రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, అక్టోబర్ 2014, సోమవారం

   రివ్యూ..              రీసెర్చి కథనాని కవసరం!


రచన –దర్శకత్వం : చందు మొండేటి
తారాగణం : నిఖిల్, స్వాతి, రావు రమేష్, భరణి కిషోర్, ప్రవీణ్, తులసి, జోగినాయుడు, చంటి
సంగీతం : శేఖర్ చంద్ర      ఛాయాగ్రహణం : ఘట్టమనేని కార్తీక్
బ్యానర్ : మాగ్నస్ సినీ ప్రైమ్
నిర్మాత : వెంకట్ శ్రీనివాస్
సెన్సార్ :     విడుదల: 24 అక్టోబర్, 2014 

***


        మిస్టరీలు - అందునా గుళ్ళూ గోపురాల చుట్టూ నిగూఢ రహస్యాలతో కూడిన హిస్టారికల్ మిస్టరీలు తెలుగు  ప్రేక్షకులకి కొత్తేం కాదు. మిస్టరీ కాకపోయినా, ఈ మధ్యే గోపీచంద్ నటించిన ‘సాహసం’ అనే హిస్టారికల్ థ్రిల్లర్ ని చూశారు. అంతకి ముందు వెంకటేష్ తో వచ్చిన “నాగవల్లి’ అనే మరో హిస్టారికల్ థ్రిల్లర్ నీ చూశారు. హిందీలో నైతే ‘పురానా మందిర్’  లాంటి హర్రర్ లు అనేకం వచ్చాయి. ఇంకా చెప్పాల్సి వస్తే తాజాగా “స్వామి రారా’ అనే మరో హిస్టారికల్ థ్రిల్లర్ ని కూడా చూశారు. ఇంకోసారి ఇప్పుడు  ‘కార్తికేయ’ రూపంలో ‘హిస్టారికల్ మిస్టరీ’ చూస్తున్నారు. అదీ కొత్త దర్శకుడి ఆధ్వర్యంలో. ఈ కొత్త దర్శకుడు  ‘స్వామి రారా’ కి పనిచేసిన సహాయకుడే. ‘స్వామిరారా’ అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ విగ్రహం చుట్టూ సాగే ఓ ‘థ్రిల్లర్’ కథ చెప్పింది. ఇప్పుడు ‘కార్తికేయ’  అదే హీరో హీరోయిన్లని రిపీట్ చేస్తూ, అదే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం కోణాన్నే కొంత మార్చి ‘హిస్టారికల్ మిస్టరీ’ చెబుతోంది. ఆ హిస్టరీ - అంటే ఆ ఆలయం చుట్టూ చారిత్రక నేపధ్యం దర్శకుడి కల్పనే అనేది వేరే విషయం. 
           ఈ కొత్త దర్శకుడు అసలేం చెప్పాడో వివరాల్లోకి వెళ్దాం...


ఆలయాన వెలసిన అదో మిస్టరీ!

     కార్తికేయ (నిఖిల్ ) ఫైనల్ ఇయర్లో వున్న మెడికో. అతడికి తల్లి, అన్నా వదినె లుంటారు. వల్లి (స్వాతి) బీడీఎస్ స్టూడెంట్. ఆమెకు పూజలు పురస్కారాలు చేసుకునే తండ్రి (తనికెళ్ళ) ఉంటాడు వూళ్ళో. కార్తికేయ తనకేదైనా ప్రశ్న ఎదురయ్యిందంటే దాని అంతు చూడకుండా నిద్రపోని మనస్తత్వం కలవాడు. అతడికి ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో సుబ్రహ్మణ్య పురం అనే గ్రామంలో మెడికల్ క్యాంపు పడుతుంది. ఆ ఊరే వల్లి సొంతూరని అక్కడి కెళ్లాక తెలుసుకుంటాడు. క్లాస్ మేట్స్ తో ఓ పాతబడిన బంగళాలో బస చేసి మెడికల్ క్యాంపులో పాల్గొంటూ ఉంటాడు. కాలేజీలోనే వల్లిని ప్రేమించిన కార్తికేయ, ఇప్పుడు ఆమె తండ్రికి కి ఆ విషయం తెలియజేస్తాడు. ఆ తండ్రి నుంచి పెద్దగా వ్యతిరేకత వుండదు. 

           ఇలా వుండగా, దేవాదాయ శాఖకి చెందిన ఉద్యోగి ఒకతను కొంత కాలం క్రితం ఈ వూరికి వచ్చి, ఇక్కడ మూతబడిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సంబంధించి సంభవిస్తున్న మరణాలని పరిశోధిస్తూ పాముకాటుకి గురై మరణిస్తాడు. ఇలాగే తర్వాత ఇంకో రెండు మరణాలు సంభవిస్తాయి. ఆ ఉద్యోగి మరణాన్ని పురస్కరించుకుని దర్యాప్తు కొచ్చిన పోలీసు ఇన్స్ పెక్టర్ ( భరణీ కిషోర్) కూడా ప్రమాదం పాలై చనిపోతాడు. అతను రాస్తున్న పుస్తకం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఈ ప్రమాదాన్ని కళ్ళముందు చూసిన కార్తికేయ ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు- కానీ అది ఆలయ మిస్టరీ గురించి పూర్తి సమాచార మివ్వదు. ఇక తనే ఛేదించాలని నిర్ణయించుకుంటాడు.

         ద్రవిడుల కాలంలో కీర్తివర్మ అనే రాజు,  తమిళ నాడు- ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో పరిపాలిస్తూ ఉంటాడు. ఒకసారి తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడి రాజ్యం ఎడారిగా మారుతోంటే, ఏమీ పాలుపోని అతడికి శిథిలాల మధ్య ఒక విగ్రహం కన్పిస్తుంది. అది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. తనకి ఆలయం కడితే రాజ్యం సస్యశ్యామల మవుతుందని ఆ స్వామి చెప్పడంతో ఆలయం నిర్మిస్తాడు. ప్రతీ కార్తీక పౌర్ణమికి  ఆలయం మీద చంద్ర కాంతి పడినప్పుడు ఊరంతా వెలిగిపోయేట్టు ఒక రహస్య ఏర్పాటు చేస్తాడు...రాజ్యం తిరిగి కళకళ లాడుతుంది. అప్పట్నుంచీ ప్రతీ కార్తీక పౌర్ణమికి సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఒకటో రోజున షష్టి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ ఆలయం సంవత్సరం క్రితం వరకూ రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తుల్ని ఆకర్షిస్తూ వుండేది. సడెన్ గా ఆలయంలోనే ఆలయ పూజారి దుర్మరణం చెందడంతో, మైల అనే కారణం చెప్పి మూసేశారు. అప్పట్నుంచీ తిరిగి తెరవాలనుకుంటున్న వాళ్ళు, తెరిచే ప్రయత్నం చేసే వాళ్ళూ పాముకాటుకి గురై చనిపోతున్నారు.

          అదే పాము ఇప్పుడు మరణాల మిస్టరీ ఛేదించడానికి పూనుకున్న కార్తికేయ మీద పగబట్టింది. ఈ ప్రమాదాన్ని కాచుకుని కార్తికేయ మిస్టరీని ఎలా ఛేదించాడనేది మిగతా కథ!


ఎవరెవరెలా..

           మరీ ‘స్వామిరారా’ లోలాంటి హుషారైన పాత్రకాదు హీరో నిఖిల్ ది. ‘స్వామిరారా’ థ్రిల్లర్. ప్రస్తుత సినిమా ‘మిస్టరీ’.  ఈ తేడా పాత్ర తీరు మీద, తద్వారా నటన మీదా సహజంగానే ప్రభావం చూపింది. పోనీ ఈ స్లో క్యారెక్టర్ కి బలం చేకూర్చే ఎమోషనల్ ఆసరా ఏమైనా దక్కిందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఒక నాగార్జున లేదా వెంకటేష్ నటించాల్సిన పాత్ర నిఖిల్ ఈ వయసులోనే నటించేశాడు! యువ హీరోలు ఫార్ములా పాత్రల మీద వ్యామోహం వదులుకుంటే తప్ప, మిస్టరీ కథలతో కూడిన ఇలాటి సినిమాలు వాళ్లకి నప్పవని ససాక్ష్యంగా నిరూపించాడు!

           ఈ సందర్భంగా 2007 లో హిందీ లో వచ్చిన ‘మనోరమ – సిక్స్ ఫీట్ అండర్’ అనే విజయవంతమైన మిస్టరీ మూవీ గుర్తు కొస్తోంది. ఇందులో హీరో అభయ్ డియోల్ ది చాలా ఆసక్తి గొల్పే రియలిస్టిక్ క్యారెక్టర్. మారుమాల గ్రామంలో పీ డబ్ల్యీవ్ డీ లో సగటు ప్రభుత్వ  ఇంజనీర్ గా ఉంటూ, డిటెక్టివ్ కథలు రాస్తూంటాడు. గుల్ పనాగ్ వచ్చి, “నీలాటి వాడే  నాక్కావాలి- పద, నా మొగుడి మీద నిఘా పెట్టు!” అంటుంది.  దీంతో రాసేవాడు కాస్తా చేసే డిటెక్టివ్ అవతారమెత్తి- ఒక పెద్ద మర్డర్ మిస్టరీనే నానా పాట్లూ పడి చచ్చినట్టూ ఛేదిస్తాడు. నవదీప్ సింగ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమాకి అప్పట్లో జాతీయ మీడియా అంతా కలిసి 4/5 రేటింగ్ ఇచ్చి సత్కరించింది!

