రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

1320 : మూవీ నోట్స్


 

    'శాకుంతలం లాంటి ఒక సినిమా తీయడానికి గత వందేళ్ళల్లో 20 రిఫరెన్సులు వుండగా కూడా, శాకుంతలం ని ఇంత నిరంకుశంగా సమర్పించారంటే కాళిదాసుని, కాళిదాసుని విశదపర్చిన పూర్వ కళాకారుల్నీ కేర్ చేయకపోవడమే. కనీసం రెండు రిఫరెన్సులు తీసుకున్నా శాకుంతలం ఇంత రస విహీనమయ్యేది కాదు. 1943 లో హిందీ శకుంతల’, 1966 లో తెలుగు శకుంతల ఈ రెండూ సరిపోతాయి. శకుంతల గాథని 1920 లోనే రెండు సార్లు మూకీల కాలంలోనే సినిమాగా తీశారు. ఇందులో మొదటిది బ్రిటిష్ నటి డరోతీ కింగ్ డమ్ నటించింది. 1929 లో దేశంలో తొలి దర్శకురాలు ఫాతిమా బేగం దర్శకత్వం వహించింది. ఇప్పటికి మూకీల నుంచి టాకీలకి అప్ గ్రేడయ్యాయి సినిమాలు. మళ్ళీ 1931 లో ఖుర్షీద్ బేగం నటించింది. 1931 లోనే జేజే మదన్ దర్శకత్వంలో ఇంకోటి. 1932 లో సురభి కమలాబాయి నటన. 1940 లో ఎంఎస్ సుబ్బు లక్ష్మి నటన. 1941 లో జ్యోత్స్నా గుప్తా నటన. 1943 లో వి. శాంతారాం దర్శకత్వంలో జయశ్రీ -చంద్రమోహన్ లు నటించిన హిందీ వెర్షన్ ఎన్నదగింది. ఇది అమెరికాలో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా నమోదైంది. దీంతో బాటు 1966 లో తెలుగులో కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వంలో ఎన్టీఆర్- బి. సరోజాదేవిలు నటించింది మరో మంచి రిఫరెన్సు. ఇలా 2022 వరకూ 20 సార్లు తీశారు శకుంతల గాథ. కానీ ఇప్పుడు 21 వ సారి శాకుంతలం ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది అయింది.

        ఇంకా ఇక్కడ విదేశీ వెర్షన్లు కూడా చెప్పుకుంటే, 1820 లో జర్మన్ సంగీత కారుడు ఫ్రాంజ్ షూబర్ట్ ఒపేరా కోసం ప్రారంభించిన స్వర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. శతాబ్దం తర్వాత 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో స్వరపర్చిన  లా లెజెండా డీ శకుంతల అనే ఒపేరా సిద్ధమైంది. దీని రెండో వెర్షన్ 1952 లో ప్రదర్శించారు. 1838 లోనే ఎర్నెస్ట్ రేయెర్ స్వరపర్చిన సాకౌంటల అనే బ్యాలే వుంది. ఇంకా 1962 లో సోవియెట్ రష్యా  సంగీతకారుడు సెర్గీ బలసనియన్ స్వరపర్చిన ఇంకో బ్యాలే శకుంతల వుంది. ఇలా వుండగా 2006 ఏప్రెల్ 23 న ఫ్రాంకో అల్ఫాన్సో ఒపేరాని రోమ్ లో తిరిగి ప్రదర్శించారు (చిత్రపటం చూడండి).

అంటే, ప్రపంచ కళాకారుల్ని శతాబ్దాలుగా ఇంతగా ఆకర్షిస్తున్న కాళిదాసు శకుంతల క్లాసిక్ ని చాలా గ్రాఫిక్స్ పెంచి కాదు, కుంచెని  ముంచి భావాత్మకంగా పెయింటింగ్ చేయాలన్న మాట! 

        శకుంతల యాక్టివ్ క్యారక్టర్ కాదు. ఆమె భర్త దుష్యంతుడు కూడా యాక్టివ్ క్యారక్టర్ కాదు. అందుకని ఇది కథ కాదు, గాథ. అంటే పాత్రలు దేనికవి సంఘర్షణ అనుభవిస్తాయి తప్ప పరిష్కారం కోసం పరస్పరం సంఘర్షించుకోవు. చివర్లో మూడో పాత్ర వచ్చి పరిష్కరిస్తుంది. కాబట్టి పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని ఇలాటి పురాణ గాథల్ని పరవశింపజేసే నాటకీయత ఒక్కటే కాపాడుతుంది. ఈ నాటకీయత గాథలో మూడు మలుపులు వచ్చే చోట్ల బలంగా, విజువల్ గా (అంటే సంఘటన ఆధారంగా) వుంటే, మలుపుల మధ్య కథనం కూడా అంతే రసోత్పత్తితో సమ్మోహనకరంగా వుంటుంది. దృశ్యాలు దృశ్యకావ్య హోదాని సంతరించుకుంటాయి. ఇదే చూస్తాం 1943, 1966 వెర్షన్లలో. ఈ క్రియేటివ్ ఎత్తుగడలు  గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడుకి తెలియదని చెప్పడం కాదు. శాకుంతలం పుణ్యమాని మనకి తెలియని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం మాత్రమే- రిఫరెన్సుల ఆధారంగా.

ఆరు ఘట్టాల గాథ

శకుంతల గాథ శకుంతల జననం, పెంపకం, పరిణయం, శాపం, తిరస్కారం, శాప విమోచనం అనే ఆరు ఘట్టాలుగా వుంది. ఈ ఆరు ఘట్టాల్లో స్టోరీలైన్ శకుంతల జీవిత చిత్రణే. ఆమె స్వశక్తు రాలు కాదు, పుట్టగానే అనాధ అయింది, అప్పట్నుంచీ పరాధీన గానే వుంది. పుట్టగానే శకుంత పక్షులు పెంచాయి. తర్వాత కణ్వ మహర్షి చెంతన దత్త పుత్రికగా  పెరిగింది. పోనీ దుష్యంతుడ్ని పెళ్ళి చేసుకుని స్థిరపడదామనుకుంటే, అతను మళ్ళీ వచ్చి తీసుకుపోతానని వెళ్ళి పోయాడు. యాగానికి వెళ్ళిపోయిన కణ్వుడి గైర్హాజరీలో తీసికెళ్ళ డం మర్యాద కాదని. ఇది చాలనట్టు దుర్వాసుడు వచ్చి ఆమెని శపించాడు, తర్వాత శాపవిమోచనం చెప్పినా, ఆ ఉంగరం పోగొట్టుకుని భర్త దగ్గర పరాభవాన్ని ఎదుర్కొంది. అడవుల్లో ఏకాకిగా మిగిలి బిడ్డని కంది. చివరికి భర్త తప్పు తెలుసుకుని వస్తే బాధల్లోంచి విముక్తి పొందింది. ఆడదానికే అన్ని పరీక్షలూ, ఆడదే అన్నీ భరించాలీ అనే ఇందులో నీతి. ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో. అప్పట్లో ఆడదానికి చదువు వుండేది కాదు కాబట్టి.

        ఈ స్టోరీలైన్లో శకుంతల బాధల్ని భరించడమనే పాయింటు ప్రధానంగా వుంది. ఇది శోక రసం. పాయింటు ఇది కాబట్టి ఈ శోక రసాన్ని ప్రధాన రసంగా తీసుకుని కథనం చేస్తూ, దీనికి వీర, శృంగార, అద్భుత, బీభత్స - తత్సంబంధ రసాల్ని అనుబంధ రసాలుగా చేసుకుని ఆయా దృశ్యాల్ని అలంకరించ వలసి వుంటుంది. ఇంతలో శోకం, మరింతలో శృంగారం; ఇంతలో శోకం, మరింతలో అద్భుతం- ఇలా సుఖదుఖాల ద్వంద్వాలతో ఎత్తుపల్లాల ప్రయాణ మన్నట్టుగా ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ చేస్తూ పోవాలి శకుంతల జీవిత కథని. సీన్లు ఇలా టూ డైమెన్షనల్ గా సాగాలి. అప్పుడు గాథ ఫ్లాట్ గా మారే ప్రమాదం తప్పుతుంది.

         శాకుంతలం లో వున్నది సాంతం డైమెన్షన్లు లేని ఫ్లాట్ గా సాగే సీన్లే. ఏ సీనూ రసాలూరదు. మామిడి పండు చీకి రసాలు జుర్రుకుంటున్నట్టు వుండదు. పాత్రగా శకుంతల కంటే పెద్ద ట్రాజడీ, టార్చర్ ఈ రస విహీన రచనే.                

