రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2015, సోమవారం

మళ్ళీ మిడిల్ మటాషే !

రచన- దర్శకత్వం : తేజ
తారాగణం : దిలీప్, దక్ష, చస్వ, సీమా, ఎం.వి.ఎస్. హరనాథ రావు, అభిరాం తదితరులు
సంగీతం : కళ్యాణ్ కోడూరి, ఛాయాగ్రహణం : దీపక్ భగవంత్
బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్,  నిర్మాత: కె. ఎల్. దామోదర ప్రసాద్
విడుదల : 11 సెప్టెంబర్, 2015
***

       ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ ఇంకా తన పాత ఫార్ములానే  రీసైక్లింగ్ చేస్తూ ఆ రింగులోంచి బయటికి రావడం లేదు. గతంలో ఎప్పుడో తను తీసిన ‘జయం’ (2003),  ‘నువ్వు నేను’ ( 2001) అనే రెండు హిట్సే  ఆయన సినిమాలు  తీయడానికి ముడిసరుకు అవుతున్నాయి. ప్రేమకథలు ఎదిగి వచ్చాయి. ప్రేమ కథల దర్శకుడు మాత్రం ఎదగడం లేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత, పన్నెండేళ్ళ నాటి తన పాత ‘జయం’ ని రీసైక్లింగ్ చేసి, 4 G స్పీడుకి అప్ డేట్ అవుతున్న నేటి యువ ప్రేక్షకులకి మళ్ళీ వడ్డించే దుస్సాహసం చేశారు. దీంతో తనకీ తన ప్రేమ కథల లక్ష్యిత ప్రేక్షకులకీ జనరేషన్ గ్యాప్ ఎంతుందో తెలిసిపోతోంది. అలాంటప్పుడు కాలం చెల్లిన  తాజా ప్రేమకథ ‘హోరాహోరీ’ ని తీసుకుని బాక్సాఫీసుతో ఎంత బాహాబాహీకి దిగితే మాత్రం ఏం లాభం.

          కరకాల వినోదమాధ్యమాలు బహుముఖాలుగా విస్తరించాయి. వినోదించడానికి సినిమా అనేది చిట్ట చివరి ఆప్షన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇది చాలా ఆందోళనకర పరిణామం. ఆ మాధ్యమాలన్నిటినీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకి కదిలిరావాలంటే ఆ మాధ్యమాలకి మించిన వినోదం ఏదో సినిమాల్లో వుండి తీరాలి. ఇది గమనించకుండా కేవలం బ్రాండ్ నేములు, గతకాలపు గ్రాఫులూ చూసుకుని సినిమాలు చుట్టేస్తే ఫలితాలు చాలా బాధాకరంగా వుంటాయి.  

          బ్రాండ్ నేములూ, గత కాలపు గ్రాఫులూ రీసైక్లింగ్స్ తో నిలబడతాయా? 24x7 వర్తమాన కాలంతో కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే నిలబడతాయోమో ఆలోచించ కూడదా? దర్శకుడు తేజ దీన్నే అందుకోలేక పోతున్నారు.

          ‘హోరాహోరీ’ తో అసలు ఒక సినిమాకి ఉండాల్సిన కనీస లక్షణాలని కూడా మర్చిపోయారు. చాలా విచారకరం. ఒక విజయవంతమైన దర్శకుడి పట్ల ప్రేక్షకులకి క్రేజ్ ఎలా ఏర్పడుతుందో, అలా ఔత్సాహిక-వర్ధమాన దర్శకులకీ ఒకలాంటి  భక్తి భావం ఏర్పడుతుంది. తననుంచి సక్సెస్ మంత్రా నేర్చుకోవాలను కుంటారు, తన క్రాఫ్ట్ తో ఎడ్యుకేట్ అవాలనుకుంటారు. తన బాట అనుసరించాలనుకుంటారు. అలా మార్గదర్శకంగా ఉండాల్సిన దర్శకుడు, తిరోగమించి గతకాలపు విజయాల్లో తలదాచుకుంటే వాళ్ళని చాలా నష్టపర్చిన వాడవుతాడు. రంగంలో ఉండాలనుకున్నప్పుడు రింగుల్లో వుండిపోకుండా - స్పీడ్ బోటులో దూసుకెళ్ళాల్సిందే !


                                                     ***
ఎవరి కథ?
       బసవ ( చస్వా) అనే వాడు ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఓ హత్య కేసులో ఎసిపి ( అభిరాం) కి లంచమిచ్చి సేఫ్ అవుతాడు. ఎసిపికి ఆ డబ్బు చెల్లెలు మైథిలి ( దక్ష) పెళ్ళికి అవసరం. ఇతనూ ఇతడి సీఐ తండ్రీ ( డీఎస్ రావు)  లంచగొండులు. మైథిలి పెళ్ళికి వచ్చిన బసవ మైథిలి మీద మనసు పడి పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని చంపించేస్తాడు. పెళ్లి చేసుకుంటానని మైథిలి వెంట పడతాడు. ఎసిపి వేరే సంబంధం చూస్తే, ఆ కాబోయే పెళ్లి కొడుకునీ చంపేస్తాడు. దీంతో మతి స్థిమితం కోల్పోతుంది మైథిలి. 

          స్థలమార్పు కోసం ఆమెని కర్ణాటక లోని ఆగుంబే కి పంపిస్తారు. ఎవరితోనూ మాటాడకుండా పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూండే మైథిలి పెళ్లి గురించి వినపడ్డా, పెళ్లి దృశ్యం కనపడ్డా హిస్టీరికల్ గా మారిపోతుంది. వెంటనే ఒక మాత్ర వేసి కంట్రోల్ చేయాలి.

           ఊళ్లోనే ఒక నెట్ సెంటర్ నడుపుకునే స్కంధ( దిలీప్) అనే కుర్రాడుంటాడు. ఇతడికి నానమ్మ (సీమా), ఆంటీ ( రోహిణి) వుంటారు. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఒకరు చేస్తున్న వ్యాపారం మరొకరు చేయకూడదన్న కట్టుబాటు వుంటుంది. నెట్ సెంటర్ పెట్టి స్కంధ దీన్ని ఉల్లంఘించాడని పక్క గ్రామం వాళ్ళు గొడవ కొస్తారు. అప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏ  నెట్  సెంటర్ స్పీడ్ టైపింగ్ లో గెలుస్తుందో, ఆ నెట్ సెంటర్ నడుపుకోవాలని. ఈ పోటీ లు మొదలవుతాయి. ఈ లోగా స్కంధ కి మైథిలి పరిచయమవుతుంది. అతడి కారణంగానే మాటా డ్డం మొదలెడుతుంది. టైపింగ్ లో ఆమె నేర్పు చూసి పోటీల్లో పాల్గొనమని ఒప్పిస్తాడు. ఈ పోటీలు కొన్ని తడవలుగా జరుగుతాయి. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడ్డ స్కంధ కి సమస్య లొస్తాయి. 

          అప్పుడు బసవ ఆ ఊళ్లోనే ఒక కాంట్రాక్టు కిల్లింగ్ ని ఒప్పుకుని వస్తాడు. ఇక్కడ స్కంధ సమస్య తెలుసుకుంటాడు. స్కంధ తో బసవకి పూర్వ పరిచయముంటుంది. తను ప్రేమించిన అమాయి పెద్దలు ఒప్పుకోవడంలేదని స్కంధ చెప్పేసరికి రంగంలోకి దిగుతాడు బసవ. ఇలా స్కంధ ప్రేమించిన అమ్మాయే తను ప్రేమిస్తున్నఅమ్మాయని తెలీని బసవ, బసవ ప్రేమిస్తున్న  ఆమ్మాయినే తను ప్రేమించాడని తెలీని స్కంధ ల మధ్య ఆట మొదలవుతుంది. ఇదెప్పుడు బయటపడి ఏం జరిగిందనేది మిగతా కథ.


          కథ ఇలా చెప్పుకుంటూ పోతే కథానాయకుడెవరో తెలుసిపోతోంది గానీ, సినిమా చూస్తే మాత్రం ఇదెవరి కథగా తేలుతుందో చెప్పుకుంటే అంత బావుండదు.. కమర్షియల్ సినిమా ప్రాథమిక లక్షణం కన్పించదు.

ఎవరెలా చేశారు.
       కొత్త హీరో హీరోయిన్లు దిలీప్, దక్షల పాత్రలూ వాళ్ళ నటనలూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు.  దక్ష ది ఫోటోజెనిక్ ఫేసు కాదు, వాయిసూ హీరోయిన్ కుండాల్సిన వాయిస్ కాదు.  ఎప్పుడూ బోలెడు మంది ఆర్టిస్టులతో నిండిపోయే సీన్లలో దిలీప్ కన్పించకుండానే పోతాడు. బ్యాడ్ ప్రెజెంటేషన్ బారిన పడి అతడేమిటో, అతడిలో విషయమేమిటో కూడా సరీగ్గా రిజిస్టర్ చేసుకోలేకపోతాడు. ఈ ఇద్దరూ యూత్ అప్పీల్ కి సరిపోక, పాత్రలూ పండక అనామకంగా మిగిలిపోతారు.  

          ఏసీపీ గా వేసిన అభిరాం మరో మైనస్. ఏసీపీ లెవెలే కన్పించదు. విలన్ గా వేసిన చస్వా- విలన్ల పక్కన వుండే అనుచరుడిలా ఉంటాడు. పాత్రకి సరిపోయే స్థాయి లేకపోగా, చిల్లర కామెడీ చేస్తాడు. 

          తేజ లోని  విజువల్, క్రియేటివ్ సెన్సుల్ని  దిగువస్థాయికి తీసికెళ్ళిన ఈ సినిమాలో బావున్నదల్లా రెండే- కళ్యాణ్  కోడూరి సంగీతం, దీపక్ భగవంత్ కెమెరాపనితనం మాత్రమే. పాటలకి పెద్దాడ మూర్తి రాసిన గీతాలు బావున్నాయి. జునైద్ ఎడిటింగ్ మళ్ళీ కొన్ని తప్పుల్ని సవరించ లేకపోయింది. ఈ సినిమా ముప్పాతిక కథ కర్ణాటకలోని అధిక వర్ష పాతముండే - అస్తమానం వర్షం పడుతూనే  వుండే గ్రామం ఆగుంబే లో జరుగుతుంది. అయితే తేజ తీసినప్పుడు కిటికీ లోంచి చూపిస్తే వర్షం పడుతూంటుంది, అదే కెమెరాని ఇటు పాన్ చేసి తలుపు అవతలకి చూపిస్తే,  బయట చక్కటి ఎండ కాస్తూంటుంది.  హీరోయిన్ తో ఎసిపి మాట్లాడుతూంటే వర్షం పడుతూంటుంది, అదే హీరోయిన్ వున్న వైపు చుక్క వర్షం పడని ఎర్రటి ఎండ వుంటుంది.  కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ చాలా వున్నాయి.  

