రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

మెక్ గఫిన్ ఎక్కడ?

(Sorry for the typos in the article. Now a fresh copy is posted)
స్క్రీన్ ప్లే - దర్శకత్వం : దేవ కట్టా

తారాగణం : మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, రాజారవీంద్ర 

నాగినీడు తదితరులు

మాటలు: బివిఎస్‌ రవి కథ: 24 ఫిలింఫ్యాక్టరీ

సంగీతం: అచ్చు కెమెరా: సతీష్‌ ముత్యాల

ఫైట్స్‌: విజయన్‌ 

బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , నిర్మాత : మంచు విష్ణు 

విడుదల : 4 సెప్టెంబర్, 2015 



***



      టాలీవుడ్ ఎప్పుడూ  టూ లేటే. కొత్తదనం, భిన్న ప్రయోగం, వెరైటీ అనేవి   ఇతర భాషల్లో  కన్పిస్తేనే తెలుగులో అనుమతిస్తారు హీరోలు. ఒరిజినల్ గా తెలుగులో అలాటి  వెరైటీ, భిన్నప్రయోగం, కొత్తదనం వున్న సబ్జెక్టు ఏ  దర్శకుడు వెళ్లి చెప్పినా నవ్వి పోతారు- వెళ్ళు వెళ్ళవయ్యా నేనే దొరికానా కొంపలు ముంచడానికీ- అని తరిమేస్తారు. అలాటిదే ఏ తమిళంలోనో ఓ  హిట్ కన్పిస్తే వెంటనే దాన్ని సొంతం చేసేసుకుంటారు నటించడానికి. కాబట్టి తెలుగు  సినిమా దర్శకులు ఒరిజినాలిటీ జోలికెళ్ళక అవే పాత మూస కథలు తయారు చేసుకుని తిరగడానికి కారకులెవరో ఈ పాటికి తెలిసిపోయే వుంటుంది..హీరోలు ప్రేక్షకులకి ఒక కొత్త దనాన్ని అందించడానికి  ఎప్పుడో అవతలి భాషల్లో వచ్చినప్పుడే టూ లేటుగా తెల్లారాలి...అరవ సినిమాల్లో అరువు వెరైటీ పట్టుకొచ్చి ఇదే మా సాహసం అని  ప్రకటించుకోవాలి. అప్పుడు దర్శకులు నవ్వాలో ఏడవాలో తెలీక తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టుకోవాలి!!


          కానీ మంచు వారసులు వేరు. అప్పుడప్పుడైనా వెరైటీ నివ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  మంచు విష్ణు ఇప్పటికే ‘రౌడీ’, ‘అనుక్షణం’, ‘ఎర్ర బస్సు’, ప్రస్తుతం ‘డైనమైట్’ లాంటి  తెలుగు ఒరిజినల్ వెరైటీలతో బాటు తమిళ రీమేకులూ ఇస్తున్నాడు. మంచు మనోజ్ ‘నేను మీకు తెలుసా’, ‘వేదం’, ప్రస్తుతం ‘ఎటాక్’ లాంటి తెలుగు వెరైటీలు, మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’ లాంటి తెలుగు వెరైటీలూ  ఇస్తున్నారు.  ఈ ముగ్గురూ మళ్ళీ  ఒకరిద్దరు తమిళ డైరెక్టర్ ల వైపు, తమిళ రీమేకుల వైపూ మొగ్గారనేది కూడా నిజమే.

          తమిళ టాప్ దర్శకుడు ఎ ఆర్ మురుగ దాస్ అసిస్టెంట్  ఆనంద్ శంకర్ అనే ఇంజనీరు, న్యూయార్క్ ఫిలిం అకాడెమీ విద్యార్థి చేసిన తొలి విజయవంతమైన ప్రయత్నం ‘అరిమా నంబి’ ని తెలుగులో మంచు విష్ణు హీరోగా,  దేవకట్ట దర్శకుడుగా,  ‘డైనమైట్’  గా రీమేక్ చేసినప్పుడు, ఇది కొత్తదనంతో ఉందా, రొటీనే అన్పించుకుందా ఈ కింద చూద్దాం.. ఎంత కొత్త ట్రీట్ మెంట్ తో, టెక్నాలజీతో తీసినా విషయపరంగా ఈ  థ్రిల్లర్  స్థిరపడ్డ పాత మూసలోనే వుంటే, తీసి ప్రయోజనం ఉంటుందా?

మెక్ గఫిన్ మంత్రం?
       ఓ డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్ ఎంప్లాయెడ్ యూత్ నని  చెప్పుకునే  శివాజీ ( విష్ణు) అనే అతను  నడి రాత్రి రోడ్డు మీద ఒకమ్మాయిని టీజ్ చేస్తున్న గ్యాంగ్ కి బుద్ధి చెప్పి, అనామిక అనే స్టూడెంట్ (ప్రణీత) దృష్టిలో పడతాడు. ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపి ఫోన్ నంబర్ కూడా తీసుకుంటుంది. రెండో రోజే పబ్ లో వైన్ పుచ్చుకోవడంతో మొదలై, ఆమె ఫ్లాట్ లో వోడ్కా సేవనంతో ప్రేమగా మారుతుందా పరిచయం. అప్పుడు అకస్మాత్తుగా ఓ గ్యాంగ్ ఎటాక్ చేసి ఆమెని కిడ్నాప్ చేసి తీసికెళ్ళి పోతారు.

          శివాజీ ఆమెని రక్షించడంలో విఫలమై పోలీసులని ఆశ్రయిస్తాడు.  పోలీసు అధికారి ( నాగినీడు) వచ్చి చూస్తే  శివాజీనే  అనుమానించేలా వుంటుంది పరిస్థితి. ఫ్లాట్ లో కిడ్నాప్ జరిగిన వాతావరణమే వుండదు. సెక్యూరిటీ గార్డ్ మాటలు కూడా దీనికి బలం చేకూరుస్తాయి. ఈ మిస్టరీ ఛేదించడానికి ఇక తనే పూనుకుంటాడు శివాజీ. అనామిక తండ్రి  (పరుచూరి వెంకటేశ్వర రావు) ఓ ఛానెల్ కి బాస్ అని తెలుసుకున్న శివాజీ, అతడి ఇంటి కెళ్ళే సరికి కిడ్నాప్ గ్యాంగ్ తో బాటు, ఒక సీఐ  అక్కడికొచ్చి ఛానెల్ బాస్ ని బెదిరిస్తారు. కూతురు క్షేమంగా తిరిగి రావాలంటే తన దగ్గరున్న మెమెరీ కార్డు ఇచ్చేయాలని.

          ఆ మెమరీ కార్డులో కేంద్ర మంత్రి రిషీదేవ్ ( జేడీ చక్రవర్తి) కి సంబంధించిన రహస్య ముంటుంది. అది ప్రసారం చేయకుండా తమ కిచ్చేయాలని బెదిరిస్తారు. ఆ మెమరీ కార్డు ఛానల్ ఎడిటర్ దగ్గరుందంటాడు ఛానెల్ బాస్. ఘర్షణపడి ఆ బాస్ ని చంపేసి- తెల్లారే ఎడిటర్ ని కూడా చంపేసి మెమరీ కార్డుతో పారిపోతాడు గ్యాంగ్ లీడర్ (రాజా రవీంద్ర ).

          శివాజీ ఆ గ్యాంగ్ ని వెంటాడి అనామికని విడిపించుకోవడంతో బాటు, ఆ మెమరీ కార్డుని చేజిక్కించు కుంటాడు. అప్పుడా గ్యాంగ్ లీడర్ ని చంపేసిన మినిస్టర్ అసలు గ్యాంగ్ నేరుగా రంగంలోకి దిగుతుంది. లాభంలేక స్వయంగా మినిస్టర్  రిషీదేవే వచ్చేసి పోలీసులని తన ఆదుపాజ్ఞల్లోకి తెచ్చుకుని, శివాజీ- అనామికలని చంపించేసి మెమరీ కార్డు సాధించుకోవాలని ఆపరేషన్ మొదలెడతాడు.

          ఇదీ విషయం. ఒక మెమరీ కార్డ్- ఒక ఛానెల్ బాస్- ఒక మంత్రి- ఇంకో హీరో -అనే ఫార్ములా చట్రంలో ఎన్నో సినిమాలు వచ్చేశాయి. మరి ఈ సినిమాలో ఏమిటి తేడా? ఆ తేడా కోసం ఏమైనా ప్రయత్నించారా అన్నది స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

ఎవరెలా చేశారు
         ఒరిజినల్లోని హీరోలాగే తన లుక్ ఉండాలనీ, అలాగే నటించాలనీ రిమేక్ హీరో అనుకోవాలని లేదు. కానీ మాతృకలో ఒరిజినల్ గా సృష్టించిన ( హిట్టయిన) పాత్రకి కొన్ని మూలాలు వుంటాయి. వాటి ఆధారంగానే పాత్ర, ఆ పాత్ర చిత్రణ, దాంతో అలాటి ఫీల్ వున్న కథా ఏర్పడతాయి. సినిమాకి ఫీల్ ని తీసుకొచ్చేది కథ కాదు, హీరో పాత్ర చిత్రణ. హీరోయే కథకి ఫీల్ ని తీసుకొస్తాడు. యాక్షన్ సినిమాలకి ఫీల్ ని తన శారీరక దారుఢ్యంతో మాత్రమే హీరో తీసుకు రాలేడు. కేవలం శారీరక దారుఢ్యంతో  ప్రేక్షకులతో కనెక్ట్ కాలేడు.  ఇది రాం గోపాల్ వర్మ హిందీలో తీసిన ‘జేమ్స్’ తో రుజువయ్యింది. శారీరక దారుఢ్యానికి మించిన పాత్ర మూలాలుంటాయి. ఆ మూలాల్లో జీవం వుంటుంది. ఆ జీవం ఒరిజినల్లో ఈ పాత్ర పోషించిన నడిగర్ తిలగం శివాజీగనేశన్ మనవడు విక్రం ప్రభు పాత్రకి వుంది. అతను సామాన్యుడు. తమిళంలో టైటిల్ ( అరిమా నంబి) కూడా ‘జంటిల్మన్ -కానీ సింహమంత శక్తిగల వాడు’ అన్న అర్ధంలో వుంది. జంటిల్మన్ అనడంలోనే అతడి జీవితం తెలిసిపోతోంది. అలాటి వాడు - వెరీ బ్యాడ్ బ్యాడ్ మ్యాడ్ పొలిటికల్ వరల్డ్ తో పెట్టుకోవాల్సి రావడం ఒక ఐరనీయే. ఈ కాంట్రాస్ట్ -అంటే, బలవంతుడైన రాజకీయ నాయకుడితో సామాన్యుడైన ఒక జంటిల్మన్ తలపడడం అనే సమీకరణే  ఒరిజినల్ కి తీసుకొచ్చిన తిరుగులేని  ఫీల్.

          రీమేక్ లో ఈ సమీకరణని పట్టించుకోలేదు. ఇక్కడ  రాజకీయ నాయకుడూ బలవంతుడే, హీరో కూడా బలవంతుడే- దీంతో హీరో సృష్టించుకోవాల్సిన ఫీల్ కీ, సానుభూతికీ  స్థానం లేకుండా పోయింది. ఫీల్ లేని యాక్షన్ హంగామాగా సాగిపోయింది మంచు విష్ణు నటన సాంతం.

          ధైర్యం గురించి ఓషో రజనీష్ ఒక ఆసక్తికర పరిశీలన చేశాడు :  భయం లేకపోవడం ధైర్యం కాదు, ధైర్యవంతులు నిలువెల్లా పిరికిపందలు తప్ప మరేం కాదు. ధైర్యం, పిరికితనం ఈ రెండూ భయమనే ఒకే నాణానికి రెండు ముఖాలు. కాబట్టి భయాన్ని తొలగించుకుంటే పిరికితనమూ ధైర్యమూ రెండూ వుండవు. ఈ రెండూ లేని స్థితినే మనిషి సాధించాలి.  అలాగే,  ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. అది తనలోని భయానికి పకడ్బందీగా రక్షణ కల్పించుకోవడం. భయమనేది తొలగిపోతే అసలు భయపడడమే  వుండదు. భయపడని వ్యక్తి  ఇంకెవర్నీ  భయాందోళనలకి గురి చెయ్యడు. అలాగే ఎవరూ తనని భయపెట్టడాన్ని అంగీకరించడు!

