రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఆగస్టు 2023, శుక్రవారం

1351 : రివ్యూ!


 దర్శకత్వం : మెహర్ రమేష్

తారాగణం : చిరంజీవి, కీర్తీ సురేష్ తమన్నా, సుశాంత్, మురళీ శర్మ, సాయాజీ షిండే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్య తదితరులు
సంగీతం : మహతీ స్వరసాగర్, ఛాయాగ్రహణం : డడ్లీ
బ్యానర్స్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్,, క్రియేటివ్ కమర్షియల్స్
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, కెఎస్ రామారావు
విడుదల : ఆగస్టు 11, 2023
***

నవరిలో వాల్తేరు వీరయ్య విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ వేదాలం రీమేక్ అని తెలిసిందే. దీనికి పదేళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకుడు. దర్శకత్వానికి పదేళ్ళ గ్యాప్, రీమేక్ కి ఎనిమిదేళ్ళ గ్యాప్ చాలా చెప్తాయి కాలదోషం పట్టిన సంగతులు. చిరంజీవికి కాలదోషం లేదు. ఆయన ప్రయత్నాలకే కాలీన స్పృహ కన్పించడం లేదు. ఈ కాలపు ప్రేక్షకులకి ఏ కాలపు సినిమాలు అందిస్తున్నారో చూసుకోకుండా కుమ్మేస్తున్నారు. ఆయన కుమ్మడం, ప్రేక్షకులు కుయ్యోమనడం ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం... 

కథ

శంకర్ (చిరంజీవి) సోదరి మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ని తీసుకుని కోల్ కతా లో దిగుతాడు. ఆమెని కాలేజీలో చేర్పించి టాక్సీ డ్రైవర్ గా మారతాడు. అతడికి లాస్య (తమన్నా) అనే క్రిమినల్ లాయర్ పరిచయమవుతుంది. పోలీస్ కమీషనర్ నగరంలో ఆడవాళ్ళ అపహరణలు జరుగుతున్న దృష్ట్యా టాక్సీ డ్రైవర్లు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తాడు.  దీంతో శంకర్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) అనే మాఫియా గ్యాంగ్ మెంబర్లని ఒకొక్కర్నీ  చంపడం మొదలెడడు. అటు వైపు మహాలక్ష్మిని లాయర్ లాస్య సోదరుడు శ్రీకర్ (సుశాంత్) ప్రేమించడంతో లాస్య శంకర్ దగ్గరికి ఆ పెళ్ళి సంబంధం తెస్తుంది. శంకర్ ఒప్పుకుంటాడు. ఇంతలో లాస్యకి శంకర్ చేస్తున్న హత్యలు తెలిసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుంది. సోదరి పెళ్ళి ఆగిపోవడంతో శంకర్ ఇరకాటంలో పడతాడు.
       
అసలు శంకర్ ఎవరు
? ఎందుకు మాఫియాల్ని హతమారుస్తున్నాడు? అతడి గతం ఏమిటి? చేస్తున్న హత్యల్ని ఎలా సమర్ధించుకుని ఆగిపోయిన సోదరి పెళ్ళి చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ   
2015 లో తమిళంలో అజిత్ నటించిన వేదాలం రీమేక్ కథ ఇది. తెలుగులో ఆవేశం పేరుతో డబ్ అయి విడుదలైంది కూడా. యూట్యూబ్ లో ఫ్రీగా వుంది కూడా. అయినా తెలిసిన పాత కథనే రీమేక్ చేశారు. కోల్ కత బ్యాక్ డ్రాప్ లో ఇలాటిదే అన్నాచెల్లెలు కథతో 2021 లో రజనీకాంత్ నటించిన అన్నాత్తే (తెలుగులో పెద్దన్న’) వచ్చి ఫ్లాపయ్యింది. ఇందులో కూడా చెల్లెలు కీర్తీ సురేషే. ఇంకోటేమిటంటే, భోళా శంకర్ లో తమన్నా లాగా, ఇందులో కూడా కోల్ కతాలో నయనతార లాయరే. ఇంకో అద్భుతమేమిటంటే, ఒకేలా వున్న వేదాలం’, అన్నాత్తే రెండు సినిమాలకీ దర్శకుడు శివయే!
       
అంటే తెలుగు ప్రేక్షకులు ఒకేలా వున్న
ఆవేశం’, పెద్దన్న రెండూ చూశాక, మళ్ళీ అలాటిదే భోళా శంకర్ కూడా చూడాలన్న మాట. ఇవి మామూలు బరువు బాధ్యతలు కావు. ప్రేక్షకులు నెరవేర్చుకుని విధేయత నిరూపించుకోవాలి. తీసిందే తీస్తూంటే చూసిందే చూస్తూ పోవాలి. ఇదేమైనా మాయాబజారా ఎన్ని సార్లు తీసినా చూడాడానికి. 
        
అయితే సమస్యేమిటంటే, 2013 లో షాడో తర్వాత సినిమాలేని దర్శకుడు మెహర్ రమేష్, పదేళ్ళ తర్వాత అదే తన కాలం నాటి దర్శకత్వానికి సాహసించడం. పూర్తిగా ఔట్ డేటెడ్ మేకింగ్ కి పాల్పడడం. 1970-80 ల సినిమా అన్పించేలా తీయడం. టైటిల్స్ లో స్టోరీ డెవలప్ మెంట్ అని తన పేరు పడుతుంది. వేదాలం సీన్ల వరసే దించేస్తే డెవలప్ మెంట్ ఏముందో అర్ధంగాదు. ఇలా ప్రేక్షకులకి తర్వాతేం జరుగుతుందో తెలిసిపోయే టెంప్లెట్ కథనం వాడేసి సినిమా చుట్టేసినట్టే వుంది.
       
మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గానీ
, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీనుగానీ లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేశారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసు పెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పదినిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్టాఫ్, సెకండాఫ్ చిత్రీకరణ డొల్లగా వుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బావుందనుకునేంత లోనే బోరుగా మారిపోతుంది. భోళా శంకర్ గా చిరంజీవి అసలు క్యారక్టర్ వెల్లడయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా విఫల మైంది.
       
కేవలం చిరంజీవి యంగ్
, స్టయిలిష్ లుక్, డాన్సులు, ఫైట్లు మాత్రమే అప్డేట్ అయి వున్నాయి. సినిమాలో విషయం, మేకింగ్ మాత్రం కాలానికి దూరంగా ఔట్ డేటెడ్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

చిరంజీవికి మూస ఫార్ములా పాత్రలు కొత్త కాదు. అవి ఎన్నిసార్లు నటించినా, పాత్రల పరిధి అంతే కాబట్టి, నటన మార్పు లేకుండా రిపీట్ అవుతూ వుంటుంది. అయితే ఈసారి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. కమెడియన్ల గుంపుతో  చేసిన కామెడీలు ఎవర్నీ నవ్వించలేక పోయాయి. ఎమోషన్లు చూద్దామంటే సిస్టర్ సెంటిమెంటు కూడా కృత్రిమంగా, అంతంత మాత్రంగా వుంది. ఒక్క యాక్షన్ సీన్లతో, పాటలకి స్టెప్పులతో మాత్రమే మెప్పించడానికి పరిమితమై పోయారు చిరంజీవి. ఫ్యాన్స్ కి కావాల్సింది ఇదే కాబట్టి వీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తారు.
       
తమన్నా రొటీన్ ఫార్ములా హీరోయిన్. తమన్నాతో బాటు కీర్తీ సురేష్ పాత్ర కూడా అంతంత మాత్రమే. మొన్నే రజనీకాంత్ తో చెల్లెలిగా నటించి
, మళ్ళీ ఇప్పుడు చిరంజీవితో చెల్లెలిగా నటించడం ఎంత ఎంబరాసింగ్ గా వుందో ఆమె మొహంలో చూస్తే తెలిసిపోతుంది. ఇక బోలెడు మంది కామెడియన్లు, విలన్లు రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయారు. సంగీతం, కెమెరా వర్క్, ఇతర టెక్నికల్ విభాగాలు ఎంత బాగా పని చేసినా దర్శకుడు కూడా పని చేయాలిగా? ఇది పూర్తిగా మెహర్ రమేష్ చెడ గొట్టుకున్న మెగా అవకాశం, మళ్ళీ రాదు.


మెగాస్టార్ ఈ కాలపు ప్రేక్షకుల కోసం ఇంకా తన
1970-80 లనాటి పురాతన కాలం టైపు సినిమాలు నటించకుండా, ఆ కాలంలో జరిగే పీరియడ్ కథలతో పీరియడ్ సినిమాలు నటిస్తే పాత సినిమాల వైభవమైనా చూసినట్టుంటుంది నేటి తరం ప్రేక్షకులకి. 1969 నేపథ్యంలో తీసిన ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్లాగా?
-సికిందర్


10, ఆగస్టు 2023, గురువారం

1350 : రివ్యూ!


 రచన - దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్

తారాగణం : రజనీకాంత్, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వసంత్ రవి, జాకీష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : సన్ పిక్చర్స్, నిర్మాత : కళానిధి మారన్
విడుదల : ఆగష్టు 10, 2023
***
        త మూడేళ్ళుగా మూడు సినిమాలతో హిట్లు లేక డీలా పడిన సూపర్ స్టార్ రజనీ కాంత్ నాల్గో తాజా ప్రయత్నంగా జైలర్ విడుదలైంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇతను నయనతారతో కొలమావు కోకిల’, శివ కార్తికేయన్ తో డాక్టర్ అనే రెండు హిట్లు తీసి, విజయ్ తో బీస్ట్ తో విఫలమయ్యాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం లభించింది. ఇది పెద్ద బాధ్యతే. పైగా సన్ పిక్చర్స్ వంటి పెద్ద బ్యానర్ సినిమా. అంతేగాక, నాలుగు భాషల నుంచి జాకీష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ ల కాంబినేషన్లతో రజనీకాంత్ పానిండియా స్థాయి మూవీ ఇది. దీన్ని నెల్సన్ ఎలా తీశాడు? రజనీ ఫ్యాన్స్ ని మెప్పించ గలిగాడా? రజనీకి ఇప్పుడొక హిట్ అందిందా? ఇవి తెలుసుకుందాం. 

కథ

    ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) - మనవడులతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతూంటాడు. మనవడికి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుకోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. ఇతనొక విగ్రహాల స్మగ్లింగ్ కేసు ట్రాక్ చేస్తూ మిస్సయి పోతాడు. మిస్సయిన కొడుకుని విగ్రహాల స్మగ్లర్ వర్మ (వినాయకన్) చంపేశాడని తెలుసుకుంటాడు.  దీంతో పగబట్టిన ముత్తు స్మగ్లర్ వర్మతో తలపడతాడు.
       
