రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

రివ్యూ..



నేటివిటీ ప్రాబ్లం!
నాని, వాణీ కపూర్, సిమ్రాన్, బడవ గోపి, ఎంజె శ్రీరాం తదితరులు
సంగీతం : ధరణ్ కుమార్,  ఛాయాగ్రహణం : లోకనాథన్ శ్రీనివాసన్,  కూర్పు: బి శ్రీకుమార్
కథ : మనీష్ శర్మ,  స్క్రీన్ ప్లే : హబీబ్ ఫైసల్,  మాటలు : శశాంక్  వెన్నెల కంటి
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,   నిర్మాత :  ఆదిత్యా చోప్రా
దర్శకత్వం: గోకుల్ కృష్ణ
విడుదల : ఫిబ్రవరి 21, 2014    సెన్సార్: ‘u’
***


ఒక భాషలో విజయం సాధించిన సినిమాని ఏకకాలంలో మరో రెండు భాషల్లో రీమేక్ చేసినప్పుడు వాటిలో ఒకటి కచ్చితంగా డబ్బింగ్ లాగే ఉండాలా? పోనీ వరిజినల్ ని ఆల్రెడీ కాపీకొట్టి తీసేసివుంటే మళ్ళీ రీమేకు కూడా చేసుకోవచ్చా? ఒకసారి కాపీ అట్టర్ ఫ్లాపయ్యాక  కూడా ఒరిజినల్ సూపర్ హిట్టవ్వచ్చా?....ఇవీ  ‘ఆహా కల్యాణం’ అనే వ్యవహారం చూస్తూంటే వేధించే ప్రశ్నలు.

2011 లో హిందీలో ‘బ్యాండ్ బాజా బరాత్’ అనే రోమాంటిక్ కామెడీ హిట్టవడంతో చాలాకాలానికి తెలుగు తమిళ భాషల్లో దాన్ని రిమేక్ చేస్తూ  దక్షిణాదిన అడుగెట్టాలనుకుంది సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. ఇంతలో తెలుగులో నందినీ రెడ్డి  ఈ కథనే  ‘జబర్దస్త్’ అంటూ తీసేయ్యడంతో అదో వివాదమై కూర్చుంది. అయినా యశ్ రాజ్ ఫిలిమ్స్ వెనుదీయక తెలుగు-తమిళ రీమేకులతో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే నందినీ రెడ్డితో పోటీకి దిగిందా అన్నట్టు తనుకూడా ఈ రెండేసి రీమేకులని పతాక స్థాయిలో అట్టర్ ఫ్లాప్ చెయ్యడం కోసమే కంకణం కట్టుకున్నట్టుంది ఈ సినిమా చూస్తూంటే. కాపీరైట్ సంగతి ఎలావున్నా ఫ్లాప్ చెయ్యడంలో  మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ దే పైచేయి అయ్యిందనాలి!

దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చుకుంటు న్నప్పుడు ముందు  ప్రాంతీయత గురించి, స్థానిక ప్రేక్షకాభిరుచుల గురించీ కాస్తయినా పట్టింపు లేకపోతే ఆ ఎంట్రీ ని కూడా ఎవరూ పట్టించుకోరు. ‘ఆహా కల్యాణం’ అనే డిజైనర్ ప్రేమకథ ఒరిజినల్లో వున్న న్యూఢిల్లీ నేటివిటీతో తమిళంలో తీసి తెలుగులోకి డబ్ చేసినట్టు తయారయ్యింది. దశాబ్దం క్రితం ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ ‘ అనే డిజైనర్ ప్రేమకథ తీసిన సూరజ్ బర్జాత్యా విఫలమైన చోట ఆదిత్యా చోప్రా  ‘బ్యాండ్  బాజా బరాత్’ తో ఎక్కడ సఫలమయ్యాడంటే- బర్జాత్యా నాటికింకా డిజైనర్ ప్రేమకథలకి మల్టీప్లెక్స్ సినిమాల ఊపందుకోలేదు. చోప్రా నాటికి  మల్టీప్లెక్స్ సినిమాల జోరు తారాస్థాయిలో వుంది... నగర ప్రేక్షకులు క్యూలు కట్టే  పాప్ కార్న్ మల్టీప్లెక్స్ సినిమాలు ఉత్తరాదిలోనే ఊళ్ళల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో జనాలకి ఎక్కడంలేదు- అలాంటిది తెలుగులో రక్తికట్టించే అవకాశం ఉంటుందా?

కనీసం నందినీ రెడ్డి ఆ కథని మాస్ సినిమాగా తీయడంలో విఫలమైనా, తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా కథని మార్చుకుంటూ పెళ్ళికాని హీరో హీరోయిన్ల మధ్య శారీరక సంబంధమనే ప్రధాన మలుపుని తొలగించుకోగాలిగారు. టైటిల్ సహా కుటుంబ ప్రేక్షకులకి  నప్పుతుందనుకుని తీసినట్టున్న ఈ  రీమేకులో ఈ పాయింటే  సెంటిమెంట్లకి వ్యతిరేకంగా వుంది.

‘ఆహా కళ్యాణం’ లో ఈ ‘రంకు’ వ్యవహారమెలావుందో ఓసారి చూద్దాం...

శృతి కలిపింది  తనే ...
శక్తి (నాని) అనే స్టూడెంట్ వూళ్ళో తండ్రిని మభ్య పెడుతూ రాని చదువు పేరుతో కాలక్షేపం చేస్తూంటాడు. హాస్టల్లో తిండి సహించక ఫ్రెండ్స్ నేసుకుని పెళ్ళిళ్ళలో దొంగ తిళ్ళకి హాజరైపోతూంటాడు. అలాటి ఒక పెళ్లి లో పట్టేసుకుంటుంది శృతి( వాణీ కపూర్) అనే మరో స్టూడెంట్. ఈమెకి చదువైన తర్వాత వెడ్డింగ్ ప్లానర్ గా వ్యాపారం ప్రారంభించాలని వుంటుంది. ఇందుకోసం తనకి చూస్తున్న సంబంధాల్ని కూడా వాయిదా వేస్తుంది. శక్తికి ఈమె చేయాలనుకుంటున్న బిజినెస్ నచ్చి తనని పార్టనర్ గా  కలుపుకోమంటాడు. ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఇతన్ని తిరస్కరిస్తుంది. ఫైనాన్స్ లో రోమాన్స్ ని కలపనంటుంది. అతను రోమాన్స్ కి దూరంగా ఉంటానని ప్రామీస్ చేస్తాడు.
ఒకసారి శృతి చంద్రలేఖ(సిమ్రాన్) అనే పాపులర్ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరి కెళ్తుంది. అనుకోకుండా శక్తితో బాటు అక్కడ పనిలో చేరిపోతుంది. ఓ పెళ్లి ఏర్పాట్ల సందర్భంగా చంద్రలేఖ ఎక్కువ మిగుల్చుకోవాలని కక్కుర్తిపడి దొరికిపోతుంది. ఆ  తప్పు శృతి మీదికి తోసేయ్యడానికి ప్రయత్నించడంతో, ఆమెకి గుడ్ బై కొట్టి తామే సొంత బిజినెస్ పెట్టుకుని చూపిస్తామని చాలెంజ్ చేస్తాడు శక్తి. అలా  ఇద్దరూ ‘గట్టి మేళం’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ పెడతారు.

విజయవంతంగా ఈ బిజినెస్ చేస్తూ ఆఫీసులోనే తిని పడుకుంటూ ఫక్తు బిజినెస్  పార్టనర్స్ గా వుంటారు. ఒకే పక్క మీద పడుకుంటున్నా హద్దు మీరకుండా ఉంటాడు శక్తి. అలాంటిది  ఇంకో చాలాపెద్ద కాంట్రాక్టు చేపట్టి సక్సెస్ చేసినప్పుడు దాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ తప్ప తాగేస్తారు. అప్పుడు శృతియే చొరవతీసుకుంటుంది శృతి కలపడంతో  అన్నీ జరిగిపోతాయి!
దీంతో మాటతప్పి ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చేసినందుకు ఫీలైపోయి- ఈ  ‘సెషన్’ జరిగి వుండాల్సింది కాదంటాడు శక్తి. జరిగిందాన్ని ‘సెషన్’ అంటూ తేలిగా మాట్లాడ్డంతో మండిపోయి మాటలు మానేస్తుంది శృతి. అలా ఎడం పెరుగుతూ బిజినెస్ లో పొరపాట్లకి అతణ్ణి నిందిస్తూండే సరికి, ఇక ఇద్దరూ విడిపోయే పరిస్థతి వస్తుంది. శక్తి వేరే అలాటి బిజినెస్సే పెట్టుకుని పోటీకి దిగుతాడు...

