద్వాజ్ అనే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్. మళ్ళీ ఆ క్లోజప్స్, ఆ కళ్ళల్లో కాంతి, చిన్నపిల్లాడి సంతోషం,  కర్కోటకుడి కౄరావేశం.. ఇవన్నీ వెంటాడే శూలాలై పోతాయి చూసేవాళ్ళకి. ఎందరో  విలన్లు వచ్చిపోతున్నారు- వాళ్ళు అరుస్తారు గానీ ఒక శక్తిగా మెరవరు. సందీప్ భరద్వాజ్ మాట నిదానం, చూపు చురకత్తి. అమ్జాద్ ఖాన్ కి కూడా ఇలాటి విషం స్రవించే కళ్ళు వుండవు.




       మరో ఇద్దరు గుర్తుండిపోయే నటులు పారుల్ యాదవ్ ( పారుల్ అంటే హిందీలో సుందరమైనది అట), యజ్ఞా శెట్టిలు. నాకులాగే నీక్కూడా స్వార్ధం వుంటుంది, ఆ స్వార్ధకోసం ఈ పనికి ఒప్పుకో-  అని ఎస్పీ పాత్ర అంటే, కేవలం ఓ అడ్వెంచర్ చేసి చూద్దామనే స్వార్ధం కోసమే పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయే పాత్ర ఇది. వర్మ ఈ పాత్రని  నిర్లక్ష్యం చేయకుండా, సెకండాఫ్ లో తర్వాత్తర్వాత అంతగా పనిలేకపోయినా, ఒక సామాన్యమైన అమ్మాయిగా పోలీస్ యాక్షన్ ని అర్ధంచేసుకోవడానికి ఆయా సన్నివేశాల్లో ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన క్లోజప్స్ వేసి నిలబెట్టడం ఇంకో యెత్తు ఈ సినిమాకి. ఆమె చేతిలో రివాల్వర్ వుంటుంది. తప్పించుకుంటున్న వీరప్పన్ పక్కనించే పోతూంటాడు. మొట్టమొదటిసారిగా వీరప్పన్ ని ప్రత్యక్షంగా చూస్తున్న షాక్ తో చంపలేక చేష్టలుడిగి  ఆమె చూస్తూంటే ఆమెని చూసుకుంటూ పక్కనించే వెళ్ళిపోతాడు వీరప్పన్. కాల్పులు జరుపుకుంటున్న రెండు వర్గాల మధ్య క్రాస్ ఫైర్ లో అప్పుడప్పుడు పౌరులు చిక్కుకుంటూంటారు. అలాకూడా వుందామె పరిస్థితి. దివంగత విఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్  వేసే ప్రతీ కార్టూన్ లో  ధోతీ కట్టుకుని  కామన్ మాన్ ఉంటాడు- సమాజంలో జరిగే ఆయా వైపరీత్యాల్ని పొంచి వుండి విభ్రమంగా చూసే క్యారక్టర్. అలాటి క్యారక్టరే సెకండాఫ్ లో కంటిన్యూ అయ్యే పారుల్ పోషించిన పాత్ర. 
         
        ఈమెకి ముత్తు లక్ష్మి పాత్రలో యజ్ఞాశెట్టి తో బాండింగ్, ఆయా ఆహ్లాదకర సన్నివేశాల్లో నటనలూ గుర్తుండి పోయేవే. వీళ్ళిద్దరి ఎపిసోడ్లకి వర్మ కావలసినంత స్పేస్ ఇచ్చాడు. తనని నమ్మిన యజ్ఞా శెట్టి తో పారుల్ పాల్పడుతున్నది ద్రోహమే. ఒక దశలో పారుల్ ని అనుమానించిన యజ్ఞ అది క్లియరై అపరాధ భావంతో క్షమించమంటుంది. ఇది పారుల్ ని పూర్తిగా మోరల్ డైలమా లోకి నెట్టేసినా – తను చేస్తున్న అనైతికాన్ని పైకి చెప్పుకోలేని పరిస్థితి... ఈ మానవసంబంధాల్లోని మాలిన్యాలూ పాత్రలు – నటనలు ఆకట్టుకోవడానికి తోడ్పడ్డాయి.

