రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, డిసెంబర్ 2022, బుధవారం

1270 : న్యూస్!


 

    పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ డమ్ కి నిచ్చెనలు వేస్తున్నాడా? ప్రణాళిక వేసుకోవడం ఆల్రెడీ ప్రారంభమైంది. చిన్న చిన్న సూచనలు గ్లోబల్ వేదికల మీద కనిపిస్తూనే వున్నాయి. గత ఆగస్టులో తను బహుళ బ్రాండ్ షూట్లతో బిజీగా వున్నప్పుడు న్యూయార్క్ లో వార్షిక ఇండియన్ డే పరేడ్కి హాజరై, కె -పాప్ గ్రూపు బ్యాండ్ తో కలిసి ఇచ్చిన మ్యూజిక్ వీడియో వైరల్ అయింది. మేము ఆగము అసలే ఆగము అని ఒక తెలుగు లైను వుండే ఈ పాప్ నంబర్ లో ఇచ్చిన డాన్స్ మూవ్ మెంట్స్ సోషల్ మీడియాలో వెర్రెత్తించాయి.

        కె- పాప్  లేదా కొరియన్ పాప్ అనేది దక్షిణ కొరియాలో ఉద్భవించిన ఈ శతాబ్దపు  ట్రెండ్‌ సెట్టింగ్ మ్యూజికల్ గ్రూపు. ఈ గ్రూపులో అనేక బ్యాండ్ లున్నాయి. వాటిలో ట్రైబ్ ఒకటి. ఈ ట్రైబ్ కళాకారులతోనే కలిసి మ్యూజిక్ వీడియో ఇచ్చాడు. కె -పాప్ గ్రూప్ ఇండియన్ స్టార్ తో కలిసి పని చేయడం అదే మొదటిసారి.  ప్రయోగాత్మకంగా రాక్, హిప్-హాప్, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ వంటి అనేక రకాల కళా ప్రక్రియల సమ్మేళనం ట్రైబ్ అందించే సంగీతం. అల్లు అర్జున్ వీడియో ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో భాగంగా వెలువడింది.
        
తర్వాత డిసెంబర్ మొదటివారంలో పుష్ప తో రష్యా ప్రయాణం. అక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా మాస్కోలో రష్యన్ భాషలో పుష్ప ప్రీమియర్ ప్రదర్శన. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి, హీరోయిన్ రశ్మికా మందన్న మాస్కో ఫెస్టివల్లో స్పెషల్ షో తర్వాత, పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ ని థియేట్రికల్ రిలీజ్ చేసి వచ్చారు.    మాస్కోలోని ఇండియన్ ఎంబసీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ లో ఒకటిగా ఫెస్టివల్లో  పుష్ప ని ఎంపిక చేసింది.  అంతేగాకుండా క్రిటిక్స్ పిక్ గా కూడా నమోదైంది.  ఇక థియేట్రికల్ రిలీజ్ కి అల్లుతో పాటు టీమ్ మొత్తం ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు.  రేడియో ఇంటర్వ్యూలు, టీవీ ఇంటర్వ్యూలు ధారాళంగా ఇచ్చారు.
        
అయితే దిగ్భ్రాంతికరంగా సినిమా భారీ యెత్తున ఫ్లాపయింది. మూడు రోజుల్లోనే చాలా థియేటర్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రచార కార్యక్రమాల సమయంలో ఖర్చు చేసిన 3 కోట్ల రూపాయలూ నష్టంగా మిగిలింది.
        
ఇది అల్లుకి వార్నింగ్ బెల్. దీని ఫలితమేమిటో తర్వాత చూద్దాం. పై రెండు తీపి- చేదు అనుభవాలలా వుండగా, జపాన్ లో ఎన్టీఆర్- రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్లు డ్రీమ్ రన్‌ అన్పించి సంతోషాన్ని మిగిల్చాయి. ఆర్ ఆర్ ఆర్ జపాన్ బాక్సాఫీసు కలెక్షన్ 15 కోట్లకి చేరుకుంది. జపాన్ అంతటా దాదాపు 210 థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటిలో 31 ఐమాక్స్ థియేటర్లు. రెండోది, అటు ప్రఖ్యాత ఆస్కార్ నామినేషన్ రేసులో వుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్, రామ్ చరణ్), స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ సాంగ్, స్కోర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్‌ఎక్స్, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి మొదలైన 14 ప్రధాన కేటగిరీల క్రింద నామినేషన్ రేసులో ఎంటరైంది.
        
మరోవైపు, ఆర్ ఆర్ ఆర్ జనవరి 2023లో జరిగే ప్రసిద్ధ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి రెండు విభాగాల్లో నామినేట్ అయింది. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఆంగ్లేతర భాష ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) లకి గాను రెండు కేటగిరీల్లో నామినేట్ చేసింది.
        
కె- పాప్ హిట్, పుష్ప రష్యన్ ఫ్లాప్, ఆర్ ఆర్ ఆర్ జపాన్ హిట్, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు ఇవన్నీ చూస్తూంటే అల్లు అర్జున్ కి తను గ్లోబల్ స్టార్ అవ్వాలన్న పట్టుదల పెరగడం సహజమే. దీని ఫలితంగానే ఇప్పుడు పుష్ప- ది రైజ్ సీక్వెల్ పుష్ప- ది రూల్ విషయంలో చేస్తున్న డిమాండ్లు. అసలు పుష్ప- ది రూల్ షూటింగ్ ప్రారంభం కాకముందే, ఓవర్సీస్ హక్కుల కోసం మేకర్స్ రికార్డ్ ధరని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ రైట్స్ పొందేందుకు 80 కోట్లకి పైగా అడగడం మొదలెట్టారు. బయ్యర్లు బెదిరిపోయారు.
        
