రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, ఆగస్టు 2023, సోమవారం

1353 : రివ్యూ!


 

రచన –దర్శకత్వం : అమిత్ రాయ్
తారాగణం : అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠీ, యామీ గౌతమ్, గీతా అగర్వాల్, ఆరూష్ వర్మ, పవన్ మల్హోత్రా, అరుణ్ గోవిల్ తదితరులు
సంగీతం : విక్రమ్ మాంట్రోస్, హన్స్ రాజ్ రఘు వంశీ, డీజే స్ట్రింగ్స్, ప్రణయ్, సందేశ్ శాండిల్య; ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్స్ : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వయాకామ్ 18 స్టూడియోస్, వకావూ ఫిల్మ్స్
నిర్మాతలు : అరుణా భాటియా, విపుల్ డి షా, రాజేష్ బహల్, అశ్వి వర్డే
విడుదల ; 11.8.23
***

        2019 లో హౌస్ ఫుల్ హిట్టయిన తర్వాత నుంచి నటించిన 12 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఓఎంజీ -2 తో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు కన్పిస్తున్నాడు అక్షయ్ కుమార్. 2012 లో తానే నటించిన ఓఎంజీ (ఓ మైగాడ్) సూపర్ హిట్టయ్యింది. ఇది తెలుగులో గోపాల గోపాల గా రీమేకైంది. 2010 లో రోడ్ టు సంగం అనే సినిమాతో దర్శకుడుగా మారిన అమిత్ రాయ్, 13 ఏళ్ళ తర్వాత రెండో సినిమా తీసే అదృష్టానికి నోచుకున్నాడు. అయితే ఓఎంజీ -2’, ఓఎంజీ కి సీక్వెల్ కాదు. రెండిటి కథలు, పాత్రలు వేర్వేరు. అక్షయ్ కుమార్ తప్ప ఓఎంజీ లో నటించిన వాళ్ళెవరూ ఓఎంజీ -2 లో లేరు. ఇంతకీ అమిత్  రాయ్ ఏం తీశాడు? ఇది ఎందుకంత సెన్సార్ తో వివాదంలో పడింది? అక్షయ్ కుమార్ కిది హిట్టేనా? ఇవి తెలుసుకుందాం.

కథ

    కాంతి శరణ్ ముద్గల్ (పంకజ్ త్రిపాఠీ) శివ భక్తుడు. ఓ పుణ్యక్షేత్రంలో పూజా సామగ్రి అమ్మే షాపు నిర్వహిస్తూంటాడు. భార్య ఇందుమతి (గీతా అగర్వాల్), కొడుకు వివేక్ (ఆరూష్ వర్మ), కూతురూ వుంటారు. వివేక్ స్కూల్లో చదువుతూ వుంటాడు. ఒకరోజు వివేక్ అనైతిక చర్యకి పాల్పడ్డాడని స్కూలునుంచి డిస్మిస్ అవుతాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. తన కొడుకు తప్పుడు సమాచారం వల్ల, తప్పుదారి పట్టించే వాళ్ళ వల్లా దగా పడ్డాడని భావించిన కాంతి, స్కూలు ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి (అరుణ్ గొవిల్ )తో ఘర్షణ పడతాడు. లాభం లేక, అవమానం తట్టుకోలేక వూరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబంతో వెళ్ళి పోతూంటే, దేవదూత శివగణ్ (అక్షయ్ కుమార్) ప్రత్యక్షమై సత్యం కోసం పోరాడమంటాడు. దీంతో స్కూలు యాజమాన్యాన్ని, నకిలీ వైద్యుల్ని, బూటకపు మందులు అమ్మే వాళ్ళనీ కోర్టుకి లాగుతాడు కాంతి.
       
కాంతి లక్ష్యం ఏమిటి
? విద్యా వ్యవస్థలో ఏం మార్పు కోరుకుంటున్నాడు? ఆ మార్పు సాధించాడా? ఎలా సాధించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఓఎంజీ లో నాస్తికుడు భూకంపం వల్ల తన వ్యాపారానికి జరిగిన నష్టానికి దేవుడి మీద కేసు వేసి కోర్టుకి లాగితే, ఓఎంజీ-2 లో ఓ వ్యాపారి పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల తన కొడుకు పెడ దారి పట్టిపోయాడని స్కూలు యాజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. ఈ కథ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ సీరియస్ చర్చల్లోవుండేది. తర్వాత చెత్త బుట్ట దాఖలైంది. దాన్ని దులిపి పైకి తీశాడు దర్శకుడు.
        
కౌమార దశలో లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల అపోహలు పెంచుకుని పిల్లలు మోసపోతున్నారని, ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా క్రుంగిపోతున్నారనీ, దీన్ని అరికట్టి ఆరోగ్యవంతమైన తరాల్ని అందించాలంటే, పాఠశాల దశలోనే తగిన లైంగిక విజ్ఞానాన్ని సార్వజనీనం చేయాలనీ వాదించాడు దర్శకుడు.
        
మొట్ట మొదటిసారిగా, 1974 లో బికె ఆదర్శ్ తీసిన గుప్త్ జ్ఞాన్ లోనూ ఇదే విషయం చెప్పారు. 1979 లో దాసరి నారాయణరావు తీసిన నీడ లో అశ్లీల సాహిత్యం చదివి వ్యభిచారానికి అలవాటుపడ్డ టీనేజర్ గురించి చెప్పారు. ఇదొక బర్నింగ్ టాపిక్ గా వుంటూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు కదలడం లేదు. పైగా ఇలాటి సినిమాలు తీస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఓఎంజీ -2 సెన్సార్ ఇబ్బందుల్లో ఇరుక్కుని విలవిల్లాడిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ శివుడి పాత్రనే మార్చేస్తూ చాలా సన్నివేశాలు, డైలాగులూ కత్తిరించేసిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తో సరిపెట్టింది. పిల్లలూ పెద్దలూ అందరూ చూసి కళ్ళు తెరవాల్సిన సమస్యకి   సర్టిఫికేట్ జారీచేస్తే, దీన్నెవరు చూడాలి? ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలో శివుడ్ని చూపించారని, రామాయణం తో తీసిన ఆదిపురుష్ కి ఉదారంగా సెన్సార్ అనుమతి ఇచ్చేసి విమర్శల పాలైనట్టు ఈసారి కాకూడదని, ఓఎంజీ -2 మీద ప్రతాపం చూపెట్టారు.
        
అయినా ఓఎంజీ -2 కంటెంట్ పరంగా దెబ్బతినకుండా, సెన్సారే జరగనట్టు సాలిడ్ గా వుందంటే అది దర్శకుడి ప్రతిభే. ఈ కంటెంట్ లో ఇంకెన్ని కత్తిరింపులు వేసినా (ఆల్రెడీ 27 వేశారు) కథని చెడగొట్టలేరు. అలా రాసి తీశాడు దర్శకుడు.
        
