రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

కంబాలపల్లి కథలు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
కంబాలపల్లి కథలు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

17, మే 2021, సోమవారం

1038 : రివ్యూ


 రచన - దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
తారాగణం: సందీప్ వారణాసి, వికాస్ వశిష్ట, రాగ్ మయూర్, సింధు, సిరివెన్నెల తదితరులు
సంగీతం : ఎస్. శిరీష్, ప్రవీణ్ రెడ్డి, ఛాయాగ్రహణం : అపూర్వ సాలిగ్రాం, సాగర్
బ్యానర్ డి 2 ఆర్ ఇండీ
నిర్మాతలు: రాజ్ నిడుమోరు, కృష్ణ డికె
విడుదల:  మే 14, 2021, నెట్ ఫ్లిక్స్
***

         ఇండీ ఫిలిం గా సినిమాబండి నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇండీ ఫిలిమ్స్ తో కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తున్న డి 2 ఆర్ ఇండీ సంస్థ అధినేతలు దీన్ని నిర్మించారు. సహజత్వానికి దగ్గరగా సినిమాని తీసికెళ్ళాలన్న అభిరుచి సినిమా బండి ఆద్యంతం కన్పిస్తుంది. ఇటీవల కంబాలపల్లి కథలు తో ఇదే చూశాం. ఓటీటీలో క్వాలిటీ సినిమాలకి ఢోకాలేదని ఇప్పుడు  సినిమా బండి తో నిరూపించే ప్రయత్నం. అయితే  సినిమా బండి కంటెంట్ కి సంబంధించినంత వరకూ దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రయత్నం. కానీ ఈ కొత్త దర్శకుడి ఈ ప్రయత్నంలో కామన్ సెన్సుతో కూడిన వాస్తవికత కూడా వుండాల్సింది. కామన్ సెన్స్ లేకుండా కమర్షియల్ సినిమా కూడా రాణించదు. సెల్ ఫోన్లతో వూరూరా షార్ట్ ఫిలిమ్సే తీసేయడం అందరికీ తెలిసిన విషయమై పోయాక, వీడియో కెమెరాని అదేదో దివినుంచి వూడిపడిన దివ్యవరంగా ఆశ్చర్యపడి, దాంతో సినిమా తీయాలన్న అమాయకత్వాన్ని ప్రదర్శించడం ఈ కథలో కన్విన్సింగ్ వుందా ఆలోచించాల్సిన విషయం.

        మేకింగ్ సంగతి తర్వాత, ముందు రైటింగ్ ఎంత ముఖ్యమో ఇప్పుడు కూడా మైథిలీ ఇండీ ఫిలిం గమక్ ఘర్, నాగమీస్ ఇండీ ఫిలిం నానా -ఏ టేల్ ఆఫ్ అజ్ నిరూపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నాయి. ఇంటలిజెంట్ రైటింగే ఇండీ ఫిలిమ్స్ కి ప్రాణం. సినిమా బండి లాంటిదే కన్నడలో తీసిన పల్లెటూరి ఫన్నీ కథ తిధి, కొత్త దర్శకుడి ఇంటలిజెంట్ రైటింగ్ తో, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో, 20 వరకూ జాతీయ, అవార్డులతో పేరుకి పేరూ డబ్బుకి డబ్బూ సంపాదించుకుంది. దేశంలో 30 కి పైగా ప్రాంతీయ భాషల్లో ఇండీ ఫిలిమ్స్ తీస్తూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని నాకర్షిస్తున్నారు. ఒక్క తెలుగులోనే తెలుగు మూస సినిమాల ప్రభావం నుంచి బయటికి రాలేక, ఇండీ ఫిలిమ్స్ మార్కెట్ యాస్పెక్ట్ ని లోకల్ గానే  తక్కువ చేసి చూస్తున్నారు. సినిమా బండి కథలో దొరకాల్సింది ఎవరో మర్చిపోయిన ఓ వీడియో కెమెరా కాకుండా, ఎవరో పారేసుకున్న ఆస్కార్ అవార్డు ఫారిన్ లాంగ్వేజీ మూవీ స్థాయి స్క్రిప్టూ, ఆ స్క్రిప్టుతో అమాయక జనం సినిమా తీసేయాలనుకునే వైరల్ ఐడియా అయివుండాల్సింది! వైరల్ ఐడియాల నిచ్చే హయ్యర్ ఇంటలిజెన్స్ ఇలాటి  లో - బడ్జెట్ ఇండీ ఫిలిమ్స్ వీక్షణాసక్తిని శిఖర స్థాయికి పెంచుతాయని గుర్తుంచుకోవాలి. ఇందుకు తెలుగు ఇండీ మేకర్లు ఫారిన్ సినిమాలు మానేసి, ముందు వివిధ ప్రాంతీయ సినిమాలు చూసి వాస్తవ జీవితాల్ని పరిశీలించాల్సిన  అవసరం చాలా వుంది. 

