రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

3, అక్టోబర్ 2018, బుధవారం

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్


25, డిసెంబర్ 2017, సోమవారం

573 : రివ్యూ!





దర్శకత్వం: అలీ అబ్బాస్జాఫర్ 
తారాగణం
: సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్, అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగే, సజ్జాద్ డెల్ ప్ఫ్రూజ్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావల్, కుముద్ మిశ్రా, అంగద్బేడి, నవాబ్ షా  తదితరులు
కథ: అలీ అబ్బాస్జాఫర్, నీలేశ్మిశ్రా, స్క్రీన్ ప్లే –మాటలు : అలీ అబ్బాస్ జాఫర్
సినిమాటోగ్రఫీ: మార్చిన్లస్కావీస్ , సంగీతం: విశాల్‌-శేఖర్, జులియస్పాకియమ్
బ్యానర్ : యశ్రాజ్ఫిల్మ్స్
విడుదల : 22 డిసెంబర్, 2017
***
2012 లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లతో ‘ఏక్ థా టైగర్’ (ఒక టైగర్ వుండేవాడు)
విడుదలైంది
. దీనికి ‘భజరంగీ భాయ్ జాన్’ ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. ఇందులో సల్మాన్, కత్రినాలు భారత ‘రా’, పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లుగా ప్రేమలో పడి దేశం కంటే ప్రేమే ముఖ్యమని అదృశ్యమైపోతారు. ఇప్పుడు 2017 లో దీని సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ (టైగర్ బతికే వున్నాడు) లో తిరిగి వీళ్ళిద్దరూ తమ రెండు దేశాల తరపున జాయింట్ ఆపరేషన్ లో పాల్గొంటారు. దీని దర్శకుడు ‘సుల్తాన్’ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్. రెండిటి నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్సే. మొదటిది కాల్పనిక గూఢచార కథయితే, ఈ రెండో దానికి యదార్ధ ఘటన ఆధారమన్నారు.  ఏమిటా యదార్ధ ఘటన? ఎక్కడ జరిగింది? దాన్నెలా తెరకెక్కించారు? ఒకసారి చూద్దాం...

కథ 
ప్రేమలో పడి పెళ్ళిచేసుకుని, కొడుకుని కని,  ఆస్ట్రియా లోని ఆల్ప్స్ మంచుపర్వత శ్రేణుల్లో  అజ్ఞాతంగా జీవిస్తున్న మాజీ ఇండో- పాక్ ఏజంట్లు టైగర్ అలియాస్ అవినాష్ సింగ్ రాథోడ్ (సల్మాన్),  జోయా (కత్రినా) ల కోసం ‘రా’ (రీసర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్ - భారత గూఢచార సంస్థ) చీఫ్ షెనాయ్ (గిరీష్ కర్నాడ్) వెతుకుతూంటాడు. ఇరాక్ లోని టిక్రిట్  లో అబూ ఉస్మాన్ (సజ్జాద్ డెల్ ఫ్రూజ్) అనే అతను కరుడుగట్టిన  ఉగ్రవాద సంస్థ ఐఎస్సీ నాయకుడుగా ఎదిగాడు. అమెరికన్లు ఆగ్రహించి అతడి మీదా అతడి దళం మీదా వైమానిక దాడులు  జరిపితే, గాయపడి ఒక ఆస్పత్రి బస్సెక్కేశాడు. ఆ బస్సుల్లో నర్సులున్నారు. వాళ్ళని ఆస్పత్రికి తీసికెళ్ళి బందీలుగా పెట్టుకుని, సురక్షితంగా మకాం పెట్టాడు. అమెరికన్లు వెనుదీయక ఆస్పత్రి మీద దాడికీ  సిద్ధమయ్యారు. దీనికి వారంరోజులే  టైముంది. 

          దీంతో ఇండియాలో  ‘రా’ చీఫ్ షెనాయ్ అప్రమత్తమయ్యాడు. ఆ నర్సుల్లో పాతికమంది భారత నర్సులే గాక, పదిహేను మంది పాక్ నర్సులు కూడా వున్నారు. ఈ సమయంలో రాజకీయం కాక మానవత్వమే ముఖ్యమని – వాళ్ళందర్నీ ప్రాణాలతో కాపాడాలని సమాయత్తమయ్యాడు. కానీ శత్రు దుర్బేధ్యమైన టిక్రిట్ లో ప్రవేశించే సాహసం చేయగల మొనగాడెవడూ లేడు - ఒక్క టైగర్ తప్ప. ఆఘమేఘాల మీద ఆ టైగర్ని  వెతకడం ప్రారంభించాడు...ఈ నేపధ్యంలోనే   ఆల్ప్స్ లో పండంటి కాపురం చేసుకుంటున్నటైగర్ దొరుకుతాడు. నీ దుంపతెగ రారా అంటే,  కచ్చితంగా రానంటాడు. భార్య జోయా నచ్చజెప్పి పంపుతుంది.

          ‘రా’ చీఫ్ ఇచ్చే టీముని కాదని, ఒక  షార్ప్ షూటర్, ఒక టెక్కీ, ఒక బాంబ్ డిఫ్యూజర్ లతో తన సొంత టీముని ఏర్పాటు చేసుకుని బయల్దేరతాడు. ఇక టైగర్ టిక్రిట్ లోకి ఎలా ప్రవేశించాడు, అక్కడెదురైన ప్రమాదాలేమిటి, టిక్రిట్ లో  జొరబడ్డాక ఆస్పత్రిలోకి ఎలా చొరబాటు చేశాడు, ఈ ఆపరేషన్ మధ్యలో పాక్ తరపున జోయా ఎలా వచ్చి తోడ్పడింది, ఆమెతో కలిసి నర్సుల్ని టైగర్ ఎలా బంధవిముక్తుల్ని చేశాడూ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      2014 లో ఇరాక్ లో జరిగిన యదార్ధ ఘటన అన్నారు. కానీ ఘటన జరిగిన తీరు వేరు. అల్ ఖైదా తానులో ముక్క ఐసిస్ ఇరాక్ లోని టిర్కిట్ లో ఇండియన్ నర్సుల్ని బందీలుగా పట్టుకున్నది నిజం. అయితే అది డబ్బుకోసం కాదు. డబ్బుకోసం అపహరణలకి పాల్పడడం వాళ్ళ పధ్ధతి కాదు. వాళ్ళ దగ్గరే బోల్డు డబ్బుంది. తాము పబ్లిసిటీలోకి రావడానికి ఆ పనిచేశారు. నర్సులకి ఏ హానీ తలపెట్టలేదు. పైగా చాలా మర్యాదగా చూసుకున్నారు. రేపు వాళ్ళ ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పడితే ఇండియా నుంచి చీప్ లేబర్ వాళ్ళకి అవసరం. కాబట్టి నర్సుల్ని అతిధులుగా చూసుకున్నారు. భారత ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి నర్సుల్ని విడిపించుకోగల్గింది. ఇదీ నిజంగా జరిగింది.