ఇప్పుడు స్మగ్లర్ వర్మ పెట్టిన కండిషన్ ఏమిటి
? దాని ప్రకారం ముత్తు ఓ  ఆలయంలో విలువైన కిరీటాన్ని తస్కరించి వర్మ కిచ్చాడా? ఇందులో నార్త్ గ్యాంగ్ స్టర్ (జాకీష్రాఫ్) తో బాటు, మాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివరాజ్ కుమార్), బ్లాస్ట్ మోహన్ (సునీల్) లు  చేసిన సహాయం ఏమిటి? కామ్నా (తమన్నా) ఎవరు? ఆఖరికి ముత్తువేల్, వర్మ డిమాండ్ ని నెరవేర్చాడా లేదా? తీహార్ జైల్లో మాజీ జైలర్ గా పనిచేసిన అతడి గతమేమిటి? చివరికి కొడుకు గురించి తెలుసుకున్న ఒక నిజంతో ఎలాటి భావోద్వేగాలకి లోనయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

కథ కొత్తదేం కాదు. రజనీకాంత్ తో దాన్ని నడిపించిన విధానం కొత్తది. రజనీకాంత్ పెద్ద వయసు పాత్రకి తగ్గట్టుగా పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. రిటైరైన జైలర్ పోలీసుద్యోగంలో తన కొడుకు కూడా నిజాయితీగా విధినిర్వహణ చేసేలా విద్యాబుద్ధులు నేర్పినప్పుడు, ఆ కొడుకు ఎంతవరకు తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడనే తండ్రీ కొడుకుల సంబంధాల్ని చిత్రించే -భావోద్వేగాలతో కూడిన కథ. ఈ కథ రెండు గంటలా 45 నిమిషాలు సాగదీయకపోతే మరింత బలీయమైన కథగా వుండేది.
       
ఉపరితలంలో కొడుకు కోసం ముఠా మీద తండ్రి పగ లాంటి రొటీన్ కథగానే  వుంటుంది. అయితే ఈ రొటీన్ గా అన్పించే కథ పొరలు పొరలుగా విడిపోతూ కొత్త కోణాలతో
, మలుపులతో థ్రిల్ చేస్తుంది. ఇలా ఫస్టావ్ లో ఒక ట్విస్టు, సెకండాఫ్ లో మరో మూడు ట్విస్టులు మొత్తం రజనీ- నెల్సన్ ల బాక్సాఫేసు గేమ్ ని సక్సెస్ ఫుల్ గా మార్చేశాయి.
       
ఫస్టాఫ్ రజనీకాంత్ రిటైరైన వ్యక్తిగా కుటుంబ జీవితం గడపడంతో
, మనవడితో కామెడీతో ప్రారంభమవుతుంది. ఒక చిన్నఇల్లు, ఇంట్లో సేంద్రీయంగా కూరగాయలు పండించుకోవడం, యూ ట్యూబర్ గా 96 మంది సబ్ స్రైబర్లున్న మనవడికి శిక్షణ నివ్వడం, వీధిలో కనిపిస్తే చాలు రజనీని దాదాపు గుద్దేసేంత పనిచేసే క్యాబ్ డ్రైవర్ తో చిరు తగాదాలు - ఇదే జీవితంగా సాగుతున్నప్పుడు, ఏసీపీ అధికారియైన కొడుకు అదృశ్యం జీవితాన్ని మలుపుతిప్పుతుంది. భార్యతో, కోడలితో ఈ భాధలో వుండగా, కొడుకు హత్యావార్త కూడా తెలుస్తుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొరికిన ముఠా వాళ్ళని చంపడం, ముఠా కుటుంబం మీద ఎదురు దాడికి దిగడం వంటి ఘటనలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లో బ్యాంగులు గానీ, ట్విస్టులు గానీ ఏమీ వుండక -ఒక కుటుంబ సన్నివేశంతో ముగుస్తుంది. ఇది రొటీన్ కి భిన్నం. 
       
సెకండాఫ్ రజనీ వేట కొనసాగుతుంది. ఈ వేటలో ఒకచోట ఒకప్పటి జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. రజనీ మాజీ జైలర్ అని ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సాగదీయకుండా ఒకే జైలు సన్నివేశంతో ముగిసిపోవడం కూడా రొటీన్ కి భిన్నమే. ఆ తర్వాత కిరీటం కోసం స్మగ్లర్ పెట్టే డిమాండ్ తో సెకండాఫ్ కథ మలుపు తిరిగి వరుసగా బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్
, మలయాళ స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. తెలుగు కమెడియన్ సునీల్ తెరపై కొస్తూంటారు. ఒక పాటతో తమన్నా కూడా వస్తుంది. కిరీటాన్ని హైజాక్ చేసే కాన్సెప్ట్ తో సాగుతూ వుండే సెకండాఫ్ కొడుకుతో క్లయిమాక్స్ ట్విస్టుతో ముగింపుకి చేరుకుంటుంది.
       
కథ నీటుగా వుండడం
, ఎలాటి డాన్సులు, కామెడీలు లేకుండా రజనీకాంత్ పాత్ర ఫ్యామిలీమాన్ గా హూందాగా కొనసాగడం - అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆద్యంతం కూర్చోబెట్టేలా చేస్తాయి. సూపర్ స్టార్ సినిమా పేరుతో లిబర్టీ తీసుకుని వూర మాస్ కమర్షియల్ చేయకుండా, కాస్త అర్ధవంతమైన ఎంటర్ టైనర్ గానే తీశాడు దర్శకుడు. కాకపోతే నిడివి తగ్గాలి.