ఇప్పుడు అల్లు డిమాండ్లు మేకర్స్ కి బడ్జెట్ ని పెంచేస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజీ మొదటి ఇంస్టాల్ మెంట్ పుష్ప- ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో ఇంస్టాల్ మెంట్ పుష్ప -ది రూల్ మరింత భారీగా, మెరుగ్గా నిర్మించడానికి దాదాపు 400 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. ప్రీక్వెల్ కి మించి సీక్వెల్ అన్నమాట. అయితే అల్లు గ్లోబల్ ప్రణాళికల ఫలితంగా ఈ బడ్జెట్ మరింత పెరుగుతోంది. తొందరగా పూర్తి చేసేందుకు వొత్తిడి చేయకుండా గ్లోబల్ ప్రమాణాలతో తీయాలన్నదే అల్లు కోరిక.
        
అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ గా వైరల్ అవుతూంటే తను లోకల్ గా వుండలేడు కదా? అటు రష్యాలో పుష్ప ఫ్లాపవడం చూస్తే, గ్లోబల్ ప్రమాణాలకి అది సరిపోలేదనే అర్ధం. హాలీవుడ్ ప్రమాణాలే గ్లోబల్ ప్రమాణాలు. కేవలం సాంకేతికంగా కాదు, విషయపరంగా కూడా. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజారణ పొందడానికి విషయపరంగా ఏ సార్వజనీతనతో వుంటున్నాయో ఆ ప్రమాణాలు. లోకల్ నుంచి పానిండియా అవడం వెరైనట్టే, పానిండియా నుంచి గ్లోబల్ అవడం పూర్తిగా వేరు. ఇది కుర్తించినప్పుడే అల్లు అర్జున్ గ్లోబల్ ప్రణాళికలు విజయవంతమవుతాయి.
        
న్యూయార్క్ వార్షిక ఇండియన్ డే పరేడ్ లో, యే భారత్ కా తిరంగా హై, కభీ నహీ ఝుకేంగా (ఇది మా త్రివర్ణ పతాకం, ఇది తగ్గేదేలే) అని నినదించినట్టు, ఇది నా గ్లోబల్ పుష్ప- తగ్గేదేలే! అన్పించేట్టు వుండాల్సి వుంటుంది.

“But having a really good understanding of history, literature, psychology, sciences ― is very, very important to actually being able to make movies.” ― George Lucas

సికిందర్

20, డిసెంబర్ 2022, మంగళవారం

1269 : న్యూస్


  ప్పుడు ఓవర్ ది టాప్ (ఓటీటీ) సెక్టార్ కి సంబంధించి ఎక్కువగా వినబడుతున్న మాట బింజ్ వాచింగ్. అంటే  ఓటీటీ కంటెంట్ ని అతిగా చూసేస్తూ కాలం గడిపేయడం. మామూలుగా కంటెంట్ ని చూసే వ్యసనం వుంటే అది సమస్య కాదు. అతిగా చూసినప్పుడే వ్యసనం దుర్వ్యసనంగా మారుతుంది. బింజ్ వాచింగ్ అవుతుంది. ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ బింజ్ వాచింగ్ కి లోనుజేయడం ఓటీటీ కంపెనీల ప్రధాన ఉద్దేశం. దాదాపు ప్రతీ ఓటీటీ ప్లాట్ ఫామ్ అందించే కంటెంట్, దాని భాష, దృశ్యాలూ  ఇటీవలి కాలంలో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతపై బహుళ ప్రభావాల ఉధృతికి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.

        యినా ఎవరు లక్ష్యపెడుతున్నారు. బింజి బాబు బద్ధకంగా బెడ్ మీద వాలిపోయి బింజ్ వాచింగ్ కి ఇంకేమున్నాయా అని స్క్రోల్ చేస్తాడు. గజిబిజిగా చాలా కంటెంట్ కన్పిస్తోంది. ఏది చూడాలా అని గందరగోళంలో పడ్డాడు. బింజ్ వాచింగ్ కి కూడా మంచిదే చూడాలనుకుంటున్నాడు. ఆ మంచికి అతడి నిర్వచనం వేరు. ఆన్‌లైన్ వీడియో కంటెంట్‌ ని చూడడానికి ప్రతి రోజూ 8 గంటల 29 నిమిషాల కాలాన్ని పాడు చేసుకుంటున్న సగటు ఇండియన్ యూత్ లో గర్వించేలా తనూ ఒకడు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వినియోగదారుల సర్వే ఆధారంగా 2023 నాటికి భారతీయ ఓటీటీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లకి చేరుకుంటుందని అంచనా వేసింది. మరి దీన్ని నిజం చేసే బాధ్యత  తనలాంటి బింజి బాబుల  భుజస్కంధాల పైనే వుంది. సమయం కూడా ఎక్కువ లేదు.

కంటెంట్ దాహంతో స్క్రోల్ చేసే బింజి బాబుల పని సులువు చేయడానికే ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (సెప్టెంబర్ 30 త్రై మాసికానికి టర్నోవర్ 29.698 బిలియన్ డాలర్లట!) పుష్ ప్లే అనే బటన్ ని పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వినియోగదారుల వీక్షణ ప్రాధాన్యతల ఆధారంగా ఇది కంటెంట్ ని సూచిస్తుంది. దీన్ని కంటెంట్ బాస్కెట్ గా భావించ వచ్చు. వినియోగదారుల టేస్టు ని బట్టి కంటెంట్ టైటిల్స్ ఇందులో దర్శన మిస్తాయి. ఈ బాస్కెట్ దగ్గర పెట్టుకుని బింజ్ వాచింగ్ చేసేయ వచ్చు. మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్ బుట్ట వొళ్ళో పెట్టుకుని బుక్కుతున్నట్టు. బింజి బాబు ఈ పుష్ ప్లే బటన్ కోసమే వెయిటింగ్. ఇది వీడి చేతికి చిక్కిందా ఇక బయట కన్పించడు, బాస్కెట్లోనే వుంటాడు.

