రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

చిన్నప్పటి కథ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
చిన్నప్పటి కథ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

4, ఏప్రిల్ 2023, మంగళవారం

1316 : రివ్యూ!


 

        మితాబ్ బచ్చన్ నేవీ కెప్టెన్. సముద్రం మీద ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు షిప్పులోని 300 మంది ప్రాణాలని  పణంగా పెట్టి పారిపోతాడు. దీంతో అత్యంత నీచుడైన పిరికివాడుగా ముద్రవేసుకుంటాడు. సమాజం, కుటుంబం అతడ్ని బహిష్కరిస్తుంది. ఆ తప్పు చేసిన ఆపరాధభావంతో కుమిలిపోతూ, గతాన్ని మర్చిపోవడానికి  బొగ్గు గనుల్లో  కార్మికుడుగా చేరతాడు. శశికపూర్ ఆ గనుల్లో ఇంజనీర్. శశికపూర్ తో అమితాబ్ స్నేహం చేస్తాడు. అమితాబ్ కి నిద్రపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ  గతం వెంటాడుతూంటుంది. శత్రుఘ్న సిన్హా పారిపోయిన ఖైదీ. గని కార్మికుడుగా చేరి రహస్య జీవితం గడుపుతూంటాడు. అయినా నేర బుద్ధి పోనిచ్చుకోక తోటి కార్మికుల్ని ఇబ్బంది పెడుతూంటే అమితాబ్ ఎదుర్కొంటాడు. ఇలాటి ఒక సంఘటనలో శత్రుఘ్న గాయపడితే అమితాబ్ అతడ్ని శస్త్ర చికిత్సకి రాఖీ దగ్గరికి తీసుకుపోతాడు. రాఖీ అక్కడ డాక్టర్. అక్కడ అమితాబ్ శత్రుఘ్న కి రక్తదానం చేస్తాడు. అలా శత్రుఘ్న అమితాబ్ స్నేహితుడవుతాడు.

        ప్రేమ్ చోప్రా బొగ్గుగనుల కాంట్రాక్టర్. ఇతను నాసిరకం పరికరాలతో, అరకొర వైద్య సామాగ్రితో, ఇతర సౌకర్యాల కొరతతో, కార్మికుల జీవితాల్ని కష్టతరం చేస్తాడు. అమితాబ్, శశి, శత్రుఘ్న ఇతడి దురాగతాలకి వ్యతిరేకంగా ఏకమవుతారు. ప్రేమ్ చోప్రా విలనీ భూగర్భంలో వరద ముప్పుకి దారితీస్తుంది. గనుల్లో విరుచుకు పడుతున్న జలాల్లో చిక్కుకున్న వందలాది కార్మికుల ప్రాణాలు అమితాబ్ కి  తిరిగి ఆ నాటి షిప్పు ఘటనని కళ్ళముందుకి తెచ్చి పెడతాయి. జీవితం వృత్త సమానం. పాత కళంకాన్ని తుడిచి వేసుకునే అవకాశాన్ని జీవితం ఎప్పుడూ ఇస్తుంది...
        
కథానాయకుడు అమితాబ్ కి పాప విముక్తి కల్గించే ఈ కదిలించే కథ 1978 నాటి కాలా పథ్థర్ లోనిది. సలీం -జావేద్ రచన, యశ్ చోప్రా దర్శకత్వం. 1975 లో ఝార్ఖండ్ లోని ఛాస్నాలా బొగ్గుగనుల్లో 375 మంది కార్మికుల ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటన దీనికాధారం. ఇది డిజాస్టర్ జానర్ మూవీ.
          
తెలంగాణా మణిహారమైన, దేశంలోనే పెద్దదైన, సింగరేణి బొగ్గు గనులు ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  దసరా సినిమా నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కి పండగే. ఇది బొగ్గుగనుల కార్మికుల జీవితాల గురించి గాక, ఫ్యాన్సుకి కిక్కునిచ్చే మద్యపానం కథగా బాగా అలరిస్తోంది. కాలమహిమ. తెలంగాణా సినిమా ఇలా ఎదుగుతోంది. కానీ ఫ్యాన్స్ కేం కావాలో అదిచ్చారు నాని, కొత్త దర్శకుడు. ఎలా వుందని కాదు, ఆడిందా లేదా అన్నదే లెక్క. ఐమాక్స్ నుంచి బయటికొచ్చిన ప్రేక్షకుల్లో ఇద్దరు 16-17 ఏళ్ళ లోపు టీనేజర్లు మైకు ముందు కొచ్చి చేసిన కామెంట్లు లెక్కలోకి తీసుకోనవసరం లేదు. దర్శకుడికి కథ చేసుకోవడం రాలేదనీ, ఎవరైనా పెద్ద దర్శకుడితో కథ చేయించుకుని వుండాల్సిందనీ అప్పుడే అంతంత పెద్ద మాటలనేశారు. వీళ్ళనేమనాలి? ఏ లోకంలో వున్నారు వీళ్ళు? ఈ బాల మేధావుల్ని వెంటనే నిషేధించాలి.
        
త్రాగుట తెలంగాణా సంస్కృతి అని చెప్తున్నారు. ఈ సంస్కృతి ఆధారంగా ఈ సినిమా తీశారు. దీనికి సింగరేణి కాలరీస్ బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారు. దీంతో ఏ సంబంధం లేకుండా మద్యపానం కథ చేశారు. అలాంటప్పుడు గ్రామంతో బాటు తాగుబోతుల సిల్క్ బార్ సెట్స్ ఇంకెక్కడైనా చూపించొచ్చు. సింగరేణి దేనికి? ఇలాటి సందేహాలొస్తే అది సినిమా పరిజ్ఞాన మన్పించుకోదు.
        
గోదావరి ప్రాంతంలో బాటసారులు వంట కోసం కట్టెలు ముట్టించినప్పుడు, పొయ్యికి పెట్టిన రాళ్ళు ఎర్రగా కాలడం చూడడమే సింగరేణి బొగ్గు గనుల అంకురార్పణకి ఆవిష్కరణ. బొగ్గు పడింది, ప్రభుత్వం బాగు పడింది. సినిమాలో మందు పడింది, కలెక్షన్ పండింది. సినిమా విడుదల రోజున పొద్దున్నే శ్రీరామ నవమికి పూజ చేసుకుని వెళ్ళే ఫ్యాన్స్ కి మాంఛి మందు మైకం. త్రాగుట తెలంగాణా ఆట. ఇక వూరూరా సిల్కు బార్సు నెలకొల్పుట. పురస్కారాలు పంచుట.

హిట్టయ్యాక ఇంతే!

    ఫ్యాన్స్ కేం కావాలో అదివ్వడమే సినిమా పని. సినిమా హిట్టయ్యాక ఇచ్చిన మద్యపానం ప్యాకేజీ లోపల విషయం ఎలా వుందన్నది అనవసరం. ఇచ్చిన విషయం లోంచే నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి, ఇవి తెలుసుకోవడం సమాచార హక్కు చట్టం కింద మన ధర్మం.
        
చిన్నప్పుడు నాని, కీర్తి, దీక్షిత్ ఒక జట్టు. పెద్దయ్యాక కీర్తి టీచర్. నాని దీక్షిత్ తో కలిసి గూడ్స్ లో బొగ్గులు దొంగిలించి సిల్క్ బార్ లో తాగుతాడు. తను పిరికివాడు. తాగితేనే ధైర్యం వచ్చి కొడతాడు. నాని, దీక్షిత్ ల మధ్య గాఢ స్నేహం. కీర్తితో నానికి మానసిక ప్రేమ. కీర్తికి దీక్షిత్ మీద భౌతిక ప్రేమ. దీంతో నానికి మూగ వేదన. వూళ్ళో ఏర్పాటైన సిల్క్ బార్లో గ్రామస్థులు తాగుడుతో, కుటుంబ సమస్యలతో అల్లకల్లోలంగా జీవిస్తూ వుంటారు. నానికి చిన్నప్పటి నుంచి కీర్తి అంటే మానసిక ప్రేమే కానీ ఆమె దీక్షిత్ ని భౌతికంగా ప్రేమిస్తోందని తెలుసుకుని -తన మానసిక ప్రేమని చంపుకుని - వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలని నిశ్చయించుకుంటాడు.
        
గ్రామంలో సముద్రకని, అతడి కొడుకు షైన్ చాకో ఇద్దరూ సాయి కుమార్ రాజకీయ ప్రత్యర్ధులు. పంచాయితీ ఎన్నికల్లో సాయికుమార్ దీక్షిత్ ని నిలబెడతాడు. దీక్షిత్ గెలుస్తాడు. షైన్ చాకో ఓడిపోతాడు. దీక్షిత్ కీ కీర్తికీ పెళ్ళయిపోతుంది. పెళ్ళి రోజు రాత్రి షైన్ చాకో ముఠా దీక్షిత్ ని నాని కళ్ళ ముందే చంపేస్తారు. దీంతో నాని షైన్ చాకో మీద పగబడతాడు...
        