నటనలు - సాంకేతికాలు

కొన్ని సార్లు సూపర్ స్టార్ సినిమాలు ఒన్ మాన్ షోగా వుంటాయి. సూపర్ స్టార్ ఇప్పుడే కొత్తగా నటిస్తున్నట్టు బలవంతంగా ప్రేక్షకుల మీద రుద్దుతూ ఇతర తారాగణాన్ని వెనక్కి నెట్టేస్తూంటారు. రజనీతో ఇలా జరగలేదు. రజనీతో ఇంకో నాల్గు భాషల స్టార్లు వున్నారు. వాళ్ళు సెకండాఫ్ లో ఒక్కో ఎపిసోడ్ లో కనిపిస్తారు. సంక్షిప్తంగా కనిపించినా కథ అవసరాన్ని తీర్చేసి వెళ్ళిపోతారు.  ఇలా కరివేపాకు పాత్రలు కాకుండా వుంటారు. ఒన్ మాన్ షో కూడా ఎలా వుండాలో బహుశా మొదటిసారి చూపించాడు దర్శకుడు.
       
అయితే రమ్య కృష్ణ
, మిర్నా మీనన్ కుటుంబ పాత్రల్ని నిర్లక్ష్యం చేశాడు. కథకి అడ్డు వస్తున్నారనుకుని పక్కకు పెట్టేసినట్టున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా రజనీతో యోగిబాబు కామెడీ మాత్రం నవ్వకుండా నవ్వించేదే. ఈ మధ్య సినిమాల్లో టూరిస్టు ఆర్టిస్టులా వచ్చిపోతున్న యోగిబాబుకి ఈసారి విషయమున్న పాత్ర దక్కింది. రజనీ కొడుకు పాత్రలో వసంత్ రవి పాత్ర తీరుతెన్నులకి సరిపోయాడు. నార్త్ గ్యాంగ్ స్టర్ గా జాకీష్రాఫ్, ముంబాయి మాఫియాగా మోహన్ లాల్, కర్ణాటక క్రిమినల్ గా శివరాజ్ కుమార్, తెలుగు సినిమా పిచ్చోడుగా సునీల్ తమ సంక్షిప్త పాత్రలతో సెకండాఫ్ ని నిలబెట్టారు. ఇక విలన్ వర్మగా మలయాళ నటుడు వినాయకన్ విలనీ అతి క్రూరంగా, రాక్షసంగా వుంది. ఈ పాత్రతో రక్త పాతం కూడా ఎక్కువే. చంపే దృశ్యాలు షాకింగ్ గా వున్నాయి. రజనీ కాంత్ సినిమా అంటే ఫ్యామిలీలు కూడా చూసే సినిమా. హింస ఇలా వుంటే జడుసుకు ఛస్తారు.
       
రజనీ కాంత్ తన
ఒన్ మాన్ షో తో ప్రేక్షకుల మెదళ్ళ లోకి చొచ్చుకుపోయే ఫ్యామిలీ- యాక్షన్ హీరోగా మళ్ళీ తన అగ్రస్థానాన్ని చాటుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ జైలర్ పాత్ర, దాంతో చేసిన కామెడీ పెద్దగా నిలబడవు. ప్రధాన కథలో ఫ్యామిలీ- యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు. తండ్రీ కొడుకుల సంబంధాల కథని బయట పెట్టుకోలేని భావోద్వేగాలతో తన అనుభవంతో బాగా పండించాడు.
       
సాంకేతికంగా రజనీ స్థాయి విలువలతోనే వుంది. అయితే సాంకేతికాలే తప్ప రచన బావుండని సినిమాలే ఎక్కువ వస్తూంటాయి. దర్శకుడు నెల్సన్ ఈ రెండూ సమం చేశాడు. నిగ్రహం తప్పకుండా కథా కథనాల్ని క్వాలిటీ రైటింగుతో కొనసాగించడమే గాక
, నటింప జేసుకోవడం, సంగీతం, ఛాయాగ్రహణం, సెట్స్, లొకేషన్స్ వంటి సర్వ హంగుల్నీ ద్విగుణీకృతం చేశాడు. రజనీ స్టార్ డమ్ ని కాపాడుతూ.
—సికిందర్

22, జులై 2023, శనివారం

1349 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
తారాగణం : సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ, గారీ ఓల్డ్ మాన్, కెనెత్ బ్రనగా, టామ్ కాంటీ తదితరులు
సంగీతం : లుడ్విగ్ గోరన్సన్, ఛాయాగ్రహణం : హయ్ట్ వాన్ హయ్టెమా 
బ్యానర్స్ : సింకాపీ ఇన్ కార్పొరేషన్, అట్లాస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
విడుదల : జులై 21, 2023
***

ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ఒపెన్ హైమర్ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా వాటిలో ఒక్క టెనెట్ (2020) తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు. అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ అంటూ అందించాడు.


