రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, అక్టోబర్ 2023, శనివారం

1371 : రివ్యూ


 

రచన -దర్శకత్వం : వంశీ
తారాగణం : రవితేజ, నుపుర్ సానన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషు సేన్‌గుప్తా తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : ఆర్. మధి
బ్యానర్ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, నిర్మాత: అభిషేక్ అగర్వాల్
విడుదల : అక్టోబర్ 20, 2023
***

మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో టైగర్ నాగేశ్వర రావు కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నంలో, రవితేజకే హాని జరిగే తీరు తెన్నులతో కూడా తయారైంది సినిమా. రవితేజ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పానిండియా స్థాయిలో సినిమాని విడుదల చేయించడం వల్ల ఆ లెవెల్లో ప్రతిష్ట కూడా దెబ్బ తింది. ఈ బయోపిక్ ఎలాగో గట్టెక్కడానికి వివాదాస్పదమై ప్రేక్షకుల్ని ఆకర్షించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కరుడుగట్టిన దొంగని సమర్ధించే వర్గాలు వుండవు కాబట్టి.
        
ఇంతకీ ఏమిటీ సినిమా/బయోపిక్? భగవంత్ కేసరి’, లియో ల తర్వాత ఎంతో హడావిడీ చేస్తూ పండక్కి విడుదలైన ఇది మొదటి రెండు సినిమాల పక్కన ఎక్కడ నిలబడుతుంది? దీని కొచ్చే రెస్పాన్స్ ఎంత? ఇవి తెలుసుకుందాం...

కథ

    1970 లలో ఢిల్లీలో ఐబీ చీఫ్ రాఘవేంద్ర రాజ్పుత్ (అనుపమ్ ఖేర్) నుంచి బాపట్ల డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి (మురళీ శర్మ) కి అర్జెంట్ కాల్ వస్తుంది. విశ్వనాధ శాస్త్రి ఢిల్లీ చేరుకుంటే, ఐబీ చీఫ్ ప్రధానమంత్రి భద్రతాదళానికి టైగర్ నాగేశ్వరరావు నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని, ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరని అడుగుతాడు.
        
విశ్వనాథ శాస్త్రి చెప్పడం మొదలు పెడతాడు... నాగేశ్వరరావు స్టూవర్ట్ పురం దొంగ. అతను పోలీసులకి ఛాలెంజి విసిరి మరీ దోపిడీలు చేస్తాడు. దొరక్కుండా తప్పించుకుంటాడు....అంటూ పూర్తి వివరాలు అందిస్తాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రధాని భద్రతా దళాన్ని ఏమని బెదిరించాడు? ఆ బెదిరింపు ప్రకారం ఏ నేరానికి పాల్పడ్డాడు? అప్పుడేం జరిగింది? ప్రధాని రియాక్షన్ ఏమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    రవితేజ సినిమా కథలా వుంటూ, రవితేజకే అడ్డుపడే సన్నివేశాలతో వుంది. ఒక క్రిమినల్ ని గ్లోరిఫై చేయడానికి కొన్ని జాగ్రత్తలుంటాయి. పుష్ప లో కాల్పనిక స్మగ్లర్ క్యారక్టర్ ని గ్లోరిఫై చేయడానికి వ్యక్తిగత జీవితంతో ఆ జాగ్రత్తలు పాటించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా నిజ వ్యక్తి కథ. ఈ నిజ వ్యక్తి కథ బయోపిక్ గా తీసి గ్లోరిఫై చేయడానికి, రవితేజని ఇంకో స్థాయికి తీసికెళ్ళడానికీ పనికి రాని కథ. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద ఎక్కడా ఒక పుస్తకం వెలువడ లేదు. వాళ్ళూ వీళ్ళూ  చెప్పుకునే కథలూ, కొన్ని పోలీస్ రికార్డులూ ఇవే వున్నాయి. సినిమాకి సరిపోను మెటీరీయల్ లేకపోవడం చేత, భారీగా కల్పన చేసిన సన్నివేశాలతో సినిమాని నింపక తప్పలేదు. అడిగే వారెవరుంటారు.
       
ఈ కల్పితాలు చేయడానికి ఏ పాయింటుని ప్రధానంగా తీసుకుని కథ నడపాలో కూడా తెలుసుకోనట్టుంది. నాగేశ్వరరావు గురించి ప్రచారంలో వున్నవి రెండే అంశాలు- పోలీసులకి దొరక్కుండా చెప్పి మరీ దోపిడీలు చేయడం
, దోచుకుంది పేదలకి పంచి పెట్టడం. అంటే పోలీసులకీ నాగేశ్వరరావుకీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంతో- ప్రధాన కథని యాక్షన్ కథగా మార్చి  థ్రిల్లింగ్ గా నడుపుతూ, ఉపకథగా పేదలకి డబ్బు పంచే మానవీయ కోణాన్ని ఆవిష్కరించ వచ్చు.
         
ఇందులో మొదటిది చూపించకుండా
, రెండోదే చూపించడంతో ప్రధాన కథ గల్లంతైన సినిమా అయింది. ఏవో కొన్ని దోపిడీలు చూపించారు- కానీ పోలీసులతో వుండాల్సిన ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ పార్టు మర్చిపోయారు. ఇంకేం సినిమా ఆడుతుంది?
       
చరిత్రలో నాగేశ్వరరావు లాంటి నేరస్థుడే వున్నాడు. అతను ఉన్నత స్థానాల్లో చిటికెలో ఆర్ధిక నేరాలు చేసి తప్పించుకునే ఫ్రాంక్ అబిగ్నేల్. పోలీసులకి దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతడి మీద
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని సినిమా తీశాడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. దొంగగా లియోనార్డో డీకాప్రియో, పోలీసుగా టామ్ హాంక్స్. ఫ్రాంక్ అబిగ్నేల్ దేనికి ప్రసిద్ధో ఆ ఎలుకా పిల్లీ చెలగాటాన్నే కథగా చేసి, టైటిల్ కూడా అలాగే పెట్టి  తీశాడు స్పీల్ బెర్గ్. టైగర్ నాగేశ్వరరావు లో ఈ పాయింటునే పక్కన బెట్టి పానిండియా తీశారు.
       
డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి చెప్పుకొచ్చే కథ- రైలు దోపిడీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టి పెరిగి దొంగగా మారిన కథ వస్తుంది. ఆ తర్వాత రవితేజ రెగ్యులర్ సినిమా టెంప్లెట్ ప్రారంభమైపోతుంది. బాపట్లలో ఓ కాలేజీ
, కాలేజీలో చదివే హిందీ అమ్మాయి- ఆమెని ఆకలిగా చూస్తూ వెంటపడి వేధించి, డిజైనర్ డ్రెస్సుల్లో   స్టెప్పులేస్తూ పాటలు పాడి, ఆమె పెళ్ళి చెడగొట్టి తనవైపు తిప్పుకునే కామెడీ లవ్ ట్రాకు! కనీసం 15 మంది ఇక్కడే లేచిపోయారు థియేటర్లోంచి.
       
తిరిగి ఓ రెండు దోపిడీలు
, ఆ తర్వాత సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే పేదలకి డబ్బులు పంచే రాబిన్ హుడ్ ఎపిసోడ్. టెంప్లెట్ ప్రకారం ఫస్ట్ హీరోయిన్ ఫస్టాఫ్ లోనే దూరమవగా, సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్! పోలీసులతో పోరాటం. చివరికి ఢిల్లీలో ప్రధాని ఇంట్లో దొంగతనం! చాలా సిల్లీగా రాసి తీశాడు సినిమాని. ఎక్కడా థ్రిల్, సస్పెన్స్, మలుపులు అనేవి లేకపోగా, సన్నివేశాలు, డైలాగులు నీరసంగా వుంటాయి. యాక్షన్ పార్టులో తప్ప టాకీ పార్టులో స్పీడు అనేదే వుండదు.
       
ఇంకోటేమిటంటే
, ఫస్టాఫ్ కథని విశ్వనాధ శాస్త్రి చెప్తే- సెకండాఫ్ కథని స్టూవర్ట్ పురం పెద్ద (నాజర్) చెప్తాడు. దీని వల్ల ఫస్టాఫ్ లో చచ్చిపోయిన దుష్ట పాత్రలు సెకండాఫ్ లో మళ్ళీ వస్తాయి. రెండు దృక్కోణాల్లో కథ చెప్తే, కథ ముందు కెళ్ళక అక్కడక్కడే తిరుగుతున్నట్టే గాక, పాత్రలు మళ్ళీ కనిపిస్తూ కన్ఫ్యూజింగ్ గా కూడా వుంటుంది. ఇది కన్ఫ్యూజన్ అనుకోలేదు దర్శకుడు, చాలా క్రియేటివ్ గా కథ చెప్తున్నా ననుకున్నాడు.

నటనలు - సాంకేతికాలు

    రవితేజ నాగేశ్వర రావు పాత్రకంటే రవితేజ టైపు టెంప్లెట్ పాత్రే నటించాడు. రక్తంతో రాసే చరిత్రలు వుంటాయి, కన్నీటితో రాసే చరిత్రలు వుంటాయి, ఇది రెండూ కలిపి రాసిన చరిత్ర అని మొదట్లో కొటేషన్ పడుతుంది. రక్తమే తప్ప కన్నీరు లేదు. రక్తాలు పారిస్తూ క్రూరంగా యాక్షన్ సీన్సు నటించి, లియో విజయ్ నే మించిపోయాడు రవితేజ. డబ్బులు పంచే మానవీయ కోణం అలా చేయడానికి పురిగొల్పిన సంఘటనేదో చెప్పకపోవడంతో, ఆ ఎపిసోడ్ ఎంత నటించినా, నాయకుడు లో కమలహాసన్ ని టచ్ చేయలేక పోయాడు. గ్రాఫిక్స్ తో యంగ్ రవితేజతో వచ్చే సీన్లలో మాత్రం ఆ ఏజిని బాగా నటించాడు.
       
బాపట్లలో హిందీ అమ్మాయిగా నుపుర్ సానన్ ది ఫస్టాఫ్ లో ఫార్ములా హీరోయిన్ సంక్షిప్త పాత్ర. సెకండాఫ్ లో లోకల్ అమ్మాయిగా గాయత్రీ భరద్వాజ్ కి నిడివి వున్న పాత్ర
, దాంతో నటించే అవకాశం.  
        
ఢిల్లీలో ఐబీ చీఫ్ గా నటించిన అనుపమ్ ఖేర్ అయితే కామెడీ పాత్ర అయిపోయాడు. హిందీ వాడైన తను మారువేషంలో బాపట్లలో తిరుగుతూ దంచి కొట్టి తెలుగు మాట్లాడేస్తూంటాడు. ఇక డీఎస్పీగా మురళీ శర్మ పోలీసు విధులు సరే,
       
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు అలా వచ్చి వెళ్ళిపోతూంటాయి. 1970 ల కాలపు పీరియడ్ లుక్ కోసం నిర్వహించిన కళాదర్శకత్వం కోసం
, పోరాటాల కోసం బాగా ఖర్చు పెట్టారు. కానీ మాధి ఛాయాగ్రహణం సాధారణంగా వుంది. యాక్షన్ సీన్సు లో- ముఖ్యంగా రైలు దోపిడీ సీన్లో గ్రాఫిక్స్ నాసి రకంగా వున్నాయి. 1970 లలో సినిమా తీస్తే ట్రిక్ ఫోటోగ్రఫీ ఇలాగే వుండేది. ఈ సినిమా కథ కూడా 1970 ల నాటిదే కాబట్టి ఇలాగే వుంది.
       
చివరిగా
, వేశ్యావాటికల్లో తిరిగే వాడు, రమ్మంటే రాలేదని వేశ్య కడుపులో తన్నే వాడు, సొంత తండ్రిని తలనరికి చంపేవాడు- హీరోతో తీయాల్సిన సినిమా కాదు. విలన్ పాత్రలేసే ఆర్టిస్టుతో తీసుకోవచ్చు. అసలు ఇది సినిమాగా తీయడానికి పనికిరాని బయోపిక్!
—సికిందర్


20, అక్టోబర్ 2023, శుక్రవారం

1370 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : లోకేష్ కనరాజ్
తారాగణం : విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాతలు : లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల : అక్టోబర్ 19, 2019
***

        ళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనకరాజ్ ల  కాంబినేషన్ లో మాస్టర్ తర్వాత లియో రెండో సినిమా. భారీ ప్రచారార్భాటంతో విడుదలై, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు వసూలు చేసిందన్న నిర్మాతల ట్వీట్లతో ఇది వైరల్ అవుతోంది. కమల హాసన్- సూర్య- విజయ్ సేతుపతి లతో పానిండియా బ్లాక్ బస్టర్ విక్రమ్ తీసిన కనకరాజ్ లియో కి తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగుతుందా, కొనసాగడానికి సరిపడా విషయముందా తెలుసుకుందాం...

