రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

1212 : రివ్యూ!


నేను మీకు బాగా కావాల్సిన వాడిని రివ్యూ!

కథ - దర్శకత్వం : శ్రీధర్ గాదె

తారాగణం : కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు

స్క్రీన్ ప్లే - మాటలు : కిరణ్ అబ్బవరం, సంగీతం :  మణిశర్మ, ఛాయాగ్రహణం : రాజ్ నల్లి
బ్యానర్ : కోడి దివ్య ఎంటర్టయిన్మెంట్స్
నిర్మాత : కోడి దివ్య దీప్తి
విడుదల : సెప్టెంబత్ 16, 2022
***

        కొత్తగా వస్తూ ఇంకా అభిమానులంటూ ఎవరినీ ఏర్పర్చుకోలేక పోతున్న హీరో కిరణ్ అబ్బవరం, మూడేళ్ళలో నటించేసిన నాలుగు సినిమాల్లో రెండు  ఇదివరకే అట్టర్ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఇది ఐదో సినిమా. ప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాత. శ్రీధర్ గాదె కొత్త దర్శకుడు. స్క్రీన్ ప్లే - మాటలు కిరణ్ అబ్బవరమే రాశాడు. మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా వుంటుందని, పూర్తి కుటుంబ కథగా తెరకెక్కిన దీన్లో అంతర్లీనంగా ఒక ముఖ్యమైన అంశాన్నిచర్చించామనీ, ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనీ, మొదటిసారిగా ఇందులో తను రెండు షేడ్స్  వున్న పాత్ర నటించాననీ, ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాననీ చెప్పుకొచ్చాడు. సినిమాలో ఇవన్నీ వున్నాయా? చూద్దాం...

కథ

వివేక్ (కిరణ్ అబ్బ‌వ‌రం) క్యాబ్ డ్రైవర్ గా వుంటాడు. రోజూ తాగి వచ్చే సాఫ్ట్ వేర్ తేజు (సంజనా ఆనంద్) ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూంటాడు. ఒక రోజు ఎందుకిలా తాగుతున్నావని అడిగి, ఆమె గతం తెలుసుకుంటాడు. వైజాగ్ లో ఆమెది ధనిక కుటుంబం. తల్లిదండ్రులు, బాబాయ్ కుటుంబం ఒకే భవనంలో సంతోషంగా వుంటారు. తండ్రి (దేవీ ప్రసాద్) ఆమెకి సంబంధం చూస్తాడు. కానీ ఆమె సిద్ధార్థ్ (సిద్ధార్థ్  మీనన్) ని ప్రేమిస్తూంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి బాధ పెట్టలేక పెళ్ళి రోజు సిద్ధార్థ్ కోసం వెళ్ళిపోతుంది. అతను మోసగాడని తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్ళే మొహంలేక, ఒంటరిగా వుంటూ తాగుడు మరిగిందన్న మాట.  

ఈమె ప్రేమ కథ తెలుసుకున్న వివేక్, తన ప్రేమ కథ చెప్తాడు. అతను దుర్గ (సోనూ ఠాకూర్) అనే లాయర్ని ప్రేమించాడు. ఆమె వేరొకర్ని పెళ్ళి చేసుకుని వెళ్ళి పోవడంతో దెబ్బ తిని, క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకుతున్నాడు. ఇలా పరస్పరం తమ ప్రేమ కథలు చెప్పుకున్న వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. 

ఎలావుంది కథ

చాలా పాత కాలపు సినిమా కథ. బహుశా 1980 లలో వచ్చిన సినిమా కథ. దీన్ని కొన్ని కోట్లు త్యాగం చేసి ఈ కాలం ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకున్నారు. కోడి రామకృష్ణకి  ఇలా నివాళులర్పించా లనుకున్నారు. దీని కోసం ప్రేక్షకుల్ని ఎంతైనా టార్చర్ చేయడానికి ఖర్చుకి వెనుకాడకుండా తీవ్ర కృషి చేశారు. కొత్త దర్శకుడు, యంగ్ హీరో ఇద్దరూ పాత చింతకాయలోనే తమ విజయ రహస్యముందని నమ్మి తీశారు.

.ఇది ఈ కాలంలో మన అందరి ఇంట్లో జరిగే కథే అంటే నమ్మాలి, ఫీలవ్వాలి. ఇందులో అంతర్లీనంగా చర్చించిన  ముఖ్యమైన అంశం ఏమిటో క్విజ్ పోటీలు వేసుకుని చెప్పాలి. ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి కనెక్ట్ అవడానికి అనుబంధాలే మున్నాయో వెతుక్కోవాలి. దొరక్కపోతే మళ్ళీ సినిమా చూడాలి. ఇందులో అబ్బవరం వున్న  రెండు షేడ్స్ లో ఒకటి ప్రేక్షకుల్ని ఫూల్స్ చేసినా ఆనందించాలి. కిరణ్ అబ్బవరం సెకండాఫ్ లో చెప్పే తన ప్రేమ కథంతా నిజం కాదనీ, స్వాతి పత్రికలో వచ్చిన కథ చెప్పి హీరోయిన్నీ ప్రేక్షకుల్నీ ఫూల్స్ చేశాడనీ తెలుసుకుని-  అతడి స్క్రీన్ ప్లే టాలెంట్ ని మెచ్చుకోవాలి. అతను రాసిన హద్దులు మీరిన డబుల్ మీనింగ్ డైలాగుల్ని ఈ కుటుంబ కథా చిత్రంలో ఆనందించాలి. ఈ సినిమా ద్వారా తను అందరికీ మరింత దగ్గరవుతాడన్న అతడి ప్రగాఢ విశ్వాసాన్ని కూడా గౌరవించాలి. అతను 1.5 రేటింగ్ ని సగౌరవంగా స్వీకరిస్తాడనేది నిర్వివాదాంశం.