బాస్కెట్ దేశ దేశానికీ మారుతుంది. నెట్ ఫ్లిక్స్ అనే కాదు, ఇతర కంపెనీలూ అనుసరించి బాస్కెట్స్ తో వచ్చేస్తాయి. వినియోగదారులు చూడగలిగే కంటెంట్‌ ని కంపెనీలు క్యూరేట్ చేస్తున్నందున వెతుక్కునే పనుండదు. అదే సమయంలో వినియోగదారుల అభిరుచుల్ని మార్చే, మరోవైపుకు తీసికెళ్ళే అధికారం కంపెనీల చేతికొచ్చేస్తుంది. ఇప్పటికే క్రైమ్, హార్రర్ అనేవి పాపులర్ జానర్లుగా భావించేలా చేసి తమ కంటెంట్ లైబ్రరీలని నింపేస్తున్నాయి. అంతే కాదు వెబ్ సిరీస్ మొత్తం సీజన్‌లు ఒకేసారి విడుదల చేసి, అతిగా చూసే (బింజ్ వాచింగ్) ట్రెండ్‌కి దోహదం చేస్తాయి. కంపెనీల లక్ష్యం అంతులేని స్క్రోల్స్ ని సాధించడం, కంటెంట్‌ ని నిరంతరం నవీకరించడం. ఇంకా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్‌ ని నిరంతరం కనిపెట్టడం.   

ఆన్‌లైన్ వీక్షణకి స్మార్ట్ ఫోన్స్ అంబాటులోకి రావడంతో, కంటెంట్ ని వ్యక్తిగతీకరించే దారులు పెరిగాయి- శృంగార కంటెంట్ సహా. ఇది శృంగార కంటెంట్‌తో మొదలై ముగియదు. మతం, రాజకీయాలు కూడా ఉన్మాద చిత్రీకరణలతో ముందుకొస్తాయి. కంటెంట్ ప్రజల - ముఖ్యంగా యువత ఆలోచనా  ప్రక్రియని, వైఖర్లనీ, ప్రవర్తనీ ప్రభావితం చేసే అపారమైన సామర్థ్యాన్ని కలిగి వుంటాయి.  ప్రధానంగా దేశ వ్యతిరేక లేదా మత వ్యతిరేక కంటెంట్‌ ని ప్రదర్శించడం ద్వారా, దాంతో తక్షణమే స్పందించేలా రెచ్చగొట్టడం ద్వారా, యువతలో ప్రతికూల సంస్కృతిని కంటెంట్ వ్యాప్తి చేసే ప్రమాదముంది.

బింజ్ వాచింగ్ కి ఈ కంటెట్ తోడవడమనేది ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, డిప్రెషన్, స్థూలకాయం, కంటిచూపు తగ్గడం వంటి పరిణామాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. చదువు సంధ్యల సంగతి చెప్పక్కర్లేదు.  ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ వంటివి ప్రోత్సహించేలా ఇప్పటికే వెబ్ సిరీస్‌లు మారాయి. ఇటీవల యువత పాల్పడిన నేరాలకు ఓటీటీ కంటెంటే కారణమని పోలీసులు చెప్తున్నారు.

కాబట్టి బింజ్ వాచింగ్ కూడా ఒక డ్రగ్. దీన్నుంచి తమని తాము కాపాడుకోక పోతే బింజి బాబులు ఎందుకూ పనికి రాకుండా పోతారు. దీన్నుంచి కాపాడుకునే మార్గాలున్నాయి. అవేమిటో కొన్ని చూద్దాం- పరిమితులు సెట్ చేసుకుని వాటిని కచ్చితంగా పాటించడం, ఒంటరిగా గాకుండా ఎవరితోనైనా కలిసి చూడడం, అప్పుడప్పుడు పాజ్ బటన్ ని నొక్కి చూడాలనిపించే కోరికని నియంత్రించడం, చూస్తున్నప్పుడు దృష్టి సోషల్ మీడియా వైపు పోతే చూడడం ఆపేయడం, నిద్ర వస్తున్నపుడు వెంటనే ఆపేయడం, వ్యాయామం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవడం వంటివి బింజ్ వాచింగ్ నుంచి దూరంగా వుంచుతాయని ఆశించవచ్చు.

—సికిందర్  

18, డిసెంబర్ 2022, ఆదివారం

1268 : సండే స్పెషల్ రివ్యూ!


క్రిస్మస్ వచ్చిందంటే హాలీవుడ్ నుంచి క్రిస్మస్ సినిమాలొస్తాయి. క్రిస్మస్ వచ్చిందంటే అమెరికాలో నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ (ఎన్ బి సి) ఛానెల్ 1946 నాటి క్లాసిక్ ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ క్రమం తప్పకుండా ప్రసారం చేస్తూ వుండాల్సిందే. మన దగ్గర కొంతకాలం క్రితం వరకూ నవమికి లవకుశ టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్టు. ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ డిసెంబర్ 24 రాత్రి ఎనిమిది గంటలకి ఎన్ బి సి లో ప్రసారం కాబోతోంది. మరో ఛానెల్ లో 24 గంటల పాటూ ప్రసారమవుతూనే వుంటుందట. వరుసగా మూడేళ్ళు క్రిస్మస్ కి విడుదలవుతూ వచ్చిన ది ప్రిన్సెస్ స్విచ్ సీక్వెల్స్ లో నాల్గోది ఈ క్రిస్మస్ కి రాలేదు. ఇప్పుడు లిండ్సే లోహన్ నటించిన ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ క్రిస్మస్ మూడ్ ని పెంచుతూ వచ్చేసింది. సాధారణంగా క్రిస్మస్ సినిమాలు ఫ్యామిలీ- రోమాంటిక్ ఎంటర్ టైనర్లుగా వస్తాయి. ఈసారి ఇంకో క్రిస్మస్ సినిమా కాస్త తేడాగా  హూ కిల్డ్ శాంటా అంటూ మర్డర్ మిస్టరీ కామెడీగా వచ్చింది. వచ్చేవారం దీని రివ్యూ చూద్దాం.