  దీని మీద మలయాళంలో తీసిన ‘టేకాఫ్’ గత మార్చిలోనే విడుదలయింది. దీన్ని యదార్థ సంఘటనలాగే  తీశారు. కాకపోతే ఫస్టాఫ్ వరకూ అక్కడి కెళ్ళిన నర్సుల జీవితాల్లో కుటుంబపరమైన సమస్యలు చూపించారు. ఆతర్వాత ఐసిస్ పాల్పడిన అపహరణ – విడుదల వగైరా యధాతధంగా చూపించారు. అయితే నర్సుల్ని విడుదల చేయించడంలో భారత ప్రభుత్వ పాత్రకంటే అక్కడి మలయాళీ బిజినెస్ మాన్ పాత్రవుందని వార్తలొచ్చాయి. దీన్ని అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ ధృవీకరించారు కూడా. కానీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. ఇలాటి బందీల, లేదా సంక్షోభంలో ఇరుక్కున్న సమూహాల తరలింపు ఉదంతాల్లో అదేమిటోగానీ బిజినెస్ మాన్లే భుజానవేసుకునే వైనాలు కనపడుతున్నాయి. ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘హోటల్ రువాండా’ ల తర్వాత ‘ఏర్ లిఫ్ట్’, ఇప్పుడు ‘టేకాఫ్’ అనే ఇండియన్ సినిమాలు. కువైట్ సంక్షోభంలో మలయాళీ బిజినెస్ మాన్ ని హీరోగా చూపిస్తూ ‘ఏర్ లిఫ్ట్’ తీసినట్టే, ‘టేకాఫ్’ లోనూ  మలయాళీ బిజినెస్ మాన్ నే ప్రధానపాత్రగా చూపించారు. రెండూ వివాదాస్పదమయ్యాయి. కాకపోతే మొదటి దాని విషయంలో దర్శకుడు క్షమాపణ చెప్పుకున్నాడు. 

 ప్రస్తుత కథలో ‘ఇరాక్ లో భారత నర్సుల అపహరణ’ అనే వార్తని ఐడియాగా తీసుకుని, స్పై థ్రిల్లర్ గా యాక్షన్ కథ అల్లారు. ట్విస్టుగా పాక్ నర్సుల్ని కూడా చేర్చారు. ఇసిస్ బదులు ఐఎస్సీ అన్నారు. ఇరాక్ బదులు అబుదాభీ, మొరాకో లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఈ స్పై జానర్ కథని ‘దంగల్’ కోవలో హాస్యభరితం చేశారు. కష్టాల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో, అన్నిటా  పాత్రలు ఫన్నీగా మాట్లాడి తెగ నవ్వించడమనే వినోదాత్మక విలువని చక్కగా ఉపయోగించుకున్నారు.  ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ – 8’ లో హీ - మాన్ హీరోల విట్టీ డైలాగ్ పవర్ ఎలా మాస్ చేత కేరింతలు కొట్టించుకుందో,  ప్రేక్షకులతో అవే దృశ్యాలు  ప్రస్తుతం థియేటర్లలో కన్పిస్తున్నాయి. 

ఎవరెలా చేశారు
సల్మాన్ ఖాన్ ని చూపించి ఎలా చప్పట్లు కొట్టించాలో, ఎలా ఈలలు వేయించాలో ఆ విన్యాసాలన్నీ ప్రదర్శించారు. ఆ డైలగులన్నీ పలికించారు. మంచు కొండల్లో సల్మాన్ ఎంట్రీలో చెయ్యి చూపిస్తే ఈలలు, కాలు చూపిస్తే ఈలలు, తోడేళ్ళతో పోరాటం చూపిస్తే కేరింతలు – అందరూ వేటాడగలరు,  టైగర్ లా వేటాడలేరు  - అని డైలాగు కొట్టిస్తే చప్పట్లూ ఈలలూ. ఎడారిలో క్వాడ్ బైక్ మీద దూసుకొస్తూంటే, ఇరాక్ వీధుల్లో గుర్రపు స్వారీ చేస్తూంటే, ఒక పెద్ద మెషీన్ గన్ మోసుకొస్తూంటే, షర్టు విప్పి కండలు చూపిస్తే...ఒకటేమిటి, అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశారు.  విచిత్రమేమిటంటే ఇవన్నీ పక్కా లోకల్ మాస్ గా వుంటూనే ఇంటర్నేషనల్ సినిమాలా అన్పించడం. సల్మాన్ డైలాగులు పలికే తీరువల్ల డైలాగ్ రైటర్ల పని సులువై పోతుంది - పై వాడు నిన్ను క్షమిస్తాడో లేదో, నా పని నిన్ను పై వాడి దగ్గరకి పంపించడం (పాత డైలాగే)... మన పని కేవలం నర్సుల్ని రక్షించడమే కాదు - శాంతి కోసం మనం నిలబడ్డామని ప్రపంచానికి చూపించడం కూడా... నీకు దమ్ముంటే నన్నాపి చూడరా ఉస్మాన్ (పాత మూస డైలాగు)... దేశ ప్రతిష్టకే సవాలు (టెంప్లెట్ డైలాగు)...ఇలా రాసేస్తే సరిపోతుంది, వాటి ఎఫెక్టు సంగతి సల్మాన్ చూసుకుంటాడు. అయితే చాలాసార్లు తగ్గాల్సిన చోట్ల తగ్గి, ఇతర పాత్రల బలిమికి అవకాశం కూడా ఇచ్చాడు. 

 ఈ స్పై థ్రిల్లర్ లో జోసెఫ్  క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ తో బాటు, జేమ్స్ బానెట్ పాత్రల పొందిక కన్పిస్తాయి. ఒకప్పటి కొన్ని పాత్రలు కనుమరుగైపోయాయి. అలాటి ఒక పాత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ పాత్ర. ఇది వెనుకాడే హీరోపాత్రని ముందుకు తోసే ‘థ్రెషోల్డ్ క్యారక్టర్’.  జేమ్స్ బానెట్ ప్రకారం మన మానసికలోకంలో జడప్రాయమైన అవస్థ వుంటే దాన్ని విడుదల చేసే కవాటం లాంటిది ఇది. కత్రినా పాత్ర కథలో ఈ పని చూసుకుంటుంది. ఆమె ఎంట్రీ సీను సూపర్ మార్కెట్ లో వుంటుంది. అక్కడ  జొరబడిన ముగ్గురు దొంగల్ని సీసీ కెమెరా ఒక చుట్టు  తిరిగే లోపు కొట్టి పడేస్తుంది. ‘దిసీజ్ విమెన్ ఎంపవర్ మెంట్’ అని ఓనర్ మెచ్చుకుంటుంది ( అంటే విమెన్ ఎంపవర్ మెంటుకి తన్నాలనా? తంతే తప్ప మగలోకం దారికి రాదనేమో). 

          కత్రినాకి ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ వున్నాయి. సల్మాన్ తన టీముతో అపాయంలో వుండీ స్తబ్దుగా వుంటే, హెడ్ లైట్లు పడతాయి – ఆఁ ... వచ్చేసిందిరో మీ వదిన – అంటాడు సల్మాన్. ఆమె వచ్చేసి ఫటా ఫటా లేపెస్తుంది టెర్రరిస్టుల్ని. కథంటే ఓడిడుకుల మన మానసిక స్థితే. వివిధ పరిస్థితులకి లోనయ్యే స్థితుల్ని చూపిస్తూ పాత్రలతో చక్క దిద్దుతూంటారు.

