రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, డిసెంబర్ 2020, బుధవారం

1004 : రైటర్స్ కార్నర్

   

  చయిత అవాలని కలలుగనే వారెవరినీ నేను విమర్శించను. రచనలు చేసి జీవించడం చాలా కష్టం. అందుకే ఇలాటి కలలున్న వాళ్ళు రెండు ఉద్యోగాలు చేస్తారు. ఒకటి జీతం వచ్చే పగటి ఉద్యోగం. దీంతో తలపైన కప్పు, కడుపుకి ఇంత తిండీ లభిస్తాయి. ఇక ఖాళీ సమయాన్ని రాతపనికి  కేటాయించుకుంటారు. పనిలో మీరు ఒంటరి. మీకెవరి  సపోర్టూ లభించదు. రచనలు చేసే వాడి మీద అంత సదభిప్రాయం వుండదు మనుషులకి. ఇలా స్ట్రగుల్ చేసి మీరు రచయిత అన్పించుకుని సినిమాల్లోకి వచ్చారంటే, ఇక్కడ కూడా స్ట్రగుల్ వుంటుంది. చాలా తక్కువ మందికి చేతినిండా పని వుండి, వాళ్లకి  సినిమాలు తప్ప  ఇక దేని గురించీ ఆలోచించే అవసరముండదు. మిగిలిన వాళ్ళు మళ్ళీ రెండుద్యోగాలు చేయాల్సిందే!   
-
రాబిన్ స్వికార్డ్   
       
నేనెందుకు రాస్తున్నానంటే... రాయడాన్ని ఎంజాయ్ చేస్తాను గనుక, సినిమాల్ని ప్రేమిస్తాను గనుక. కానీ ప్రధాన కారణం చెప్పుకోవాలంటే, నేను రాసింది ఎవరో ఒకరు ఇష్ట పడుతున్నారు కాబట్టి, నాకు డబ్బిస్తున్నారు కాబట్టి. లేకపోతే నేనిక్కడ వుండేవాణ్ణి కాదు, చేపలు పడుతూ వుండే వాణ్ణి.
-జిమ్ కౌఫ్ 
       
ఎవరో అన్న ఒక మాటని రాసిపెట్టుకోవడంతో ప్రారంభమయ్యింది నేను రచన చెయ్యడం. తర్వాత ఇంకెవరో చెప్పిన మాట నచ్చి అదీ రాసి పెట్టుకున్నాను. అలా అలా విన్న డైలాగులనీ కలిపి నాటిక రాసేశాను. నాటిక ఎలా రాయాలో తెలీకుండానే నలభై నిమిషాల నాటిక రాసేశాను. ఇదంతా చేస్తున్నప్పుడు  నా సబ్ కాన్షస్  మైండ్ అందిస్తూ పోయిన క్రియేటివిటీ మాదకద్రవ్యాల్లాంటి మత్తులా నన్నావహించింది... మత్తు నన్ను రచయితగా మార్చేసింది
-
నికోలస్ కజన్  
       
ఇంతకంటే సంతృప్తికరమైన వృత్తి నాకు తోచదు. రాసే దినచర్య నాలుగు గోడల మధ్య  బందీ చేస్తుంది. సినిమా తీయడం పూర్తిగా వేరు, అది బయటి లోకంలోకి రప్పిస్తుంది. అటు ఇటూ రెండు సంబంధిత లోకాల్లో జీవించడం నాకు సరిపోయే వృత్తే : ఏకాంతంలో రాయడం, సమూహంలో తీయడం!
-
అకివా గోల్డ్స్ మాన్
       
నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే మా ఇంగ్లీషు టీచరు నువ్వు రైటర్ అవ్వాలని ఎప్పుడూ అంటూ వుండేది. ఎనిమిదేళ్ళప్పటి నుంచే నేను రచయిత్రినైనట్టు కలల్లో మునిగి తేలిపోతూ వుండే దాన్ని. నేను రాయాలంటే ఇంకో జాబ్ చేసుకుంటూ రాత్రి పూట మాత్రమే రాసుకోగలిగే పరిస్థితుల్లేకుండా, రచనే జీవితంగా చేసుకుని రంగాన్ని ఎన్నుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు,  సినిమాలపై నాకున్న వ్యామోహం అటు వైపు లాగింది.  ఇక వృత్తీ ప్రవృత్తుల సంగమంలాగా సినిమా రంగమే నాకు బెస్ట్ ఆప్షన్ అయింది.
- లెస్లీ డిక్సన్  
       