నటనలు- సాంకేతికాలు

కిరణ్ అబ్బవరం మాస్ కమర్షియల్ స్టార్ అవ్వాలనే కోరికతో ఈ సినిమా నటించాడు. ఆవారా మాస్, తాగుబోతు మాస్, ఐటెమ్ సాంగ్ మాస్, ఇక ఫైట్స్ అయితే చెప్పనవసరం లేదు. తన హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు స్లోమో షాట్స్. ఇవన్నీ ఔట్ డేటెడ్ అయిపోయాయన్న విషయం పట్టించుకోలేదు. ఇక తన ప్రేమ కథలో రవితేజ మార్కు ఇమిటేషన్. ఇది హద్దులు మీరి వెకిలి తనంగా మారింది. ఇంతా చేస్తే తన ప్రేమ కథ నిజం కాదు, కల్పిత పాత్రలతో హీరోయిన్ కి కట్టుకథ చెప్పాడు. కనీసం టైటిల్ కోసమైనా హృదయాల్ని హత్తుకునే ఒక్క సీనూ నటించ లేదు. అబ్బవరం సినిమాలన్ని ట్లో ఇది అబ్బా అని గుచ్చుకునే నటన, సినిమా.

ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ సాంతం శాడ్ గా వుండే పాత్ర, నటన. రోమాన్స్ లేదు, యూత్ అప్పీల్ లేదు. ఫస్టాఫ్ సగం వరకూ తాగిన మత్తులోనే వుంటుంది. ఇక అబ్బవరం కట్టుకథలో హీరోయిన్ సోనూ ఠాకూర్ లాయర్ పాత్ర ఎక్స్ ఫోజ్ చేస్తూ, రోమాంటిక్ గా వుంటుంది. అబ్బవరం కోసం ఓ మాస్ పాట వేసుకుంటుంది. ఇక కుటుంబ సినిమా అని ప్రచారం చేసిన ఈ సినిమాలో కుటుంబ పరివారం సీన్లు అంతంత మాత్రమే. ఒక్కరికీ సరైన పాత్రల్లేవు, రిజిస్టర్ కారు. 

ఇక మణిశర్మ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం మొక్కుబడిగా అందించినట్టు వున్నాయి. పాట అయిపోయాక కనీసం ఆ పాట ట్యూన్ కూడా గుర్తుకు రాదు. సరైన సాహిత్యం రాయించుకోవడానికీ, పాడించుకోవడానికీ సినిమాలో  విషయం ఇన్స్ ఫైర్ చేయాలిగా? సాంకేతిక విలువలూ డిటో.

చివరికేమిటి

కొత్త దర్శకుడు తీసుకు వచ్చిన అరిగిపోయిన విషయం నిర్మాతకి నచ్చితే ఎవరేం చేస్తారు. అసలే అరిగిపోయిన విషయమైతే, అబ్బవరం స్క్రీన్ ప్లే, డైలాగులు రాయడం ఒకటీ. స్క్రీన్ ప్లే రాస్తూ చివరి పదిహేను నిమిషాల వరకూ సినిమాలో కథే లేకుండా చేశాడు. కథలోకి వచ్చేటప్పటికి చివరి పదిహేను నిమిషాలే మిగిలాయి. అంతవరకూ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, కట్టుకథతో తన ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాకులు కూడా కథే అనుకున్నట్టుంది. కథంటే ఏమిటో తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే రాసేస్తే ఇలాగే వుంటుంది.

ఫస్టాఫ్ రాత్రి పూట ఐటెమ్ సాంగ్ తో ప్రారంభమయ్యే సినిమా, తాగి వున్న హీరోయిన్ని క్యాబ్ లో పికప్ చేసుకున్నాక, అరగంట సేపూ తాగి వున్న ఆమెతో సీన్లే వస్తూంటాయి. అరగంట గడిచాక, ఆమె తన ప్రేమ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకూ చెప్తుంది. ఇంతసేపూ హీరో అబ్బవరం కనపడడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ ముగించడంతో ఇంటర్వెల్. ఇలా ఇంటర్వెల్ కి కూడా కథ ప్రారంభం కాదు, ఏం కథ చెప్పాలనుకుంటున్నాడో అర్ధం గాదు.