Manorama -six feet under
      స్వాతీ రెడ్డి ది ఇంకో ఫార్ములా పాత్ర. ఫార్ములా సినిమాల్లో హీరోయిన్ దేనికోసమైతే వుంటుందో స్వాతి కూడా దానికోసమే యధాశక్తి కృషి చేస్తున్నట్టు కన్పిస్తుంది- ప్రేమలకి, పాటలకి మాత్రమే. కాకపోతే వొళ్ళు చేసినందువల్ల నాజూగ్గా చూపించడానికి కెమెరా మాన్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ప్రారంభ దృశ్యాల్లో ఆమె స్కూటీ హీరో కారుకి తగిలే సన్నివేశంలో కూడా అటువంటి జాగ్రత్తే పడి వుంటే ఇంకా బావుండేది. 

 హీరో ఫ్రెండ్స్ గా వేసిన ఇద్దరూ మెడికల్ స్టూడెంట్స్ లా లేరు. మూస ఫార్ములా మాస్ పోకిరీ షోకిల్లా రాయుళ్ళానే వున్నారు. ఇతర నటులవి అలా వచ్చి ఇలా వెళ్ళే పాత్రలే- ప్రతినాయకుడి పాత్ర రావురమేష్ సహా! 
          శేఖర్ చంద్ర సంగీతంలో పాటలేవీ క్యాచీగా, హుషారుగా లేవుగానీ, నేపధ్య సంగీతానికి తనదైన బ్రాండ్ ని మాత్రం బాగా కాపాడుకున్నాడు. ఛాయాగ్రాహకుడు కార్తీక్ కి ఈ మిస్టరీ మూడ్ ని ఆద్యంతం ఎలివేట్ చేద్దామంటే, ఆ లైటింగ్ స్కీముకి  అడపాదపా లవ్ ట్రాక్ అడ్డు పడుతూ పోయింది. అలాకాక హీరోహీరోయిన్ల ప్రేమాయణం కూడా ప్రధాన కథలోనే  కలిసిపోయి సాగి వుంటే – ఆ లైటింగ్ కి, కలర్ స్కీములకి  ఏకత్వం సాధ్యపడేది. 
          ఇందులో గ్రాఫిక్స్ పాళ్ళు ఎక్కువే. గుడి స్థల పురాణం చిత్రకథ, పాము దృశ్యాలు, గుళ్ళో చంద్రకాంతి రిఫ్లెక్షన్ లాంటివి చాలాభాగం ఆక్రమించాయి. అయితే అవి పకడ్బందీగా వున్నాయి. 
          కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానై నిర్వహించిన ఈ కొత్త దర్శకుడి నుంచి అప్పుడే ఎక్కువ ఆశించకూడదు. తనకు సాధ్యమైనంత చేసుకుపోయాడు. మరీ ఇష్టారాజ్యంగా చుట్టేసి మొదటి సినిమాతోనే ఐపు లేకుండా పోతున్న కొత్త దర్శకులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో- నిర్మాతకి లాభం చేసి కొత్తాఫర్లు దక్కించుకునే హోదానే పొందాడు ప్రస్తుత దర్శకుడు. కాకపోతే టెక్నికల్ గా మాత్రమే, విషయపరంగా కాదు.


స్క్రీన్ ప్లే సంగతులు 
     దర్శకుడు తను తీస్తున్న కథ ఏ genre కి చెందుతుందో గుర్తించకపోవడం, గుర్తించినా దాని అసలు కథన రీతు లేమిటో తెలుసుకోకపోవడం; బదులుగా గుళ్ళ గురించీ, ఇతర పాముల్ని హిప్నటైజ్ చేయడం గురించీ క్షుణ్ణంగా రీసెర్చి చేస్తూ కూర్చోవడం  – ఇవీ ఈ స్క్రీన్ ప్లే ని పేలవంగా మార్చేసిన కారణాలు. అసలు రీసెర్చి చేయాల్సింది genre గురించి! దాంతో స్క్రీన్ ప్లే ని అర్ధవంతంగా మల్చుకోవడం గురించి!!

          సారవంతమైన భూమిలోనే మొక్కలు బలంగా పెరుగుతాయి. సారవంతమైన స్క్రీన్ ప్లే లేనిదే బలమైన కథనం కూడా రాదు. స్క్రీన్ ప్లే కి ఆ ‘భూసారాన్ని’ ఇచ్చేది ఆ కథ తాలూకు  genre లక్షణాలు. సాధారణంగా ఏ సస్పెన్స్ తో కూడిన కథా చిత్రాలనైనా సస్పెన్స్ థ్రిల్లర్ అనెయ్యడం పరిపాటి. ఆ దోవనే పడి గుడ్డిగా కథ తయారు చేసుకోవడమూ ఆనవాయితీ. కానీ సస్పెన్స్ అనేది ఒక్క థ్రిల్లర్ genre లోనే కాదు,   ‘మిస్టరీ’ అనే మరో genre లో కూడా ఉంటుందనీ,  రెండూ వేర్వేరు జాతులనీ తెలుసుకోవడం మాత్రం జరగడం లేదు. హార్రర్లో కూడా సస్పెన్స్ వుంటుంది. దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అనరు గానీ, మిస్టరీని మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లో కలిపేసి మాట్లాడ్డం చాలా విచిత్రం. 
          సస్పెన్స్ థ్రిల్లర్ లో విలన్ ఎవరో తెలిసిపోతూంటాడు, మిస్టరీలో చివరిదాకా తెలియడు. సస్పెన్స్ థ్రిల్లర్ ‘సీన్ - టు- సీన్ సస్పెన్స్’ అనే  కథన ప్రక్రియతో, విలన్ తో ఓపెన్ గేమ్ గా నడుస్తుంది, మిస్టరీ ‘ఎండ్ సస్పెన్స్’  కథన ప్రక్రియతో విలన్ తో ‘క్లోజ్డ్ గేమ్’ గా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ని  ‘ఎండ్ సస్పెన్స్’ ప్రక్రియతో నడిపినా, లేదా మిస్టరీని ‘సీన్ –టు- సీన్’ ప్రక్రియతో నడిపినా రెండూ అట్టర్ ఫ్లాప్ అవుతాయి.  సస్పన్స్ థ్రిల్లర్ స్పీడుగా సాగుతుంది, మిస్టరీ నిదానంగా నడుస్తుంది. రెండిటి సస్పెన్సుకూ రెండు పార్శ్వా లుంటాయి- ఎందుకు?/ఎవరు ? – అన్నవి. నేరం ‘ఎందుకు’ జరిగింది?/ ‘ఎవరు’ చేశారు?- అని. సస్పెన్స్ థ్రిల్లర్ కి ఈ రెండూ ఓపెన్ చేసి విలన్ ని పట్టుకోవడం గురించి ఎత్తుకుపై ఎత్తుల సీన్- టు- సీన్ సస్పెన్స్ గా నడపవచ్చు. మిస్టరీకి అలా కుదరదు. ఎందుకు జరిగిందో తెలియకూడదు, ఎవరు చేశారో కూడా తెలియ కూడదు. ఈ ప్రశ్నలకి సమాధానాల్ని అన్వేషిస్తూ, క్లూస్ ని పట్టుకుంటూ చిట్ట చివరికి ఆ దోషిని పట్టుకుని, నేరం ఎందుకు చేశాడో అప్పుడు తెలుసుకుంటాడు హీరో.
          మిస్టరీకి ముగింపు అప్పటివరకూ సాగిన కథన తీవ్రతకి మించిన స్థాయిలో వుండాలి. బయట పడే ఆ మిస్టరీ (రహస్యం) ప్రేక్షకులకి షాకింగ్ గా వుండాలి, ఓస్ ఇంతేనా అన్పించ కూడదు. ఇందుకే మిస్టరీ ముగింపు చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. దీనికెంతో ఆలోచనా శక్తీ, సబ్జెక్టు పట్ల రీసెర్చీ అవసరం. అలాగే మిస్టరీ కథనంలో క్లూస్ ఇస్తూ అనుమానాన్ని ఇతరుల మీదికి పోనిస్తూ ( ఇలా అనుమానితులుగా చూపించడాన్ని, నేరస్థుడ్ని పట్టివ్వగల అవకాశమున్న క్లూస్ ని చూపించడాన్నీ ‘రెడ్ హెర్రింగ్స్’ అంటారు, చాలావరకూ వీటిని ప్రేక్షకుల్ని మిస్ లీడ్ చేస్తూ బిజీగా ఉంచడానికి ప్రయోగిస్తారు) నడపాలి. ఇలా కాకుండా నడపడం, మర్డర్ మిస్టరీల రచయిత్రి ఒక్క స్వర్గీయ అగథా క్రిస్టీ కే చెల్లింది! పాఠకులకి ఆమె పట్ల వల్లమానిన అభిమానమో మరేంటో, చివరి పేజీలవరకూ ఆమె ఇచ్చే అన్ని సమాధానాల కోసం ఓపిగ్గా చదివేవారు. అలా రెడ్ హెర్రింగ్స్ ని కూడా దాచిపెట్టి ఇంకెవరైనా రాస్తే చదవలేక విసిరికొట్టేయడం గ్యారంటీ!