ఈ ఫస్టాఫ్ కథలో నాని పిరికి వాడు, పాసివ్ క్యారెక్టర్. దీక్షిత్ యాక్టివ్ క్యారెక్టర్. కథని అతనే లీడ్ చేస్తూంటాడు. కీర్తితో ప్రేమ, క్రికెట్లో గెలుపు, బార్ లో క్యాషియర్ ఉద్యోగం, సర్పంచ్ గా గెలుపు, కీర్తితో పెళ్ళి - ఈ ప్రధాన ఘట్టాలన్నీ అతడి మీదే వుంటాయి. ముఠా బారి నుంచి నానిని కాపాడుతూ చనిపోయే ఘట్టం కూడా.
        
ఈ కథలో విలన్ షైన్ చాకోని సీత (కీర్తి) మీద కన్నేసిన రావణుడిలా చూపించారు. నాని రాముడికి హనుమంతుడిలా వుండిపోయాడు. కానీ రాముడ్ని పోగొట్టుకున్న సీతకి హనుమంతుడి (నాని) తో పెళ్ళి జరిపించేశారు! ఈ పిచ్చి కథ ప్రేక్షకులకి నచ్చి తీరాలి. ముత్యాల ముగ్గు రామాయణమే, గోరంత దీపం రామాయణమే. ఇలాటి రామాయణం కాదు.
        
దీక్షిత్ చనిపోయే ఘట్టం... తాగితేనే ధైర్యంవచ్చి కొట్టే నాని, దీక్షిత్ మీద దాడి జరుగుతున్నప్పుడు తాగి వుండి కూడా ముఠా మీద తిరగగబడక, దీక్షిత్ తనని కాపాడుతూంటే పారిపోతూంటాడు. ముఠా దీక్షిత్ ని చంపేస్తుంది.
        
ముఠా ఎవర్ని చంపడానికొచ్చింది? బార్ లో నాని వుంటాడు. బార్ మీదికి ముఠా వచ్చినప్పుడు దీక్షిత్ అప్పుడే అక్కడికొస్తాడు. దీక్షిత్ శోభనం రాత్రి కీర్తిని వదిలి బార్ లో నాని దగ్గరికి ఎందుకొచ్చాడు? ముఠా దీక్షిత్ ని చంపాలనుకుంటే అతడి ఇంటి మీది కెళ్ళకుండా నాని కోసమన్నట్టుగా బార్ కెందు కెళ్ళారు?
        
తాగితే చెలరేగిపోయే నాని దీక్షిత్ తనని కాపాడుతూంటే అతడి వెంట వురకడమే తప్ప ముఠా మీద దాడి ఎందుకు చేయలేదు? హీరోయిన్ ని కాపాడడానికి హీరో ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్టు, దీక్షిత్ నాని చేయి పట్టుకుని అలా వురకడమేమిటి? అంటే నాని కావాలనే ముఠాని ఎదుర్కోలేదా? ముఠా దీక్షిత్ ని చంపేస్తే కీర్తి తనకి దక్కుతుందని తెలివిగా ఆలోచించాడా?

మరిన్ని పాసివ్ గైడెన్సులు

        పాసివ్ క్యారెక్టర్ నాని సెకండాఫ్ లో షైన్ చాకో, దీక్షిత్ ని రాజకీయ కక్షతో కాకుండా, కీర్తి మీద కన్నేసి చంపాడనీ తెలుసుకుని కీర్తికి తాళి కట్టేస్తాడు! కీర్తి ఎవడో ఒకడు మగాడి సొత్తుగా వుండాలన్నట్టు. ఆమె ఇంకా భర్తని పోగొట్టుకున్న బాధలో వుండగానే. ఆమె కూడా ఆ తాళిని తెంచి పారెయ్యకుండా, దీక్షిత్ తో చైల్డ్ హుడ్ లవ్ లేదు గివ్ లేదన్నట్టు నానితో వెళ్ళిపోవడం. ఈమెది కూడా సెల్ఫిష్ క్యారెక్టరయింది.
        
ఇక్కడ కథ అయిపోయినట్టే. తర్వాత అమ్మ చెప్పిందని నాని అస్త్రసన్యాసం చేసినప్పుడూ కథ అయిపోయినట్టే. షైన్ చాకో భార్య చెప్తే దీక్షిత్ హత్యకి కారణం తెలియడం, అమ్మ చెప్తే అస్త్ర సన్యాసం చేయడం వంటివి నాని పాసివ్ క్యారెక్టరైజేషన్ కి అదనపు హంగులు. పాసివ్ క్యారెక్టర్లు సృష్టించాలనుకునే వాళ్ళకి గైడెన్స్.
        
చివరికి అస్త్రసన్యాసం చేసిన నానికి చాకో తో పనే లేదు. కథ అయిపోయింది కాబట్టి. చాకోకే నానితో పనుంది. అతడ్ని చంపి రెండు సార్లు పెళ్ళయిన కీర్తిని దక్కించుకోవడానికి. కీర్తికీ అభ్యంతర ముండనవసరం లేదు. ఒకసారి బానిస ఎప్పటికీ బానిసే. ఇక నాని ప్రారంభించాల్సిన క్లయిమాక్స్ తను పాసివ్ కాబట్టి తను ప్రారంభించకుండా చాకో ప్రారంభిస్తాడు. ఇలా చాకో యాక్షన్ తీసుకుంటే- ఎజెండా అతను సెట్ చేస్తూంటే- ఆ ట్రాప్ లో పడ్డ పాసివ్ నాని, దానికి రియాక్షన్ ఇస్తాడు పాసివ్ కాబట్టి. ఇక దసరాకి రావణ దహనంతో బాటు చాకో మరణం పూర్తి.

ఏది భావోద్వేగం

    బాలమేధావులు చెప్పిందేమిటాని ఆలోచిస్తే పై విధంగా వచ్చింది. మనం రాయాలి కాబట్టి ఆలోచిస్తాం, లేకపోతే అవసరమేముంది. ఏదో చూపింది చూశామా, ఇంటికెళ్ళి పడుకున్నామా ఇంతే. వారం రోజులుగా ఏం రాశాడా అని పాఠకులు బ్లాగుని క్లిక్కు మీద క్లిక్కు చేసి చూస్తున్నారు. క్లిక్కులతో బ్లాగు పగిలిపోయేట్టుంది. చివరికి బద్ధకం వదిలించుకుని లేటుగా చూసి లేటుగా రాశాం.
       
కాలా పథ్థర్ అమితాబ్ మీద కథ. పాప విముక్తి కోసం అల్లాడే ఇన్నర్ జర్నీ, గని కార్మి కుల కోసం పోరాటం అతడి ఔటర్ జర్నీ. ఇందులో ఈ రెండు త్రెడ్స్ ని డిస్టర్బ్ చేసే లవ్ లో సమస్యలు, ట్రయాంగులర్ లవ్ సమస్యలు, ఫ్రెండ్ షిప్పుల్లో సమస్యలు వుండవు. ఇది డిజాస్టర్ జానర్ మూవీ. అమితాబ్ కి రెండు డిజాస్టర్ లు - సముద్రం మీద షిప్పుతో, గనుల్లో వరదతో. కాబట్టి అమితాబ్ కి రాఖీతో సాఫీ ప్రేమ. శశి కపూర్ కి పర్వీన్ బాబీతో, శత్రుఘ్న సిన్హాకి నీతూ సింగ్ తో సాఫీ ప్రేమలు. కథలో భావోద్వేగం ప్రేమలతో కాదు, స్నేహాలతో కాదు. భావోద్వేగం చెదిరిపోకుండా ఏకధాటిగా, బలంగా వుండాల్సింది ప్రధాన కథ అయిన అమితాబ్ అంతర్ సంఘర్షణతో, విపత్తులో గని కార్మికులతో. హై డ్రామా ఇక్కడుంది, స్టార్లు ముగ్గురి హీరోయిజాలూ, ఆత్మబలి దానాలూ అన్నీ ఇక్కడే. దీంతోనే  భావోద్వేగం. ఇలాగే వుంది సినిమాలో. చివరికి ఇన్నర్, ఔటర్ జర్నీలు విజయవంతంగా ముగించుకునన్న అమితాబ్ మెచ్యూర్డ్ క్యారెక్టరవడం ఉత్తమ కథా లక్షణం ప్రకారం జరిగిన ప్రక్రియ.
        
