రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, నవంబర్ 2017, సోమవారం

554 : రివ్యూ!


దర్శకత్వం : కెన్నెత్ బ్రనగా
తారాగణం : కెన్నెత్ బ్రనగా, జానీ డెప్ ,పెనెలోప్ క్రజ్, జూడీ డెంచ్మిషెల్ ఫీఫర్,  డైసీ రిడ్లీడెరెక్ జాకోబీ తదితరులు
కథ : అగథా క్రిస్టీ,  స్క్రీన్ ప్లే : మైకేల్ గ్రీన్,  సంగీతం : పాట్రిక్ డాయెల్,  ఛాయాగ్రహణం : హేరిస్ జంబర్ లౌకోస్
నిర్మాణం : కిన్ బెర్గ్ జానర్,  ది మార్క్ గోర్డాన్ కంపెనీ,  స్కాట్ ఫ్రీ ప్రొడక్షన్స్
విడుదల :  నవంబర్ 24, 2017
***
        గత మెంతోఘనకీర్తి, వర్తమానం శూన్యం అన్నట్టుంది హాలీవుడ్ హడావిడి. వర్తమాన సమకాలీన ప్రపంచ సంగతులు పక్కన పెట్టి, గడిచిపోయిన పాత కాలపు సంగతుల్ని వర్తమానంలోకి తోడి చూపిస్తోంది. ఇంకా రాని కాలపు వూహల్ని ఇదే వర్తమానంలోకి తెచ్చి  ప్రదర్శిస్తోంది. వర్తమానాన్ని భూత భవిష్యత్ కాలాల దర్శనీయ స్థలంగా మార్చేస్తోంది.  మూడు పీరియెడ్లు ఆరు ఫ్యూచర్లు గా వర్ధిల్లుతోంది. తీస్తే పీరియెడ్ సినిమాలు, లేదంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలు తీసుకుంటూ వర్తమానంలో ఏదో వుందనుకుంటున్న శూన్యాన్ని భర్తీ చేస్తోంది. మరి ఇప్పుడున్న వర్తమాన సంగతులు ఇంకెప్పుడు చూపిస్తుందంటే, మరో యాభై ఏళ్ల తర్వాత అవి భూతకాలపు సంగతులయ్యాక.  అంటే ఇలా మనం ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసుకోలేమన్న మాట, ఇంకెప్పుడో భవిష్యత్ తరాలకి అప్పటి పీరియెడ్ సినిమాలుగా తీసి అపురూపంగా చూపిస్తారన్నమాట. పలాయనవాదాన్ని మించిన సక్సెస్ మంత్రం ఏముంది?

          ఇలా ఇప్పుడు 83 ఏళ్ల నాటి  అగథాక్రిస్టీ కథతో  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ అనే పీరియడ్ మూవీ తీశారు. పీరియెడ్ కథ, దానికో ఫేమస్ రచయిత / రచయిత్రి పేరుంటే చాలు, లాంచింగ్ తోనే బజ్ క్రియేట్ చేస్తుంది. ఇంతకన్నా పబ్లిసిటీ ఏం కావాలి. మరి ఆ కాలపు పాత ఫ్యాషను కథల్నీ, ముసలి హీరోల్నీ ఇప్పుడెవరు చూస్తారంటే, విదేశాల్లో 40 కి ఇటూ అటూ వయసున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా చూస్తారు. అక్కడ విభజనలేదు. ఇండియాలో 40 కి ఇటున్న వాళ్ళు ఎలాగూ చచ్చినా చూడరు,  వాళ్ళ టేస్టు వేస్టు వేరు. 40 రాగానే సినిమాలు చూడ్డం మానేసిన వాళ్ళు, ఖర్మ తప్పదనుకుంటూ  కదలవచ్చు ఇలాటి సినిమాలకి. ఐతే ఒక షరతు : అగథా క్రిస్టీ ఎవరో, ఆమె సృష్టించిన డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ పాత్ర ఏమిటో తెలిసివుంటే, పనిలో పనిగా చదివి కూడా వుంటే -  ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

కథ   
     డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ (కెన్నెత్ బ్రనగా) జెరూసెలం చర్చిలో ఒక దొంగతనం కేసుని  యాక్షన్ తో మహాద్భుతంగా పరిష్కరించి, కొంత కాలం విశ్రాంతి తీసుకుందామని ఇస్తాంబుల్ బయల్దేరతాడు. అక్కడ విశ్రాంతి తీసుకుని, లండన్ లో ఇంకో కేసు అటెండవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. జెరూసలెంలో ఓరియెంట్  ఎక్స్ ప్రెస్ ఎక్కి బయల్దేరినప్పుడు రచెట్ (జానీ డెప్) అనే బిజినెస్ మాన్ పరిచయం చేసుకుని, తనని చంపాలని చూస్తున్న ఒక గ్యాంగ్ బారి నుంచి కాపాడేందుకు రక్షణగా వుండాలంటాడు. నీ ఫేసు నాకు నచ్చలేదని తిరస్కరిస్తాడు పైరట్. ఆ రాత్రి ఆల్ప్స్ పర్వతాల మధ్య నుంచి ట్రైను పోతున్నప్పుడు వాతావరణం బీభత్సంగా తయారై, హిమపాతానికి రైలు మార్గం మూసుకుపోయి ట్రైనాగిపోతుంది. తెల్లారి చూస్తే కూపేలో రచెట్ చనిపోయి వుంటాడు. పన్నెండు కత్తిపోట్లు పొడిచి ఎవరో చంపారు.

          ఈ లగ్జరీ ట్రైనులో రిటైరైన నటి కరోలిన్ (మిషెల్ ఫీఫర్), స్పానిష్ నర్సు ( పెనెలోప్ క్రజ్), ఓ నీగ్రో డాక్టర్, ఇతనితో రహస్య ప్రేమాయణం సాగిస్తున్న మేరీ (డైసీ రిడ్లీ) అనే బ్యూటీ, ఇంకో రష్యన్ యువరాణి (జూడీ డెంచ్), మరింకో  హంగేరియన్ యువరాజు, ఇంకో కోపిష్టి క్యూబన్ ... ఇలా పన్నెండు మంది వుంటారు. వీళ్ళల్లో ఎవరీ హత్య చేశారు? ఎందుకు చేశారు? విశ్రాంతి తీసుకుందామని పోతున్న పైరట్ కి ఈ అత్యవసర పరిస్థితి మళ్ళీ కేసులోకి దింపుతుంది.  హతుడైన రిచెట్ దగ్గర పైరట్ కి ఓ పాత కాగితం దొరుకుతుంది. దాని మీద చెడిపోయిన అక్షరాలు ఒక పాత కేసుని జ్ఞప్తికి తెస్తాయి. ఆ కేసులో డైసీ అనే బాలికని కాసెట్టీ అనే క్రిమినల్ కిడ్నాప్ చేసి, డబ్బు గుంజి చంపేశాడు. ఈ షాక్ కి కడుపుతో వున్న బాలిక తల్లి సోనియా (మిరాండా రైసన్) చనిపోయింది. తట్టుకోలేక బాలిక తండ్రి కల్నల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరెస్టయిన పని మనిషి అవమానం తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంది. ఒక కిడ్నాప్ ఇన్ని చావులకి దారితీసింది... అయితే ఆ కిడ్నాపర్ కాసెట్టీయే,  ఇప్పుడు  హత్యకి గురైన బిజినెస్ మాన్ రచెట్ అని గుర్తిస్తాడు పైరట్. 

          ఇతణ్ణి ఎవరు చంపారన్నది మిస్టరీగా మారుతుంది. పైన చెప్పుకున్న సెకండరీ మిస్టరీతో ఈ మిస్టరీకి ఏమైనా సంబంధముందా? అదెలాటి సంబంధం? ఇతణ్ణి చంపి ఎవరు లాభపడతారు? ఆ వ్యక్తి  ఎవరు?... ఇవీ పైరట్ ముందున్న గడ్డు ప్రశ్నలు. 