        ముత్యాల ముగ్గు లో సెంట్రల్ క్యారక్టర్ సంగీతది ఆమెకి జరిగే ట్రాజడీలోంచి పెల్లు బికేది శోక రసమే అయినా, సినిమా శోకరస ప్రధానం కాదు. శోక రసాన్ని ప్రధాన రసంగా చేసి కథ నడపలేదు. నడిపితే ఫ్లాపయ్యేది. ఆమె శోకాన్ని తీర్చేందుకు ఆమె పిల్లలతో అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసి వినోదాత్మకంగా కథ నడిపారు. ఇది కాల్పనిక కథ కాబట్టి సక్సెస్ కోసం ఎలాగైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. శకుంతల లాంటి పురాణంతో స్వేచ్ఛ తీసుకోలేరు. శోక రసాన్నే ప్రధాన రసంగా చేసి గాథ నడపాల్సిందే. సంగీతంలో బాణీల్ని కూర్చినప్పుడు ఏ వాద్యపరికరం ఎక్కడ ఎప్పుడు ఎలా శృతి కలుపుతూ పలుకుతుందో - అలా గాథలో ప్రధాన రసానికి అనుబంధ రసాలు పలికినప్పుడు దృశ్యాలు కట్టి పడేస్తాయి.

        పైన చెప్పుకున్నట్టు 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో లా లెజెండా డీ శకుంతల అని సిద్ధం చేసిన ఒపేరా నోట్సు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం బాంబు దాడిలో ధ్వంసమయ్యాయి. అయినా పట్టువదలని అల్ఫానో 1952 కల్లా తిరిగి కొత్త నోట్సు పూర్తి చేసి ఒపేరాని ప్రదర్శించాడు. సంగీత రూపకంగా సాగే ఈ ఒపేరా చాలు- శకుంతల గాథలో పలికే వివిధ రసాల తీరుతెన్నులు తెలియడానికి. శాకుంతలం లో మణిశర్మ నేపథ్య సంగీతం ఏం పలికిందో, ఎందుకు పలికిందో వేరే స్టడీ చేయాలి సంగీతం తెలిసిన వాళ్ళు.

స్క్రీన్ ప్లేలో ఆ మూడు మలుపులు

శకుంతల గాథలోని  ఆరు ఘట్టాలు మూడు మలుపులతో వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ. అంటే త్రీయాక్ట్స్ స్ట్రక్చరే. ప్రధాన పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని త్రీ యాక్ట్స్. ప్లాట్ పాయింట్ వన్- దుర్వాసుడి శాప ఘట్టం. మిడ్ పాయింట్ -శకుంతల భర్త దుష్యంతుడి దగ్గరికి బయల్దేరే ఘట్టం. ప్లాట్ పాయింట్ టూ -దుష్యంతుడి సభలో శకుంతల పరాభవం. స్క్రీన్ ప్లేకి మూలస్తంభాలైన ఈ మూడు మలుపులూ శాకుంతలం లో తప్పుల తడకగా వున్నాయి. ఇందుకే వీటి మధ్య కథనం ఎక్కడికక్కడ కొడిగట్టిన దీపమైంది.

        1943 హిందీ శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ చూద్దాం :  తోటలో భర్త దుష్యంతుడి రాకకై నిరీక్షిస్తున్న శకుంతల (జయశ్రీ), నేస్తం లాంటి  జింక తన దగ్గరికి రావడంతో ప్రేమగా నిమురుతూ, ఎక్కడున్నావు ఇన్నాళ్ళూ, నన్ను మర్చిపోయావా?... నువ్వెందుకు మర్చిపోతావులే, నేనే మర్చిపోయా అని ఉలిక్కిపడి తేరుకుని, ఆఁ ? ... ఏమన్నాను నేనూ? మర్చిపోయానా? ఆఁ ?... అంటే... ఆయన కూడా ఇలాగే నన్ను మర్చిపోయాడా?’ అని బలహీన స్వరంతో అని, జింకని వదిలేసి ఆందోళనగా ఇంట్లోకి పరుగెత్తి, వేలికున్న ఉంగరం చూసుకుంటూ, మర్చిపోయావా నన్ను ప్రియా? నా గుండె తట్టుకోవడం లేదు... మర్చిపోయావా నన్ను ప్రియా?’ అని మరింత బలహీన స్వరంతో దుఖితురాలవుతున్నప్పుడు- గుమ్మంలోకి దుర్వాసుడు వచ్చేసి పిలుస్తాడు. ఒకసారి పిలుస్తాడు, రెండు సార్లు పిలుస్తాడు. పలకదు. తన దుఖంలో తానుంటుంది. ఇది గమనించని అతను, పిలుస్తున్నా పలక్కపోవడం అవమానంగా తీసుకుని శపిస్తాడు- నువ్వు ఎవర్నైతే తల్చుకుంటూ నన్నవమానించావో వాడు నిన్ను మర్చిపోవుగాక!  అని శాపం పెట్టి వెళ్ళిపోతాడు.

        అటు హస్తినాపురం రాజభవనంలో నిద్రిస్తున్న దుష్యంతుడు అదిరిపడి మేల్కొని సేవకుల్ని పిలుస్తాడు. సేవకులొచ్చి అడిగితే  ఏమీ చెప్పలేకపోతాడు.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దృశ్యంలో నాటకీయత శకుంతల జింకని పలకరించడంతో మొదలైంది. దుర్వాసుడు రాకముందు జింకని లీడ్ గా తీసుకుని మరపు గురించి, దాంతో ఆమెకి దుష్యంతుడి పట్ల కలిగిన సందేహాల గురించీ ఆందోళనకరంగా, శోక రసంతో సీను రన్ అవుతోంది. దుర్వాసుడొచ్చి అందుకు తగ్గట్టుగానే శాపం పెట్టడంతో (బీభత్స రసం) అవతల దుష్యంతుడు అన్నంత పనీ చేశాడు- శకుంతలని మర్చేపోయాడు. జింకతో మాట్లాడుతూ శకుంతల రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టింది (అద్భుత రసం). అందుకే అలా ఫీలయ్యింది. ప్రపంచంలో రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టేది ఇద్దరే - ఆడవాళ్ళు, జంతువులు. మగవాడు నెత్తి మీద ఢామ్మని పిడుగు వచ్చి పడే దాకా సోమరిగా టైమ్ పాస్ చేస్తూనే వుంటాడు.

        ఈ సీనులో ఇంకో అర్ధం కూడా చూడొచ్చు. ఆడదానివైనా నీ సిక్స్త్ సెన్స్ తో నువ్వు అనుమానిస్తే వెంటనే చర్య తీసుకో. అనుమానిస్తూ కూర్చోకు. అనుమానించిందే జరుగుతుంది. దటీజ్ హౌ మైండ్ వర్క్స్. శకుంతల అనుమాన నివృత్తికి పూనుకోకుండా వర్రీ అవుతూ కూర్చోవడం వల్లే ప్రకృతి ఆమె అనుమానాన్ని నిజం చేసేందుకు నెగెటివ్ ఫీలింగ్ రూపంలో దుర్వాసుడ్ని పంపింది.

        ఇలా ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుకి  డెప్త్ ఏర్పడింది. ఇందులో శాపంతో అవతల దుష్యంతుడి రియాక్షన్ కూడా చూపించి సర్కిల్ ని కంప్లీట్ చేశారు. ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా సరే. అయితే శకుంతలకి సంబంధించి రస పుష్టితో ఈ నాటకీయత కేవలం డైలాగులతో గాకుండా సంఘటనా పూర్వకంగా చూపించి వుంటే మరింత ప్రభావ వంతంగా వుండేది. ఎన్ని డైలాగులు చెప్పినా సంఘటన ఆధారంగా విజువల్ గా చెప్పినప్పుడే బలంగా రిజిస్టర్ అవుతుంది. 1943 లో వి శాంతారాం తలపోసిన నాటకీయత అప్పటి  విధానం కావొచ్చు. 1966 వచ్చేసరికి తెలుగులో కమలాకర కామేశ్వర రావు క్రియేషన్ విజువల్ నేరేషన్ కి ప్రాణం పోసింది. ఇదెలా వుందో చూద్దాం...

