రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, ఏప్రిల్ 2017, శనివారం

రివ్యూ!


రచన దర్శకత్వం : మణిరత్నం
తారాగణం : కార్తీ, అదితీ  రావ్ హైదరీ, రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్  తదితరులు
మాటలు : కిరణ్,  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: ఏఆర్ రెహమాన్,
ఛాయాగ్రహణం : ఎస్‌. వివర్మన్
నిర్మాణ సంస్థలు: ద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
ర్ప: దిల్రాజు
నిర్మాతలు: ణిరత్నం, శిరీష్
విడుదల : మార్చి 7, 2017
***
1983 నుంచి ఇప్పుడు 2017 వరకూ 34 ఏళ్ళూ తన సమకాలీనుల్ని బీట్ చేస్తూ అప్రతిహతంగా మార్కెట్ వున్న దర్శకుడుగా కొనసాగుతున్న మణిరత్నం విజయరహస్యమంతా , తను తీసే సినిమాలకి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలని కల్పించడంలోనే వుంది, కథా వస్తువులు విశ్వజనీన మానవ సంబంధాల చుట్టూ పరిభ్రమించడంలోనే వుంది.  అయితే ఎక్కువగా ప్రేమకథల మీదే దృష్టిపెట్టే తను, వాటినీ సమకాలీన ట్రెండ్స్ ని అనుసరించి తీయడం ప్రారంభించారు.  2015 ఏప్రెల్ లో ‘ఓకే బంగారం’ అనే ప్రేమకథతో సహజీవనం  సమస్యని చూపించారు. కానీ ఈసారి మాత్రం అలాటి మరో సమకాలీన సమస్య జోలికిపోకుండా సీదా సాదా పీరియడ్ ఫిలిం తీసేశారు. తీస్తూ దీన్నొక రోమాంటిక్ డ్రామా చేశారు. రోమాంటిక్ డ్రామాలు ఇప్పుడు ఆకట్టుకుంటాయా? ప్రేమలో చర్యకి పాల్పడకుండా హీరో హీరోయిన్లు రోమాంటిక్ డ్రామాని నిలబెట్టగలరా? తను ‘ఏ’ సెంటర్ డైరెక్టర్ గా పేరుబడ్డాక  ఆ వర్గం ప్రేక్షకులనైనా సంతృప్తి పర్చగల్గారా? ఇవన్నీ ఈ కింద పరిశీలిద్దాం...

కథ 
       వరుణ్ (కార్తీ) శ్రీనగర్ బేస్ లో ఏర్ ఫోర్స్ పైలట్. అక్కడి కల్నల్ కూతురు గిరిజ (రుక్మిణీ విజయ్ కుమార్) తో ప్రేమలో పడతాడు. ఆమె కారణంగా ఓ రోడ్డు ప్రమాదానికి గురై  స్పృహ లేని స్థితిలో మిలిటరీ ఆస్పత్రిలో చేరతాడు. కొత్తగా వచ్చిన మిలిటరీ డాక్టర్ లీలా అబ్రహాం (అదితీరావ్ హైదరీ) చికిత్స చేసి కాపాడుతుంది. ఆమె మీద ఇష్టం పెంచుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. లీలా అన్న ఒకప్పుడు వరుణ్ కొలీగ్ కావడంతో, వరుణ్ గురించి అతను  ఉత్తరాల్లో రాసిన విషయాలు ఆమెని వరుణ్ ని ప్రేమించేలా చేస్తాయి. ఈ ప్రేమ సంబంధం ఒడిదుడుకుల మయంగా వుంటుంది. వరుణ్ ఏ క్షణంలో ఎలా నొప్పించే విధంగా ప్రవర్తిస్తాడో తెలీదు. కొంచెం ప్రేమ కొంచెం ఖర్మ అన్న చందాన  ఈ వ్యవహారం కొనసాగిస్తూనే  గర్భవతవుతుంది. దీంతో  అతను అప్పుడే బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడి పెళ్లిని కాదంటాడు. అదే  సమయంలో కార్గిల్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న అతను విమానం కూలిపోయి  పాకిస్థాన్ లో పారాచూట్ లాండింగ్ అవుతాడు. పాక్ సైనికులు పట్టుకుని బంధిస్తారు. అలా మూడేళ్ళూ  జైల్లో మగ్గుతూ ఎప్పుడెప్పుడు లీలాని కలుస్తానా  అని కలవరించడమే అతడి దిన చర్యవుతుంది.

          వరుణ్ పాక్ జైల్లోంచి బయటపడ్డాడా? బయటపడి  లీలాని కలుసుకోగలిగాడా? కలుసుకుంటే ఏం  జరిగింది? ఈ మూడేళ్ళ కాలంలో తను వూహించని పరిణామాలు ఏమేం  చోటు చేసుకున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మణిరత్నం  ప్రేమ సినిమా పూర్తిగా చూడాల్సిందే.


ఎలా వుంది కథ        
        మణిరత్నం సినిమా అనే బంగారు పళ్ళేనికి  గోడచేర్పు మాత్రం బలంగా వుంది ఏర్ పోర్స్- మిలిటరీ నేపధ్యాలతో. కానీ పళ్ళెంలో వడ్డించిన కథ అనే భోజనమే, రుచికరంగా  బలవర్ధకంగా లేదు. ముఖ్యంగా వినోదమనే సాంబారు లేదు. ప్రేమ అనే కూర కూడా ఉప్పుతగ్గి కారం ఘాటు ఎక్కువైపోయింది. ‘ఓకే బంగారం’ లో సహజీవనం కథ అభాసు అయినట్టే, ప్రస్తుత సాదా ప్రేమకథ కూడా జావకారిపోయింది. ఇంత ఖర్చుపెట్టి తీసిన ఈ మిలిటరీ - ఏర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేమకథని ఒక అనిర్వచనీయమైన అనుభూతుల దొంతరగా మార్చెయ్యవచ్చు నిజానికి మణిరత్నం స్థాయి దర్శకుడు. 

          కానీ తెలుగులో ఇప్పటికీ లైటర్ వీన్ ప్రేమకథలని వస్తున్న పసలేని రోమాంటిక్ డ్రామాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా నూలు దారమంత మందం కథతో  భారీ ప్రయత్నం చేశారు. రోమాంటిక్ డ్రామా ఇగోల గోలతో నిలబడే అవకాశం ఏమాత్రం వుండదు. ఇగోలతో మూతి విరుపులు, తగాదాలు, విడిపోవడాలు, సారీ చెప్పడాలు, కలవడాలు; మళ్ళీ ఇగోలతో మూతి విరుపులు, తగాదాలు, విడిపోవడాలు, సారీ చెప్పడాలు, కలవడాలూ... ఇలా కథని వున్నచోటే వుంచి గిర్రున రంగులరాట్నంలా తిప్పుతూ పోయారు.  బయస్కోపులా అవే బొమ్మల్ని చూపిస్తూ చూపిస్తూ పోయారు.  ప్రేమికుల మధ్య ఒక ప్రధానమైన, బలమైన  సమస్యంటూ లేకపోతే, దాంతో సంఘర్షణంటూ లేకపోతే, దానికో అర్ధవంతమైన పరిష్కారమూ  లేకపోతే అది కథెలా అవుతుంది? 

          మణిరత్నం కథలో ఆమె గర్భవతవడమనే మలుపుతో సమస్య ఏర్పాటయితే,  దీని నిర్వహణ  కూడా లైటర్ వీ(ణ)న్  సినిమాల ధోరణిలోనే వుంది. ఈ ఘట్టం క్లయిమాక్స్ దగ్గర వస్తుంది. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. ఇందుకే ఇంత సేపూ ప్రేమలో ఏమీ జరక్క రంగులరాట్నంతో బోరు కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపూ ఈ రంగుల రాట్నం తిప్పే బదులు, ఫస్టాఫ్ లోనే  పాత్రల్ని చర్యకి దింపి వుంటే- పాత్రల్ని సమస్యలోకి నెట్టేసే ఆ చర్య వల్ల కథ ఆసక్తికరంగా తయారయ్యేది. 

       ఈ సందర్భంగా మనకి ‘సన్ ఫ్లవర్’ అనే క్లాసిక్ ప్రేమకథ గుర్తుకురాక మానదు. 1970 లో అప్పటి టాప్ హీరోయిన్ సోఫియా లారెన్, మార్సెల్లో మాస్ట్రోవన్నీలు నటించిన ఈ కథలో ప్రేమలో వున్న సోఫియా- సైనికుడైన మార్సెల్లో రెండో ప్రపంచ యుద్ధంలో డ్యూటీని ఆలస్యం చేయడానికి పెళ్లి అనే తతంగం నడుపుతారు. దీంతో పన్నెండు రోజులు డ్యూటీని ఎగ్గొట్టే అవకాశం లభిస్తుంది. ఇది చాలదన్పించి, పిచ్చెక్కినట్టు మరొక నాటకానికి తెర తీస్తాడు మార్సె ల్లో. ఆఖరికి అతన్ని పట్టుకుని రష్యా పంపేస్తారు. అక్కడ యుద్ధంలో ఏమయ్యాడో ఆచూకీ దొరకదు.  అతను చనిపోలేదనీ,  బతికే వుంటాడనీ బలంగా  నమ్ముతుంది సోఫియా. ఈ నమ్మకంతో వెతకడానికి తనే రష్యా బయల్దేరుతుంది. అక్కడ పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) పువ్వుల పంటల్లోకి  వెళ్తుంది. ఆ మొక్కలన్నీ యుద్ధంలో చనిపోయిన ఒక్కో సైనికుడి సమాధి మీద నాటినవని తెలుసుకుని ఏడుస్తుంది. అయినా భర్త మీద తన ప్రేమ ఓడిపోదనీ, ఎక్కడో బతికే వుంటాడనీ నమ్ముతుంది. రష్యాలోనే ఇంకా గాలిస్తే అతను కన్పిస్తాడు భార్యతోనూ,  కూతురుతోనూ. 