సినిమా సెట్ మిలిటరీ ఏరియా  లాంటిది. అక్కడ జరిగే కార్యకలాపాల్లో రచయితగా మీకెలాటి పాత్రా లేదు. అందుకని మీరక్కడికి వెళ్తే మిమ్మల్ని వింత జీవిలా చూస్తారు.
-మార్క్ కీఫ్
       
ఎప్పుడూ మామూలు చైర్లో కూర్చోండి....ఇదీ కొత్త రచయితలకి నేనిచ్చే సలహా. పెద్ద కుర్చీని  ప్రొడ్యూసరో, డైరెక్టరో కూర్చోవడానికి వదలండి...
-
జాన్ డి. బ్రాన్ కాటో
       
రచయితగా నా జీవితంలో సగభాగం, బహుశా ముప్పాతిక వంతు, నేను రాసింది తిరగరాయడంతోనే గడిచిపోయింది. నాకు ప్రత్యేకమైన టాలెంట్ వుందని అనుకోను, కానీ అసాధారణ  స్టామినా ఏదో నాకుందని నాకు తడుతూ వుంటుంది.
-జాన్ ఇర్వింగ్

  

15, డిసెంబర్ 2020, మంగళవారం

 


దర్శకత్వం :  ఎం జ్యోతికృష్ణ. 
తారాగణం : 
గోపీచంద్, రాశీ ఖన్నాఅనూ ఇమ్మాన్యుయేల్జగపతిబాబుఆశీష్ విద్యార్థిసాయాజీ షిండేఅభిమన్యు సింగ్వెన్నెల కిషోర్అలీబ్రహ్మాజీ తదితరులు 
కథ జ్యోతి కృష్ణస్క్రీన్ ప్లే :  ఎం రత్నంసంగీతం : యువన్ శంకర్ రాజాఛాయాగ్రహణం : ఛోటా కె నాయుడువెట్రి 
బ్యానర్ : శ్రీ సాయి రాం క్రియేషన్స్ 
నిర్మాతలు : 
ఎస్ ఐశ్వర్య ఎం రత్నం 
విడుదల : నవంబర్ 30, 2017
***
      ‘ఆక్సిజన్ గురించి దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పింది చూస్తే  నిజంగానే ఇదేదో డిఫరెంట్ మూవీ అని సంబరపడతాం. తీరా డిఫరెంట్ కీ ఫార్ములాకీ తేడా  లేకపోవడమే తన దృష్టిలో డిఫరెంటేమో అని తెలిసి కంగుతింటాం. ప్రేక్షకులు ఫార్ములాతో విసిగిపోయి డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారని చెబుతూ, ‘ఆక్సిజన్’ అలాటి తేడాగల మర్చిపోలేని అనుభవాన్నిచ్చే కమర్షియల్ అని సెలవిచ్చాడు. ఫార్ములా మర్చిపోలేని అనుభవాన్నిస్తుందా?

          పజయాలతో వూపిరి సలపని  గోపీచంద్ కాస్త ఆక్సిజన్ ని ఆశించడంలో తప్పులేదు. ఆ ఆక్సిజన్ ప్రేక్షకుల పాలిట కాలుష్యం అవకుండా తను చూసుకోవాలి. చాలాకాలం నిర్మాణంలో వుండి, విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు విడుదలైతే దానర్ధం సిగరెట్లకి ఎక్స్ పైరీ డేట్ వుండదనా? చూద్దాం ఈ ఆక్సిజన్ సంగతులేమిటో...

