రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

877 :


          చివరికి సినిమాలు సేఫ్ అవడానికి ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా కూడా లాభించడంలేదు. డియర్ కామ్రేడ్ తో మొదలైన ఫ్లాపుల పరంపర ఈ ఫార్ములాకి గండి కొడుతోంది. డియర్ కామ్రేడ్ తర్వాత స్టార్ సినిమాలు 5 విడుదలయ్యాయి - మన్మథుడు -2, రణరంగం, సాహో, గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్. వీటిలో మొదటి నాల్గూ వరసగా ఫ్లాపయ్యాయి. గద్దలకొండ గణేష్ బ్రేక్ ఈవెన్ సమస్యలో పడింది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కి ముందు ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టయ్యింది. మరి అలాటిదే మాస్ యాక్షన్ సినిమా గద్దలకొండ గణేష్ కి సమస్య ఎదురయ్యింది. ఓవర్సీస్ లో ఫ్లాప్ అనుకుని ఆశ వదులుకున్నారు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో గద్దలకొండ గణేష్ కంటే, నగర బ్యాక్ డ్రాప్ లో ఇస్మార్ట్ శంకర్ ఎక్కువ యూత్ ఫుల్ గా వుంది.

         
దిహేనేళ్ళ క్రితం ఈ ఫార్ములా మొదలయ్యింది... ‘అత్యధిక థియేటర్లు –వారాంతపు రోజులు’ అన్న ఫార్ములా. అప్పట్లో ప్రింట్లు, ఇప్పడు డిజిటల్. అప్పట్లోనే నాల్గు వారాలు, యాభైరోజులు, వందరోజులు, మూడు రకాల జూబ్లీలూ వగైరా ఆడే రోజులు పోయి చాలా కాలమైంది. కనీసం ఒక వారం మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. అందుకని వీలైనన్ని ఎక్కువ  ప్రింట్లతో - థియేటర్లతో – శుక్ర శని ఆదివారం వారాంతపు మూడు రోజుల్లో విడుదల చేసి వీలయినంత వసూళ్లు లాగెయ్యాలన్న ఫార్ములా మొదలయ్యింది. ఇది సక్సెస్ అవుతూ వచ్చింది కూడా సినిమాల క్వాలిటీ ఎలా వున్నా. ఇప్పుడు చూస్తే ఈ మూడు గోల్డెన్ రోజుల మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. మొదటి రోజే ఎండుటాకులా టపటప రాలిపోతున్నాయి. ఒకవేళ వారాంతం ఆశాజనకంగా వున్నా, సోమవారం నుంచి గుండెల్లో గుబులు మొదలవుతోంది. పై 5 సినిమాలూ ఈ సోమవారం సిండ్రోం బాధిత సినిమాలే. అంటే స్టార్ సినిమాల క్వాలిటీ ఎలాగూ పెరగదు కాబట్టి ఇక బడ్జెట్లు సగానికి సగం తగ్గించుకోవడమే సేఫ్ అవడానికి మార్గం.

      తె
లుగు రాష్ట్రాల కంటే హిందీ రాష్ట్రాల మాస్ జనం ఎక్కువ. అయినా అక్కడ హిందీ సినిమాలు పాత మూస మాస్ ఫార్ములా ధోరణికి స్వస్తి చెప్పాయి. సగటు ప్రేక్షకులు సహా ఓవర్సీస్ ప్రేక్షకులవి కూడా నేలబారు అభిరుచులే అని చీప్ గా ట్రీట్ చేస్తూ, ఇంకా పాత మూస మాస్ ఫార్ములా స్టార్ సినిమాలు తీయడం తెలుగులోనే చెల్లింది. కానీ నెట్ యుగపు ప్రేక్షకుల అరచేతిలో కొత్త ప్రపంచాలు ఆవిష్కృత మవుతున్నాయి. ఇది గమనించే హిందీలో మాస్ ప్రేక్షకుల్ని క్లాస్ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ విభిన్న స్టార్ సినిమాలు తీస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. నూరు కోట్ల క్లబ్ లో హిందీ సినిమాలు చేరుతున్నాయంటే క్లాస్ క్లబ్ లో మాస్ ప్రేక్షకులు చేరకపోతే సాధ్యం కాదు. తెలుగులో మాస్ వర్గాల్ని క్లాస్ క్లబ్ లోకి చేర్చుకోవడానికి మేకర్లు ససేమిరా అంటున్నారు కల్లెక్షన్లు మొరాయిస్తున్నా. తెలుగు మేకర్ల దృష్టిలో ప్రేక్షకులు ఇంకా మేకలు.

         
సెప్టెంబర్ వరకూ హిందీ బాక్సాఫీసు పనితనం మెరుగ్గా వుంది. 9 సూపర్ హిట్లు, 4 హిట్లు, 4 ప్లస్ లు, 22 ఫ్లాపులు. హిందీలో సూపర్ హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపుపై ఇంకో 50 శాతం అదనంగా వసూళ్లు సాధించడం. డ్రీం గర్ల్ (114.20 కోట్లు), మిషన్ మంగళ్ (200.16), ఆర్టికల్ -15 (65. 05), కబీర్ సింగ్ (278.24), ది తాష్కెంట్ ఫైల్స్ (16.75), బద్లా (88.02), లుకా చుప్పీ (95.14), గల్లీ బాయ్ (139.98), యురీ – ది సర్జికల్ స్ట్రైక్ (244.06) సూపర్ హిట్లుగా నమోదయ్యాయి. వందకోట్లతో తీసి రెండొందల యాభై కోట్లు గడిస్తే సూపర్ హిట్టే, ఐదు కోట్లతో తీసి పన్నెండున్నర కోట్లు గడించినా సూపర్ హిట్టే. ఈ రెండో దానితో పోల్చుకుంటే వందకోట్లతో తీసి రెండొందల కోట్లు గడిస్తే హిట్టే, సూపర్ హిట్ కాదు. పన్నెండున్నర కోట్లు గడించిన 5 కోట్ల సినిమానే సూపర్ హిట్.

         
హిట్ అంటే బడ్జెట్ కి రెట్టింపు రావడం. తెలుగులో బడ్జెట్ మీద పదిశాతం వచ్చినా హిట్టే హిట్టూ అంటూ గంతులు. హిందీలో ఛిచోరే (136.00 కోట్లు), సాహో (148.00), బాట్లా హౌస్ (97.18), కేసరి (153.00) హిట్లుగా నమోదయ్యాయి. ప్లస్ అంటే బడ్జెట్ సేఫ్ అయి కొద్ది శాతం అదనంగా గడించడం. సూపర్-30 (146.10 కోట్లు), భారత్ (209.36), దేదే ప్యార్ దే (102.40), టోటల్ ఢమాల్ (154.10) ఈ కేటగిరిలో వున్నాయి. ఇక ప్లాప్ అంటే, బడ్జెట్ లో 50 శాతానికి పైగా కోల్పోవడం. జబరియా జోడీ, ఖాందానీ షఫాఖానా,అర్జున్ పాటియాలా, జడ్జ్ మెంటల్ హైక్యా, గేమ్ ఓవర్, ఖామోషీ, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, పిఎం నరేంద్రమోడీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, థాకరే, బ్లాంక్, సెట్టర్స్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2, జంగ్లీ, నోట్ బుక్, సంచరియా, వై చీట్ ఇండియా- ఇవన్నీ స్టార్లు లేని లో- మీడియం బడ్జెట్ ఫ్లాపులు. స్టార్స్ తో పెద్ద బడ్జెట్ ఫ్లాపులు నాల్గున్నాయి : కళంక్, మణికర్ణిక, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లాగా, రాబర్ట్ అక్బర్ వాల్టర్.  ఈ మొత్తం అన్ని కేటగిరీల్లో కళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 తప్ప ఇంకేవీ పాత మూస ఫార్ములాలు కావు.

            
స్టోరీ అయిడియాలు, సినాప్సిస్ లు వాట్సాప్ లో పంపవద్దని మనవి. ఈ మెయిల్ చేస్తే బావుంటుంది. ఈ బ్లాగులో ఇంత రాస్తున్నా ఇంకా పాత మూస ఫార్ములా కథలు పంపే మహనీయులున్నారు. కనీసం తెలుగు సినిమాల ట్రెండ్ ఏమిటో మార్కెట్ వైపు తమ విలువైన, అరుదైన చూపు సారించి- బద్ధకం వదిలించుకుని, సినిమాలు చూడకపోయినా కనీసం రివ్యూలైనా చదివి, ఏ సినిమా ఏమిటో లోకజ్ఞానం పెంచుకుంటే మంచిదని మరోసారి మనవి. అలాటి కథలు చెత్త బుట్టలో పారేసి ఇంటికెళ్ళిపోవడం మంచిది. జీవించడానికి అనేక వృత్తులున్నాయి.

సికిందర్                                                                                                               

9, జులై 2020, గురువారం

955 : రివ్యూ


‘ఘూమ్ కేతు’
రచన - దర్శకత్వం : పుష్పేంద్ర నాథ్ మిశ్రా
తారాగణం: నవాజుద్దీన్ సిద్దిఖీ, రాగిణీ ఖన్నా, అనురాగ్ కశ్యప్, రఘువీర్ యాదవ్, ఇళా అరుణ్ తదితరులు
సంగీతం : స్నేహా ఖన్వాల్కర్. ఛాయాగ్రహణం : సత్య రాయ్ నాగ్ పల్
నిర్మాత : అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్
***
      నురాగ్ కశ్యప్ లాంటి టాప్ దర్శకుడు నిర్మించిన సినిమా ఆరేళ్ళూ విడుదలకి నోచుకోక పోవడం వింతే. ఆరేళ్ళ నాడే ఇలా పురాతన కాలపు సినిమాలా తీసి కామెడీకి శ్రద్ధాంజలి ఘటిస్తే అది సినిమాకీ శ్రద్ధాంజలి ఘటించడమే అయింది. డిస్ట్రిబ్యూటర్లు కరోనా డెత్ అనుకుని పారిపోవడమే అయింది. ఇప్పుడు ‘జీ5’ ముందుకు వచ్చి స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న యాడ్ ఫిలిం మేకర్, టీవీ డైరెక్టర్ పుష్పేంద్ర నాథ్ మిశ్రా దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ కొచ్చాడు. ప్రస్తుతం ఈయన తీస్తున్న ‘తాజ్ మహల్ 1989’ అనే రిలేషన్ షిప్స్ తో కూడిన కథతో వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అవుతోంది.

