రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మనసే మందిరం ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మనసే మందిరం ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

10, నవంబర్ 2020, మంగళవారం

ఇలా అడుగుతున్న కొందరికి మళ్ళీ గుర్తు చేయడం కోసం పాత పోస్టు (797)

 


Q :  నేను సహకార దర్శకుడ్ని. ప్రస్తుతం ఒక సినిమాకు పనిచేస్తున్నాను. నాకు దర్శకత్వం చేసేముందు స్క్రీన్ ప్లే నేర్చుకోవాలనుంది. కొత్త దర్శకులకు స్క్రీన్ ప్లే నాలెడ్జి ఎంత అవసరమో మీ బ్లాగు ద్వారా తెలుసుకుంటున్నాను.  స్క్రీన్ ప్లే సబ్జెక్టు నేర్చుకున్నాకే దర్శకుడుగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే సమూలంగా నేర్చుకోవాలంటే ఎంత కాలం పడుతుంది? స్క్రీన్ ప్లే క్లాసులు పెట్టమని కొందరు అడిగినా మీరు సుముఖంగా లేరని తెలిసింది. నేనెలా నేర్చుకోవాలి?
 మల్లిక్, అసోసియేట్ 

A :  ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్చుకోవచ్చు. స్క్రీన్ ప్లే క్లాసుల  ఆలోచన రాలేదు, వచ్చేఅవకాశం లేదు. అప్పుడప్పుడు పర్సనల్ గా నేర్చుకుంటామని  అడిగే వాళ్ళున్నారు.అందుకు కనీసం మూడునెలలు పడుతుందంటే ముందుకొచ్చే పరిస్థితి లేదు. వారం రోజుల వర్క్ షాప్స్ లోనో, నెల రోజుల కోచింగ్ లోనో వచ్చేస్తుందనుకుంటారు. దర్శకత్వ శాఖలోనో,రచయితల దగ్గరో పనిచేసినా నెల రోజుల్లో కూడా ఏమీ రాదు.  
 
          అసలు నేర్చుకునే విషయంలో చాలా మార్పు వచ్చింది. ఒకలాటి అసహనం, తమకే ఎక్కువ తెలుసన్న అహం నేర్చుకోనీయడం లేదు. ఈ అసహనం, అహం అరచేతిలో కంటెంట్ వల్ల వస్తోంది. ఎక్కువగా వరల్డ్ మూవీస్ చూసేస్తూ తమకే ఎక్కువ తెలుసనుకుంటున్నారు. స్క్రీన్ ప్లే నేర్చుకునే విషయంలోనే కాదు, కథలు పట్టుకొచ్చి సహకారమడిగే వాళ్ళు కూడా తమకే  భిన్నంగా ఇంకేదో తెలుసనుకుంటున్నారు. వాళ్ళు భిన్నంగా తమకేదో తెలుసనుకుంటున్నది అంతంత మాత్రం క్రియేటివిటీ మాత్రమే, స్ట్రక్చర్ కాదు. భ్రమల్లో వుంటున్నారు. కమర్షియల్ కాని, ఇక్కడ రూపాయీ వసూలు చేయని, స్ట్రక్చర్ వుండని, ఆర్ట్ మూవీస్ బాపతు వరల్డ్ మూవీస్ గాథలఫ్యాన్స్ గా కొనసాగుతున్నంత కాలం, స్ట్రక్చర్ ప్రాముఖ్యాన్ని ఏం గుర్తించి నేర్చుకుంటారు. కమర్షియల్ సినిమాకి పనికొచ్చే కథకీ, పనికిరాని గాథకీ తేడా అయినా తెలుసుకోవాలిగా. వరల్డ్ మూవీస్ కాస్తాపి కనీసం 80 - 90 లనాటి తెలుగు సినిమాలు కాదుకదా, హాలీవుడ్ సినిమాలైనా చూసే ఆసక్తి లేదు. తమకి తెలిసిన క్రియేటివిటీతో ఇంకా నేర్చుకోవడం టైం వేస్ట్, నేరుగా చేసేయడం బెస్ట్ అనుకునే కల్చర్ పెరిగిపోయింది. బీటెక్ చేయకుండా వూహల్లో ఇంజనీర్లు అయిపోవాలనుకోవడం లాగా.  

            స్క్రీన్ ప్లే నేర్చుకోవాలంటే దృష్టిలో పెట్టుకోవాల్సిన అనుబంధ అంశాలెన్నో వుంటాయి. కేవలం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ నేర్చుకుంటే సరిపోదు. ఆ స్క్రీన్ ప్లే ప్రాక్టికల్ గా మార్కెట్లో వర్కౌట్ అయ్యే వివిధ కారకాల్ని కూడా ఏ కథకా కథగా కనుగొని వాటిని జొప్పించే పర్యావరణ కళ కూడా నేర్చుకోవాలి. స్ట్రక్చర్ నేర్చుకున్నంత మాత్రాన అయిపోదు, దానికవసరమైన క్రియేటివ్ శక్తి ఎంతుందో బయటికి తీయడానికి నిరంతర ప్రక్రియ కొనసాగాల్సిందే.       

            సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి - ఏ ఫిలిం ఇనిస్టిట్యూట్ లోనైనా బోధించే స్క్రీన్ ప్లే కోర్సు అమెరికన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే. ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కాదు. ఎందుకంటే ఒక ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటూ దేశంలో ఏ భాషా చలనచిత్రాలకి సంబంధించీ లేదు. ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే రాయబోతే కల్చర్ డామినేట్ చేస్తుంది. ఆ కల్చర్ భరతముని నాట్యశాస్త్రంలో నవరసాల రూపంలోవుంది. నాట్యం, నటన, నాటకం భరతముని నాట్యశాస్త్రంలోంచే వచ్చాయి. 

        మొదటి తరం సినిమాలు ఆ పౌరాణిక నాటకాల్లోంచే నవరస భరితంగా వచ్చాయి. ఈ నవరసాలు, నవరసాలతో కూడిన అభినయాలు, సంగీత నాట్యాలూ సినిమాల్లో భాగమైపోయాయి. వీటివల్ల సినిమా కథకి ఓ స్ట్రక్చర్ ని కూర్చడం సాధ్యం కాదు. అందుకని ఇండియన్ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడాలేదు. వరల్డ్ మూవీస్ తీసే యూరోపియన్ దేశాల్లో కూడా, లాటిన్ అమెరికాలో కూడా మనలాగే వాళ్ళ కల్చర్ వల్ల ఓ ఇదమిద్ధమైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లేదు. ప్రపంచం మొత్తంలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వున్నది ఒక్క అమెరికాకే. 

        అందుకే ఒక్క అమెరికా నుంచి తప్ప మరే దేశం నుంచీ స్క్రీన్ ప్లే బుక్స్, ఆర్టికల్స్, వెబ్ సైట్స్ వెలువడవు. ప్రపంచమంతా స్క్రీన్ ప్లే కోర్సులు బోధించేది అమెరికన్ (హాలీవుడ్) స్క్రీన్ ప్లేతోనే. 

            కానీ కాలంమారింది. ఈ మారిన కాలంలో కమర్షియల్ సక్సెస్ కోసం అమెరికన్ స్క్రీన్ ప్లేని భరతముని భాగం చేస్తూనే మన సినిమాలకి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరముంది. ఇదెప్పుడో జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరగాలి. 50 లలో, ’60 లలో తెలుగు సినిమాలు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లోనే రావడం మొదలెట్టాయి భరతమునిని కూడా కలుపుకుంటూ. దేవదాసు, దొంగరాముడు, మనసే మందిరం, వివాహబంధం...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 80 లలో ఖైదీ కూడా, శివ కూడా... 90 లలో కూడా ఇలా కొనసాగింది. 

        2000 నుంచి ఈ ఇరవై ఏళ్లుగా కొత్తతరం మేకర్లతో మారిపోయింది. కథా నిర్మాణం వెనక్కెళ్ళి పోయింది. అప్పట్లో చిత్రం, నువ్వే కావాలి వంటి ప్రేమ సినిమాలతో మొదలైన కొత్త  ట్రెండ్ లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒక్కరయ్యే రచనా నేపధ్యంలేని మేకర్లు వెల్లువెత్తారు. ఒక ఐదేళ్ళ పాటు వందల సినిమాలు లైటర్ వీన్ ప్రేమలంటూ తీశారు. భరతమునిని కూడా వదిలేసి పాత్రల్ని పాసివ్ పాత్రలుగా మార్చేశారు. కథనాల్ని మిడిల్ వుండని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలుగా మార్చేశారు. 

        పూర్వపు సినిమాల్లో సినిమాల్ని ఫ్లాప్ చేసే పాసివ్ పాత్రలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు కన్పించవు. అలాటిది ఆఖరికి మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ ఎవర్నీ వదలకుండా స్టార్ సినిమాలకీ ఇదే జాడ్యాన్ని అంటించారు. ఇలావొక స్ట్రక్చర్ పట్టని రచనా నేపధ్యంలేని క్రియేటివ్ స్కూలు తయారైంది. 

             కానీ ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో నేర్పేది అమెరికన్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నే. అందుకే ఫిలిం ఇనిస్టిట్యూట్స్ ఇంగ్లీషులో అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని తెలుగు సినిమాల్లోకి వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్. ఇదేంట్రా తీరా ఇక్కడ వేరే సీనుందని తలలు పట్టుకోవడం. వీళ్ళు ఇటు క్రియేటివ్ స్కూల్లో అడ్జెస్టు కాలేరు, వాళ్ళు అటు స్ట్రక్చర్ స్కూల్ ని ఇష్టపడరు. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్. మధ్యలో సినిమాల కొచ్చింది చావు. 