స్కూల్లో చదివే వివేక్ ని తోటి స్టూడెంట్స్ టాయిలెట్ లో చూసి, నీది ఇంత చిన్నగా వుందా? చేతితో రుద్దితే పొడుగ్గా అవుతుంది అని ఇంటర్నెట్ లో రకరకాల వెబ్సైట్స్, వీడియోలు చూపిస్తారు. దీంతో వివేక్ పొడవు పెంచుకోవడం కోసం అదే పనిగా హస్తప్రయోగం చేసుకోవడం మొదలెడతాడు. ఏవో మందులు తింటాడు. ఇంటిదగ్గర అమ్మలక్కలు బుగ్గలు నిమిరి లేత పిల్లాడు ఎలా వాడిపోయాడు అని దిగులుపడతారు విషయం తెలీక. ఇంకోసారి వివేక్ స్కూలు టాయిలెట్ లో చేతికి పనిచెప్తే ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు. ఇది రచ్చ అయి స్కూలు నుంచి డిస్మిస్ అవుతాడు.
        
దీంతో పరువు పోగొట్టుకున్న తండ్రి కాంతి, కొడుకుని తిరిగి స్కూల్లో చేర్పించడానికి విఫలయత్నాలు చేసి కుటుంబంతో వూరు విడిచి వెళ్ళి పోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు దేవదూత శివగణ్ ప్రత్యక్షమై కర్తవ్యం బోధించేసరికి స్కూలు యజమాన్యాన్ని కోర్టుకి లాగుతాడు. తన కేసు వాదించడానికి లాయర్లు ముందుకు రాకపోవడంతో తానే వాదిస్తాడు.
        
అంచెలంచెలుగా శివగణ్ అందించే క్లూస్ తో ప్రాచీన గ్రంథాల దగ్గర్నుంచీ, పాశ్చాత్య దేశాల వరకూ చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ ని అధ్యయనం చేసి కేసు వాదిస్తాడు.రెండు వేల ఏళ్ళ నాడే విష్ణు శర్మ లైంగిక విజ్ఞానం గురించి రాశాడనీ, నేర్పాడనీ;  దేవతల మొదటి ఇచ్ఛ కామమేననీ, దాంతో సృష్టి ఏర్పాటయిందనీ, ఇది అసభ్యమని పురాణాల్లో ఎక్కడా చెప్పలేదనీ, ధర్మార్ధ కామ మోక్షాల గురించే చెప్పారనీ... ఇలా వాత్సాయన కామసూత్రాల్నీ, అజంతా ఎల్లోరా గుహల్లో శిల్పాల్నీ, ఇంకా చాలా డేటానీ కోర్టు ముందుంచుతాడు. ప్రాచీన కాలంలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంత ఓపెన్ గా వుంటే ఇప్పుడెందుకు దాయాలని అతడి ప్రశ్న.
        
ఈ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. రోడ్డు పక్క నాటు వైద్యుల్నీ, కొందరు ఘరానా డాక్టర్లనీ, సెక్స్ వర్కర్ నీ కోర్టుకి లాగుతాడు. ఎదుటి లాయర్ కామినీ మహేశ్వరి కూడా తక్కువేం కాదు. ఈమెతో కలిసి స్కూలు యజమాన్యం, మత పెద్ద, కొందరు రాజకీయులూ మతాన్ని లాగి, కాంతి మీద కేసులు వేయించి నోర్మూయించేదాకా పోతుంది...
        
విషయం మీద చాలా అవగాహనతో, ఇబ్బంది అన్పించే అంశాల్ని హాస్యంతో తేలికబరుస్తూ ఆద్యంతం ఒక స్టడీ మెటీరీయల్ లాగా అందించాడు దర్శకుడు. సాధారణంగా బూతంతా చూపించి చివర్లో నీతి చెప్తారు. అలా కాకుండా శృంగారంతో తేడా చూపించాడు. కాంతి భార్యని కోర్టులో -మీ మొదటి రాత్రి ఎలా జరిగిందని కూతురి ముందే అడిగినప్పుడు, చాలా తెలివిగా కోర్టంతా నవ్వేలా ఆమె చెప్పే సమాధానం దర్శకుడి క్రియేటివిటీకి నిదర్శనం.
        
అలాగే సెక్స్ వర్కర్ ని కాంతి క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ- నీ కొడుకు ఎలాటి పౌరుడు కావాలని కోరుకుంటున్నావ్, నీ దగ్గరికి వచ్చే విటుల్లాగానా?’  అని వేసే ప్రశ్న సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం గురించే వుంటుంది. ఈ సన్నివేశం, సినిమా ముగింపులో కాంతి కొడుకు చెప్పే మాటలూ కదిలిస్తాయి.
        
కరుణా, జాలి, ఆలోచన, హాస్యం పుట్టించే ఇలాటి సినిమాకి యూనివర్సల్ యూ సర్టిఫికేట్ ఇవ్వకుండా విలన్ లాగా ప్రవర్తించింది ప్రభుత్వమని చెప్పాలి.

నటనలు – సాంకేతికాలు

    అక్షయ్ కుమార్ శివుడి గెటప్ మారలేదు. పేరు మాత్రం దేవదూత శివగణ్ గా మార్చారు. సినిమా మొత్తం మీద ఏడెనిమిది సీన్లలో కన్పిస్తాడు. బయటే గుళ్ళూ గోపురాల్లో తిరుగుతూంటాడు. ఎక్కడికెళ్ళినా ఒక వృషభం అతడి వెనుక వెళ్తూ వుంటుంది. అతను కామెడీ క్యారక్టర్. కానీ లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధంగాని కోర్టు చిట్కాలు చెప్తాడు. చివర్లో కాంతి ఓడిపోయాక క్లయిమాక్స్ లో విజయం అతడి చేతిలో పెట్టే బహిరంగ కోర్టు దృశ్యాలు సినిమాని మరో స్థాయికి తీసికెళ్తాయి. అక్షయ్ కుమార్ ఈసారి దేశభక్తి, మతభక్తి డైలాగులతో అరుపులు అరవకుండా నిగ్రహించుకున్నాడు.
        
అయితే సినిమాకి పబ్లిసిటీ లేక మౌత్ టాక్ మీద ఆధారపడింది. సెన్సార్ గొడవలే పెద్ద పబ్లిసిటీ అనుకున్నారేమో, అదేమంత కలిసి రాలేదు. అక్షయ్ పూనుకుని ప్రమోషన్స్ ప్రారంభిస్తే మంచి హిట్ వైపు వెళ్తుంది.
        
సినిమా కాంతి పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ మీదే పూర్తిగా ఆధారపడింది. అతను ప్రతి చోటా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎదుటి లాయర్ పాత్రలో యామీ గౌతమ్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అమెవైపు వాదనలు కూడా ఆలోచింప జేస్తాయి. మరొక చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ జడ్జి పాత్రలో పవన్ మల్హోత్రా. సినిమా జడ్జిలా కాకుండా  రియల్ జడ్జిలా వుంటాడు. నేపథ్యంలో నాల్గు పాటలు వస్తాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలు బావున్నాయి.
        
