రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జూన్ 2023, మంగళవారం

1341 : స్పెషల్ ఆర్టికల్


 

కొత్త జేమ్స్ బాండ్ కోసం మళ్ళీ  వేట మొదలైంది. సగటున ప్రతి పదేళ్ళ కోసారి కొత్త జేమ్స్ బాండ్ కోసం వేట ఆనవాయితీగా వస్తోంది. 1962 లో వెండి తెర మీద తొలి జేమ్స్ బాండ్ 007 అవతరణ తర్వాత 2021 వరకూ 60 ఏళ్ళలో ఆరుగురు జేమ్స్ బాండ్ పాత్రధారులు వంతుల వారీగా ప్రపంచ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 007 స్పై సిరీస్ కి ఏడవ పాత్రధారి ఎవరవుతారనేది ఏడాది కాలం గా సస్పెన్స్ గా మారింది.

        రవ జేమ్స్ బాండ్ 007 గా డేనియల్ క్రేయిగ్ 5 బాండ్ సినిమాల్లో నటించి రిటైరయ్యాడు. ఇతను 1992 లో ది పవర్ ఆఫ్ ఒన్ తో సినీరంగ ప్రవేశం చేసి, మరో 22 సినిమాలు నటించిన తర్వాత, 2006 లో కాసినో రాయల్ తో జేమ్స్ బాండ్ అయ్యాడు. కాసినో రాయల్ తర్వాత క్వాంటమ్ సొలేస్ (2008), స్కై ఫాల్ (2012), స్పెక్టర్ (2015), నో టైమ్ టు డై (2021) లతో 15 ఏళ్ళ సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు. చిన్న తుపాకులతో అనుభవంతో పాటు, రేస్ డ్రైవింగ్, ఫ్రీ-రన్నింగ్, కార్డ్ ప్లేయింగ్ లలో ప్రత్యేక స్కిల్స్ తో 2006 లో జేమ్స్ బాండ్ పాత్రకి ఎంపికయ్యాడు.

జేమ్స్ బాండ్ పాత్రకి ఎంపిక కావాలంటే నటనానుభవం మాత్రమే వుంటే చాలదు. దాంతో బాటు జేమ్స్ బాండ్ గూఢచార పాత్రకి అవసరమైన ప్రత్యేక స్కిల్స్ కొన్ని కలిగి వుండాల్సిందే. మొట్టమొదటి జేమ్స్ బాండ్ గా థామస్ సీన్ కానరీ 1962 -1983 ల మద్య 6 బాండ్ సినిమాల్లో నటించాడు. చిన్న తుపాకులు పేల్చడం, గాంబ్లింగ్, రేస్-డైవింగ్, లైట్-ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్- బెల్ట్ వంటి ప్రత్యేక స్కిల్స్ ఇతడి సొంతం.

ఆరోన్ టేలర్-జాన్సన్ 
    రెండవ జేమ్స్ బాండ్ గా జార్జ్ లాజెన్‌బీ వచ్చాడు. 1969 లో సీన్ కానరీ వుండగానే ఒక సినిమాలో నటించాడు. చిన్న తుపాకులు పేల్చడం, స్కీయింగ్, బాబ్-స్లెడ్డింగ్, డ్రైవింగ్, గుర్రపు స్వారీ, గాంబ్లింగ్, డ్రింకింగ్, స్మోకింగ్ మొదలైన వాటిలో స్పెషల్ స్కిల్సు ఇతడి ఆస్తి.
       
మూడవ బాండ్
రోజర్ మూర్. ఇతను చాలా ఫన్నీగా ఎంటర్ టైన్ చేస్తాడు. కామెడీ పాలెక్కువ. 1972-1985 మధ్య ఏడు బాండ్ సినిమాలు నటించి ఎక్కువ పాపులరయ్యాడు. చిన్న తుపాకులు పేల్చడంలో,  బాంబులు-  పేలుడు పదార్థాలు పేల్చడంలో, పెద్ద వాహనాలు నడపడంలో, స్నోబోర్డింగ్ తో,  స్కీయింగ్ తో , జలాంతర్గాములతో, వైన్- షాంపేన్- సిగార్లు వంటివి తాగడంలో ప్రత్యేక స్కిల్స్ గడించాడు.
       
నాల్గో జేమ్స్ బాండ్ టి
మోతీ డాల్టన్. 1986-1994 మధ్య రెండు బాండ్ సినిమాల్లో నటించాడు.  చిన్న తుపాకులు, పెద్ద విమానాలు, డైవింగ్, గాంబ్లింగ్,  స్నిపింగ్, స్మోకింగులతో స్పెషల్ స్కిల్స్.
       
ఐదో బాండ్
పియర్స్ బ్రాస్నన్. 1994-2005 మధ్య 4 బాండ్ సినిమాలు నటించాడు. ప్రత్యేక స్కిల్స్ : చిన్న తుపాకులు, జెట్ పైలటింగ్, బేస్-జంపింగ్, స్కీయింగ్, మోటార్‌సైక్లింగ్, లైట్-ఎయిర్‌క్రాఫ్ట్, వైస్, సిగార్లు.
       
ఆరవ బాండ్ గా ఇప్పుడు డేనియల్ క్రేయిగ్ రిటైరయ్యాడు.
బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన సూపర్ స్పై జేమ్స్ బాండ్ పాత్ర సాహసకృత్యాలు చేయని దేశం లేదు. 1983 లో రోజర్ మూర్ నటించిన ఆక్టోపస్సీ లో ఇండియా వచ్చి ఉదయపూర్ లో హంగామా చేసిపోయాడు.
       