దీంతో సహజంగానే జపాన్ ని ధ్వంసం చేసిన అణుబాంబు సృష్టికర్త ఒపెన్ హైమర్ గురించి దృశ్యాత్మకంగా చూసి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నోలన్ ఫ్యాన్స్ కేర్పడింది. ఓపెనింగ్స్ తోనే 45-50 మిలియన్ డాలర్ల బాక్సాఫీసుతో విజయవంతంగా నిలిచిన ఈ మూవీ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. ఇది లాభాలార్జించాలంటే 400 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు రాబట్టాలని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఈ మూవీ మిగిలిన నోలన్ సినిమాల్ని తలదన్నేలా వుందా? అన్ని  వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే మేకింగ్ తో వుందా? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

రాబర్ట్ జే ఒపెన్ హైమర్ అలియాస్ ఒప్పీ (సిలియన్ మర్ఫీ) అమెరికాలో జన్మించిన యూదు. 1927 లో జర్మనీలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా చేరుతాడు. ఇక్కడ క్వాంటం మెకానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖల్లో చేస్తున్న కృషిని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో  మన్హట్టన్ ప్రాజెక్ట్లో సైంటిస్టుగా నియమిస్తుంది. ఇలావుండగా మరోవైపు జీన్ టట్లక్ (ఫ్లారెన్స్ పాగ్) అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూంటాడు. మన్హట్టన్ ప్రాజెక్టు నుంచి బదిలీ అయి న్యూ మెక్సికోలోని  లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్గా నియమితుడవుతాడు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) జర్మనీ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెలుగులోకి వచ్చిన సమాచారంతో,  ఒప్పీ ని  అణ్వాయుధ తయారీకి ఆదేశిస్తాడు.
        
దాంతో ఒప్పీ టీమ్ ని ఏర్పాటు చేసుకుని ఆటంబాంబు తయారు చేసి విజయవంతంగా పరీక్ష జరుపుతాడు. ఆ తర్వాత ఒప్పీకి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ (గేరీ ఓల్డ్ మాన్) 1945 ఆగస్టు 6 న, మళ్ళీ 9 న ఒకటి కాదు, రెండు ఆటం బాంబులు జపాన్ లోని హీరోషిమా, నాగసాకి లపై ప్రయోగించాలని ఆదేశించడంతో ఒప్పీ బెదిరిపోతాడు. జపాన్లో జరిగిన బీభత్సానికి ట్రూమన్ ని నిలదీస్తాడు. ఇక్కడ్నించీ ఒప్పీకీ ప్రభుత్వానికీ సంబంధాలు చెడి, ఒప్పీ మీదే కోర్టు విచారణకి దారితీస్తుంది.
        
ఈ నేపథ్యంలో ఒప్పీపై ప్రభుత్వం చేసిన ప్రత్యారోపణ ఏమిటి? ఒప్పీ కమ్యూనిస్టు సానుభూతి పరుడనేది నిజమేనా? ఒప్పీ తను నిర్దోషియని ఎలా నిరూపించుకున్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పీ ఎందుకు పశ్చాత్తాపం చెందాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

అమెరికన్ ప్రొమీథియస్ అని 2005 లో కై బర్డ్, మార్టిన్ షెర్విన్ లు రాసిన ఒపెన్ హైమర్ బయోగ్రఫీ ఈ మూవీ కాధారం. క్రిస్టఫర్ నోలన్ తన స్టయిల్లో బయోపిక్‌ని తెరపై చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా కథ అయినప్పటికీ క్లాసిక్ నోలన్ మూవీగానే కన్పిస్తుంది. నోలన్ ఇష్టపడే నాన్ లీనియర్ కథనం, విభిన్న కలర్ స్కీములు, ఒప్పీ  మానసిక స్థితిని చిత్రించడానికి మాంటేజ్‌లతో వివరణాత్మక కథనం మొదలైన నోలన్ నుంచి ఆశించే ప్రతిదీ వుంటాయి- ఒక్క కమర్షియల్ ఎలిమెంట్లు తప్ప.
        
సినిమా విడుదలకి ముందు ఇది హార్రర్ జానర్ అని ప్రకటించి సంచలనం రేపాడు నోలన్. ఇంత ప్రతిష్టాత్మక సినిమా చీప్ గా హార్రర్ ఏమిటని అభిమానులు నొచ్చుకున్నారు. చెప్పినట్టుగానే నోలన్ ఇష్టపడే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోబాటు, పొలిటికల్ డాక్యుమెంటరీ ఆనవాళ్ళు లేకుండా దాదాపు హార్రర్ గానే ఈ బయోపిక్ వుంది. జపాన్ మీద ప్రయోగించిన అణుబాంబు తాలూకు హార్రర్ కాదిది- దీని పర్యవసానంగా ఒప్పీ అనుభవించే హార్రర్. ఇది ఆటంబాంబు దాడి కథ కాదు. ఒప్పీ అనుభవించే భయానక మానసిక స్థితి కథ. అతడి మేధకీ, హృదయానికీ మధ్య సంఘర్షణ. లక్షల మంది అమాయకుల్ని బలిగొన్న ఆటంబాంబుని కనుగొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయాణం ఈ కథ.
        
అయితే సాంకేతికంగా ఇది కథ కాదు, గాథ. అందువల్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా నాయకుడు- ప్రతినాయకుడు- సంఘర్షణ అనే యాక్షన్ థ్రిల్లర్ గా వుండదు. ఇది ఒక జీవిత చరిత్ర కావడంతో ఒప్పీ జీవితపు ముఖ్య సంఘటనల సంపుటిగా, డైరీగా  మాత్రమే ఇది వుంటుంది. ఇక్కడ నోలన్ అభిమానులు నిరాశపడతారు. ఇది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ గాక, మూడు గంటల సేపు సాగే డైలాగు డ్రామా. క్యారక్టర్ స్టడీ. దీన్ని థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ కోరుకుని చూస్తే మాత్రం అణుబాంబు మీద పడ్డట్టే వుంటుంది. 
        