          గుండె పగులుతుంది. అయినా తను ప్రేమించే భర్త సుఖసంతోషాల్ని భగ్నం చేయలేక, అతడికి ఎదురు పడకుండానే  స్వదేశానికి వచ్చేస్తుంది.  ఒక ఫ్యాక్టరీలో పని చేయడం మొదలెడుతుంది. అప్పుడెన్నేళ్ళకో  అతను తిరిగొస్తాడు, ఆమె కిస్తానని ప్రామీస్ చేసిన ఫర్ కోటుతో...ఇప్పుడింకా ఏడ్పించేస్తుందీ క్లాసిక్ ప్రేమకథ. దీన్ని రోమాంటిక్ డ్రామా అంటారు. 

          రోమాంటిక్ డ్రామాకి  పాత్రలు పాల్పడే చర్యలతోనే బలం వస్తుంది- బలమైన సంఘటనలు పుడతాయి- మాటా మాటా అనుకుని విడిపోతే కాదు!  ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నారు, కబుర్లు అనలేదు. కబుర్లతో కాకరకాయలే వస్తాయి. 

        మణిరత్నం సర్ కథలో,  కార్గిల్ యుద్ధంలో పైలట్ అదృశ్యమైతే ప్రభుత్వానికి తెలీదా? అతను యుద్ధ ఖైదీగా బందీ అయివుంటే విడిపించే ప్రయత్నం చెయ్యదా? హీరోయిన్ తో బాటు హీరో తల్లిదండ్రులు కూడా అతడి గురించిన ఆందోళనతో గడపరా? అతడి కోసం ప్రభుత్వం చుట్టూ తిరగరా? సోఫియా లారెన్ యుద్ధంలో మిస్సయిన భర్త ని వెతుక్కుంటూ పరదేశం వెళ్ళడం సార్వజనీన భావోద్వేగం కాదా? ఈ యూనివర్సల్ ఎమోషన్ ని మణిరత్నం హీరోయిన్ కి లేకుండా చేసి కథని ఎలా నిలబెట్టగలరు? సోఫియా లారెన్ పాత్ర గర్భవతి కూడా కాదు. అయినా భర్తంటే అంత ప్రేమతో వుంటుంది. మణిరత్నం హీరోయిన్ గర్భవతి అయి వుండి కూడా హీరోకోసం పాకిస్థాన్ అయినా, ఇంకే స్థాన్ కైనా వెళ్ళకుండా ఎలా వుండగల్గుతుంది? 

          పాకిస్థాన్ వెళ్లి వుంటే ఈ ప్రేమకథ సరైన దార్లో పడేది. ఒక బ్యాక్ డ్రాప్ అంటూ పెట్టుకున్నాక,  ఆ బ్యాక్ డ్రాప్ తో ప్రధాన కథ స్పర్శించక పోతే  మొత్తం కథంతా కుప్ప కూలుతుందని  మహేష్ బాబు ‘బాబీ’ ఎప్పుడో నిరూపించింది. ఏర్ ఫోర్స్- మిలిటరీ బ్యాక్ డ్రాప్ అంటూ వున్నాక, ఇంకా కార్గిల్ యుద్ధం లాంటి తీవ్రమైన అంశమూ కూడా వున్నాక- ఇవేమీ లేనట్టు- ఈ బ్యాక్ డ్రాప్ తో స్పర్శే లేకుండా, ఇకేదో లోకంలో ప్రేమ కథ ఎలా నడపగలరు? పళ్ళెం లో అన్నం తింటూ గోడచేర్పుకి తగలకుండా తినగలమా? 

ఎవరెలా చేశారు 
     తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ వున్న, తెలుగు మాట్లాడగల తమిళ కమర్షియల్ మాస్ హీరో కార్తీ కి మణిరత్నంతో ఇది అరుదైన అవకాశం. ఏర్ ఫోర్స్ పైలట్ పాత్రలో పూర్తి మేకోవర్ తో అత్యంత సహజంగా కన్పించడం బావుంది. ‘కంచె’ లో సైనికుడి పాత్రలో ఇలాటి మేకోవర్ తో వరుణ్ తేజ్ కన్పించిన తర్వాత కార్తీ కన్పిస్తున్నాడు. రక్షణ దళాల పాత్రల్ని మూస తరహాలో మొహానికి పౌడరు కొట్టి నాటుగా చూపించే పద్ధతికి భిన్నంగా- ఏ అంతర్జాతీయ ప్రేక్షకులు చూసినా ఒప్పే విధంగా  సహజత్వానికి ప్రాణంపోయడం ఇప్పుడిప్పుడే దక్షిణాది సినిమాల్లో అలవాటవుతోంది.

          కార్తీ పాత్రచిత్రణ విషయానికొస్తే, అతడిది నిలకడ లేని మనస్తత్వమని కూడా అనలేం, ప్రేమలో పూటకో విధంగా ప్రవర్తిస్తూంటే. తను వెంటపడి ప్రేమిస్తున్నది ఒక మిలిటరీ లేడీ డాక్టర్ నని కూడా ఆలోచించకుండా ఆమెతో పదుగురిలో కూడా దురుసుగా ప్రవర్తిస్తాడు. అవమానిస్తాడు. మళ్ళీ సారీ చెప్తాడు, బుజ్జగిస్తాడు. మళ్ళీ దురుసుగా ప్రవర్తిస్తాడు. 

          తీరా మనకి అర్ధమయ్యే దేమిటంటే ఇతనేదో కమిట్ మెంట్ ఫోబియాతో బాధపడుతున్నట్టు నటిస్తున్నాడని. ఇది క్రిమినల్ మెంటాలిటీయే. ప్రేమిస్తే ఎక్కడ పెళ్ళికి కమిట్ అవాల్సి వస్తుందోనని భయపడేవాళ్ళు ప్రేమలకి దూరంగా వుంటారు. ఆర్ధిక పరిస్థితులో మరోటో చక్కబడితే ఫోబియా దానికదే పోతుంది. కార్తీ పాత్ర ఆమెకి నెలతప్పించే దాకా పోయాక అప్పుడు-  భర్త పాత్ర, తండ్రి పాత్రా ఇప్పుడే వహించలేనని, నేను నీకు సరిపోనని, వర్కౌట్ అవదనీ  ‘కమిట్ మెంట్ ఫోబియా’ వెల్లడించుకుని బై చెప్పేస్తాడు. అంటే ఆమెతో  అన్నీ అనుభవించి తీరా ఈ మాట అంటున్నాడంటే ఈ ఒక ఫోబియా నాటకమే. 

        పాత  సినిమాల్లో ఇలా మోసం చేసి పారిపోయే పాత్రల్ని హీరోయిన్ పాత్రలు చీటింగ్ కేసులు పెట్టేవి. లేదా ఆ చీటర్స్ ఇళ్ళ ముందు మౌన పోరాటానికి దిగేవి. ఇంకా యాక్షన్ హీరోయిన్ పాత్రలైతే చంపి పారేసేవి. మణిరత్నం ఈ రక్షణ శాఖ ఉద్యోగి పాత్రని ఎలా అర్ధం చేసుకోమన్నారో అస్సలు  అర్ధం కాదు. ఇతణ్ణి పాకిస్తానీయులు పట్టుకుని జైల్లో వేశారంటే మంచి పనే చేశారు శాస్తిగా!  

          అసలు మొదటి హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆమె కారణంగానే యాక్సిడెంట్ అవడం కూడా అతడికి గుణపాఠంగానే  జరిగిందనుకోవాలా? ఆ విధంగా మొదటి హీరోయిన్ ఇతడి బారిని పడకుండా బాగానే ఎస్కేప్ అయ్యిందనుకోవాలా? ఇలా అడుగడుగునా ఈ కథనం, పాత్ర చిత్రణలూ సెల్ఫ్ డ్యామేజింగ్ గానే వున్నాయి. ఇంకా పాయింట్లు తీస్తే మణిరత్నం పట్ల అపచారమే అవుతుందేమో...

          హీరోయిన్ అదితీ రావ్ హైదరీ మణిరత్నం విజువల్స్ తో దేవతా మూర్తి దర్జా పొందింది. అద్బుతమైన రూపమామెది. ఆమె మణిరత్నానికీ, కెమెరా మాన్ రవి వర్మన్ కీ జీవితాంతం రుణపడి వుండాల్సిందే. రూపమే కాకుండా నటనలో కూడా అందె వేసిన చేయామె. కానీ ఏం  లాభం,  డాక్టర్ పాత్రయిన తనని సగటు టీనేజర్ కన్నా అపరిపక్వంగా మణి సర్ చూపించిన ప్పుడు? ఎందుకు పదే పదే తనని అవమానించే  పైలట్  వెంట పడ్డం? మోటివ్ ఏమిటి? 

      ఇతడి గురించి అన్న అంత గొప్పగా రాశాడని- చనిపోయిన అన్న సెంటిమెంటుతో ఇతడే దైవం అనుకుంటున్నట్టు పట్టుకు వేళ్ళాడ్డమేమిటి?  ఇతడిలో అన్నకి గొప్ప లక్షణాలు కన్పించడం హాస్యాస్పదం. ఇప్పుడితడి వరస చూస్తూ కూడా అన్న రాసింది నాన్సెస్ అనుకోకుండా, రేపేం చేస్తాడో తెలీని వాడికా శరీరాన్ని  కూడా అప్పగించడం? అప్పగించినా డాక్టర్ గా జాగ్రత్త తీసుకోక పోవడం? పోతే పోయాడనుకుని పిల్లనీ కనీ పెంచడం? పెళ్ళికాని తల్లి అన్పించుకోవడం?  ఇలా జీవితాన్ని సరిపెట్టుకోవడం? ఈమెని ఎలా అర్ధం జేసుకోవాలి? ఇలాటి ఆషామాషీ,  బలహీన మోటివ్స్ తో పాత్రచిత్రణలు చేశారు. 