        ప్రస్తుతం ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ నెట్ ఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ గావుంది. కారణం హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ నటించడం. ఈమె పదేళ్ళ క్రితం సినిమాలు ఫ్లాపై కనుమరుగైంది. ఇప్పుడు చాలా తేలికపాటి క్రిస్మస్ రోమాన్స్ తో క్రిస్మస్ కి గ్లామర్ తెస్తూ తెరపై కొచ్చింది. దీనికి జనీన్ డమైన్ దర్శకత్వం వహించింది. ఈమె కొత్త దర్శకురాలు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ దేశ భాషల్లో కేవలం హిందీలోనే అందుబాటులో వుంది. ఇదెలా వుందో చూద్దాం...

గొప్పింటి కూతురు గల్లంతు

మంచు కొండల్లో మిస్టర్ బెల్మౌంట్ కి ఒక లగ్జరీ హోటల్ వుంటుంది. ఈ హోటల్ కి కూతురు సియారాని అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిండెంట్ గా నియమించి బిజినెస్ టూర్ వెళ్ళి పోతాడు. బిజినెస్ మీద ఏమాత్రం ఆసక్తి లేని సియారా, బాయ్ ఫ్రెండ్ టాడ్ తో మంచు కొండల్లో స్కయింగ్ కి వెళ్తుంది. టాడ్ ఇక ఆగలేక ఆమెకి ప్రపోజ్ చేసి వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడు. ఇంతలో అట్మాస్ఫియర్ లో మార్పులొచ్చి పెద్ద గాలి వీచడంతో సియారా బ్యాలెన్సు తప్పుతుంది. టాడ్ ఆమెని పట్టుకోబోతే ఉంగరం వూడి చేతి కొస్తుంది. ఆ అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సియారా కొండ మీంచి జారి గల్లంతై ఎక్కడో వెళ్ళి పడుతుంది. టాడ్ ఇంకెక్కడో వెళ్ళి పడతాడు.   

అట్నుంచి జేక్ వస్తూంటాడు. ఇతను అటు చాలా దూరంలో నార్త్ స్టార్ లాడ్జి ఓనర్ గా తీవ్ర నష్టాల్లో వుంటాడు. స్పృహ తప్పి పడున్న సియారాని చూసి తీసికెళ్ళి లాడ్జిలో పడుకోబెడతాడు. అతడికో కూతురు ఎవీ, అత్తగారు వుంటారు. కళ్ళు తెరిచిన సియారా తనెవరో జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. అటు మంచు కొండల్లో ఎటో తప్పిపోయి సహాయం కోసం చూస్తూంటాడు టాడ్. ఇలా క్రిస్మస్ రోజుల్లో దూరమైన ప్రేమ జంట, మధ్యలో జేక్,  అటు సియారా కోసం వెతుకుంటున్న మిస్టర్ బెల్మౌంట్, హోటల్ సిబ్బంది, పోలీసులూ... ఈ మూడు పరిస్థితులూ ఏ ముగింపుకి చేరాయన్నది మిగతా కథ.

జ్ఞాపక శక్తిని కోల్పోయిన సియారాకి జేక్ కి ఎలా దగ్గరైంది, భార్య చనిపోయిన జేక్ కూతురు ఎవీ ప్రోత్సాహంతో సియారా కెలా దగ్గరయ్యాడు, ఈ ప్రేమ కథ ఇక్కడ పురులు విప్పుకుంటున్న వేళ చచ్చీ చెడీ ఎలాగో చేరుకున్న టాడ్ పరిస్థితేమిటి, కూతురి జాడ కనుక్కుని వచ్చిన బెల్మౌంట్ తీసుకున్న నిర్ణయమేంటీ...ఇవి కూడా మిగతా లైటర్ వీన్ ఫన్నీ స్టోరీలో తెలుస్తాయి.

లిండ్సే మెయిన్ ఎట్రాక్షన్

లిండ్సే లోహన్ అద్భుత గ్లామర్ తో, కాస్ట్యూమ్స్ తో, సరదా నటనతో పండగ సినిమాని మనోహరంగా మార్చేస్తుంది. క్రిస్మస్ సినిమాలు ఎలా తీయాలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. సినిమా అంతా  నేపథ్యంలో క్రిస్మస్ వాతావరణం, విందులు, వినోదాలు, సంగీతం వుంటాయి. కథలో కుటుంబాలుంటాయి. కుటుంబాల్లో హీరోహీరోయిన్ల ప్రేమ కథలుంటాయి. ఎవరు చూసినా నవ్వుతూ వుంటారు. బరువైన సెంటిమెంట్లు, బాధలు, ఏడ్పులు అస్సలుండవు. నవ్వు పుట్టించే గమ్మత్తయిన సీన్లు వుంటాయి. ప్రేమ కథ తియ్యటి మిఠాయిలా పైపైన లైటర్ వీన్ గా వెళ్ళి పోతూంటుంది. ప్రేమ కథలో ప్రేమిస్తున్న మూడో పాత్ర వుంటే, ఓకే నో ప్రాబ్లం అని, న్యూసెన్స్ చేయకుండా లైట్ తీసుకుని తప్పుకుంటుంది. మొత్తం మీద ఫార్ములా కథలే తప్ప కొత్తగా ఏం వుండదు. తీసిన విధానం క్రిస్మస్ స్పెషల్ లాగా వుంటుంది.

ఇవన్నీ ఈ క్రిస్మస్ మూవీలో ఎంజాయ్ చేయవచ్చు. తెలుగులో సంక్రాంతి సినిమాలని, దీపావళి సినిమాలనీ వస్తూంటాయి. వీటిలో భారీ ఖడ్గాలు పట్టుకుని తిరగడం, నరకడం, రక్తాలు పారించడం వుంటాయి. శుభమాని పండగ పూట ఈ బీభత్సాలకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు. మన ప్రేక్షకుల తట్టుకునే శక్తి అపారం.

ఎవీ మీదే ఫోకస్

ఎవీ పాత్ర వేసిన బాలనటి ఒలీవియా పెరేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది దర్శకురాలు జనీన్. సమూహంలో ఎందరున్నా, వాళ్ళ సంభాషణలు నడుస్తూంటే, ఒలీవియా మీదే ఫోకస్ చేసి ఆమె రియాక్షన్ షాట్సే వేస్తూంటుంది. కారణం ఈ బాలనటి స్మైల్ ప్రేక్షకుల మూడ్ ని వెలిగించేసేలా వుంటుంది. ఈ బాక్సాఫీసు కిటుకు పట్టుకుంది కొత్త దర్శకురాలు.

