రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మండేలా ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మండేలా ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

1, నవంబర్ 2023, బుధవారం

1372 : రివ్యూ

 


దర్శకత్వం : పూజా కొల్లూరు
తారాగణం : సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్యా ప్రదీప్ తదితరులు
రచన : వెంకటేష్ మహా, సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం : వై. దీపక్
నిర్మాతలు : ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        డాది కొక సినిమా నటించే చిన్న సినిమాల తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబుకి సక్సెస్ లు తక్కువే. 2014 లో హృదయ కాలేయం అనే కామెడీతో నటుడయ్యాక కాలక్షేప కామెడీలే చేసుకొస్తూ ఇప్పుడు వాస్తవిక కథా చిత్రంగా రాజకీయ సెటైర్ ప్రయ
త్నించాడు. దీనికి పూజా కొల్లూరు కొత్త దర్శకురాలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా చూసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజెప్పే ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎలా వుందో తెలుసుకుందాం...

కథ

    పడమర పాడు అనే గ్రామంలో అమాయకుడైన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టి జీవిస్తూంటాడు. అతను ఒంటరి, మర్రి చెట్టు అతడి నివాసం. గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా పెంపుడు జంతువులా చేస్తూ ఆ వచ్చే డబ్బుల్ని దాస్తూంటాడు. డబ్బులు కూడబెట్టి చెప్పుల షాపు తెరవాలని అతడి కల. ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. ఇలాకాదని, డబ్బు పోస్టాఫీసులో దాయాలని, స్నేహితుడు పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి తీసుకుపోతాడు. కొత్త పోస్టు మాస్టర్ వసంత (శరణ్యా ప్రదీప్) ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతుంది. అవి లేవు. తల్లిదండ్రులేం పేరు పెట్టారో గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. చూస్తే చిరునవ్వుతో వున్నట్టు కన్పిస్తాడు కాబట్టికొందరు స్మైల్ అని పిలవడం మొదలెట్టారు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. అందుకని వసంత బాగా ఆలోచించిఅతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టేస్తుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకోమంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ దిక్కుమాలిన వాడికి ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో గ్రామంలో సంచలనం రేగుతుంది.
       
ఇలా వుండగా
, పంచాయితీ ఎన్నికలు దగ్గర పడతాయి. గ్రామాన్ని ఉత్తర కులం, దక్షిణ కులంగా ఆక్రమించుకుని పెత్తనాలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములుంటారు. వీళ్ళ తల్లుల కులాలు వేర్వేరు. తండ్రి ఒక్కడే. కాబట్టి సవతులైన తల్లుల కులాల కారణంగా అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి పడక, గ్రామాన్ని కుల ఘర్షణలతో అట్టుడికిస్తూంటారు. ఉత్తరం దిక్కుకి జగ్గు (నరేష్), దక్షిణం దిక్కుకి లోకి (వెంకటేష్ మహా) కులోన్మాదులుగా పేర్గాంచి వుంటారు.
       
అయితే పంచాయితీ ఎన్నికలు రావడంతో ఓట్ల లెక్క తీస్తే
, ఇద్దరికీ సమానంగా ఓట్లు పడతాయని తెలుస్తుంది. జనాలు కులోన్మాదం పెంచుకోవడంతో ఎదుటి కులం ఓట్లు కొనలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎదుటి కులం ఓట్లు తగ్గించాలంటే కొన్ని శాల్తీల్ని లేపెయ్యాలని హత్యాయత్నాలు కూడా చేస్తారు. ఇంతలో కొత్తగా ఓటు హక్కు పొంది, మార్టిన్ లూథర్ కింగ్ గా తిరుగుతున్న స్మైల్ దృష్టిలో పడతాడు. దీంతో అతడి ఓటు కొట్టేసి ఒక ఓటు మెజారిటీతో సర్పంచ్ గా గెలవచ్చని అతడ్ని పట్టుకుంటారు.
        
దీంతో మార్టిన్ వీఐపీ అయిపోతాడు. అతడి ఓటు కోసం పోటీపడుతూ అన్నదమ్ములు అతడ్ని అందలా లెక్కించడమే గాకతొక్కేస్తారు కూడా ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ దుష్ట సోదరుల మధ్య చిక్కుకున్న మార్టిన్, తను పొందిన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడుదీనికి ఎన్ని ప్రమాదా లేదుర్కొన్నాడు?చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగాప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    సరీగ్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ కీలక ఎన్నికల సినిమా విడుదలైంది. ఇలాగే సరీగ్గా 2021 ఏప్రెల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు రోజు తమిళంలో దీని మాతృక విడుదలైంది. తమిళంలో టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా కి రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్. మండేలా కి జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చింది. 2021 తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు విడుదలైన మండేలా లో, ఓటుకి నోటుతాయిలంకులంమతం కాదని స్వచ్ఛంగా ఓటేస్తూప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తేఇది అక్కడ పోలింగ్ రోజున ఎంత వరకూ ప్రభావితం చేసిందో తెలీదు.
       
ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో తమిళంలో  
మండేలా’ వాస్తవిక సినిమాని కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ ప్రయోగాత్మకంగా తీశాడు (2023 లో శివకార్తికేయన్ తో నూరు కోట్లు వసూలు చేసిన మావీరన్ తీశాడు). ఎన్నికల్లో కుల మతాలుడబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీ (రేవడీ) లకి ఆశపడే కస్టమర్ల కింద జమకట్టి, వీరి కోసం టీవీలు, కరెంటు, లాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్కూటీలు, గ్యాస్ బండలు, నెల ఖర్చులకి డబ్బులు... ఇలా ఎన్నో బహుమతులు ఇస్తామని పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అయితే కిలో ఆవుపేడ రెండు రూపాయలకి కొంటామని కూడా  ప్రకటించింది!
       
ఇక కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు సొంతంగా పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే
ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు...ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర మాత్రం డబ్బులేదు, వుండదు.
        
కానీ ఎన్నికల కోసం పార్టీల దగ్గర మాత్రం ఈ మూడు పథకాలకి సరిపడా డబ్బుంటుంది. 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 121 దేశాల్లో ఇండియా 107 వ స్థానానికి దిగజారి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా ఎదిగాయి. ప్రభుత్వం పేదదిప్రజలు నిరు పేదలుపార్టీలు మాత్రం అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా మీద కబ్జా కోసమే తప్ప మరేం కాదు.
           
ప్రభుత్వ ఖజానా లోంచి మీరిచ్చే బహుమతులు కాదుమేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండని గ్రామాలు ఎదురు బేరం పెడితేర్యాలీలు జరగవు. ఆ ర్యాలీల ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా/మార్టిన్  దగ్గరున్న విలువైన ఓటు కోసం ప్రత్యర్ధులైన అన్నదమ్ములు దిగివచ్చి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాతగ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది కాస్త అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో అనేది కూడా ఆలోచించాలి. ఇదే ఈ సినిమా రసవత్తరంగా చేస్తున్న పని.

నటనలు- సాంకేతికాలు

    యోగిబాబుతో పోల్చనవసరం లేదుగానీ సంపూర్ణేష్ బాబు చెప్పులు కుట్టే వాడిగా పాత్ర  స్వభావానికి సరిపోయాడు. తమిళంలో యోగిబాబుది క్షురకుడి పాత్ర. అయితే తమిళంలో పేరు పాత్రకి తగ్గట్టుగా వుంది. అది కులవివక్ష అనుభవించే పాత్ర కాబట్టి మండేలా పేరుపెట్టాడు తమిళ దర్శకుడు. నెల్సన్ మండేలా వర్ణవివక్ష గురించి పోరాడేడు. తెలుగులోనూ కుల వివక్ష అనుభవించే సంపూర్ణేష్ బాబు పాత్రకి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ పోరాడింది మానవ హక్కుల గురించి. కొత్త దర్శకురాలు ఈ తేడా గమనించకుండా మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ గా కూడా పెట్టేసినట్టుంది.
       
వెర్రి బాగుల వాడు వెళ్ళి వెళ్ళి 
ఓటు హక్కుతో  ఎన్నికల్లో ప్రత్యర్ధులకి చిక్కి కింగ్ అయిపోవడంవాళ్ళ కుమ్ములాటలో తన స్థానమేమిటో క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం సంపూర్ణేష్ పాత్ర పని. ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి కింగ్ గా దర్జా వెలగబెట్టినా, లోలోపల అతను వాస్తవం తెలిసిన వాడే. చెప్పుల షాపు పెట్టి తండ్రి కోరికని నిజం చేయాలన్న కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినాకించపర్చినాకిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.
        
కులమతప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఇవి తొక్కే స్తున్నాయని కులం కార్డోమతం కార్డోప్రాంతీయ కార్డో ప్రయోగించి వీధికెక్కితే ప్రయోజనం లేదు. అప్పుడా కార్డూ వుండదుసొంత కలలూ వుండవు. ఈ ఆటంకాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇది పాత్రగా సంపూర్ణేష్ నేర్పుతాడు. ఇందుకే అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటేపోస్ట్ మాస్టర్ వసంత  మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.
        
తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికిమర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకునిఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూకమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూవెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు. 
        
పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినావెనుక గుమ్మంముందు తలుపు ప్రస్తావనలతో  చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో  డిపాజిట్లు రిస్కులో వున్నాయని మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా.
        
ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే సంపూర్ణేష్  మరింత డిగ్నిటీ నటించి క్యారక్టర్ ని ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు చెప్పులు కుట్టే వాడు  అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండాఎవర్నీ ఒక్క మాట అనకుండాఓటు పవర్ తో ఓడించేస్తాడు. సంపూర్ణేష్ కి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.
        
ఇక పోస్ట్ మాస్టర్ వసంతతో చేతకాని ప్రేమాయణం కూడా నడుపుతాడు. ఈ రీమేక్ నటుడిగా సంపూర్ణేష్  తనని పరీక్షించుకోవడానికి కొలమానంగా ఉపయోగపడింది. ఇందులో పడికి పది మార్కులూ పొందాడు. అలాగే అన్నదమ్ములుగా నటించిన నరేష్, వెంకటేష్ లు తమ విలనీని ఎత్తుగడలతో రంజింపజేస్తూ పోయారు. తమని గెలిపించే ఓటు కోసం ప్రత్యర్ధులు ఏమేం చేస్తారో సినిమాటిక్ గా కాకుండా, రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో డెటెయిలింగ్ చేస్తూ నడిపడం వల్ల కథనానికి కొత్తదనం, బలంవచ్చాయి. ఇతర సహాయ పాత్రల్లో అందరూ ఓకే.
        
అయితే టెక్నికల్ గా తమిళంలో  వున్నంత వాస్తవికతని ప్రతిబింబించ లేదు. తమిళంలో రియలిస్టిక్ జానర్ కి తగ్గ ఒక రిధమ్ఒక విజువల్ క్రాఫ్ట్  కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూసాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గాలైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. వీటి మీద పట్టు సాధించాలి కొత్త దర్శకురాలు.

చివరికేమిటి

    ‘మండేలా లాంటి ప్రయోజనాత్మకాన్ని రీమేక్ చేయాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే ఇది సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ లో ఇదివరకే వచ్చేసి తెలుగు వాళ్ళు చూశారు. పైగా 2021 లో మండేలా థియేటర్స్ లో విడుదల కాలేదు. అప్పటి లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్ లో విడుదలై వుంటే హిట్టా ఫ్లాపా తెలిసిపోయేది. ఈ నిర్ధారణ లేకుండా తెలుగులో రీమేక్ చేశారు. ఓటీటీ సినిమాని రీమేక్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రిస్కు ఎవ్వరూ తీసుకోరు.
       
కాబట్టి తెలుగులో థియేట్రికల్ విడుదల బాక్సాఫీసు దగ్గర పరీక్షే. పోతే
, తమిళంలో
 ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంటుంది. దీన్ని తెలుగులో పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనేకుల సమస్యనేఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు దీని మీద ఇంకా కృషి చేయాలి.  కంటెంట్ మీద తనకెంత పట్టుందో మరీ టైటిల్ పెట్టడం దగ్గరే దొరికిపోయేలా వుండకూడదు.  

—సికిందర్

 


23, అక్టోబర్ 2022, ఆదివారం

1237 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : కెవి అనుదీప్
తారాగణం : శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క, కార్ల్ హార్ట్, సత్యరాజ్, ప్రేమ్జీ అమరేన్, ఆనందరాజ్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాతలు : డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు
విడుదల : అక్టోబర్ 21, 2022
***
        జాతిరత్నాలు అనే హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ స్టార్ శివ కార్తికేయన్ తో తెలుగు -తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు. ఇందులో మరియా ర్యాబోషప్క అనే ఉక్రెయిన్ నటి హీరోయిన్. గత నెలలోనే అనుదీప్ కథ అందించిన కామెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో దారుణంగా ఫ్లాపయింది. మైండ్ లెస్ కామెడీతో జాతిరత్నాలు హిట్టయ్యిందనీ ఇక మైండ్ లెస్ కామెడీలే తీయాలని నిర్ణయించుకున్నట్టుంది. కానీ దీపావళి సందర్భంగా ఇదే రోజు మరో నాలుగు  సినిమాలు- జిన్నా, ఓరి దేవుడా, సర్దార్, బ్లాక్ ఆడమ్ కూడా విడుదలయ్యాయి. పోటీ గట్టిగానే వుంది.

        మిళంలో శివ కార్తికేయన్ వరుస హిట్లు ఇస్తున్న స్టార్. ఇప్పుడతను తమిళంలో కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తో పోటీలో వెనుకబడ్డాడు. కార్తీ కూడా వరుస హిట్లు ఇస్తున్న తమిళ స్టారే. తాజాగా పొన్నియిన్ సెల్వన్ లో నటించాడు. తమిళంలో సర్దార్ కి మార్నింగ్ షో కే హిట్ టాక్ వచ్చేసింది. ప్రిన్స్ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. మరి సినిమా ఎలావుంది? ఇది తెలుసుకుందాం...