కథ

    పార్తీపన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నిర్వహిస్తూ కుటుంబంతో వుంటాడు. కుటుంబంలో భార్య సత్య (త్రిష), 18 ఏళ్ళ కొడుకు (మాథ్యూ థామస్), ఎనిమిదేళ్ళ కూతురు (ఇయాల్) వుంటారు. కుటుంబంతో ప్రశాంతంగా  గడుపుతున్న పార్తీపన్ జీవితంలోకి ఓ ముఠా ప్రవేశిస్తుంది. కాఫీ షాపులో డబ్బు దోచుకోవడానికి వచ్చిన ముఠా (దర్శకుడు మిస్కిన్, శాండీ) బారినుంచి కూతుర్ని కాపాడుకుంటూ వాళ్ళని చంపేస్తాడు పార్తీపన్. దీంతో అరెస్ట్ అవుతాడు. అవి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్యలుగా కోర్టు నిర్ధారించి నిర్దోషిగా విడుదల చేసేస్తుంది. దీంతో పార్తీపన్ చుట్టుపక్కల హీరోగా ప్రచారమవుతాడు. ఆ ఫోటో ఎక్కడో వున్న ఆంథోనీ దాస్ (సంజయ్ దత్), అతడి కొడుకు హెరాల్డ్ దాస్ (అర్జున్) అనే క్రిమినల్స్ చూస్తారు. పార్తీపన్ పేరుతో హిమాచల్ లో వుంటున్నది తన చిన్న కొడుకు లియో దాసేనని ఆంథోనీ గుర్తించి ఎటాక్ చేస్తాడు. తను లియో దాస్ కాదని, నువ్వెవరో తెలియదనీ వాదిస్తాడు పార్తీపన్. అయినా వినిపించు
కోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు ఆంథోనీ దాస్.
       
ఇంతకీ పార్తీపన్ ఎవరు
? ఆంథోనీ చిన్న కొడుకేనా? పార్తీపన్- లియో ఒకరు కాదా? కాకపోతే ఇంకెవరు? కొడుకుని చంపాలని ఆంథోనీ ఎందుకు పగబట్టాడు? కొడుకు అతడికేం అపకారం చేశాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పై కథా సంగ్రహం చదివితే ఆసక్తికరంగా వుంది. నువ్వు కొడుకువని విలన్ క్లెయిమ్ చేయడం, కాదని కొడుకు తిప్పికొట్టడం, కొడుకుని చంపాలని విలన్ ప్రయత్నించడం, తండ్రికి కొడుకు ఏం అపకారం చేశాడని ప్రశ్న తలెత్తడం, అసలు కొడుకు కొడుకేనా అన్న సందేహం కలగడం... ఇదంతా ఇంట్రెస్టింగ్ మాఫియా ఫ్యామిలీ డ్రామాగా కుతూహలం రేకెత్తిస్తుంది. తీరా ఈ సస్పెన్స్ మీద వున్న ముసుగు తీస్తే కంగాళీగా వుంటుంది.

టైటిల్స్ లో ఈ సినిమాకి ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ అనే హాలీవుడ్ మూవీ ప్రేరణ అని వేశారు. హాలీవుడ్ మూవీలో తండ్రీ కొడుకుల సంబంధం లేదు, క్రిమినల్- క్రిమినల్ సంబంధమే వుంది. ఈ మూవీ 2000లలో వచ్చిన గొప్ప సినిమాగా నమోదైంది. ఇందులో హీరో ట్రేడ్ మార్క్ స్కిల్స్ తో వుంటాడు. కుటుంబం మీద దాడి జరిగినప్పుడు ఆ స్కిల్స్ బయటపడి తానే ఆశర్యపోతాడు. అతను తుపాకీతో కాల్చి చంపడం ఒక ప్రత్యేక శైలితో చేస్తాడు. అలా కుటుంబాన్ని రక్షించుకోవడానికి చంపేసి నేర ప్రపంచంలో ఇరుక్కుపోతాడు. ఈ దయనీయ స్థితి సినిమా అంతటా వెంటాడే భావోద్వేగంగా వుంటుంది.  
       
ఇలాటిదే కథతో 1990 లో ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన
రౌడీయిజం నశించాలి వచ్చింది. నిజానికిది  మలయాళంలో మోహన్ లాల్ నటించిన కిరీడమ్కి రీమేక్. దీనికి మోహన్ లాల్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఇందులో ఓ బడా రౌడీ బారినుంచి కానిస్టేబులైన తండ్రిని కాపాడుకుంటూ  చంపేస్తాడు హీరో. దీంతో వూళ్ళో హీరో అయిపోతాడు. కానీ రోజురోజుకీ బయటపడలేని విధంగా రౌ డీయిజంలోనే  ఇరుక్కుపోతాడు. మరిన్ని మరిన్ని నేరాలు చేయాల్సి వస్తుంది...ఇందులో, పై హాలీవుడ్ మూవీలో ఒక నీతి వుంది. లియో లో ఇదే మిస్సయి, విలన్ కుటుంబ గొడవలకి పరిమితమై పోయింది. ఇదైనా సరిగ్గా లేదు.
       
హీరో పాత్రచిత్రణ మీద ఆధారపడ్డ ఈ కథ ఎంత అపరిపక్వంగా వుందంటే- ప్రారంభంలో విజయ్ వూరిమీద పడి దాడి చేస్తున్న హైనాని వీరోచితంగా ఎదుర్కొంటాడు. ఈ పోరాటంతో అతను పవర్ఫుల్ వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. తర్వాత కుటుంబంతో
, కాఫీ షాపుతో సాధారణ జీవితం గడుపుతున్న సామాన్యుడిలా వుంటాడు. కాఫీ షాపు మీద దుండగులు దాడి చేసినప్పుడు, వాళ్ళతో పొరాడి చంపేసి తన బలానికి తనే ఆశ్చర్యపోతాడు- మనం కాదు- ఎందుకంటే అతను ఎంత పవర్ఫుల్లో ముందే హైనాతో పోరాటంలోనే తెలుసుకున్నాం.
       