***

      కొత్త దర్శకుడు, అతడి రచయితలూ విషయ పరంగా వాస్తవికతకి దూరంగా వున్నా, దృశ్యపరమైన వాస్తవికతని మాత్రం పోషించారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో వీరబాబు (వికాస్ వశిష్ట) అనే ఆటోడ్రైవర్ వుంటాడు. అతడికి ఓ రోజు ఆటోలో ఎవరో మర్చిపోయిన ఎస్ ఎల్ ఆర్ కెమెరా దొరుకుతుంది. అర్ధంగాక దాన్ని విచిత్రంగా చూసి భార్యకి చూపిస్తే, ఆమే ఆశ్చర్యంగా చూస్తుంది. వూళ్ళో ఒక పెళ్ళిళ్ళ  ఫోటోగ్రాఫర్ గణపతి (సందీప్ వారణాసి) వుంటే అతడికి చూపిస్తాడు. అతనూ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోలేక పోతాడు. దాన్ని పదివేలకి అమ్మేసి ఆటో ఫైనాన్స్ తీర్చేయాలనుకుంటాడు వీరబాబు. కానీ టీవీలో చిన్న సినిమాల సక్సెస్ గురించి చూసి, ఆ కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించాలని నిశ్చయించుకుంటాడు. గణపతిని కెమెరామాన్ గా నియమించుకుంటాడు. సినిమా తీయడానికి ఒక ముసలి తాత (ముని వెంకటప్ప) రాసిన కథ దొరుకుతుంది. ఈ కథకి హీరోగా బార్బర్ మరిడయ్య (రాగ్ మయూర్) దొరుకుతాడు. హీరోయిన్ గా స్టూడెంట్ దివ్య (త్రిషారా) ని సెలెక్టు చేసుకుంటాడు. ఇక షూటింగ్ ప్రారంభిస్తాడు. ఈ షూటింగ్ మధ్యలో హీరోయిన్ దివ్య ఒకడితో లేచిపోతుంది...ఇప్పుడేం చేయాలో అర్ధం గాక ఇరకాటంలో పడతాడు వీరబాబు...

***
   ఈ కథలో ఇంకా ఆటోలో కెమెరా మర్చిపోయిన సిటీ గర్ల్ సింధు గా సింధూ శ్రీనివాస మూర్తి వుంటుంది. కథకి ఈమే ముగింపు నిస్తుంది. ఈమె క్యారక్టర్ ఎలా వున్నా, నటన బావుంది. ఆటో డ్రైవర్ వీరబాబు భార్య గంగోత్రిగా సిరివెన్నెల యలమందల నటించింది. వీరబాబు ఆటో నడపకుండా సినిమా తీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఈమె, తర్వాత అర్ధం జేసుకుని సహకరిస్తుంది. వీరబాబు సినిమా మధ్యలో ఆగిపోయాక, ఈమెతో ఒక దృశ్యం మౌన భాష్యం చెబుతుంది. ఇంట్లో వీర బాబు చూస్తూండగా అతడి షర్టు వేసుకుని, తలకి తువ్వాల చుట్టుకుని, ఆమె బయటికెళ్ళే  మాటలు లేని మూకీ దృశ్యం ఆమె కూలి పనికి వెళ్లడానికి సిధ్ధ పడిందని చెప్పకనే చెప్తుంది. ఈ దృశ్యం సినిమా మొత్తం మీద గుర్తుండి పోయే టాప్ సింబాలిక్ దృశ్యం. కానీ ఉండాల్సిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అర్ధరహితం.

        మొదటి హీరోయిన్ లేచిపోయాక రెండో హీరోయిన్ గా కూరగాయలమ్మే మంగ (వై జి ఉమ) వుంటుంది. ఈమెది కూడా బలమైన స్త్రీ పాత్రే. షూటింగ్ గ్యాప్ లో అక్కడే బుట్ట పెట్టుకుని కూరగాయ లమ్ముతుంది. సొంత జీవితంతో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇలాగే లేచిపోయిన మొదటి హీరోయిన్ గా త్రిషారా కి ప్రియుడితో లేచిపోయి సొంత జీవితం చూసుకోవడమే ముఖ్యం. ఇలా ఈ పల్లెటూరి స్త్రీ పాత్రలు ఒక వ్యక్తిత్వంతో కన్పిస్తాయి.

        కథ రాసిన ముసలి తాతగా ముని వెంకటప్పకి మాటలుండవు. షూటింగు ఎలా  జరుగుతోందో గమనిస్తూ వుంటాడు. ఈ తాత క్యారక్టర్ తీరు కన్నడ తిధి లో తాత క్యారక్టర్ లా వుంటుంది. కథ వేరు. తాత రాసిన ప్రేమ కథ పేరు తాత రాసిన టైటానిక్ అని చివర్లో రివీల్ చేయడం బావుంది. దీన్నే సినిమా టైటిల్ గా పెట్టి వుండాల్సింది. 

     ఆటో డ్రైవర్ గా, సినిమా దర్శకుడుగా వీరబాబుగా వికాస్ వశిష్టది పూర్తిగా అమాయకత్వంతో కూడిన పాత్రే, నటనే. ఎంత బాగా పాత్రలో లీనమైపోయినా ఆ అమాయకత్వం ఒప్పించేలా వుండదు. ఇలా సినిమా తీసి కోట్లు గడించాలన్న అన్ రియలిస్టిక్ గోల్ ని వూళ్ళో అందరూ నమ్మడం ఇంకో ఇబ్బంది పెట్టే విషయం. ఆ కోట్ల డబ్బుతో(!) వూళ్ళో రోడ్డు, కరెంటు, నీటి సౌకర్యాలు కల్పించాలన్న కలలు మరీ చోద్యంగా వుంటాయి.