                                                                        ***
       వెన్నెలకంటి శశాంక్ రాసిన మాటలు ( కన్నడ ఒరిజినల్ బాలాజీ కె) ఆడంబరాలు లేకుండా సహజంగా వున్నాయి. మాటలకంటే ఎక్కువగా హావభావాలతోనే సీన్లని వర్కౌట్ చేశారు. చివర్లో- ‘నువ్వు రాక్షసుడివి’ అంటాడు చీఫ్. రాక్షసుణ్ణి ( వీరప్పన్ ని ) చంపాలంటే రాక్షసుడిగా మారాల్సిందేనంటాడు ఎస్పీ. ఇది ముగింపు డైలాగు. ‘ఆపరేషన్ కకూన్’ వీరప్పన్ ని సజీవంగా పట్టుకోవడానికే  ప్రారంభించారు. కానీ సజీవంగా పట్టుకుంటే అతను  ఎవరెవరి గుట్లు బయటపెడతాడో తెలీదు కనుక చివర్లో పట్టుకునే అవకాశం వున్నా చంపేశారు. దీనికి సాక్షిగా వున్న ఒక పోలీసుని కూడా చంపేస్తాడు ఎస్పీ. ఈ నేపధ్యంలోంచి వచ్చినవే పై డైలాగులు. రాక్షసుడిగా మారడం మంచిదే. కానీ సాక్షిని చంపి తను చట్టానికి దొరక్కుండా చూసుకోవడం; అలాగే యంత్రాంగంలో, రాజకీయంలో వీరప్పన్ తో వుండే కనెక్షన్స్ రట్టు అవకుండా  కాపాడ్డం హీరోయిజం అన్పించుకోదు. ఈ రీత్యా ముగింపు డైలాగు పేలవంగా వుంది. తర్వాత అమెరికా బిన్ లాడెన్ ని చంపడంలో కూడా ఇదే నీతిని పాటించింది. 

        పాటలు షరా మామూలుగా చంపడం, నరకడం, నెత్తురు తాగడం, కట్లపాము, త్రాచుపాము, కొండచిలువ లాంటి క్షుద్ర పదాలతో నాటు గొంతుకల అరుపులతో, ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’, ‘రౌడీ’ పాటల టైపులోనే మోటుగా వున్నాయి. వ్యక్తిగతంగా వర్మకే చంపాలనీ, రక్తం కళ్ళ జూడాలనీ మనసు తహతహ లాడుతున్నట్టుంది ఈ పాటల్లో ఘాటు చూస్తూంటే.

        పాటల సంగీతం అలా వుంచితే, ఈ మధ్య వర్మసినిమాల్లోలా మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదే గోలగా, ఫోర్సుడుగా, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టుగా వుంది. ఎఫెక్ట్స్ కూడా కథని ఫాలో అవుతున్నట్టు లేవు. చంపడానికి వీరప్పన్ గ్యాంగ్ తో అడవిలో మాటేసినప్పుడు ఒకటే హోరుగా పక్షుల కూతలు విన్పించడంలో సహజత్వం ఎక్కడుంది. అవెందుకలా నాన్ స్టాప్ గా అరిచేస్తున్నాయి. అలా అరుస్తూంటే అట్నుంచి వస్తున్న పోలీసులు ఎలర్ట్ కారా? ఇది వీరప్పన్ తెలుసుకోడా? ఇవన్నీ వదిలేద్దామనుకున్నా- మరి కాల్పుల మోతకి ఆ పక్షులేం  చేస్తున్నాయి. ఒక్క పెట్టున అవి ఎగిరిపోతున్న రెక్కల చప్పుళ్ళు  విన్పించాలిగా? ఇలా రొడ్డ కొట్టుడు ఎఫెక్ట్స్, రొడ్డ కొట్టుడు పాటలు వర్మ బాగా తీసిన సినిమాల స్థాయిని కూడా దిగజారుస్తున్నాయి.

        డ్రోన్ షాట్లు, 360 డిగ్రీ షాట్లు, పాయింటాఫ్ వ్యూ షాట్లతో సూపర్ ఫాస్ట్ కెమెరా వర్క్ బావుంది.  అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా.