1962 నుంచీ ఈ 60 ఏళ్ళ కాలంలో 25 జేమ్స్ బాండ్ 007 సినిమాలు నిర్మించిన ఆల్బర్ట్ బ్రకోలీ
, ఆయన మరణానంతరం కుమార్తె బర్బరా బ్రకోలీ,
26వ బాండ్ సినిమాని 2024 లోపు ప్రారంభించే అవకాశంలేదు. విడుదల 2025-26 లలో వుండొచ్చు. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. బాండ్ 26 గా వర్కింగ్ టైటిల్ పెట్టారు. దర్శకుడుగా మాత్రం డెనిస్ విలెన్యూ అనే కెనడియన్ -ఫ్రెంచి దర్శకుడు ఎంపికయ్యాడు. ఇతను హాలీవుడ్ లో 11 సినిమాలకి దర్శకత్వం వహించాడు-  బ్లేడ్ రన్నర్ 2049 సహా.

హెన్రీ కావిల్
    మరి కొత్త జేమ్స్ బాండ్ ఎవరు? కొత్త జేమ్స్ బాండ్ ముప్ఫైలలో వున్న యువకుడై వుండాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2022 చివర్లో కొత్త జేమ్స్ బాండ్ గా ఆరోన్ టేలర్-జాన్సన్ ఉద్భవించాడని హాలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. ఇతను రహస్య ఆడిషన్‌లో పాల్గొన్నాడనీ, బాండ్ నిర్మాతల్ని ఆకట్టుకున్నాడనీ సమాచార సారాంశం. 32 ఏళ్ళ ఆరోన్ 22 సినిమాల్లో నటించాడు. వీటిలో చివరిది బుల్లెట్ ట్రైన్’.
        
అయితే ఆరోన్ ఫైనల్ కాలేదు. కొత్త జేమ్స్ బాండ్ లిస్టులో ఇంకా పది నుంచి 25 మంది వరకూ హీరోల పేర్లున్నాయి. వీరిలో నల్ల జాతీయుడు ఇద్రిస్ ఎల్బా కూడా వున్నాడు. ఇతను తప్పుకున్నాడు. నిర్మాతల ఇంకో నియమం ఏమిటంటే, ఎంపిక చేసిన నటుడు జేమ్స్ బాండ్ గా పది పన్నెండేళ్ళ పాటు సర్వీసు ఇవ్వగల స్టామినాతో వుండాలి.  
       
రెజ్-జీన్ పేజీ
పరిశీలనలో వున్న ఇంకో పేరు. ఇతను మూడవ బాండ్ రోజర్ మూర్ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా వున్నట్టు చెప్పాడు. టామ్ హార్డీ వినిపిస్తున్న ఇంకో పేరు. ఇతను మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’, ఇన్‌సెప్షన్’, ది డార్క్ నైట్ రైజెస్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు.  
        
క్రేయిగ్ శకం ముగియడంతో, 007 నిర్మాతలు ఫ్రాంచైజీని కొంచెం ముందుకు -అంటే నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలని కోరుకునే అవకాశం వుంది. దీనికి కూడా అర్హతలున్న హీరో కావాలి. హెన్రీ కావిల్ ఇంకో పేరు. అలాగే ఐడాన్ టర్నర్, రాబర్ట్ ప్యాటిన్సన్, రిచర్డ్ మాడెన్, గాబ్రియేల్ బస్సో, సిలియన్ మర్ఫీ, సామ్ హ్యూగన్, జాక్ లోడెన్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ నార్టన్, జోనాథన్ బెయిలీ, హెన్రీ గోల్డింగ్జామీ బెల్, జాన్ బోయెగా, విల్ పౌల్టర్, డాన్ స్టీవెన్స్, డేనియల్ కలుయుయా, క్లైవ్ స్టాండెన్, డ్వేన్ జాన్సన్టామ్ హాప్పర్, చివెటెల్ ఎజియోఫోర్...ఇలా లిస్టు పెద్దదే. ఇందులో ఇంకో పేరు చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. దేవ్ పటేల్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ నటుడు. స్లమ్ డాగ్ మిలియనీర్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం.

గాబ్రియేల్ బస్సో
    బాండ్ నిర్మాతలు ఒకే మూసలో ఆలోచిస్తున్నట్టున్నారు. ఎంతసేపూ పాశ్చాత్య హీరోలనే జేమ్స్ బాండ్ గా ఎంపిక చేసుకుంటున్నారు. గ్లోబల్ సినిమాలంటే ఇప్పుడు ఒక్క హాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు. ఆస్కార్ లో అవార్డులు తీసుకున్న టాలీవుడ్ కూడా గ్లోబల్ సినిమాగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతోంది- ఆర్ ఆర్ ఆర్ ద్వారా. అందుకని జేమ్స్ బాండ్ గా టాలీవుడ్ హీరో కూడా ఏమాత్రం తీసిపోడు. దేవ్ పటేల్ సరే, ప్రభాస్ వైపు కూడా బాండ్ నిర్మాతలు చూస్తే బావుంటుంది.

—సికిందర్ 

 

 

5, జూన్ 2023, సోమవారం

1340 : స్పెషల్ ఆర్టికల్

        ప్రసిద్ధ  బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, స్వర్గీయ కిషోర్ కుమార్ బయోపిక్ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్ళుగా ఈ బయోపిక్ విషయం తేలడం లేదు. అయినా బాలీవుడ్ హీరోలు నేనే కిషోర్ కుమార్ పాత్ర పోషిస్తున్నానంటే, కాదు నేను పోషిస్తున్నానని పోటీలు పడి ప్రకటించుకుంటున్నారు. అసలు బయోపిక్ కి మేం  అనుమతి ఇవ్వాలిగా అని కిషోర్ కుమార్ కుటుంబం చురక వేస్తోంది. దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడిలా వున్నాడు. మీరంతా కాదు, మేమే కిషోర్ కుమార్ బయోపిక్ నిర్మిస్తాం, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని  కిషోర్ కుమార్ కుటుంబం ప్రకటిస్తోంది. ఇలా కౌంటర్లు వేసుకుంటూ పాయింటుకి రాలేకపోతున్నారు అటు ఇటూ సెలెబ్రిటీలు.