ఇక సెకండాఫ్ ముప్పావు గంట తన ప్రేమ కథ చెప్తాడు. ఇది స్వాతి పత్రికలో కథ చెప్పాడని తర్వాత తెలుస్తుంది. ఇలా ఇద్దరి ఫ్లాష్ బ్యాక్స్ పూర్తయి కథ లోకొస్తే పావుగంట మిగిలి వుంటుంది. ఆంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. ఇలా ఇప్పుడు  ప్రారంభమయిన కథలో మాంటేజెస్ వేస్తూ ఈ పావుగంటలో కొన్ని సస్పెన్సులు విప్పుతాడు. ఇలా తేలేదేమిటంటే ఎండ్ సస్పెన్స్ కథనం చేశాడని. ఎండ్ సస్పెన్స్ కథనం దృశ్య మాధ్యమం అయిన సినిమాని నిలబెట్టదు. ఇదింకో ఘోరమైన తప్పు. 

ఇద్దరూ ఒకటవడమే ముగింపని తెలిసిపోయే విషయమే. ఇద్దరూ హగ్ చేసుకుంటే ఎండ్ పడుతుందని కూడా వూహిస్తాం. కానీ హగ్ చేసుకోగానే మాస్ డ్యూయెట్ మొదలవుతుంది. ఇంకేం కథ మిగిలి వుందాని జుట్టు పీక్కోవడం మొదలెడితే, పాట అయిపోగానే ఎండ్ పడుతుంది! పిచ్చి చూపులు  చూడడం ప్రేక్షకుల వంతవుతుంది!

—సికిందర్ 

17, సెప్టెంబర్ 2022, శనివారం

1211 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం : సుధీర్ బాబు, కృతీ శెట్టి, అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణీ నటరాజన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్ , ఛాయాగ్రహణం : పీజీ విందా
బ్యానర్స్ : బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల :   సెప్టెంబర్ 16, 2022
***

        సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో సమ్మోహనం తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్. ఈ రోమాంటిక్ డ్రామా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వైరల్ అయ్యాయి. మరి సినిమా వైరల్ అయ్యిందా? తెలుసుకుందాం...

కథ
నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్. మొదటి మగాడు, కసక్, గుడ్ బాయ్- బ్యాడ్ బాయ్ వంటి ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఏడో సినిమా ప్లాన్ చేస్తాడు. నిర్మాత ఏ కథ ఏ హీరో హీరోయిన్లతో తీసినా అభ్యంతరం లేదని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. కొత్త హీరోయిన్ గురించి ఆలోచనలో నవీన్ కి చెత్త కుప్పలో ఒక సినిమా రీలు దొరుకుతుంది. ఆ రీలు వేసి చూసి షాక్ అవుతాడు. అందులో ఎవరో అద్భుతంగా వున్నకొత్త హీరోయిన్ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవడానికి కో డైరెక్టర్ బోస్ (వెన్నెల కిషోర్), రైటర్ రమణ (రాహుల్ రామకృష్ణ) లతో కలిసి వేట మొదలెడతాడు

ఆమె కంటి డాక్టర్ అలేఖ్య (కృతీశెట్టి) అని తెలుస్తుంది. కానీ అలేఖ్యకి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ద్వేషం. ఆమె తల్లిదండ్రులు (శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్) కూడా ద్వేషిస్తారు. అయినా ఎలాగైనా అలేఖ్యని హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించే ప్రయత్నంలో, సినిమాలంటే ఆమెకెందుకు ద్వేషమో తెలుసుకుని షాక్ అవుతాడు.

ఏమిటామె చెప్పిన విషయం? దీంతో డిస్టర్బ్ అయిన నవీన్ తిరిగి ఎలా తన ప్రయత్నాలు కొనసాగించాడు? ఈ క్రమంలో ఇంకేమేం జరిగాయి? అలేఖ్య, ఆమె తల్లిదండ్రుల ద్వేషాన్ని ఎలా ప్రేమగా మార్చి దర్శకుడిగా తను ఇంకో మెట్టు పైకెదిగే సినిమా తీశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
కేవలం రోమాంటిక్ డ్రామా కాదు, ఇంకా చాలా. ఒక దర్శకుడు స్త్రీ స్వశక్తీ కరణ గురించి, విముక్తి గురించీ ఎన్నో సినిమాలు తీయొచ్చు. నిజ జీవితంలో అలాటి స్త్రీ ఒక్కరినైనా  ఉద్ధరించి సినిమాలు తీసే వాడుంటాడా? వాడు కదా గొప్ప దర్శకుడు? కూతుర్ని సంరక్షణ పేరుతో ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులు, కూతురు గర్వకారణంగా వుండాలని ఎందుకు కోరుకోరు? ఆ స్వేచ్ఛ ఎందుకివ్వరు? తోబుట్టువులకి అర్ధమేమిటి? ఒకరి కలని ఇంకొకరు నిజం చేయడం కాదా? కట్టుబాట్లని ధిక్కరించడంలో శాంతి వుంటే ఆ శాంతిని ఎందుకు పొందకూడదు? ఇలా ఈనాటికీ ఈ అభ్యుదయ భావాల గురించి మాట్లాడడం, సంఘర్షించడం మానవ జాతికి నగుబాటు కాదా?