ఇదీ విషయం. ఈ పోటీలో కష్టాలు, ఒక్కరే నిర్వహించలేని వ్యవహారాలూ ఎదురై ఒకరిలోటు మరొకరు తెలుసుకుని ఎలా ఒక్కటయ్యారనేది ఇక్కడ్నుంచీ చూడొచ్చు.

కథ సంగతలా ఉంచితే, ముందుగా వచ్చిన ఇబ్బందేమిటంటే  నానీ- వాణీ కపూర్ ల జోడీ ఛోటే మియా- బడే  మియా లాగా వుండడం! ఎత్తుల్లో కొట్టొచ్చే తేడాతో ఏకోశానా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్పించుకోకపోవడం...మరీ పంజాబీ తనం ఎక్కువున్న వాణీ కపూర్ వల్లకూడా తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ లేకపోవడం...అసలు మేకింగే హిందీ సినిమాలావుండడం...కొత్తవాడైన తమిళ దర్శకుడు గోకుల్ కృష్ణ మక్కీకి మక్కీ ఒరిజినల్ నే తమిళంలోకి దింపి లిప్ సింక్ ద్వారా తెలుగు రిమేక్ అనికూడా అన్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. క్లోజప్స్ లో ఆ లిప్ సింక్ బండారం బయటపడింది...ఇంకా ఒక్క నానీ తప్ప మరెవరూ తెలుగు నటులు లేకపోవడం కూడా ఇది డబ్బింగే అన్పించడానికి దారితీసింది.


ఖర్చు బాగానే పెట్టారు, విజువల్స్ బ్రహ్మాండంగానే వున్నాయి- సంగీతం ఓ మోస్తరే- అయితే మొదలెట్టింది లగాయతూ చివరి ఘట్టం దాకా బ్యాక్ డ్రాప్ లో మార్పులేని వరస పెళ్ళిళ్ళ ప్రోగ్రాములే చూపించడంతో అదో మొనాటనీకి దారితీయడ మేగాక,  కథ తక్కువ హడావిడి ఎక్కువలా తయారయ్యింది.  సినిమా చూసి బయటికి వస్తూంటే  కథ కంటే పెళ్ళిళ్ళ సందడే చెవుల్లో గింగురు మంటూంటుంది...వేటిలో ఒక్క పెళ్లి కూడా  తెలుగు పెళ్లి వుండదు!


స్క్రీన్ ప్లే సంగతులు
మల్టీ ప్లెక్స్ సినిమాలకి ఓ స్క్రీన్ ప్లే అంటూ వుండదు. ఈ సినిమాలు తీసే కొత్త దర్శకులు కొత్త ధోరణి అనుకుని ఇష్టానుసారం కథలల్లుకుంటారు. లైటర్ వీన్ కథలు, బలహీనమైన పాయింట్లు, వెన్నెముక లేని ప్లాట్ లైన్లూ వీరి ప్రత్యేకత. ఇదే ఒరిజినల్ కథలో కన్పిస్తుంది. అదే యధాతధంగా రీమేకుల్లో దిగుమతయ్యింది. కొన్ని సినిమాల నుద్దేశించి కాలక్షేప బఠాణీ లంటూంటాం...వాటిల్లో కూడా కథ ఎంతైనా కొంత బలంగానే వుంటుంది. కానీ మల్టీప్లెక్స్ సినిమాలు అంతకన్నా బలం లేని కథలతో పాప్ కార్న్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఒరిజినల్ హిందీ కథ రాసుకున్న దర్శకుడు మనీష్ శర్మ, ‘స్క్రీన్ ప్లే’ సమకూర్చిన హబీబ్ ఫైసల్ –ఇద్దరూ ఇంటర్వెల్లో శృంగార దృశ్యం మీద  మమకారం బాగా  పెంచుకుని అదే  ఈ కథకి ప్రాణం అనుకున్నారు. దాని ఆధారంగానే మిగతా కథ  నడిపి ముగించినట్టు అన్పిస్తారు. కానీ కథని ఇరవైనిమిషాల్లో మొదటి అంకం ముగించేసి- శృతి కి వెడ్డింగ్ ప్లానర్  లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తూ రెండో అంకం ప్రారంభించారు. అంటే ఇక్కడే అసలు కథ ప్రారంభమైందన్న మాట. ఐతే  దీన్ని కేవలం వెర్బల్ గా (మాటల రూపంలో) చెప్పించారేతప్ప- విజువల్ గా ఒక బలమైన సంఘటనతో ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాంటప్పుడు ముగింపు కూడా విషయంలేక- లేదా ఏదో విషయాన్ని బలవంతంగా జొప్పించి నట్టుగా బలహీనంగా వస్తుందనేది గుర్తించ లేకపోయారు. వారి దృష్టిలో ఇంటర్వెల్ మలుపే కీలకం. ఇదే ముగింపుకి ‘ఇష్యూ’  అవుతుం దనుకున్నారు. కానీ అది కేవలం వాళ్ళ ఊహే!


ఏ స్క్రీన్ ప్లే కైనా మొదటి అంకం ముగింపులో లక్ష్యాన్ని, లేదా సమస్యని బలంగా ఏర్పాటు చేయకపోతే మూడో అంకం (క్లైమాక్స్) ముగింపు కూడా బలహీనంగా వస్తుందనేది చాలా ప్రాథమిక సూత్రం. పోనీ శృతి లక్ష్యాన్ని వెర్బల్ గా బలహీనంగానే ఎష్టాబ్లిష్ చేశారే  అనుకుందాం- అంటే  ఈ పాయింటుతో ఇక్కడే కథ మొదలయింది. అప్పుడు ఈ పాయింటు మీద క్లైమాక్స్ కి పోతే అప్పుడది స్టోరీ క్లైమాక్స్ అవుతుంది. కానీ ఇంటర్వెల్ సీనుతో కథ ప్రారంభమయ్యిం దనుకోవడంవల్ల దానిమీదే ముగింపుకి పోయారు. ఇంటర్వెల్ సీను కథలో ఒక మలుపే తప్ప అదే కథ కాదు. దాంతో ముగింపుకి పోతే అది ప్లాట్ క్లైమాక్స్ కి పోతుంది. కావాల్సింది స్టోరీ క్లైమాక్స్...

బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ లో కమలహాసన్- సరితలు  ఏడాది తర్వాతే కలుసుకోవడమనే ‘స్టోరీ’ ని ఏర్పాటుచేసి- తీరా  చూస్తే కలపకుండానే ఓ ట్రాజడీతో క్లైమాక్స్ కి చేర్చిముగిస్తారు.  ఇక్కడ ప్రేక్షకుల్ని ‘స్టోరీ క్లైమాక్స్’ కోసం ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసి,  వాళ్ళ ఊహలు తలకిందులు చేస్తూ స్టోరీ క్లైమాక్స్ క్యాన్సిల్ అయ్యేలా ప్లాట్  క్లైమాక్స్ ఎత్తుకున్నారు. ఈ ప్లాట్ క్లైమాక్స్ ఎక్కడ్నుంచి వచ్చింది? మాధవిని కమల్ వదిలేశాడన్న అక్కసుతో ఆమె అన్న యాక్టివేట్ అయ్యే పరిణామంతో  అనివార్యంగా వచ్చింది! దీన్ని తప్పించి స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళలేరు- ఏడాది ఎడబాటు షరతుని విజయవంతంగా నిభాయించుకుని కమల్- సరితలు ఒకటయ్యే ప్రశ్నే తలెత్తనంత బలమైన పరిణా మమది-కాబట్టే ప్లాట్ క్లైమాక్స్! అంత  కరెక్టు జడ్జిమెంట్  కాబట్టే అంతటి హిట్! హిందీ రీమేక్  ‘ఏక్ దూజేకేలియే’ లో క్లైమాక్స్ మార్చాలంటూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగలేదు బాలచందర్.