ఇక జేక్ గా నటించిన కార్డ్ ఓవర్ స్ట్రీట్, టాడ్ గా నటించిన జార్జి యంగ్ టీవీ నటులే. మిస్టర్ బెల్మౌంట్ గా నటించిన జాక్ వాగ్నర్ రిచర్డ్ గేర్ పోలికలతో వుంటాడు. ఈ గంటన్నర ఎంటర్ టైనర్ లో మొత్తం 30 పాటలున్నాయి. ఇవి రవంత బిట్లుగా వచ్చిపోతూంటాయి. పూర్తిగా క్రిస్మస్ వేడుకల వాతావరణంతో, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో, మంచు ప్రాంతంలో, అద్భుత సెట్ డిజైన్లతో, మేకింగ్ ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలానికీ తీసిపోనట్టుగా కనువిందు చేస్తుంది ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’.
—సికిందర్

1267 : రివ్యూ!

కథ - దర్శకత్వం : సునీల్ పుప్పాల
తారాగణం : తేజ ఐనంపూడి, ధన్యా బాలకృష్ణన్, చైతన్య రావు, పృథ్వీరాజ్ తదితరులు
స్క్రీన్ ప్లే : అజయ్ శరణ్,  సంగీతం : అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం :  రాహుల్ మాచినేని
నిర్మాతలు : ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే
విడుదల : డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ
***

        రో క్రైమ్ సినిమా ఓటీటీలో విడుదలైంది. 1973 లో ఇదే టైటిల్ తో మురళీ మోహన్- గిరిబాబులతో జగమే మాయ అనే సూపర్ హిట్ క్రైమ్- హార్రర్ థ్రిల్లర్ విడుదలైంది. ఇది హార్రర్ స్పెషలిస్టులు రామ్సే బ్రదర్స్ తీసిన హిందీ దో గజ్ జమీన్ కే నీచే కి రీమేక్. ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రస్తుత తెలుగు జగమే మాయ థ్రిల్లర్ గాకుండా, క్రైమ్-సస్పెన్స్ మూవీగా ముందుకొచ్చింది. రెండు గంటల లోపు నిడివిగల ఇది ఎంత బలంగా కట్టిపడేస్తుందో చూద్దాం...

కథ  

విజయవాడలో ఆనంద్ (తేజ ఐనంపూడి) బెట్టింగ్స్ తో డబ్బులు సంపాదించాలనుకుని అప్పుల పాలవుతాడు. అప్పులు తీర్చడానికి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూంటాడు. అలా ఓ వివాహిత దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో డబ్బూ బంగారం కనిపించేసరికి దోచుకుని హైదరాబాద్ పారిపోతాడు. ఇక్కడ డబ్బున్న చిత్ర (ధన్యా బాలకృష్ణన్) ని చూసి పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటాడు. చిత్ర మొదటి భర్త అజయ్ (చైతన్య రావు) యాక్సిడెంట్ లో పోయాడు. ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి వుంది. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక ఆనంద్ పేర కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటుంది.

ఇంతలో భర్త అజయ్ ని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చిత్రే చంపిందని తెలుసుకుని భయపడతాడు ఆనంద్. తనని కూడా  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేస్తుందా? ఇప్పుడేం చేయాలి? ఇందులోంచి ఎలా బయటపడాలి? పెళ్ళి చేసుకున్న చిత్రని ఎలా వదిలించుకోవాలి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

డబ్బుల కోసం జరిగే నేరాలతో ఈ కథ. కథ ముగిస్తూ ఇన్ స్టెంట్ కర్మ అన్నారు. ఇందులో ఇన్ స్టెంట్ కర్మ ఏముందో అర్ధం గాదు. ముగింపు కూడా ఆకస్మికంగా అసంపూర్ణంగా వుండడం గాక, సీక్వెల్ కూడా వుంటుందని ప్రకటన వేశారు. సీక్వెల్ తీయాలంటే తీసిన సినిమా ఎంతో కొంత పాపులర్ అవ్వాలి. తీసిన సినిమా సగం పనికి రానప్పుడు, ఇంటర్వెల్ తర్వాత నుంచి చూసుకుంటే సరిపోయినప్పుడు, సీక్వెల్ దేనికి?

క్రైమ్ సినిమా అన్నప్పుడు అది ప్రారంభం నుంచే నేపథ్యంలో ఆ ఫీల్ ప్రతిఫలిస్తూ, క్రైమ్ జానర్ లక్షణాలు, జానర్ మర్యాదలతో కూడిన పాత్రలూ కథా కథనాలు వుండాలి. ఆ రకమైన షాట్స్, టేకింగ్ వుండాలి. టెక్నకల్ గా కూడా మేకింగ్ ని విస్మరించి- రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో లాగా విజయవాడలో ఆనంద్  క్యారక్టరైజేషన్ సీన్లు వేసేసి, రొటీన్ కారణాలతో  హైదరాబాద్ పంపేసి, రొటీన్ గా చిత్ర తో కలిపేసి, పెళ్ళి జరిపించేసే సరికి- ఇదంతా చూసి చూసి వున్న మసాలా టెంప్లెట్ లాగా, రెండు గంటల్లోపు వున్న సినిమాలో ముప్పావు గంట గడిచినా కథే ప్రారంభం కాదు. 

ఒక చోట ఆనంద్  అంటాడు- ఈ ల్యాగ్ ఏమిటో, ఎన్నాళ్ళు సాగదీస్తుందో... అసలే ఆర్ట్ సినిమా హీరోలా యాక్ట్ చేయలేక చస్తుంటే అని. ఇది అక్షరాలా రాసుకున్న స్క్రిప్టుకే వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ లో ఏమీ లేదు- మొదటి భర్తని చిత్రే చంపిందన్న ఇంటర్వెల్ మలుపు రావడం తప్ప.

