రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మూస మీద దాడి!




దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య టి.



తారాగణం : సుధీర్ బాబు, వమిఖా గబ్బి, ధన్యా బాలకృష్ణ, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాల కృష్ణ, చైతన్య కృష్ణ  తదితరులు

కథ- స్క్రీన్ ప్లే : శ్రీ రాం ఆదిత్య టి., మాటలు : అర్జున్- కార్తీక్, సంగీతం : సన్నీ ఎం ఆర్, ఛాయాగ్రహణం : శ్యాందత్  సైనుద్దీన్, నృత్యాలు : చిన్ని ప్రకాష్, సుచిత్రా చంద్రబోస్, విజయ్, కూర్పు : ఎం ఆర్ వర్మ, పోరాటాలు : అన్బరీవ్, రామ్ సుంకర 
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్ టిన్ మెంట్స్, నిర్మాతలు : విజయ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి 
విడుదల : 25 డిసెంబర్,  2015
****



ప్రేమకథా చిత్రం’ తో ఓ మంచి హిట్ సాధించిన సుధీర్ బాబు, మళ్ళీ అలాటి ఒక సక్సెస్ కోసం విఫలయత్నాలు చేస్తున్నప్పటికీ,  కొత్తదనాన్ని ప్రయత్నించడం మానుకోక పోవడం అతడి ప్లస్ పాయింట్. దొంగాట, మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ- అనే గత భిన్నమైన మూడు ప్రయత్నాలతో  అపజయాల బాట పట్టినప్పటికీ,  మళ్ళీ ఓ కొత్తదనాన్నే ఆశ్రయించి, కొత్త దర్శకుడ్నే పూర్తిగా నమ్మి,  ‘భలే మంచి రోజు’ తో తిరిగొచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీ రామ్  ఆదిత్య న్యూవేవ్  థ్రిల్లర్ గా అందించిన  ఈ తొలి  ప్రయత్నానికి,  ‘స్వామిరారా’  స్ఫూర్తి అన్నట్టు స్పష్టంగా అన్పించినా, ఆ రేంజి సక్సెస్ కి ఇది చేరుకో గల్గిందా లేదా చూద్దాం...

కథ

రామ్ ( సుధీర్ బాబు) అనే నిరుద్యోగి  ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ( ధన్యా బాలకృష్ణ) మోసం చేసి ఇదే రోజు పెళ్లి చేసుకుంటోందని,  ఆమెని  నాల్గు తన్ని వద్దామని ఫ్రెండ్ (ప్రవీణ్) తో కలిసి బయల్దేరతాడు. దార్లో ఫ్రెండ్ తో వాగ్వాదం తో ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్ ఇవ్వడంతో-ఆ కార్లో కిడ్నాపైన ఇంకో పెళ్లి కూతురు సీత ( వమిఖా గబ్బి) కారు దిగి పరారవుతుంది. దీంతో గ్యాంగ్ లీడర్ శక్తి ( సాయికుమార్) రామ్ ఫ్రెండ్ ని బంధించి, ఆ సీతని వెతికి తీసుకొచ్చే బాధ్యత రామ్  మీదేస్తాడు. రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం) లు  తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది. ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకోస్తూంటే ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఏమిటీ  కిడ్నాపులు? మొత్తం ఎన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి? వాళ్ళెవరెవరు? ఒకర్నొకరు ఎందుకు డబుల్ క్రాస్ చేసుకుంటున్నారు? మధ్యలో సీత పెళ్లి కథేంటి? ఒక్క రోజులో ఈ చిక్కులన్నీ ఇందులో ఇరుక్కున్న  రామ్ ఎలా పరిష్కరించాడు- మొదలైన ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
నిన్నటి ‘సౌఖ్యం’ దెబ్బకి ఇహ తెలుగు సినిమా కథంటే భయపడి పారిపోయే పరిస్థితి పరాకాష్ఠ కి  చేరుకున్నాక- ‘భలే మంచి రోజు’ కథ క్రిస్మస్ పండక్కి పండగ మూడ్ ని నాశనం చేయకుండా, ఈ మంచి రోజుని మంచిరోజులాగే ఉంచుతూ కొండంత ధైర్యాన్నిస్తుంది చూసే ప్రేక్షకులకి. ఇదేరోజు మళ్ళీ అవతల ‘మామ మంచు- అల్లుడు కంచు’ చూసే వాళ్ళ పరిస్థితి  వేరు, అదలా ఉంచుదాం. ఒక సహజంగా జరిగే కథ చూడడం ఎవరికైనా మూస సినిమాల నుంచి చాలా రిలీఫ్ నిస్తుంది.  సహజ సంఘటనలు, సహజ క్రిమినల్ పాత్రలు, సహజ కామెడీ, వీటితో థ్రిల్, సస్పెన్స్, వినోదం  కలగలిసి ఫ్రెష్ గా  తయారైన కథ ఇది. ముందే చెప్పినట్టు, ‘స్వామిరారా’ పంథాలో వుంటుంది. అయితే ‘స్వామిరారా’ తో ప్రామిజింగ్ దర్శకుడిగా కన్పించిన  సుధీర్ వర్మ అంతలోనే  రెండో ప్రయత్నం పాత మూస ‘దోచేయ్’ తో ఎంత షాకిచ్చాడో  తెలిసిందే. ప్రస్తుత కొత్త దర్శకుడు అలా కాకుండా ఆ ‘స్వామిరారా’  ప్రమాణాల కోసం- ఆ ఫీల్ కోసం తెగ ప్రయత్నం చేయడం ఇక్కడ తెర నిండా కన్పిస్తుంది.

ఎవరెలా చేశారు
        సుధీర్ బాబు కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాడు. పైగా ప్రారంభం నుంచీ  ముగింపు వరకూ సినిమాని తన భుజాన మోస్తూ ఒక పక్కా యాక్టివ్ క్యారెక్టర్ కి నిదర్శనంగా నిలచాడు. ఫ్రెండ్ కోసం హీరోయిన్ని కిడ్నాప్ చేస్తే, మళ్ళీ తల్లిదండ్రుల కోసం తప్పి పోయిన హీరోయిన్ ని మళ్ళీ పట్టుకునే బాధ్యత కూడా   మీద పడే, నిత్యం కర్తవ్యానికీ- హీరోయిన్ తో నైతిక బాధ్యతకీ  నడుమ  నలిగే పాత్రని  సమర్ధవంతంగా పోషించాడు. గత ఫ్లాపుల బాధ దీంతో తీరిపోవచ్చు.  

పంజాబీ హీరోయిన్ వమిఖా గబ్బీ కి ఇదే తొలి తెలుగు అయినా,  హిందీలో 2007 లో ‘జబ్  వి మెట్’  లో కరీనా కపూర్ చెల్లెలిగా వేసి నప్పట్నించీ వుంది. అంత  గ్లామరస్ కాకపోయినా,  గోదావరి జిల్లా అమ్మాయి పాత్రకి సరిపోయింది. రెండో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కెక్కువ కథలేదు. హీరో తండ్రిగా కార్ల షెడ్డు నడిపే పరుచూరి గోపాల కృష్ణ పాత్ర గమ్మత్తయినది. అలాగే చర్చి ఫాదర్ గా పోసానీ పాత్రకూడా బిన్నమైన కామిక్ పాత్రే. క్లయిమాక్స్ లో  వచ్చి గందరగోళం సృష్టించే పృథ్వీ తో క్లయిమాక్స్ కే బలం పెరిగింది. అయితే ఎంత సేపూ  సినిమాల్ని పేరడీ చేసే పాత్రలే ఆయనకి  దక్కుతున్నాయి. తన కామెడీకి ఇక  రూటు మార్చుకుంటే మంచిదేమో. హీరో చెల్లెలి పాత్రలో విద్యుల్లేఖా  రామన్ కూడా ఫన్నీ పాత్రే. ఓల్డ్ సిటీలో మూతబడ్డ థియేటర్ లో పాత సినిమాలేసుకు ఎంజాయ్ చేసే,  మెయిన్ విలన్ గా సాయికుమార్ దో  భిన్నమైన పాత్రా, నటనా. వీళ్ళందరితో బాటు, జంట క్రిమినల్స్ గా కమెడియన్ వేణు- శ్రీరాంలు సైతం కథని మలుపులు తిప్పుతూ ఎక్కడికో తీసికెళ్ళి పోయే పాత్రలే. ప్రతీ పాత్రా కథలో ఎక్కడో కలిసి కథ పరిధిని పెంచేదే.  ఈ సహజత్వం వల్ల ఇవి గుర్తుండి  పోతాయి.