సినిమాలో కొస్తే...
        ఈ సినిమాకథ ‘మిస్టరీ’ కోవకి చెందుతుందని ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆలయాన్ని ఆశ్రయించి చిట్ట చివర్లో తెలిసే ఈ మరణాల రహస్యం మిస్టరీ కథలా సాగలేదు. మిస్టరీలాగే మందకొడి నడక నడిచినా, ఆ నడకలో బలం లేదు. కారణం, తగినన్ని మలుపుల్లేక పోవడం, రెడ్ హెర్రింగ్స్ అసలే లేకపోవడం. లాజిక్ పట్ల ప్రొఫెషనలిజం లోపించడం. మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాని సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కొంత లాజిక్ ని ( సృజనాత్మక స్వేచ్చ- సినిమాటిక్ లిబర్టీ వగైరా వగైరా వంకలతో) ఎగేయవచ్చుగానీ, మిస్టరీల్లో  ప్రతీ చిన్న అంశం పట్లా లాజికల్ గా పటిష్టంగా ప్రొఫెషనల్ గా ఉండాల్సిందే. లేకపోతే దర్శకుడి మీద  జాలి కలుగుతుంది ప్రేక్షకులకి. 

          కథా ప్రారంభంలో చూపించిన పాముకాటు మరణంలో ఆ  ఉద్యోగి రాస్తున్న పుస్తకం, ఎక్కడో దూరాన వూళ్ళో ఉంటున్న భార్య చేతిలో కెలా వెళ్ళింది? క్రైం సీన్లో అది పోలీస్ ప్రాపర్టీ కాదా? అలాగే, ఇంటర్వెల్ సీన్లో మరణించిన ఇన్స్ పెక్టర్ దగ్గరున్న అదే పుస్తకం, మళ్ళీ ఆ క్రైం సీన్లో పోలీస్ ప్రాపర్టీ కాకుండా హీరో చేతికెలా వచ్చింది? అది క్రైం కాదా? మెడికో అయిన అతడికి మెడికో-లీగల్ వ్యవహారాలు తెలియవా? లేక పోలీసుల మీదే నమ్మకంపోయి, చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడా? అలా చూపలేదే? 
          కథా ప్రారంభంలో ‘సింహరాశి’ హీరో కాస్తా ముగింపులో ‘మేషరాశి’ హీరో అయిపోయాడేమిటి? మెడికల్ క్యాంపుకి బయల్దేరుతున్న కొడుక్కి, నీకు సర్పదోషముందని, తల్లి కట్టిన కంకణం ప్రసక్తి తర్వాత పాము సీన్లలో లేదేమిటి? అదుండగా పామెందుకు పగబట్టిందని హీరోకి అన్పించదా?
          ఇలా మున్ముందు ఏదో ప్లే చేస్తుందని బిల్డప్ ఇస్తూ ప్రయోగించిన ఈ ప్లాట్ డివైస్ (కంకణం) -అంటే సెటప్ చివరికి పే ఆఫ్ కాక  నీరుగారిపోయింది. అలాగే, కారుమీద స్క్రాచెస్ పడతాయని అన్న వారించే సీను, ఇలా చేస్తే  రేపు మెడికల్ క్యాంపు కెళ్ళేందుకు డబ్బివ్వనని అన్న చెప్పే మరో సీను, రాబోయే సీన్లకి లీడ్స్ గా రాసుకుని వుంటే  పొరపాటే. అవి కథని ముందే పట్టించేస్తాయి. ఆలాగే, అన్న కూతురితో, తల్లితో మాంఛి హార్రర్ సీన్లకి తెరతీసి, ఏమీ జరక్కుండా ముగించడం- ‘సీనస్ ఇంటరప్టస్’  కి దారి తీసి తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఇది కూడా పే ఆఫ్ కాని సెటప్పే!
          చిట్టచివరికి అసలు సంగతేంటో హీరో తెలుసుకోవడానికి అతడ్ని శక్తి పీఠం స్వామి వారి దగ్గరికి తీసుకుపోతాడు హీరోయిన్ తండ్రి. ఆ పని మొట్ట మొదటే వూళ్ళో మకాం వేసి పుస్తకం రాస్తున్న పాపం ఆ దేవాదాయ శాఖ ప్రాణి తోనే  చేయవచ్చుగా? అప్పుడు  అతనే ఈ మిస్టరీ ఛేదించి, హీరోకి ఈ శ్రమంతా లేకుండా చేసి, బతికే వుండే వాడుగా?  అంటే, ఈ అప్పుడీ కథంతా లేనట్టే, అంటే సినిమా అనవసరంగా తీసినట్టేగా? ఈ రకంగా కథ తయారుచేసుకుంటే ఎట్లా!
          ఇన్స్ పెక్టర్ కి ఆ వాహన ప్రమాదం అంత అట్టహాసంగా ఎలా జరిగిందో చివర్లో విలన్ తో కూడా  వివరణ ఇప్పించ లేదు.  అది సినిమాలో ఒనాఫ్ ది బెస్ట్ సీన్స్ , అంత త్వరగా జ్ఞాపకాల్లోంచి చెరగిపోయేది కాదు.
          ఈ మిస్టరీ బలంగా సాగక పోవడానికి ఇంకో కారణం కూడా వుంది. అది పూరీ మార్కు స్టయిల్ స్క్రీన్  ప్లే.  ఫ్లాపయిన పూరీ జగన్నాథ్ సినిమాల్లో బాధ్యతారాహిత్యంగా కథనం ఇలా వుంటుంది – ఒక లవ్ సీన్, తర్వాత ఒక యాక్షన్ సీన్, ఆ తర్వాత ఒక కామెడీ సీన్...దీని తర్వాత వెంటనే మళ్ళీ ఒక లవ్ సీన్, ఆ తర్వాత మళ్ళీ వెంటనే అర్జెంటుగా ఒక యాక్షన్ సీన్, దీని తర్వాత మళ్ళీ వెంటనే యమర్జెంటు గా ఒక కామెడీ సీన్... దీన్తర్వాత మళ్ళీ...అదే గానుగెద్దు రౌండప్. ఈ రౌండప్ లతో రోల్ అవుతూ అవుతూ ఎలాగో అయ్యిందన్పించి, హమ్మయ్య అని ఒడ్డునపడి నిట్టూర్చడం!
          ప్రస్తుత మిస్టరీ కూడా ఇంతే... ఒక లవ్ సీన్, బ్యాక్ డ్రాప్ లో ఒక పోలీస్ సీన్, ఒక ఫ్యామిలీ సీన్...మళ్ళీ ఒక లవ్ సీన్, బ్యాక్ డ్రాప్ లో ఒక పోలీస్ సీన్,  ఒక ఫ్యామిలీ సీన్...సెకండాఫ్ లో ఒక లవ్ సీన్, ఒక హర్రర్ సీన్, ఒక కామెడీ సీన్, ఫ్యామిలీ లేదని అర్జెంటుగా, ఇల్లాజికల్ గా వాళ్ళందర్నీ రప్పించుకుని,  మళ్ళీ ఒక ఫ్యామిలీ సీన్...మళ్ళీ ఒక లవ్...ఇలా!
          పోలీస్ బ్యాక్ డ్రాప్ తోబాటు; కృతకంగా, తెచ్చి పెట్టుకున్నట్టు వున్నాసరే, కొంత మేరకు హీరో ఫ్యామిలీ దృశ్యాలూ భరించవచ్చు. కానీ ప్రధాన కథకి తీవ్రంగా విఘాతం కల్గించింది లవ్ ట్రాకే. ఈ లవ్ ట్రాక్ లో కూడా కొత్తదనం గానీ, థ్రిల్ గానీ ఏమాత్రం లేక- కొత్త దర్శకుడే గానీ, కొత్త తరం దర్శకుడు కానే కాదని అన్పించేస్తూంటాయి. హీరోయిన్ని కూడా హీరో అన్వేషణలో భాగంగా చేసి, ఆ అన్వేషణ లో ప్రేమాయణాన్ని కలుపుకుంటూ పోయుంటే సరైన పధ్ధతి.
          ఎందుకో ఈ  కొత్త దర్శకుడికి భారీ సినిమాల మూస ఫార్ములా కథనం నచ్చుతుందిలా వుంది. లేకపోతే హీరోయిన్ పాత్ర తను పనిచేసిన ‘స్వామిరారా’ పద్ధతిలో కథలో భాగంగా వుండేది. ఒకసారి ఈ రివ్యూ శీర్షికన ఫోటోని చూస్తే  ఏమనిపిస్తుంది? హీరోయిన్ కూడా కథలో భాగమైన న్యూవేవ్ సినిమాలా  అన్పిస్తుంది. కానీ యాడ్ కోసం ఇది మిస్ లీడ్ చేసే ఫోటో షూట్ అని సినిమా చూస్తే గానీ తెలీదు. 
          ముగింపులో తేల్చిన విషయం ఏనాడో ‘దేవుడు చేసిన మనుషులు’ నాటి నుంచీ చూస్తున్న విషయమే. ఆకస్మికంగా వచ్చే క్లైమాక్స్ దాని తర్వాత ఉపసంహారం చాలా పేలవంగా వున్నాయి. క్లైమాక్స్ ని ముచ్చట్లు చెప్పుకుని ముగించినట్టుంది. హీరోకి దొరికియినంత మాత్రాన ఏ విలనూ అంతా చెప్పేసుకోడు. ప్రేక్షకుల కోసమో, లేదా దర్శకుడు సినిమా ముగించడం కోసమో చెప్పేస్తున్నట్టుంది. 
పాత్రోచితానుచితాలు 