దీంతో కాఫీషాపు సంఘటనతో సామాన్యుడిగా సర్ప్రైజ్ చేసి నేరప్రపంచంలో ఇరుక్కోవాల్సిన పాత్ర పూర్తిగా రివర్స్ అయింది. పాత్ర పట్ల ఏ మాత్రం సానుభూతి కూడా పుట్టదు. ఓపెనింగ్ గ్రాండ్ గా వుండాలని హైనాతో పోరాటం పెట్టకుండా
, కాఫీషాపుతోనే అతడి జీవితం చూపించి వుంటే పాత్ర చిత్రణ- దాంతో కథా దెబ్బ తినేవి కావు. హాలీవుడ్ మూవీతో ప్రేరణ పొందడమంటే వాళ్ళు పెట్టని సీన్లు పెట్టడం కాదు.
       
లోపాలు పక్కన పెడితే ఫస్టాఫ్ మాత్రం క్లీన్ గా వుంటుంది. నీ తండ్రినంటూ సంజయ్ దత్ రావడం వరకూ
, అసలు తనెవరో మనకు తెలియకుండా విజయ్ సస్పెన్సు పోషించడం వరకూ, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో డ్రామా హాట్ హాట్ గా వుంటుంది. చిన్న ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వాలేదు. సెకండాఫ్ కొచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ తో కంగాళీగా మారిపోతుంది. ఏ మాత్రం ఒప్పించని బారుగా సాగే కుటుంబ డ్రామా, అది కూడా బలహీనంగా బయటపడుతుంది. ఇంత బ్యాడ్ రైటింగ్, మేకింగ్ టాప్ డైరెక్టర్ ఎలా చేశాడో తెలీదు. సెకండాఫ్ కథ, దాని క్లయిమాక్స్ మొత్తం సహన పరీక్షగా మారిపోతాయి. లేని కథకి యాక్షన్ సీన్లు మాత్రం భారీగా, అతి వయొలెంట్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

    కమర్షియల్ సినిమాల్లో ప్రేక్షకులు ఆశించే ఎలాటి డ్యూయెట్లు, కామెడీలు, రోమాన్సు లేకుండా సహజంగా అన్పించే రియలిస్టిక్ పాత్ర నటించాడు విజయ్. ఎక్కడా నవ్వుతూ కూడా కంపించడు. పాత్రకి తగ్గ సీరియస్ నెస్, దానికి తగ్గ యాక్షన్ సీన్స్ ఈ రెండే సినిమాలో కనిపిస్తాయి. ఈ యాక్టింగ్ కి తగ్గ పాత్రచిత్రణ, భావోద్వేగాలు కూడా వుంటే బావుండేది.
       
త్రిష కుటుంబానికి ఎదురైన ఆపదలకి సంఘర్షణ పడే పాత్రలో ముద్ర వేస్తుంది. విలన్లిలిద్దరూ- సంజయ్ దత్
, అర్జున్ పరమ బోరు పాత్రలుగా మిగిలిపోతారు సెకండాఫ్ లో. వీళ్ళ కుటుంబ కథ అదో మార్లెండ్ బ్రాండో గాడ్ ఫాదర్ ఫ్యామిలీ కథలా ఫీలవడం!
       
ట్రెండ్ లో వున్న అనిరుధ్ రవిచందర్ సంగీతంలో
నా రెడీ సాంగ్ వింటేనే బావుండొచ్చుగానీ, తెర మీద తేలిపోయింది. మిగిలిన పాటలు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ గా వస్తాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ మొదలైనవి ఫ్రెష్ గా అన్పిస్తాయి. అన్బీరవ్ సమకూర్చిన యాక్షన్ సీన్స్ లో ఎన్ని అవయువాలు తెగిపడ్డాయో, అన్నీ లీటర్ల రక్తం ప్రవహించిన్దో లెక్కే లేదు.
       
మొత్తం మీద లోకేష్  కనక రాజ్ గత మూడు సినిమాల మ్యాజిక్ మిస్సవడమే కాదు
, ఫస్టాఫ్ చూసి సెకండాఫ్ స్కిప్ చేసినా ఫర్వాలేదనిపించేలా వుంది.

—సికిందర్


19, అక్టోబర్ 2023, గురువారం

1368 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం : బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, శరత్ కుమార్, రఘుబాబు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్
బ్యానర్ : షైన్ క్రియెషన్స్, నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : అక్టోబర్ 19, 2023
***

        ఖండ, వీర సింహారెడ్డి జంట విజయాల తర్వాత బాలకృష్ణ నుంచి భగవంత్ కేసరి దసరా కానుకగా అందింది. ఈసారి బాలకృష్ణ కామెడీ ట్రాకులతో కమర్షియల్ యాక్షన్ మసాలాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఓ భిన్నమైన ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మెప్పించిందా? ప్రయత్నం మంచిదే అయినా విషయం బావుందా? విషయం బావున్నా చెప్పడం బావుందా? ఇవి తెలుసుకుందాం...

కథ

    ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (బాలకృష్ణ)  అనుకోని ప్రమాదంలో ఓ ఎస్సై (శరత్ కుమార్) చనిపోవడంతో, అతడి కూతురు విజ్జీ (శ్రీలీల) ని పెంచుకుంటాడు. ఆమె తండ్రి కోరిక ప్రకారం ఆమెని ఆర్మీ లో చేర్పించే సంకల్పంతో వుంటాడు. ఇద్దరి మధ్య తండ్రీ కూతుళ్ళ అనుబంధమేర్పడుతుంది. అయితే తండ్రి మరణంతో ఒక ఫోబియాకి లోనైన విజ్జీ ఆర్మీలోచేరేందుకు ఒప్పుకోదు. ఇంతలో ఒక టాప్ బిజినెస్ మాన్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రామ్ పాల్) డిప్యూటీ సీఎం (శుభలేఖ సుధాకర్) ని చంపి డిప్యూటీ సీఎం పియ్యే (బ్రహ్మాజీ) దృష్టిలో పడేసరికి అతడ్ని చంపేందుకు వేట మొదలెడతాడు. ఈ వేటలో అతడికి అతడికి విజ్జీమీద అనుమానం కలిగి ఆమెని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు భగవంత్ కేసరి విజ్జీని కాపాడుకుని, పాత శత్రువు సాంఘ్వీని అంతమొందించేందుకు ఎలా పోరాటం మొదలెట్టాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    జైలర్ రజనీకాంత్ బాటలో బాలకృష్ణ ఇమేజి చట్రం లోంచి బయటికొచ్చి వయస్సుకి తగ్గ పాత్ర నటించిన కథ ఇది. జైలర్ లోలాగే కామెడీలు, డ్యూయెట్లూ, వీర హీరోయిజాలు, పంచ్ డైలాగులు, మాస్ బిల్డప్పులు, ఎలివేషన్లూ లేకుండా, సీదా సాదా కంటెంట్ రిచ్ సెంటిమెంటల్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వూర మాస్ సినిమాల చట్రం లోంచి బయటికొచ్చి కాన్సెప్ట్ ప్రధానప్రయత్నం చేశాడు. కాన్సెప్ట్ వచ్చేసి స్త్రీ స్వశక్తీ కరణకి సంబంధించింది. ఆడపిల్లలు సింహంలా వుండాలని బాహాటంగానే సందేశమివ్వడం. అయితే ఈ కాన్సెప్ట్ ఒక పక్క, ఇంకో పక్క విలన్ తో పగ - రెండూ కలిసి ఒక వొరలో ఇమడలేక పోయాయి. దీంతో స్త్రీ స్వశక్తీ కరణ అంశం గల్లంతై పోయింది.
        