          పై పరిశీలన సినిమాల్లో హీరోలకీ, విలన్ల కీ ఇద్దరికీ వర్తిస్తుంది.  పాత్రలు జీవంతో ఉండాలంటే  ఇలాటి పరిశీనలు తప్పని సరి కావొచ్చు.  కాబట్టి మంచు విష్ణు పాత్ర తొలినుంచీ అంత దారుఢ్యంతో ధైర్యశాలిగా వుందంటే, లోలోపల ఏవో భయాలు వుండే తీరాలి. ఏమిటవి? దీన్ని ఆ పాత్రకి కల్పిస్తే పాత్రచిత్రణలో లోపం తొలగిపోయి- ఫీల్ పుట్టుకొచ్చే అవకాశం వుండేది. 

          మంచు విష్ణు తన పాత్ర  విలక్షణం గా కన్పించడం కోసం, చేతిమీద లాంగ్ టాటూ  పొడిపించుకోవడం, బ్యాంకాక్ లో ఫ్రీ స్టయిల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఐరన్ బాడీ తో కొమ్ములు తిరిగిన ఫైటర్ గా కన్పించడం ఇదంతా  పాత్ర మూలాల్ని చెరిపేశాయి.


         మాతృక తీసిన దర్శకుడు ఈ పాత్రని ఇలా ఊహించి ఉండడు.  కనుకే సామాన్యం గా కన్పించే విక్రం ప్రభుని తీసుకున్నాడు. విక్రం ప్రభు ఏమీ ఈ పాత్రకోసం ఫైటర్ గా తర్ఫీదు పొంది రాలేదు. ఒక మర్యాదస్తుడైన, మృదుభాషి అయిన బాయ్ ఫ్రెండ్ పాత్ర, కరుడు గట్టిన యాక్షన్ హీరోగా ఎందుకు  మారాల్సి వచ్చిందో  క్యారక్టర్ ఆర్క్ సహితంగా చూపిస్తూ సాగే చిత్రణ ఇది. ఇక్కడ్నించీ ఫీల్ పుట్టింది.

          మంచు విష్ణు పాత్ర ఎలా వున్న హీ- మాన్ స్టేచర్ తో అలాగే సాగి ముగుస్తుంది. క్యారక్టర్ ఆర్క్ లేదు. లేనప్పుడు ఫీల్ లేదు. కేవలం మరమనిషిలా యాక్షన్ హంగామా సృష్టించడమే.  ఇది సగం సినిమాకి హాని చేసింది, మిగతా సగం హాని ఎక్కడ జరిగిందీ  స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. 

          సినిమా ప్రారంభమే రోడ్డు మీద అమ్మాయిని టీజ్ చేస్తూంటే, హీరోయిన్ కాపాడే వాళ్ళే లేరా అన్నప్పుడు, హీ- మాన్ లా హీరో ఎంట్రీ ఇచ్చి, డైలాగులు కొట్టి, ఆ గ్యాంగ్ ని తన్నడమనే, దాంతో హీరోయిన్ ప్రేమలో పడ్డమనే, ఏమాత్రం  ఆసక్తి కల్గించని పాత మూసగా వుండడం విచారకరం.

          దీనికి ప్రతిగా తమిళంలో,  హీరో ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో డీసెంట్ గా డ్రింక్ చేస్తూ కబుర్లాడుతూంటే హీరోయిన్ రావడమనే క్లాస్ ప్రారంభంగా వుంటుంది. సూటిగా చెప్పాలంటే తమిళంలో క్లాస్ క్యారక్టర్ కాస్తా, తెలుగులో అదే పాత మూస మాస్ క్యారక్టర్ గా మారిపోయింది. మరి అన్ని  మార్షల్   ఆర్ట్స్ స్కిల్స్ వున్నవాడు ఆ రంగంలోనే  కృషి చేయకుండా, డిజిటల్ మార్కెటింగ్ కి  ఎందుకు వచ్చాడో పొంతన వుండదు. తమిళంలో హీరో  బీ ఎం డబ్ల్యూ కార్ల  షోరూం లో పనిచేస్తూంటాడు.  ఆ ఉద్యోగం కోసం అతను కండలు పెంచుకుని రాలేదు.

          దర్శకుడు దేవకట్టా- హీరో కారు వెంట లూజ్ గా పరిగెడుతూంటే చూడ్డానికి బావుండదు కనుక, మంచు విష్ణుకి  ఆ ఎత్తున ఫిజికల్ ట్రైనింగ్ సజెస్ట్ చేశామన్నారు. నిజానికి గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకుపోతూంటే, ఆ షాక్ లోంచి తీరుకుని,  సామాన్యుడైన హీరో అలా లూజ్ గా పరిగెత్తడమే సబబు.  అప్పుడే అతను  వీర హీరో ఐపోలేదు- కథాక్రమంలో దానికింకా సమయం వుంటుంది. 

          ఫ్లాట్ లో తను బాత్రూం లో వున్నప్పుడు అవతలి గదిలో కిడ్నాప్ జరుగుతోంటే, హీరో పరుగెత్తుకొచ్చి ఏంచేయాలో తోచక అటూ ఇటూ కొంత కాలయాపన చేస్తాడు. తమిళంలో ఆ పాత్రకి అది సరిపోయింది. తెలుగులో మార్చిన మంచు విష్ణు పాత్రకీ అదే చిత్రణ ఎలా సరిపోతుంది- నడిరోడ్డు మీద ఒకమ్మాయిని టీజ్ చేస్తూంటే అంత కండబల ప్రదర్శనతో బుద్ధి చెప్పిన వాడు,  తన గర్ల్ ఫ్రెండ్ ని అదే మెరుపు వేగంతో కాపాడుకో లేడా? ఇక్కడే పాత్ర ఫెయిలయ్యింది.

          కాబట్టి సినిమా ప్రారంభ దృశ్యాన్ని అనాలోచితంగా మార్చినట్టే తెలిసిపోతోంది. హీరో పాత్రకి అలా ఎంట్రీ ఇచ్చాక, ఇక అలాగే ముందుకెళ్ళ లేని ఉచ్చులో పడ్డట్టయ్యింది.  ఒక సినిమాని రీమేక్ చేసేప్పుడు ఆ ఒరిజినల్ దర్శకుణ్ణి కూర్చో బెట్టుకుని, అతడి గొడవేంటో ఎందుకలా తీశాడో, ఆ తీయడం వెనుక మతలబు లేంటో, రెసిపీ ఏంటో అంతరార్ధం తెలుసుకుని- తీస్తే మంచిదేమో!

          మొత్తానికి ఫైట్లూ డాన్సులూ టార్గెట్ చేసుకుని మాత్రమే మంచు విష్ణు ప్రేక్షకుల్ని మెప్పించడానికి ప్రయత్నించాడు.
         
          హీరోయిన్ ప్రణీతది  గ్లామర్ పాత్ర. హీరోతో బాటు శత్రువుల నుంచి తప్పించుంటూ వుండే యాక్షన్ పాత్ర. అలాగని ఫైట్లు లేవు, గుర్తుంచుకోవడానికి ఒక్క సీనూ లేదు.  డిటో తమిళం.

          ఇక సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం లో కొత్తదనమేమీ లేదు. మాతృకలో ఆర్డీ రాజశేఖర్  ఫీల్ ని మెయిన్ టెయిన్ చేస్తూ సృష్టించిన విజువల్ ట్రీట్ వేరు. సినిమాకి విజయన్ మాస్టర్ హెవీ డ్యూటీ యాక్షన్ దృశ్యాలే హైలైట్. బివిఎస్ రవి మాటలు రెండు మూడు బలమైన సన్నివేశాల్లో పకడ్బందీగా వున్నాయి.


స్క్రీన్ ప్లే సంగతులు 

         
మిళంలో హిట్టయిందల్లా బంగారం కాదు. దాంట్లోనూ బోలెడు మైనస్ లుంటాయి.  ‘డైనమైట్’  మాతృక ‘అరిమా నంబి’ విషయ పరంగా రొటీన్ యాక్షన్ థ్రిల్లరే. దేనికోసం యాక్షన్ అనేది పాతకాలం నుంచీ  వస్తున్న వ్యవహారమే. ఒక సీడీ కోసమో, టేప్ కోసమో, ఇంకా దేని కోసమో విలన్లూ హీరోలూ సాగించే పోటాపోటీ వేట అనే ఫార్ములా, ఫార్ములా సినిమాలంత పాతదే.  ఇంత పాత దనాన్ని కూడా తమిళ ప్రేక్షకులు మోశారంటే ఆ హీరో కల్గించిన ఫీల్ వల్ల కావొచ్చు. ఎమోషన్ బలంగా వుంటే  రొటీన్ ఫార్ములా కూడా సక్సెస్ కి లొంగి వస్తుంది. తమిళంలో ఇదే జరిగి వుంటుంది. లేకపోతే విషయపరంగా సవాలక్ష లోపాలున్న ఈ సినిమా హిట్ కాకూడదు.

          తెలుగులో అలాటి ఫీల్ ని క్రియేట్ చేయకపోవడంవల్ల ఆ లోపాలే కొట్టొచ్చి నట్టు పైకి తేలి, సెకండాఫ్ ని దెబ్బతీశాయి. స్క్రీన్ ప్లేలో ప్రధానంగా కథనపరమైన ఒక లోపం, ఫస్టాఫ్ లో అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, సెకండాఫ్ లో బయట పడి బలహీనపర్చింది.

          ఆ లోపం ప్లాట్ డివైస్ గా వాడుకున్న మెమరీ కార్డుని అ నాదిగా వస్తున్న పద్ధతిలోనే  ప్రయోగించడం.

          మెమరీ కార్డ్ అనే ప్లాట్ డివైస్ తో మార్పు లేని అదే ఫార్ములా కథనం చేయడం. 

          ఈ మెమరీ కార్డుతో గొడవ ఎంతసేపు ఆసక్తిని నిలుపుతుంది? 

          ఏం సస్పెన్సుని సృష్టిస్తుంది?

          ఓ మంత్రి హత్య చేశాడు.. ఆ సీడీ హీరోకి దొరికింది..  ఆ సీడీ కోసం మంత్రి అనుచరులు వెంట బడ్డారు.. కొట్టుకున్నారు.. చంపుకున్నారు.. తప్పించుకున్నారు.. ఆ సీడీ ని చివరికి ప్రపంచానికి బట్టబయలు చేశాడు హీరో.. మంత్రి కటకటాల వెనక్కి పోయాడు- బాపతు సినిమాలు ఎన్ని సార్లు చూడలేదు?

          పోనీ ఆ సీడీ లో ఏముందో సస్పెన్స్ కోసం అట్టి పెట్టుకుని, చిట్ట చివరికి రివీల్ చేసినప్పుడు, ఆ రహస్యం  ఎంత షాకింగ్ గా వుండాలి? అంత షాకింగ్ గా ఉన్నప్పుడే అంత సేపూ ఆ సీడీ కోసం సాగిన రొటీన్ కథనాన్ని అది మరిపించ గల్గుతుంది.  ఇలాటిదేమీ లేకుండా రొటీన్ కథనాన్నే నడిపించి,  మళ్ళీ చప్పగా తేలే  రొటీన్ రహస్యాన్నే రివీల్ చేస్తే, షాక్ వేల్యూ ఏముంటుంది?  మొత్తం సినిమానే చప్పగా తేలిపోతుంది.       

          బహుశా తమిళ మాతృకకి  1995 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ మర్డర్ కేసు స్ఫూర్తి కావొచ్చు. భార్య నైనా సహానీ అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే  సుశీల్ శర్మ పిస్తోలుతో కాల్చి చంపి, ఆ శవాన్ని న్యూ ఢిల్లీ లోని ఓ రెస్టారెంట్ కి తీసికెళ్ళి, తందూరీ చికెన్ చేసే పొయ్యిలో వేసి బూడిద చేశాడు. ప్రస్తుత సినిమాలో కేంద్ర మంత్రి  ఢిల్లీలో ప్రియురాల్ని చంపి, గ్యాస్ స్టవ్ ప్రమాదం సృష్టించి నేరాన్ని కప్పి పుచ్చుతాడు.  ఈ రొటీన్ పాయింటే క్లయిమాక్స్ లో ఆ మెమరీ కార్డులో రివీలవుతుంది. కొత్తదనం లేదు, షాక్ వేల్యూ లేదు.

          ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు హీరో చేతి కొచ్చే  ఆ మెమరీ కార్డులో  అసలేముందో తెలిసేది క్లయిమాక్స్ లోనే. దీంతో అంతవరకూ సెకండాఫ్ మళ్ళీ ఆ మెమరీ కార్డు కోసం సాగే హోరాహోరీ రిపీట్ అవుతూ- రోల్ అవుతూ- సాగతీతగా సాగుతూనే వుంటుంది.  తీరా అది రివీల్ అయ్యేసరికి ఉస్సూరుమని పాత విషయమే!

          అలా రివీల్ అయినప్పుడు షాకింగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? సీన్ రివర్సల్ చేయాలి. సపోజ్, ఆ దృశ్యాలు సాక్షాత్తూ హీరో తండ్రినే మంత్రి చంపుతున్నవై యుంటే ఎలావుంటుంది? అదీ సీన్ రివర్సల్ తో షాక్ వేల్యూ అంటే! కథలో ఏం  జరిగినా హీరోకే జరగాలి. హీరోకే రివర్స్ అవాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ ప్రేక్షకుల మీద వుంటుంది. ప్రేక్షకులు డైరెక్టుగా హీరోని ఫాలో అవుతూ సినిమా చూస్తారు కాబట్టి- హీరోకి అలాటి అనుభవాలు ఎదురవ్వాలి. విలన్ ని ఫాలో కాని ప్రేక్షకులు అతడి వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా రియాక్ట్ కారు. దానికి హీరోతో సంబంధం ఉన్నప్పుడో, లేదా విశాల ప్రాతిపదికనవిలన్ మానవాళికే ముప్పు తలపెట్టినప్పుడో, విలన్ పట్ల ప్రేక్షకులు రియాక్ట్ అవుతారు.

          కనుక ఈ సినిమాలో చూపించినట్టు- ఎవరో మంత్రి ప్రియురాలు చస్తే ప్రేక్షకులెందుకు కేర్ చేస్తారు? హూ ఈజ్ షీ ఆఫ్టరాల్? హీరో చెల్లెలు కూడా కాదు.

          ఒకవేళ సీన్ రివర్సల్ నచ్చనప్పుడు- ఈ ప్లాట్ డివైస్ ( మెమరీ కార్డు) తో మొత్తం స్కీమునే మార్చెయ్య వచ్చు. ఏమిటా స్కీము? అదే మెక్ గఫిన్ టెక్నిక్!

***
మెక్ గఫిన్ టెక్నిక్...

డిటెక్టివ్, క్రైం, అడ్వెంచర్ కథా సాహిత్యాల్లో 19వ శతాబ్దం నుంచే ఆంగ్లంలో ఈ ప్లాట్ డివైస్
ప్రయోగం వుంది. సినిమాల్లో సస్పన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  దీన్ని ప్రవేశపెట్టి 
మార్గదర్శకుడయ్యాడు. 1935 లో తీసిన ‘39 స్టెప్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో
‘మెక్ గఫిన్’ ని ప్రయోగించాడు.  ఈ మెక్ గఫిన్ ఏమిటో, 
దీని పూర్వాపరాలేమిటో, ఆతర్వాత 1939 లో కొలంబియా
యూనివర్శిటీలో ఒక సుదీర్ఘమైన లెక్చరే  ఇచ్చాడు.

          మెక్ గఫిన్ అనే చొప్పదంటు పేరు ఆ ఎలిమెంట్ గురించి పిచ్చాపాటిగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు పుట్టింది. హిచ్ కాక్ వృత్తాంతం ప్రకారం- ఇద్దరు వ్యక్తులు రైల్లో  ప్రయాణిస్తూంటారు. ఒకతను ‘ఏంటోయ్, ఆ బ్యాగేజీ ర్యాక్ లో ఆ ప్యాకేజీ ఏంటదీ?’ అని అడుగుతాడు. ‘అదా, అదీ  మెక్ గఫిన్ లేవో, నోర్మూసుకో’ అంటాడు రెండో అతను. ‘నోర్మూసుకోవాల్నా? మెక్ గఫిన్నా? మెక్ గఫిన్ ఏంటయ్యా బాబూ, కాస్త ఎక్స్ ప్లెయిన్ చేసి చావు- అలాగే నోర్మూసుకుంటా’ అంటాడు మొదటి అతను. దీనికి రెండో అతను -‘అదిగో- ఓ..అక్కడా ...అక్కడ స్కాటిష్ హైలాండ్స్ లేవూ, ఆ స్కాటిష్ హైలాండ్స్ లో సింహాల్ని పట్టే ఉచ్చు లాంటిదన్నమాటలే  మెక్ గఫిన్ అంటే ’ అని వివరిస్తాడు. ‘పోవోయ్, ఎటకారమా? స్కాటిష్ హైలాండ్స్ లో సింహా లెక్కడ చచ్చాయని?’ అని మొదటి అతను ఇంతెత్తున లేస్తాడు. ‘లేవుకదా? మరయితే మెక్ గఫిన్ కూడా లేనట్టే, నోర్మూసుకుని కూర్చో!’ అని దబాయిస్తాడు రెండో అతను. అంటే తేలిందేమిటంటే, మెక్ గఫిన్ అనేది  ఉత్తుత్తి బూచి అన్నమాట. గబ్బర్ సింగ్ లేకపోయినా, అదిగో గబ్బర్ సింగ్ వస్తాడు- అని పిల్లల్ని భయపెట్టడం లాంటిదన్నమాట!

          ఐతే కథల్లో నిజం చెయ్యడం గురించే బూచిని ప్రయోగిస్తారు.

          ఉదాహరణకి- ఒక కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి నేర స్థలంలో ఒక ఆధారం కన్పిస్తున్నా దానిమీద దృష్టి పెట్టలేదు అనుకుందాం, ప్రేక్షకులు కూడా దాన్ని పట్టించుకోకుండా- ఆ అధికారి కనుగొన్న ఇంకేదో  క్లూనే పట్టుకుని ఫాలో అవుతున్నారనుకుందాం...కేసు నడిచీ నడిచీ ఆ క్లూ ఎంతకీ  పనికి రాకపోయేసరికి- అప్పుడా అధికారికి నేర స్థలంలో ఉపేక్షించిన ఆ ఆధారం తళుక్కున మెరిసిందను కుందాం- అదే కీలకసాక్ష్యాధారం! కేసుకి అదే అవసరమని అప్పుడు తెలిసి రావడమనే ప్లేనే -మెక్ గఫిన్ టెక్నిక్! విలువ లేనిది అనుకున్నదే తర్వాత విలువ సంతరించుకోవడం! కాకపోతే దీన్ని జాగ్రత్తగా ప్లే చేయాలి- ప్రేక్షకులకి ఏమాత్రం అనుమానం రాకూడదు.

          సినిమాల్లో ఈ ‘బూచి’ ని ఫస్ట్ యాక్ట్ ( బిగినింగ్) లో ప్రేక్షకులకి అనుమానం రాకుండా ప్రయోగించి, థర్డ్ యాక్ట్ (ఎండ్) లో తెరపైకి తీసుకొచ్చి గొప్ప ట్విస్టు ఇస్తారు.    

***
       మెక్ గఫిన్ ని ప్రయోగించినప్పుడు దాన్ని ప్రేక్షకులు కేర్ చేయకూడదని హిచ్ కాక్  అంటాడు.

          మెక్ గఫిన్ ని రివీల్ చేసినప్పుడు అది డైనమైట్ లా పేలాలని జార్జి లుకాస్ అంటాడు.

          నిజానికి ‘డైనమైట్’ సినిమా టైటిల్ ఈ మెక్ గఫిన్ ని దృష్టిలో పెట్టుకునే పెట్టాల్సింది..
   
          అప్పుడీ సినిమా కథనం ఇలా ఉండొచ్చు : హీరోయిన్ కిడ్నాపయ్యింది, ఆమె తండ్రి మర్డరయ్యాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో హీరోకి తెలీదు, హీరోయిన్ ని రక్షించుకుని, కిడ్నాపర్ ని చంపినప్పుడు ఆ లాడ్జిలో అక్కడే  పడున్న బ్లాక్ చిప్ ని చూసుకోలేదు (మెక్ గఫిన్ ప్రయోగం) , ప్రేక్షకులు కూడా గమనించలేదు...ఇంటర్వెల్ తర్వాత, హీరో కారణాలు అన్వేషిస్తూంటే అతణ్ణి చంపడానికి గ్యాంగ్ వెంటపడింది, తనకేం సంబంధమో అర్ధం గాలేదు, ప్రాణాలు కాపాడుకుంటూ హీరోయిన్ తో పారిపోవడం చేశాడు, ఎప్పుడో లాడ్జి సీను మెదిలింది, అక్కడికి పరిగెత్తాడు, అక్కడ పడున్న మెమరీ చిప్ ని చేజిక్కించుకున్నాడు (మెక్ గఫిన్ రివీల్), కారణాలు అర్ధమయ్యాయి, ఇప్పుడా కార్డులో ఏముందో చూడాలి- చూస్తే అందులో విషయం చాలా షాకింగ్ గా వుంది..  క్లయిమాక్స్ ప్రారంభమయ్యింది...

          అంటే మెమరీ కార్డుని అంతసేపూ దాచి పెట్టడం వల్ల, దానికోసం రొటీన్ వేటగా ప్రేక్షకులకి బోరు కొట్టదు. అది క్లైమాక్స్ లోనే రివీలయ్యి, కొత్త ట్విస్టుతో కొత్త విషయాన్ని మోస్తూ, ఆడియెన్స్ కి కొత్త హుషారు పుట్టిస్తుందన్న మాట!

          ఎన్నో గొప్పవైన థ్రిల్లర్స్ లో ఈ మెక్ గఫిన్ చుట్టే కథలల్లుతారు- లార్డ్ ఆఫ్ ది రింగ్స్, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, పల్ప్ ఫిక్షన్, స్టార్ ట్రెక్, మిషన్ ఇంపాసిబుల్ మూడు పార్టులూ.. ఇలా చాలా వున్నాయి.

          నిజజీవితంలో మెక్ గఫిన్- ఉదాహరణకి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా మర్డర్ కేసులో వుంది.
          మూడేళ్ళ క్రితం రాయ్ గఢ్ అడవుల్లో ఒక సగం కాలిన శవం దొరికింది. అనాధ శవంగా దాన్ని ఖననం చేశారు. షీనాబోరా అనే యువతి తల్లి ఇంద్రాణీ ముఖర్జీయా  తన కూతురు అమెరికాలో సెటిలయ్యిందని చెప్పుకొచ్చింది ఈ మూడేళ్ళూ. ఒక అక్రమ ఆయుధాల కేసులో ఆమె కారు డ్రైవర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు, షీనా బోరాని గురించి కక్కేశాడు ఆ డ్రైవర్. మూడేళ్లక్రితం తనూ, షీనా బోరా తల్లి, ఆమె రెండో భర్తా కలిసి షీనా బోరాని చంపి రాయ్ గఢ్ అడవుల్లో తగులబెట్టామని చెప్పేశాడు. షాకయ్యారు పోలీసులు- మూడేళ్ళ క్రితం ఆ డెడ్ బాడీని  మెక్ గఫిన్ అనుకున్నారు!  అదే ఇప్పుడు షీనా బోరా శవంగా రివీలయ్యింది! మెక్ గఫిన్ చక్కగా ప్లే అయ్యిందిక్కడ  నిజజీవితంలో!
          స్క్రీన్ ప్లే ని ఒక శాస్త్రంగా అంగీకరించగల్గితే, అదొక మహాసముద్రం. నిత్యం దాన్ని మధిస్తున్న వాళ్ళకే ఇలాటి స్క్రిప్టింగ్ సమస్యలకి  విశ్వసనీయ పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కానీ టాలీవుడ్ లో అధ్యయనం కంటే కూడా తాటాకు చప్పుళ్ళెక్కువ కదా! ఇలాటివి ఒప్పుకోరు!
***