          ఆలయ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన మొదటి పాత్ర దేవాదాయ శాఖ ఉద్యోగి వంటి రియలిస్టిక్ క్యారక్టర్ అయినప్పుడు, హీరో పాత్ర కూడా అలాటి రియలిస్టిక్ క్యారక్టర్ అయివుండాల్సింది. (ఉదా. ‘మనోరమ-సిక్స్ ఫీట్ అండర్’) నిఖిల్ మెడికో పాత్ర ఫార్ములా పాత్ర అయిపోయింది. పైగా ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ లోని పాత్రలా కథలో ఒదిగి పోలేదు. ‘మనోరమ-సిక్స్ ఫీట్ అండర్’ లో అతను ప్రభుత్వ ఇంజనీర్ - కమ్  - డిటెక్టివ్ రచయిత. డిటెక్టివ్ రచయిత అనే హాబీవల్ల ఆ మర్డర్ మిస్టరీ కథలో పాలూ నీళ్ళలా కలిసిపోయాడు. ఇది భవిష్యత్తులో ఇంకా బాగా రాసే అనుభవం అవ్వొచ్చు అతడికి. కథ ద్వారా పాత్ర ఎదుగుదలని చూపించాలి.
          కథతో సంబంధంలేని నిఖిల్ మెడికో పాత్ర ఎదుగుదలకి నోచుకోలేదు. పక్కా మూస ఫార్ములా పాత్రలా ఆషామాషీగానే  ఉండిపోయింది. మనస్పూర్వకంగా కథలో ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల భావోద్రేకాలు కొరవడి కథకి బలం కూడా చేకూర్చలేక పోయింది. సజీవ పాత్రకి అంతర్గత - బహిర్గత ముఖాలు రెండూ వుంటాయి. కానీ ఈ మెడికోకి అంతర్గత సంఘర్షణ కొరవడింది. కథలో బోలెడంత crisis వుంది కానీ పాత్రకి conflict కొరవడింది. వూళ్ళో మిస్టరీ మరణాలు సంభవించడం కథలో crisis. వాటి పట్ల హీరో లేటుగానే మేల్కొన్నా ఆ  crisis అతడిలో conflict ని బలంగా సృష్టించలేక పోయింది. కారణం, అతను ప్రేమ ట్రాకు, ఫ్యామిలీ ట్రాకూ అనే మూస ఫార్ములా గుదిబండలు మోసుకుంటూ తిరగడం.
        ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి : మర్డర్ మిస్టరీల్లో ఇలాటి వాటికి స్థానం వుండదు. ‘శివ’ లాంటి మాఫియా సినిమాల్లో కుటుంబ జీవితం ఉండొచ్చు. ఆ కుటుంబం ఇబ్బందులు పడొచ్చు. అది ఆ genre  సినిమాలో ఒదిగిపోయే కథనమే. కానీ మిస్టరీ genre లో జరుగుతున్న మర్డర్లు తప్పించి మరో కథనం  జొరబడ కూడదు. ఒకసారి బాపు – రమణల  ‘ముత్యాల ముగ్గు’ నే చూద్దాం : ఇది కుటుంబ కథే అనుకుంటే శుద్ధ పొరపాటు! ఇది క్రైం ఎలిమెంట్ ప్రధానమైన కుటుంబ కథ! కాబట్టి ఇందులో క్రైం ఎలిమెంటు అనే అద్భుతరస ప్రధానంగానే స్క్రీన్ ప్లే సాగుతుంది. రావుగోపాలరావు పాత్ర చాలా పకడ్బందీగా కుట్ర చేసి భార్యాభర్తల్ని (హీరో హీరోయిన్లని) విడదీసేది ఆ క్రైం ఎలిమెంట్. మరి దీంతో బాపు – రమణలు ఏం చేశారు?
  
        ఫస్టాఫ్ లో ఆనందంగా సాగుతున్న శ్రీధర్ – సంగీతల వైవాహిక జీవితంలోకి  రావుగోపాలరావు రూపంలో దుష్టశక్తిని ప్రవేశ పెట్టి అల్లకల్లోలం సృష్టించారు. దీంతో కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నింద  పడి వీధిపాలయ్యింది. ఈ ఘట్టంలోంచి సెకండాఫ్ కథని ఎలా ఎత్తుకోవాలి? సెకండాఫ్ కథ ఎజెండా తిరిగి వాళ్ళిద్దర్నీ కలిపి సుఖాంతం చేయడమే. ఈ ఎజెండా ని పట్టుకునే సెకండాఫ్ కథ నడపాలి.  

         ఈ ఎజెండాని మోసే కవలలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. వాళ్ళ తల్లి (సంగీత) మీద పడ్డ నింద తొలగించేందుకు భవిష్యత్తులో ఉపయోగపడే సాధనాలు వాళ్ళే. కనుక 1) సహజంగా ఆ పిల్లలు  దూకాల్సిన కార్య క్షేత్రంలోకి, వాళ్లింకా పుట్టలేదని మరొకర్ని పంపి కథ నడిపించేయాలా?  మరి ఇక్కడ రామాయణం ఉత్తర కాండ కథ కదా చెప్తున్నారు. దాని సంగతేమిటి? 

          లేకపోతే 2) శ్రీధర్ – సంగీత ల ఎడబాటు తాలూకూ బాధల్ని వాళ్ళిద్దరి మీదా చిత్రీకరిస్తూ పిల్లలు పుట్టి వచ్చేవరకూ లాగించేయాలా ?  మరైతే అది టోకున శోకరసాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రధాన రసాన్ని(క్రైం ఎలిమెంట్) భంగ పరుస్తుందేమో?

మరి పిల్లలుపుట్టి వచ్చేవరకూ ఏంచేయాలి? ఈ గ్యాప్ ని పూడ్చడానికి, ఏ బ్రహ్మానందాన్నో దింపి కామెడీ మీద కామెడీ పెట్టి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించెయ్యాలా? సర్కస్ లో మెయిన్ షోలో మధ్య మధ్య షోకి సంబంధం లేకుండా జోకర్ వచ్చి నవ్వించి పోయినట్టు? 1975 లో కాకపోయినా 2005 తర్వాత నుంచైనా ఈ పనేగా చేయబోతారు భావి దర్శక మహాశయులు- అదేదో తామే ముందు చేసిపారేస్తే సువర్ణా క్షరాలతో లిఖిస్తారుగా తర్వాత చరిత్రలో? 
          బాపూ రమణలు ఇలా ఆలోచించి వుంటే, ముత్యాలముగ్గు బుగ్గి అయ్యేది. అదికాదు రసపోషణ. మొదట్నుంచీ ఈ కథ నడక చూస్తే  అద్భుత రస ( క్రైం ఎలిమెంట్) ప్రధానంగానే సాగుతూ వచ్చింది. కనుక ఈ ప్రధాన రసానికి భంగం కలక్కూడదు. నవరసాల్లో మిగిలిన రసాలు ఎవున్నా అవి సైడ్ ట్రాకులోనే పరిమితంగా వుండాలి. అందుకని ప్రధాన రసమైన ఈ అద్భుత రస స్రవంతికి మొదట్నుంచీ ఒక చోదక శక్తిగా ఉంటూ వస్తున్న రావుగోపాలరావు అండ్ గ్యాంగు పాత్రలు నాల్గింటినీ దింపి, అసలు వీళ్ళ భాగోతం ఏంటబ్బా  అని  పోస్ట్ మార్టం చేసి మనకి చూపెట్టడం మొదలెట్టారు -  వివిధ దృశ్యాల ద్వారా -సిద్ధహస్తులైన స్వర్గీయ బాపూ రమణ ద్వయం దిగ్విజయంగా!
          స్క్రీన్ ప్లే కి బలం దాని genre తాలూకు రసపోషణే. ఇలా  ‘ముత్యాల ముగ్గు’ సెకండాఫ్ సరైన కథనానికి అది మార్గం చూపించింది.

         కానీ నిఖిల్ పాత్ర కళ్ళముందు పోలీసు చావు జరిగినా, చేతిలో ఆ పుస్తకం వున్నా, ఇలా ఎప్పుడో ఇంటర్వెల్లో ఈ ప్రధాన మలుపు దగ్గర,  ప్రధాన కథతో తను కనెక్ట్ అయినప్పటికీ- ఆ మెయిన్ స్టోరీ లోకి సీరియస్ గా వెళ్ళిపోకుండా- మళ్ళీ అవే లవ్ ట్రాకులు- దాని తాలూకు పెళ్లి ప్రతిపాదనలు, ఫ్యామిలీని పిలిపించుకుని మాట్లాడించడాలూ, వాళ్ళతో అనవసరమైన హార్రర్ సీన్లూ- మళ్ళీ ప్రేమాయణాలూ వగైరా వగైరా. ఇంకా ఆ మెడికల్ క్యాంపు కృతక దృశ్యాలూ. 