టెక్నికల్ గా ఈ కథ డిమాండ్ చేస్తున్న మేకింగ్ తో వుంది. ‘ఉత్తమ విలన్’, ‘ విశ్వరూపం’ సినిమాల ఫేం కెమెరా మాన్ శ్యాందత్  సైనుద్దీన్ కలర్స్ తో, లైటింగ్ తో, షేడ్స్ తో ఉత్తమ పనితనం కనబరచాడు. అలాగే ‘స్వామిరారా’ లో లాగా జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసిన బాణీలతో సన్నీ ఎం ఆర్ కథ ఫ్లేవర్ తగ్గ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన ఎడిటింగ్, యాక్షన్, కోరియోగ్రఫీ విభాగాలూ కూడా కథ ఏర్పరచిన చట్రంలోనే పని చేశాయి. పోతే మాటలు రాసిన అర్జున్- కార్తీక్ లు ఈ కామిక్ థ్రిల్లర్ కి చాలా స్పూర్తిదాయకమైన క్రియేటివిటీ ని కనబర్చా రు.

చివరి కేమిటి
కొత్త దర్శకుడు శ్రీరామ్  ఆదిత్యలో మంచి టాలెంట్ వుంది. సినిమాలు చూసే జనంగా యువ ప్రేక్షకులే మిగిలినప్పుడు,  వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేసిన న్యూవ్ వేవ్ థ్రిల్లర్ ఇది. ఇదయినా ‘స్వామి రారా’ అయినా ‘పల్ప్ ఫిక్షన్’ తో క్వెంటిన్ టరాంటినో పాపులర్ చేసిన తరహా సినిమాలే.  అవలా ఉంచితే,  మొత్తం థ్రిల్లర్ కుండాల్సిన స్పీడు, పెప్, టెంపో లోపించాయి.  షాట్స్ లో కెమెరా స్పీడు కూడా లేదు. అలాగే ఈ కథంతా ఒక్క  రోజులో జరుగుతోందన్న ఫీల్ కూడా తీసుకు రాలేకపోయారు. ఇవన్నీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. ఏమైనా కొత్త దర్శకుడు అప్పుడే పర్ఫెక్టుగా వుండాలని ఆశించలేం. ఈ కొత్త దర్శకుడి మీద విశ్వాసంతో అవకాశమిచ్చిన సుధీర్ బాబు, నిర్మాత లిద్దరూ అభినందనీయులే.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!) 

25, ఏప్రిల్ 2019, గురువారం

808 : ఫ్లాష్ బ్యాక్




ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
 యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘స్వామీరారా ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ్  కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు. 



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి. 

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ ఏం సుగంధాల్ని వెదజల్లుతుందని.  

-సికిందర్




2, నవంబర్ 2014, ఆదివారం

అల్లరి ప్రాబ్లం!

బొమ్మాళి బ్రదర్ బాగుపడతాడా?

        ల్లరి నరేష్ కిప్పుడు మంచి కాక మీద అగ్ని పరీక్ష ఎదురయ్యింది! ఈ నెల విడుదలవుతున్న తాజా కామెడీ  ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఏమవుతుందో ఏమో నన్న సస్పెన్సే ఈ అగ్నిపరీక్ష! గుండెల్లో గుబులు, బయట నవ్వులు. ఐదు వరస ఫ్లాపులతో నిర్మాతలకీ కొనుగోలుదార్లకీ  గాభరా పుట్టిం చేస్తున్న ఒకప్పటి ఓపెనింగ్స్ హీరో నరేష్ ఇప్పుడు తాజా నవ్వుల సినిమాతో ఏం పంచిపెడతాడో నన్నదే  ఉత్కంఠ అంతటా. తీపి మిఠాయా - గొడ్డు కారమా- ఏది రుచి చూపిస్తాడు? ఉన్న పోటీలేని ఏకైక హాస్య కథా నాయకుడనుకుంటే, అతడికే సమస్య లెదురవడం విచిత్ర పరిస్థితి. నవ్వించే నటుడికి సమస్యలేమిటి? నవ్విస్తే కొడతారా? లేక నవ్విపోతారా? అలాగైతే అసలు కామెడీ హీరోలే కాని స్టార్లందరూ ఏమైపోవాలి?
                     గ్ర హీరోలు సక్సెస్ కి ఇక కామెడీయే ఏకైక మార్గమని, తమ ప్రతీ సినిమాలో కథ వదిలేసి కథతో సంబంధం లేని కామెడీ మీద కామెడీ ట్రాకులతో, బ్రహ్మానందాన్ని బాసటగా దింపుకుని, ఏడాది పొడవునా ప్రేక్షకుల్ని నవ్వించి నవ్వించి ఇంకా నవ్విస్తూనే వున్నా బోరు కొట్టడం లేదు కదా? పెద్ద హీరోల సినిమాలంటే ఇప్పుడు కామెడీ సినిమాలే అన్నంతగా అర్ధమే మారిపోయింది. అలాంటిది 2002 లో అల్లరిఅనే సినిమాతో పుట్టడమే కామెడీ హీరోగానే పుట్టి, ఈ పన్నెండేళ్ళుగా ఫక్తు కామెడీ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న, రికార్డు స్థాయిలో  అప్పుడే 49 సినిమాల వయస్సు కొచ్చేసిన అల్లరి నరేష్, అంతలోనే గల్లంతయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?

          సూటిగా చెప్పాలంటే, తను కామెడీ హీరోగా ఉంటున్న వాడు  కాస్తా ఏదో దుష్ట శక్తి ఆవహించినట్టు, పేరడీ హీరోగా మారిపోవడమే కారణం. ఇతర స్టార్ల సినిమాల్ని, పాత్రల్ని, కామెడీ లనీ పేరడీ చేయడం, సెటైర్లు వేయడం వంటి పనులు చేస్తూ, నవ్విస్తున్నాననుకుంటూ ఎక్కడేసిన గొంగళి లా వుండిపోవడం. దీంతో ప్రేక్షకులు పగలబడి నవ్వడమే లేదు సరికదా, నవ్విపోవడం మొదలెట్టారు. ఎలా తయారైందంటే, ఇతర స్టార్ల సినిమాల్లో చూసేసిన అవే తిరగమోత తాలింపు సీన్లని కామెడీ పేరుతో మళ్ళీ మళ్ళీ చూడాల్సిరావడం చాలాచాలా గుది బండగా మారింది! యాక్షన్ స్టార్లు కామెడీని నమ్ముకుని హింసని తగ్గించుకుంటే, నరేష్ సినిమాలేమో కామెడీ పేరుతో హింసిస్తున్నాయి.

          2012 వరకూ కొన్ని  అపజయాలున్నా విజయాలే ఎక్కువగా సడెన్ స్టార్, కింగ్ ఆఫ్ కామెడీ, ఈతరం రాజేంద్ర ప్రసాద్, సిక్స్ సిగరెట్ ప్యాక్ హీరో లాంటి రకరకాల బిరుదులతో పాపులారిటీ ప్రవాహంలో నవ్వుల నదిలో పువ్వుల పడవ మీద హాయిగా ప్రయాణిస్తున్న నరేష్ కి అదే సంవత్సరం ‘సుడిగాడు’ తో ఫుల్ రేంజిలోనే  క్రేజ్ పెరిగింది. ఎక్కువగా తమిళ రీమేకులు తీసే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఆరేళ్ళ అజ్ఞాతం తర్వాత నరేష్ తో తీసిన మరో తమిళ రీమేకు “సుడిగాడు”. ఇందులో సినిమా సాంతం బాగా రోటీనై పోయిన సినిమా హీరోల పాత్రల్ని, ప్రేమల్ని, హీరోయిజాల్ని, పంచ్ డైలాగుల్నీ ఆట పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రియేటివిటీ చాలా ఒరిజినల్ గా, మరెంతో కొత్తగా అన్పించడంతో అంతే రెచ్చిపోయి, దీన్నో పెద్ద హిట్ చేసి రుణం తీర్చుకున్నారు నాణ్యతకి విధేయులైన ప్రేక్షకులు కూడా!



       టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఎన్డీటీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు సైతం దీనికి బ్రహ్మరధం పట్టాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తే, 33 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు! ఏదీ వదిలిపెట్టకుండా ఈగ, టాగూర్, దూకుడు, పోకిరీ, సింహా, జల్సా, ఖుషి, ఖలేజా, మగధీర, రచ్చ, చంద్రముఖి, భారతీయుడు, రోబో, అపరిచితుడు, ప్రేమికుడు, బాయ్స్, సెవెంత్ సెన్స్, 7జి బృందావనం కాలనీ, మాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లీడర్, పెదరాయుడు, నరసింహా, మర్యాదరామన్న, ఏమాయ చేశావే, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు ...వంటి మొత్తం 28 సినిమాల్లోంచి వివిధ దృశ్యాల్నీ పేరడీ చేసి పారేశారు! 