డెప్త్ లేని విజువల్ కాన్ఫ్లిక్ట్

1966 తెలుగు శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు మరపు గురించి ఫోర్ షాడోయింగ్ (పరిణామాల ముందస్తు హెచ్చరిక) సీను వుంటుంది. దుష్యంతుడు (ఎన్టీఆర్) శకుంతల (బి సరోజా దేవి) ని గాంధర్వ వివాహ మాడేక, గుర్తుగా ఉంగరమిచ్చి, మళ్ళీ వచ్చి తీసికెళ్తానని సెలవు తీసుకుంటున్నప్పుడు, శకుంతల బేలగా చూసి, నన్ను మర్చిపోతారేమో?’ అంటుంది. అందుకు దుష్యంతుడు, నేను మర్చిపోతానా? ఎంత మాట. నా ధర్మాన్ని మర్చిపోను, నన్ను నేను మర్చిపోను అని అనునయించి సెలవు తీసుకుంటాడు.

        దీని తర్వాత, ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీనులో- తోటలో శకుంతల ఆనందంగా విహరిస్తున్నప్పుడు చెలి కత్తెలు (శారద, గీతాంజలి) వచ్చి ఆటలు పట్టిస్తారు. శకుంతల, నా స్వామి నా కోసం కబురు పంపుతాడా?’ అంటుంది. ఆయన ఇప్పుడేం చేస్తూంటాడు అని కూడా అంటే, నీకంటే ఎక్కువ నీకోసం ఎదురు చూస్తూంటాడు అంటుంది చెలికత్తె. ఎలా?’ అంటే, ఏముందీ నీ బొమ్మని చూసుకుంటూ అంటుంది చెలికత్తె.

        అవతల హస్తినాపురంలో ఏవో మధుర వూహల్లో తేలిపోతున్న దుష్యంతుడ్ని చూసి భటుడు (పద్మనాభం), ఏంటో నీలో నువ్వు ముసిముసిగా  నవ్వుకుంటున్నావ్?’ అంటాడు. దుష్యంతుడు తేరుకుని బొమ్మ వేయడానికి సిద్ధమవుతాడు. అది చూసి భటుడు, కొంపదీసి అనాఘ్రాత పుష్పం ఆ అడవి పిల్లది కాదు కదా?’ అంటాడు.

        ఇటు తోటలో శకుంతల దుష్యంతుణ్ణి తల్చుకుంటూ మైమరపులో వుంటుంది. అక్కడికి దుర్వాసుడొచ్చి పిలిస్తే పలకదు. మళ్ళీ పిలిచినా తన లోకంలోంచి ఇవతలకి రాదు. దీంతో కోపంతో శపిస్తాడు. అతడి శాపం సృష్టించే కల్లోల వాతావరణానికి అవతల దుష్యంతుడు వేస్తున్న శకుంతల బొమ్మ ఎగిరిపోతుంది. ఈ గాలి దుమారమేమిటో అర్ధంగాక ఉక్కిరి బిక్కిరవుతాడు. ఆ బీభత్సానికి అతడి స్మృతి పథంలోంచి శకుంతల వైదొలగి పోతుంది.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దుష్యంతుడు వేస్తున్న బొమ్మ, గాలి దుమారం, బీభత్సం అనే సంఘటన ఆధారంగా విజువల్ యాక్షన్ తో వుంది. ఇది వి శాంతారాం సృష్టి కున్న డెప్త్ తో లేదు. అందులో మర్చిపోవడం అనే పాయింటుతో శకుంతల మానవ సహజ భయాలతో లాజికల్ గా వుంటే, తెలుగులో టీనేజి అమ్మాయి కలల విహారంతో డైమెన్షన్ లేకుండా సాదాగా వుంది ప్లాట్ పాయింట్ వన్ సీను ప్రారంభం- మర్చిపోవడమనే పాయింటు దీనికి ముందు సీనులో విడిగా వుండడం వల్ల - ప్లాట్ పాయింట్ వన్ సీను లో డెప్త్ లోపించింది.

        అదే శాంతారాం సృష్టిలో మర్చిపోవడమనే పాయింటుతోనే ప్లాట్ వన్ సీను రన్ అవడంతో డెప్త్, అర్ధం, పరమార్ధం కలిసొచ్చాయి. తెలుగులో తర్వాత దుర్వాసుడి శాపంతో విజువల్ యాక్షన్ని ప్రదర్శించింది సీను. దీంతో భౌతికంగా బలం చేకూరింది, మానసికంగా కాదు. అయినా ఈ హిందీ తెలుగు ప్లాట్ పాయింట్ వన్ సీన్లు ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ అయ్యేవే. తాజా శాకుంతలం లో కనీసం శాపం కూడా రిజిస్టర్ కాదు.

పాపం శాపం


        ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు ఫ్లాష్ బ్యాకుగా వేసిన సీన్లో, శకుంతలని పెళ్ళాడిన దుష్యంతుడు (దేవ్ మోహన్), శకుంతల (సమంత) తో అంటాడు- ‘...తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజ లాంఛనాలతో తీసుకెళ్తాను, దిగులు పడకు దేవీ అని. దీనికి శకుంతల అంటుంది, పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అని. దీనికి దుష్యంతుడు అంటాడు, భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. ఇక వెళ్ళనా?’ అంటాడు. బాధతోనే తలూపుతుంది. వెళ్ళిపోతాడు.

                ఈ సీను చాలా అసహజంగా, పేలవంగా వుంది. డైలాగులు అర్ధరహితంగా వున్నాయి. పై రెండు హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టుగా మర్చిపోవడం గురించి లీడ్ సీను, లేదా మెయిన్ సీను కాకుండా, ప్రేమ గురించి ఈ సీను వుంది. నన్ను మర్చిపోతారేమో?’ అనకుండా, మీ ప్రేమకి కూడా దూరమైతే?’ అంటుంది. కానీ తర్వాత దుర్వాసుడొచ్చి, దుష్యంతుడి ప్రేమకు దూరమవు గాక! అని శపించ బోవడం లేదు, దుష్యంతుడు నిన్ను మర్చిపోవుగాక! అని శపించడానికి రాబోతున్నాడు. కానీ సీను చూస్తే టార్గెట్ పాయింటు మరపు గురించి గాక, ప్రేమ గురించి వుంది! ఇలా వుంటే ఏం రక్తి కడుతుంది ఇంత పెద్ద సినిమా సీను?
                
            పైగా మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అన్నప్పుడు దుష్యంతుడిచ్చిన అర్ధం లేని సమాధానం భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని. అంటే, నా ప్రేమకు దూరమైనా నీకు చెట్టు పుట్టల ప్రేమ వుందిగా, జంతువుల ప్రేమ వుందిగా, మీ ఫాదర్ కణ్వ మహర్షి లవ్  కూడా వుంది, ఇంకేం అడ్జస్ట్ అయిపో అనా? ఏమిటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది? వీళ్ళు ప్రబంధ నాయికానాయకులా? వెనుక ఒక సీన్లో, నీకు జంతుజాలం ప్రేమ కాదు, మగని ప్రేమ కావాలని చెలికత్తెలు అన్నారే? వెనుక ఏం రాశారో చూసుకోరా?

                ఇక ఉంగరం సంగతి. ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. అది ప్రేమ చిహ్నమా, క్యాలండరా? ఆ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని వారాల్లో తిరిగి వస్తాననని వాగ్దానం చేస్తూ, ఆమె లెక్కించుకోవడానికి ఇచ్చిన క్యాలండర్! పై హిందీ తెలుగు వెర్షన్లలో ఉంగరమివ్వడంలో ఇదీ అర్ధం. అంతేగానీ, మన ప్రేమకి చిహ్నంగా ఇదుంచుకో, వస్తా, నీకూ నాకూ ఇక బైబై! అని కాదు! ఇంత మైండ్ బ్లోయింగ్ గా రచన చేస్తే సినిమా గ్లోబల్ హిట్టే అవ్వాలి! 

                ఇక వెళ్ళనా అని వెళ్ళిపోతాడు. ఈ సీనంతా శకుంతల చెప్పలేని బాధతో, కన్నీళ్ళ తో వుంటుంది. దుష్యంతుడు వెళ్ళిపోవడం ఆమె కంత శిక్ష అన్నట్టు వుంటుంది.  అతను వెళ్ళిపోయాక ఆనందంగా పాట పాడుకుంటుంది. మానసిక స్థితిలో ఈ మార్పెందుకో తెలీదు. పాట పూర్తయ్యాక సకల రాజ లాంఛనాలతో దుష్యంతుడు వస్తూంటాడు. ఇదామె వూహ. వూహల్లో తరలి వస్తున్న దుష్యంతుణ్ణి చూసుకుంటూ మైమరపులో వుండగా, అట్నుంచి దుర్వాసుడు వస్తూంటాడు. దుర్వాసుడ్ని చూసి చెలికత్తెలు బెదిరిపోతారు. దుర్వాసుడి కోపం గురించి ఒక చెలికత్తె ఒక కథ చెప్తుంది. ఇలా దుర్వాసుడు దారిలో చెలికత్తె లతో పరిచయం ముగించుకుని శకుంతల దగ్గరి కొస్తాడు. ఆమె ఇంకా ఆ వూహా లోకంలోనే వుంటుంది. పిలిస్తే పలకదు. ఎంత పిలిచినా తిరిగి చూడదు. దీంతో తనని ఖాతరు చేయని శకుంతలని దుర్వాసుడు శపించి వెళ్ళిపోతాడు.