పై ప్రశ్నల సమాహారమే ఈ కథ. రోమాంటిక్ డ్రామాకి పూర్తిగా మార్చేసిన దృక్కోణం, భాష్యం. ఇందులో రోమాన్స్ కంటే జీవితం గురించి ఎక్కువ. అవే పస లేని, ఆదరణ కోల్పోయిన రొటీన్ రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాల పేరుతో వస్తున్న ప్రేమ సినిమాల మధ్య కాస్త ఆలోచన, అభిరుచీ గల ప్రేక్షకుల కోసం రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి మెచ్యూర్డ్ ప్రయత్నం.

తెర మీద దర్శకుడి పాత్ర ఎంత ఉన్నతంగా కన్పిస్తుందో, తెరవెనుక ఇంద్రగంటి కూడా అంత గౌరవం పెంచుకుని కన్పిస్తారు. ఇంద్రగంటి సినిమాలన్నీట్లో ఇది టాప్. ఎంత టాప్ అంటే, దీనికి ప్రేక్షకులు తక్కువ. తెలుగులో క్వాలిటీ సినిమాలకి ఇంకా ఎదగాలి కదా ప్రేక్షకులు. సీరియస్ సినిమా, కాస్త బాధపెట్టే సినిమా వస్తే టీవీ సీరియల్ అని కొట్టి పారేసే వర్గం బయల్దేరింది. టీవీ సీరియల్ కీ, సినిమాకీ తేడా తెలియకుండానే దర్శకులు సినిమాలు తీస్తారా? టీవీ సీరియల్స్ సినిమాల్లోంచే వచ్చాయి. కానీ బలహీన, సోకాల్డ్ కుటుంబ కథలు సీరియల్స్ గా చూపించి ఈ జానర్ నే దెబ్బతీశాయి. ఇదే సినిమాలకీ ఆపాదించి కొట్టి పారేయడం, అదే ఇలాటి సీరియస్- ఆలోచనాత్మక సినిమాలు వేరే భాషల్లో వస్తే ఆకాశానికేత్తేయడం ఫ్యాషనైపోయింది- ఒక పక్క హెవీ మదర్ సెంటిమెంట్ల ఒకేఒక జీవితం లాంటివి హిట్ చేస్తూ!

నటనలు- సాంకేతికాలు

సుధీర్ బాబు ఏంటో ఈ సినిమాతో తెలుసుకోవచ్చు. జంటిల్ మాన్ దర్శకుడి పాత్రని అతను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా తెరమీద ప్రొజెక్ట్ చేశాడు. ప్రతీ సీనులో తన పాత్ర ప్రేక్షకులకి  ఆత్మీయంగా అన్పించేలా, ప్రేమించేలా నటించాడు. కుటుంబ సంక్షోభాన్నీ, ఆ కుటుంబంలో కూతురి క్షోభనీ చాలా నీటుగా పరిష్కరించే పాత్రచిత్రణ అతడి నటనకి బలం. ఇది అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

హీరోయిన్ కృతీ శెట్టిది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే. సినిమాల్లో హీరోయిన్ పేరుకి పెద్ద హోదాలో వుంటుంది గానీ, వేసేది వెకిలి వేషాలు. లాయరమ్మ మాస్ పాటేసుకుంటుంది. కలెక్టరమ్మ కల్లు తాగి చిందులేస్తుంది. కృతీ శెట్టి డాక్టర్ పాత్ర హోదాకి తగ్గ, హూందాతనంతో కూడిన నటనని చూసి తలవంచుకోవాలి రంగరంగ వైభవం లోని హీరో హీరోయిన్ల టీనేజీ బిహేవియర్ లేకి డాక్టర్ పాత్రల్లాంటివి కూడా.

ఇక వెన్నెల కిషోర్. ఇతను ఎంత నటించినా కామెడీ ఇంకా మిగిలే వుంటుంది. సినిమా తర్వాత సినిమా కొసరి కొసరి వడ్డిస్తూంటాడు. ఒకేఒక జీవితం లో బ్రోకర్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఇక్కడ కో డైరెక్టర్ పాత్రలో అలా ఒదిగి కామిక్ రిలీఫ్ కి తోడ్పడ్డాడు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ రైటర్ పాత్రలో నవ్వించడానికి రాలేదు- హీరోకి పెద్ద మనిషి తరహా సపోర్టు నిచ్చే జగ్గయ్యలా అన్పిస్తాడు. వీళ్ళిద్దరు కూడా అవార్డు తీసుకోవచ్చని అనడం లేదుగానీ, తీసుకునే కెపాసిటీ వుంది.