          తెలుగు సినిమా హీరో 24x7 సమాజంలో ప్రజా సమస్యలే పరిష్కరిస్తూ ఉంటాడని; సమాజంలో జరిగే నేరఘోరాలకు, ప్రజలకు జరిగే అన్యాయాలకూ కోపం తో అతడి కళ్ళు తీవ్రంగా ఎర్రగా భగభగ మండి పోతాయని; చాలా ఈజీగా డీటీఎస్ సౌండులో అతడి నోటెంట పంచ్ డైలాగ్స్ పేల్తాయని; భారత ఆర్ధిక వ్యవస్థ నంతా తన భుజాల మీదే మోస్తూంటాడని; హీరోయిన్ పక్కన లేకపోతే అతడి హృదయం పేదల పట్ల ఆర్తితో కొట్టుకుంటుందని; అతడి హస్తాలు వందలమంది పవర్ఫుల్ విలన్లని ఇట్టే చిత్తుగా చితగ్గొట్టేస్తాయని; ఎక్కడ అతడి పాదాలు తాకితే అక్కడంతా సిరిసంపదలు, సుఖ సంతోషాలూ వెల్లివిరుస్తాయనీ ఒకటే సెటైర్లు!


          తెలుగు సినిమా హీరో అర్హతల మీద కూడా కామెడీ- దేవుళ్ళూ దేవతల కంటే కూడా తనకు జన్మనిచ్చిన తల్లినే అపారంగా ప్రేమించడం; చెల్లెలు ఎలాటి అపాయంలో వున్నా ఆమెని కాపాడడానికి తనే ఠంచనుగా వెళ్ళడం; తను నిరుపేద అయినా ఎలాంటి ధనికురాలైన హీరోయిన్ నైనా ప్రేమలో పడెయ్యడం; సమాజానికి ద్రోహం చేసే వాడు హీరోయిన్ తండ్రి అయినా సరే క్షమించకుండా శిక్షించడం; అసలు విలన్ కూతురైన హీరోయిన్నే ప్రేమించడం; తను మోడరన్ డ్రెస్సుల్లో వుండీ  సంస్కృతి గురించి, కట్టుబాట్ల గురించీ హీరోయిన్ కి క్లాసు పీకడం; తన ఫ్రెండ్ చెల్లెల్ని తన చెల్లెలుగానే చూడ్డం, ఆమె అందంగా వుంటే ఆమెనే ప్రేమించడం; సమాజశత్రువుల మీద అతి సులువుగా విజయం సాధించడం; విమానాలనీ, హెలికాప్టర్ లనీ  జీవితంలో మొట్ట మొదటిసారిగా చూస్తున్నా, సిటీ బస్సుల్లా  అవెక్కేసి ఎడాపెడా తిరిగెయ్యడం; వందల మందితో భీకర పోరాటాలు చేసినా తను ఫ్రెష్ గానే  వుండడం, సిక్స్ ప్యాక్ బాడీ కలిగివుండి, డైలాగ్ డెలివరీ లో- ఫైట్స్ లో అపర ఎక్స్ పర్ట్ అయిపోయి  ఉండడం!


          ఇంతటి  క్రియేటివిటీ తో బాక్సాఫీసుని ఊపేసిన ఈ  ‘అల్లరి’ మార్కు కామెడీ, నిజానికి మహేష్ బాబుకి వచ్చిన ‘దూకుడు’ అంతటి రేంజి నిచ్చింది నరేష్ కి తన కామెడీ సెగ్మెంట్ లో. కానీ ఆతర్వాత జరిగిందేమిటి? అదే క్రియేటివిటీని మక్కీకి మక్కీ రిపీట్ చేస్తూ యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ అనే మూడు సినిమాల్లో నటించడం. ‘సుడిగాడు’ తర్వాత 2012- 2014 మధ్యకాలంలో వచ్చిన ఈ మూడు కామెడీలే కాక, యాక్షన్- త్రీడీ, లడ్డూ బాబు  అనే రెండు ప్రయోగాలూ కలిపి - మొత్తం ఐదు సినిమాలు వరసపెట్టి అట్టర్ ఫ్లాపయ్యాయి. ప్రయోగాల్ని పక్కన పెడదాం, అవి ఎప్పుడో గానీ జరిగే ప్రయత్నాలు కావు. నటుడిగా తనని నిలబెడుతున్న తన రెగ్యులర్ బ్రాండ్ కామెడీ విషయంలో ‘సుడిగాడు’ తర్వాత అనుసరించిన విధానమే మట్టికరిపించింది. ఒక క్రియేటివ్ ప్రయత్నం హిట్టయితే ఇక అదే జీవనాధారమని దయనీయంగా  సాగిలపడి కొనసాగాలనుకోవడం ఎదురు దెబ్బ తీసింది. మహేష్ బాబు ‘దూకుడు’ లాంటి క్రియేటివిటీ తో ఏ రేంజికి వెళ్లి, మళ్ళీ అదే ‘దూకుడు’ క్రియేవిటీ ని , అదే కోవలోని టైటిల్ తో ఫాలో అయిపోయి  ‘ఆగడు’ తో ఏమయ్యాడో- సరీగ్గా ఇదే నరేష్ తోనూ జరిగింది! దూకుడుకి ముందు- దూకుడు కి తర్వాత అని మహేష్ బాబు అయినట్టు, సుడిగాడుకి ముందు- సుడిగాడుకి తర్వాత  అయ్యింది సరీగ్గా నరేష్ బాబు  పరిస్థితి!


          హిందీలో ఆనాడు రమేష్ సిప్పీ ‘షోలే’ అనే మెగా హిట్ తీసిన వెంటనే అటువంటి ‘షోలే’ లాంటిదే  ‘షాన్’ తీద్దామనుకుని అట్టర్ ఫ్లాపయ్యాడు. ఆ గుణపాఠాన్ని చూసే అందులోంచి ఓ  కొటేషన్ పుట్టించారు - “షోలే కా షాన్ మత్ బనావో!” అని.


          చరిత్ర చదువుకోవాలిగా? షోలే షోలే నే! అదే అద్భుతం మళ్ళీ సిప్పీ తనే చేయలేడు. మొగలే ఆజం, మల్లీశ్వరి, మాయాబజార్..లాంటి అద్భుతాల్నిఆ దర్శకులు అలా వదిలేసి వేరే సినిమాలతో ముందు కెళ్ళి పోయారు. దూకుడు దూకుడే, సుడిగాడు సుడిగాడే ... ‘దూకుడు కా ఆగడు మత్ బనావో...సుడిగాడు కా యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ  వగైరా వగైరా మత్ బనావో!’ –అని చరిత్ర మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హీరో కృష్ణ కూడా అప్పట్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే సాహసోపేతమైన ఇంటర్నేషనల్ హిట్ తీసి, తర్వాత అలాటిదే ‘మంచివాళ్ళకు మంచివాడు’ తీస్తే ఏమయ్యిందో  తెల్సిందే. ఒక ఇన్నోవేషన్ ఇచ్చిన సక్సెస్ మత్తు లోంచి చప్పున బయటి కొచ్చేయాలంతే. కానీ దాన్నే పట్టుకుని సినిమా తర్వాత సినిమాగా  నరేష్ ఇంకేవో  నగిషీలు చెక్కుకుంటూ ఉండడంతో అది  సుడిగుండం లోకి లాగేసింది! ఒక్క సుడిగాడు మూడు సుడిగుండాల్ని సృష్టించింది! 


          ఒక సందర్భంలో, ఫ్లాప్ హిట్ అని లేకుండా తను నటించే అన్ని సినిమాల ఫలితాల్ని పోస్ట్ మార్టం చేసుకుంటా నన్నాడు నరేష్. కానీ ‘సుడిగాడు’  హిట్ ని గనుక పోస్ట్ మార్టం చేసుకుని వుంటే, ఆ చేసుకున్న విధానం ప్రశ్నార్ధకమైనదే. 


          తత్ఫలితంగా డోలాయమానంలో పడింది పరిస్థితి. నిర్మాతలు భయపడ్డారు మళ్ళీ నరేష్ తో సినిమా అంటే. తను తీసుకునే పారితోషకం మూడు కోట్లే అయినా నిర్మాణ ఖర్చు లు విపరీతంగా పెట్టించి పది- పన్నెండు కోట్లకి చేరవేస్తాడనే టాక్ వున్న నరేష్ తో సినిమా అంటే ఇక ముందుకు రాలేని పరిస్థితి (బ్రదరాఫ్ బొమ్మాళికి పదమూడు కోట్లయిందని అంటున్నారు). అన్ని సెంటర్ల అభిమాన హాస్యనటుడనే పేరు తెచ్చున్న నరేష్ కి బి, సి సెంటర్ల ప్రేక్షకులు సైతం బైబై చెప్పేస్తున్న పరిస్థితి ఎదురయ్యింది. 