        అతడి నైతిక విలువలు కూడా ప్రశ్నార్ధకమే. ఎక్కడో ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు దుర్బుద్ధితో వుంటారేమో గానీ, సర్వసాధారణంగా తమ ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువుల్ని వీలుంటే వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడమో, లేకపోతే పోలీసులకి అప్పజెప్పడమో చేస్తారు. వీర బాబు ఇవేమీ చెయ్యక, దాన్ని అమ్మేసి ఆటో మీద అప్పు తీర్చేయాలనుకుంటాడు. తర్వాత దాంతో సినిమా తీసి కోట్లు గడించాలనుకుంటాడు. ఆ కెమెరాలో దాని ఓనర్ సింధు తాలూకు వీడియోల్లో ఆమె కన్పిస్తున్నా గుర్తు పట్టనట్టే వుంటాడు. చివరికి ఆమె వెతుక్కుంటూ వచ్చాక సారీ కూడా చెప్పడు. ఇలా ఈ ప్రధాన పాత్ర చిత్రణ విలువలు లేకుండా దుర్బుద్ధితో కన్పిస్తుంది.

    కెమెరా కోసం ఆమె పోలీసుల చుట్టూ, వూళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని వచ్చిన ఆమె, కారు వదిలేసి ఆటో ఎందుకు ఎక్కిందో తెలీదు. ఆటో ఎక్కినట్టు కూడా ఆమెకి గుర్తుండదు.

        హీరోగా రాగ్ మయూర్ ఫన్నీగా నటించాడు. కెమెరామాన్ గా సందీప్ వారణాసి ఒక్క బండి కాడె మీద కూర్చుని క్రేన్ షాట్ తీయడం తప్ప, వేరే స్కిల్స్ కెమెరాతో ప్రదర్శించడు. అసిస్టెంట్ గా బాలనటుడు రాంచరణ్ ఎంట్రీ ఫన్నీ.

        శిరీష్, ప్రవీణ్ రెడ్డి ల సంగీతంలో వ్యంగ్యంగా చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ బావున్నాయి. అపూర్వ సాలిగ్రాం, సాగర్ ల ఛాయాగ్రహణం సహజత్వంతో కూడుకుని వుంది. కమర్షియల్ సినిమాల్లో చూపించని అసలైన గ్రామీణులు, వాళ్ళ జీవితాలూ ఎలా వుంటాయో కేరాఫ్ కంచర పాలెం’, కంబాలపల్లి కథలు’, ఇప్పుడు సినిమా బండి తెర కెక్కించడం మంచి పరిణామమే.

***

      రైటింగ్ సైడ్ కొత్త టాలెంట్ కన్పిస్తుంది. స్క్రీన్ ప్లే ప్రవీణ్ కండ్రేగుల, వసంత్ మరింగంటి, కృష్ణ ప్రత్యూష అయితే; మాటలు వసంత్ మరింగంటి. పోతే నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె లు కూడా దర్శకులే కాబట్టి, రచయితలే కాబట్టి, స్క్రిప్టులో వాళ్ళ ఆలోచనలు కూడా వుండి వుంటాయి. ఇది ఇంటలిజెంట్ స్క్రిప్టు కాకపోయినా మూసలో పడని క్వాలిటీ రైటింగ్ గా మాత్రం కన్పిస్తోంది కొన్ని లోపాలతో. ఇది దృశ్యాల వరకూ. ఇక కన్సెప్ట్ పరంగా చూస్తే ఇండీ ఫిలిం డిమాండ్ చేసే ఇంటలిజెన్స్ కనిపించడం లేదు.

        ముందుగా చెప్పుకున్నట్టు ఈ కథ సెల్ ఫోన్లు లేని కాలంలో నైతే వీడియో కెమెరాతో సినిమా తీసే ఆలోచనకి అద్భుతంగా వుండేది. సెల్ ఫోన్లు వచ్చాక ఎవరుపడితే వాళ్ళు షార్ట్ ఫిలిమ్సే తీసేస్తున్నాక, సినిమాకున్న గ్లామర్ పలచ బడ్డాక, ఈ కాలంలో వీడియో కెమెరా అద్భుతమని సినిమా తీయాలనుకోవడంలో సమకాలీనత లేదు. కంబాలపల్లి కథలు లో కంప్యూటర్ తో 2005 నాటి పీరియడ్ కథగా తీసినప్పుడు దానికి కాలీన స్పృహ వుంది. అప్పుడప్పుడే గ్రామాల్లోకి కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు వస్తున్నాయి కాబట్టి ఆ క్రేజ్ పాత్రల్లో కనిపించడంలో సహజత్వముంది. సినిమా బండి లో పాత్రలకి వీడియో కెమెరాతో ఈ కాలంలో అంత వండర్ అనుకోవడం కాన్సెప్ట్ కి వైరల్ ఐడియా మాత్రం కాదు. ఒక పాసివ్ ఐడియా మాత్రమే. వైరల్ ఐడియా కావాలంటే పైనే చెప్పుకున్నట్టు, ఈ అమాయక పాత్రలకి ఎవరో పారేసుకున్న ఆస్కార్ లెవెల్ స్క్రిప్టు  దొరకడమే!  కోతికి కొబ్బరి కాయ దొరకాలి గానీ జామకాయ కాదు.