కథ
ఆనంద్ (శివ కార్తికేయన్) ఓ ఊళ్ళో స్కూలు టీచర్. సోషల్ సబ్జెక్టు చెప్తాడు. సోషల్ నాలెడ్జి ఏమీ వుండదు. స్కూలుకంటే సినిమాలకి ఎక్కువ వెళుతూ వుంటాడు. తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) అభ్యుదయవాది. కులాంతర వివాహాలు జరిపిస్తూంటాడు. ఎందుకైనా మంచిదని కొడుకు ఆనంద్ చేత హామీ పత్రం రాయించుకుంటాడు- ఎట్టి పరిస్థితిలో కులాంతర వివాహమే చేసుకోవాలని, కులంలో అమ్మాయిని ప్రేమించరాదనీ. ఇప్పుడు అదే స్కూల్లో జెస్సికా (మరియా) అనే బ్రిటీష్ జాతీయురాలు ఇంగ్లీషు టీచరుగా వచ్చి చేరుతుంది. ఈమె తండ్రి విలియమ్స్ (కార్ల్ హార్ట్) తాత ఆస్తిపాస్తులు ఇక్కడే వదిలి వెళ్ళడంతో తను ఇక్కడే సెటిలై పోయాడు. టౌన్లో ఇతడి స్థలం ఒకటి కబ్జా చేయాలన్న పన్నాగంతో ఓ కేడీ భూపతి (ప్రేమ్జీ అమరేన్) వుంటాడు.

స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ జెస్సికా  ఇంగ్లీషు అందచందాలు చూసి
, ఆనంద్ ఇక సినిమాల కెళ్ళడం మానేసి, బుద్ధిగా స్కూలుకొస్తూ వచ్చిన పని ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటాడు. అతడి ప్రేమని చూసి ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే కులాల్ని, మతాల్నీ అధిగమించి విశాల ప్రాతిపదికన ఆనంద్ ఓ విదేశీయురాలిని ప్రేమించడం గర్వంగా ఫీలైన తండ్రి విశ్వనాధం, ఆమె బ్రిటిషర్ అని తెలిసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో ఓ బ్రిటిష్ తాత తన తాతని చంపాడు కాబట్టి.

అటు జెస్సికా  తండ్రి విలియమ్స్ కూడా ఇండియన్ రక్తంతో సంబంధం వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి
, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ  

ఇది పూర్తి స్థాయి కామెడీ కథ. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నర్సింహా రావు మొదలైన దర్శకులు ఫక్తు కామెడీ సినిమాలే తీసే వాళ్ళు. ఈ కాలంలో రోమాంటిక్ కామెడీలు, హార్రర్ కామెడీలు, క్రైమ్ కామెడీలూ అంటూ ప్రేమని, హార్రర్ ని, క్రైమ్ నీ జోడించుకుని సబ్ జానర్ కామెడీలు తీస్తున్నారే తప్ప, ఆ రోజుల్లో ఆ దర్శకులు తీసేలాంటి ఫక్తు కామెడీలు తీయలేక పోతున్నారు. దీనికి కాస్త సృజనాత్మకత, ప్రతిభ కావాలి సామాజిక స్పృహతో బాటు. కనుక ఒక జంధ్యాల, ఈవీవీ, వంశీ, రేలంగి అన్పించుకునే దర్శకులు ముందు కాలంలో కూడా రావడం అసంభవమనుకుంటున్న సమయంలో అనుదీప్ అనే దర్శకుడు వచ్చాడు.

అయితే అనుదీప్ తో సమస్యేమిటంటే, అతను ప్రధాన పాత్ర ఆధారిత కామెడీ తీయడు. ప్రధాన పాత్రని అప్రధానం చేసి, ఇతర పాత్రలతో కలిపేసి గుండుగుత్త కామెడీ తీస్తాడు. ఏ కథైనా, ఎలాటి కథైనా ప్రధాన పాత్రకి గోల్ అంటూ వుంటుంది. ఆ గోల్ ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, దాంతో పోరాటం, పరిష్కారమనే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ సహిత స్క్రీన్ ప్లేతోనే వస్తుందని అతడికి తెలుసో లేదో. ఇలా ఈ సార్వజనీన స్క్రీన్ ప్లే స్ట్రక్చరనేది గోల్ తో యాక్టివ్ గా వుండే ప్రధాన పాత్రతోనే సాధ్యమనీ, గోల్ లేకుండా పాసివ్ గా వుండే ప్రధాన పాత్రతో విఫలమవుతుందనీ, బేసిక్స్ అతడికి తెలుసో లేదో తెలీదు.