సెంటిమెంట్ల పేరుతో రొడ్డ కొట్టుడు నాటు తల్లితండ్రుల పాత్రలకి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇక్కడ శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్ లు ఓ కుదుపు నిస్తారు. వీళ్ళిద్దరు కూతురు కృతీ పాత్రతో పతాక స్థాయికి తీసికెళ్ళారు సంక్లిష్ట హ్యూమన్ డ్రామాని. పిల్లలు ఏడ్పిస్తే పేరెంట్స్  ఏడ్పు ఎలా వుంటుందనడానికి శ్రీకాంత అయ్యంగార్ నటించిన చివరి భావోద్వేగ సన్నివేశం నిజ జీవితం ఇలాగే వుంటుందనడానికి తార్కాణం. ఇది ఎక్కడో గుచ్చుకుని గిల్టీ ఫీలింగ్ తో లేచి వెళ్ళి పోయే ప్రేక్షకులూ వుంటారు. ఇది దర్శకుడి విజయమే. శ్రీకాంత్, కళ్యాణీ లది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

ఇంకే మైనర్, సహాయ పాత్రలు నటించిన వాళ్ళూ కూడా కథ శిల్పం, మూడ్, ఫీల్ ని చెడగొట్టకుండా అందులో భాగమై కనిపిస్తారు. సాంకేతిక ప్రమాణాల్లో పీజీ విందా కెమెరా వర్క్ బ్యూటీఫుల్ విజువల్స్ ని సృష్టించింది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కళా దర్శకత్వం, సెట్స్, లొకేషన్స్ పైస్థాయిలో వున్నాయి. వివేక్ సాగర్ సంగీతం లో అల్లరల్లరి టైటిల్ సాంగ్, ఇంకో ఐటెమ్ సాంగ్ తో బాటు, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి కవులు. వివేక్ సాగర్ సన్నివేశాలకి కూర్చిన నేపథ్య సంగీతం భారీ ఆర్కెస్ట్రెయిజేషన్ తో హాలీవుడ్ స్టయిల్లో రిచ్ నెస్ ని తీసుకు వచ్చింది. ఇక ఇంద్రగంటి రచన, దర్శకత్వం ఆయన సినిమాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో తెలియజేస్తాయి. ఈ ప్రమాణాల్ని మున్ముందు కూడా ఇలాగే అందిస్తాడని ఆశించాలి.

చివరికేమిటి
ఇంటర్వెల్ దాకా సమయం వృధా చేయకుండా వెంటనే పది నిమిషాల్లో సినిమా రీలు దొరకడంతో కథ ప్రారంభమై పోతుంది. ఆ రీల్లో వున్న హీరోయిన్ కృతీ శెట్టి కోసం అన్వేషణ. కానీ దర్శకుడైన సుధీర్ బాబు రీల్లో వున్న హీరోయినెవరో వెంటనే తెలుసుకోవచ్చు. ఎవరు తీస్తున్నసినిమా  ఆపేశారో లాబ్స్ లో ఆ రీలుని బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ లాజిక్ ని పక్కన బెట్టారు. ఆమె కోసం సినిమాటిక్ అన్వేషణ, కామెడీలు.

చివరికి కృతి డాక్టర్ అని తెలిశాక, సినిమా వాళ్ళంటే ద్వేషంతో ఆమె ట్రాక్. సుధీర్ రొట్ట మాస్ సినిమాల డైరెక్టర్ అని కూడా ఆమెకి అసహ్యం. దీన్ని పోగొట్టడానికి ఒక సెమినార్ లో రెండు కోట్లు విరాళం ప్రకటిస్తాడు. దీనికి కూడా లొంగదు. అప్పుడు అదే సెమినార్ లో చెత్త సినిమాలు తీసే వాడుకూడా ఏదో మేలు చేసే ఒక డైలాగు రాస్తాడని, దాంతో కనీసం ఒకడైనా చిరస్మరణీయు డవుతాడన్న సన్నివేశం సోదాహరణగా ప్రూవ్ అయి అతను ఉన్నతుడై పోతాడు.

హీరోయిన్ మనసుని మార్చే ఈ సీను క్రియేషన్ చాలా టాప్ క్లాస్. కథ లోతుపాతుల్లోకి వెళ్ళి తవ్వి తీసిన క్రియేటివిటీ. మళ్ళీ సెకండాఫ్ లో ఆమెని నటించడానికి ఒప్పించేందుకు సుధీర్ చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలాటిదే టాప్ క్లాస్.

ఇంటర్వెల్లో ఆ సినిమా రీలులో తనని చూసుకుని కృతి చెప్పే విషయంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో ఆమె ఫ్లాష్ బ్యాక్ తో ద్వేష  కారణం పూర్తిగా అర్ధమవుతుంది.

ఇప్పుడు సుధీర్ కథ మార్చేసి ఆమె పేరెంట్స్ కి తెలియకుండా ఆమె హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇది చాలా విపరిణామాలకి దారి తీస్తుంది పేరెంట్స్ తో  క్లయి మాక్స్ కొచ్చేసరికి- అన్ని సమస్యలకీ పరిష్కారంగా అదే రీలుతో కలిపి తీసిన సినిమా వేసి, సృష్టించే వూహించని పతాక స్థాయి డ్రామా మాస్టర్ స్ట్రోక్ గా వుంటుంది. సున్నిత పాత్రల బలమైన మానసిక సంఘర్షణల క్వాలిటీ చిత్రణ ఇది. ఐతే పైన చెప్పుకున్నట్టు, ఈ క్లాస్ మూవీకి ప్రేక్షకుల సపోర్టు తక్కువే వుంటుంది.