13 ఏళ్ళ తర్వాత దర్శకుడు అమిత్ రాయ్ అవుట్ డెటెడ్ అయిపోకుండా నేటి ప్రమాణాలకి తగ్గకుండా చిత్రీకరణ జరిపాడు. గుప్త్ జ్ఞాన్ తర్వాత 49 ఏళ్ళకి తిరిగి మరోసారి సెక్స్ ఎడ్యుకేషన్ అవశ్యకతని ప్రేక్షకుల ముందుంచాడు.

—సికిందర్


12, ఆగస్టు 2023, శనివారం

1352 : పరిచయం

 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ గురించి ఎంత చెప్పుకుంటున్నారో, ఇందులో నటించిన విలన్ గురించి కూడా అంతే చెప్పుకుంటున్నారు.చెత్త మొహం, అతి క్రూరుడు, సుత్తితో మొహం పగులగొట్టి చంపేసే రాక్షసుడు, కళ్ళతోనే భయం పుట్టించే, మాసిన లుంగీ చొక్కా వేసుకునే, మురికి వాడల్లో తిరిగే పిచ్చోడు లాంటి జనం భయపడి చచ్చే,  నీచ నికృష్టపు దేశవాళీ విలన్ గా కనిపించిన నటుడి పేరు వినాయకన్. స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది కోరుకునే పెద్ద మనసు స్టార్ కుండాలి. విలన్ కెంత పేరొస్తే హీరోగా తనకంత పేరొస్తుందన్న సమభావముండాలి. విలన్ ఎంత బలవంతుడైతే హీరో కంత బలం పెరుకుతుందన్న క్రియేటివ్ దృష్టి వుండాలి. ఇవన్నీ రజనీకాంత్ ప్రదర్శించినందువల్లే జైలర్ సక్సెస్ కి వినాయకన్ కూడా ప్రధాన కారకుడయ్యాడు.
        
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ అభిమానుల్ని ఆహ్లాదపరిచే, వినోదాత్మక, భావోద్వేగ, శైలీకృత యాక్షన్ సన్నివేశాల్ని దట్టించిన పాపులర్ కమర్షియల్ మూవీ. దీని ప్రధాన విజయమేమిటంటే విలన్ గా వినాయకన్‌ని ఎంపిక చేయడం. మలయాళ ప్రేక్షకులకి వినాయకన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇతర భాషల ప్రేక్షకులకి కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలంటే జైలర్ బాగా తోడ్పడుతుంది. అయితే వినాయకన్ ని తీసుకోవాలని ముందుగా అనుకోలేదు. ముందుగా అనుకున్న స్టార్ వేరు.  జైలర్ ఆడియో లాంచ్‌లో స్వయంగా రజనీకాంత్ చెప్పారు.
       
పేరు ప్రస్తావించకుండా రజనీ చెప్పిందాన్ని బట్టి చూస్తే
, ఆయన చెప్తున్నది మోహన్ బాబు గురించేనని అన్పించక మానదు. మోహన్ బాబు విలన్ గానే నట జీవితం ప్రారంభించి తర్వాత విలన్ అయ్యారు. మోహన్ బాబు, రజనీ చాలా సంవత్సరాలుగా మంచి మిత్రులు కూడా.  మోహన్ బాబు నిర్మించిన సూపర్ హిట్ పెదరాయుడు లో రజనీ కీలక పాత్ర పోషించారు కూడా. ఈ నేపథ్యంలో జైలర్ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీ చెబుతున్నది మోహన్ బాబు గురించేనని ఇట్టే తెలిసిపోతుంది.
        
జైలర్ లో విలన్ పాత్రని ఎవరైనా స్టార్ లేదా కొత్త నటుడు పోషిస్తే బావుంటుందనుకున్నానని రజనీకాంత్ చెప్పారు. విలన్ పాత్రలకి పేరుబడ్డ వారెవరిని తీసుకున్నా పెద్దగా ప్రభావం వుండదని అన్నారు. అప్పుడు దర్శకుడు నెల్సన్ ఒక పేరు సూచించాడని, ఆయనొక పెద్ద సౌత్ స్టార్ అనీ, తనకి మంచి మిత్రుడు కూడానని చెప్పారు. ఆయన విలన్ కి సరిపోతాడని భావించి తనే ఫోన్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత నెల్సన్ వెళ్ళి కథ విన్పించి వచ్చాక తను పునరాలోచనలో పడ్డాననీ, ఆ స్టార్ కున్నఇమేజిని బట్టి, పాత్రతో వ్యవహరించడానికి తగినంత స్వేచ్ఛ వుండదని, ప్రాక్టికల్ గా కొన్ని పరిమితులు వుంటాయనీ, పైగా తను విలన్ ని కొట్టే సన్నివేశాలు కూడా వున్నాయనీ, ఆ స్టార్ తో ఆ పని చేయలేననీ భావించి, ఆ స్టార్ కి ఫోన్ చేసి సారీ చెప్పినట్టు వివరించారు.
       
అయితే రజనీ మాటల్ని ఎక్కువమంది తమిళ ప్రేక్షకులు వేరేగా తీసుకున్నారు. ఆయన చెప్పింది కమల్ హాసన్ గురించేనని భావించారు. చెన్నై ఆడియో లాంచ్ లో రజనీ 45 నిమిషాలు ప్రసంగించారు.
ఈ స్పీచ్‌తో నెటిజన్లు రజనీ ప్రస్తావించిన స్టార్ మరెవరో కాదని, ఐదు దశాబ్దాల తన ప్రత్యర్థి కమల్ హాసనే నీ తేల్చేశారు. ఇప్పుడు దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరినీ కలపి తెరపై చూసే అవకాశం చేజారిపోయిందని, వీరిద్దరి అభిమానులు భొరున విలపించారు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ, కమల్ మళ్ళీ తెరపై 'తలైవర్ 171'లో ఒక్కటవుతారని ప్రచారం ఒకటి జరుగుతోంది.
        
మోహన్ బాబు కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు- స్టార్ ని విలన్ గా మార్చే ప్రయత్నం అలా కుదరక పోవడంతో రజనీ, నెల్సన్ లు కొత్త ముఖం కోసం అన్వేషించి వినాయకన్ ని పట్టుకున్నారు. స్టార్ ని తెచ్చి విలన్ చేస్తే ఏమయ్యేదో గానీ, కొత్త ముఖాన్ని తెచ్చుకుని  స్టార్ ని చేశారు. ఇంత పచ్చిగా, మురికివాడల క్యారక్టర్ అన్పించే వినాయకన్ స్టార్ విలన్ అయిపోయాడు! స్లమ్ డాగ్ విలియనీర్ అన్నట్టు.

ఎవరీ వినాయకన్
?