కథ 
      రాజమండ్రిలో రఘుపతి (జగపతి బాబు) కి ముగ్గురు తమ్ముళ్ళు (బ్రహ్మాజీ, శ్యామ్, ప్రద్యుమ్న సింగ్), వాళ్ళ కుటుంబాలు, తనకో కుమార్తె  శృతీ (రాశీ ఖన్నా) వుంటారు. ఈ కుటుంబం మీద వీరభద్రం (సాయాజీ షిండే) పాత కక్షలతో  చంపుతూంటాడు. రఘుపతి తమ్ముడు, అతగాడి కొడుకూ అలా బలై పోతారు. వీరభద్రం నుంచి కుటుంబానికి రక్షణ  లేదని రఘుపతి కూతురికి అమెరికా సంబంధం చేసి పంపించేయాలనుకుంటాడు. సంబంధం చూడ్డానికి అమెరికా నుంచి  కృష్ణ ప్రసాద్ (గోపీ చంద్) వస్తాడు. శృతికి అమెరికా వెళ్ళడం ఇష్టంలేక, కృష్ణప్రసాద్ కి రకరకాల పరీక్షలు పెడుతూంటుంది మేనమామ (అలీ) తో కలిసి. వీరభద్రం మరోసారి దాడి చేసేసరికి, కృష్ణప్రసాద్ వీరోచితంగా పోరాడి ఆమె మనసు గెల్చుకుంటాడు. గెల్చుకున్నాక, అసలు తను కృష్ణప్రసాద్ కాదని ఆమెకి షాకిస్తాడు. 

          కృష్ణప్రసాద్ ఎవరు? ఏ ఉద్దేశం పెట్టుకుని ఈ వూరొచ్చాడు? అతడి ప్రతీకారం ఎవరి మీద? ఎందుకు? ...ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ
   
       పాత మూస ఫార్ములా డ్రామా అని తెలిసిపోతూనే వుందిగా - ఇంకా డిఫరెంట్ ఏమిటి? డిఫరెంట్ ఏమిటంటే,  నకిలీ సిగరెట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయనే విషయం ఈ పాత మూస ఫార్ములాలో కలిపి చెబుతున్నారు  కాబట్టి, ఇదే డిఫరెంట్ అనుకోవాలని ఉద్దేశం. రేపు అల్లూరి సీతారామరాజు కథ తీయాలన్నా దాన్నిలాగే పాత మూస ఫార్ములాలో బిగించి డిఫరెంట్ చేస్తారు. కాకపోతే ఇంటర్వెల్లో నేను క్లీన్ షేవ్డ్  రాజ్ కుమార్ని కాదు, అల్లూరి సీతా రామరాజునని బ్యాంగ్ ఇస్తాడు గడ్డం పెట్టుకుని. అప్పుడు బాషా లాగానో, ఫ్యాక్షన్ లాగానో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చి, శత్రు సంహారం గావిస్తాడు. మహాత్మా గాంధీ కథ తీసినా ఇదే – తెలిసిన ఇదొక్కటే ఫార్ములా పంజరంలో వుంటుంది. ఇది మర్చిపోలేని మాంచి అనుభవాన్నే ఇస్తుంది. 



ఎవరెలా చేశారు 
        నిజానికి గోపీచంద్ పోషించింది ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర. సైన్యంలో వుండే హీరో,  సెలవు మీద ఇంటికి వచ్చినప్పుడే సమాజంలో ఏదో చెడు తన కుటుంబాన్ని బలి తీసుకున్నప్పుడు,  తిరగబడే మూస ఫార్ములాలో వుండే పురాతన టెంప్లెట్ పాత్ర. సైనికుడు సరిహద్దులో వున్నప్పుడే  సమాజ సమస్యలకి స్పందించి సెలవు పెట్టి వచ్చి సంగతి చూసుకోకూడదా? అసలు సెలవు పెట్టి ఇంటికి రాకపోతేనే ఇల్లూ సమాజమూ బావుంటాయేమో?  కుటుంబానికి హాని జరిగినప్పుడే తిరగబడి – దానికి దేశం కోసమే చేస్తున్నట్టు రంగుపులిమి పాత్ర చిత్రణ చేయడం చాలా అన్యాయం. సైనికుడు కుటుంబం కోసం యుద్ధం చేయడు, దేశంకోసమే చేస్తాడు. 