—సికిందర్
(ఈ సినిమా రెండు సార్లు చూశాం. ఇందులో
నేర్చుకోవాల్సినవి చాలా వున్నాయి.
ఇది పర్సనల్ గా రాసుకున్న రివ్యూ.
ఇది ఎక్కువమందికి నచ్చని సినిమా.
ఎక్కువ మందికి లపాకీ సినిమాలు కావాలి)


15, సెప్టెంబర్ 2022, గురువారం

1210 : రివ్యూ!

దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
తారాగణం : రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు
రచన ; అయాన్ ముఖర్జీ, హుస్సేన్ దలాల్; సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ ఛటర్జీ, వికాష్ నౌలాఖా, ప్యాట్రిక్ డ్యూరక్స్
బ్యానర్స్ : స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్
నిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మరిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
విడుదల : సెప్టెంబర్ 9, 2022
***

        సుదీర్ఘ కాలం నిర్మాణంలో వుండి, బహిష్కరణల పిలుపులతో అయోమయంలో పడి, ఆఖరికి బుకింగ్స్ తో ఆశల్ని రేకెత్తిస్తూ విడుదలైన బ్రహ్మాస్త్రం ప్రేక్షకుల తీర్పుకి నిలబడింది. 410 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెబుతున్న ఈ బాలీవుడ్ మెగా మూవీ, ఇంకో సందిగ్ధాన్ని కూడా తొలగించేందుకు ముందుకొచ్చింది. వరుసగా బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు హిందీ సినిమాలని ఇక మర్చిపోదల్చారా అన్న ప్రశ్నకి సమాధానంగా కూడా బ్రాహ్మాస్త్రం విడుదలైంది. అలాటిదేమీ లేదు, హిందీ సినిమాల్ని కూడా చూస్తారు - కాకపోతే ఎంత స్టార్ సినిమా అయినా నాసిరకం సినిమాల్ని చూడరని ఇక తేలిపోతోంది.

        ర్శకుడు అయాన్ ముఖర్జీకిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ఈ స్థాయి బడ్జెట్ కి, హాలీవుడ్ ని తలదన్నే విజువల్ హంగామాకీ భారీ తారాగణం కొలువు దీరాలి నిజానికి. కానీ అరడజనుకి మించి తారలు లేరు. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, మౌనీ రాయ్, ఇంతే. భారీ సంఖ్యలో తారాగణముంటేనే కథంతా గందర గోళమై, ఎవరు ఎవరో గుర్తు పెట్టుకుని చూడ్డం కూడా అదనపు భారమై పోతుంది. మరి ఇంత సింపుల్ తారాగణంతో బ్రహ్మాస్త్రం కథ ఎంత బలంగా వుంది? అరుగురూ స్టార్సే. ఏ క్షణం చూసినా ఒకరు కాకపోతే ఒకరు స్టార్సే కనపడే ఈ బృహత్ ప్రయత్నంలో, ఏ మాత్రం మెప్పించి కడుపు నిండిన ఫీలింగ్ తో ప్రేక్షకుల్ని ఇళ్ళకి పంపించారు? ఇవి తెలుసుకుందాం...

కథ

పురాతన కాలంలో గాలి నీరు నేల నిప్పు అనే పంచభూతాల్లోని నాలుగు మూలకాలకి, జంతు సంబంధమైన, వృక్ష సంబంధమైన ధాతువుల్ని కలిపి, అతీత శక్తుల్ని సాధించడానికి ఋషులు హిమాలయాలలో కఠోర తపస్సు చేసి బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. దుష్ట శక్తుల నుంచి ప్రపంచానికి ముప్పు వాటిల్లినప్పుడు ఈ అస్త్రం ఆ ముప్పుని తుత్తునియలు చేసే విశ్వశక్తితో వుంటుంది. ఈ బ్రహ్మాస్త్రాన్ని మూడు భాగాలుగా  చేసి, బ్రహ్మాంశ్ అనే గుప్త సమాజానికి అందించారు. తరతరాలుగా గుప్త సమాజం చేతులు మారుతూ వస్తూ, ఇప్పుడు ముగ్గురి దగ్గర అస్త్ర భాగాలు భద్రంగా వున్నాయి.        

ప్రస్తుతానికొస్తే, ముంబైలో డీజే శివ (రణబీర్ కపూర్) పండగలకి ప్రోగ్రాములు ఇస్తూ వుంటాడు. అనాధగా అతడిది సామాన్య జీవితం. దసరా ఉత్సవాలప్పుడు అతను ఈషా (ఆలియా భట్) అనే అద్భుత సౌందర్యరాశిని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. అయితే అతడి ప్రేమాయణానికి ఏవో కలలు అడ్డుపడుతూంటాయి. ఆ కలల్లో అగ్నిగోళాలు పేలుతూ, ఏవో దృశ్యాలు కనపడుతూ వుంటాయి. దీన్ని అర్ధం జేసుకోలేక పోతాడు.