ఇంతకీ ఎవరీ వినాయకన్ అంటే- నటుడు, గాయకుడు, స్వరకర్త, నాట్యాచారుడు- ఇన్ని కళలున్నాయి ఈ మలయాళీ ఆర్టిస్టులో. 1995 లో మాంత్రికం లో అతిధి పాత్రతో నట వృత్తిని ప్రారంభించాడు . ఆ తర్వాత రెండు సినిమాల్లో సహాయ పాత్ర, కమెడియన్ పాత్రా పోషించాడు. తర్వాత స్టాప్ వయొలెన్స్’, ఛోటా ముంబాయి సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. మొత్తం 53 మలయాళ సినిమాలు, 8 తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా (అసాధ్యుడు’- 2006), ఒక హిందీ సినిమా నటించాడు. 2016 లో కమ్మటి పాదం లో నటనకి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు పొందాడు. సినిమాల్లోకి రావడానికి ముందు బ్లాక్ మెర్క్యురీ అనే డాన్స్ గ్రూపుని నిర్వహించేవాడు. మైకేల్ జాక్సన్ ని ఇమిటేట్ చేసేవాడు.
       
ఇందుకేనేమో  
జైలర్ లో విలన్ గా బాగా హై వస్తే అనుచరులతో కలిసి పిచ్చ డాన్స్ చేస్తాడు. తాళ్ లో ఐశ్వర్యారాయ్ పాటకి కూడా డాన్స్ చేసి పడేశాడు. చంపడం అంటే అతడికెంత ఆనందమంటే, అనుచరుణ్ణి కింద పడదోసి, ఛాతీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని, సుత్తితో తనివిదీరా మొహమ్మీద కొట్టి చంపుతాడు. ఇలాటిదే సీను రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన వీరప్పన్ కథ జంగిల్ (2000) లో - మనుషుల్ని చంపడానికి ఉవ్వీళ్ళూరుతూ వుండే పొట్టి రాజ్ పాల్ యాదవ్ తో వుంటుంది.
       
విగ్రహాల స్మగ్లర్ వర్మగా విలన్ పాత్రలో వినాయకన్ నటన రియలిస్టిక్ నటన. పాత్ర లోతుపాతుల్లోకి వెళ్ళిపోయి
, పాత్రనంతా కళ్ళల్లో నింపుకుని- అక్కడ్నించీ ఒడలు జలదరించేలా పాత్రని ఆకాశాన్నంటిస్తాడు. రజనీ కాంత్ మాత్రం కూల్ గా వుంటాడు. రజనీని డామినేట్ చేస్తూ ఆయన ముందు వినాయకన్ ది ఓవరాక్షన్ కాదు- ఆ పాత్రే అంత. దీన్ని రియలిస్టిక్- మెథడ్ యాక్టింగ్ తో ఓవరాక్షన్ అన్పించకుండా చేశాడు. మృగానికి ఓవరాక్షనేంటి? మృగం తీరే అంత. వినాయకన్ మృగంగా మారితేనే ఇది సాధ్యం.
       
ఇప్పుడు వినాయకన్ పానిండియా కాదు
, గ్లోబల్ పండితుల దృష్టిలో పడినట్టు తాజా వార్తలొస్తున్నాయి. ఎప్పుడైనా దేశ సంస్కృతిని ప్రతిబింబించే దేశవాళీ పాత్రలే, దేశీయ నటనలే గ్లోబల్ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తాయి.
—సికిందర్   


11, ఆగస్టు 2023, శుక్రవారం

1351 : రివ్యూ!


 దర్శకత్వం : మెహర్ రమేష్

తారాగణం : చిరంజీవి, కీర్తీ సురేష్ తమన్నా, సుశాంత్, మురళీ శర్మ, సాయాజీ షిండే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్య తదితరులు
సంగీతం : మహతీ స్వరసాగర్, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్,, క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, కెఎస్ రామారావు
విడుదల : ఆగస్టు 11, 2023
***

నవరిలో వాల్తేరు వీరయ్య విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ వేదాలం రీమేక్ అని తెలిసిందే. దీనికి పదేళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకుడు. దర్శకత్వానికి పదేళ్ళ గ్యాప్, రీమేక్ కి ఎనిమిదేళ్ళ గ్యాప్ చాలా చెప్తాయి కాలదోషం పట్టిన సంగతులు. చిరంజీవికి కాలదోషం లేదు. ఆయన ప్రయత్నాలకే కాలీన స్పృహ కన్పించడం లేదు. ఈ కాలపు ప్రేక్షకులకి ఏ కాలపు సినిమాలు అందిస్తున్నారో చూసుకోకుండా కుమ్మేస్తున్నారు. ఆయన కుమ్మడం, ప్రేక్షకులు కుయ్యోమనడం ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం... 

కథ

శంకర్ (చిరంజీవి) సోదరి మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ని తీసుకుని కోల్ కతా లో దిగుతాడు. ఆమెని కాలేజీలో చేర్పించి టాక్సీ డ్రైవర్ గా మారతాడు. అతడికి లాస్య (తమన్నా) అనే క్రిమినల్ లాయర్ పరిచయమవుతుంది. పోలీస్ కమీషనర్ నగరంలో ఆడవాళ్ళ అపహరణలు జరుగుతున్న దృష్ట్యా టాక్సీ డ్రైవర్లు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తాడు.  దీంతో శంకర్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) అనే మాఫియా గ్యాంగ్ మెంబర్లని ఒకొక్కర్నీ  చంపడం మొదలెడడు. అటు వైపు మహాలక్ష్మిని లాయర్ లాస్య సోదరుడు శ్రీకర్ (సుశాంత్) ప్రేమించడంతో లాస్య శంకర్ దగ్గరికి ఆ పెళ్ళి సంబంధం తెస్తుంది. శంకర్ ఒప్పుకుంటాడు. ఇంతలో లాస్యకి శంకర్ చేస్తున్న హత్యలు తెలిసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది. సోదరి పెళ్ళి ఆగిపోవడంతో శంకర్ ఇరకాటంలో పడతాడు.
       
అసలు శంకర్ ఎవరు
? ఎందుకు మాఫియాల్ని హతమారుస్తున్నాడు? అతడి గతం ఏమిటి? చేస్తున్న హత్యల్ని ఎలా సమర్ధించుకుని ఆగిపోయిన సోదరి పెళ్ళి చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ   
2015 లో తమిళంలో అజిత్ నటించిన వేదాలం రీమేక్ కథ ఇది. తెలుగులో ఆవేశం పేరుతో డబ్ అయి విడుదలైంది కూడా. యూట్యూబ్ లో ఫ్రీగా వుంది కూడా. అయినా తెలిసిన పాత కథనే రీమేక్ చేశారు. కోల్ కత బ్యాక్ డ్రాప్ లో ఇలాటిదే అన్నాచెల్లెలు కథతో 2021 లో రజనీకాంత్ నటించిన అన్నాత్తే (తెలుగులో పెద్దన్న’) వచ్చి ఫ్లాపయ్యింది. ఇందులో కూడా చెల్లెలు కీర్తీ సురేషే. ఇంకోటేమిటంటే, భోళా శంకర్ లో తమన్నా లాగా, ఇందులో కూడా కోల్ కతాలో నయనతార లాయరే. ఇంకో అద్భుతమేమిటంటే, ఒకేలా వున్న వేదాలం’, అన్నాత్తే రెండు సినిమాలకీ దర్శకుడు శివయే!
       