ఎలావుంది కథ
       ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్ నవలారాణి – క్వీన్ ఆఫ్ క్రైమ్ - అగథా మేరీ క్లారిస్సా  క్రిస్టీ (1890 -1976), 1934 లో ఇదే పేరుతో రాసిన నవలకి రెండోసారి వెండి తెర రూపమిది. మొదటి సారి 1974 లో తెర కెక్కించారు. అది బాగా పేరు తెచ్చుకుంది. క్రిస్టీ సృష్టించిన డిటెక్టివ్ పైరట్ పాత్ర షెర్లాక్ హోమ్స్ తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్లాసిక్ పాత్ర. బ్రిటన్ కి చెందిన క్రిస్టీ,  ఎక్కువగా  గ్రామీణ వాతావరణంలో మర్డర్ మిస్టరీలు రాయడం ఒకెత్తు, పైరట్ కథానాయకుడుగా రాసిన 33 నవలలూ ఒకెత్తూ.
          క్రిస్టీ నవలలు ముగింపులకి పెట్టింది పేరు. ఎవరి వూహకీ అందని, మతులు పోయే, సంభ్రమాశ్చర్యాలు కల్గించే ముగింపు లివ్వడం ఆమె ప్రత్యేకత. ది ఎబిసి మర్డర్స్, వన్ టూ బకిల్ మై షూ, ఎండ్ లెస్ నైట్, ఈవిల్ అండర్ ది సన్... ఇలా ఏ మిస్టరీ చూసినా పరిపుష్టమైన భాషతో సాహిత్యాభిలాషుల విందులా కూడా వుంటాయి. 

         ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ అయితే మర్డర్ మిస్టరీల జానర్ లో గేమ్ ఛేంజర్. ఒక విప్లవం. ఆ కాలపు ఉద్దండ రచయితలు అలెన్ పో, కానన్ డాయెల్, ఇంకెవరూ వూహించనే లేకపోయిన - ఇలా కూడా చేయవచ్చాని ఆలోచనే చేయలేకపోయిన, అనితర సాధ్య ప్రయోగం చేసింది అగథా క్రిస్టీ దీని ముగింపుతో. ఆనాడూ ఈనాడూ మర్డర్ మిస్టరీలకున్న ఒకే ఒక్క ఫార్ములా ఏమిటి? ఓ నల్గురో, ఇంకెక్కువ మందో అనుమానితులుంటే,  వాళ్ళల్లో ఎవరు హంతకుడో,  లేదా హంతకురాలో కనిపెట్టడమేగా? ఈ చట్రంలోనే మిస్టరీలు వుంటాయిగా?  ఇలాకాక, మొత్తం అనుమానితులందరూ  హంతకులైతే?? .... అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? క్రిస్టీకే వచ్చింది. దీంతో ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ లో హంతకుడెవరా అని  అన్వేషిస్తున్న పైరట్ కి,  మొత్తం పన్నెండు మంది అనుమనితులూ హంతకులుగా  దొరికిపోతారు!!!

          ఫార్ములాని బ్రేక్ చేసి, మూస చట్రంలోంచి మర్డర్ మిస్టరీ జానర్ ని బయట పడేసింది  క్రిస్టీ అప్పట్లోనే. అయితే నవలకీ సినిమాగా మార్చిన కథకీ తేడాలున్నాయి. సినిమా ప్రారంభంలో వున్న జెరూసలెం ఎపిసోడ్ సినిమాకోసం సృష్టించిందే. యాక్షన్ సీన్లు కూడా నవల్లో లేవు. ముగింపులో  పైరట్ పాత్ర ముగింపు విషయంలో కూడా  సినిమా కథకి పొడిగింపు వుంది. వీటి గురించి చివర చూద్దాం. 

ఎవరెలా చేశారు 
     అగథా క్రిస్టీ వర్ణన ప్రకారం డిటెక్టివ్ హెర్క్యూల్ పైరట్ ఐదున్నర అడుగుల ఎత్తు వుంటాడు. మీసం వుంటుంది. కొంచెం తిక్కగా వుంటాడు. బెల్జియం దేశస్థుడు. ప్రస్తుతం ఈ పాత్ర పోషించిన బ్రిటిష్ నటుడు, ఈ సినిమా దర్శకుడూ అయిన కెన్నెత్ బ్రనగా మూడంగుళాలు ఎక్కువే ఎత్తుంటాడు. . మీసం మామూలుగా వుండదు. గదిలో వుంటే ఈ చివరనుంచి ఆ చివరిదాకా వున్నట్టు కన్పిస్తుంది. నవ్వు తెప్పించే అదే తిక్కతనంతో వుంటాడు. అంతే సీరియస్ గా కేసుతో ప్రవర్తిస్తాడు. 1974 లో ఈ పాత్రని బ్రిటిష్ నటుడు ఆల్బర్ట్ ఫిన్నే పోషించాడు. అది పూర్తిగా క్రిస్టీ వర్ణనకి సరిపోతుంది. బెల్జియం వ్యక్తి అన్పించేలా వుంటాడు. 
          బ్రనగా బెల్జియం దేశస్థుడిలా కూడా అన్పించకపోయినా, ఈ పాత్ర పూర్తిగా అతడి వన్ మాన్ షో. చాలా పకడ్బందీగా, ఒక డిటెక్టివ్ ఎలా వుంటాడో, ఎలా వుండాలో అంత వృత్తితత్వాన్ని కనబరుస్తూ కట్టిపడేస్తాడు. గగుర్పాటు కల్గించే మూడు యాక్షన్ సీన్లు కూడా చేస్తాడు. దిక్కూమొక్కూ వుండని ఆల్ప్స్ పర్వతాల మధ్య ఒక ఎత్తైన బ్రిడ్జి మీద ట్రైన్ ఆగిపోయి – చూస్తేనే ఆ దృశ్యం భీతావహంగా వుంటుంది. బ్రనగా యాక్షన్ ఇక వూహించుకోవాల్సిందే. 

          ఈ హత్య కేసంతా బాహ్యంగా అతడి మేధా శక్తిని పరీక్షించేదైనా, అంతర్గతంగా అతను బాధపడేది  - ఫ్లాష్ బ్యాకులోని ఒక కిడ్నాపూ- దాని విపరిణామాలకి. అయితే ఆ క్రిమినల్ ఇప్పుడు హతుడయ్యాడు. ఇతడికి న్యాయం చేయాల్సి వచ్చిన నైతిక బాధ్యత –చివరికి అనుమానితులందరూ ఇతడి హంతకులే అయ్యేసరికి – తనకే ప్రశ్నఅయి ఎదురు నిలబడుతుంది బ్రనగాకి బాధ్యత. ఇప్పుడతను పడే వేదన, న్యాయం చెప్పలేని అశక్తత, కళ్ళల్లో తిరిగే నీరు – ఈ ప్రపంచంలో న్యాయం త్రాసుని ఎల్లప్పుడూ బ్యాలెన్సు చేయడం సాధ్యం కాదనే అంతర్ముఖీన విలాపం (“ The scales of justice cannot always be equally weighed ” ) - ముగింపుకో  నూలు పోగు. అతడి మీద చివరి మూడు నాల్గు దృశ్యాలు గుండెని మెలితిప్పే భావోద్వేగపు కణికలు.

          బ్రనగా ఇతర హేమాహేమీలైన నటులందరితోనూ సమర్ధవంతంగా నటింప జేశాడు. హాలీవుడ్ బిగ్ స్టార్స్ జానీ డెప్ తో బాటు పెనెలోప్ క్రజ్,
మిషెల్ ఫీఫర్, జూడీ డెంచ్ తదితరులతో సిల్వర్ స్క్రీన్ బ్రహ్మాండంగా వెలిగిపోతూంటుంది. దృశ్యాలు  పీరియెడ్ లుక్ తో రిచ్ గా, క్లాసిక్ గా వుండేవే. ఆల్ప్స్ మంచు పర్వతాల మధ్య ట్రైను పోతూండే ఔట్ డోర్ దృశ్యాలు, రాత్రిపూట భీకరంగా మారే వాతావరణంలో, ఈదురు గాలులూ పిడుగు పాట్లూ హిమపాతాల మధ్య – చుక్కు చుక్కు చుక్కు మనుకుంటూ, ఆవిరింజను బోగీల్ని లాక్కుంటూ పోయే ప్రకృతి కెదురీతా, ఠకాల్మని అంతెత్తు బ్రిడ్జి మీద భయానకంగా ఆగిపోయీ -  చివరిదాకా అందులోనే సాగే ఉత్కంఠ రేపే మర్డర్  డ్రామా – ఇవన్నీ విజువల్ అప్పీల్ ని హిమాలయాలకి తాటించే  శిఖరాగ్ర స్థాయి చిత్రీకరణలే. దర్శకుడిగానూ కెన్నెత్ బ్రనగా అపూర్వ విరుపులు – మాస్టర్ స్ట్రోక్స్. 