దసరా లో ఏ భావోద్వేగం పట్టుకోవాలి? ఫ్రెండ్ షిప్పా? లవ్వా? రాజకీయమా? కులతత్వమా? మద్యపాన సమస్యా? రామాయణం ఫీలవ్వాలా? ...రాముడు పది హిట్లు కొడితే రావణుడు చచ్చిపోలేదు. రావణ దహనమంత ఈజీ కాదు. హిట్లు కొట్టిన కొద్దీ తలలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఈ కలుపుతో కాదని, మూలం మీద కొట్టాలని, బ్రహ్మాస్త్రంతో ఛాతీ మీద కొట్టి నేల కూల్చాడు. దసరా లో భావోద్వేగాలన్నీ కలుపు మొక్కలే.  కాలా పథ్థర్ లో భావోద్వేగం రాముడు వేసిన బ్రహ్మాస్త్రం. కానీ ఏ బ్రహ్మాస్త్రమూ లేకపోయినా దసరా సూపర్ హిట్టయ్యింది. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకుని, కలుపు మొక్కలతో ఆధునిక తెలుగు సినిమాలు ఇలాగే నిర్మించుకోవచ్చు. ఆప్ట్రాల్ బాక్సాఫీసుని మించిన కొలమానం లేదు.

—సికిందర్

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

1301 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : దర్శకుడు : రంజిత్ జయకొడి

తారాగణం : సందీప్ కిషన్విజయ్ సేతుపతిదివ్యాంశవరుణ్ సందేశ్గౌతం మీనన్అయ్యప్ప శర్మఅనసూయవరలక్ష్మీ శరత్‌ కుమార్ 
సంగీతం
 : సామ్ సిఎస్ఛాయాగ్రహణం : కిరణ్ కౌషిక్ 
నిర్మాతలు:
 భరత్ చౌదరిరామ మోహన రావు

విడుదల : ఫిబ్రవరి 3, 2023
***

        హిట్లు అనేవి లేకుండా నటిస్తూ వున్న సందీప్ కిషన్ తమిళంలో కూడా హీరోగా 5 సినిమాలు నటించాడు. మరో రెండు నటిస్తున్నాడు. ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ లో కూడా ముఖ్యపాత్ర నటించాడు. తాజాగా తెలుగు- తమిళం ద్విభాషా చలన చిత్రంలో నటించాడు. ఇది హిందీ, మలయాళం, కన్నడలో పానిండియాగా విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటించడం ఆసక్తి రేకెత్తించింది. కొత్త తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దీన్ని పీరియెడ్ మూవీగా రూపొందించాడు. ఇదైనా సందీప్ కిషన్ కి కలిసి వచ్చిందా లేక, మళ్ళీ మొదటికొచ్చిందా తెలుసుకుందాం...

కథ

1990 లలో చిన్నప్పుడు మైఖేల్ (సందీప్ కిషన్) కత్తి పట్టుకుని తండ్రిని చంపేందుకు ముంబాయి వచ్చి గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతమ్ మీనన్) దృష్టిలో పడతాడు. మైఖేల్ ని చేరదీసి అనుచరుడు స్వామి (అయ్యప్ప శర్మ) పర్యవేక్షణలో వుంచుతాడు. యువకుడుగా ఎదిగిన మైఖేల్ శత్రువుల దాడి నుంచి గురునాథ్ ని కాపాడడంతో గురునాథ్ కి మరింత దగ్గరవుతాడు. ఇది చూసి గురునాథ్ కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) అసూయ పెంచుకుంటాడు. తన మీద దాడి జరిపించిన రతన్ (అనీష్ కురువిల్లా) నీ, అతడి కూతురు తీర (దివ్యాంశ) నీ చంపమని మైఖేల్ ని ఢిల్లీకి పంపుతాడు గురునాథ్. ఢిల్లీ వెళ్ళిన మైఖేల్ తీర ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అమర్ నాథ్ రతన్ ని చంపేసి, మైకేల్ మీద కాల్పులు జరిపి లోయలోకి తోసేస్తాడు.

        అసలు మైఖేల్ తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? అతను జైల్లో ఎందుకు పుట్టాడు? గురునాథ్ - చారులత (అనసూయా భరద్వాజ్) లతో మైఖేల్ కున్న సంబంధమేమిటి? కన్నమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎవరు? ఇంకో గ్యాంగ్ స్టర్ (విజయ్ సేతుపతి) ఎవరు? ఇంతకీ మైఖేల్ తండ్రిని చంపాడా లేదా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

1990 ల కాలంలో సెట్ చేసిన పీరియెడ్ కథ. ఫార్ములా రివెంజీ డ్రామా. ఈ కథలో మైఖేల్ కి అన్యాయం జరిగిన చిన్నప్పటి కథ తప్ప మిగిలినదంతా ఫ్లాట్ గా సాగిపోయే రక్తపాతాల యాక్షన్ కథ. చివరి 15 నిమిషాలు పేలుళ్ళ మోతే.  కేజీఎఫ్ ప్రభావం కూడా చాలా వుంది. గ్యాంగ్ స్టర్- మాఫియా సినిమాలు కమలహాసన్  నాయకుడు నుంచీ జేడీ చక్రవర్తి సత్య వరకూ అనేకం వచ్చాయి. ఆ కాలంలో జరిగిన కథల్ని అదే ఫార్ములాతో, టెంప్లెట్స్ తో అలాగే తీయడం వల్ల ఈ తరం ప్రేక్షకులకి గిట్టుబాటు అయ్యేదేమీ వుండదు. బోరు కొట్టి కూర్చుంటాయి. కాకపోతే నాయకుడు నుంచి సత్య నుంచీ పాత్రల్ని తీసుకుని, నేటి కాలానికి హీరోతో కొత్త కథ సృష్టిస్తే అదొక చెప్పుకోదగ్గ ప్రయత్నం.

        ఇందులో వినోదించడానికి, ఆనందించడానికి అలాటి కథ, పాత్రలు లేవు. యమ సీరియస్ కథకి యమ సీరియస్ పాత్రలు. పాత్రలన్నీ ఒకేలా వుంటాయి - సీరియస్ మొహాలు పెట్టుకుని దేశం కోసం సీరియస్ గా పోరాటం చేస్తున్నట్టు.  ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తున్నాడు గనుక ఓపికతో చూస్తాం. ఇంటర్వెల్లో మైఖేల్ని షూట్ చేసి లోయలో పడేశాక- ఈ సెటప్ చేసిన కథతో సెకండాఫ్ గజిబిగా తయారై, రివెంజి కథ మన మీద పగ దీర్చుకుంటున్నట్టు వుంటుంది. మైఖేల్ పాత్ర సందీప్ కిషన్ తండ్రి పాత్ర మీద పగ దీర్చుకోవడానికి వచ్చాడా, లేక తనకి హిట్స్ ఇవ్వడం లేదని ప్రేక్షకుల మీదా? రెండోదే నిజం చేశాడు. 

        ప్రియురాలి ప్రేమ, తల్లితో మదర్ సెంటిమెంటు అనే బంధాల మధ్య మైఖేల్ ని భావోద్వేగభరితంగా బంధించాలన్న ప్రయత్నానికి ప్రియురాలితో ప్రేమలో పసలేదు, మదర్ తో ఫీల్ లేదు, ఫ్యామిలీ డ్రామా అసలే లేదు- కేవలం తండ్రిని చంపాలన్న కసి తప్ప. పైగా సెకండాఫ్ లో అనవసర పాత్రల హడావిడి ఒకటి. ఆలస్యంగా వచ్చే విజయ్ సేతుపతి పాత్ర కూడా కథా బలానికి తోడ్పడలేదు. సెకండాఫ్ శిరోభారం తప్ప ఏమీ లేదు. ఇలాటి కథ చేసుకుని, దీన్ని స్టయిల్ తో, టెక్నిక్ తో, అద్భుతంగా చిత్రీకరించిన శ్రమంతా వృధా అయింది.

నటనలు- సాంకేతికాలు

నటవర్గం మాత్రం మల్టీ స్టారర్ కి తక్కువ కాకుండా వున్నారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దర్శకుడు గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయా భరద్వాజ్ ...పానిండియా ఆర్భాటం. ఒక్కరూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు. గురునాథ్ గా గ్యాంగ్ స్టర్ పాత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ కెందుకో అర్ధం గాదు. ఈ పాత్ర విజయ్ సేతుపతి వేసి వుంటే యూత్ కి ఈ యమ సీరియస్ సినిమాతో హుషారొ చ్చేదేమో.

        తెర మరుగైన హీరో వరుణ్ సందేశ్ విలనీ అయినా సరదాగా చేయకుండా సైకోలా బిహేవ్ చేస్తాడు. అనసూయ కూడా సీరియస్సే. అందరూ సీరియస్సే హార్రర్ సినిమాలాగా. సందీప్ కిషన్ గెటప్ మార్చుకున్నాడు గానీ, సీరియస్ లుక్ తో నటించడానికి తగినన్ని భావోద్వేగాల్లేవు కథలో. బాగా చేసింది ఫైట్లు ఒక్కటే. ప్రేక్షకులతో తను కనెక్ట్ అవ్వాలంటే చిన్నప్పటి  ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే బలంగా వుంటే చాలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తను లేడు, చైల్డ్ ఆర్టిస్టు వున్నాడు. ప్రస్తుత కథలో తనున్నప్పుడు, ఫ్లాష్ బ్యాక్ లోని భావోద్వేగాలు ప్రస్తుత కథలోకి వచ్చేలా అంతకంటే బలమైన కథనముండాలి.  