అంటే తెలుగు ప్రేక్షకులు ఒకేలా వున్న
ఆవేశం’, పెద్దన్న రెండూ చూశాక, మళ్ళీ అలాటిదే భోళా శంకర్ కూడా చూడాలన్న మాట. ఇవి మామూలు బరువు బాధ్యతలు కావు. ప్రేక్షకులు నెరవేర్చుకుని విధేయత నిరూపించుకోవాలి. తీసిందే తీస్తూంటే చూసిందే చూస్తూ పోవాలి. ఇదేమైనా మాయాబజారా ఎన్ని సార్లు తీసినా చూడాడానికి. 
        
అయితే సమస్యేమిటంటే, 2013 లో షాడో తర్వాత సినిమాలేని దర్శకుడు మెహర్ రమేష్, పదేళ్ళ తర్వాత అదే తన కాలం నాటి దర్శకత్వానికి సాహసించడం. పూర్తిగా ఔట్ డేటెడ్ మేకింగ్ కి పాల్పడడం. 1970-80 ల సినిమా అన్పించేలా తీయడం. టైటిల్స్ లో స్టోరీ డెవలప్ మెంట్ అని తన పేరు పడుతుంది. వేదాలం సీన్ల వరసే దించేస్తే డెవలప్ మెంట్ ఏముందో అర్ధంగాదు. ఇలా ప్రేక్షకులకి తర్వాతేం జరుగుతుందో తెలిసిపోయే టెంప్లెట్ కథనం వాడేసి సినిమా చుట్టేసినట్టే వుంది.
       
మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గానీ
, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీనుగానీ లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేశారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసు పెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పదినిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్టాఫ్, సెకండాఫ్ చిత్రీకరణ డొల్లగా వుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బావుందనుకునేంత లోనే బోరుగా మారిపోతుంది. భోళా శంకర్ గా చిరంజీవి అసలు క్యారక్టర్ వెల్లడయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా విఫల మైంది.
       
కేవలం చిరంజీవి యంగ్
, స్టయిలిష్ లుక్, డాన్సులు, ఫైట్లు మాత్రమే అప్డేట్ అయి వున్నాయి. సినిమాలో విషయం, మేకింగ్ మాత్రం కాలానికి దూరంగా ఔట్ డేటెడ్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

చిరంజీవికి మూస ఫార్ములా పాత్రలు కొత్త కాదు. అవి ఎన్నిసార్లు నటించినా, పాత్రల పరిధి అంతే కాబట్టి, నటన మార్పు లేకుండా రిపీట్ అవుతూ వుంటుంది. అయితే ఈసారి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. కమెడియన్ల గుంపుతో  చేసిన కామెడీలు ఎవర్నీ నవ్వించలేక పోయాయి. ఎమోషన్లు చూద్దామంటే సిస్టర్ సెంటిమెంటు కూడా కృత్రిమంగా, అంతంత మాత్రంగా వుంది. ఒక్క యాక్షన్ సీన్లతో, పాటలకి స్టెప్పులతో మాత్రమే మెప్పించడానికి పరిమితమై పోయారు చిరంజీవి. ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కాబట్టి వీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తారు.
       
తమన్నా రొటీన్ ఫార్ములా హీరోయిన్. తమన్నాతో బాటు కీర్తీ సురేష్ పాత్ర కూడా అంతంత మాత్రమే. మొన్నే రజనీకాంత్ తో చెల్లెలిగా నటించి
, మళ్ళీ ఇప్పుడు చిరంజీవితో చెల్లెలిగా నటించడం ఎంత ఎంబరాసింగ్ గా వుందో ఆమె మొహంలో చూస్తే తెలిసిపోతుంది. ఇక బోలెడు మంది కామెడియన్లు, విలన్లు రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయారు. సంగీతం, కెమెరా వర్క్, ఇతర టెక్నికల్ విభాగాలు ఎంత బాగా పని చేసినా దర్శకుడు కూడా పని చేయాలిగా? ఇది పూర్తిగా మెహర్ రమేష్ చెడ గొట్టుకున్న మెగా అవకాశం, మళ్ళీ రాదు.


మెగాస్టార్ ఈ కాలపు ప్రేక్షకుల కోసం ఇంకా తన
1970-80 లనాటి పురాతన కాలం టైపు సినిమాలు నటించకుండా, ఆ కాలంలో జరిగే పీరియడ్ కథలతో పీరియడ్ సినిమాలు నటిస్తే పాత సినిమాల వైభవమైనా చూసినట్టుంటుంది నేటి తరం ప్రేక్షకులకి. 1969 నేపథ్యంలో తీసిన ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్లాగా?
-సికిందర్


10, ఆగస్టు 2023, గురువారం

1350 : రివ్యూ!


 రచన - దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్

తారాగణం : రజనీకాంత్, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : సన్ పిక్చర్స్, నిర్మాత : కళానిధి మారన్
విడుదల : ఆగష్టు 10, 2023
***
        త మూడేళ్ళుగా మూడు సినిమాలతో హిట్లు లేక డీలా పడిన సూపర్ స్టార్ రజనీ కాంత్ నాల్గో తాజా ప్రయత్నంగా జైలర్ విడుదలైంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇతను నయనతారతో కొలమావు కోకిల’, శివ కార్తికేయన్ తో డాక్టర్ అనే రెండు హిట్లు తీసి, విజయ్ తో బీస్ట్ తో విఫలమయ్యాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది పెద్ద బాధ్యతే. పైగా సన్ పిక్చర్స్ వంటి పెద్ద బ్యానర్ సినిమా. అంతేగాక, నాలుగు భాషల నుంచి జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ ల కాంబినేషన్లతో రజనీకాంత్ పానిండియా స్థాయి మూవీ ఇది. దీన్ని నెల్సన్ ఎలా తీశాడు? రజనీ ఫ్యాన్స్ ని మెప్పించ గలిగాడా? రజనీకి ఇప్పుడొక హిట్ అందిందా? ఇవి తెలుసుకుందాం. 

కథ

    ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) - మనవడులతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతూంటాడు. మనవడికి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుకోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. ఇతనొక విగ్రహాల స్మగ్లింగ్ కేసు ట్రాక్ చేస్తూ మిస్సయి పోతాడు. మిస్సయిన కొడుకుని విగ్రహాల స్మగ్లర్ వర్మ (వినాయకన్) చంపేశాడని తెలుసుకుంటాడు.  దీంతో పగబట్టిన ముత్తు స్మగ్లర్ వర్మతో తలపడతాడు.
       