          సినిమా ఓపెనింగే తేజ అలసత్వాన్ని పట్టిస్తుంది. సిటీ నడి సెంటర్లో గొడ్డలితో నరికి భార్యా భర్తల్ని విలన్ చంపుతోంటే, చంపి చాలా నింపాదిగా అన్నీ సర్దుకుని వెళ్లిపోతూంటే, జనమంతా  చుట్టూ చేరి అదేదో గారడీ ప్రదర్శన అన్నట్టుగా చూస్తూంటారు- అది గారడీ ప్రదర్శనా? అతనలా మర్డర్లు చేస్తూంటే చుట్టు  పక్కల ఎవరూ లేకుండా భయంతోనైనా పారిపోవాలి, లేదా తెగించి వాణ్ణి  పట్టుకుని పోలీసులకైనా అప్పగించాలి- ఇదేమీ చేయకుండా, గిరి గీసుకుని చుట్టూ నిలబడి తమాషా చూస్తూంటారు. ఎవరూ ఒక్క ఫోటో- ఒక్క వీడియో కూడా తీసి అప్ లోడ్ చేయరా ఈ కాలంలో? 

స్క్రీన్ ప్లే సంగతులు

   ఇది మరో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని చెప్పడానికి చాలా...బాధేస్తోంది. సినిమా నిడివి రెండు గంటలా నలభై నిమిషాలు(!) వుంటే, ఒక్క బిగినింగ్ విభాగమే రెండుంపావు గంటలు   తినేస్తుంది! అప్పుడు మాత్రమే సినిమాకి వెన్నెముక అనదగిన, సినిమాలో యాభై శాతం నిడివి ఉండాల్సిన, మిడిల్ ప్రారంభమవుతుంది!

              మిడిల్ తో బాటు ఎండ్ కూడా మిగిలిన అరగంట వ్యవధిలోనే ఇరుక్కుంటాయి. స్క్రీన్ ప్లే ఇలా ఉన్నాక, సినిమాని ఎంత ప్రమోట్ చేసుకుంటే ఏం లాభం. అమ్మాల్సిన సరుకు సినిమానా, స్క్రీన్ ప్లేనా? అమాయక ప్రేక్షకుల మీద ఎలాటి స్క్రీన్ ప్లేలు పడేస్తున్నారో సరిచూసుకుని ప్రమోట్ చేసుకోవాలా, వద్దా? నీ స్క్రీన్ ప్లే లో థర్డ్ యాక్ట్ బాగాలేదయ్యా, నీ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ ఏమిటి? - అని హాలీవుడ్ నిర్మాతలు ప్రొఫెషనల్ గా అడిగే లాంటి కల్చర్ రానంతవరకూ తెలుగు సినిమాలకి మోక్షం లేదు. తొంభై శాతం ఫ్లాపుల రికార్డు కొనసాగుతూనే వుంటుంది

          స్ట్రక్చర్ స్పృహ వుండని ఇలాటి కథా కథనాలకి పాల్పడే కంటే, అసలు స్ట్రక్చరే వుండని గాథలుతయారు చేసుకోవడానికి సిద్ధపడితే మంచిదేమో.

          ఆర్ట్ సినిమాలు తీయని టాలీవుడ్ మీద విధి ఇలా పగ తీర్చుకుంటోందేమో ఒకవేళ. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్లతో తీస్తున్నవి కూడా స్ట్రక్చర్ పరంగా ఆర్ట్ సినిమాలేనని తెలీకనే తీసేయడం  విధి చేయు వింతేనేమో. కానీ ఆత్రేయ రాసినట్టు, ఇక్కడ ఇది మతిలేని చేష్ఠమాత్రం కాదు-తను చేయాల్సిన పని కరెక్టుగానే చేసుకుపోతోంది విధి. ఎమర్సన్ అన్నట్టు విధి ఎప్పుడూ గ్రేట్ లెవెలర్- హెచ్చు తగ్గుల్ని సమానం చేసేస్తుంది.  

           స్ట్రక్చరూ వుండని పాసివ్ పాత్రల గాథలేఆర్ట్ సినిమాలు. రాసుకుంటున్న కథలకి స్ట్రక్చర్ ఉండక, వున్నా హీరో పాత్ర పాసివ్ గా మారిపోయి- అట్టహాసంగా తీస్తున్నవినిజానికి బిగ్ బడ్జెట్ల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే.

***
   అందుకని తమ వల్ల కాదని తేలిపోయిన కథలకి బదులు,  అసలే స్ట్రక్చరూ వుండని, సులభంగా తయారు చేసుకోగల  ‘గాథలు’ రాసుకుంటే గొడవే వుండదేమో.   ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా కుమార్తె, సోఫియా కపోలా దర్శకత్వం వహించి ఆస్కార్ అవార్డు కూడా పొందిన ‘సమ్ వేర్’ (2010) అనే సినిమాకి ఏ స్ట్రక్చరూ వుండదు. కారణం అది ‘గాథ’ కాబట్టి. గాథ (tale) కీ,  కథ(story) కీ తేడా గురించి గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది, గాథ స్టేట్ మెంట్ ని మాత్రమే ఇస్తుంది. కథలో పాత్ర యాక్టివ్ గా వుంటుంది, గాథలో పాసివ్ గా వుంటుంది. కథ కమర్షియల్ సినిమాకి పనికొస్తుంది, గాథ పనికి రాదు. అయినా శ్రమలేకుండా పని జరిగిపోయే గాథలే రాసుకోవాలనుకుంటే, పైన ఉదాహరించిన ‘సమ్ వేర్’ ని పరిశీలించుకోవచ్చు. అనంతరం అవార్డులకి పంపుకోవచ్చు. అసలు స్క్రీన్ ప్లేల  పరంగా ఫ్లాపయిన సినిమాలన్నిటినీ అవార్డులకి పంపుకోవచ్చు. వాటికి అక్కడే తప్ప, ప్రేక్షకుల మధ్య స్థానం లేదు.  

          దర్శకుడు తేజ చాలా విచిత్రంగా స్ట్రక్చర్ ని భంగపర్చడమే గాక, హీరో (కథానాయకుడు) కి కొత్త నిర్వచనమిచ్చారు. విచిత్రంగా అని అనడమెందుకంటే- తను తీసిన సూపర్ హిట్స్ ‘జయం’, ‘నువ్వునేను’ ల  బలమైన స్ట్రక్చర్స్ ని తనే మర్చిపోయినందుకు.

          ఈ రెండూ అరగంటలో బిగినింగ్ ని ముగించుకుని, చక్కగా మిడిల్లో పడతాయి. సార్వజనీన త్రీ యాక్ట్  స్ట్రక్చర్ కి లోబడి వుంటాయి. 

          అలాటిది ‘హోరాహోరీ’ తో - పైన చెప్పుకున్నట్టు, నేటి యువ ప్రేక్షకులతో ఆయన కనెక్ట్ కాలేకపోవడమే కాదు, ఏకంగా స్ట్రక్చర్ తోనే కనెక్షన్ కోల్పోయారు. ఇది డబుల్ ట్రబుల్. మూడో ట్రబుల్ - తన సినిమాకి హీరో ఎవరో కూడా మర్చిపోవడం!


***
     People have forgotten how to tell a story. Stories don't have a middle or an end any more. They usually have a beginning that never stops beginning- Steven Spielberg …ఇలా పదేపదే ప్రస్తావించుకోవాల్సి వస్తోంది!

   beginning that never stops beginning...!  అంటే ఏమిటో ఒకసారి శివాజీ గణేశన్ బాగా వివరించారు. పడవేసుకుని పోతున్నవాడు తెడ్డు వేసుకుంటూ పోతూనే ఉంటాడు...పోతూనే ఉంటాడు..సినిమా ఎండ్ దాకా అలా పోతూనే ఉంటాడు- అదే ఆర్ట్ సినిమా-అని! ఇంతకంటే అవమానకరమైన ఎత్తిపొడుపు వుండదు కమర్షియల్ సినిమాకి!


          తేజ సినిమాలో కూడా ప్రారంభమైన బిగినింగ్ పోతూనే వుంటుంది..పోతూనే వుంటుంది..ఆయన తెడ్డు వేసుకుని బిగినింగ్ తో పోతూనే వుంటారు..అలా వెళ్లి పోతూనే వుంటారు..హైలెస్సా అనుకుంటూ బలప్రయోగం చేసి లాగుతూనే వుంటారు.. లాగుతూనే వుంటారు..క్లయిమాక్స్ దాకా లాక్కెళ్ళి, అప్పుడు హమ్మయ్యా అని పూర్తి సంతృప్తి చెంది, బిగినింగ్ ని  భద్రంగా వదిలేస్తారు. ఇంత కష్ట పడి సినిమా సాంతం బిగినింగే రాసుకుంటే ఇది స్క్రీన్ ప్లే కాదనడం పాపం.


***
ఉండాల్సిన స్ట్రక్చర్..  
హోరా హోరీ’ లో ఉన్న స్ట్రక్చర్..

       పై రెండు చిత్ర పటాలని చూస్తే ఎలా ఉండాల్సిన స్ట్రక్చర్ ‘హోరా హరీ’ లో ఎలా అయిపోయిందో తెలుస్తుంది. ‘హోరాహోరీ’ స్ట్రక్చర్ లో బిగినింగ్ చేసిన ర్యాగింగ్ దెబ్బకి, మిడిల్-ఎండ్ లు బిక్కుబుక్కుమంటూ చివరి క్లాస్ రూమ్ లో ఎలా ఇరుక్కుని కూర్చున్నాయో తెలుస్తుంది. ప్రభుత్వం కన్నుగప్పి స్క్రీన్ ప్లేల్లో కూడా ఇలా చేస్తున్న ర్యాగింగ్ ని ఎక్స్ పోజ్ చేయాల్సిందే!

          ముందు బిగినింగ్ విభాగం ఎలా వుందో చూద్దాం..

          బిగినింగ్ లో అరగంట దాకా హీరోయిన్ వ్యవహారమే. హీరోయిన్ పెళ్లి చెడగొట్టి బెదిరించే  విలన్ ప్రయత్నాలే. దాంతో ఆమె పిచ్చిదై పోవడం, వాతావరణ మార్పు కోసం వేరే వూరికి తరలించడమూ-   అక్కడా ఫిట్స్ వస్తూ పేషంట్ గానే ఉండడమూ- పూర్తిగా హీరోయిన్ తో ఉండాల్సిన యూత్ అప్పీల్ నీ, గ్లామర్ కోషెంట్ నీ నీరుగార్చేసింది. 

          ఆమెకి రెండేసి ధమాకా లెందుకుండాలి? ఒకటుంటే సరిపోతుంది. చంపుతానని విలన్ చేస్తున్న బెదిరింపులే ఆమెకి ఎక్కువ. మళ్ళీ పిచ్చిదవడం క్యారక్టరైజేషన్ ప్రాబ్లం. ఆమెకి ప్రాణభయం ఉన్నందుకే వేరే వూరు తరలించినట్టు చూపడంలో వున్న థ్రిల్, సస్పెన్స్, ఆమెతో వుండే యూత్ అప్పీల్ వగైరా - డబుల్ ధమాకా గా మతిస్థిమితం కూడా తప్పినట్టు చూపడంలో వుండదు. దీనివల్ల కథకి ఒనగూడే ప్రయోజనం లేకపోగా, వినోద కాలక్షేపాన్నీ, రోమాంటిక్ ఫీల్ నీ  సినిమా ప్రారంభంలోనే  ఈ అరగంట సేపూ హరించి వేసినట్టయింది. 