చివరికేమిటి 
        ప్రధానంగా ఏమిటంటే ఇది ఎండ్ సస్పెన్స్ కథ. ఈ మధ్య తెలుగు సినిమాల్లో దీని గురించి ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం. అదిప్పుడు మౌలికంగా ఎలా వుంటుందో అలా ప్రత్యక్ష మయింది. మర్డర్ మిస్టరీ లన్నీ ఎండ్ సస్పెన్స్ లే. క్రిస్టీ నవలన్నీ ఇవే. ఎండ్ సస్పెన్స్ ని నవలగా చదవగలం  గానీ సినిమాగా చూడలేం. చదవడానికీ చూడడానికీ తేడా వుంది. సినిమాగా చూస్తే ఏమవుతుందంటే : 1. హంతకుడెవరా అని చివరివరకూ ఓపికపట్టి చూడాలి, 2. చివరిదాకా విలన్ కన్పించకపోవడంతో హీరో పాత్ర నిరుద్యోగిగా కన్పిస్తూ బోరు కొడుతుంది, 3. మొదటి ఆట చూసిన ప్రేక్షకుల ద్వారా హంతకుడెవరో తెలిసిపోతే తర్వాతి ఆటలకెళ్ళే  ప్రేక్షకులకి ఏ సస్పెన్సూ వుండదు.

         కాబట్టి మొదటి రెండిటి ఖర్మ ప్రేక్షకులు అనుభవిస్తారు. మూడోది ఆ సినిమా నిర్మాతలు అనుభవిస్తారు. నిర్మాతల శ్రేయస్సు కోసమైనా ఒక్క ఆట సస్పెన్సు  కోసం ఈ బుద్ధి మాలిన పని చెయ్యడు ఏ సినిమా కథకుడూ. చేశాడంటే జైల్లో పెట్టాల్సిందే. 

          అమెరికన్ రచయిత్రి, బుక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంజె రోజ్ ఏం చెప్పిందో ఓసారి చూద్దాం : A mystery is a whodunit. You know what happened, but not how or who's behind it. A thriller, or a suspense, is a howdunit. You know what happened, and you usually know who did it, but you keep reading because you want to know how they pulled it off.

          మిస్టరీ అంటే, whodunit (ఎవరు చేశారు?) అన్న ప్రశ్నతో సాగేది. ఏం జరిగిందో మనకి చూపిస్తారు. కానీ ఎవరు చేశారో, ఎలా చేశారో చివరి దాకా సస్పెన్స్ లో వుంచుతారు. సస్పెన్ థ్రిల్లర్ అంటే, howdunit (ఎలా చేశారు?) అనే ప్రశ్నతో సాగేది. ఏం జరిగిందో, ఎవరు చేశారో మనకి చూపించేస్తారు. ఎలా చేశారనేది సస్పెన్స్ లో పెడతారు. ఈ రెండోదే సినిమాలకి పనికొస్తుంది. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే-  హత్య జరిగింది, ఎవరు చేశారో అప్పుడే తెలిసిపోయింది, ఈ విలన్ని  హీరో ఎలా పట్టుకుంటాడనే ‘సీన్ టు సీన్ సస్పెన్స్’  ని సృష్టిస్తూ సాగేదే సస్పెన్స్ థ్రిల్లర్. మొదటిది ఎండ్ సస్పెన్స్ అయితే, ఇది సీన్ టు సీన్ సస్పెన్స్.  దీంతోనే ఎన్ని ఆటలైనా సినిమా ఆడుతుంది, మిగతా విషయాలు బావుంటే. సినిమాలకి ఎలా? అన్న ప్రశ్నే చూసేట్టు చేస్తుంది, ఎవరు? అనేది కాదు. ఎవరు? అనేది తెరమీద కనబడిపోతూండాలి, హీరోతో సిగపట్లకి దిగిపోవాలి. అప్పుడే మజా వస్తుంది. ‘స్పైడర్’ లో సైకోకిల్లర్ సూర్య ని చివరి వరకూ దాచి పెడితే,  మహేష్ బాబు ఏం చేస్తూండే వాడు? సినిమా ఫిజికల్ గా వుండాలి, నవల మానసికంగా వుండొచ్చు. 

మరెలా చూడాలి?
     ఇలాటి ఎండ్ సస్పెన్స్ తో వున్న ఎంఓఎ  (మర్డర్ ఆన్ ది ఓరియెంట్  ఎక్స్ ప్రెస్)  ని మరి ఇప్పుడెలా చూడగలం?  ఎలా చూడగలమంటే, ఆ కాలంలో అలా రాసేవాళ్ళు కాబట్టి ఆ కాల నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే చూడగలం. ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్న నవలని కోట్లాది మంది చదివేసి వుంటారు కాబట్టి ఇలాకూడా  సినిమా చూడ్డానికి ఏ సస్పెన్సూ వుండదు. అలాటి నవలని ఎలా తీశారనే అకడెమిక్ ఇంటరెస్ట్ తో చూసేవాళ్ళే ఎక్కువ. ఇలా ఇప్పటి కాల నేపధ్యంలో  ‘స్పైడర్’ తీస్తే ఒక్క ఆట కూడా ఆడదు. నిజ సంఘటనల మీద తీసే మర్డర్ కథల్ని కూడా  ఎండ్ సస్పెన్స్ తోనే వున్నా చూడగలం. ఎందుకంటే ఆ నిజ కథ దగ్గర ఫిక్స్ అయిపోయి, ఆ కళ్ళద్దాలతో చూస్తాం కాబట్టి. నోయిడాలో జరిగిన ఆరుషి హత్యకేసు మీద తీసిన ‘తల్వార్’ ఇలాటిదే. హంతకులెవరో తేల్చడానికి సాగే దర్యాప్తే కథ. ఇలా నిజకథలూ, పీరియెడ్ కథలూ అనే ప్రాతిపదిక లేక,  ఫిక్షన్ చేసి ఇప్పుడు జరుగుతున్న కథలా చేస్తే - ఆ ఎండ్ సస్పెన్స్  పనికిరాదు. 

           ఎంఓఎ కి స్క్రీన్ ప్లే రూల్స్ అన్నీ వుంటాయి. బిగినింగ్ మొదటి అరగంట వరకూ ట్రైన్ ఎక్కే వివిధ పాత్రల పరిచయాలూ,  వాటి  కాలక్షేపాలూ వుంటాయి. దాదాపూ ఇరవై పాత్రలు. సినిమా కాబట్టి ఇన్నేసి పాత్రల పేర్లు తెలుసుకోక పోయినా, గుర్తుంచుకోక పోయినా,   స్టార్స్ ని బట్టి వివిధ దృశ్యాల్లో ఎవరేం చేశారో, చేస్తున్నారో గుర్తుంచుకుంటూ పోగలం. కానీ స్క్రీన్ ప్లే చదివితే పేర్లే గుర్తుంచుకోవాలి. ఆ పేర్లతో ఎవరేమిటో గుర్తు పెట్టుకోవాలి. ఆ పేర్లతోనే ఎవరు ఎవరితో ఏం చేస్తూపోతున్నారో అతి కష్టపడి గుర్తుపెట్టుకుంటూ పోవాలి. ముప్పై పేజీల ఈ బిగినింగ్ విభాగపు పాత్రల పరిచయ కార్యక్రమంలో ఇన్నేసి పాత్రలతో గజిబిజి అయి,  బుర్ర చెడి పక్కన పడేస్తాం కాసేపు. ఎవరెవరెవరో ఒక లిస్టు రాసుకుని,  అది చూసుకుంటూ  చదివితే గానీ ఆ పైన చదవే పరిస్థితి వుండదు. నవల్లో స్పేస్ ఎక్కువ కాబట్టి, పాత్రల  వర్ణనలూ బయోగ్రఫీలూ ఎక్కువుంటాయి కాబట్టీ, మనసులో ముద్రించుకుంటూ వెళ్ళగలవు (ఎప్పుడో ఇంటర్మీడియేట్ లోవున్నప్పుడు చదివిన నవల్లో పాత్రలు ఇప్పుడేం గుర్తుంటాయి. నిక్కర్లేసుకుని ఎనిమిదో తరగతి లో వున్నప్పుడు పరిస్థితులు డిమాండ్ చేసి చదవడం ప్రారంభించిన కొమ్మూరి, టెంపోరావ్ నవలల్లో పాత్రలు  గుర్తున్నాయి విచిత్రంగా).  క్రిస్టీ ఇన్నేసి (పన్నెండు అనుమానిత పాత్రలే గాక మరెన్నో) పాత్రల్ని పెట్టడంలో ఒక ఉద్దేశముంది. కోర్టు జ్యూరీలో పన్నెండుమంది సభ్యులుంటారు. ఆ జ్యూరీని సింబాలిక్ గా వీళ్ళతో చివర్లో వాడుకోవడానికే  పెట్టింది.