       
వాజుద్దీన్ సిద్దిఖీ, అనురాగ్ కశ్యప్ లతో బాటు అతిధి పాత్రల్లో అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షీ సిన్హా, చిత్రాంగద సింగ్, దర్శకుడు నిఖిల్ అద్వానీ లతో ఇంత స్టార్ ఎట్రాక్షన్ వున్నా, ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదంటే దీని కామెడీ వ్యవహారం ఏ స్థాయిలో వుందో అర్ధం జేసుకోవచ్చు. ఉన్న గంటా 40 నిమిషాల నిడివికి కూడా నిలబడని కామెడీ పేరుతో ఏదో కథ!

కథ
     ఘూమ్ కేతు (నవాజుద్దీన్) తాజాగా జానకీ దేవి (రాగిణీ ఖన్నా) ని పెళ్లి చేసుకుని ఉత్తరప్రదేశ్ లో వుంటాడు. మనసు బాలీవుడ్ వైపు లాగుతూంటుంది. కిరాణా షాపు నడిపే తండ్రి దద్దూ (రఘువీర్ యాదవ్) నీకు సినిమా లేంట్రా అని చెడా మాడా తిడుతూంటాడు. తను బాలీవుడ్ రైటర్ అవ్వాల్సిందే నని పట్టుబట్టి కూర్చుంటాడు ఘూమ్ కేతు. కిరాణా లెక్కలు రాసినంత మాత్రాన, నీ పెళ్లి పత్రికల మీద పేర్లు రాసినంత మాత్రానా బాలీవుడ్ రైటర్ అయిపోతా వట్రా అని ధూంధాం చేస్తాడు పరమ కోపిష్టి దద్దూ. ఘూమ్ కేతుకి మేనత్త (ఇళా అరుణ్) సపోర్టు బాగా వుంటుంది. తల్లిలేదు, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఇంకో పెళ్లి కాని  పెదనాన్న వుంటాడు. ఘూమ్ కేతు ఇలా కాదని ఒక ‘గిలిగింతలు’ అనే హాస్య పత్రికలో చేరడానికి పోతాడు. ఆ ఎడిటర్, నువ్వు పత్రికల్లో రాయడానికి పనికిరావని- సినిమా రైటర్ గా పని కొస్తావని- తను రాసిన ‘30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవడమెలా?’ అన్న బుక్ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. 

       ఆ బుక్ పట్టుకుని ముంబాయి పారిపోతాడు ఘూమ్ కేతు. పెళ్ళయిన పదిరోజుల్లో పారిపోవడం చూసి దద్దూ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. వాడి  ఫోటో ఇమ్మంటే ఫ్యామిలీ ఫోటో ఆల్బం తీసుకుని పారిపోయాడంటాడు. ఫోటో లేకుండా పోలీసులు ముంబాయి పోలీసులకి సమాచారం అందిస్తారు. ఫోటో లేని మిస్సింగ్ కేసు ఇన్స్ పెక్టర్ దద్లానీ (అనురాగ్ కశ్యప్) ముందుకొస్తుంది. 30 రోజుల్లో ఈ కేసు సాల్వ్ చేయకపోతే, మంచి నీళ్ళు కూడా పుట్టని చోట ట్రాన్స్ ఫర్ అయిపోతావని పై అధికారి నుంచి వార్నింగ్ వస్తుంది. 

        పోలీసులకి ఫోటో దొరక్కుండా ఇన్స్ పెక్టర్ దద్లానీ పై పోర్షన్లోనే మకాం వేసిన  ఘూమ్ కేతు జోరుగా మూడు స్క్రిప్టులు రాస్తూంటాడు. షారుఖ్ ఖాన్ ని టార్గెట్ గా  పెట్టుకుంటాడు. ఓ దొంగ ఆ స్క్రిప్టులు ఎత్తుకుపోవడంతో పోలీస్ స్టేషన్ కెళ్ళి ఇన్స్ పెక్టర్ దద్లానీకే కంప్లెయింట్ ఇస్తాడు. ఇప్పుడేం జరిగింది? దద్లానీ ఘూమ్ కేతుని పట్టుకున్నాడా? ఘూమ్ కేతు బాలీవుడ్ రైటర్ అయ్యాడా? ఇద్దరిలో ఎవరి ఆశయం నెరవేరింది? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు 
      1970 మోడల్ గెటప్ తో, డ్రెస్సులతో నవాజుద్దీన్ అవుట్ డేటెడ్ గా వుంటే కామెడీగా వుంటుందనుకున్నట్టుంది. ఇది బెడిసి కొట్టింది. నవ్వుకాదు కదా నీరసం వచ్చేస్తుంది. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటి ఫ్యాషన్ తో రంగు రంగుల డ్రెస్సు లేసుకుంటే మాంచి కిక్ తో నవ్వొచ్చే సందర్భం. నవాజుద్దీన్ ఘూమ్ కేతు పాత్ర కూడా కాలం చెల్లిన పురాతన సినిమా పాత్ర. ఇలా కూడా నటించడానికీ, ఏదో నవ్వించడా నికీ తగిన స్పేస్ కూడా లేదు. అతడి స్పేస్ ని ఇతర పురాతన పాత్రలు మింగేస్తూంటాయి. బాలీవుడ్ లో రైటర్ గా ఎపిసోడ్స్ కూడా పెద్దగా ఏమీ వుండవు. మధ్యలోనే అతను విరమించుకుని వెనక్కి రావడంతో, మొదట్లో ఆసక్తి రేకెత్తించిన రైటర్ పాత్ర ముగిసిపోయి తేలిపోతాడు. నవాజుద్దీన్ ఈ సినిమా చేయడం బ్యాడ్ జడ్జిమెంట్. 

        ఇన్స్ పెక్టర్ గా అనురాగ్ కశ్యప్ ఇంకో బలహీన కామెడీ పాత్ర. ఇందులో తనుకూడా చేయగల్గిందేమీ లేదు. వూళ్ళో ఘూమ్ కేతు ఇంటిదగ్గర పాత్రలన్నీ ఓవరాక్షన్ కామెడీ. వీళ్ళంతా సినిమాకి చేయాల్సిన హాని అంతా చేసేస్తారు. అతిధి పాత్రల్లో కన్పించే అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా తదితరులు వాళ్ళ వాళ్ళ సినిమా షూటింగుల్లో సంక్షిప్తంగా కన్పిస్తారు. సంక్షిప్తంగా కన్పించినా, చివర్లో అమితాబ్ పాత్ర కథని మలుపు తిప్పే పాత్ర. ఈ అవుట్ డేటెడ్ సినిమాకి అమితాబ్ వల్ల చివరి పది నిమిషాలే కాస్త హుషారు పుడుతుంది.  

        సాంకేతికంగా యాడ్ ఫిలిం మేకర్ గా కొన్ని క్రియేటివిటీలు చూపించాడు దర్శకుడు. అట్టహాసంగా సెట్ వేసి సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ చేయడం, నవాజుద్దీన్ వూహించుకుని రాస్తున్న మూడు కథల్ని విజువలైజ్ చేసి చూపించడం మొదలైనవి. 16 ఎంఎం బ్లాక్ అండ్ వైట్ లో చార్లీ చాప్లిన్ టైపు మూకీ సీన్లు వేసి వ్యంగ్యం చేయాలనుకున్న క్రియేటివ్ ప్రయత్నం కూడా రాణించలేదు. ఇవి పాత కాలం ప్రేక్షకులకి తప్ప నేటి యువ ప్రేక్షకులకి ఎక్కవు. ఇక సంగీతం, ఛాయాగ్రహణం పేలవంగానే వున్నాయి. నిర్మాణ విలువలకి స్థానం లేదు. తక్కువ బడ్జెట్ లో లాగించేశారు.  

కథాకథనాలు 
     2007 లో కమెడియన్ వినయ్ పాఠక్, రజత్ కపూర్ లతో వచ్చిన సూపర్ హిట్ ‘భేజా ఫ్రై’ తో పోలిస్తే ‘ఘూమ్ కేతు’ కథ ఓ కామెడీ కథే కాదు. ‘భేజా ఫ్రై’ లో వినయ్ పాఠక్ బాలీవుడ్ సింగర్ నవ్వాలని పల్లెటూరు నుంచి వచ్చి, ఆడియో కంపెనీ బాస్ రజత్ కపూర్ ఇంట్లో తిష్టవేసి, తన సంగీత రాగాలతో బుర్ర తినేస్తాడు. చాలా అమాయక క్యారక్టర్. తనేం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఆడియో బాస్ కీ, అతడి భార్యకీ తంపులు పెట్టి కాపురం గుల్ల చేస్తాడు. ఇదొక విజయవంతమైన న్యూ ఏజ్ కామెడీ. ‘ఘూమ్ కేతు’ లో నవాజుద్దీన్ కి బాలీవుడ్ లో రైటర్ అయ్యే ప్రయత్నాలతో తగిన సీన్లే వుండవు. ఈ సీన్ల మధ్య వూళ్ళో వున్న ఓల్డ్ ఫ్యామిలీ గొడవల కామెడీలు మాటి మాటికీ వస్తూంటాయి. ఇవే ఎక్కువ భాగం ఆక్రమిస్తూ కథకి అడ్డు పడుతూంటాయి.