        ఇలావుండగా, జునూన్ (మౌనీ రాయ్) అనే దుష్ట శక్తి తన అనుచరులిద్దరు రఫ్తార్, జోర్ లని వెంటేసుకుని బ్రహ్మాస్త్రం వేటలో వుంటుంది. మోహన్ భార్గవ్ (షారుక్ ఖాన్) అనే శాస్త్రవేత్త గుప్త సమాజం సభ్యుడిగా వుంటూ, బ్రహ్మాస్త్రంలోని ఒక భాగం వానరాస్త్రాన్ని కలిగి వుంటాడు. ఇతడ్ని చంపేసి వానరాస్త్రాన్ని హస్తగతం చేసుకుంటుంది జూనూన్. మిగిలిన రెండు అస్త్రాల్ని కూడా చేజిక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలన్న దుష్ట ప్రణాళికతో వుంటుంది.

        శివకి కలలో కనపడుతున్న దృశ్యాలివే. మరోసారి వారణాసిలో చిత్రకారుడు అనీష్ శెట్టి (నాగార్జున) బలి కాబోతున్నాడని గ్రహించి, ఈషాతో అక్కడికి వెళ్ళేసరికి జునూన్ దాడి చేస్తూంటుంది. గుప్త సమాజం రెండో సభ్యుడు అనీష్ శెట్టి దగ్గరున్న నంది అస్త్రాన్ని కైవసం చేసుకుని చంపేస్తుంది. ఈ సమయంలోనే శివకి అగ్నితో తనకేదో సంబంధ ముందని తెలుస్తుంది. తను నిప్పుని  పుట్టించలేడు, కనీసం దీపం ముట్టించలేడు. అయితే  మంటలు కూడా అతడ్నేమీ చేయలేవు.

        ఈ నేపథ్యంలో గురూ (అమితాబ్ బచ్చన్) అనే గుప్త సమాజం మూడో సభ్యుడు హిమాలయాల్లో ఆశ్రమంలో వున్నాడని తెలుసుకుని వెళ్ళిన శివ అక్కడేం చేశాడు? మూడో అస్త్ర భాగం జునూన్ చేతికి చిక్కకుండా ఆమెనెలా ఎదుర్కొన్నాడు? చివరికేమయ్యాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ట్రెజర్ హంట్- మిథికల్ ఫాంటసీ జానర్ కథ ఇది. అయితే ఇటీవల కార్తికేయ 2 లో  పురాణాలు చరిత్రలనీ, కృష్ణుడు చారిత్రక పురుషుడనీ చెప్తూ, కృష్ణుడిచ్చిన అస్త్రంతో వాస్తవిక కథ చేయకుండా కల్పిత కథే చేశారు. ప్రపంచాన్ని కాపాడే ఒక అస్త్రాన్ని కృష్ణుడు గుప్త సమాజానికిస్తాడు. ఆ గుప్త సమాజం వారసుల దగ్గరున్న అస్త్ర భాగాల కోసమే ఈ కథ. బ్రహ్మాస్త్రం లో కూడా ఇలాటిదే కథ. ఈ కథలు అశ్విన్ సంఘీ  రాసిన ది కృష్ణ కీ అనే పాపులర్ మిథికల్ థ్రిల్లర్ నవల్లోని కథ లాగే వుంటాయి. కాకపోతే కార్తికేయ 2 లో అస్త్రం కోసం వేట కథ కాస్తా, కృష్ణుడి ప్రవచనాలతో భక్తి సినిమాలాగా మారిపోయింది. అందుకే ఇప్పుడున్న మతోత్సాహ వాతావరణంలో నార్త్ లో అంత హిట్టయ్యింది.

        బ్రహ్మాస్త్రం లో దేవుళ్ళూ  ప్రవచనాలూ లేవు. అస్త్రం కోసం వేటతోనే సూటి కథ. అయితే ఈ కథలు ఈ కాలంలో కూడా మూసలోనే తీస్తున్నారు. అటు హాలీవుడ్ లో చూస్తే ప్రపంచాన్ని కాపాడేది అమెరికానే అన్నట్టు సినిమాలు తీసి పడేస్తున్నారు. మన వాళ్ళు ప్రపంచానికివ్వగల శాస్త్ర పరిజ్ఞానమంతా మన దగ్గరే వుందని  చెప్తూ కూడా - అస్త్ర శస్త్రాల కథల్ని దేశం దాటించడం లేదు. ఇదే బ్రహ్మాస్త్రం దుష్ట శక్తుల చేతిలో పడితే మొదటి దెబ్బ అమెరికాకే అన్నట్టు చెప్పి, విదేశీ పాత్రలతో కూడా కథ చేసి వుంటే - సెకండాఫ్ ఈ కథ మరో లోకల్ మూస కథగా కుదేలవకుండా, గ్లోబల్ కథగా వ్యాకోచించేది.