ఎండ్ సస్పెన్స్ తో ఏం చేశారు?
        పాత్రల పరిచయాలయ్యాక,  ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన మొదలవుతుంది. తనకి ప్రాణహాని వుందని రిచెట్ పాత్ర పైరట్ ని రక్షణ కోరడం, పైరట్ తిరస్కరించడం, ఆ రాత్రి అల్లకల్లోల వాతావరణం ....మొదలైన వాటితో సమస్యకి దారితీసే పరిస్థితుల్ని కల్పించాక, ఇక సమస్య ఏర్పాటవుతుంది - ప్లాట్ పాయింట్ వన్ - తెల్లారి చూస్తే  రిచెట్ హత్య జరిగి వుండడం. ఇప్పుడు స్క్రీన్ టైం ముప్పావు గంట. కథ ప్రారంభమయ్యింది. మిడిల్లో పడింది కథ. ఇక ఈ హత్యని పరిష్కరించే సమస్యతో (గోల్ తో), మిడిల్ ధర్మం ప్రకారం, పైరట్ సంఘర్షణ మొదలవుతుంది.

          ఏమిటా సంఘర్షణ? ప్రత్యర్ధి లేడు, ఎవరితో సంఘర్షణ? ఏం సంఘర్షణ? ట్రైన్లో పన్నెండు మంది వుంటారు ప్రయాణీకులు. వీళ్ళని అనుమానితులుగా ప్రకటించి, ఒకరి తర్వాత ఒకరుగా ఇంటర్వ్యూలు  చేసుకుంటూ వెళ్ళడమే. ఈ ఇంటర్వ్యూల్లో కొందరితో ఎదురయ్యే ప్రతిఘటనలు, వాదోప వాదాలే. మిడిల్లో జరగాల్సిన యాక్షన్ – రియాక్షన్ల బిజినెస్ ప్రకారం ఈ తప్పొప్పుల వాగ్యుద్ధాలు కరెక్టే. కానీ ఇవి కేవలం వాగ్యుద్ధాలే . కేవలం వెర్బల్ యాక్షన్  మిడిల్ ని -  సినిమాని  - నిలబెట్టలేదు. మిడిల్ సంఘర్షణ విజువల్ యాక్షన్నికూడా కలుపుకుని వుండాల్సిందే. అందుకని అప్పడప్పుడు పైరట్ మీద దాడులతో యాక్షన్ సీన్లు. నవలలో లేని యాక్షన్ సీన్లు. అయినా ఈ ఎండ్ సస్పన్స్ తో హంతకుడెవరో తేలేవరకూ ఫ్లాట్ కథనమే వుంటుంది. విషయలేమి కొట్టొచ్చినట్టూ కనపడుతుంది. 

          మన సినిమాల్లో ఇలాటి కథలతో ఇదే సమస్య. మొదలెట్టింకాణ్ణించీ ముగిసేవరకూ,  హంతకుడెవరనే కాసేపటికి తళుకు బెళుకులు కోల్పోయే, బలం లేని ఒకే పాయింటు చుట్టూ కథనం చేయడం. క్రిస్టీ ఇలా చేయలేదు. డెప్త్ లేని వెలితి తీర్చేందుకు సెకండరీ మిస్టరీ జోడించింది. గతంలో కాసెట్టీ అనే క్రిమినల్ పాల్పడిన బాలిక కిడ్నాప్ కథ. ఆ సంబంధమైన ఫ్లాష్ బ్యాక్. ఆ కాసేట్టీయే ఇప్పుడు హతుడైన రిచెట్ అని బయటపడడం – దీంతో హంతకుడెవరనే ఎండ్ సస్పెన్స్ ఫిలింగ్, ఫ్లాట్ కథనం, విషయలేమి వగైరాలన్నిటికీ చెక్ పెట్టడం కుదిరింది. ఇంకొకటేమిటంటే, ఆ ఫ్లాష్ బ్యాకుతో రిచెట్ ని కనెక్ట్ చేసినట్టే, పైరట్ నీ కనెక్ట్ చేయడంతో మొత్తం కథకే జీవం వచ్చింది. నిజానికి పైరట్ గతంలో ఆ కిడ్నాప్ కేసు తన దగ్గరి కొచ్చినా చేపట్టలేకపోయాడు. అది అన్ని దారుణాలకి దారితీయడం అతడిలో గిల్ట్ ని పెంచింది. ఇలా పాత్రకి మంచి లోతు పాతులేర్పడ్డాయి. ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతాం. ఇదే ఎమోషనల్ కనెక్ట్ తో ముగింపులో అతడి మోరల్ డైలమాని అర్ధం జేసుకోగల్గుతాం. 

          నిజానికి ఈ ఫ్లాష్ బ్యాక్ అప్పట్లో నిజంగా జరిగిందే. క్రిస్టీ ఫీలై నవలలో వాడుకుంది. అలాగే ఆల్ప్స్ పర్వతాల మధ్య ట్రైను  మంచులో చిక్కుకోవడం నిజ జీవితంలో ఆమె అనుభవించిందే. కథలో ఈ రెండూ ఇప్పుడు సినిమాకి మంచి బలాన్నిచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ సరే, మంచు ఉత్పాతం అనే సంఘటనతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటవడంతో- అది బలంగా చాలాకాలం ఈ ప్లాట్ పాయింట్ వన్ గుర్తుండేలా మనసులో నాటుకుంటుంది.  ప్లాట్ పాయింట్ వన్ విజువల్ యాక్షన్ తో వుండాలసలు. ‘అన్ ఫెయిత్ పుల్’ లో, అలాగే విక్రం కుమార్ తీసిన  ‘24’  లో ఇలాగే విజువల్ యాక్షన్ తో కలుపుకుని వుండే ప్లాట్ పాయింట్ వన్లు ఇప్పటికీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూంటాయి. కథంటే సంఘటనల క్రమమే, మాటల క్రమం కాదు. నేనిలా అని తెలిసే ఎందుకు ప్రేమించావ్ – బుద్ధిలేక ప్రేమించా – అని మాటలనుకుని హీరోహీరోయిన్లు విడిపోయే ప్లాట్ పాయింట్ వన్లు లేకి చిత్రణలు. 

ఎలా విప్పారు?
      ఇలా కథలో కథ (ఫ్లాష్ బ్యాక్ )బయటపడి మిడిల్  బలీయమవుతున్నాక, ప్రస్తుత దర్యాప్తు కథనాన్ని బలీయం చేస్తారు. అదెలాగంటే, హత్యలో ఒకరు కాదు, ఇద్దరు పాల్గొని వుండాలని. ఆధారం? కత్తి పోట్లు రెండు రకాలుగా వున్నాయి. బలంగా పొడిచినవి, బలహీనంగా పొడిచినవి. కాబట్టి ఆ ఇద్దరూ ఒక మగ, ఒక ఆడ అయివుండాలని ఇంకో ట్విస్టు. ఇంకోటేం జరుగుతుందంటే,  అనుమానితుల్లో పెద్దావిడ భుజంలో ఎవరో కత్తి గుచ్చి పారిపోతారు. క్యారుక్యారు మంటుంది. 