      క ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారిత థ్రిల్లర్ అన్నాక, లాజిక్ తో చెలగాటం కుదరదు. లాజిక్ అవసరం లేదనుకుంటే వేరే మసాలా యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ మెదడుకి మేతపెట్టే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్  పక్కా ప్రోఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. లాజిక్ ని ఎగేస్తూ ఇష్టానుసారం తీస్తామంటే ఆ దర్శకుడి మేధస్సు మీద జాలి కలుగుతుంది.
          ఒరిజినల్లో వున్న లాజికల్ దోషాలు రీమేక్ లోనూ దొర్లాయి :
          1.  ఫ్లాట్ లో కిడ్నాపే  జరగనట్టు సీన్ని క్రియేట్ చేయడంలో సీఐ ఉద్దేశమేమిటి? అంతగా హీరో కంప్లెయింట్ చేస్తే తను మేనేజ్ చేసుకోలేడా మిస్ లీడ్ చేస్తూ? ఊరికే ఏదో మిస్టీరియస్ బిల్డప్ కోసం అనవసరమైన సీను క్రియేట్ చేశారా?
          2.  కేంద్ర మంత్రి గ్యాంగ్ తో సీఐ ఎప్పుడు, ఎందుకు కలిశాడు? ఢిల్లీలో కేంద్ర మంత్రి రెగ్యులర్ గ్యాంగ్,  హైదరాబాద్ లో లోకల్ గ్యాంగ్ ని మెమరీ కార్డ్ కోసం నియమించుకున్నాక, ఈ సీక్రెట్ ఆపరేషన్ (తన గుట్టు)  ఎందుకు పోలీసులకి తెలిసేట్టు చేసుకోవాలి?
          3.   సెకండ్ హాఫ్ లో కేంద్రమంత్రి తనే స్వయంగా రంగంలోకి దిగుతూ, ఇందులో పోలీసులు వద్దనుకున్నాం- ఇప్పుడు వాళ్ళే అవసరమయ్యారని అనడమేమిటి? ప్రారంభంలోనే సీఐ లింకప్ అయ్యాడని తెలీదా?
          4.  బ్యాంకు సంఘటనలో గ్యాంగ్ కారు రాంగ్ పార్కింగ్ చేసి వుంటే, ట్రాఫిక్ పోలీసులు  దాని టైరుని లాక్ చేస్తారు. ఆ గ్యాంగ్ ని హీరో కారెక్కించుకుని పారిపోయేటప్పుడు, ఆ టైర్ లాక్ తీయకుండా ఎలా స్టార్ట్ చేసి పోనిచ్చాడు?
          5. హీరో తమని హైజాక్ చేసి తీసుకుపోతూంటే, కేవలం ముక్కు వరకూ కర్చీఫ్ కట్టుకున్న అతణ్ణి, అదీ ఒకే  డ్రెస్సులో ఉంటున్న అతణ్ణి- గ్యాంగ్ గుర్తు పట్టలేరా? 

          6.  బ్యాంకులో డబ్బు తెచ్చుకోవడానికి కిడ్నాపర్ కారు దిగుతూంటే అనుచరుడు కూడా వస్తానన డమేమిటి? ‘ఎందుకురా?’ అని కిడ్నాపర్ అడిగితే, ‘వూరికే’ అని- కారుదిగి పోవడమేమిటి? కారు దిగుతూ రివాల్వర్ని కారు డాష్ బోర్డులో పెట్టడమేమిటి? ఆ సమయంలో అది దగ్గర పెట్టుకుని ఉండాలికదా? డాష్ బోర్డులో పెడితే మూత ఓపెన్ అయి, రివాల్వర్ రివీల్ అవడం పోలీసులు చూడ్డం కోసమా? ఆ రివాల్వర్ అనుచరుడి దగ్గరే వుంటే, హీరో వాళ్ళని హైజాక్ చేయడం కుదరదని ఇలా లాజిక్ ని కిల్ చేశారా? హాస్యాస్పదంగా లేదూ?
          7. గండిపేటలో నివాస ముండే  ఛానెల్ బాస్ ఇంటి ప్రాంతాల యాక్షన్ సీన్ జరిగితే, హీరో పోలీసులకి కాల్ చేసి,  పెద్దమ్మ గుడిదగ్గర, రోడ్ నంబర్ 36 (జూబ్లీ హిల్స్) - అంటాడేమిటి?
          8. లాడ్జి సంఘటనలో ఫోన్ మాట్లాడానికి కిడ్నాపర్ డాబా పైకి వెళ్తాడు, హఠాత్తుగా లాడ్జి బిల్డింగ్ లో హీరోతో భారీయెత్తున కాల్పులతో చాలా సేపూ యాక్షన్ జరుగుతుంది. అది ముగిసి హీరో హీరోయిన్ తో పారిపోయాక, డాబా మీదే వున్న కిడ్నాపర్ ఫోన్ సంభాషణ ముగించి కిందికి దిగి వచ్చి, జరిగింది అప్పుడే  తెలిసినట్టు చూస్తాడేమిటి? అంతసేపూ అన్ని శబ్దాలు వినపడనే లేదా? అతను యాక్షన్ లో పాల్గొంటే కథ మారిపోతుందని ఇలా లాజిక్ ని ఎగేశారా?
          9. కిడ్నాపర్ ఆ మెమరీ కార్డు సంపాదించి ఇవ్వడానికి ఢిల్లీ గ్యాంగుతో రెండు కోట్ల రూపాయలకి బేరం మాటాడుకున్నాడు..అలాటి విలువైన కార్డు లాడ్జి లో టేబుల్ మీద నిర్లక్ష్యంగా   పారేసి, ఫోన్ మాట్లాడడానికి డాబా పైకి వెళ్తాడా? హీరోకి ఆ కార్డు దొరకాలి కాబట్టి రెండుకోట్ల మొనగాడు కిడ్నాపర్ ని దద్దమ్మగా చేశాడా దర్శకుడు?
          10 ఫస్టాఫ్ లో ఇంకో మూడు గంటల్లో హైదరాబాద్ లో ఉంటానన్న కేంద్ర మంత్రి, సెకండాఫ్ లో ఎప్పుడో 30 గంటలు గడిచాక అంత బిల్డప్ తో మొనగాడులా రావడం నవ్వు తెప్పించడం లేదూ? సీన్స్ కి విశ్వసనీయత లేకపోతే ఇలాగే వుంటుంది. 

          11. కేంద్రమంత్రి హైదరాబాద్ కొచ్చి, పోలీస్ కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేస్తూ, కమిషనర్ సహా అందర్నీ పరిగెట్టిస్తూ, హీరో హీరోయిన్ల కోసం వేటాడడం ఎలా సాధ్యం? ఈ తమాషా ప్రపంచం చూస్తూ కూర్చుంటుందా? మీడియా కూడా చేతులు ముడుచుకు కూర్చుంటుందా?
          12. కేంద్ర మంత్రి ఒకణ్ణి  షూట్ చేయమంటే,  ఆ పోలీస్ అధికారి అదేదో తన హయ్యర్ అఫీషియల్ ఆర్డర్ అయినట్టు షూట్ చేసేస్తాడేమిటి? నగర  పోలీసులు కేంద్రమంత్రి ప్రైవేట్ సైన్యం అయిపోయారా?
          13. హీరో ఆ మెమరీ కార్డులో మ్యాటర్ ని  యూ ట్యూబ్ లో అప్-లోడ్ చేయకుండా, సిటీ మొత్తం 45 నిమిషాలు ఇంటర్నెట్ కట్ చేయమని ఆదేశిస్తాడు కేంద్రమంత్రి. ఎంటిదిది? సినిమాటిక్ లిబర్టీకి కి కూడా హద్దుండాలి కదా?
          14. అంత విలువైన మెమరీ కార్డుని సంపాదించుకున్న హీరో, దాన్ని హీరోయిన్ కిచ్చేప్పుడు, నోట్ బుక్ పేజీల మధ్య పెట్టేసి అందించడమేమిటి? అది జారి ఎక్కడైనా పడిపోదా? పాకెట్ లో పెట్టుకోమని జాగ్రత్త చెప్పవచ్చు కదా? అలా చెప్తే ఆ తర్వాత ఆ కార్డు పోగొట్టుకునే సీను వుంటుంది కాబట్టి - ఆ సీను కుదరదనా కామన్ సెన్సుని ఎగేశారు?

          15. అనుకున్నంతా అయ్యింది... ఆ నోట్ బుక్ పేజీల మధ్య అలాగే మెమరీ కార్డు పెట్టుకుని, హీరోయిన్ హీరోతో తప్పించుకుంటున్నప్పుడు- ఎస్కలేటర్ మీద అది జారిపడి- ఎస్కలేటర్ పళ్ళ మధ్య ఇరుక్కుని - కసబిసా చితికిపోయింది! ఇంతతెలివి తక్కువ చైల్డిష్ హీరో హీరోయిన్లకి, ఇంత భారీ యాక్షన్- అడ్వెంచర్ అవసరమా?
          16. అంతిమంగా, కేంద్ర మంత్రిని స్టేడియం లో బంధించి హీరో ఏం సాధించాలనుకు
న్నాడు? గన్ పాయింట్ మీద అతణ్ణి  బెదిరిస్తూ, నేరం ఒప్పుకోకుంటే చంపేస్తానని అంటాడు-  ఇదంతా  గ్రాండ్ గా నేషనల్ ఛానెల్స్ లో టెలికాస్ట్  అయ్యేలా ఏర్పాటు చేసుకుని. అలా బెదిరించి చెప్పించిన వాంగ్మూలం కోర్టులో చెల్లదని తెలీదా? కేంద్ర మంత్రికి శిక్ష పడే మాటేమో గానీ, అతను నేరం ఒప్పుకోకపోతే చంపేసి- ఆ టెలికాస్టింగ్ కి తను మాత్రం హంతకుడిగా మొత్తం దేశానికీ- ఆ తర్వాత చట్టానికీ ఖాయంగా దొరికిపోతాడు హీరో! ఇంత  తెలివి తక్కువగా హీరో తన ఉచ్చు తనే బిగించుకున్నాడు తప్ప- ఏం జరిగినా కేంద్ర మంత్రికి పోయేదేం లేదు. అతననుకుంటున్న ప్రధానమంత్రి పదవిలోకి  కులాసాగా వచ్చేస్తాడు.
          17. ఆ బెదిరింపూ- చంపడాలూ మిస్సయి- ఇంకెక్కడికో మారుతుంది స్థలం. అక్కడ హీరో మీద పైచేయి సాధించిన కేంద్రమంత్రి, అతన్ని చంపబోతూ- నేనే ఆ మర్డర్ చేశాను ఏం చేస్తావ్-లాంటి డైలాగులేవో  చెప్తాడు- అక్కడ టెలికాస్టింగ్ లేదన్న ధైర్యంతో. తర్వాత బటన్ కెమెరాతో హీరో ఆ మాటలు రకార్డు చేశాడని తేలుతుంది. అయినా కూడా అది కోర్టులో చిల్లికాణీకీ పనికి రాదు. అప్పుడూ కేంద్ర మంత్రి సెంట్ పర్సెంట్ సేఫే! అలాటి వీడియో రికార్డింగ్ ( స్టింగ్ ) ఆపరేషన్స్  ఏసీబీ, సీబీఐ లాంటి ప్రభుత్వ సంస్థలు చేస్తేనే కోర్టుల్లో చెల్లుబాటు అవుతాయి. మీడియా చేసినా పనికిరావు.
          18. అసలా కేంద్ర మంత్రి మీద ఛానెల్ బాస్ ఆ సాక్ష్యం ఎలా సంపాదించాడు? ఏదో రేవ్ పార్టీ జరుగుతోంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశామన్నాడు. కానీ ఆదృశ్యాలు చూస్తే,  కేంద్రమంత్రి ప్రియురాలి ఫ్లాట్ లో జరిగినవి.
          19. సరే, ఎక్కడ రికార్డు చేసినా, ఎలా సంపాదించినా, కేంద్ర మంత్రి తో  అంతటి జాతీయ ప్రాధాన్యంగల వీడియోని వెంటనే ప్రసారం చేయకుండా ఎందుకు దాచి పెట్టుకున్నాడు ఛానెల్ బాస్? ప్రసారం చేస్తే ఈ సినిమా కథ ఉండక, రీమేక్ కీ అవకాశం ఉండదనా?

సికిందర్


















         









         
























         


         





































29, ఆగస్టు 2015, శనివారం

మిషన్ పాసిబుల్!