          మతిస్థిమితం కూడా తప్పడం ఎప్పుడు అవసరమంటే, వాణ్ణి భరించీ భరించీ, ఇక భరించలేక పిచ్చెక్కి - ఒరేయ్ ఇక నువ్వు బతకవురా, రారా, రా - అని ఎదురుతిరిగి ఒక్క వేటు వేసినప్పుడు, ఆ మతి స్థిమితం కూడా తప్పడం కథకి అవసరమవుతుంది. ఒన్ క్యారక్టర్- ఒన్ సిట్యుయేషన్- ఒన్ క్యారక్టరిస్టిక్- అంతే!  డబుల్ ధమాకాతో కథ దవాఖానాకే. 

          ఈ అరగంట తర్వాత ప్రవేశించే హీరో, నెట్ సెంటర్ పోటీల కోసం స్పీడ్ టైపింగ్ కి హీరోయిన్ ని ఒప్పించాక,  నడిపిన కథనమంతా ఇప్పటి సినిమాలకి పని కొచ్చేది కాదు. చాలా నీరస పడి పోతుంది నడుస్తున్న కథనమంతా.  ‘జయం’, ‘నువ్వునేను’ తీసిన కాలంలో యువత ఇంకా నెటిజన్లు కారు, సరీగ్గా సెల్ వాడకం దార్లు కూడా కాదు. అప్పుడు టీనేజర్లని అమాయకులుగా, ఓ చిన్న ప్రపంచంలో జీవించే లేత పిండాలుగా చూపిస్తే సరిపోయింది. ఇప్పుడు సరిపోతుందా? రూరల్ యూత్ అయినా కనెక్ట్ అవుతారా?

          అసలు నెట్ సెంటర్ కి వచ్చే అమ్మాయిలూ అబ్బాయిలు టైపింగ్ నేర్చుకోవడానికి రావడ మేమిటో అర్ధంగాదు. ఇక హీరో ప్రేమని వ్యక్తం చేశాడు, హీరోయిన్ లాగి కొట్టింది- హీరో వెళ్లి రైలు పట్టాల మీద పడుకున్నాడు.

          ఈ పడుకోవడం కూడా యితరులు చూసేట్టు చూసుకుని మరీ డ్రమెటిగ్గా పడుకున్నాడు. ఎదురుగానే ఇల్లుంది. అంటే ఏంటి అతడి  ఉద్దేశం-  చావు నటిద్దామనా? ఆ ఇంట్లో ఎవరో చూసి కాపాడితే హీరోయిన్ కరిగిపోతుందనా? అసలది రైలొచ్చే టైమేనా? ఇది కామెడీ సినిమా అయితే ఇలా బాగానే వుంటుంది, కానీ ఒక  సీరియస్ పరిస్థితిని ఇలా కామెడీగా చూడాల్సి వస్తోంది. ఇంతలో  ఓ చిన్న కుర్రాడు ఆ ఇంట్లోంచి రివ్వున రానే వచ్చాడు, వచ్చేసి సీను చూసేసి, హీరోయిన్ కి చెప్పేందుకు తుర్రుమన్నాడు. హీరో చచ్చాడు! - ‘ఒరే ముందు మీ ఇంట్లో చెప్పి కాపాడరా, రైలొచ్చేస్తుంది- ఆ హీరోయిన్ కి తర్వాత చెప్పేడ్చినా  నా ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అవుతుంది’ - అని అరవాలి హీరో. కుర్రాడు కూడా, తానలా హీరోయిన్ దగ్గరికి తుర్రుమంటే, ఇలా సర్రుమని ట్రైనొచ్చి హీరో మీదికి ఎక్కేస్తే? - అని ఆలోచించలేదు వాడి తెలివికి! 

          ఇదంతా ఇంటర్వెల్ ఘట్టం. ఆ సమయంలో విలన్ వచ్చి కాపాడి కోప్పడతాడు. పక్క కెళ్ళి ఒకణ్ణి మర్డర్ చేస్తాడు. అట్నుంచి హీరోయిన్ వస్తూంటుంది. హీరోని కలుసుకుంటుంది. ‘చస్తావా? చచ్చిపోతావా?’ అని ఎడాపెడా లెంపకాయలు కొట్టి- ‘నన్ను చేసుకుంటే నీకు ప్రమాదమనే అప్పుడు రిజెక్ట్ చేసి కొట్టాను’ - అని సంజాయిషీ చెప్పుకుంటుంది. 

          ఇది చాలా కీలకమైన సన్నివేశం! ఇక్కడే హీరోయిన్ సమస్య బయటపడి, ఆ సమస్యతో హీరో సంఘర్షణ మొదలయ్యే- బిగినింగ్ ముగిసి చక్కగా మిడిల్ ప్రారంభమయ్యే ఘట్టం! కానీ ఇదేం  జరగదు..

          ఆమె అలా అనగానే  హీరో ఎలర్ట్ అవ్వాలి నిజానికి. తను ఈమెని చేసుకుంటే తనకే ప్రమాదమని ఎందుకన్నది అనైనా మానవ సహజ కుతూహలంతో అడగాలి. అసలామె సమస్యే మిటో, ఆందోళన దేనికో అప్పుడైనా అడిగి తెలుసుకోవాలి. అదేమీ చెయ్యడు. అటు పక్క మర్డర్ చేసిన విలన్ రక్తం తుడుచుకుంటూ ఉంటాడు. వీళ్ళు చూడరు, వీళ్ళని వాడూ చూడడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతూంటే ఇంటర్వెల్. ఇంతసేపూ అటు వెనకాల పట్టాల మీదే ట్రైనే వెళ్ళదు.
 
          నిజంగానే ఇక్కడ బిగినింగ్ ముగిసి కథ సెటప్ అయిందా? ఇక్కడ్నించీ మిడిల్ సాగడానికి సమస్య ఏర్పాటయ్యిందా? 

          ఎవరికి  సమస్య ఏర్పడాలి? కథానాయకుడికి ఏర్పడాలి. కథానాయకుడు హీరోనే అనుకుంటున్నాం. ఇతను చూస్తే ఇంతవరకూ హీరో లక్షణాలేవీ కనబరచలేదు. హీరోయిన్ కాదన్నదని పట్టాల మీద పడుకున్నాడు. పరిస్థితి తీవ్రత గురించి హీరోయిన్ హింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. మరి ఇతడి గోల్ ఏమిటి? కనుక గోల్ లేదు కాబట్టి ఇతను ఈ కథకి కథానాయకుడు కాదు. ఎంత పాసివ్ హీరో క్యారక్టర్లయినా కథానాయకులు గానే వుంటాయి సినిమాల్లో. అలా పాసివ్ హీరోగా వున్న ఇతను కూడా కథానాయకుడు కానట్టు పాత్ర చిత్రణ, కథనం నడిచాయి. ఒక సినిమాలో హీరో కాక పోతే ఇంకెవరు కథా నాయకులవుతారు? అలాంటి సినిమాలుంటాయా? 

          హీరోయిన్ సంగతి చూస్తే, ఈమె విలన్ భయంతో బాటు- అటు హీరోని ప్రేమించడానికీ అన్న భయంతో బిక్కుబుక్కు మనే పాత్ర. ఈమెకి ఈ సమస్యలున్నాయి గానీ -పరిష్కరించుకునే తెగువ ( గోల్) లేదు. కనుక ఈమే కథానాయకురాలు కాదు.

          ఇక మిగిలింది విలన్. ఇతనే మన గ్రేట్ హీరో! సినిమా మొదలెట్టింది లగాయతూ హీరోయిన్ కోసం పడి చచ్చిపోతూ- మర్డర్లు చేసేస్తూ- ఆమెని వెతుక్కుంటూ-పిచ్చోడిలా తిరుగుతున్నాడు. ఇతడికి తిరుగులేని గోల్ వుంది- ఈ బిగినింగ్ లోనే కాదు- మిడిల్- ఎండ్ దాకా అన్నిటా ఈ గోల్ కోసం రగిలిపోతూంటాడు. కాబట్టి ఈ కథకి కథానాయకుడు ఇతనే అని తేలుతోంది.

          ఈ సినిమాకి విలనే కథానాయకుడు!
          ఈ కథ విలన్ దే!
          గోల్ వున్న క్యారక్టర్ విలనే! 
          ఇంత స్క్రీన్ ప్లే బ్లండర్ తో ఒక సినిమా ఎలా తీస్తారో విచిత్రం.


***
      యినంత మాత్రాన ఈ ఇంటర్వెల్ తో బిగినింగ్ విభాగం ముగిసి మిడిల్ ప్రారంభమయి నట్టు కాదు. కథ కూడా ప్రారంభ మయినట్టు కాదు. ఇంటర్వెల్ సీన్ చాలా మిస్ లీడింగ్ సీన్. ఇక్కడ సమస్య ఏర్పాటయి నట్టే కన్పిస్తుంది కానీ ఏర్పాటు కాలేదు- ఏర్పాటయితే ఏదో ఒక పాత్ర ఎఫెక్ట్ అవ్వాలి. ఈ మైదాన ప్రాంతంలో  విలన్ - హీరోయిన్ ఎదురెదురు పడలేదు. విలన్ పొదల అవతలే ఉన్నాడని హీరోయిన్ కి తెలీదు, హీరోయినూ హీరో పొదలవతల ఉన్నారనీ విలన్ కూడా చూసుకోలేదు. హీరోయిన్ ఈ ఊళ్లోనే ఉంటోందని కూడా అప్పటికి తెలీదు. విలన్ అవతల ఉన్నాడని హీరోకి తెలిసినా- ఆ విలన్ కి,  హీరోయిన్ తో వున్న ప్రాబ్లం అసలే తెలుసు కోదల్చుకోలేదు హీరో.

          విలన్ చూసి వుంటే వెంటనే సమస్య ఏర్పాటయ్యేది-ఆ సమస్య విలన్ దే అయి దాన్ని సాధించే  క్రమంలో ఇక్కడ బిగినింగ్ ముగిసి- ఇంటర్వెల్ తర్వాత నుంచైనా మిడిల్ ప్రారంభమయ్యేది- మూడు పాత్రల మధ్య ఇంటరెస్టింగ్ ప్లేతో.

          ఇలా లేదు సెటప్. కేవలం విలన్ ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి, పరోక్షంగా సమస్య క్రియేట్ అయ్యిందని ఆడియెన్స్ ఫీలవ్వాలి తప్ప, ప్రత్యక్షంగా పాత్రల మధ్య ఇంకా ఏమీ లేదు. కనుక  ఇక్కడింకా ఇంటర్వెల్ దగ్గర గంటన్నర గడిచినా, ఇంకా బిగినింగ్ ముగియలేదు, సమస్య- సంఘర్షణ ఏర్పాటుతో కథ ప్రారంభమూ  కాలేదు.