ఫస్టాప్ మందకొడిగా సాగుతుంది ఒప్పీ వృత్తిగత, వ్యక్తిగత జీవిత చిత్రణతో. దీన్ని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి శృంగార జీవితం కూడా కలుపుకుని పాయింటుకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆటం బాంబు తయారీ దగ్గర్నుంచి ఆసక్తి పెరిగేలా చేసి, ఆటంబాంబు ప్రయోగంతో అసలు కథలోకి తీసికెళ్ళాడు నోలన్.
        
జపాన్ మీద అణుబాంబు ప్రయోగానికి ఎదురుతిరిగే ఒప్పీతో సెకండాఫ్ కథ వుంటుంది. కమ్యూనిస్టు అనే అనుమానంతో అతడ్నే ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో డ్రామా ఊపందుకుంటుంది. అధికారులు చుట్టు ముట్టి జరిపే ఈ విచారణ భావోద్వేగ భరితంగా వుంటుంది. మరోపక్క అణుబాంబు కనిపెట్టిన పాపిగా ఒప్పీ అనుభవించే మనోవేదన గుండెల్ని కదిలిస్తుంది. ముగింపు భావోద్వేగాల పతాక సన్నివేశాలతో కట్టి పడేస్తుంది. అణుబాంబు పితామహుడు ఒపెన్ హైమర్ సంక్షుభిత మనస్థితిని దర్శించాలంటే ఈ బయోపిక్ ని ఒక దృశ్యమాధ్యమం రూపంలో తన మేధస్సుతో అనితర సాధ్యంగా అందించాడని చెప్పాలి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్.

నటనలు -సాంకేతికాలు

ఒపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీకి ఆస్కార్ నామినేషన్‌ తప్పనిసరి అని అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషనే కాదు, ఆస్కార్ ప్రతిమనూ సొంతం చేసుకుంటాడు. మరే ఇతర నటుడూ సాధించలేని ఔన్నత్యాన్ని అతను దాదాపు సాధించినట్టు కన్పిస్తాడు. ఎందరో నటులకి అతనొక గైడ్ గా కన్పించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అతడి హావభావాల్ని, ముఖకవళికల్ని కెమెరా జూమ్ చేసి పట్టుకున్న తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి వుండం. అతడి నిస్సహాయత, ఆక్రోశం, ఆందోళన, పాప భీతి... ఒకటేమిటి, ప్రతీదీ హార్రర్ గా చేసి ప్రేక్షకుల మీదికి విసిరేదే. ఇది జపాన్ మీద అణుబాంబు దాడి కథ కాదు, అణుబాంబులా విస్ఫోటించే  సిలియన్ మర్ఫీ అభినయపు గాథ.
        
ఇంకా ఇందులో ఎన్ని పదుల పాత్రలున్నాయో చెప్పలేం. ఏ పాత్రలో ఎవర్ని చూస్తున్నామో కూడా పట్టుకోవడం కష్టం. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గా టాం కోంటీ, మరో శాత్రవేత్త నీల్స్ బోర్ గా కెన్నెత్ బ్రనగా (ఈయన 2018 లో అగాథా క్రిస్టీ నవల మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్ ని దర్శకుడుగా తెరకెక్కించాడు), అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూ మన్ గా గేరీ గోల్డ్ మాన్, లెఫ్టినెంట్ జనరల్  లేస్లీ గ్రోవ్స్ గా మాట్ డామన్‌ మాత్రం  గుర్తుంటారు.
        
సాంకేతికంగా లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం థియేటర్ సౌండ్ సిస్టమ్ లో కట్టిపడేస్తుంది. సన్నివేశాల్లో సంగీతం ఇంకి పోయి, ఎదురుగా నిజంగానే సంఘటనలు జరుగుతున్నాయా అన్నట్టు వుంటుంది. రిచర్డ్ కింగ్ సౌండ్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హయ్ట్ వాన్ హయ్టెమా ఛాయాగ్రహణం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా క్లోజప్ షాట్లు కథనాన్ని మనస్సుల్లో ముద్రించేస్తాయి. రూత్ డి జోంగ్ పీరియడ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకో అద్భుతం. ఎల్లెన్ మిరోజ్నిక్ రూపొందించిన దుస్తులు ఇంకో హైలైట్. ఇక జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ మాత్రం ఈ పూర్తి స్థాయి డైలాగ్ డ్రామాని గేట్లు తెరిచి వదిలేసి నట్టుంది మూడు గంటల సేపూ.
        
పోతే, అణుపరీక్ష నిర్వహించే సీను గ్రాఫిక్స్ వాడకుండా నిజదృశ్యం చూస్తున్నట్టు క్రియేట్ చేయగల్గడం క్రిస్టఫర్ నోలన్ కళాదృష్టికి ఓ చిన్న మచ్చు తునక.
—సికిందర్


20, జులై 2023, గురువారం

1348 : రివ్యూ!