        కథా కథనాలు, పాత్రలు ఇలా వుంటే,, వీటిని తెరకెక్కించిన విధానం మాత్రం మహోజ్వల చిత్రరాజం అన్పించేలా వుంటుంది. కెమెరాకి  తీసుకున్న షాట్స్, లైటింగ్, కలర్ స్కీమ్ అన్నీ పీరియడ్ మూవీ జానర్ విలువలతో వున్నాయి. వీటితో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పోటీ పడింది. సందీప్ కిషన్ కి టెక్నికల్ గా గర్వించే మూవీ దక్కింది, విషయపరంగా మాత్రం హిట్ కి సుదూరంగా వుండిపోయింది.
—సికిందర్

12, డిసెంబర్ 2022, సోమవారం

1262 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకత్వం : గంగాధర్
తారాగణం: విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, చైతన్య రావు, రవిశంకర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సందీప్ రాజ్, సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం:  శ్రీనివాస్ బెజుగం
బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా
విడుదల : డిసెంబర్ 9, 2022
***
        క్రైమ్ సినిమాలు విరివిగా వస్తున్న క్రమంలో ముఖచిత్రం ఇంకో కొత్త దర్శకుడి ప్రయత్నంగా తెరపై కొచ్చింది. ఒకప్పుడు ఇవే క్రైమ్ సినిమాలు అన్ని భాషల్లో బి గ్రేడ్ సినిమాలుగా వచ్చి వెళ్ళి పోయేవి. ఇదే పరిస్థితి హార్రర్ సినిమాలది. హార్రర్ సినిమాల్ని ఈ శతాబ్దం ఆరంభంలో బాలీవుడ్ లో స్టార్స్ తో తీస్తూ బి గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయడంతో ప్రేక్షకులు పెరిగి మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా రావడం మొదలెట్టాయి. క్రైమ్ సినిమాలతో ఇది జరగలేదు.

        దీంతో చిన్న హీరో హీరోయిన్లతో, కొత్త హీరో హీరోయిన్లతో ఇప్పటికీ ఇవి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం లేదు. తెలుగులో ఎప్పుడో వచ్చే అడివి శేష్ క్రైమ్ సినిమాలు తప్ప స్టార్ స్టేటస్ కి అప్ గ్రేడ్ అవుతున్న దాఖలాల్లేవు. అయితే కొన్ని చిన్న సినిమాలు క్రైమ్ తో తీస్తే దృష్టినాకర్షించే కథాంశాలతో వుంటాయి. ఇది అరుదుగా జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళ గలిగితే చిన్న క్రైమ్ సినిమాయే పెద్ద హిట్టయ్యే అవకాశముంటుంది. ఇలాటిదొక మెయిన్ స్ట్రీమ్ కథాంశం ముఖచిత్రం ది. మరి ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోగలిగారా? దీనికి గంగాధర్ అనే అతను కొత్త దర్శకుడు. రచన చేసింది కలర్ ఫోటో దర్శకుడు. ఈ ఇద్దరూ చేతిలో వున్న యూనివర్సల్ కథాంశాన్ని క్రైమ్ తో జోడించి ఏ మేరకు సద్వినియోగం చేసుకుని బాగు పడ్డారో చూద్దాం...  

కథ

    రాజ్  (వికాస్ వశిష్ట) కాస్మెటిక్ సర్జన్ హైదరాబాద్ లో. అతడ్ని మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్) ప్రేమిస్తూంటుంది. ఈ చిన్నప్పటి ఫ్రెండ్ ని కాదనుకుని విజయవాడలో మహతి (ప్రియా వడ్లమాని) ని పెళ్ళి చేసుకుంటాడు. ఒక రోజు మాయా రోడ్డు ప్రమాదంలో మొహం చితికిపోయి కోమాలో కెళ్ళి పోతుంది. మరోవైపు మహతి మెట్ల మీంచి జారిపడి చనిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితురాళ్ళే. ఇప్పుడు మొహం చితికి పోయిన మాయ కోమాలోంచి తేరుకున్నాక ఛూస్తే, తన ముఖం మహతిలా మారిపోయి వుంటుంది. మొహం చితికిన మాయాకి చనిపోయిన భార్య మహతి చర్మం తీసి ప్లాస్టిక్ సర్జరీ చేశానని చెప్తాడు రాజ్. ఇప్పుడు మహతిలా వున్న మాయా జీవితమేమిటి? ఆమె మహతి గురించి తెలుసుకున్న నిజమేంటి? దాంతో మహతితో రాజ్ పాల్పడిన నేరాన్ని ఎలా బయటపెట్టి శిక్షించింది? ఇందులో లాయర్ విశ్వ (విశ్వక్సేన్) పోషించిన పాత్రేమిటి? ... వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్) స్టోరీ ఐడియాతో ఈ క్రైమ్ కథ చేశారు. తెలుగు సినిమాల్లో బహుశా ఇది మొదటిసారి. ఇలా యూనిక్ ఐడియాగా వున్న దీని కథా విస్తరణ గందరగోళంగా వుంది. యూనిక్ ఐడియా గల్లంతయింది. సామాజిక బాధ్యత పెద్ద మాటగా అన్పించవచ్చుగానీ, ఈ యూనిక్ ఐడియా విషయంలో ఈ కథ ఒక బాధ్యతే అవుతుంది. కానీ అల్లరి నరేష్ తో నాంది తీసినప్పుడు చట్టంలోని సెక్షన్ 211 తో దేశ భాషల్లో ఎక్కడా రాని యూనిక్ కథని ఎలా బాధ్యత లేకుండా కిల్ చేశారో, అలా ముఖ చిత్రం తో చేశారు. ఈ కథ ఏ వైవాహిక అత్యాచార బాధితులకి బాసటగా వుండాలో అది గాకుండా చేశారు.  

        వైవాహిక అత్యాచారం దానికదే ఒక నేరం (కోర్టులు ఒప్పుకోకపోయినా నైతికంగా నేరమే). ఈ మౌలిక పాయింటుని  ఇంకో నేరంతో కలిపి కథ చేస్తే మౌలిక పాయింటే గల్లంతై పోతుంది. ఏదో వొక పాయింటుతో కథ చేయాలి- వైవాహిక అత్యాచారమా? ముఖ మార్పిడి  నేరమా? ఏదో వొకటి. రెండూ కలిపి చేస్తే మొదటిది బలై పోతుంది. ఇదే జరిగింది. ఈ ముఖ మార్పిడి కూడా గజిబిజి క్రైమ్ కథే.

        వైవాహిక అత్యాచారం ఐడియా అనుకున్నాక, దీని మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషించుకోకుండా, ముఖ మార్పిడి క్రైమ్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ కి పూనుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ తో స్పష్టత లేకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ కి పాల్పడితే ఇంతే. మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ వుంటుంది. ఇది బ్లాగులో పదేపదే చెప్పుకున్న పాత విషయమే.

       వైవాహిక అత్యాచారం విస్తృత మార్కెట్ యాస్పెక్ట్ వున్న స్టోరీ పాయింటు. దేశంలో ఇంతవరకూ రాని పానిండియా మూవీగా  ఈ తెలుగు సినిమా వెళ్ళగల సామర్ధ్యమున్న పాయింటు. లొట్టపీసు లోకల్ సినిమా కాదు. ఈ పాయింటుని కాస్త రీసెర్చి ఏదో చేసుకున్నట్టు కూడా కనిపించదు. కోర్టులో తోచినట్టు వాదనలు జరిపి, వైవాహిక అత్యాచారం నిందితుడైన హీరో రాజ్ పాత్రకి పదేళ్ళు శిక్ష పడేట్టు చేసి శుభం అనేశారు.

        వైవాహిక  అత్యాచారాన్ని నేరంగా సుప్రీం కోర్టు కూడా గుర్తించనప్పుడు, శిక్షెలా పడుతుంది? భార్య సమ్మతి లేకుండా భర్త శృంగారానికి బలవంతం చేయడం రేప్ కిందికొచ్చే నేరంగా పరిగణించడానికి గతంలో రెండు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఒప్పుకోలేదు. అసలు భార్యకి భర్త తనని రేప్ చేస్తున్నాడని నిరూపించడమే కష్టమని ప్రముఖ లాయర్ ఫ్లేవియా అగ్నెస్ అంటున్నారు. ఫలానా రాత్రి తను మూడ్‌లో లేనని, తను నిద్రపోయిన తర్వాత, లేదా అనారోగ్యంతో వుంటే, బలవంతం చేశాడని ఆమె నిరూపించాలి. ఇదొక ఛాలెంజ్ అవుతుందని ఆమె అంటున్నారు.