        పైగా దర్శకుడు ‘ఫోర్త్ వాల్’ టెక్నిక్ ప్రదర్శించడం ఒకటి. అంటే పాత్ర ప్రేక్షకుల వైపు చూస్తూ కథని, పాత్రల్ని వివరించడం. ఇది ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ లో అక్షయ్ ఖన్నా మీద బాగా వర్కౌట్ అయింది. ‘ఘూమ్ కేతు’ లో ఫ్యామిలీ గొడవల్ని చూపించడానికే ఈ టెక్నిక్ ని సాకుగా వాడుకున్నాడు దర్శకుడు. రైటర్ నవ్వాలని ముంబాయి వెళ్ళిపోయిన నవాజుద్దీన్ ఆ ప్రయత్నాలేవో చేసుకోకుండా, ఎప్పుడు చూసినా ఇంకా ఎక్కడో వూళ్ళో వదిలేసి వచ్చిన ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటూ -  మా నాన్న ఇలా చేశాడు, పిన్ని ఇలా చేసింది, మేనత్త ఇలా చేసింది, కొత్త భార్యతో ఇలా జరిగిందీ అని ప్రేక్షకులకి చెబుతూ పిచ్చి కామెడీ సీన్లేసు కోవడమేమిటో? ఈ కథ ఫ్యామిలీ గొడవల గురించా, బాలీవుడ్ ప్రయత్నాల గురించా?

        స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్, స్ట్రక్చర్ సంబంధ సూత్రాలూ పట్టించుకోక పోవడం వల్ల ‘ఘూమ్ కేతు’ అయినా, ‘సూఫీయం సుజాతాయుమ్’ అయినా కథేమిటో అర్ధంగాని దయనీయ స్థితిలో పడి అట్టర్ ఫ్లాపయ్యాయి. నవాజుద్దీన్ 30 రోజుల్లో బాలీవుడ్ రైటర్ అవ్వాలి, అనురాగ్ కశ్యప్ 30 రోజుల్లో నవాజుద్దీన్ ని పట్టుకోవాలి. ఇదీ కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే నవాజుద్దీన్ రైటర్ అయ్యే ప్రయత్నాలు మానుకుని ఊరికెళ్ళి పోతాడు. ‘సూఫీయం సుజాతాయుమ్’ లో కూడా కాన్ఫ్లిక్ట్ ఏర్పడగానే పాత్రలు  దేని దారి అది చూసుకుంటాయి. ఇవి కథలెలా అవుతాయి? వీటినెవరు చూస్తారు?

        నవాజుద్దీన్ స్క్రిప్టు పోగొట్టుకున్నాక వూళ్ళో వున్న ఫ్యామిలీ గుర్తుకొచ్చి, ఆ సెంటి మెంట్లు గొప్పగా అన్పించి ముంబాయి వదిలి ఇంటికెళ్ళి పోతాడు. అసలు ఈ పాత్రే రైటర్ పాత్రగా నమ్మశక్యంగా వుండదు. జీవితంలో ఏమీ రాయని వాడు బాలీవుడ్ రైటర్ అవ్వా లనుకోవడం ఆషామాషీగా తీసుకున్నట్టుంది దర్శకుడు. అతను రాసే కథలు కూడా ‘సవతి తల్లి’ అనీ, ‘బాత్రూం లో హత్య’ అనీ ఇలాటి చిల్లర వేషాలు.  

        నవాజుద్దీన్ స్క్రిప్టు రాసుకుంటూ ఒక చోట అనుకుంటాడు - ‘కామెడీ రాయడం సీరియస్ బిజినెస్, ప్రేక్షకులు కూడా నవ్వాలి కదా’ అని. దర్శకుడు మాత్రం దీన్ని సీరియస్ బిజినెస్ గా తీసుకోక ‘సి గ్రేడ్’ కామెడీగా చేసి వదిలాడు.

సికిందర్
(తెలుగురాజ్యం డాట్ కాం)


18, నవంబర్ 2020, బుధవారం

999 : స్క్రీన్ ప్లే సంగతులు

 


  యోపిక్స్ ట్రెండ్ తగ్గు ముఖం పడుతున్న వేళ ఒక ఆటో బయోగ్రఫీ రివ్యూ కొచ్చింది. దీని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కావాలని అడిగిన ఒక పదుగురి కోరిక మేరకు సవివరంగా రాయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు సమయం తీసి రాయడం వల్ల ఆలస్యమైంది. 3,542  పదాలతో పూర్తి చేసే సరికి ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియలేదు. ఇది 16 పేజీలు వస్తుంది. కనుక చదవబోయే ముందు నిడివి గురించి ముందే ఈ హెచ్చరిక. తెలుగులో మంచి ఫాలోయింగున్నతమిళ స్టార్ సూర్య ఈ ఆటో బయోగ్రఫీకి కథానాయకుడు. దేశంలో సామాన్యులకి చౌకలో ఏర్ డెక్కన్ విమాన యానాన్ని ఆవిష్కరించిన కెప్టెన్ జీఆర్ అయ్యంగార్ గోపీనాథ్ రాసుకున్న ఆత్మ కథతో  సూరరై పొట్రు (ధీరుడికి వందనం) గా, వెంకటేష్ తో గురు ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర రూపకల్పన చేసింది. ఇదింకా మలయాళ కన్నడలతో బాటు, తెలుగులో ఆకాశమే నీ హద్దురా అని సెల్ఫిష్ టైటిల్ తో విడుదలైంది. మీడియా ప్రశంసలు విశేషంగా అందుకుంది. సెల్ఫిష్ టైటిల్ అనడమెందుకంటే, సామాన్యులకి చౌకలో విమాన సౌకర్యం కల్పించే కల తన స్వార్ధం కాదని, ప్రజా ప్రయోజనం కోసమేననీ సినిమాలో సూర్య అంటాడు. అలాంటప్పుడు టైటిల్ ఆకాశమే మీ హద్దురా అని కస్టమర్ ఓరియెంటెడ్ గా వుండాలేమో.

        సూర్య కాబట్టి ఇది మరో తమిళ మాస్ మసాలాగా తయారై నట్టుంది. తన మాస్ ఫ్యాన్స్ ని సంతోష పెట్టే వూర మాస్ సినిమా. లేదా ద్రవిడ క్యాస్ట్ పొలిటిక్సు కావొచ్చు. బ్రాహ్మణ కెప్టెన్ గోపీనాథ్ ని అణగారిన వర్గాల మాస్ క్యారక్టర్ గా మార్చి, భార్య పాత్రని కూడా మాసమ్మాయిగా మార్చి, విలన్ గా బ్రాహ్మణ గోస్వామి పాత్రని సృష్టించారు. బ్రాహ్మణుల మీద విజయంగా ముగించారు. ఆటో బయోగ్రఫీని తిరగేసి రాసి, క్యాస్ట్ ఫీలింగ్ ని ఆకాశమే నీ హద్దురా చేశారు. ఈ సినిమాకి కులం రంగులు పులమడం అవసరమా అన్పించేట్టు చేశారు. 

        దర్శకురాలు సుధ గురు తోనే తన స్కూల్ ని స్పష్టం చేసింది. అదే స్కూల్లో ఇప్పుడు సూర్యతో వూర మాస్ గా తీసింది- కార్పొరేట్ కథనాన్ని పక్కన పెట్టేసి. ఐతే స్పోర్ట్స్ కథ గురు ని  స్పోర్ట్స్ జానర్లోనే తీసినట్టు, ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూర్ కథని కూడా అదే స్పోర్ట్స్ జానర్లో ఈజీగా తీసేయడంతో సమస్య వచ్చింది. ఎంటర్ ప్రెన్యూర్ లేదా బిజినెస్ జానర్ మూవీస్ వున్నాయిగా - ముఖ్యంగా ఏవియేషన్ బిజినెస్ తో రియల్ స్టోరీ ది ఏవియేటర్’, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ బిజినెస్ తో ఇంకో రియల్ స్టోరీ ది ఫౌండర్ వంటివి ఎన్నో పకడ్బందీగా, భావి ఎంటర్ ప్రెన్యూర్స్ కి కూడా పనికొచ్చేలా వున్నాయిగా. కెప్టెన్ గోపీనాథ్ ఒక వినూత్న బిజినెస్ మోడల్ తో విజయం సాధిస్తే, దాంతో బాక్సాఫీసు మోడల్ ని సక్రమంగా ప్రెజెంట్ చేయాలిగా. అసలు బయో పిక్కులకైనా, ఆటో బయోగ్రఫీల కైనా కథకి ఏది పాయింటుగా వుంటుంది, ఏది మార్కెట్ యాస్పెక్ట్ తో చెప్పాల్సిన కథవుతుంది? ఇలాకాక మొన్న అమెరికాలో ఇండియన్ టీ అంటూ వచ్చిన మరో మిస్ ఇండియా లా మిక్చర్ పొట్లంలా తీసేయడమేనా? ఇలా జరిగిన అనేక తప్పిదాల్నితర్వాత విశ్లేషించు కుందాం. 