        దర్శకుడగా వర్మ తిరిగి తన పాత ఫామ్ లో కొచ్చేశాడు. ఈ సినిమా చూస్తూంటే ఒకటే అర్ధమవుతుంది- కాకమ్మ కథలు కాకుండా, సమాజంలో జరిగే కథలు, వ్యక్తుల కథలు తీసినప్పుడు  పాత్రచిత్రణలు- వాటి చిత్రీకరణలు బలీయంగా వుండడం, వాటితో బలమైన ముద్ర వేయగల్గడం.  రియల్ క్యారక్టర్లలో పరకాయ ప్రవేశం చేసినంతగా తను ఫిక్షన్ క్యారక్టర్స్ లోకి దూరలేడెమో. రియల్ క్యారక్టర్స్ చిత్రీకరణ విషయంలో ‘గాడ్ ఫాదర్’ ని ఆవాహన చేసుకున్నట్టుంది.

స్క్రీన్ ప్లే సంగతులు
        స్ట్రక్చర్ ని పట్టించుకోకుండా శివాజీ గణేశన్ జోకేసిన – తెడ్డేసిన పడవ ప్రయాణపు కథా గమనంలా (ఆర్ట్ సినిమాల్లా) ఈ మధ్య వర్మ స్క్రీన్ ప్లేలు వుంటూంటే, ‘కిల్లింగ్ వీరప్పన్’ భిన్నంగా స్ట్రక్చర్ లో ( కమర్షియల్) కొచ్చేసింది. బయోపిక్ ( జీవిత చరిత్ర) ని సినిమాగా ఎలా తీయాలి, డాక్యుమెంటరీ ప్రాయమైన బయోపిక్ లని డ్రమెటిక్ చేసి  ఎలా డాక్యూ డ్రామాగా రక్తి కట్టించాలి, ఎంతవరకూ యదార్ధానికి దూరంగా సృజనాత్మక స్వేచ్ఛ  తీసుకోవాలి, ఏ వివాదాలకి దూరంగా వుండాలి లాంటి జాగ్రత్తల గురించి ఆలోచన ఈ స్క్రీన్ ప్లే వెనుక కన్పిస్తుంది. జీవితచరిత్ర చాలా రీసెర్చిని  డిమాండ్ చేస్తుంది. ఆ రీసెర్చి సారం ఒక స్క్రీన్ ప్లేలో ఒదగాలంటే మళ్ళీ  ఇది కూడా చాలా స్క్రీన్ ప్లే స్టడీస్ ని డిమాండ్ చేస్తుంది. కానీ జరుగుతున్న దేమిటంటే,  గొప్పగా జీవిత చరిత్రని ఏళ్ల తరబడి రీసెర్చి చేశామంటారు, తీరా దాన్ని రొడ్డ కొట్టుడు కమర్షియల్ మూస ఫార్ములా స్క్రీన్ ప్లే చట్రంలో ఇరికించి- ఎత్తుపల్లాల్ని(జవజీవాల్ని) చదును చేసేసే గుచ్చుకునే కంకర రోడ్డులా వేసేసి,  ‘పాన్ సింగ్ తోమర్’, ‘రుద్రమ దేవి’ ల్లాంటి ‘భ’యోపిక్ లతో జడిపించేస్తారు!

        జీవితచరిత్రని మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఘట్టం తీసుకుని కూడా చేయవచ్చు. కిల్లింగ్ వీరప్పన్ లో ఇదే జరిగింది. జీవితంలో అతణ్ణి  చంపే  చివరి ఘట్టాన్నే సినిమాకి తీసుకున్నారు. అందుకే కిల్లింగ్ వీరప్పన్ అని టైటిల్ అయింది. ఇందుకే వీరప్పన్ అసలెవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎందుకు ఎలా అడవిదొంగగా మారాడు, అప్పుడేమేం చేశాడు- లాంటి వివరాలన్నీ దీనికి అవసరం లేదు. అది వేరే సినిమాగా తీయొచ్చు. అందువల్ల ఇది సమగ్రంగా లేదని భావించడం సరికాదు. అతడి జీవిత చరిత్రని కంపార్ట్ మెంటలైజ్ చేసి, అందులో అతణ్ణి పట్టుకునే క్రమాన్ని మాత్రమే చెప్పదలిచారు.  వీరప్పన్ ని పట్టుకోవడానికి ఎప్పుడో 1991 లోనే  తమిళనాడు- కర్ణాటక పోలీసులతో స్పెషల్  టాస్క్ ఫోర్స్ ఏర్పటయినా, అప్పట్నించీ ‘కిల్లింగ్ వీరప్పన్’ కథ చెప్పుకురాలేదు. దీన్ని మళ్ళీ సబ్- కంపార్ట్ మెంటలైజ్ చేశారు: కేవలం అంతిమంగా అతణ్ణి పట్టుకోవడానికి- లేదా చంపడానికి – పదినెలల క్రితం 2004 లో ప్రారంభించిన ‘ఆపరేషన్ కకూన్’ సాధకబాధకాల్ని మాత్రమే తీసుకున్నారు. ఇదీ రీసర్చి సారం. ఇక దీని పైనే కథనాన్ని ఫోకస్ చేస్తూ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ వేశారు.