దర్శకత్వం : కబీర్ ఖాన్
తారాగణం : సైఫలీ ఖాన్, కత్రినా కైఫ్, సవ్యసాచి చక్రవర్తి, మహ్మద్ జీషాన్ ఆయూబ్,
సొహైలా కపూర్, షానవాజ్ పట్వర్ధన్,
సంగీతం : ప్రీతమ్, నేపధ్య సంగీతం : జూలియస్ పఖియం, ఛాయాగ్రహణం : ఆశీమ్  మిశ్రా,  కూర్పు : ఆరిఫ్ షేక్  - ఆదిత్య బెనర్జీ
కథ : హుసేన్ జైదీ,  స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్- పర్వేజ్ షేక్, మాటలు : కబీర్ ఖాన్ - కౌసర్ మునీర్
బ్యానర్ : నాడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టెయిన్ మెంట్
నిర్మాతలు : సాజిద్ నాడియావాలా,  సిద్ధార్థ్ రాయ్ కపూర్
విడుదల : 28 ఆగస్ట్ 2015
*
త నెల్లోనే ‘భజరంగీ భాయిజాన్’ అనే సూపర్ హిట్ ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్ నుంచి వెంటనే ఈ నెల ‘ఫాంటమ్’ వచ్చేసింది.. మొదటిది ఇండో- పాక్ ల మధ్య స్నేహం కోసం,
రెండోది పాక్ లో వున్న 26/11 ముంబాయి దాడుల సూత్రధారిని చంపడం కోసం.
మొదటి దాన్ని పాక్ ఆదరించింది, రెండో దాన్ని పాక్ కోర్టు నిషేధించింది. ఫర్వాలేదు- అక్కడి ప్రేక్షకులు దీన్ని చూడకపోయినా మునిగిపోయిందేమీ లేదు, కానీ భారత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి వున్న 26/11 ఉదంత సూత్రధారి అంతాన్ని భారతీయ ప్రేక్షకులు
చూసే ఆనందించాలి. ఇది థియేటర్లలో వెల్లడవుతూనే వుంది- హఫీజ్ సయీద్
పాత్రధారిని సైఫలీ ఖాన్ కాల్చి చంపుతున్నప్పుడు ప్రేక్షకులనుంచి
వస్తున్న రెస్పాన్స్. ఈ ఘటన నిజమవుతుందో లేదో కాలమే చెప్తుంది-
అందాకా ప్రేక్షకుల్ని ఇలాగైనా సంతృప్తి పర్చాలి కదా!

          హాత్మా గాంధీ మీద హత్యాయత్నంతో కమల్ హాసన్ ‘హేరామ్’,  దావూద్ ఇబ్రహీం ని పాక్ నుంచి పట్టి తెచ్చే రిషీకపూర్  ‘డి- డే’ లాంటి కాల్పనిక  చరిత్రల్లాంటిదే ‘ఫాంటమ్’ కూడా. కాకపోతే 26/11 తాజా సమకాలీన ఉదంతం కావడంతో, ఫ్లాష్ ఫార్వర్డ్ మోడ్ లో  ఇది ప్రేక్షకుల తాజా కచ్చిని  బాగా తీర్చుతుంది.

          ఏ తరహా సినిమా అయినా అంతిమంగా న్యాయ స్థాపన జరిగి ప్రేక్షకుల కచ్చి తీర్చి నప్పుడే గొప్ప సక్సెస్ అవుతుంది. ‘ఫాంటమ్’ అంత గొప్ప సక్సెస్ అయ్యే లక్షణాలున్న సినిమా అనలేం, కానీ  26/11 ముష్కరుడ్ని చంపడమనే కిల్లర్ ( అంటే కత్తి లాంటి ) బాక్సాఫీసు అప్పీల్ వున్న  పాయింటుతో,  ఈ పరిమిత బడ్జెట్ మూవీ దర్శకుడి విఫల ప్రయోగం మాత్రం కాబోదు.

          సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే ఆ దేశంలో కోవర్ట్ ఆపరేషన్సే శరణ్యమని ఉపదేశించే ఈ స్పై థ్రిల్లర్ అసలెలా వుందో చూద్దాం..

‘రా’ రమ్మంది! 
       దనియాల్ ఖాన్ ( సైఫలీ ఖాన్) దేశ దిమ్మరిలా తిరుగుతూంటాడు. గతం అతణ్ణి బాధిస్తోంది. తను సైన్యంలో వున్నప్పుడు జరిగిన ఒక సంఘటనని పై అధికారులు అపార్ధం జేసుకుని కోర్ట్ మార్షల్ చేసి సైన్యం లోంచి తొలగించారు. సైన్యంలో ఫాంటమ్ (అదృశ్య శక్తి )  గా పెరుతెచ్చుకున్నప్పుడు గర్వించిన తన తండ్రి కూడా ఇప్పుడు తన మొహం చూడ్డం లేదు. సైనికాధికారిగా తండ్రి వుంటే, తనిలా తన మీద పడ్డ నింద కూడా తొలగించుకునే మార్గం లేక ఇంటా బయటా వెలి వేసిన వాడిలా తిరుగుతున్నాడు.

          ఇతడి మీద భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ ఎనాలిసి వింగ్ ( ‘రా’ ) దృష్టి పడుతుంది. వెతికి పట్టుకుంటారు. ‘రా’ బాస్ రాయ్ ( సవ్యసాచి చక్రవర్తి) కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఇటీవల నేపాల్ సరిహద్దులో పట్టుపడ్డ పాక్ టెర్రరిస్టు వెల్లడించిన ప్రకారం లష్కరే తయ్యెబా ( ఎల్ ఈ టి ) మరో 26/11 తరహా దాడిని ప్లాన్ చేస్తోంది. ఈ దాడుల్ని ముందే తిప్పి కొట్టలేమా, రొటీన్ గా అప్రమత్త హెచ్చరికలు జారీ చేసి ఊరుకుంటే సరిపోతుందా- అని కొత్తగా చేరిన అపర చాణుక్యుడు లాంటి చలాకీ సుమీత్ ( మహ్మద్ జీషాన్ ఆయూబ్) అనడంతో ఆలోచనలో పడ్డ రాయ్- హోం మంత్రికి తన ఐడియా చెబితే ఇంతెత్తున లేచాడు హోంమంత్రి. పాకిస్తాన్ లోకెళ్ళి లష్కర్ నాయకుడు హరీజ్ సయీద్ ( పాక్ హైకోర్టు ఈ సినిమాని నిషేధించడంతో హడావిడిగా హఫీజ్ సయీద్ పేరుని హరీజ్ సయీద్ గా మార్చారు) ని చంపడానికి అనుమతించేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ప్రభుత్వానికి తెలియకుండా ప్రైవేటుగా ఈ ఆపరేషన్ కానిచ్చేద్దామని సుమీత్ కూడా ధైర్యం చెప్పడంతో రాయ్ ఇందుకు సమకట్టాడు.

          ఈ ఆపరేషన్ కి ఒప్పుకునేది లేదంటాడు దనియాల్. పది మంది వెధవలు ముంబాయిలో జొరబడి చంపితే, మనం కూడా వెధవలుగా వాళ్ళ దేశంలో చంపి రావాలా? - అని ప్రశ్నిస్తాడు. అపర చాణక్యుడు చాకచక్యంగా అతణ్ణి ఒప్పించేస్తాడు- అతడిమీద నింద తొలగించుకునే మార్గం ఇదేనని.

          2008 నవంబర్ 26న ముంబాయి మీద టెర్రర్ దాడులు జరిపి 166 మందిని బలిగొన్న లష్కర్ నాయకుడు హరీజ్ సయీద్ తో బాటు, అనుచరులు సాజిద్ మీర్, డేవిడ్ కోల్మన్ హెడ్లీ, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ లని మట్టుబెట్టడానికి రంగం సిద్ధమయింది. బాస్ రాయ్ రెండు కండిషన్లు పెడతాడు- ఒకటి : వీళ్ళ చావులు ఇండియా మీదికి అనుమానాలు  రాకుండా యాక్సిడెంటల్ మరణాలుగా వుండాలి, రెండు : వూర కుక్కకి కూడా ఈ కోవర్ట్  ఆపరేషన్ గురించి  పొక్కకూడదు!

          ఇక్కడ్నించీ మొదలవుతుంది లండన్, చికాగో, సిరియా, పాకిస్తాన్ దేశాల్లో శత్రు సంహారం. లండన్ లో ఒక ఎన్జీవో తరపున పనిచేసే నవాజ్ మిస్త్రీ ( కత్రినా కైఫ్) పరిచయమవుతుంది. ఆమె ద్వారానే అక్కడ సాజిద్ మీర్ ని ట్రేస్ చేసి హతమారుస్తాడు. చికాగో వెళ్లి అక్కడ జైల్లో వున్న డేవిడ్ హీడ్లీ ని చంపేస్తాడు. ఈ రెండు మరణాలు పాక్ గూఢచార సంస్థ ఐఎస్సై దృష్టి కొస్తాయి. దీంతో దనియాల్ పాక్ హై కమిషనర్  ని కాంటాక్ట్ చేసి తనెవరో చెప్పేస్తాడు. భారత సైన్యం తనని అవమానించింది గనుక, పగ దీర్చుకునేందుకు  లష్కర్ సహాయం కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పేస్తాడు. హై కమిషనర్ నుంచి ఈ సమాచారమందుకున్న ఐఎస్సై చీఫ్,  అతడి బ్యాక్ గ్రౌండ్ ని చెక్ చేసి,  సిరియాలో వున్న లష్కర్ నాయకుల్ని కలుసుకునేందుకు ఏర్పాటు చేస్తాడు.

          సిరియాలో లష్కర్ నాయకుణ్ణి కలుసుకున్నప్పుడు అకస్మాత్తుగా సిరియా సైన్యం ( ఐఎస్?) దాడులు  జరుపుతుంది. ఆ నాయకుడు చచ్చిపోతాడు. ఇక పాకిస్తాన్ లోకి వెళ్లేందుకు వేరే మార్గం లేక, ఎన్జీ వో ప్రతినిధిగా తనే తీసికెళ్తుంది నవాజ్, దనియాల్ ని.

          ఇక్కడ లష్కర్ చీఫ్ హరీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతూంటాడు. ఐఎస్సై అతణ్ణి  షేక్ సాబ్ అని పిలుచుకుంటూ, జెడ్ గ్రేడ్ సెక్యూరిటీ కూడా కల్పించి మర్యాదలు చేస్తూంటుంది. మరో నిందితుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ లాహోర్  జైల్లో ఉంటాడు. ఇతడికి రోజూ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఓ డాక్టర్ వెళ్తూంటాడు. ఇతడి క్లినిక్ ని చూసుకునే ఓ పెద్దావిడ ( సొహైలా కపూర్) వుంటుంది. ఈవిణ్ణి  ట్రాప్ చేస్తుంది నవాజ్.

          హరీజ్ సయీద్ ని దనియాల్ వాచ్ చేస్తూంటాడు. హరీజ్ నీ, జకీవుర్ నీ  ఒకే సమయంలో చంపేసి దేశం విడిచి పారిపోవాలని ప్లాన్ చేస్తారు ఇద్దరూ.

          ఇదీ విషయం. ఈ ప్లాను పారిందా, బెడిసిందా? ఆ దేశం లోంచి ఎలా పారిపోయి వచ్చారు? పారిపోతున్నప్పుడు మార్గ మద్యం లో ఏమేం జరిగాయి? ఇద్దరూ ప్రాణాలతో వున్నారా? సముద్ర జలాల్లో ఏం జరిగింది? ఇద్దరి మధ్యా చిగురించిన ప్రేమ ఫలించిందా? దుర్మతుల చావుల్ని సెలెబ్రేట్ చేసుకునే అవకాశం ఇండియాకి కలిగిందా?

          ఇవన్నీ ఎవరికి వారు ఈ స్పై థ్రిల్లర్ చూసి తేల్చుకోవాల్సిన ప్రశ్నలు.