          వ్యక్తిగతం గా నరేష్ లో ఏ లోపమూలేదు. ఏ సక్సెస్సూ అతని తలకెక్కి స్వారీ చేయలేదు.
తను ఏకైక కామెడీ హీరోననే గర్వం, అహంకారం లేవు. మీడియం రేంజి నిర్మాతలకి, కొత్తగా వచ్చే దర్శకులకి కూడా అతను ఫ్రెండ్లీ హీరోయే.  తన పొజిషన్ చూసుకుని అడ్డగోలుగా పారితోషికం కూడా పెంచుకు పోలేదు. కాకపోతే నిర్మాణ వ్యయం బాగా పెంచేస్తాడన్న అభియోగం మాత్రం వుంది. అతడికి ఇంకా పాత  స్టయిల్లో పాటలకి భారీ సెట్టింగులు వేయించుకునే చాదస్తముంది. దీంతోనే వ్యయం తడిసి మోపెడవుతోంది. ఒకప్పుడు నరేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో అని డేట్స్ కోసం పోటీలు పడేవారు నిర్మాతలు. ఆ డిమాండ్ తట్టుకోలేక ఏడాదికి సగటున నాల్గు సినిమాల్లో విశ్రాంతి లేకుండా నటించాడు నరేష్. 2008 లో నైతే బాపు తీసిన ‘సుందరకాండ’ తో మొదలు పెట్టి, విశాఖ ఎక్స్ ప్రెస్, పెళ్లి కాని ప్రసాద్, గమ్యం, బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్, సిద్దూ ఫ్రమ్  శ్రీకాకుళం, బ్లేడ్ బాబ్జీ, దొంగలబండి ..ఇలా అక్షరాలా ఎనిమిది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు. అలాగే 2010లో ఏడు సినిమాల్లో నటించాడు( శంభో శివ శంభో, రాంబాబు గాడి పెళ్ళాం, ఆకాశ రామన్న, బెట్టింగ్ బంగార్రాజు, శుభప్రదం, సరదాగా కాసేపు, కత్తి కాంతారావు). కానీ 2008 లోనే, రంగ ప్రవేశం చేసిన ఆరేళ్ళ కు గానీ అతని  స్టార్ డమ్ ప్రారంభం కాలేదు. అతడి జీవితంలో ఈ   ‘స్వర్ణయుగం’ మరో 16 సినిమాలతో అలాగే కొనసాగి, 2012 ఆగస్టు నాటికల్లా  “సుడిగాడు’ తర్వాత ముగిసింది. ‘సు’ (సుందరకాండ) తో మొదలైన స్టార్ డమ్ ‘సు’ (సుడిగాడు) తోనే ముగిసిపోయింది. మొత్తం 2014 వరకూ నటించిన 49 సినిమాల్లో 39వరకూ కామేడీలే వున్నాయి.

          ఐతే గమ్మత్తేమిటంటే, ఇతర స్టార్లకి ఒకరి స్టార్ డమ్ మరొకరికి వెళ్ళిపోయే తలనొప్పి ఎప్పుడూ పొంచి వుంటుంది. ఒకటో నంబర్ స్టార్ ఫ్లాపులిస్తే, ఒక్క హిట్ తో రెండో నంబర్ స్టార్ ఆ స్టార్ డమ్ ని లాక్కోవచ్చు. మళ్ళీ ఈ రెండో నంబర్ నుంచి నంబర్ త్రీ కూడా లాక్కోవచ్చు. ఇంకెప్పుడో కాలం  కలిసొచ్చి కసిమీద వున్న ఒకటో నంబర్ స్టారే మళ్ళీ త్రీ నుంచి లాగేసుకో వచ్చు! ఇదో ఎందరు స్టార్ లుంటే అన్ని స్తంభాలాట లాంటిది!


          అల్లరి నరేష్ కీ తల నొప్పి లేదు.  తన హాస్య నట ప్రపంచంలో తానొక్కడే స్టార్. తన స్టార్ డమ్ ని  లాక్కునే మరో కామెడీ హీరోయే లేడు. ఇతర స్టార్లు ఎందరున్నా, ఎప్పుడైనా కామెడీ స్టార్ ఒక్కడే ఉంటాడు. ఈ సౌలభ్యం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఈ  ఒంటి స్తంభపు ఆట తానొక్కడే తీరుబడిగా ఆడుకుంటాడు. స్టార్ డమ్ ఎటూ పోనే పోదు. పోతే అక్కడే కింద పడి వుంటుంది. దాన్నీ మళ్ళీ తనే ఎత్తుకో వచ్చు. ఇది కూడా కనా కష్టమై పొతే అంతకన్నాకన్నా ట్రాజెడీ హీరో ఉంటాడా! అప్పుడు కామెడీ కోసం ప్రేక్షకులు ఎటు చూడాలి? 


         
ఈ నేపధ్యంలో, పట్టుదలతో తనని నిలబెట్టిన తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ నే ఈ ఆపత్కాలంలో తిరిగి  నమ్ముకోవాల్సి వచ్చింది నరేష్ కి.  ఆ దివంగత తండ్రి సమర్పణలో ‘సిరి సినిమా’ బ్యానర్ లో  బంధువు అమ్మిరాజుని నిర్మాతగా చేసుకుని,   బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’. పూర్తి చేశాడు నరేష్. దీనికి గతంలోనే   దర్శకుడుగా మారి, నిఖిల్ తో  ‘వీడు తేడా’ అనే సినిమా తీసిన ప్రముఖ రచయిత ఈసారి తనని గుర్తు పట్టకుండా మారు పేరు వెనుక దాక్కుని,  బాహాటంగానే దర్శకత్వం వహించాడు. ఆయనే  చిన్నికృష్ణ  అనే బి. చిన్ని!

              నరేష్ ని నిలబెట్టడానికి చేయాల్సిన గిమ్మిక్కులన్నీ ఈ సినిమాతో చేశారు. అందులో ప్రధానమైనది తమిళ హీరోయిన్ కార్తీక ని పెట్టుకోవడం. నాటి అగ్ర తార రాధ కూతురైన కార్తీక 2009లోనే  నాగచైతన్య నటించిన ‘జోష్’ తో తెలుగు తెర కెక్కింది గానీ, తెలుగు ప్రేక్షకులకి తన తల్లిలా దగ్గర కాలేకపోయింది. తమిళ డబ్బింగ్ హిట్ ‘రంగం’ తో మళ్ళీ తిరిగి వచ్చింది. అల్లరి నరేష్ కి ఇంకో రికార్డుంది. అతనితో నటించిన ఏ హీరోయినూ పై స్థాయికి వెళ్ళిన పాపాన పోలేదు. రాజేంద్ర ప్రసాద్ తో అలాకాదు. ఆయనతో కెరీర్ ప్రారంభ దశలో నటించిన సౌందర్య, ఆమని, రంభ అగ్ర తారలయ్యారు. అగ్ర తారలయ్యాక కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో నటించారు. కానీ నరేష్ తో ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కీ పట్టుమని నాల్గు అవకాశాలు దక్కలేదు. అలాగే అగ్ర హీరోయిన్లతో నటించాలని నరేష్ కీ వుంటుంది. అయితే వాళ్ళు భగ్న హీరోయిన్ లయ్యాకే ఆ అవకాశం దక్కుతూ వస్తోంది - చార్మీ, భూమిక, శ్రియ మొదలైన వాళ్ళతో అయ్యాక ఇప్పడు కార్తీక తో!

          మళ్ళీ ఇక్కడ కార్తీక హీరోయిన్ గా నటించ లేదు. నరేష్ కి కవల సోదరిగా నటించింది.  హీరోయిన్ గా వేరే మోనాల్ గుజ్జర్ వేసింది. సినిమా ప్రధానంగా నరేష్- కార్తీక ల మధ్యనే నడుస్తుందని అంటున్నారు. కొత్త తరహా కథతో, కొత్త రకం కామెడీతో- ఆ కవల సోదరుడికి తలనొప్పులు తెచ్చే కవల సోదరి స్పీడ్ పాత్రతో ఇదో భిన్నమైన అనుభవమే కాగలదు ప్రేక్షకులకి అని నిర్మాత ఆశాభావం.


          ఐతే అసలు సంగతేంటో నవంబర్ లో మాత్రమే తేలుతుంది. ఇది నరేష్ ని బయట పడేసిందా ఇక సమస్య వుండదు. ఐతే ఇదిచ్చే సక్సెస్ తో మళ్ళీ ‘సుడిగాడు’ తర్వాత చేసిన పొరపాట్లే చేస్తే కథ మళ్ళీ మొదటి కొస్తుంది. ఎప్పటికప్పడు సక్సెస్ ని మర్చిపోతూ, ఆ సక్సెస్ ఇచ్చిన సినిమా ఛాయలు లేని మరో కొత్త ప్రయత్నం చేస్తూంటేనే తనకు పోటీలేని, ప్రత్యాన్మాయం కూడా లేని ఈ స్థానాన్ని నిలబెట్టుకోగలడు. 


          దీని తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తయారవుతున్న  ‘బందిపోటు’ విడుదలవుతుంది. తనతో ‘అహ నా పెళ్ళంట’ తీసిన వీరభద్రంతో “బిస్కెట్ రాజా’ అనే మరోసినిమా ప్రకటించాడు నరేష్. తన యాభయ్యోవ సినిమా జనవరి 1,2015న విడుదలయ్యేలా చూడాలనుకుంటున్న అల్లరినరేష్ ఇంకో యాభై సినిమాల రికార్డు కూడా తనే పూర్తి చేసి దాన్ని  తండ్రికి నివాళిగా అర్పిస్తేనే జన్మ ధన్యమైనట్టు!