***
లాజోస్ ఎగ్రి 
     కథలన్నీ సంఘర్షణా యుతమైనవే. సంఘర్షణ లేక పాత్ర లేదు, పాత్రలేక చర్యల్లేవు, చర్యల్లేక  కథలేదు, కథ లేక స్క్రీన్ ప్లేనూ లేదు- సిడ్ ఫీల్డ్. 
          అంటే సంఘర్షణ మొదలవనిది కథ మొదలవనట్టే. సంఘర్షణ బిగినింగ్ లో మొదలవదు. బిగినింగ్ ముగిసేచోట సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ అప్పుడు స్క్రీన్ ప్లే మిడిల్ లో పడి కథ మొదలవుతుంది. కాబట్టి ‘హోరాహోరీ’ లో పైన చెప్పుకున్నట్టు, ఇంటర్వెల్ దగ్గర కూడా సంఘర్షణ పుట్ట లేదంటే, బిగినింగ్ ఇంకా ముగిసిపోనట్టే. అంటే సెకండాఫ్ లో కూడా బిగినింగ్ అలా కొనసాగుతూనే ఉంటుందన్న మాట!  సంఘర్షణ ఎప్పుడు పుడుతుందో తెలీదు, కథ ఎప్పుడు ప్రారంభ మవుతుందో తెలీదు. ఈ నడుస్తున్నదంతా అవధులు దాటిన ఉపోద్ఘాతమే! ఉపోద్ఘాతం కథ వుతుందా?

          చాలా విచారించాల్సిన విషయమేమిటంటే, ఇప్పటికీ చాలా మంది స్క్రీన్ ప్లే ప్రారంభం నుంచీ చూపించేదంతా కథే అనుకుంటున్నారు! అందుకే ఇలాటి స్క్రీన్ ప్లేలు! సంఘర్షణ
పుట్టనంత సేపూ కథే కాదు- ఈ సంఘర్షణ గురించి- లాజోస్ ఎగ్రి  (1888 – 1967)  రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ అన్న ప్రసిద్ధ గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు  : ఏమీ కోరుకోని వ్యక్తినుంచి, తనకేం కావాలో తెలీని వ్యక్తి  నుంచీ సంఘర్షణని ఆశించలేం...కథలో నిర్ణయం తీసుకోలేని పాత్రలు స్తబ్దుగా ఉండిపోయే సంఘర్షణని సృష్టిస్తాయి. సంఘర్షణ పుట్టే పరిస్థితులు ఏర్పడినా పాత్రలు ఉపేక్షిస్తాయి...ఏ డైలాగూ, అదెంత బలంగా ఉన్నప్పటికీ, అది సంఘర్షణకి కారణం కానంత వరకూ కథ కూడా పుట్టదు. ఒక్క సంఘర్షణ మాత్రమే మరిన్ని సంఘర్షణలని పుట్టించ గల్గుతుంది. తొలి సంఘర్షణాత్మక పరిస్థితి- పాత్రకి తన లక్ష్యాన్ని(గోల్ ని) తను సాధించుకోవాలన్న స్పృహ కలగనంతవరకూ ఏర్పడదు..

          సరీగ్గా ఇది  ‘హోరాహోరీ’ ఇంటర్వెల్ సీనుకి వర్తిస్తుంది.  పైన వివరించుకున్నట్టు, హీరో ఏం కోరుకుంటున్నాడో తెలీదు. హీరోయిన్ ని గెల్చుకోవాలనుకుంటున్నాడా, చచ్చిపోవా లనుకుంటున్నాడా తెలీదు. ఇంటర్వెల్ తర్వాత ఆమె పెద్దలు తన్నారు, తంతే వెళ్లి విలన్ కే  చెప్పుకున్నాడు. కాబట్టి ఇతన్నుంచీ సంఘర్షణ ని ఆశించలేం. ఇతను నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టే ఇంటర్వెల్ దగ్గర పుట్టాల్సిన సంఘర్షణని పుట్టనివ్వకుండా  స్తబ్దుగా ఉండిపోయేట్టు చేశాడు.  హీరోయిన్ తో ప్రేమకి సంబంధించి ఇద్దరి మధ్యా  అసలు విషయం బయటపడే ఒక్క డైలాగూ - నోరి జారి కూడా ఇతనూ విలనూ చెప్పకపోవడం వల్ల సంఘర్షణ పుట్టలేదు. హీరో కి లక్ష్యమే లేదు కాబట్టి ఎంతసేపటికీ తొలి సంఘర్షణాత్మక పరిస్థితిని పుట్టించ లేకపోయాడు వదిలేద్దాం. హీరోయిన్ కోసం అంతగా అల్లాడుతున్న బలమైన లక్ష్యమున్న  విలన్ కూడా సంఘర్షణ పుట్టే పరిస్థితే వున్నా, దర్శకుడు చెప్పినట్టు విని, దాన్ని ఉపేక్షించడం వల్ల సంఘర్షణ నీరు గారిపోయింది. కథ పెండింగులో పడిపోయింది. విఫలమైపోయింది.


***
         సెకండాఫ్ లో బిగినింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ డ్రామా ఏమిటంటే, అసలు విషయం తెలీని హీరో-విలన్ లు జిగ్రీ దోస్తులై పోవడం..హీరో ప్రేమ కోసం విలన్ ప్లాన్లు చెప్పడం, చెప్పిన ప్లాన్లు మళ్ళీ ఆపుకోడం- (అమలైతే  విలన్ కి అసలు విషయం అప్పుడే తెలిసిపోతుందని దర్శకుడి భయం). ఆఖరికి కాలేజీ దగ్గర హీరోయిన్ని విలన్ చూసి అసలు విషయం చెప్పినప్పుడు హీరో లోలోన కుమిలిపోవడం, విలన్ ఇచ్చిన ఉంగరాన్ని అతడి తరపున హీరో తనే హీరోయిన్ కి తొడిగించడం, గోడచాటున కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం, ఆ ఉంగరం హీరో ప్రేమ కానుక అనుకున్న హీరోయిన్ అన్న వచ్చేస్తున్నాడని, దాన్ని తీసేయడానికి ఇంటిల్లిపాది తో కలిసీ  విఫలయత్నం చేయడం...

          ఇలాసాగుతూ సాగుతూ ఈ బిగినింగ్ విభాగం ఇంకో ముప్పావుగంటా గడిచి- అప్పుడు అసలు విషయం విలన్ కి తెలిసి హీరోతో సంఘర్షణ పుడుతుంది. మిడిల్ ప్రారంభమై కథ మొదలవుటుంది. ఈ కథ పావుగంట మాత్రమే  నడిచి మిడిల్ అంతలోనే ముగిసిపోయి, కయిమాక్స్ తో ఎండ్ ప్రారంభమవుతుంది.

          ఇలా రెండు గంటలా నలభయి నిమిషాల సినిమాలో కథకి ఇచ్చిన సమయం ఎంత అంటే, కేవలం చిట్ట చివర పావుగంట! మిడిల్ మటాష్ తో మిగతాదంతా నస! ప్రేక్షకులు డబ్బులు చెల్లించేది స్క్రీన్ ప్లేలో యాభై శాతం కథ ( మిడిల్) కోసం!  ఇలా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తో సినిమా ఎలా సక్సెస్ అవుతుందనుకోవాలి?  ‘కిక్- 2’  సక్సెస్ అయిందా? 

          చివరగా, ఈ కథ పాయింటు 2013 లో విడుదలైన ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి దొబారా’ పాయింటూ ఒకటే. ఇందులో మాఫియాగా అక్షయ్ కుమార్, బస్తీ కుర్రాడు ఇమ్రాన్ ఖాన్ ని చేరదీసి, అనుచరుడుగా నియమించుకుంటాడు. ఇద్దరూ కలిసి సోనాక్షి సిన్హా తో ప్రేమలో పడతారు...


-సికిందర్
           



 












           




          









          
 























12, సెప్టెంబర్ 2015, శనివారం

సాంకేతికం -డీఐ

          డీఐ విధానంలో కలరిస్టు  పని చిత్ర లేఖనమే. చిత్రకారుడు కుంచెతో రంగు లద్దినట్టు,  కలరిస్టు సాఫ్ట్ వేర్ తో మెరుగులు దిద్దుతాడు. వెలుగు నీడల్ని సరిచేస్తాడు. ఆలోచన మెరిస్తే, తెలుపు నలుపు దృశ్యాల్లో చొక్కా గుండీలకి రంగు లేసి చమత్కారం కూడా చేస్తాడు. కెమెరామాన్ దృశ్యమానం చేస్తే,  కలరిస్టు కలంకారీ తనం ప్రదర్శిస్తాడు. ఉపయోగించే సాఫ్ట్ వేర్ బేస్ లైట్ కావొచ్చు, లస్టర్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు  -వర్క్ స్టేషన్ ఏదైనా విన్యాసాలోకటే.

          కాకపోతే డీటీఎస్ నిపుణుల్లాగే  డిఐ కలరిస్టులు  ఫీల్డు మొత్తం మీద అతికొద్ది మందే వుంటారు. ఫీల్డు అవసరాలకి వీళ్లి సరిపోతారు. టాలీవుడ్ లో వున్న అలాటి అతికొద్ది మంది కలరిస్టుల్లో  సి.వి. రావు ఒకరు. కలరిస్టుకి పని ఒత్తిడి చాలా ఎక్కువ. అలాంటప్పుడు డీఐ సూట్లు పెంచుకుని, ఎక్కువ మంది కలరిస్టుల్ని నియమించుకోవచ్చు కదా అన్పించ వచ్చు. కా నీ అది కాదు సమస్య. ఎడాపెడా సినిమాలు తమ మీద వచ్చి పడిపోవడం వల్ల కాదు పని భారం పెరిగి ఒత్తిడి.. సీవీ రావు మాటల్లోనే చెప్పుకుంటే- ‘సినిమాల్ని రిలీజ్ ఘడియ వరకూ ఎడిటింగ్ చేస్తూ ఆక్షరి నిమిషాల్లో డీఐ కి పంపిస్తూంటారు. దీంతో ఒత్తిడి పెరిగి నాణ్యతతో కూడా రాజీ పడాల్సి వస్తోంది..’  ఇదీ సమస్య. ఆఖరి నిమిషాల్లో ఆదరాబాదరా అవసరాలు తీర్చే సమస్య!

      ‘మగధీర’ ’ క్లయిమాక్స్ దృశ్యాలకి ఈయన అలాటి డెడ్ లైన్ ( రెండు రోజులు మాత్రమే గడువు!) ఒత్తిడినే ఎదుర్కోవాల్సి  వచ్చింది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో డీఐ  అక్కడక్కడా పాలిపోయినట్టు కన్పించడానికి కారణం ఇలాటి పని ఒత్తిడే. తెలుగు సినిమాలపై వెబ్ సైట్లలో వచ్చే ఇంగ్లీషు రివ్యూలలో, డీఐ బాగా లేదని రాస్తూంటారు. ఎందుకు బాగా రాలేదో కారణాలు తెలుసుకుని రాస్తే, కలరిస్టుల  నైపుణ్యం మీద అనుమానాలు తొలగి పోయే అవకాశముంటుందని అబిప్రాయపడ్డారు తను. 