 


రచన-దర్శకత్వం: అనిల్ కృష్ణ కన్నెగంటి
తారాగణం : అశ్విన్ బాబు, నందితా శ్వేత, సాహితీ అవంచ, విద్యుల్లేఖా రామన్, సంజయ్ స్వరూప్,రాజీవ్ కనకాల శుభలేక సుధాకర్, శ్రీనివాస రెడ్డి, రఘు కుంచె తదితరులు
సంగీతం: వికాస్ బాడిస, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్
సమర్పణ : అనిల్ సుంకర, బ్యానర్: ఎస్వీకే సినిమాస్, నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ :  జూలై 20, 2023
***

        వారం ట్రైలర్స్ తో, ప్రమోషన్స్ తో ఉత్కంఠ రేపిన హిడింబ అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజుగారి గది హార్రర్ కామెడీల్లో నటించి పరిచయమైన అశ్విన్ బాబు ఈ సారి వైవిధ్యమున్న సినిమాలో నటించడం, అదీ యాక్షన్ హీరోగా కొత్త మేకోవర్ రో ప్రత్యక్షమవడం ఆసక్తి కల్గించే విషయమే. అయితే ఈ ప్రయత్నంలో వైవిధ్యం ఎంత వరకూ వుంది? ప్రచార ఆర్భాటం ఎంతవరకూ సబబన్పించుకుంది? ఇవి పరిశీలిద్దాం...  

కథ

అభయ్ (అశ్విన్ బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీసు ట్రైనింగ్ పొందుతున్న సమయంలో ప్రేమలో పడి తర్వాత విడిపోతారు. అభయ్ నగరంలో ఎస్సైగా పని చేస్తూంటాడు. నగరంలో యువతులు సీరియల్ కిడ్నాప్స్ కి గురవుతూంటారు. ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం కేరళ నుంచి ఆద్యాని పిలిపిస్తుంది. ఆద్య ఇప్పుడు ఐపీఎస్. కేసులో ఆమెకి సహాయంగా అభయ్ ని నియమిస్తుంది ప్రభుత్వం. ఇద్దరూ దర్యాప్తు చేసి కాలా బండలో బోయ అనే క్రిమినల్ ని పట్టుకుని యువతుల్ని విడిపిస్తారు.      

అయినా ఇంకో యువతి కిడ్నాప్ అయ్యేసరికి, మిస్సయిన 16 మంది యువతులు వేరని, బోయ బంధించిన యువతులు వేరనీ గుర్తిస్తుంది ఆద్యా. అంతే గాక ఆ కిడ్నాపర్ ఎరుపు దుస్తులేసుకున్న యువతుల్ని అపహరిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఎవరా కిడ్నాపర్? ఎక్కడున్నాడు? అండమాన్ దీవుల్లో ఆదిమ జాతి హిడింబకి ఈ కిడ్నాప్స్ తో వున్న సంబంధమేమిటి? ఈ కేసుని ఎలా ఛేదించారు ఆద్యా, అభయ్? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

హార్రర్ జానర్ లో సబ్ జానర్ కిందికి కానబలిజం (నరమాంస భక్షణ) సినిమాలొస్తాయి. 1965 -1980 ల మధ్య హాలీవుడ్ నుంచి విపరీతంగా కానబలిజం సినిమాలొచ్చాయి. దాన్ని కానబలిజం బూమ్ అన్నారు.1965 లో నేకెడ్ ప్రే తో ఈ బూమ్ ప్రారంభమయింది. శ్వేత జాతీయుడ్ని ఆఫ్రికన్ నరమాంస భక్షక తెగ వెంటాడి పట్టుకుని తినేసే కథతో ఈ సినిమా తీశారు. తర్వాత ఈ టెంప్లెట్టే  నరమాంస భక్షక థ్రిల్లర్స్ కి బ్లూప్రింట్గా మారింది. అరణ్యంలో టూర్ కెళ్ళి నరభక్షకుల పాలబడి తప్పించుకురావడంగా, లేదా బలై పోవడంగా ఈ కథలుంటాయి.
       
1980 లలో బూమ్ ముగిసినా
, తర్వాత  అడపాదడపా ఈ తరహా సినిమాలు వస్తూనే వున్నాయి. తమిళంలో 2010 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ (వెయ్యి మందిలో ఒక్కడు) వచ్చింది. దీన్ని చోళ రాజుల నాటి చారిత్రక నేపథ్యంలో తీశారు.
       
నరమాంస భక్షణతో జుగుప్స
, వికారం, గగుర్పాటు కల్గించే కానబలిజం సినిమాలన్నీ హార్రర్ సబ్ జానర్స్ కి  పరాకాష్ఠ. మన దేశంలో కేవలం అండమాన్ దీవుల్లోని ఒక దీవిలో జరావా అనే తెగ ఏకైక నరభక్షక తెగగా వుంది. నిజానికి అండమాన్ దీవుల్లో వున్న ఆదిమవాసులు పదివేల సంవత్సరాల క్రితం మానవావిర్భావం జరిగిన ఆఫ్రికా నుంచి ఒక పాయగా విడిపోయి వచ్చి అండమాన్స్ లో స్థిరపడ్డారు. మరి కొందరు వివిధ ఖండాలకి వలస పోయారు. అండమాన్స్ కి వచ్చిన సమూహాలు  ఉపఖండమంతా విస్తరించారు. కాబట్టి మన పూర్వీకులు ఇప్పుడు అండమాన్స్ లో నివాసమున్నఆదిమ తెగలేనని శాస్త్రవేత్తలు తేల్చారు. మనమంతా వాళ్ళమే!!
        
అక్కడ వుంటున్న సంతతి నాగరిక ప్రపంచంలోకి రారు. నాగరికులు వెళ్తే ప్రతిఘటిస్తారు. ప్రభుత్వాలు వాళ్ళని నాగరిక ప్రపంచంలోకి తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ ప్రయత్నాల్లో కొందరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి ప్రయత్నం చేస్తే తెగలు చంపేస్తాయి. ప్రభుత్వం ఆ ప్రాంతం టూరిస్టులకి నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది.
       