            మరేం చేయాలి? బ్యాక్ టు ది ఫ్యూచర్. ఆదిత్య - 369 కాల యంత్రం బుక్ చేసుకుని కాలంలో వెనక్కి 20 వ శతాబ్దంలోకి వెళ్లిపోవాలి. అక్కడి బ్లాక్ అండ్ వైట్ ల నుంచీ చిరంజీవీ బాలకృష్ణల వరకూ రాజ్యమేలిన తెలుగు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని పట్టుకు రావడమే...అమెరికన్ త్రీయాక్ట్ స్ట్రక్చర్ ని తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గా మార్చుకున్న పూర్వీకుల విజ్ఞతని సమాదరించడమే. కనుకే వారం రోజుల వర్క్ షాప్స్ లో, నెలరోజుల కోచింగ్ లో ఉత్సాహపడి అమెరికన్ స్ట్రక్చర్ నేర్చుకుని లాభం లేదనేది. ఎక్కువగా సిడ్ ఫీల్డ్ నే బోధిస్తారు. అమెరికన్ స్ట్రక్చర్ ని తెలుగుకి అన్వయించే ప్రయత్నంలో భాగంగానే ఈ బ్లాగులో వ్యాసాలు వెలువడుతున్నాయి. ఓ పదేళ్ళు పరిశీలించీ పరిశీలించీ, సిడ్ ఫీల్డ్ తో బాటు ఇంకొందర్నీ స్టడీ చేసీ, నేటివిటీకి అన్వయమయ్యేవి తీసుకుని, కానివి తీసేసి, ఏడాది పాటు రాసుకుంటూ వస్తే, ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్అనే వొక నమూనా ప్రతి తయారయ్యింది. దీన్నింకా సంస్కరించే పనుంది. 

            సరే, దర్శకత్వం చేపట్టే ముందు రచన మీద పట్టు సాధించాలన్న మీ ఆలోచన స్ట్రక్చరాశ్యులు కన్పించని ఈ రోజుల్లో చాలా మంచి ఆలోచనే. అసోషియేట్ గా ఈ పాటికి మీకు ఎంతో కొంత అనుభవముంటుంది. ముందు మీరనుకుంటున్నకథకి లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ రాసేయండి. దాని ఆధారంగా ఐడియా దగ్గర్నుంచీ డైలాగ్ వెర్షన్ వరకూ ఐదు మెట్లు ఎలా క్లియర్ చేసుకుంటూ వెళ్తూ స్ట్రక్చర్ నేర్చుకోవచ్చో మీ కథ ద్వారా మీరే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారమంతా బ్లాగులోనే తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్రూపంలో వుంది. స్ట్రక్చర్ నేర్చుకున్నాక ఆ స్ట్రక్చర్ తో మీ కథకి పర్యావరణ కళ తెలుసుకోవడమనే అనుబంధ కోర్సు ప్రారంభించుకో వచ్చు. ఏమైనా సందేహాలు వస్తే పర్సనల్ గా కలిసి తీర్చుకోవచ్చు.

సికిందర్
14.3.19

 

14, ఏప్రిల్ 2020, మంగళవారం

928 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 6

     
      క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాల్లో అక్కడక్కడ ప్రస్తావిస్తున్న జానర్ మర్యాదలు అన్నిటినీ కలిపి ఒక చోట లిస్టుగా ఇస్తే సౌకర్యంగా వుంటుందని కొందరు కోరారు. ఈ వ్యాసం ముగించాక ఆ పని చేద్దాం. ఈ జానర్ ని రియలిస్టిక్ రూపకల్పన కూడా చేసి యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు. హిందీ ‘పింక్’ లో  కొందరు యూత్ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్నప్పుడు, ఒకడు తాప్సీతో మిస్ బిహేవ్ చేస్తే, ఆమె బాటిలెత్తి కొట్టేస్తుంది. ఇది హత్యాయత్నం కేసుకింద నమోదై ఆమె ఇరుక్కుంటుంది. ఇలా రియలిస్టిక్ గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి, ప్రవర్తనల్లోంచి  తీసుకుంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది. తమిళ డబ్బింగ్ ‘16 - డి’ ఇలాంటిదే. తెలుగు ‘మత్తు వదలరా’ జానర్ వేరైనా యూత్ ప్రవర్తనే పాయింటు. మరొకటేమిటంటే, నేటి సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యాస్పెక్ట్స్ తో కూడా ఈ జానర్ సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుత కరోనా ముప్పువల్ల ఎకనమిక్స్ తో బాటు రోమాంటిక్స్ కీ పెద్ద సమస్య వచ్చి పడింది. లాక్ డౌన్ వల్ల  బాయ్ ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్స్ కలుసుకోలేక, షికార్లు తిరగలేక  నానా అవస్థలు పడుతున్నారు. రోమాన్సులు రోకలి బండలయ్యాయి. క్రిమినల్స్ ఆర్ధిక నేరాలు చేయలేక పాపం ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏటా పోలీస్ స్టేషన్లలో మూడు కోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదవుతాయి. అంటే రోజుకి 80 వేలు. అలాంటిది ఇప్పుడు 80 కూడా నమోదు కావడం లేదు. దేశంలో ప్రతీరోజూ 377  మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక్కరు కూడా మరణించడం లేదు. 

       
క్రైం థ్రిల్లర్ జానర్ అతి హింసని ఒప్పుకోదు. హత్యా పరిశోధనలతో వుండే పోలీస్ క్రైం థ్రిల్లర్ వేరు, మాఫియా లేదా ఇతర క్రిమినల్ చర్యలతో వుండే యాక్షన్ థ్రిల్లర్ వేరు. యాక్షన్ థ్రిల్లర్ లో ఎంతైనా హింస వుండొచ్చు. ఘోరంగా నరుక్కోవచ్చు, కాల్చుకోవచ్చు, పేల్చుకోవచ్చు, చీల్చుకుని చెండాడుకో వచ్చు, రక్తాలు పారిస్తూ అరుపులు అరుచుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెట్టి, పోలీస్ క్రైం థ్రిల్లర్ నీటుగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్. ఇందులో హింస మితిమీరితే అది ఇన్వెస్టిగేషన్ ని మింగేస్తుంది. అదికూడా యాక్షన్ థ్రిల్లరై పోతుంది తప్ప, క్రైం థ్రిల్లర్ అంటూ ట్రైలర్స్ వేసుకుని ప్రచారం చేసుకోవడానికుండదు. హింస ఎంత ఎక్కువైతే అంత తక్కువ క్రైం థ్రిల్లరవుతుంది. 

        ఈ సందర్భంగా ఒక హాలీవుడ్ రచయిత తను చేపట్టిన క్రైం థ్రిల్లర్ స్క్రిప్టు గురించి చెప్పుకొచ్చాడు...ఇందులో హంతకుడు 10 హత్యలు చేస్తాడు. రచయితగా తను ఈ 10 హత్యల్నీ చిత్రిస్తూ పోతే, కథ హింసాత్మకంగా మారిపోతుంది. అంటే కాస్సేపటికి ఈ చేస్తున్న హత్యలు బోరు కొట్టేస్తాయి కూడా ప్రేక్షకులకి. అందువల్ల తను ఇలా చేశాడు - హంతకుడు ఇప్పుడు కథలో మూడు హత్యలే చేసుకుపోతాడు. పోలీస్ డిటెక్టివ్ కి దర్యాప్తు క్రమంలో ఆ హంతకుడు గతంలో ఇంకో 7 హత్యలు చేశాడని తెలుస్తుంది. ఇలా 7 హత్యల్ని గతంలోకి సమాచార రూపంలో నెట్టేయడం వల్ల, లైవ్ గా చూపించే ప్రమాదం, బోరు తప్పాయి. 

        మర్డర్ తో సస్పెన్స్ వుండదంటాడు. మర్డర్ జరిగేందుకు అవకాశమున్న కిడ్నాప్ తో సస్పెన్స్ వుంటుందంటాడు. ప్రేక్షకుల్ని కథనుంచి ఎమోషనల్ గా దూరం చేయాలనుకుంటే, హత్య తర్వాత హత్య తర్వాత హత్య... హింసాత్మకంగా నింపెయ్యవచ్చంటాడు. ఎమోషన్ తోబాటు టెన్షన్ తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయాలనుకుంటే, హింస తగ్గించి, జరగబోయే హత్యగురించి ఉత్కంఠ పెంచాలంటాడు. అత్యంత భయపెట్టే సినిమాల్లో అతి తక్కువ హింస వుంటుందని గుర్తు చేస్తాడు. 

       
క్రైం థ్రిల్లర్ లో చంపడానికి
      ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేయాలి. మనిషి ప్రాణాలే చీప్ అన్నట్టు చంపుకుపోతే, చీప్ అయినదానికి ప్రేక్షకులు ఫీల్ కారు. ఆ చంపడాల్ని కూడా కేర్ చెయ్యరు. మర్డర్ సీన్లు మార్కెట్ యాస్పెక్ట్ లేక వేస్ట్ అయిపోతాయి. ‘ఈక్వలైజర్ 2’ అనే మాఫియా యాక్షన్లో, దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా, హత్యా దృశ్యాల్లో వాణ్ణి చంపవద్దంటూ మనం తల్లడిల్లేంత  ఎమోషన్ని రగిలిస్తాడు.