ఈ స్త్రీ స్వశక్తీ కరణని కూడా హీరోయిన్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంగా వుంది. చిన్నప్పట్నుంచీ ఆమె ఏం కావాలని కోరుకుంటోందో తెలుసుకోకుండా ఆర్మీలో చేరు, ఆర్మీలో చేరూ అని ఒకటే టార్చర్ పెట్టడం బ్యాడ్ పేరెంటింగ్ అన్పించేలా వుంది. తండ్రి మరణంతో ఆమె మానసికంగా ఒక ఫోబియాతో బాధపడుతోంటే దీనికి ట్రీట్ మెంట్ ఇప్పించకుండా, శారీరకంగా బలంగా ఎదగమని కఠిన శిక్షణకి గురి చేయడం ఇంకో బ్యాడ్ టేస్ట్.
        
కథలో సైకాలజిస్టు పాత్ర (కాజల్ అగర్వాల్) వున్నప్పటికీ కూడా ట్రీట్ మెంట్ ఇప్పించే ఆలోచనే  రాదు. ఆర్మీలో చేరితేనే బలవంతురాలవుతుందను కోవడం ఏమిటో కూడా అర్ధంగాదు. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, వూరి చివర కరాటే శిక్షణ ఇప్పిస్తే పోయేదానికి. ఇప్పుడు సైన్యంలో చేరాలన్నా నాల్గేళ్ళ అగ్నివీర్ కొలువు తప్ప ఏం లేదు.
        
ఈ అసమగ్ర కాన్సెప్ట్ కి నెంబర్ వన్ గా ఎదగాలన్న విలన్ సొంత గొడవల కథ అడ్డుపడితే, ఇది కూడా కథ కుదరక విలన్ చాలా బలహీనంగా మారిపోయాడు. ఇలావుంటే, మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి – చైల్డ్ ఎబ్యూజ్ ని కూడా తెచ్చి కలిపేశారు. ఈ రెండూ పరస్పర సంబంధం లేనివి. దీనిమీదా స్కూలు పిల్లల ముందు లెక్చరివ్వడం. ఇలా అసలు కథ ఎక్కడికక్కడ లయ తప్పి అపశ్రుతులు పలకడం.కంటెంట్ రిచ్ సినిమా అంటే రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ తీసేసి, అందులో ఏవేవో కంటెంటులు కలపడం కాదేమో!

నటనలు - సాంకేతికాలు

    పెద్దరికం వహించే పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కన్పించే సినిమా ఇది. పైగా తెలంగాణ పాత్ర. ఆదిలాబాద్ కి చెందిన ఈ పాత్రలో తెలంగాణ డైలాగులు చెబుతూ ఎబ్బెట్టుగా ఏం లేడు బాలకృష్ణ. పైగా పవర్ఫుల్ గా వున్నాడు. ప్రతీ సీనులో (కాజల్ అగర్వాల్ తో తప్ప) ప్రభావశీలంగా వున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కూడా తన రొటీన్ పౌరుషాల నటనకి పోకుండా అదుపు చేసుకున్నాడు.
        
కానీ బలహీన విలన్ తో యాక్షన్ కథ అంతంతమాత్రమే. ఇక పెంపుడు కూతురితో బాండింగ్ కి పిలుపులే అడ్డుపడ్డాయి. చిన్నప్పట్నుంచీ పెంచుకుంటున్నప్పుడు అది తండ్రీ కూతుళ్ళ సంబంధమై పోవాలి. ఆమె చిచ్చా (చిన్నాన్న) అని పిలవడంతో బాండింగులు, ఎమోషన్లు ఉపరితలంలోనే వుండిపోయాయి. నాన్నా అని పిలిచి వుంటే ఆడియెన్స్  ఎక్కువ బాండింగ్, ఎమోషన్లు, ప్రేమలు ఫీలయ్యేవాళ్ళు. సినిమా చివర్లో ఎప్పుడో నాన్నా అనుకుంటుంది. ఈ ఆలస్యానికి అది పండని డ్రామా అయిపోయింది.
        
ఇక బాలకృష్ణ యాక్షన్ సీన్సు ఎందుకో ఈలలు వేయించేలా లేవు. హింస మాత్రం జైలర్ కి కొంచెం తక్కువ లెవెల్లో వుంది. తలకాయల నరికివేతలు లేవు. ఒకే పాట బా లకృష్ణ డాన్సుతో వుంది. గణేష్ ఉత్సవం పాట. ఈ పాట డాన్సులకి గొప్పగా చెప్పుకునే   శ్రీలీల స్కిల్స్ కనిపించకుండానే ముగిసిపోయింది.
        
ఈసారి శ్రీలీలకి చెప్పుకోదగ్గ ప్రధాన పాత్ర దక్కింది. కూతురి పాత్రలో స్ట్రగుల్ చేస్తూ భిన్న పార్శ్వాల్ని ప్రదర్శించింది. అయితే సానుభూతి పొందే సన్నివేశాలు లేకపోవడం ఆమెకి మైనస్. ఆమె పాత్రతో వున్న కాన్సెప్ట్ ఇతర ప్రస్తావనలతో కంటిన్యూటీ దెబ్బతినడం కారణం.
        
