రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జనవరి 2020, బుధవారం

906 : కొత్త డైరెక్టర్ కహానీ


        రోజుల్లో యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా అంటే గిటారే కావాలంటారు. యూతే కాదు, అన్న ప్రాసన రోజున బుజ్జి బాబు ముందు వీణ ఒక పక్క, గిటార్ ఇంకో పక్కన పెడితే వాడు చిన్ని చేతులతో గిటార్నే యూత్ అప్పీల్ తో వదలకుండా పట్టుకునే రోజులివి. కానీ కొందరు కొత్తగా వచ్చే దర్శకులు కాలం మారలేదని, అస్సలు మారబోదని భీష్మించుకుని,  ఇంకా వీణే వాయిస్తూ తదాత్మ్యం చెందుతున్నారు. చుట్టూ యువప్రేక్షకులు యూతో రామచంద్రా అని అలమటించడాల మంటలు రేపుతున్నా ఫిడేలు కూడా వాయిస్తూ కూర్చుంటున్నారు. వీణ సినిమాలు పోయి గిటార్ సినిమా లొచ్చినట్టు ఆ మార్కెట్టే తెలియడం లేదు. వీణ సినిమాలంటే ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలనీ, గిటార్ సినిమాలంటే హుషారెక్కించే రోమాంటిక్ కామెడీలనీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ బ్లాగులో చెప్పుకుంటూనే వున్నాం. కానీ నిర్మాత దిల్ రాజుకి కూడా వీణ ప్రేమలకే ప్రియమైన మార్కెట్ వుందని గట్టి నమ్మకం. యంగ్ హీరో రాజ్ తరుణ్ కి ‘వీణ లోనా గిటారు లోనా ఎక్కడున్నది నాదము’ అని ఇంకా అయోమయం. ఇక కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణకైతే, టర్కిష్ డ్రామాలోనే యూత్ కి కావాల్సిన దమ్మారో దమ్ అంతా వుందని ప్రబల విశ్వాసం. 

        టర్కీ రోమాంటిక్ డ్రామా - ‘ఆస్క్ టెసా ఫ్లీరీ సెవెర్’ (ఇంగ్లీషు టైటిల్ : లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్) ట్రాజడీ కూడా! ఇందులో చూపించిన కథాకాలం 1977 నుంచి పాతికేళ్ళు అంటే 2002 వరకూ. 1977 లో పుట్టిన హీరోహీరోయిన్లు, పాతికేళ్ళ తర్వాత 2002 లో కలుసుకున్నప్పటి కథ అన్నమాట. దీన్ని నిర్మించి విడుదల చేసింది 2011 లో. పదేళ్ళ తర్వాత తెలుగులో రీమేక్ చేశారు. రీమేక్ నే కాదు, కొత్తగా వస్తున్న డైరెక్టర్ ట్రాజడీని కూడా పక్కనబెట్టాలన్ననీతి కూడా ఇందులో వుంది. ఐతే తెలుగులో ఈ కథాకాలం 1993 నుంచీ డిజిటల్ యుగంలో వుంది. ఒరిజినల్ కథాకాలం ఇంకా డిజిటల్ కాని ఎనలాగ్ యుగంలో వుంది, 2002 లో సెల్ ఫోన్లు మినహాయించి. రిమేక్ కథాకాలంలో ఒరిజినల్లో వున్న ఒక మిస్టీరియస్ క్రియేషన్ ని మిస్ చేసుకుని చిత్రీకరణ తేలిపోయేలా చేసుకున్నారు. ఇదేమిటో తర్వాత చూద్దాం. 


          ఈ ట్రాజడీ రీమేకులో పాయింటునే తీసుకుని కథనాన్ని మార్చినా తెలుగులో న్యాయం చేయగలమా అంటే పాయింటే ముగింపుని ట్రాజడీ చేసే పాయింటు అయింది. ఇటీవల హీరోయిన్ లేకపోయినా, వున్నా ప్రేమ లేకపోయినా రెండు మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి గనుక ట్రాజడీని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనుకోవడానికి ఆ సక్సెస్ అయిన సినిమాలు ప్రేమ సినిమాలు కావు, సస్పెన్స్ థ్రిల్లర్స్. 

        ఈ టర్కీ ట్రాజడీని హక్కులు కొని అధికారికంగా రీమేక్ చేయడానికి ఈ కథలో ముగింపుతో బాటు, కథనంలో కోయిన్సిడెన్సులు ఆకర్షించి వుండాలి. టైటిల్ కూడా ‘లవ్ లైక్స్ కోయిన్సిడెన్సెస్’ అంటూ ప్రమాదాలంటే ప్రేమకి రొంబ ఇష్టమన్నట్టు ఆకర్షించడానికి బలిష్టంగా వుంది. కానీ ముగింపులో వచ్చే కోయిన్సిడెన్సుని కన్విన్స్ చేయడానికే మొదట్నుంచీ కోయిన్సిడెన్సు లతో ప్రేమికులకి యాక్సిడెంట్లు చేయించారని ఒరిజినల్లో కథకుడి ఆంతర్యాన్ని గ్రహించి వుంటే, ఈ రీమేక్ కి బాక్సాఫీసు దగ్గర జరిగే యాక్సిడెంట్ ని నివారించే వాళ్లేమో. ఈ కోయిన్సిడెన్సుల్ని ప్రేమకే ఆపాదిస్తూ టైటిల్ గా పెట్టుకున్నాడు టర్కీ దర్శకుడు. కానీ ఇది రైటర్ కథా సౌలభ్యం కోసం పాల్పడ్డ ‘రైటర్స్ కన్వీనియెన్స్’ అవుతుంది. స్క్రీన్ ప్లే ట్యూటర్ స్కాట్ మేయర్స్ ప్రకారం, కథలో మొదటి సంఘటన కోయిన్సిడెన్సు (విధి) అని సరిపెట్టుకోవచ్చు ప్రేక్షకులు. అలాటిదే రెండో సంఘటనని కోయిన్సిడెన్సుగా సరి పెట్టుకోలేరు ప్రేక్షకులు- కథా సౌలభ్యం కోసం ‘రైటర్స్ కన్వీనియెన్స్’  అనుకుంటారు. మూడోసారి కూడా ఇదే జరిగితే ఇక చెప్పక్కర్లేదు – ప్రమాదాలతో మాటిమాటికీ విధి అంటే చిరాకేస్తుంది. కథనాన్ని విధి మీదికి నేట్టేసే ఈజీ సొల్యూషన్ గా కథ నడపడం రైటర్ కి క్షంతవ్యం కాదంటాడు సిడ్ ఫీల్డ్ కూడా. 

        ఈ టర్కీ ట్రాజడీని దర్శకుడు మూడు కాకుండా, రెండు ప్రమాదాలతో, అదీ ఒకేసారి జరిగేలా -  ‘రోమాంటిక్ సస్పెన్స్’ గా తీసి వుండాల్సింది. ఇది టాలీవుడ్ కి అత్యవసరం. ఎందుకంటే, కథా కథనాల్లో ఏ మాత్రం లోటుపాట్లు ఆలోచించకుండా, కనపడింది కనపడినట్టు రీమేక్ చేసేసే వాళ్ళున్నారు గనుక. వాళ్ళకి కన్వీనియెంట్ గా వుండేందుకు అత్యవసరమే. మరి రెండు ప్రమాదాలు రైటర్స్ కన్వీనియెన్సే కదా, ఎలా? అదెలాగో ‘కాసాబ్లాంకా’ ఉదాహరణగా స్కాట్ మేయర్సే చెప్పాడు. దీని వివరాల్లోకి వ్యాసం ముగింపులో వెళ్దాం. ముందు క్లుప్తంగా కథ చెప్పుకుందాం...

కథ
        1993 లో రెండు కార్లు గుద్దుకుని వాటిలో వున్న ఇద్దరు గర్భిణులు ఒకే ఆస్పత్రిలో ఇద్దర్నికంటారు. పాతికేళ్ళు గడిచిపోతాయి. మహి (రాజ్ తరుణ్) ఫోటోగ్రాఫర్ గా కృషి  చేస్తూంటాడు. వర్ష (పాండే) సినిమా హీరోయిన్ నవ్వాలని ప్రయత్నాలు చేస్తూంటుంది. మహి ఏర్పాటు చేసిన ఓ ఫోటో ఎగ్జిబిషన్ లో ఆమె తన చిన్నప్పటి ఫోటో చూసుకుని మహిని అడుగుతుంది. ఫోటో గ్రాఫరైన తన తండ్రి తీసిన ఫోటో అదని, అప్పట్లో ఊటీలో వుండే వాళ్ళమని చెప్తాడు. ఆ ఫోటోలో వున్నది తానేనని ఆమె చెప్పేసరికి ఆశ్చర్యపోతాడు. అలా చిన్నప్పుడు విడిపోయిన ఇద్దరూ ఒకటై మీటవుతూంటారు. చిన్నప్పుడు పరస్పరం సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడామెకి  రాహుల్ అనే బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఇటు మహికి చిన్నప్పట్నుంచీ గుండె సంబంధమైన సమస్య వుంటుంది. ఆమెకి ఫోటో షూట్ లు చేస్తూ సినిమాకి ఎంపికయ్యేందుకు తోడ్పడతాడు. ఆమె ఊటీ బయల్దేరుతుంది. అతను డాక్టర్ చికిత్సకి రమ్మన్నా వినకుండా ఊటీ వెళ్ళిపోతాడు. ఊటీలో ఆమె అతడితో ప్రేమలో పడుతుంది. అతను ప్రేమించలేక పోతాడు. ఒక రోజు జబ్బు ముదిరి పడిపోతాడు. హాస్పిటల్లో మృత్యు ముఖంలో వుంటాడు. ఇది తెలుసుకుని ఆమె వస్తూ యాక్సిడెంట్ కి గురై బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె గుండె అతడికి మార్చి అతణ్ణి బ్రతికిస్తారు డాక్టర్లు. ఆమె లేకపోయినా ఆమె తనలోనే వుందనీ, ఇద్దరి లోకం ఒకటేననీ ముగుస్తుంది సినిమా. 


జబ్బుకి రియాలిస్టిక్ ఫిక్షన్?

        నిన్ను నేను వెతుక్కుంటున్నప్పుడు నన్ను నేను కోల్పోతాను
        నేను నిన్ను కనుగొన్నప్పుడు నాలోంచి నేను తొలగిపోతాను
        ఈ వీడ్కోలు ఒక వింత - నువ్వే నాలో వున్నప్పుడు
        నేనెంత దూరం వెళ్ళినా నాతోనే కదా నువ్వుంటావు...

        ఇలా కవితాత్మకంగా ముగిస్తాడు టర్కీ దర్శకుడు. కథ అర్ధవంతంగా ముగిస్తే కవిత్వం కదిలించ వచ్చు. రెండు పాసివ్ పాత్రల్ని(ట్రాజడీలలో పాసివ్ పాత్రలే వుంటాయి, ఇవి కమర్షియల్ ఉపయోగాలకి సుదూరంగా ఎక్కడో... వుంటాయి) కథకుడే నడిపిస్తే అతడి బుద్ధి కొద్దీ ముగింపు వుంటుంది. ఆ కవిత్వాలు కథ లోంచి, పాత్రల్లోంచి ప్రవహించక తన బుద్ధికి తనే కీర్తి గానాలు చేస్తున్నట్టు వుంటుంది. దీంతో కదిలించే మాటలా వుంచి వికటిస్తుంది.