ఎవరెలా చేశారు?
         సైఫలీ ఖాన్ కిది జారుడు బల్ల పాత్ర. గొప్ప నటులు కాని వాళ్లకి ఇలాటి పాత్రలే వర్కౌట్ అవుతాయి. జారుడు బల్ల పాత్రల వల్ల హై వోల్టేజి యాక్షన్ ఎపిసోడ్లతో ఎమోషన్స్ పలికించే అవసరమే రాదు, ప్రత్యర్థులు తిరగబడకుండా కుక్క చావు చస్తూంటే స్ట్రగుల్ పడాల్సిన అవసరమే రాదు, యాక్షన్ హంగామాలో రోమాన్స్ కి చోటు కూడా లేకుండా చేస్తే ఆ ఫీలింగ్స్ పలికించే అగత్యమూ వుండదు. జారుడుబల్ల మీద అలా జారుకుంటూ పోతూ ఉండడమే. ఎదురొచ్చేది ఏమీ వుండదు. అంతా ఒన్ మాన్ షో.  ఒన్ వేలో ఒకటే యాక్షన్- అవతలి వైపు నుంచి నో రియాక్షన్.  విలన్లు తమకేం జరుగుతోందో తెలియకుండా సడెన్ గా చస్తూంటే- నటించలేని హీరో పాత్ర వేసిన జారుడు బల్ల ఆర్టిస్టుకి బాగానే ఉండొచ్చు గానీ, కథనంలో పస వుండదు. హీరోకి దీటుగా విలన్ కూడా వుండి - చావడానికి ముప్పుతిప్పలు పెడుతూంటే- చంపడానికి హీరో పడే పాట్లతో తో చూడ్డానికి ఓ కథలా ఉండొచ్చు.

          సైఫ్  చాలా సేఫ్. సినిమా సాంతం ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. గట్టిగా అరిచి కూడా డైలాగులు చెప్పలేడు గనుక, లష్కర్ పెద్ద ముష్కరుడ్ని చంపుతున్నప్పుడు కూడా - ‘ఇండియాకి  ఏం కావాలని అన్నావ్ కదా.. ఇండియాకి న్యాయం కావాలి..’ అన్న స్టేట్ మెంట్ లాంటి ఒక డైలాగుతో సింపుల్ గా సరిపెట్టేశారు.

          ఈ సినిమాలో పాయింటుకి పట్టం గట్టాలి తప్ప సైఫలీ నటనకి కాదు. కత్రినా కైఫ్ ది ఇంకో బాధ. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నానా అన్నట్టే విసుగ్గా కన్పిస్తూంటుంది. తను అర్జెంటుగా బరువు తగ్గాల్సిన అవసరముంది. సినిమా మొత్తం మీద తను చేసిందేమిటంటే,  సైఫలీ వెంట ఎక్కడికి పడితే అక్కడికి పరుగెత్తడమే, అలా పరిగెత్తుతూ వుండడమే. ఒక్క ఫైట్ కూడా చేయకుండా చాలా కష్టం తప్పించుకుంది తను.

షానవాజ్ పట్వర్ధన్ 
         హఫీజ్ సయీద్ పాత్ర వేసిన షానవాజ్ పట్వర్ధన్ అచ్చం అదే పోలికలతో వుండి, మ్యానరిజమ్స్ ని బాగా ఇమిటేట్ చేశాడు. జకీవుర్ రెహ్మాన్ పాత్ర కేవలం చనిపోయేటప్పుడే సీన్లో కొస్తుంది- కాబట్టి ఆ ఒక్క షాట్ లో ఆ నటుడు చావు నటించడానికి పెద్దగా కష్టపడలేదు. చికాగోలో హెడ్లీ పాత్ర వేసిన నటుడు కూడా హెడ్లీ పోలికలతో వుండడం విశేషం. ఇక ఇప్పుడిప్పుడే కమెడియన్ గా పాపులరవుతున్న, ‘రా’ ఉద్యోగి సుమీత్ పాత్ర వేసిన జీషాన్ ఆయుబ్ ఒక్కడే ఈ సీరియస్ యాక్షన్ మూవీకి కాస్త కామిక్ రిలీఫ్.

మహ్మద్ జీషాన్ ఆయుబ్ 

          పాటలకి చోటు లేదు. ట్రైలర్స్ లో ఊరించిన ‘ఆఫ్ఘన్ జలేబీ’ ఐటెం సాంగ్ ఓ బిట్ వచ్చి కట్ అయిపోవడం నిరాశే  ప్రేక్షకులకి. ఇంకో పాట సందర్భానుసారం బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. పాకిస్తాన్ లో పెళ్లి పాట బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ వుంటుంది.

          మరోసారి ‘భజరంగీ భాయిజాన్’  ఫేమ్  ఆశీమ్ మిశ్రా ఛాయాగ్రహణాన్ని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. యాక్షన్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో ఆయా దేశాల దళాలుగా పాల్గొన్న ఆర్టిస్టులూ పకడ్బందీగా కన్పిస్తారు. లాహోర్ ఒక బజారు సెట్, నేపధ్య వాతావరణం పాకిస్తాన్ ని ప్రతిసృష్టి చేసినట్టే వుంటుంది. అలాగే లెబనాన్ లో వేసిన సిరియా భూభాగం సెట్ కూడా. వాడిన ఆయుధాలు, మందుగుండు సహా ఆథెంటిగ్గా కన్పిస్తాయి. చివర్లో జలాంతర్గామి రావడం ఒకెత్తు.

          కబీర్ ఖాన్ మేకింగ్ లో కథాపరంగా ఎన్నో  లోటు పాట్లున్నా, టెక్నికల్ గా కాలుష్యం లేకుండా నీటుగా వుంది. ‘భజరంగీ భాయిజాన్’ లాగే హృదయాల్ని బరువెక్కిస్తూ ముగించడం దీనికి కూడా అవసరమే- ఇది నిజ సంఘటన కాబట్టి -అలాటి మనోభావాలతో ముడిపడి వుంది కాబట్టి.

 స్క్రీన్ ప్లే సంగతులు 
          న్వెస్టిగేటివ్ జర్నలిస్టు హుసేన్ జైదీ రాసిన నవల ‘ముంబాయి ఎవెంజర్స్’ ఆధారంగా తీసిన సినిమా అని బాగా ప్రచారం జరిగింది. ఆర్నెల్ల క్రితమే ఈ నవల విడుదలయ్యింది, కానీ గత సంవత్సరమే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. దర్శకుడు కబీర్ ఖాన్ కి ఈ సినిమా అయిడియా వచ్చాకే దాన్నాథారంగా జైదీ నవల రాయడం ప్రారంభించాడు. కాబట్టి నవలకీ సినిమాకీ ఎక్కడా పోలిక కన్పించదు - పాత్రలతో సహా. సినిమా పేరు చెప్పుకుని నవలకి బారీ అడ్వాన్సు కూడా తీసుకున్నాడు జైదీ. నవలలో ఈ ఆపరేషన్ ని ‘రా’ చేపట్టదు. ఒక రిటైర్డ్ కల్నల్ ఆరుగుర్ని సమీకరించి 26/11 దాడుల కారకులని సంహరించడం మొదలెడతాడు. ఆ కుట్ర దారుల్లో సినిమాలో లేని మసూద్ అజర్ పాత్ర కూడా వుంటుంది. మసూద్ అజర్ 1999 వరకూ జమ్మూ కాశ్మీర్ జైల్లో ఖైదీగా  వున్నాడు. అప్పుడు కాందహార్ విమాన హైజాక్ ఉదంతం లో ఎన్డీయే ప్రభుత్వం తీసికెళ్ళి హైజాకర్స్ కి అప్పగించిన టెర్రరిస్టుల్లో మసూద్ కూడా వున్నాడు. అలా అప్పగించిన మసూదే 2001 లో పార్లమెంట్ మీద దాడికి పాల్పడ్డాడు. 26/11 ముంబాయి దాడుల్లో కూడా ఇతడి హస్తముందని అరెస్టు చేసింది అప్పట్లో పాక్ ప్రభుత్వం. ఈ పాత్ర సినిమాలో ఎందుకనో లేదు. ఉండాల్సిన పాత్ర- ‘రా’ టార్గెట్ చేయాల్సిన పాత్ర. పార్లమెంట్ మీద దాడిని ‘రా’ అంత సులభంగా ఎలా మర్చిపోతుంది?

        ఒక యదార్థ సంఘటనని సినిమాగా తీస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే- డాక్యుమెంటేషన్ లా తయారయ్యే ప్రమాదముంది. ఇదే ముంబాయి దాడుల మీద రాం గోపాల్ వర్మ 2013 లో  ‘ఎటాక్స్ ఆఫ్ 26/11’ తీసినప్పుడు, అది సగం డాక్యూ డ్రామాలాగా, మిగతా సగం తను చేసిన ఫిక్షన్ లాగా తయారయ్యింది. టీవీ ఛానెళ్ళలో అప్పట్లో లైవ్ గా ప్రపంచం యావత్తూ చూసేసిన ముంబాయి టెర్రర్ దాడుల దృశ్యాల్నే డాక్యూ డ్రామా చేసి మళ్ళీ చూపించాల్సి వచ్చింది వర్మకి. ఇక్కడ నావెల్టీ కోల్పోయాక, పట్టుబడ్డ టెర్రరిస్టు కసబ్ తో మిగతా సగం ఇష్టానుసారం కల్పన చేసి అతడికి ఉరితో ముగించాల్సి వచ్చింది. పాక్ తో స్నేహ సంబంధాలు ఎలాటివో, టెర్రరిస్టులకి నీతి పాఠాలు అలాటివే కాబట్టి, కసబ్ పాత్రకి వర్మ ఎంత చెప్పినా ప్రేక్షకులే కన్విన్స్ కాలేకపోయారు. అప్పట్లో ఆ దాడుల నేపధ్యంలో పాపులర్ డిమాండ్ ఎలా వుందంటే- ఛానెళ్ళ సాక్షిగా అంత మారణహోమం సాగించిన వాడికి ఇంకా వేరే సుదీర్ఘ విచారణగానీ, సాక్ష్యాధారాలుగానీ అవసరం లేకుండా - నేరుగా శిక్షించెయ్యాలనేది.

          వర్మ ఇది పట్టించుకోలేదు. పట్టించుకుని వుంటే- పట్టుబడ్డ కసబ్ పాత్రని బహిరంగంగా- ఇంకా కావాలంటే- బాధితుల ఇల్లిల్లూ తిప్పి- ఆ తర్వాత కాల్చి చంపేలా చిత్రణ చేసి ఉండేవాడు. సినిమా అనేది సోషల్ కామెంటే తప్ప, సోషల్ డాక్యుమెంటేషన్ కాదు. సినిమాగా తీయబోతే యదార్థ సంఘటనలు ‘కథ’ కాలేక, ‘గాథ’ గా మారిపోయే ప్రమాదముంది. పదిమంది టెర్రరిస్టులు ముంబాయిలోకి జొరబడి మారణహోమం సాగించారు, ఒక్క కసబ్బే సజీవంగా దొరికాడు, వాడి మీద విచారణ జరిపి దోషిగా తేల్చి ఉరి తీశారు- అని జరిగింది జరినట్టు చెబితే అది సినిమా ఎందుకవుతుంది? అది సినిమాకి పనికిరాని ‘గాథ’ అవుతుంది. ఇదుగో ఫలానా సంఘటన ఇలా మొదలై ఇలా కొనసాగి ఇలా ముగిసిందీ..అని స్టేట్ మెంట్ మాత్రంగా చెప్పి వదిలేసేదే గాథ. వర్మ ఈ పనే చేశారు. అలాకాక, అలా దొరికిన వాడికి ఇంకా విచారణ ఎందుకు, వెంటనే శిక్ష! - అనే ఆర్గ్యుమెంట్ ని క్రియేట్ చేసివుంటే ఇంటరెస్టింగ్ కథయ్యేది. సినిమాకి పనికొచ్చేది ఆర్గ్యుమెంట్ సహిత ఆలోచనాత్మక  యాక్టివ్ కథే తప్ప, స్టేట్ మెంట్ మాత్రమైన పాసివ్ గాథ కాదు.