బాలకృష్ణని ప్రేమిస్తూ వుండే కాజల్ అగర్వాల్ తో లవ్ ట్రాక్ నవ్వించే బదులు జాలి పుట్టించేలా వుంది. ఇంతకీ సైకాలజిస్టుగా ఆమె చేసిందేమిటో అర్ధం గాదు. ఆమె సైకాలజిస్టు పాత్రే తప్పేమో. ఆమె వైద్యం చేసే క్లినిక్ పెడితే సైకియాట్రిస్టు అవ్వాలి. ఇక విలన్ అర్జున్ రామ్ పాల్ చేసిందేమీ లేదు. పైగా అతడి సొంత కథతో వేరే ట్రాకు చాలా సినిమా నడుస్తుంది. ఎప్పుడైనా మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి వచ్చి అడ్డుతగులుతా డనుకుంటే అదే జరగదు.
        
ఈ సినిమాలో పాటలకి ప్రాధాన్యం లేదు. కాబట్టి తమన్ సంగీతం అలంకారప్రాయంగా వుండిపోయింది. సీనియర్ కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్  ఛాయాగ్రహణం ఒక ఆకర్షణగా చెప్పుకోవాలి. మిగతా ప్రొడక్షన్ విలువలు బాలకృష్ణ స్థాయికి తగ్గి ఎలా వుంటాయి. సినిమాలో డైలాగుల మీద మంచి కృషి చేసినట్టుంది- బంజారా హిల్సు, జూబిలీ హిల్సు, చిచ్చా కొడితే మెడికల్ బిల్సు

చివరికేమిటి

    చెప్పాల్సిన కథ ఒకటైతే దానికేదేదో కలిపి ఏమేమో చెప్పారు. ప్రారంభంలో ఇంకో గొడవ వుంటుంది. ముంబాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ (సంజయ్ స్వరూప్) ప్రభుత్వం నుంచి ప్రాణ భయంతో ఫ్యామిలీని తీసుకుని స్లమ్స్ లో దాక్కుందాడు. రక్షించడానికి ఒక స్నేహితుడు వచ్చి భగవంత్ కేసరి కథ చెప్పడం మొదలెడతాడు.
        
ఫస్టాఫ్ బాలకృష్ణ శ్రీలీలని పెంచడం, మరోవైపు కాజల్ అగర్వాల్ బాలకృష్ణ వెంటపడడం జరుగుతూ వచ్చి, మధ్యలో విలన్ కథ మొదలై, అతను డిప్యూటీ సీఎంని చంపి, శ్రీలీల వెంటబడడంతో- బాలకృష్ణ అడ్డుకునే సీనుతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇందులో విలన్ తో పాత పగ బయటపడ్డాక- ఫ్లాష్ బ్యాక్ ముగిసి- బాలకృష్ణ శ్రీలలకి ట్రైనింగ్ ఇప్పించే దృశ్యాల తర్వాత విలన్ తో క్లయిమాక్స్.
        
శ్రీలీలకి బలవంతపు ట్రైనింగ్. ఇలా కాకుండా, విలన్ తో ఆమె పడ్డ ప్రమాదానికి నువ్వే ఎదుర్కొమని బాలకృష్ణ మోటివేట్ చేసివుంటే, ఆమె కేర్పడే గోల్ ఆమె సొంత గోల్ అయ్యేది. మరొకరి గోల్ కోసం బతకకుండా. కథా కథనాల లోపాల వల్ల భగవంత్  కేసరి అందుకోవాల్సిన  స్థాయిని మాత్రం అందుకోలేక పోయింది.

—సికిందర్

 

12, అక్టోబర్ 2023, గురువారం

1367 : న్యూస్


సంవత్సరం కూడా ఆంద్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలలో నేషనల్ సినిమా డే లేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా మల్టీప్లెక్సులు మూతబడి తిరిగి తెరుచుకున్నప్పుడు, అపారంగా ఆదరించిన ప్రేక్షకులకి కృతజ్ఞతా పూర్వకంగా గత సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా నేషనల్ సినిమా డే నిర్వహిస్తున్నారు. పై రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాలు అడ్డు తగలడం దారుణం. ఇతర రాష్ట్రాల్లో రేపు 4 వేల స్క్రీన్స్ పై రూ. 99లకే రెండవ జాతీయ సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
 

30, సెప్టెంబర్ 2023, శనివారం

1366 :

 


          హాలీవుడ్ లో భారీ బడ్జెట్‌తో దర్శకులు తమ కిష్టమైన సినిమా తీయడానికి స్టూడియోలు అంగీకరించడం లేదని ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ ధ్వజమెత్తడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్ స్టూడియోలు ఫ్రాంచైజీ లేదా కామిక్ బుక్ ఎంటర్ టైనర్లు ఉత్పత్తి చేసే కథల తయారీ కేంద్రాలుగా  మారిపోయాయనీ, సినిమాని రక్షించండనీ స్కార్సెసీ దర్శకులకి పిలుపు నిచ్చారు.
        స్కార్ విజేత దర్శకుడు స్కార్సెసీ జీక్యూ మేగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను 50 సంవత్సరాల క్రితం భాగమైన హాలీవుడ్ పరిశ్రమ ముగిసిపోయిన చరిత్ర అన్నారు. 50 సంవత్సరాల క్రితం 1970 లలో మూకీ సినిమాలు తీయడం గురించి మాట్లాడుకుంటే ఎలా వుండేదో ఇప్పుడు ఫ్రాంచైజీ, కామిక్ బుక్ సినిమాలు తీయడం గురించి అలా వుంటుందన్నారు. వ్యక్తిగత ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలూ వ్యక్తీకరించే దర్శకుల కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి స్టూడియోలు నిరాకరిస్తున్నాయనీ, అలాటి దర్శకులు ఇండీస్ అని పిలిచే ఇండిపెండెంట్ సినిమాలకి పరిమితమయ్యేలా స్టూడియోలు నెట్టి వేస్తున్నాయనీ విమర్శించారు.  
       