-సికిందర్
నవంబర్ 2014 ‘ఈవారం’ కోసం




.


2, మార్చి 2015, సోమవారం

స్ట్రక్చర్ -4


సినాప్సిస్ తో మొదటే స్పష్టత!
తెలుగు సినిమా స్క్రీన్ ప్లే




డియాని విస్తరిస్తే సినాప్సిస్. దీన్నే అవుట్ లైన్ అనొచ్చు. నిజానికి ఈ సినాప్సిస్   హీరోకో, నిర్మాతకో పరిశీలనార్ధం పంపుకోవడం కోసం కాదు. అది హలీవుడ్ పద్ధతి. అక్కడ నిర్మాతలు, స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు మొదటే సినాప్సిస్ అడుగుతారు. వీళ్ళకంటే ముందు లిటరరీ ఏజెంట్ అడుగుతాడు. ఇతను నిర్మాతలకీ లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకీ,  రచయిత/దర్శకుడు తరపున మధ్యవర్తిగా ఉంటాడు. రచయిత/దర్శకుడు అందించిన సినాప్సిస్ ని ఆయా నిర్మాతలకి లేదా స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చూపిస్తాడు. అది ఆసక్తి కలిగిస్తే అప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే అడగొచ్చు.  

       సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ ఏ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ ఉండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో ఉంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడివైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ఆ స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి కర్తని హీనంగా చూస్తారు.

         ఈ మార్గ దర్శకాలకి లోబడి సినాప్సిస్ పాఠాన్ని ఆకట్టుకునేలా రాయగల్గాలి. ఇది సొంత నైపుణ్యం మీద ఆధారపడుతుంది. దీనికి మార్గదర్శకాలు లేకున్నా, వివిధ స్క్రీన్ ప్లే కోర్సుల సంస్థలు సినాప్సిస్ రాయడంలో కూడా శిక్షణ నిస్తాయి. 12 అంశాలు ఆ కథా సంగ్రహంలో ప్రతిబింబించాలి. ప్రధాన పాత్ర పరిచయంతో బాటు దాని రోజువారీ జీవితం, ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, ఆ సమస్యతో సంఘర్షణ, పరిష్కారం కోసం వెతుకులాట, ఓ మినీ పరిష్కర మార్గం తో కొత్త ప్రయత్నం – ఓటమి, ఓటమిలోంచి కొత్త మార్గం, ఇక వెనక్కి రాలేని సంక్లిష్ట పరిస్థితి, నిరాశా నిస్పృహలు, మళ్ళీ కొత్త పరిష్కార మార్గం, దాంతో ముగింపు దిశగా అంతిమ పోరాటం, ముగింపూ.

       అన్ని పాత్రల్నీ ప్రస్తావించ కూడదు, మలుపుల గురించీ ఎక్కువ వివరాలు ఇవ్వకూడదు. అనవసర వర్ణనలు, వివరణలు ఉండరాదు. మొదటి పేరాలోనే మొదటి మలుపు వుండాలి. ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్యలో  తికమక వుండకూడదు,  ప్రధాన పాత్ర పఠిత కి కనెక్ట్ అవగల్గాలి. సినాప్సిస్ లో ఫీలింగ్, ఎమోషన్ వ్యక్తమవాలి...ఇలా ఎన్నో!

ఇక్కడి అవసరం వేరు!
        అక్కడ వ్రాతపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ రూల్సు. ఇక్కడ మౌఖికంగా నిర్మాతకి లేదా దర్శకుడికి కథ చెప్పాలి కాబట్టి వాళ్ళ కోసం సినాప్సిస్ రాసి పెట్టుకో నవసరం లేదు. సొంత అవసరాల కోసమే రాసుకోవాలి.  అనుభవజ్ఞులైన దర్శకులకి, రచయితలకి దీని అవసరముండక పోవచ్చు.  అనుభవజ్ఞులు నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళిపోగలరు. ఔత్సాహికులకి, దర్శకత్వ శాఖలో అంతగా అనుభవం లేని,  లేదా అసలు సినిమా రచయితగా / దర్శకుడుగా ఏ అనుభవమూ లేకుండా సినిమా రచయిత/ దర్శకుడు  కాగోరే అభ్యర్దులకి, సినాప్సిస్ అనే టూల్ ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు గొప్ప దర్శకుల సినిమాలు చూస్తే, ఇలా నేరుగా వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్ళకుండా ముందుగా  సినాప్సిస్ రాసుకుని వుంటే, సినిమా ఇంత అభాసు అయ్యేది కాదేమో అన్పించే సందర్భాలు కూడా అనేకం. ఎందుకంటే, అనుభవమున్నంత మాత్రాన నేరుగా వన్ లైన్ ఆర్డర్ వేయగల సమర్ధులు  కావాలని లేదు. చాలా తరచుగా వీళ్ళ సినిమాలు ఫస్టాఫ్ కథ ఒకటీ, దారితప్పి సెకండాఫ్ లో నడిపించిన  కథ మరొకటిగా సౌష్టవం, సమగ్రత లనేవి లేకుండా తేలడం చూస్తూంటాం. ఇలాటి మొత్తం అనుకున్న కథకి మొదటే సినాప్సిస్ రాసుకుని చదువుకుంటే, మెదడుకి చాలా బ్రేకులు పడుతూంటాయి. అంటే ఆ కథ అతుకుల బొంతలా ఉందని మొదటే అర్ధమౌతుందన్న మాట. ఈ సంగతి నేరుగా వన్ లైన్ ఆర్డర్ కి వెళ్తే అందరికీ అర్ధమవాలని లేదు.

         వన్ లైన్ ఆర్డర్ అంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో  నెంబర్లు వేసుకుంటూ ఒకటి రెండు లైన్లలో రాసుకోవడం. సినాప్సిస్ లేకుండా ఒక ఐడియాని మెదడులోనే కథగా ఊహించుకుని (విస్తరించుకుని), వన్ లైన్ ఆర్డర్ వేయగలిగే సామర్ధ్యం ఒక్క దర్శకుడుకి ఉంటే  సరిపోదు. అతను రాయించుకునే రచయితలకీ వుండాలి. ఒక సీనియర్ దర్శకుడు ఓపిగ్గా పెద్ద నోటు పుస్తకంలోనే నెలల తరబడి రాసుకున్న కథని చదువుకోండని రచయితల కిస్తారు. ఇదెంతో హాయైన పని. ఇంకో దర్శకుడు రచయితలు కథ చెప్పడానికొస్తే వినరు, సినాప్సిస్ రాసిమ్మంటారు. హిందీలో స్వర్గీయులు రాజ్ కపూర్- కె. ఎ. అబ్బాస్ ల వ్యవహార శైలి ఇంకా భిన్నంగా వుండేది. అబ్బాస్ మొత్తం కథని ఒక నవలగా 200 పేజీలు రాసుకొచ్చేవారు. రాజ్ కపూర్ దాన్ని పవిత్ర గ్రంధంలా తలమీద పెట్టుకు వెళ్లి, పూజ చేసి, దాంతో వచ్చి గట్టి ఉఛ్ఛారణతో ఏకధాటిగా మొత్తమంతా చదివేసే వారు. అప్పుడే  దాని మీద చర్చ ప్రారంభించే వారు.

      పై మూడు ఉదాహరణల్లో ఒక సామాన్యాంశం వుంది. ఇవన్నీ ముందుజాగ్రత్తగా కథకి అత్యంత ప్రధానమైన నిర్మాణ సౌష్టవాన్నీ, సమగ్రతనీ డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా రాస్తేనే స్పష్టత రావడమే గాక సమగ్ర రూపాన్ని సంతరించుకుంటుంది. ఒక ఐడియాని ఊహల్లోనే మొత్తం కథగా విస్తరించుకుని, ఆ పైన వన్ లైన్ ఆర్డర్ వేసుకు పోతే అది ముక్కలు ముక్కలు గా వచ్చే అవకాశముంది. ఊహల్లో చాలా వాటికి  స్పష్టత వుండదు. పైగా ఊహలు అతిశయోక్తులతో కూడుకుని వుంటాయి. ఆలోచననలతో బోధపడని కొన్ని విషయాలు, ఆచరణ సాధ్యం కాని  అతిశయోక్తులు రాసుకుంటూ పోతే తెలిసిపోతాయి. మెదడు పని చేసే విధానమే అలా వుంటుంది. దాని భావాలకి/ఆలోచనలకి భౌతిక రూపం ఏర్పడుతూ వుంటే, దాన్ని పట్టుకుని అది లంకె లేసుకుంటూ ముందు కెళ్ళి పోతుంది. చెక్కుతున్న శిల్పంలో ఎక్కడెక్కడ సౌష్టవం తాలూకు ఎగుడు దిగుళ్ళున్నా అన్నీ కవర్ అయిపోతాయి.