                ఇంటర్ కట్ లో ఈ శాపంతో అటు హస్తినాపురంలో దుష్యంతుడి రియాక్షన్ సీను హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టు ఇక్కడ వుండదు. ఫ్లాట్ గా శకుంతల మీద సీనుతో పేలవంగా ముగిసిపోతుంది. దుర్వాసుడు వస్తూంటే సీన్లు వేసి అంత బిల్డప్ ఇచ్చారే గానీ, ఆ బిల్డప్ తో ఒరిగిందేమిటో చూపించలేకపోయారు. ఈ సీనులో మెయిన్ ఈవెంట్ అయిన దుర్వాసుడి శాపానికున్న శక్తి ఎలాంటిదో చూపించలేకపోయారు. అతడి శాపానికి హస్తినాపురం చేరే ఫ్రీక్వెన్సీ గానీ, వైబ్రేషన్ గానీ లేవు. మరి దుష్యంతుడు శకుంతలని  మర్చి పోయినట్టా, మర్చి పోనట్టా, ఏమైనట్టు? దారిలో సిగ్నల్ టవర్స్ లేకనా? జియో అంబానీకి చెప్పి ఏర్పాటు చేసుకోవాల్సుంటుందా? 

ఏ ఫ్రీక్వెన్సీ లేని, వైబ్రేషన్ లేని దుర్వాసుడి కూనిరాగం శాపంతో  సినిమా హిట్టవ్వాలని ఎలా ఆశిస్తారు. కథ పుట్టే ప్లాట్ పాయింట్ వన్ హిట్టవ్వకపోతే సినిమా ఎలా హిట్టవుతుంది. అసలు ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను అని తెలుసుకుని రచన చేశారాని పెద్ద అనుమానం!

(మిగతా రేపుదయం)
—సికిందర్


14, ఏప్రిల్ 2023, శుక్రవారం

1319 : రివ్యూ

 

అయోతి  (తమిళం)
రచన- దర్శకత్వం : ఆర్. మంధిర మూర్తి
తారాగణం : శశి కుమార్, ప్రీతీ అస్రానీ, మాస్టర్ అద్వైత్, యశ్పాల్ శర్మ, అంజూ అస్రానీ, పాండీ తదితరులు
సంగీతం : ఎన్ ఆర్ రఘునందన్, ఛాయాగ్రహణం : మాధేష్ మాణిక్కం
బ్యానర్ : ట్రైడెంట్ ఆర్ట్స్
నిర్మాత : ఆర్ రవీంద్రన్
విడుదల :  ఏప్రెల్ 7, 2023, జీ 5
***
            మిళ సినిమా ఒక్కోసారి దాని సహజ రంగు దాచి పెట్టుకుని దర్శనమిస్తూంటుంది. రంగు చూస్తే రంగేళీ, హంగు చూస్తే కంగాళీ అన్నట్టు అరవ సినిమాలొస్తూంటాయి. అరవ సినిమాలకి కాస్త భిన్నంగా యూనివర్సల్ సినిమా అన్నట్టుగా తమిళ సినిమాలొస్తూంటాయి. వీటి కంటెంట్ గానీ, మేకింగ్ గానీ ప్రాంతీయ సరిహద్దుల్ని చెరిపేసే ప్రమాణాలతో వుంటాయి. అరవ సినిమాలు మూసలో పడి అక్కడే వుంటాయి. తమిళ సినిమాని నిలబెట్టుకునే కొత్త మేకర్లు కూడా అరుదుగా వుంటారు. ఆ అరుదైన కొత్త మేకర్లలో ఇవాళ ప్రశంసలు పొందుతున్న వాడు ఆర్ మంధిర మూర్తి.

        ప్రశంసలు దేనికంటే, అయోతి అనే మళ్ళీ తనే తీయలేడేమో అనేంత ఆశ్చర్య జనకంగా సినిమా తీసినందుకు. హీరో శశి కుమార్ తో హీరోయిజానికే హీరోయిజాన్ని నేర్పే నేర్పుతో ఆలోచనాత్మకంగా తీశాడు. ఆలోచనాత్మక విషయంతో సినిమాలు రావడం వేరు. ఆ విషయాన్ని చెప్పే విధం కూడా ఆలోచనలో పడేసే అయోతి లాంటి సినిమా వేరు.  విషయాన్ని చెప్పడంలో అమల్లో వున్న అన్ని పద్ధతుల్నీ తీసి పక్కనబెట్టి, తన పద్ధతిని విప్లవాత్మకంగా ముందుంచుతున్న కొత్త దర్శకుడి క్రియేటివ్ వైకల్పమేమిటో ఇక చూద్దాం...

కథ

అయోధ్య కి చెందిన బలరాం (యశ్పాల్ శర్మ) రామభక్తుడు. మతవాది. మహా కోపిష్టి. ఎవరి మాటా వినడు. మగ దురహంకారంతో భార్య జానకి (అంజూ అస్రానీ) తో క్రూరంగా ప్రవర్తిస్తాడు. పిల్లలు అతడ్ని చూసి వణికి పోతారు. కాలేజీకి వెళ్ళే టీనేజీ కూతురు శివానీ (ప్రీతీ అస్రానీ), స్కూలు కెళ్ళే కొడుకు సోనూ (మాస్టర్ అద్వైత్ ) ఇంట్లో తండ్రి లేనప్పుడు స్వేచ్ఛని అనుభవిస్తారు. తండ్రి కనపడగానే బిక్కచచ్చిపోతారు. ఇలాటి బలరాం కుటుంబంతో రామేశ్వరం తీర్థయాత్ర పెట్టుకుంటాడు. దురై చేరుకుని, అక్కడ్నించి టాక్సీలో వెళ్తారు. అసలే కోపిష్టి, పైగా గుట్కా తినే అలవాటు. గుట్కాతో టాక్సీని పాడు చేస్తూంటే డ్రైవర్ అభ్యంతరం చెప్తాడు. దీంతో పిచ్చి రేగిపోయిన బలరాం టాక్సీని స్పీడుగా తోలమని వేధిస్తాడు. తెల్లారేలోగా రామేశ్వరం చేరుకోవాలంటాడు. స్పీడు పెంచడానికి డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో కొడతాడు. ఇద్దరూ మీద పడి కొట్టుకోవడంతో టాక్సీ అదుపు తప్పి యాక్సిడెంట్ పాలవుతుంది.

యాక్సిడెంట్లో తలకి తీవ్రగాయమైన జానకిని హాస్పిటల్ కి చేరుస్తారు. గాయపడ్డ డ్రైవర్, స్నేహితుడైన శశికుమార్ కి చెప్పడంతో, శశి కుమార్ అత్యవసరంగా వేరే హాస్పిటల్ కి తీసికెళ్ళాల్సిన జానకిని అంబులెన్స్ లో తీసుకుని బయల్దేరతాడు. మార్గ మధ్యంలో ఆమె చనిపోతుంది.
        
ఇప్పుడేం చేయాలి? భాష తెలియని ప్రాంతంలో మృత దేహంతో ఏకాకిగా మిగిలిన కుటుంబాన్నేం చేయాలి? ఎట్టి పరిస్థితిలో ఈ హిందీ కుటుంబానికి సాయపడాలని నిర్ణయించుకున్న తమిళ శశికుమార్, అయోధ్యకి మృత దేహం తరలింపుకి సంబంధించి ఎలాటి చట్టపరమైన అవాంతరాల్ని ఎదుర్కొన్నాడు? సాంప్రదాయం పేరుతో అడుగడుగునా అడ్డు తగులుతున్న బలరాంతో ఏ ఇబ్బందులు పడ్డాడు? దీనంగా మిగిలిన పిల్లల మొహాలు చూసి పట్టు వదలకుండా ఆ కుటుంబాన్ని ఎలా కష్టంలోంచి బైట పడేశాడు?   ఇదీ మిగతా కదిలించే కథ.