        వీడియో కెమెరాతో సినిమా తీసి కోట్లు సంపాదించి వూరుని బాగుచేయాలన్న హీరో గోల్ లో కూడా బలం, వాస్తవికత లేవు. ఇది కంబాలపల్లి కథలు లో రెండు కోట్ల ఫేక్ లాటరీతో కథలాంటి టెంప్లెట్ ఫార్ములా. జానర్ మర్యాద కాదు.

        స్క్రీన్ ప్లే మాత్రం త్రీయాక్ట్స్ ప్రమాణాలతో వుంది. ఫస్టాఫ్ లో మొదటి పావుగంటలో దొరికిన కెమెరాతో సినిమా తీయాలనుకునే గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సెకండావ్ చివర్లో అదే కెమెరా ధ్వంసమయ్యే ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. పరస్పర విరుద్ధంగా ఇవి మంచి డైనమిక్స్ తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని నిలబెట్టాయి. ఇలాటి డైనమిక్సే హీరోయిన్ లేచిపోయి షూటింగు ఆగిపోవడం, తర్వాత షూటింగులో హీరో ఎక్కిన రైలు భువనేశ్వర్ దాకా వెళ్లిపోవడం మొదలైనవి. గోల్ కి అవరోధాలు కల్పించే ప్రత్యర్ధి పాత్ర లేకపోవడం షూటింగులోనే ఆటంకాలేర్పడ్డం మిడిల్ యాక్షన్ - రియాక్షన్ బిజినెస్ ని పోషించాయి. కథ హాస్యప్రధానంగా వున్నా, ఆటంకాలేర్పడ్డప్పుడు ఈ హాస్య ధోరణి వుండదు. డబ్బు సంపాదించడం గోల్ కాబట్టి శాడ్ మూడ్ లోకి జారుకోవడం. ఇదంతా సరైన కాన్సెప్ట్ లేకపోవడం వల్లే.  

        ఒక సరదాగానో, వ్యామోహంగానో, ఫాషన్ తోనో సినిమా తీయడం వరకే గోల్ గా కాన్సెప్ట్ వుండి వుంటే ఈ కథతో అంత ఇబ్బంది వుండేది కాదు. సినిమాతో కోట్లు గడించి బాగుపడాలన్న గోల్ వల్ల కథ కామన్సెన్సుని, వాస్తవికతనీ, అమాయక పాత్రల ఇన్నోసెన్స్ నీ కోల్పోయింది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 2009 లో తీసిన, ఆస్కార్ ఎంట్రీ సంపాదించిన, మరాఠీ క్లాసిక్ హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ లో ఫాల్కే పాత్రకి ఆర్ధిక ఇబ్బందులున్నా సినిమా తీసి డబ్బు సంపాదించాలన్న కోరిక మాత్రం అస్సలు వుండదు. కేవలం తెర మీద బ్రిటిష్ వాళ్ళు వేసిన సినిమా చూసి, ఆ కదిలే బొమ్మలకి వండరై పోయి, అలాటిది తనూ తీయాలని కేవలం వ్యామోహం పెంచుకుంటాడు.  
   
        ఇంటిల్లిపాదీ ఆ సినిమా తీయడంలో పాలు పంచుకుంటారు. చాలా హాస్య పాత్రలు, హాస్యమైన సన్నివేశాలు. కష్టాలు కూడా హాస్యమే. ఎక్కడా శాడ్ మూడ్ వుండదు. దేశంలో మొట్ట మొదటి సినిమా తీయడానికది ఏ సౌకర్యాలూ లేని కాలం, నటులు కూడా దొరకని కాలం. అలాటి కాలంలో సినిమా పట్ల కేవలం - కేవలం వ్యామోహంతో - సర్వం అమ్ముకుని, 1913 లో రాజా హరిశ్చంద్ర తీసి చరితార్ధుడయ్యాడు దాదా ఫాల్కే. వీరబాబులో ఈ వ్యామోహం లోపించి స్వార్ధం చోటు చేసుకోవడంతో మేకర్స్ తలపోసిన కాన్సెప్ట్ విఫలమైంది.