        జబ్బు ట్రాజడీలు జబ్బులంత పాతవి. క్యాన్సర్ జబ్బులు, గుండె జబ్బులు, ఇవి పాతబడి నోరు తిరగని సైంటిఫిక్ పేర్ల జబ్బులూ, ఇవన్నీ ప్రేమ కథలకి ఒకప్పుడు సక్సెస్ ఫార్ములాలు. ఇప్పుడు కాదు. అయినా ఇప్పటి గ్లోబల్ యూత్ గా కదం తొక్కుతున్న యువ ప్రేక్షకుల కోసం తీయాలంటే చాలా రిస్కు వుంటుంది. చాలా క్రియేటివ్ పవర్స్ కూడా అవసరం. అమెరికన్ సాహిత్యంలో యువ పాఠకుల కోసం ఇప్పుడొస్తున్నవి అవే రొటీన్ ప్రేమ నవలలు కాదు. రియాలిస్టిక్ ఫిక్షన్ అనే కొత్త జానర్ నవలలు. ఈ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ నవలగా వచ్చి సంచలనం సృష్టించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ గురించి తెలిసే వుంటుంది. దీన్ని హాలీవుడ్ మూవీగా తీస్తే చాలా పెద్ద హిట్టయింది. దీన్నే హిందీలో ‘దిల్ బేచారా’ గా తీస్తున్నారు. వచ్చే మే లో విడుదలవుతుంది. ఇది ఇద్దరు టీనేజర్ల ప్రేమ కథ. ఆమెకి థైరాయిడ్ క్యాన్సర్, అతడికి లెగ్ క్యాన్సర్. దీని మార్కెట్ - క్రియేటివ్ యాస్పెక్ట్స్ ఏమిటి? హాస్య రసం, వినోదం, యూత్ లాంగ్వేజ్, బలమైన పాత్రలు, క్యాన్సర్ కి, ప్రేమకి యువ దృష్టితో కొత్త భాష్యం! 

        ఈ లక్షణాలు తెలుగు రీమేక్ కి వున్నాయా? లేవు. రాజ్ తరుణ్ గుండె జబ్బు పాత్ర ఫస్టాఫ్ నుంచీ విషాదమే. టర్కీ దర్శకుణ్ణి ఇప్పటి తెలుగుకి అక్షరాలా ఫాలో అయిపోయారు. యూరప్ భూభాగంతో తో కలిసి వుండే టర్కీ దేశపు సినిమాలు నిజానికి వరల్డ్ మూవీస్ వర్గానికి చెందుతాయి. వరల్డ్ మూవీస్ అంటేనే ఆర్ట్ మూవీస్. వాటి జోలికి పోయి రీమేక్స్ చేయకూడదని చాలా సార్లు చెప్పుకున్నాం. అవి కమర్షియల్ సినిమాల కథలుగా వుండవు, మనకి కమర్షియల్ ప్రదర్శనలకి పనికి రాని, స్ట్రక్చర్ లేని  ‘గాథ’ లుగా వుంటాయని పదేపదే చెప్పుకున్నాం. అయినా వాటిని రీమేకులు చేసి చేతులు కాల్చుకుంటున్నారంటే ఏమనాలి. వరల్డ్ మూవీస్ కమర్షియల్ సినిమాలే ఐతే హాలీవుడ్ సినిమాల్లాగా మనదేశంలో ఎందుకు విడుదల కావడం లేదు? ఈ సింపుల్ లాజిక్ ని అర్ధం జేసుకుంటే చాలు. వరల్డ్ మూవీస్ యూరో మూవీస్, హాలీవుడ్ మూవీస్ డాలర్ మూవీస్. యూరోలు కావాలా, డాలర్లు కావాలా? కాబటి హాలీవుడ్ మూవీల మీద చేయేస్తే మేలు. 

నాల్గు మైనస్ లు 
       కాబట్టి యూరో నుంచి తెలుగు రూపాయల్లోకి రీమేక్ చేసిన ఈ గుండె జబ్బు సినిమా 1. పాసివ్ పాత్రలతో, 2. స్ట్రక్చర్ లేని, 3. గాథ; పైగా 4. ట్రాజడీ. థియేటర్లో ఆడాలనుకునే ఒక తెలుగు సినిమా మీద ఇన్ని రకాల దౌర్జన్యాలా? ఈ నాల్గూ సినిమా విజయాన్ని అడ్డుకుంటూ తిష్ట వేసిన దుష్ట చతుష్టయం. సినిమాలకి సంబంధించినంత వరకూ గాథలనేవి మేడి పండులు, వాటి పొట్ట విప్పి చూస్తే పురుగులుండు. ఇలా ఈ రీమేకులో వొరిజినల్లో లాగా, ఫస్టాఫ్ లోనే గుండె జబ్బు విషయం ఓపెన్ చేయడం వల్ల సాంతం విషాదభరితమై పోయింది. రాజ్ తరుణ్ యువ పాత్రకి యూత్ అప్పీల్ లేక నీరసంగా, భారంగా వుండిపోతాడు. తను ఈ సినిమాని నిలబెట్టాల్సిన కథానాయకుడనే విషయమే మర్చిపోతాడు. 


       
        ఒరిజినల్లో ఒక క్రాఫ్ట్ ని ఒప్పుకోవచ్చు : హీరో హీరోయిన్ల చిన్నప్పటి మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల క్రాఫ్ట్. ఈ ఫ్లాష్ బ్యాకులు బాల్యంలా చాలా ఇన్నోసెన్స్ తో వుంటాయి. తెలుగులో ఈ ఫీల్ ని పట్టుకోలేకపోయారు. పైగా బాల్యపు సీన్లని పొడిగించారు. బాల హీరోయిన్ తాతతో రిహార్సల్ చేసే సీను లాంటివి. హద్దులు దాటి ఇదేమీ వర్కౌట్ కాలేదు, పైగా ఇన్నోసెన్స్ కి హానిచేశాయి. డబ్బింగ్ లో ఈ డైలాగులు ఒరిజినల్లో లాగా మంద్రస్థాయిలో లేకుండా గోలగా వున్నాయి - ఈ ఫ్లాష్ బ్యాకులు లేకపోతేనే బావుండేదన్పించేలా. ఒరిజినల్లో వున్న బ్యూటీ ఎలాంటిదంటే, బాల్యపు ఫ్లాష్ బ్యాక్ వస్తోందంటేనే ఆసక్తిగా చూసేలా చేస్తాయి. బాలల  సినిమాలు పెద్దల సినిమాల్లా వుండవు కదా, అలాగే బాలల ఫ్లాష్ బ్యాకులు మిగతా సినిమాలా కలిపేసి వుండకూడదు. 

        ఒరిజినల్లో కనీసం ఫస్టాఫ్ కథనంలో ఆసక్తి వుంది. మొదటి ఇరవై నిమిషాల కథనం ఒక ఎజెండాతో సీక్వెన్స్ గా వుంటుంది. ప్రారంభంలో కారు ప్రమాదాలు జరిగి హీరోహీరోయిన్లు పుట్టాక, వెంటనే టైటిల్స్ డార్క్ రూమ్ లో నెగెటివ్ లు డెవలప్ చేస్తున్న దృశ్యాలు ప్రారంభమవుతాయి. ఇక్కడే పైన ప్రస్తావించిన మిస్టీరియస్ క్రియేషన్ వస్తుంది. టైటిల్స్ పూర్తయ్యేవరకూ డార్క్ రూమ్ లో నెగెటివ్ (ఫోటోల) డెవలప్ మెంట్ ప్రక్రియలే. ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడెందుకు డెవలప్ చేస్తున్నారనే మిస్టరీ. ఈ మిస్టరీతోనే టైటిల్స్ పూర్తయి హీరోయిన్ తెరపైకొస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్నవస్తుంది. నెగెటివ్ డెవలప్ మెంట్స్ కి ఈమెతో సంబంధముందా, ఎలా? సంబంధం లేదనిపిస్తుంది. ఇంతలో హీరో తెరపై కొస్తాడు ఫోటోగ్రాఫర్ గా. ఇప్పుడు గానీ మిస్టరీ వీడిపోదు. ఇతను డిజిటల్ ఫోటోగ్రఫీ లేని ఫిల్ముల కాలంలో 1977 లో పుట్టాడు, పెరిగాడు, ప్రస్తుతకాలం 2002 లో ఫోటోగ్రాఫర్ గా ఫిల్ము లే వాడుతున్నాడు. ఎందుకంటే అప్పటికింకా డిజిటల్ కెమెరాలు రాలేదు. ఇదీ టైటిల్స్ లో కూడా కథ చెబుతూ అతణ్ణి ఫోటోగ్రాఫర్ గా ఎస్టాబ్లిష్ చేసిన విధం.   

          ఇంత మంచి కథ చెప్పే క్రియేటివిటీ తెలుగులో లేదు. ఇక్కడ హీరో 1993 లో పుట్టి పెరిగాడు గనుక డిజిటల్ ఫోటోగ్రఫీతోనే అతడి ఫోటోగ్రఫీ ప్రారంభమవుతుంది. అందువల్ల క్యారక్టర్ నేరుగా కన్పించిపోతాడు. టైటిల్స్ తో సంబంధంలేదు. ఒరిజినల్లో టైటిల్స్ తర్వాత  హీరో హీరోయిన్ల పారలల్ క్యారక్టర్ డెవలప్ మెంట్ చూపిస్తారు. చిన్న చిన్న సీన్లుగా, ఒక సీను హీరోతో - ఇంకో సీను హీరోయిన్ తో - పేకముక్కల్లా పేర్చుకుంటూ పోతాడు క్రియేటివ్ టర్కీ దర్శకుడు. ఇదంతా ఒక సీక్వెన్సుగా ఒక ఎజెండాతో వుంటుంది. ఆ ఎజెండా ఏమిటంటే, ఈ విడివిడి హీరో హీరోయిన్లు ఒకచోట ఎప్పుడు ఎక్కడ క్లాష్ అయి, ఫేస్ టు ఫేస్ అవుతారనే ఆసక్తిని ప్రేక్షకులకి జనింప జేసేలా చేయడం. నిజంగా ఈ పేకముక్కల పేర్పు ఉత్సుకతని  రేకెత్తిస్తుంది. ఈ ఉత్సుకత రేకెత్తాలంటే సీన్లు చప్పున ముగిసిపోతూ వేగంగా సాగిపోతూ వుండాలి. వేగం- సైజు ఈ రెండూ ఈ క్రాఫ్ట్ లో కీలకం. వేగం తగ్గినా, సీన్ల సైజు పెరిగినా పైన చెప్పుకున్న ఉత్సుకత వుండదు వీళ్ళెలా కలుస్తారనే దాని గురించి. ఎజెండా వీగిపోతుంది. 

        ఈ బిట్ సీన్స్ లో పరస్పరం వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ వుంటుంది. ఫోటోగ్రాఫర్ గా అతను ఒక మ్యాగజైన్ తో డీల్ కుదుర్చుకుంటున్న డెవలప్ మెంట్, సినిమా యాక్టర్ గా ఆమె ఆడిషన్స్ వగైరా హాజరవుతున్న క్రమం. మధ్యమధ్యలో పరస్పరం పేరెంట్స్ ని కూడా చూపిస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న దృశ్యాలు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఒక బిట్. అసలు హీరో హీరోయిన్లు కలుసుకునే పాయింటాఫ్ ఎటాక్ సీను ఎప్పుడొస్తుందాని చూస్తూంటే, ఏడో నిమిషంలో ఆమె బాయ్ ఫ్రెండ్ తో యాంటీ సీనుతో ఒక కుదుపు. పన్నెండో నిమిషంలో ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర ఆమె తన ఫోటో చూసుకునే మలుపు. పన్నెండో నిమిషంలో రానేవస్తుంది పాయింటాఫ్ ఎటాక్ సీను - హీరోతో మిలాఖత్.

        ఇలా ఈ పన్నెండు నిమిషాల్లో హీరో హీరోయిన్లని, ఇతర పాత్రల్నీచక చకా పరిచయం చేసేశారు. తెలుగులో ఈ ఎజెండాని అర్ధం జేసుకోనట్టుంది. హీరోతో ఒక సీను, హీరోయిన్ తో ఇంకో సీనూ బారెడు సీన్లు గా, నిదానంగా వేసుకుంటూ పోయేసరికి అర్ధం లేకుండా పోయింది. ఇంటర్ కట్స్ లో సీన్లంటనే సముచిత వేగంతో వాటిని  రెంటినీ కలిపి ఒక పతాక సన్నివేశానికి చేర్చడం. ఇది జరగనప్పుడు ఇంటర్ కట్స్ కి అర్ధమే లేకుండా పోతుంది. కథనం మీద ఆసక్తి కూడా పోతుంది. 