ప్రసిద్ధ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న కామిక్ బుక్ సినిమాలు ప్రేక్షకుల్ని
థీమ్ పార్క్ లో  తిప్పినట్టు వుంటాయి తప్ప అవి సినిమాలు కావన్నారు. మార్వెల్ స్టూడియోస్ తీసిన ఎవెంజర్స్, ఐరన్ మాన్, యాంట్ మాన్, బ్లాక్ పాంథర్, థోర్ ...ఇవన్నీ స్కార్సెసీ చెప్పే చిన్న పిల్లల్ని అలరించే కామిక్ బుక్ (బొమ్మల కథ) ఆధార సినిమాలే.
       
2007 లో ప్రారంభించి 32 సినిమాలు నిర్మించింది మార్వెల్. ఒక కామిక్ బుక్ పాత్రతో సినిమా నిర్మిస్తే దాని ఫ్రాంచైజీ ( సీక్వెల్స్) గా మరెన్నో నిర్మిస్తుంది. తాజాగా నవంబర్ లో
కెప్టెన్ మార్వెల్ సీక్వెల్ వస్తోంది. ఇంకో 12 నిర్మాణంలో వున్నాయి. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ కూడా కామిక్ బుక్ సినిమాలు తీయడంలో పేరు పొందింది. స్కార్సెసీ 2019 లో తాను వెల్లడించిన అభిప్రాయానికి ఇప్పటికీ కట్టుబడి వున్నానన్నారు.
        
హాలీవుడ్ రూపొందించిన కామిక్ బుక్ సినిమాలకి, ఫ్రాంచైజీలకీ ఇప్పటికీ  థియేటర్ ప్రేక్షకుల ఆదరణ వుందా, ప్రేక్షకులు సినిమాలిలాగే వుండాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకి-  ప్రస్తుతానికి ఇలాగే అనుకుంటున్నారన్నారు.
        
దర్శకులు దీనిపై బలంగా పోరాడాలి. అది అట్టడుగు స్థాయి నుంచి రావాలి. ఇతర నిర్మాతల నుంచి కూడా రావాలి అన్నారు. స్టూడియోల ఒత్తిడి వున్నప్పటికీ తమ సినిమా నిర్మాణ శైలికి కట్టుబడి వున్నందుకు సఫ్డీ బ్రదర్స్, క్రిస్టఫర్ నోలన్‌ వంటి దర్శకుల్ని ప్రశంసించారు.
        
అన్ని వైపుల నుంచి ఎదురు తిరగాలి. ఆగవద్దు. ఏం జరుగుతుందో చూద్దాం. మనం సినిమాల్ని రక్షించుకోవాలి. వాళ్ళ మీద ఫిర్యాదులు చేయ వద్దు. ఎదురు తిరగాలి, అంతే  అన్నారాయన. తను తీసిన ది డిపార్టెడ్ సినిమాకి కి వార్నర్ బ్రదర్స్ ఒక ఫ్రాంచైజీ తీయాలని కోరినట్టు, అయితే అలాటి తయారీ చేసిన (మాన్యుఫ్యాక్చర్) కంటెంట్ నిజంగా సినిమా కాదని తాను తిప్పికొట్టినట్టు చెప్పారు.
       
ఇది దాదాపుగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చేసి సినిమాని రూపొందిస్తున్నట్టుగా వుంది. అంటే మనకి అద్భుతమైన దర్శకులు, సమర్ధులైన స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణులు లేరనుకోవాలా? తీసిన సినిమానే పొడిగించి ఫ్రాంచైజీలు తీయడానికి వీళ్ళందరూ టాలెంట్ ని వృధా చేసుకోవాలా? ఈ సినిమాలు ఏమిస్తాయి? కాసేపు మానసికానందాన్నిచ్చి, ఆపైన మనసుల్లోంచి, మొత్తం శరీరాల్లోంచి ఆనవాళ్ళు లేకుండా తుడిచి పెట్టుకు పోయేవేగా?’ అని మండి పడ్డారు.
        
స్కోర్సెసీ ప్రకారం, డికాప్రియో- మాట్ డామన్ లు నటించిన ది డిపార్టెడ్ (2007) లో ఇద్దరు హీరోల్లో ఒకరినైనా తర్వాత వినియోగించుకోవచ్చా అని వార్నర్ బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ లు అడిగారు. అంటే అర్ధం ఫ్రాంచైజీ కోరుకుంటున్నారు. అయితే నేను పనిచేయలేనన్నాను. వాళ్ళు బాధగా వెళ్ళిపోయారు. ఆ బాధ సినిమా గురించి కాదు, ఫ్రాంచైజీ గురించి! అన్నారు స్కార్సెసీ (ది డిపార్టెడ్ ని 2008 లో జగపతి బాబు- జేడీ చక్రవర్తిలతో ఫ్రీమేకుగా హోమం తీశారు దర్శకుడు జేడీ చక్రవర్తి).
        
సినిమా మేకింగ్‌లో సాంకేతిక ప్రయోగాలకు విముఖత చూపనన్నారు స్కార్సెసీ. అయితే దర్శకుడు కంటెంట్ ని పుర్రెలోంచి లాగి బయటికి తియ్యాలనీ, వయసు రీత్యా జీవితంలో తానున్న దశలో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పితీరాలనీ, లేకపోతే ఆ జీవితపు దశకి అర్ధం లేదనీ, చెప్పలేక పోతే సినిమా తీయడం ఎందుకనీ ప్రశ్నించారు.   

సినిమాని కాపాడాలన్న స్కార్సెసీ బాధ చాలా తక్కువ మందికి వుంటుంది. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే వాళ్ళే ఎక్కువ. వాళ్ళు తీసే సినిమాలు మొదటి వారం దాటితే జ్ఞాపకముండవు. తర్వాత వాటిని చూసి నేర్చుకోవడానికి స్టడీ మెటీరీయల్ గానూ పనికిరావు. స్కార్సెసీ 1967-2022 మద్య 26 సినిమాలకి దర్శకత్వం వహించారు.
టాక్సీ డ్రైవర్’, రేజింగ్ బుల్’, గుడ్ ఫెల్లాస్’, ది డిపార్టెడ్ వంటి ప్రసిద్ధ సినిమాల్ని తనదైన శైలిలో రూపొందించారు. ది డిపార్టెడ్ కి ఆస్కార్ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు.
       
80 ఏళ్ళ మార్టిన్ స్కార్సెసీ తాజాగా దర్శకత్వం వహించిన
ది కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అక్టోబర్ 20 న విడుదల కాబోతోంది. ఇందులో లియోనార్డో డీ కాపిరో, రాబర్ట్ డీ నీరో, లిల్లీ గ్లాడ్ స్టోన్ నటించారు. ఇదే పేరుతో
డేవిడ్ గ్రాన్ రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా దీన్ని నిర్మించారు.
—సికిందర్

 

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

1365 : రివ్యూ!