          ఇదంతా నాటకం. పేద్ద నాటకం. ఒకరొకరూ వీళ్ళందరూ ఏదో విధంగా ఫ్లాష్ బ్యాక్ తో కనెక్ట్ అయి వున్నారని పైరట్ కనిపెట్టేసరికి - ప్లాట్ పాయింట్ టూ.

          పెద్దావిడ (మిషెల్ ఫీఫర్) ఎవరో కాదు, ఆనాడు కాసెట్టీ అలియాస్ రిచెట్ కిడ్నాప్ చేసి చంపేసిన బాలిక అమ్మమ్మ. మత్తులో వూగుతూ వుండే అమ్మాయెవరో కాదు, బాలిక పిన్నీ ... ఇలా కుటుంబ సభ్యులే కాకుండా, ఆ చనిపోయిన కుటుంబానికి సన్నిహితులే అందరూ.  అప్పటి కిడ్నాప్ అండ్ మర్డర్  కేసులో సాంకేతిక కారణాలతో కాసెట్టి విడుదలైపోయాడు. అది ఈ 12 మందినీ బాధిస్తోంది. బాలిక, ఆమె తల్లిదండ్రులు, పనిమనిషీ... ఇంకా పుట్టని గర్భస్థ శిశువూ... వీళ్ళ ఆత్మలకి శాంతిని చేకూర్చడమే ఈ 12  మంది ధ్యేయం. దీనికి నాయకత్వం  అమ్మమ్మ. ఈ ట్రైనులో కాసెట్టీ అలియాస్ రచెట్ పోతున్నాడని కనిపెట్టి అమ్మమ పన్నిన  గ్రాండ్ ప్లానే ఇది. కాకపోతే ఈ ట్రైనులో పైరట్ తగుల్తాడని వూహించలేదు. అయినా అతనున్నప్పటికీ  వెరవకుండా ప్లాను పారించుకుంది. 

          ఇలా బ్లాస్ట్ అవుతుంది ప్లాట్ పాయింట్ టూ. ఇది ప్లాట్ పాయింట్ వన్ కి మించిన బలంతో ఉండాల్సిన విధంగా వుంది. వుంది. పైగా ఎండ్ సస్పెన్స్ కూడా తెలిపోకుండా, వూహించని ట్విస్టుతో సస్పెన్సు విప్పుకుని - 12 మంది అనుమానితులే హంతకులుగా బద్దలయ్యింది. 

ముగింపు ఎలా? 
      ఇక ఎండ్ విభాగం మొదలు.  ఇందులో పైరట్ ఏ డిటెక్టివ్ కథలోనైనా వుండే విధంగానే తన దగ్గరున్న ఆధారాలతో కార్యకారణ సంబంధం వివరిస్తూ దెన్యూమో (denouement) చెప్పుకొస్తాడు. అప్పుడు ఆ 12 మందీ పాయింటాఫ్ వ్యూలో వాళ్ళు కాసెట్టీ అలియాస్ రచెట్ ని చంపున్నప్పటి ఫ్లాష్ కట్స్ పడతాయి.

          అందర్నీ వరసగా కూర్చోబెడతాడు. 12 మందీ ఒక జ్యూరీలాగా కూర్చుంటారు. 12 కత్తి పోట్లు పొడిచి చంపింది వాళ్ళే, జ్యూరీ వాళ్ళే, ఇప్పుడు తీర్పు చెప్పాల్సిందీ వాళ్ళే! వాళ్ళ ఎదురుగా నిలబడి తన వాదన విన్పించుకుంటాడు పైరట్. రెండే జరిగి వుండాలి : ట్రైనాగి పోయినప్పుడు ఎవరో ఆగంతకుడు జొరబడి చంపి పారిపోయి వుండాలి, లేదా మీ 12 మందీ చంపి వుండాలని. ఐతే నిజమేంటో తెలిసిన వాణ్ణి గనుక, ఇది దాచుకుని బతకలేననీ, మీకు ప్రమాదం కూడాననీ చెప్పి, తనని చంపెయ్యమనీ  అమ్మమ్మ ముందు పిస్తోలు పెడతాడు. 

          నా మనవరాలు చనిపోయినప్పుడే నేను చచ్చిపోయానని – ఆమె పిస్తోలు తలకి పెట్టి ట్రిగ్గర్ లాగుతుంది. గుళ్లుండవు. అటు పైరట్ – ఇటు వీళ్ళందరి అంతరాత్మల సంక్షోభంతో ఉద్రిక్తంగా వుంటుంది సీను.

          నవల్లో ఈ డ్రామా వుండదు. అందులో పైరట్ వాళ్ళ పట్ల సానుభూతితో వుంటాడు. సానుభూతితో ఏం చేయగలడు. తను పోలీసు కాదు, చట్టం కాదు. ట్రైను అధికారికి తన రెండు థియరీలు చెప్పేసి వెళ్ళిపోతాడు. ట్రైను అధికారి మొదటి థియరీనే ఓకే చేసి,  పోలీసులకి తెలియజేస్తాడు. దీంతో నవల ముగుస్తుంది. క్రిస్టీ దైవిక న్యాయం వైపున్నట్టు వుంటుంది. 

          సినిమాలో పైరట్ అలా వుండ లేకపోతాడు. కానీ ఏమీ చేయలేకపోతాడు. చట్టమూ పోలీసులూ దైవిక న్యాయం వైపే వుండడంతో - ఈ ప్రపంచంలో న్యాయాన్ని కాపాడడం అన్నిసార్లూ కుదరదని ఎమోషనలై – కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతాడు. నిజానికి సినిమాకి పాత్రకిచ్చిన ఈ భావోద్రేకపూరిత ముగింపే బావుంది. ఇలాగని పైరట్ పాసివ్ క్యారక్టర్ అయిందా? కాలేదు. చివరివరకూ పోరాడే పాత్ర పాసివ్ పాత్ర అవదు. చివరికి ఆశించిన ఫలితం దక్కవచ్చు, దక్కకపోవచ్చు. యాక్టివ్ పాత్రకి దీంతో నిమిత్తం లేదు- అంతిమంగా పాయింటు ఎస్టాబ్లిష్ చేశాడా లేదా అనేదే ముఖ్యం. ప్రాక్టికల్ గా వుండే పాయింటు. ఆ కాలంలో క్రిస్టీ చర్చి వైపు నుంచి ముగింపు చూసి వుండొచ్చు. ఇప్పుడు కాలం అలా లేదు. చట్టం వైపు నుంచే చూడాలి. అయినా ఈ చట్టం చేతిలో పెడితే ఆ చట్టమెలా వుంది? న్యాయం ఎక్కడుంది? న్యాయం ఇలాగే వుంటుందని ప్రాక్టికల్ గా  తెలియజేసి వెళ్ళిపోయాడు పైరట్.

          వాస్తవం ఎలా వుంటుందో  కళ్ళు తెరిపించి వెళ్ళిపోయే వాడే అసలైన హీరో. వాస్తవాన్ని తొక్కిపెట్టి, ఆ 12 మందినీ జైల్లో వేసిపోయేవాడు ప్రేక్షకుల్ని మభ్య పెట్టే హీరో.  