        ఇక టెక్నికల్ గా చెప్పుకుంటే, క్రైం థ్రిల్లర్ డార్క్ మూవీ కాదు. దీన్ని డార్క్ మూడ్ క్రియేట్ అయ్యేలా బ్లూ లేదా బ్రౌన్ టింట్ ఇస్తూ డార్క్ లైటింగ్ తో చిత్రించడం పొరపాటు. క్రైం థ్రిల్లర్ బీభత్స భయానక రసం కాదు. బీభత్స రసానికి దేవత మహాకాలుడు. మహాకాలుడు ముదురు నీలం. ఈ రంగు హార్రర్ కి, వయొలెంట్ మూవీస్ కి సరిపోతుంది. క్రైం థ్రిల్లర్ అద్భుత రసం. అద్భుత రసానికి దేవత బ్రహ్మ. బ్రహ్మ పసుపు వర్ణం. అద్భుత రసం వర్ణం పసుపు. కాబట్టి క్రైం థ్రిల్లర్ ని కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరించాల్సి వుంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలు అద్భుతరసంతో కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా, యూనివర్సల్ ఎంటర్ టైనర్లుగా వుంటున్నవి కాస్తా, ఇటీవల అతి హింసతో పిల్లలు చూడలేని విధంగా వుంటున్నాయని విమర్శలొస్తున్నాయి. ఇదే రసమో అర్ధంకాని వేషమైపోయింది. 


        క్రైం థ్రిల్లర్ అన్నాక ఇన్వెస్టిగేషన్ - ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ప్రేక్షకులు ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ అయి వుండి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్లవుతూ వుండి, ఇన్వెస్టిగేషన్ కే జేజేలు పలికేట్టు చేయడమే మేకర్ ప్రధాన కర్తవ్యం కావాలి. బయటికొచ్చిన ప్రేక్షకుడు - భలే వుంది ఇన్వెస్టిగేషన్ - అని ఛానెల్ మైకులో పబ్లిక్ టాక్ చెప్పేటట్టు వుండాలి. 

       ఇవన్నీ మిడిల్ కథనంలో- 
    పాటించవలసిన సంగతులు... క్రైం థ్రిల్లర్ కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ తో వుంటుందని చెప్పుకున్నాం. హంతకుడెవరో ప్రేక్షకులకి ఓపెన్ చేసి, తర్వాత పోలీస్ డిటెక్టివ్ హీరోకి హంతకుణ్ణి ఓపెన్ చేసి - ఇక వాడినెలా పట్టుకుంటాడన్న సస్పెన్స్ తో సీన్లు నడిపించడం. ఈ బాపతు థ్రిల్లర్ కాన్ఫ్లిక్ట్ ఎంత గాభరా పుట్టించేట్టు వుంటే అంత సక్సెస్ అవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ లో హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు పుట్టించాలి. ఈ కాన్ఫ్లిక్ట్ తెలిసి ప్రేక్షకులు బిక్కచచ్చిపోయి కుర్చీకి అతుక్కుపోవాలి. ఇందుకే క్రియేటివ్ పార్టు రాయడం అత్యంత కష్టమైన వ్యవహారమని గత వ్యాసంలో చెప్పుకున్నది. హంతకుడనే వాడు పోలీస్ డిటెక్టివ్ హీరోకి కి ముత్తాత అన్పించాలి. తను చేయబోయే మర్డర్ ప్రపంచం దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటుందని హంతక వెధవ అన్నాడనుకుందాం...లేదా - నీ బాడీ పార్టు లాగి నువ్వూహించని ట్విస్టు ఇస్తానని పోలీస్ డిటెక్టివ్ కి వార్నింగ్ ఇచ్చాడనుకుందాం, ఇలాటివి కాన్ఫ్లిక్ట్ ని టైం బాంబుగా మార్చేస్తాయి. 

        పోలీస్ డిటెక్టివ్ హీరోకి ఎలాగూ ఒక క్యారక్టరైజేషన్ ఇస్తారు. హంతకుడికి, అంటే విలన్ కి కూడా ఓ క్యారక్టరైజేషన్ ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు దృక్పథాల్నివ్వాలి. పోలీస్ డిటెక్టివ్ హీరోకి - నేరస్థులు నేరాలతో శాంతిభద్రతల సమస్య కాదు, పారిశుధ్య సమస్య సృష్టిస్తున్నారనీ, నేరాలు చేసి నేరస్థలాన్ని చంఢాలంగా వదిలేసి పోతున్నారనీ, ఆ వెధవల్ని పట్టుకుని ఆ రక్తం, ఆ చెత్త, ఆ కంపు తన్ని క్లీన్ చేయించాలన్న దృక్పథం ఇచ్చామనుకుందాం - అప్పుడు హంతకుణ్ణి అపరిశుభ్రత ఏమాత్రం సహించని, పరమ నీట్ నెస్ ని కోరుకునే నీటుగాడి దృక్పథంతో చూపిస్తే, కాన్ఫ్లిక్ట్ కి ఈ వ్యక్తిత్వాల వైరుధ్యం కూడా జతపడి ఇంకింత ఆసక్తి కల్గిస్తుంది.   

        కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్ లాక్ తో నడిపిస్తే ఇన్వెస్టిగేషన్ బతుకుతుంది. యాక్షన్ థ్రిల్లర్ ని టైం లాక్ తో చూపించ వచ్చు. లేదా 
 ‘మనసే మందిరం’ లాంటి ఫ్యామిలీ డ్రామాలో చూపించవచ్చు. 60 నిమిషాల్లో ఏదో జరగబోతోందని, ఆలోగా దాన్ని నివారించాలనీ, గడియారం ముల్లు చూపిస్తూ కథనాన్ని టెన్షన్ తో పరుగులు తీయించవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన క్రైం థ్రిల్లర్ లో ఇలా చేస్తే ఇన్వెస్టిగేషన్ కి చోటుండదు, యాక్షన్ ఆక్రమించేస్తుంది. జానర్ మర్యాద చెడుతుంది.

        
కౌంట్ డౌన్లూ, డెడ్ లైన్లూ- 
      అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషనంతా పూర్తయ్యాక క్లయిమాక్స్ లో పెట్టుకోవచ్చు. క్లయిమాక్స్ లో హంతకుడితో టైం లాక్ యాక్షన్ నడిపించవచ్చు. అసలు ఈ జానర్ కథకి టైం లాక్ అనేది లేకుండా, కాలపరిమితి లేని ఆప్షన్ లాక్ తో ఫ్రీగా వదిలేస్తేనే హాయి.  

     కరుణ, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ  మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.

        ఈ మిడిల్ విభాగంలో జరిగే బిజినెస్ ప్రకారం హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య వుండే యాక్షన్ - రియాక్షన్ల (సంఘర్షణ) కథనంలో హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే ఒకపని చెయ్యొచ్చు : 2500 ఏళ్ల క్రితం చైనీస్ సైనిక జనరల్, యుద్ధ వ్యూహ కర్త సుంజీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం, ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ ని పరిశీలించ వచ్చు. ఇందులో పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ మధ్య పోరాటంలో కావాల్సిన అనేక టిప్స్ దొరుకుతాయి. పీడీఎఫ్ లింక్ వ్యాసం చివర వుంది. ఆసక్తి వుంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   హంతకుడితో పోరాటంలో పోలీస్ డిటెక్టివ్ సమయానుకూలంగా పాసివ్ అవచ్చు (“He will win who knows when to fight and when not to fight.అంటాడు సుంజీ, The best way to fight is not to fight at all.అని కూడా అంటాడు. మనం మనకి తోచింది, వూహించి ఏవో అర్ధంలేని పోరాటాలు రాసేకన్నా, అసలు యుద్ధ కళేమిటో తెలుసుకుని చిత్రిస్తే బావుండొచ్చు). 

       స్క్రిప్టు రాయడం రోజుల్లో పూర్తయ్యే పనికాదు. కథలో ఎక్కడ దేనికి ఏది అవసరమో నిత్యం కథని ప్లాన్ చేసేప్పుడు గుర్తిస్తూ, ఆ మేరకు సమాచారం పొంది -రీసెర్చి చేసి, కథలో చిత్రణ చేసుకోవాలి. సినిమాలు చూసి మనకే అంతా తెలుసనీ రాసెయ్యకూడదు. ఆ సినిమాలు అలా తీయడానికి తెరవెనుక ఏం రీసెర్చి చేశారో, ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో ఎవరికి తెలుసు. డిస్కషన్స్ లో తేలిక భావం కన్పిస్తూంటుంది. కారణం ఇవ్వాళా అరచేతిలో ప్రపంచ సినిమాలన్నీ వుండడంతో - ఆ సినిమాల సీన్లు షాట్లు మనసులో ఫిక్స్ అయిపోయి, ఇతరులేంటి చెప్పేదని డిస్కషన్స్ ని బేఖాతరు చేస్తున్న సంస్కృతి కన్పిస్తోంది. చూసిన సినిమాల్లోంచి షాట్లు సీన్లు ఆ పళంగా తెచ్చి పెట్టుకోలేరు. అవి ఏ సందర్భంగా ఏ సన్నివేశానికి ఏ ఉద్దేశంతో సృష్టించారో తెలుసుకోకుండా కాపీ కొట్టుకోలేరు. నీ బిడ్డని నువ్వే పుట్టించగలవ్, ఇతరుల వీర్యదానంతో కాదు. 

        పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ- 
      మధ్య పోరాటంలో ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని  వీలైనంత సఫర్ చేయాలంటాడు హిచ్ కాక్. ఐతే పోలీస్ డిటెక్టివ్ పూర్తిగా సీరియస్ గా  వుండనవసరం లేదు. కథలో వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా నవ్వించాలి. ఫన్నీ పోలీస్ క్యారక్టరైనా ఫర్వాలేదు, ఒక పార్శ్వంలో హంతకుడి చేతిలో అతడి సఫరింగ్ ని చూపిస్తూనే. ఫన్నీ పోలీస్ క్యారక్టర్ కి పీటర్ సెల్లర్స్ నటించిన ‘పింక్ పాంథర్’ సిరీస్ సినిమాలు చూస్తే  ఒక ఐడియా వస్తుంది. ఈ సిరీస్ లో అతను తెలివితక్కువ ఇన్స్ పెక్టర్ జాక్స్ క్లూసో గా ఎంటర్ టైన్ చేస్తాడు. పోలీస్ డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో పోలీస్ పాత్రలా వుండ కూడదని ఎలా అనుకున్నామో, హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.  