          ఈ టీముతో సంబంధం లేకుండా కత్రినా సొంతంగా వేరే  ఆపరేషన్ ఒకటి చేస్తుంది కథకి అడ్డం వస్తూ. మెడికల్ కాలేజీ అమ్మాయిల్ని చదవకుండా ఎత్తుకొచ్చి,  రేపులు  చేస్తూ చాకిరీ చేయించుకుంటూ వుంటారు ఐఎస్సీ ఉగ్రవాదులు. వాళ్ళతో సోలోగా స్వోర్డ్ ఫైట్ చేసి అమ్మాయిల్ని విడిపిస్తుంది కత్రినా. ఒకవైపు కథకి నర్సుల్ని విడిపించే పాయింటు వుండగా మళ్ళీ ఇదెందుకు సృష్టించారో అర్ధం గాదు. కత్రినా యాక్షన్ సీన్లు డబల్ ధమకాలా ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టించేవే. 

    వెండి తెర మీద నుంచి ఇంకో కనుమరుగైపోయిన జేమ్స్ బానెట్ చెప్పిన పాత్ర - ట్రిక్ స్టర్. అంటే మాయగాడు. మన మనసుకి  మనతో ట్రిక్కుల్ని ప్లే చేసే గుణం వుంటుంది. ఆ మాయలో మనం పక్కదోవ పట్టిపోతాం. ఆ  కాసేపు, లేదా ఎంత కాలమైనా ఆడుకుని తిరిగి మనల్ని ట్రాకులో పెడుతుంది మన మనసు మనల్ని. ఈ పాత్రే  పరేష్ రావల్ అద్భుతంగా పోషించిన ఫిర్దోస్ అలియాస్ తోబాఁ ( అరబిక్ లోపాము). ఇతను పాతికేళ్ళ క్రితం ఇరాక్ లో స్థిరపడి యజమానులకి, అధికారులకీ తొత్తులా వుంటూ కార్మికుల మీద పడి బతుకుతూంటాడు. హీరో టీముని ముప్పు తిప్పలు పెడతాడు. చివరికి నీతి  వైపు నిల్చి సహాయపడతాడు. పరేష్ రావల్ మ్యానరిజమ్స్, మాట తీరూ, నటనా ఎంతో కన్నింగ్ గానూ ఫన్నీగానూ  వుంటాయి. ఇలాటి పాత్రనే ‘మ్యాడ్ మాక్స్ టూ’ లో బ్రూస్ స్పెన్స్ పోషించడాన్ని చూడొచ్చు. కొంచెం తేడాతో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో నాగభూషణాన్ని కూడా చూడొచ్చు. ఆరుద్ర లాంటి ఆనాటి రచయితలకి ఇది బాగా తెల్సు. 

 ఐఎస్సీ లీడర్ గా ఇరానియన్ నటుడు సజ్జాద్ డల్ఫ్రోజ్ నటించాడు. ఈ లోకంలో ఒకటే మతముంది,  మానవత్వం - అనే కలికాలంలో ప్రాక్టికల్ గా పనిచెయ్యని ఐడియాలజీతో హీరోకి పేలవమైన రొటీన్ డైలాగే  వుంటుంది. దీనికంటే కళ్ళు తెరిపించే డైలాగు సజ్జాద్ పలుకుతాడు – ఈ ఆయుధాలు, ఈ డబ్బు ఎక్కడ్నించి వస్తున్నాయి? ఉగ్రవాదం ఒక బిజినెస్, దీంట్లో లోకమంతా కలిసి వుంది – అని.  ఉగ్రవాదం అనే కాష్టంలో ఎవరి లాభం కోసం వాళ్ళు ఆజ్యం పోస్తున్నారనే అర్ధంలో. సజ్జాద్ ని ఖాకీ యూనిఫాంలో గడ్డంతో, ఎర్ర టోపీతో చూపిస్తే  కల్నల్ గడాఫీ, ఫిడెల్ కాస్ట్రో, కమ్యూనిజంలని  కలగలిపి చూపినట్టుంది. ఈ మిక్స్చర్ పోట్లంతో ఐసిస్ కి ఏమైనా మెసేజి బహుమానంగా ఇవ్వాలనుకున్నారేమో తెలీదు. 

          ఇక హీరో టీం మెంబర్లుగా కుముద్ మిశ్రా, అంగద్ బేడీ, నవాబ్ షా కన్పిస్తారు. పాకిస్తాన్ ఐఎస్సై టీం లీడర్ గా సుదీప్ కన్పిస్తాడు. ఈ రెండు టీముల్లో  తెలిసిన క్రేజీ స్టార్లుంటే ఇంకా మజా వచ్చేది. ఐఎస్సై  టీములో తర్వాత మాజీ ఏజెంట్ కత్రినా వచ్చి కలుస్తుంది.  ఇరు దేశాల నర్సులు బందీలై వున్నా, రెండు దేశాల టీములు కలిసి పనిచేయడం అంత వాస్తవికంగా అన్పించదు. శాంతి కోసం పనిచేద్దాం రమ్మంటే పాక్ వచ్చే అవకాశంలేదు. తమ నర్సులకోసం పాక్ ఆపరేషన్ నిర్వహించే అవసరమే రాకపోవచ్చు. ఐసిస్ కి కాశ్మీర్ లోకి ఆహ్వానం పలుకుతున్న పాక్ తో  - ఐసిస్ భాయ్ భాయే కాబట్టి – మీరు పట్టుకున్న వాళ్ళల్లో మా అమ్మాయిలున్నార్రా బాబూ వదిలిపెట్టండంటే సరిపోతుంది. కానీ సినిమాలో ఉగ్రవాది ఒక పాక్ నర్సుని కాల్చేసినట్టు చూపించారు. 

గూఢచార సినిమా అనగానే దేశభక్తి ధారాళంగా ప్రవహించేలా చిత్రీకరిస్తారు ( దేశాన్ని రక్షించే సైన్యం ఎక్కడో సైలెంట్ గా వుంటుంది - మిగతా అన్ని రంగాలూ వర్గాలూ దేశభక్తిని పులుముకుని, ఫ్రీగా దేశభక్తిని అనుభవిస్తూ  చిందులేస్తూంటాయి). హాలీవుడ్ సినిమాల్లో ఈ జానరేతర దేశభక్తి ఎలిమెంట్ కన్పించదు. ఇండో- పాక్ టీములు వాళ్ళ వాళ్ళ జెండాలు దాచుకుని తెచ్చుకోవడం, స్నేహపూర్వకంగా ఎవరి దేశభక్తిని వాళ్ళు ప్రదర్శించుకోవడం, చివరికి ఇండియా మెంబరు చనిపోతూ పాక్ మెంబర్ కి తన జెండా ఇచ్చి మోయించడం...ఆఖరికి  శుభం సీనులో నర్సులున్న బస్సుకి రెండు దేశాల జెండాలూ  రెపరెప లాడడం సిల్లీగానే వుంటుంది. నర్సులు భుక్తి కోసం వెళ్ళారా, లేక దేశభక్తితో దేశం కోసం వెళ్ళారా? 