        అంటే దీన్ని కథగా చేయాల్సి వస్తే ఆ భార్య కోర్టులో విఫలమై బాధితురాలిగానే మిగలాలి చివరికి. అప్పుడు కోర్టులకీ, పార్లమెంటుకీ వినబడేలా ఆక్రోశించాలి. ఒక గట్టి ప్రశ్నతో ముగించాలి. ముఖచిత్రం కథలో మరణించిన స్నేహితురాలు మహతికి న్యాయం కోసం మాయా కోర్టులో పోరాడుతుంది. అయితే మహతి భర్తని శిక్షించలేమని కోర్టు తీర్పుతో తెలుసుకుని- మయా తనూ ఒక నిర్ణయం తీసుకుని తిరుగుబాటు చెయ్యాలి- స్త్రీ స్వాతంత్ర్యాన్ని చట్టం గుర్తించకపోతే, వైవాహిక అత్యాచారం నుంచి రక్షణ కల్పించకపోతే- స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకుని రిస్కు చేయాలి? ఏ మగాడు ఎలాటి వాడో ఎలా తెలుస్తుంది? అందుకని నేను పెళ్ళే చేసుకోను- స్వతంత్రంగా వుండగలిగేంత జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకుని బతికేస్తాను, మీ పెళ్ళి వ్యవస్థకో గుడ్ బైరా నాయనా  - అనేసి వాకౌట్ చేస్తే ఎంతో కొంత అర్ధముండొచ్చు కథకి. సామాజిక బాధ్యతో, కథా ప్రయోజనమో, మరోటో నెరవేర్చి పుణ్యం కట్టుకున్నట్టు వుంటుంది. ఇలా యూనిక్ ఐడియాతో ఇది సినిమా వైరల్ అవడానికి అవకాశమున్న మార్కెట్ యాస్పెక్ట్ అవుతోంది.

ఇంకా వుంది...

        మార్కెట్ యాస్పెక్ట్ చెప్పుకున్నాక, క్రియేటివ్ యాస్పెక్ట్ చూద్దాం. క్రియేటివ్ యా స్పెక్ట్ చూస్తే ఇది ఎక్కువగా ముఖమార్పిడి కథగా వుంది. ఈ కథలోంచి వైవాహిక అత్యాచారమనే స్టోరీ ఐడియా బయటికి రావడానికి సెకండాఫ్ లో ఇరవై నిమిషాలూ పట్టింది! ముఖమార్పిడి కథ పొదిగితే ఆ గుడ్డుని పగులగొట్టుకుని పుట్టిందే వైవాహిక అత్యాచారం అసలు కథన్న మాట. ఏం ఖర్మ! అంటే ఇలా సెకండాఫ్ లో అసలు కథ రివీల్ అయిందంటే మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు మనో వీధుల్లో మాయా విహారం చేస్తూ రచిస్తే వచ్చేది మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అనే చెత్త. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే సినిమాకి పనికి రాదా అంటే, కమర్షియల్ సినిమాకి పనికి రాదు. డబ్బులు రాని ఆర్ట్ సినిమా చేసుకోవచ్చు. ఆర్ట్ సినిమాలు మంచివి కాదని కాదు, యూరప్ తీసికెళ్ళి మంచిగా ఆడించుకోవచ్చు.

        హాలీవుడ్ నుంచి ఎవడో ఒకడు స్క్రీన్ ప్లే సంగతులు చెబుతూనే వుంటాడు నిత్యాన్న ప్రసాదం లాగా. మనకేం పట్టదు. మనకి మనమే స్క్రీన్ ప్లే సూపర్ హీరోలం, వీరులం. ఒకడు చెప్పేదేంటి. మన మనో వీధులు, సందులు, గొందులు మనకి పట్టా చేసి పెట్టి వున్నాయి. ఇంకొకడు చెప్పేదేంటి. ఎందుకు చెబుతున్నాడో, ఎక్కడెక్కడో తొంగి చూసి, సినిమాల్లోంచి సంగతులు లాగి, లాభ నష్టాలు ఎందుకు చెబుతూంటాడో అస్సలు అర్ధం గాదు! మన పట్టా పాస్ బుక్ తప్ప ఇంకేదీ అర్ధం గాదు.

        ఈ కథ ఫస్ట్ యాక్ట్ ఇలా వుంటుంది- ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయ పరిచయం కావడం, మాయని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, మాయాకి రోడ్డు ప్రమాదంలో ముఖం చితికి పోయి కోమాలో కెళ్ళి పోవడం, మహతి మేడ మీంచి పడి చనిపోవడం, మహతి బతకాలంటే మాయా కోలుకోవాలని రాజ్ అనడం- ఇంటర్వెల్.

      సుమారు గంట సేపు ఫస్ట్ హాఫ్ వుంటుంది. పై స్టోరీ బీట్స్ చూస్తే ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. మహతి బతకాలంటే మాయా కోలుకోవాలన్న రాజ్ మాటలతో ఇంటర్వెల్ ఏమర్ధమయ్యింది? అంటే చనిపోయిన మహతి రూపంతో మాయాకి సర్జరీ చేసి ఆమెలో మహతిని చూసుకోవాలనా? ఇదేనా సెకండాఫ్ లో చూడబోయే కథ? ఇదేనా ఫస్ట్ యాక్ట్ ముగింపు? ప్లాట్ పాయింట్ వన్? ఇవన్నీ నిర్ధారణ లేని వూహాగానాలు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఏర్పడకపోతే కథ గురించి వూహాగానాలే తప్ప కథేమిటో అర్ధంగాకుండా పోతుంది. ఇదే జరిగింది ఇంటర్వెల్ తో- కాన్ఫ్లిక్ట్ లేక!

        ఇక సెకండాఫ్ లో కోమాలోనే వున్న మాయాకి సర్జరీ చేసి మహతిలాగా మార్చేస్తాడు. ఆమె కోమాలోంచి కోలుకున్నాక మహతి చనిపోయిన విషయం చెప్పి- మహతిలాగా తెచ్చుకుని ఇంట్లో వుంచుకుంటాడు. ఇలా ఇరవై నిమిషాలు గడిచాక ఆమెకి మహతి ఫోన్లో రికార్డింగ్స్ బయటపడతాయి- వాటి ప్రకారం రాజ్ శాడిస్టు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రేప్ చేస్తున్నాడు. తను ప్రెగ్నెంట్ అయింది. అయినా వదలడం లేదు... ఇలా వైవాహిక అత్యాచారం విషయం ఇప్పుడు బయట పడుతుంది.

మిడిల్ కి మిగిలింది ఇంతే

    అంటే కథేమిటో ఇప్పుడు అర్ధమవుతోందన్న మాట. అంటే కాన్ఫ్లిక్ట్ ఫస్టాఫ్ ఇంటెర్వెల్ దాటుకుని సెకండాఫ్ లో ఇరవై నిమిషాల కొచ్చిందన్న మాట. అంటే సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ వుండాల్సిన స్పేస్ ని ఫాస్ట్ యాక్టే ఆక్రమించి సెకండాఫ్ ని- అంటే మిడిల్ ని మటాష్ చేసిందన్న మాట. అందుకే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట.

        ఇప్పుడు సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ఇరవై నిమిషాలు స్పేస్ ని నష్టపోయాక సెకండ్ యాక్ట్ కీ, ఆ తర్వాత థర్డ్ యాక్ట్ కీ మిగిలింది 40 నిమిషాలే. ఇందులోనే రెండూ పంచుకోవాలి. పంచుకుంటే సెకండ్ యాక్ట్ కి మిగిలింది పదీ పదిహేను నిమిషాలే. అంటే రెండు గంటల సినిమాలో 50 శాతం, అంటే గంట పాటు నడవాల్సిన సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- ఇంతలా కృశించి పోయిందన్న మాట!   

        ఇలా సినిమా ప్రారంభమయ్యాక గంటా 20 నిమిషాల పాటూ కథే ప్రారంభం కాలేదంటే అది సినిమా కాదన్న మాట. ఈ కథ వైవాహిక అత్యాచారం గురించి అని ఎప్పుడో సెకండాఫ్ లో తెలిసే వరకూ ప్రేక్షకులు కూర్చుని ఏం చేయాలి? ఇలావుందన్న మాట స్టోరీ ఐడియాతో క్రియేటివ్ యాస్పెక్ట్ సంగతి.

        చెప్పాలనుకున్న ముఖమార్పిడితో వైవాహిక అత్యాచారం కథ గనుక స్ట్రక్చర్ లో పెట్టి చెప్తే ఇలా వుంటుంది- ఫస్టాఫ్ అరగంటకల్లా మహతి చనిపోయి, ఆమె రూపంతో మాయాకి సర్జరీ జరిగి ఫస్ట్ యాక్ట్ - అంటే బిగినింగ్- ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ యాక్ట్- అంటే మిడిల్- ప్రారంభమై మాయా వచ్చి మహతిలా గా రాజ్ తో రాజ్ ఇంట్లో వుంటూంటే, ఇంటర్వెల్లో మహతి ఫోన్ రికార్డింగ్స్ ద్వారా  వైవాహిక అత్యాచారం విషయం బయట పడి, రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇలా కథేమిటో ఇంటర్వెల్లో అర్ధమయ్యేట్టు వుంటుంది.