ఇప్పుడు స్మగ్లర్ వర్మ పెట్టిన కండిషన్ ఏమిటి
? దాని ప్రకారం ముత్తు ఓ  ఆలయంలో విలువైన కిరీటాన్ని తస్కరించి వర్మ కిచ్చాడా? ఇందులో నార్త్ గ్యాంగ్ స్టర్ (జాకీష్రాఫ్) తో బాటు, మాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివరాజ్ కుమార్), బ్లాస్ట్ మోహన్ (సునీల్) లు  చేసిన సహాయం ఏమిటి? కామ్నా (తమన్నా) ఎవరు? ఆఖరికి ముత్తువేల్, వర్మ డిమాండ్ ని నెరవేర్చాడా లేదా? తీహార్ జైల్లో మాజీ జైలర్ గా పనిచేసిన అతడి గతమేమిటి? చివరికి కొడుకు గురించి తెలుసుకున్న ఒక నిజంతో ఎలాటి భావోద్వేగాలకి లోనయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

కథ కొత్తదేం కాదు. రజనీకాంత్ తో దాన్ని నడిపించిన విధానం కొత్తది. రజనీకాంత్ పెద్ద వయసు పాత్రకి తగ్గట్టుగా పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. రిటైరైన జైలర్ పోలీసుద్యోగంలో తన కొడుకు కూడా నిజాయితీగా విధినిర్వహణ చేసేలా విద్యాబుద్ధులు నేర్పినప్పుడు, ఆ కొడుకు ఎంతవరకు తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడనే తండ్రీ కొడుకుల సంబంధాల్ని చిత్రించే -భావోద్వేగాలతో కూడిన కథ. ఈ కథ రెండు గంటలా 45 నిమిషాలు సాగదీయకపోతే మరింత బలీయమైన కథగా వుండేది.
       
ఉపరితలంలో కొడుకు కోసం ముఠా మీద తండ్రి పగ లాంటి రొటీన్ కథగానే  వుంటుంది. అయితే ఈ రొటీన్ గా అన్పించే కథ పొరలు పొరలుగా విడిపోతూ కొత్త కోణాలతో
, మలుపులతో థ్రిల్ చేస్తుంది. ఇలా ఫస్టావ్ లో ఒక ట్విస్టు, సెకండాఫ్ లో మరో మూడు ట్విస్టులు మొత్తం రజనీ- నెల్సన్ ల బాక్సాఫేసు గేమ్ ని సక్సెస్ ఫుల్ గా మార్చేశాయి.
       
ఫస్టాఫ్ రజనీకాంత్ రిటైరైన వ్యక్తిగా కుటుంబ జీవితం గడపడంతో
, మనవడితో కామెడీతో ప్రారంభమవుతుంది. ఒక చిన్నఇల్లు, ఇంట్లో సేంద్రీయంగా కూరగాయలు పండించుకోవడం, యూ ట్యూబర్ గా 96 మంది సబ్ స్రైబర్లున్న మనవడికి శిక్షణ నివ్వడం, వీధిలో కనిపిస్తే చాలు రజనీని దాదాపు గుద్దేసేంత పనిచేసే క్యాబ్ డ్రైవర్ తో చిరు తగాదాలు - ఇదే జీవితంగా సాగుతున్నప్పుడు, ఏసీపీ అధికారియైన కొడుకు అదృశ్యం జీవితాన్ని మలుపుతిప్పుతుంది. భార్యతో, కోడలితో ఈ భాధలో వుండగా, కొడుకు హత్యావార్త కూడా తెలుస్తుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొరికిన ముఠా వాళ్ళని చంపడం, ముఠా కుటుంబం మీద ఎదురు దాడికి దిగడం వంటి ఘటనలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లో బ్యాంగులు గానీ, ట్విస్టులు గానీ ఏమీ వుండక -ఒక కుటుంబ సన్నివేశంతో ముగుస్తుంది. ఇది రొటీన్ కి భిన్నం. 
       
సెకండాఫ్ రజనీ వేట కొనసాగుతుంది. ఈ వేటలో ఒకచోట ఒకప్పటి జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. రజనీ మాజీ జైలర్ అని ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సాగదీయకుండా ఒకే జైలు సన్నివేశంతో ముగిసిపోవడం కూడా రొటీన్ కి భిన్నమే. ఆ తర్వాత కిరీటం కోసం స్మగ్లర్ పెట్టే డిమాండ్ తో సెకండాఫ్ కథ మలుపు తిరిగి వరుసగా బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్
, మలయాళ స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. తెలుగు కమెడియన్ సునీల్ తెరపై కొస్తూంటారు. ఒక పాటతో తమన్నా కూడా వస్తుంది. కిరీటాన్ని హైజాక్ చేసే కాన్సెప్ట్ తో సాగుతూ వుండే సెకండాఫ్ కొడుకుతో క్లయిమాక్స్ ట్విస్టుతో ముగింపుకి చేరుకుంటుంది.
       
కథ నీటుగా వుండడం
, ఎలాటి డాన్సులు, కామెడీలు లేకుండా రజనీకాంత్ పాత్ర ఫ్యామిలీమాన్ గా హూందాగా కొనసాగడం - అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆద్యంతం కూర్చోబెట్టేలా చేస్తాయి. సూపర్ స్టార్ సినిమా పేరుతో లిబర్టీ తీసుకుని వూర మాస్ కమర్షియల్ చేయకుండా, కాస్త అర్ధవంతమైన ఎంటర్ టైనర్ గానే తీశాడు దర్శకుడు. కాకపోతే నిడివి తగ్గాలి.

నటనలు - సాంకేతికాలు

కొన్ని సార్లు సూపర్ స్టార్ సినిమాలు ఒన్ మాన్ షోగా వుంటాయి. సూపర్ స్టార్ ఇప్పుడే కొత్తగా నటిస్తున్నట్టు బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దుతూ ఇతర తారాగణాన్ని వెనక్కి నెట్టేస్తూంటారు. రజనీతో ఇలా జరగలేదు. రజనీతో ఇంకో నాల్గు భాషల స్టార్లు వున్నారు. వాళ్ళు సెకండాఫ్ లో ఒక్కో ఎపిసోడ్ లో కనిపిస్తారు. సంక్షిప్తంగా కనిపించినా కథ అవసరాన్ని తీర్చేసి వెళ్ళిపోతారు.  ఇలా కరివేపాకు పాత్రలు కాకుండా వుంటారు. ఒన్ మాన్ షో కూడా ఎలా వుండాలో బహుశా మొదటిసారి చూపించాడు దర్శకుడు.
       