          ఫస్టాఫ్ లో అమెరికా నుంచి వచ్చే గోపీచంద్ పాత్ర  సస్పెన్స్ లేని సాదా రొటీన్ మూస పాత్ర. ఇలాకాక, ఇంకో బాడీ లాంగ్వేజ్ కనబడుతూంటే,  పాత్ర సస్పన్స్ క్రియేట్ చేసి, మూస కథకి కూడా దానికదే  డెప్త్ వచ్చేది. అతను ఆర్మీ మేజర్ అయినప్పుడు ఆ రకమైన వైఖరి కూడా కన్పించదు. ఈ ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత రివీలవుతుంది. సెలవు మీద ఇంటికి వస్తే,  వూరూ పేరూ లేని నకిలీ సిగరెట్లకి తమ్ముడు బలై, దీనివెనుక కుట్ర తెలిసి పోరాటం మొదలెడితే- కుటుంబం నశించి (డిటో ‘పటేల్ సర్’ ఫ్లాష్ బ్యాక్) – పోరాటాన్ని ఉధృతం చేయడం  ఈ పాత్రకిచ్చిన టాస్క్. ఇక్కడా విషాద మేమిటంటే- ఇప్పుడూ తను సైనికుడిలా వుండడు. సైనికుడి మైండ్ తో మాట్లాడడు. తనకి  దక్కిన గోల్డెన్ మూమెంట్స్ చివరి సన్నివేశంలోనే. ఇక్కడ మాత్రమే కదిలించే పాత్ర – మిగతా ఎక్కడా కాదు. రొటీన్ యాక్షన్ జానర్ లో వుండిపోతుంది. తన ఆపరేషన్ కి ‘ఆక్సిజన్’  అని పేరు పెట్టుకున్నప్పుడు- ఆ ఆపరేషన్ సైనికుడు చేసే ఆపరేషన్ కోవలో వుండక పోవడం విచారకరం. ఇలాగైనా డిఫరెంట్ అన్పించుకోలేదు. 

          రాశీ ఖన్నాదీ మూస ఫార్ములా హీరోయిన్ పాత్ర. పల్లెటూళ్ళో హీరోతో ఆమె పాల్పడే చేష్టలు చూసీ చూసీ అరిగిపోయినవి.  సెకండాఫ్ లో మెడికల్ రీసెర్చర్ గా వచ్చే సెకండ్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ కాస్త బాధ్యతగల పాత్రగా వున్నా, ఫార్ములా ప్రకారం ఆ పాత్ర ముగిసిపోతుంది. జగపతిబాబు, విలన్లు గా నటించిన ఇతరులూ సైతం చాలా పాత మూస పాత్రలు పోషించారు. అలీకి సీన్లు ఎక్కువే వున్నా కామెడీలో కిక్కు పెద్దగా లేదు.  

          యువన్ శంకర్ రాజా సంగీతం, ఛోటా కె. నాయుడు – వెట్రిల ఛాయాగ్రహణం సాధారణం. పీటర్ హెయిన్స్  సమకూర్చిన యాక్షన్ దృశ్యాల్లో హీరోతో మిలిటరీ యుద్ధ కళలు కన్పించవు. ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీ మేజర్ గా సరిహద్దులో టెర్రర్ స్థావరం మీద హీరో జరిపే దాడి – బిన్ లాడెన్ మీద అమెరికన్ దాడిని జ్ఞప్తికి తెచ్చే టెక్నిక్ తో వుండాల్సింది. పోలికలు కన్పించినప్పుడే కొన్ని సీన్లు ‘మర్చిపోలేని అనుభవాన్ని’ (దర్శకుడి మాటల్లో) ఇచ్చేది. 