          డీఐ అంటేనే కెమెరామాన్ చిత్రీకరించు కొచ్చిన  బొమ్మల్ని రేణువులుగా విడగొట్టి, శుద్ధి చేసి, తిరిగి ఫిలిం మీదికి ఎక్కించడం. ఈ ఫిలిం ట్రీట్ మెంట్, డీ-స్పాటింగ్, డర్ట్ ఫిక్సింగ్, కలర్- లైటింగ్ కరెక్షన్ ప్రక్రియల్లో కలరిస్టు సూక్ష్మ గ్రాహి అయివుంటాడు. అతడి ఏకాగ్రతకి పూర్తి 30 రోజుల గడువూ ఇవ్వకపోతే, క్వాలిటీ రాదన్నారు సీవీ రావు.

        ఓకే, ఇక సాంకేతికాల్లోకి వెళితే, ఆయన చెప్పిన ప్రకారం- సాంప్రదాయ గ్రేడింగ్ లో ఎనలైజర్ తో బొమ్మని మాత్రమే సరి చేయగల్గుతారు. స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, దృశ్యంలో ప్రధాన బొమ్మ వరకూ మాత్రమే సరిదిద్ద గలుగుతారు. దీన్ని ప్రైమరీ కలర్ కరెక్షన్ అంటారు. ఈ బొమ్మ మినహా మరే దృశ్య భాగాన్నీ ఎనలైజర్ తో దిద్దడం  కుదరదు. అంటే- దృశ్యంలో పొద్దు తిరుగుడు పువ్వు ప్రధాన బొమ్మగా వుంటే, దాని పసుపు వర్ణం ( అంటే స్కిన్ కలర్)  ని ఆధారం చేసుకుని కాడనీ, తొడిమల్నీ, ఆకుపచ్చ రంగుతో ఎంతయినా ఆకర్షణీయం చేయొచ్చు. కానీ పైన ఆకాశాన్నీ, కింద నేలనీ మాత్రం ఏమీ చేయలేరు. ఈ పువ్వు స్థానంలో మనిషి రూపమే  ప్రధాన బొమ్మగా వున్నా కూడా, ఆ  స్కిన్ కలర్ ని బేస్ చేసుకుని, ఆ రూపం వరకూ మాత్రమే సింగా రించగల్గుతారు. 


        డీఐ తో అలా కాదు- దృశ్యం లో ప్రధాన బొమ్మతో బాటు, నేపధ్యంలో ఇంకా ఏవైనా విశేషాలుంటే వాటన్నిటినీ రంగులతో, వెలుగు నీడలతో సరి దిద్దెయ్యొచ్చు. అంటే పొద్దు తిరుగుడు పువ్వు తో బాటు పైన భూమ్యాకాశాల్నీ, చుట్టూ పశుపక్ష్యాదుల్నీ, సమస్త విశేషాల్నీ కొట్టొచ్చేట్టు తీర్చిదిద్ద వచ్చన్న మాట. దీన్ని సెకండరీ కలర్ కరెక్షన్ అంటారు. పాత గ్రేడింగ్ పద్ధతి ప్రైమరీ కే పరిమితమైతే, డీఐ వచ్చేసి సెకండరీకి విస్తరించి, మొత్తం ఫ్రేమునీ కళకళ లాడేట్టు చేస్తుంది.ఇదెలా జరుగుతుందో వీడియో స్క్రీన్ మీద ఉత్సాహంగా చేసి చూపించారు.

     బేస్ లైట్ ఈయన అభిమాన వర్క్ స్టేషన్. దాని ముందు ఆత్మవిశ్వాసంతో గర్వంగా కూర్చుని పని చేస్తారు. ఇందుకోసం లండన్ లో బేస్ లైట్ కంపెనీ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ పొంది వచ్చారు. 2005 లో ఒక నార్వేజియన్ ఫిలిం ‘కిల్ బుల్ జో’ ( క్వెంటిన్ టరాంటినో తీసిన ‘కిల్ బిల్ కి పేరడీ) తను డీఐ చేసిన మొదటి సినిమా. అయితే తెలుగులో బడ్జెట్ పరిమితులుండే  చిన్నా చితకా సినిమాలకి డీఐ చేసుకునే అదృష్టం ఉండదా అని అడిగితే- దీనికిలా  చెప్పారు :  ‘వాళ్ళు ముడి ఫిలిం కి పెట్టే లక్షల రూపాయల్ని డీ ఐ కి కేటాయించుకుని, డిజిటల్లో చిత్రీకరణ జరుపు కోవచ్చు. చిన్న సినిమాలకి కూడా డీఐ అదృష్టం వుంటుంది. ఎలాగూ ఆ డిజిటల్ అవుట్ పుట్ ని ఫిలిం మీద ప్రింట్లు వేయించుకునే సదుపాయం వుంది కదా, ఇలా చేసుకుంటే భారీ సినిమాల డిఐ హంగులు చిన్న సినిమాలకీ సాధ్యమే!’

       చిత్తూరు జిల్లా దొడ్డి పల్లి కి చెందిన సీవీ రావు ( చెరపల్లి వెంకటేశ్వర రావు) ఆర్ధిక శాస్త్రంలో పీ హెచ్ డీ చేసి, మల్టీ మీడియాలో మాస్టర్స్ డిప్లొమా పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఓ మల్టీ మీడియా సంస్థలో  పని చేస్తున్నప్పుడు, 2005 లో  కె. బసిరెడ్డి నెలకొల్పిన ‘డిజిక్వెస్ట్’ లాబ్ లో అవకాశం వచ్చింది. అప్పట్నించీ ‘మగధీర’, ‘కిక్’, ‘స్టాలిన్’, ‘ప్రస్థానం’, ‘సాధ్యం’, ‘తకిట తకిట’, ‘కాఫీబార్’ వంటి తెలుగు సినిమాలతో బాటు, 9 ప్రాంతీయ భాషల్లో, మూడు అంతర్జాతీయ భాషల్లో మొత్తం 90 పై చిలుకు సినిమాలకి కలరిస్టుగా సేవలందించారు.

        షూటింగు లకి ముందు ఛాయాగ్రాహకులకి ఎక్స్ పోజర్ లెవెల్స్ పైన మాత్రమే  సూచన లిచ్చే తనకి, సెట్స్ కి వెళ్ళే అలవాటు లేదన్నారు.


సికిందర్ (అక్టోబర్ 2010, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక) 

          

9, సెప్టెంబర్ 2015, బుధవారం

పది నిమిషాలకో వామ్మో!

రచన- దర్శకత్వం : మారుతి
తారాగణం: నాని, లావణ్యా త్రిపాఠి, నరేష్‌, మురళీ శర్మ, అజయ్‌, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి,
సితార, స్వప్న మాధురి తదితరులు
సంగీతం: గోపీ సుందర్‌, ఛాయాగ్రహణం: నిజార్‌ షఫీ, బ్యానర్‌ : జీఏ2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌
సమర్పణ : అల్లు అరవింద్,
నిర్మాత :
 బన్నీ వాస్‌
విడుదల : సెప్టెంబర్‌ 4, 2015