ప్రస్తుత సినిమాలో సరిగ్గా ‘మరోచరిత్ర’కి వ్యతిరేకంగా జరిగుండాల్సింది- అంటే –స్టోరీ క్లైమాక్స్ చోటుచేసుకుని వుండాల్సింది. ఎందుకంటే ప్రేమకి సంబంధించిన వాళ్ళిద్దరి  ప్లాట్ క్లైమాక్స్ ఏం చేసినా పేలవంగానే, అర్ధంపర్ధం లేకుండా వుంటుంది. అందుకే క్లైమాక్స్ లో  ఆమె అకస్మాత్తుగా తనకి ఎంగేజ్ మెంట్ అయినట్టు చెప్పేస్తుంది. దుబాయిలో  వున్న పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నట్టు పదే  పదే  ఫోన్ ని ఉపయోగిస్తుంది. ఇదంతా అసందర్భంగా మనకి అన్పిస్తుంది. అతన్ని పక్కనపెట్టి- కథలో వున్న ఇతర పాత్రలకైనా తెలియకుండా ఆమె ఎంగేజ్  మెంట్ ఎలా చేసుకుంటుంది? ఆ పెళ్లి కొడుకెవరో చూపెట్టకుండా ఆమె ఫోన్లోనే మాట్లాడుతున్నట్టు చూపిస్తూంటే ఆమే దొంగ నాటక  మడుతున్నట్టు లేదా? ఆ పెళ్ళికొడుకు  తెరమీదికి రాకుండానే అతను ఫూలిష్ గా ఆమె నాటకానికి పడిపోయినట్టు లేదా?

ఎత్తుకున్న వ్యాపారభాగాస్వామ్యం మీదే స్టోరీ క్లైమాక్స్ కి  వెళ్లి వుంటే ఇలా ప్రేక్షకుల్ని ఏమార్చే వ్యవహారం తప్పేది. ఇందుకు మొదటి అంకం ముగింపులో ఆమె కి ర్పాటు చేసిన లక్ష్యం బలంగా వుండాలని చెప్పుకున్నాం. వెర్బల్ గానే ఏర్పాటుచేసిన పాయింటులో వాళ్ళిద్దరి ఒప్పందానికి సంబంధించి వివరాలు అసంపూర్ణం గానే వున్నాయి. ఫైనాన్స్ లో రోమాన్స్ ని మిక్స్ చెయ్యనని తను మాటిచ్చాడు సరే, ఒకవేళ మాట తప్పితే ఏంచెయ్యాలి? ఈ క్లాజు ఒప్పందంలో లేకపోవడం కూడా చైల్డిష్ గా వుంది. దీనిక్కూడా సమాధానం చెప్పివుంటే గేమ్ కి బలం చేకూరేది..ఎలాగూ ఒప్పంద ఉల్లంఘన జరిగింది కాబట్టి- దానికెవరు బాధ్యులనే ప్రశ్న తలెత్తేది. ఈ ప్రశ్నే విభేదాలకి దారితీసివుంటే- ఈ ప్రశ్నే తర్వాతి కథనానికి మూలాధారంగా వుండి –అర్ధవంతమైన స్టోరీ క్లైమాక్స్ కి వెళ్ళేది- అందులోంచే వాళ్ళిద్దరి ప్రేమ సమస్య కూడా పరిష్కారమై పోయేది!

ఇంత చెప్పుకున్నాక ఈ కథకి ప్రధాన పాత్ర  ఎవరు?- అనే ప్రశ్న కూడా మనకి తలెత్తితే సమాధానం మాత్రం దొరకదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ సినిమా కథలింతే!

- సికిందర్



















14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

రివ్యూ..
 గూండే

 మాస్ బ్రోమాన్స్!
రణవీర్ సింగ్ , అర్జున్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, శౌరభ్ శుక్లా తదితరులు 
సంగీతం : సుహెయిల్ సేన్,  ఛాయాగ్రహణం : అసీం  మిశ్రా 
బ్యానర్ : యశ్  రాజ్ ఫిలిమ్స్,  నిర్మాత : ఆదిత్యా చోప్రా 
రచన- దర్శకత్వం :  ఆలీ అబ్బాస్ జాఫర్  , విడుదల : ఫిబ్రవరి 14, 2014
   ***   
మాస్ సినిమాల కోసం దక్షిణాది రీమేకుల మీద ఆధారపడుతున్న బాలీవుడ్ కి అలాటి అవసరం ఇక లేకుండా సొంత కార్ఖానా నుంచి కూడా తమదైన ఉత్పత్తి తీయొచ్చని ‘గూండే’ అనే ఈ పక్కా ఉత్తరాది నేటివిటీ తో వచ్చిన కమర్షియల్ నిరూపిస్తోంది. కావలసిన అన్ని హంగులూ, మసాలా మేళవించి రెండున్నర గంటల బోరు కొట్టని, బోల్డు బ్రోమాన్స్ (బ్రదర్ హుడ్ – రోమాన్స్) ని ఒలకబోస్తూ వాలెంటైన్స్ డే కి విచ్చేసిన ఈ యశ్ రాజ్ ఫిలిమ్స్ కానుక, 1970 ల నాటి కథాకమామిషుని ఆవిష్కరిస్తోంది. 
1970 ల నాటి నేటివిటీతోనే గత ఆగస్టు 15 న విడుదలైన అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి- దొబారా’ దారుణంగా విఫలమైన చోటే, ‘గూండే’ నాటి కలకత్తా నేటివిటీతో సఫలమైంది. రెండూ యాక్షన్ - ప్రేమకథలే అయినప్పటికీ-  ‘గూండే’ –ప్రేమలోనే ఒదిగిపోయే యాక్షన్ ని నేర్పుగా జొప్పించి చప్పట్లు కొట్టించుకో గల్గుతోంది.

బాలీవుడ్ తాజా ట్రెండీ హీరోలు రణవీర్ సింగ్- అర్జున్ కపూర్ లు, హాట్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తో కలిసి మ్యూజికల్ రోమాన్స్ కి తెర తీశారు. ముక్కోణ ప్రేమకథని బొగ్గు గనుల చీకటి కోనల్లో మెరుపులా మెరిపించారు. ఆమె దృష్టిలో ఒకరు  వజ్రం అయితే, మరొకరు నల్ల బంగారం. ఆమె ప్రేమ కోసం ఈ రెండూ సంఘర్షించుకోవడం స్వయంకృతమేనా, లేక దీని వెనుకేమైనా వేరే చోదక శక్తులున్నాయా?

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ 2011 లో ఇమ్రాన్ ఖాన్- కత్రినా కపూర్- అలీ జాఫర్ లతో ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’ అనే కడుపుబ్బ నవ్వించే రోమాంటిక్ కామెడీతో-  కత్రీనాలోని కొత్త టాలెంట్ ని (అదరగొట్టే పూర్తి స్థాయి యాక్టివ్ పాత్ర తో)  బయట పెట్టించిన ఘనతతో,  ఇప్పుడు ప్రియాంకా చోప్రాలోని స్త్రీ సహజ లాలిత్యాన్నీ  చక్కగా వెలికి తీశాడు.

1970 లనాటి కథా కాలం నేటి హిందీ బాక్సాఫీసు విజయాల కొత్త ఫార్ములాగా ఎలా వర్కవుటవుతోందో చూడాలంటే అసలీ సినిమాలో విషయమేమిటో  తెలుసుకోవాలి..

బంగ్లా కాందీశీకులు – ఘరానా గూండాలు
1971 యుద్ధంలో భారత దేశం తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో జెనీవా శరణార్ధుల శిబిరంలో ఇద్దరు బాలలు- విక్రం, బాలా బాధలు పడతారు. ఒక ఆయుధాల స్మగ్లర్ వీళ్ళని ఉద్ధరించి వాడుకుంటాడు. తదనంతర పరిణామాల్లో పిల్లలిద్దరూ ఒక కాముకుడైన బ్రిగేడియర్ ని చంపి కలకత్తా పారిపోయి వస్తారు. పౌరసత్వం లేని వీళ్ళ ఉనికి ప్రశ్నార్ధకమౌతుంది. అవమానాలకి గురవుతారు. అసలు తామెవరు, ఏ దేశపు వాళ్ళు, ఇక్కడ్నించీ ఏమిటి జీవితం...లాంటి జవాబుదొరకని ప్రశ్నలతోనే బతుకులీడుస్తూ ఓ ఆలోచనచేసి – బ్రతుకుదెరువు కోసం బొగ్గు రవాణా చేసే రైళ్ళ మీద ప్రాణాలకు తెగించి దాడులు చేస్తూ ఆ బొగ్గుని అమ్ముకుంటూంటారు.

పెరిగాక కలకత్తానే శాసించే బడా గూండా లవుతారు. హేపీగా బొగ్గుతో బాటు చమురు, గ్యాస్, కలప స్మగ్లింగులు చేసుకుంటూ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారుతారు. ఒకపక్క స్కూళ్ళూ  ఆస్పత్రులూ కట్టించి ప్రజా సేవ చేస్తూంటారు. ప్రజానీకానికి దేవతల్లాగా వుంటారు. దందాలో వీళ్ళకి ప్రత్యర్ధు లెవరూ వుండరు. వేరే విలన్లూ శత్రువులూ ఎవరూ వుండరు- ఒక్క కొత్తగా వచ్చిన ఏసీపీ సత్యజిత్ సర్కార్ (ఇర్ఫాన్ ఖాన్) తప్ప.