          దేశభక్తి కాకుండా,  ఇలాంటప్పుడు వాస్తవంగా ఏం జరుగవచ్చో అది చూపిస్తే ఈ స్పై జానర్ మర్యాద నిలబడేది. ‘రా’ ఏజెంట్ నేతృత్వంలో ఐఎస్సై ఏజెంట్లు పనిచేయడం వింతే. నిజానికి వాళ్ళు కలవకుండా సపరేట్ ఆపరేషన్ నిర్వహించి,  క్రెడిట్ తాము కొట్టెయ్యాలని ‘రా’ ఏజెంట్లకి అడ్డుతగులుతూండాలి. వాళ్ళ మీద హత్యాప్రయత్నాలు కూడా చెయ్యాలి. వాళ్ళ తీరు వల్ల నర్సుల ప్రాణాలకే ఎసరు రావాలి. హీరోకి అటు ఐఎస్సీతో బహిర్గతంగా ఫిజికల్ యాక్షనే కాకుండా, ఇటు ఐఎస్సై ఏజెంట్లతో అంతర్గతంగా ఎమోషనల్ యాక్షన్ కూడా వుండాల్సింది. అప్పుడే పాత్రకి ద్వంద్వాలేర్పడి పాత్రచిత్రణ కరెక్టుగా వుండి, మరింత ఎఫెక్టివ్ గా మారే   అవకాశంవుండేది. ఇది లేకపోవడంతో ఫ్లాట్ గా,  ఏకోన్ముఖంగా యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హీరో పాత్ర. ఈ ద్వంద్వాలుంటే హీరో భార్యగా,  ఐఎస్సై ఏజెంటుగా హీరోయిన్ పాత్ర కూడా మానసిక సంఘర్షణకి లోనై, ద్వంద్వాలు ఏర్పాటై ఎంతో రక్తికట్టించేది. చివరికి సమన్వయ కర్త తనే అయ్యేది - పైన చెప్పుకున్నట్టు ఒక  థ్రెషోల్డ్ పాత్రగా. పాత్ర స్వభావాన్ని మొదట్లో చూపించి తర్వాత మర్చిపోతే ఎట్లా? ఒకే ఆపరేషన్  గురించి రెండు దేశాల ఏజెంట్లు ఘర్షణపడే  ఎజెండా అవసరం ఈ కథకి. దీంట్లోకి దేశభక్తి  కోణం రానవసరం లేదు. కథలో దాని పాత్ర సబ్ టెక్స్ట్ గా మాత్రమే, ఆ ఫీల్ ని ఆడియెన్సు చూసుకుంటారు.  

          నర్సు పాత్రల్లో
అనూప్రియా గోయెంకా, అంజలీ గుప్తా, నేహా హింగేలు ప్రధానంగా కన్పిస్తారు. ‘రా’ చీఫ్ గా  గిరీష్ కర్నాడ్ ఆదేశాలిస్తూ వుండే పాత్ర. మేకింగ్ ఉన్నత ప్రమాణాలతో వుంది (నూట  యాభై కోట్లు అంటున్నారు, యశ్ రాజ్ ఫిలిమ్స్ కి ఇదే తొలి ఖరీదైన ప్రొడక్షనట). పోలెండ్ ఛాయాగ్రాహకుడు మార్చిన్లస్కావీస్ కెమెరా వర్క్ ఒక కళా ప్రయోగం. దీనికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ టామ్ స్టూథర్స్ సమకూర్చిన యాక్షన్ దృశ్యాలు స్టన్నింగ్ గా వున్నాయి. నిడివి రెండు గంటలా 40 నిమిషాలనేది ఎక్కువే. 

చివరికేమిటి 
హాస్యం ఈ స్పై థ్రిల్లర్ని అపహాస్యం పాలుకాకుండా కాపాడింది. హాస్యం లేకుండా సీరియస్ మూడ్ లో చూడాలంటే భరించే కాలం కాదిది. ఈ రోజుల్లో – పెరిగిపోతున్న వివిధ దృశ్య మాధ్యమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో - సినిమాలకి  ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటు (యూఎస్పీ) వుండాల్సిందే. ఆ యూఎస్పీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసి  ప్రేక్షకుల్ని ఆకర్షించాల్సిందే. ఆ యూఎస్పీయే ఈ స్పై థ్రిల్లర్ కి హాస్యమనే షుగర్ కోటింగ్.  సినిమాలంటే కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ తో తీసేది కాదు, మార్కెట్ యాస్పెక్ట్ నికూడా కలుపుకోకపోతే తీసి దండగ. టాలీవుడ్ లో ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఇంకా అలవడాల్సి వుంది. వుంటే లో కేటగిరీలో కాలం చెల్లిన పద్ధతిలో వుండకుండా హిందీ, హాలీవుడ్ సినిమాలు చూసి  అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా వుంది.  

          ‘దంగల్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్ ని  హాస్యయుతమైన పాత్రలతో వినోదాత్మకం చేయపోతే వెంటనే ఫ్లాపయ్యేది. ఆ పాత్రలుకూడా ఎవరికీ గుర్తుండేవి కాదు. పాత్రలు కామెడీ చేయడం పాత పధ్ధతి, హాస్యంగా మాట్లాడ్డం ఇప్పటి పధ్ధతి. కథలు సీరియస్ గానే వుంటాయి, పాత్రలు ఛలోక్తుతో రియాక్ట్ అవుతూంటాయి. కష్టాల్ని,  పనిని ఆటలాగా తీసుకోవడమే వీటి కార్యాచరణ. ఇలా ఇవి మనల్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతాయి. 

          ప్రస్తుత స్పై థ్రిల్లర్ లో పాత్ర చావుతప్పి కన్ను లొట్టబోయి బయట పడి - యమ రాజ్ టచ్ కర్కే  నికల్ గయా ( యముడు టచ్ చేసి వెళ్ళిపోయాడు) - అంటే అంత సీరియస్ సీనులో ప్రేక్షకులు ఘోల్లున నవ్వకుండా వుంటారా? ఎంట్రీ సీన్లో సల్మాన్ కొడుకుతో తోడేళ్ళతో తలపడే యాక్షన్ ఎపిసోడ్ ఎంత గుర్పాటు కల్గిస్తుందో, ఫన్నీ డైలాగులతో అంత రిలీఫ్ నిస్తూంటుంది – ఇంజెక్షన్ ఇస్తూ డాక్టర్ కబుర్లలో పెట్టినట్టు. ఈ ఎపిసోడ్ లో కొడుకు భయపడిపోయి కేకలు పెట్టేట్టుగా, సల్మాన్ వాణ్ణి కాపాడేట్టుగా  – పిచ్చిగా ఫాదర్ సెంటి మెంటు,  చైల్డ్ సెంటిమెంటు అంటూ  వెలగబెట్టకుండా - చైల్డ్ ఎంపవర్ మెంట్ ని చూపించడం బావుంటుంది ఇద్దరి ఫన్నీ డైలాగ్స్ తో. తను తోడేళ్ళ గుంపుని  ఎదుర్కొంటూనే,  వాడికి తప్పించుకునే  కళలు నేర్పుతూంటాడు. తప్పించుకుంటున్న వాడి వెంట తోడేళ్ళు పడ్డా కేకలు వేయడు. ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఒక్క తోడేలుని కూడా చంపకుండా, మీద పడేటప్పుడు పక్కకి తప్పుకోవడం, వాటిని పక్క దోవ పట్టించడం లాంటి ట్రిక్కులు ప్లే చేస్తాడు. హాస్యాన్ని యూఎస్పీ అస్త్రం చేసుకుని ప్రయోగించడమే దీని ఘన విజయానికి కారణం. 