అయితే రమ్య కృష్ణ
, మిర్నా మీనన్ కుటుంబ పాత్రల్ని నిర్లక్ష్యం చేశాడు. కథకి అడ్డు వస్తున్నారనుకుని పక్కకు పెట్టేసినట్టున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా రజనీతో యోగిబాబు కామెడీ మాత్రం నవ్వకుండా నవ్వించేదే. ఈ మధ్య సినిమాల్లో టూరిస్టు ఆర్టిస్టులా వచ్చిపోతున్న యోగిబాబుకి ఈసారి విషయమున్న పాత్ర దక్కింది. రజనీ కొడుకు పాత్రలో వసంత్ రవి పాత్ర తీరుతెన్నులకి సరిపోయాడు. నార్త్ గ్యాంగ్ స్టర్ గా జాకీష్రాఫ్, ముంబాయి మాఫియాగా మోహన్ లాల్, కర్ణాటక క్రిమినల్ గా శివరాజ్ కుమార్, తెలుగు సినిమా పిచ్చోడుగా సునీల్ తమ సంక్షిప్త పాత్రలతో సెకండాఫ్ ని నిలబెట్టారు. ఇక విలన్ వర్మగా మలయాళ నటుడు వినాయకన్ విలనీ అతి క్రూరంగా, రాక్షసంగా వుంది. ఈ పాత్రతో రక్త పాతం కూడా ఎక్కువే. చంపే దృశ్యాలు షాకింగ్ గా వున్నాయి. రజనీ కాంత్ సినిమా అంటే ఫ్యామిలీలు కూడా చూసే సినిమా. హింస ఇలా వుంటే జడుసుకు ఛస్తారు.
       
రజనీ కాంత్ తన
ఒన్ మాన్ షో తో ప్రేక్షకుల మెదళ్ళ లోకి చొచ్చుకుపోయే ఫ్యామిలీ- యాక్షన్ హీరోగా మళ్ళీ తన అగ్రస్థానాన్ని చాటుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ జైలర్ పాత్ర, దాంతో చేసిన కామెడీ పెద్దగా నిలబడవు. ప్రధాన కథలో ఫ్యామిలీ- యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు. తండ్రీ కొడుకుల సంబంధాల కథని బయట పెట్టుకోలేని భావోద్వేగాలతో తన అనుభవంతో బాగా పండించాడు.
       
సాంకేతికంగా రజనీ స్థాయి విలువలతోనే వుంది. అయితే సాంకేతికాలే తప్ప రచన బావుండని సినిమాలే ఎక్కువ వస్తూంటాయి. దర్శకుడు నెల్సన్ ఈ రెండూ సమం చేశాడు. నిగ్రహం తప్పకుండా కథా కథనాల్ని క్వాలిటీ రైటింగుతో కొనసాగించడమే గాక
, నటింప జేసుకోవడం, సంగీతం, ఛాయాగ్రహణం, సెట్స్, లొకేషన్స్ వంటి సర్వ హంగుల్నీ ద్విగుణీకృతం చేశాడు. రజనీ స్టార్ డమ్ ని కాపాడుతూ.
—సికిందర్

22, జులై 2023, శనివారం

1349 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
తారాగణం : సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ, గారీ ఓల్డ్ మాన్, కెనెత్ బ్రనగా, టామ్ కాంటీ తదితరులు
సంగీతం : లుడ్విగ్ గోరన్సన్, ఛాయాగ్రహణం : హయ్ట్ వాన్ హయ్టెమా 
బ్యానర్స్ : సింకాపీ ఇన్ కార్పొరేషన్, అట్లాస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
విడుదల : జులై 21, 2023
***

ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ఒపెన్ హైమర్ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా వాటిలో ఒక్క టెనెట్ (2020) తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు. అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ అంటూ అందించాడు.


దీంతో సహజంగానే జపాన్ ని ధ్వంసం చేసిన అణుబాంబు సృష్టికర్త ఒపెన్ హైమర్ గురించి దృశ్యాత్మకంగా చూసి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నోలన్ ఫ్యాన్స్ కేర్పడింది. ఓపెనింగ్స్ తోనే 45-50 మిలియన్ డాలర్ల బాక్సాఫీసుతో విజయవంతంగా నిలిచిన ఈ మూవీ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. ఇది లాభాలార్జించాలంటే 400 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు రాబట్టాలని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఈ మూవీ మిగిలిన నోలన్ సినిమాల్ని తలదన్నేలా వుందా? అన్ని  వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే మేకింగ్ తో వుందా? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

రాబర్ట్ జే ఒపెన్ హైమర్ అలియాస్ ఒప్పీ (సిలియన్ మర్ఫీ) అమెరికాలో జన్మించిన యూదు. 1927 లో జర్మనీలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా చేరుతాడు. ఇక్కడ క్వాంటం మెకానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖల్లో చేస్తున్న కృషిని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో  మన్హట్టన్ ప్రాజెక్ట్లో సైంటిస్టుగా నియమిస్తుంది. ఇలావుండగా మరోవైపు జీన్ టట్లక్ (ఫ్లారెన్స్ పాగ్) అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూంటాడు. మన్హట్టన్ ప్రాజెక్టు నుంచి బదిలీ అయి న్యూ మెక్సికోలోని  లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్గా నియమితుడవుతాడు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) జర్మనీ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెలుగులోకి వచ్చిన సమాచారంతో,  ఒప్పీ ని  అణ్వాయుధ తయారీకి ఆదేశిస్తాడు.
        
దాంతో ఒప్పీ టీమ్ ని ఏర్పాటు చేసుకుని ఆటంబాంబు తయారు చేసి విజయవంతంగా పరీక్ష జరుపుతాడు. ఆ తర్వాత ఒప్పీకి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ (గేరీ ఓల్డ్ మాన్) 1945 ఆగస్టు 6 న, మళ్ళీ 9 న ఒకటి కాదు, రెండు ఆటం బాంబులు జపాన్ లోని హీరోషిమా, నాగసాకి లపై ప్రయోగించాలని ఆదేశించడంతో ఒప్పీ బెదిరిపోతాడు. జపాన్లో జరిగిన బీభత్సానికి ట్రూమన్ ని నిలదీస్తాడు. ఇక్కడ్నించీ ఒప్పీకీ ప్రభుత్వానికీ సంబంధాలు చెడి, ఒప్పీ మీదే కోర్టు విచారణకి దారితీస్తుంది.
        
ఈ నేపథ్యంలో ఒప్పీపై ప్రభుత్వం చేసిన ప్రత్యారోపణ ఏమిటి? ఒప్పీ కమ్యూనిస్టు సానుభూతి పరుడనేది నిజమేనా? ఒప్పీ తను నిర్దోషియని ఎలా నిరూపించుకున్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పీ ఎందుకు పశ్చాత్తాపం చెందాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

అమెరికన్ ప్రొమీథియస్ అని 2005 లో కై బర్డ్, మార్టిన్ షెర్విన్ లు రాసిన ఒపెన్ హైమర్ బయోగ్రఫీ ఈ మూవీ కాధారం. క్రిస్టఫర్ నోలన్ తన స్టయిల్లో బయోపిక్‌ని తెరపై చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా కథ అయినప్పటికీ క్లాసిక్ నోలన్ మూవీగానే కన్పిస్తుంది. నోలన్ ఇష్టపడే నాన్ లీనియర్ కథనం, విభిన్న కలర్ స్కీములు, ఒప్పీ  మానసిక స్థితిని చిత్రించడానికి మాంటేజ్‌లతో వివరణాత్మక కథనం మొదలైన నోలన్ నుంచి ఆశించే ప్రతిదీ వుంటాయి- ఒక్క కమర్షియల్ ఎలిమెంట్లు తప్ప.
        