ఇప్పుడు నరభక్షక జరావా తెగకి హిడింబా అనే కల్పిత పేరు పెట్టి ఈ సినిమా తీసినట్టున్నారు. అయితే జరావా తెగ పరాయివాళ్ళు తమవైపు వస్తే ప్రాణాలు తీస్తారేమోగానీ
, వాళ్ళు నాగరిక ప్రపంచంలోకి వచ్చి మనుషుల్ని ఎత్తుకుపోయి తినరు. ఈ దృష్ట్యా ఈ కథ అసహజంగానే గాక, జరావా తెగపట్ల, మన మూలాల పట్లా అన్యాయంగానూ అన్పిస్తుంది.
       
కాన్సెప్ట్ ఇలావుంటే దీంతో చేసిన కథ అమెచ్యూరిష్ గా వుంది. పైగా గతంలో జ రిగింది
, వర్తమానంలో జరిగింది నాన్ లీనియర్ కథనం (మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్) తో చెప్పడం చాలా గందరగోళానికి దారితీసింది. ఫస్టాఫ్ కేవలం కిడ్నాపులు, దర్యాప్తు- వీటితోనే సాగుతూ, ఈ దర్యాప్తు కూడా పేలవంగా, అర్ధరహితంగా, లాజిక్ లేకుండా సాగడంతో, మధ్యమధ్యలో ఆసక్తి కల్గించని లవ్ ట్రాక్ వచ్చి జొరబడడంతో -ట్రైలర్స్, ప్రమోషన్స్ హంగామా అంతా తాటాకు చప్పుళ్ళేనని స్పష్టమైపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఏ మాత్రం వైవిధ్యంలేని పాత మూస ఫార్ములా చిత్రణగా తేలిపోతుంది.
       
ఇక సెకండాఫ్ లో అసలు కథలో కొచ్చాకైనా కథనం దారిలో పడదు. రెండు ట్విస్టులు మాత్రం బావుంటాయి.
అండమాన్ దీవుల్లోని హిడింబా తెగ కథకి ముడిపెడుతూ చూపించిన ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత క్లయిమాక్స్ కి ముందు అంతరించిపోయిన హిడింబ తెగ మిగిలున్న వారసుడు రివీలయ్యే ట్విస్టూ మంచి బ్యాంగ్ నిస్తాయి. వీటితో ఈ కానిబాలిజం థ్రిల్లర్ మంచి థ్రిల్ నిస్తుంది. ఈ రెండు బలమైన పాయింట్లు చేతిలో వుంచుకుని వీటిని ప్లే చేసే విషయంలో దర్శకుడు ఎందుకు ఫెయిలయ్యాడో హిడింబాలకే తెలియాలి.
       
ఈ కాన్సెప్ట్ లో విషయముంది. ఎలా చెప్పాలో తెలియక వీగిపోయింది. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు
, కాలా బండలో కేజీఎఫ్ టైపు యాక్షన్ సీన్లు, సెకండాఫ్ లో యాక్షన్ సీన్లూ- వీటితో హడావిడి చేస్తే లోపాలు కవరై పోతాయనుకున్నట్టుంది- ఇంకా చూడడానికి జుగుప్స కల్గించే దృశ్యాల వల్లా – ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకూ రాని సినిమా చూసినట్టు ప్రేక్షకులు ఫీలై పోతారనుకున్నట్టుంది- అంత సీను మాత్రం లేదు. ఈ బీభత్సాన్ని బోయపాటి శ్రీను తీసివుంటే ఇంకోలా వుండేది. అన్నట్టు ఈ సినిమాలో బోయపాటిని అనుకరించడమూ వుంది.

నటనలు-సాంకేతికాలు

అశ్విన్ బాబు మేకోవర్ తో యాక్షన్ సీన్స్ కి తప్ప, ఎమోషనల్ సీన్స్ కి సరిపోలేదు. క్లయిమాక్స్ ట్విస్ట్ ని మాత్రం బాగా హేండిల్ చేయగలిగాడు. కానీ క్లయిమాక్స్ యాక్షన్ సీన్లు అతడితో చాలా అతి అన్పిస్తాయి బోయపాటి లెవెల్ తో. ఇక పోలీసు అధికారిగా ఫస్టాఫ్ లో నటన ఫరవాలేదుగానీ, ఆ దర్యాప్తులో విషయం లేక తేలిపోయాడు.  అలాగే రోమాంటిక్ సీన్స్ లో. ఐపీఎస్ గా నందితది మాత్రం పాత్రని నిలబెట్టే నటన. టాలెంట్ వున్న నటి.
       
ఇతర నటుల్లో మకరంద్ దేశ్పాండే పాత్ర
, నటన బలమైన ముద్ర వేస్తాయి. సహాయ పాత్రల్లో ఇతర నటులు కథకి తగ్గట్టు వుంటారు- అది కథ అనుకుంటే. సంగీతం లౌడ్ గా బి గ్రేడ్ సినిమా టైపులో వుంటే, ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వుంటాయి.
       
తొలిసారిగా కానబలిజం సినిమా చూపిస్తున్నప్పుడు జానర్ మర్యాదలు పాటించకుండా మూస ఫార్ములా ధోరణిలో చుట్టేయడం
, క్లయిమాక్స్ తో కాన్సెప్ట్ నిలబడినా ముగింపుని నిర్లక్ష్యం చేయడం వంటి కారణాలతో హిడింబ  చేజారిన యూనిక్ జానర్ గా మిగిలింది...

—సికిందర్