చేజార్చుకున్న తురుపు ముక్కలు 

       ఒరిజినల్లోనే కథలో గానీ, పాత్రలో గానీ సస్పెన్స్ అనేదే లేకుండా అంతా విప్పి చూపిస్తూ వెళ్ళిపోయారు. దర్శకుడు గుప్పెట్లో ఏదీ వుంచుకోలేదు తురుపు ముక్కల్లా  ప్రయోగించడానికి. ఫస్టాఫ్ లో పైన చెప్పుకున్న సీక్వెన్స్ తర్వాత, ఇంకేమీ లేదు కథగా చెప్పుకోవడానికి. ఎప్పుడైతే హీరోకి గుండె సమస్య అని ఫస్టాఫ్ లోనే చెప్పేశారో, ఇక సినిమా వినోదాత్మక విలువ నాశనమైంది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఇలాటిది వినోదానికి భంగం కలక్కుండా సమయం చూసి రివీల్ చేస్తారు. కానీ ప్రస్తుత ట్రాజడీ వరల్డ్ మూవీ కథ కాబట్టి స్ట్రక్చర్ వుండదు. ఏది ఎప్పుడెలా తోస్తే అప్పుడలా ప్రేక్షకుల మీద పారేస్తూ పోవడమే. ఇలా వీడికి గుండె ప్రాబ్లమని ఫస్టాఫ్ లోనే చెప్పేసి తాంబూలా లిచ్చేశాం, ఇక తన్నుకు చావండని చెప్పేయడమే. ఇక ఈ సినిమా చూడలేక గిలగిల తన్నుకోవడమే. 

        రాజ్ తరుణ్ తో ఒక రకమైన యాతన కాదు ఈ సినిమా చూడాలంటే. సినిమా సాంతం శాడ్ మూడే. కొత్త మీసాల యూత్ కత్తి ఎలా భరిస్తాడు వంగిపోయిన రాజ్ తరుణ్ ని? ఆగదూ ఆగదూ ఆగితే సాగదని అప్పుడే వంగి పోవడాలా గుండె పట్టుకుని? ఇదిలా వుంటే, ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో కన్పించవు. గాథ కాబట్టి. ముగింపులో చివరి యాక్సిడెంట్ దాకా ఒకే బిగినింగ్. మిడిల్ లేదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. బిగినింగ్ తర్వాత ఎండ్ వచ్చేస్తుంది మధ్యలో మిడిల్ రాదు. క్యారక్టర్ కి గోల్ లేదు, సంఘర్షణా లేదు. ఇది గాథల లక్షణమే. కథైతే రెండు ప్లాట్ పాయింట్స్, మొదటి ప్లాట్ పాయింట్ దగ్గర గోల్, ఆ తర్వాత సంఘర్షణతో మిడిల్, రెండో ప్లాట్ పాయింట్ దగ్గర పరిష్కారమూ, తర్వాత ముగింపుతో ఒక స్ట్రక్చర్ గా వుంటాయి. కథని నాల్గు డబ్బులొచ్చే సినిమాగా నిలబెడతాయి. ఇలా చెప్పడం కొత్త డైరెక్టర్ ని చిన్నబుచ్చడానికి కాదు, వరల్డ్ మూవీస్ బండారం విప్పడానికే. ఇంకా దర్శకులు ఇది గమనించకుండా వరల్డ్ మూవీసే రీమేక్ చేస్తే, కాపీలు చేస్తే వాళ్ళిష్టం. 

        గుండె జబ్బని మొదటే ఎందుకు చెప్పడం? చివర్లో చెప్పొచ్చుగా? గుండె జబ్బుని దాచుకుని  హీరో పైకి నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చుగా? ‘మిలి’ లో ఆడుతూ పాడుతూ వుండే జయబాధురి పాత్ర నిజానికి క్యాన్సర్ బాధితురాలని చివర్లో షాకిస్తుంది గా? ఈలోగా చక్కబెట్టాల్సిన జీవితాల్ని చక్కబెట్టేస్తుందిగా? బాధని దాచుకుని సకార్యాలు చేసేపాత్ర కథానాయక / నాయిక పాత్రవుతుంది. ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ లో హీరో హీరోయిన్ల క్యాన్సర్ పాత్రలేమిటి? 

        గుండె జబ్బుని తురుపు ముక్కగా వాడుకుని వుంటే, అదే సమయంలో కోయిన్సిడెన్సుల యాక్సిడెంటుల్ని ఇంకో తురుపు ముక్కగా ముగింపులోనే ప్రయోగించి వుంటే, కనీస భద్రత వుండేది ఈ రీమేక్ కి. ఇంకోటేమిటంటే, తెలుగులో ఫస్టాఫ్ లోనే హీరోయిన్ పాత్ర సినిమా హీరోయిన్ అయిపోయినట్టు చూపించే పొరపాటు చేశారు. ఈ విషయంలో రీమేక్ నయం. అందులో క్లయిమాక్స్ లోనే ఆమె స్టేజి నటి అవుతుంది. స్టేజి మీద నటిస్తూండగా హీరో హాస్పిటల్లో వున్నాడని వార్త వస్తుంది. హుటాహుటీన బయల్దేరుతూ యాక్సిడెంట్ పాలవుతుంది. ఇంతలోనే నటి అయి, ఇంతలోనే చనిపోవడం ఎంత బాధాకర అనుభవంగా వుంటుంది ప్రేక్షకులకి. ఇదే తెలుగులో చూపించినట్టు, ఎప్పుడో ఫస్టాఫ్ లో సినిమా హీరోయిన్ అయిన హీరోయిన్, ఇంకెప్పుడో క్లయిమాక్స్ లో యాక్సిడెంట్ అయితే ఈ ఎడం అలాటి బాధాకర అనుభవాన్నిస్తుందా? కొన్ని సెటప్స్ వెంటనే పే ఆఫ్ అయితేనే దాని ఎఫెక్ట్ వుంటుంది. రస పోషణ ఇలాటి డైనమిక్స్ తోనే జరుగుతుంది. 

        హీరోయిన్ ఊటీ బయల్దేరడం, డాక్టర్ అపాయింట్ మెంట్ ని కాదని హీరోకూడా బయల్దేరడం ఇంటర్వెల్. ఇది గాథ కాబట్టి నాన్ కమర్షియల్ ఇంటర్వెల్ ఇంతే.

పరిష్కారమేమిటి?  
      ఈ గాథ సెకండాఫ్ ముగింపు మాత్రం చెప్పుకుందాం. పాత్రకి గోల్ లేకపోతే సెకండాఫ్ లో చెప్పుకోవడానికి విషయ మేముంటుంది. ముగింపులో హీరో జబ్బు పెరిగి హాస్పిటల్లో చేరతాడు. హీరోయిన్ కి ఇది తెలిసి వస్తూంటే కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇది మూడో యాక్సిడెంట్. మొదటిది పుట్టడం పుట్టడం కార్లు గుద్దుకుని పుట్టారు. తర్వాత చిన్నప్పుడు సైకిళ్ళు గుద్దుకుని పరిచయమయ్యారు. ఇప్పుడు ఇంకోసారి గుద్దుకుని హీరోయిన్ బ్రెయిన్ డెడ్డే ఐపోయింది!
          ఇవన్నీ కోయిన్సిడెన్సులని చెప్పడం. ఇన్ని కోయిన్సిడెన్సులు చూపించడం. మొదటిసారి విధి అనుకుంటే, రెండోసారి రైటర్స్ కన్వీనియెన్స్ అయితే, మూడోసారి...?? ఇక్కడే స్కాట్ మేయర్స్ ఎంటరవుతాడు. తను నిర్వహించిన ఒక మాస్టర్ క్లాసులో టాప్ డైరెక్టర్ ఆరన్ సార్కిన్ బోధించిన విషయం చెప్తాడు : ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘కాసాబ్లాంకా’ (1942) లో ఒకే ఒక్క కోయిన్సిడెన్సు వుంటుంది. ఆ ఒకటి కూడా బ్యాడ్ కోయిన్సిడెన్సు అయి ఒప్పించేలా అన్పించదు. 

        ఇందులో హీరో (హంప్రీ బోగార్ట్) తనని హీరోయిన్ (ఇంగ్రిడ్ బెర్గ్ మన్) వదిలేసి వెళ్ళిపోయాక, కాసాబ్లాంకాలో నైట్ క్లబ్ నడుపుకుంటూంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది - కాకతాళీయంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా కాకతాళీయం అవుతుంది? ఆమె కాసాబ్లాంకాకే ఎందుకు రావాలి, ఇంకో నగరానికి వెళ్ళ కూడదా? వచ్చిందే అనుకుందాం, ఈ నైట్ క్లబ్ కే ఎందుకు రావాలి? ఇంకో నైట్ క్లబ్ కెళ్ళ కూడదా? 

        ఆమె రావాలని హీరో కూడా కోరుకోవడం లేదు. అయితే కోరుకోక పోవడమే ఈ సీనుని పాక్షికంగా జస్టిఫై చేస్తోంది. ఆమెతో తనకున్న గతాన్ని ఎవాయిడ్ చేస్తున్నాడు గనుకే ఆమె రావాలని కోరుకోవడం లేదు. కానీ ఆ గతాన్ని డీల్ చేయాల్సిందే, దాన్నుంచి తప్పించుకోలేడు. . అందువల్ల ఆమె రాక తన కవసరమే. విధి ఇలా పరీక్షిస్తోంటే ఈ విధిలీలని ఆమోదించాల్సిందే. 

        సార్కిన్ ఈ ఆమోదాన్ని పాత్ర స్వగతంలో డైలాగు రూపంలో వ్యక్తం చేయాలంటాడు. అప్పుడు రైటర్స్ కన్వీనియెన్స్ అపవాదు తప్పుతుందంటాడు. ఇంతకి మించి ఇంకేమీ లేదు. అంటే ఒక కోయిన్సిడెన్స్ కే ఇంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంటే, రెండో కోయిన్సిడెన్స్ కూడా వుంటే? అది అసహజమే. దానికి సహజత్వాన్ని తీసుకు రావడం కుదరదు. మంచి కథా లక్షణం కాదు. మూడోది కూడా వుంటే ఇంకా నాన్సెన్స్. 


        ‘ఇద్దరి లోకం ఒకటే’ లో మూడున్నాయి : కార్లు గుద్దుకుని పుట్టడం, సైకిళ్ళు గుద్దుకుని ఫ్రెండ్స్ అవడం, మళ్ళీ కార్లు గుద్దుకుని బ్రెయిన్ డెడ్ అవడం. ఇలా వుంటే ఇది కామెడీ కూడా అయిపోయే ప్రమాదముంది. ఒక సీరియస్ గా సృష్టించిన కోయిన్సిడెన్స్ కామెడీయే అయింది. సందీప్ కిషన్ నటించిన తమిళ రీమేక్ ‘రన్’ అనే ఇండిపెండెంట్ సినిమా మధ్యలో విలన్ ఆటో గుద్దుకుని ఠపీమని చచ్చిపోతాడు!

        అందుకని కోయిన్సిడెన్స్ ఒక్కటే వుండాలి, అదీ బలంగా వుండాలని స్కాట్ మేయర్స్ అంటాడు. మనకి తోచినంతవరకూ ‘ఇద్దరి లోకం ఒకటే’ పరిష్కారం -
మొదటి రెండు ప్రమాదాలు తీసేసి చివరి ఒక్క ప్రమాదాన్ని వర్కౌట్ చేయాలి. అతడి గుండె జబ్బు విషయం సెకండాఫ్ లోనే  ప్రేక్షకులకి రివీలై, హీరోయిన్ కి రహస్యంగా వుంటుంది. ఇక తప్పనిసరిగా ప్రేమలో కమిటవాల్సి వచ్చేసరికి, కారు యాక్సిడెంట్ చేస్తాడు. అతడి కోసం ఆమె వచ్చేస్తూ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె గుండె అతడికి అమరుస్తారు. చావాలనుకున్న వాడు బతకాల్సి వచ్చింది. ఆమె బతికించింది. మొదటిది అతను కావాలని చేసిన యాక్సిడెంట్, ఎవ్వరూ వూహించని రెండోది విధి లీల. దట్స్ ఐరనీ, ట్విస్ట్ ఎండింగ్. ఓ హెన్రీ స్టయిల్.