        కథనంలో డైనమిక్స్ ముఖ్యం. ఒకటనుకుంటే ఇంకోటి జరగడం. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో బాంబుని నిర్వీర్యం చేయడానికి వెళ్ళారనుకుందాం. అప్పుడు బాంబుని నిర్వీర్యం చేస్తూంటే అకస్మాత్తుగా భూకంపం రావడం లాంటిది. అనూహ్య సంఘటనలతో కథనం చేస్తే చైతన్య వంతంగా వుంటుంది కథ.

        క్రైం థ్రిల్లర్ కథ నిర్వహించలేక పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. యాక్షన్ కూర్చోబెట్టే సస్పెన్స్ కాదు. అది పే ఆఫ్. సస్పెన్స్ సెటప్. ఆయా సీన్లలో సస్పెన్స్ ని సెటప్ చేసినప్పుడు, ఇప్పుడేం జరుగుతుందా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఆ సస్పెన్స్ కి ఇప్పుడేం జరగాలా అని ఆలోచించకుండా, రివర్స్ లో ఇంకేం జరిపించాలా అని ఆలోచించాలి. పైన చెప్పుకున్నట్టు, బాంబు తీసేయబోతే భూకంపం వచ్చినట్టు. 

        బేసిగ్గా చెప్పుకోవాలంటే, కథలనేవి సంఘటనలకి సమాచార రిపోర్టింగులు కావు. కథలనేవి మార్పుని చూపించేటివి. ఒక సిట్యుయేషన్, ఒక పాత్ర, లేదా పాత్రల మధ్య సంబంధాలు ఎలా మార్పుకి లొనయ్యాయో చూపించేవే కథలు. కనుక సస్పెన్స్ కథనం మార్పు ని దృష్టిలో పెట్టుకుని సాగాలి. అప్పుడే కథ డైనమిక్ గా వస్తుంది. 

        మామూలుగా కథనమంటే ఏమిటి - 
    ఒక సీన్లో ఒక ప్రశ్న విసిరి, ఇంకో సీన్లో దానికి జవాబు చెప్పడమేగా? ప్రశ్నలు జవాబులేగా కథనమంటే? ప్రతీ సీనూ ప్రేక్షకులకి చేస్తున్న ఒక వాగ్దానం కావాలి. హీరోయిన్ అందాల్ని తెరనిండా చూపిస్తూంటే, ఇది దేనికో లీడ్ కావాలి తప్ప, కేవలం యూత్ అప్పీల్ కోసమని వృధా చేయకూడదు. ఈ జానర్లో ప్రతీ సీనూ ఆడిటింగ్ జరుగుతుంది. ప్రతీ సీనూ సస్పెన్స్ కి లింకై వుంటుంది. వృధాగా వుండదు. 

        ఇక ఇంటర్వెల్, క్లయిమాక్సులు. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివా - హంతకుడా -ఎవరు ట్విస్ట్ ఇవ్వాలి? ఇలాటి జానర్ కథలో పరీక్షకి గురయ్యేది పోలీస్ డిటెక్టివ్, పరీక్షపెట్టేది హంతకుడు. పోలీస్ డిటెక్టివ్ స్కిల్స్ కి పరీక్ష. ఇలాటి కథని పోలీస్ యంత్రాంగపు పనితీరుకి మోడల్ గా చూపిస్తాం. హంతకుల పనితీరుకి మోడల్ గా హంతకులకి చూపించం. అందుకని ప్రేక్షకులు పోలీస్ డిటెక్టివ్ హీరోనే ఫాలో అయ్యేలా పరీక్షలన్నీ అతడికే వుంటాయి. ఇంటర్వెల్లో అతనే పెద్ద దెబ్బ తింటాడు హంతకుడి చేతిలో. క్లయిమాక్స్ లో పోలీస్ డిటెక్టివ్ హీరో దెబ్బకి, హంతకుడు పుంజాలు తెంపుకుని పారిపోతూ వుంటాడు, దట్సాల్.

        ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ లోలాగా పెద్ద హీరోలు చెయ్యరు. చిన్న హీరోల మీద ఆధారపడాలి. చిన్న హీరోలతో ఈ జానర్ కి మైలేజీ సంబంధమైన లోటు లుంటాయి. దీన్ని క్రియేటివ్ యాస్పెక్ట్ ని మరికొంత విస్తరించుకుని సరిచేసుకోవాలి. ప్రేక్షకులు సినిమా సాంతం అదే చిన్న హీరో మొహం, అదే హంతకుడి మొహం చూస్తూ కూర్చోలేరన్పిస్తే, క్లయిమాక్స్ లో ఈలలు పడేలా ఇంకో పెద్ద నోటెడ్ విలన్ ఆర్టిస్టుని అదనంగా దిగుమతి చేసుకోవాలి. లేదా ఇతర సీన్లలో బడ్జెట్ మిగుల్చుకుని క్లయిమాక్స్ లో బిగ్ యాక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఇలాటి క్రియేటివ్ యాస్పెక్టులు అన్వేషించుకోవాలి. క్రియేటివ్ స్టేజి అంటే ఒకసారి రాసేసేది కాదు. రాస్తూ రాస్తూ రాస్తూ తిరగ రాస్తూ గీస్తూ పూస్తూ వుండేది. 


   ఈ జానర్ కథ పది నిమిషాల్లో వినిపించడాని కుండదు. పది నిమిషాల్లో ప్రేమ కథనో, యాక్షన్ కథనో విన్పించ వచ్చు. ఇలాటి ఇన్వెస్టిగేషన్ ఆధారిత క్రైం థ్రిల్లర్ విన్పించాలంటే పది నిమిషాల్లో విషయమేమీ వుండదు. కనీసం అరగంటైనా పడుతుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఏదో పదం వాడేస్తూంటారు కదా, అలాటి స్క్రీ ప్లే బేస్డ్ జాతికి చెందుతుంది ఈ క్రైం థ్రిల్లర్ గొడవ. అంటే కథనం చెప్పుకుంటూ పోతే తప్ప అర్ధమవడం కష్టమన్న మాట. ఈ కథనాన్ని అరగంట లోపు కుదించడం సాధ్యం కాదు. ఒక అసోసియేట్ వున్నాడు. రెండేళ్ళుగా ఇలాటి కథని విన్పించీ విన్పించీ - వెనుక నుంచి ముందుకూ, ముందు నుంచి వెనక్కీ, ఎలాపడితే అలా - ఎప్పుడు పడీ అప్పుడు - ఎంత సేపంటే అంత సేపూ -విన్పించే స్థితి కొచ్చాడు. 

        కథ రాసేశాక క్రాస్ చెకింగ్ చేసుకోకుండా హీరోకో నిర్మాతకో విన్పించ కూడదు. ఒకవేళ అది లోపరహితంగా వుండి ఓకే అయితే ఫర్వాలేదు. లోపాలుంటే మాత్రం ఇరుక్కుని పోతారు. వాళ్ళు ఓకే చేశాక క్రాస్ చెకింగ్ మొదలు పెట్టుకుంటే, అప్పుడు లోపాలు బయట పెడితే, వాటిని మార్చడానికి వాళ్ళు అంగీకరించక పోతే (అవి లోపాలని తెలీక), ఇంకేం చెయ్యడానికి వీలుండదు. కాబట్టి ముందే క్రాస్ చెకింగ్ చేయించుకుని, పూర్తి సంతృప్తి కలిగాకే విన్పించాలి.   

(ఐపోయింది) 
సికిందర్
The Art Of War, pdf

18, మార్చి 2019, సోమవారం

799 : సందేహాలు - సమాధానాలు



Q : 118’ సస్పెన్స్ థ్రిల్లర్  స్ర్కీన్ ప్లే సంగతులు  రాస్తారా? ఈ మధ్య మీరు తెలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటిని అసలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాల పరిస్థితి బాగా లేదు కదా? అవి తీస్తున్న కొత్తవాళ్ళ కోసమైనా చిన్న సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రాయవచ్చు కదా?
పేర్లు వెల్లడించ వద్దన్న దర్శకుడు, రచయితతో బాటు, సంజీవ్ అసిస్టెంట్ డైరెక్టర్
A : 118, బద్లా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని థియేటర్లో చూసి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం సాధ్యం కాదు. ఇవి డైలాగ్ కనెక్షన్స్ తో, ఎన్నో క్లూస్ కనెక్షన్స్ తో, వాటి లాజికల్ డ్రైవ్ తో సాగిపోయే ఇన్వెస్టిగేషన్ కథలు. వీటిని చాలా సార్లు ఆపి చూస్తూ రాయాలి. అందుకని ‘118’ అమెజాన్ లో విడుదలయ్యాక రాద్దాం. ఇక తెలుగు సినిమాలకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదనే విషయం. రాయడానికి వీటిలో కొత్త విషయాలుండడం లేదు. అవే టెంప్లెట్ సినిమాలు, అవే కథలు. ఇంకా పాత సినిమాలు బెటర్. నేర్చుకోవాల్సిందంతా వీటిలోనే వుందన్పిస్తోంది. దొంగ రాముడు, మనసే మందిరం, వివాహ బంధం...నాటి దర్శకులు, రచయితలూ నేర్చుకోవడానికి భావితరాల కిచ్చినట్టు, నేటి కథ - మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం అన్నీ తామే అయి కూడా మేకర్లు ఏమిస్తున్నారు. వాళ్ళే ఒకర్నొకరు అనుకరిస్తూ టెంప్లెట్ సినిమాలే తీస్తున్నారు. వీళ్ళని ఫాలో అయ్యే అసిస్టెంట్లు వీళ్ళనుంచి కొత్తగా ఏం నేర్చుకుంటారు. 