విక్రం (రణవీర్ సింగ్), బాలా (అర్జున్ కపూర్) ఇద్దరూ ప్రాణానికి ప్రాణమిచ్చే కరుడుగట్టిన స్నేహితులు. పధ్నాల్గేళ్ళుగా వీళ్ళ మీద రుజువులు దొరకని కేసుల చిట్టాలు కట్టలుగా పేరుకుని పున్నాయి. వీళ్ళ కరుడుగట్టిన స్నేహాన్నీ, చట్టాలకి దొరకని వీళ్ళ దందాల్నీ ఎలాగైనా బద్దలు కొట్టాలనుకుని - ఏసీపీ సర్కార్ ఆ కేసుల కట్టల్ని మోసుకొచ్చి కౌన్సెలింగ్ చేస్తాడు. వాళ్ళు పగలబడి నవ్వి,  ఒక్క రుజువు చూపిస్తే ఏ కౌన్సెలింగూ అక్కర్లేకుండా చట్టానికి లొంగి పోతామంటారు. సర్కార్ అక్కడే ఆ ఫైళ్లని తగులబెట్టి- ఇక్కడ్నించీ మీ నేరాల్ని రుజువులతో సహా పట్టుకుని, మీ లంకలోంచి మిమ్మల్ని కుక్కల్ని ఈడ్చుకు పోయినట్టు ఈడ్చుకు పోతానని హెచ్చరించి  వెళ్ళిపోతాడు.

ఎంటర్ ది క్యాబరే డాన్సర్ నందితా (ప్రియాంకా చోప్రా).. కలకత్తా క్లబ్ యూరినల్స్ లో ఈమెతో యూత్ ఫుల్ గా  రోమాన్స్ లో పడి – దందా వదిలేసి బీట్లేయడం మొదలెడతారు. ఈమె ఎవరికి పడితే ఆ రెండో వాడు వదినగా ఒప్పుకుని తప్పుకోవాలని ప్రమాణాలు చేసుకుంటారు. ఆమెఎవరికీ పడదు సరికదా, ఓ రోజు సినిమాకి రమ్మని- ఆ సినిమాహాల్లో వెండి తెరమీద శ్రీదేవి పాటకి ఆగలేక స్క్రీన్ ముందు డాన్స్ వేస్తూంటే ఆకతాయిలు అడ్వాన్స్ అవుతారు. అప్పుడు తట్టుకోలేక ఓ ఆకతాయిని బాలా కాల్చి పారేస్తాడు. కేసు మెడకి చుట్టుకోవడంతో పారిపోమ్మంటాడు విక్రం.

కానీ తమ ప్రేమాయణం కొలిక్కి రాకుండానే ఎలా పారిపోవాలి? ప్రస్తుతానికి ప్రేమాయణానికి విరామం, పరిస్థితులు చక్కబడి నువ్వు తిరిగొచ్చాకే మొదలెడదాం, అంతవరకూ నేను నందితాని కూడా చూడను-అని మాటిచ్చి పంపుతాడు విక్రం. ఆపాటికే నందితా తనతో ప్రేమలో పడిందని విక్రంకి తెలీదు. ఆమె వచ్చి ప్రేమని ప్రకటించి- కాళీ మాతా నిమజ్జనోత్సవాలకి నువ్వొచ్చి నాతోపాటు హారతి పట్టకపోతే జన్మలో నీ మొహం చూడనని వెళ్ళిపోతుంది.

ఇప్పుడేం చేశాడు విక్రం? స్నేహితుడి కిచ్చిన మాట తప్పి నందిత కోసం వెళ్ళాడా? వెళ్తే పరిణామాలెలా వుంటాయి?నందితని కాదంటే ఏమవుతుంది? ఈ పరిస్థితిని ఏసీపీ సర్కార్ ఎలా వాడుకోగలడు? స్నేహితుల్ని విడదీసి పరస్పరం అస్త్రాలుగా ప్రయోగించగలడా? ఏం చేయగలడు? ఇక్కడ్నించీ ఏమౌతుంది?

Contd..





                                      

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

కథలోంచి పలాయనం!

రివ్యూ..
పైసా 
**నాని, కేథరిన్ ట్రెసా, సిద్ధికా శర్మ, చరణ్ రాజ్, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ తదితరులు

సం గీతం : సాయి కార్తీక్,   ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్,  ఎడిటింగ్ : త్యాగరాజన్  రచన : పద్మశ్రీ, కే కే బెనర్జీ , పాత్రికేయ

నిర్మాత : రమేష్ పుప్పాల,    బ్యానర్ : ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్
రచన- దర్శకత్వం : కృష్ణ వంశీ
విడుదల :                సెన్సార్ : 'A'
***
నానీ- కృష్ణ వంశీ ల కాంబినేషన్ లో అట్టహాసంగా ప్రారంభమై విడుదల సంక్షోభా న్నెదుర్కొంటూ వచ్చిన ‘పైసా’ మొత్తానికి బాక్సాఫీసు పరీక్షకి వచ్చి నిలబడింది. దర్శకుడు కృష్ణ వంశీ ఏదో సామాజిక స్పృహతో తీసినట్టు అన్పించే ఈ ‘పైసా’, దీనికి సహజంగా ఇచ్చే షుగర్ కోటింగ్ దృష్ట్యా  ప్రేక్షకుల్ని మాయచేసి కాసేపు ఊకదంపుడు మసాలా సినిమాల మత్తు నుంచి దూరంగా, ఆలోచనాత్మక సినిమా దిశగా సంసిద్ధుల్ని చేస్తుందేమో నన్న అభిప్రాయాన్ని కల్గించింది. మరోపక్క విషయపరంగా అభ్యంతరకరంగా వున్న కారణంగా విడుదల ప్రశ్నార్ధకం కాలేదన్నదీ ఒక నిజం. ఒక సామాజిక సమస్యతో ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ భారీ కమర్షియల్ ‘జైహో’ కి సైతం ప్రేక్షకు లిచ్చిన తీర్పు గమనిస్తే, ఈ తరహా సినిమాలు సరైన అవగాహన లేకుండా తీస్తే ఇంతే సంగతులవుతాయని కూడా గమనించగలం. మరి ఈ కోవలో ‘పైసా’ ఎటువైపు నిలబడింది- ప్రేక్షకుల వైపా, ‘జైహో’ వైపా?


‘పైసా’ ఫక్తు మాస్ కమర్షియల్ ముద్రేసుకుని చేయాలనుకున్న ఒక సోషల్ కామెంట్. ‘పిల్ల జమీందార్’ తర్వాత మరో సారి నాని మాస్ పాత్రతో ఒన్ మాన్ షో గా నడిపిన డబ్బు సినిమా. డబ్బు సినిమాలు రోడ్ మూవీస్ గానో, ఛేజ్- థ్రిల్లర్స్ గానో తప్ప, విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూనే, షుగర్ కోటింగ్ తో షోషల్ కామెంట్ గా వచ్చిన దాఖలా ఈ మధ్య కాలంలో లేదు. కృష్ణ వంశీ లాంటి ఒక  సీనియర్ దర్శకుడు, అందునా ప్రత్యేక పంథాగల సాం కేతికుడు ఇలాటి సబ్జెక్టుని డీల్ చేస్తున్నాడంటే పాతా కొత్తా అభిమానులంతా  విడుదల జాప్యానికి సంబంధించిన కారణాల కతీతంగా క్యూ కట్టేస్తారు. మరి వాళ్ళ అభిమానాన్ని నిలబెట్టుకుందా ఈ ‘పైసా’ ?

నగరాల్లో కళ్ళు చెదిరే సంపద సృష్టి జరుగుతోంది. దురదృష్ట వశాత్తూ దీనికి ఆత్మాభిమానం చంపుకుని నెగెటివ్ గా స్పందించే కళ్ళే ఎక్కువ కనబడుతున్నాయి సొసైటీలో. అలాటి ఒక జత కళ్లున్న ప్ర ‘క్యాష్’ అనబడే ప్రకాష్ అనే యూత్ కథే ఈ సినిమా. ఈ కథానాయకుడు  చివరంటా ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం!