         1972 లో, హిందీలో ‘జంగల్ మే మంగళ్ ’ అనే కాలేజీ యూత్ హార్రర్-మ్యూజికల్ కామెడీ సూపర్ హిట్ వచ్చింది. అందులో ఒక ప్రొఫెసరమ్మ అమ్మాయిల్నేసుకుని కేరళ అడవులకి ‘ఫీల్డ్ ట్రిప్’ కని  టిప్ టాప్ గా వస్తుంది. ఇంకో రిటైర్డ్ కల్నల్ అబ్బాయిల్నేసుకుని అదే పని మీద అక్కడికే ధూం ధాంగా వస్తాడు. ఇక అందరి అల్లర్లు, ఏడ్పించుకోవడాలూ ప్రేమలూ మొదలై పోతాయి. అప్పుడు మర్డర్లు జరగడం ప్రారంభమౌతుంది. అంతే, దాంతో ఎక్కడి ప్రేమలు అల్లర్లూ కామెడీలూ అక్కడే బంద్! ఫీల్డ్ ట్రిప్ క్లోజ్! క్యారెక్టర్లు సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతాయి! ఆ అడవిలో అదృశ్య శ్యక్తేదో తమ ప్రాణాలు తీస్తూంటే- దాన్నెదుర్కొని ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్య ఎజెండా గా మారిపోతుంది. అంటే కథ పాయింటు కొచ్చేసింది. వచ్చాక ఆ వచ్చిన పాయింటు మీదే నడవాలి- ఇంకే  పాత విషయాల ప్రసక్తీ రాకూడదు. 
          మెడికో విషయంలో అలాకాదు. అతను వచ్చిన మెడికల్ క్యాంపు వ్యవహారం సినిమా చివరంటా నడుస్తూనే వుంటుంది. అసలు మెడికల్ క్యాంపు ఎన్నాళ్ళు నిర్వహిస్తారు? సరే, ఈ కాలపరిధిని పక్కన పెట్టినా, హీరోకి ప్రధాన సమస్య ఎదురయ్యాక క్యాంపు వదిలేసి ముందు కెళ్ళి పోవాలి. కానీ ఈ ‘ఫీల్డ్ ట్రిప్’ ని ఇంకా లాగుతూ వుంటే, బ్యాక్ డ్రాప్ లో కథతో ఏమాత్రం సంబంధం లేని ఆ సీన్లు అవుట్ డేటెడ్ అయిపోయి, కథనం కూడా వెలసి పోయినట్టు వుంటుంది.
           నీలకంఠ తీసిన ‘మాయ’ లో ప్రారంభంలో చెప్పిన ఎప్పుడో జరగబోయే చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో ఏర్పాట్ల తాలూకు కథనమే బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ, తీరా క్లైమాక్స్ లో ఆ షో ఏర్పాటయ్యే సరికి దాని నావెల్టీయే  కోల్పోయింది!
          మన మెడికో మెడికల్ క్యాంపు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ అనే మొదటి అంకం కథనం తాలూకు వ్యవహారాల్ని వదిలేసి- ప్రధాన కథలో ఎంటరైనప్పుడు- ఈ రెండో అంకం లో జరగాల్సిన బిజినెస్ తో  – ప్రధాన సమస్యతో conflict కి లోనవకుండా- సంఘర్షణ పడకుండా పోయాడు. అసలు ఏ స్క్రీన్ ప్లేలో నైనా మొదటి అంకం బిజిబ్\నెస్ ని రెండో అంకంలో ఎలా కంటిన్యూ చేస్తారు? దాని వాళ్ళ రెండో అంకం బలాన్ని కోల్పోదా? 

           ఈ స్క్రీన్ ప్లే తో అసలు జరిగిందేమిటంటే, కథ ద్వారా పాత్రని నడిపించడం. అదే పాత్ర ద్వారా కథని నడిపించి వుంటే అదొక ‘స్వామిరారా’ లోలా హీరో షైన్ అయ్యేవాడు. కానీ మన హీరో కథ మీద ఆధారపడి డల్ అయ్యాడు. ఇది మూసఫార్ములా పాత్రయినా ఇంటర్వెల్ నుంచీ ఆసక్తి కల్గించే అవకాశముంది. దీన్ని కూడా చేజార్చుకున్నాడు. తనకి మూఢ నమ్మకాలంటే పడదని మొదటే చెప్పాడు. ప్రశ్న తలెత్తితే దాని అంతు చూస్తానన్నాడు. మరి తన మీదే పాము  పగబడితే తను స్పందించి చేసిం దెంత? ఆ పాముని పట్టుకుని పాముల నిపుణుడికి చూపించాడు! అ నిపుణుడు పాములకి హిప్నటైజ్ చేయడం గురించి చాంతాడంత డాక్యుమెంటరీయే చేప్పుకోస్తూంటే పాసివ్ గా వింటూ కూర్చున్నాడు. 
          నిజానికి ఒక ఫార్ములా పాత్రైనా, తన  వైద్య వృత్తికి కనెక్ట్ అయ్యే పాముల హిప్నాటిజం వరంలా అందివచ్చింది. దాన్ని తనే స్వయంగా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి,  మూఢ నమ్మకాల్ని బద్దలు కొట్టి వుంటే మెడికో పాత్రకి ఎంతో వన్నె చేకూరేది! పాత్ర ఎదుగుదల కన్పించి ఎక్కడో వుండేది!


-సికిందర్




          


          
         



         


         

         



7, అక్టోబర్ 2014, మంగళవారం

రీ- రివ్యూ / ఆనాటి సినిమా 

ఒరిజినల్ నే తలదన్నింది!

అభినయంతో ఆమె కవిరాసిన పాత్రని ఇట్టే కవిత్వం చేసి పెట్టేయగలదు – మరి ఆమె అభినయ కళావిరుపుల మెరుపుల్ని అక్షరాల్లో పట్టగల కవి కుమారుడెవడు – కలాలు మొరాయించాల్సిందేగా!
            కలాల్నే ఓడించే కళా స్వామ్యమామెది!

          శ్రమలేని జీవితం నేరమైనట్టే, కళ లేని శ్రమా ఘోరమే. జీవితంలో కళనంతా కోల్పోయి, శ్రమలోనే కళని రెండు కళ్ళుగా చేసుకుందామె. తుది యంటూ లేని సుషుప్తావస్థలో తనుంటే, పైలోకాల్లో దేవతలకి స్వాగత సన్నాహాలు పూర్తి చేయడానికి నెలలకి నెలలూ పట్టేసిందని స్వయంగా ఆత్రేయ రాసేశాక, మానవ మాత్రులకి ఎన్నెన్ని జన్మలు కావాలి ఆమెకి సరితూగే నాల్గక్షరాలు ఏర్చి కూర్చడానికి...ఏవో తోచిన నాల్గు విశేషణాలు జోడించుకుని ఆనందించడం మినహా!
           సావిత్రియే ఒక విశేషణం, పర్యాయపదం. ఈమాట ఎవరు చెప్పారు? సాక్షాత్తూ వైజయంతీ మాలే చెప్పింది. అలా  నటనలో అత్యున్నత శిఖరాల అధిరోహణకి ఒక్క ముక్కలో సావిత్రీ అని అభివర్ణిం చెయ్యొచ్చు. గమనిస్తే - ఇంత  సులువు చేసి పోయింది సావిత్రి పెన్ మాస్టర్లకి!
          సినిమా అంటే జీవితమే అని ఆమె నిర్వచనమాయ్యాక, రౌద్ర రసంలో గాజులు పగిలి రక్తం చిందేంత, శోక రసంలో శోష వచ్చి పడిపోయేంత నటనా పటిమే ఆమె జీవితం నిండా చదివించే  పేజీలైపోయాయి. ఆ పేజీల్ని ఆబగా తిప్పేస్తూంటే, మూడు చోట్ల చెవులు పట్టి ఆపి చాచి కొడుతుందామె! ముందు ‘మిస్సమ్మ’ చదువుకోవోయ్, ఆ తర్వాత ‘మాయాబజార్’ చూసుకో, ఇంకా తర్వాత ‘చివరకుమిగిలేది’ తెలుసుకుని ముందుకుపో! ఫో!! – అనేసి. 
           మొదటి రెండూ తను అజరామరం చేసిన అమోఘ పాత్రలే. చివరిదే జాతీయంగా గెలిచిన గర్వించే పాత్ర. దేవదాసుగా అక్కినేని ఎక్కడెక్కడి వెండి తెర దేవదాసులందర్నీటోకున జయించేసినట్టే, ‘చివరకు మిగిలేది’ తో సావిత్రి ఇటు బెంగాలూ అటు బాంబే అభినేత్రులందర్నీ ఓడించి పారేసి, వచ్చి అక్కినేని సరసన నించుంది సగర్వంగా - తెలుగు జాతి బలిమిని చాటుతూ. ఈ చిత్ర రాజాన్ని ఒక మాగ్నం ఓపస్ గా చరిత్ర కెక్కించి చేతులు దులిపేసుకుంది!