సికిందర్  

 

16, జనవరి 2021, శనివారం

1009 : రివ్యూ

రచన - దర్శకత్వం : ఉదయ్ గుర్రాల
తారాగణం : ప్రియదర్శి
, హర్షిత్ మల్గి రెడ్డి, గౌరీ ప్రియా రెడ్డి, అనూషా,రవీందర్ బొమ్మకంటి తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ
, ఛాయాగ్రహణం :  ఉదయ్ గుర్రాల, శ్యామ్ దూపాటి నిర్మాతలు :  ప్రియాంకా దత్, స్వప్నా దత్
విడుదల : ఆహా
***

    తెలుగులో షార్ట్ ఫిలిమ్స్ మోజు తగ్గి వెబ్ సిరీస్ సీజన్ ప్రారంభమై కూడా చాలా కాలమైంది. ఈ వెబ్ సిరీస్ కూడా సినిమాల్లాగే రోమాంటిక్ కామెడీల మయమై యూత్ ప్రేక్షకులతో సరిపెట్టుకున్నాయి. థియేటర్లలో సినిమాకొక కొత్త జంటగా రోమాంటిక్ కామెడీల బెడద వదిలిందనుకుంటే వెబ్ లో మొదలయ్యాయి. వేదిక మార్చుకున్నాయే తప్ప విషయం అదే. వెబ్ లో కూడా ఇవి వెలవెల బోతున్న వేళ కోవిడ్ మొదలయ్యింది. కోవిడ్ తో ఓటీటీ ముఖ చిత్రమే మారిపోయింది. కోవిడ్ కాలంలో ఓ 15 కొత్త ఓటీటీ కంపెనీలు వివిధ భాషల్లో వెలిశాయి దేశవ్యాప్తంగా. ఇంకొన్ని ప్లానింగ్ లో వున్నాయి. ఇవి ముందుకు తెచ్చిన కాన్సెప్ట్ ఏమిటంటే, లోకల్ కథలు చెప్పడం. కారణం, కోవిడ్ తో ఇంట్లో బందీలైన పెద్దవాళ్ళు, స్త్రీలు ఓటీటీకి కొత్త ప్రేక్షక వర్గమయ్యారు. దీంతో ఈ వర్గాన్ని టాప్ చేసేందుకు, స్థానిక జీవితాల సహజ కథలు అందించడం మొదలెట్టాయి ఓటీటీలు. అత్తాకోడళ్ళ టీవీ సీరియల్స్ చూసి చూసి వేసారిన స్త్రీలు, ముఖ్యంగా పట్టణ, గ్రామీణ స్త్రీలు, వెబ్ సిరీస్ లో దగ్గరగా తమ జీవితాల్ని చూసుకోవడం మొదలెట్టారు. అటు థియేటర్లలో  చూడదగ్గ సినిమాలు లేక, ఇటు ఇంట్లో టీవీ భరించలేక ఉక్కపోతకి గురైన పెద్దవాళ్ళకి  కూడా లోకల్ ఓటీటీలు వరంలా కన్పిస్తున్నాయి. స్థానిక భాష, సంస్కృతి, వారసత్వం, జీవితాలు, కమర్షియల్ సినిమాల కృత్రిమత్వాలకి దూరంగా సహజ కథలు, ప్రాంతీయ ఓటీటీల కాన్సెప్ట్ అయింది. బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, తుళు, కొంకణి, కన్నడ, మలయాళం ...ఇలా ప్రాంతీయ భాషల్లో వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్త మార్కెట్ ని పట్టుకున్నాయి.  

    క సర్వే ప్రకారం ఓటీటీ ప్రేక్షకులు నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా పెరుగుతున్నారు. కోవిడ్ తో దాదాపు 90 శాతం గ్రామాలకి ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ఓటీటీ చొచ్చుకెళ్లింది. మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల కంటే, పోటీ తక్కువ వుండే ఈ సింగిల్ లాంగ్వేజ్ ఓటీటీల నిర్వహణ, వ్యాపారం లాభసాటిగా వుంటోంది. ఇప్పటికే 50 కోట్ల యూజర్లతో అమెరికా తర్వాత ఇండియా పెద్ద మార్కెట్ గా వుంది. 2023 కల్లా ఇంకో 45 శాతం పెరిగి, 13 వేల కోట్ల రూపాయల భారీ మార్కెట్ గా విస్తరించే అవకాశముంది. మల్టీ లాంగ్వేజ్ ఓటీటీల్లో క్వాలిటీ కంటెంట్ కి అలవాటుపడ్డ ప్రేక్షకులు, సింగిల్ లాంగ్వేజీ ఓటీటీల్లో కూడా క్వాలిటీ కంటెంట్ కే ఓటు వేస్తున్నారనేది ఇక్కడ పాయింటు. కాబట్టి సంక్రాంతి సినిమాలు సహా 90% అట్టర్ ఫ్లాపయ్యే అడ్డగోలు సినిమాలు తీస్తున్నట్టు గాక, ఓటీటీ కంటెంట్ ని బాగా కష్టపడి, నిజాయితీగా తీయాలన్న మాట. 

    ఈ నేపథ్యంలో తెలుగుకే పరిమితమైన సింగిల్ లాంగ్వేజ్ ఓటీటీ ఆహా నుంచి గ్రామీణ వెబ్ సిరీస్ కంబాల పల్లి కథలు వెలువడింది. మొదటి చాప్టర్ గా మెయిల్ విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. దర్శకుడు ఉదయ్ గుర్రాల. మరి దీని కథేంటి, ఇదెంత క్వాలిటీతో వుందీ చూద్దాం...  