                    
        దర్శకుడు మారుతీ సరైన దారిలో పడ్డారు. 5d నుంచి 6k కి సాగించిన ప్రయాణంలో ‘కొత్త జంట’ ప్రేమాయణం బ్రేకేసినా, ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ తో సెన్సిబుల్ కామెడీకి ప్రయత్నించి నిలదొక్కుకున్నారు. ఇక్కడ్నించీ పెద్ద  హీరోల వైపు గనుక ప్రయాణం వుంటే, ఇలాటి క్లీన్ కామెడీని  నమ్ముకున్నప్పుడే టేస్టున్న ప్రేక్షకుల అభిమానం కూడా పొందేందుకు అప్ గ్రేడ్ అయినట్టవుతుంది.
        హీరో నాని అటూ ఇటూ దారి తప్పి ఇప్పుడు సరైన మార్గంలో పడ్డట్టయింది. పెద్ద హీరోలకి యాక్షన్ సినిమాలు తప్పవు. తనలాంటి యంగ్ హీరోలకే చాలా వెరైటీని అందించే అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూస నుంచి ఉపశమనం కల్గిస్తే, బ్రహ్మరధం పడతారు ప్రేక్షకులు  - ఇప్పుడు తనకి పడుతున్న బ్రహ్మరధం లాగే.
         సైంటిస్టుల మతిమరుపు పైన చాలా జోకులే వున్నాయి. వాళ్ళు సైంటిస్టు లయ్యాక మతిమరుపు మహానుభావులుగా తయారై వుంటారు. కానీ పుట్టుకతో మతిమరుపు వున్నవాడే సైంటిస్టు అయిన దృష్టాంతం ప్రపంచంలో ఎక్కడా ఉండక పోవచ్చు. చిన్నప్పట్నించీ ఏదీ గుర్తుండని వాడు సైంటిస్టు ఎలా అయ్యాడబ్బా అన్న అనుమానం పీడించకుండా, దర్శకుడు మొదటే ఒక హిచ్ కాక్ కొటేషన్ వేశాడు- డ్రామా అంటూ మొదలయ్యాక లాజిక్ అనేది అంతమవుతుందని. నిజమే, ఏ లాజిక్కూ ఉండనవసరం లేనిది కామెడీకే.  అబ్సర్డ్ ( అసంబద్ధ) కామెడీ అనే ఉపశాఖ ఇలాగే పుట్టింది. ‘గోల్ మాల్’ సిరీస్ సినిమాలు ఇలాగే వచ్చాయి. అసంబద్ధమని కాదుగానీ, వ్యాపారబద్ధంగా, రొటీన్ యాక్షన్ కామెడీలకి దూరంగా - ఈ కాలక్షేప కామెడీ  ఎలా వుందో ఓసారి  చూద్దాం..
మతిమరుపుతో  ప్రేమాట!
        పాండురంగారావు ఒక సైంటిస్టు. కూతురి కోసం సంబంధాలు చూస్తూంటాడు. స్నేహితుడు ఆంజనేయులు ( నరేష్) కొడుకు లక్కీయే ఉన్నాడని తెలుసుకుని అతణ్ణి కలవడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యవసాయ క్షేత్రంలో జూనియర్ సైంటిస్టు అయిన లక్కీ (నాని) మతిమరుపు కుర్రాడు. మెమరీకీ అటెన్షన్ కీ మధ్య లింకులేక ఏదీ గుర్తుండదు. ఒక పని చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చిందంటే ఆ చేస్తున్న పని మీంచి డైవర్ట్ అయిపోయి  కాల్ తీసుకుని ఎటో వెళ్ళిపోతాడు. ఇవతల ఆపనీ , ఆ పనికోసం వచ్చిన వాడూ దిక్కులు చూడాల్సిందే. పాండురంగా రావుకి రెండు సార్లూ ఇదే అనుభవమై విరక్తి పుడుతుంది. జన్మలో మొహం చూపించొద్దని వెళ్ళిపోతాడు. అలా బంగారం లాంటి సంబంధం తప్పిపోతుంది.
          కానీ బంగారం లాంటి అమ్మాయి నందన (లావణ్యా త్రిపాఠి) కంట పడుతుంది. డాన్స్ స్కూల్లో పిల్లలకి డాన్సు నేర్పే నందన తో ప్రేమలో పడ్డాకా తన మతిమరుపు బయటపడకూడదని నానా తిప్పలు పడుతూంటాడు లక్కీ. ప్రతిసారీ మతిమరుపుని కప్పి పుచ్చుతూ  అతడిచ్చే వివరణల్ని నమ్మేస్తూంటుందామె. ఆమె సంఘ సేవిక కూడా. ఓ చిన్న పిల్ల ప్రాణాలు కాపాడిన అతడిమీద అప్పుడే ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టాక తండ్రికి చెప్పేస్తుంది. ఆ తండ్రి ఎవరో కాదు, ఏ లక్కీ పేరెత్తితే ఒంటి కాలి మీద లేస్తాడో ఆ సైంటిస్టు పాండు రంగారావే. 
          ఇది తెలుసుకున్న లక్కీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తి పాండురంగారావుని తప్పించుకుని, తన ఫ్రెండ్ ( వెన్నెల కిషోర్ ) ని లక్కీ పేరుతో ముందుకు తోసి కొత్త డ్రామాకి తెర తీస్తాడు. ఈ ఫ్రెండే లక్కీ అనుకుంటున్న పాండురంగారావు, కూతురి రికమెండేషన్ తో ఇక తప్పక లక్కీని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. ఇంకోవైపు నందనని  పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఎస్సై అజయ్ ( అజయ్) లక్కీ ఆడుతున్న గేమ్ ని రట్టు చేయాలని రంగంలోకి దిగుతాడు. ఈ గందరగోళం రానురానూ లేనిపోని మలుపులకి దారితీసి  - పాపం పండే ఘట్టం వస్తుంది లక్కీకి...
          కామెడీ ఆఫ్ ఎర్రర్స్, తెలుగులో అంటున్న ‘కన్ఫ్యూజ్ కామెడీ’- ఏదైనా కావొచ్చు- వీటి ఆధారంగా నడిపిన ఈ కామెడీ ఇలాటి మరికొన్ని క్యారక్టర్ ఓరియెంటెడ్ కామెడీలకి దారితీయొచ్చు.
ఎవరెలా చేశారు
           కామెడీకి డిమాండ్ పెరిగిపోయి హీరోలే కమెడియన్ లైపోయాక పూర్తి స్థాయి కామెడీ పాత్రలు కాక యాక్షన్ కామెడీల్లో భాగంగా, ఓ కమెడియన్ని వెంటేసుకుని  కామెడీ చేయడంతో  సరిపెట్టేస్తున్నారు. కామెడీ పాత్ర అంటే యాక్టివ్ పాత్ర  మాత్రమే  కాక - అదనంగా భౌతికంగా టైమింగ్, మానసికంగా అబ్ నార్మల్ బిహేవియర్ అనే విలువలూ జోడించి వుంటాయి  కాబట్టి- యాక్షన్ హీరో పాత్రలకంటే కూడా సంక్లిష్టం గా వుంటాయి కామెడీ పాత్రలు. ఈ దృష్ట్యా ఒక హీరో యాక్షన్ కామెడీల్లో నటించడం వేరు- ఒక పూర్తి స్థాయి కామెడీ పాత్ర నటించడం పూర్తిగా వేరు. నాని ఈ రెండోది సాహసోపేతంగా చేశాడు. చేసిన దాంతో చివరంటా సినిమాని నిలబెట్టాడు.
          అతని టైమింగ్, మతిమరుపు పాత్రలో పరకాయ ప్రవేశం -ఈ రెండూ మొట్ట మొదటిసారిగా అతడిలో టాలెంట్ ఏ స్థాయిలో వుందో బయటపెట్టాయి. అతడి మతిమరుపు తో కూడిన ఏ సిట్యుయేషనూ మామూలుగా లేదు. ఏ బిట్ కూడా పెద్ద యెత్తున ప్రేక్షకుల నుంచి కేరింతల్ని రాబట్టకుండా వృధా పోలేదు. సాధారణంగా అలాటి ఓ రెండు మూడు సన్నివేశాలు పే లాక,  అక్కడ్నించీ రిపీటీషన్ బారిన పడి తేలిపోతూంటాయి అలాటి కామెడీ దృశ్యాలు. కానీ ఇక్కడ కథనం  రిపీటెడ్ యాక్షన్ ప్లాట్ గా వుంది,  ‘గ్రౌండ్ హాగ్ డే’, ‘రన్ లోలా రన్’ ల లాంటి పాపులర్ సినిమాల ధోరణిలో.
          అంతేగాక, నాని పాత్ర చేతిలో ప్రతీ పది నిమిషాలకో  ‘వామ్మో’  ప్రేక్షకుల్లో హోరేత్తిస్తూనే పోతుంది. హాలీవుడ్ కంపెనీ ‘సినీమోబైల్’  బాస్, ‘బేవర్లీ హిల్స్ కాప్’  హిట్ సిరీస్ సినిమాల నిర్మాత,  ఫువాద్ సయీద్ తరచూ ఒక మాట వాడుతూండే వాడు. ఆయనకి అంతగా సినిమా పరిజ్ఞానం వుండేది కాదు. కానీ సినిమాలో ఏముంటే హిట్టవుతుందో బాగా తెలుసు- అదే వామ్మో( Whammo =  immense energy; vigor). సినిమాలో ప్రతీ పది నిమిషాలకోసారి ఈ  ‘వామ్మో’ తో కూడిన సీను  పడాలని పట్టుబట్టేవాడు. సరీగ్గా ఇలాటి  ‘వామ్మో’ తో  కూడిన సీన్లే ఏంతో..  ఏంతో..  కాలం తర్వాత,  ఓ తెలుగు సినిమాలో అదీ నానీ చేతిలో-  ప్రతీ పది నిమిషాలకో సారి ఎడాపెడా పేలింది! పేలిన ప్రతీసారీ క్యారక్టర్ ఆర్క్ లేస్తూ పోయింది.
        ఈ మధ్యకాలంలో ఏ హీరో కూడా వన్ మాన్ షోగా సినిమా మొత్తాన్నీ ప్రేక్షకుల్ని అన్  లిమిటెడ్ గా ఎంటర్ టైన్ చేస్తూ లాక్కు పోలేదు. బెగ్గర్ కి బైక్ తాళా లిచ్చేయడం, కారు బంపర్ డ్యామేజి చేసిన వాడికే  ఎదురు డబ్బిచ్చేయడం, హీరోయిన్ ని సినిమాకి రమ్మని క్యారమ్స్ ఆడుతూ కూర్చుండి  పోవడం, పక్కనున్న హీరోయిన్ ని మర్చి పోయి ఐస్ క్రీమ్ లాగించెయ్యడం, హీరోయిన్ పేరే మర్చిపోవడం ..లాంటి మతిమరుపు చేష్టలెన్నో. 
          ఒకటి రెండు చోట్ల కామెడీకి ద్వంద్వాల పోషణ కూడా లేకపోలేదు- అవి ఇంటర్వెల్ కి ముందు, క్లయిమాక్స్ కి ముందూ వచ్చే రెండు సీన్లు. ఇంటర్వెల్ కి ముందు అర్జెంటుగా  హీరోయిన్ వదినని డెలివరీకి తీసుకుపోతూ, వేరే విషయం మీదకి డైవర్ట్ అయిపోయి ఎవడితోనో బాతాఖానీ వేసుకుంటూ నిలబడిపోవడం; క్లయిమాక్స్ కి ముందు ఫ్యామిలీని శ్రీశైలం  తీసి కెళ్తూ దారి మర్చిపోయి ఇరకాటంలో పడిపోవడం..ఇలా ఎక్కడో ఒక చోటయినా, కామెడీ సీరియస్ గా మారి ద్వంద్వాల పోషణ చేయకపోతే ప్రాణం వుండదు. 
          నానీ పాత్రకి మతిమరుపు నయం చేసుకోవాలన్న ధ్యాస వుండదు-  ‘వినాయకుడు’ లో కృష్ణుడికి సమస్యగా మారే  స్థూలకాయాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచన వుండనట్టే. వుంటే రసభంగమవుతుంది. కామెడీలా వుండదు. ఎలా వున్నవాడు అలా కంటిన్యూ అవుతూంటేనే కామెడీ. తర్వాత ఆ శారీరక/మానసిక సమస్యని క్లయిమాక్స్ లో సీరియస్ గా పాయింటుకి తీసుకురావచ్చు. అంతవరకూ ఫన్నీగా దాగుడుమూతలే వుంటాయి. ‘బర్ఫీ’ లాంటి సినిమాలో హీరో రణబీర్ కపూర్ పాత్ర మూగ- చెవిటి సమస్యకి పరిష్కారమే వుండదు. వీటి పరిష్కారాల గురించి కథ కాదు కాబట్టి, ఎక్కడా సీరియస్ అవకుండా- ఒక అంగవైకల్య పాత్రతో మనోభావాలు దెబ్బ తీయకుండా, క్రిమినల్ యాక్టివిటీతో అనితర సాధ్య కామెడీని పండించాడు రణబీర్.
          