ఇక సెకండాఫ్ లో కథ ప్రారంభించి వున్న గంట సమయంలో ఎన్నో మలుపులతో ఎంతో కథ నింపేశారు. దీంతో స్పేసింగ్ ప్రాబ్లం ఏర్పడి ఏదీ సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. ఇంపాక్ట్ నివ్వదు. ఒకరిపై ఒకరి ఎత్తుగడలు, మలుపులూ; మళ్ళీ కొత్త ఎత్తుగడలు, మలుపులూ అన్నీ హడావిడిగా జరిగిపోతూ ఆటని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తాయి.

చిత్ర పాత్ర కేంద్ర బిందువుగా, ఆమె పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీలో ఫ్రాడ్ కి తెరతీసే పాయింటు అనేది ఈ క్రైమ్ కి చాలా బావుంది. సందేహం లేదు. ఈ ఫ్రాడ్ లో బ్లాక్ మెయిల్ చేసి పార్టనర్స్ పెరగడం, పార్టనర్సే శత్రువులవడం, ఇందులోంచి బయటపడేందుకు చిత్ర ప్రయత్నించడం, ఆమెకి ఆనంద్ సహకరించడం... అంతా బాగానే వుంది. టైటిల్ కి న్యాయం కేస్తోంది. అయితే ఈ కథని ఫస్టాఫ్ లో వెంటనే ప్రారంభించి వుంటే, ఇలా కురచ బస్తాలో బలవంతంగా కుక్కినట్టు వుండేది కాదు కథ. ఒకటొకటీ పాత్రలు ఒకేచోట క్రిక్కిరిసిపోయేవి కావు.

మూడు గంటల పైనే నిడివి వున్న అంత అవతార్ 2 సినిమాలో మొదటి పది నిమిషాల్లోనే కథ ప్రారంభించేశాడు. తర్వాత ఆ  కథ ఎలా వుందన్నది తర్వాతి సంగతి. కథ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక ప్రస్తుత సినిమాలో ముగింపు కూడా అంత గందరగోళంగానూ వుంది. ఇన్ స్టెంట్ కర్మ ప్రేక్షకులదే అన్పించేలా.

నటనలు- సాంకేతికాలు

ఇది ప్రధానం గా ఇంటర్వెల్లో రివీలయ్యే ధన్యా బాలకృష్ణన్ కథ. ఈ ప్రధాన పాత్రలో చూడడానికి బావుంది గానీ, క్యారక్టర్ బలాబలాలు, క్యారక్టర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలు వంటి క్యారక్టర్ ఆర్క్ ని సృష్టించే కథ మీద కథకుడు దృష్టి పెట్టక పోవడం వల్ల వున్న పాత్రని సీదా సాదాగా నటించేసింది. భావోద్వేగాలనేవే లేవు కథలో కూడా. పైగా సెకండాఫ్ అంతా హడావిడి.

హీరోగా నటించిన తేజ క్రైమ్ సినిమా యాంటీ హీరోగా వుండాల్సింది లేడు. పాత్ర, నటన కథని బట్టి లేవు. పైగా తనలో తాను మాట్లాడుకునే కామెడీ. ఆర్ట్ సినిమా క్యారక్టర్ అని తానే చెప్పుకున్నాడు. హీరోయిన్ మొదటి భర్తగా చైతన్య రావు నటనతో దృష్టినాకర్షించే ఆర్టిస్టు. ముఖచిత్రం లో కూడా ఇది రుజువు చేశాడు. తప్పకుండా పైకొచ్చే ఆర్టిస్టు అతను. ఇక పాత హీరో పృథ్వీరాజ్ సాఫ్ట్ వేర్ బాస్ గా నటించాడు. నత్తితో ఓవరాక్షనే. భయపెట్టే పని మనిషిగా నటించినావిడ అర్ధాంతరంగా అంతర్ధానమై పోతుంది. స్పేస్ ప్రాబ్లమేమో.

పాటలు లేవు. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం మేకింగ్ లో లేని క్రైమ్ జానర్ ఫీల్ ని సృష్టించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. రాహుల్ మాచినేని కెమెరా వర్క్ నీటుగా వుంది. అయితే క్రైమ్ సినిమా వాతావరణాన్ని క్రియేట్ చేయలేదు. కథా పరంగా  చూస్తే ఇది ఫిలిమ్ నోయర్ మేకింగ్ కి నోచుకోవాల్సిన సినిమా. ఫిలిమ్ నోయర్ ఎలిమెంట్స్ తో సాగాల్సిన చిత్రీకరణ. కొత్త దర్శకుడు దీనికి గనుక సీక్వెల్ తీస్తే కనీస స్థాయి క్రైమ్ సినిమా మేకింగ్ చేస్తాడని ఆశిద్దాం.

—సికిందర్


 

ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ -సండే స్పెషల్ రివ్యూ!
ఈ రోజు సాయంత్రం

16, డిసెంబర్ 2022, శుక్రవారం

1266 : రివ్యూ!

 

దర్శకత్వం : జేమ్స్ కామెరూన్
స్క్రీన్ ప్లే : జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్
తారాగణం : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్, ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్
బ్యానర్స్ : లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ
విడుదల : డిసెంబర్ 16, 2022 
బడ్జెట్ : 350-400 మిలియన్ డాలర్లు

***

    వతార్: ది వే ఆఫ్ వాటర్ (2022) అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం 2009 లో సంచలన అవతార్ కి సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తారాగణం సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జోయెల్ డేవిడ్ మూర్, గియోవన్నీ రిబిసి, దిలీప్ రావ్ లు అవతార్ లోని తమ పాత్రల్ని రిపీట్ చేస్తూ నటించారు. కొత్త తారాగణంలో జేమ్స్ కామెరూన్ టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ఓ కీలక పాత్ర పోషించింది.  అప్పట్లో అవతార్హిట్టయితే సీక్వెల్  నిర్మించాలనుకుంటున్నట్టు ప్రకటించిన కామెరూన్, అక్షరాలా పదమూడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత, వాగ్దానం చేసిన సీక్వెల్ కోసం కళ్ళు కాయలు చేసుకున్న ప్రపంచ ప్రేక్షకుల్ని కనికరించాడు. మరో మూడు సీక్వెల్స్ జోడింపు కూడా వుంటుందని చెప్పాడు. ఇవి వచ్చేనాటికి ప్రేక్షకులు ముసలి వాళ్ళయి పోతారేమో. అండర్ వాటర్ కెమెరా వర్క్ కోసం కొత్త సాంకేతికాల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం వల్ల ఈ జాప్యం తప్పలేదన్నాడు. సినిమా చరిత్రలోనే లేనంత 350400 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సీక్వెల్ ఇంతకీ ఎలా వుంది? నిరీక్షణకి తగ్గ ఫలం అందించిందా? ఇది తెలుసుకుందాం...
 