‘కోటి’ ఆశల కుర్రాడు!
ఓల్డ్ సిటీలో షేర్వానీ లకి మోడలింగ్ చేసే ప్రకాష్ (నాని) కి బాగా డబ్బు సంపాదించు కోవాలని కోరిక వుంటుంది. కోటి రూపాయలు సంపాదించుకుంటే ఇక జీవితం సాఫీగా సాగిపోతుందనే ఆలోచనలుంటాయి. ఎక్కడ చూసినా వేల,లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల వార్తలు అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. అంత డబ్బుని ఊహించలేక పోతాడు. దుబాయి వెళ్ళిన స్నేహితుడు పంపిన డబ్బు హవాలా రూపంలో తీసుకోవడానికి వెళ్ళినప్పుడూ అక్కడ ధనరాశులు చూసి డంగై పోతాడు. ఎలాగైనా ఒక్క కోటి రూపాయలు కళ్ళ జూడాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

మరో వైపు ఇతనంటే ఇష్టపడే వస్త్రాల షాపులో పనిచేసే నూర్ (కేథరిన్ ట్రెసా) వుంటుంది. ఈమె ఇష్టాన్ని వెటకారం చేస్తూంటాడు. దీన్ని కట్టుకుంటే జీవితాశయం నెరవేరదని వాదిస్తాడు. అనుకోకుండా బంజరా హిల్స్ లో నివశించే రాజకీయ నాయకుడు సన్యాసిరాజు (చరణ్ రాజ్) అల్లరి కూతురు స్వీటీ (సిద్ధికా శర్మ ) పరిచయంకావడంతో డిసైడ్ అయిపోతాడు. డబ్బున్న అమ్మాయికి వలేస్తే తక్షణం జీవితం మారిపోతుందని ప్రేమించడం మొదలెడతాడు.
ఇటు తనని తిరస్కరించాడన్న కోపంతో దుబాయి షేక్ ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిపోతుంది నూర్. 

ఇది తెలుసుకున్న ప్రకాష్ ఆ పెళ్లిని తప్పించి ఆమెని తీసుకుని పారిపోతున్న క్రమంలో ఓ కారేక్కేస్తాడు. దీంతో ఆ కారుకి సంబంధించిన ముఠా కూడా వెంటపడతారు. ఆ కార్లో యాభై కోట్ల రూపాయల హవాలా డబ్బుంటుంది. ఈ డబ్బు ఉప ఎన్నిక గెల్చి సీఎం అయ్యేందుకు పన్నిన పన్నాగంలో భాగంగా విదేశాల నుంచి తెప్పించాడు సన్యాసిరాజు.

హైజాక్ అయిన ఈ డబ్బుల కోసం హడావిడిగా ఇంకో శ్రీకాకుళం గ్యాంగునీ, ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్టు( రాజారవీంద్ర)నీ రంగంలోకి  దింపుతాడు సన్యాసిరాజు. ఇంతకీ ఆ కార్లో అంత డబ్బుందని డబ్బు పిచ్చిగల ప్రకాష్ తెలుసుకున్నాడా? తెలుసుకుంటే ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ డబ్బుతో ఏం చేశాడు? నూర్ ఏమైంది? స్వీటీ సంగతేంటి?...మొదలైన ప్రశ్నలకి ఇక్కడ్నించీ మిగతా ఆట చూడాలి.


మొదటే చెప్పుకున్నట్టు ఇదంతా ఇంకో పాత్రకి అవకాశామివ్వని నానీ ఒన్ మాన్ షో. ఈ షోలో అతని నటనకి వంక పెట్టడాని కేమీ లేదు. కాకపోతే షో కూడా ఆ నటనతో పోటీ పడాలి. జవ జీవాలున్న మూడు ఘట్టాలు- గాలిపటం కోసం గలాటా, అంకెల్లో లక్ష కోట్లు రాసే కామెడీ, కారులో డబ్బు కనుగొన్నప్పటి మలుపు- ఈ మూడింట్లో అతను ప్రేక్షకుల్నుంచీ మంచి రెస్పాన్సే రాబట్టుకోగాలిగాడు. ఇలాటి ఘట్టాలు ఇంకిన్ని వుండి వుంటే ఆ ఒన్ మాన్ షిప్ కి సమగ్రత వచ్చేది.

హీరోయిన్ లిద్దర్లో కేరళ కి చెందిన కేథరిన్ ఇప్పటికే తెలుగు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. ఈమెకి నటన తెల్సు, అయితే సెకండాఫ్ లో ఈమె పాత్ర ఐపు లేకుండా పోయి ఈమె టాలెంటుకి గండి కొట్టింది. రెండో హీరోయిన్ సిద్ధికా గ్లామరారబోతకే  పనికొచ్చింది. చరణ్ రాజ్, రాజారవీంద్ర మొదలైన ప్రతినాయక పాత్రధారులు రొటీన్ నటనలతో అయ్యిందన్పించారు.

పాటలు- సంగీతం, కెమెరా, ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఏవైనా సరే సాంకేతిక హంగులు విషయపరంగా సినిమాని రంజింప జేయడం మీద ఆధారపడి వుంటాయి. విషయం గాడి తప్పినప్పుడు సాంకేతికాలు సినిమాని నిలబెట్టలేవు.

 స్క్రీన్ ప్లే సంగతులు
‘మొగుడు’  నిజంగానే హిందూ వివాహ వ్యవస్థ మీద తీసిన ఉదాత్త సినిమాయేనా? పెళ్లి వ్యవస్థ మీద సినిమా తీస్తున్నామని భావించుకుంటూ వేరే బాట పట్టిపోయిన క్రియేషనే ఇది ... వరకట్నం, విడాకులు, వేరుకాపురాలూ  లాంటి సమస్యల్లాగే – పెట్టిపోతల దగ్గర, కుటుంబ ఆచారాల దగ్గరా, పెళ్లి తంతులోనూ వచ్చేతేడాలుంటాయి.ఇలాటి ఒక తేడా గురించి తీసిన సినిమా మాత్రమే ‘మొగుడు’. దీనికి పెళ్లి వ్యవస్థతో ఎలాటి సంబంధమూ లేదు...రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గురించి సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు- ఏది తప్పు ఏది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల  పరిశీలనార్ధం కృష్ణ వంశీ  ఎక్కు పెట్టినట్టే. ఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగిపోయి వుంటే, ఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి వుండేది. ఇలా కాకుండా ఆ ఆర్గ్యుమెంట్ ని ( సైద్ధాంతిక విభేదాల్ని) హింసాత్మక చర్యలకి దారితీయించి, నానా బీభత్సం సృష్టించడంతో, దీన్నాపే మరో చర్యగా చివరాఖరికి గోపీచంద్ భోరున ఏడుస్తూ చెప్పుకునే ‘గాథ’ లా తయారయ్యింది సినిమా.‘కథ’  అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, ‘గాథ’ నిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అనేసి ఉత్త స్టేట్ మెంట్ ఇచ్చేసి వదిలేస్తుంది. ఈ తేడా గుర్తించడం అవసరం.  ఆర్గ్యుమెంట్ సహిత ‘కథలే’ సినిమాలకి పనికోస్తాయే గానీ, స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథలు’ కాదు...

2011 లో కృష్ణ వంశీ గత సినిమా ‘మొగుడు’ ని సమీక్షిస్తూ ఈ సమీక్షకుడు ‘దర్శకులం డాట్ కాం’ లో రాసిన రివ్యూలోని భాగాలివి. ఈ ప్రస్తావన ఇక్కడెందుకంటే,  సరీగ్గా గత సినిమాలో చేసిన భారీ తప్పుని దర్శకుడు తెలుసుకోకుండానే, అదే తప్పు చేస్తూ  తర్వాతి సినిమా ‘పైసా’ తీసినందుకు!


మొగుడు’లో పెళ్లి వ్యవస్థ గురించి చెప్పాలనుకున్నట్టే, ‘పైసా’ లో డబ్బు స్వామ్యం గురించి చెప్పాలనుకుని కథ మొదలెట్టారు. తీరా ‘మొగుడు’ లో పెళ్లి వ్యవస్థతో సంబంధంలేని వ్యక్తిగత వైషమ్యా లని రగిల్చి బీభత్స కాండ సృష్టించినట్టే, ‘పైసా’లోనూ ఎత్తుకెళ్ళిన డబ్బుకోసం ముఠాల వేటగా నీరుగార్చేశారు. ‘మొగుడు’లో కాన్సెప్ట్ ని వదిలేసి వ్యక్తిగత విభేదాలే సృష్టించినప్పుడు కనీసం అది కథా లక్షణాలతో కూడి వుండి, ఏదితప్పు?ఏది ఒప్పు? అన్న ఆర్గ్యుమెంట్ ని  ఎక్కుపెట్టగల్గారు. ‘పైసా’ లోనూ  కథకుండాల్సిన ఆర్గ్యుమెంట్ ని - కోటి కోసం డబ్బున్న అమ్మాయిని కట్టుకోవాలన్న ఆశయంతో స్థాపించారు. ‘మొగుడు’ లో ఈ ఆర్గ్యుమెంట్ ని కూడా సెకండాఫ్ లో వదిలేసి- సినిమాకి పనికిరాని స్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే ‘గాథ’ గా మార్చేసినట్టే, ‘పైసా’ లో కూడా చివరికి ‘ఇదిగో ఇలా జరిగితే ఇలా ముగిసిందీ- అనే ‘గాథ’ గానే మార్చేశారు!