నటనలు- సాంకేతికాలు
ఉన్న ఆరు పాత్రలూ బావున్నాయి- ముఖ్యంగా హీరో రణబీర్ కపూర్ మాస్ ఓరియెంటెడ్ పాత్ర. పాత్ర చిత్రణ. స్టార్ కివ్వాల్సిన ఎలివేషన్. యూత్ అప్పీల్ కోసం రోమాన్స్ సహా. తల్లిదండ్రు లెవరో తెలియని అతడి కదిలించే ఫ్లాష్ బ్యాక్. దివ్య శక్తులతో హీరోయిజం. ఇలా ప్రతీ కోణంలో గుర్తుండి పోతాడు. అగ్ని పుంజాలతో అతను పాడుకునే పాట క్రియేటివిటీ పరంగా కొత్తాలోచన. దసరా ఉత్సవాల్లో మొదటి మాస్ పాట దగ్గర్నుంచి, మూడు నాల్గు రోమాంటిక్ సాంగ్స్ మ్యూజికల్ గా, విజువల్ గా హైలైట్సే. ఇక అతడి యాక్షన్ సీన్స్ చెప్పనవసరం లేదు.

        ఆలియాభట్ ప్రేమలప్పుడు, పాటలప్పుడూ వచ్చిపోయే ఫార్ములా గ్లామర్ బొమ్మలా కాకుండా, ఆద్యంతం కథలో, యాక్షన్ దృశ్యాల్లో పాల్గొనే పాత్రచిత్రణతో, తగిన నటనతో వుంది. షారూఖ్, నాగార్జున లవి అతిధి పాత్రలే అయినా, కీలకమైనవి. సినిమా ప్రారంభం షారూఖ్ తో వుంటుంది. అతడి పాత్ర మరణం, తర్వాత నాగార్జున పాత్ర మరణమూ కదిలిస్తాయి. సెకండాఫ్ లో గురూగా అమితాబ్ మూలస్తంభంగా వుంటాడు. ఇక విలన్ పాత్రలో యంగ్ మౌనీ రాయ్ ఒక సర్ప్రైజ్. ఇంత భారీ సినిమాని విలన్ గా తన భుజాన మోయడం!

        ఇక సాంకేతికంగా చెప్పడానికి మాటల్లేవు. సంజయ్ లీలా భన్సాలీ కూడా ఈ దృశ్య వైభవం చూసి అప్డేట్ అవ్వాల్సిందే. హాలీవుడ్ ఆల్రెడీ మోకరిల్లిందని రివ్యూలొస్తున్నాయి. తిరుగులేని గ్రాఫిక్స్ వర్క్ కి కళ్ళు చెదురుతాయి. ఇంతకంటే ప్రేక్షకులకేం కావాలి? కావాలి ఇంకాస్త మంచి సెకండాఫ్...

చివరికేమిటి

ఆరే ఆరు పాత్రలతో భారీ కథ కాకుండా, కథ సింపుల్ గా, సూటిగా వుండడంతో ఫస్టాఫ్ క్షణం కూడా కళ్ళు తిప్పుకోకుండా ఫాలో అవుతాం. నిజానికి హాలీవుడ్ బిగ్ యాక్షన్ మూవీస్ సింపుల్ గా సూటిగా వుండే కథలతోనే వుంటాయి. ఇక్కడ ఒక బ్రహ్మాస్త్రం మూడు చోట్ల వుంది, దాన్ని కాజేయడం కోసం విలన్, విలన్ని అడ్డుకునే హీరో, ఇంతే కథ. ఆ విలన్ కి ఇద్దరే అనుచరులు. దీనికి బ్యాక్ డ్రాప్, యాక్షన్ ఇవన్నీ బిగ్ కాన్వాస్స్ తో వుంటాయి. ఇలా ఈమధ్య కాలంలో ఫస్టాఫ్ కళ్ళు తిప్పుకోకుండా కూర్చోబెట్టే సినిమా ఇదే.

        సెకండాఫే సమస్య. సెకండాఫ్ లో వేట కథ నాపి, బ్రహ్మాస్త్రం పుట్టు పూర్వోత్తరాలు (ఇది ఆల్రెడీ సినిమా ప్రారంభంలో చిరంజీవి వాయిసోవర్ చెప్పేశారు), హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వంటి సెకండాఫ్ ని కుంగదీసే విషయాలతో నిడివిని భర్తీ చేయడంతో, ముప్పావుగంట సహనాన్ని పరీక్షిస్తుంది. మళ్ళీ వేట కథ మొదలయ్యాక ఎంతకీ ముగియని క్లయిమాక్స్ తో సహన పరీక్ష రెట్టింపవుతుంది. మరి ముగింపు? ముగింపు పేలవంగా వుంది. ఈ ముగింపుతో రెండో భాగం తీస్తారా, దీంతో ఆపేస్తారా అనేది త్వరలో న్యూస్ ఇవ్వొచ్చు దర్శకుడు.

సికిందర్