ఎలావుంది కథ

ఇది తమిళనాడులో నిజంగా జరిగిన కథ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది వలస కూలీల మీద తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని అబద్ధపు ప్రచారం సాగించిన శక్తులకి చెంప పెట్టు లాంటి కథ. అయోధ్యలో నివసిస్తున్న ఉత్తరాది బ్రాహ్మణ కుటుంబాన్ని, తమిళనాడులోని రామేశ్వరం, మదురైలో నివసిస్తున్న తమిళుల్ని ఒకచోట చేర్చి, మానవత్వం మీద బలమైన విశ్వాసాన్ని కలిగించే - రచయిత ఎస్. రామకృష్ణన్ రాసిన కథ ఆధారంగా - తన తొలి సినిమా ప్రయత్నంగా దీన్ని అందించాడు కొత్త దర్శకుడు మంధిర మూర్తి.
        
ఒక మరణం ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తుంది. మనుషుల్లో, మానవ సంబంధాల్లో మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. అయితే మరణంతోనే ఈ మార్పులు జరగాలని కాకుండా ముందే మేల్కొంటే మరణమనే నష్టమే జరగదు. ఇది ఈ కథ చెప్పే ఒక వాస్తవమైతే, రెండో వాస్తవం- మతం కేవలం ఒక ఆచారం. ఇంకే అర్ధాలు కల్పించినా అది రాజకీయం. రేపటి భవిష్యత్తుకి ఆశాకిరణం (అయోతి) గా మతాన్ని చూడకపోయినా రాజకీయమే. రాజకీయంతో అవసరాలు తీరతాయా?
        
పై రెండు అంశాల్ని కలగలిపిన ఒక బలమైన భావోద్వేగభరిత కథగా ఇది తెరకెక్కింది. ఇందులో ముగింపులో తెలిసే అసలు విషయం కొసమెరుపుగా కథని ఆకాశానికెత్తేస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే ఈ ముగింపులో చిన్న డైలాగు ఇంకో ఎత్తు. క్లుప్తంగా, మృదువుగా పలికే ఈ రెండు పదాల డైలాగు సినిమాని ఎక్కడికో తీసికెళ్ళిపోతుంది ఎమోషనల్ హై తో. ఇంతవరకూ కథలో తెలియని కోణం అమాంతం బయటపడి నిశ్చేష్టుల్ని చేస్తుంది. ఇందుకే ఇది రెగ్యులర్ అరవ సినిమా కాలేదు, అరుదైన తమిళ సినిమా అయింది.

నటనలు - సాంకేతికాలు

శశికుమార్ ది రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్ర కాదు. వూర మాస్ అరవ హీరోయిజాల తమిళ ప్రేక్షకులకి ఇదొక షాక్. అయితే ప్రారంభంలో సముద్ర తీరంలో సన్నాసుల్ని ఉతికే మాస్ ఎంట్రీ సీను పాత్రకి అవసరం లేకపోయినా దర్శకుడికి ఎత్తుగడగా తప్పనట్టుంది. ఇది తప్పితే శశికుమార్ సగటు మనిషి పాత్ర సహజత్వంతో ఎక్కడా రాజీపడదు. అతనెక్కడా నవ్వడు, పైగా ఒకే ఎక్స్ ప్రెషన్ తో వుంటాడు. మౌనంగా వుంటాడు. సన్నివేశం సహజ బలాన్ని ఉత్పత్తి చేస్తే నటుడికి భావ ప్రకటనతో పనుండదు. సన్నివేశాల్లో శశికుమార్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకపోయినా, అతడి మౌనంతో మైండ్ ని చదవగలం. ఈ సబ్ టెక్స్ట్ (ఉపవచనం) గురుదత్ ప్యాసా లోని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ టైపు కథనం వల్ల వస్తుంది.
        
ఎదుటి పాత్రలు వాటి ఆక్రోశాలతో ఎంత ప్రకోపితులైనా సరే, శశి కుమార్ సాక్షిలా వుంటాడు తప్పితే ఆ ఎమోషనల్ తూఫానులో తానూ సుడిగుండమై పోడు. సాక్షిలా గమనిస్తూ తగిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రత్యేకతే ఇతర పాత్రల్నుంచి అతడ్ని వేరు చేసి దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది. ఈ యాక్టివ్ పాత్ర హీరోయిజం విజువల్ గా, ఆబ్జెక్టివ్ గా  వుండకుండా, కనపడని సబ్జెక్టివ్ గా వుంటుంది.
        
కూతురి పాత్రలో ప్రీతీ అస్రానీ నటన బలమైన ముద్ర. యువ నటీమణుల్లో కావాల్సినంత సామర్ధ్యముంది. లపాకీ సినిమాల్లో వాళ్ళని టపాకీ పాత్రలకి పరిమితం చేయడంతో టాలెంట్ ని ప్రదర్శించుకోలేని స్థితిలో వుండిపోతున్నారు. తండ్రితో వేధింపులకి గురవుతూ అణిగిమణిగి వున్న కూతురు తను. ఇక మెడికల్ కాలేజీలో తల్లి శవపేటిక ముందు తండ్రి మీద తిరగబడి కళ్ళు తెరిపించే - లావాలా బ్రద్ధలయ్యే సీనుని హేండిల్ చేసిన విధం ఆమెకే సాధ్యమవుతుంది.  సినిమా మొత్తంలో సుడిగాలిలా కమ్మేసే సీను ఇదొకటే. తమ్ముడికి తనే దిక్కుగా మిగిలిన పరిస్థితి సహా సానుభూతి పొందే నటనకి గీటు రాయిలా నిల్చింది. శశి కుమార్ తర్వాత ప్రధాన ఆకర్షణ ఈమె నటనే. తమ్ముడుగా మాస్టర్ అద్వైత్ దైన్యంతో కూడిన మొహం ఒక వెంటాడే దృశ్యం.      
        
తల్లిగా అంజూ అస్రానీ భర్త పెట్టే బాధల్ని దాచుకుని ఓదార్పు చూపే సాత్విక పాత్రలో కన్పిస్తుంది. గుట్కా తినే తండ్రి బలరాం గా బాలీవుడ్ నటుడు యశ్పాల్ శర్మ వొంటి మీద రామభక్తి, ఇంట్లో రావణ కుయుక్తి పాత్రని బలంగా పోషించాడు. అయోధ్యలో అతడి వుండకూడని రావణ కుయుక్తి, రామేశ్వరంలో కూతురి చేతిలో హుళక్కి అయ్యే సన్నివేశంలో పురుగులా మిగిలి తెగ జాలిని పొందుతాడు. రామేశ్వరం వెళ్తే శని వదిలినట్టయింది. . 
        
భార్య మృతదేహంతో ప్రతీచోటా సాంప్రదాయం పేరుతో అడ్డుపడతాడు. పోస్ట్ మార్టం తో, పోలీస్ ప్రొసీజర్ తో, అవయవ దానంతో, ఏర్ పోర్టు రూల్స్ తో ప్రతీచోటా న్యూసెన్స్ చేస్తాడు. అవయవ దానమనేసరికి- నీయమ్మ ఏంట్రా -  గుండె తీసేసి, కళ్ళు తీసేసి, కిడ్నీలు కూడా తీసేసి స్వర్గాని కెలా పంపుతారురా? ఆమె ఆత్మ ఎలా శాంతిస్తుంది రా? - అంటూ కేకలేస్తాడు. శశికుమార్ మౌనం గా వుంటాడు.
        
శశి కుమార్ నేస్తంగా పాండీది కూడా కీలకపాత్రే.  విమాన టిక్కెట్ల కోసం బైక్ ని  అమ్మేసే శశికుమార్ ఇంకో స్నేహితుడు, ఉచితంగా శవపేటికని తయారు చేసిచ్చే ఇంకో పాత్ర, పోస్టుమార్టం విషయంలో పోలీసుల సహాయగుణం, మెడికల్ కాలేజీ సిబ్బంది ఔదార్యం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు లేకపోతే రూల్స్ లో లూప్ హోల్స్ ఏమున్నాయా అని వెతికే ఏర్ పోర్టు అధికారీ పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా వుంటాయి.
        