        ఏమిటా ఫౌండేషన్? మనం గతంలో రెండుమూడు సందర్భాల్లో  చెప్పుకున్నట్టు- ‘గాంధీ’ కి అటెన్ బరో వేసిన ఫౌండేషనే ఇలాటి సమయాల్లో అవసరపడుతోంది- అది  తెలుగులో ‘హేపీ డేస్’ లాంటి ఫిక్షన్ కైనా, హిందీలో  గాంధీ మై ఫాదర్ లాంటి మరో బయోపిక్ కైనా. మొత్తం మహాత్మా గాంధీ జీవితంలో కేవలం మూడు  ప్రధాన ఘట్టల్నే ‘గాంధీ’ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ గా అటెన్ బరో తీసుకున్నట్టు- వీరప్పన్ జీవితాన్ని కంపార్ట్ మెంటలైజ్ చేసి, మళ్ళీ ఒక కంపార్ట్ మెంట్ ని సబ్ కంపార్ట్ మెంటలైజ్ చేస్తే తేలిన సారంలో, వర్మ కూడా మూడే ఘట్టాల్ని ఫౌండేషన్ గా తీసుకున్నాడు : 1. లేడీ ఇన్ఫార్మర్ తో వీరప్పన్ ని పట్టుకునే ప్రయత్నం, 2. ప్రముఖుల్ని కిడ్నాప్ చేయాలనీ వీరప్పన్ అనుకున్నప్పుడు అవసరమైన దుండగుల స్థానంలో పోలీస్ ఏజెంట్లని పంపే ప్రయత్నం, 3. వీరప్పన్ ఎల్ టీ టీ ఈ నేత ప్రభాకరన్ ని కలుసుకోవాలని ఉబాలట పడినప్పుడు,  వాహనంగా పోలీస్ ఏజెంట్ డ్రైవర్ గా వున్న అంబులెన్స్ ని పంపే ఘట్టం..



          మూడు ఘట్టాలనీ త్రీ యాక్ట్ (బిగినింగ్-మిడిల్-ఎండ్) స్ట్రక్చర్లో ఎలా సర్దాలి? నిజానికి ఈ మూడూ మిడిల్, ఎండ్ విభాగాల్లో మాత్రమే సర్దుకున్నాయి. బిగినింగ్ విభాగమంతా  వీరప్పన్ ఎదురుదాడుల్లో పోలీసులు మరణించడం, ఫ్లాష్ కట్స్ లో క్లుప్తంగా అతడి బ్యాక్ గ్రౌండ్ చూపించడం వగైరా వున్నాయి. సుమారు అరగంట తర్వాత బిగినింగ్  ముగుస్తూ- ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఇక వ్యూహం మార్చాలన్న ఎస్పీ ఆలోచనతో- వీరప్పన్ ని అడవిలోంచి బయటికి రప్పించాలని నిర్ణయించడంతో, మిడిల్ మొదలవుతుంది.   
ఈ మిడిల్ ప్రారంభంలోనే గ్రామంలో శ్రేయ అనే అమ్మాయిని ఎస్పీ తన ఇన్ఫార్మర్ గా నియమించుకోవడం, ఆమె ఇంట్లోకి ముత్తులక్ష్మి అద్దెకి దిగేలా చూడడం, ఆమె మీద కన్నేసి వుంచడం- ఇదంతా ఎస్పీ తనముందున్న సమస్యతో మిడిల్ బిజినెస్ ప్రకారం చేస్తున్న స్ట్రగుల్లో భాగంగానే.