          ఇంకో గమ్మత్తుంది ఈ కథలో. ఈ గమ్మత్తు చూసయినా  హీరోయిన్ జాగ్రత్త పడాలి. ఆ గమ్మత్తేమిటంటే,  హీరో అన్న పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూతురిని  ఆల్రెడీ దర్జాగా గర్భవతిని చేసిపారేసి  తొమ్మిదో నెల తాళి  కడతాడు. పెళ్లి పీటల మీంచే ప్రసవాని కెళ్తుంది. ఈ డార్క్ కామెడీ నంతా పెళ్లి పాట సహా మనం ఎంజాయ్ చేసే నిర్బంధానికి మణి సర్ గురిచేసినా ఏమీ అనుకోం. కానీ అన్న రూట్లోనే తను ప్రేమిస్తున్న తమ్ముడు కూడా పోతున్నాడని హీరోయిన్ జాగ్రత్త పడాలిగా? ఈ వంశమింతే అన్నట్టు, తోడి కోడల్లాగే పెళ్ళవకుండానే సంతానవతి అయి అడ్జెస్ట్ అయిపోదామనుకోవడమేమిటి?  అసలు హీరో క్యారక్టర్ అన్న  అడుగుజాడల్లోనే హీరోయిన్ ని ట్రాప్ చేసి గర్భవతిని చేసి వదిలేశాడనుకోకూడదా మనం? మణిరత్నం మీద గౌరవంతో పాయింట్లు లాగవద్దను కుంటూనే లాగాల్సి వస్తోంది. 

          మణి సర్ అసలేం చేస్తున్నారో అర్ధమే  గాదు. వెనక పేజీల్లో ఏం రాసుకుంటే ఏం అర్ధాలొ స్తున్నాయో చూసుకోకుండా,  సెల్ఫ్ డ్యామేజింగ్ గా రాసుకుంటూ పోయినట్టు కన్పిస్తుంది. ఇంకో చోట, పెళ్లి అని చెప్పి హీరోయిన్ని రిజిస్ట్రార్ ఆఫీసుకి తీసికెళ్ళి, ఎంతో ‘కౌన్సెలింగ్’ చేసి ఒప్పిస్తాడు హీరో.  తీరా టైం  అయిపోయిందని, రేపు వద్దామని వెళ్ళిపోతాడు. మర్నాడు ఆమె రిజిస్ట్రార్ ఆఫీసుకొచ్చి ఎదురు చూసి చూసి వెళ్ళిపోతుంది. తర్వాత ఎన్ని రోజులకో వచ్చి,  అనుకోకుండా ఢిల్లీ వెళ్ళానంటాడు! ఇలాటి వాణ్ణి ఎలా నమ్ముతుందో విద్యాధికురాలైన హీరోయిన్ అర్ధం గాదు. ఈ పాత్రల్లో పైలట్ కన్పించడు, లేడీ డాక్టర్ కన్పించదు. కాలేజీ ప్రేమల టెంప్లెట్ పాత్రలే కన్పిస్తాయి. వీళ్ళ  తగాదాలు, అలకల సీన్లూ చూస్తూంటే ఇరాన్ బాలల సినిమాలే గుర్తుకొస్తూంటాయి. మణి రత్నమే ఇలా చేస్తే, రేపింకో కొత్త దర్శకుడూ దీన్నే ఫాలోయి వీరాధి వీరుడుగా మన౦ ప్రాణాలు తీయడా? ఇది గుర్తిస్తే బావుంటుందేమో మణిరత్నం. 

        శ్రీనగర్, లేహ్, లడక్ ఒరిజినల్ లొకేషన్స్ తో బాటు, బెల్ గ్రేడ్ లో చీట్ చేసిన లొకేషన్స్  ఒక బలమైన విజువల్ పవర్ నిస్తాయి సినిమాకి. మరోసారి మణిరత్నం పంచభూతాల్ని ప్రేమ కథకి సాక్ష్యం చేశారు. వొళ్ళు గగుర్పొడిచే ఎత్తైన లేహ్ పర్వత శ్రేణుల్లో  మంచు తూఫానులో ప్రేమికుల సంఘర్షణ ఒక దృశ్య కావ్యం లాంటి అద్భుత సీను.  ఇంకా సందర్భాన్నిబట్టి  వర్షాన్నీ, మండే సూర్యుణ్ణీ, హోరు గాలినీ, నీలాకాశాన్నీ సాక్ష్యంగా చేసి ప్రేమ కథ చెప్పారు. ఈ ప్రేమ కథలోనే దమ్ములేదు. 

          పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్  లొకేషన్స్ నీ, అక్కడి మిలిటరీ, పోలీసు పాత్రల్నీ అద్భుతమైన నేటివిటీతో చిత్రీకరించారు. క్లయిమాక్స్ లో హీరో తప్పించుకునే యాక్షన్ దృశ్యాలూ బ్రహ్మాండం. ప్రతీ దృశ్యాన్నీ ఛాయాగ్రాహకుడు రవి వర్మన్ ఒక పెయింటింగ్ లా సృష్టించాడు. అయితే తన కష్టానికి తగ్గ ప్రేమ కథే లేకపోయింది...

           ఏఆర్ రెహ్మాన్ కూడా క్యాచీ ట్యూన్స్ ఇవ్వడానికి ఏమీ ప్రయత్నించలేదు. సీరియస్ రోమాంటిక్ డ్రామా ఆ తీరు పాటలనే ఇచ్చేలా చేసింది.

చివరికేమిటి? 
      ఇది రోమాంటిక్ డ్రామా అంటున్నాం గానీ, రోమాంటిక్ డ్రామాకాదు, అలాగని రో మాంటిక్ కామెడీ కాదు. రెండూ కలిపేసిన మిశ్రమం. జానర్ మర్యాద పాటింపు లేదు.  రోమాంటిక్ డ్రామాకి ప్రేమికుల మధ్య సమస్య బాహ్య శక్తులు, లేదా బాహ్య పరిస్థితుల్లోంచి వస్తుంది. ‘సన్ ఫ్లవర్’ రోమాంటిక్ డ్రామాలో యుద్ధమనే బాహ్య పరిస్థితి విడదీస్తుంది భార్యాభర్తల్ని. అంతే గానీ వాళ్ళు తగాదాలాడుకుని విడిపోరు. మణిరత్నం సినిమాలో తగాదాలాడుకునే విడిపోయారు. ప్రేమికులు తగాదాలాడుకుని విడిపోవడం రోమాంటిక్ కామెడీ లక్షణం. రోమాంటిక్  కామెడీల్లో బాహ్య శక్తులు, బాహ్య పరిస్థితులు ప్రేమికులని విడదీయవు. ప్రేమికులే  పరస్పర ప్రత్యర్ధులుగా, విరోధులుగా వుంటారు. నువ్వా నేనా అన్నట్టు సిగపట్లు పట్టుకుంటారు. ఏ వొక్కరూ పాసివ్ కారు. ఇద్దరూ యాక్టివ్ పాత్రలుగానే వుంటారు. అయితే కార్గిల్ యుద్ధం లాంటి  నేపధ్యంలో రోమాంటిక్ కామెడీ  తమాషా కష్టమే. యుద్ధ నేపధ్యంలో గొప్ప సినిమాలన్నీ సీరియస్ రోమాంటిక్ డ్రామాలుగానే వున్నాయి. అద్భుతమైన విజువల్ పవర్ తో మణిరత్నం సినిమాకి అంత బలమైన యుద్ధ నేపధ్యం వున్నాక,  ఈ రోజుల్లో కూడా ఎమోషనల్ గా రోమాంటిక్ డ్రామాతో కట్టి పడేయవచ్చు. మణిరత్నం రెండు జానర్స్ నీ కలిపేయడం వల్ల ఎటూ కాకుండా పోయింది. 

          నిజానికి తను గర్భవతి అయి హీరో వర్కౌట్ కాదని వెళ్ళిపోయాక ఏర్ బేస్ కి వెళ్తుంది హీరోయిన్. ఎంత మిలిటరీ డాక్టర్ అయినా టూవీలర్ మీద రన్ వే  దాకా ఎలా వెళ్ళిపోతుందో తెలీదు.  అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధ విమానాలు భీకరంగా బయలుదేరుతూంటాయి. అంటే కార్గిల్ యుద్ధం మొదలయ్యిందని మనకి తెలుస్తూనే వుంటుంది. కానీ అక్కడ హీరో హీరోయిన్లు ఈ విషయమే పట్టకుండా తగాదా పడతారు. అక్కడున్న పరిస్థితుల నేపధ్యంలోంచి వాళ్ళ మాటలే రావు. ఎట్టి  పరిస్థితుల్లోనూ దర్శకుడు బ్యాక్ డ్రాప్ తో ప్రేమ కథకి స్పర్శ లేకుండా చేస్తున్నాడన్న  మాట. 

        ఆ విమానాలేంటి అలా ఎగురుతున్నాయని హీరోయిన్ అడగదు, నేనిప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను-  తర్వాత మాట్లాడకుందామని హీరో కూడా  అనడు.  ఇలా అనుకుంటే కథ పాత్రలు అనుకున్నట్టు సాగుతుంది. కానీ మణిరత్నం తాను  అనుకున్నట్టుగా సాగాలనుకున్నారు రాంగ్ రూటులో. ఇప్పుడైనా పాత్రలు గనుక బ్యాక్ డ్రాప్ లో విషయాన్నీ పట్టించుకుని మాట్లాడుకుంటే, ఈ సమయంలో  దేశం కన్నా ప్రేమలు ఎక్కువ కావనుకుం టాయి. కానీ దేశంకన్నా ప్రేమే ముఖ్యమన్నట్టు తగాదాలాడుకుని మణిరత్నం చేతిలో దిగజారిపోయాయి!