    అయితే ప్రపంచమంతటా వైవాహిక అత్యాచారమనే అపరిష్కృత సమస్యగా వున్న బర్నింగ్ టాపిక్ గురించి సినిమా తీయాలనుకుంటే దాన్ని ముఖ మార్పిడి కథతో చేస్తే గజిబిజి అవుతుంది. ముఖ మార్పిడి విడిగా వేరే పాయింటు - ఆస్తికోసం భార్యని చంపి ఆమె ముఖాన్ని ప్రేయసికి అతికించి ఆడే నాటకంలాగా వేరే కథవుతుంది. దీనికి వైవాహిక అత్యాచారం పాయింటు కలిపితే డామినేట్ చేసేది ముఖమార్పిడి పాయింటే!

        అందుకని శుభ్రంగా కల్తీలేని వైవాహిక అత్యాచారం కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ చేస్తే, స్ట్రక్చర్ ఇలా వస్తుంది - ఫస్ట్ యాక్ట్ లో ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయా పరిచయం కావడం, మాయాని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, తర్వాత మహతి మేడ మీంచి పడి చనిపోవడంతో మాయాకి అనుమానాలతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డం.

        ప్లాట్ పాయింట్ వన్ మాయాతో ఎందుకంటే, మహతికి న్యాయం కోసం పోరాడేది మాయానే. ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర రాజ్ కి, ప్రత్యర్ధి పాత్రగా మాయా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎదురెదురు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోతే కథ సాగదు. సాగినా ఎలా సాగాలో తెలీదు.

        ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర చేతిలో వున్న గోల్ ప్రత్యర్ధి పాత్ర అయిన మాయా చేతికొచ్చేస్తుంది. మహతి మరణం మీద ఈమెకి అనుమానాలున్నాయి. ఈ అనుమానాలు తీర్చుకునే గోల్ తో సెకండ్ యాక్ట్ -అంటే మిడిల్- ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో సంబంధిత కథ జరుగుతూ, మాయా రాజ్ ఇంటికొస్తే, మహతి ఫోన్ రికార్దింగ్స్ దొరికి- ఆమె రాజ్ చేతిలో వైవాహిక అత్యాచార నరకాన్ని అనుభవించిందన్న నిజం తెలిసి -రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ప్రారంభమై పోతూ ఇంటర్వెల్ వస్తుంది.

        ఇక సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ కొనసాగుతూ రాజ్ తో మాయాకి మిడిల్ బిజినెస్ మొదలవుతుంది. అంటే యాక్షన్- రియాక్షన్లతో కూడిన సంఘర్షణ. ఈ సంఘర్షణలో లాయర్ సాయం తీసుకుంటుంది. ప్రతిఘటించే రాజ్ తో సంఘర్షణ వెళ్ళి వెళ్ళి మాయాకి తగిన సాక్ష్యాధారాలు చిక్కడంతో- ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- పూర్తవుతుంది.

        ఇక థర్డ్ యాక్ట్ లో - అంటే ఎండ్ లో - కోర్టు డ్రామా వస్తుంది. ఇక్కడ మహతి బలైన వైవాహిక అత్యాచార నేరాన్ని లాయర్ తో కలిసి నిరూపిద్దామంటే, వైవాహిక అత్యాచారం అసలు నేరమే  కాదని కోర్టు కొట్టేస్తుంది. పైగా మహతీది ప్రమాదవశాత్తూ మరణం కాదని కూడా నిరూపించలేక పోతుంది మాయా. మహతిని చంపడం కూడా చేసిన రాజ్ ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. మాయా న్యాయ వ్యవస్థ మీద, ఇలాటి పెళ్ళి వ్యవస్థ మీదా ఓ రెబల్ స్టేట్ మెంట్ పారేసి- సెల్ఫ్ రిలయెంట్ ఇండిపెండెంట్ వుమన్ గా వాకౌట్ చేస్తుంది. ఇలా రఫ్ గా, కల్తీలేని శుభ్రపర్చిన వైవాహిక అత్యాచారం కథ సూటిగా తగిలేట్టు వుండొచ్చు.

ఇలా వుంది క్రైమ్ జానర్ మర్యాద
        ఇక సినిమాలో ముఖమార్పిడి కథ కూడా ఎలా వుందంటే- రాజ్ మహతి శవాన్ని ఏం చేశాడో తెలియదు. ఆమె ముఖ చర్మాన్ని తెచ్చి కోమాలో వున్న మాయాకి సర్జరీ చేసి అతికించేస్తాడు! ఆమెకి తెలియకుండా, ఆమె అంగీకారం లేకుండా మహతి ముఖంగా మార్చేస్తాడు. ఇది నేరం. అతను చేసింది ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఈ సర్జరీ చేయించుకునేది ఇద్దరే- క్రిమినల్స్, కొందరు పౌరులు. క్రిమినల్స్ ఎందుకు చేయించుకుంటారో తెలిసిందే. పౌరుల విషయానికొస్తే -తమ లొకేషన్‌లు, సామాజిక కనెక్షన్‌లు, రోజువారీ కదలికలు, ప్రైవేట్ సమాచారమూ ట్రాక్ చేయకుండా ప్రభుత్వాన్ని, లేదా వివిధ సంస్థల్ని నిరోధించడానికి ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని తిరుగుతారు. దొరికితే చారల దుస్తులేసుకుని వేరే ఐడెంటిటీ నెంబర్ బిళ్ళతో కటకటాల వెనక్కి పోతారు.

        మాయా ఇదే పరిస్థితిలో పడుతుందని పట్టించుకోలేదు కథకుడు. ఆమె మహతిలా బతకాలన్నా ఎలా బతుకుతుంది? ముఖం మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులెలా మేనిపులేట్ చేస్తుంది. సింపుల్ గా ఎక్కడో ఆధార్ అథెంటికేషన్ లో దొరికిపోతుంది. అసలు తన మీద రాజ్ చేసిన ఈ అక్రమాన్ని ఎలా సహిస్తుంది. వెంటనే కంప్లెయింట్ చేసి లోపలేయించాలి. కానీ ఇలా కూడా చేయదు. అతను మహతీలా ఇంటికి తీసుకుపోతే మహతిలా జీవిస్తూంటుంది!! తను మహతి అయితే మాయా ఏమైంది? దీనికేం చెప్తుంది? మాయా కనిపించడం లేదని ఇంటి ఓనర్ కంప్లెయింట్ చేస్తే ఏం చేస్తుంది?

        ఇక మహతికి న్యాయం కోసం కోర్టు కెక్కాక కోర్టుని దారుణంగా మోసపుచ్చుతోందని కూడా కథకుడు పట్టించుకో దల్చుకోలేదు. లాజిక్కా బొందా? సినిమా కథకి లాజిక్కేంటి, ఇదింతే అన్నట్టు దూసుకుపోయాడు. క్రైమ్ కథకి అతి ముఖ్య యోగ్యత, జానర్ మర్యాద లాజికల్ రీజనింగ్ అన్న విషయం అవసరమన్పించలేదు కథకుడికి. 

        చచ్చిపోయిన మహతి రూపంలో మహతిలా కోర్టులో కేసు పోరాడుతున్న మాయానీ, ఆమె లాయర్నీ చూస్తే- 
పాపం జడ్జి గారికి, ప్రాసిక్యూటర్ గారికీ ఈమె మహతి కాదు మాయా అని ఇంకా తెలీదు. మహతీయే అనుకుని జడ్జి గారి తీర్పు పాఠం...వైవాహిక అత్యాచార నేరం రుజువైనందున దోషి రాజ్ కి పదేళ్ళు కారాగార శిక్ష! ఇంతేనా, అతను హంతకుడు కూడా అన్న విషయం తెలియదా? వైవాహిక అత్యాచారం నేరమా? అది రుజువు చేయగల నేరమా? ఈజిట్? ఓకే, థాంక్యూ!

నటనలు-సాంకేతికాలు

        ఇందులో విశ్వక్సేన్ ది ముగింపులో కోర్టులో లాయర్ గా వాదించే అతిధి పాత్ర మాత్రమే. ఈ పాత్ర, మనసుపెట్టి నటించలేదు. కోర్టులో కామెడీ చేయాలా వద్దా అని డైలమాలో పడి ఎటూ గాకుండా నటించి సరిపెట్టాడు. మహతిగా నటించిన ప్రియా వడ్లమాని నటన ఒక్కటే చెప్పుకోదగ్గది. అయితే మహతిగా చనిపోయాక, మాయాకి తన రూపం వచ్చి, ఇంకా మహతిలాగే తను నటించడంలో లాజిక్ ఏమాత్రం లేదు. రూపం మారినంత మాత్రాన మహతి మాయ ఎలా అయిపోతుంది? మహతిగా రూపం మారిన ఆయేషా ఖానే మహతిగా నటించాలి, ప్రియా వడ్లమాని కాదు. ఈ లాజిక్ కూడా వదిలేసి ఆషామాషీగా పాత్రల్ని చుట్టేశారు.