సినిమా విడుదలకి ముందు ఇది హార్రర్ జానర్ అని ప్రకటించి సంచలనం రేపాడు నోలన్. ఇంత ప్రతిష్టాత్మక సినిమా చీప్ గా హార్రర్ ఏమిటని అభిమానులు నొచ్చుకున్నారు. చెప్పినట్టుగానే నోలన్ ఇష్టపడే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోబాటు, పొలిటికల్ డాక్యుమెంటరీ ఆనవాళ్ళు లేకుండా దాదాపు హార్రర్ గానే ఈ బయోపిక్ వుంది. జపాన్ మీద ప్రయోగించిన అణుబాంబు తాలూకు హార్రర్ కాదిది- దీని పర్యవసానంగా ఒప్పీ అనుభవించే హార్రర్. ఇది ఆటంబాంబు దాడి కథ కాదు. ఒప్పీ అనుభవించే భయానక మానసిక స్థితి కథ. అతడి మేధకీ, హృదయానికీ మధ్య సంఘర్షణ. లక్షల మంది అమాయకుల్ని బలిగొన్న ఆటంబాంబుని కనుగొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయాణం ఈ కథ.
        
అయితే సాంకేతికంగా ఇది కథ కాదు, గాథ. అందువల్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా నాయకుడు- ప్రతినాయకుడు- సంఘర్షణ అనే యాక్షన్ థ్రిల్లర్ గా వుండదు. ఇది ఒక జీవిత చరిత్ర కావడంతో ఒప్పీ జీవితపు ముఖ్య సంఘటనల సంపుటిగా, డైరీగా  మాత్రమే ఇది వుంటుంది. ఇక్కడ నోలన్ అభిమానులు నిరాశపడతారు. ఇది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ గాక, మూడు గంటల సేపు సాగే డైలాగు డ్రామా. క్యారక్టర్ స్టడీ. దీన్ని థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ కోరుకుని చూస్తే మాత్రం అణుబాంబు మీద పడ్డట్టే వుంటుంది. 
        
ఫస్టాప్ మందకొడిగా సాగుతుంది ఒప్పీ వృత్తిగత, వ్యక్తిగత జీవిత చిత్రణతో. దీన్ని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి శృంగార జీవితం కూడా కలుపుకుని పాయింటుకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆటం బాంబు తయారీ దగ్గర్నుంచి ఆసక్తి పెరిగేలా చేసి, ఆటంబాంబు ప్రయోగంతో అసలు కథలోకి తీసికెళ్ళాడు నోలన్.
        
జపాన్ మీద అణుబాంబు ప్రయోగానికి ఎదురుతిరిగే ఒప్పీతో సెకండాఫ్ కథ వుంటుంది. కమ్యూనిస్టు అనే అనుమానంతో అతడ్నే ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో డ్రామా ఊపందుకుంటుంది. అధికారులు చుట్టు ముట్టి జరిపే ఈ విచారణ భావోద్వేగ భరితంగా వుంటుంది. మరోపక్క అణుబాంబు కనిపెట్టిన పాపిగా ఒప్పీ అనుభవించే మనోవేదన గుండెల్ని కదిలిస్తుంది. ముగింపు భావోద్వేగాల పతాక సన్నివేశాలతో కట్టి పడేస్తుంది. అణుబాంబు పితామహుడు ఒపెన్ హైమర్ సంక్షుభిత మనస్థితిని దర్శించాలంటే ఈ బయోపిక్ ని ఒక దృశ్యమాధ్యమం రూపంలో తన మేధస్సుతో అనితర సాధ్యంగా అందించాడని చెప్పాలి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్.

నటనలు -సాంకేతికాలు

ఒపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీకి ఆస్కార్ నామినేషన్‌ తప్పనిసరి అని అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషనే కాదు, ఆస్కార్ ప్రతిమనూ సొంతం చేసుకుంటాడు. మరే ఇతర నటుడూ సాధించలేని ఔన్నత్యాన్ని అతను దాదాపు సాధించినట్టు కన్పిస్తాడు. ఎందరో నటులకి అతనొక గైడ్ గా కన్పించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అతడి హావభావాల్ని, ముఖకవళికల్ని కెమెరా జూమ్ చేసి పట్టుకున్న తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి వుండం. అతడి నిస్సహాయత, ఆక్రోశం, ఆందోళన, పాప భీతి... ఒకటేమిటి, ప్రతీదీ హార్రర్ గా చేసి ప్రేక్షకుల మీదికి విసిరేదే. ఇది జపాన్ మీద అణుబాంబు దాడి కథ కాదు, అణుబాంబులా విస్ఫోటించే  సిలియన్ మర్ఫీ అభినయపు గాథ.
        
ఇంకా ఇందులో ఎన్ని పదుల పాత్రలున్నాయో చెప్పలేం. ఏ పాత్రలో ఎవర్ని చూస్తున్నామో కూడా పట్టుకోవడం కష్టం. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గా టాం కోంటీ, మరో శాత్రవేత్త నీల్స్ బోర్ గా కెన్నెత్ బ్రనగా (ఈయన 2018 లో అగాథా క్రిస్టీ నవల మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్ ని దర్శకుడుగా తెరకెక్కించాడు), అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూ మన్ గా గేరీ గోల్డ్ మాన్, లెఫ్టినెంట్ జనరల్  లేస్లీ గ్రోవ్స్ గా మాట్ డామన్‌ మాత్రం  గుర్తుంటారు.
        
సాంకేతికంగా లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం థియేటర్ సౌండ్ సిస్టమ్ లో కట్టిపడేస్తుంది. సన్నివేశాల్లో సంగీతం ఇంకి పోయి, ఎదురుగా నిజంగానే సంఘటనలు జరుగుతున్నాయా అన్నట్టు వుంటుంది. రిచర్డ్ కింగ్ సౌండ్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హయ్ట్ వాన్ హయ్టెమా ఛాయాగ్రహణం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా క్లోజప్ షాట్లు కథనాన్ని మనస్సుల్లో ముద్రించేస్తాయి. రూత్ డి జోంగ్ పీరియడ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకో అద్భుతం. ఎల్లెన్ మిరోజ్నిక్ రూపొందించిన దుస్తులు ఇంకో హైలైట్. ఇక జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ మాత్రం ఈ పూర్తి స్థాయి డైలాగ్ డ్రామాని గేట్లు తెరిచి వదిలేసి నట్టుంది మూడు గంటల సేపూ.
        
పోతే, అణుపరీక్ష నిర్వహించే సీను గ్రాఫిక్స్ వాడకుండా నిజదృశ్యం చూస్తున్నట్టు క్రియేట్ చేయగల్గడం క్రిస్టఫర్ నోలన్ కళాదృష్టికి ఓ చిన్న మచ్చు తునక.
—సికిందర్