-సికిందర్



4, జనవరి 2020, శనివారం

905 : రివ్యూ



దర్శకత్వం : సచిన్ రవి
తారాగణం :
: క్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాత్స, అచ్యుత్ కుమార్, బాలాజీ నోహర్, ప్రమోద్ శెట్టి, రిషబ్ శెట్టి తదితరులు
‌: క్షిత్ శెట్టి, సంగీతం: అజనీష్ లోక్నాథ్, ణ్ రాజ్;  ఛాయాగ్రహణం : కర్మ చావ్లా, కూర్పు: క్షిత్ శెట్టి, చిన్ వి
బ్యాన
ర్‌: పుష్కర్ ఫిలింస్
నిర్మాతలు: హెచ్‌.కె.ప్రకాశ్, పుష్క ల్లిఖార్జునయ్య
విడుదల : జనవరి 1, 2020
      న్నడ నిర్మాతలు పానిండియా మార్కెట్ మీద దృష్టి పెట్టి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. 2018 లో ఇలా ఐదు భాషల్లో ‘కేజీఎఫ్’ తీసి భారీ విజయం సాధించాక, ఇప్పుడు ‘అవనే శ్రీమన్నారాయణ’ (అతడే శ్రీమన్నారాయణ) తో ఐదు భాషల బ్లాక్ బస్టర్ ని ఉద్దేశించారు. కొత్త దర్శకుడు సచిన్ రవి, హీరో రక్షిత్ శెట్టిలు ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ ని అఖిల భారత ప్రేక్షకులకి సగర్వంగా సమర్పించారు. పానిండియాలో నాల్గు భాషలు సౌతిండియావే వుంటున్నాయి. నార్త్ లో హిందీ ఒక్కటే. అయినా పానిండియా అంటున్నారు. సౌతిండియా నుంచి ఇలాటి పానిండియాలు ఇటీవల ‘సైరా’, ‘సాహో’ లు వచ్చాయి. వీటి ఫలితాలు చూడనే చూశాం. ఐతే 60 కోట్లతో తీసిన ‘కేజీఎఫ్’ పానిండియా - ఓవర్సీస్ బాక్సాఫీసు 250 కోట్లు దాటి అతిపెద్ద హిట్టయింది. కన్నడ నుంచే  వచ్చిన ఈ రెండో పానిండియా మాటేమిటి? ఇది చూద్దాం...

కథ
     1980 లలో అమరావతి అనే కల్పిత ప్రాంతం. అక్కడొక టూరింగ్ నాటకాలేసుకునే ట్రూప్ భారీగా దోపిడీలు చేసి సొత్తుని దాస్తూంటారు. ఈ ప్రాంతానికి దొరగా రామరామ అభీర (మధుసూదన రావు) వుంటాడు. ఓ రోజు అతను ఈ ముఠాని పట్టుకుని కొందర్ని చంపేస్తాడు. కానీ ఆ నిధి ఎక్కడ దాచారో రహస్యం తెలియదు. ఇంతలో తను కూడా చనిపోతాడు. అతడి ఇద్దరు కొడుకులు జయరాం, (బాలాజీ మనోహర్), తుకారాం (ప్రమోద్ శెట్టి) లు తండ్రి వారసత్వం కోసం పోటీ పడతారు. బలవంతుడైన జయరాం కోటలోంచి తుకారాం ని తరిమేస్తాడు. తుకారాం తర్వాతి కాలంలో అమరావతిలో రాజకీయ నాయకుడవుతాడు, జయరాం బందిపోటై నిధి వేటలో వుంటాడు. పదిహేనేళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అమరావతికి కొత్త పోలీసు ఇన్స్ పెక్టర్ గా శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) వస్తాడు. అతడికి రిపోర్టర్ లక్ష్మి (శాన్వి) పరిచయమవుతుంది. శ్రీమన్నారాయణ కానిస్టేబుల్ అచ్యుత్ (అచ్యుత్ కుమార్) తో కలిసి నిధి రహస్యం కనుక్కునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో జయరాం, తుకారాంల నుంచి ఎలాటి ప్రతిఘటనలు ఎదురయ్యాయనేదే మిగతా కథ.  

ఎలావుంది కథ
      ట్రెజర్ హంట్ (నిధి వేట) జానర్ కథ. దీనికి ‘సదరన్ ఆడ్ ఫిక్షన్’ (southern odd fiction) అని పేరు పెట్టుకున్నారు ఈ మేకర్లు. ఆడ్ ఫిక్షన్ కాబట్టని కౌబాయ్, పౌరాణిక, గ్యాంగ్ స్టర్, బందిపోటు, ఫాంటసీ తదితర జానర్లన్నీ ఇష్టారాజ్యంగా కలిపేసి పాత్రల్నీ, కథనీ వండి వార్చేసి- ఏదీ ఫీల్ కాకుండా చేశారు. కళాత్మకం అనే పదానికి అర్ధం కూడా మార్చేశారు. కథాకథనాలు పక్కన బెట్టి, బ్రహ్మాండమైన మేకింగ్ తో ‘కళాత్మకం’ చేయబూనారు. కథాకథనాలతో బోలెడు కన్ఫ్యూజ్ చేశారు. రాయడానికీ తీయడానికీ మూడేళ్ళూ  శ్రమించామని చెప్పుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ చూస్తే ఐదు భాషల్లో పానిండియా మార్కెట్ కి సమకట్టారు. కానీ కన్నడ స్వాభిమానం ఎక్కువైపోయి కన్నడ నటీనటుల్నే మొత్తం తారాగణంగా పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కర్ణాటక దాటితే ప్రేక్షకులకి తెలియరు. పైపెచ్చు కన్నడ పైత్యాన్నేదృశ్య దృశ్యాలుగా పంచిపెట్టారు. ఈ పైత్యానికి రెండు గంటల సమయం చాల్లేదు. మూడు గంటలా ఆరు నిమిషాల సమయమంతా తీసుకుని వీరంగం వేశారు. పానిండియా థియేటర్లకి కరెంటు, ఏసీ ఛార్జీల అదనపు బిల్లులు వడ్డించి ఆనందించారు. పానిండియా ప్రయత్నం పెనం మీంచి పొయ్యిలో పడింది. ఈ ‘భారీ కళాత్మక కన్నడ స్వాభిమానం’ కన్నడిగలకే ఊడిగం చేసింది.


       ఇక కన్నడ సినిమాలు ‘అవనే శ్రీమన్నారాయణ’ కి ముందూ, తర్వాతా’ అంటూ చరిత్ర రాసుకోవాలని చెప్పుకుంటున్నారు. ఒక ‘మెకన్నాస్ గోల్డ్’ లాగానో, ‘నేషనల్ ట్రెజర్’ లాగానో ఔట్ డోర్ అడ్వెంచర్ కి పూనుకోకుండా, డైలాగులే ఎక్కువ - యాక్షన్ తక్కువగా డ్రామెడీగా మార్చేశారు. నిధి వేట సినిమాలంటే పిల్లా పెద్దా అందరికీ అద్భుత రసంతో వినోదాల విందుగా, పసందుగా వుండే ఆచారాన్ని విడనాడి పెడదారి పట్టిపోయారు. ప్రేక్షక వర్గాల్ని బొటాబోటీ పిడికెడు మాత్రంగా తగ్గించుకుని ఉస్సూరన్పించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించేలా, రిపీట్ ఆడియెన్స్ కి నోచుకునేలా నిర్మించక పోతే,  రిటర్న్ ఎలా వస్తాయి? ‘సైరా’ తో ఈ పాఠం నేర్చుకునే వుండాలి. 


ఎవరెలా చేశారు
       రక్షిత్ శెట్టి కన్నడలో నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ సినిమాకి హీరోతో బాటు రచయిత కూడా. పాత్ర ప్రకారం కామిక్ - ఫన్నీ నటన ఓకే. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కొన్ని యాక్షన్ సీన్లూ ఓకే. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ ఫైట్ సీను. అయితే ఇది నామ్ కే వాస్తే కౌబాయ్ క్యారక్టర్. ఆ క్యారక్టర్ లుక్కే వుండదు. ఎంట్రీ సీనుతో ఇచ్చిన బిల్డప్ తర్వాత క్యారక్టర్ తో వుండదు. పని తక్కువ, వాగుడు ఎక్కువ క్యారెక్టర్. ఈ అతి చలాకీతనం క్యారక్టర్ వల్ల కథ వున్న చోటే వుండి పోతుంది. మాటకారి తనం, రకరకాల ట్రిక్స్ ప్రయోగించడం ఇదే క్యారక్టరైజేషన్. ఈ ఇన్స్ పెక్టర్ నారాయణ ఎన్నో మంత్రాలు వేస్తాడు. ఏదీ పేలదు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అవ్వదు. ‘భక్త ప్రహ్లాద’ సినిమా ప్రదర్శనలో ఎంట్రీ ఇస్తాడు. హిరణ్య కశిపుడు స్తంభాన్ని బద్దలు కొడితే రావాల్సిన నరసింహుడి బదులు రక్షిత్ శెట్టి వచ్చేస్తాడు. బాగానే వుంది. కానీ పోనుపోను పాత్రా నటనా మొనాటనీ బారినపడి ఫస్టాఫ్ కే తేలిపోయింది. 36 నెలలూ 3 గంటల 6 నిముషాలూ తీస్తూపోతే డైనమిక్స్ కాపాడ్డం కష్టమే. 18 నెలలు అతిగా రాసి, 18 నెలలు అతిగా తీసినప్పుడు ఇలాగే అవుతుందని అనుకోవాలేమో. 


        హీరోయిన్ హీరోయిన్ లా లేదు. ఆమె కంటికే అనడం లేదు. సహాయ నటిలా వుంది. ఇక ఇద్దరు విలన్ల పాత్రల్లో కన్నడ నటులు వాళ్ళ ప్రతిభ చాటుకున్నారు. సంగీతం మైనస్సే గానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం ఈ మిక్స్డ్ జానర్ కి ఒకే లుక్ తో వున్నాయి - చారిత్రకం అన్నట్టు. ఈ తరహా సెట్టింగులు చారిత్రక సినిమాల్లోనే వుంటాయి. బార్ సెట్ మాత్రం డిజైనర్ కౌబాయ్ లుక్ తో చేశారు. యాక్షన్ సీన్స్ కౌబాయ్ తో సంబంధం లేదు. ఇక దర్శకుడే ఎడిటర్ అయినందు వల్ల 3 గంటల 6 నిమిషాలు తృప్తిగా నిడివి పెట్టుకున్నాడు. 
3 గంటల 6 నిమిషాల సినిమాకి 4 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్ కూడా కట్ చేసి ఔరా అన్పించుకున్నాడు అఖిల భారతీయంగా. 

చివరికేమిటి
        ఈ సినిమా చూస్తూంటే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకురాక మానదు. 2012 లో విడుదలైన పవన్  కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రివ్యూలో కొంత భాగాన్ని ఒకసారి చూద్దాం...

        స్టార్ సినిమాలంటే అవే ఫ్యాక్షన్, మాఫియా, యాక్షన్ కామెడీలనే నమ్మి ఏ వైవిధ్యం లేకుండా వాటినే ఉత్పత్తి చేస్తూ, ముందుకు పోలేని ఒక ప్రతిష్టంభన నెదుర్కొంటున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ -  హరీష్ శంకర్ ల ‘గబ్బర్ సింగ్’ ఆగమనం ఓ ఆశా రేఖ. మనం గతంలో చాలా వెస్టర్న్ కౌబాయ్ సినిమాలు చూసే వుంటాం. అవి మన ఫ్యాక్షన్, మాఫియా సినిమాల్లాగా డార్క్ మూడ్ ని క్రియేట్ చేసేవి కావు. కౌబాయ్ పాత్రలు మన జానపద పాత్రల్లాంటివే. వినోదాన్ని అందించడానికే అవి పుట్టాయి. పైగా కౌబాయ్ పాత్రలు అమెరికన్లకి మిథికల్ (పౌరాణిక) పాత్రల్లాంటివి. అవి వాళ్ళ ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. రానురాను వీటికి కాలం చెల్లిపోవడంతో, సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ లాంటి మానవాతీత శక్తుల మిథికల్ పాత్రల్ని ప్రవేశపెట్టి అలరించ సాగారు. అయినా కౌబాయ్ చచ్చి పోలేదు. ముఖ్యంగా  భారతీయ ప్రేక్షకుల స్మృతి పథంలో నిలిచే వున్నాడు. మరీ తెలుగు ప్రేక్షకులనైతే ‘మోసగాళ్ళకు మోసగాడు’ నుంచీ ‘టక్కరి దొంగ’ వరకూ అడపా దడపా పలకరించి పోతూనే వున్నాడు. అయితే ఓ మారు వేషంలో రావడం మాత్రం ఇదే ప్రథమం. అసలు మొత్తం భారతీయ వెస్టర్న్ సినిమాల మీద రాజేంద్ర ప్రసాద్ తో తీసిన పేరడీ ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఓ హాస్య ప్రహసనం వుండగా, ఒక పోలీసు వేషంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ గా కౌబాయ్ రావడం పైన చెప్పుకున్న ప్రతిష్టంభనని బద్దలు చేసే ఒక అపూర్వ క్రియేటివిటీయే అయింది.