కథ

    తెలంగాణా మహబూబాబాద్ దగ్గర్లో నిద్రాణంగా వుండే కంబాల పల్లి గ్రామం, నిదానంగా సాగే కాలం, జీవితాలు 2005 లో. అప్పటికింకా కంప్యూటర్లు కొత్త. రవి (హర్షిత్ మల్గిరెడ్డి) అనే విద్యార్థి ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆన్ లైన్లో ఫలితాలు ప్రకటిస్తుంది ప్రభుత్వం. రవి ఆ కేంద్రాని కెళ్ళి రిజల్ట్స్ చూసుకుంటున్నప్పుడు, మొట్ట మొదటి సారిగా కంప్యూటర్ ని చూస్తాడు. కంప్యూటర్ సహా ఆ కేంద్రం మాయా ప్రపంచంలా కన్పిస్తుంది. థర్డ్ క్లాసులో పాసయిన అతను ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి పోవాలనుకుంటాడు. బీకాంలో చేరాల్సి వస్తుంది. 

        గ్రామంలో హైబత్ (ప్రియదర్శి) అనే అతను, ఫోటో స్టూడియో బోర్డు తీసేసి, కంప్యూటర్ గేమింగ్ సెంటర్ ప్రారంభిస్తాడు. ఇతను ఫోటో స్టూడియో నడుపుకుంటూంటే, పని నేర్చు కుంటామని ఇద్దరు చేరి, పదిహేను రోజుల్లో అటొకడు, ఇటొకడు  ఫోటో స్టూడియోలు తెరిచేసి మధ్యలో తనని ముంచేశారు. దీంతో కంప్యూటర్ గేమింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. దీన్ని రవి చూసి ఉద్రేక పడతాడు. కంప్యూటర్ నేర్చుకుంటానంటే, వీడెక్కడ ముంచుతాడోనని హైబత్ ఎలర్ట్ అవుతాడు. వదలకుండా సతాయిస్తూంటే కొన్ని షరతులు పెట్టి నేర్పుతాడు. ఈమెయిల్ ఎక్కౌంట్ క్రియేట్ చేసి, ఈమెయిల్ సౌకర్యం గురించి చెప్తాడు. దీంతో తనకి మెయిల్ వచ్చిందేమోనని రవి రోజూ చూస్తూంటాడు. ఒక రోజు రెండు కోట్లు లాటరీ తగిలినట్టు వస్తుంది. భయపడి వెళ్ళి ఫ్రెండ్ సుబ్బు (మణి) కి చెప్తాడు. సుబ్బు ధైర్యం చెప్పి, ఏంచేయాలో చెప్తాడు. ఆ ప్రకారం అడ్రసు పంపి ఎదురు చూస్తూంటే, లక్ష కట్టాలని మెయిల్ వస్తుంది. ఇప్పుడు రవి ఏం చేశాడన్నది, ఎలాటి చిక్కుల్లో పడ్డాడన్నది మిగతా కథ. 

నటీనటులు - సాంకేతికాలు
     ప్రియదర్శి తప్ప అందరూ కొత్తవాళ్లే. ప్రియదర్శి సహాయ పాత్ర వేశాడు. సీరియస్ గా వుంటూ నవ్వు తెప్పించే పాత్ర. తక్కువ మాటలు. సీన్లు కూడా తక్కువే. కంప్యూటర్ తెలిసిన వాడుగా హీరోలా ఫోజు కొట్టకుండా గ్రామీణ అమాయకత్వంతో కూడా వుంటాడు. కంప్యూటర్ వైరస్ అంటే అదేదో మనుషుల ద్వారా సోకే వైరస్ అనుకునే రకం. చెప్పులు బయట విడిచి రావాలని రూలు. ఆ రోజుల్లో నగరాల్లో కూడా కంప్యూటర్ రూములోకి చెప్పులు బయట విడిచే వాళ్ళు ఎడ్యుకేటెడ్ బ్యాచి. ఇలా ప్రియదర్శి గేమింగ్ కి వచ్చిన ఒక కుర్రాడి వల్ల కంప్యూటర్ కి వైరస్ సోకిందని  పంచాయితీ పెట్టించి జరిమానా వేయిస్తాడు. వైరస్ ని తీయించడానికి ఒక బైరాగిలా వుండే టెక్నీషియన్ ని పిలిపిస్తాడు. వాడు అటుచూసి ఇటు చూసి ఒక నొక్కు నొక్కితే వైరస్ పోతుంది. 500 వసూలు చేసుకుంటాడు. ఈ టెక్నీషియన్ ఎక్స్ ప్రెషన్స్ తో బాగా గుర్తుండి పోతాడు. ప్రియదర్శిది ఇలాటి అమాయకత్వం. పాత్ర గుర్తుండిపోయే విధంగా నిలబెట్టాడు. 