చివరికేమిటి 
     ఇతర సిగరెట్లు మంచి వైనట్టు నకిలీ సిగరెట్ల మీద సినిమా తీశారు. మంచిదే, ఈ చలనచిత్రం చూసి జనం మంచి సిగరెట్లు అలవాటు చేసుకుంటే! కథా ప్రయోజనం నెరవేరుతుంది. అసలు ఈ సినిమా తీయడం వెనుక కార్పొరేట్ కంపెనీల హస్తాలున్నాయేమో తెలీదు – తమ సిగరెట్లు అమ్ముకోవడానికి. మంచి  సిగరెట్లు తాగమని అన్యాపదేశంగా చెప్పే సినిమా ఎంతైనా గొప్పది. ఈ మార్పు ఈ దర్శకుడి తోనే ప్రారంభం కావాలి. 

          సిగరెట్ల మీద సినిమాలు తీస్తే, సిగరెట్లు తాగాలన్పించేలా వుంటున్నాయి. అనురాగ్ కశ్యప్ తీసిన  ‘నో స్మోకింగ్’ చూస్తే ఏం చెప్పాడో వూహకందక, బయటికెళ్ళి పోయి గుప్పుగుప్పుమని పది సిగరెట్లు  దమ్ముల్లాగి పడెయ్యాలన్పించింది అప్పట్లో!  సిగరెట్ సినిమాలు అంతటి మార్పుని తెస్తాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’ నకిలీ సిగరెట్లు మానేస్తే పర్యావరణమంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ తో తులతూ
గుతుందని తలపోసింది. జరిగింది వేరు. చూపించిన సినిమా. అంతా  మూస ఫార్ములా పాత సీనుల కాలుష్యమే. 

          సారా అయినా సిగరెట్ అయినా పాత సీసాలో వేస్తే కొత్తగా అన్పిస్తాయని కావొచ్చు ఇలాటి పనికి తెగబడ్డారు. మూస ఫార్ములా టెంప్లెట్ చట్రం, దాంట్లో ఫ్యామిలీల కోసమని ఫ్యామిలీ కథ- (ఎంతాశ, ధూమ పానం మూవీని  కూడా ఫ్యామిలీలకి చూపించాలని) – ఈ ఫ్యామిలీ కథ ఫస్టాఫ్ తో పరిసమాప్తమై, సెకండాఫ్ వేరే స్మోకింగ్ కథగా మారడం చూస్తే – ఫస్టాఫ్ ఫ్యామిలీలు చూసి వెళ్లి పోవచ్చు, అప్పుడు సెకండాఫ్ పొగనంతా స్మోకర్లు భరించగలరు. ఇకపైన మంచి సిగరెట్లు తాగాలని చూసి నేర్చుకోవచ్చు. మంచి సిగరెట్లని అలవాటు చేసిన మంచి సినిమాగా మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుకోవచ్చు.

      Ps :టెర్రర్ శిబిరం మీద విజయవంతమైన దాడి తర్వాత మేజర్ అయిన హీరో, సహచరులు, ఆనందంగా ఒక పాత హిందీ పాట పల్లవి నందుకుంటారు – ‘హకీఖత్’ లోని – ‘కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియోఁ.... అని. ఇది విజయోత్సవ గీత మనుకున్నట్టంది. యుద్ధంలో అమరులైన జవాన్లని చూపిస్తూ వచ్చే విషాద  నేపధ్య గీతమిది. దీనర్ధం : నేస్తాల్లారా మన జీవితాలనీ శరీరాలనీ అర్పణ చేసి వెళ్లి పోతున్నామని...  ఇలా అర్ధం తెలుసుకోకుండా పాట పెట్టేస్తే,  ఇప్పుడిదేమిటని అర్ధం గాక భేజా ఫ్రై అవడమే మన పని!


-సికిందర్ 

13, డిసెంబర్ 2020, ఆదివారం

 

ఛోటా కె. నాయుడు 

సాంకేతిక ఔన్నత్యం ఆత్మిక దాహాన్ని కూడా తీర్చగలిగే సాధనమైనప్పుడు, ఒక ‘అవతార్’ లా, ఇంకో ‘రోబో’ లా కాసుల కుంభవృష్టి కూడా కురుస్తుంది. పౌరాణిక ఛాయలున్న సమకాలీన పాత్రలే ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చగల్గుతాయని ఎప్పుడో రుజువైంది. ఇలా ఆత్మిక దాహాన్ని తీర్చిన నాటి ‘మేజర్ చంద్రకాంత్’,  ‘కొండవీటి సింహం’ లాంటివి ఇప్పుడు తీస్తే, ఇంకింత భారీస్థాయిలో అత్యాధునిక సాంకేతిక హంగులన్నీ కలుపుకుని అదరగొట్టేట్టు వుండాలని నవతరపు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