        హిందీ ‘దబంగ్’ లో సల్మాన్ ఖాన్ ది సాదా పోలీసు పాత్ర. అతడి వ్యవహార సరళి ప్రేక్షకులకి అలవాటయిన అతడి తీరులోనే వుంటుంది. దీని రీమేకైన ‘గబ్బర్ సింగ్’ లో పాత్ర భారీ రూపాంతరం చెందింది. ఒక ఏరియాని ఇష్టారాజ్యంగా ఏలుకునే వెస్టర్న్ సినిమాల్లోని కౌబాయ్ క్యారక్టర్ లా అతను ప్రవర్తిస్తాడు. ఇష్టం వచ్చినట్టు తుపాకులు పేలుస్తాడు. సిబ్బందిని గ్యాంగ్ లా వెంటేసుకు తిరుగుతాడు. వాళ్ళతో ‘గబ్బర్ సింగ్’ డైలాగులు కొడతాడు. ఫన్నీ డైలాగులతో ప్రత్యర్ధి ముఠాతో ఆడుకుంటాడు. వెస్టర్న్ సినిమాలని తలపించే ప్రదేశాల్లో గుర్రమెక్కి, బైకెక్కి, జీపెక్కి సంచరిస్తాడు. అలాంటి వొక ఎడారి మైదానంలో పోలీస్ స్టేషన్ కూడా వుంటుంది. దాని బోర్డుని గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ మార్చేస్తాడు. కౌబాయ్ లా ఈ తన అడ్డా తనిష్టం. పోలీస్ స్టేషన్ లో ఎప్పుడెక్కడ కూర్చుంటాడో తెలీదు. ఏ భంగిమలో కూర్చుంటాడో తెలీదు. తన వెంట వుండే సాంబా అనే ‘షోలే’ క్యారక్టర్ తో తను పలికే ఆణిముత్యాలని నోట్ చేసుకొమ్మని ఆర్డరేస్తూ, గిరీశంలా లిటరరీ టచ్ కూడా ఇస్తాడు. ‘దబంగ్’ మహారాష్ట్ర లోని రియల్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంటే, ‘గబ్బర్ సింగ్’ కోసం గ్రామం సహా, అన్ని లొకేషన్సూ సెట్సే వేశారు. దీంతో తెలుగు నేటివిటీకి భిన్నంగా ఒక డిజైనర్ లుక్ తో మోడరన్ వెస్టర్న్ వాతావరణ నేపధ్యం సమకూరినట్టయింది...

         ఇదీ జానర్ ని పది జానర్లతో కలిపి కషాయంలా చేయకపోవడంతో వున్న ప్రయోజనం. కౌబాయీకరణలో ‘గబ్బర్ సింగ్’ ఏకసూత్రత హీరోని దృష్టినాకర్షించే ఫోకస్ తో ప్రస్ఫుటంగా నిలబెట్టింది. రక్షిత్ శెట్టి కౌబాయ్ తనం, నేపథ్యవాతావరణం ఈ జల్లెడ పట్టలేక కథనీ, పాత్రనీ కలగాపులగం చేశాయి వివిధ జానర్ల తాపడంతో.

        ఇలావుంటే కథకి స్ట్రక్చర్ అనేది లేదు. పైగా కథనుంచి వెళ్ళిపోయి విన్యాసాలు. గంటన్నర ఫస్టాఫ్ అంతా కథలోకే వెళ్ళదు. ఒక పేలవమైన డైలాగుతో ఇంటర్వెల్ కూడా బలైంది. సెకండాఫ్ మొదలెడితే ఇంకా అవే డైలాగ్ కామెడీలు, వున్న చోటే డ్రామాలు. నిధికోసం వేటలో వుండాల్సిన పాత్రలు రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడేసిన గొంగళిలా వుంటాయి. ఇక క్లయిమాక్స్ అత్యంత పేలవం. ట్రెజర్ హంట్ జానర్ కథ అడ్వెంచర్ ప్రధానంగా వుంటుందనేది ప్రాథమిక జ్ఞానం. ఇది కూడా లేకపోతే ఎలా?

        సూపర్ స్టార్స్ తో ‘మెకన్నాస్ గోల్డ్’ (1969) అనే బృహత్తర సినిమా సాంతం ఔట్ డోర్ కౌబాయ్ అడ్వెంచరే. ఇందులో నిధి వున్న పర్వతాల్లో భూకంపం వచ్చే దృశ్యాల్లో ముఠాలు ఇరుక్కునే క్లయిమాక్స్ సినిమాకే తలమానికం. ఈ దృశ్యాలతోనే ఈ సినిమా ప్రసిద్ధి. ‘అతడే శ్రీమన్నారాయణ’ దేనికి ప్రసిద్ధి? భారీ పెట్టుబడులతో ఇలాటి బిగ్ కాన్వాస్ సినిమాలు తీసేప్పుడు హాలీవుడ్ లో ఇలాటి సినిమాల గురించి వచ్చిన రైటింగ్, మేకింగ్ సంబంధ పుస్తకాలు, దర్శకుల ఇంటర్వ్యూలూ చదవాల్సిన అవసరముంది. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ ల మీద పుస్తకాలు అద్భుత ద్వారాలు తెరుస్తాయి. పానిండియా అనుకునే ముందు పఠనం లేకపోతే పతనం పొంచి వుంటుంది. 

        నికొలస్ కేజ్ నటించిన ‘నేషనల్ ట్రెజర్’ (2004) మోడరన్ అడ్వెంచర్ కి ప్రతీక. ఇందులో కథ ఓ పది నిమిషాలకే ప్రారంభమైపోతుంది. గోల్ వచ్చేసి 1776 నాటి ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండెపెండెన్స్’ కళాకృతుల్ని చేజిక్కించుకోవడం. చరిత్రకారుడి పాత్రలో హీరోగా నికోలస్ కేజ్ కి ప్రత్యర్ధులుగా కిరాయి ముఠాలు. కేజ్ కి ఒక నైతికపరమైన సందిగ్ధత కూడా వుంటుంది. అతను ముందు కెళ్తే ఎఫ్బీఐ అతణ్ణి ప్రజాశత్రువు నెంబర్ -1 గా ప్రకటించే ప్రమాదముంది. దీనికి ఆస్కార్ నామినేషన్ వరకే దక్కవచ్చు. కానీ ఔట్ డోర్ అడ్వెంచర్ గా దీని వినోదాత్మక విలువ తీసివేయలేనిది.

        ‘అతడే శ్రీమన్నారాయణ’ మేకింగ్ లోనే తప్ప రైటింగ్ లో సత్తా చాటుకోలేక పోయిన పాక్షిక ప్రయత్నం. ఐతే 23 కోట్లే బడ్జెట్ అంటున్నప్పుడు ఓపెనింగ్స్ తో బయటపడే అదృష్టముంది.

సికిందర్



3, జనవరి 2020, శుక్రవారం

904 : నిర్మాతల స్పెషల్


       రెండేళ్ళ క్రితం కోలీవుడ్ లో ప్రధానమైన మార్పు వచ్చింది. కోలీవుడ్ అంటే చెన్నైలో తమిళ సినిమా పరిశ్రమ. చెన్నైలోని  కోడంబాక్కంలో ఈ పరిశ్రమ నెలకొంది కాబట్టి కోలీవుడ్ అనే పేరొచ్చింది. ఇక్కడ రెండేళ్ళ క్రితం నుంచి కొన్ని కంపెనీలు మూస పధ్ధతి నుంచి బయటి కొచ్చేశాయి : బిగ్ నేమ్స్ ని కూడేసి సినిమాల విజయాల కోసం ప్రయత్నించే మూస పధ్ధతి. విజయాల కోసం స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ - స్టార్ నిర్మాతల కాంబినేషన్ల మీద ఇంకెంత మాత్రం నమ్మకం పెట్టుకోలేని మార్పు. వైనాట్ స్టూడియోస్, స్టూడియో గ్రీన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వంటి సంస్థలు ఈ చట్రాన్ని ఛేదించుకుని బయటికొచ్చేశాయి. ఇక సబ్జెక్టుల కూలంకష మూల్యాంకన చేపట్టాయి. స్క్రిప్టులు చదవడానికి, విశ్లేషించడానికి, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడానికీ క్రియేటివ్ టీమ్స్ ని నియమించుకున్నాయి. ఈ టీమ్స్ లో రచయితలుండడం లేదు, స్క్రిప్ట్ డాక్టర్సే వుంటున్నారు. కాంబినేషన్స్ తో చాలా సినిమాలు బోల్తా కొట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది. ఇంతలో తాము తీసిన కొన్ని విజయవంతమైన చిన్న సినిమాల ప్రభావంతో - విపరీతంగా స్క్రిప్టులు వచ్చి పడడంతో - సినిమాలు తీయడానికి ప్రత్యామ్నాయ మార్గం ఇలా తట్టింది...

        నిర్మాతలు శశి కాంత్ (వై నాట్ స్టూడియోస్), ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) ఇద్దరూ స్క్రిప్టుల కూలంకష విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికొచ్చేశారు. పేరున్న దర్శకుడు వచ్చినా సరే, ఇదే ప్రక్రియ. కేవలం ఒక దర్శకుడు రెండు గంటలు కథ చెప్పినంత మాత్రాన వినేసిన నిర్మాత కోట్లాది రూపాయలు గుమ్మరించడం అవివేకమని తెలుసుకున్నారు. నిర్మాత శశికాంత్ ఇక స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని తెలుసుకోవడం ప్రారంభించారు. స్క్రీన్ ప్లే వర్క్ షాపులకి హాజరవుతూ వున్నాక, నిర్మాత క్రియేటివ్ గా  కూడా ఇన్వాల్వ్ అవడం ఎంత అవసరమో గుర్తించారు. ఏవీఎం లాంటి పెద్ద సంస్థల శైలిని తెలుసుకున్నారు. ఆ సంస్థల అధినేతలు మొదట రచయితలతో కలిసి కూర్చుని కథ తయారు చేసుకుని, దాని ప్రకారం దర్శకుడు, హీరో, ఇతర తారాగణం వగైరా ఎవరైతే బావుంటారో నిర్ణయించే వాళ్ళు. అవి నిర్మాతల రోజులు. ఇప్పుడు నిర్మాతల రోజులు బాగాలేవు, వాళ్ళు జీ హుజూర్లు. 

        స్క్రీన్ ప్లే క్లాసులకి హాజరయ్యాక స్క్రిప్టు ఎంత ఇంపార్టెంటో తెలిసింది. దాంతో ఇన్ హౌస్ స్టోరీ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో టీముతో కృషి చేస్తూంటే, ఐడియాల్ని పొదిగి పిండ దశ నుంచీ అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చేస్తూ కథలుగా మార్చవచ్చో తెలిసింది. తమ సంస్థలతో పనిచేయాలనుకునే దర్శకులైనా, రచయితలైనా గిరిగీసుకుని వుండకూడదనే నియమం. సొంత ఐడియాల్ని అభివృద్ధి చేసుకోవడమే గాక, తమకందే పూర్తి స్థాయి స్క్రిప్టుల పరిశీలన కూడా ఒక సెక్షన్. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ధనుష్ హీరోగా సుబ్బరాజ్  దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘సురులి’ ఐడియాని, సుబ్బరాజ్ తో కలిసి తామే డెవలప్ చేశారు.

        డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత ప్రభు ఈ కొత్త పంథా ననుసరించే కార్తీతో ‘ఖైదీ’ తీసి సూపర్ హిట్ చేసుకున్నారు. తమ రచయితల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడం ఒక సమస్యగా వుందన్న విషయం ప్రభు గ్రహించారు. నేటి సినిమా రచయితలకి ఒక క్రియేటివ్ మార్గ దర్శనం గానీ, వేదిక గానీ లేకపోవడం కారణం. వాళ్ళకి ఆర్ధిక ఆలంబన కూడా లేదు. ఐడియాల్ని పంచుకోవడానికి, రాయడం నేర్చుకోవడానికీ వేదికలు లేవు. విపరీతమైన అభద్రతా భావం ఇంకోవైపు. సినిమా రచనని కూడా ఒక క్రాఫ్ట్ గా పరిశ్రమ గుర్తిస్తే తప్ప ఈ సమస్యలన్నీ తొలగవని ప్రభు అభిప్రాయం. తమ దగ్గరికి వచ్చే స్క్రిప్టుల్లో కథా కథనాలు దాదాపు యాభై శాతం మార్పు చేర్పులకి లోనవుతాయి. ఐడియాలు మాత్రం అవే వుంటాయి.

        నిర్మాతకి స్క్రీన్ ప్లే నాలెడ్జి వుంటే తమకి అదెంతో ప్రయోజనకరంగా వుంటుందని పుష్కర్ లాంటి దర్శకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. నాలెడ్జి వున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ కీ, నాలెడ్జి లేని వాళ్ళ ఆర్గ్యుమెంట్ కీ తేడా వుండడమే ఆ ప్రయోజనం. 

          తెలుగులో ఇంకా ఈ మెట్టు ఎక్కలేదు. నిర్మాతలకే కాకుండా మరెవ్వరికీ నాలెడ్జి అంత ముఖ్యమన్పించడం లేదు.

సికిందర్


2, జనవరి 2020, గురువారం

903 : కొత్త శీర్షిక!



రచన, దర్శకత్వం: రీతేష్ రానా
తారాగణం :  శ్రీ సింహ, త్య, రేష్ అగస్త్య, అతుల్యా చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖా రామన్, అజయ్ ఘోష్ దితరులు
సంగీతం: కాల భైర, ఛాయాగ్రహణం : సురేష్ సారంగం, కూర్పు : కార్తీక శ్రీనివాస్
బ్యానర్స్‌: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: చిరంజీవి,  హేమలత
***
      అందరికీ కొత్త దశాబ్ద కానుకగా ఈ కొత్త శీర్షిక - కొత్త డైరెక్టర్ కహానీ!...2019 లో చిన్న చిన్న సినిమాలు తీసిన కొత్త దర్శకులు 88 మంది పరిచయమయ్యారు. ఎప్పటిలానే ఇద్దరే సక్సెస్ అయ్యారు (ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా). 2018 లో మొదటి సినిమా సక్సెస్ అయి 2019 లో రెండో సినిమాతో కూడా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్కడే వున్నాడు (బ్రోచే వారెవరురా). మన్మథుడు 2, రాజుగారి గది 3, కొబ్బరి మట్ట తీసిన మలి ప్రయత్నం దర్శకులు షరామామూలుగానే ఫ్లాపయ్యారు. ఈ 88 లో 86 మంది అవకాశాల కోసం కొన్నేళ్ళ పాటు ఎంతో శ్రమపడి వుంటారు. హోం వర్క్ సరిగ్గా లేక దొరికిన ఆ వొక్క అవకాశాన్ని వృధా చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో. ఇదే తంతు  ప్రతీ సంవత్సరం జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళల్లో 95 శాతం రోమాంటిక్ కామెడీలు తీసే లోకంలోనే ఏదో సాధిద్దామని ఇంకా కొట్టు మిట్టాడుతున్నారు. చాలా సార్లు చెప్పుకున్నట్టు, సమస్య ఏమిటంటే, గత రెండు దశాబ్దాలుగా తెలుగు యూత్ సినిమా అంటే రోమాంటిక్ కామెడీలనే నమ్మకంతో వచ్చి పడుతున్న రోమాంటిక్ కామెడీలే చూసి చూసి, పెరిగిన తరం, మళ్ళీ ఆ రోమాంటిక్ కామెడీలే  తీయడం! ఇవి తప్ప ఇంకో జానర్ తెలియని పరిస్థితుల్లో వుండి పోవడం. వీళ్ళకి దొరికే నిర్మాతలకి సినిమాల గురించి ఏమీ తెలియక పోవడం. సరే, మొత్తం మీద 2019 సస్పెన్స్ - మిస్టరీ థ్రిల్లర్ల సంవత్సరంగా చిన్న సినిమాలకి కొంత దారి చూపించింది. ఓ ఐదారు తీశారు. మూడు సక్సెస్ అయ్యాయి -బ్రోచే వారెవరురా, ఏజెంట్ ఆత్రేయ, మత్తు వదలరా. 

         ‘మత్తు వదలరా’ న్యూయేజ్ సినిమా అనీ, కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా అనీ అంటున్నారు గానీ రెండూ కాదు. ఫలానా హాలీవుడ్ సినిమా శైలి ప్రభావమనడమూ కరెక్ట్  కాదు. ‘స్కాట్ పిల్గ్రిమ్స్ వర్సెస్ ది వరల్డ్’ ఓ కామిక్ బుక్ ఆధారంగా తీసిన సెమీ ఫాంటసీ. దాని మేకింగ్ శైలి పూర్తిగా వేరేగా వుంది. ‘మత్తు వదలరా’ దర్శకుడు రీతేష్ రానా సొంత శైలిని నిర్మించుకుని మేకింగ్ చేశాడు. ఐతే చాలావరకూ ఏమవుతుందంటే, ఒక సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చే కొత్త దర్శకులు ఈ కాలంలో లేరు. బాపు శైలి, వంశీ శైలి, భారతీరాజా శైలీ అనేవి గత చరిత్రలు. ఒకరిద్దరు సొంత శైలితో ముద్ర వేస్తూ వచ్చినా రెండో సినిమాకి ఆ శైలీ వుండదు, భావ సంపదా వుండదు, మూసలోకి ముస్తాబై విచ్చేస్తారు. డీఐ వచ్చేసి కెమెరా మాన్ సొంత శైలినెలా తినేసిందో, చిన్న చిన్న సినిమాల కొత్త దర్శకులు టెక్నాలజీ కాలుష్యమే స్టయిల్ అనుకుని గుర్తింపు లేకుండా పోతున్నారు. డిజిటల్ టెక్నాలజీ స్టయిల్ నివ్వదు, అది కళారూపానికి అస్థిపంజరాన్నేఇస్తుంది. మిగతా రక్తమాంసాల్ని కళాకారుడి అంశతో చేత్తో అద్దాల్సిందే. దీన్ని కథా కథనాల మీద, నటనల మీదా ప్రదర్శించాల్సిందే.      

కథ 
      ఇది ఒక కొరియర్ డెలివరీ బాయ్ కథ. బాబూ మోహన్ (సింహా), యేసు బాబు (సత్య), అభి (నరేష్ అగస్త్య) లు ఒక బస్తీలో రూమ్మేట్స్. బాబూ మోహన్ కొరియర్ డెలివరీ బాయ్ గా, యేసు బాబు డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూంటారు. అభి కంప్యూటర్లో సినిమాలు చూస్తూ వుంటాడు. ఏదో షెర్లాక్ హోమ్స్ టాలెంట్ వున్నట్టు కన్పిస్తాడు. బాబూ మోహన్ కి వచ్చే జీతం చాలదు. మేనేజర్ జీతంలో కోత  పెడుతూంటాడు. చాలీ చాలని జీతంతో అద్దెలు కట్టలేక విసిగి ఈ పని మానేద్దా మనుకుంటాడు. యేసు బాబు ఆపుతాడు. ఆపి, ఇదే వృత్తిలో అదనపు డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చిట్కా చూపిస్తాను పదమని డెలివరీకి తీసికెళ్తాడు. అక్కడ క్లయంట్ దగ్గర పేమెంట్ తీసుకుంటున్నప్పుడు, ఓ అయిదు వందల నోటు ఎలా నొక్కేసి అడగాలో చూపిస్తాడు. దీనికి బాబూమోహన్ ఒప్పుకోడు. ఎలాగో ఒప్పిస్తాడు యేసుబాబు. 

        మరో డెలివరీ కెళ్ళినప్పుడు ఆ చిట్కా ప్రయత్నిస్తాడు బాబూ మోహన్. ఆ రిచ్ అపార్ట్ మెంట్ లో ఓ బామ్మ (పావలా శ్యామల) కి డెలివరీ ఇచ్చి పేమెంట్ తీసుకున్నప్పుడు, అతను నోట్లు లెక్క బెట్టడాన్ని పట్టి పట్టి చూస్తుంది బామ్మ. అతడి చిట్కా పారదు. మంచి నీళ్ళు కావాలంటే తేవడానికి వెళ్తుంది. ఆమె నీళ్ళు తెచ్చేటప్పటికి చిట్కా అమలు చేసేసి ఒక నోటు తగ్గిందంటాడు. ఆమె తిరగబడుతుంది. ఆ పెనుగులాటలో ప్రమాదవశాత్తూ చనిపోతుంది. మత్తు ఆవరించి అతనూ పడిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే  పక్కన ఇంకో శవం వుంటుంది. డెలివరీ బ్యాగు తీసుకుని పారిపోయి వచ్చేస్తాడు. వచ్చేసి చూస్తే డెలివరీ బ్యాగులో 50 లక్షలుంటాయి.

        ఈ డబ్బెక్కడిది? బామ్మ తన వల్లే చనిపోయిందన్నభయంతో వుంటే, ఆ రెండో శవం ఎలా వచ్చింది? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇదీ కథ.   


ఎలా వుంది కథ
     క్రైం జానర్లో కాలం చెల్లిన మిస్టరీ సబ్ జానర్. మార్కెట్ యాస్పెక్ట్ వచ్చేసి ఎకనమిక్స్. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి ఎండ్ సస్పెన్స్ మిస్టరీకి కామెడీని జత చేయడం. సినిమాల్లో నేటి యూత్ అప్పీల్ ఎకనమిక్స్ లేదా రోమాంటిక్స్ కథలుగా వుంటోందని తెలిసిందే. ఈ మర్డర్ మిస్టరీ డబ్బు గురించి ఎకనమిక్స్ యాస్పెక్ట్ తోనే యూత్ ని ఆకట్టుకునే బాక్సాఫీసు అప్పీల్ తో వుంది. ‘బ్రోచేవారెవరురా’ క్రైం జానర్ కూడా ఎకనమిక్స్ తోనే సక్సెస్ అయ్యింది. ‘హుషారు’ అనే రెగ్యులర్ యూత్ కూడా. ప్రస్తుత మర్డర్ మిస్టరీలో మాట వరసకైనా రోమాంటిక్స్ ని జత చేయ లేదు. అంటే హీరోయిన్ లేదు, అంతేగాకుండా పాటలూ లేవు. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయిన్ వున్నా రోమాన్స్ లేదు. ఆ రోమాన్స్ ని సబ్ టెక్స్ట్ లో ఫీలవుతారు ఆడియెన్స్. అరుదుగా కొత్త మేకర్స్ బాక్సాఫీసు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు.

         సాధారణంగా సీరియస్ గా వుండే మర్డర్ మిస్టరీకి కామెడీతో క్రియేటివ్ యాస్పెక్ట్ ని జత చేయడం ఒక ప్రయోగమే. హార్రర్ కి కామెడీని జత చేసే హార్రర్ కామెడీల్లాగా. ఇక్కడ ఆయా హత్యా స్థలాల్లో  హీరో తన పక్కన ఫ్రెండ్స్ ని వూహించుకునేలాటి  కల్పన - ఫాంటసీ -  హార్రర్ సినిమాల్లో వుంటుంది. హార్రర్ కాకుండా,  ‘చమత్కార్’ లాంటి కామెడీల్లో కూడా వుంటుంది. ఇందులో సర్వం పోగుట్టుకున్న షారుఖ్ ఖాన్ స్మశానంలో కూర్చుంటే, ఆత్మ రూపంలో నసీరుద్దీన్ షా వచ్చేసి తోడ్పడే ఫాంటసీ కామెడీ ఇది. ప్రస్తుత మర్డర్ మిస్టరీ లో, హీరో ఇమాజినేషన్లో ఫ్రెండ్స్ ని ప్రవేశ పెట్టి కామెడీ చేయకపోతే ఈ సినిమా నిలబడేది కాదు. 

        ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో ఇలాటి మర్డర్ మిస్టరీ కథలతో వుండే సమస్యే మిటంటే, ఇవి ఎండ్ సస్పెన్స్ తో వుంటాయి. ఈ నేరస్థుడెవరో పరిశోధిస్తూ / దర్యాప్తు చేస్తూ చిట్ట చివరి దాకా ప్రేక్షకులకి తెలియకుండా వుంచే సస్పన్స్ ఇది. ఇది ఏనాడో సినిమాలకి వర్కౌట్ కాదని, కాలం చెల్లిందని హాలీవుడ్ గుర్తించి, అవే మిస్టరీల్ని సీన్ టు సీన్ సస్పెన్స్ గా మార్చి తీయడం మొదలెట్టింది. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్రిటిష్ నమూనాని పెట్టుకుని హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా ఫ్రీమేక్స్ చేసేశారు. అది కృష్ణతో  ‘అవేకళ్ళు’, కాంతారావుతో ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు వస్తున్న కాలం. దీన్ని బ్రేక్ చేస్తూ పై భాషల్లో బ్రిటిష్ నమూనాతో వచ్చిన మర్డర్ మిస్టరీల్లో మర్డర్ వుంటుంది. కానీ మర్డర్ జరిగినట్టు చూపించరు, చెప్పరు, తెలియనివ్వరు. ఇంకో కథ నడిపిస్తూంటారు. అది ప్రేమ కథ కావచ్చు, కుటుంబ కథ కావచ్చు, ఇంకేదేనా కావచ్చు. ఈ కథ వెళ్లి వెళ్లి చివరికి, దాచి పెట్టిన మర్డర్ మిస్టరీని రివీల్ చేసి, అంతవరకూ నడిపిన కథలో క్యారక్టర్ ని కిల్లర్ గా పట్టుకోవడంగా ట్విస్ట్ ఇస్తారు. అంటే ఈ జరిగిన కథంతా జరిగిన ఒక హత్యలో హంతకుణ్ణి పట్టుకోవడం గురించే జరిగిందని అప్పుడు బయట పడుతుంది. దీంతో మర్డర్ తో వుండే బాక్సాఫీసు వ్యతిరేక ఎండ్ సస్పెన్స్ కథనం కవరై పోతుంది. అసలు మనం చూస్తున్నది మర్డర్ మిస్టరీ అనే ఫీలే వుండదు.  

        ఇంకో టైపు కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ క్రియేట్ చేసేది. ఇందులో హత్యనీ, హంతకుణ్ణీ ముందే చూపించేసి, వాణ్ణి పట్టుకోవడం గురించి సీనుకి సీనుకీ సస్పెన్స్ ని  పోషిస్తూ, ఓపెన్ గేమ్ గా చూపిస్తారు.

        ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాల్లో పదేపదే చెప్పుకున్నట్టు, చివరి దాకా నేరస్థుడెవరో  ప్రేక్షకులకి తెలియకుండా వుంచడమనే ఎండ్ సస్పెన్స్ కథనాలనేవి నవలా ప్రక్రియలు. ప్రసిద్ధ నవలల నుంచే ఆ కాలంలో ఇలాటి సినిమాలు రావడం మొదలెట్టాయి. కానీ నవలా కథనం వేరు, సినిమా కథనం వేరు. నవల చదువుతున్నప్పుడు మనస్సొక్కటే కథనం మీద ధ్యాసతో వుంటుంది. మిస్టరీ గురించి రకరకాలుగా వూహించుకుంటూ, ప్రశ్నలు వేసుకుంటూ చిట్ట చివరి పేజీల్లో మిస్టరీ వీడిపోయేదాకా. కానీ సినిమా చూస్తున్నప్పుడు మనస్సుతో బాటు కళ్ళు కూడా పనిచేస్తూంటాయి. ఇక్కడ మనసూ కళ్ళూ మ్యాచ్ అయితేనే సినిమాని చూడగలం. అంటే ఆ కళ్ళకి నేరస్థడు లేదా విలన్ తెరమీద కనపడిపోవాలి. అప్పుడే ప్లే రక్తి కట్టి సినిమాలో ఇన్వాల్వ్ అవగల్గుతారు.       
             ఎందుకిలా? మన మనో ప్రపంచం అలా వైరింగ్ అయి వుంది కాబట్టి. నిండు వెండి తెరమీద సినిమా చూడ్డమంటేనే, మనలోని  కాన్షస్ మైండ్ - సబ్ కాన్షస్ మైండ్ లు లడాయి పెట్టుకోవడం. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అంటారు. మన కాన్షస్ మైండ్  తెర మీద తన ప్రతినిధిగా హీరోని చూస్తూంటే, సబ్ కాన్షస్ మైండ్ విలన్ కి ప్రతీకగా వుంటుంది. అలాటిది ఎండ్ సస్పెన్స్ మిస్టరీ కథల్లో విలన్ని చివరి దాకా మరుగున పెట్టేస్తే, మన సబ్ కాన్షస్ మైండ్ ని పక్కన పెట్టేసి కథ నడపడమే నన్న మాట. అంటే సినిమా చూస్తున్నప్పుడు మానసికంగా మనం కోరుకునే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని తొలగించెయ్యడమన్న మాట. అంటే మన మనస్సుల్లో సగ భాగాన్ని కత్తిరించి అవతల పారెయ్యడమన్న మాట. అంటే పరిపూర్ణ వీక్షణానుభవాన్ని నిరాకరించడమన్నమాట. అంటే అన్నం పెట్టి కూర వేయక పోవడమన్న మాట. అంటే న్యూ ఇయర్ కి స్నాక్స్ పెట్టి డ్రింక్స్ దాచేయడమన్న మాట. సినిమా తీసి నాలుగు డబ్బులు కళ్ళ జూడాలనుకునే రీజనబుల్ మానవుడు చేసే పనేనా ఇది? ఇదో రకం ఆత్మహత్య!

        ఇలా చిట్టచివర్లో నేరస్థుడు తెలిసే మిస్టరీ సినిమాలకి రిపీట్ ఆడియెన్స్ కూడా వుండరు. నేరస్థుడెవరో తెలిసిపోయాక రెండోసారి చూడ్డానికి సస్పెన్స్ ఏముంటుంది. సినిమా ఒకసారి చూస్తే చాలనుకుంటారా నిర్మాతలు? ఒకసారి చూడ్డానికైనా మిగిలేదెంతమంది? విడుదలైతే మార్నింగ్ షోకే ఆ ఎండ్ సస్పెన్స్ కొంపముంచుతుంది. షో చూసి వచ్చిన ప్రేక్షకులు నేరస్థుడెవరో చెప్పేస్తే చూడాలనుకునే ప్రేక్షకులకి చూడ్డానీకేమీ వుండదు. అప్పట్లో ‘అవేకళ్ళు’ చూసిన పాతాయన వున్నాడు. ఆయన ఇదే చెప్పాడు - ‘అవే కళ్ళు’ లో చివరికి దొరికే హంతకుడు నాగభూషణమేరా, నాగభూషణమేరా’ అని సినిమా చూసిన ప్రేక్షకులు బయటి కొచ్చి టాంటాం చేసి పారేశారని. ఓస్, ఐతే ఇంకేం చూస్తామని జనాలు అనుకోవడం. కనుక ఎండ్ సస్పెన్స్ సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ప్రేక్షకుల వరకే. ఇలా చెప్తే నొచ్చుకోవచ్చు, కానీ వాస్తవమిది. 


        నాటి ప్రపంచ ప్రఖ్యాత క్రైం నవలా రాణి అగథా క్రిస్టీ ఈ రకమైన మూస మర్డర్ మిస్టరీలకొక ఉపాయం కనిపెట్టింది. ఆమె రాసిన నవలలన్నీ ఎండ్ సస్పెన్స్ మిస్టరీలే. డిటెక్టివ్ హె ర్క్యూల్ పైరట్, లేదా డిటెక్టివ్ మిస్ మార్పుల్ పాత్రలతో మర్డర్ మిస్టరీలు రాసింది. ఆమె షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త సర్ అర్ధర్ కానన్ డాయల్ సరసన నిల్చింది. ఒక హత్య జరుగుతుంది. కొంత మంది అనుమానితులుంటారు. వీళ్ళల్లో ఎవరు హంతకుడో / హంతకురాలో డిటెక్టివ్ దర్యాప్తు చేసి చివర్లో రట్టు చేయడం. హత్య - అనుమానితులు -ఎవరు హంతకుడు చెప్పుకోండి చూద్దాం? - బాపతు టెంప్లెట్ లో అనాదిగా వుంటున్న మర్డర్ మిస్టరీల మూస కుంపటిని బద్దలు కొట్టి క్రైం సాహిత్యాభిమానుల్నిసంభ్రమాశ్చర్యాలకి గురి చేసింది. ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ లో పన్నెండు మంది అనుమానితుల్లో ఎవరు హంతకుడనే కథ నడుపుతూ నడుపుతూ చివరి కొచ్చేసరికి కథని రివర్స్ చేసేసింది. అనుమానితుల్లో ఒకడే హంతకుడయ్యే సాంప్రదాయాన్ని తీసి అవతల పెట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ పన్నెండు మంది అనుమానితుల్నీ హంతకులుగా పట్టించేసింది! అనుమానితుల్లో ఒకరు హంతకుడు అనే టెంప్లెట్ ని, అనుమానితులందరూ హంతకులే అనే కొత్త కథగా మార్చేసింది. ఇది ఎండ్ సస్పెన్స్ కే బిగ్ బ్యాంగ్. దిమ్మ దిరిగిపోయింది పాఠకులకి. ఇది మరో రీమేక్ గా సినిమా రూపంలో ఇటీవలే వచ్చింది. 

        ఒక కథ చేస్తున్నప్పుడు దాని సరికొత్త లాభదాయక వైవిధ్యాల కోసం రీసెర్చి కూడా అవసరమే. కథ రాసేపని తొంభై శాతమనీ, దాన్ని సినిమాగా తీసే పని పది శాతమేనని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు. దీన్నిలా మార్చుకోవచ్చు : కథ రాసేపని పది శాతమే, దాని రీసెర్చి తొంభై శాతం శ్రమ. ఐడియాని 90 రోజులు రీసెర్చి చేయండి, 10 రోజుల్లో రాసి అవతల పడెయ్యండి!