ఏమనాలి?
       ఒక అసోషియేటో, కో –డైరెక్టరో దర్శకుడు అవాలని కథ తయారు చేసుకున్నారను కుందాం. అది వన్ లైన్ ఆర్డర్ లోనే  వుంటుంది. అదేమిటో ఐదు నిమిషాల్లో చెప్పమంటే చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది వుంటున్నారు. గంట చెప్తాం, గంటన్నర చెప్తాం అంటారు. ఇలాటి ఇద్దరు ముగ్గురు గత పదేళ్లుగా ఒకటి రిజెక్ట్ అయితే ఇంకోటి తయారు చేసుకుని పదేపదే నిర్మాతల దగ్గర విఫలమౌతోంటే, అసలు సంగతేమిటా అని ఈ వ్యాసకర్త ఒకసారి స్వయంగా వెళ్లి చూస్తే, వాళ్ళు నిర్మాతలకి కథ విన్పించడం  లేదు. షాట్లు చెప్పి తలపోటు తెప్పిస్తున్నారు. చాలా షాకింగ్ సీన్!

     పరిస్థితి అర్ధమైపోయి, వాళ్ళని ఆపి ఐదు నిమిషాల్లో కథేమిటో చెప్పేస్తే, ‘ఇలా వీళ్ళెందుకు చెప్పరు?’ అని నిర్మాతల ఆవేదన. ఎందుకు చెప్పరంటే,  వాళ్ళకి అప్పుడే ప్రాజెక్టు ఓకే అయిపోయిందని అనుకుంటున్నారు, అందుకే రేపటి షూటింగుకి ఇప్పుడే షాట్స్ డిస్కషన్స్  చేస్తున్నారు మరి !
      అగ్ర దర్శకుల దగ్గర, అగ్ర హీరోల సినిమాలకి కో-డైరెక్టర్ గా అనుభవం సంపాదించిన ఒకరు దీటైన నేరేషన్ పవర్ తో, అవసరమైన చోట్ల ఫలానా ఫలానా కెమెరాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ తో షాట్స్ ని బిల్డప్ చేస్తూ కళ్ళముందు సినిమా చూపించేస్తూ కథ చెప్పేస్తారు. ఇది పతాకస్థాయి విజువల్ నేరేషన్. ఇంత కాకపోయినా కనీసం నాటకీయంగా విజువల్ నేరేషన్ ఇవ్వగలిగితే చాలు. కానీ విచారకరంగా ఇది కూడా జరగడం లేదు.

     మహాకవి, సినిమా రచయిత స్వర్గీయ ఆరుద్ర దర్శకుడేం కాదు. కానీ ఆయన కృష్ణ నటించిన సూపర్ హిట్  కౌబాయ్ అడ్వెంచర్ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్క్రిప్ట్ రాసిచ్చిన తర్వాత, దానికి ముగ్ధులైన నిర్మాతలు ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు. ఆయన తిరస్కరించారు, అది వేరే విషయం. రాయగల, రాసుకోగల సామర్ధ్యానికి ఇంతటి  మన్నన వుంటుందన్న మాట.

       షాట్స్ తో కథ చెప్పడం, లైన్ ఆర్డర్ తో కథ చెప్పడం ఇవన్నీ కథ మీద పట్టు లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. లైన్ ఆర్డర్ తో మాత్రమే  కథ చెప్పగలరు కాబట్టే గంట, గంటన్నర చెప్తా మంటారు. ఒక సినిమా చూసొచ్చి మనం కథెలా చెప్తాం? షాట్సో, వన్ లైన్ ఆర్డరో చెప్పం కదా? సినిమా రివ్యూలు చదువుతూంటాం. వాటిలో టూకీగా కథనెలా పరిచయం చేస్తారు? ఆ మాత్రంగానైనా  చూసిన ఒక సినిమా కథ చెప్పమంటే కూడా చెప్పలేని వాళ్ళు దర్శకత్వాల మీద మోజు పెంచుకుంటున్నారు. మరొక బలహీనత ఏమిటంటే, తమ సొంత కథని తప్ప, ఇతరుల కథల్ని విని అర్ధం చేసుకోలేకపోవడం. కానీ ఇతర సినిమాలు చూస్తే వాటిలోని ఆ ఇతరుల కథల్నే తిరిగి చెప్పలేకపోయినా, చక్కగా అర్ధం చేసుకోగల్గడం. అంటే ఇతరుల కథలు తెర మీద విజువల్ గా చూసినప్పుడు మాత్రమే  అర్ధమౌతున్నాయన్న మాట.  మళ్ళీ అదే తమ సొంత కథల్ని విజువల్ గా చెప్పలేక పోతారు. ఇలా అనుకుంటే పూర్వకాలంలో ఆ దర్శకులు ఇతరుల కథల్నీ, నవలల్నీ ‘ఓన్’ చేసుకుని ఎలా అన్నేసి విజయవంతమైన సినిమాలు తీయగలిగారో! కనుక ఇంత గందరగోళ వాతావరణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో టాలీవుడ్ లో కథలు తయారు తున్నాయి. పద్ధతి ఇది కాదని చెప్పినా విన్పించుకోని వాళ్ళు అలాగే ముందు కెళ్ళి,  ఆ ఒక్క సినిమాతో  దర్శకులన్పించుకుని, నిర్మాతల్ని ముంచేసి, మళ్ళీ సినిమా అవకాశం రాక అక్కడితో ఆగిపోతున్నారు.

     మరి కొందరికి స్క్రీన్ ప్లే పుస్తకాల వ్యసనం వుంటోంది.  డబ్బు వృధా చేస్తూ పుస్తకాల మీద పుస్తకాలు  కొంటూంటారు. వాటిని చదివి ఏదీ అర్ధం చేసుకోరు. ముందు  బేసిక్స్ చదువుకుని, కథ తయారు చేసుకోవడం తెలుసుకుంటే, ఆ తర్వాత వివిధ కోణాల్లో క్రియేటివ్ ప్రక్రియల కోసం సవాలక్ష హయ్యర్ స్టడీస్ కి వెళ్ళవచ్చు. బేసిక్సే అర్ధం గానప్పుడు జేమ్స్ బానెట్ ని చదివి ఏం లాభం. ఈ చదవడాలతోనే కాలం గడిపేస్తూ అసలు పని ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇంత చదువుతున్నారు కదాని ఓ వంద పేజీల సింపుల్ లవ్ స్టోరీ గల ఇంగ్లీష్ నవల ఇచ్చి వన్ లైన్ ఆర్డర్ వేసుకు రమ్మంటే- ఆ నవలతో పాటూ ఇంకెప్పుడూ కన్పించకుండా అంతర్ధానమైపోతే ఏమనాలి?

ఇంత  చేస్తుంది సినాప్సిస్!
       వన్ లైన్ ఆర్డర్ తోనే  ఒకటి కాదు, నాలుగు గంటలు కథ చెప్పినా, దానికీ ఓ పద్ధతుంటుంది. మొదట్లో చెప్పుకున్న హాలీవుడ్ సినాప్సిస్ రచనలో మొట్టమొదట ప్రధాన పాత్రని  పరిచయం చేసి, దాని రోజువారీ జీవితం గురించి చెప్పాలని ఎందుకన్నారు? కథ అలా ప్రారంభిస్తేనే ఒక ఫ్లో ఉంటుందనే కదా? అలా కాకుండా హీరో పాత్ర ఎవరో ఏమిటో, ఏం చేస్తూంటాడో, ఇతర ముఖ్య పాత్రలతో సంబంధా లేమిటో చెప్పకుండా, మొత్తం కథ ని బ్యాక్ డ్రాప్ లో పెట్టి  చెప్పడం ప్రారంభించకుండా, నేరుగా వన్ లైన్ ఆర్డర్ చెప్పేస్తూంటే ఏమర్ధమౌతుంది? ఆ మాటకొస్తే, ఈ బ్యాక్ డ్రాప్ కంటే ముందు మూడు ముక్కల్లో కథ పాయింటేమిటో చెప్పి అప్పుడు కథలోకి వెళ్తే శ్రోతకి ఎంత సౌకర్యంగా వుంటుంది? ఆ పాయింటు ప్రకారం కథ వెళ్తోందా లేదా  అని అతను ఆద్యంతం ఇన్వాల్వ్ మెంట్ తో  వినే అవకాశముంటుంది. 

    ఈ నేరేషన్ లోపలన్నిటికీ, ఆ పైన సినిమా  తీస్తే అది అట్టర్ ఫ్లాపవడానికీ మూలకారణం తమ కథేమిటో తమకి తెలియకపోవడం వల్లే. రాసుకున్న వందల పేజీల స్క్రిప్టుని ఐదు నిమిషాల్లో టూకీగా బలంగా చెప్పలేక పోవడం వల్లే. అంటే ఓ నాలుగు పేజీల సినాప్సిస్ తో మొట్ట మొదట కసరత్తు చేయకపోవడం వల్లే. వేసుకున్న వన్ లైన్ ఆర్డర్ లో ఏది బిగినింగ్, ఏది మిడిల్, ఎక్కడ్నించీ ఎండ్ చెప్పలేకపోతున్నారంటే, ఓ వెయ్యి పదాల సినాప్సిస్ తో కసరత్తు చేయకపోవడం వల్లే. మొత్తం కథకి స్ట్రక్చర్ లేదంటే, సినాప్సిస్ తయారీకి ఓ రెండు గంటలు శ్రమ చేయక పోవడం వల్లే.