        టీవల బయోపిక్ లో కిషోర్ కుమార్ పాత్రని రణవీర్ సింగ్  స్థానంలో రణబీర్ కపూర్ పోషించ వచ్చని వచ్చిన వార్తల నేపథ్యంలో, అసలు బయోపిక్ హక్కులు ఎవరికీ ఇవ్వడం జరగలేదని కిషోర్ కుమార్ కుమారుడు, గాయకుడు అమిత్ కుమార్ స్పష్టం చేశాడు. దీంతో బయోపిక్ సన్నాహాల్లో వున్న దర్శకుడు అనురాగ్ బసు ఇరుకున పడ్డాడు. ళ్ళీ ళ్ళీ  హక్కుల కోసం కిషోర్ కుమార్ కుటుంబాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది.

కిషోర్ కుమార్ కుటుంబం, ముఖ్యంగా ఆయన కుమారుడు అమిత్ కుమార్, బయోపిక్ హక్కుల్ని ఇంకా ఎవరికీ ఇవ్వడానికి సిద్ధంగా లేడనేది నిర్వివాదాంశం. అనురాగ్ బసు ఈ బయోపిక్ కోసం ఎనిమిదేళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య ఈ బయోపిక్ ని రణవీర్ సింగ్ తో తీయవచ్చని వచ్చిన వార్తలకి భిన్నంగా రణబీర్ కపూర్ తోనే నిర్మిస్తారని ధృవీకరణ వచ్చింది. స్వయంగా రణబీర్ కపూర్ కూడా ప్రకటించాడు. ఎనిమిదేళ్ళుగా దర్శకుడు అనురాగ్ బసుతో తను ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నట్టు స్పష్టం చేశాడు.       

అయితే అనురాగ్ బసు- రణబీర్ కపూర్‌లు ఈ బయోపిక్ తీయలేరనీ, వారికి కాపీరైట్ లేదనీ, కాపీరైట్ కోసం అమిత్ కుమార్ తోబాటు, కిషోర్ కుమార్ భార్య లీనా చందా వర్కార్ ని అనేక మార్లు ప్రయత్నించారనీ, కిషోర్ కుమార్ కుటుంబం నుంచి వివరణ వెలువడింది.

మరోవైపు స్క్రిప్టు మీద పనిచేస్తున్నామనీ చెప్పిన అమిత్ కుమార్, దర్శకత్వం తానే వహించబోతున్నట్టు సంకేతాలిచ్చాడు. అయితే ఎవరు నటిస్తారనేది చెప్పలేదు. తను నటించే అవకాశం మాత్రం వుండదని చెప్పొచ్చు. కిషోర్ కుమార్ బయోపిక్ తీయాలంటే కేవలం వృత్తి గత జీవితం తీస్తే సరిపోదు. ఆలాతీస్తే అమిత్ కుమార్ నటించవచ్చు. నాల్గు పెళ్ళిళ్ళు చేసుకున్నకిషోర్ కుమార్ భార్యలతో కుటుంబ జీవితం కూడా చూపించాలి కాబట్టి కుమారుడైన అమిత్ కుమార్ నటిస్తే బావుండదు.
        
కొంత కాలం క్రితం అనురాగ్ బసు దర్శకత్వంలో గాయకుడు అద్నాన్ సమీ నటించవచ్చని మీడియాలో రాశారు. భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమి స్వయంగా సంగీతకారుడు, స్వరకర్త, నటుడు కూడా అయినందు వల్ల ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడని మీడియా వర్గాలు వెల్లడించాయి.  అద్నాన్ సమీ గతంలో కిషోర్ కుమార్ పాడిన కొన్ని క్లాసిక్ హిట్స్ ని ఒక ప్రముఖ రియాలిటీ షోలో పునఃసృష్టించాడు కూడా. ఈ షో పెద్ద హిట్టయ్యింది.
        
తర్వాత అద్నాన్ సమీ పేరు వెనక్కి వెళ్ళిపోయి అమీర్ ఖాన్ తెరపై కొచ్చాడు. ఇవన్నీ గమనిస్తూ వున్న నటుడు నసీరుద్దీన్ షా, అసలెవరు కిషోర్ కుమార్ బయోపిక్ తీసినా, ఆర్డీ బర్మన్ బయోపిక్ తీసినా చెడగొడతారనీ, వాటి జోలికి పోవద్దనీ హితవు చెప్పాడు.
        
అయితే బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం ఆసక్తి రేపడంలేదు. కేవలం అమిత్ కుమార్- అనురాగ్ బసు శిబిరాల మధ్యే ముసుగులో గుద్దులాటగా ఇది సాగుతోంది. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందనేదే ఇప్పుడు ఆసక్తి పుట్టిస్తున్న ప్రశ్న. అసలు కిషోర్ కుమార్ చాలా సంకీర్ణ వ్యక్తిత్వమున్న కళాకారుడు. లోభిలా కన్పిస్తాడు, అంతలోనే దానాలు చేసి ఆశ్చర్య పరుస్తాడు. చాలా హాస్యప్రియుడు. స్టూడియోలో పాట పాడే ముందు అసిస్టెంట్ వైపు చూసి కాఫీ అందిందా?” అంటాడు. అంటే డబ్బు ముట్టిందా అని అర్ధం. కాఫీ అందిందని అసిస్టెంట్ సైగ చేస్తే పాట పాడతాడు, లేకపోతే లేదు. 
        