సికిందర్


25, నవంబర్ 2017, శనివారం

553 : సందేహాలు - సమాధానాలు



Q : మీ రివ్యూలు అనాలసిస్ లు బావుంటాయి. మీరు ప్రతి రివ్యూనీ  త్రీ ఏక్ట్ స్ట్రక్చర్ తో కంపేర్ చేస్తుంటారు. కానీ చిరంజీవి గారి ‘ఖైదీ’  మిడిల్ - బిగినింగ్ - ఎండ్ స్ట్రక్చర్ లో వుంటుంది కదా. విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మిగిలింది హీరో విలన్స్ ని ఎలాగూ చంపుతాడు అనే ప్రేక్షకుడికి తెలిసిన విషయమే కదా. రజనీ కాంత్ ‘బాషా’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి  దీనికి వున్న డిఫరెన్స్ ఏంటి? మీరు అనాలసిస్ రాస్తే చదవాలని వుంది. ఇది నా రిక్వస్ట్.
                                                                                              - ఉమా మహేష్ రెడ్డి


A : కథలకి వుండేది త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఒక్కటే. దాన్ని బిగినింగ్ – మిడిల్- ఎండ్ అనే వరసక్రమం అంటున్నాం.  అందుకని దేన్నైనా దీంతోనే రివ్యూ చేయాలి. ‘ఖైదీ’ లో వున్నది ఇదే స్ట్రక్చర్ వరసక్రమం మారింది. మీరన్న మిడిల్ - బిగినింగ్ – ఎండ్ లుగా. ఇది కథకుడి క్రియేటివిటీ, స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ లో ఒక వరసలో (లీనియర్ గా) వుండే బిగినింగ్ – మిడిల్- ఎండ్ విభాగాల్నే, అటూ ఇటూ మార్చడం (నాన్ లీనియర్ గా) కథకుడి క్రియేటివిటీ. దీన్ని బాగా అర్ధం జేసుకోవాలి. స్ట్రక్చర్ తో చేసే క్రియేటివిటీ మాత్రమే. ఇది ఫ్లాష్ బ్యాక్ తో కథ చెప్పడం తప్ప మరోటి కాదు. మిడిల్ తో కథ ప్రారంభించి, బిగినింగ్ కి వెళ్ళడమంటే, ఆ బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడమే.



          స్ట్రక్చర్ తో ఎప్పుడూ సమస్య వుండదు. దాంతో క్రియేటివిటీకి పాల్పడితేనే సమస్యలు ఎదురవుతాయి. మీరన్న విశ్రాంతి సమయానికే కథ మొత్తం ప్రేక్షకుడికి తెలిసి పోవడం లాంటిది. ఒకప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనంగా వున్నప్పుడు స్ట్రక్చర్ తో ఏం చేసుకున్నా సమస్య కాలేదు. ‘గుండెలు తీసిన మొనగాడు’ లో లాగా ఎండ్ సస్పెన్స్ చేసినా, ‘అంతస్తులు’ లో లాగా సెకండాఫ్ సిండ్రోం సృష్టించినా సమస్య కాలేదు. ఆ రోజుల్లో కథల నాణ్యత ఒక్కటే ప్రేక్షకులు పట్టించుకునే వారు, అదెలా చెప్పారనేది కాదు. కేవలం కథ నాణ్యంగా లేకపోతేనే తిప్పి కొట్టే వాళ్ళు. అయినా 90 లవరకూ కూడా అత్యధికశాతం సినిమాలు స్ట్రక్చర్ లోనే వుంటూ వచ్చేని.  ఫ్లాష్ బ్యాక్ సినిమాలు చాలా తక్కువ.

          తరాలు మారి,  వినోద సాధనాలు పెరిగి, వాటి రకరకాల ఫటాఫట్  పాప్ కార్న్ కంటెంట్స్ కి దృష్టి చెదరగొట్టుకుని, సినిమాల్లో కథల నాణ్యతని పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు. హీరోయిజాల మీద పడ్డారు. హీరోయిజాలకే రేటింగులూ టీఆర్పీలు ఇస్తూ వాళ్ళని ఇంకా రెచ్చగొట్టారు. సినిమాలు నాణ్యంగా రాకుండా చెడగొడుతున్నది ఇతర దృశ్య మాధ్యమాలే. కాబట్టి ఓపిగ్గా రెండున్నర గంటలు కథ చూస్తూ కూర్చునే మానసిక స్థితి ఎవరికీ లేదు. చూపించే ఫటాఫట్ కథల్నైనా కన్ఫ్యూజ్ చేస్తూ  చెప్తే అసలే భరించలేరు. అందుకే ఒకప్పుడు వర్కౌట్ అయిన ఫ్లాష్ బ్యాకులు, ఎండ్ సస్పెన్సులు, సెకండాఫ్ సిండ్రోములు మొదలైన వాటికి  కాలం తీరింది. 

          ఇప్పుడు స్ట్రక్చర్ తో క్రియేటివిటీ కి పాల్పడుతూ ఒక ఫ్లాష్ బ్యాకుతో, అనేక ఫ్లాష్ బ్యాకులతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయంటే, రెండే కారణాలని చెప్తారు మేధావులు :  కథలో సరుకు లేకపోవడం, అదో గొప్ప ఫ్యాషన్ గా ఫీలైపోవడం. తేటగా శుభ్రంగా బిగినింగ్- మిడిల్ – ఎండ్ క్రమంలో (స్ట్రక్చర్ లో) కథ చెప్పినంత హాయైన పని మరొకటి లేదు. రాం గోపాల్ వర్మ కథతో ఎప్పుడైనా గిమ్మిక్కులు చేశారా? ఫ్లాష్ బ్యాకులు చూపించారా? ‘శివ’ దగ్గర్నుంచీ చక్కగా బిగింగ్ మొదలెట్టుకుని,  మిడిల్ లో సంఘర్షణ జరుపుకుని,  ఎండ్ తో కథని కొలిక్కి తెచ్చి ముగిస్తూనే వున్నారు కదా? ఆయనకి లేని పైత్యం ఇతర్లకి ఎందుకు? ఆయన కథలు ఇప్పుడు బావుండకపోవచ్చు.  అయినా ఆయన కథలు చెప్పడం సార్వజనీన స్ట్రక్చర్ లోనే వుంటుందెప్పుడూ. బాగాలేవని తెలిసిన కథల్ని కూడా గిమ్మిక్కులు చేసి మెప్పించాలని చూడలేదు. 

          ఇంకా ‘ఖైదీ’ లాగానో, ‘బాషా’ లాగానో స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శించుకోవాలనుకుంటే తప్పకుండా ప్రదర్శించుకోవచ్చు. ఫ్యాక్షన్ సినిమాలన్నీ ‘బాషా’ ని అనుసరించి వచ్చినవే. అయితే ఇలా ఒక ఫ్లాష్ బ్యాక్ తో, లేదా అనేక  ఫ్యాష్ బ్యాకులతో కథలు చెప్పాలంటే పాటించాల్సిన కొన్ని సున్నితమైన టెక్నిక్స్ వున్నాయి. ఒకటే ‘ఖైదీ’, ‘బాషా’ మంత్రం లేదు. ఈ టెక్నిక్స్ అందరికీ అర్ధం గావు. హాలీవుడ్ సినిమాలు చూపించినా ఒప్పుకోరు. హాలీవుడ్ సినిమాల్లోంచి సులభంగా కథలు కొట్టేయాలి, కష్ట పెట్టే టెక్నిక్స్ ని కాదు. కాబట్టి అవే ఖైదీలూ బాషాలూ అలాగే చేసుకోనియ్యాలి. ‘గరుడవేగ’ అలా చేసిందే.

 Q : ‘గరుడవేగ’  స్క్రీన్ ప్లే సంగతుల్లో ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ సెకండాఫ్ లో అరగంటకి చూపించడం కరెక్ట్ కాదని మీరన్నారు. మీరే పేర్కొన్న స్పైడర్, సింగం -3, వివేకం మొదలైన చిత్రాల్లో,  అసలు కథ ఫస్టాఫ్ లోనే ఓపెన్ చేసినా అవి ఫ్లాపయ్యాయి కదా? దీనికేం చెప్తారు?   
 జిఏఆర్ (కెనెడా)
 (పూర్తి పేరు వెల్లడించ వద్దన్నారు)