సింపుల్ గా చెప్పాలంటే, రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఒక షోషల్ కామెంట్ గా ప్రారంభించిన కథని, పసలేని డబ్బు వేటగా దిగజార్చారు. సినిమా ప్రారంభించి అరగంటలో ‘కోటి కోసం డబ్బుగల అమ్మాయి’ అనే నిర్ణయంతో మొదటి అంకాన్ని చక్కగా సకాలంలో ముగించి, కథ ప్రారంభించాక- అదే కథలోంచి పలాయనం చిత్తగించారు.

హీరోకి దొరికిన, విలన్ పోగొట్టుకున్న డబ్బుకోసం డజన్ల సినిమాల్లో ఇదివరకే వచ్చేసిన యాక్షన్ సినిమాగా మార్చేశారు. ఈ యాక్షన్లోనూ రిలీఫంటూ లేక పోగా, పైపెచ్చు దాన్నొక ఉన్మాదంగా తయారుచేసి వదిలిపెట్టారు. యాభై కోట్లు దొరికిన హీరో లక్ష్యం ఏంటో ఎష్టాబ్లిష్ చెయ్యక –సినిమాకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ పోషించి ఎక్కడో ముగింపులో అసలు విషయం చెబుతూ ఉస్సూరన్పించారు.

కానీ దానికి ముందే హీరో ఆ డబ్బంతా తగుల బెట్టడం యాంటీ సెంటిమెంట్ గా మారిపోయి రసభంగం అయ్యిందన్న విషయం కూడా గమనించలేదు. సినిమాకి ఓపెన్ సీన్ –టు- సీన్ సస్పెన్స్ మాత్రమే వర్కౌట్ అవుతుందన్న ప్రాథమిక పాఠం పూర్తిగా మరిచారు. దర్శకుడు ఈ ‘కథ’ ని ‘ఇంటరాక్టివ్ స్క్రీన్ ప్లే టెక్నిక్’ తో రాసినట్టు చెప్పుకున్నారు. ప్రేక్షకుల్ని ఎక్కడెక్కడ ఎలా ఇన్వాల్వ్ చేయాలనే ప్రక్రియ ఇదని సెలవిచ్చారు. కానీ ఇంటరాక్టివ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ అనేది ఎక్కడాలేదు- ఉంటే గింటే అది టీవీ షోలకి పాశ్చ్యాత్య  దేశాల్లో వుంది. అసలు ఏ సినిమా స్క్రీన్ ప్లే అయినా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసేది గానే వుంటుంది- కొత్తగా ఇంటరాక్టివ్ అనేదేమీ వుండదు.

ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీ ని కేంద్రంగా చేసుకుని నడిపిన ఈ కథలో చూపించినట్టు,  ఇప్పుడక్కడ ఒకప్పటి ప్రసిద్ధ రెడ్ లైట్ ఏరియా ‘మెహెందీ’ లేదు. దాన్ని 1996 లోనే మూయించేశారు. అలాగే ముగింపులో ఇవ్వాలనుకున్న ట్విస్టు కోసం ఫస్టాఫ్ లో ఒక చోట వేసిన లీడ్ సీనులో చెప్పినట్టు- సంపాదనలో ఇరవై ఐదు శాతం దానమివ్వాలని  ముస్లిముల మతంలో ఎక్కడా చెప్పలేదు. రంజాన్ నాటికి ఆ  ఏడాదంతా కూడబెట్టిన మొత్తం స్థిర చరాస్థుల విలువలోంచి 2.5 శాతం జకాత్ గా ఇవ్వాల్సి వుంటుంది. సినిమాలో చూపించినట్టు పరాయి సొత్తు సొంతం చేసుకుని అందులోంచి దానమివ్వడాన్ని మతం ఒప్పుకోదు.

పాత్రోచితానుచితాలు
ఎక్కువ ప్రేక్షకాదరణ వుండే కమర్షియల్ సినిమాల్లో హీరో పాత్ర – క్యారక్టర్ గ్రాఫ్ మూడంచెలుగా వుంటుంది. వ్యక్తిగత అసంతృప్తులతో ప్రారంభమై, తన విశ్వాసాలకి సవాలుగా సాగి, ఆఖర్న తన అంతర్గత శత్రువు(అంటే-తన ‘విశ్వాసాలు’ అనుకుంటున్న రాంగ్ థింకింగ్) నీ- బహిర్హత విలన్లనీ జయించడంతో పాజిటివ్ గా మారడం!


 కానీ ఈ సినిమాలో హీరోకి ఈ జర్నీ లేదు. డబ్బుకోసం అమ్మాయిని పట్టడం అనే రాంగ్ థింకింగ్ నుంచి అతడేమీనేర్చుకోలేదు. ఎలా ప్రారంభమైన పాత్ర అలాగే ముగిసింది- వ్యక్తిగత స్వార్ధంతో. దొరికిన డబ్బు ఏం చేశాడో డొంకతిరుగుడు లెక్కలు చెప్పేకన్నా- ఆ డబ్బుని ఇన్ కం ట్యాక్స్ వాళ్ల పరం చేస్తే వాళ్ళే పది శాతం – ఐదుకోట్లు రివార్డు ఇచ్చి చట్టబద్ధత కల్పించే వారుగా- అలా లీగల్ సొమ్ముతోనే దుబాయ్ వెళ్ళిపోయే వాడుగా?

సినిమా ప్రారంభం లో కాసేపు దర్శకుడు కాన్సెప్ట్ ని షోషల్ కామెంట్ గా హడావిడి చేశాడుగానీ- దాన్నే గుర్తుంచుకుని వుంటే- కనీసం క్లైమాక్స్ లో నైనా కోట్లాది రూపాయలు వెదజల్లి అధికారంలోకి రావాలనుకునే నాయకులకి చెంప పెట్టులాంటి సందేశంతో హీరో చర్యల్ని సృష్టించేవాడు.

పక్కన చూపించే జేమ్స్ బానెట్ ‘ స్టోరీ వీల్ ‘ లోకి ఈ సినిమాలోని విషయాన్నీ, పాత్రనీ  తెచ్చి చూస్తే, ఇవి  పూర్తి అట్టడుగు స్థాయి (viii) యాంటీ ఫెయిరీ టేల్ (గాథ – కథ కాదు) కి చెంది, తన నుంచి తాను దూరమైపోయిన అసమర్ధ  పాత్రగా మాత్రమే తేల్తాయి!






   


-సికిందర్ 













   




హిందీ సినిమాలు ఇంతేనా ?

హిందీ సినిమాలు కూర్చోబెట్టే విషయం తక్కువగానూ, పారితోషికాలూ బడ్జెట్లు కళ్లు చెదిరేంత మహా ఎక్కువగానూ తయారైన ప్రమాదాన్ని పసిగట్టిన సుభాష్‌ఘాయ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ నాలుగేళ్ళు గడిపేశారు. అయినా ఏటా నూటయాభై తీస్తే నూటపాతిక ఫ్లాపయ్యే పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఏ మూకుమ్మడి ఫ్లాపులకి సినిమా రచనే కారణమని నిర్ణయించారో, ఆ స్క్రీన్‌ప్లే కోర్సులకోసం ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్ అభ్యర్థులు అయిపు లేకుండాపోయారు. మామూలుగా మూడు నెలలు, ఆరు నెలలు వుండే ఈ కోర్సుని ఏడాదిపాటు నూరిపోసినా, హిందీ సినిమాల్ని ఉద్ధరించే కథానుకథాయోధులు కాలేకపోయారు. కారణమొక్కటే కార్పొరేట్ సంస్థలు కూడా మూస ధోరణిలోమీ కథ తీసుకుంటే దర్శకత్వం వహించేదెవరు? దర్శకుణ్ణి పెట్టుకుంటే అతను తన కథే పట్టుకొస్తాడే, అప్పుడెలా?’ అని కళ్ళు తెరిపిస్తున్నారు. కార్పొరేట్ అయినంత మాత్రాన హాలీవుడ్ పద్ధతుల్ని పాటించాలని లేదు. ఇక్కడ ఫీల్డులో పాతుకుపోయిన పాత మూస భావాలతోనే అవికూడా దుకాణం తెరవాల్సిందే.