ఇది ఫాం హౌస్ కి వీరప్పన్ ని రప్పించేందుకు దారితీసి- అక్కడ ఎలర్ట్ అయిన వీరప్పన్ ఎటాక్ చేయడంతో, ఇంటర్వెల్ దగ్గర  ఆ ప్లానంతా విఫలమవడం- ఎస్పీ స్ట్రగుల్ లో భాగంగా చోటు చేసుకోవాల్సిన బిజినెస్ లో - ప్రత్యర్ధితో సాగుతున్న ఈ యాక్షన్ రియాక్షన్ ల పర్వంలో  గట్టి ఎదురు దెబ్బ తగలాలన్న సూత్రాన్ని అమలు చేయడమే.

ఇంటర్వెల్ తర్వాత మిడిల్ కంటిన్యూ అవుతూ- ఎస్పీ మరో ఎత్తుగడ వేయడం- అది వీరప్పన్ గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసినప్పుడు, డిమాండ్ చేసిన డబ్బులో తనకేం మిగల్లేదన్న అసంతృప్తితో- రజనీ కాంత్ సహా మరికొందరు రాజకీయ నాయకుల్ని  కిడ్నాప్ చేయదలచి- అందుకవసరమైన గ్యాంగ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు- ఎస్పీ తన  ఏజెంట్లని పంపి ట్రాప్ చేయాలనుకోవడం- ఇది కూడా పసిగట్టిన వీరప్పన్ భారీ ఎత్తున నష్టం కలగజేయడం, ఎస్పీ సన్నిహిత పోలీసు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగి మిడిల్ ముగుస్తుంది.

మిడిల్ ముగింపులో ( ప్లాట్ పాయింట్- 2) హీరోకి తీవ్ర  నష్టం జరిగి కోలుకోలేని పరిస్థితి ఎదురవడమనే సూత్ర పాలనే జరిగిందిక్కడ. దీని తర్వాత ఎండ్ విభాగం ప్రారంభిస్తూ వెళ్ళేది క్లయిమాక్ కే.   అలా సన్నిహిత పోలీసు ప్రాణాలు కోల్పోవడంతో ఎస్పీ కి సంకల్ప బలం పెరుగుతుంది. అవతల వీరప్పన్ శ్రీలంకలో ఎల్ టీ టీ ఈ నాయకుడు ప్రభాకరన్ వీరత్వం గురించి విని ఉప్పొంగిపోయి- అతణ్ణి కలుసుకోవలనుకుంటున్న ప్పుడు- ఎస్పీ తన ఏజెంట్ ద్వారా మాయోపాయంతో వీరప్పన్ ని ముఠా సహా అంబులెన్స్ లో అడవిలోంచి బయటికి రప్పిస్తూ గ్రామం మధ్యలో ఎన్ కౌంటర్  చేయడమనే ఎండ్ బిజినెస్ తో ముగింపు.
***
మూడు ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్లో కావలసినంత బిగువు, సస్పెన్స్, టెంపో, థ్రిల్ వగైరా..ఇందులో మళ్ళీ పాత్రల్నీ సంఘటనల్నీ సంఘర్షణల్నీ బాధల్నీ బలంగా ఎష్టాబ్లిష్ చేస్తూనే..

కావాల్సిందల్లా ఒక నిజ వ్యక్తి జీవితంలో ఒక బాక్సాఫీస్ సెల్లింగ్ పాయింటు వున్న భాగాన్ని మాత్రమే తీసుకుని, మళ్ళీ వెనక్కి చూడకుండా అక్కడ  స్పష్టమైన గీత గీసి- ఆ  భాగం వరకూ   స్ట్రక్చర్ లో కూర్చే నేర్పే.

        ‘కిల్లింగ్ వీరప్పన్’ స్క్రీన్ ప్లే ఇలాటి కథలకి ఒక గైడ్. గతంలో ‘శివ’ తో త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే కి వర్మే ఇచ్చిన గైడ్ కి లాగే.

-సికిందర్