        ఆయేషా ఖాన్ ఫస్టాఫ్ లో అరగంట కనిపించి కోమాలో కెళ్ళిపోయే పాత్ర. పాత్రకి రూట్స్ లేవు, నటనా కూడా సరిగా లేదు. హీరో రాజ్ గా, విలన్ గా వికాస్ వశిష్ట నటన కథా కథనాల ప్రమాణాలకి తగ్గట్టుంది. లాజిక్ లేని పాత్ర. ఇతడి ఫ్రెండ్ గా, మరో డాక్టర్ గా చైతన్యా రావు నటించాడు.

     ఇక సంగీతం గానీ, సాంకేతిక విలువలుగానీ లో బడ్జెట్ కి తగ్గట్టుగానే వున్నాయి. ఇలా కొత్తదర్శకుడు, ఇంకో దర్శకుడూ కలిసి- మారిటల్ రేప్ కథని గజిబిజి గందరగోళం చేసి వదిలారని చెప్పాలి. బాగుపడిందేమీ లేదు. ఇది చూశాక జీతేంద్ర- ముంతాజ్ లు నటించిన రూప్ తేరా మస్తానా గుర్తుకొస్తుంది - క్యారక్టర్ రీప్లేస్ మెంట్ థ్రిల్లర్.

—సికిందర్

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

1219 : రివ్యూ!



రచన - దర్శకత్వం : ఆర్. బాల్కీ
తారాగణం : దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్, పూజా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు
కథ : ఆర్. బాల్కీ, స్క్రీన్‌ప్లే :  ఆర్. బాల్కీ, రాజా సేన్, రిషీ వీరమణి
సంగీతం: అమన్ పంత్, ఛాయాగ్రహణం : విశాల్ సిన్హా నిర్మాతలు : రాకేష్ ఝున్‌జున్‌వాలా, జయంతీ లాల్ గడా, అనిల్ నాయుడు, గౌరీ షిండే
బ్యానర్స్ : హోప్ ప్రొడక్షన్, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల :  సెప్టెంబర్ 23, 2022
***

ర్శకుడు ఆర్ బాల్కీ (బాలకృష్ణన్) గత 15 ఏళ్ళుగా బాలీవుడ్ లో తీసినవి 8 సినిమాలే అయినా అవి ఎవరూ తీయలేని సినిమాలు. చీనీ కమ్’, నుంచీ పాడ్ మాన్ వరకూ చూసుకుంటే అన్నీ అవుటాఫ్ బాక్స్ ప్రయోగాలే. కొన్నిసార్లు ఆ బాక్స్ కూడా కనపడదు. బాక్సే లేని సినిమాలతో బాక్సాఫీసు విజయాలు. రెండుసార్లు ఉత్తమ చలన చిత్రం జాతీయ అవార్డులు, 4 సార్లు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 5 విభాగాల్లో 17 నామినేషన్లు అతడి స్థాయిని తెలుపుతాయి. ఈసారి ప్రపంచ వ్యాప్తంగానే ఎవరి వూహకూ రాని ఐడియాతో సీరియల్ కిల్లర్ సినిమా తీశాడు. ఇందులో మలయాళ స్టార్ సల్మాన్ దుల్కర్ ని, బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ నీ, హైదరాబాద్ తెలుగు అమ్మాయిగా బాలీవుడ్ హీరోయిన్ అయిన శ్రేయా ధన్వంతరినీ ప్రధాన తారాగణంగా తీసుకుని, ఎవరూ వూహించని కొత్త కథ తెరకెక్కించాడు. అదేమిటో చూద్దాం...

కథ

ముంబాయిలో ఒక సీనియర్ సినిమా రివ్యూ రైటర్ (రాజా సేన్) హత్య జరుగుతుంది. ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో అర్ధంగాదు క్రైమ్ బ్రాంచ్ ఐజీ అరవింద్ మాథుర్ (సన్నీ డియోల్) కి. హత్యచేసిన తీరు ఆశ్చర్య పరుస్తుంది. శవం మీద గాయాలు హత్యలా అన్పించవు, ఆర్టిస్టు గీసిన రేఖాచిత్రాల్లా వుంటాయి కత్తితో. నుదుట త్రికోణాకారం చెక్కి వుంటుంది. ఈ త్రికోణాకారం మీద దృష్టి పెడతాడు ఐజీ మాథుర్. దీనికి ఇంకో త్రికోణం కలిపితే నక్షత్రం గుర్తు వస్తుంది. ఒక త్రికోణమే వేశాడంటే సగం నక్షత్రమన్న మాట. అంటే సగం స్టార్. స్టార్స్ సినిమా రివ్యూలకిచ్చే రేటింగ్ గుర్తులు. అంటే హంతకుడు హతుడికి హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చాడన్న మాట.  

ఆ వారం విడుదలైన సినిమాకి రివ్యూ రైటర్ రివ్యూ రాస్తూ సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇందుకు ఈ హత్య జరిగినట్టు అర్ధమవుతుంది. మళ్ళీ వారం ఇంకో రివ్యూ రైటర్ హత్య జరుగుతుంది. ఆ వారం విడుదలైన సినిమాకి అతనుకూడా మంచి రేటింగ్ ఇవ్వలేదు. రేఖా చిత్రకారుడుగా హంతకుడు అతడి శవాన్ని ఆర్టులా చెక్కి
, నుదుట సింగిల్ స్టార్ వేశాడు. రివ్యూరైటర్లు సినిమాలకి రేటింగ్ ఇస్తూంటే, హంతకుడు రివ్యూ రైటర్లని చంపి వాళ్ళకి అర్హమైన రేటింగ్ ఇస్తున్నాడన్న మాట.

ఈ పాటికి రివ్యూ రైటర్ల మీద పగబట్టిన సీరియల్ కిల్లర్ రంగంలో వున్నాడని అర్ధమైపోతుంది ఐజీ మాథుర్ కి. ఇక పూర్తి స్థాయిలో యాక్షన్ లోకి దిగిపోతాడు. డానీ (దుల్కర్ సల్మాన్) అని ఒక ఫ్లోరిస్టు వుంటాడు. నీలా (శ్రేయా ధన్వంతరి) అని ఒక సినిమా రిపోర్టర్ వుంటుంది. డానీ సుప్రసిద్ధ దివంగత దర్శకుడు గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన కాగజ్ కే ఫూల్’, ప్యాసా క్లాసిక్స్ చూస్తూ ఆ పాటలు వింటూ వుంటాడు. ఇంతే క్లాసిక్ గా నీలాని ప్రేమిస్తూంటాడు. నీలాకో అంధురాలైన తల్లి (శరణ్య) వుంటుంది.

డానీ రెండు గ్లాసుల్లో టీ పోసుకుని తాగుతాడు. సైకిలు మీద తిరుగుతూ కస్టమర్స్ కి ఫ్లవర్స్ అందిస్తాడు. నీలాతో ప్రేమ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ వుంటాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఎవరీ సీరియల్ కిల్లర్? వారానికో హత్య చేస్తున్నాడు. ఈ హత్యల్ని ఎలా అరికట్టాలి? సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకోవాలి? ఇవీ ఐజీ మాథుర్ ముందున్న చిక్కు ప్రశ్నలు.

ఎలా వుంది కథ
పైన చెప్పుకున్నట్టు సీరియల్ కిల్లర్ జానర్ లో ఇంతవరకూ ఎక్కడా రాని కొత్త కథ. అల్టిమేట్ ఐడియా- సినిమా రివ్యూ రైటర్లని చంపడం. దర్శకుడు బాల్కి గురుదత్ అభిమాని. గురుదత్ తీసిన ప్యాసా (1957- ఇది తెలుగులో 1978 లో మల్లెపువ్వు గా రీమేక్ అయింది శోభన్ బాబుతో), కాగజ్ కే ఫూల్ (1958) రెండూ బ్యాడ్ రివ్యూల పాలబడి సమాధి అయిపోయాయనీ, ఇవే తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా నిలబడ్డాయనీ, కానీ గురుదత్ కాగజ్ కే ఫూల్ వైఫల్యం తర్వాత విరక్తితో దర్శకత్వం మానుకుని, 10 సినిమాలకి నిర్మాతగానే కొనసాగాడనీ, బ్యాడ్ రివ్యూలు అతడిలోని గొప్ప దర్శకుడ్ని చంపేశాయనీ, ఈ బాధ ఎలా వుంటుందో తెలిపేందుకే చుప్ తీశాననీ వెల్లడించాడు బాల్కీ.

అయితే రివ్యూ రైటర్ల మీద కక్ష గట్టినట్టు ఏమీ సినిమా తీయలేదు. కానీ బ్యాడ్ రివ్యూలు గురుదత్ కెరీర్ ని సమాప్తం చేశాయని అంటున్నప్పుడు
, తను ఈ సినిమా బ్యాడ్ రివ్యూలకి అవకాశం లేకుండా, లోపాలు లేకుండా చూసుకోల్సింది. ఇలా జరగలేదు. కథే తికమకగా మిగిలింది చివరికి. ఏం చెప్పాలని తీశాడో అర్ధం గాదు.