***

       హాలీవుడ్ లో గాథల్ని కథలుగా మార్చేస్తారు. సమస్యలకి శాశ్వత  పరిష్కారాలు చూపిస్తారు. అందుకే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ హాలీవుడ్ రచయితల్ని సంప్రదిస్తూ వుంటుంది. బిన్ లాడెన్ పట్టుబడితే అతన్నేం చేయాలన్న ధర్మ సందేహం కలిగి లారెన్స్ రైట్ అనే రచయితని సీఐఏ సంప్రదిస్తే- ఎన్ కౌంటర్ మాత్రం చేయవద్దన్నాడు రైట్. లాడెన్ దాడుల బాధితులు ఏ ఏ  దేశాల్లో వున్నారో ఆ దేశాలన్నిటా అతణ్ణి  తిప్పుతూ, ఆ బాధితులు విసిరే ప్రశ్నలకి అతను జవాబు చెప్పక తప్పని పరిస్థితి కల్పించాలి- అతను ఏ షరియా చట్టాలనైతే నమ్ముతాడో, వాటి ప్రకారమే అతడి స్వదేశం సౌదీ అరేబియాలో విచారణ జరిపించి, బహిరంగంగా అక్కడే శిర విచ్ఛేదం గావించాలి- అప్పుడే  అతడి వర్గ ప్రజలు అతణ్ణి అమరుణ్ణి చేస్తూ మరింతమంది పిల్ల లాడెన్లుగా పుట్టుకురాకుండా, శాశ్వతంగా పరిష్కారమవుతుంది సమస్య - అని సలహా ఇచ్చాడు లారెన్స్ రైట్.

          వాస్తవంలో ఇలా జరగలేదనేది వేరే సంగతి. సినిమావాళ్ళని ప్రభుత్వాలెందుకు పట్టించుకుంటాయి- ఫలానా వాణ్ణి ఎన్ కౌంటర్ చేయక పోతే వాడేమని నోరు విప్పుతాడో  తెలీదు. వాడు తామే పెంచి పోషించిన ‘పామే’ అయితే కచ్చితంగా కాటేస్తాడు. ప్రభుత్వాల బంటుగా మారిన వాడు ప్రభుత్వాల చేతిలోనే కథ ముగించుకుంటాడు.  

***

           
          వర్మలా కాకుండా కబీర్ ఖాన్ చేతిలో పూర్తి చరిత్ర లేదు. వర్మకి కసబ్ వరకే చరిత్ర. కబీర్ కి కసబ్ వెనకాల కుట్రదారులతో కలిపి పూర్తి చరిత్ర. ఈ చరిత్ర ఇంకా ముగియలేదు. ఈ చరిత్ర కుట్ర దారుల సంహారంతో సమగ్రంగా ముగియాలనే పాపులర్ డిమాండ్ వుంది. వర్మ తన కాలపు పాపులర్ డిమాండ్ ని తీర్చలేదు. కబీర్ తన కాలపు పాపులర్ డిమాండ్ ని తీర్చ బూనినప్పుడు, అది తెగింపుతో  ‘ఫాంటమ్’ కథయ్యింది. ఐతే ఇలా పూర్తికాని చరిత్రకో ముగింపు నిస్తున్నప్పుడు- అది పూర్తయిన చరిత్రలాగే భావించుకుని పప్పులో కాలేసుకుంటే, ఇలా డాక్యుమెంటేషన్ లాగే వుంటుంది సినిమా.        

          ఇదేం గాంధీ గారి చరిత్ర కాదు- అలాగే తీయడానికి. చరిత్ర హీనులు బతికే వున్నారు. వాళ్ళతో కాల్పనిక చరిత్ర చేస్తున్నప్పుడు సృజనాత్మక స్వేచ్ఛకి  సంకెళ్ళుండవు. ఆ పాత్రలతో యాక్షన్ రియాక్షన్ ల ఎలుకా- పిల్లి చెలగాటాలకి కావాల్సినంత స్కోపుంటుంది.

          1962 లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చార్లెస్ డీగాల్ మీద జరిగిన హత్యాయత్నాన్ని పురస్కరించుకుని ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసిన పాపులర్ ఇన్వెస్టిగేటివ్ నవల  ‘ది డే ఆఫ్ ది జాకాల్’, దీని ఆధారంగా ఇదే పేరుతో తీసిన సినిమా- ఒక గైడ్ లా వుంటాయి. చంపాలనుకుంటున్న కిల్లర్ చిక్కుల్లో పడకపోతే అది థ్రిల్లర్ అన్పించుకోదు. స్క్రీన్ ప్లే లో ఈ  స్వేచ్చ తీసుకోనందుకే ‘ఫాంటమ్’ వేడి పుట్టని డాక్యుమెంటేషన్ లా మారింది.           

            వేడి పుట్టకపోగా, చెప్పిన పాయింటుకి వ్యతిరేక దిశగా సాగుతుంది  స్క్రీన్ ప్లే. చెప్పిన పాయింటు - విషయం కుక్కకి కూడా పొక్క కూడదనేది ఒకటైతే, యాక్సిడెంటల్ మరణాలుగా  వుండాలని రెండో కండిషన్. వీటినే ఉల్లంఘిస్తూ కథ నడపడం ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయడమే.

          హీరో లండన్లో సాజిద్ మీర్ నీ, చికాగోలో డేవిడ్ హెడ్లీ నీ హతమార్చాక పాకిస్తాన్ వెళ్ళే ప్రయత్నంతో మిడిల్ విభాగంలో పడుతుంది కథ.

          ఈ పాకిస్తాన్ కి వెళ్ళే వ్యూహమే తప్పుగా వుంటుంది. పై రెండు హత్యలూ చేశాకా లండన్లో పాక్ హైకమిషన్ కి హీరో ఫోన్ చేసి- వాళ్ళిద్దర్నీ చంపింది తనే అని తనకి జరిగిన అన్యాయం చెప్పుకుని, లష్కర్ తో చేతులు కలిపి ఇండియా మీద పగ దీర్చుకోవడానికే ఇలా చేశానంటాడు. తనని లష్కర్ తో కలిపి పాక్ వెళ్లేందుకు తోడ్పడాలంటాడు.  ఇలా గోప్యత గురించి  ‘రా’ బాస్ పెట్టిన కండిషన్ని తనే ఉల్లంఘిస్తాడు. తీరా సిరియా వెళ్లి లష్కర్ నాయకుణ్ణి కలుసుకుంటే అక్కడ జరిగిన దాడిలో ఆ నాయకుడు చనిపోయాక- హీరోయినే హీరోని పాక్ కి తీసికెళ్తా నంటుంది.

          ఈ పనేదో ముందే చేయొచ్చుగా? తన వెంట వున్న హీరోయిన్ దేశదేశాల్లో యుద్ధరంగాల్లో వైద్య సేవలందించే ఎన్జీవో ప్రతినిధి అయినప్పుడు- హీరో ఆమెతోనే ప్లాన్ చేసి పాక్ కి వెళ్ళ వచ్చుగా? అనవసరంగా పాక్ హైకమిషనర్ దగ్గర బండారం బయట పెట్టుకోవడమెందుకు? హీరోయిన్ తో తనే ప్లాన్ చేస్తే సిరియా వెళ్ళే పనే ఉండదుగా ? స్క్రీన్ ప్లే లో సీన్లు, బడ్జెట్లో ఆ షూటింగ్ ఖర్చులూ తప్పేవిగా?

          ఐఎస్సై కి ఎలాగూ లండన్, చికాగో మరణాలతో అనుమానాలు రావడం ఖాయం- అవెంత యాక్సిడెంటల్ మరణాలైనా. ఒక కేసుతో సంబంధం వున్న వాళ్ళు ఒకరొకరుగా యాక్సిడెంటల్ గా  మరణిస్తూంటే- మధ్యప్రదేశ్ లో దుమారం రేపుతున్న వ్యాపమ్ స్కామ్ లాగే భగ్గుమనడం ఖాయం. కాబట్టి ‘రా’ బాస్ అలా యాక్సిడెంటల్ మరణాలు గా కన్పించాలని కండిషన్ పెట్టడంలో కూడా అర్ధంలేదు. అసలు అంత రహస్యంగా చంపాలనుకోవడం ‘రా’ ఈ ప్రైవేట్ ఆపరేషన్ నిర్ణయానికి రావడానికి దారితీసిన చర్చలకే విరుద్ధం. అవతలి దేశం వాళ్ళు ఇలా తెగబడుతూంటే మనమేదో విదేశాంగ విధానమంటూ పప్పుసుద్దల్లా కూర్చుంటున్నామని  చర్చించుకున్నారు. అలాంటప్పుడు చాటు మాటుగా చంపిరావాలనుకోవడం  కూడా పిరికితనమే అవుతుంది. చంపించింది ఇండియానే  అని పాక్ ఎలా ఆరోపిస్తుంది? ఏ ఆధారాలు చూపిస్తుంది? టెర్రరిస్టుల మీద సాక్ష్యాధారాలు ఇండియా అందిస్తూంటే తను చేస్తున్నదేమిటి? కాబట్టి పాక్ కి భయపడాల్సిన పని లేదు.

          పైగా పాక్ కి వెళ్లేముందు, హీరోనే అంటాడు హీరోయిన్ తో- ‘సాజిద్ మీర్ అనే వాడే లేడని పాక్ వాదిస్తున్నప్పుడు, వాడి చావుకి ఎవర్ని ఎలా బాధ్యుల్ని చేస్తుంది?’ అని.

***
          బిగినింగ్ ని ముగిస్తూ హీరో మిడిల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసే ఈ మొదటి మూలస్థంభం విషయంలో నస వుండకూడదు. ఇక్కడ హీరో పాకిస్తాన్ ఎలా వెళ్ళాలనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కి క్లియర్ కట్ సొల్యూషన్ లేకపోతే ఈ మొదటి మూలస్థంభం బలహీనపడి- సెకండాఫ్ లో రెండో మూలస్థంభాన్నీ,  కథ ముగింపునీ బలహీనం చేసేస్తుందని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం.

          షార్ప్ గా ఆలోచించే గూఢచార పాత్రగా హీరోని అన్నిటా చూపిస్తున్నప్పుడు, పాక్ కి వెళ్లేందుకు  ఎన్జీవో ప్రతినిధి అయిన హీరోయిన్ తో అంతే షార్ప్ గా ముందెప్పుడో ప్లాన్ చేసుకోవచ్చు. పాక్ హైకమిషనర్ తో డొంక తిరుగుడు వ్యవహారం చేసి, మళ్ళీ హీరోయినే శరణ్యం అనేకాడికి రావడం అవివేకం.  ఒక స్క్రీన్ ప్లే ట్యూటర్  ఇంటర్నెట్ లో ఈ మొదటి మూలస్థంభం దగ్గర ఉండాల్సిన విధం గురించి, షార్ప్ టిప్ ఎలా ఇచ్చాడో చూడండి-  Don’t waste time. Never wander. Maximize script economy and get into your story quick – at the last possible moment – so you can move the story forward immediately, while always staying creative with character, world, and situation. ఇలా కాకుండా ఏం  చెయ్యాలా అని మొదటి మూలస్థంభం చుట్టూ గూఢచారి అయిన హీరో తిరుగుతూ, స్క్రీన్  టైం వేస్ట్ చేసుకుంటూంటే చూడ్డానికి బావోదు.

          ఇదే దర్శకుడు ‘భజరంగీ భాయిజాన్’ లో ఈ మూలస్థంభాన్ని  ఎంత పకడ్బందీగా, సృజనాత్మకంగా- అందులోని విశేషాలు ఎంత కొట్టొచ్చినట్టుగా ఉండేట్టు సృష్టించాడో ఆ సినిమా స్క్రీన్ ప్లే సంగతుల్లో చూశాం.

          ప్రస్తుత సినిమాలో ఈ మూల స్థంభం నిజానికి సెకండాఫ్ లో ప్రధాన నిందితుడు హరీజ్ సయీద్ ని మట్టుబెట్టేందుకు ఆక్సిజన్ని ఇచ్చేది. చరిత్ర తెలిసిన ప్రేక్షకులకి ఇతర నిందితుల చావులు అంత ముఖ్యంకాదు, ప్రధాన నిందితుడి చావే చాలా ముఖ్యం. ఈ సినిమాకి కిల్లర్ బాక్సాఫీస్ అప్పీల్ ఇదే. కాబట్టి స్క్రీన్ ప్లేకి ప్రధాన కథ ఇదే. హీరోకి మెయిన్ విలన్ ఇతనే. కనుక ఈ మెయిన్ విలన్ని మొదటి మూలస్థంభానికి ఎటాచ్ చేయకుండా, హీరో గోల్ కి ఎమోషన్ కల్పించడం ఎలా సాధ్యమవుతుంది? ఎమోషన్ లేకపోతే గోల్ ఏం బావుంటుంది?