సీనియర్ రచయిత కమలేష్ పాండే కూడా హిందీ సినిమాల దుస్థితికి నేటి రచయితలే కారణమని భావిస్తారు. వీళ్ళు దర్శకులకి ఉపగ్రహాలనీ, వాళ్ళ ప్రాపకంకోసం విలువల్ని వదులుకుంటారనీ అంటారు. వాళ్ళిచ్చే డీవీడీలు చూసి, వాళ్ళు చెప్పినట్టు రాసి, ఆ స్క్రిప్టులమీద వాళ్ళ పేర్లే రాసిచ్చి, ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయే వృత్తితత్వం తెలీని అర్భకులని కూడా అంటారు పాండే. వీళ్ళకసలు ముంబాయిలో కథలు నిండుకున్నాయని తెలీదనీ, కథలెక్కడున్నాయో ఆ గ్రామసీమలకెళ్ళలేరనీ నిందిస్తారు. కానీ పాండే తన కాలంలో వుండి మాట్లాడుతున్నట్టుంది. ఆ కాలంలో రచయితలకి బ్రాండ్ నేమ్ వుండేది. కమలేష్ పాండే, సలీం-జావేద్, రాహీ మసూంరాజా, రాబిన్ భట్... వీళ్ళ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలతో సబ్జెక్టులు తెరకెక్కేవి. ఇప్పుడవన్నీ దర్శకులేసుకుంటారు. రచయిత ఫిలిం ఇనిస్టిట్యూట్ పట్టా పొందినా, అనామకంగా దర్శకుల కొలువుల్లో చోటు సంపాదించుకోవాల్సిందే. ఫిలిం ఇనిస్టిట్యూట్ భాష మాట్లాడకుండా, అక్కడ నేర్చుకున్న శాస్త్రంకూడా మర్చిపోయి, సొంత కథా కాకరకాయా పక్కనపెట్టి, చెప్పింది రాసిపెట్టాల్సిందే. సొంత కథతో రచయిత అన్పించుకోవాలంటే తనే దర్శకుడవ్వాలి తప్ప మరో మార్గంలేదు. కమలేష్ పాండే లాంటి సీనియర్లకి ఇంకా సాగుతూండవచ్చు. తనింకా మూడు పెద్ద సినిమాలకీ, రెండు చిన్న సినిమాలకీ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ అదే ఐడెంటిటీ నిలబెట్టుకోవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు కొత్త రచయితలకెక్కడిది. అలాంటప్పుడు అసలు సొంత టాలెంట్‌నే బయటపెట్టుకోలేని వీళ్ళు, హిందీ సినిమాల దుస్థితికి కారకులెలా అవుతారు. తమ కథే బాగాలేనప్పుడు గ్రామసీమలకెళ్ళి ఏం వెతుక్కుంటారు. అసలు గ్రామసీమల కథలు ఇప్పుడు చూసే హిందీ ప్రేక్షకులున్నారా?

నాటి ప్రసిద్ధ హీరో వినోద్‌ఖన్నా అయితే ఇంకో అడుగు ముందుకేశారు. ఫీల్డులోకి నవలా రచయితలు రాకపోవడమే ఈ దుస్థితికి మూలకారణమని తేల్చేశారు. నవలా రచయితలు మొహమాటపడుతుంటారని, వాళ్ళని బుజ్జగించి బామాలి తీసుకురావాలనీ, అంతేగాక యూనివర్సిటీల్లో స్క్రీన్‌ప్లే కోర్సులు ప్రవేశపెట్టాలనీ డిమాండ్ చేశారు. 

ఇది చోద్యంగానే వుంటుంది వినేవాళ్లకి. నవలా రచయితలు సినిమా రచయితలెప్పుడయ్యారు. ఆర్కే నారాయణ్ తను రాసిన గైడ్నీ, గుల్షన్ నందా కటీపతంగ్నీ ఇచ్చారేమో సినిమా తీసుకోమని. ఇచ్చి తప్పుకోవాలే తప్ప ఇంకెందులోనూ చేతులు పెట్టకూడదుగా. ఎన్నారై రచయిత ఫరూఖ్ ధోన్డీ కథతో సుభాష్‌ఘాయ్ కిస్నాతీస్తున్నప్పుడు, కథా చర్చల్లో పాల్గోడానికి పిల్చి ఏం మర్యాద చేశారో, అప్పట్లో ధోన్డీ డెక్కన్ క్రానికల్ ఎడిట్ పేజీలో ఇంత పొడుగు వ్యాసం రాసుకోవాల్సి వచ్చింది. చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సమ్ ఒన్తో త్రీ ఇడియెట్స్తీసిన రాజ్‌కుమార్ హిరానీ, చేతన్ పేరు వేయకుండా రేపిన దుమారం తెలిసిందే. నవలా 

రచయితలకిస్తున్న గౌరవ మర్యాదల మాటలా వుంచితే, అసలు నవలా రచయితలు సినిమా రచనలో విఫలమవడం విశ్వవ్యాప్తంగా కన్పించే ఒక వాస్తవమే. నవలా రచన వేరు, సినిమా రచన వేరు. ప్రసిద్ధ నవలా రచయిత స్కాట్ ఫిట్జెరాల్డ్ అయినా, ‘జాస్రచయిత పీటర్ బెంచ్లే అయినా, ‘్ఫరెస్ట్ గంప్రాసిన విన్‌స్టన్ గ్రూమ్ అయినా తమ నవలల్ని సినిమాలుగా మలచడంలో విఫలమైన వాళ్ళే. ఫిట్జెరాల్డ్ తనదికాని రంగంలో విఫలయత్నంచేసి వెళ్ళిపోతే, వద్దన్నా పీటర్ బెంచ్లే జాస్స్క్రిప్టుని మూడుసార్లు రాసిచ్చి సమయం వృధాచేశారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ చివరి నిమిషంలో తనకి తెలిసిన టీవీ రచయితని పిలిపించుకుని ఏరోజు సీన్లు ఆరోజు రాయించుకోవాల్సి వచ్చింది. ఇక ్ఫరెస్ట్ గంప్తో విన్‌స్టన్ గ్రూమ్‌తో తలెత్తిన వివాద ఫలితంగా స్క్రిప్టు రాయకున్నా, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నవలా రచయితగానైనా ఆయన పేరు ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో నవలా రచయితలకి మొహమాటాలు, వాళ్లకి బుజ్జగింపులతో ఆహ్వానాలూ జోకుకిందే లెక్కించవచ్చు. 

ఎటుతిరిగీ హిందీ సినిమాల వైఫల్యానికి నేటి రచయితలనే బాధ్యుల్ని చేస్తున్నారు. ఎలాటి బాధ్యతాయుత స్థానంలోనూ వుండని, సినిమాల జయాపజయాల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేని, ఈ అమాయకుల్ని అర్జెంటుగా సంస్కరించే పని పెట్టుకున్నారు. ఫిలిం ఇనిస్టిట్యూట్లూ, యూనివర్సిటీల్లో కోర్సులూ.. వామ్మో.. సినిమాల్ని హిట్ చేయడానికి సుశిక్షితులైన రాత పని కూలీలు ఎంతవసరం నిజంగా!
వ్యవస్థని బాగుచేయకుండా, వ్యవస్థలో నామమాత్రమైన రచయితల సంస్కరణతో ఏది బాగుపడుతుంది. హాలీవుడ్ ఇలా రచయితల వ్యవస్థని నాశనం చేసుకోలేదు, యూరప్ చేసుకుంది. 1960లలో యూరప్‌లో ఆధర్ థియరీఅనే పదాన్ని కాయిన్ చేసి, సినిమాకి నిజమైన కథకుడు దర్శకుడే, రచయితకాదని డిసైడ్ చేశారు. దీంతో అక్కడి పరిశ్రమ నిజమే కాబోలనుకుని రచయితల్ని అంటరాని వాళ్ళుగా చూడడం మొదలెట్టింది. అంతగాక ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లో స్క్రీన్‌ప్లే కోర్సుల్ని ఎత్తిపారేసింది. ఇక దర్శకులే రాసుకుని తీయడం మొదలెట్టారు. 