బ్యాడ్ రివ్యూ అనేది వుంటుందా
? సినిమా బ్యాడ్ గా వుంటే దాన్ని బట్టి రివ్యూ వుంటుంది. సినిమాలే బ్యాడ్ గా వుంటాయి, రివ్యూలు కాదు. నిష్పాక్షిక రివ్యూలు, నిర్మాణాత్మక విమర్శ బ్యాడ్ రివ్యూలు కాలేవు. ఉద్దేశపూర్వకంగా  సినిమాని దెబ్బతీసే  ఎజెండా రివ్యూలుంటాయి. డబ్బు తీసుకుని రాసే భజన రివ్యూలూ వుంటాయి. ఈ సినిమాలో బాల్కీ వివిధ పాత్రలద్వారా ఈ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశాడు.

 
విమర్శ సమాజానికి అవసరం. ఏ రంగం అభివృద్ది పథంలో సాగాలన్నా విమర్శ చాలా అవసరం. విమర్శే లోపాల్ని ఎత్తిచూపి ఎడ్యుకేట్ చేస్తుంది’... అబద్ధపు రివ్యూలు ప్రేక్షకుల కళ్ళు తెరిపించ లేవు, వాళ్ళ అభిరుచులు పెరిగేలా చెయ్యలేవు. ఇవి సినిమాలకి హాని కూడా చేస్తాయి’... సోషల్ మేడియాలో అందరూ రివ్యూలు రాస్తున్నప్పుడు ఇంకా వేరే రివ్యూల అవసరమేముంది?’... రివ్యూలు రాసే వాళ్ళందరూ క్రిటిక్స్ కారు. మూవీ ఎక్స్ పర్ట్స్ రాసే రివ్యూలు వేరు. వీళ్ళ రివ్యూల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారు ... ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు.

కథ కొత్తది. రివ్యూ రైటర్ల హత్యల వల్ల బాలీవుడ్ లో ఏర్పడిన పరిస్థితికూడా చూపించాడు. చంపుతున్న సీరియల్ కిల్లర్ ఎవరో చివరి వరకూ సస్పెన్స్ లో వుంచకుండా ఇంటర్వెల్లో రివీల్ చేసేశాడు. దీని వల్ల ఎండ్ సస్పెన్స్ కథనం బారిన పడి బోరు కొట్టదు సినిమా. చివరి వరకూ నేరస్థుడెవరో సస్పెన్స్ లో వుంచే ఎండ్ సస్పెన్స్ కథలు ప్రింట్ మీడియా అయిన నవలల్లో బావుంటాయి గానీ, విజువల్ మీడియా అయిన సినిమాకి పనికిరావని హాలీవుడ్ ఏనాడో  గుర్తించి, ఎండ్ సస్పెన్స్ సినిమాలకి చెక్ పెట్టేసింది. అయినా ఇంకా ఇప్పటికీ తెలుగులో ఓదెల రైల్వే స్టేషన్’, కిరోసిన్ లాంటి ఎండ్ సస్పెన్సులు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు.

హాలీవుడ్ సీన్ టు సీన్ సస్పెన్స్ సినిమాలకి తెరతీసింది. ఇవి సక్సెస్ అవుతున్నాయి. సస్పెన్స్ అనే అంశానికి రెండు పార్శ్వాలుంటాయి- ఎవరు
? ఎందుకు? అనేవి. ఇవి రెండూ మూసి పెట్టి చివరివరకూ కథ నడిపితే అది ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఈ రెండు పార్శ్వాల్లో ఎవరు? అనేది చూపించేసి, ఎందుకు? అనేది చివరి వరకూ సస్పెన్స్ లో పెట్టుకోవచ్చు. ఎవరు? అనేది ఓపెన్ చేశాక, ఇక ఎలా పట్టుబడతాడనే సీన్ టు సీన్  సస్పెన్స్ తో కథనం చేస్తే సక్సెస్ అవుతుంది.

అయితే ఎందుకు
? అనే నేర కారణం చివర్లో ఓపెన్ చేసినప్పుడు బలంగా వుండాలి. లేకపోతే తేలిపోతుంది సినిమా. ఇదే జరిగింది చుప్ లో.  ఇంటర్వెల్లో సీరియల్ కిల్లర్ ఎవరో చూపించేసి, ఇక అతనెలా పట్టుబడతాడనే సీన్ టుసీన్ సస్పెన్స్ కథనం చేసు కొస్తూ, చివర్లో పట్టుబడ్డాక ఓపెన్ చేసిన నేర కారణం కన్ఫ్యూజుడుగా వుంది. ముగింపు పేలవంగా మారింది.

సీరియల్ కిల్లర్ చిన్నప్పుడు కుటుంబంలో జరిగిన ఒక ట్రాజడీని ఇప్పుడు రివ్యూ రైటర్ల హత్యలకి ముడిపెట్టి జస్టిఫై చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నడుస్తున్న కథా ప్రపంచానికి లోబడి సజాతి కారణం చూపించకుండా
, సంబంధం లేని చిన్నప్పటి విజాతి కారణం చూపించి మెప్పించాలనుకోవడం విచారకరం. ఒక దర్శకుడే రివ్యూల వల్ల తన కెరీర్ పరిసమాప్తమైందని కక్షగట్టి, రివ్యూ రైటర్లని చంపుతూ వుంటే, అది కథా ప్రపంచంలో ఒదిగే సజాతి కారణమవుతుంది.

నటనలు - సాంకేతికాలు
దుల్కర్ సల్మాన్ ఈ సినిమాకి బలమే కానీ, సెకండాఫ్ లో సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రేమైనా ఇంకేదైనా నవ్వు మొహంతో సున్నితంగా వ్యవహరించే నటనతో ఓ ముద్రవేస్తాడు. అతడికి కోపం రాదు, ఆవేశపడడు. హాయిగా పూలు అమ్ముకుంటూ, గురుదత్ సినిమాలూ పాటలూ ఎంజాయ్ చేస్తూంటాడు. ఇతడి వల్ల సినిమాకో ఆకర్షణ వచ్చింది. హీరోయిన్ శ్రేయా ధన్వంతరి కూడా సినిమా రిపోర్టర్ గా, దుల్కర్ సల్మాన్ లవర్ గా  సింపుల్ గా వుంది. ఈమె తల్లిగా నటించిన శరణ్య అంధురాలి పాత్ర వల్ల కథకి లభించిన అదనపు ప్రయోజనం లేదు. ఆమెకి సీరియల్ కిల్లర్ ని చూసే అతీతశక్తి ఏదైనా వుంటే అది వేరు. ఆ సీరియల్ కిల్లర్ ఈమెకి కూడా స్పాట్ పెట్టి థ్రిల్ పెంచొచ్చు. ఐజీగా సన్నీడియోల్, క్రిమినల్ సైకాలజిస్టుగా పూజాభట్ ల ఇన్వెస్టిగేషన్ ప్రొఫెషనల్ టచ్ తో వుంది. పోలీస్ ప్రొసీజురల్ జానర్ మర్యాదలకి తగ్గట్టు.

కెమెరా వర్క్
, విజువల్స్ మిగతా బాల్కీ సినిమాల్లాగే టాప్ క్లాస్. పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటాయి- జానేక్యా తూనే కహీ, వఖ్త్ నే కియా క్యా హసీన్ సితమ్, యే దునియా అగర్ మిల్ భీ జాయే... అన్నీ  ప్యాసా’, కాగజ్ కే ఫూల్  లలోని క్లాసిక్ హిట్సే. చివరి విషాద గీతం చిన్నప్పటి ముగింపు ఫ్యామిలీ దృశ్యాలకి డిస్టర్బింగ్ గా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూంటుంది.

మొత్తానికి గురుదత్ కి నివాళిగా బాల్కీ తీసిన ఈ మూవీ రేటింగ్స్ 2/5 నుంచి 3/5 వరకు ఇచ్చారు. సెకండాఫ్ లో హత్యలు లేకుండా సీరియల్ కిల్లర్ ని ట్రాప్ చేయడానికి హీరోయిన్ని రివ్యూ రైటర్ గా ప్లాంట్ చేసే డ్రామా ఒక దశ దాటే టప్పటికి బోరే తప్ప ఏమీ లేదు. ఈ ట్రాప్ క్లయిమాక్స్ లో (ప్లాట్ పాయింట్ 2) ప్రారంభించాల్సింది. మరిన్ని హత్యలతో టెన్షన్  గ్రాఫ్ పెంచకుండా
, మిడిల్ 2 యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగించకూడా, సెకండాఫ్ పూర్తిగా ఇదే డ్రామా నడిపి, ముగింపుకి కూడా న్యాయం చేయని లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ సినిమా రచయితల్లో రివ్యూ రైటర్ రాజా సేన్ కూడా వున్నాడు.

—సికిందర్