      స్ట్రక్చర్ !

      ఎటుతిరిగీ ఇక్కడికే వస్తాం. ఐడియాలో స్ట్రక్చర్, లాగ్ లైన్ లో స్ట్రక్చర్, సినాప్సిస్ లో స్ట్రక్చర్!

      సినాప్సిస్ లో స్ట్రక్చర్ అంటే వన్ లైన్ ఆర్డర్ నుంచి మొదలెట్టి అంతిమంగా డైలాగ్  వెర్షన్ దాకా అవి చెదిరిపోకుండా లంగరేసి వుంచడం. సినిమా కథ  తయారు చేసుకోవడానికి సినాప్సిస్ ని మించిన బ్లూ ప్రింట్ లేదు. రూట్ మ్యాప్ లేదు. ఒక సర్టిఫికేట్ లేదు.

       ఇటీవల ఒక కథకి ఒక దర్శకుడితో కలిసి వేసిన లైన్ ఆర్డర్ గ్రూప్ డిస్కషన్స్ లో సవ్యంగా రాలేదన్పించి, అదే వన్ లైన్ ఆర్డర్ ని పెట్టుకుని సినాప్సిస్ రాసుకుంటూ పోతూంటే అన్ని లోపాలూ తొలగిపోయి, కొత్త డైనమిక్స్ తో, కొన్నిసీన్లు కూడా మారిపోయి, ఒక ఎడతెగని ఫ్లోతో సమగ్ర కథ తయారయ్యింది. అంతే కాదు,  ఆ వన్ లైన్ ఆర్డర్ ప్రారంభంలో హీరో గోల్ కి సంబంధించి పీడిస్తున్న అదేమిటో అర్ధంగాని అంతుచిక్కని అస్పష్టత కూడా (ఇది దర్శకుడూ ఆ యన గ్రూపూ అప్పటికింకా  పసిగట్టలేదు),  సినాప్సిస్ రాస్తూంటే, చిట్ట చివర పక్క పాత్ర ఒకటి అనే విధంగా యాదృచ్చికంగా రాసేసిన ఒక డైలాగుతో తీరిపోయింది! దాంతో ఆ డైలాగు పట్టుకుని మొదటి కొచ్చి,  హీరో  గోల్ తాలూకు ఆ ప్రకటనని ఆ మేరకు సవరిస్తే, అప్పుడు ఆ ప్రకటనకీ అతను చేసుకుపోతున్న పన్లకీ ఒక అర్ధం పర్ధం వున్న లింకు ఏర్పడింది. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఒక ఫ్లోలో రాసుకుంటూ పోతేనే ఏదైనా క్లారిటీ వస్తుంది.  ఫలితంగా ఈ ముప్పై మూడు పేజీల సినాప్సిస్ నే దర్శకుడు ఫైనల్ కథగా డిక్లేర్ చేస్తే, దీని ఆధారంగా ఈసారి  అర్ధవంతమైన వన్ లైన్ ఆర్డర్ వేయడం మొదలు!

      ఇంత చేస్తుందన్నమాట  సినాప్సిస్!

      ఇంకో చోట సినాప్సిస్ ఇంకో రూపంలో వుంది. ఆ దర్శకుడితో కొంతకాలం అగ్ర హీరోకి కథ కోసం కసరత్తులు జరిగి (ఇక్కడ ఈయన గ్రూపు లేదు) చివరికి ఇప్పట్లో ఆ అగ్ర హీరో అందుబాటులో లేకపోవడంతో, ఓ థ్రిల్లర్ ఐడియా మీద వర్క్ ప్రారంభించాం. దానికి ఒక లైను మీద అంగీకారాని కొచ్చి రికార్డింగ్ చేసుకున్నాక, సింగిల్ హేండెడ్ గా ఆర్డర్ వేసేయమన్నారు. ఆ సబ్జెక్ట్ మీద కొంత రీసెర్చి చేసి, ఆ రికార్డింగ్ ఆధారంగా ఆర్డర్ వేస్తూంటే వారం రోజుల్లో అంతకంటే బెటర్ గా, అనూహ్యంగా తయారయ్యింది మొత్తం కథ. క్లైమాక్స్ కూడా మారిపోయింది. ఈ నేరేషన్ ని విని థ్రిల్లయిన ఆయన నిర్మాతల వేటలో పడ్డారు. ఇక్కడ సినాప్సిస్ ఆ రికార్డింగే. ఒకోసారి          సినాప్సిస్ కంటే వన్ లైన్ ఆర్డర్ బెటర్ గా రావచ్చని చెప్పేందుకే ఇది..ఐతే వన్ లైన్ ఆర్డర్ ని బేస్ చేసుకోవడానికి సినాప్సిస్ అంటూ ఒకటి వుండి తీరాలి.

      నిజానికి ఇలాటి విషయలు వెల్లడించ కూడదు. ప్రాక్టికల్ గా ఏం జరగవచ్చో చెప్పడానికి మాత్రమే మచ్చుకి పై రెండు ఉదంతాల్ని ప్రస్తావించక తప్పలేదు.  

      ఇంతకీ సినాప్సిస్ ఎలా వుంటుంది?  దీన్నెలా రాయాలి?

ఇదిగో ప్రయోజనం!
        ఓసారి ఈ కింద రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినాప్సిస్ ని చూద్దాం :

      ఓ కాలేజీ ఎదుట అనుచరులతో ఎదురుచూస్తున్న గణేష్, జేడీ  సైగతో ఓ విద్యార్థిని హత మారుస్తాడు.

    జేడీ ఒక విద్యార్థి నాయకుడు. కాలేజీ లో ఎదురు లేని వాడు. ఆ కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్. గణేష్ ద్వారా జేడీ కి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం చె లాయిస్తున్న భవానీ అనే పెద్ద గూండాతో పరిచయం ఉంటుంది. ఇలా విద్యార్థులతో ఏర్పడిన  ఈ సంబంధంతోనే, మాచిరాజు అనే రాజకీయనాయకుడి నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకుంటూ, మాచిరాజుకి వెన్నుదన్నుగా ఉంటాడు భవానీ.

     ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా చేరతాడు శివ. అక్కడ మల్లి అనే విద్యార్ధి తో, ఆశా అనే ఇంకో విద్యార్థినితో స్నేహం పెంచుకుంటాడు.  అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, లెక్చరర్లని అవమానపరచడం వంటి పన్లతో అల్లరి చేస్తున్న జేడీకి శివ తారసపడతాడు. మొదటిసారి స్నేహితులు చెప్పారని జేడీ ని క్షమించినా, మళ్ళీ ఈసారి ఆశా తో మిస్ బిహేవ్ చేయడంతో, రెచ్చిపోయిన శివ సైకిలు చైను లాగి, జేడీ నీ అతడి గ్యాంగునీ చితగ్గొట్టేస్తాడు. అన్నాళ్ళూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జేడీ, ఈ శివ తెగింపు చూసి నిశ్చేష్టుడౌతాడు.

      ఈ అనూహ్య సంఘటన మరో రెండు పర్యవసానాలకి దారి తీస్తుంది. మొదటిది జేడీ గణేశ్ ని రంగంలోకి దింపడం, రెండోది స్నేహితులు శివని ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహించడం. కానీ శివ తనకంటే అర్హత వున్న జగన్ ని ఎన్నికల్లో నిలబెట్టమని కోరతాడు. శివ చేస్తున్న ఈ ప్రయత్నాల్ని ఆపమని కోరతాడు గణేష్.  మా కాలేజీ వ్యవహారాల్లో వీధి రౌడీల జోక్యం అనవససరమని అంటాడు శివ.

     గణేశ్ బెదిరించే ప్రయత్నం చేస్తాడు. శివ అతడికీ దేహశుద్ధి చేస్తాడు. దీంతో వ్యవహారం ముదిరి భవానీ దాకా వెళుతుంది. భవానీ మొదట ఆగ్రహించినా, తర్వాత జేడీ కంటే శివయే తనకి బాగా పనికొస్తాడని గ్రహిస్తాడు. అలా పథకం ప్రకారం భవానీ జగన్ ని హతమారుస్తాడు. ఇక తప్పక శివ ఎన్నికల్లో నిలబడతాడు.

     కార్మిక నాయకుడు కృష్ణారెడ్డి ని భవానీ మోసం చేయడంతో అతను శివ పంచన చేరతాడు. మరో పక్క తనని ప్రేమిస్తున్న ఆశా నే శివ పెళ్లి చేసుకుంటాడు. ఇక భవానీ శివ మీద దాడులు ప్రారంభిస్తాడు. శివ వాటిని తిప్పికొట్టడంతో బాటు భవానీ గ్యాంగుని తన వైపు తిప్పుకుంటాడు. దీంతో మాచిరాజు కూడా భవానీ కి దూరమౌతాడు.