A : ‘గరుడవేగ’ స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో స్పష్టం చేశాం దీన్ని. మీరన్న సినిమాలు ఫ్లాపవడానికి కారణం కథ ఫస్టాఫ్ లో మొదలవడం కాదు. వేరే క్రియేటివ్ కారణాలున్నాయి. ఇంకోసారి ఆ వ్యాసం చూడండి. స్ట్రక్చర్ (బిగినింగ్ –మిడిల్ –ఎండ్) వల్ల సినిమాలు ఫ్లాప్ కావు. స్ట్రక్చర్ తో క్రియేటివిటీ ప్రదర్శిద్దామని స్ట్రక్చర్ ని చెదరగొట్టినప్పుడే ఫ్లాపవుతాయి.  ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో (మిడిల్ –బిగినింగ్- ఎండ్)  కథ చెప్పడం స్ట్రక్చర్ ని చెడగొట్టడం కాదు. కేవలం విభాగాల్ని అటూఇటూ మార్చడమే. స్ట్రక్చర్ ని  చెదరగొట్టడం ఎప్పుడవుతుందంటే, ఒక విభాగం స్పేస్ లోకి ఇంకో విభాగాన్ని చొరబెట్టడం వల్ల అవుతుంది. కింది పటంలో స్ట్రక్చర్ ని చూడండి :



          ఇందులో బిగినింగ్, ఎండ్ లు చెరి  25 శాతముంటే, మిడిల్ ఇంటర్వెల్ కి ఇటూ అటూ కలుపుకుని 50 శాతముంది. ఇందులో ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యే చోట,  ప్లాట్ పాయింట్ -1 వుంది. ఇక్కడ కథ మొదలవుతుంది. అప్పుడు కథ స్ట్రక్చర్ లో వున్నట్టు. ఇప్పుడు ఈ కింది పటం  చూడండి : 


          ఇందులో బిగినింగ్ విభాగం దాని 25 శాతం స్పేస్ ని అతిక్రమిస్తూ ఇంటర్వెల్ ని కూడా దాటిపోయి,  మిడిల్ స్పేస్ ని అవతల ఎండ్ లోకి నెట్టేస్తూ ప్లాట్ పాయింట్ -2 వరకూ, 75 శాతం దాకా ఆక్రమించింది. అంటే కథ ఇక్కడ ప్రారంభమవుతుందన్నమాట. ఆ కథకి  పాతిక శాతమే స్పేస్ వుంటుందన్నమాట. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ అంటే కథకి ఉపోద్ఘాతమే, కథ కాదు. కాబట్టి ఇక్కడ 75 శాతం వరకూ  ఉపోద్ఘాతమే చూసి,  అప్పుడు ఓ పాతిక శాతం మాత్రమే కథ చూస్తామన్న మాట. ‘గరుడవేగ ‘ లో ఇదీ జరిగింది.

 Q : ఇప్పుడు ఏదైనా ఒక కథను టెంప్లెట్ స్క్రీన్ ప్లే గా రాయాల్సిన గత్యంతరం ఏర్పడితే – ‘ఖైదీ’ స్ట్రక్చర్ స్లాట్ లో పెడితే,  తరవాత ఏంటని ప్రేక్షకుడికి తెల్సి పోతుంది. బిగినింగ్ ని చివరిదాకా లాగితే ఎండ్ సస్పెన్సో, లేక పోతే కథేంటో చెప్పకుండా ఇంకా ఎంతసేపు రా బాబూ అని ప్రేక్షకుడు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించే మార్గం ఏది?
                                                                                                                                     - ఉమా మహేష్ రెడ్డి  
                                                                                                      

 A :   స్క్రీన్ ప్లేనే వుంటుందండీ, టెంప్లెట్ స్క్రీన్ ప్లే వుండదు. అది బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అనే, మనిషి మెదడు కథల్ని రిసీవ్ చేసుకునే వరుస విభాగాలతో, యూనివర్సల్ స్ట్రక్చర్ గా ఏర్పడి, కాలపరీక్షకి తట్టుకుని నిలబడుతోంది. టెంప్లెట్ అనేది వున్న స్ట్రక్చర్ లోపల కథనానికి క్రియేటివ్  వెర్రితల.  వెరసి ‘టెంప్లెట్ సినిమా’ అవుతుంది. పూరీ జగన్నాథ్ సినిమాల్లాగా. అంటే, ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్ -  ఇక సెకండాఫ్ లో హీరోయిన్ కట్ అయిపోయి, విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపూ ఇంతే. కొన్ని పోపు డబ్బాలు వరసగా పెట్టుకుని (బ్యాంకాక్ బీచిలో) వాటిలో అవే దినుసుల్ని నటీనటుల్ని మారుస్తూ వరసగా వేసుకుంటూ పోవడమన్న మాట. ఇది కథనానికి వర్తించే క్రియేటివిటీ. స్ట్రక్చర్ అలాగే వుంటుంది.  ఇక మీప్రశ్నలో చివరి భాగం - దీన్ని అధిగమించే మార్గం ఏది? అనేదానికి -  అధిగమించే మార్గాలు 'శివ' దగ్గరే వాటి మానాన వాటిని వదిలేసి దారితప్పి తిరుగుతున్నాం. ‘శివ’ని చూసి తెలుసుకోండి. శివ = సిడ్ ఫీల్డ్. ఇంతకన్నా ఏం కావాలి.


 సికిందర్

552 : రివ్యూ!






రచన- దర్శకత్వం : పవన్ మల్లెల
తారాగణం : నారా రోహిత్, రెజీనా, మ్యకృష్ణ, పృథ్వీ, అజయ్, ఆదిత్యా మీనన్, రామరాజు, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి దితరులు
థః కొలుసు రాజా, సంగీతం : ణిశర్మ, ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్
బ్యానర్ : మాయా జార్ మూవీస్, స్ చంద్రిక విజరీ, మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : బి.హేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల : నవంబర్ 24, 2017
***
      నారా రోహిత్ సినిమా అంటేనే  ఏదో వెరైటీ పాత్ర అని ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. లేదు,  నేనూ మాస్ కొస్తా, ఒక మాస్ యాక్షన్ నేనూ చేస్తానంటూ వస్తాడని ఎవరూ వూహించి వుండరు. అదీ ఆరిపోయిన ఫ్యాక్షన్ దీపం వెల్గించుకుంటూ. తన మీద ఓ అంచనా, తనకంటూ గిరిగీసిన ఓ ఇమేజీ అంటూ లేనప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ‘బాలకృష్ణుడు’ అనే ఈ పాత మూసతో ప్రేక్షకుల మధ్య కొచ్చేశాడు. ఓల్డ్ డ్రామా మీద చాలా మక్కువున్న వాడిలా కన్పిస్తున్న దర్శకుడు పవన్ కూడా, ఓల్డ్ డ్రామాని ఈ కాలం ప్రేక్షకులు మిస్సవుతున్నట్టు భావించుకుని ఈ ఫ్యాక్షన్ కి సాహసించినట్టుంది. ఇంతకీ వీళ్ళిద్ద రేం చేశారు? పాతని పాతలాగే చూపించే చాదస్తాలకి పోయారా, లేక ఏమైనా కొత్త దనం చూపించారా, ఫ్యాక్షన్ లో కొత్తదనం చూపించడాని కేముంటుంది....ఇవన్నీ ఓ సారి పరిశీలిద్దాం.
కథ
 