ఇక స్పై జానర్ కథలో హీరో పాత్ర ప్రయాణం భిన్నంగా వుంటుంది. పరిష్కరించాల్సిన సమస్య అతడికి వ్యక్తి గతంగా ఎదురుకాదు. ఎక్కడో ఏదో సమస్య ముందే ఏర్పాటయి వుంటుంది. ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో వెతికి పట్టుకొచ్చి అతణ్ణి  ఆ సమస్యలోకి తోస్తారు.  జేమ్స్ బాండ్ లాంటి స్పై జానర్ హీరో పాత్రకి సొంత బాధలుండవు. కవిలాగా ప్రపంచ బాధే  తన బాధ. ఆ ప్రపంచ బాధలు తీర్చడమే తనకొచ్చిన బాధ. ఇదంతా స్పై జానర్ కొక టెంప్లెట్. ఈ టెంప్లెట్ లోనే ఈ కథలుంటాయి. కాకపోతే స్పై సినిమాలు ఎప్పుడో గానీ రావు గనుక  ప్రేక్షకులకి అదేపనిగా విసుగు పుట్టించవు, బతికిపోతారు.  ఇలాకాక, టాలీవుడ్ సినిమాలు వారంవారం  టెంప్లెట్ అనే ఒకే టెంపుల్ లో గంట వాయించుకుంటూ బిలబిలమంటూ అలాగే వచ్చే స్తూంటే,  విసుగు సూచీ వసూళ్ళ సూచీ కంటే బాగా పై స్థాయిలోనే ఎగదన్ని వుంటోంది. మార్కెట్ యాస్పెక్ట్ అంటే మనకి అర్ధంగాని అరబ్బీ పదం కదా. అందుకే ఎవరో ఆకతాయిలు తప్ప,  ప్రేక్షకులు బతికివుండే  అవకాశం బొత్తిగా లభించడం లేదు. 

          దర్శకుడు అలీఅబ్బాస్ జాఫర్, నీలేష్ మిశ్రాలు  కలిసి ఈ కథ రాశారు. ఐదేళ్ళ క్రితం ‘ఏక్ థా టైగర్’ తర్వాత ఈ సీక్వెల్ తో నీలేష్ కిది రెండో అవకాశం. తీవ్రవాద / ఉగ్రవాద డెస్కు జర్నలిస్టుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవముంది. దీనివల్ల కథ ఆపరేటింగ్ పార్టు ఆథెంటిగ్గా వచ్చింది. అబ్బాస్ సమకూర్చుకున్న స్క్రీన్ ప్లేలో జోసెప్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ కన్పిస్తుంది. అంటే పురాణ కథల కథాక్రమం కనపడుతుంది (పై పటం చూడండి). ఆన్ని మతాల పురాణాల్లోంచి జోసెప్ క్యాంప్ బెల్ కనుగొన్న మిథికల్ స్ట్రక్చర్,  ‘స్టార్ వార్స్’  మొదలుకొని ఎన్నో హాలీవుడ్ సినిమాలకి ఒక గైడ్ లా వుంటోంది.

          ఈ స్ట్రక్చర్ లో పై పటంలో కన్పించే దశలన్నీ ఈ స్పై థ్రిల్లర్ లో కన్పిస్తాయి. స్ట్రక్చర్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే స్పై జానర్ కథల్లో  ప్లాట్ పాయింట్ వన్ సమస్య తలెత్తినప్పుడు రాదు, ఆ సమస్య  ని హీరో చేపట్టినప్పుడే వస్తుంది. ఐఎస్సీ నాయకుడి మీద అమెరికా వైమానిక దాడులు, అతను నర్సుల్ని బందీలుగా పట్టుకోవడం, ‘రా’ చీఫ్ కి సమాచారం తెలియడం, ఇలా  ఇది బిగినింగ్ విభాగంలో ముందే ఏర్పాటయిన సమస్యే. కానీ ఇదే  ప్లాట్ పాయింట్ వన్ మాత్రం కాదు . ఇప్పుడు హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో చూపించి,  ‘రా’  చీఫ్ వెళ్లి సమస్య చెప్పాక, నర్సుల్ని విడిపించడానికి హీరో అంగీకరించడమే ప్లాట్ పాయిట్ వన్ అవుతుంది.  బిగినింగ్ విభాగానికి ఇదే ముగింపుగా వుంటుంది.


సికిందర్
         
         
         











         




























.

2, మే 2016, సోమవారం

జానర్ మర్యాద గురించి మరొక్కసారి - 2


  2015 లో తర్వాతి రేంజి హీరోలు 19 మంది - కల్యాణ్ రామ్, గోపీచంద్, రాజశేఖర్, రామ్,  నాగచైతన్య, నాని, అఖిల్, శర్వానంద్, సుధీర్, వరుణ్ తేజ్, అల్లరి నరేష్, విష్ణు, నిఖిల్, సుమంత్ అశ్విన్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నాగశౌర్య, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సత్యకార్తీక్ లూ  కలిసి, హీరోయిన్ అనూష్కా శెట్టి ని కలుపుకుని  36 సినిమాలిచ్చారు. ఇందులో తొమ్మిదింటిని మాత్రమే ఓకే చేశారు ప్రేక్షకులు. మిగతా ఇరవయ్యేడూ వాళ్లకి నచ్చలేదు. 
కంచె, పటాస్, భలే భలే మగాడివోయ్,  ఎవడే సుబ్రహ్మణ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే మంచి రోజు, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మామా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ..ఇవే ప్రేక్షకులకి నచ్చాయి. ఇవన్నీ ఏఏ జానర్ సినిమాలో ఆ జానర్లకి కట్టుబడ్డాయి. వీటిలో కొన్ని పాత్ర చిత్రణల  పరంగా, కథాకథనాల పరంగా లోపాలతో వున్నాయి. రామాయణం చెబుతూ అందులో కొన్ని  లోపాలతో చెప్పినా ఫర్వాలేదుగానీ, భారతం కూడా కలిపి  చెప్పేస్తే  మొత్తం తేడా ఎలా కొడుతుందో, అలా ఫీలవుతున్నారు ప్రేక్షకులు సినిమా జానర్ల నిర్వహణ విషయంలోనూ. అలాగని జానర్ మర్యాదలకి కట్టుబడితే చాలు, ఇక ఎన్ని లోపాలతో నైనా సినిమాలు తీసేయ్యొచ్చని సంబర పడితే కాదు. జానర్ మర్యాదలకి కట్టుబడ్డ మంటే ఎత్తుకున్న జానర్ కథని కలుషితం చెయ్యకుండా చివరంటా చూపించడం మాత్రమే కాదు, ఏ జానర్ కా జానర్ డిమాండ్  చేసే కొన్ని లక్షణాలుంటాయి- వాటిని కూడా ప్రదర్శిస్తేనే మొత్తం కలిపి జానర్ మర్యాద అనే ప్యాకేజీ.          ఉదాహరణకి,  ‘శివం’ అనే సినిమా మాస్ యాక్షన్ జానర్ కి చెందింది. దీన్ని వేరే విజాతి జానర్లతో కలుషితం చేయలేదు. అయినా ప్రేక్షకులు తిరస్కరించారు. కారణం, అది మాస్ యాక్షన్ జానర్ కుండే లక్షణాలని ప్రదర్శించకపోవడమే. స్క్రీన్ ప్లే పరంగా లోపాల మయంగా ఉండడమే. జానర్ మర్యాద అంటే ఆ జానర్ కుండే స్క్రీన్ ప్లే రచన కూడా నన్నమాట. 