ఒక కొత్త దర్శకుడు వస్తే 18 వేలు ఇస్తే పాడతానని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పట్లో 18 వేలు చాలా ఎక్కువ. ఆ కొత్త దర్శకుడు నిర్మాతని ఎలాగో ఒప్పించుకుని పాడించుకున్నాడు. పాట పూర్తయ్యాక, కిషోర్ ఆ 18 వేలు కొత్త దర్శకుడికి ఇచ్చేసి- “ఇది నిర్మాతకి తిరిగి ఇవ్వకు. దాచుకో. సినిమాల్ని నమ్ముకోకు అన్నాడు. ఆ కొత్త దర్శకుడు కిషోర్ ఇంటి అవతల ఆ 18 వేలతో గుడిసె కొనుక్కుని తర్వాత రిచ్ అయ్యాడు.
        
కిషోర్ కుమార్ ఎప్పుడేం చేస్తాడో ఎవరూ పసిగట్టలేరు. అర్ధరాత్రి లేచి తలగడ కింద నోట్లు లెక్కబెట్టుకుంటాడు. ఒక ప్రముఖ నిర్మాత మీద కోపంతో ఆయనకి పాటలు పాడడం ఇష్టం లేక, ఆయన ఇంటికి రాకుండా గేటు ముందు కుక్కల్ని కట్టేశాడు. ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ షూటింగులో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముంబయిలో మూడు గంటలు కారు తోలుకుంటూ వెళ్ళి పోతూనే వున్నాడు. షూటింగ్ సిబ్బంది వెంటాడి ఎలాగో  పట్టుకుంటే “మీరు కట్ చెప్పలేదుగా?” అన్నాడు.
        
ఇలాటి కామెడీలు చాలా వున్నాయి. కానీ పాటలు పాడడం కామెడీ కాదు. చాలా సీరియస్. పాట పాడాడంటే అదొక అద్భుతమే. దాన్ని కాలం చెరిపి వెయ్య లేదు. కిషోర్ కుమార్ (అభాస్ కుమార్ గంగూలీ, 1929 - 1987)  హిందీతో బాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, భోజ్ పురి, అస్సామీ, ఒడియా సహా అనేక ఇతర భారతీయ భాషల్లో వేలకొద్దీ పాటలు పాడారు. తను గాయకుడే గాక, నిర్మాత, నటుడు, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. ఆయన నాల్గు సార్లు వివాహమాడేడు- రూమా గుహా థాకుర్తా (1950-58), మధుబాల (1960-60), యోగితా బాలి (1976-78), లీనా చందా వర్కార్ (1980-87).
        
"ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకుల్నీ మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజల్ని ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గానీ మన బాధ వారికి పంచకూడదు." ఇదీ కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన ఫిలాసఫీ.
        
"తోటలో నుంచి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి." అని సెలవిచ్చాడు.

—సికిందర్

 

4, జూన్ 2023, ఆదివారం

1339 : రివ్యూ!


రచన- దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ 
తారాగణం : తిరువీర్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు
సంగీతం : యశ్వంత్ నాగ్, ఛాయాగ్రహణం : వాసు పెండమ్
సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి  

విడుదల : జూన్ 2, 2023
***

రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఇటీవలి హార్రర్ మసూద హీరో తిరువీర్ ఇందులో కథానాయకుడు. తెలంగాణ నేపథ్యపు సినిమా. ఈ మధ్య తెలంగాణ నేపథ్యపు సినిమాలు బాగానే వస్తున్నాయి. అయితే వీటిని హిట్టయిన జాతిరత్నాలు టైపులోనే తీస్తున్నారు. ఒక తెలంగాణ టౌను లేదా పల్లె, అక్కడ నల్గురు కుర్రాళ్ళు, వాళ్ళ కామెడీలు, అవే కథలూ వగైరా. ఇలాటి సినిమాలు తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా విపరీతంగా వచ్చేసి ఆ అధ్యాయం ముగిసిపోయింది. ముగిసి పోయిన మెయిన్ స్ట్రీమ్ అధ్యాయాన్ని తెలంగాణ సినిమా ఎత్తుకుంది. మొన్న విడుదలైన మేమ్ ఫేమస్ కూడా ఈ కోవకి చెందిందే. ఇప్పుడు పరేషాన్ దీని సరసన చేరింది. ఇలాటి సినిమాల్ని నిర్మాతల సొమ్ములు, ప్రేక్షకుల సమయం వృధా చేయాడానికే తీస్తున్నారేమో తెలీదు. పారేషాన్ కి ఇంతకి మించి వేరే ఆశయమున్నట్టు కనపడదు. ఇంతకీ ఈ పరేషానేమిటో తెలుసుకుందాం...