          ఈ మొత్తం ప్రేమ కథని మణిరత్నం అనేక ఫ్లాష్ బ్యాకులతో చెప్పారు. ఈ ఫ్లాష్ బ్యాకులు ఒకరి దృక్కోణంలో వుండవు. ఒక తడవ పాక్ జైల్లో వున్న హీరో దృక్కోణంలో, ఇంకో తడవ శ్రీనగర్ లో వున్న హీరోయిన్ దృక్కోణంలో వస్తూంటాయి. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ మూడేళ్ళ క్రితానికి సంబంధించినవి. ఒకరి ఫ్లాష్ బ్యాక్, ఇంకొకరి ఫ్లాష్ బ్యాక్, మధ్యమధ్యలో ప్రెజెంట్ లో ఇద్దరి పరిస్థితీ- ఇవన్నీ వున్న ఈ కాస్తా  ప్రేమకథని కూడా ఏకధాటిగా చూడనివ్వకుండా చేశాయి. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులనేవి టీవీలో ఒక ఇంటరెస్టింగ్ ప్రోగ్రాం చూస్తూంటే ఉన్నట్టుండి వచ్చే యాడ్స్ లాంటి చీకాకు పెట్టే వ్యవహారం. కథలో దమ్ములేనప్పుడే, దాన్ని కప్పి పుచ్చడానికే,  ఫ్లాష్ బ్యాకులతో హంగామా చేస్తారని  అంటాడు సిడ్  ఫీల్డ్. మణిరత్నం కథలో ఎ పాటి దమ్ముందో చూశాం. 

          ఇక హీరో దృక్కోణంలో ఫ్లాష్ బ్యాకుల పరంపరకి తెర తీసే ముందు,  దేన్ని రిఫరెన్స్ పాయింటుగా పెట్టుకుని ప్రారంభించాలి? ఒక ప్రేమికుడు ప్రేమికురాలితో గొడవపడి వెళ్ళిపోయి-  యుద్ధ ఖైదీగా వేరే దేశంలో బందీ అయ్యాక - అతడి స్మృతి  పథంలో మొట్ట మొదట ఏది  మెదలుతుంది? ప్రేమికురాలితో గొడవ పడ్డ ఘట్టమేనా? ఆమె గర్భవతి కూడా అయివున్న నేపధ్యంలో ఇప్పుడామె ఏమై పోతుందన్న ఆందోళనకూడా తోడయిన రిఫరెన్స్ పాయింటేనా? లేక ఈ ఫీలింగే లేకుండా హేపీగా కవిత్వం వల్లిస్తూ,  ఆమె తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా జరిగిందో హేపీగా ఫ్లాష్ బ్యాకులు ప్రారంభించుకోవడమా?  ఏది రిఫరెన్స్ పాయింటు? ముందు వియోగ బాధ అనుభవించి,  ఇప్పుడు తను చేసేది లేక క్రమక్రమంగా ఆమెతో మధుర స్మృతులతో గడపడం అనే మానసిక స్థితి వస్తుంది. మైండ్ అలా వర్క్ చేస్తుంది. ఇలా లేనప్పుడు కథ ఫ్లాట్ అయిపోతుంది. ఆనంద  విషాదాలతో కూడిన ద్వంద్వాల  పోషణతోనే కథకి డెప్త్ వస్తుంది. ‘మై మేరీ పత్నీఔర్ వోహ్’  అనే హిట్ లో రాజ్ పల్ యాదవ్ తన ట్రాజిక్ పరిస్థితిని మర్చిపోవడానికి,  నానా కామెడీ వేషాలతో ద్వంద్వాల పోషణ అద్భుతంగా చేసి సజీవపాత్రని  స్థాపిస్తాడు. 

      మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో ఇంకో నష్టం ఏమిటంటే స్ట్రక్చర్ చెదిరిపోతుంది. ఎప్పుడో ముప్పావు గంటలో రావాల్సిన కథలో పాయింటు రెండు గంటల తర్వాత వస్తుంది. పాయింటు ఎప్పుడు వస్తే అప్పుడు కథ ప్రారంభమైనట్టు. మణిరత్నం కథలో ఫ్లాష్ బ్యాకుల వల్ల స్ట్రక్చర్ చెదిరిపోయి దాదాపు రెండు గంటలకి ( యుద్ధ నేపధ్యంలో ఏర్ బేస్ లో పైన చెప్పుకున్న హీరో హీరోయిన్ల గొడవ) పాయింటు ఎస్టాబ్లిష్ అయి అప్పుడు కథ ప్రారంభమవుతుంది. దాంతో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కింద జమ అయ్యింది. ఇందుకే ఈ కథ సహన పరీక్ష అయిపోయింది.  కథకి వెన్నెముక లాంటి మిడిల్ విభాగమే లేకపోయాక, ఏర్ ఫోర్స్-మిలిటరీ, కార్గిల్ యుద్ధం లాంటి ఎంతబలమైన బ్యాక్ డ్రాప్ వుండీ ఏం లాభం? 

          మణిరత్నం కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన ఈ ‘చెలియా’ కి బాక్సాఫీసు చెల్లింపులు చేసిన పొరపాట్ల వల్ల చేతికి రాకుండా పోవడమే జరుగుతుంది.


-సికిందర్










            
         

          

5, ఏప్రిల్ 2017, బుధవారం

          (కవర్ స్టోరీ మిగతా భాగం)
    మరి ఇంతటి డిటెక్టివ్ ఇంటికెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఎందుకేర్పడింది? రచయితల సరుకు అయిపోయిందా? అదేం కాదు, సమాజమే దాని రూపు రేఖలు మార్చుకుంది. కాలక్రమంలో  నేరాల స్వభావం మారింది, తీవ్రతా విస్తృతీ పెరిగాయి. అగథా క్రిస్టీ నవలల్లో లాగా నేరమనేది గ్రామీణ జీవితానికే, ఇరుగుపొరుగు ఇళ్లకే  పరిమితం కాలేదు. గ్రామాల్లో  జరిగే చిన్న చిన్న నేరాలకి సైతం మూలాలు  మాఫియా సంస్కృతి వల్లనైతే నేమి, ఇతర వ్యవస్థీకృత ముఠాల వల్లనైతే నేమి, ఇంకేదో దేశంలో ఏ మారు మూలనో వుంటున్నాయి. ముంబాయిలో పేలుళ్లు జరిపి దావూద్ ఇబ్రహీం అనే వాడు దుబాయిలోనూ కరాచీలోనూ తల దాచుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ్నించీ నేరాలు సాగిస్తున్నాడు. రాయల సీమ ఫ్యాక్షన్ పోరు హైదరాబాద్ వీధుల దాకా ప్రాకింది. కోలా కృష్ణమోహన్ అనేవాడి లీలల కిటుకు లండన్లో వుంటోంది... 

         
లాటి పరిస్థితుల్లో నేరాల్ని అరికట్టాలంటే ఏకవ్యక్తి  వ్యవహారం చాలదు. ఎలాగైతే నేరస్థ ముఠాలు విస్తృత నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నాయో, అలా వాళ్ళని దండించే వ్యవస్థలకి అంత కన్నా ఎక్కువ స్థాయిలో నెట్ వర్క్ వుండాలి. సంబంధిత అంతర్రాష్ట్ర,  అంతర్జాతీయ విభాగాలతో సమన్వయముండాలి. ఇది ఒక్క పోలీసు వ్యవస్థకే సాధ్యమవుతుంది తప్ప ప్రైవేట్ డిటెక్టివ్ వల్ల  కాదు. సాధారణంగా పడక్కుర్చీ మేధావి అయివుండే ప్రైవేట్ డిటెక్టివ్ తర్కవితర్కాలకి ఈ నేరాలు లొంగి రావు. కార్య క్షేత్రంలోకి దూకాలి, పరుగులు పెట్టాలి, వేటాడాలి. డిటెక్టివ్ యుగంధర్, డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ పరశురాం లాంటి పాత్రలు విదేశాలకీ వెళ్లి శత్రువుల పనిబట్టిన కథలున్నాయి. యుగంధర్ టిబెట్ వెళ్లి దలైలామాని కాపాడేడు. నర్సన్ అసిస్టెంట్ కృపాల్ తో కలిసి విదేశంలో చేసే ఒక అడ్వెంచర్ లాంటిదే రాజేంద్రకుమార్, వహీదా రెహమాన్ లతో ఎస్ఎస్ వాసన్ తీసిన ‘షత్రంజ్’ (చదరంగం- 1969) అనే హిందీ సినిమాలో వుంటుంది. డిటెక్టివ్ పరశురాం కూడా ఎన్నో దేశాలు తిరిగి వచ్చాడు. డిటెక్టివులుగా స్థానికంగా దేశవాళీ హత్య కేసులు పరిశోధిస్తూనే,  అడపాదడపా విదేశాల్లో గూఢచారి  పాత్ర కూడా నిర్వహించాయీ పాత్రలు. షెర్లాక్ హోమ్స్, హెర్క్యూల్ పైరట్ లు కూడా గూఢచారి పాత్ర పోషించిన డిటెక్టివ్ పాత్రలే. కానీ ఫిలిప్ మార్లో, లివ్ ఆర్చర్, ట్రావిస్  మెక్ గీ లాంటి డిటెక్టివ్ పాత్రలు కుటుంబాల్లో జరిగే నేరాల పరిశోధనలకే పరిమితమయ్యాయి. 1954 లో ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జేమ్స్ బాండ్- 007 పాత్ర ఆగమనంతో గూఢచారి పాత్రకి ప్రొఫెషనలిజం అబ్బింది. ఈ పని డిటెక్టివ్ లు చేస్తే పాఠకులకి వాస్తవికత అడ్డుతగులుతోంది. 