2015 లో 27 మీడియం రేంజి సినిమాలూ, ప్రధానంగా జానర్ల పాలన సరీగ్గా లేకే పరాజయాల పాలయ్యాయి.
1. షేర్ : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : సింగిల్ విండో స్కీము
        2. సౌఖ్యం : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : రీసైక్లింగ్ చేసిన అనేక కథలు
3. జిల్ :  జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
4. గడ్డం గ్యాంగ్ : జానర్ : రియలిస్టిక్ క్రైం, జరిగింది : రియలిస్టిక్ అప్రోచ్ లోపించడం
5. పండగ చేస్కో : జానర్ : ఫ్యామిలీ యాక్షన్, జరిగింది : సింగిల్ విండో స్కీము
6. శివం : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
7. దోచేయ్ : న్యూవేవ్ క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా
8. జండాపై కపిరాజు : జానర్ : రాజకీయం, జరిగింది : కాలం చెల్లిన అప్రోచ్  
9. అఖిల్ : జానర్ : సోషియో ఫాంటసీ, చూపించింది : మూస ప్రేమకథ
10. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ : జానర్ : లవ్, జరిగింది : కాలం చెల్లిన కథనం
11. మోసగాళ్ళకు మోసగాడు : జానర్ : క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా  
12. లోఫర్ : మాస్ యాక్షన్, కలిపింది : కాలం చెల్లిన గ్రామకక్షలు
13. బందిపోటు : జానర్ : క్రైం, కలిపింది : పల్లెటూరి రాజకీయాలు
14. జేమ్స్ బాండ్ : జానర్ : క్రైం కామెడీ, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
15. మా. మంచు- అ. కంచు : జానర్ : ఫ్యామిలీ, జరిగింది : ఔట్ డేటెడ్ కామెడీ
16. డైనమైట్ : జానర్: యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
17. సూర్య వర్సెస్ సూర్య : జానర్ : సైన్స్ ఫిక్షన్, చూపించింది : మూస  ప్రేమ
18. శంకరాభరణం : జానర్ : మల్టీ ప్లెక్స్, జరిగింది : సింగిల్ స్క్రీన్ కి విస్తరణ
19. కొలంబస్ : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
20. కేరింత : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
21. రేయ్ : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ తో ఔట్ డేటెడ్ అప్రోచ్
22. అసుర : జానర్ : క్రైం, జరిగింది : మూస ఫార్ములా అప్రోచ్
23. జాదూగాడు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
24. బీరువా : జానర్ : కామెడీ, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
25. టైగర్ : జానర్ : సామాజికం, జరిగింది : యాక్షన్ జానర్ కింద మార్చెయ్యడం
26. సైజ్ జీరో : జానర్ : హెల్త్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
27. టిప్పు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్

***


2015 ప్రత్యేకత ఏమిటంటే, అన్ని రకాల జానర్సూ హిట్ చేశారు ప్రేక్షకులు, అన్ని రకాల జానర్సూ ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. జానర్ నిర్వహణలో తేడా రాకపోతే కంచెలాంటి అపూర్వ ప్రయోగాన్నీ సక్సెస్ చేశారు ప్రేక్షకులు, తేడా వస్తే సైజ్ జీరోఅలాటి అపూర్వ ప్రయోగాన్నీ తిప్పి కొట్టారు.  జానర్  తేడా రాకపోతే  పటాస్ లాంటి పక్కా మాస్ యాక్షన్ జానర్స్ నీ ఇష్టపడ్డారు, తేడా వస్తే సౌఖ్యం’, ‘లోఫర్ల లాంటి జానర్ మర్యాద పాటించని మాస్ యాక్షన్స్ నీ వ్యతిరేకించారు. జానర్ల నిర్వహణలో తేడా రానంత వరకూ ప్రేక్షకులకి ఏ జానర్  సినిమా అయినా ఒకటేననీ, కేవలం మాస్ సినిమాలకే మడి గట్టుక్కూర్చోలేదనీ దీన్ని బట్టి తేలుతోంది. హిట్టయిన స్వామీ రారాలాంటి వ్యూవేవ్ క్రైం ని ఇచ్చిన సుధీర్ వర్మ లాంటి దర్శకుడి దోచేయ్కూడా జానర్  తేడా వచ్చినందుకే నచ్చలేదు ప్రేక్షకులకి. తేడా రాక పోవడం వల్లే  అతడి శైలిలోనే మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య తీసిన భలే మంచిరోజుని దాని జానర్ మర్యాదతో ఆదరించారు ప్రేక్షకులు.

        సినిమాల జయాప జయాల్ని నిర్ణయిస్తున్నవి  క్లాస్- మాస్- ఇంకేదో కొత్త ప్రయోగం కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, హార్రర్, యూత్, బూతు అనే ఎలిమెంట్స్ ఎంతమాత్రం కావనీ,  ఎలిమెంట్ ఏదైనా, జానర్ నిర్వహణలో తేడా రాని  పనితనం  చూపిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనీ, అదే  జానర్ నిర్వహణలో తేడా వస్తే ఎంత పెద్ద స్టార్ నటించిన  సినిమానైనా తిప్పి కొడతారనీ  గత సంవత్సరపు విశ్లేషణ ద్వారా అర్ధం జేసుకోవచ్చు. తేడా కి సంబంధించి  బ్యాలెన్సింగ్ యాక్ట్ ని గనుక సరీగ్గా నిర్వహించుకుంటే తప్ప, సక్సెస్సయ్యే మాటే లేదు.

        సినిమా సక్సెస్ అవడానికి ఒకే  మూసలో పడి  ఒకటే మూస  సినిమాలు ఇంకా తీయడం గాకుండా- ప్రేక్షకులు అంగీకరిస్తున్న వివిధ జానర్ల సినిమాల్లో ఉంటున్న జానర్ లక్షణాలని గుర్తించి, ఆ ప్రకారం పధ్ధతి మార్చుకుంటే తప్ప,  ప్రేక్షకులు సక్సెస్ చేసే మాట పగటి కలే అవుతుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

 ఉదాహరణకి హాలీవుడ్ లో సక్సెస్ కోసం ఒక్కో జానర్  సినిమాకి ఒక్కో పధ్ధతిని  అవలంబిస్తారు.  సైన్స్ ఫిక్షన్  సినిమా అయితే సంబంధిత జానర్  ఎలిమెంట్స్ ని దానికి కలుపుతారు. యాక్షన్ సినిమా అయితే దాని పేస్ (నడక వేగం) ని  దృష్టిలో పెట్టుకుంటారు. ఫ్యామిలీ కథా చిత్రమైతే హృదయాలకి హత్తుకునే డైలాగులమీద మనసు పెడతారు. ఇలా ఏ జానర్ కా జానర్ కుండే ప్రత్యేక లక్షణాలని కలిపి అలరించేందుకు కృషిచేస్తారు. ఇదంతా ఒక శాస్త్రమే వుంది. కానీ శాస్త్రాలు అంతగా అక్కర్లేదుగా మనకి? 