కథ

మంచిర్యాలలో ఐజాక్ (తిరువీర్) ఐటీఐ ఫెయిలై ఫ్రెండ్స్ తో తాగి ఆవారాగా తిరుగు తూంటాడు. ఇతడి తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి ఉద్యోగి. ఈ తండ్రి ఆవారాగా తిరుగుతున్న కొడుక్కి తన ఉద్యోగం ఇప్పిద్దామని ఆఫీసర్ తో రెండు లక్షలకి మాట్లాడుకుంటాడు. ఆ డబ్బులు భార్య బంగారం అమ్మి కొడుకు చేతికిచ్చి, ఆఫీసర్ కి ఇమ్మంటాడు. ఇంతలో ఫ్రెండ్స్ కి ఏవో అవసరాలొచ్చి ఆ డబ్బు వాళ్ళ కిచ్చేస్తాడు కొడుకు ఐజాక్. ఇతడితో ప్రేమలో వున్న శిరీష (పావనీ కరణం) గర్భవతవుతుంది. టౌన్లో పరీక్షలు చేయిద్దామంటే ఐజాక్ దగ్గర డబ్బులుండవు. ఫ్రెండ్స్ ని అడిగితే ఇవ్వరు. ఇంతలో కొడుకు డబ్బు పాడు చేశాడని తండ్రికి తెలుస్తుంది. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

పైన చెప్పుకున్నట్టు ఈ తెలంగాణ సినిమా కూడా ముగిసి పోయిన తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాల అధ్యాయాన్నే తిరిగి ప్రేక్షకులకి వడ్డించింది. అయితే తెలంగాణ యాసతో, తెలంగాణ పాత్రలతో, తెలంగాణ కల్చర్ తో తీసే ఇలాటి సినిమాలు కామెడీ ప్రధానంగా వుంటున్నాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్ తర్వాత కామెడీ కూడా లేదు. కథలో విషయం లేక కామెడీ పుట్టలేదు. ఫస్టాఫ్ అంతా దాదాపు పాత్రల్ని పరిచయం చేయడానికే సరిపోయింది. ఈ పరిచయాల వరకే కామెడీ చేష్టలు సరిపోయాయి. తీరా కథలోకి ప్రవేశించాక- తండ్రి ఇచ్చిన డబ్బు తిరిగి హీరో ఫ్రెండ్స్ నుంచి వసూలు చేసుకునే కథే కావడంతో- సినిమాగా నిలబడడానికి కాన్ఫ్లిక్ట్ సరిపోక- కాన్ఫ్లిక్ట్ సరిపోక పోయేసరికి దాని తాలూకు కామెడీ లేక, సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాలతో దారితప్పి భారంగా పరిణమించింది.

కథ లేనప్పుడు వున్న కథని కాంప్లికేట్ చేయాలన్నది హాలీవుడ్ పాటించే రూలు. పోను పోనూ కామెడీ కథని కామెడీతో పరమ సంక్లిష్టంగా మార్చేస్తూ, చివర్లో  చిక్కు ముడి విప్పుతారు. ఈ సంక్లిష్టతకి, చిక్కుముడి సస్పెన్సుకి ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కామెడీని ఎంజాయ్ చేస్తారు. హేపీ భాగ్ జాయేగీ అని హిందీలో కథలేని కామెడీ సినిమాని ఇలాగే తీసి హిట్ చేశారు.

ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా కథా సౌలభ్యం కోసం వుందే తప్ప కథలోంచి పుట్టలేదు. తాగి ఆవారాగా తిరిగే కొడుకుతో గొడవ పడే తండ్రి, అతడి చేతికే రెండు లక్షలిచ్చి ఆఫీసర్ కిచ్చి రమ్మనడమేమిటి?

కామెడీ అంటే జోకులు పేల్చడమే అన్నట్టుంది. యూత్ కోసం తీసిన ఈ సినిమాలోని జోకులకి యూత్ కైనా నవ్వొచ్చే పరిస్థితి లేదు. సెకండాఫ్ లో మాత్రం రెండు చోట్ల పిచ్చి జోకులు నవ్విస్తాయి. పోతే దసరా లో లాగా ఈ సినిమాలో కూడా తాగుడు సీన్లు అదుపు తప్పాయి. సమస్య వచ్చినా, సంతోషమేసినా, డబ్బు లేకపోయినా తాగుడే. హీరో దగ్గర డబ్బు తీసుకున్న ఫ్రెండ్స్ ఆ రెండు లక్షలు తాగుడుకే పెట్టేసే కథ ఇది.

హీరోయిన్ తో ప్రేమ కథ కూడా కుదర్లేదు. హీరోతో ఒకసారి పడుకోగానే వెంటనే గర్భం వచ్చేసిందని కంగారు పడే సిల్లీ హీరోయిన్ పాత్ర. ఇది నమ్మి టెస్టుల కోసం డబ్బులేక పాట్లు పడే హీరో పాత్ర. లాజిక్ లేని కథ, లాజిక్ లేని పాత్రలు, సిల్లీ జోకులతో కామెడీ – ప్రేక్షకులకి చాలా పరేషాన్!

నటనలు- సాంకేతికాలు

మసూద లో తిరువీర్ కీ, పరేషాన్ లో తిరువీర్ కీ పోలిక లేదు. ఇలాటి సినిమాలో నటించి తనకున్న ఫాలోయింగ్ ని దెబ్బ తీసుకోవడమే. తనని చూసి ఓపెనింగ్ కి వచ్చిన యువ ప్రేక్షకులు అసహనంతో ఈ సినిమా చూస్తున్న దృశ్యాలు థియేటర్లో కన్పిస్తాయి. దమ్ములేని సినిమాలో మసూద లోలాంటి దమ్మున్న యాక్టింగ్ కి అవకాశం లేకుండా పోయింది. గెటప్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే అతడ్ని చూసేలా చేస్తాయి.

హీరోయిన్లు పావనీ కరణం, సాయి ప్రసన్నల పాత్రలు, నటనలు జీరో అయినా వాళ్ళని తగినంత గ్లామరస్ గా చూపించడానికైనా ప్రొడక్షన్ విలువలు సరిపోలేదు. కెమెరా వర్క్, సంగీతం విఫలమయ్యాయి.