        రవిగా నటించిన హర్షిత్ ఆ లేత వయస్సుకి తగ్గట్టుగా మాటలు పలకడంలో గానీ, సున్నిత భావాలు ముఖంలో పలికించడంలో గానీ, కంప్యూటర్ తో అమాయకత్వంలో గానీ, లాటరీతో భావోద్వేగాలతో గానీ, నిద్రణంగా వుండే గ్రామంలో ఒదిగిపోతున్నట్టే  నిదానంగా వుంటాడు. పాత్రని ఇతను కూడా నిలబెట్టాడు. అలాగే ఇతడి స్నేహితుడు సుబ్బు పాత్ర వేసిన మణి గురించి కూడా చెప్పుకోవాలి. ఇక రవి ప్రేమించే స్టూడెంట్ రోజాగా గౌరీ ప్రియా రెడ్డి, ఇంకో అమ్మాయి గిరిజ పాత్రలో అనూషా తెలంగాణా అమ్మాయిల వాలకంతోనే వుంటారు. అప్పులిచ్చే శివన్నగా రవీందర్ బొమ్మకంటి ఇంకో ఎస్సెట్ నటవర్గానికి. వీళ్లే గాక ప్రతీ వొక్కరూ, చుట్టూ కొండలూ పచ్చటి ప్రకృతీ వుండే కంబాల పల్లి నేపథ్య వాతావరణంలో కలిసిపోయినట్టు వుంటారు.

       ఛాయాగ్రహణం దర్శకుడే నిర్వహించాడు. కెమెరావర్క్ క్వాలిటీతో వుంది. మిగతా అన్ని ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వున్నాయి. సున్నిత సంగీతం సహా సాంకేతిక విభాగాలు కంబాలపల్లి పరిసర వాతావరణాన్ని, నిద్రాణంగా వుండే మూడ్ ని కళాత్మకం చేశాయి. దర్శకత్వంలో కథ డిమాండ్ చేస్తున్న ఒక వస్తుగత శైలి వుంది. ఆ శైలిని  చివరంటా చెడకుండా శిల్పం చెక్కాడు దర్శకుడు. సంభాషణలు పనిగట్టుకుని రాసినట్టుగాక నిజంగా ఎలా మాట్లాడతారో ఆ మాటలు రాసేశాడు. ఈ కంబాల పల్లి మొదటి చాప్టర్ ని దాచుకో దగ్గ ఒక ఆల్బంగా రూపొందించాడు అభిరుచిగల ప్రక్షకులకి. నిడివి గంటా 56 నిమిషాలు మాత్రం ఎక్కువే. 

ఎలావుంది కథ
    2005 లో కంప్యూటర్ తో పీరియెడ్ కథగ్రామీణ నేపథ్యంలో కంప్యూర్ తో వైజ్ఞానిక  విప్లవంగా కాక ఫక్తు వినోద ప్రధాన కథ. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు గ్రామాల్లో కంప్యూటర్ల ప్రవేశం తల్లిదండ్రులకి తమ పిల్లల విద్యాభివృద్ధికి కొత్త కెరటంలా కన్పించింది. ఈ కోణం నేపథ్య మాత్రంగా కూడా స్పృశించకుండా కేవలం వినోద వస్తువుగా కథ వుంది. రవి పాత్ర కంప్యూటర్ కొనాలంటే తండ్రి మందలించడంలోనే విషయ ప్రాధాన్యాన్ని తగ్గించడం వుంది. కాస్త చారిత్రక వాస్తవాలు కూడా రికార్డు చేసి వుండాలి. ఈ వాస్తవిక కథలో పాయింటు కూడా ఫార్ములా సినిమా పాయింటులా రెండు కోట్ల ఫేక్ లాటరీ కాలక్షేప కథతో వుంది. హైబత్ పాత్ర కంప్యూటర్ గేమింగ్ ప్రారంభించినప్పుడు, కంప్యూటర్ రాక అనేది వినోదంతో పిల్లల్ని చెడగొట్టడానికా, పిల్లల విద్య కోసమా అన్న చర్చలేని గ్రామ పెద్దల ఉదాసీనత కాన్సెప్ట్ తో ఒక లోపంలా కన్పిస్తుంది. విద్య వర్సెస్ వినోదం కథ ఇంతే వినోదాత్మకంగా చెప్పివుండొచ్చు.         

    ఆర్కే నారాయణ్ రాసిన క్లాసిక్ కథల సంపుటి మాల్గుడి డేస్ దూరదర్శన్ సిరీస్ గా కూడా సంచలనం సృష్టించింది. మాల్గుడి అనే దక్షిణాది కల్పిత వూళ్ళో జరిగే కథలు. ఇవి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికీ కాలదోషం పట్టలేదు. మాల్గుడిలో జీవితాలు, ఎదుర్కొనే సమస్యలు, సాధారణంగా కన్పించే అసాధారణ చిత్రణలు. అనితర సాధ్యమైనవి కూడా. విజువల్ మీడియాకి వాస్తవిక రూరల్ కథలు తీయాలనుకునే వాళ్ళకి ఒక గైడ్ అనొచ్చు. 