ఇయాన్ ఫ్లెమింగ్
        రోడ్డు మీద హత్య, అపార్ట్ మెంట్ లో మానభంగం, వ్యాపారి కొడుకు  కిడ్నాప్ లాంటి వ్యక్తి చుట్టూరా   నేరాలు ప్రజల దృష్టి నాకర్షించినంత కాలం, డిటెక్టివ్ పాత్రలకి బాగానే చెల్లు బాటయ్యేది. ఎపుడైతే ఈ పరిధి దాటుకుని నేరాలు అసాంఘీక శక్తుల చేతుల్లో ఆక్టోపస్ లా వ్యాపించి, తీవ్రత కూడా పెంచుకుని నిత్యకృత్యాలై పోయాయో, అప్పుడిక ప్రజల దృష్టి వాటి మీదికి మళ్ళింది. వాటి ముందు డిటెక్టివ్ లు పరిశోధించే  మామూలు హత్య కేసులు వెలవెలబోయాయి. ఇప్పుడు వ్యవస్థీకృత ముఠాల పనిబట్టాలంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర కావాలి, పడక్కుర్చీ మేధావులైన డిటెక్టివ్ పాత్రలు కాదు. తెలుగులో ఈ డిటెక్టివ్ పాత్రల స్థానాన్నిమధుబాబు సృష్టించిన యాక్షన్ హీరో  షాడో మెల్లమెల్లగా ఆక్రమించ సాగాడు. పూర్తిగా ఆక్రమించి డిటెక్టివ్ పాత్రల్ని వెనక్కి  నెట్టేశాడు. 

          అయితే షాడో ఏ ఇన్వెస్టిగేషన్ తోనూ పనిలేని అడ్వెంచర్స్ చేసే పాత్ర. దాని తరహా వేరు. నెట్ వర్క్ ని నెట్ వర్క్ తోనే ఛేదించడం సాధ్యం. ఈ పని ప్రభుత్వ శాఖ అయిన పోలీసు వ్యవస్థకే వీలవుతుంది.  పోలీసులకుండే లాబ్ వసతి, రికార్డుల సదుపాయం, సమాచార సౌలభ్యం, ఇన్ఫార్మర్ ల తోడ్పాటూ  మొదలైనవి  ప్రైవేట్ డిటెక్టివ్ ల అందుబాటులోకి రావు.  ఒక హత్య జరగ్గానే ఏ అధికారమూ లేని  డిటెక్టివ్ ఆ ఘటనా స్థలానికి వెళ్ళిపోతాడు. ఇన్స్ పెక్టర్ సెల్యూట్ కొట్టి సాదరంగా ఆహ్వానిస్తాడు. హత్యాస్థలంలో అన్నీ చూపిస్తాడు. డిటెక్టివ్ క్లూస్ పట్టుకుంటాడు. తనే కేసు పరిశోధించి,  పరిష్కరించి శెభాష్ అన్పించుకుంటాడు. తనే హీరో, పోలీసులు జీరోలు.  నిజంగా ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ప్రతీ డిటెక్టివ్ రచయితా చేసిన పని ఇదే. ఏదో కాలం కలిసివచ్చి ఆ పాత్రల్ని అలా రాసి ఆరాధ్య దైవాలు చేశారు కాబట్టే  పాఠకులూ వాస్తవికత చూడకుండా  అభిమానించారు. ఎంత లైసెన్సు వున్న ప్రైవేట్ డిటెక్టివ్ అయినా ఇలాటివి చేయలేడు. పోలీసులూ  రానివ్వరు. 

ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ 
        ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ తో ఇదంతా
వాస్తవికంగా  వుంటుంది. అతను వెళ్ళిన చోట హత్య జరిగి వుంటే ఏదీ ముట్టుకోకుండా వెంటనే పోలీసుల్ని పిలుస్తాడు. పోలీసులు వచ్చి అతన్నే ఇబ్బంది పెడతారు. ఫేమస్ లాయరని సెల్యూట్ కొట్టరు. పెర్రీ మేసన్ కూడా ప్రోటోకాల్ పాటించి వెళ్ళిపోతాడు. పోలీసులే  కేసు దర్యాప్తు చేస్తారు. పెర్రీ మేసన్ కి పాల్ డ్రేక్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ వుంటాడు. కేసులోంచి తన క్లయింట్ ని కాపాడడానికి మేసన్,  డ్రేక్ చేత సీక్రేట్ గా పరిశోధన చేయిస్తాడు. ఆ సాక్ష్యాధారాలతో కేసు సంగతి కోర్టులో చూసుకుంటాడు. ఈ కోర్టు సీన్లే మనకి చలిజ్వరం తెప్పిస్తాయి. ఇదంతా ప్రొఫెషనల్ గా వుంటుంది. 

          కాబట్టి నెట్ వర్క్ నేరాలతో  వాస్తవికత  డిటెక్టివ్ పాత్రలకి ప్రతిబంధకంగా మారింది. పైన చెప్పిన పోలీస్ నెట్ వర్క్ లో కూడా  డిటెక్టివ్ ని ఇన్వాల్వ్ చేసి రాస్తే చాల అసహజంగా వుంటుంది.  షెర్లాక్ హోమ్స్ అయినా కేవలం అతడి కుశాగ్రబుద్ధి చేత  ఈ కాలంలో ఇలాటి కేసులు పరిష్కరిస్తున్నట్టు రాయడానికి పూనుకోలేరు. కనుక డిటెక్టివ్ పాత్రలు అస్తిత్వ సమస్యలో పడ్డాయి.

          ఈ నేపధ్యంలో ఇంగ్లీషు సాహిత్యంలో  పోలీస్ డిటెక్టివ్ అనేవాడు అవతరించాడు (బ్రిటన్ నుంచి రూత్ రెండెల్ నవలలు). ఇతను పోలీసు శాఖలో ఉద్యోగియే. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ సబిన్స్ పెక్టర్ అని మన దగ్గరా వున్నారు. అయితే ఈ పాత్రలు మన డిటెక్టివ్ సాహిత్యంలో కొచ్చేసరికి  డిటెక్టివ్ లకి సహకరించే పక్క పాత్రలుగా వుండి పోయాయి ( డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు- కొమ్మూరి సాంబశివరావు, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణన్- సికిందర్). పాశ్చాత్య సాహిత్యంలో పోలీస్ డిటెక్టివ్ వచ్చేసి స్వతంత్రుడైపోయాడు. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రలు కేవలం తమ అఖండ మేధాశక్తి తోనే గాక, ఆధునిక ఫోరెన్సిక్ సైన్సు, కంప్యూటర్ ప్రోగ్రాములు వంటి అండదండలతో నేర పరిశోధనని శాస్త్రీయంగా మార్చుకుని ముందుకు సాగుతారు. సమాజంలో చోటు చేసుకునే పరిణామాలు తప్పకుండా సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి గనుక, క్రైం  సాహిత్యపు రూపు రేఖలు అలా పూర్తిగా మారిపోయాయి. దీంతో  ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఆధునిక క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ తన స్థానాన్ని కోల్పోయాడు. గడచిన నలభయ్యేళ్ళ కాలంలో ఆంగ్లంలో కొత్తగా డిటెక్టివ్ పాత్ర సృష్టి ఏదీ జరగలేదు. వున్న డిటెక్టివ్ కథలే పునర్ముద్రిస్తున్నారు. తెలుగులో అదీ లేదు. కొమ్మూరి  జీవించినంత కాలం ఆయన సొంత పబ్లికేషన్లో యుగంధర్ సిరీస్ పునర్ముద్రణలు పొందేవి. 

అగథా క్రిస్టీ
       సరే, తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ క్యారెక్టర్ అడ్రసు గల్లంతయ్యాక, కాల్పనిక క్రైం కథల స్థానంలో రియల్ క్రైం స్టోరీస్ ప్రవేశించాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా వెంటనే పోలీస్ డిటెక్టివ్ ని ఎవరూ అందుకోలేదు. ఈ వ్యాసకర్త ‘అపన’ లో రాసినప్పుడు అవన్నీ ఫోరెన్సిక్- మెడికో లీగల్ ప్రొసీజర్స్ తో కూడిన హత్య కేసుల దర్యాప్తులే. అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ప్రైవేట్ డిటెక్టివ్ లకి ఆపాదించి రాయడం అసహజంగానే వున్నా, లాల్ అండ్ జాన్ అనే పాత్రలు పాపులర్ అయ్యాక అవేం చేసినా చెల్లిపోయింది. విమర్శలు రాలేదు. విషయం ఆకర్షించింది. ఈ డిటెక్టివ్ పాత్రల ప్రత్యేకత గురించి ఎడిటర్ శ్యామ దామోదర రెడ్డి గారు సంపాదకీయాల్లో రెండు మూడు సార్లు పేర్కొన్నారు కూడా. డిటెక్టివ్ లాల్ అండ్ జాన్ ల పరిశోధనలు డిటెక్టివ్ సాహిత్యానికే వన్నె తెస్తున్నాయన్నారు. కానీ మొత్తంగా డిటెక్టివ్ సాహిత్యమే కట్ట కట్టుకుని అటకెక్కాక,  ఇంకే పోలీస్ డిటెక్టివ్ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఛానెల్స్ వచ్చి పుస్తకమే చచ్చిపోయాక, డిటెక్టివుల గురించి మాట్లాడే పనే లేకుండా పోయింది. 