          క్లైమాక్స్ సీనే ఈ ముగ్గురు తెలుగు – బెంగాలీ – హిందీ నటీమణుల టాలెంటు కి గీటురాయి అయింది. ఈ క్లైమాక్స్ అంటూ చిత్రీకరిస్తే అది రాత్రి పూటే వుండాలని నిబంధన పెట్టింది సావిత్రి. షాట్ పూర్తయ్యాక తన సమీపంలోకి ఎవరూ రావొద్దని ఆక్షలు విధించింది. రీటేకు లేమాత్రం లేని షాట్స్ తో, మతి చలించిన విధివంచిత పాత్ర ఆక్రందనని గుండె పగుల గొట్టుకుని మరీ ప్రతిష్టించేసి, వెళ్లి మూల కూలబడి వెక్కి వెక్కి ఏడ్వడమే! పాత్ర తాలూకు ఆ గుండె కోతంతా వదిలాక,  చక్కాలేచి గుడ్ నైట్ చెప్పేసి సొంత గూటికి వెళ్ళిపోవడమే!
             ఈ అమృత తుల్యమైన షాట్సే అటు బెంగాలీ మాతృక ‘దీప్ జలే జాయే’ లో సుచిత్రా సేన్ నీ, ఇటు మళ్ళీ హిందీ రీమేక్ 'ఖామోషీ’ లో వహీదా రెహమాన్ నీ ఆలౌట్ చేసేశాయి. స్వయంగా ఈ ఓటమి ఒప్పేసుకుంది కూడా వహీదా.
          మనసులాట ఇదంతా. వికటించే ఒక వింత ప్రయోగం. అయినా ఆ రిటైర్డ్ కల్నల్ డాక్టర్ (డాక్టర్ ప్రభాకర రెడ్డి) కి ఈ ప్రయోగమే కావాలి. మానసిక రోగులకి మందులతో గాక, ప్రేమతో వైద్యం చేయాలనే సూతత్రీకరణ. విఫల ప్రేమలతో పిచ్చివాళ్ళయిన పెషంట్లకి ప్రేమ నటించి బాగు చేస్తే బావుంటుందని ఆలోచన. అప్పటికి ప్రపంచంలో మొట్ట మొదటిదైన ఈ ప్రయోగాన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేసి  పేరు ప్రతిష్టలు గడించాలన్నఆశ.  ఇందుకు సాధనం అదే ఆస్పత్రిలో పనిచేసే పద్మ ( సావిత్రి) అనే అమాయక నర్సు.  
           కేస్ – 1 : భాస్కర్ ( టి.ఎల్. కాంతారావు)అనే పేషంట్ తో, నర్సు పద్మ వలచి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నిజంగా తనే ప్రేమలో పడిపోయింది. మనసారా అతను కోలుకుని వెళ్తూ, ఆమె చూపించిన ఈ ప్రేమ అంతా ప్రయోగంలో భాగంగా ఉత్తి నటనే అని అపార్ధం జేసుకుని వెళ్ళిపోయాడు. కాదూ నిజంగానే ప్రేమించానూ అని అతడికైనా, ఆ డాక్టర్ కైనా ఎలా చెప్పుకోవాలామె? ఎలా?

         కేస్ – 2 : ప్రకాష్ (ఎం. బాలయ్య) అనే ఇంకో పేషంట్ ని కూడా ఇలాగే నయం చేసి పంపించాలని డాక్టర్ ఇంకో హుకూం. వల్లకాదంది, తనవల్ల ఇక కాదంటే కాదంది. మనసంతా ఆ వెళ్లిపోయిన భాస్కరే నిండి వుంటే, బరితెగించి మళ్ళీ ఇంకోడితో నటనా? ఐనా ఉద్యోగ ధర్మం కొద్దీ ఓర్చుకుని ఎలాగో ఈ ప్రకాష్ కి సపర్యలు చేస్తూ, ఇతడి ప్రేమ కథలో మోసగించిన ప్రియురాల్ని తెచ్చి అప్పగించేస్తే, ఛీ కాదు పొమ్మన్నాడు. నువ్వే నా ప్రేయసీ అంటూ గలాభా సృష్టించాడు. మతిపోయి తలుపులు బిడాయిం చుకుని పిచ్చి చూపులు చూసింది. పచ్చిగా పిచ్చిదై తెరలుతెరలుగా నవ్వడం మొదలెట్టింది. అదే ఆస్పత్రిలో అదే పేషంట్లకి నయం చేసిన అదే గదిలో, తనే ఓ పేషంటైపోయి ఈసురోమంటూ చీకటిని మిగుల్చుకుని చతికిల బడింది. అప్పుడు మిన్నంటే అక్రందన -
          “నేను అభినయం చేయలేదూ , నిజంగా నేను అభినయం చేయలేదు! నేనెన్నడూ అభినయం చేయలేదు! అభినయించడం నాకు చేత గాదు, నా చేత గాదు, నా చేత గాదూ ..” అనేసి!
          “చిగురంటి వయసులో చిక్కని జీవితాన ...చివరకు మిగిలేది చీకటేనా కారు చీకటేనా” –(కృష్ణ శాస్త్రి)...సేవికగా, నటించే నాయికగా, మనసిచ్చిన మానినిగా, భగ్నహృదయిని గా, భయవిహ్వలగా, బలిపశువుగా... పాత్ర నడక (క్యారక్టర్ ఆర్క్) ని అంకురం దగ్గర్నుంచీ చివరాఖరికి విధ్వంసం వరకూ ఒంటి చేత్తో లాక్కెళ్ళేసి, నిటారుగా నింగి నంటించిన సినిమా ప్రపంచపు సామ్రాజ్ఞిని వృత్తి నైపుణ్యాన్ని వర్ణించడానికి ఆ భరతముని దిగివచ్చినా బలాదూరే!

      మతి పోగొట్టుకోవడంలో ఆ కళ్ళు తిప్పడం వుందే...అదే  సుచిత్రా వహీదా నటద్వయం చాపకిందికి నీరు తెచ్చేసింది! బేసిగ్గా ఈ కళ్ళు తిప్పే టెక్నిక్ ని ఈ అఖండ తారామణు లిద్దరూ ఎందుకు విస్మరించారో వాళ్ళకే తెలియాలి. పైపెచ్చు సుచిత్రా సేన్ లో పాత్ర డిమాండ్ చేసే సగటు ఆడదాని అణుకువ కంటే కూడా మోడరన్ గాళ్ పాయిజే పెల్లుబికింది బాగా. వహీదా రెహమాన్ లో సగటు స్త్రీ తొంగి చూసినా, ఆ కీలక మతి చాంచల్య ఘట్టంలో ఉల్లాస ఛాయలు దేనికో?
          మొత్తానికి ఇలా సావిత్రిదే పైచేయై పోయింది!
          1960 లో మంజీరా ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బెంగాలీ మాతృక, ‘నర్స్ మిత్ర’ అనే నవలకి తెర రూపం. ఆశుతోష్ ముఖోపాధ్యాయ ఆ నవలా రచయిత. అసిత్ సేన్ ని దర్శకుడిగా పెట్టుకుని, అనిల్ చటర్జీ, సుచిత్రాసేన్ లని హీరో హీరోయిన్లుగా తీసుకుని ప్రఖ్యాత సంగీత దర్శుకుడు హేమంత్ కుమార్ ఈ సినిమా నిర్మాణం చేపట్టాడు. అది సూపర్ హిట్టయ్యింది. 1969 లో ఇదే దర్శకుడు రాజేష్ ఖన్నా –వహీదా రెహమాన్ – ధర్మేంద్ర లతో ‘ ఖామోషీ’ గా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాపయ్యింది. 
          బెంగాలీలో హేమంత్ కుమార్ పాడిన ‘అయి రాత్ తుమార్ అమార్’ (ఈ రాత్రి నీదీ నాదీ) అనే హమ్మింగ్ సాంగ్ వుంది. ఈ ట్యూన్ నే తెలుగు రీమేక్ ‘చివరకు మిగిలేది’ లోనూ వాడుకుంటూ ‘సుధవో సుహాసినీ’ అని దేవులపల్లి కృష్ణ శాస్త్రితో పాట రాయించుకుని, ఘంటసాల చేత పాడించుకున్నాడు సంగీత దర్శకుడు అశ్వత్థామ. వేరే ట్యూన్ తో హిందీ రీమేక్ లో కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ రాసిన పాట- ‘వో హ్ షామ్ కుచ్ అజీబ్ థీ’ గుండెల్లో సాయంకాలపు రాగాల్ని నాటుతుంది. ఇకపోతే బెంగాలీ మాతృక, హిందీ రీమేక్ ల కథనం కథానాయిక దృక్కోణంలో సాగుతుంది. 


           మొదటి కేసులో సాగే ఆమె ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా నీడలా ఆ భగ్న ప్రేమికుడ్ని చూపించే టెక్నిక్ తో, డైరీలో ఆమె జ్ఞాపకాల్ని తోడుకునే కథనంతో లీలామాత్రంగా వుంటుంది. తెలుగులో దీన్నిదర్శకుడి దృక్కోణం (పాయింటాఫ్ వ్యూ) కి మార్పు చేశారు. రెండు కేసుల్నీ కేసుని వర్తమానంలో నడిచే కథలుగానే చూపించారు. దీనికి కారణాలేమిటో ఎగ్జిక్యూటివ్ నిర్ణాత ఎం.ఆర్. కొండల రెడ్డి వివరిస్తారు (కింది సెక్షన్లో చూడండి). అలాగే ఏసుప్రభు, పాలగ్లాసు, రేడియో దృశ్యాలతో పాటు; రాజబాబూ రమణా రెడ్డిల మెంటలోళ్ళ కామెడీ ఒరిజినల్ లో లేని చేరికలే. అప్పటి పాపులర్ హీరో హరనాథ్ కూడా ఓ ప్రత్యేకపాత్ర పోషించిన ఈ సినిమాకి గుత్తా రామినీడు దర్శకుడు. ఈయన అప్పుడప్పుడే ‘మా ఇంటి మహాలక్ష్మి’ అనే సినిమాతో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొంది వున్నాడు.