          దీన్ని కరెక్టుగా గుర్తించారు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు. ఏ వెండితెర మీద దృశ్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందో, అదింకా కాస్సేపుంటే బావుండన్పిస్తుందో, ఆ దృశ్యంలోని ప్రతీ అంశం తేటగా కళకళ లాడుతూ వుంటుందో, ఆ దృశ్యకారుడి పేరే  ఛోటా కె. నాయుడు. ఆయన చేతిలో కెమెరా ఓ మంత్ర దండం లాంటిది. ఈ రంగుల మంత్రదండపు మాయాజల్లులో తడిసి తరించని సూపర్ స్టార్ లేరు.  ఆ స్టార్స్ కి దాసోహం కాని ప్రేక్షకులూ లేరు...  ‘అడ్వాన్స్ అయిపోయారు ప్రేక్షకులు!’ అని కామెంట్ చేశారాయన. ‘ ప్రేక్షకుల కోసం ఇప్పుడింకెలా తీస్తే సక్సెస్ అవుతామో సరిగ్గా ఊహించి, రిస్కు చేసి, ఒక ‘అవతార్’ నీ, ఇంకో ‘రోబో’నీ తీశారు ప్రసిద్ధ దర్శకులు జేమ్స్ కామెరూన్, ఎన్. శంకర్ లు. డిస్కవరీ ఛానెళ్ళల్లో, ఇతర మీడియాల్లో ఎన్నోఆశ్చర్య గొలిపే ప్రోగ్రాముల్ని చూస్తున్న ప్రేక్షకులు,  సినిమాల్లోనూ ఆ స్థాయి దృశ్య వైభవాల్నే  కోరుకుంటున్నారు..’ అన్నారాయన.


     సినిమా అనేది ఎంత హైటెక్ హంగుల్ని కలుపుకున్నప్పటికీ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకూదదన్నారు. లేటెస్ట్ ‘బృందావనం’  సక్సెస్ ని మనసారా ఎంజాయ్ చేస్తున్న ఛోటా, ఆ సినిమాలో బ్రహ్మానందం దగ్గర్నుంచీ తారాగణమంతా తమని ఎంతో అందంగా ఛోటా గారు చూపించారని కురిపిస్తున్న ప్రశంసలకి స్పందిస్తూ- ‘అందంగా చూపించక పోతే ఇక నేనెందుకు? కెమెరామాన్ గా అది నా డ్యూటీ. అలా అందంగా చూపించడంతో బాటు, దర్శకులు ఏం కోరుకుంటున్నారో ఆ సన్నివేశ ఫీల్ ని రాబడుతూ పిక్చరైజ్ చేస్తాను’ అన్నారు.


             ఫీల్డులో అత్యధిక పారితోషికం పొందుతున్న ఛాయాగ్రాహకుడెవరైనా వుంటే అది తనే. ఐతే కెమెరామాన్ వేగంగా పనిచేయలేకపోతే నిమిష నిమిషానికీ నిర్మాత డబ్బు కోల్పోవాల్సి వస్తుందన్నారు. 