ముందుగా కథ

         తమిళనాడు మధురై దగ్గర్లో సోలవందన్ లో వుంటాడు నెడుమారన్ రాజంగం అలియాస్ మారా (సూర్య). అతను ఒకప్పుడు ఏర్ ఫోర్స్ లో కెప్టెన్. సామాన్యులకి విమానం కల నిజం చేయాలన్న ఆశయంతో ఇప్పుడు దాని మీద వుంటాడు. టీచరైన తండ్రితో పడదు. మధ్యలో తల్లి (ఊర్వశి) కి హైరానా. ఒక బేకరీ నడిపే అమ్మాయి సుందరి (అపర్ణా బాలమురళి) ని ప్రేమిస్తాడు. ఆమె ఆకాశంలో కలలుగనే అతణ్ణి దూరం పెడుతుంది. మారా కలకి జాజ్ ఏర్ లైన్స్ అధినేత పరేష్ గోస్వామి (పరేష్ రావల్) స్ఫూర్తి. మధ్యతరగతి వాడైన గోస్వామి ఏర్ వేస్ లో టాప్ కి ఎదగడం ప్రేరణ. దాంతో ఆయన్ని కలిసి తన చీప్ ఏర్ వేస్ ప్లాను గురించి చెప్పి భాగస్వామ్యం కోరతాడు. గోస్వామి హేళన చేసి పంపిస్తాడు. దాంతో మారా పట్టుదలకి పోతాడు. అప్పులు చేసి, క్రౌడ్ ఫండింగ్ చేసుకుని అతను విమానాన్ని ఎగరేసినప్పుడల్లా గోస్వామి భూ మార్గం పట్టిస్తూంటాడు. ఒకటి రెండు సార్లు కాదు, చాలా సార్లు. ఇలా ఈ పోరాటంలో మారా చివరికి తన కలని నిజం చేసుకుంటూ, సామాన్య ప్రయాణీకులతో విజయవంతంగా విమానాన్ని ఎలా ఎగరేశాడన్నది మిగతా కథ.  

సూర్య మాస్ అవతారం 

         వూళ్ళో ఇరుకు బస్తీలో మాస్ యువకుడి పాత్రలో సూర్య తమిళ అభిమానుల హృదయాలకి మునుపెన్నడూ లేనంతగా దగ్గరైనట్టు కనిపిస్తాడు. శవ యాత్రలో విరగబడి మసాలా డాన్స్ చేస్తాడు. నవ్వించడు, పైగా ఏడ్పిస్తాడు. భావోద్రేకాల్ని రెచ్చగొడతాడు. క్యాస్టిజం గురించి మాట్లాడతాడు. నేను సోషలిస్టుని, నువ్వు సోషలైట్ వి అంటాడు. ఏం జరిగినా అగ్రవర్ణ అణిచివేతగా ఫీలవుతాడు. మొత్తంగా సామాజిక వర్గ కోణంలో లక్ష్యిత ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. లక్ష్యం కోసం తన పోరాటంలో ఈ వర్గ ప్రజలే తన బలమని సమీకరిస్తాడు. ఇదేమన్నా విప్లవ సినిమానా? బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ లో వుంటుంది. రెబలిజమంటే సమాంతర వ్యవస్థని ఆహ్వానించడమే. సమాంతర వ్యవస్థలో స్మగ్లింగ్ వుంటుంది. స్మగ్లింగ్ చేసుకు బ్రతకాలి, ఆ వినియోగ దార్లు వేరు. దేశంలో మెయిన్ స్ట్రీమ్ లో దళిత కార్పొరేట్ అధిపతులు లేరనా?

        నేరుగా కార్పొరేట్ క్లబ్ కి చేర వేసే ఒక వినూత్న విమాన యాన బిజినెస్ మోడల్ ని ఆలోచించగల్గిన అడ్వాన్సుడు ఎంటర్ ప్రెన్యూర్ అయిన తను, ఈ మూస పోరాటాలూ కులం కార్డులూ, తన క్యాస్ట్ ని ఫీలయ్యే ఇన్ఫీ రియారిటీ కాంప్లెక్సులూ, రోషాలూ పక్కన పెట్టి, రెబెల్ పంథా నుంచి కాస్త మెయిన్ స్ట్రీమ్ లో కొచ్చి-  బిజినెస్ మైండ్ తో  హేమా హేమీలతో నెగెటివ్ గా రియాక్టవని మాస్టర్ నెగోషియేటర్ గా వ్యవహరించాలని ఆలోచించని, ఆవేశమే తప్ప ఆలోచన లేని, సగటు టెంప్లెట్ మాస్ పాత్రగా మిగిలి పోతాడు. బిజినెస్ జానర్ మూవీలో వింత పాత్రలా వుంటాడు. అసలొక తాజా మాజీ కెప్టెన్ లా అన్పించడు. డిఫెన్స్ దళాలకి కుల మతాలుండవని మర్చిపోయారేమో.

        గోస్వామిని అప్రోచ్ అయ్యే విధానం, మిస్ ఇండియా లో ఎంబీఏ చదివిన కీర్తీ సురేష్ పాత్ర, జగపతి బాబుని అప్రోచ్ అయి రొచ్చు చేసుకునే విధానంతో వంద మార్కుల సరి సమానం. ఎవరైనా ఎదుటి వ్యక్తికి పోటీ నిచ్చే ప్రతిపాదనతో అప్రోచ్ అవుతారా? ది ఫౌండర్ లో ఒకే రెస్టారెంట్ నడుపుతున్న మెక్ డొనాల్డ్ సోదరుల్ని, రే క్రాక్ ఎలా అప్రోచ్ అయ్యాడు? ఫ్రాంఛైజీలు ప్రారంభించి, మెక్ డొనాల్డ్స్ పురోభివృద్ధికి తోడ్పడతానన్నాడు. ఇవ్వాళ మన సమీపంలో కూడా మెక్ డొనాల్డ్స్ వుందంటే అది మెక్ డోనాల్డ్స్ సోదరులతో రే క్రాక్ నెరపిన డిప్లమసీ ఫలితమే. 

        మారా తనకి గోస్వామి స్ఫూర్తి అంటాడు. నువ్వు స్ఫూర్తి నిచ్చావు, నాకు అన్నం పెట్టు అన్న టైపులో తగువుకి దిగుతాడు. బ్రతుకు తెరువుకి స్ఫూర్తి నిచ్చిన వ్యక్తితో పోట్లాటకి దిగితే కాలం క్షమిస్తుందా? ఇదే తర్వాత జరిగింది. ఇలా ఇన్ని లోపాలతో వున్న మారా పాత్రతో ఫీలవాల్సింది హీరోయిజంగా ఏమీ అన్పించదు, దాని ప్రవర్తనలోంచి ఇలా మనం చేయకూడదని నేర్చుకోవాల్సిన మోరల్ లెసన్ కన్పిస్తుంది. ఎలా పడితే అలా తీయడానికి ఇది చిన్నా చితకా సినిమా కాదు, స్టార్ సినిమా. దీని రాత, తీత పై స్థాయిలో వుండక పోతే ఎలా? అందులోనూ ఆటో బయోగ్రఫీతో. అసలు కెప్టెన్ గోపీనాథ్ కి స్ఫూర్తి అమెరికాలో, యూరప్ లో రెండు ఏవియేషన్ కంపెనీలు. ఆ ఐడియాని ఇండియాలో స్వతంత్రంగా అమలు చేశాడు.    

***

        రోమాంటిక్ సైడ్ సూర్యకి అపర్ణాతో రోమాన్స్ ప్రాక్టికల్ గా, ఇన్స్పైరింగ్ గా ఏమీ వుండదు. ఆకాశంలో అతడి కల అసాధ్యమని అతణ్ణి దూరం పెట్టి, ఆమె తన బేకరీ షాపు  చూసుకుంటుంది. అతనప్పటికే వైమానిక దళ కెప్టెన్ గా విమానం నడిపాడని ఆలోచించదు. అతడికి కూడా తన కలతో ఒక విజన్ అంటూ లేదు. ముందు తన కుటుంబాన్నికలుపుకుని తన కలల్ని వూహించుకోని వాడు ఇతరుల కలల్ని ఏం నిజం చేస్తాడు. ఇరుకు జీవితాలు గడుపుతున్న తన పేరెంట్స్ తోబాటు, ప్రేమిస్తున్న అమ్మాయినీ బేకరీ వృత్తి వదిలించి - తన కలలతో ఉన్నత జీవితం అందించాలన్న తపన అతడికుండదు. వుంటే వాళ్ళని కాక్పిట్ లో కూర్చో బెట్టుకుని తను విమానం నడుపుతున్నట్టు కరువుదీరా డ్రీమ్ సాంగ్ వేసుకునే వాడు. దర్శకుడు శంకర్ అయితే ఇలాగే చేసి ప్రేక్షకుల కోరిక నంతా తీర్చేస్తాడు. విజువలైజేషన్ లేని కలలుంటాయా. అలాటి డ్రై కలలు నిజమవుతాయా, వాటిని నమ్మొచ్చా. ఏదో సాధించాలని కలలుంటే ఆటో మేటిగ్గా మైండ్ విజువలైజేషన్ కెళ్లిపోతుంది. ఈ ప్రకృతి ధర్మాన్ని పాత్ర కెలా నిరాకరిస్తారు. కొన్ని కలలు రోమాంటిక్ ఇంట్రెస్ట్ వల్ల కూడా నిజమవుతాయి. సినిమాకి రోమాంటిక్ ఇంట్రెస్ట్ తోడవని హీరో గోల్ ఏం బావుంటుంది. ఆమె కోసం నేను సాధిస్తాను- అనుకోక పోతే ఇంకెందుకు పాత్ర. ప్రణయ రసం లేని పాత్ర ప్రయాణం ఎడారిలో గుడారంతో సమానం. ఇసుక పిసుక్కోవడమే.