          గత Q&A లో సీన్ ఎలా రాయాలో ‘జస్టిస్ చౌదరి’ ఉదాహరణగా విశ్లేషిస్తే విశేష స్పందన వచ్చింది. ఎన్నడూ లేనన్ని రికార్డు స్థాయి హిట్స్ వచ్చాయి. వందల్లో వుండే హిట్స్, ఆ రోజు వేలల్లో వచ్చాయి. ఎందరో సీన్ ఎలా రాయాలో ఇప్పుడు తమకు కొత్తగా తెలిసిందని ఎక్సైట్ అయ్యారు. నిజానికి సీన్ స్ట్రక్చర్ కి ఉదాహరణ కోసం ఇప్పటి సినిమాలేమున్నాయని చూస్తే కన్పించలేదు. పాత సినిమాల్లోకి వెళ్లి చూస్తే,  చూసిన మొట్ట మొదటి ‘జస్టిస్ చౌదరి’ లోనే కన్పించింది. కానీ పాత సినిమా ఉదాహరణ ఇస్తే కొత్త జనరేషన్ కేం నచ్చుతుందని కూడా అన్పించింది. అయినా తప్పక రాయాల్సి వచ్చింది. దీనికే కొత్త జనరేషన్ ఎక్సైటయి పోయారు. తీసుసుకోవాల్సింది పాత సినిమాల్లో వుంటే తీసు కోవడానికి అభ్యంతరం లేదన్న మాట!  

          కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే సవాలక్ష లోపాలుంటున్నాయి. తీస్తున్న సినిమాలు 90 శాతం అట్టర్ ఫ్లాపులు. ఎందుకు ఫ్లాపయ్యాయో వీటి లోపాలు రాయడమే పనిగా మారింది. దీనికంటే అర్ధవంతమైన సినిమాలకి -  అవి పాతవైనా - రాయడం బెటరన్పిస్తోంది. ఓ సినిమా ఫ్లాపయితే ఎందుకు ఫ్లాపయ్యిందో మేం తెలుసుకోవాలి కదా, ఇది తెలుసుకోవడానికి బ్లాగుని విజిట్ చేస్తున్నాం కదా అనే వాళ్ళూ వున్నారు. తప్పదంటే అప్పుడప్పుడు ఈ పని కూడా చేద్దాం. అసలే ఫ్లాపయిన సినిమాలని వదిలెయ్యక, ఇంకా తప్పులు రాసి పీడించడం ఎందుకనే పాయింటు కూడా ఒకటుంది. 

          ఇక వారంవారం విడుదలై వెళ్లి పోతున్న చిన్న చిన్న సినిమాల సంగతి. వీటిలో కొన్నిటికి రివ్యూలు రాస్తూనే వున్నాం. స్క్రీన్ ప్లే సంగతులంటే వాటి స్థాయికి ఎక్కువ. మీరడిగారు కాబట్టి ఒకటి రెండు రాసి చూద్దాం. అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందా? ఏమీ రాదు. ఈ చిన్న నిర్మాతలు, దర్శకులు ఇకంతే! 

Q : ‘కథ ఎలా చెప్పాలన్న దానికి మీరిచ్చిన వ్యాసం అద్భుతంగా వుంది. మా లాంటి వాళ్ళెందరికో ఉపయోగపడుతుంది. అయితే మల్టీ స్టారర్ కథ ఎలా చెప్పాలో వివరించలేదు.
శ్రీను ఆర్, అసిస్టెంట్ డైరెక్టర్ 
A :   మల్టీ స్టారర్ తీసే స్థాయికి వెళ్ళేటప్పటికి కథలు చెప్పడం ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పట్నుంచే ఎందుకు. ఇప్పుడేం తీసే అవకాశాలొస్తాయో అంతవరకూ తెలుసుకుంటే చాలు. ఐతే చిన్న హీరోలు ఇద్దరు ముగ్గుర్ని కలిపి తీసే ‘మినీ స్టారర్స్’ అవకాశముండొచ్చు. వీటికి కథలో ప్రధానపాత్రని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. ‘హేపీడేస్’ లో నల్గురు హీరోలున్నా అది వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రగా నడిచే కథే. కనుక ముందు ఆ మెయిన్ హీరోకి చెప్పాలి. చెప్పేటప్పుడు అతనే ప్రధాన పాత్రగా త్రీ పిల్లర్స్ ఆధారంగా చెప్పాలి, మిగిలిన హీరోల పాత్రల్ని కూడా కలిపి. మిగిలిన హీరోలకి చెప్పినప్పుడు ఫలానా అతను మెయిన్ హీరో, మీమీ క్యారెక్టర్స్ ఇవీ అని చెప్పొచ్చు. కథ గురించి అయిడియా ఇస్తే సరిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ అయితే ఎవరికీ కథ కూడా చెప్పరు. నీ క్యారెక్టర్ ఇదీ, నీ క్యారెక్టర్ ఇదీ...వచ్చి చేసుకోండని చెప్పేస్తారు. 

Q :  నేనొక స్క్రిప్టు రాశాను. ఎవర్ని అడిగినా తీసుకోవడం లేదు. ఇంకా రాయాల్సిన అయిడియాలున్నాయి. కానీ చూస్తే ఎవరూ తీసుకోని పరిస్థితి వుంది. నేను రైటర్ గా ఎలా ముందు కెళ్ళాలి?
జే ఎం ఆర్ రచయిత
A :   అది కిందటి శతాబ్దం సంగతి. ఈ శతాబ్దంలో స్క్రిప్టు రాసుకుంటే దర్శకుడు అయిపోవడమే. ఇతరుల స్క్రిప్టుతో దర్శకత్వం వహించాడనికెవరూ సిద్ధంగా లేరు. ఎవరి స్క్రిప్టు వాళ్ళదే. కాబట్టి రాసుకుంటే తీసుకోవడమే. లేదంటే దర్శకుల దగ్గర రైటర్ గా చేరడమే. ఇండిపెండెంట్ రైటర్ కాన్సెప్ట్ ఇక లేదు. ఐతే గియితే పెద్ద సినిమాలకి డైలాగు రచయితలవుతారేమో. డైలాగ్ రైటర్ గా కృషి చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. 
సికిందర్



17, మార్చి 2019, ఆదివారం

798 : ‘పాలపిట్ట’ తాజా ఆర్టికల్, విస్మృత సినిమాలు - 5


      ఒకప్పుడు బెంగాలీ సినిమాలు, సాహిత్యం విరివిగా తెలుగు సినిమాలకి ఆధారమయ్యాయి. 1950 లలో తెలుగు నిర్మాతలు, దర్శకులు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు.  తెలుగు, ఆంగ్ల, బెంగాలీ భాషల నవలలు, కథలు, నాటకాలూ తెలుగు సినిమాలుగా తెరకెక్కించే కొత్త సృజనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీనికి బీజం 1945 లో బిఎన్ రెడ్డి వేశారు. జీన్ ఫిలిప్ రామ్యూ రాసిన 18 వ శతాబ్దపు ‘పిగ్మాలియన్’ అనే ఆంగ్ల నాటకాన్ని భానుమతి - నాగయ్యలతో ‘స్వర్గ సీమ’ గా తీశారు. తర్వాత 1949 లో షేక్స్ పియర్ నాటకం ‘కింగ్ లియర్’  ఆధారంగా శివరావు కస్తూరి, శ్రీరంజని లతో కెవి రెడ్డి ‘గుణసుందరి కథ’ తీశారు. 1950 లలో ఇవి ఒక ఒరవడికి నాంది అయ్యాయి. ఆంగ్ల సాహిత్యంతో  పడిన అడుగు తెలుగు, బెంగాలీ సాహిత్యాలకీ బాట వేసింది. ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం తెలుగు సినిమాలకి కొత్త వ్యాపార వస్తువుగా దొరికింది.  దేవదాసు, అర్ధాంగి, చరణడాసి వంటి విజయవంతమైన సినిమాలుగా తీశారు. 

         
దిలా వుండగా, బెంగాలీ సినిమాలని  రీమేక్ చేసే ఇంకో ఒరవడి కూడా ప్రారంభించారు. దేవాంతకుడు, చివరకు మిగిలేది, వివాహబంధం మొదలైనవి. ఇలా 1980 ల వరకూ అడపాదడపా  బెంగాలీ సినిమాలని రీమేక్ చేస్తూ వచ్చినా  ఏదీ విజయం సాధించలేదు – 1977 లో ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన  ‘ఎదురీత’ తప్ప. 1964 లో తీసిన ‘వివాహబంధం’ అపజయం పాలవడానికి కారణం, తెలుగులో కొచ్చేటప్పటికి ఆ కాలానికి కథాకథనాలు పాతవై పోవడం కావొచ్చు. 

          1960 లనుంచి తెలుగు సినిమాల్లో కమర్షియల్ విలువలతో వ్యాపార యుగం ప్రారంభమయ్యింది. నటనలు, పాటలు, కథాకథనాలూ వేగం పుంజుకున్నాయి. 1964 లో ‘వివాహబంధం’ విడుదలయ్యే నాటికి  గుండమ్మ కథ, రాముడు -భీముడు, మూగమనసులు, మంచి మనసులు, ఆరాధన, దాగుడు మూతలు, మంచి మనిషి వంటి కమర్షియల్ వినోదాత్మక సాంఘికాలెన్నో ప్రేక్షకులకి కొత్త రుచులు పంచి పెట్టాయి. ఇలాంటప్పుడు చివరకు మిగిలేది, మనసే మందిరం, వివాహబంధం లాంటి విషాదగాథలు ఎందరికి నచ్చుతాయి.  