        ‘మత్తువదలరా’ లో అనుమానితులుండరు కానీ అదృశ్యంగా హంతకుడున్నాడన్న అంచనా ఇస్తూ కథ నడిపారు. చివర్లో ఆ అదృశ్య హస్తం రివీలయ్యాక, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే సమస్యే వచ్చింది. అప్పటి వరకూ విలన్ కన్పించక కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే లోపించింది. అంటే పాసివ్ కథనం అనివార్యమైంది. విలనే లేకపోతే ఎంత సేపని హీరో తంటాలు పడతాడు. పైగా చివర్లో హంతకుడు రివీలయ్యాక రిపీట్ ఆడియెన్స్ సమస్యతో బాటు, ఫస్ట్ షో వరకే షెల్ఫ్ లైఫ్ ప్రాబ్లం ఏర్పడింది. ఫలానా వాడు హంతకుడని టాక్ బయటికి వచ్చేస్తే, సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి అది స్పాయిలర్ అవుతుంది.  గత రెండు దశాబ్దాలుగా నయా మేకర్లు పదేపదే ఎండ్ సస్పెన్స్ సినిమాలు, పదేపదే పా సివ్ హీరో సినిమాలు, పదేపదే మిడిల్ మటాష్ సినిమాలు తీస్తున్నారు. వీటి గురించి పదేపదే రాసిరాసి, ఈ బ్లాగు ఉప్పెనలా పొంగి పొరలుతోంది. జై హింద్. బ్లాగు దారి బ్లాగుదే, మేకర్ల దారి మేకర్లదే.
ఎవరెలా చేశారు 
         హీరోగా శ్రీ సింహ కొత్త వాడయినా వున్న పాత్రని, పాత్ర చిత్రణని చిత్రిక పట్టాడు. ఐతే ఫ్రెండ్ నేర్పిన చిట్కా ప్రాక్టికాలిటీని కూడా అతను చిత్రిక పట్టాల్సింది. ఒకవేళ చిట్కా ప్రయోగిస్తూ దొరికిపోతే ఏం చేయాలన్న దాని గురించి. ఆ ఏం చేయాలన్న విరుగుడు మంత్రం తను అడగలేదు, ఫ్రెండ్ చెప్పలేదు. ఈ లోపం వల్ల ఫ్రెండ్ మాటే వేదంలా తీసుకుని పాసివ్ గా వెళ్లి ఇరుక్కున్నాడు. ఇది హీరో కుండాల్సిన లక్షణం కాదు. ఏదో విరుగుడు మంత్రాన్ని కూడా బామ్మ దగ్గర దొరికి పోయినప్పుడు ప్రయోగించి వుంటే పాత్ర పాసివ్ స్థాయి నుంచి  ఆ సన్నివేశంలో ఎదిగేది. ఏ సన్నివేశమైనా త్రీ యాక్ట్స్ లో వుంటుంది. అతను చిట్కా ప్రయోగించడం ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ అయితే, సెకండ్ యాక్ట్ ఆ ప్రయోగ ఫలితంతో సంఘర్షణగా వుంటుంది. సంఘర్షణ ఫలితంగా బామ్మ పడిపోవడం సెకండ్ యాక్ట్ ప్లాట్ పాయింట్ టూ అవుతుంది. ఇక్కడ అతను ఆ విరుగుడు మంత్రాన్ని ప్రయోగించిన ఫలితంగా బామ్మ పడిపోతే, ప్లాట్ పాయింట్ టూ అర్ధవంతంగా వుంటుంది. సన్నివేశం స్ట్రక్చర్ లో వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ చిట్కా ప్రయోగిస్తే అది బెడిసి కొట్టడమైతే, ప్లాట్ పాయింట్ టూ దీనికి పరిష్కారంగా విరుగుడు మంత్రం ప్రయోగిస్తే ఇది కూడా బెడిసి కొట్టడం. ఇలా చూస్తూ పోతే ఈ సినిమాలో అనేక సన్నివేశాలు బలహీనంగా వున్నాయి. సింహా ఎంత బాగా నటించినప్పటికీ సన్నివేశాల బలం కూడా అవసరం. 

        సత్య ఈ మిస్టరీకి ఎంటర్ టైన్మెంట్ సారధిలా నిల్చాడు. సింహా ఇమాజినేషన్ లో వచ్చి అతను చేసే ‘దెప్పి పొడిచే’ రివర్స్ కామెడీ, వివిధ గెటప్స్ లో నటనా కొత్తగా వున్నాయి. ఇంకో ఫ్రెండ్ పాత్రలో నరేష్ అగస్త్య, ఇమాజినేషన్ సీన్స్ లో షెర్లాక్ పరిష్కారాలు చెప్పేప్పుడు, ప్రొఫెషనల్ బిహేవియర్ తో మెప్పిస్తాడు. ఇతర ఫన్నీ పాత్రల్లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, విద్యుల్లేఖా రామన్ లు ఎంటర్ టైన్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక దర్శకుడు బ్రహ్మాజీ ఎక్స్ ప్రెషన్స్ ని సమున్నతంగా క్లోజప్స్ లో పట్టుకోవడం ఇదే. బ్రహ్మాజీ క్లోజప్స్ నటనకి ఫిలిం స్కూల్ పాఠాలు. ఇక డ్రగ్ ఎడిక్ట్ గా అతుల్యా
చంద్రది నెగెటివ్ పాత్ర నటన. 

        కాల భైరవ సంగీతం ట్రెండీగా, క్యాచీగా వుంది యూత్ ని దృష్టిలో పెట్టుకుని. అలాగే  కెమెరా వర్క్ తో సురేష్
సారంగం, ఆర్ట్ డైరెక్షన్ తో ఏఎస్ ప్రకాష్, యాక్షన్ తో యు. శంకర్ లో- బడ్జెట్ అన్న ఫీల్ రాకుండా క్వాలిటీ నిచ్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ స్ప్లిట్ ఎడిట్ తో ట్రెండీ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఐతే క్లయిమాక్స్ నిడివిని తగ్గించ లేకపోయింది. లొకేషన్స్ పరంగా ఇంటీరియర్సే తొంభై శాతం వున్నాయి. ఒక అపార్ట్ మెంట్ బిల్డింగ్, ఒక బస్తీలో పోర్షన్, లో- బడ్జెట్ కివే లొకేషన్స్. డ్రగ్ మత్తు హేల్యూసినేషన్స్ సీజీ వర్క్ అభౌతిక లోకాల్ని సృష్టిస్తూ నాణ్యతతో వుంది. 

చివరికేమిటి
       రీతేష్ రానా, తేజాల రచన నూలు పోగంతటి కథని కథనంతో నిలబెట్టే ప్రయత్నం చేసింది. మొదటి ముప్ఫై ఐదు నిమిషాల్లో బామ్మ చావుతో మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) వచ్చేసింతర్వాత, చివరి ఇరవై నిమిషాలకి హంతకుడి గుర్తింపుతో రెండో మలుపు(ప్లాట్ పాయింట్ టూ) వస్తుంది. మధ్యలో గంటకి వచ్చే ఇంటర్వెల్ ఫాల్స్ ఇంటర్వెల్ బ్లాక్. ఏదో ఘోరం జరిపోతోందన్నట్టు ఇంటర్వెల్లో ఆపి, ఓపెన్ చేస్తే - అది ఉట్టిదే నని తేల్చేయడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే. కథనం ట్రాకు నుంచి తప్పిపోవడమే. దీని బదులు ఆ తలుపు కొట్టిన వ్యక్తిగా బ్రహ్మాజీనే చూపించి ఇంటర్వెల్ వేసి వుంటే, సస్పెన్స్ క్రియేట్ అయ్యేది. చచ్చిపోయిన బ్రహ్మాజీ పాత్ర ఎలా బ్రతికి వచ్చింది?- ఇదీ ప్రేక్షకులు వేసుకునే ప్రశ్న. కథమంటే ప్రశ్నలు వేసి జవాబులు చెప్పడమేగా? అలా ప్రేక్షకుల్ని బిజీగా వుంచడమేగా? లేకపోతే ఖాళీగా మరబొమ్మల్లా కూర్చోవడానికి ప్రేక్షకులు సినిమాల కొస్తారా?       

        తర్వాత ఆ తలుపు కొట్టిన బ్రహ్మాజీ పాత్ర కూడా హీరో ఇమాజినేషనే నని లాజికల్ గా వివరణ ఇవ్వొచ్చు. కథనం చెదిరి పోకుండా ట్రాకులో వుంటుంది. ఇంటర్వెల్ అంటే కథలోనే వెతుక్కుని సృష్టించే మలుపు, అంతేగానీ పక్క నుంచి ఇంకేదో తెచ్చుకుని కలిపేది కాదు.   ఫస్టాఫ్ ముప్ఫై ఐదవ నిమిషం నుంచీ ఇంటర్వెల్ ముందు సీను వరకూ బామ్మ సీనుతో ఒకే 25 నిమిషాల సుదీర్ఘ సీను. క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్’ లో సీన్స్ లాగా. ఈ టెక్నిక్ వాడి వుంటే, ఇంత సుదీర్ఘ సీను ఉండుండి ఒక పెద్ద బ్యాంగుతో ముగిసివుంటే -‘కిల్ బిల్’ లో లాగా ఒక ‘వామ్మో’ (whammo) క్రియేట్ అయ్యేది. 

        ఫస్టాఫ్ తో పెద్దగా ఇబ్బంది లేదు, సెకండాఫ్ లోనే సమస్యలు. లాజికల్ సమస్యలతో బాటు, హంతకుడెవరన్న కాలం చెల్లిన మిస్టరీతో వచ్చే సమస్యలు. హంతకుణ్ణి రివీల్ చేశాక కథనంతో సర్వ సాధారాణంగా జరిగే తప్పే జరిగింది. ఇక ఆ హంతుకుడు ఏది ఎలా ఎప్పుడెందుకు చేశాడో సినిమా మొదట్నుంచీ వరసగా కార్యకారణ సంబంధాలు చెప్తూ వివరించే తతంగం. ఇది ప్రింట్ మీడియా నవలకి ఇప్పుడూ చెల్లుబాటవుతుంది, విజువల్ మీడియా సినిమాకి కాదు. అవన్నీ కలిపి ఆలోచించుకుంటూ అర్ధంజేసుకునే మానసిక శ్రమ ప్రేక్షకులు తీసుకోరు. పాసివ్ గా చూస్తూంటారు. అసలు దొరికిపోయిన హంతకుడు తన దుకాణ మంతా ఎందుకు విప్పుతూ కూర్చుంటాడు- అందునా ‘షెర్లాక్ హోమ్స్’ లాంటి వాడు? వాడు హీరో మెడకే బిళ్ళ వేసే ప్లానుతో వెంటనే ఉడాయిస్తాడు!

        అంటే ఈ సీను వెర్బల్ గా గాకుండా యాక్షన్ తో వుండాలి. వీడే హంతకుడని హీరో పట్టుకున్నాక, హంతకుడి చేత ఎలా హంతకుడో చెప్పిస్తూ కూర్చునే డైలాగుల దుకాణం పెట్టకుండా, ఆ హంతకుణ్ణి వెంటనే జంప్ అయ్యేలా చేస్తే - వాడి కోసం క్లయిమాక్స్ యాక్షన్ మొదలైపోతుంది. వీడే హంతకుడని హీరో పట్టుకోవడం ఆడియెన్స్ కి షాక్ వేల్యూయే అనుకుందాం- అప్పుడా షాక్ వేల్యూని సస్టెయిన్ చేయడం ఈ కీలక మలుపులో చాలా అవసరం. లేకపోతే ప్లాట్ పాయింట్ టూ కి అర్ధమే లేదు. ప్లాట్ పాయింట్ టూ అనేది స్క్రీన్ ప్లే కి మూడో మూల స్థంభం. వెంటనే హంతకుడు పారిపోయేలా చేస్తే ఇది సస్టెయిన్ అవుతుంది. అక్కడే వాడి చేత డైలాగుల దుకాణం పెట్టిస్తే, డైల్యూట్ అయిపోతుంది షాక్ వేల్యూ. పారిపోయిన వాణ్ణి హీరో పట్టుకుంటే, అప్పుడు హీరోయే వాడి అభియోగాల చిట్టా విప్పితే, యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు. హీరోకి అసలేమీ తెలీదన్నట్టు హంతకుడే  తన బాగోతం చెప్పుకుంటే హీరో పాసివ్ క్యారక్టర్ అయిపోతాడు. తను ఏదెలా చేశాడో తనే చెప్పుకుంటే  ఆడియన్స్ కి గగుర్పాటు కలగదు. ఎందుకంటే అది పాసివ్, సెకండ్ హేండ్ ఇన్ఫర్మేషన్, వాడి మాటలు నమ్మాలని కూడా లేదు.  వాడి నిజ స్వరూపం హీరోయే విప్పి చెప్పేస్తూంటే - ఆడియెన్స్ కి తాము కనిపెట్ట లేకపోయిన పాయింట్స్ ని ఇంతసేపూ (ఈ మిడిల్ విభాగంలో కథ జరిగినంత సేపూ) హీరో కనిపెడుతూనే  వున్నాడన్న స్పృహలో కొచ్చి, హీరో మీద అభిమానం మరింత పెరిగే అవకాశం వుంటుంది. హీరో అనేవాడు ఎప్పుడూ ప్రేక్షకులకంటే పై స్థాయిలో వుంటాడు.

        ఇలా చేసినా ఈ మిస్టరీ నిలబడుతుందా? పైనే చెప్పుకున్నట్టు, ఇలాటి ఎండ్ సస్పెన్స్ మిస్టరీలతో హంతకుణ్ణి దాచి పెట్టి చివరికి చెప్పడంలో వున్న మౌలిక సమస్య - మౌత్ టాక్ తో రివీలై పోయే, రిపీట్ ఆడియెన్స్ కి నెగెటివ్ గా పరిణమించే - బాక్సాఫీసు వ్యతిరేక ఫలితాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.

సికిందర్