        అలా తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ అనే పాత్రకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
          మెదడుని  పదునెక్కించేదీ, పరిశీలనా శక్తిని పెంచేదీ; ఇంగిత జ్ఞానాన్ని, తార్కిక బుద్దిని, సమయ స్ఫూర్తి నీ, సూక్ష్మదృష్టినీ  పరిపుష్టం జేసేదీ, వేగవంతమైన ఆలోచనా శక్తిని కల్పించేదీ డిటెక్టివ్ కథే. ప్రైవేట్ డిటెక్టివ్ కావొచ్చు, పోలీస్ డిటెక్టివ్ కావొచ్చు- డిటెక్టివ్ ఎప్పుడూ న్యాయం వైపే వుంటాడు. కక్కుర్తి పడి అన్యాయం చెయ్యడు. మంచిని కాపాడతాడు. అతడి మాటా  ప్రవర్తనా నిజాయితీతో, బాధ్యతతో కూడుకుని వుంటాయి. నెగెటివ్ భావాల్ని రెచ్చ గొట్టే పనికి డిటెక్టివ్ దూరం –బహుదూరం.
                                                         
***
ఇతర భాషల్లో డిటెక్టివ్ లు...
          మన దేశంలో ఇతరభాషల్లో డిటెక్టివ్ పాత్ర లెలా వున్నాయో చూస్తే, బెంగాలీలో సత్యజిత్ రే సృష్టించిన ప్రసిద్ధ ‘ఫెలూదా’ వున్నాడు. చార్మినార్ సిగరెట్ తాగుతూ, స్టేట్స్ మన్ దిన పత్రిక  చదివే ఈ డిటెక్టివ్ పాత్ర వెంట తోప్షే అనే టీనేజర్ వుంటాడు. ఈ జంటని ముంబాయి నుంచీ ఖాట్మండూ వరకూ ఎక్కడికైనా తిప్పేవారు సత్యజిత్ రే. సోనార్ కెల్లా, జై బాబా ఫెలూ నాథ్ అనే రచనల్ని తెర కెక్కించారు కూడా. బెంగాలీ లోనే శిబరాం చక్రవర్తి అనే హాస్య రచయిత సృష్టించిన డిటెక్టివ్ కొల్కే కాశీ  అనే కామిక్ పాత్ర వుంది. మనోరంజన్ భట్టా చార్య  అనే మరో రచయిత హుక్కా కాశీ అనే మరో డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇక శరదిందు బందోపాధ్యాయ అయితే ఏకంగా దేశవాళీ షెర్లాక్ హోమ్స్ నే సృష్టించారు. పాత్ర పేరు బ్యాంకేష్ బక్షీ. గంగోపాధ్యాయ అనే మరొకాయన కాకా బాబూ అనే డిటెక్టివ్ నీ, సమ రేష్ బోస్ గగోల్ అనే బాల డిటెక్టివ్ నీ సృష్టించారు. 1960లలో రచయిత నిహరంజన్ గుప్తా ప్రవేశంతో  ఊపు వచ్చింది. ఈయన సృష్టి కిరీటీ రాయ్ అప్పట్లోనే హైటెక్ డిటెక్టివ్. కానీ ఎన్ని డిటెక్టివ్ పాత్రలున్నా,  బెంగాలీలో డిటెక్టివ్ పాత్ర అనగానే సత్యజిత్ రే ‘ఫెలూదా’ యే మెదులుతాడు. 


          కన్నడ సాహిత్యంలో క్రైం సాహిత్యం  ముప్ఫై శాతం. టాప్ రైటర్ నర్సింహయ్య. ఈయన 1950లో రాయడం ప్రారంభించారు. ఇప్పటికి 400 నవలలు రాశారు. ఈయన సృష్టించిన పురుషోత్తం – మధుసూదన డిటెక్టివ్ పాత్రలు ఇంటింటా తెలిసిన పాత్రలు. రెండో స్థానంలో విజయ నన్నూర్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారి వున్నారు. సహజంగానే ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. ఇక మరాఠీ కొస్తే, అక్కడ డిటెక్టివ్ సాహిత్యం పుష్కలంగా ఉత్పత్తి అయినా చెప్పుకోదగ్గ రచయితల్లేరు. 1960 లనాటి బాబూరావ్ అర్నాల్కర్ రచనల్నే ఇప్పటికీ యువతకి దిక్కు. ఇతరులు రాసినవి ఆంగ్ల కథలకి మక్కీకి మక్కీ కాపీలు. ఒక్క శ్రీకాంత్ శింకర్ మాత్రం నిజంగా జరిగిన సంఘటనల్ని కథలుగా మల్చి పాపులరయ్యారు. ఇక తమిళంలో, సెక్స్ ఎక్కువ కలిపి రాస్తారు. సుజాత అనే కలం పేరుతో రాసే లాయర్ మాత్రం ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. దేశవాళీ పెర్రీ మేసన్ సృష్టించి పేరు తెచ్చుకున్నారీయన. ఇతర డిటెక్టివ్ రచయితలూ ఛానెళ్ళ  వైపు వెళ్ళిపోయారు.

నాటు సరుకంటే హిందీలోనే!
          ఇంగ్లీష్ డిటెక్టివ్ సాహిత్యానికే  దేశంలో అత్యధిక పాఠకులున్నారు. తర్వాతి స్థానం హిందీది. అయితే రాసేదంతా చవకబారు సరుకే. ఎప్పుడో దశాబ్దం  క్రితం కల్నల్ రంజిత్ పేరుతో డిటెక్టివ్ నవలలు వచ్చేవి. వాటిలో  డిటెక్టివ్ భగవాన్ వుండేవాడు. ఈ అపరాధపరిశోధకుడి పాత్ర ఆకట్టుకునే విధంగా వుండేది. ఇప్పుడొస్తున్న డిటెక్టివ్ నవలలన్నీ సి గ్రేడ్ హిందీ సినిమాల స్థాయిలో వుంటున్నాయి. చాలావరకూ సినిమా కథల్లాగే వుంటాయి డైలాగులు సహా. ఈ ‘డిటెక్టివ్ రచయితలు’  హిందీ సినిమాల్లో అవకాశాల కోసం తహతహలడుతున్నట్టుగా  సినిమాటిక్ గా నవలలు రాస్తూంటారు. 1980 లకి పూర్వం వేద్ ప్రకాష్ కాంభోజ్,  ఓం ప్రకాష్ శర్మ, ఇబ్నె షఫీ అనే రచయితలు హిందీ  డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యులని చెప్పాలి. ఇబ్నె షఫీ సృష్టించిన డిటెక్టివ్ జంట అబ్దుల్ అండ్ హమీద్ లు నాటుగా మోటుగా మాస్ గా వుంటూ హిందీ గ్రామీణ పాఠకుల్ని ఆకట్టుకునేవి. 1980-90 లలో అంతా నరేంద్ర మోహన్ పాఠక్  రాజ్య మేలారు. ఇదే సమయంలో రాయడం మొదలెట్టిన వేద్ ప్రకాష్ శర్మ ‘వర్దీ వాలా గూండా’ (పోలీస్ యూనిఫాంలో గూండా)  అనే నవల ఇప్పటికి  అయిదు లక్షల కాపీలు అమ్ముడయ్యిందని చెప్పుకుంటారు. దీన్ని నవల అనేకన్నా సినిమా స్క్రిప్ట్ అనొచ్చు. హిందీ డిటెక్టివ్ నవలల టైటిల్స్, కథా కథనాలు, పాత్రలు ప్రతీదీ హిందీ మసాలా మూవీస్ లాగే వుంటాయి. వీటిని చదవడమంత  శిక్ష వుండదు. ఈ వ్యాసకర్త పది పేజీలకన్నా చదవలేక పోయేవాడు. ముద్రించే కాగితం కూడా అత్యంత హీనంగా వుంటుంది. హిందీకి జాతీయ భాషా హోదా వున్నప్పటికీ ఆ భాషలో ఒక్కరంటే ఒక్కరు   ఓ పాపులర్ డిటెక్టివ్ పాత్రని  అందించలేకపోయారు.

వాడుకలో డిటెక్టివ్ పదం 
సర్ ఆర్ధర్ కానన్ డాయల్
          ప్రపంచ సాహిత్యంలో తొట్ట తొలి డిటెక్టివ్ పాత్ర సృష్టికర్త సర్ ఆర్ధర్ కానన్ డాయల్ కాదు. ఆయన షెర్లాక్ హోమ్స్ పాత్రని 1887 లో సృష్టించారు. కానీ ఇంకా పూర్వం 1841 లో ఎడ్గార్ అలన్ పో  ‘ది మర్డర్స్ ఇన్ ది రూమార్గ్’ అన్న నవల రాశారు. ప్రపంచంలో ఇదే మొట్టమొదటి డిటెక్టివ్ రచన. ఇందులో ఆయన లీ షావెలర్ సీ ఆగస్ట్ డుపిన్ అనే డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇదే ప్రపంచంలో మొట్ట మొదటి డిటెక్టివ్ పాత్ర. కానీ డుపిన్ వల్లా, షెర్లాక్ హోమ్స్ వల్లా డిటెక్టివ్ అన్న పదం వాడకంలోకి రాలేదు. 1829 లో స్కాట్ లాండ్ యార్డ్ గా పిలిచే లండన్ పోలీసు వ్యవస్థ  ఏర్పాటయ్యాక,  నెమ్మదినెమ్మదిగా 1878లో అందులో సీఐడీ విభాగాన్ని ప్రారంభించాక, సీఐడీ  పోస్టుల్ని సృష్టించారు. ఆ సీఐడీ లకే  డిటెక్టివ్ లన్న పర్యాయనామం స్థిరపడింది. అలా క్రైం సాహిత్యానికి డిటెక్టివ్ సాహిత్యమని పేరొచ్చింది. అందులో అపరాధపరిశోధకుడు డిటెక్టివ్ అయ్యాడు. షెర్లాక్ హోమ్స్ సహా అపరాధపరిశోధక పాత్రలన్నిటికీ డిటెక్టివ్ లనే పేరొచ్చింది.



తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్  పాత్రలు
వాటి సృష్టి కర్తలు
యుగంధర్
కొమ్మూరి సాంబశివరావు
లాయర్ విశాలాక్షి
ఆరుద్ర
వాలి, పరశురాం
టెంపో రావ్
భగవాన్
విశ్వ ప్రసాద్
పృథ్వీరాజ్
మల్లాది వెంకటకృష్ణ మూర్తి
నర్సన్
గిరిజశ్రీ భగవాన్
వెంకన్న 
వసుంధర
ఇంద్రజిత్
పాణి
ఇంద్రజిత్- ప్రమీల   
చాణక్య     
చంద్రమోహన్
సిన్హా
సుధాకర్
కరణ్   
ఇన్స్ పెక్టర్ రాజారెడ్డి
గిరి 
వాసు- శేషు
లాల్ అండ్ జాన్
ఆహర్పతి, జగత్ 
రావులపాటి సీతారామారావు
కృష్ణ మోహన్
కనకమేడల
జివిజి
విజయబాపినీడు
శ్యాం బాబు
ఏవీ మోహన్రావ్
బొమ్మిడి అచ్చారావు
అజీజ్
ఎంవివి సత్యనారాయణ
బి. రాజేశ్వరి
సికిందర్ (అపరాధపరిశోధన)
సికిందర్ (ఆంధ్రభూమి)


ఆంగ్ల సాహిత్యంలో డిటెక్టివ్  పాత్రలు
వాటి సృష్టికర్తలు
షెర్లాక్ హోమ్స్
కానన్ డాయల్
హెర్క్యూల్ పైరట్, మిస్ మార్పుల్
అగథా క్రిస్టీ
ఫిలిప్ మార్లో
రేమండ్ చాండ్లర్
లివ్ ఆర్చర్
రాస్ మెక్ డొనాల్డ్
ట్రావిస్ మెక్ గీ
జాన్ డి. డొనాల్డ్
ఫాదర్ బ్రౌన్
చెస్టర్టన్
పెర్రీమేసన్ (క్రిమినల్ లాయర్)
ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్
జేమ్స్ బాండ్ (గూఢచారి)
ఇయాన్ ఫ్లెమింగ్



(కవర్ స్టోరీ అయిపోయింది) 
రేపు : ఈ వ్యాసాలు ఎవరి కోసం?

- సికిందర్











         




4, ఏప్రిల్ 2017, మంగళవారం

     క్రైం జానర్ సినిమా అర్ధమవాలంటే డిటెక్టివ్ సాహిత్యం తెలుసుకోవాలి.  ఫిలిం నోయర్ గా పుట్టిన  క్రైం జానర్ డిటెక్టివ్ సాహిత్యంలోంచే పుట్టింది 1930 లలో. ఇప్పుడు తెలుగులోనూ డిటెక్టివ్ సాహిత్యం లేకపోవచ్చు. కానీ  దాని వారసత్వంగా క్రైం జానర్ తో సినిమాలు వుంటూనే వున్నాయి. కాబట్టి అసలీ క్రైం జానర్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే డిటెక్టివ్ సాహిత్య చరిత్రలోకి వెళ్ళాలి. ఫిలిం నోయర్ సినిమాలలో  ప్రధానంగా వుండే ఎలిమెంట్స్  గనుక చూస్తే- ఓ హత్య జరుగుతుంది, ఆ హత్య కేసుని ఒక డిటెక్టివ్, లేదా ఇన్వెస్టిగేటర్ దర్యాప్తు చేస్తాడు. ఇతనే కథానాయకుడు. మరో  రెండు స్త్రీ పాత్రలుంటాయి -  ఒకటి నెగెటివ్, ఇంకోటి  పాజిటివ్;  కథ నగర ప్రాంతంలోనే జరుగుతుంది, చాలా  వరకూ రాత్రి పూటే జరుగుతుంది, వర్షం కూడా  పడితే పడవచ్చు, డైలాగులు పదునుగా  పోయెటిక్ గా వుంటాయి, ప్రధాన పాత్రలన్నీ ఉన్నత వర్గాలకి చెందినవే అయివుంటాయి,  ఉన్నత వర్గాల హిపోక్రసీని ఎండగట్టడం , కాల నేపధ్యంతో బాటు, సమాజ నేపధ్యాన్ని కూడా జోడించడం  ఈ జానర్ ప్రధాన లక్షణాలుగా వుంటాయి.

           తెలుగులో డిటెక్టివ్ సాహిత్యానికి సుదీర్ఘ చరిత్రే వుంది. గొప్ప గొప్ప పండితులూ ఈ సాహిత్యాన్ని రాసిన వాళ్ళల్లో వున్నారు. 1950 లలో పాంచకడీ దేవ్ అనే రచయిత బెంగాలీలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్ నవలలు రాసే వారు. సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ నీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత  క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నీ,  తలపించేలా పాంచకడీ దేవ్ సృష్టించిన  డిటెక్టివ్ అరిందమ్ పాత్రతో, బెంగాలీ నవలల్ని  ప్రసిద్ధ వేంకట పార్వతీశ్వర కవులు తెలుగులోకి అనువాదం చేసి ముద్రించేవారు.

           కవి సామ్రాట్  విశ్వ నాథ సత్యనారాయణ కూడా ‘దిండు కింద పోక చెక్క’ అనే  డిటెక్టివ్ నవల రాసిన వారే. ఇక ప్రసిద్ధ కవి, పరిశోధకుడు, సినిమా రచయిత  ఆరుద్ర 1950 లో ‘పలకల వెండి గ్లాసు’ అనే  డిటెక్టివ్ నవల రాశారు. ఆ తర్వాత అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ మొదలైన డిటెక్టివ్ నవలలెన్నో  రాశారు. చివరిగా 1957 లో ‘ఆడదాని భార్య అనే డిటెక్టివ్ నవల రాశారు. పాలగుమ్మి పద్మరాజు కూడా  చచ్చి సాధించేడుఅనే అపరాధ పరిశోధక నవల రాశారు. 

          ఇదంతా ఒకెత్తయితే,  1930 లలోనే దాదాపు వెయ్యి నవలలు రాసి చరిత్ర కెక్కిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, వంటింటీ స్త్రీలకి వాడుక భాషలో తన నవలలద్వారా అక్షరాస్యతనీ, పఠనాసక్తినీ పెంచారని పేరుగడించారు. ఈయన కూడా అలవోకగా డిటెక్టివ్ నవలలు  రాసి అవతల పడేయడం ఒకెత్తూ . డిటెక్టివ్ సాహిత్యంలో ఈ మొదటి తరం రచయితలిలా వుండగా, రెండో తరం వచ్చేసి 1950 లలోనే కొమ్మూరి సాంబశివరావుతో ప్రారంభమయ్యింది. ఈయన సగటు పాఠకుడి భాషలో ఆధునికంగా రాయడం మొదలెట్టారు. తెలుగులో ఆధునిక డిటెక్టివ్ సాహిత్య పితామహుడు ఆయనే. మద్రాసులో వుండే ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ పాత్ర జంటిల్ మెన్ పాత్ర. చదువుతూంటే ఎలాటి వారికైనా ఈ పాత్రమీద గౌరవం ఏర్పడుతుంది. యుగంధర్ అసిస్టెంట్  రాజు, ఇంకో చైనీస్  అసిస్టెంటు కాత్యా, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  స్వరాజ్యరావు పాత్రలతో ఆయన నవలలు మూడు దశాబ్దాల పాటూ ఒక క్రేజ్. 

         ఇక టెంపోరావ్ అయితే చెప్పనే అక్కర్లేదు- డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసేశారు. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల ఆంగ్లానువాదాలు ప్రచురించే వారు. సినిమారంగంపత్రిక సబ్ ఎడిటర్  గడియారం వెంకట గోపాలకృష్ణ - జి.వి.జి పేరుతో  డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఇలా ఈ డిటెక్టివ్ సాహిత్యపు  పురుగు కుట్టని రచయితలూ, పాఠకులూ లేరంటే అతిశయోక్తి కాదు.    ఈ నేపధ్యంలో డిటెక్టివ్ సాహిత్యం గురించి మరికొంత సమాచారం తెలుసుకుంటే బావుంటుందన్న ఉద్దేశంతో,  2000 జులై  2  ‘ఆంధ్రభూమి’ ఆదివారం అనుబంధంలో ‘మాయమైన డిటెక్టివ్’  పేర ఈ వ్యాసకర్త  రాసిన కవర్ స్టోరీని ఇక్కడ ఇస్తున్నాం, ఆసక్తి వుంటే చదవండి... 
                                            ***
        లే చిత్రంగా తోచే స్థితి ఇది... పుస్తకాల్నిండా డిటెక్టివ్ పాత్రలున్నప్పుడు,  బయటెక్కడా డిటెక్టివ్ లు కన్పించలేదు మన దేశంలో. ఇప్పుడు బయట అడుక్కో ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ వెలుస్తున్నప్పుడు, పుస్తకాల్లోంచే మాయమైపోయాడు డిటెక్టివ్ అనే వాడు!

          క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ పొందింది  మామూలు మరణం కాదు – శాశ్వతంగా ఆ జాతి అంతరించిపోయింది, రాక్షస బల్లులు డైనోసారస్ లకి మల్లే.
         
           ఈ పరిణామం ఒక్క తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల క్రైం సాహిత్యాల నుంచీ డిటెక్టివ్ మాయమై పోయాడు.

          తెలుగులో శవ సాహిత్యంగా పేరు బడి, అస్పృశ్యతకి  గురైన క్రైం సాహిత్యమే, అనంతర కాలంలో స్టార్ రైటర్ల చలవతో తెలుగు వారపత్రికల కెక్కి,  పాపులరవడం, గౌరవం పొందడం  ఒక వింత. నవలా సాహిత్యమంటే ఇదేనేమో అన్నంత భ్రమలో పాఠకులూ  పడిపోయి, వార పత్రికల్లో స్టార్ రైటర్స్ రాస్తున్న క్రైం థ్రిల్లర్ సీరియల్స్ కి దాసోహమైపోయారు- ఒకప్పుడు డిటెక్టివ్- క్రైం సాహిత్యాన్ని శవ సాహిత్యమని ఛీ కొట్టిన ఉత్తమ సాహిత్యాభిలాషులే,  పాఠకురాళ్ళే, విపరీత క్రేజ్ తో అటువంటి  సీరియల్స్ నే  అక్కున జేర్చుకోవడం మొదలెట్టారు. 