అలాగే  పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ నటించిన చందన్ మిత్రా దర్శకత్వంలో ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే సూపర్ హిట్ కామెడీ వుంది. డబ్బా స్కూటరు పొట్టి లెక్చరర్ గా పొడుగు భార్యతో అతను పెంచుకునే  ఆత్మనూన్యతా భావంతో పడే బాధ- ఆ బాధలోంచి కామెడీ ని పుట్టించే ద్వంద్వాల పోషణతోనే  సినిమా సాంతం సాగుతుంది. 
          కాబట్టి పై మూడు ఉదాహరణల్లో ఎక్కడా పాత్ర మానసిక/ శారీరక లోపాలని సవరించే దిశగా కథల్లేవు. ఇదే కామెడీ. సవరించే దిశగా వెళ్తే ట్రాజెడీ. అలాగే ఆ లోపాలని ఎత్తి  చూపుతూ ఇతర పాత్రలు ఆటలు పట్టిస్తే అది సెటైర్. ‘పోయెటిక్స్’ అని అరిస్టాటిల్ రాసిన థియరీలో- కామెడీని కామెడీ లాగానే  ఉంచాలనీ, సెటైర్ తో కలగాపులగం చేస్తే కామెడీ ఫ్లాప్ అవుతుందనీ జాగ్రత్త చెప్పాడు. కామెడీ అంటే, పాత్రకుండే లోపాలతో హాస్యం పుట్టించడమనీ; అదే సెటైర్ అంటే, పాత్ర వ్యక్తిత్వాన్ని హాస్యం పట్టించడమనీ నిర్వచించాడు. కాబట్టి పై మూడు సినిమాల్లో కామెడీ పాత్రల వ్యక్తిత్వాల్ని ఇతర పాత్రలేవీ ఎత్తిపొడిచి నవ్వులపాలు చేసే దృశ్యాలు వుండవు. డిటో నాని సినిమా.
          ఇదంతా ఎందుకంటే- నాని పాత్ర తనకి సమస్యగా వున్న మతిమరుపుని నయం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం గురించి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళకోసం- అలా నయం చేసుకోవాలంటే, ఏవో పాత్రలు అతడి లోపాన్ని ఎత్తి  చూపాలి, లేదా హీరోయినే- వెళ్ళవయ్యా, నయం చేసుకు రా, పెద్ద ప్రేమ కావాలిట- అని ఎత్తిపొడవాలి. ఎత్తి చూపితే ట్రాజెడీ అయినట్టే, ఎత్తి పొడిస్తే సెటైర్ అవుతుంది కథ! అప్పుడు పది నిమిషాలకో వామ్మో లుండవు, వాయ్యో లుంటాయి! నానీ, మారుతీ, నిర్మాతలూ అసలే వుండరు! 
          పాత్రకో లక్ష్యం, ఆ లక్ష్యం కోసం స్ట్రగుల్, లక్ష్య సాధన- అనేకథా గమన  రేఖ మీద లోసుగుల్లేని పాత్ర ప్రయాణం వల్ల,  ప్రేక్షకులకి గుర్తుండిపోయే లాండ్ మార్క్ కామెడీ నానీ అందించినట్టయ్యింది. అతను గొప్ప ఆర్టిస్టు అవుతాడు.
***
         ‘అందాల రాక్షసి’  ఫేమ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ డాన్స్ స్కూల్ టీచరుగా, సంఘ సేవికగా మూస ఫార్ములా పాత్ర పోషించినప్పటికీ- ఆ  రెండు మధ్య తరగతి కుటుంబాల హాస్య ప్రహసనంలో తన సాధారణ అమ్మాయి ఫీచర్స్ తో పాలూనీళ్ళలా కలిసిపోయింది. ఇది సినిమా ప్రాజెక్ట్ చేస్తున్న హోమ్లీ లుక్ కి న్యాయం చేసింది. లేకపోతే ఏ ప్లాస్టిక్ అందచందాల హైఫై హీరోయినో అయివుంటే వ్రతం చేడేది. లావణ్య సెలెక్షన్ నూటికి నూరు పాళ్ళూ సరైన నిర్ణయం. కింది తరగతి ప్రేక్షకులకి కూడా తన పాత్రతో, నటనతో కనెక్ట్ అయిపోయింది.
          అయితే క్లయిమాక్స్ లో పాత్ర దిగజారింది. ఆ మొత్తం మతిమరుపుని దాచిపెట్టి హీరో నాటక మాడాడన్న చిన్న  కారణంతో వేరే పెళ్లికి ఆమె పాత్ర సిద్ధపడడం ఫార్ములా టర్నింగ్ కోసమే పెట్టినట్టుంది. అతడి నాటకం వల్ల ఎవరూ నష్టపోలేదు. పైగా ఆమె వదిన ప్రాణాలు కాపాడి, సుఖప్రసవం అయ్యేలా చూశాడు. ఆ వదిన కూడా ఈ సందర్భంలో అతడికి సపోర్టుగా రాకపోవడం ఒకలోపం. హీరోని హీరోయిన్  నిరాకరించడం ఆమె కీలుబొమ్మగా  మారడానికే దారితీసింది. వేరే పెళ్ళికి సిద్ధపడిన హీరోయిన్,  హీరో వచ్చి డిస్టర్బ్ చేస్తూంటే కూడా అభ్యంతరం చెప్పకుండా చూస్తూ వుండి పోయి- ఆ పెళ్లి కొడుకు పీచమణిచిన హీరోతోనే మళ్ళీ పెళ్ళికి సిద్ధపడడం కీలుబొమ్మ తనమే.
           
ఆమె తండ్రిపాత్ర పోషించిన హిందీ నటుడు మురళీ శర్మ ఒక సర్ప్రైజ్ ఆఫర్.  హిందీ- తెలుగు సిన్మాల్లో పచ్చి విలన్ గా పాపులరైన తను చాలా సౌమ్యుడైన మధ్యతరగతి తండ్రి పాత్రలో హైలైట య్యాడు. ముగింపులో ఇచ్చిన ట్విస్టుతో మరింత రాణించాడు. 
          ఇతర పాత్రల్లో అందరికీ మంచి మార్కులే పడతాయి. ఈ కామెడీ మ్యూజికల్ కామెడీ కూడా. గోపీ సుందర్ సంగీతంలో పాటలు కథకి అడ్డుపడకుండా కథకి మరింత అలంకారాన్నిచ్చాయి. నిజార్ షఫీ ఛాయాగ్రహణం దర్శకుడి ‘ఈ రోజుల్లో’ లాంటి 5d వండర్ లా లేదుగానీ, ఫర్వాలేదు.  
***
స్క్రీన్ ప్లే సంగతులు.
         ఇది ఫస్టాఫ్- సెకండాఫ్ బాపతు స్క్రీన్ ప్లే. అంటే ఇంటర్వెల్ దగ్గర పాయింటు కొచ్చి,  ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో కథ ప్రారంభ మవడమన్నమాట. కాస్త సహన పరీక్షే. పదినిమిషాల కోసారి ‘వామ్మో’ ఉండబట్టి బతికిపోయింది అంతసేపూ (గంటా పదినిమిషాలు) పాయింటు లేని ఫస్టాఫ్. ఇంకోలా చెప్పుకోవాలంటే, ఇంటర్వెల్ వరకూ బిగినింగ్ విభాగమే నడిచి, ఇంటర్వెల్ తర్వాత మాత్రమే మిడిల్ విభాగం ప్రారంభమై, ఆ సెకండాఫ్ నిడివిలోనే ఎండ్ విభాగంతో పంచుకోవడమన్నమాట. ఈ స్ట్రక్చర్ ని యూనివర్సల్ కి తీసుకొస్తే, ఇంటర్వెల్ లోపే సుమారు ముప్పావు గంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి, అక్కడ్నించీ ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లో క్లయిమాక్స్ వరకూ మిడిల్ విభాగం సుదీర్ఘంగా సాగాల్సి వుంటుంది. దీనితర్వాత ఎండ్ విభాగంతో క్లయిమాక్స్ ప్రారంభమవ్వాలి. అప్పుడు ప్రామాణికంగా ఈ విభాగాల నిష్పత్తి (బిగినింగ్) 1 : (మిడిల్) 2 : (ఎండ్) 1 గా వుంటుంది. కానీ ఈ సినిమా లాంటి ఫస్టాఫ్- సెకండాఫ్ బాపతు స్క్రీన్ ప్లేల్లో -  ఈ విభాగాల నిష్పత్తి (బిగింగ్) 2 : (మిడిల్) 1 : (ఎండ్) 1 గా మారిపోతుంది. అంటే సినిమాకి వెన్నెముక అయిన మిడిల్ విభాగం బలహీన పడుతుంది. ఐనా ఈ సినిమా సెకండాఫ్ కాస్త బాగాలేదు అనే టాక్ రావడానికి కారణం ఇలా మిడిల్ విభాగానికి ప్రామాణిక నిష్పత్తి లభించకపోవడం వల్ల కాకపోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ నిష్పత్తుల్ని, స్ట్రక్చరల్ రూల్స్ నీ, అన్నిటినీ  ఒక్క దెబ్బతో హీరో పాత్ర  బ్రేక్ చేసి పారేసింది! 
          నిజానికి స్ట్రక్చర్ పరిమితుల్లో- దాని చట్రంలో కథ చెయ్యడం నరకయాతన. ముఖ్యంగా బిగినింగ్ విభాగాన్ని సెటప్ చేయడం.  ఎందుకంటే కథలన్నీ ఒకే పోతలో పోసినట్టు వస్తాయి. ఈ దృష్ట్యా కథకుడి సృజనాత్మకతకి  అడ్డొచ్చే ఈ  స్ట్రక్చర్ శృంఖలాల్ని తెంచి పారెయ్యడం ఒక్క హీరో పాత్ర వల్లే సాధ్యమవుతుందని ఇలా నాని పాత్ర చిత్రణ నిరూపిస్తోంది. 
           