రెండు పాటలున్నాయి- పోలీస్ స్టేషన్లో దొంగలతో పోలీసులు పాడించే పాట (ఇది కావాలని రిలీఫ్ కోసం పెట్టినట్టుంది). ఈ పాటలో శశికుమార్, పాండీ బయట కూర్చుని వుంటారు. అరవ సినిమా అయితే దొంగలతో ఆడి పాడతారు. రెండో పాట సెకండాఫ్ లో మాంటేజ్ సాంగ్. ఈ సాంగ్ లో యశ్పాల్ శర్మ పాత్ర ఇంటి దగ్గర క్రూరత్వాలు బయట పడతాయి. అతడి పాత్ర నేపథ్యం ఇక్కడ వెల్లడవుతుంది.  
        
కెమెరా వర్క్, ఎడిటింగ్ నాణ్యంగా వున్నాయి.  కెమెరా వర్క్ లో అయోధ్యా, మదురై, రామేశ్వరం దృశ్యాలు, పాత్రల భావోద్వేగాల విజువల్స్ జ్ఞాపకముండి పోతాయి. కేవలం మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే - ఒక రోజులో పూర్తయ్యే స్వల్ప కథకి, ఎమోషన్లని తోడే ఎక్కువ సందర్భాలకి తావుండదు. అటువంటప్పుడు డల్ అయిపోతూంటుంది రన్. అందుకని చనిపోయిన తల్లిని చూసి ఏడ్చే పిల్లల విజువల్స్ ని- కథనం డల్ అయ్యే అవకాశమున్న రెండు మూడు చోట్లా రిపీట్ చేస్తూ ఎమోషనల్ హైని, కంటిన్యూటీనీ సాధించినట్టున్నాడు ఎడిటర్. ఇది అరవ సినిమా ఓవర్ మేలో డ్రామా అన్పించ వచ్చుగానీ, రన్ ని కాపాడ్డానికి చేసిన ఎడిటింగ్ కళ కూడా కావొచ్చు.

చివరికేమిటి

ఈ మధ్య వస్తున్న సస్పెన్స్ సినిమాల్ని మధ్య మధ్యలో నిద్ర మేల్కొని చూడాల్సి వస్తున్న క్రాఫ్టు చచ్చిపోయిన రోజుల్లో- సోషల్ జానర్ స్వల్ప కథ అయిన అయోతి లో, దృష్టి మరల్చలేని రెండు గంటల పకడ్బందీ కథనం చేయడంలో అనుసరించిన విధానం చూస్తే- కృత్రిమ ఫార్ములాలకి భిన్నంగా, ఆర్గానిక్ గా సహజ భావోద్వేగాల సృష్టే స్పష్టమవుతుంది. కదిలించే సన్నివేశాల పరంపరే ఈ స్వల్పకథకి బలం. పూర్తి విషాదంతో కూడిన సినిమా ఈ రోజుల్లో రిస్కే అయినా, ఆ విషాదం కథ లోతుల్లోంచి నిజంగా కదిలించే విషాదమైతే టీనేజర్ కూడా అతుక్కుపోయి చూస్తాడని ఇందువల్ల తెలుస్తోంది.
       
టీనేజర్స్ కి ప్రీతీ అస్రానీ టీనేజి పాత్ర
, పిల్లలకి మాస్టర్ అద్వైత్ బాల పాత్ర, జనరల్ యూత్ కి హీరో శశికుమార్ పాత్ర, గృహిణులకి అంజూ అస్రానీ తల్లి పాత్ర, పెద్దలకి యశ్పాల్ శర్మ పాత్రా ముట్టడించి అన్ని ఏజి గ్రూపులకి విజువల్ అప్పీల్ ని ఎడతెరిపి లేకుండా పంచుతోంటే, విషాదంతో నిండిన రెండు గంటల ఈ స్వల్ప కథ తేలిపోయే అవకాశం లేదు.
       
ప్రేక్షకుల్ని ప్లీజ్ చేయడానికి  రోమాన్స్ లేదు
, కామెడీల్లేవు, టైమ్ పాస్ పాటల్లేవు, ఎలాటి కమర్షియల్ హంగులూ లేవు. అసలు సాధారణంగా అనుకునే హీరోయిజమే లేదు. సబ్ ఫ్లాట్స్ లేవు. ఎక్కువ పాత్రల్లేవు. కేవలం మరణమనే విషాదంతో, మృతదేహాన్ని అయోధ్యకి చేర్చే ఒకే లైనుతో, దాని చుట్టూ సంఘర్షణతో మాత్రమే ఈ స్వల్ప కథ వుంది.
       
ఈ సంఘర్షణలో సాధారణంగా హీరోకి వుండే ప్రత్యర్ధి లేడు. పరిస్థితులే వివిధ అడ్డంకులుగా వుంటాయి. మృత దేహం తరలింపు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి చేయాల్సిన పనులకి సంబంధించి. స్క్రీన్ ప్లేలో 25 వ నిమిషంలో యశ్పాల్ శర్మ - టాక్సీ డ్రైవర్ కొట్లాడుకుని జరిగే యాక్సిడెంట్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇదే కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ లో హీరో శశి కుమార్ వుండడు. అమల్లో వున్న నియమాల ప్రకారమైతే టాక్సీ డ్రైవర్ గా శశికుమారే వుంటాడు. కాన్ఫ్లిక్ట్ లో అతనుండాలి కాబట్టి. కానీ ఈ నియమాన్ని పాటించలేదు కొత్త దర్శకుడు. అయినా కథ గానీ
, పాత్ర గానీ దెబ్బ తినలేదు. ఇదొకటి గమనించాల్సిన విషయం.
       
ఫస్ట్ యాక్ట్ అయోధ్యలో 10 వ నిమిషంలో యశ్పాల్ శర్మ రామేశ్వరం ప్రయాణం గురించి కుటుంబానికి చెప్పాక
, రామేశ్వరం సముద్ర తీరంలో సన్నాసులతో పైటింగ్ తో ఎంట్రీ సీను వేసుకుని వెళ్ళిపోతాడు హీరో శశికుమార్. ప్లాట్ పాయింట్ వన్ లో మదురై సమీపంలో యాక్సిడెంట్ తర్వాత, టాక్సీ డ్రైవర్ ఫోన్ చేయడంతో, అంబులెన్స్ డ్రైవర్ గా శశికుమార్ కాన్ఫ్లిక్ట్ లోకి - సెకండ్ యాక్ట్ లో ఎంటరవుతాడు. ఇది గమనించాలి.
       
ఇక్కడ్నుంచి మృతదేహాన్ని అయోధ్యకి తరలించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకదాని తర్వాతొకటి కాన్ఫ్లిక్టుల వరస మొదలవుతుంది. ఆ రోజు దీపావళి పండుగ సెలవు కాబట్టి ఈ పరిస్థితి. కథనంలో ఐరనీ ఏమిటంటే
, ఒక  వైపు మృతదేహంతో పాట్లు, మరో వైపు తెల్లారినప్పట్నించే వీధుల్లో టపాకాయలతో పండుగ సందడి. అయితే ఎవరైనా శుభమా అని దీపావళి పండుగ రోజు ఇల్లు వదిలి తీర్ధ యాత్ర పెట్టుకుంటారా అన్నది ప్రశ్న.  పెట్టుకుంటారేమో అదేమంత పెద్ద విషయం కాదనుకుంటే, అఖండ సాంప్రదాయ వాదియైన బలరాం (యశ్పల్ పాత్ర) లాంటి వాడు పెట్టుకుంటాడా అన్న పాత్ర చిత్రణకి సంబంధించిన ప్రశ్న తలెత్తుతూనే వుంటుంది. పండుగ సెలవుతో అవాంతరాల కోసమే కొత్త దర్శకుడు పాత్రచిత్రణని బలిపెట్టి వుండాలి.
       
రెండోది యశ్పాల్ దగ్గర డబ్బుల్లేకపోవడం. పేదవాడైన శశికుమార్ పర్సులో వున్న రెండు మూడొందలు ఖర్చు పెట్టేసి ఇబ్బంది పడడం. ఎక్కడో పర రాష్ట్రానికి ప్రయాణం పెట్టుకున్న యశ్పాల్ దగ్గర టాక్సీ ఫేర్ కి మించి డబ్బులే వుండవా
? అయోధ్యలో మిత్రుడికి ఫోన్ చేస్తే, విమాన టికెట్లు నేను చూసుకుంటాను, దిగులు పడొద్దంటాడు మిత్రుడు. ఈ లోపాలు కూడా గమనించాలి.
       