హాలీవుడ్‌లాగా యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా చూసే కమర్షియల్ సినిమాలు తీయలేవు. కాబట్టి అక్కడ చెల్లిపోతుంది. ఇది భారత్‌కెలా వర్తిస్తుంది. అయినా కమర్షియల్ సినిమాల కాలవాలమైన బాలీవుడ్ ప్రపంచంలో దర్శకులే రచయితలు కావడం మొదలెట్టారు. ఇది గత పదేళ్లలో వచ్చిన మార్పు. ఇక్కడ్నుంచీ రచయిత రచయితగా కథనిచ్చే హక్కుని కోల్పోయాడు. దర్శకుడు ఆ హక్కుని లాక్కున్నాడు. ఇక కమర్షియల్ సినిమాలకి నప్పని యూరప్ ఫార్ములా అమల్లో పెట్టేశారు.
తామే రాసుకుని తీస్తున్న హిందీ దర్శకులు దర్శకులుగా విఫలమవుతున్నారని కాదు, రచయితలుగా సినిమాల్ని ఫ్లాప్ చేస్తున్నారు. పాన్ సింగ్ తోమర్తీసిన తిగ్మాంశూ ధూలియా ఫస్ట్ఫా రచనకీ, సెకండాఫ్ రచనకీ సంబంధమే వుండదు. జోకర్తీసిన శిరీష్ కుందర్ మొత్తం సినిమా అంతా రాయరాక చతికిలబడ్డాడు. దీంతో సల్మాన్‌ఖాన్‌తో తెలుగు కిక్రీమేక్ అవకాశాన్ని కోల్పోయాడు. కాక్టెయిల్కి రాసి తీసి సినిమా అంతా ఏడ్పించాడు హోమీ అదజానియా. ఇలా ఎందరో.

హీరోలకీ తాము నటిస్తున్న కథల మీద పూర్తి అవగాహన వుండదు. తమ పాత్రవరకే చూసుకుని, దాన్ని హైలైట్ చేసుకోవడంకోసమే తంటాలు పడతారు. ఇలాటి హీరోలందరి సినిమాలూ ఫ్లాపవుతున్నాయి. ఒక్క అమీర్‌ఖాన్ తప్ప స్క్రిప్టుని కూలంకషంగా పరిశీలించే హీరోలు లేరు. అమీర్‌ఖాన్ తన పాత్రేగాక, ఇతర పాత్రల్నీ, మొత్తం కథనరీతుల్నీ పోస్టుమార్టం చేసి, ఒక సమంజసమైన కథాప్రపంచం సృష్టికి వొత్తిడి తెస్తాడు. తమ పాత్రల్ని మాత్రమే హైలైట్ చేసుకునే ఇతర హీరోలకి ఆ పాత్ర చిత్రణల గురించైనా అవగాహన వుండదు. దర్శకుడు ఏదో రాసుకొస్తే, అది యాక్టివ్ పాత్రా, పాసివ్ పాత్రా తెలుసుకోలేరు. పాసివ్ పాత్రల్లో నటించేసి ఫ్లాప్ చేస్తారు. నటనలో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూట్లు కూడా నటన నేర్పుతాయే తప్ప, యాక్టివ్, పాసివ్ గురించీ, పాత్ర చిత్రణల గురించీ చెప్పవు.
నిర్మాతలకి ఇదేం పట్టదు రచన విషయం దర్శకుడు చూసుకుంటాడు. నటించి హీరో అదరగొడతాడు. కాబట్టి హిట్టయి పోతుందనుకుని ఇతర వ్యవహారాలు చూసుకుంటారు. ఏదో రీమేకులతో కలిసివచ్చి సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గన్ లాంటి ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలు వంద కోట్లు దాటి వసూళ్లు చేసినంతమాత్రాన అంతా బాగున్నట్టు కాదు. నూటయాభైలో నూట పాతిక నుయ్యో గొయ్యో చూసుకుంటున్నాయి. రచయితలుగా మారిన దర్శకులు, నిర్మాతలు, శిష్య రచయితలూ కలిసి ఏం చేస్తూంటారో మనోజ్ త్యాగీ బాగా చెప్తారు.

 రచయిత అవుదామని బ్యాంకుద్యోగం మానేసిన త్యాగీ మాటల్లో, ప్రతీరోజూ నిర్మాతలు, దర్శకులు, రచయితలూ మీటింగులు పెట్టుకుంటారు. ఆ మీటింగుల్లో గత రాత్రి ఏమేం విదేశీ సినిమాలు చూశారో ముచ్చటించుకుంటారు. వాటిలోంచి ఏది పనికొస్తుంది. మొత్తం పనికొస్తుందా, అక్కడక్కడా ఎత్తిపోతలు చేసుకోవాలా, వాటిని ఇంకెవరయినా కాజేశారా అనే ఎజెండాతో మాఫిగా భేటీ లాంటిది పెట్టుకుంటారు. ప్రముఖ సినీ విమర్శకుడు కోమల్ నహతా ప్రకారమైతే, పనికిమాలిన స్టోరీలైన్లు, పేలవంగా అల్లుకున్న ప్లాట్లు, ఒక గ్రామర్, స్ట్రక్చరూ లేని స్క్రిప్టులతో తొంభయి శాతం సినిమాలు తీస్తున్నారు.

శిష్య రచయితల్లో సత్తావున్న వాళ్ళు వుండరని కాదు. రాంగోపాల్ వర్మతో సౌరభ్ శుక్లా, అనురాగ్ కాశ్యప్‌లున్నంతకాలం ఆయన సినిమాలు వేరు, వాళ్ళు దర్శకులుగా వెళ్ళిపోయాక వేరు. సత్తావున్న హిందీ రచయితలు కూడా తమ పేరుతో కథ ఇచ్చుకోలేని పరిస్థితులే వున్నప్పుడు దర్శకులవుతున్నారు. దర్శకుడు రచయిత అవడం, రచయిత దర్శకుడవడం అనే మ్యూజికల్ చైర్స్‌తో గమ్మత్తయిన ఆటాడుకుంటున్నారు. సీనియర్ రచయితల నిగ్రహ నిబద్ధతలు వేరు. కమలేష్ పాండేనే మీరెందుకు దర్శకుడు కాకూడదని అడిగితే-

నేను దర్శకుణ్ణి ఎందుకు కానంటే, రచయితగా నా పని ముగిసిపోలేదు. రచయితగా ఏక కాలంలో ఆరు కథల మీద పనిచేయగలను, అదే దర్శకుడ్నయితే ఒకే కథతో రెండేళ్లు ఇరుక్కుపోవాలి. అది భరించలేను. నేను చెప్పాల్సిన కథలు ఇంకా చాలా వున్నాయి, జీవితకాలం సరిపోదు. నా కథల్ని కోరుకుని వాటిని దివ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకులు నాకుండగా బాధే లేదు- అంటారు పాండే. తేజాబ్, ఖల్‌నాయక్, సౌదాగర్, చాలబాజ్, దిల్, రంగ్ దే బసంతీ, ఢిల్లీ-6 మొదలయిన ముప్పయి నాలుగు హిట్సిచ్చి, ఇప్పుడు ప్రియదర్శన్ కోహినూర్’, ‘మిస్టర్ ఇండియారీమేక్, కన్సైన్‌మెంట్, లైఫ్ ఆఫ్టర్ డెత్, భైరవీ మొదలయిన సినిమాలకి పనిచేస్తున్న పాండే గురించి ఇంకా చెప్పుకోవాలంటే, నేటి రచయితలు సిగ్గుపడేలా ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లే పుస్తకాలు, ప్రతిరోజూ స్క్రీన్‌ప్లే వెబ్‌సైట్స్, కొత్త హాలీవుడ్ సినిమాల స్క్రీన్‌ప్లేలు, హిందీ పత్రికల్లో కాల్పనిక కథలూ చదవడం వగైరా, స్క్రీన్‌ప్లే వర్క్‌షాపులకి హాజరవడం వంటి వ్యాపకాలూ పెట్టుకుని నిత్యం అప్డేట్ అవుతుంటారు.



ఇలాటి సీనియర్ రచయితలు రంగంలో లేరు. ఉన్న అమాయక శిష్య పరమాణువులకి హిందీ సినిమాల ఉన్నతికోసం చాకిరేవు పెట్టాలని ఉపన్యాసాలిస్తున్నారు. అసలు కూర్చోబెట్టి స్క్రీన్‌ప్లే పాఠాలు బోధించాల్సింది రచనలుచేస్తున్న దర్శకులకీ, పాత్రలు తెలియని హీరోలకీ, అసలేమీ తెలియని నిర్మాతలకీ.. దీంతోబాటు మాఫియా భేటీల్ని అంతం చేస్తేగానీ హిందీ సినిమాలు బాగుపడవు. ఇది చేయకుండా, హిందీ సినిమాల క్వాలిటీ గురించి బాధపడ్డం అనవసరం!


సికిందర్ 
(ఆంధ్రభూమి)