స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ నేర్పర్చేదే గోల్ కోసం పోరాడే యాక్టివ్ ప్రధాన పాత్ర. అంతేగానీ, ప్రధాన పాత్ర కోసం స్ట్రక్చర్ ని ఎవరూ కనిపెట్టలేదు. యుగాలుగా రాస్తున్న కథల్లో గోల్ తో వుండే ప్రధాన పాత్రే స్ట్రక్చర్ నేర్పరుస్తూ వస్తోందని గమనించి స్క్రీన్ ప్లే శాస్త్రాలు రాశారు నిపుణులు. శాస్త్రం ముందు కాదు, పదార్ధమే ముందు. పదార్థాన్ని విశ్లేషిస్తేనే శాస్త్రం ఏ రంగంలోనైనా.

అనుదీప్ తీస్తున్నవి సిల్లీ కామెడీలే. దీనికాధారం సామాజిక అంశాలే
, నేటివిటీయే. సోషల్ కామెంట్ చేసే సదాశయమే. వ్యక్తుల హిపోక్రసీని బయట పెట్టాలన్న తపనే. అయితే ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చని అరిస్టాటిల్ మహాశయుడు చెప్పాడు. అనుదీప్ చేస్తున్నదిదే. మంచిదే. అయితే ఈ అబ్సర్డ్ కామెడీని అతను కథతో చేయడం లేదు. సెటైర్లతో విడివిడి స్కిట్స్ తీసి, వాటిని కలిపి అదే కథ అనుకోమంటున్నాడు.

కథ ఎక్కడుంది
? ఆనంద్ జెస్సికాతో ప్రేమలో పడ్డం దగ్గరుంది. ఆ తర్వాత ఇంటర్వెల్లో వీళ్ళ తండ్రులు అడ్డుకోవడం దగ్గరుంది. ఇంకా తర్వాత తండ్రులు రాజీపడే క్లయిమాక్స్ లో వుంది. ఈ మూడే కథతో సంబంధమున్న ఘట్టాలు. మిగిలిన వన్నీ వీటితో సంబంధం లేని, వీటి మధ్య పేర్చిన, విడివిడి సెటైరికల్ స్కిట్స్. కేవలం కథకి సంబంధించి ఆ మూడు ప్లాట్ పాయింట్స్ ని పెట్టుకుని, వాటి మధ్య ఫిల్లర్స్ గా స్కిట్స్ వేస్తూ సినిమా నడిపేశాడు.

ఇందుకే హీరో పాత్ర ఆనంద్ కి పని (గోల్) లేకుండా పోయింది. ఇంకా ఓ స్థలాన్ని కబ్జా చేయాలనుకునే పక్క పాత్ర భూపతి కెక్కువ గోల్ వుంది. అతను ఇంగ్లీషు వాడి స్థలాన్నెలా కొట్టేయాలన్న గోల్ తో  చివరి దాకా మంచి ఊపు మీద యాక్టివ్ గా వుంటాడు- పైన చెప్పుకున్న
ప్రధాన పాత్ర -సమస్య -పోరాటం -పరిష్కారం స్ట్రక్చర్ తో యాక్టివ్ క్యారక్టర్ గా! అతను స్థలాన్నైతే కొట్టేయ లేకపోయాడు గానీ, హీరో ఆనంద్ చేతిలో వుండాల్సిన త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని మాత్రం కొట్టేసి పాసివ్ గా కూర్చోబెట్టేశాడు.

చెప్పేదేమిటంటే
, ఆల్రెడీ తెలుగు హీరోలకి అలంకరిస్తున్న పాసివ్ పాత్రల్ని తీసికెళ్ళి తమిళ హీరోల్ని కూడా పుష్పమాలాంకృతుల్ని చేయడమెందుకని. తెలుగు దర్శకుడు వెళ్ళి వెళ్ళి  తమిళాన్ని కూడా తెలుగు కిష్కింధ చెయ్యాలా? 2020 లో తమిళంలో మడోన్ అశ్విన్ అనే కొత్త దర్శకుడు తీసిన మండేలా అనే రాజకీయ సెటైర్ లో హీరోగా యోగిబాబు బార్బర్ పాత్ర ఎంత యాక్టివ్ గా వుంటుంది. కథని అతనే సృష్టిస్తాడు, అతనే నడిపిస్తాడు, అతనే ముగిస్తాడు.

హీరోగా ఆనంద్ కూడా చేయాల్సిందేమిటంటే
, ప్రేమకి అడ్డుపడుతున్న తండ్రుల వ్యక్తిగత వైరాల్ని వాళ్ళకే వ్యతిరేకంగా వాడుకుని టీచర్ గా బుద్ధిచెప్పడం. లేకపోతే టీచర్ పాత్ర దేనికి? మొదట కామెడీ కోసం టీచర్ని నాలెడ్జి లేని వాడుగా చూపించినా, ప్రేమతో సమస్యలో పడ్డాక ఎదగాలిగా (క్యారక్టర్ గ్రోత్)? ఎదిగి టీచర్ అన్పించుకుంటూ, వూరి  సమస్యగా మారిన తన సమస్యని కామెడీగానే, సృజనాత్మకంగా పరిష్కరించుకునే గోల్ తో కొనసాగాలిగా (క్యారక్టర్ ఆర్క్)? కథకి ఉష్ణోగ్రత పెంచాలిగా (టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్)? ఇవేమీ లేకుండా హీరో అయిపోతాడా?