2019 లో సంపూర్ణేష్ బాబు నటించిన కామెడీ కొబ్బరిమట్ట కి దర్శకుడుగా పనిచేసిన దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ తన ఈ మలి ప్రయత్నంతో ఎలాటి జాగ్రత్తలూ తీసుకోక పోవడం విచారకరం. లేకపోతే ముగిసిపోయిన ఇలాటి మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా అధ్యాయాన్ని రీసైక్లింగ్ చేస్తే తెలంగాణ సినిమా అయిపోతుందని నమ్మే దర్శకుల్లో తనూ ఒకడు కావాలనుకోవడాన్నే నిజమైన కామెడీగా తీసుకుని ఎంజాయ్ చేయాలేమో.  
—సికిందర్                                                                 

 

 

3, జూన్ 2023, శనివారం

1338 : రివ్యూ!


 

దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
తారాగణం : బెల్లంకొండ గణేష్, అవంతికా దాసాని, సముద్రకని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
రచన : కృష్ణ చైతన్య, సంగీతం : మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : అనిత్ కుమార్
నిర్మాత : సతీష్ వర్మ
విడుదల : జూన్ 2, 2023
***

        త సంవత్సరం ‘స్వాతిముత్యం’ అనే ఫ్యామిలీ డ్రామాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్ ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు. అల్లరి నరేష్ తో ‘నాంది’ అనే హిట్ తీసిన సతీష్ వర్మ దీనికి నిర్మాత. రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు దీంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పూనుకున్నాడు. కొత్త దర్శకుడి సినిమా అనగానే క్రేజ్ వచ్చే పరిస్థితులిప్పుడు లేవు. సినిమాని విడుదల చేశాకే ప్రేక్షకుల్ని మెప్పించి క్రేజ్ ని సృష్టించుకోవాలి. ఇలా క్రేజ్ ని సృష్టించుకోగలిగాడా కొత్త దర్శకుడు? ఇది తెలుసుకుందాం...

కథ

వైజాగ్ లో  సుబ్బారావు (గణేష్) ఒక కాలేజీ స్టూడెంట్. అతడికి ఐ ఫోన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఐఫోన్ కి యజమాని కావాలని కష్టపడి 90 వేలు కూడబెట్టి ఐఫోన్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. ఒకరోజు కాలేజీలో కొట్లాటలు జరిగి పోలీసులు అందరి ఫోన్లు సీజ్ చేస్తారు. అందులోంచి సుబ్బారావు ఐ ఫోన్ పోతుంది. దీంతో పోలీస్ కమీషనర్ వాసుదేవన్ (సముద్రకని) కి ఫిర్యాదు చేస్తాడు. అతను పట్టించుకోక పోవడంతో అతడి కూతురు శృతి (అవంతికా దాసానీ) తో స్నేహం చేసి, ఐ ఫోన్ ని పొందాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో వుండగా ఒక హత్య జరిగి అందులో ఇరుక్కుంటాడు. ఇంతలో తన బ్యాంకు అక్కౌంట్లో కోటీ 75 లక్షలు పడతాయి. ఇప్పుడు తనని హత్య కేసులో ఇరికించిందెవరు? అక్కౌంట్లో డబ్బులు ఎక్కడ్నించి పడ్డాయి? ఐఫోన్ పోవడానికీ హత్యకీ సంబంధమమేమిటి? ఈ కుట్రలోంచి సుబ్బారావు ఎలా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కథ. అయితే దీనికి ఏర్పాటు చేసిన ఐఫోన్, హత్య, అక్కౌంట్లో డబ్బులు అనే నేపథ్యాలు కథతో కనెక్ట్ అవక వీగిపోయాయి. సారమంతా అన్ క్లెయిమ్డ్ బ్యాంక్ అక్కౌంట్ల స్కామ్ తో వుంటుంది. హీరో ఈ స్కామ్ ని ఛేదించి తెలివితేటలతో నేరస్థుల్ని పట్టుకునే థ్రిల్లింగ్ క్లయిమాక్సు తప్ప మిగతాదంతా ఆషామాషీగా వుంటుంది. అంటే కొత్త దర్శకుడి దగ్గర థ్రిల్లింగ్ క్లయిమాక్స్ తప్ప మిగతా కథ లేదన్న మాట. మళ్ళీ ఈ క్లయిమాక్స్ తో కథకిచ్చే ముగింపు వర్కౌట్ కాలేదు.
       
అందుకే ఫస్టాఫ్ ఐఫోన్ పిచ్చితో
, దానికి పేరు పెట్టుకుని పాల్పడే చాదస్తాలతో సాగతీత వ్యవహారంగా వుంటుంది. ఐఫోన్ ని పొందడం కోసం హీరోయిన్ తో సాగించే రోమాన్స్ కూడా సహన పరీక్షే. ఇంటర్వెల్ కి ముందు హత్యతో గానీ కథ ప్రారంభం కాదు.
       
సెకండాఫ్ హీరో హత్య కేసులోంచి బయటపడే – స్టూడెంట్ పవర్ చూపించే కమర్షియల్ ప్రయత్నాలు. ఇదైనా యూత్ అప్పీల్ తో వుండాల్సింది. సస్పెన్స్ థ్రిల్లర్ లో సస్పెన్స్
, థ్రిల్, టెంపో, స్పీడ్, ట్విస్టులు కూడా మర్చిపోతే ఎలా? ఇలా కథ చేసుకోవడంలో ప్రొఫెషనలిజం కొరవడి, విసిగిస్తూ క్లయిమాక్స్ కి చేరి, విశ్వరూపమంతా అప్పుడు చూపించడం! మళ్ళీ దీంతో ముగింపు షరా మామూలు సిల్లీ వ్యవహారమే. ఇలా సినిమా సక్సెస్ అవుతుందా? అన్ క్లెయిమ్డ్ బ్యాంక్ అక్కౌంట్ల స్కామ్ ఎంత మందికి అర్ధమౌతుంది? దీనికెంత బాక్సాఫీసు అప్పీల్ వుంటుంది? ఇది వెబ్ సిరీస్ గా తీయాల్సిన పాయింటు కావచ్చు.