రచన -దర్శకత్వం : సతీష్ వర్మ
తారాగణం : కార్తీక్ రత్నం, గోల్డీనిస్సీ, సత్య, రవిబాబు, అజయ్ తదితరులు
సంగీతం : కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : సుందర్ ఎస్సీ
బ్యానర్ : ఆర్టీ టీం వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
నిర్మాత : రవితేజ
విడుదల : సెప్టెంబర్ 15, 2023
***
        మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన రావణాసుర’, గట్ట కుస్తీ సత్ఫలితాలనివ్వలేదు. తిరిగి మూడో సినిమాగా కొత్త దర్శకుడికి అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా ఈ వారం విడుదలైంది. చాలా మంది హీరోలు సొంత బ్యానర్లు ప్రారంభించి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. వీటితో చాలా కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇంకా నేర్చుకోవాల్సిన దశలో దర్శకులుగా మారిపోవడం వల్ల ఈ పరిస్థితి తప్పడం లేదు. ప్రస్తుతం సతీష్ వర్మ అనే కొత్త దర్శకుడు పరిచయ
మవుతూ మర్డర్ మిస్టరీ తీశాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించాడు. ఈ మర్డర్ మిస్టరీని కామెడీ ప్రధానంగా తీసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు క్రైమ్, కామెడీ రెండూ ఎక్కువ టాలెంట్ ని కోరుకునే జానర్లు. మరి ఈ కొత్త దర్శకుడు ఇందులో ఏమాత్రం ప్రతిభా నిరూపించుకోగలిగాడో చూద్దాం...

కథ

ఓ గ్రామంలో రాజు (కార్తీక్ రత్నం) అనే బైక్ మెకానిక్ వుంటాడు. అతడికి కోపం ఎక్కువ. దీంతో తెలియకుండానే శత్రువుల్ని పోగేసుకుంటాడు. ఆ గ్రామంలో వర్షాలు రంగురాళ్ళు బయటపడతాయి. వాటిని సొంతం చేసుకోవడానికి పోటీ పడతారు గ్రామస్థులు. అలా ఒక రోజు రంగురాళ్ళ దగ్గర సోమి నాయుడు (రాజ్ తిరందాసు) అనే అతడితో ఘర్షణ పడతాడు రాజు. ఆ తర్వాత సోమినాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో రాజు అనుమానితుడుగా కేసులో ఇరుక్కుంటాడు. ఇక చేయని హత్యలో ఇరుక్కున రాజు నిర్దోషిగా ఎలా నిరూపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మర్డర్ మిస్టరీ జానర్ గురించి పెద్దగా అవగాహన లేకుండా తీసినట్టుందీ సినిమా. హంతకుడెవరు? అని చివరిదాకా కథని లాగి, చిట్ట చివర్లో  హంతకుడ్ని చూపించే బాపతు ఎండ్ సస్పెన్స్ కథలు 40 ఏళ్ళ క్రితమే నవలలకి తప్ప, సినిమాలకి పనికి రావని మర్డర్ మిస్టరీలకి హాలీవుడ్ గుడ్ బై చెప్పేసింది. చివరి దాకా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా, హంతకుడెవరో చూపించేసి, వాడెలా పట్టుబడతాడన్న యాక్షన్ తో, సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సృష్టించి హాలీవుడ్ సినిమాలు తీస్తోంది. ఈ విషయం తెలీక ఇప్పటికీ తెలుగులో ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు. అందులో ఇది మరొకటి.
       
కొత్త దర్శకుడి చేతిలో ఈ మిస్టరీ వర్కౌట్ కానట్టే
, కామెడీ కూడా పని చేయలేదు. ఈ రెండు ప్రక్రియల్లో ప్రవేశం లేకపోయినా, కథ చెప్పడానికి రోషోమన్ ఎఫెక్ట్ అంతటి కళా ప్రక్రియకి సాహసించడం ఇంకో బడాయి. అంటే, జరిగిన హత్య గురించి వివిధ సాక్షులు వాళ్ళ  దృక్కోణంలో ఇచ్చే వాంగ్మూలాలతో కథ. హీరోతో బాటు, రవిబాబు, సత్యల పాత్రలు ఒకరి తర్వాత ఒకరు తాము చూసింది, తమకు తెలిసిందీ చెప్పుకురావడం. ఇలా అదే హత్యా సంఘటనని  వివిధ వెర్షన్లుగా మార్చి చూపించడం. 1950 లనాటి ఈ టెక్నిక్ ఎప్పుడో కాలదోషం పట్టి థ్రిల్ చేయడం మానేసింది.
       
ఇంకో  ఘోరమైన తప్పిదం ఏమిటంటే
, ఈ మూడు వెర్షన్లని మూడు చాప్టర్లు గా చెప్పి, ఈ మూడు చాప్టర్లలో గాకుండా, చివర్లోనే కథ వుంటుందని ముందే చెప్పేసి సినిమా ప్రారంభించడం! నిజమే, మర్డర్ మిస్టరీలో సస్పెన్స్ అంతా ఎండ్ లోనే వీడుతుంది. ఇదే చెప్పేశాడు. చెప్పేశాక మూడు చాప్టర్లు తీయడమెందుకు బడ్జెట్ దండగ? చివరి ముక్క తీసుకుని షార్ట్ ఫిలిమ్ తీస్తే సరిపోయే దానికి? మాస్ మహారాజానీ ఇంత బురిడీ కొట్టించాలా? ఆ మూడు చాప్టర్లలో కూడా వున్నడెం వున్నదేం లేదు, చూపించిందే చూపించడం!
       
విషయం ఇలా వున్నాక, ఇక ఎవరెలా నటించారు, పాటలెలా వున్నాయి, ప్రొడక్షన్ విలువలెలా వున్నాయి తెలుసుకోవాలన్పిస్తోందా
? రవితేజ సొంత బ్యానర్లో టీం వర్క్ ని సీరియస్ గా తీసుకోకపోతే, ఈ మూడో ఫ్లాప్ తర్వాత నాల్గోది కూడా డీఫాల్టుగా సిద్ధమవుతుంది.
—సికిందర్