        ఇలా ఈ సినిమాలో క్లట్టర్ ఎక్కువుంది. ఫిల్టర్ చేస్తే అందులోంచే సరైన కథనం చేసుకోవడానికి ఆణిముత్యాలు దొరుకుతాయి. పెళ్లయాక విమానంలో కేటరింగ్ గురించి చర్చ వస్తుంది. వివిధ వూళ్ళలో  తన బంధువులు స్వగృహ టైపులో స్నాక్స్ వ్యాపారాలు చేస్తున్నారనీ, వాళ్ళు సప్లయి చేస్తారనీ అంటుంది. బాగానే వుంది విమానంతో కుటీర పరిశ్రమ. గల్లీ మాస్ ఆలోచన. అసలు గోపీనాథ్ ఎకానమీ బిజినెస్ మోడల్ లో విమానంలో ఫుడ్ సర్వింగ్ అనే అంశం లేనే లేదని మర్చిపోయారు. మారా అనే తను, మాస్ నుంచి క్లాస్ కి ఎదిగి, కంపెనీలో సుందరిని కూడా కార్పొరేట్  పోస్టుకి సిద్ధం చేయాలన్న ఎంటర్ ప్రెన్యూర్ ఆలోచనలుండవు. డైనమిక్స్ తో కథనం ఎక్కడికక్కడ రీఫ్రెష్ అవుతూ నెక్స్ట్ లెవెల్ కెళ్ళకుండా, ఎక్కడేసిన గొంగళిలా వుంటుంది.
***

       ప్రేమతో మొదలయ్యే వీళ్ళ ఇగోలతో సమస్య సంసారంలో కూడా కొనసాగుతుంది. ఈ ఇగోలతో కూడా బలమైన సన్నివేశాలు వుండవు గానీ, తండ్రి చావు బతుకుల్లో వున్నపుడు విమాన టికెట్ కొనలేక పడే యాతనతో కదిలించే బలమైన నటన ప్రదర్శిస్తాడు సూర్య. సందేహం లేదు, సూర్య ఈజ్ ది బెస్ట్. ఈ సీను టాప్. అయితే ఈ విషాదం కంటే, ఖర్మ కాలి అతను పై వర్గాల వాళ్ళనే తిరిగి దీనంగా టికెట్ డబ్బులు అడుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదాని గుణపాఠంలా అన్పిస్తుంది. ఎవ్వరూ కనికరించి డబ్బులివ్వరు. ఇలా ఏం డ్రామా క్రియేట్ చేస్తున్నారో గ్రహించకుండా, హీరోకే డ్యామేజింగ్ గా వుండే దృశ్యాల చిత్రీకరణ చేసేశారు. 

        ఇంటర్వెల్ సీను కూడా ఇలాటిదే. భారీ సీను క్రియేట్ చేస్తూ, స్ఫూర్తి ప్రదాత గోస్వామి మీద సిలిండర్ విసిరేస్తాడు. చివరికి ఇంత పోరాడుతూ యాక్షన్ తో కన్పిస్తున్న సూర్య పాత్ర యాక్టివ్ పాత్రనా? కాదు. రియాక్షనే చూపిస్తున్న పాసివ్ - రియాక్టివ్ పాత్ర. అందుకే కథ ఇలాటి దృశ్యాలే రిపీటవుతూ ముగిసింది. 

        మలయాళ నటి అపర్ణా బాల మురళి సరైన దృక్పథం లేని బేకరీ నడిపే మాస్ హీరోయిన్ గా, మాస్ విలువలకి తగ్గ న్యాయం చేసుకుంది. గోస్వామిగా పరేష్ రావల్ మాత్రం ఉండీ లేనట్టుండే ప్రతినాయక పాత్ర. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సూర్య విమానం ఎగరేసినప్పుడల్లా భూమార్గం పట్టించడానికి వచ్చి రెడీగా కన్పిస్తూంటాడు. క్లయిమాక్సులో కన్పించడం శుద్ధ అనవసరమనుకుంటాడు. 

        గోస్వామికి కూడా తెలివి వుండదు. మారా చెప్తున్న అయిడియా పనికొచ్చేదే. తను కాకపోతే ఇంకో అంతర్జాతీయ కంపెనీకి పోయి ఇండియాలో దింప వచ్చు మారా. అప్పుడేం చేస్తాడు. ఇదేదో తను క్యాష్ చేసుకుని తన ఏక ఛత్రాధిపత్యానికి విఘాతం కలక్కుండా చూసుకోకుండా? కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో లేని మారా - గోస్వామిల ఈ పోరాటాన్ని సినిమాలో కల్పించారు. 

        మారాని చూడగానే గోస్వామి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటాడు. ఇలా అంటరాని తనాన్ని కూడా ఈ కథలోకి తీసుకు రావడం! దీనికి మారా రియాక్షన్ ఏమీ వుండదు. గోస్వామి తనని చూసి అలా చేతులు తుడుచుకున్నాడంటే, మారా ఇక ఆ మీటింగ్ కి నీళ్లొదుకుని వెళ్లిపోవాలి. ఇలా కథని మార్చేసే అర్ధం లేని చిత్రణ లున్నాయి. 

        ఒక ఏర్ ఫోర్స్ కెప్టెన్ తో గోస్వామికి అంత లేకి తనమేమిటో అర్ధం గాదు. దేశంలో అందరూ కలిసి జీవించాల్సిందే. దేశం తప్ప ఇంకోటి లేదు జీవించడానికి. అసలు సినిమా ప్రారంభంలోనే బ్రాహ్మణ వ్యక్తి రైలులో బడుగు జనాల్ని చూసి అసహ్యించుకోవడం వుంది. ఇక్కడ్నించే సినిమాలో బ్రాహ్మణ - బడుగు బాహాబాహీకి అలవాటు పడేందుకు ప్రేక్షకులని సిద్ధం చేశారు. ఈ బ్రాహ్మణులకి శాస్తి చేయాల్సిందే అన్నట్టు మిగతా కథ నడిపారు. ఏమిటో ఇదంతా. 

        ఇక కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ నడిపిన విజయ్ మాల్యా రూపంలో వుండే విమల్ బాలయ్య పాత్రలో డాన్ ధనోవా వుంటాడు. ఏర్ డెక్కన్ చరిత్రలో ఈ కీలక పాత్రని ఆటో బయోగ్రఫీలోని క్రోనాలజీ పట్టించుకోకుండా మధ్యలో అసందర్భంగా ప్రవేశ పెట్టి ముగించారు. ఏర్ ఫోర్స్ అధికారిగా మోహన్ బాబు అతిధి పాత్ర కూడా కల్పితమే. 

        సాంకేతికాల కొచ్చేటప్పటికి ఏ స్టార్ సినిమా అయినా బాగానే వుంటుంది. ఇది కూడా అంతే. ఎగరేసినప్పుడల్లా ఒక్కో విమానం ప్రమాదానికి లోనయ్యే దృశ్యాలన్నీ ప్రొఫెషనల్ గా వున్నాయి. సంగీతమూ ప్రొఫెషనల్ గా వుంది. అన్నీ ప్రొఫెషనల్ గానే  వుంటాయి. సాంకేతికులు ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతూ ప్రొఫెషనల్స్ గా వుంటారు, లేకపోతే ప్రొఫెషన్ వుండదు. కథా కథనాల వాళ్ళే, పాత్ర చిత్రణల వాళ్ళే ప్రొఫెషనల్స్ గా వుండరు, అప్డేట్ అవరు. అవకపోయినా ప్రొఫెషన్ పదిలం.

ఎలావుంది కథ
       భారీగా కల్పితాలు చేసిన సినిమా అన్నాడు కర్ణాటకకి చెందిన కెప్టెన్ గోపీనాథ్. చాలా చోట్ల నవ్వానన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోతే ఎందుకు నవ్వాడో. పెద్ద మనసు చేసుకుని అభినందించాడు. రాష్ట్రీయ, జాతీయ మీడియాలు పోటీలు పడి మూడేసి నాల్గేసి స్టార్స్ ఇచ్చి కొనియాడేక, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్బ్ ఆటో బయోగ్రఫీయే, ఇంకో మాట లేదు. 

        అయితే  సింప్లీ ఫ్లై- ఏ డెక్కన్ ఒడెస్సీ పేర ఆటో బయోగ్రఫీ కూడా సమగ్రంగా వుండదు. ఇందులో ఏర్ డెక్కన్ ప్రారంభానికి ముందు బాల్యం నుంచీ గోపీనాథ్ జీవిత కథ వుంటుంది. గ్రామీణుడిగా, సైనికుడుగా, రైతుగా, వ్యాపారిగా, ఎంటర్ ప్రెన్యూర్ గా సగ భాగం వుంటుంది. రెండో సగం దేశంలో తొలి ఛార్టర్ హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభకుడుగా, తర్వాత ఏర్ డెక్కన్ తో తొలి లో -కాస్ట్ క్యారియర్ (ఎల్సీసీ) కంపెనీ వ్యవస్థాపకుడుగా వుంటుంది. 

        అయితే ఏర్ డెక్కన్ ఆపరేషన్స్ ఎలా వుండేవి, సామాన్య ప్రయాణీకుల స్పందన లేమిటి, విమానం కల తీరిన వాళ్ళ అనుభవాలేమిటి, దాచుకోదగ్గ అనుభూతులేమిటి, ఆనంద పారవశ్యాలేమిటి, కంపెనీ ప్రాభవమేమిటి, సిబ్బంది నియామకా లేమిటి, ఉపాధి పొందిన వాళ్ళ సంఖ్యేమిటి, కొనుగోలు చేసిన మరిన్ని విమానాల వివరాలేమిటి, చివరికి విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ తో విలీనానికి దారి తీసిన పరిస్థితులేమిటీ సమాచారం లేదు. సినిమాకి కావాల్సింది ఈ కథే. ఈ కథే లేక పోవడంతో సినిమాలో చూపించిందంతా కథకి పూర్వం వుండే కేవలం ఉపోద్ఘాతమని గుర్తించాల్సిన అవసరముంది.