నటనలు- సాంకేతికాలు

సామాన్య స్టూడెంట్ పాత్రలో బెల్లంకొండ గణేష్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తప్ప తన దగ్గర ఇంకేమీ లేదని యువప్రేక్షకులకి హింట్ ఇచ్చాడు. దర్శకుడికి తగ్గ హీరో అన్పించుకున్నాడు. ఇంతకంటే చెప్పుకోవడానికేమీ లేదు. హీరోయిన్ అవంతిక అందచందాలతో యూత్ అప్పీల్ ని కలిగి వుంటుంది- పాత్రకి మాత్రం లాజిక్ వుండదు. పోలీస్ కమీషనర్ గా సముద్రకని కూడా పాత్ర చాలని బాధితుడే. పాత్రమాత్రం కథకి కేంద్ర బిందువుగా ఆసక్తి రేపేదే. పాత్ర పాలన మాత్రం ఎక్కడేసిన గొంగళి. ఇక సునీల్ పాత్ర- సెకండాఫ్ లో తను ప్రవేశించాకే కథలో చలనం వస్తుంది. ఆ తర్వాత తనూ కథా సేదదీరుతాయి. శ్రీకాంత్ అయ్యంగార్ ది కాసేపు హడావిడి.
        
మహతీ స్వర సాగర్ సంగీతంలో పాటలు సినిమా చూస్తున్నంత వరకే ఫర్వాలేదనిపిస్తాయి. అనిత్ కుమార్ కెమెరా వర్క్ గానీ, ప్రొడక్షన్ విలువలుగానీ పొదుపుగా ఖర్చు చేసినట్టు వున్నాయి.

చివరికేమిటి
2021 లో అల్లరి నరేష్ తో నాంది తీసిన నిర్మాత సతీష్ వర్మ, దాన్ని శిక్షాస్మృతి లోని సెక్షన్ 211 చుట్టూ కథగా ప్రచారం చేసి తీశారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసుల మీద బాధితుడు ప్రయోగించగల బ్రహ్మాస్త్రం సెక్షన్ 211 అనేలా తీశారు. ఎవర్నో ఇరికించి పోలీసులు కేసు పెడతారుఅతను నిర్దోషిగా విడుదలై వచ్చితన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీసుల మీద సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టడం కుదరదు ఈ సినిమాలో చూపించినట్టుగా. చాలా చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఇది జరిగింది. అందుకని ఈ సెక్షన్ గురించి కాకుండా, ఈ సెక్షన్ ని అడ్డుపెట్టుకుని అల్లిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ కథగా మాత్రమే ఇది బావుండి హిట్టయ్యింది.
        
ప్రస్తుత సినిమాలో అన్ క్లెయిమ్డ్ బ్యాంకు అక్కౌంట్ల  స్కామ్ పాయింటు కూడా బాక్సాఫీసుకి పరాయిదే. అయితే ఈ పరాయి పాయింటుని  అడ్డుపెట్టుకుని అల్లిన రొటీన్ కమర్షియల్ యాక్షన్ కథే సరిగా లేక ఇంకో నాంది కాలేకపోయింది. కథా కథనాల విషయంలో తెరవెనుక ఎవరితో ఏం జరిగినా బాధ్యత వహించాల్సింది కొత్త దర్శకుడు రాకేషే. ఇది తను తీసిన ఫ్లాప్ గా తన ఖాతాలోకి వెళ్తుంది. ఇక క్రేజ్ సృష్టించుకోవడానికి ఆస్కారమే లేదు.
—సికిందర్


1337 : రివ్యూ!

 



రచన- దర్శకత్వం : తేజ
తారాగణం : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, దేవీ ప్రసాద్ తదితరులు
సంగీతం : ఆర్పీ పట్నాయక్, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)  
విడుదల : జూన్ 2, 2023  
***

        గ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తెరకెక్కాడు. తేజ దర్శకత్వంలో అహింస లో నటిస్తూ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. చాలా కాలంగా హిట్స్ లేని తేజ, 2017 లో రానా దగ్గుబాటితో నేనేరాజు నేనే మంత్రి తో ఓ హిట్ ఇచ్చి, మళ్ళీ 2019 లో కాజల్ అగర్వాల్ తో సీత తీసి ఫ్లాపయ్యాడు. తిరిగి ఇప్పుడు అహింస తో రెండు దశాబ్దాలు పైబడిన అదే తన శైలిలో ఈ తరం ప్రేక్షకులతో అనుబంధం పెంచుకునేందుకు ముందుకొచ్చాడు. అయితే ఇందులో సక్సెస్ అయ్యాడా? దివంగత రామానాయుడు మనవడు అభిరాంని యువ ప్రేక్షకుల నవ హీరోగా సరైన తీరులో లాంచ్ చేయగల్గాడా? ఈ ముఖ్యాంశాల్ని పరిశీలిద్దాం.