 చరిత్రలో ఒక పేజీ..
డా. ఎం.ఆర్. కొండలరెడ్డి 
చివరకు మిగిలేది నిర్మాతలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యు. పురుషోత్తమ రెడ్డి, ఎం. సత్యనారాయణ లున్నా, పర్యవేక్షణంతా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా డా. ఎం.ఆర్. కొండలరెడ్డి తన భుజానేసుకున్నారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ లో రాజధాని బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, సెన్సార్ బోర్డు మెంబరుగా వున్నారు. ఈ వయసులో నీలకంఠ తీసిన ‘షో’ చిత్రం మీద ఎం.ఫిల్ కూడా చేస్తున్నారు. మృదుభాషి అయిన ఈయన దగ్గర ‘చివరకు మిగిలేది’ సమాచారం పుష్కలంగా వుంది!
           1959 లో ‘సినీ అడ్వాన్స్’ అనే పత్రికలో బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయే’ రివ్యూ చదివి ఉత్తేజితుడైన ఈయన( అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో సినిమా రివ్యూలు రాసేవారీయన) పురుషోత్తమ రెడ్డిని, దర్శకుడు గుత్తా రామినీడునీ వెంట బెట్టుకుని కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాతా సంగీత దర్శకుడూ అయిన హేమంత్ కుమార్ దగ్గర పది వేలకి ఆ సినిమా తెలుగు రైట్స్ కొని, మద్రాసు వచ్చేశారు. ముందు జమునని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో, సావిత్రిని కలిశారు. ఈ సినిమా చేయడానికి సావిత్రి సాహసించక పోవడంతో, అక్కినేని నాగేశ్వర రావుతో చెప్పించారు. అలా ఒప్పుకున్న సావిత్రి అప్పుడే తన పారితోషికం 40 వేలలోంచి పాతిక వేలూ పెట్టి ఈ నిర్మాతల దగ్గరే తమిళ డబ్బింగ్ రైట్స్  కొనేశారు. ఐతే తెలుగులో ఈ రీమేక్ ఫ్లాప్ కావడంతో సావిత్రి తమిళ డబ్బింగ్ జోలికెళ్ళ లే దు. అది వేరే విషయం.

          సావిత్రి బిజీ కారణంగా నెలకి మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో, వీనస్ స్టూడియోలో వేసిన సెట్లో అలాగే ఆరు నెలల  పాటు షూటింగ్ జరిపారు. ప్రఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. మూడు లక్షల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసి,  1960 అక్టోబర్ లో 12 ప్రింట్లతో విడుదల చేస్తే, వెనువెంటనే తిప్పికొట్టారు తెలుగు ప్రేక్షకులు. పిచ్చి సినిమాలో సావిత్రికి కాదు, ఇలాటి సినిమా తీసిన నిర్మాతలకి పట్టిందని చెడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒకే ఒక్క ఆటకి బాక్సు వెనక్కొచ్చేసింది. కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో మాత్రం రెండు వారాలాడింది. మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సంఘం దీనికి మూడు అవార్డులిచ్చింది(ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు). 1990 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే క్రిక్కిరిసి చూశారు డెలిగేట్లు. ఇప్పుడీ సినిమా ప్రింట్లు ఎక్కడా లేవు. చివరి ప్రింటు కూడా శిథిలమౌతూంటే, జాగ్రత్త పడి సీడీలు తీసి భద్రపర్చారు. ఆ సీడీలే ఈ రాస్తున్న ఆర్టికల్ కి మూలాధారం. ఇవి మార్కెట్లో విడుదల చేయలేదు. రైట్స్ కొనేవాళ్ళు లేరు. ఈ వ్యాసకర్త భుజానేసుకుని హైదరాబాద్, చెన్నైలలోని ప్రముఖ ఛానెళ్లలో ప్రయత్నించినా వాళ్ళు ముందుకు రాలేదు. ఈ సినిమా రైట్స్ తీసుకుంటే చివరికి తమకి కూడా ఏమీ మిగలదన్నుకున్నారో ఏమో. 

           అట్లూరి పిచ్చేశ్వర్రావు చేత మాటలు రాయించారు. తర్వాత కృష్ణశాస్త్రి వీటిని సంస్కరించారు. అయితే కథనంలో పాయింటాఫ్ వ్యూ పరంగా ఒరిజినల్ కీ ఈ రీమేకుకీ  వ్యత్యాసాన్ని కొండల రెడ్డి వివరిస్తూ- అలా తెలుగు ప్రేక్షకుల సౌలభ్యం కోసమే  చేశామన్నారు. కాంతారావుతో సావిత్రి ప్రేమాయణాన్ని అలా ప్రత్యక్షంగా చూపించక పో తే తెలుగు ప్రేక్షకులకి నచ్చేది కాదన్నారు. అలాగే సావిత్రి బాలయ్యని డీల్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ లో లాగా తల్లి ప్రేమ యాంగిల్ ని ప్రవేశపెట్టినా కూడా మన ప్రేక్షకులకి రుచించేది కాదన్నారు. సూడో ఫీనియా, ఎక్యూట్ మేనియా, వంటి వైద్య భాషని, బాల్యం నించీ వివిధ దశల్లో పురుషుడి మానసికావస్థ కి సంబంధించిన డిస్కషన్ నీ ఇందుకే పరిహరించామన్నారు. తర్వాత 1964 లో కొండల రెడ్డి తానొక్కడే నిర్మాతగా జగ్గయ్య, కృష్ణ కుమారి లతో ‘వీలునామా’ నిర్మించి విజయం సాధించారు.



-సికిందర్ 

(డిసెంబర్ 6, 2009 సావిత్రి జయంతి సందర్భంగా 'సాక్షి' కోసం)

         





          







5, అక్టోబర్ 2014, ఆదివారం

రీ- రివ్యూ/ ఆనాటి సినిమా

స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే!

          సినిమా కథకి దైవత్వాన్ని ప్రసాదించిన ప్రవక్త స్వర్గీయ బి.ఎన్. రెడ్డి అని అభివర్ణించవచ్చు.
1939 లో ‘వందేమాతరం’ నిర్మిస్తూ బి.ఎన్.రెడ్డి హంపి కెళ్తే, అక్కడి విరూపాక్షాలయం గర్భగుడి తీవ్ర భావావేశానికి లోనుజేసింది. ఇక్కడే కదా అలనాడు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు
నించుని ప్రార్ధన చేశాడన్న స్పహకి కదిలిపోయి, ఎలాగైనా సరే రాయలవారి ఆ అంగరంగ వైభవాన్ని   వెండితెర మీద దృశ్యమానం చేయాలన్న కోర్కె బలంగా నాటుకుపోయింది. ఇది పదేళ్ళకి నెరవేరేసరికి, ఆ కళాసృష్టి ‘మల్లీశ్వరి’ ప్రపంచ సినిమా జగత్తులోనే అజరామరంగా నిల్చిపోయింది!

 బీఎన్ కేదో అతీతశక్తి ఆవహిస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ శక్తి దేవరాయలు! స్వయంగా ‘ఆముక్త మాల్యద’ అనే అపూర్వ కావ్యఖండాన్నిచ్చిన వాడు. ఆయనే బీఎన్ ని ప్రవక్తగా మార్చి ‘మల్లీశ్వరి’ అనే అనితర సాధ్య సృష్టితో ఈ కళా ప్రపంచంలోకి పంపించి ఉంటాడు.

          ప్రవక్తలు వాసికి బద్దులు.
          గత 50 -60 సంవత్సరాల మధ్యకాలంలో ‘మల్లీశ్వరి’ (1951) గురించి ఎందరెందరో మహానుభావులు ఎంతెంతో రాసేశారు. ఇంకా రాయడానికి ఏమీ మిగలనంతగా. అయినా ఈ రాస్తున్న కలం ఇంకేవో తంటాలు పడుతోంది. దేవరాయలి గురించి ఓ కథ ప్రచారంలో వుంది. రాజకోట నిర్మాణం కోసం అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ అరణ్యంలో కెళ్ళారు. అక్కడో వింత దృశ్యం ఎదురైంది. ఓ నాల్గు కుందేళ్ళు రెండు అడవి కుక్కల్ని వెంటాడుతున్నాయి - గ్రేట్ యాక్షన్ సీన్! ఇది గమనించిన పండితులకి తక్షణం ఆ స్థల మహాత్మ్యం అవగతమై ఇక్కడ గనుక రాజకోట నిర్మిస్తే, రాయలవారి రాజ్యం వెయ్యేళ్ళూ  వర్ధిల్లుతుందని సెలవిచ్చారు. ఇక కోట నిర్మాణం ప్రారంభమైపోయింది. ఆ భూమి పూజకి దేవరాయలు నదీ స్నానమాచరించి, శంఖం పూరించాలి. ఆ శంఖా రావం విన్పించగానే పలుగుతో భూమ్మీద ఒక్క పోటు పొడిచారు. అంతలో మరో శంఖారావం విన్పించి కంగారు పడి పోయారు. ఇదేమిటిది - అని ఆరాతీస్తే, మొదటి రావం రాయల వారు పూరించింది కాదని తేలింది! దీంతో డీలాపడిపోయి, ఇహ వందేళ్ళతో ఈ సామ్రాజ్యం పని సరి- అని కుమిలిపోయారు.
          రాసి కాదు, వాసి ముఖ్యం. వందేళ్ళు కూడా కాదు, అందులో కేవలం ఐదో వంతు- ఇరవై ఏళ్ళు పాలించినప్పటికీ ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ సుభిక్ష పాలనకి ఆదర్శప్రాయంగా నిలచిపోయాడు. అలాగే కేవలం పదకొండు సినిమాలే తీసినప్పటికీ బీ ఎన్ రెడ్డి ( 1908 – 1977) ప్రపంచ దృష్టినాకర్షించాడు. చలనచిత్ర రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయ్యాడు. పద్మభూషణ్ కీ పాత్రుడయ్యాడు. పోస్టల్ స్టాంప్ పైనా ప్రకాశించాడు. ఇంకేం కావాలి?