          ఎక్కడో చావబోయే సమయంలోనే మెయిన్ విలన్ని ( హరీజ్ సయీద్ ని) ఓపెన్ చేయకుండా, ముందుగా  మొదటి మూలస్థంభం దగ్గరే  ఆడియెన్స్ కి అతణ్ణి  పరిచయం చేసి వుండాలి. కనీసం అతడి ప్రసంగాల క్లిప్పింగ్స్ చూస్తూ హీరో ఆవేశపడేట్టయినా వుండాలి. ఇంకా అవసరమైన ఎక్స్ పొజిషన్ మెయిన్ విలన్ గురించి ఇక్కడే ఇచ్చి వుంటే, అతణ్ణి చంపే సీను అంత చప్పగా వుండేది కాదు. మొదటి మూలస్థంభం దగ్గర్నుంచీ పోగుబడ్డ హీరో కసి తీర్చుకునే విధం ఇంకా బలంగా వచ్చేది. ఇదేమీ లేకపోయినా ప్రేక్షకులు మంచి రెస్పాన్సే ఇచ్చారంటే ఆ మెయిన్ విలన్ గురించి చరిత్రలో ముందే తమకి తెలిసివుండడం వల్లే. కానీ అంత సేపూ ఆ మెయిన్ విలన్ తో ఉండాల్సిన డైనమిక్స్ మిస్సయి చప్పటి కథనాన్నే చూడాల్సి వచ్చింది.

***

          ‘రా’ బాస్ పెట్టిన కండిషన్లో  యాక్సిడెంటల్ మరణాలుగా వుండాలన్నది కూడా సెకండాఫ్ లో గల్లంతయ్యింది. విడివిడిగా జకీవుర్ రెహ్మాన్, హరీజ్ సయీద్ ల చావుల్ని బహిరంగ హత్యలుగానే చేసేస్తారు హీరో హీరోయిన్లు. ఇలా సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అనే ప్లాట్ టూల్స్  ‘రా’ బాస్ విషయంలోనే కాదు- హీరోయిన్ విషయంలో కూడా విఫలమయ్యింది.  

          హీరోయిన్ పాత్ర ఎంత నిర్లక్ష్యంగా వుందంటే- ఈమె జైల్లో వున్న జకీవుర్ రెహ్మాన్ ని చంపడానికి ఓ క్లినిక్ లో పనిచేసే నర్సు  బీబీజాన్ అనే పెద్దావిడని మచ్చిక చేసుకుంటుంది. ఈవిడ కొడుకుని లష్కర్ లో చేర్పించుకుని అతడి చావుకు కారకులయ్యారు టెర్రరిస్టులు. అప్పట్నించీ లష్కర్ పట్ల ద్వేషమున్న ఆమెని  జకీవుర్ ని చంపేందుకు ఒప్పిస్తుంది హీరోయిన్.  వాళ్ళ డాక్టర్ ప్రతీరోజూ జకీవుర్ కి ఇంజెక్షనివ్వడానికి జైలు కెళ్తూంటాడు. ఆ ఇంజెక్షన్ మార్చెయ్యమని చెప్తుంది హీరోయిన్. ఈ సహకారం అందిస్తే ఆమెని సురక్షితంగా ఇండియా తీసికెళ్ళి పోతామని వాగ్దానం చేస్తుంది. ఇదీ ‘సెటప్’.

          దీని ‘పే ఆఫ్’ ఎలా జరిగిందంటే- ఆవిడ మార్చేసిన ఇంజెక్షన్ తో జకీవుర్ చచ్చాడు, అప్పటికే  ఐఎస్సై కి తెలిసిపోయి ట్రేస్ చేస్తూ వచ్చేస్తున్నారు, హీరోయిన్  ఆ క్లినిక్ బయటే కాపేసింది. ఐఎస్సై వాళ్ళు క్లినిక్ లోకి వచ్చేసి ఆవిణ్ణి పట్టేసుకున్నారు- ఈ ఊహించని ఘటనకి ఆవిడ కాల్చుకుని చనిపోయింది, హీరోయిన్ మెల్లిగా అక్కడ్నించీ జారుకుంది.. ఇదీ ఆ సెటప్ కి పే ఆఫ్!

          హీరోయిన్ అక్కడ కాపేసి ఏం చేస్తున్నట్టు? జైల్లో పని జరిగిపోతే పెద్దావిడకి ప్రమాదముంటుందని తెలీదా? ఐఎస్సై వాళ్ళు  వచ్చేస్తూంటే ఆమెని తీసుకుని పారిపోకూడదా? అలా చేయలేనప్పుడు వాగ్దానం చేయడమెందుకు?  

          ఇక హీరో ర్యాలీ నిర్వహిస్తున్న హరీజ్ సయీద్ ని టార్గెట్ చేసి చంపే ఘట్టంతో మిడిల్ ముగుస్తుంది.

***

          హీరోకి యాంటీగా ఏ విలనూ లేకపోయినా, ఐఎస్సై వుంటుంది. ఐఎస్సై ఫస్టాఫ్ లో- మొదటి మూలస్థంభం దగ్గర పాక్ హైకమిషనర్ ని హీరో కెలుక్కోవడం వల్ల రంగంలో కొస్తుంది. అప్పట్నించీ ఆ సంస్థ అతడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలతోనే రెండో మూలస్థంభం దాకా గడిపేస్తుంది!  ఫస్టాఫ్ లో మొదటి మూలస్థంభం దగ్గర యాక్టివేట్  అయ్యే ఐఎస్సై, హీరో ఫలానా దగ్గరున్నాడని రెండో మూలస్థంభం దగ్గరికి చేరుకునే సరికే,  ఆ రెండో మూలస్థంభం దగ్గర హీరోగారు బిల్డప్ తో  మెయిన్ విలన్ ని  భూస్థాపితం చేస్తూంటాడు!!

          ప్రతీదీ లేటే. ఇందుకే ఏ డైనమిక్సూ లేకుండా పోయాయి. హీరో గోల్ కి అడ్డంకులు సృష్టించే ఒక్క విలన్ లేకపోతే  లేకపోయాడు- కనీసం  ఐఎస్సై  అయినా సకాలంలో హీరోని ట్రేస్ చేసి, అతడి ప్లాన్ ని అడుగడుగునా విఫలం చేస్తూంటే,  అప్పుడది మిడిల్ విభాగం బిజినెస్ అయ్యేది. ఈ బిజినెస్ లేకుండా మిడిల్ విభాగం ఎలా వుంటుంది?

          ఇదంతా పక్కన బెడితే,  ఇక్కడ్నించీ-  అంటే మెయిన్ విలన్ చచ్చాక ముగిసిన మిడిల్ విభాగం దగ్గర్నుంచీ - ఎండ్ విభాగంలో ఒక ఇంటరెస్టింగ్ ప్లే తెరపై కొస్తుంది  స్క్రీన్ ప్లే టెక్నిక్ పరంగా. అది డబుల్ క్లయిమాక్స్ ధమాకా!

          సాధారణంగా కథలకి ఒకే క్లయిమాక్స్ వుంటుంది. అది స్టోరీ క్లయిమాక్స్ కావొచ్చు, లేదా ప్లాట్ క్లయిమాక్స్ కావొచ్చు. ఎక్కువగా స్టోరీ క్లయిమాక్స్ తోనే వుంటాయి కథలు. ప్లాట్ క్లయిమాక్స్ కెళితే యాంటీ క్లయిమాక్సులు వస్తాయి కాబట్టి.  కె. బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ అలాటి ప్లాట్ క్లయిమాక్స్ వున్న కథ. ‘మరోచరిత్ర’ లో స్టోరీ క్లయిమాక్స్ - ప్రేమికులిద్దరూ ఏడాది ఎడబాటు తరవాత కుడా ఇంతే బలంగా ప్రేమల్ని కలిగి వుంటే అప్పుడు పెళ్లి చేస్తామన్న పెద్దల మాట ఆధారంగా పుడుతుంది. ఇది మొదటి మూలస్థంభం దగ్గర ఎస్టాబ్లిష్ అవుతుంది (ఎక్కడైనా స్టోరీ క్లయిమాక్స్- లేదా పాయింట్ అనేది ముందే ఎష్టాబిష్ చేసి కథ నడుపుతారు). కాబట్టి ఈ కథ ముగింపు ఊహించేదే.  ప్రేమికులు ఈ పరీక్ష నెనగ్గకుండా ఉంటారా- కాకపోతే ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటారో అన్న సస్పెన్సే కథని డ్రైవ్ చేస్తుంది.

          కానీ ఆ ప్రేమికులు పరీక్ష నెగ్గలేకపోతారు. కారణం- ఆ స్టోరీ క్లయిమాక్స్ ని క్యాన్సిల్ చేస్తూ ప్లాట్ క్లయిమాక్స్ ముందుకొచ్చేసింది. ఈ ప్లాట్ క్లయిమాక్స్ అంతసేపూ కథనం లోంచి పు ట్టింది. ఆ కథనం లో హీరో ఒకడికి, హీరోయిన్ మరొకడికీ శత్రువులయ్యారు- దీని పే - ఆఫ్ గానే  అలా శత్రువుల చేతిలో చనిపోయారు. ఇదీ ప్లాట్ క్లయిమాక్స్ అంటే.

          ఇలా కథలకి ఏదో ఒక క్లయిమాక్స్ మాత్రమే ఉంటుందని పైన అనుకున్నాం కదా? ఇప్పుడు ప్రస్తుత సినిమాలో రెండూ వున్నాయి- స్టోరీ క్లయిమాక్స్, ప్లాట్ క్లయిమాక్స్!

          26/11 కుట్ర దారుల్ని చంపదమన్నది స్టోరీ క్లయిమాక్స్. ఇది మిడిల్ ముగింపులో హరీజ్ సయీద్ ని చంపడంతో పూర్తయ్యింది. దీంతో కథ పూర్తయినట్టే. ఇంకో రెండు నిమిషాలు సమప్ చేసి ముగించేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ పొడిగించారు. ఎండ్ విభాగమంతా ప్లాట్ క్లయిమాక్స్ కి కేటాయించారు. హీరో విలన్లందర్నీ చంపేసినా, కథాక్రమంలో ఐఎస్సై అనే శత్రువుని వెంట తగిలించుకున్నాడు. కాబట్టి ఆ కథనం పూర్తి కాలేదు. ఆ కథనం తో ఎండ్ విభాగం మొదలవుతుంది. ఐఎస్సై ని తప్పించుకుని హీరో హీరోయిన్లు స్వదేశం ఎలా పారిపోయి వచ్చారనేది ప్లాట్ క్లయిమాక్స్ గా వుంటుంది. ‘మరో చరిత్ర’ విషయంలో అనుకున్నట్టే -ఏముందిలే ఎలాగో తప్పించుకొచ్చేస్తారు- అనుకుంటాం. కానీ ప్లాట్ క్లయిమాక్స్ ఎప్పుడూ యాంటీ క్లయిమాక్స్ కే దారి తీస్తుందని మరువకూడదు. ఇక్కడా ఇదే జరుగుతుంది.

          ఇందుకే ఈ సినిమా ముగింపు హృదయాల్ని బరువెక్కిస్తుంది. బహుశా ఇదే బరువు స్టోరీ క్లయిమాక్స్ కి కూడా పెడితే, అదీ ఇదీ కలిసి ప్రేక్షకులకి హెవీ అయిపోతాయని తలచారేమో తెలీదు. ఇందుకే హరీజ్ సయీద్ మరణానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేదేమో తెలీదు. ‘బొబ్బిలి పులి’ లో కూడా డాక్టర్ దాసరి నారాయణరావు, సినిమా  క్లయిమాక్స్ వరకూ  సీను కొక్క డైలాగు మాత్రమే తేలికగా ఉండేట్టు చూసి, ప్రధానమైన క్లయిమాక్స్ లో అవసరమైన హెవీ డైలాగులన్నీ పేల్చేశారు.

          మొత్తానికి  ‘ఫాంటమ్’ అనే  సెమీ- రియలిస్టిక్ కాల్పనిక చరిత్ర,  కథా కథనాలపరంగా పడుతూ లేస్తూ ఇలా బాక్సాఫీసు గట్టెక్క గల్గిందెలాగో!


సికిందర్

         

         

         
         





.