కథ
    అవతార్ లో చూపించిన సంఘటనలు జరిగి దశాబ్ద కాలానికి పైగా గడిచిపోయాక ఇప్పుడు - జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్ ), నేత్రి(జో సల్దానాతోటి నావీలతో కలిసి సంతోషంగా నివసిస్తూంటారు. వీరికి పెద్ద కుమారుడు నెటేయం, చిన్న కుమారుడు లోయాక్, కుమార్తె టుక్దత్తపుత్రిక కిరీ, స్పైడర్ అనే మానవ బాలుడూ కుటుంబంగా వుంటారు. ఇలా కుటుంబమంతా అనుబంధాలూ ఆత్మీయతలతో ఆనందంగా గడుపుతున్న వేళ, ఒక రోజు ముప్పు ముంచుకొస్తుంది. ఈ పండోరా గ్రహాన్ని మరోసారి వలసరాజ్యం చేసుకోవడానికి భూమ్మీద నుంచి అవతార్ లో ఓడిపోయిన మానవ బృందం తాలూకు స్కై పీపుల్ మళ్ళీ దిగుతుంది భీకర యంత్ర, ఆయుధ సంపత్తితో.

బృంద నాయకుడు క్వారిచ్  ప్రధాన ఆపరేటింగ్ స్థావరాన్ని  నిర్మించేస్తాడు. ఇది తెలుసుకుని జేక్ గెరిల్లా ఆపరేషన్ కి పూనుకుని స్థావరాన్ని ధ్వంసం చేసేస్తాడు. రైల్వే మార్గాన్ని పేల్చేస్తాడు. పైప్ లైన్లు బద్దలు చేస్తాడు. దీంతో జేక్ ని చంపేయమని దళాన్ని ఎగదోస్తాడు క్వారిచ్. జేక్ పిల్లలు దళానికి చిక్కుతారు. దీంతో జేక్, అతడి భార్య నేత్రీ వచ్చి దాడి జరిపి పిల్లల్ని విడిపించుకుని వెళ్లిపోతారు- స్పైడర్ ని తప్ప. మానవ బాలుడు స్పైడర్‌ తన కుమారుడే అని గుర్తించిన క్వారిచ్, అతనితో ఎక్కువ సమయం గడిపి జేక్ కుటుంబ సమాచారం లాగాలనుకుంటాడు. స్పైడర్ క్వారిచ్‌కి నావీ సంస్కృతి గురించి నేర్పుతూంటాడు.

అటు స్పైడర్‌ వల్ల తమ ఆచూకీ తెలిసిపోతుందని అనుమానించిన జేక్, కుటుంబాన్ని తీసుకుని పండోరా తూర్పు సముద్రంలో వేరే తెగకి చెందిన ద్వీపానికి చేరుకుంటాడు. ఈ తెగ సముద్రాన్ని పూజిస్తారు. వీరి శరీరాలు జలచరాల్లాగా నీటి అడుగున జీవించడానికి అనుకూలంగా వుంటాయి. ఇప్పుడు మనుగడ కోసం ఈ అననుకూల జీవన విధానానికి జేక్ కుటుంబం ఎలా తమని మల్చుకుని, దండెత్తిన శత్రువుల్ని ఎదుర్కొన్నారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

22 వ శతాబ్దంలో అంటే- 2154 లో భూమి మీద సహజ వనరులు అంతరించి పోవడంతో, వనరుల అభివృద్ది విభాగం (ఆర్డీయే), ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలానికి చంద్రుడైన పండోరా గ్రహంపై విలువైన ఖనిజం యునోబ్టానియంని మైనింగ్ చేస్తుంది. పండోరా విష వాయువులతో కూడిన గ్రహం. ఇక్కడ నావి అనే మానవరూప జాతి నివసిస్తూంటుంది. ఈ పండోరా గ్రహం మీదికి మైనింగ్ బృందాల్నినావితో సంకరం చేసిన హ్యూమన్ హైబ్రిడ్‌లుగా పంపుతారు శాస్త్రవేత్తలు. వీటికి అవతార్ లని పేరు పెడతారు. అలాటి ఒక అవతార్ జేక్ సల్లీ ఇక్కడికి వచ్చి, నావీలలో కలిసిపోయి పండోరా ఆక్రమణని ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో ప్రత్యర్ధి క్వారిచ్ చనిపోతాడు. ఇదీ మొదటి అవతార్ కథ. అప్పట్లో 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 2,923 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు వచ్చింది!

పై మొదటి
అవతార్ కథకి కొనసాగింపుగా రెండో అవతార్. ఇందులో మొదటి అవతార్ లో చచ్చిపోయిన విలనే మెమరీని ఇంప్లాంట్ చేసుకుని అవతార్ గా తిరిగి వస్తాడు. ఈ కథని కేవలం దండెత్తి వచ్చిన మానవ జాతి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే సాధారణ హీరో కథగానే చూపించారు. మిగతా సహజ వనరుల  ధ్వంసం, ప్రకృతీ, పర్యావరణాల నాశనం వంటి అంశాల జోలికి ఉద్దేశపూర్వకంగానే పోలేదని సినిమా చూస్తే తెలుస్తోంది.