కథకులు  పాత్రని పట్టుకునే ప్రయాణిస్తారు సాధారణంగా. పాత్రని కాక కథని పట్టుకుని ప్రయాణించినప్పుడు బలహీన ( పాసివ్) పాత్రలు పుట్టుకొస్తాయి. కానీ ప్రస్తుత కామెడీలో కథకుడు పాత్ర ని పట్టుకుని ప్రయాణించడమే కాదు, ఆ పాత్ర పాల్పడే చర్యలు పరాకాష్టగా ఉండేలా చూడ్డంతో, దాని ఫలితంగా పది నిమిషాల కోసారి థియేటర్లు ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లి పోవడంతో- ఒకటే రుజువవుతోంది : ఇలాంటప్పుడు ప్రేక్షకులు బిగినింగ్ - మిడిల్- ఎండ్ అని స్ట్రక్చర్ ని  చూడనే చూడరని! కేవలం తమని అన్ లిమిటెడ్ గా అలరిస్తున్న పాత్రని పట్టుకుని అదేపనిగా సాగిపోతారనీ! 
          కాబట్టి ఇంటర్వెల్ వరకూ పాయింటులోకి (కథలోకి) ప్రవేశించకపోయినా బోరు ఫీలవకుండా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి సెకండాఫ్ కాస్త బాగాలేదు అనే టాక్ రావడానికి కారణమేమిటి? అది దర్శకుడి అభద్రత.
***
       సెకండాఫ్ లో కూడా ఇలా సూపర్ యాక్టివ్ హీరోతో  ‘వామ్మో’ లు కంటిన్యూ అయ్యాయి. కానీ ‘వామ్మో’ కీ ‘వామ్మో’ కీ మధ్య నడిపించిన కథే, ఫస్టాఫ్ లో వున్న నావెల్టీకి న్యాయం చేయలేకపోయింది.
          మొదట్నించీ వద్దాం...
           ఫస్టాఫ్ ( బిగినింగ్) ప్రారంభంలో కథకి ఓ ముడి వేసి, ఇంటర్వెల్ తో  దానికి ఎటాచ్ చేశారు. ఆ ముడి హీరో మతిమరుపు చేష్టల వల్ల  హీరోయిన్ తండ్రితో (పెళ్ళిసంబంధం గురించి)  చెడడం. ఇలా ముడివేసి కొనసాగించారు. ఆ తర్వాత హీరోయిన్ని చూసి ప్రేమలో పడ్డం. ఆమె ఆ తండ్రి కూతురే అని తెలీదతడికి. ఈ డైనమిక్ అతడామెని తొలిచూపు చూసినప్పుడే ప్రేక్షకుల్ని హోరేత్తించింది. ఆమె ఎవరో ప్రేక్షకులకి తెలుసు, హీరోకి తెలీదు కాబట్టి. ఇలాటి డైనమిక్సే ‘వామ్మో’ లకి కారణమయ్యాయి సినిమా సాంతం. మతిమరుపు బయటపడకుండా హీరోయిన్ తో దోబూచు లాడుతున్నాడు హీరో. ఇది బిగినింగ్ విభాగం. కాబట్టి ఈ విభాగం ముగింపులో సమస్య ఏర్పాటుకి దారితీసే పాత్రలవరకూ మాత్రమే  పరిచయాలు జరిగాయి. మిడిల్ విభాగం లో అవసరపడే వెన్నెల కిషోర్ పాత్రతో సమస్య ఏర్పాటుకి సంబంధం లేదు కాబట్టి దాన్ని బిగినింగ్ లో పరిచయం చేయలేదు. ఏ నేపధ్యంగా  కథ నడుస్తోందో అది ఎష్టాబ్లిష్ అయ్యింది, ముఖ్య పాత్రల పరిచయాలూ అయ్యాయి.. ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేయాలి. ఇదే ఆలస్య మవుతోంది. ఆలస్యమవుతోందంటే ఇంటర్వెల్ లోపు సమస్య ఏర్పాటు కాదని వూహించెయ్యొచ్చు. కనుక హీరో మతిమరుపు ఎపిసోడ్లతో పైన చెప్పుకున్నట్టు, రిపీటెడ్ యాక్షన్ ప్లాట్ గా కథనాన్ని నడిపారు. ఇలా చేసి సమస్య ఏర్పాటుని ఆలస్యం చేయడానికి ముఖ్య కారణం ఒకటుంది. దీనిగురించి తర్వాత చెప్పుకుందాం. 
          ఇలా హీరో టక్కుటమారాలతో రిపీటెడ్ యాక్షన్ ప్లాట్ గా ఎంటర్ టైన్మెంట్ ని పొడిగిస్తూ సాగదీసిన  కథనం- సడెన్ గా స్వరం మార్చుకుంటుంది. పానకంలో పుడకలా, లేదా ఉరుములేని పిడుగులా,  హఠాత్తుగా హీరోయిన్ ని ఎస్సై వ్యభిచార కేసులో ఇరికించే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ వస్తుంది (చాలా బ్యాడ్ గా దీన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది మనబోటి వాళ్లకి). దీనికి ఇంటర్ కట్స్ లో హీరోయిన్ వదినని హీరో ప్రసవం కోసం హాస్పిటల్ కి తీసికెళ్ళే ఎపిసోడ్ వస్తుంది. ఈ రెండూ హఠాత్తుగా సినిమా స్వరాన్ని ( టోన్ ని) ఎలా మార్చేస్తాయంటే, ఆ హోరెత్తి పోయే లౌడ్ రీరికార్డింగ్ తో, ఎక్కడో  క్లయిమాక్స్ లో ఉండాల్సిన ముక్కలు  ఇక్కడ కలిసిపోయాయా అన్నట్టు వుంటుంది. కానీ ఇప్పుడు సినిమా రీళ్ళు లేవు, రీళ్ళు తారుమారు అయ్యాయనుకోవడానికి!
          పోనీ ఈ రెండూ సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనలో భాగమా అంటే అదీ కాదు. హీరో హాస్పిటల్ ఎపిసోడ్ కథకి అవసరమే కావొచ్చు గానీ, హీరోయిన్ తో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ అనవసరమైనది. హీరోయిన్ వదినని హీరో హాస్పిటల్ కి తీసికెళ్ళే ఎపిసోడ్ మున్ముందు కథకి అవసరమే కావొచ్చు. ఈ ఎపిసోడ్ నడపాలంటే,  హీరోయిన్ ఇంటికి హీరో వచ్చినప్పుడు, అక్కడ నొప్పులు పడుతున్న హీరోయిన్ వదిన తప్ప మరెవరూ వుండకూడదు. అందుకే హీరోయిన్ ని సడెన్ గా పిడుగుపాటులా వ్యభిచార కేసులో పోలీస్ స్టేషన్ కి ఎక్కించి, ఆమె తండ్రిని కూడా అక్కడికి పరుగెత్తించి, హీరోకి లైన్ క్లియర్ చేసినట్టుంది కథనం.
           
ఈ ఎపిసోడ్లు అయిపోయాక, ఇక అప్పుడు ఒకే సీను తో సమస్యకి దారితీసే పరిస్థితిని కల్పించారు. అది తన తండ్రిని తో కలవమని హీరోయిన్ హీరోకి చెప్పే సీను. హుషారుగా ఆమె తండ్రిని కలవడానికి బయల్దేరిన హీరో, అతన్ని గుర్తుపట్టి షాక్ అవుతాడు. ఇప్పుడేం చేయాలి? ఇదీ సమస్య. ఇదీ ఇంటర్వెల్. ఇలా ప్రారంభంలో వేసిన ముడిని ఇక్కడ ఇంకా గట్టిగా బిగించారు.
ఇలా ప్రారంభంలో, ఇంటర్వెల్లో ఒకే సమస్య రిపీటయ్యే కథనాలు అరుదుగా వుంటాయి.
          
ఇక- సెకండాఫ్ లో  కెళ్ళే ముందు ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావించుకుంటే, ఈ హాస్పిటల్ ఎపిసోడ్ దగ్గర్నుంచీ సెకండాఫ్ లో హీరో తెరలేపే  కొత్త డ్రామా అంతా తనకి తెలుసని-  ముగింపులో హీరోయిన్ తండ్రి బయట పెట్టి తనే సుఖాంతం చేస్తాడు కథని.  అంటే ఇంటర్వెల్ సీను కంటే ముందు, హాస్పిటల్ దగ్గిర హీరో- హీరోయిన్లు కౌగిలించుకునే  దృశ్యం అతను చూశాడు. దీని తర్వాతే ఏమీ తెలీనట్టు హీరోని కలవడానికి వెళ్ళాడు. హీరో పారిపోయాడు. ముగింపులో రివీలయ్యే ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని  సెకండాఫ్ కెళ్దాం..
***
  సెకండాఫ్ ప్రారంభంలో మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో పాత్ర తన కెదురైన సమస్యతో స్ట్రగుల్ పడాలి. అలా ఇక్కడ హీరోకి ఎదురైన సమస్య, హీరోయిన్ తండ్రి ఎవరో తెలియడం. దాంతో హీరోయిన్ తో ప్రేమా పెళ్ళీ రిస్కులో పడ్డం!
          దీంతో ఆ తండ్రికి ఎదురుపడే ధైర్యం లేక ఫ్రెండ్ ( వెన్నెల కిషోర్) ని తనలా ముందుకు తోసి నాటకం ప్రారంభించాడు. ఈ నాటకం తెలుగులో చెప్పుకునే కన్ఫ్యూజ్ కామెడీ. అంటే ఏ కథ కైనా సెకండాఫ్ లో బ్రహ్మానందాన్ని దింపి, నడిపించే కోన వెంకట్ మార్కు సింగిల్ విండో స్కీము అనబడు కన్ఫ్యూజ్ కామెడీ  స్క్రీన్ ప్లే అన్నమాట!
         
ఈ సింగిల్ విండో స్కీమునే  సెకండాఫ్ కథనం కోసం దర్శకుడు మారుతి ఆశ్రయించాల్సి వచ్చింది విధివశాత్తూ. ఈ స్కీము ఫస్టాఫ్ లో అమలు కాదు  కాబట్టి, ఫస్టాఫ్ లో సమస్య ఏర్పాటుని ఆ విధంగా ఆలస్యం చేసి ఇంటర్వెల్ కి జరపాల్సి వచ్చింది. సమస్య ఏర్పాటు ఆలస్యం చేయడానికి ఇదీ కారణం. లేకపోతే  ‘కిక్ -2’  లో రవితేజ హైపర్ యాక్టివ్ క్యారక్టర్ తో ఇంటర్ వెల్ లోపే 45 నిమిషాల్లో బిగినింగ్ ని ముగించినట్టూ- మారుతి కూడా ముగించాలి నిజానికి. అక్కడే ముగిస్తే వాట్ నెక్స్ట్ ? అన్న ప్రశ్న తలెత్తి వుంటుంది. అది తప్పించుకోవడానికి అలా బిగినింగ్ ని పొడిగించి ( ఘోరమైన రీరికార్డింగ్ తో పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఎపిసోడ్లతో) - సెకండాఫ్ లో తాననుకుంటున్న సింగిల్ విండో స్కీము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు.
         కానీ ఇది ప్రేక్షకులకి ఎప్పుడో బోరు కొట్టే జోన్ గా మారిపోయింది. ఇందుకే సెకండాఫ్ కాస్త బాలేదు అన్పించుకుంది. కొత్తదనానికి దూరంగా, అరిగిపోయిన అదే సింగిల్ విండో కన్ఫ్యూజ్ కామెడీనే పెట్టేయడం వల్ల,  ఫస్టాఫ్ లో వున్న నావెల్టీ నశించింది. ఈ రొటీన్ స్కీములోనే  అప్పుడపుడు హీరో ఇచ్చే ‘వామ్మో’ లతో, గోపెసుందర్ పాటలతో సరిపోయింది గానీ లేకపోతే - సినిమా భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారేది. 
          ఈ సెకండాఫ్ హీరో ఆడే నాటకమంతా హీరోయిన్ తండ్రికి తెలిసిందే. అది ముగింపులో వెల్లడిస్తాడు. అలాంటప్పుడు ఈ పాత్ర పాయింటాఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ కామెడీ ఏం లేదు. ఎవడేంటో, ఎవడేం చేస్తున్నాడో అంతా చూస్తూ గమ్మున ఉన్నాడన్న మాట. ఈ లేయర్ కథ ముగించడానికి మంచి టూల్ గా ఉపయోగపడింది. హీరో మీది అపార్ధాలు తొలగాలంటే ఇంతకంటే తెలివైన కథనం లేదు.
          మొత్తానికి ‘భలే భలే మగాడివోయ్’ అనే ఈ విజయవంతమైన కమర్షియల్ ఈ  సంవత్సరం స్క్రీన్ ప్లే పరంగా నేర్పుతున్న కొత్త పాఠం-  ఎడాపెడా ‘వామ్మో’ లిచ్చే హీరో పాత్ర వుంటే,  స్ట్రక్చర్ తో పనిలేదని!  అనితర సాధ్యమైన ‘వామ్మో’ లని క్రియేట్ చేసినందుకు దర్శకుడు మారుతికి హేట్సాఫ్ చెపుదాం.
          మతిమరుపుని నిర్లక్ష్యం చేస్తే అల్జిమీర్స్ వస్తుంది- సీక్వెల్ గా నానీకి దీన్ని తగిలిస్తే సరిపోవచ్చు! 

సికిందర్