తెలుగు సినిమాల్లో ఎలా మారిపోయిందంటే, సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్తే అన్నట్టు, అన్నిజానర్ల సినిమాలకీ కలిపి ఒకటే రొడ్డకొట్టుడు హీరోల పాత్రలు, ఒకటే రొడ్డకొట్టుడు కథనాలు, ఒకటే రొడ్డ కొట్టుడు కామెడీలు, ఒకటే రొడ్డ కొట్టుడు డైలాగులు, ఒకటే రొడ్డ కొట్టుడు నటనలు, ఒకటే రొడ్డ కొట్టుడు డాన్సులూ ... ఏ జానర్ సినిమా అయినా సరే, ఒకే తేల్ మాలీష్ - బూట్ పాలీష్ అన్నట్టు ఫుట్ పాత్ బిజినెస్. ఇలా ఇంత భావదారిద్ర్యాన్నీ, సృజనాత్మక దివాలాకోరు తనాన్నీ, నైపుణ్య లేమినీ కూడా ఒక ఫ్యాషన్ గానే  బిళ్ళ తగిలించుకుని ఇష్టారాజ్యంగా  సినిమాల్ని చంపేస్తున్నారు. సినిమాల్ని ఏ వెబ్సైటూ చంపడం లేదు. 25-34 ఏజి గ్రూపులో జనాభాలో 34 శాతంగా వుంటున్ననెటిజనులు, వెబ్సైట్ల రాతలు చూడ్డం వల్ల సినిమాలు ఫ్లాప్ అవవు. సినిమాల్ని తీస్తున్న వాళ్ళే  అరకొర జ్ఞానంతో తీసేసి చంపుకుంటున్నారు. కేవలం పది శాతమే హిట్టవుతున్నాయంటే టాలీవుడ్ లో వున్న టాలెంట్ పది శాతమే నని అర్ధం జేసుకోవాలి. మరి మిగతా 90 శాతం..??

 ఇక 2015 లో చిన్నా చితకా రొడ్డ కొట్టుడు సినిమాలు కూడా 42 దాకా తీస్తే,  వాటిలో దొంగాట, రాజుగారి గది – రెండు మాత్రమే మాన మర్యాదలతో వున్నాయని సర్టిఫికేట్ ఇచ్చారు ప్రేక్షకులు.

జానర్ మర్యాదని గనుక మర్యాదగా పాటిస్తే, మాస్ సినిమాలో ఒకలా వున్న హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇంకోలా రూపు దిద్దుకుంటుంది. మాస్ పాత్రకి మించిన కుశాగ్రబుద్ధితో, హేతుబద్ధ ఆలోచనలతో హేండ్ సమ్ గా వుండి, మాస్ పాత్ర కంటే ఎక్కువ ఆకట్టుకునే అవకాశముంటుంది. ఆవారా బంజారా మాస్ పాత్రని  ‘సరైనోడు’ కి వచ్చేసరికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకుగా తయారు చేసే స్థితికి చేరుకున్నారు. రాష్ట్రపతి కొడుకుని కూడా ఆవారా తిరగుబోతుగా చూపించుకునే పూర్తి స్వేచ్చ తెలుగు సినిమా దర్శకులకి ఎంతైనా వుంది, కాదనం.  కానీ జానర్ల పరంగా ఆలోచించినా, అన్ని జానర్లకీ కలిపి అవే రొడ్డ కొట్టుడు ఆవారా మాస్ పాత్రలే ఎలా వుంటాయి? 'రాజా చెయ్యేస్తే' లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సినిమా పాత్ర కూడా రొడ్డ కొట్టుడుగా ఎలావుంటుంది?

         తెలుగు ప్రజలు పౌరులుగా మంచి నాగరికంగానూ, సినిమా ప్రేక్షకులుగా చంఢాలపు అనాగారికంగానూ ఉంటారని నమ్మడం వల్ల ఇలా పుడుతున్నాయా పాత్రలు? ? సత్యజిత్ రే జీవిత కథ రాసిన మేరీ సెటన్, భారతీయ సినిమాలు వీధి భాగోతాల స్థాయి దాటి రాలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల వరస చూస్తే, గుంటూరులో బాషా నాటకాలని ఆడేవి. ఆ నాటకాల్లో హీరోల పాత్రలూ ఆ కథల స్థాయీ దాటి రావడం లేదు తెలుగు సినిమాలు!

        
         రొడ్డ కొట్టుడుకి అతీతంగా ఆలోచించాల్సింది ముందు జానర్ మర్యాద గురించి. ఇక్కడే సమస్య  వస్తోంది. ఈ సమస్యని తొలగించుకుని సినిమాలు తీస్తే ఏ జానర్ సినిమా నైనా ఆదరించడానికి సిద్ధంగా వున్నారు ప్రేక్షకులు.  పాత్ర దగ్గర్నుంచీ కథా కథనాల వరకూ; చిత్రీకరణ, మేకింగ్ అప్రోచ్ వరకూ ఏజానర్ మర్యాద ఆ జానర్ కిచ్చి కాపాడితే అది సినిమాల్నే  కాపాడుతుంది- 2016 లోనైనా ఇది అమలయ్యే అదృష్టానికి నోచుకుంటోందా? ఒకసారి చూద్దాం...

***

2016 ఏప్రెల్  ఆఖరు వరకూ ఈ నాలుగు నెలల కాలంలో 40 స్ట్రెయిట్ చిత్రాలు విడుదలయ్యాయి. డబ్బింగులని వదిలేద్దాం. స్ట్రెయిట్ చిత్రాల్లో  6 పెద్దవి, 15 మధ్య తరహా, 19 చిన్నవీ. పెద్ద వాటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు వున్నాయి. వీటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు నాలుగూ వెంటనే హిట్ టాక్ వచ్చినవి కావు. తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేస్తే అతి కష్టంగా నిలబడ్డవి నాన్నకు ప్రేమతో, సరైనోడు మాత్రమే. కానీ రియల్ హిట్స్ రెండూ నాగార్జున నటించినవే. ఇంకో మాటే లేకుండా మొదటి ఆటకే సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి రెండూ తక్షణం ప్రేక్షకుల ఆమోదం పొందాయి. కారణం? జానర్లని కాపాడ్డం.  