           ఇప్పుడు సినిమాలు ముడి ఫిలిం నుంచి డిజిటల్ కి మారుతున్న సంధి కాలంలో వున్నాయి. దీన్ని తాను తప్పక ఆహ్వానిస్తానన్నారు. కొంత సమయం తీసుకుని  చిన్న బడ్జెట్ లో డిజిటల్ సినిమా తీస్తానన్నారు. శబ్దాని కెప్పుడో డీటీఎస్ తో డిజిటలీకరణ జరిగిపోయింది, కెమెరాకీ డిజిటల్ తో అలాటి అవసరం లాగా, డిజిటల్ ఇంటర్మీడియేట్ ( డీఐ) ప్రక్రియ వచ్చిందన్నారు. ఈ డీఐ తో కూడా వెండి తెర మీద తనదైన ముద్ర ఏమాత్రం దెబ్బతినకుండా, దగ్గరుండి కలర్, లైటింగ్ కరెక్షన్స్ చేయించు కుంటానన్నారు. ఇక డెప్త్ విషయానికొస్తే, దాన్ని కాపాడే కలరిస్టులు మనకున్నారన్నారు. పోతే, మామూలు దృశ్యాల్ని కెమెరాతో చూస్తామనీ, గ్రాఫిక్స్ కయితే మనోనేత్రంతో చూడాల్సి వస్తుందనీ, గ్రాఫిక్స్ మెదడుకి మేత లాంటిదనీ  చమత్కరించారు.


         మరి కెమెరామానే దర్శకుడైతే అన్న ప్రశ్నకి, అప్పుడు తొంభై శాతం ఫెయిల్యూరే అన్నారు. అదెలా? ‘స్వార్ధం! సహజంగా కెమెరా మాన్ కుండే స్వార్ధం కొద్దీ సరౌండింగ్స్ అందంగా రావాలని దాని మీదే దృష్టి పెడతాడు. దర్శకుడైతే మొదటి నుంచీ స్క్రిప్టు మీద అవగాహనతో ఉంటాడు. సినిమా మూడ్, ఫీల్, ఫ్లో ల మీద అతడికి మంచి పట్టు వుంటుంది. కానీ నిత్యం పిక్చరైజేషన్ తోనే తలమునకలయ్యే కెమెరామాన్ ఆ మూడ్, ఫీల్, ఫ్లోలని కూడా పరిగణనలోకి తీసుకోవడంలో కొంత వెనుక బడతాడు. దీనివల్ల తను దర్శకుడిగా రాణించే లేక పోవచ్చు ‘ – అని వివరించారు.



             శ్యాం కె. నాయుడు తో బాటు, మరో ఐదారుగురు తన శిష్యుల్ని కెమెరామాన్లుగా తయారుచేసిన ఛోటా, 1991 లో ‘అమ్మ రాజీనామా’ తో డాక్టర్ దాసరి నారాయణ రావు స్కూల్  నుంచి సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ముందు విడుదలైన సినిమా ఇదే అయినా, పని చేయడం మొదలెట్టింది అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలోని ‘రగులుతున్న భారతం’ కి. ఇప్పటికి ఆయన చేసిన సినిమాల సంఖ్య 56 కి చేరింది. ప్రస్తుతం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ‘ప్రేమ కావాలి’ కి పని చేస్తున్నారు. ‘భారీ సినిమాల మెగా బడ్జెట్లతో, టెక్నాలజీలతో పని చేసిన అనుభవమున్న మీరు, ఒక సాధారణ  ప్రేమ సినిమాకి ఎలా న్యాయం చేయగలరు? ఇది కూడా అంతేసి బడ్జెట్ భారంతో పాటు టెక్నాలజీ హంగామా కూడా మోయాల్సిందేనా?’ అన్న మరో ప్రశ్నకి, అదేం కాదన్నారు. దీని బడ్జెట్ నీ, పనిదినాలనీ దృష్టిలో పెట్టుకుని, క్వాలిటీతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రీ కరిస్తున్నానన్నారు. రామానాయుడు స్టూడియోలో ‘ప్రేమ కావాలి’ లోని ఓ పాటని చిత్రీకరిస్తూ గ్యాప్ లో ఈ కబుర్లన్నీ చెప్పిన ఛోటా, ఈ సినిమాకి రెగ్యులర్ 435 కెమెరానే వాడుతున్నానన్నారు. అయితే మాస్టర్ ప్రైమ్ లెన్స్ తో షూట్ చేస్తున్నానన్నారు. ఈ లెన్స్ ప్రత్యేకత  మండుటెండల్లో షూట్ చేసినా కూడా దృశ్యాన్ని చెక్కుచెదర నివ్వదన్నారు ఛోటా కె. నాయుడు.



 సికిందర్ 

నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’