పైన కథా సంగ్రహం రాసినప్పుడు... ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి
, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అని పేర్కొన్నాం. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అన్నామే గానీ, ఇప్పుడేం చేశాడు ఆనంద్?... అని రాయలేదు. ఎందుకంటే ఈ కథలో ఆనంద్ ఏమీ చేయని -గోల్ లేని పాసివ్ పాత్ర కాబట్టి.

అయితే గోల్ తో ఏం చేయాలన్నా ఇక్కడ అసలు సమస్య వుంది. తండ్రుల సమస్యే సమస్య. ఎప్పుడో స్వాతంత్ర్య పోరాటంలో ఇంగ్లీషు తాత తన తాతని చంపాడని ఆనంద్ తండ్రి, ఇండియన్ రక్తంతో సంబంధం వద్దని జెస్సికా తండ్రీ సృష్టించిన సమస్యలో లాజిక్ ఎంత? ఎమోషన్స్ ఎంత? ఇవి కన్విన్సింగ్ గా వుండే పాయింట్సేనా? ఏ మాత్రం అర్ధం లేని, ఎమోషన్లు పుట్టించని, సిల్లీ పాయింట్స్. పైన అరిస్టాటిల్ ని ఉటంకిస్తూ చెప్పుకున్నట్టు - ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చు. ఇది దర్శకుడు అనుదీప్ తీసిన స్కిట్స్ కే వర్తిస్తోంది తప్ప కథ పుట్టడానికి కారణమైన ఎమోషన్స్ లేని ప్లాట్ పాయింటుకి కాదు.

తండ్రులు సృష్టించిన సమస్యే ఎమోషన్స్ లేకుండా ఇల్లాజికల్ గా
, సిల్లీగా, ఆషామాషీగా వుంటే ఇది సినిమాని నిలబెట్టే ప్లాట్ పాయింట్ అవదు- ఫాల్స్ పాయింటుతో ఫ్లాప్ ప్లాట్ పాయింటవుతుంది. ఆనంద్ దీంతో ఎంత గోల్ పుట్టించుకున్నా అందులో ఎమోషన్ లేక, ఎంత కథ నడిపినా నిలబడేది కాదు. మొట్టమొదట కథకి ఐడియా తట్టినప్పుడు తట్ట నెత్తినెట్టుకుని పరిగెత్తకుండా, అసలా ఐడియా అనేది స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ నిచ్చే పరిధిలో వుందా లేదా తెలుసుకోక పోతే ఇంతే జరుగుతుంది.

అనుదీప్ స్కిట్స్ కి ఆధారంగా చేసుకున్నవి కులాలు
, ఇండో -బ్రిటిష్ వైరం, దేశభక్తి -మానవత్వం మొదలైనవి. వీటిని వ్యంగ్యం చేసి, హాస్యం పట్టించి, ఎంత కడిగెయ్యాలో అంతా కడిగేసుకుంటూ పోయాడు.

కులాలు నర్సు చేతిలో వున్నాయి, ఇటు పిల్లని అటు మారిస్తే కులాలే మారిపోతాయి’... ‘దేశాల్ని ఆక్రమించి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ నిచ్చింది మీరు’... ఇంగ్లీషోడికి ఇంకా ఇండియాలో చోటుందా’... వంటి డైలాగులెన్నో  పేలుతూంటాయి. కృత్రిమ -కాపీ పేస్ట్- వాట్సాప్ జోకుల రోమాంటిక్, హార్రర్, క్రైమ్ ప్లాస్టిక్ కామెడీలతో మొహం మొత్తిన వాళ్ళకిది కాస్త ఉల్లాసమే.

ప్రతీ స్కిట్ ఏదో రకంగా హాస్య సంభాషణా బలంతో పేలేదే. నాలుగు స్కిట్స్ హైలైట్ గా వుంటాయి- కూరగాయల షాపు దగ్గర సొరకాయ కామెడీ
, ఇంట్లో మొబైల్ కాలర్ ట్యూన్ కామెడీ, పోలీస్ స్టేషన్లో యాంటీ ఇండియన్స్- జనరల్ నాలెడ్జి కామెడీ, చివర్లో దేశభక్తి వర్సెస్ మానవత్వం కామెడీ క్లయిమాక్స్.

మంచి కామెడీ తీయాలంటే ఐక్యూ ఎక్కువుండాలి
, ఇంటలిజెంట్ రైటింగ్ వుండాలి. ఇవి ఆద్యంతం స్కిట్స్ లో కన్పిస్తాయి.