కథ

    ఆ వూళ్ళో తల్లిదండ్రుల్లేని రఘు (అభిరామ్) మేనమామ దగ్గర పెరుగుతాడు. మరదలు అహల్య (గీతికా తివారీ) ని ప్రేమిస్తాడు. వాళ్ళకి నిశ్చితార్ధం జరిపిస్తారు. వూళ్ళో నే దుష్యంతరావు (రజత్ బేడీ) అనే దుష్టుడికి ఇద్దరు కొడుకులు వుంటారు. వాళ్ళు అహల్యని అపహరించి అత్యాచారం చేస్తారు. రఘు రగిలిపోతాడు. అయితే అహింసని నమ్మే అతను చట్టరీత్యా పోవాలనుకుంటాడు. ఇందులో లాయర్ లక్ష్మి (సదా) సహకరిస్తుంది. లాయర్ లక్ష్మిని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో అహింసని నమ్మే రఘు హింసకి దిగుతాడు. ఈ పోరాటంలో దుష్యంతరావు మీద ఎలా పగదీర్చుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    అహింసని నమ్మే హీరో హింసకి దిగే పరిస్థితులు ఎదురుకావడం, జరిగిన అన్యాయానికి పగదీర్చుకోవడం బాపతు ఫార్ములా కథలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఇదొకటి. అయితే కథనం కూడా పాతబడిపోవడం ఈ కథ ప్రత్యేకత. రెండు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్న తేజ అప్డేట్ కాకుండా, అదే తనకి అబ్బిన ఆనాటి కళతో ఈనాటి ప్రేక్షకులకి దగ్గరవ్వాలనుకోవడం అత్యాశే అనుకోవాలి. ఏ విధంగా చూసినా ఈ సినిమా తేజ చేయి దాటిపోయింది. ఆయన కాలం చెల్లిపోయాడు.

అహింసా వాదంతో సినిమాలో చూపించింది అర్ధం పర్ధం లేని హింసే. ఇది ప్రేక్షకుల్ని హింసించడమే. అక్షరాలా రెండు గంటలా 42 నిమిషాలు సాగదీసిన ఉన్మాదం. ప్రేయసి అత్యాచారానికి గురైతే అహింసని నమ్మాలంటూ కోర్టుని ఆశ్రయించినవాడు, లాయర్ హత్యతో అహింసని వదిలేసి హింసకి దిగడం మింగుడు పడని వ్యవహారం. ప్రేయసి కంటే లాయరే ఎక్కువన్నట్టు పాత్ర చిత్రణ తయారైంది. దీంతో పాత్ర, దాంతో కథా నమ్మబుద్ధి కావు.
       
తేజ తీసిన సినిమాలన్నిట్లో ఇదే అత్యంత తక్కువ రేటింగ్ గల సినిమా. చిత్రం
, నువ్వు నేను, జయం లు తీసిన కాలంలోనే వుండి పోయి ఈ కాలంలో సినిమా తీసిన ఫలితమిది. పైగా ఆ సినిమాల్లోని సన్నివేశాలే చాలాసార్లు వాడేశారు. ఫస్టాఫ్ లో రోమాన్స్, కొంత, వినోదం కొంత ఫర్వాలేదన్పించినా, హీరోయిన్ మీద అత్యాచారంతో పాత రివెంజి కథగా ఫస్టాఫ్ లోనే తేలిపోయింది. ఇక బరి తెగించిన హింసతో సెకండాఫ్ దారుణం.
       
యూత్ కోసం తీసిన ఈ సినిమాలో యూత్ అప్పీల్ హీరో హీరోయిన్లతో లేదు
, కథా కథనాలతోనూ లేదు. అంతా రొడ్డ కొట్టుడుగా చుట్టేశారు. కథని అడవుల్లోకీ తీసికెళ్ళడం తేజ ఇంకో రొటీన్ ఫార్ములా. మళ్ళీ కథని తీసికెళ్ళి అడవుల్లో పడేశారు. అభిరామ్ లాంచింగ్ ని ప్రశ్నార్ధకం చేశారు.

నటనలు- సాంకేతికాలు

    అభిరామ్ ఈ లాంచింగ్ తో నిలబడాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ పాత్ర, కథ, దర్శకత్వం సహకరించలేదు. పాతబడిపోయిన తేజతో అభిరామ్ కిది రాంగ్ లాంచింగ్. ఇంకెవరైనా కొత్త దర్శకుడితో ట్రెండీ మూవీ చేయాల్సింది. ముఖంలో హావభావాలున్నాయి, నటనలో ఈజ్ కూడా వుంది. సినిమా నటుడుగా అర్ధవంతంగా కన్పిస్తున్న తను అర్ధం పర్ధం లేని సినిమాలో నటించడమే విచిత్రం. మలి ప్రయత్నంతోనైనా ఇలాటి పొరపాటు చేయకుండా వుంటే బావుంటుంది.
       
హీరోయిన్ గీతిక అందంగా వుంది. పాత్ర అంతంత మాత్రమే వుంది.
జయం హీరోయిన్ సదా లాయర్ పాత్రలో ఫర్వాలేదు. విలన్ గా రజత్ బేడీ కూడా ఫర్వాలేదు. 
పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌మ‌ల్ కామ‌రాజు, ఇంకో పోలీసు పాత్రలో రవికాలే వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.
       
సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని పట్టుకుంది. ముఖ్యంగా ఫారెస్ట్ సీన్స్ లో. ఆర్పీ పట్నాయక్ సంగీతం క్రేజ్ ఏం క్రియేట్ చేయలేదుగానీ
, ఇప్పటి స్టయిలు మ్యూజిక్ కి కాస్త దగ్గరగా వుంది. ఒకప్పటి తేజ సినిమాలు యువతని ఉర్రూత లూగించే మ్యూజికల్ హిట్స్. ఇప్పటి ఈ సినిమా వాటి దరిదాపుల్లో కూడా లేకపోవడం హైలైటయ్యే అంశం.
—సికిందర్