        కెప్టెన్ గోపీనాథ్ ఏర్ డెక్కన్ ప్రారంభించుకోవడానికి చంద్రబాబు నాయుడు, ఎస్ ఎం కృష్ణ, వెంకయ్య నాయుడు వంటి అన్ని పార్టీల నాయకులూ, ప్రభుత్వాలూ సహాయపడ్డారు. ఇతర కంపెనీలతో గోపీనాథ్ ఎదుర్కొన్నది పోటీయే తప్ప, సినిమాలో చూపించినట్టు కుట్రల్ని కాదు. ఏం చేసినా ఆటో బయోగ్రఫీని మార్చి చేశామనుకుంటున్నది కథ కాదు. సినిమాలో కథే ప్రారంభం కాలేదు. కథకే రెక్కలు మొలవలేదు. 

స్క్రీన్ ప్లే సంగతులు

        ఏ బయోపిక్కైనా, ఆటో బయోగ్రఫీయైనా సినిమాకి ఒకే కాన్ఫ్లిక్ట్ తో వుంటుంది. ఒక నిజ వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి ఆ వ్యక్తి జీవితంలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యనే (కాన్ఫ్లిక్ట్) ప్రధానంగా చేసుకుని, సమస్య-సంఘర్షణ- పరిష్కారమనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ కిందికి తెస్తారు. అదే జానర్ బయోపిక్ అయినా సరే. 

        ఇక్కడ సౌలభ్యం కోసం బయోపిక్ అనే వాడదాం. బయోపిక్ స్క్రీన్ ప్లేకి ఎప్పుడో 1982 లో  గాంధీతీసిన సర్ రిచర్డ్ అటెన్ బరో ఒక మార్గం వేశాడు. ఇటీవల 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్వుండనే వుంది. ఇంకా చాలామంది తీసిన చాలా బయోపిక్ లు అర్ధవంతంగా వున్నాయి. బయోపిక్ అంటే మామూలు సినిమా కథలాగే ఆ వ్యక్తి పాత్ర, అది ఎదుర్కొనే సమస్య, కనుగొనే పరిష్కారం, చివర విజయమో అపజయమో, ఇంతే. ఇలా ఒక లైనులో చూసినప్పుడు సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే మజిలీల క్రమం వెండితెర మీద స్పష్టంగా తొణికిస లాడాలి.

        బయోపిక్ అంటే పుట్టిందగ్గర్నుంచీ గిట్టిందాకా ఆ వ్యక్తి జీవితాన్ని పూసగుచ్చినట్టు చూపించడం కాదు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన ఒకే ఒక్క మలుపు, లేదా ఒక లక్ష్యం కోసం ఆ వ్యక్తి ఎదుర్కొన్న సమస్య మాత్రమే సినిమాకి బయోపిక్ కథ అవుతుంది. మహాత్మా గాంధీ లక్ష్యం స్వాతంత్ర్య సముపార్జన. దీనికి ప్రేరణ 1) దక్షిణాఫ్రికా రైల్లో తనకి జరిగిన అవమానం, అప్పుడు 2) సహాయ నిరాకరణోద్యమం, 3) క్విట్ ఇండియా ఉద్యమం - స్వాతంత్ర్య సిద్ధి, 4) మతకల్లోలాలు -మరణం. ఇంతే, శాఖోపశాఖలుగా విస్తరించిన మహాత్ముడి జీవితంలో ఈ నాల్గే ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ గా తీసుకుని, అజరామరమైన చలన చిత్రరాజాన్ని ప్రపంచాని కందించాడు అటెన్ బరో. 

        అంతేగానీ మహాత్ముడు ఎలా సత్యనిష్టుడో చిన్నప్పటి సీన్లేద్దాం, కుటుంబం సీన్లేద్దాం, ఆ బిట్లు వేద్దాం, ఈ బిట్లు తెచ్చి వేద్దామని కలగాపులగం చేయలేదు. మహాత్ముడి వ్యక్తిగత జీవితమే చూపించాలంటేఆ పాయింటుతో అది వేరే బయోపిక్ అవుతుంది. గాంధీ మై ఫాదర్అనీ గాంధీ మీద కోపం వచ్చేలా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ గాంధీ కొడుకుతో తీయనే తీశాడు. 

            ఇలాగే స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథగానే తీశాడు. వెండితెర వున్నది స్పష్టమైన కథల కోసం తప్ప; గాథలతో, ఉపోద్ఘాతాలతో, డాక్యుమెంటరీలతో, న్యూస్ బులెటిన్ లతో, కచరా చేయడానికి కాదు. లింకన్తీసినప్పుడు స్పీల్ బెర్గ్ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం - అగ్నిపరీక్ష లాంటిది -13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దీనికోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. 

        ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే స్పీల్ బెర్గ్ పక్కన పడేశాడు. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగే నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు! అయినా దీని మీద కసరత్తు చేస్తే కుదరదన్పించింది. నాలుగు నెలలు కాక రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు!! ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలతో బయోపిక్ తీసి పెద్ద విజయం సాధించాడు.

         1970 లలో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ని నిండా ముంచిన వాటర్ గేట్ కుంభకోణాన్ని కూపీలాగి పుస్తకం రాశారు ఇద్దరు జర్నలిస్టులు. ఆల్ ది ప్రెసిడెంట్స్ మెన్అన్న పుస్తకం టైటిల్ తోనే గొప్ప సినిమా తీశారు. పుస్తకాన్ని స్క్రీన్ ప్లేగా మార్చే బాధ్యత హాలీవుడ్ లో ఆచార్యుడు లాంటి రైటర్ విలియం గోల్డ్ మాన్ తీసుకున్నాడు. అప్పటికే ఒక ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వుంది. పుస్తకంలోని రెండో భాగాన్నితీసి అవతల పడేసి, మొదటి భాగంతోనే స్క్రీన్ ప్లే అంతా రాశాడు. పుస్తకం రాసిన జర్నలిస్టులిద్దరు ఇదేమిటని గోలగోల చేశారు. ఒక జర్నలిస్టు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఇంకో స్క్రీన్ ప్లే కూడా రాశాడు. స్క్రీన్ రైటింగ్ అంటే జర్నలిజం కాదురా అన్నాడు గోల్డ్ మాన్. స్క్రీన్ మీద ప్రేక్షకులు జర్నలిజాన్ని చూడరన్నాడు. దీంతో బిగ్ స్టార్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్, దర్శకుడు అలన్ పకూలా కంగారు పడి గోల్డ్ మాన్ రాసిన స్క్రీన్ ప్లేని తీసుకుని నెలరోజులు అజ్ఞాతంలో కెళ్ళి పోయారు. దాంతో కుస్తీ పట్టారు. ఇలా కాదు, అలా వుండాలి...అలా కాదు, ఇలా చేద్దాం...రెండో భాగాన్ని ఇలా కలుపుదాం, కాదు అలా కలుపుదామని జుట్లు పీక్కుని పీక్కునీ ఏమీ చేయలేక పెద్దాయనే కరెక్ట్ అని, పెద్దాయన రాసిన శిలాశాసనాన్నే సినిమాగా తీశారు. అదెక్కడికో వెళ్ళిపోయి చరిత్ర కెక్కింది. ఎన్నో ఆస్కార్ అవార్డు లొచ్చి పడ్డాయి. ఆ స్టార్ కీ, దర్శకుడికీ కాక, పెద్దాయనకీ ఇంకోటి పడింది. అలా ఆల్ ది గోల్డ్ మాన్స్ మెన్ అన్పించుకున్నారన్న మాట.

***

            బిజినెస్ జానర్ బయోకిక్ కైనా ఇంతే. ది ఏవియేటర్, ది ఫౌండర్, జాయ్, వాల్ స్ట్రీట్, ది బ్యాంకర్ ఇలా ఎన్నో. ఓ సామాన్య వ్యక్తి బిజినెస్ కలల్ని నిజం చేసుకునే ఈ కథల్లో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో కథే వుంటుంది. అంటే ఆ బిజినెస్ ప్రారంభించాక ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య, దాని పరిష్కారం మొదలైనవి. ది ఫౌండర్ (2016) లో మెక్ డోనాల్డ్స్ సోదరుల్ని ఒప్పించి ఫ్రాంఛైజీలు ప్రారంభించిన రే క్రాక్, క్రమంగా టేకోవర్ కే పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని మెక్డొనాల్డ్స్ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది కథ. 

        ది ఏవియేటర్ (2004) చూద్దాం :  ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ దర్శకత్వంలో లియోనార్డో డీ కాప్రియో నటించిన ఈ బయోపిక్ లో, కథ క్లియర్ కట్ గా వుంటుంది. బిగినింగ్ విభాగంలో కాప్రియో వేగంతో  రికార్డుల్ని బ్రేక్ చేసే మోనో ప్లేన్ ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ లో నిర్మాణం పూర్తి చేస్తాడు. మిడిల్ లో ఓసిడి వ్యాధికి లోనవుతాడు. దాంతో బాధపడుతూనే విమాన వేగంలో ప్రపంచ రికార్డుల్ని బ్రేక్ చేస్తూ పోతాడు. ఒక ఏర్ ఫోర్స్ కాంట్రాక్టు లభిస్తుంది. ఇంకోసారి విమానం కూలిపోతుంది. ఈ ప్లాట్ పాయింట్ టూ లో, ఏర్ ఫోర్స్ తో అవినీతి ఆరోపణల కేసులో ఇరుక్కుంటాడు. ఎండ్ విభాగంలో ఇందులోంచి బయటపడి, విమానం ఎగరేసుకుంటూ హేపీగా పోతాడు. చాలా సింపుల్ - ఒక్క లైనులో కథేమిటో స్పష్టంగా కనపడుతూంటుంది తెరమీద. కథలా వుండే కథ. 