          ఇంత మాత్రాన ‘వివాహబంధం’ మంచి సినిమా కాదా అంటే మంచి సినిమానే. లేకపోతే  భానుమతి ఎందుకు నటించి, నిర్మిస్తారు. బెంగాలీలో హిట్టయిన ‘సాత్ పాకే బంధా’ కి రీమేక్. ఆశుతోష్ ముఖోపధ్యాయ్ రాసిన నవల ఆధారం. ఈయన ఇంకో నవల ఆధారంగా బెంగాలీలో తయారైన ‘దీప్ జ్వెలే జాయ్’ ని తెలుగులో ‘చివరకు మిగిలేది’ గా రీమేక్ చేశారు. తెలుగులో ‘వివాహబంధం’ గా రీమేక్ చేసిన  ‘సాత్ పాకే బంధా’,  1974 లో హిందీలో విజయానంద్, జయాబాధురీలతో ‘కోరాకాగజ్’ గా రీమేక్ చేశారు. ఇది పెద్ద హిట్టయ్యింది.  

          ‘వివాహబంధం’ ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పిఎస్ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, భానుమతీ రామకృష్ణ, చిత్తూరు వి నాగయ్య, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, వాసంతి తదితరులు నటించారు. ఎంబి శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం అన్నయ్య,  మాటలు అట్లూరి పిచ్చేశ్వర్రావు, పాటలు సి నారాయణ రెడ్డి. 

          పెళ్ళంటూ చేసుకున్నాక  ఏవో వెలుపలి కారణాలు చీలికలు తెస్తే చిట్లి పోయేంత బలహీనమైనదా ఆ బంధం?  మరెందుకు విడిపోతారు ? దీనికి జవాబులు  వెతుకుదాం...

          చంద్రశేఖర్ (ఎన్టీ రామారావు) ఓ మూడొందల జీతంతో లెక్చరర్. అదే కాలేజీలో అప్పారావు (చిత్తూరు వి నాగయ్య) ప్రిన్సిపాల్. చంద్రశేఖర్ కి చిన్నప్పట్నుంచీ పెంచిన పిన్ని (హేమలత) వుంటుంది. మధ్యతరగతి జీవితం. అప్పారావుకి మాణిక్యాంబ (సూర్యకాంతం) అనే భార్య, భారతి (భానుమతి), అరుణ (వాసంతి) అనే ఇద్దరు కుమార్తెలు, రఘు (ప్రభాకర రెడ్డి)  అనే కుమారుడూ వుంటారు. సోదరుడి కుమారుడు కాంతారావు (పద్మనాభం) పడి వేలాడుతూ వుంటాడు. అప్పారావుది సంపన్న కుటుంబం. కానీ డొక్కు కారు వుంటుంది.

          ఓ రోజు ఆ  కారెక్కకుండా బస్సులో వస్తూంటే చంద్రశేఖర్ పరిచయమవుతాడు భారతికి. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అప్పారావుకి తెలిసి సంతోషిస్తాడు. భార్యకి చెప్తే ఆమె ఇంతెత్తున లేస్తుంది. అతడి అంతస్తేమిటని ప్రశ్నిస్తుంది. తమ హోదాకి తగ్గ సంబంధమే చేయాలంటుంది. వినకుండా పెళ్లి చేసేస్తాడు అప్పారావు. ఇది మనసులో పెట్టుకుంటుంది మాణిక్యాంబ. 

          చంద్రశేఖర్ భార్యగా సామాన్య ఇంట్లోకి ప్రవేశిస్తుంది భారతి. పిన్నితో కూడా కలిసిపోయి సుఖంగా వుంటుంది. యాత్రలకి వెళ్ళొస్తారు. వస్తూ చాలా బహుమతులు తెస్తారు. దీంతో మండిపడుతుంది మాణిక్యాంబ. మూడొందల జీతగాడు అల్లుడు ఇవన్నీ తెచ్చి పంచడం భరించలేక పోతుంది. కించపరుస్తూనే మెత్తగా పొదుపు గురించి బోధిస్తుంది. “ఇవన్నీ ఎందుకు? చేతిలో డబ్బుంటే మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంది. నువ్వైనా పట్టించుకోక పోతే ఎలా? ఆదాయాన్ని బట్టి ఖర్చుపెట్టుకోవాలి” అంటుంది. “ఆదాయం తక్కువైనంత మాత్రానా ఆప్యాయతలు తగ్గుతాయా?”  అంటాడు. “ఎందుకు తగ్గుతాయి, ఇల్లుమాత్రం గుల్లవుతుంది” అంటుంది. సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. 

           
ఇలా ఆమెకెంత ఆత్మాభిమానమో, అతడికీ అంతే ఆత్మాభిమానం. దీంతో ఆమె అంటే ఇక కూల్చలేని అడ్డుగోడ కట్టుకుని, నత్త గుల్లలా ముడుచుకు పోతాడు.

          ఆమె ఏం చేసినా పుండు మీద కారం జల్లినట్టే వుంటుంది.  ఏదో వొక వంకతో అతన్నీ, కూతుర్నీ పిలిపించుకుంటూ వుంటుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బంధు వులొచ్చారని పిలిస్తే వెళ్తాడు భారతిని తీసుకుని. ఆ బంధువు - ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు రాసిన పుస్తకానికి పతకం వచ్చిందటగా? ప్రమోషన్ కూడా వచ్చిందట? – అంటూంటే చంద్రశేఖర్ కి తర్వాత అర్ధమవుతుంది, అత్తగారే ప్రతిష్ట కోసం అల్లుణ్ణి ఇలా గొప్పగా చిత్రించుకుందని. దీంతో మరింత అవమానం ఫీలయ్యి వెళ్ళిపోతాడు. ఎంత సేపూ తనది దిగువ స్థాయి అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరుని నిరసించడం మొదలెడతాడు.   

          ఆమె వూరుకోదు. కూతురితో ఫోన్లో మాట్లాడుకోవాలని ఇంటి ముందు టెలిఫోన్ స్థంభం పెట్టించి కనెక్షన్ ఇప్పిస్తుంది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం పతాక స్థాయికి చేరుతుంది. భారతీనే నానా మాటలంటాడు. భారతి తల్లిని నానా మాటలంటుంది. మాణిక్యాంబ ఇంకింత రెచ్చిపోయి – “ముష్టి మూడొందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా? నూతిలో కప్పలా ఎంత కాలం బతుకుతాడు? శ్రమపడాలి, పైకి రావాలి!”  అని క్లాసు పీకేస్తుంది. ఇంకోసారి అల్లుడితోనే  నేరుగా అనేస్తుంది – “ఫలానా వారి అల్లుడు అన్పించుకోవడం కాదు గొప్ప. ఫలానా వారి అత్తగారు వస్తే నేను గర్వ పడేలా వుండాలి నీ హోదా, అదీ గొప్పంటే!”  అని. 

         
ఇలా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యా నలిగిపోతూంటుంది భారతి. అత్తాఅల్లుళ్ళ ఆత్మాభిమానాల సమస్య కాస్తా, భార్యా భర్తల మధ్య సూటిపోటి మాటల వాగ్యుద్ధంగా మారిపోయి విడిపోతారు.

ఎవరి కథ?
        నందమూరి తారక రామారావు కొత్త గెటప్ లో కనిపిస్తారు. ఈ గెటప్ తో పాత్ర వయసుకి మించిన రూపంలో కన్పిస్తారు. ధోవతీ కుర్తా వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, బరువు కూడా పెరిగి పెద్ద మనిషిలా వుంటారు. యూత్ అప్పీల్ లేని ఈ గెటప్ మనకి ఇబ్బందిగానే వుంటుంది. ఇది బెంగాలీ ఒరిజినల్ లోని బెంగాలీ బాబు గెటప్పే. పదేళ్ళ తర్వాత తీసిన హిందీ ‘కోరా కాగజ్’ లో లెక్చరర్ పాత్ర ప్రొఫెసర్ పాత్రగా మారి, ఆధునిక దుస్తుల్లో యూత్ అప్పీల్ తో వుంటాడు విజయానంద్.

          ఎన్టీఆర్ పాత్ర స్వభావం నెగెటివ్ గానే వుంటుంది. ఇలాటి మనుషులుంటారు. నిజానికి ఆత్మాభిమానం నెగెటివ్ లక్షణం కాదు. కానీ పాత్ర స్వభావం పైన చూస్తే ఆత్మాభిమానం, లోన చూస్తే సంకుచితత్వం అన్నట్టుంటుంది. ఆయన సూర్యకాంతంతో రియాక్ట్ అయ్యేది ఫక్తు ఆత్మాభిమానంతోనే. కానీ జీవించేది మాత్రం ఆత్మాభిమానంతో కాదు. సంకుచితత్వంతో, మార్పు కోరని అదే నూతిలో కప్ప జీవితం. ఈ నూతిలో కప్ప జీవితపు ఛాయలు ఆయన మోహంలో ప్రకటిస్తూంటారు. ఆ మోహంలో సంతోషం వుండదు, సుఖం వుండదు. ఆశలుండవు, ఆశయాలుండవు. బెంగాలీ రచయిత భలే పాత్రని సృష్టించాడు. మాటంటే ఆత్మాభిమానం తన్నుకొస్తుంది, చూస్తే ఆ ఆత్మాభిమానంతో మానసికంగా, ఆర్ధికంగా ఎదిగేది లేదు. 