    ఇందులో జంటిల్ మాన్స్ గిఫ్ట్ అనే కథలో రిటైరైన పాత్రకి పోస్ట్ లో ఒక కవర్ వస్తుంది. తను పని చేసిన కంపెనీ జనరల్ మేనేజర్ నుంచి. ప్రతీ నెలా పెన్షన్ అందినప్పుడల్లా బంక మన్నుతో ఒక ప్రతిమ తయారు చేసి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడల్లా గత నెల ఇచ్చిన బొమ్మ ఎలా వుందని అడిగేవాడు. మెచ్చుకునే వాడు జనరల్ మేనేజర్. అయితే ఇప్పుడిలా కవర్ రావడంతో కవరులో బొమ్మ విషయంలో ఏం కోప్పడుతూ రాశాడోనని భయం పట్టుకుంటుంది. కవరు విప్పే ధైర్యంలేక ఎక్స్ రే టెక్నీషియన్ కి చూపించి లోపలేముందో చెప్పమంటాడు. అతను టెస్టు చేసి ఆరోగ్యం బాగా లేదని రాసి వుందంటాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగికి దిగులు పట్టుకుంటుంది. ఇక బొమ్మలు చేసే వృత్తి చేయలేక పోతాడు. బొమ్మ వల్లే జనరల్ మేనేజర్ ఆరోగ్యం చెడిందనుకుని పిచ్చివాడైపోతాడు. ఇంతకీ ఆ కవర్లో ఏం రాశాడు జనరల్ మేనేజర్. అతి విధేయత, అమాయకత్వం మనిషిని ఎలా తయారు చేస్తాయి అన్న వొక క్యారక్టర్ స్టడీ ఈ కథ. ఆర్కే నారాయణ్ సున్నిత హాస్య ప్రియుడనేది కూడా తెలిసిందే. ఏ ప్రయోజనం కోసం కథ రాయాలన్న దృష్టి అదనపు హంగు. కంబాలపల్లి మెయిల్  కథ చూస్తే ఈ కథ మెదిలింది. పోలికలు కనిపిస్తాయి గానీ ప్రయాణాలు వేరు.

చివరి కేమిటి

   వాస్తవికత అనగానే ఇంకా ఆర్ట్ సినిమా ధోరణిలోకి వెళ్లి పోతూంటాయి కథలు. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లి మూడు దశాబ్దాలయింది. మళ్ళీ శ్యామ్ బెనెగల్ తేరుకుని 2000 లో కొత్త రూపమిచ్చాడు. దీన్నికొత్త దర్శకులు మల్టీ ప్లెక్స్ సినిమాలుగా మార్చి చెడగొట్టాక, 2015 లో కర్నాటక నుంచి కొత్త దర్శకుడు రాంరెడ్డి, ఆర్ట్ సినిమాకి ఆధునిక రూపమిస్తూ లోకల్- నేషనల్- ఇంటర్నేషనల్ అన్నితరగతుల ప్రేక్షకులకీ వర్తించేలా ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేశాడు. ఇదెలా చేశాడో ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. 
     
    వాస్తవిక కథలతో వెబ్ సిరీస్ నైనా కమర్షియల్ సినిమాల ప్రధాన స్రవంతిలోకి తీసుకురాక పోతే ఈ తరం ప్రేక్షకులకి రుచించవు. ప్రధాన స్రవంతి అంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో వుండే కథ. ఇండియాలో విజువల్ మీడియాకి త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వినా మార్గం లేదు. స్ట్రక్చర్ వుండని వరల్డ్ మూవీస్ చూసి మోసపోవద్దు. అవి స్ట్రక్చర్ వుండని ఆర్ట్ సినిమాల్లాంటివి. సినిమా ట్రైలర్ కైనా, యాడ్ ఫిలిమ్ కైనా త్రీయాక్ట్ స్ట్రక్చర్ వుంటుందని గుర్తించాలి. స్ట్రక్చర్ లేని ఉత్త క్రియేటివ్ ప్రదర్శన అంటే గోడలు లేని భవనం లాంటిది. తన వరకూ చూసుకుని ఆనందించే మురిపెం. ప్రేక్షకులకి పనికిరాదు. 

    మెయిల్ కథ గంట సేపటికి గానీ ఫేక్ లాటరీ పాయింటు కొచ్చి కథలోకి వెళ్ళదు. పాత్రల పరిచయానికి ఇంత సేపా? ఫేక్ లాటరీ కోసం  అప్పులు చేసిన రవి పాత్ర సమస్యకి చివరి పది నిమిషాల్లో ఇచ్చిన ముగింపు ఫార్ములా ముగింపుగా కాకుండా, ప్రత్యర్ధి శివన్న పాత్ర వెర్రిబాగుల తనంతో ఫన్నీగా వుంది మంచి విషయమే - అయితే కథ పాయింటుకి రాకముందు బిగినింగ్ నడక, పాయింటు కొచ్చాక ముగింపు వరకూ మిడిల్ నడక, ఆర్ట్ సినిమాల పోకడతో వుండడమే సమస్య. నిద్రాణంగా వుండే గ్రామమని నిద్రాణంగా వుండే కథనం చేయకూడదుగా. హైబత్ పాత్ర వూరికి పోతూ రవికి తాళాలు ఇచ్చి పోవడం, అలాగే శివన్న పాత్ర రవికి లక్ష అప్పు ఇచ్చేయడం వంటి రెండు ప్రధాన మలుపులు కథా సౌలభ్యం కోసం చేసినట్టే వుంది. తాళాలివ్వడానికి, లక్ష అప్పు ఇవ్వడానికి లాజికల్ కారణాలు జతపడక పోతే వాస్తవికత బలహీన పడుతుంది. ఆర్ట్ సినిమాల్నిఇక మర్చిపోయి, వాస్తవిక కథల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చి, అన్నివర్గాల ప్రేక్షకులకీ దగ్గర చేయడమే ఇప్పటి అవసరం.

సికిందర్