నటనలు- సాంకేతికాలు
హీరోగా శివ కార్తికేయన్ కామెడీని చాలా ఈజ్ తో లాగించేశాడు. అతను చాలా సహజంగా సిట్యుయేషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్ తో కామెడీ సీన్లు ఎక్కువ. సత్యరాజ్ ఇందులో ప్రధాన కమెడియన్ అనుకోవచ్చు. ప్రారంభంలో సరిహద్దులు గీసుకుని కొట్టుకుంటున్న వూరి జనాల కులాల పిచ్చిని కత్తితో చికిత్స చేసి, అదే కత్తితో దేశభక్తి, మానవత్వం గ్రూపులకి చికిత్స చేస్తాడు. కత్తితో ఎవరి చేతి మీద గీరినా రక్తం ఎరుపే నని చూపించడం అతడి హాబీ. తెల్లవాడైన జెస్సికా తండ్రి కూడా చేతి మీద గాటు వేయించుకుని, తనది కూడా ఎరుపు రక్తమే కదా అనుకుంటాడు. ఇలాటి వెర్రిమాలోకాలు వుంటారనేది లాజిక్. దీనిమీద అబ్సర్డ్ కామెడీ. సత్యరాజ్ చెయ్యి నరికేసి చూపిస్తే అది బ్లాక్ కామెడీ.

అలాగే పోలీస్ స్టేషన్ కామెడీలో ఇన్స్ పెక్టర్ పాత్రలో ఆనందరాజ్ నటన. ఇక భూకబ్జాలు చేసే కేడీగా ప్రేమ్జీ అమరేన్ ది కూడా మంచి కామెడీ. ఇవన్నీ ఒకెత్తైతే, జెస్సికా తండ్రిగా నటించిన కార్ల్ హార్ట్ చెప్పుకోదగ్గ నటుడు. ఇక హీరోయిన్ గా నటించిన ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క తెలుగు పాత్రలో పూర్తిగా ఇమిడి పోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన బ్రిటిష్ అమ్మాయిగా ఆ సహజత్వం ప్రదర్శించింది. క్లయిమాక్స్ కి ముందు సత్యరాజ్ తో, ఆనాడు బ్రిటన్ చేసిన అన్యాయాలన్నిటికీ క్షమాపణలు చెప్పే భావోద్వేగపూరిత సన్నివేశం కదిలించేదే. స్కూల్ కామెడీ దృశ్యాలు కూడా బావున్నాయి. ఇద్దరు బాలనటులు ఫన్నీగా వున్నారు.

కామెడీలో స్లో పాటలు, ఫ్లోని దెబ్బతీసే మాంటెజెస్ సాంగ్స్ లేకుండా హుషారు నిచ్చే పాటలున్నాయి. రెండు గ్రూప్ సాంగ్స్ కి భారీ సెట్సే వేశారు. థమన్ సంగీతానికి తగ్గట్టు విజువల్స్ కూడా వున్నాయి.  మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కొన్ని ఔట్ డోర్స్ లో పాలిపోయినట్టు వుంది. ఎందుకలా డీఐ చేశారో తెలీదు.

పోతే ఇది ద్విభాషా చిత్రమన్నారు గానీ, ఇందులో తెలుగు నటీనటులెవ్వరూ లేరు. తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ చేసినట్టుంది. అయితే తీసింది తెలుగు దర్శకుడు కావడంతో తెలుగే అన్పించే డైలాగులున్నాయి. కథ గురించి ఆలోచించకపోతే స్కిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. సినిమాలు ఫస్టాఫ్ బావుంటే, సెకండాఫ్ బావుండడం లేదు. లేదా ఫస్టాఫ్ బాగా లేక సెకండాఫ్ బావుండే సినిమా లొస్తున్నాయి. ప్రిన్స్ మాత్రం ఫస్టాఫ్- సెకండాఫ్  రెండూ స్కిట్స్ తో బోరు కొట్టవు. ఇదే స్కిట్స్ తో గాకుండా కథతోనే జరిగి వుంటే బావుండేది. దర్శకుడి దర్శకత్వంలో వేగం వుంది, పంచ్ వుంది- తీయడానికి కథ లాంటిది తయారు చేసుకుంటే బావుంటుంది. ఇంతకీ కథంటే ఏమిటి? 