        బిగినింగ్ లో ఇది బాల్య జీవితంతోనే ప్రారంభమవుతుంది. బాల్యంలో సినిమా కలలతో వుంటాడు. సినిమాలు తీస్తున్నాక విమానాల మీద దృష్టి మళ్లించి ఆ దిశగా వెళ్ళిపోతాడు. ఈ ఉపోద్ఘాతమంతా స్ట్రక్చర్ అనుమతించే బిగినింగ్ విభాగం లోపే సర్దేసి వుంటుంది. ఇది సినిమా దర్శకుడు, ఏవియేషన్ మాగ్నెట్ అయిన - హోవర్డ్ హ్యూజెస్ జీవిత కథ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు లందుకున్న మెస్మరైజింగ్ బయోపిక్. బయోపిక్స్ కి గైడ్ బుక్.

***

         ఇప్పుడు ఏర్ డెక్కన్ బయోపిక్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రారంభంలో ఏర్ డెక్కన్ క్రాష్ లాండింగ్ దృశ్యం తర్వాత ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఏర్ ఫోర్స్ లో మారా జీవితం, వూళ్ళో సుందరితో ప్రేమ, పేరెంట్స్ తో పరిస్థితి, చౌక విమాన యానం కల, అందులో భాగంగా గోస్వామిని కలవడం. ఇక్కడ గోస్వామిని కలిసి ప్రపోజల్ పెట్టడం, తిరస్కారం పొందడం అన్నది ప్లాట్ పాయింట్ వన్ దృశ్యం. ఇది సముచితంగా 30 నిమిషాల కొస్తుంది. 

        ఇక మిడిల్ లో గోస్వామితో తిరస్కారం పొందిన మారా పట్ల, వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రకాష్ బాబు అనే అతను ఆసక్తి చూపిస్తాడు. అతను చెప్పినట్టు మలేషియా నుంచి విమానం హైర్ చేసుకోవడానికి మారా నలభై లక్షలు అప్పు చేస్తాడు. దీనికి డీజీసీఏ అధికారి బ్రేక్ వస్తాడు. దీని వెనుక గోస్వామి వుంటాడు. ప్రకాష్ బాబు గోస్వామి మనిషే. ఇలా మోసపోయానని గ్రహించిన మారా నీరుగారి పోతాడు. ఇంతలో తండ్రి చావు బతుకుల్లో వుంటే పరిగెడతాడు. తండ్రి చనిపోతాడు. మలేషియా  విమానం క్యాన్సిల్ అవుతుంది. మారా గోస్వామి మీద తిరగబడతాడు. ఇక్కడ ఇంటర్వెల్ వస్తుంది గంటం పావుకి. 

        సెకండాఫ్ లో అంటే మిడిల్ టూ లో- చేసిన అప్పుల గురించి ఇంటా బయటా  సమస్యలు వస్తాయి. సుందరితో కూడా సమస్యలు వస్తాయి. ఎలాగో పెళ్ళవుతుంది. మారా ఇంకో ప్రయత్నం చేస్తాడు. క్రౌడ్ ఫండింగ్ తో ప్రజల దగ్గర డబ్బు సేకరించి కార్గో ఫ్లయిట్ కొంటాడు. దాన్ని పాసింజర్ టర్బో క్రాప్ గా మార్చి ప్రారంభిస్తే, గోస్వామి లాండింగ్ డిలే చేయిస్తాడు. విమానం ఏర్ ఫోర్స్ బేస్ లో క్రాష్ లాండింగ్ అవుతుంది. ఇదే ప్రారంభంలో చూపించిన దృశ్యం. దీంతో ఫ్లాష్ బ్యాక్ ఇక్కడి కొచ్చి పూర్తయినట్టు. 

        ఇప్పుడు దీని మీద ఏర్ ఫోర్స్ అధికారి కోర్ట్ మార్షల్ చేసి ఫైన్ వేస్తాడు. తిరిగి మారా రూపాయి టికెట్ పెట్టి ఇంకో ఏర్ ట్రావెల్ ప్రయత్నం చేస్తాడు. దీన్నీ గోస్వామి ఫెయిల్ చేస్తాడు. కొడుకు పుడతాడు. ఇప్పుడు విమల్ బాలయ్య వచ్చి, విలీనం చేయమని ఆఫర్ ఇస్తాడు. మారా తిరస్కరిస్తాడు. దీంతో మిడిల్ టూ కూడా  ముగిసి ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. ఇక ఎండ్ విభాగంలో మారా సామాన్యుల్ని ఎక్కించుకుని విజయవంతంగా విమానాన్ని ఎగరేస్తాడు. ఇదీ స్ట్రక్చర్.

***

       ఇందులో మొదటి 30 నిమిషాల్లో గోస్వామితో మీటింగ్ తో ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందనుకుని, సహజంగానే ఇంటర్వెల్ కి విజయవంతంగా ఏర్ డెక్కన్ ప్రారంభించి, ఆ వ్యవస్థని మారా సుందరితో కలిసి ఎలా నడిపాడో దాని తాలూకు వైభవాన్ని చూస్తామను కుంటాం. సామాన్య ప్రయాణీకులతో సీన్లేమిటో, ఎంటర్టయిన్ మెంట్ ఏమిటో, బర్నింగ్ ట్రైన్ లో ఎలాగైతే రకరకాల కుటుంబాలు ట్రైనెక్కి చేసే వినోద కార్యక్రమాల్లాగా, ప్రయాణంలో పదనిసల్లాగా, ఆ సరదాలు చూస్తామనుకుంటాం. బాంబే టూ గోవా బస్సు ప్రయాణంలో కమెడియన్లు, మూర్ఖులు, హౌలే గాళ్ళు, ఆకూపోకా తెలీని అమాయకులూ చేసే కామెడీల్లాంటివి చూస్తామనుకుంటాం. స్వర్గమన్నాక స్వర్గాన్ని చూపించాలిగా. ఎంతసేపూ స్వర్గం చేరుకునే పాట్లే చూపించి ముగిస్తారా. అది కథవుతుందా. స్వర్గమో రామచంద్రా  అని అల్లాడాలా సినిమా చూస్తున్న వాడు -త్రిశంకు స్వర్గంలో పడేస్తే?


        ప్రేక్షకుల్లో విమానాన్ని ఎక్కని వాళ్లెందరో వుంటారు. అసలు ఏర్ డెక్కన్ చీప్ ట్రావెల్ ఎలా వుంటుందో చూడాలనుకునే వాళ్ళుంటారు. సామాన్యుల విమానం కల అని చెప్పి ఆ కల చూపించక పోతే ఎట్లా. శంకర్ అయితే ఇలాగే చూపించి వాళ్ళ కోరిక నంతా తీర్చేస్తాడు. ఇదే చెప్పాల్సిన కథ కాబట్టి. ఇది మిడిల్ విభాగమూ, మిడిల్ విభాగమంటే కథా ప్రారంభమూ కాబట్టి. కథంటే ఇదే కాబట్టి. ఇంకా గోపీనాథ్ లా మారా 40 విమానాలతో ఎదిగిన విధం, పొందిన మీడియా కవరేజి, వైభవం ఇదంతా చూడాలనుకుంటాం. 

        ది ఏవియేటర్ లో ప్లాట్ పాయింట్ వన్ లో విమాన నిర్మాణం పూర్తి చేశాక, దీంతో మిడిల్ ప్రారంభంతో విమానాన్నేసుకుని స్పీడ్ లో రికార్డ్ బ్రేకింగ్ మొదలెట్టేశాడని ఇందాకా తెలుసుకున్నాం. ఇదే కదా చెప్పాల్సిన కథ. ది ఫౌండర్ లో  మెక్డొనాల్డ్స్ ఫ్రాంఛైజీలు ప్రారంభించాలన్న ప్లాట్ పాయింట్ వన్ గోల్ తో ప్రారంభమయిన రే క్రాక్, మిడిల్ లో ఫ్రాంఛైజీలని విస్తరిస్తూ, ఎలా కంపెనీని అభివృద్ధి చేశాడని కదా చూస్తాం. 

        అలాగే ఏర్ డెక్కన్ కథలో ఏర్ డెక్కన్ బిజినెస్ వ్యవహారం చూపించాల్సి వుంటుంది. ఒకసారి మరాఠీలో తీసిన ప్రసిద్ధ చలన చిత్రం, దాదాసాహేబ్ ఫాల్కే బయోపిక్ తో హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ చూడండి. ప్రింటింగ్ ప్రెస్ లో నష్టాలొచ్చి నిరుద్యోగిగా తిరుగుతున్న ఫాల్కే, ఒక గుడారంలో ఇంగ్లీష్ సైలెంట్ మూవీ చూస్తాడు ప్లాట్ పాయింట్ వన్ లో. దాంతో తన గోల్ సినిమా తీయడమేనని డిసైడ్ అయిపోతాడు. ఇంటిల్లిపాదీ జట్టు కడతారు. ఇలా మిడిల్ ప్రారంభమైపోతుంది. అంటే కథ ప్రారంభమైపోతుంది. అలా దేశంలో మొట్ట మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణం ప్రారంభించేస్తాడు. ఈ నిర్మాణం చాలా ఫన్ గా వుంటుంది కుటుంబ సభ్యులతో. ఎన్ని కష్టాలొచ్చినా వాటిని హాస్యం పట్టిస్తూ ఫన్నీగా వుంటారు. చాలా వినోద భరితంగా వుంటుంది కథా ప్రారంభంతో ఈ మిడిల్ జర్నీ. 

        సరే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? ది ఏవియేటర్ లో హోవర్డ్ హ్యూజెస్ డిఫెన్స్ కాంట్రాక్టు పొందడంతో వస్తుంది. ది ఫౌండర్ లో రే క్రాక్ మెక్డొనాల్డ్స్ ని టేకోవర్ చేసే ప్రయత్నంతో వస్తుంది. ఏర్ డెక్కన్ లో ఏం రావాలి? బిగ్ ఫిష్ విజయ్ మాల్యా ఏర్ డెక్కన్ ని విలీనం చేసుకుని మింగేసే ప్రయత్నంతో రావాలి. 