       కర్నూలు జిల్లాలో రవీందర్ రెడ్డి (ఆదిత్యా మీనన్) ఫ్యాక్షన్ ని రూపుమాపాలని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడు. అతడి చెల్లెలు భానుమతి (రమ్యకృష్ణ) సహకరిస్తూంటుంది. ప్రజల్లో వీళ్ళకి వస్తున్న మంచి పేరుకి తాళలేక బసిరెడ్డి (రామరాజు) రవీందర్ రెడ్డిని అణచాలని చూసి అవమాన పడతాడు. దీంతో ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో అతడి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) రవీందర్ రెడ్డిని చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. అతడి మనుషుల్ని భానుమతి చంపించేస్తుంది. ప్రతాపరెడ్డి పోలీసులకి లొంగిపోతాడు. అయినా  భానుమతి మీద పగ వదులుకోడు. భానుమతి మేనకోడలు ఆద్య (రేజీనా) హైదరాబాద్ లో వుందని తెలుసుకుని,  తన పగకి ఆమెని వాడుకోవాలనుకుంటాడు. ఆద్యకి ఆమెకి తెలియకుండా భానుమతి ఒక బాడీ గార్డుని నియమిస్తుంది. ఆ బాడీగార్డు బాలు (నారా రోహిత్) ఆద్యతో ప్రేమలో పడతాడు. ఇప్పుడు జైలు నుంచి ప్రతాపరెడ్డి విడుదలై వస్తాడు. ఇక అతడి బారి నుంచి ఆద్యని బాలు ఎలా కాపాడేడు, కాపాడే క్రమంలో ప్రతాపరెడ్డిని ఎన్ని విధాలుగా ఏడ్పించి పీడా వదిలించాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
        పైన చూస్తేనే తెలిసిపోతోంది  కథెలా వుందో. ఇంకా అదే ఫ్యాక్షనేంటంటే ఇంతే. అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలూ  కుప్పతెప్పలుగా రావడం లేదా? ఇవి తప్ప ఇంకేమైనా వస్తున్నాయా? వీటికి అందమైన కావ్యాలుగా  రివ్యూలు కూడా రాసి తరించడం లేదా? ఇలాంటప్పుడు వీటి నుంచి కాస్త ఆటవిడుపుగా అదే ఫ్యాక్షన్ చాలా కాలం తర్వాత వస్తే తప్పేముంది?  రోత పుడుతున్న అవే రోమాంటిక్ కామెడీలూ,  అవే దెయ్యం కామెడీలకంటే ఇదే నయం. ఎందుకంటే ఇది ఫుల్ కామెడీ. నవ్వించని క్షణాలు ఏవైనా వున్నాయా అని వెతుక్కోవాలి. నవ్వులాటలో పాత ఫ్యాక్షన్ పాత వాసనా మర్చిపోతాం. కథలో ముందేం జరిగిందో నాకు తెలీదు, నేనొచ్చాక  నీ (విలన్) అవసరం లేదు, ఈ కథకి నేనే హీరో - నంటూ కామెడీ హీరో అన్నాక పాత ఫ్యాక్షన్ సీనంతా మారిపోక ఏమవుతుంది. 

ఎవరెలా చేశారు
      కెరీర్ తో కొత్త ప్రయోగాలు చేసే నారారోహిత్ కి ఒక మసాలా యాక్షన్ చేయాలన్పించి అందుకు ఫ్యాక్షన్ ని ఎంచుకున్నాడు. దాదాపు హీరోలందరూ ఫ్యాక్షన్ చేసేశారు. ఆలస్యంగా వచ్చిన తను కూడా ఓ ఫ్యాక్షన్ చేయకపోతే వెనుకబడి పోతాడు. దేశం చిన్న చూపు చూస్తుంది. అందుకని కాల యంత్రంలో వెనక్కి ప్రయాణించాడు. బరువు తగ్గి,  సిక్స్ ప్యాక్ తో సిద్ధమై డాన్సులకి , ఫైట్లకి వొళ్ళు కదలకపోయినా కెమెరాని కదిలించుకుంటూ యాక్షన్ కామెడీ పాత్ర లాగించేశాడు. పాత్ర ఫ్యాక్షన్ కుటుంబంలో లేకపోవడం కామెడీకి తోడ్పడింది. ఫ్యాక్షన్ కుటుంబంలో వుండుంటే  అదే పాత టెంప్లెట్ ఫ్యాక్షన్ గా హింసా రక్తపాతాలతో ఎరుపెక్కి ఏవగింపు కల్గించేది.  అనేక  కామెడీ ట్విస్టులిస్తూ పాత్ర సాగడంతో బోరు కొట్టించే ప్రమాదాన్ని తప్పించుకుంది. తన పాత్రే ఈ సినిమా. ఆ  పాత్ర పాత మసాలా యాక్షన్ కి వినోదాన్ని జోడించింది. ఈ వినోదం విలన్ ఇంట్లో హీరో చేరి చేసే టెంప్లెట్ వినోదంగా  గాక,  సాంతం ఔట్ డోర్ ప్రయాణంలోనే సాగడం అడ్వెంచరస్ కామిక్ థ్రిల్లర్ గా మారడానికి వీలిచ్చింది. పాత్రకి తను  రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వున్నానని అస్సలు తెలియకపోవడమే తన ధోరణిలో పూర్తిగా వేరే  రూటులో వేరే కథ నడపుతూ నవ్వించడానికి తోడ్పడింది. రోహిత్ చేసిన కొన్ని ప్రయోగాలకన్నా ఇదే నయం. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా, బి సి సెంటర్లలో మాస్ కి దగ్గరవుతాడు కనీసం.

          రెజీనాదీ హాస్య పాత్రే, ఏదో పాటల్లో కన్పించి పోయే గ్లామర్ డాల్ గా కాకుండా, ఆద్యంతం దాదాపు ప్రతీ సీనులో సీనుకి తగ్గ తంటాలు పడుతూ వుంటుంది. హీరో తన బాడీ గార్డు అని తెలీక పోవడమనే సస్పెన్స్ ఆమె పాత్రని ఆసక్తికరంగా మార్చింది. దుర్యోధనుడిగా ఆమె ద్రౌపది చీర లాగే కామెడీ 

          మూడో కీలక పాత్ర- ప్రకృతి ప్రేమికుడు పృథ్వీది. ఇంటర్వెల్ కి ముందునుంచీ హీరోకి తగిలి,  ఇక హీరో వెంటే వుండాల్సిన ఖర్మతో- విషయం తెలీక లేనిపోని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సృష్టించే పాత్రలో,  మరోసారి తను పరువు నిలబెట్టుకున్నాడు. 

          రమ్యకృష్ణ  ఫ్యాక్షన్ మార్కు పగతో వుండే సీరియస్ పాత్ర. ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకం ట్రూపు వాడిగా శ్రీనివాసరెడ్డి, పది పెళ్ళిళ్ళు చేస్తేగానీ పెళ్లి కాదని జ్యోతిష్కుడు చెప్పడంతో,  ఆ పనిలో వుండి నానా తన్నులు తినే పాత్రలో వెన్నెల కిషోర్, ఇంకో ఇద్దరు  కమెడియన్లు రఘుబాబు, తాగుబోతు రమేష్ లు ఎంటర్ టైన్ చేస్తారు. ఇవి మూస పాత్రలే.  అయితే మూస  రోమాంటిక్ కామెడీల్లో, దెయ్యం కామెడీల్లో హీరోహీరోయిన్ల కంటే, కమెడియన్ల కంటే బెటర్. విలన్ గా అజయ్ తన విలనీతో, అయోమయంతో బాగానే చేశాడు. 

          మణిశర్మ పాటలు ఓ మాదిరి. క్యాచీ ట్యూన్స్ మాత్రం లేవు. విజయ కుమార్ ఛాయాగ్రహణం రొటీనే. ఇతర సాంకేతిక విలువలు మామూలుగా వున్నాయి.

చివరికేమిటి 
      దర్శకుడు పవన్ ప్రథమ ప్రయత్నం అనుభవమున్న దర్శకుడిలాగా వుంది. అయితే ఇలా పాత సినిమాలే మళ్ళీ తీయకుండా వుండ గల్గాలి. సీన్లని వేగంగా పరిగెత్తించ గల నేర్పే ఈ పాతని మరిపించగల్గింది. కథలో ప్రతీ పది నిమిషాలకోసారి ట్విస్ట్ ఇస్తూ కథనం చేయడం వల్ల పాత కథే సరే చూద్దామనే పరిస్థితి కల్పించింది. విలన్ ఫ్యాక్షనిస్టు  అని తెలీక హీరో పట్టేసుకుని పది  కోట్లు సంపాదించుకునే ట్రాకే ఈ యాక్షన్ కామెడీని కాపాడింది. ఫస్టాఫ్ – సెకండాఫ్ రెండూ కథలో కొత్త విషయాలు బయట పెడుతూ పరుగులెత్తడంతో –రొటీనే అయినా ఈ యాక్షన్ కామెడీని  కదలకుండా చూస్తూ కూర్చునేలా చేశాయి. ఎండిపోయిన రోమాంటిక్ కామెడీలనీ, దెయ్యం కామెడీలనీ వెక్కిరిస్తూ,  ఎండిపోయిన ఫ్యాక్షన్ ని నేనూ వున్నానంటూ ‘బాలకృష్ణుడు’  ఓ సెటైర్ వేసింది...

-సికిందర్
www.cinemabazaar.in