ప్రీతీ అస్రానీ తల్లికి రామేశ్వరంలో కట్టుకోవడానికి సెలెక్టు చేసే చీర
, తమ్ముడు హుండీలో డబ్బు దాచుకునే చర్యా- ఈ రెండూ తర్వాత ప్లాట్ డివైసుల రూపంలో అవసరంలో అనూహ్యంగా తెరపైకొచ్చి థ్రిల్ చేస్తాయి. స్వల్ప కథ సింగిల్ లైను కుంగ కుండా ఇలాటి క్రియేటివ్ ఎలిమెంట్స్ ప్రయోగం కూడా తోడ్పడింది.
       
భాషల విషయంలో రాజీ పడలేదు కొత్త దర్శకుడు.
హిందీ మాట్లాడే పాత్రలు హిందీయే మాట్లాడడం, తమిళం మాట్లాడే పాత్రలు తమిళమే మాట్లాడడం చేస్తాయి. ఎవరి మాతృభాషలో ఆ పాత్రలు మాట్లాడ్డం వల్ల సహజత్వమే కాకుండా, ఎదుటి పాత్ర భాష అర్దంకాని టెన్షన్, భావోద్వేగాలు కూడా ఏర్పడుతూ కథనం బలీయమవుతూ పోవడానికి తోడ్పడింది.
       
ప్రత్యర్ధి లేని కథనంలో కథనం చప్పబడకుండా వివిధ ప్రభుత్వ లాంచనాల సమస్యలే టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫుని పెంచుతూపోయే క్రమం కన్పిస్తుంది. ప్రభుత్వ లాంచనాలకి సంబంధించి కొత్త దర్శకుడు మంచి రీసెర్చి చేసినట్టు కన్పిస్తుంది. సన్నివేశాల్లో బలీయమైన హ్యూమన్ డ్రామా సృష్టి వల్ల డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం కూడా తొలగిపోయింది. పౌరుల
జీవితాల భద్రత కోసం రూపొందించిన ప్రభుత్వ నిబంధనల మధ్య చిక్కుకున్న సామాన్య ప్రజల వేదనని, వాటిని పాటించడంలో వున్న ఆచరణాత్మక సమస్యల్ని, ఓ పరాయి పట్టణంలో చిక్కుకుపోయిన దిక్కులేని కుటుంబాన్ని ప్రతీకగా చేసి చూపించాడు కొత్తదర్శకుడు. పోలీసు రిపోర్టులో పేరులో స్పెల్లింగ్ తప్పులు చూసి ఏర్ పోర్టు అధికారి అనుమతి నిరాకరించే లాంటి బ్రిటీష్ కాలం నాటి ఆఫీసర్ల బాబు డమ్ ఇంకా వేళ్ళూ నుకోవడం ఒక విచారకర స్థితి.

'
అయోతీ
ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు. కథ చెప్పడంలో అమల్లో వున్న సాంప్రదాయాల్ని కాసేపు పక్కన బెట్టి, ఒక క్రియేటివ్ వైకల్పం చూపిస్తున్న కొత్త దర్శకుడు మంధిర మూర్తి మలి ప్రయత్నమెలా వుంటుందో ఇక చూడాలి.

—సికిందర్

 

11, ఏప్రిల్ 2023, మంగళవారం

1318 : మూవీ నోట్స్

 


టాలీవుడ్ (బెంగాలీ సినిమా పరిశ్రమ) లో ప్రోస్థెటిక్స్ మేకప్ ఆర్టిస్టు విన్సీ డాఇతను జగత్ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ వీరాభిమాని. డా విన్సీ పేరుని తిరగేసి తన పేరుగా పెట్టుకున్నాడు. ఇతను పరమ నీచంగా మారిన తన జీవిత కథ చెప్పుకొస్తూంటాడు. ఈ కథలో ఆది బోస్ అనే 18 ఏళ్ళ వాడు తల్లిని వేధించే తాగుబోతు తండ్రిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేస్తాడు. పోలీసులకి లొంగిపోతాడు. కోర్టు పిచ్చాసుపత్రికి పంపిస్తుంది. ఇలా వుండగా, టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అయిన విన్సీ డా తండ్రి చనిపోవడంతో, అతడి కొడుకుగా టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అవకాశాలు పొందడానికి స్ట్రగుల్ చేస్తూంటాడు. డావిన్సీ కళనే నమ్మిన తను, ఆ కళా ప్రక్రియతో రాణించే పరిస్థితుల్లేక తీవ్ర నిరాశతో వుంటాడు. ఇలా వుంటూనే జయ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

ప్పుడు  ఆది బోస్ పెద్దవాడై జైలు నుంచి విడుదలవుతాడు. ఇతను తనని తాను సీరియల్ లాయర్ గా భావించుకుంటాడు. అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఒక దుర్మార్గమైన పథకాన్ని ఆలోచించుకుంటాడు. జైల్లో మానసిక చికిత్స అతడి క్రూర సైకో మనస్తత్వాన్ని ఏ మాత్రం రూపు మాపలేదు. ఆ పథకంతో సినిమా దర్శకుడుగా నటిస్తూ విన్సీ డా ని కలుస్తాడు. తనకి కొన్ని వందల కోట్లు బ్యాంకు స్కామ్ చేసిన శ్యామ్ సుందర్ అనే బిజినెస్ మాన్ రూపంతో మాస్కు కావాలంటాడు. ఆర్ధిక సమస్యల్లో వున్న విన్సీ డా ఈ పనికి ఒప్పుకుని మాస్క్ తయారు చేసి ఇస్తాడు. ఆది బోస్ ఆ మాస్క్ వేసుకుని బ్యాంకుని దోచుకుని, సెక్యూరిటీ గార్డ్ ని చంపేసి పారిపోతాడు. దీంతో బ్యాంకు స్కామ్ కేసులో తప్పించుకున్న బిజినెస్ మాన్ శ్యామ్ సుందర్, ఇప్పుడు బ్యాంకు దోపిడీ ప్లస్ హత్య కేసులో అరెస్టయి పోతాడు.

ఇది తెలుసుకున్న విన్సీ డా షాకవుతాడు. ఆది బోస్ తనని మోసం చేశాడని అర్ధమవుతుంది. ఇందులో అమాయకుడైన సెక్యూరిటీ గార్డుప్రాణాలు  కోల్పోవడమే కలచివేస్తుంది. తను ఆరాధించే ప్రోస్థెటిక్స్ కళ ఇలా నేరానికి ఉపయోగపడిందన్న భయంకర సత్యం నిద్రపోనివ్వదు. ఈ పరిస్థితుల్లో ఇక వీన్సీ డా మరిన్ని మాస్కులు తయారు చేయడని గ్రహించిన ఆది బోస్, విన్సీ డా మొదటి మాస్కు తయారు చేసినప్పుడు తీసిన వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తాడు.

దీంతో అరెస్టు భయంతో బ్లాక్ మెయిల్ కి లొంగిన విన్సీ డా
, రెండో మాస్కు తయారు చేసి ఇస్తాడు. ఈసారి ఒక రాజకీయ నాయకుడి కొడుకు మాస్కు. ఈ కొడుకు నిర్లక్ష్యంగా కారు నడిపి కొందర్ని చంపేసిన కేసు నుంచి బయటపడ్డాడు. ఇతడి మాస్కు వేసుకున్న ఆది బోస్, ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కారు తోలి చంపేస్తాడు. దీంతో అప్పుడు అంత మందిని చంపి తప్పించుకున్న రాజకీయ నాయకుడి కొడుకు, ఇప్పుడు తప్పించుకోలేని విధంగా ఇరుక్కుంటాడు.

ఆ చనిపోయిన వాళ్ళల్లో ఒకడి కొడుకు విన్సీ డా ని కలుసుకోవడంతో విన్సీ డాకి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంకా ఈ నేరాల్లో ఆది బోస్ కి భాగస్థుడ్ని కాలేనని ఎదురు తిరుగుతాడు. ఆది బోస్ విన్పించుకోకుండా, చివరి మాస్కు ఒక రేపిస్టుది తయారు చేయమంటాడు. ఆ మాస్కు వేసుకుని రోడ్డు మీద పోతున్న ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు. ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాడు. ఇది వరకు రేప్ కేసులో విడుదలై పోయిన రేపిస్టు ఈసారి బయటపడలేని విధంగా ఇరుక్కుంటాడు. అయితే ఆ వీడియో చూసిన విన్సీ డా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆది బోస్ రేప్ చేసింది ఎవర్నో కాదు,  తన గర్ల్ ఫ్రెండ్ జయనే! ఆమె ఆత్మహత్య చేసుకోబోతూంటే కాపాడుకుంటాడు.