కానీ నాన్నకు ప్రేమతో లో నాన్న లేకుండా అర్ధంకాని సైన్స్ ఫిక్షన్ జానరే స్వారీ చేస్తే, డిక్టేటర్ లో ఫ్యామిలీ యాక్షన్ జానర్  కాస్తా మళ్ళీ ఔట్ డేటెడ్ బాషా ఫార్మాట్ తో తేలిపోతే, సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ కిక్-2 కి లాగా ఫారిన్ ఇష్యూ జానర్ పాలబడింది. ‘కంచె’ అనే ఇదే ఫారిన్ ఇష్యూ జానర్ మరెందుకు హిట్టయ్యిందంటే, ఆ ఫారిన్ ఇష్యూ జానర్ లో వున్నది పసిపాప ప్రాణం. పసివాళ్ళు నేటివిటీకి అతీతులు. హిట్టయిన భజరంగీ భాయిజాన్ లోని పసిది పరాయి పాకిస్తానీ. ‘పోలీస్’ లో బాక్సాఫీసు అప్పీలున్న, కీలక కూతురి పాత్ర విలువ తెలీక,  బార్బీ బొమ్మలా చూపించి సరిపెట్టేశాడు దర్శకుడు.
ఇక సరైనోడు మాస్ యాక్షన్ నే గానీ  ఫ్యాక్షన్ సబ్ జానర్ కింది కొచ్చింది. పాత్రల పేర్లూ ప్రదేశాలూ మారాయంతే. ఫ్యాక్షన్ సబ్ జానర్ వాసన ఇంకెన్నాళ్ళు భరిస్తారు ప్రేక్షకులు. 

        ఇలాకాక, సోగ్గాడే చిన్నినాయనా ఫాంటసీ జానర్  నుంచి పక్కకి తొలగకుండా, ఊపిరి వరల్డ్ మూవీ జానర్ కి అన్యాయం చేయకుండా, విచ్చేస్తే అక్కున జేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే పనిగా వస్తున్న హార్రర్ కామెడీ జానర్ తో విసుగెత్తిన ప్రేక్షకులకి, సోగ్గాడే చిన్నినాయనా లోని ఆత్మఫాంటసీ పెద్ద ఉపశమనం. ఊపిరిలో కార్తీ పాత్ర ఇంటి కథతో కాలుష్యమున్నా, కొత్తగా వరల్డ్ మూవీ జానర్ ని చూస్తున్న అనుభూతి ముందు అది దిగదుడుపే అయింది ప్రేక్షకులకి.


        ఇక ఈ జనవరి - ఏప్రెల్ మధ్య,  మధ్య తరహా  సినిమాలు 18 విడుదలైతే,  14 ఫ్లాప్ అయ్యాయి. ఈ రేంజి హీరోలైన రామ్, నాని, శర్వానంద్, అడివి శేష్, సందీప్ కిషన్, శ్రీకాంత్,  విష్ణు, మంచు మనోజ్, సునీల్, నారా రోహిత్, ఆది, రాజ్ తరుణ్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్, సత్య కార్తీక్ మొత్తం 15 మందీ కలిసి 18 సినిమాలిస్తే ఒక్కటే నచ్చింది ప్రేక్షకులకి. ఇంకో ఓ మూడింటిని మాత్రం  ఏవరేజిగా సరిపెట్టేశారు.
        క్షణం, నేనూ శైలజ, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణగాడి వీర ప్రేమ గాథ...వీటిలో ‘క్షణం’ క్రైం జానర్ ని కాపాడుతూ ఇంటెలిజెంట్ రైటింగ్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి హిట్టయితే, నేనూ శైలజ జానర్ వచ్చేసి ఓల్డ్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్. వీటిని అప్ డేట్ చేసివుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఎక్స్ ప్రెస్ రాజా  ఇంటర్వెల్ కి అయిపోయిన మల్టీ ప్లెక్స్ జానర్ కథని, అతికించిన వేరే కథతో సింగిల్  స్క్రీన్ కి పెంచారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఏ జానర్ కీ చెందని అన్ని జానర్ల సినిమా. అందుకే ఏం చూశామో  అర్ధం గాలేదని కామెంట్లు వచ్చాయి. 


        ఫ్లాపయిన 14 సినిమాల జానర్ల తీరుని పరిశీలిస్తే...

        1. రన్ : జానర్ : ఇండీ ఫిలిం, జరిగింది : ఇండీ ఫిలిం ని రీమేక్ చేసే చోద్యం
        2. టెర్రర్ : జానర్ : క్రైం లో టెర్రర్ సబ్ జానర్, జరిగింది : అప్డేట్ కాని అప్రోచ్
        3. ఈడో రకం- ఆడో రకం : జానర్ : కామెడీ, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్
        4. శౌర్య : జానర్ : క్రైంలో థ్రిల్లర్ సబ్ జానర్, జరిగింది : సబ్ జానర్ ఖూనీ
        5. ఎటాక్ : జానర్ : గ్యాంగ్ స్టర్ సబ్ జానర్, జరిగింది : నిర్వహణలో ఒక లోపం
        6. కృష్ణాష్టమి : జానర్ : ఫ్యామిలీ, యాక్షన్, జరిగింది : జానర్ల ఔట్ డేటెడ్ నిర్వహణ
        7. తుంటరి : జానర్ : స్పోర్ట్స్, జరిగింది :  రాంగ్ కాస్టింగ్
        8. సావిత్రి : జానర్ : లవ్, జరిగింది : అప్డేట్ చేసుకోని కథ
        9. రాజా చెయ్యేస్తే : జానర్ : క్రైం, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
        10. గరం : జానర్ :  మాస్, జరిగింది : ఔట్ డేటెడ్ అప్రోచ్
        11. సీ. అందాలు-రా. సిత్రాలు : జానర్ ; లవ్, జరిగింది :  ఔట్ డేటెడ్ అప్రోచ్
        12. క. వైభోగమే : జానర్ : ట్రెండీ లవ్, జరిగింది : సెకండాఫ్ లో ఔట్ డేటెడ్ అప్రోచ్
        13. స్పీడున్నోడు : జానర్ : రియలిస్టిక్ లవ్, జరిగింది : మాస్ యాక్షన్
        14. పడేసావే : జానర్ : లవ్, జరిగింది :  కాలం చెల్లిన ముక్కోణ ప్రేమ
***

     క విడుదలైన  19 చిన్న సినిమాల్లో ఒకటే హిట్టయ్యింది : గుంటూరు టాకీస్. క్రైం లో ఇది అడల్ట్ క్రైం జానర్ కి చెందినా, మరే పక్క చూపులు చూళ్ళేదు. దీని అప్రోచ్ కూడా noir జానర్ (crime fiction featuring hard-boiled cynical characters and bleak sleazy settings) లో అతికినట్టు వుంది. మిగిలిన 18 చిన్న సినిమాల విశ్లేషణ కూడా అనవసరం. 


        అంటే ఈ నాలుగు నెలల్లో కూడా రికార్డు స్థాయిలో జానర్లని పట్టించుకోనే లేదన్న మాట. మొత్తం  విడుదలైన 40  లో నాలుగే జానర్ మర్యాద కాపాడుకుని సొమ్ములు చేసుకున్నాయి. పెద్దవి రెండు, మధ్యస్థం ఒకటి, చిన్నది ఒకటి. ఇక రాబోయే నెలల్లో ఇంతకి మించి జరిగేదేమీ వుండదని వాతావరణ సూచన లిచ్చెయ్యొచ్చు. అసలేం చేస్తున్నారో తెలిస్తే కదా పరిస్థితిలో మార్పు రావడానికి!


(ఇంకా వుంది)

–సికిందర్