          సూర్యకాంతం గయ్యాళి అత్తేంకాదు, ఆర్ధికం నేర్చిన వ్యవహార్త. ఎదుటి వాళ్ళు కూడా పైకి రావాలనే ఆమె గొడవ. అయితే నోటి దూలవల్ల చెడగొట్టుకుంటుంది. “నా ఇల్లు బంగారం గానూ”  అనేది ఆమె ఊతపదం. చివరికి విసిగిపోయిన కూతురు, “నీ ఇల్లు బంగారం కాదు. అంతస్తుల్ని గురించి, అభిమానాల్ని గురించీ నీ అభిప్రాయాలు మారనంత వరకూ నీ ఇల్లు బంగారం కాదు!” అని అరుపులు అరిస్తేగానీ కళ్ళు తెరవదు. 

          సూర్యకాంతం ఓ విధంగా ‘విలన్’ పాత్రే అయినా విలన్ పాత్రలా అన్పించదు. ఆమెతో  ఈ పాత్రలో మంచితనమే కన్పిస్తుంది. ఈ పాత్రని ఎంజాయ్ చేయగలమే తప్ప ద్వేషించలేం. ఆమె డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ డెలివరీలో సెలయేటి ప్రవాహంలా సాగిపోయే భాష గానీ ఇప్పటి సినిమాల్లో చూడం.

          ఇక తల్లికీ భర్తకీ మధ్య నలిగిపోయే పాత్రలో భానుమతి రానురాను పాత్ర డెప్త్ పెరుగుతున్నకొద్దీ దృష్టిని తన మీదికి తిప్పుకుంటుంది. సెంట్రల్ పాత్ర తనదే అయిపోవడం వల్ల. నిజానికి ఒరిజినల్ బెంగాలీ గానీ,  హిందీ రిమేక్ గానీ,  హీరో కథగా వుండవు. హీరోయిన్ కథగానే వుంటాయి. కథా ప్రారంభం కూడా హీరోయిన్ తోనే వుంటుంది. బెంగాలీలో సుచిత్రా సేన్ గానీ, హిందీలో జయబాధురీ గానీ గతాన్ని తలచుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అంటే భర్త నుంచి విడిపోయి దూరంగా టీచర్ గా జీవిస్తున్నప్పుడు, గతం గుర్తు కొచ్చి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మొదట్నుంచీ కథ. 

          తెలుగులో భానుమతితో ఇలా వుండదు. నేరుగా బస్సు ప్రయాణంలో ఎన్టీఅర్ పరిచయంతో వర్తమానంలో ప్రేమ కథగా మొదలవుతుంది. ఇందుకే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర ఇటు భానుమతి కాకుండా, అటు ఎన్టీఆర్ కాకుండా అయోమయంగా  వుంటుంది కథని ఫాలో అవడానికి.  
          సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండి, ఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే  ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడు, ఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు.

 
         బెంగాలీ వొరిజినల్ ని  హీరోయిన్ కథగానే తీశారు, హీరో కథ కాదు. దీన్ని మార్చకుండా హిందీ లోనూ హీరోయిన్ కథగానే తీశారు. హీరోయిన్ కథ కాబట్టి బెంగాలీలో అప్పటి పాపులర్ హీరోయిన్ సుచిత్రా సేన్ ని ఈ పాత్రకి ఎన్నుకున్నారు. హీరో పాత్రలో చిన్న హీరోని పెట్టుకున్నారు. హిందీలో కూడా అప్పటికి పాపులరైన జయబాధురీని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోగా అంతగా తెలియని విజయానంద్ ని తీసుకున్నారు. ఇలా పాత్రల్ని బట్టి, కథని బట్టి, ఆర్టిస్టుల్ని బ్యాలెన్స్ చేశారు. 

          తెలుగులో ఇలా చేయలేదు. ఎన్టీఆర్, భానుమతి హేమాహేమీల కాంబినేషన్ గా  చేశారు. చేసినప్పుడు కథ ప్రకారం భానుమతిని ప్రధాన పాత్ర చేయలేక, ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రగా చేయడానికి కథని మార్చలేక రెండు పాత్రల కథ అన్నట్టు చేశారు. దీంతో ఓ ప్రధాన పాత్ర, అది  ఎదుర్కొనే సమస్య, దాని దృష్టి కోణం, ఆ దృష్టి కోణంలో ఫ్లాష్ బ్యాక్ తో కథా ప్రారంభమూ  అనే అర్ధవంతమైన కథా ప్రక్రియ చెదిరిపోయింది. హిందీ, బెంగాలీల్లో ప్రధాన పాత్రగా హీరోయిన్ ని ప్రవేశ పెడుతూ చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఆమె తోనే కనీసం పదిహేను నిముషాలు టీచర్ అని పరిచయం చేసి దృశ్యాలు నడిపించారు. ఈ దృశ్యాల్లో ఈమె ఎవరు? ఎందుకు వొంటరిగా వచ్చి ఈ వూళ్ళో వుంటోంది? ఏం జరిగిందీమెకి?  అన్న ప్రశ్నలెన్నో మనల్ని వేధించేట్టు చేసి, ఆసక్తిని పెంచారు.  

          ఐతే భానుమతి ఈ పాత్ర ప్రయాణంలో ఆయా ఘట్టాల్ని అర్ధవంతంగా నటించింది. భర్తకి ఎదురుతిరిగే సన్నివేశం, తర్వాత తల్లికి ఎదురు తిరిగే సన్నివేశం, చివరికి ఆత్మత్యాగం చేసుకోబోయే సన్నివేశం - కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా - ఆమె
నటనని ఆకాశానికంటించింది. 

          తండ్రి పాత్రలో నాగయ్యకి  భార్యని కాదని కూతురి పెళ్ళిచేయడం వరకే  ప్రాధాన్యం. ఆ తర్వాత ఎందులోనూ జోక్యం చేసుకోడు, కష్టాల్లో వున్న కూతురికి సానుభూతి వ్యక్తం చేస్తూ వుండడం తప్ప. కొడుకు పాత్రలో ప్రభాకర రెడ్డికి తల్లికిలాగే అహం ఎక్కువ. చెల్లెలి చేత విడాకుల పత్రాలమీద సంతకం చేయించుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చెయ్యడు. కుటుంబంలో ఆడపిల్లకి సమస్య వస్తే మగవాళ్ళయిన తండ్రీ కొడుకులు ఇలా వుండడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది మనకి. ఏ వైఖరీ తీసుకోలేక కిమ్మనకుండా వుంటారు. 

          ‘మాతం - గి మణిపూర్’ అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలితో కూడా. ఎవరి తోనూ సంఘర్షించరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. ‘వివాహబంధం’ లోనే కాదు, చాలా కుటుంబ సినిమాల్లో కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా వుంటూ వస్తోంది. 

          ఇందులో పద్మనాభం కామెడీ కూడా ఆర్ధిక పరమైనదే. డబ్బు సంపాదించడానికి పూటకో ఆలోచన చేస్తాడు, ఏదీ అమలు చేయక పక్క పాత్రకి నరకం చూపిస్తూంటాడు. “ఈ రోజుల్లో లక్ష అంటే ఎంత? ఆఫ్టరాల్  రెండక్షరాలు” వంటి డైలాగులు పేలుస్తూంటాడు. 

భానుమతి పాత్రకే బలం, స్పష్టత 
     ఈ వివాహబంధపు కథ పూర్తిగా ఆర్ధికం మీద ఆధారపడింది. ఆర్ధిక ఎదుగుదల కోసం అల్లుణ్ణి  అత్త వేధించడమే ఈ డబ్బు చుట్టూ సంబంధాల కథ. అయితే ఒక అనుమానం రాకమానదు. అన్ని గొప్పలు పోయే సంపన్నురాలైన, ఆత్మాభిమానం గల అత్తగారు, కట్నం ఏమీ ఇవ్వలేదా? అల్లుడు తీసుకోలేదా? సంబంధం అనుకున్నాక వెంటనే పెళ్లి సీను చూపించేశారు తప్ప కట్నం, పెట్టిపోతలు వగైరా ఆ సంబంధమైన వ్యవహారమేమీ మాట్లాడుకున్నట్టు సీను వేయలేదు. బెంగాలీ, హిందీల్లో కూడా ఇలాగే వుంటుంది. ఈ స్పష్టత లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత పాత్రల ప్రవర్తన ఒక పజిల్ లా వుంటుంది. 

          సూర్యకాంతంకి కూతుర్ని సామాన్యుడి కివ్వడం అస్సలు ఇష్టం లేదు. “నేనూ ఒకప్పుడు లెక్చరర్నే కదా, ఏం తక్కువైంది?” అని నాగయ్య అంటే, “ఏం తక్కువైందో నాకు తెల్సు. ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి నేను పడ్డ పాట్లు నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెల్సు. నా బిడ్డకి కూడా ఎందుకు కష్టాలూ?” అంటుంది సూర్యకాంతం. 

          అలాటిది కూతుర్ని వైభవంగా అత్తారింటికి పంపినట్టు కన్పించదు. పంపాక కూతురు సుఖపడాలని సౌకర్యాలు కల్పించే పనిలో పడుతుంది. హిందీలో ఫ్రిజ్ కూడా పంపిస్తుంది అత్తగారు. సూర్యకాంతం అల్లుడికి పుండు మీద కారం జల్లుతున్నట్టు వాయిదాల పద్ధతిలో ఒకటొకటీ సౌకర్యాలు కల్పిస్తుంది. “నేను ఆదర్శ వివాహం చేసుకున్నాక ఇవన్నీ ఎందుకు?”  అని అల్లుడు అనడానికి అలాటి వివాహం చేసుకున్నాడన్న స్పష్టత నివ్వలేదు కథకుడు. కథలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యగా పాత్రల మధ్య ఒక సమస్యని  ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాత్రల మధ్య పూర్వం ఏం జరిగిందో తెలియజేయకపోతే కథని ఫాలో అవడం కష్టమవుతుంది. 