ఇక ఆది బోస్ మీద పగబట్టి అతడి మీద విష ప్రయోగం చేస్తాడు విన్సీ డా. ఆది బోస్ మాస్కు వేసుకుని ఆది బోస్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నమ్మిస్తూ వీడియో తీస్తాడు. ఈ వీడియో చూసిన పోలీస్ ఇన్స్ పెక్టర్, వీడియోలో ఆది బోస్ గొంతు తేడాగా వుందని ఇన్వెస్టిగేట్ చేసి విన్సీ డా ని పట్టుకోబోతే, వృద్ధులుగా మారువేషాల్లో వున్న విన్సీ డా, జయా దేశం విడిచి పారిపోతారు.

ఆ కథతో ఈ కథ

పై కథ 2019 లో శ్రీజిత్ ముఖర్జీ దర్శకతంలో వచ్చిన విన్సీ డా అనే బెంగాలీ సినిమాలోది. క్రైమ్ జానర్ సినిమాని పునర్నిర్వచించిన మూవీ ఇది. నేరస్థుల్ని శిక్షించ డానికి అమాయకుల్ని బలిగొనే దుర్మార్గపు శిక్షా స్మృతి వీక్షకుల్ని, అదే సమయంలో సమీక్షకుల్నీ ఉలిక్కి పడేలా చేసింది. ఇది చూసి దర్శకుడు సుధీర్ వర్మ, రచయిత శ్రీకాంత్ విస్సా కూడా సముచిత రీతిలో ఉలిక్కిపడి వుంటారు. మాస్ మహారాజా రవితేజకి చెప్తే, ఆయన కూడా తగు విధంగా ఉలిక్కిపడి వుంటారు. ఉలిక్కిపడ్డ ముగ్గురూ కలిసి  విన్సీడా కి రుసుము చెల్లించకుండా ఉచితంగా సంగ్రహించి, రావణాసుర గా ప్రేక్షకుల్ని ఉలిక్కిపడేలా చేద్దామనుకుంటే, చీమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రేక్షకులకి! 

కథ ఫ్రీగా దొరికిందని రవితేజ హీరోయిన్ని రేప్ చేసి, ఒరిజినల్లో కూడా లేనివిధంగా  -బోనస్ గా గొంతు కూడా కోసి క్రూరంగా చంపితే ఎలా? విన్సీ డా లో చిన్న హీరోలిద్దరూ ఏమైనా చేయొచ్చు. అందులోని  ఆది బోస్ విలన్ పాత్ర వేయాలని ఏ పాపులర్ స్టారూ అనుకోడు. అది రెగ్యులర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హీరో కథ కాదు. దానికి నెక్స్ట్ జన రేషన్ కథ. పాపులర్ స్టార్ నటించాల్సింది కాదు. నటిస్తే విన్సీ డా పాత్ర నటించుకోవచ్చు. ఆది బోస్ పాత్రతో రవితేజ కోసం కథ మార్చినప్పుడు చేసిన ఇంకో చేయరాని పనేమిటంటే, రొటీన్ సీరియల్ కిల్లర్- ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా చుట్టేయడం.

మెడికల్ మాఫియా అనే పాత రొటీన్ కి, ఆ మాఫియాలు ఒక్కొక్కర్ని  చంపడానికి విన్సీ డా లోని మాస్కులు తగిలిస్తే, ఈ చంపుతున్న సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే- కథంతా లాజిక్కుల సమస్యతో కలగాపులగమైపోయింది. పైగా ఇలాటి పోలీస్ వెర్సెస్ కిల్లర్ కథకి సస్పెన్స్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. ఎందుకు చంపుతున్నాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తే, అది వందల సినిమాల్లో చూపించిన మూస కారణమే. ఇలా ఏదో అన్యాయానికి గురైన హీరో, చట్టాన్ని  చేతుల్లోకి తీసుకున్న కాన్సెప్ట్ కాదు విన్సీ డా. ఆడుతున్న నెమలిని తీసుకొచ్చి అరుస్తున్న కాకిని చేశారు.

ఇక మాస్కులు తయారు చేసే విన్సీ డా పాత్ర నటించిన సుశాంత్ కి  విన్సీ డా లోని మేకప్ ఆర్టిస్టు బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. వూరికే మాస్కులు తయారు చేసే పాత్రగా ఫ్లాట్ గా వుంటాడు. అసలు  విన్సీ డా పోలీస్ వర్సెస్ కిల్లర్ కథ కాదు. విన్సీ డా ఇద్దరు హీరోల మధ్య విన్సీ డా వర్సెస్ సైకో కిల్లర్ కథ! అందుకని విన్సీ డా లో లాజిక్కులు, సస్పెన్సులు, థ్రిల్సు వుండవు. విన్సీ డా కథ వీటి గురించి కాదు. రెండు భిన్న ధృవాలుగా వున్న పాత్రల మధ్య, నైతికతలకి సంబంధించిన - ఒక డిస్టర్బింగ్ ఐడియాలజీని స్థాపించే డ్రామా. ముందు ఈ జానర్ మర్యాదని అర్ధం జేసుకోవాలి!

అతి మానవుడి అవతరణ

ఈబర్ మెంచ్ (Übermensch) అనేది 1883 లో జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే కాయిన్ చేసిన పదం. అంటే తనని తాను అతి మానవుడు (సూపర్ హ్యూమన్) గా భావించుకునే వాడని అర్ధం. తను రాసిన  'థస్ స్పేక్ జరతూస్త్ర' లో దేవుడు ఎలా చనిపోయాడో వివరిస్తాడు నీషే. దరిమిలా మెరుగైన భవిష్యత్తు కోసం ప్రపంచాన్ని క్రమబద్ధీకరించే బాధ్యత ఈబర్ మెంచ్ పై వుంటుంది.  దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ  'విన్సీ డా' కథా కథనాలకి ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. ఇది మానసికంగా కుంగిపోయిన ఆది బోస్ కథ.  ఇతను తనని తాను నీషే తలపోసిన ఈబర్ మెంచ్ గా భావించుకుంటాడు. అవినీతి వ్యవస్థ కారణంగా న్యాయాన్ని తప్పించుకునే, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులకి వ్యతిరేకంగా తను పాల్పడే చర్యల్లో, అమాయకుల్ని బలి చెయ్యాల్సిందేనన్న దుర్మార్గాన్ని ఈజీగా తీసుకునే రకం.

ఇంతవరకూ విజిలాంటీ జస్టిస్ (న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం) సినిమాలు చూశాం. 1974 లో డెత్ విష్ దీనికి పెద్ద బాట వేస్తూ, అదే సమయంలో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంది. అప్పటి విలువలకి - సమాజాలకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మింగుడు పడని వ్యవహారంగా వుంది. కానీ సినిమా టెంప్లెట్ల లంపటంలో చుట్టుకుని అక్కడక్కడే పడి వుండదు. కాలానికి ముందుంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే డెత్ విష్ తర్వాత నెక్స్ట్ లెవెల్  ఏంటి? దీనికి సమాధానమే నేటి కాలాని కంటే ముందున్న విన్సీ డా’.

నీషే ప్రకారం దేవుడు చనిపోయి ఈబర్ మెంచ్ అవతరిస్తే వేరేగా వుంటుంది లోకం. నేరస్థులు న్యాయ స్థానం నుంచి, దేవుడి శిక్షనుంచీ తప్పించుకుంటే ఇంకేం జరగాలి? చట్టమూ చచ్చిపోయి, దేవుడూ చచ్చిపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికెళ్ళాలి? అందుకని ఈ సామాజిక రొష్టులోంచి అతిమానవుడు రొష్టుగా అవతరిస్తాడు. నేరస్థులు చేసిన నేరాల్నే పిచ్చెక్కి అమాయకుల్ని బలి పశువుల్ని చేసి రీక్రియేట్ చేస్తాడు. నేరస్థుల్ని జైల్లో కుక్కేస్తాడు. అతిమానవుడి కచ్చ నేరస్థులతో కాదు. నేరస్థుల్ని చంపే విజిలాంటీ జస్టిస్ కాదు. ఆ రోజులు పోయాయి. చట్టం మీద, దేవుడి మీద అతడి కచ్చ. చట్టమూ, దేవుడనే వాడుంటే  దేవుడూ వొళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే అతి మానవుడు అతలాకుతలం చేసి  చూపించే సన్నివేశం ఇదే!

        ఇంత అర్ధంతో స్టడీ చేసి శ్రీజిత్ ముఖర్జీ విన్సీ డా తీస్తే, ఇదా రావణాసుర తో మర్యాద?