అందుకని పెట్టుబడి దారీ వ్యవస్థకి వ్యతిరేకమైన ఎలాటి చిత్రణా చేయలేదు. గ్రహాల్ని కూడా వలస రాజ్యాలుగా చేసుకుని దోచుకుంటాం, అక్కడున్న వారు ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోవలసిందే అన్న అంతరార్ధం ఈ సినిమాలో గోచరిస్తోంది. జేమ్స్ కామెరూన్ గత మూవీ అలీటా లో కూడా ఇదే భావజాలం కన్పిస్తుంది. ఆస్కార్ అవార్డు వచ్చేది కూడా ఇలా వుంటేనే. 2019లో కొరియన్ మూవీ పారసైట్ ని కూడా శ్రామిక వర్గ వ్యతిరేక కథగా వుంటేనే ఆస్కార్ తో సత్కరించారు.

దీంతో అవతార్ హీరో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగత కారణాలకి పరిమితమై
,  మొత్తం పండోరా గ్రహం శ్రేయస్సు కోసం పోరాడాలన్న విశాల దృక్పథాన్ని పక్కన బెట్టేశాడు. ఫలితంగా కథ డొల్లగా మారింది. కథ లేనందువల్లే కథ జోలికి పోలేదు. ఉద్దేశించిన భావజాలం నుంచి దృష్టిని మళ్ళించేందుకే కాబోలు- ఫాదర్ అనే వాడు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడన్న డైలాగు ప్రారంభంలో వేశారు, మళ్ళీ ముగింపులో వేశారు. ఇలా కథకి సంబంధించి ఫాదర్ మీదికే దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఫాదర్ తిరుగుతూంటే డైలాగుతో ఈ మెసేజ్ బాగానే వుంటుంది. మొదటి నుంచీ ఫాదర్ (హీరో) ని కుటుంబంతో అన్యోన్యంగా చూపిస్తూనే ఈ డైలాగు ఏమిటి? మనం ఎక్కడున్నా మన కుటుంబం కోటలాంటిది అని భార్యతో అంటాడు. పండోరా గ్రహమే లేకపోతే పండంటి కోట ఎక్కడుంటుంది. ఇలా పర్యావరణం గురించి కాక కుటుంబం గురించి డైలాగు వచ్చిన ప్రతి సారీ భావజాలాన్ని దాచే కామెరూన్ తాపత్రయం బయటపడు
తూంటుంది. కుటుంబం గురించి కాదు- తీయాల్సిన సినిమా వనరుల దోపిడీ గురించి! సముద్ర జీవుల్ని, తిమింగలాల్నీ కూడా విచ్చలవిడిగా చంపేస్తూ చూపించారు.

ఇక కథనం విషయానికొస్తే, హీరో విలన్ మీద ఎదురుదాడి చేసి కుటుంబంతో వేరే ద్వీపానికి చేరుకునే సరికి గంట సినిమా గడుస్తుంది. అక్కడ కొత్తగా సముద్రగర్భంలో విహారం, జీవనం, ఓ తిమింగలంతో స్నేహం- ఈ మూడు అంశాలే సుమారు గంటన్నర సేపు కథ లేకుండా సాగుతాయి. చివరి 45 నిమిషాల్లో విలన్ బృందం దిగడంతో క్లయిమాక్స్ యాక్షన్ మొదలవుతుంది. ఇలా ప్రారంభంలో కథ ప్రారంభించి వదిలేశాక, క్లయిమాక్స్ లోనే ప్రారంభించిన కథ వచ్చి కలుస్తుంది. మధ్యలో గంటన్నర పాటు కథలేని సముద్ర విహారాలే వుంటాయి.

ఇంకోటేమిటంటే, హీరో విలన్ కి ఏదో నష్టం చేసి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. మళ్ళీ విలన్నీ ఎదుర్కొనే ఆలోచనే లేదు. అస్త్రసన్యాసం చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు విలన్ పగబట్టి చంపాలని ఎందుకు వెతకాలి. ఇలా హీరో పాత్ర చిత్రణ, విలన్ పాత్ర చిత్రణ రెండూ కన్విన్సింగ్ గా లేవు. హీరో గ్రహాన్ని కాపాడుకోవడం కోసం నిలబడితే కథనంలో, పాత్ర చిత్రణల్లో తప్పులు తొలగిపోతాయి.

కాబట్టి కథ పట్టించుకోకుండా, కథ లేకపోయినా విసుక్కోకుండా కనువిందు చేసే విజువల్ వండర్ గా దీన్ని ఆనందించవచ్చు. ఎమోషన్స్ లేని విజువల్ వండర్ గా గుర్తుంచుకోవచ్చు. కామెరూన్ కంటెంట్ విషయంలో అలిటా తో పట్టు కోల్పోవడంతోనే అవతార్ 2 పై అనుమానం కలిగింది. ఇది నిజమైంది.

సాంకేతిక ప్రతిభ

కామెరూన్ తన శ్రమనంతా మునుపెన్నడూ లేని అద్భుత సాంకేతిక మాయాజాల సృష్టి మీద పెట్టాడు. ప్రామాణిక 24fpsకి, హై-ఫ్రేమ్-రేట్ 48fps కూడా జతచేసిన కెమెరా వర్క్ తో మరిచిపోలేని విజువల్స్ సృష్టించాడు. ఛాయాగ్రాహకుడు రస్సెల్ కార్పెంటర్ దీని వెనుక హస్తం. ఒక అందమైన దృశ్యకావ్య ఫీల్ ఈ సైన్స్ ఫిక్షన్ తో అందించాడు కామెరూన్. అతనెప్పుడూ విజువల్స్ కి మాస్టరే. ఏది సీజీ, ఏది నిజం తెలియనంతగా పాత్రలు, ప్రదేశాలు కలిసిపోయాయి. అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ సహా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దివ్యంగా దృశ్యమానమయ్యాయి. జస్ట్ ఇది మాటలకందని విజువల్ మ్యాజిక్ అంతే, సంగీతాన్ని కలుపుకుని.

—సికిందర్