          ఇలా ఎన్టీఆర్, సూర్యకాంతం పాత్రల విషయంలో ఒక స్పష్టత లేని విషయం అలా వుంచితే, భానుమతి పాత్ర ఎదురయిన సమస్యతో ఒక స్పష్టతతో, బలంగా  వుంటుంది. ముందు ఆమె తల్లితో సమస్యలు వస్తున్నాయని అస్సలు అనుకోదు. తల్లిది సానుకూల దృక్పథమే అనుకుంటుంది. అందుకని, ఒక బంధువు ముందు భర్త గురించి తల్లి లేనిపోని గొప్పలు చెప్పి భర్త మనోభావాలు దెబ్బ తీసినప్పుడు -  “మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడి కిచ్చి పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను” అని అతనంటే - “మీకన్నీ రావాలనీ, మీరలా వుండాలనీ ఆవిడ ఉద్దేశం” అని నచ్చజెప్తుంది. 

          “నా లాంటి వాడు అల్లుడు కావడం ఆవిడ గారికి నామర్దాగా వుంది, నువ్వు నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు” అని మళ్ళీ అంటే – “మీరొట్టి శాడిస్టు మనిషి!” అని నవ్వేస్తుంది . కానీ టెలిఫోన్ పెట్టిస్తున్నప్పుడు తల్లి ఇంటికొచ్చి గోడకి తగిలించిన సామాగ్రిని చూసి, “ఈ తట్ట బుట్ట పెట్టే చోటు ఇదా? తీసి అవతల పడెయ్యి!” అని భర్త ముందు కసురుకున్నప్పుడు నిర్ఘాంత పోతుంది. “తీయడానికి వీల్లేదు!” అని భర్త అరిచినప్పుడు ప్రత్యక్ష సమరం మొదలైపోతుంది. 

          అలాఅలా తన సంసారం మీద తల్లిగారి పెత్తనం బాగా పెరిగిపోతూంటే, ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్న ఆమె, ఒకానొక దశలో సహనం కోల్పోయి భర్తతో అనేస్తుంది –“మగవారు మీరుండగా ఇవన్నీ ఆవిడ ఎందుకు చేయించాలని మీకు బాధగా వుంది కదూ? పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలనుందా  ఏమిటీ? ఇక నా మంచీ చెడూ అమ్మా నాన్నా ఏం చూడనే కూడదా?” అని. 

          ఇలా భర్తకీ తల్లికీ మధ్య వ్యక్తిత్వాల గొడవలు తనకీ భర్తకీ మధ్య వ్యక్తిత్వాల గొడవగా మారిపోతుంది. ఇక ఆమె అన్నకి ఫోన్ చేసి, చెల్లెల్ని తీసికెళ్ళి పొమ్మంటాడు. ఏమనాలో అర్ధంగాక పుట్టింటికి చేరుతుంది భారతి. 

          మనసుని మళ్ళించుకోవడానికి ఎమ్మే చదవడం మొదలెడుతుంది. చదువుకుని ఉద్యోగం చేస్తానంటుంది. అన్న మందలిస్తాడు. “స్త్రీ జీవితానికి అర్ధం, లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు. వివాహం చేసుకోవడం” అంటాడు. అప్పటికే విడాకుల కాగితాల మీద సంతకం తీసుకున్న అతను, చెల్లెలి పెళ్లి ప్రస్తావన తెచ్చి, అక్క వుండగా చెల్లెలి పెళ్లి కష్టమని, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. తల్లి కూడా సమర్ధిస్తుంది. దీంతో విరుచుకు పడుతుంది భారతి, “ మీరింత వరకూ నా మంచి కోసం చేసింది చాలు...నువ్వు మంచి అనుకున్నదే లోకం మంచి అనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది. అంతస్తులు మారుతున్నాయి. అనుభావాలు మారుతున్నాయి. కానీ నీలాటి అమ్మలు మాత్రం మారడం లేదు!” అనేసి వెళ్ళిపోతుంది. 

          కాలం మారుతోంది అనే మాట అప్పటి ఈ సినిమాలో ఇంకో రెండు సార్లు వస్తుంది. బస్సులో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు, “కాలం మారిపోతోంది. ఆడవాళ్ళ  సీట్లో ఆడవాళ్లే, మగవాళ్ళ ఆడవాళ్లే” అని ఒకసారి, చివర్లో ఎన్టీఆర్ పశ్చాత్తాప పడినప్పుడు మరోసారి. కాలం మారిందనే మాట ఇప్పటికీ వాడుతూనే వుంటారు. కానీ అరవై ఏళ్ల  క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మారిందనే అనుకుంటారు. అయితే ఇప్పుడు చూస్తేనే, అప్పటి కాలం మారలేదనీ, ఇప్పటి కాలమే బ్రహ్మాండంగా మారిందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. 

          భారతి ఎమ్మే పాసయి, టీచరుగా ఉద్యోగమొస్తే వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ గతాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆమెని చూసి ఒక టీచర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తాడు. నాల్గు దులుపుతుంది. చెల్లెలి పెళ్లి పిలుపు రావడంతో ఇక వెళ్ళక తప్పదు. వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వధూవరులు ఏడడుగులు వేస్తున్నప్పుడు తట్టుకోలేక పరిగెడుతుంది. పరుగెత్తీ పరుగెత్తీ భర్త ఇల్లు చేరుకుంటుంది. తలుపు కొట్టీ కొట్టీ  అలసి పోతుంది. ఒకావిడ తలుపు తీసి “ఎవరు కావాలి?”  అంటుంది. భారతికి అర్ధమైపోతుంది. “మీ వారున్నారా, పిలవండి” అంటుంది నిస్సహాయంగా. అప్పుడే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని జీర్ణించుకోలేక. అప్పుడు అతనొస్తాడు. అతడి పేరుకూడా చంద్రశేఖరే. లాయర్. భర్త ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడనీ, తాము ఈ ఇంట్లోకి వచ్చామనీ అతనన్నప్పుడు తేలిక పడుతుంది భారతి. ఈ సస్పెన్స్ డ్రామా గొప్పగా వుంటుంది. 

          అయితే ఇతను ఆమెని నిందిస్తాడు. భర్త పిచ్చి పట్టిన వాడిలా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదనీ, పిన్ని కూడా ఇవన్నీ చూడలేక చనిపోయిందనీ, దీని కంతటికీ బాధ్యత భారతీదేననీ దూషిస్తాడు. భారతికిక  చచ్చిపోవాలన్పిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భర్త చంద్రశేఖర్ లాయర్ దగ్గరికొస్తాడు. లాయర్ జరిగింది చెప్తాడు. చంద్రశేఖర్ చలించిపోతాడు.

          “కాలం మారుతోంది. మనసుకు నచ్చినా నచ్చక పోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవమని పూజించే రోజులు పోయాయి. పురుషులతో బాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. విభిన్న వ్యక్తిత్వాలున్నభార్యాభర్తల మనసులు అతకడం కష్టం” అని బాధపడతాడు. 

          “తనలో ఎంత మార్పు వస్తే ఇక్కడి కొచ్చింది...మొదట్లో నేనూ నీలాగే అనుకున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళని నీడలా అనుసరిస్తే చాలనుకున్నాను. మనకిష్టమైన రూపంలో కన్పించడానికి వాళ్ళు మట్టి బొమ్మలూ, లక్క బొమ్మలూ కాదు. మనలాంటి మనుషులే...” అంటూ భారతిని వెతకడానికి పరిగెడతాడు.   సుఖాంతమవుతుంది. ఈ మొత్తం కుటుంబ డ్రామాలో నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రూపంలో సమస్య వచ్చినప్పుడు, ఆ భార్యాభర్తలు ఒకటై తమ వైవాహిక బంధం కోసం ఆ మూడో వ్యక్తి ప్రమేయాన్నే తిప్పికొట్టాలనీ.  ఈ కథలో చంద్రశేఖర్ అత్త ప్రభావానికి లొంగిపోయి భార్య  భారతిని బాధపెట్టడం, భారతి చంద్రశేఖర్ ని బాధ పెట్టడం, ఇద్దరూ కలిసి సంసారాన్ని ముక్కలు చేసుకోవడం. అత్తగారు మాత్రం సలక్షణంగా వుండడం. ఈ దృశ్యాన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ (టీఏ) ప్రకారం చూస్తే, అత్తగారు పేరెంట్ మెంటాలిటీతో వుంటే, భార్యాభర్తలు చైల్డ్ మెంటాలిటీతో వుండిపోయారు. ఈ రెండు మెంటాలిటీలూ లాభం లేదనీ, మనుషులు అడల్ట్ మెంటాలిటీకి ఎదిగితే సమస్యలు రావనీ టీఏ చెప్తుంది. ఇదీ విషయం. 

          పిఎస్ రామకృష్ణ దర్శకత్వం బెంగాలీ మాతృకలాగా మరీ కళాత్మకంగా లేకపోయినా,  సీదా సాదాగా బాగానే వుంటుంది. సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పక్క ఆర్టిస్టుల క్లోజప్స్ వేసే చమత్కారం ఎక్కువ కన్పిస్తుంది. గ్లామరస్ గా భానుమతికి చాలా సార్లు వేశారు. మాటలు రాసిన అట్లూరి పిచ్చేశ్వరరావు “చివరకు మిగిలేది” కి రాసిన రచయితే. ఆయన దురదృష్టమేమిటంటే ఈ రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. పాటలు రెండు సూపర్ హిట్టయ్యాయి- “నీటిలోన నింగిలోన”, “విన్నావా విన్నావా” అనే పాటలు.

సికిందర్
‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక
మార్చి, 2019 సంచిక