        అలాటి ఆయన అందించిన ‘మల్లీశ్వరి’ చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా ఎన్నదగ్గ  అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక పాఠ్యాంశం కాగలదని గుర్తించారు. అయితే ఈ పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకుంటున్న ఈ కాలంలో – కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యాన్మాయ స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. ఈ అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు! 
             ఇప్పడు ఓంకార, లవ్ ఆజ్ కల్, లండన్ డ్రీమ్స్ వంటి సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీ, వాంటెడ్ లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతో, పై మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులు, పాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్ మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి. కాలమహాత్మ్యమేమో...కుందేళ్ళన్నీ కలిసి అడవి కుక్కల్ని తరిమి కొడుతున్నాయి!
          ఇదేగనుక తెలుగు సినిమాల్లోనూ జరిగితే, ప్రేమ కథల్లో కూడా విలన్ గాడితో పొడిపించు కోవడాలు, రక్తాలు పారించు కోవడాలూ ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు!
          బీఎన్ రెడ్డి విరూపాక్షాలయ దర్శనానుభవం తర్వాత చాలాకాలం మంచి కథ కోసం అన్వేషించాడు. రెండేళ్ళూ గడిచి పోయాయి. అప్పుడు రెండు కథలు దృష్టిలోపడ్డాయి.
          అవి ఒకటి – మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమైన బుచ్చిబాబు నాటకం ‘రాయల కరుణాకృత్యం’
          రెండు -  ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఈ నాటకాన్నే పోలిన ఇంకో కథ. 
          ఈ రెంటినీ కలిపి ఓ కథ తయారు చేసుకున్నాడు బీఎన్. 
          ‘మల్లీశ్వరి’ చిత్రకథ తెలిసిందే. నాగరాజు (ఎన్టీఆర్) అనే శిల్పి, అతడి మరదలు మల్లీశ్వరీ (భానుమతి) ప్రేమించుకుంటారు. మల్లీశ్వరి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) ఇందుకు వ్యతిరేకం. దీనిక్కారణం నాగరాజు రాళ్ళు కొట్టుకునే కూలీ కావడం. నాగమ్మ భర్త నారప్ప (దొరై స్వామి) కి తనచెల్లెలి కొడుకైన ఈ నాగరాజు అంటేనే అభిమానం. ఈ పరిస్థితుల్లో ఓ వర్షపు రాత్రి సత్రంలో మల్లీశ్వరి చేస్తున్న నాట్యాన్ని చూస్తాడు మారువేషంలో రాజ్యం లో సంచరిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు ( శ్రీవాస్తవ).

   అప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం దేవరాయలు తన కెవరైనా పడతి నచ్చిందంటే ఆమె ఇంటికి పల్లకీని పంపుతాడు. పల్లకీ వచ్చిందంటే ఆ పిల్ల అదెక్కి రాణీ వాసానికి తరలిపోవాల్సిందే. ఇప్పుడా వచ్చి మల్లీశ్వరి నాట్యాన్ని చూస్తోంది సాక్షాత్తూ రాయలవారేనని తెలీని నాగరాజు - ఈ మల్లిని మీ పల్లకీలో పట్టు కెళ్ళి పొండని వేళాకోళా మాడేస్తాడు!
     దీన్తర్వాత ఎప్పటికైనా మల్లిని పెళ్ళాడ్డానికి డబ్బు సంపాదించుకుందామని నగరానికి వలసెళ్ళిపో తాడు నాగరాజు. అతనెళ్ళిపోయాక ఇటు మల్లీశ్వరి ఇంటికి పల్లకీ వచ్చేస్తుంది. హతాశురాలైన ఆమెకి,  అదెక్కి రాణీవాసానికి తరలివెళ్ళడం వినా గత్యంతర ముండదు.
           తిరిగొచ్చిన నాగరాజు జరిగిందంతా తెలుసుకుని, మల్లి మోసం చేసిందనే అపోహ పడి, పిచ్చోడైపోతాడు. ఒక శిల్పాచారి వచ్చి రాజకోటలో నర్తన శాల నిర్మాణం పనులున్నాయని చెప్పి, నాగారాజుని తీసుకుపోతాడు. అలా రాజకోటలో అడుగుపెట్టిన నాగరాజు అక్కడ ‘వంచకి అయిన మల్లి’  ని చూస్తాడు!
          చరిత్ర ప్రకారం రాణివాసంలో పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే ఇప్పుడు నాగరాజు తల తెగిపడే పరిస్థితి అన్నమాట. బీఎన్ కరుణాకృత్యం’ నాటకమూ, ఇంకో పత్రికలోని కథా అలా కలిసి వచ్చి రాయలని పాజిటివ్ గా చూపించే అవకాశం లభించింది గానీ లేకపోతే  ఏమయ్యేదో.  ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా. మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలి? నాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్ అయ్యింది కదా! తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల సమాహారమే కదా! మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆటే కదా! కచ్చితమైన స్క్రీన్ ప్లే  పరిభాషలో చెప్పుకోవాలంటే, సినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ మైండ్ అంటారు. ఈ దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.

       ఈ స్టోరీ మైండ్ లో నాగరాజు అనే వాడు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఈ ఇగో తన సబ్ కాన్షస్ మైండ్ తో,  లేదా అంతరంగంతో చెలగాట మాడిందన్నమాట - అలా వేళాకోళం చేసేసి! మరి ఈ అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు? అది దేవరాయాలి పాత్రే! 
           ఇప్పుడు మనం గనుక డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘ది పవరాఫ్ యువర్ సబ్ కాన్షస్ మైండ్’ అనే గ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, మన ఇగో చెప్పిన మాటని,  లేదా చేసే ఆలోచననీ  మన అంతరంగం తక్షణ ఆదేశాలుగా స్వీకరించి దాంతో ఎక్కడికైనా, ఎంతదూరమైనా సాగి పోయి సాధించు కొచ్చేస్తుంది. ఈ సృష్టి అంతా శక్తితరంగాల ఆటు పోట్లే తప్ప మరేం కాదుగా?  ప్రతీదీ శక్తి తరంగాల గుచ్ఛమే. రాయీ రప్పా సైతం! అలా నాగరాజు అంతరంగానికి పాపం నాగరాజు వేళాకోళ మాడేడని అస్సలు తెలీదు. హాస్యాని కనే మాటల్ని కూడా నిజం చేసేయడం దాని నైజం. అందుకే ఇలాటి నమ్మకమైన సేవకుడు లాంటి అంతరంగ ప్రతీక అయిన దేవరాయలి పాత్ర కాస్తా నాగరాజు చెప్పింది తు.చ. తప్పకుండా పాటిస్తూ మల్లీశ్వరి ఇంటికి పల్లకీ పంపించేసిం దన్నమాట!

      దేవరాయలి పాత్రని ఇలా అర్ధం చేసుకుంటేనేగానీ అపోహలు తొలగవు. లేకపోతే ఇదేమిటీ, అంతటి మహా రాజూ వేళాకోళమని తెలిసీ ప్రేమికులతో ఇలాటి అనైతికతకి ఎలా పాల్పడ్డాడూ అన్న సందేహం వస్తుంది.      

     ఇక క్లైమాక్స్ కొస్తే, కోటలో పాగా వేసి దొరికిపోయిన నాగరాజు తల నరకమనలేదు ఆనవాయితీ ప్రకారం దేవరాయలు. నాగరాజూ మల్లీశ్వరీ లు ఎంత ప్రాణత్యాగానికి సిద్ధపడినా రాయలవారు పంతానికి పోలేదు. మన అంతరంగం చాలా దయాళువు కూడా. పైన చెప్పిన గ్రంధం ప్రకారం మన అంతరంగం మనతో అడ్డగోలుగా వాదించదు.  సత్యాన్ని తెలియ జేసి వూరుకుంటుందంతే.  రాయలి పాత్ర చేసింది ఈ పనే. నాగరాజు వేళాకోళం ఎంత కాడికి తెచ్చిందో కను విప్పయ్యేలా చేసి, అంతటి సంఘర్షణకీ తెర దించేసింది!
          కాబట్టి ఈ స్క్రీన్ ప్లే లో నాగరాజు మనసే అతడి శత్రువయ్యింది. అందుకే ఇది పనిగట్టుకుని విలన్ ఆర్టిస్టుల్ని పెట్టుకునే అవసరం లేని స్క్రిప్టులకి స్వర్ణ యుగపు స్క్రీన్ ప్లే రోడ్ మ్యాప్ అవుతోంది - కావాల్సింది సినిమా కథని స్టోరీ మైండ్ గా అర్ధంజేసుకునే తాహతు మాత్రమే!


-సికిందర్

(ఫిబ్రవరి 2010 ‘సాక్షి’ కోసం)