      దెబ్బతిన్న భవానీ శివ ఇంటి మీద దాడి చేస్తాడు. దీంతో అంతిమ పోరాటం మొదలై భవానీని వధించి, నగరానికి  దుష్టుడి పీడా వదిలిస్తాడు శివ. ఈ పోరాటంలో తన అన్న కుమార్తెని పోగొట్టుకుంటాడు.

      ఇదీ విషయం!

      ఇలా సినాప్సిస్ రాసుకుంటే, ఇందులో స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు వుంటాయి. పై పాఠం మొదటి మూడు పేరాలూ బిగినింగ్ ని సూచిస్తే, నాల్గు నుంచీ ఏడవ పేరా వరకూ మిడిల్ నీ, చివరి పేరా ఎండ్ నీ సూచిస్తాయి. మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ తాలూకు సమస్య ఏర్పాటయింది. తర్వాతి మూడు పేరాల్లో మిడిల్ తాలూకు సంఘర్షణ ప్రారంభమయ్యింది, చివరి పేరాలో ఎండ్ తాలూకు పరిష్కారం చెప్పడం జరిగింది.

       వేటికవి ఈ మూడు విభాగాల్లో కథ కుదిరే వరకూ కసరత్తు చేయాల్సిందే. ఎవరి కథని బట్టి వాళ్ళు ఏఏ అంశాల్ని, సంఘటనల్నీ కూర్చితే ఆయా  మలుపులకి దారి తీస్తాయో వాటిని కనిపెట్టాల్సిందే. పై సినాప్సిస్ మొదటి మూడు పేరాల్లో బిగినింగ్ విభాగం సూత్ర ప్రకారం ఎలా ఏర్పాటయ్యిందంటే-
1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించడం
2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే  శక్తుల్ని చూపడం
3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4. సమస్య ఏర్పాటు.

      యాక్షన్, కామెడీ, ట్రాజెడీ, ఫ్యామిలీ, రోమాన్స్, థ్రిల్లర్, హార్రర్, జానపదం, పౌరాణికం- ఏ తరహా సినిమా కథకైనా బిగినింగ్ విభాగపు పరిధిని గుర్తించి చూస్తే,  పై నాలుగు అంశాలు ఆధారంగానే కథనం వుంటుంది.

      అలాగే  ‘శివ’ సినాప్సిస్ లోనూ  వుంది-

1. ప్రధాన పాత్ర శివతో పాటు, హీరోయిన్ ఆశానీ, ఇతర ఫ్రెండ్స్ పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ తో పాటు అతడి తాలూకు జేడీ,గణేష్, మాచిరాజు పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ పడగ నీడలో కాలేజీ వాతావరణం వున్నట్టు కథా నేపధ్యాన్ని సృష్టించడం...
2. ప్రధాన పాత్ర శివకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే శక్తులుగా  జేడీ, గణేష్ లని చూపడం
3.  జేడీ చేష్టలతో శివకి సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన
4.  సైకిల్ చైన్ లాగి జేడీ మీద తిరగబడ్డంతో శివకి భవానీతో సమస్య ఏర్పాటు అవడం
ఈవిధంగా బిగినింగ్  విభాగం స్పష్టమౌతోంది సినాప్సిస్ లో.

      ఇక మిడిల్ కొస్తే-

      మిడిల్ అనేది ప్రధాన పాత్రకి సమస్యతో పోరాటాన్ని ఎస్టాబ్లిష్  చేస్తుంది. ఈ సమస్య ఒక పరిస్థితి కావొచ్చు, లేదా భౌతికంగా ప్రత్యర్ధి పాత్ర కావొచ్చు.  ప్రధాన పాత్ర- వ్యతిరేక శక్తి పరస్పరం  పై చేయి సాధించడానికి యాక్షన్ –రియాక్షన్ గా సంఘర్షించుకుంటాయి. . ప్రధాన పాత్రకి ఒకోసారి పై చేయీ అంతలోనే ఓటమీ జరుగుతూ వచ్చి, ఒకానొక దశలో తీవ్ర నష్టానికి గురవుతుంది. ఈ నష్టంలోంచి ఫైనల్ గా ఓ పరిష్కార మార్గం తడుతుంది. ఇక్కడితో మిడిల్ ముగుస్తుంది.

       ‘శివ’ సినాప్సిస్ లో ఇదంతా చూడొచ్చు :

       శివ జేడీ ని కొట్టడంతో ఏర్పడిన పరిణామాలు అతణ్ణి భావానీతో పోరాటానికి సిద్ధం చేశాయి. భావానీయే సమస్య. దెబ్బలు తిన్న జేడీ గణేష్ ని రంగం లోకి దింపడం, గణేష్ ఎన్నికల్లో నిలబడొద్దని శివని బెదిరించడం, శివ అతణ్ణీ కొట్టడం, దీంతో భవానీ రంగంలోకి రావడం, తన ప్రయోజనం కోసం జగన్ ని చంపి శివాని ఎన్నికల్లో నిలబడక తప్పని పరిస్థితి కల్పించడం, గెలిచిన శివతో ప్రయోజనం నెరవేరక పోగా, తన అనుంగుడు కృష్ణా రెడ్డి శివ పంచన చేరడం, వ్యతిరేక మాఫియా గా ఎదిగిన శివ ఆశా  ని పెళ్లి చేసుకోవడం, శివ మీద భవానీ దాడులు మొదలెట్టడం, శివ ప్రతిదాడులు చేయడం, భవానీ గ్యాంగునే తన వైపు తిప్పుకోవడం, దీంతో మాచిరాజు కూడా భవానీకి దూరమై భవానీ ఇరుకున పడ్డమూ జరిగాయి..

      ఇలా మిడిల్ కి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఏర్పాటయ్యింది సినాప్సిస్ లో.

     ఎండ్ కొస్తే-

     మిడిల్ ముగింపులో ప్రధాన పాత్రకి ఫైనల్ గా అందే పరిష్కార మార్గం తో ఎండ్ విభాగం ప్రారంభమౌతుంది. ఇక వ్యతిరేక శక్తి పూర్తిగా ఆత్మ రక్షణలో పడుతుంది. అది కూడా ఫైనల్ గా తీవ్ర చర్యకి పాల్పడుతుంది. దీన్ని ఓర్చుకుంటూ ప్రధాన పాత్ర ఆ వ్యతిరేక శక్తిని శాశ్వతంగా అణిచి వేసి కథ ముగిస్తుంది.

    ‘శివ’ సినాప్సిస్ లో –

     చివరి పేరా ఇదే ప్రతిపాదిస్తుంది. మిడిల్ విభాగం ముగింపులో  భవానీ గ్యాంగ్ ని శివ తన వైపు తిప్పుకుని ఫైనల్ షో డౌన్ కి సిద్ధమైన నేపధ్యంలో, ఆత్మ రక్షణలో పడ్డ భవానీ శివ ఇంటి మీద దాడి చేయడం, శివ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి చంపడం, ఇదంతా  ఓర్చుకుని శివ భవానీ ని సంహరించి కథ ముగించడమూ జరిగాయి.

      ఇలా సినాప్సిస్ లో సమస్య- సంఘర్షణ- పరిష్కారం ఈ మూడూ ప్రస్ఫుటమైనప్పుడు కథకి సమగ్రత వస్తుంది. ఈ బ్లూప్రింట్ ని, రూట్ మ్యాప్ ని, సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకుని నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. సమస్య ఏర్పడ్డానికి సృష్టించిన సీనేమిటి? పరిష్కార మార్గానికి సీనేమిటి? ముగింపు సీనేమిటి? ఈ మూడు సీన్లూ ఎప్పటకీ మారవు. నేరేషన్ లో, వన్ లైన్ ఆర్డర్ లో, స్క్రీన్ ప్లేలో, డైలాగ్ వెర్షన్ లో అవే ఉండిపోతాయి. ఉండి తీరతాయి. ఎందుకంటే అవే కథకి పట్టుగొమ్మలు, పిల్లర్స్. ఈ మూడు సీన్ల అవగాహన లేకపోతే, ఏం చేసీ కథకి ఓ అర్ధం పర్ధం రాదు.

      ఫైనల్ గా సినాప్సిస్ అంటే ఈ మూడు సీన్లని హైలైట్ చేస్తూ రూపొందించిన ఒక అడ్వర్టైజ్ మెంట్. ‘సరుకు’ అమ్మడానికి ఈ అడ్వర్టైజ్ మెంట్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నమాట!

     ఇలా స్పష్టాతి స్పష్టమైన సినాప్సిస్ చేతికొచ్చాక, దీన్నాధారంగా తర్వాతి టూల్ వన్ లైన్ ఆర్డర్ లోకి వెళ్దాం!

 సికిందర్