—సికిందర్  


5, ఫిబ్రవరి 2022, శనివారం

1126 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సుధీర్ రాజు
తారాగణం : శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, చంద్రమోహన్, సుధ, హేమ, మురళీ శర్మ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు
మాటలు: విక్రమ్ రాజ్
, స్వామి మండేలా, సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : బుజ్జి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్
***

            1991 నుంచీ 120 కి పైగా సినిమాలు నటించి ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ 2022 లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ప్రయోగం చేశారు. పాత ఫ్యామిలీ సినిమాల హీరో అయిన తను, ఈ మధ్య విలన్ పాత్రలేస్తూ అఖండలో కూడా కన్పించారు. ఇప్పుడు పాత ఫ్యామిలీ సినిమా హీరోగా పాత టైటిల్ కోతల రాయుడు తో, పాత ఫ్యామిలీ సినిమా నటిస్తూ, కొత్త ప్రేక్షకుల మీద పాత ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేసిన కొత్త దర్శకుడు, నిర్మాతలు బహుశా పాత కాలం లోంచి వచ్చారు. అందరూ పాత కాలం లొంచే వస్తారు, కానీ పాతగానే వుండిపోరు. శ్రీకాంత్ సహా దర్శకుడు నిర్మాతలూ పాతగానే వుంటూ పాతదనంతో మక్కువ తీర్చుకున్నారు. ఈ మక్కువ ఎలా వుందో చూద్దాం...

కథ
    ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథయితేగా ఎలావుందో చెప్పుకోవడానికి. కోతల రాయుడు పని కోతల రాయుడు పాత్ర చేయకుండా, కథకుడే కోతల రాయుడైతే ఎలా వుంటుందనడానికి శాంపిల్ ఈ సినిమా కథ. కథకుడు కథ వదిలేసి చాలా కోతలు కోశాడు. కథతో సంబంధంలేని కామెడీలు చేశాడు. డ్రామాలు చేశాడు. అసలు ధన లక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయిందో, ఈ సమస్యేంటో, పరిష్కారమేంటో చెప్పకుండా, ఏవేవో కోతలు సొరకాయల్లా తెగ కోస్తూ ఇదే కథ అనుకున్నాడు. పాతకాలంలో ఇలా వున్నాయా కథలు? పాత కాలపు కథకుడికి మతి మరుపు కూడా వున్నట్టుంది. కథలెలా వుంటాయో మర్చిపోయి, తలా తోకాలేని కథ పట్టుకుని, కోతల రాయుడులా తెలివైన కొత్త ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు.

నటనలు- సాంకేతికాలు

    ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ మరోసారి వెండి తెరమీద ఈ సినిమాతో ప్రకాశించాడు. ఈ ప్రకాశం వేషం, స్టయిలింగ్, నటనల వరకే. పాత్ర గురించీ, పాత్రకున్న కథ గురించీ చెప్పుకోకూడదు. ఇలా పాత శ్రీకాంత్ ని గుర్తుకు తెచ్చినప్పుడు, గుర్తుండే విషయంతో కూడా రావాలని ఎందుకు గుర్తుపెట్టుకో లేదో మరి. ఎలాపడితే అలా సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు నష్టపోవడానికి కారకుడు కాకూడదని జాగ్రత్తలు తీసుకునే తను,  ఈసారి ఎలా మోసపోయాడో తెలీదు. ఇలా హీరోగా ప్రయోగాలు చేసేకన్నా విలన్ గా స్థిరపడితే మేలు.

        హీరోయిన్లు నటాషా, డింపుల్ లు గ్లామర్ ని బాగానే ఆరబోశారు. ముక్కలు ముక్కలుగా వున్న కథని  గ్లామర్ తో కవర్ చేయడానికి శ్రమిస్తున్నట్టు కసరత్తులన్నీ చేశారు. ఎన్ని కసరత్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ కలిసి ఒక కామెడీ ఎపిసోడ్ వేసుకున్నారు. కథతో సంబంధం లేకుండా జబర్దస్తీగా ఒక కామెడీ షో. పోసాని, మురళి శర్మలు కథ లేని సినిమాకి విషయంలేని పాత్రలు. ఇంకా చాలా మంది నటీనటులూ వాళ్ళ పాత్రలూ వున్నాయి నిండైన కుటుంబ సినిమా అన్పించుకోవడానికి.

        కొత్త దర్శకుడు సుధీర్ రాజుకి కథాకథనాలూ దర్శకత్వమూ ఏదీ సాధ్యం కాలేదు. సినిమా పేరుతో ప్రేక్షకుల నెత్తిన ఓ తమాషాని రుద్ది చేతులు దులుపుకున్నాడు. పూర్తిగా లేని కథ, కథతో సంబంధంలేని, లాజిక్ లేని సీన్లు, పాత్రలు, కామెడీలూ ... ఇలా ప్రతి నిమిషమూ ప్రేక్షకుల్ని ముళ్ళ మీద కూర్చోబెట్టి ఆనందం తీర్చుకున్నాడు. దీని పాటల చిత్రీకరణ కోసం సిక్కిం కూడా వెళ్ళాడు. సునీల్ కశ్యప్ తో పాటలు మాత్రం సరిగ్గానే చేయించుకున్నాడు. కెమెరామాన్ బుజ్జి నుంచి కూడా టాలెంట్ ని పిండుకున్నాడు. పిండడానికి తనదగ్గరే ఏమీ లేకుండా పోయింది.

—సికిందర్