        అప్పుడు గోపీనాథ్ పడ్డ క్షోభ, చివరికి విలీనం చేసేసి తప్పు కోవడం మొదలైనవి రావాలి. ఇది కాసేపు పరాజయంగా అనిపించినా అంతిమంగా ఆయన మార్గదర్శి అయ్యాడు. ఆయన తర్వాత ఇదే ఎల్సీసీ సెగ్మెంట్లో గో-ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో, జెట్ నెట్ మొదలైన సామాన్యుల విమానాలు ప్రారంభమయ్యాయంటే ఆయనే స్ఫూర్తి. మాల్యా నుంచి వచ్చిన డబ్బుతో డెక్కన్ 360 అని కార్గో ఏర్ లైన్స్ ప్రారంభించి, కోర్టు ఉత్తర్వులతో మూసేశాడు. ఇలా ఉపసంహారంలో చెప్పి ముగించాలి. 

        అంటే ఆటో బయోగ్రఫీకి అదనంగా రీసెర్చి చేసుకోవాలి. ఆటో బయోగ్రఫీలో సినిమా కథ లేదు. అది బిగింగ్ ఉపద్ఘాతమే. మిడిల్, ఎండ్ లు లేవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోగ్రఫీగా సంజయ బారు రాసిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ లో కూడా ఇలాగే కథలేదు. సినిమాకి అది బిగినింగ్ విభాగమే. దాంతో బయోపిక్ తీస్తే ఎలా వచ్చిందో తెలిసిందే. ఈ లింకు క్లిక్ చేయండి. చాలా మందితో సమస్యేమిటంటే ఏది బిగినింగో, ఏది మిడిలో గుర్తు పట్టలేరు. ఏ సినిమాలోనూ ప్లాట్ పాయింట్ ని గుర్తించ లేరు, దాని ఉపయోగం చెప్పలేరు. స్క్రీన్ ప్లే పౌర ధర్మాలు తెలియకుండా స్క్రీన్ ప్లేల్లో తిరుగాడుతూంటారు. నగర పౌర ధర్మాలు తెలియకుండా నగరంలో తిరుగాడినట్టు. 

        కెప్టెన్ గోపీనాథ్ జీవితాన్ని అదనంగా రీసెర్చి చేసుకుంటే ఆయన సంస్థని ఎలా నడిపి వదిలేశాడో బోలెడు సమాచారముంది. సినిమా రచయిత అన్నాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు తనం చాలా అవసరం.

***

        ఇలా ఈ సినిమా అంతా చూపించింది ఎంతకీ ముగియని బిగినింగే. శివ నే తీసుకుంటే, అరగంటలో బిగినింగ్ ముగిస్తూ నాగార్జున, ప్లాట్ పాయింట్ వన్ లో జేడీని కొట్టాక, మాఫియా భవానీతో అమీతుమీకి -కథలోకి- వెళ్లకుండా, సినిమా అంతా జేడీనే కొడుతూ వుండడం లాంటిదన్న మాట. ఇంతకన్నా అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యం కాదు.      

              మారా కూడా అరగంటలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోస్వామీతో తలబడ్డాక, కంపెనీని ప్రారంభించి అభివృద్ది చేయకుండా -కథ ప్రారంభించకుండా- సినిమా అంతా గోస్వామితో సిగపట్లకే దిగాడు. చిట్ట చివర సినిమా ముగింపులో ఎలాగో విజయవంతంగా విమానాన్ని ఎగరేశాడు. అంటే ఇప్పుడు బిగినింగ్ ముగించి ప్లాట్ పాయింట్ వన్ కొచ్చాడన్న మాట. ఇంకో గంటన్నర సినిమా తీస్తేగానీ చెప్పాల్సిన కథతో మిగిలిన మిడిల్, ఎండ్ లు ముగించడన్న మాట. ఇంత వింత ఎక్కడా చూడం.

        మరి సినిమా ముగింపులో వచ్చింది ప్లాట్ పాయింట్ వన్ అయితే, వెనుక గోస్వామితో చూపించిన ప్లాట్ పాయింట్ వన్? అది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇప్పుడు తేలుతోంది. అది ప్లాట్ పాయింట్ వన్ అన్న భ్రమలో సినిమా చూస్తూంటాం. ఎంతకీ మిడిల్లోకి వెళ్ళక పోతే ఏం చేస్తాం. భ్రమల్లోంచి బయట పడతాం. మిడిల్ మటాష్ సినిమాలతో కూడా ఇలాగే జరుగుతుంది. సెకండాఫ్ ప్రారంభమైతే గానీ మిడిల్ మాటాష్ అని బయటపడదు. 

        ఇప్పుడు మారాకి గోస్వామితో ఏర్పడిన ప్లాట్ పాయింట్ వన్ కాని ప్లాట్ పాయింట్ వన్ సీను, నిజానికి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అన్నమాట. అంటే బిగినింగ్ విభాగంలో ప్లాట్ వన్ కి దారి తీసే పరిస్థితుల కల్పనలో భాగంగా వచ్చే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనే మలుపు అన్నమాట. శివలో నాగార్జున జేడీని కొట్టే ముందు, జేడీ అమలని టచ్ చేసే సీను అన్నమాట.

***

          మొదట దర్శకురాలు స్పోర్ట్స్ జానర్లో తీసిన గురు ఫార్మాట్ బాగానే వుందిగాఅనుకుని, ఆ ఫార్మాట్లో పెట్టి ఈ బిజినెస్ జానర్ సినిమా తీసే
సినట్టుంది. స్పోర్ట్స్ జానర్ ఫార్మాట్  బిజినెస్ జానర్ కి రెడ్ కార్పెట్ అవుతుందా. స్పోర్ట్స్ జానర్లో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి అపజయాలెదు
ర్కొనీ ఎదుర్కొనీ చివర్లో గోల్ కొట్టి విజయం సాధించడం వుంటుంది. ఇలా బిజినెస్ జానర్ కథ వుంటుందా. మారా గోస్వామితో సిగపట్లు పట్టీ పట్టీ ఆఖరికి విమానం ఎగరేస్తే బిజినెస్ జానరై పోతుందా?

        ఈ కథనం కూడా ఎపిసోడిక్ గా వుంది. స్టార్ట్ అండ్ స్టాప్ అని డాక్యుమెంటరీల కూపయోగపడే ఎపిసోడిక్ కథనం. ఒక సమస్యతో ఒక ఎపిసోడ్ ఎత్తుకుని, దాన్ని ముగించి, ఇంకో సమస్యతో ఇంకో ఎపిసోడ్ మొదలు పెట్టి ముగించడం. ఇలాగే చేస్తూ పోవడం. టైగర్ హరిశంద్ర ప్రసాద్ గుర్తుందా. విమానాన్ని ఎగరేసే వివిధ ప్రయత్నాలతో రిపీటయ్యేది అలాటిదే కథనం. ప్రతీ ప్రయత్నం ప్రారంభ ముగింపుల్లో బిగినింగ్ మిడిల్ ఎండ్ లుంటాయి. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఒకటే కాదు,  సైజ్ జీరో’, ‘సిటిజన్’, ‘ఆటోనగర్ సూర్య ఆఖరికి సర్దార్ గబ్బార్ సింగ్ కూడా డాక్యుమెంటరీ కథనాలే. ఇవెందుకు ఫ్లాపయ్యాయో తెలుసుకోలేదు. 

        ఇక జానర్ చూస్తే ఇది బిజినెస్ జానరా, ఫ్యామిలీ డ్రామా జానరా. సినిమా నిడివిలో సగం ఫ్యామిలీ బాధలే వున్నాయి. బాధల్ని రిజర్వ్ చేయాల్సింది బిజినెస్ జానర్ అంటూ వున్న విమానం కథనం కోసం ప్రత్యేకంగా. రెండు వైపులా బాధలతో ఎడాపెడా వాయిస్తే ప్రధానమైన బిజినెస్ జానర్ కథనం హైలైట్ అవడం మానుకుంటుంది. మిస్ ఇండియా లో కూడా ఇలాగే కుటుంబ కష్టాలు భారీగా చూపించి, బిజినెస్ కష్టాల మీంచి దృష్టి తప్పేలా చేశారు. ఏది మెయిన్ స్టోరీ, ఏది సబ్ ప్లాట్ తేడా లేకుండా, సబ్ ప్లాట్ ని కూడా మెయిన్ స్టోరీ చేసేయడమేనా. లేక రెండూ మెయిన్ స్టోరీలే చెప్పాలనుకున్నారా. ఒక సినిమాలో రెండు మెయిన్ స్టోరీ లుంటాయా. 

        ఇలా ఆటో బయోఫ్రఫీతో సంబంధం లేని విషయాలతో పూర్తి సినిమా తీసి, సృజనాత్మక స్వేచ్ఛ తీసుకున్నామని ప్రారంభంలో వేశారు. ఒక వ్యక్తి జీవిత కథతో ఇదా సృజనాత్మక స్వేచ్ఛ! 

        ఇదీ సూరరై పొట్రు స్క్రీన్ ప్లే సంగతుల సంపూర్ణ రామాయణం. స్టార్ సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు అవసరమాని ఎప్పుడో మానుకున్నాం. అవి మారవు. స్ట్రక్చర్ తెలుసుకుని చేసేదేముంది. ఏమీ వుండదు. స్టార్ సినిమాలెలా వున్నా ఎంజాయ్ చేయడమే. అంతకి మించిన సుఖం లేదు. సుఖ్ హై ఏక్ ఛావ్ ఢల్తీ ఆతీ హై జాతీ హై -అని పాడుకుంటూ దుఖాన్ని ఎంజాయ్ చేయడమే.

సికిందర్