          వార పత్రికల్లో ఆ పాపులర్ సాహిత్యమంతా కూడా మంత్ర తంత్రాల క్షుద్ర సాహిత్యం తోనే మొదలైంది. ఒకప్పుడు పావలాకి  అద్దెకి దొరికే డిటెక్టివ్ నవలలంత సమాన వైభోగమే ఇది. కానీ పాపులర్ నవలా రచయిత లెవరూ డిటెక్టివ్ ని  బతికించుకోవాలనే ఆలోచనే చేయలేకపోయారు.

          అప్పటివరకూ వున్న  క్రైం- డిటెక్టివ్ రచయితలూ వార పత్రికలకి ఎక్కలేకపోయారు. ఒక్క మధుబాబు విషయంలో అది సాధ్యమైనా, ఆయన సృష్టించిన లెజండరీ పాత్ర ‘షాడో’ డిటెక్టివ్ కాదు, ఒక యాక్షన్ హీరో. డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు పాత్రలతో మూడు దశాబ్దాల పాటూ  మకుటం లేని మహారాజులా వెలిగిన కొమ్మూరి సాంబశివరావు,  చరమ దశలో ‘ఉదయం’ వీక్లీలో అతి కష్టంగా ఓ డిటెక్టివ్ సీరియల్ రాయగల్గారు ఆ పాత్రలతో, అంతే. చిన్నచిన్న క్రైం కథల్ని ప్రచురించాడానికే అదేదో మర్యాద తక్కువగా వెనుకాడిన వార పత్రికలే,  ఈ ట్రెండ్ లో ఇక ఏకంగా క్రైం –సెక్స్- హార్రర్  కథాంశాలతో,  శైలీ శిల్పం సరైన భాషా వుండని చవకబారు సీరియల్స్ కూడా ప్రచురించడం మొదలెట్టాయి- వాటిని కుటుంబాల డ్రాయింగ్ రూముల్లోకీ తీసికెళ్ళి పోయాయి. సీరియల్స్ పేరుతో  కాపీ రాయుళ్ళనీ, ఘోస్టు రచయితల్నీ ఉత్పత్తి చేసి, ఒక ఆంధ్రా హెరాల్డ్ రాబిన్స్ నీ, ఇంకో ఆంధ్రా ఆర్ధర్ హెయిలీ నీ, మరింకో ఆంధ్రా సిడ్నీ షెల్డన్ నీ ఆడా మగా అమాయక పాఠకుల మీద రుద్దాయి గానీ, ఒక్కరంటే ఒక్క ఆంధ్రా కానన్ డాయల్ ని గానీ, ఆంధ్రా జేమ్స్ హేడ్లీ ఛేజ్ ని గానీ, ఆంధ్రా అగథా క్రిస్టీ ని గానీ  అందివ్వలేకపోయాయి.

          జనబాహుళ్యంలో పఠనాశక్తిని పెంచింది అణా అద్దె డిటెక్టివ్ నవలలే.  పేపరైనా చూడని మొహాలకి చదివే క్రేజ్ ని నేర్పింది ఈ శవ సాహిత్యమనే డిటెక్టివ్ నవలలే. బడి కెళ్ళే బుడ్డి వెధవ దగ్గర్నుంచీ, సోడాలమ్మే మిడిమిడి జ్ఞానపు కామన్ మాన్ వరకూ-  దొంగచాటున డిటెక్టివ్ ల్ని చదివి ఎంతో కొంత అక్షర జ్ఞానంతో  బాటు, విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న వాళ్లెందరో. 

          మద్రాసు కేంద్ర స్థానంగా విరివిగా ఉత్పత్తి అయ్యే డిటెక్టివ్ నవలలు  చొరబడని ఆంధ్రప్రదేశ్ గ్రామమంటూ లేదు. అతి చిన్న సమూహంగా వుండే  ఈ సాహిత్యాభిమానులు, పదుగురి ముందు ఈ నవలలు చదివితే చీప్ టేస్టు వెధవలుగా చిన్న చూపుకి  గురయ్యే వారు. ప్రపంచంలో ఇంకే భాషలోనూ డిటెక్టివ్ సాహిత్యానికి ఈ గతిపట్టలేదు,  సరికదా విన్ స్టన్ చర్చిల్ లాంటి మహానుభావులు రాత్రి పూట డిటెక్టివ్ నవల చదవనిదే నిద్రపోయే వాళ్ళు కాదు.  తెలుగులోనే తామేదో గొప్ప  టేస్టున్న మొనగాళ్ళమని పోజు కొట్టే వాళ్ళు ఈ గతి పట్టించారు.

          ఈ డిటెక్టివ్ నవలలకి కూడా చాటుమాటుగా పట్టుకెళ్ళ డానికీ, దొంగచాటుగా చదువుకోవడానికీ అన్నట్టు ఒక అనువైన సైజు వుండేది. సరీగ్గా జేబులో పట్టే పాకెట్ సైజు (ఈ వ్యాసకర్త నిక్కరు జేబుతో లాభం లేక, పొత్తి కడుపులో దోపుకుని తిరిగే వాడు ఎనిమిదో తరగతి చదువుతూ కొమ్మూరి నవలల్ని. ఒకసారి తండ్రి చేత తొడపాశం కూడా పెట్టించుకున్నాడు. అయినా ఏనాడూ వదల్లేదు ఈ సాహిత్యాన్ని. ఆ నిర్బంధ పరిస్థితులు ఈ వ్యాసకర్తలో ఏకంగా డిటెక్టివ్ రచయిత ఉద్భవించేలా చేశాయి!). నవలలతో  పరిస్థితి ఇలా వుండగా, మరోవైపు ఒక మాస పత్రికతో  వేరేగా వుండేది. ‘అపరాధ పరిశోధన’ అనే ఆ మాసపత్రిక పెద్ద మనుషుల బుక్ షెల్ఫుల్లోకి చేరేది. భువనగిరికి చెందిన శ్యామ దామోదర రెడ్డి 1960 లలోనే హైదరాబాద్ నారాయణ గూడాలో ప్రారంభించిన ఈ డిటెక్టివ్ మాస పత్రికకి మంచి గౌరవం లభించేది. డాక్టర్ దాసరినారాయణ రావు కూడా తమ పాఠకులే అని దామోదర్ రెడ్డి చెప్పేవారు. ఎందరో ఉన్నతాధికారులు, వైద్యులు, న్యాయవాదులూ, ప్రవాసాంధ్రులు కూడా  చందాదార్లుగా వుండే వారు. పాఠకు రాళ్ళ సంఖ్యా తక్కువేం కాదు. ప్రతినెలా ఒక డిటెక్టివ్ కథల పత్రిక, దాంతో పాటూ నాల్గు డిటెక్టివ్ నవలికల సప్లిమెంటరీ వెలువడేవి. ఇవీ పాకెట్ సైజులోనే వుండేవి. తెలుగు డిటెక్టివ్ సాహిత్యానికి ‘అపన’ (‘అపరాధ పరిశోధన’ ముద్దు పేరు) సమకూర్చి పెట్టిన గౌరవ ప్రతిష్టలూ, చేసిన సేవా మరే పత్రికా చేయలేదు. 

కొమ్మూరి సాంబశివరావు 
         మద్రాసు నుంచే సినీనిర్మాత వైవీ రావ్ కొన్నాళ్ళు ‘డిటెక్టివ్’ అనే పత్రిక నడిపారు. విజయబాపినీడు ‘క్లూ’ అనే పత్రిక  నడుపుతూ ఆపుతూ వుండేవారు. అపన మాత్రం ఏ నెలా ఆగకుండా మూడు దశాబ్దాలూ  నడిచింది ( చరమ దశలో ఈ వ్యాసకర్త ఓ యాభై కథలూ, డెబ్బై నవలికలూ, ఇంకో రెండు సీరియల్సూ  ఆరేళ్ళ పాటూ రాసి అస్త్రసన్యాసం చేశాడు).
(ps : 1996- 2010 మధ్య ఆంధ్రభూమిలోనూ, ఆంధ్రజ్యోతిలోనూ 700 వరకూ క్రైం, డిటెక్టివ్  కథలు రాశాడు).
            యండమూరి, మల్లాదిలు కూడా ఈ పత్రికలో రాసిన వారే. ఇక మద్రాసు, విజయవాడ కేంద్ర స్థానాలుగా  కొమ్మూరి సాంబ శివరావు, టెంపోరావ్, గిరిజ శ్రీ భగవాన్, విశ్వ ప్రసాద్, విశ్వ మోహన్, కృష్ణ మోహన్, విజయబాపినీడు, కనక మేడల, భయంకర్, గుత్తా బాపినీడు, డాక్టర్, కొప్పిశెట్టి ... చెబుతూ పోతే జాబితా అంతమవదు- ఈ హేమాహేమీలు పుంఖానుపుంఖాలుగా  డిటెక్టివ్ నవలల్ని వెలువరుస్తూంటే, హైదరాబాద్ నుంచి ‘అపన’ ద్వారా మల్లాది వెంకట కృష్ణ మూర్తి, వసుంధర, శ్యాం బాబు, ముద్దా సురేష్, బొమ్మిడి అచ్చారావు, రమణ శ్రీ, తిరుమల శ్రీ, ఏవీ మోహన్రావ్, రంకిరెడ్డి రాము, అజీజ్, ఎంవివి సత్యనారాయణ, విఎస్ చెన్నూరి,  కురుమద్దాలి విజయలక్ష్మి, సామవేదుల గీతారాణి, విద్వాన్ షీలా దేవి, సికిందర్ ...మరెందరో రచయితలూ తమతమ  కలాలకి పదును పెడుతూ- మెదడుకి మంచి మేత పెట్టే, ఎక్కడ్నించీ కాపీ కొట్టని-  ఒరిజినల్ రచనల్ని అందించే వారు.

          ఈ వైభవమంతా వారపత్రికలలో పాపులర్ సీరియల్స్ అనే ఒక్క గాలివాటుతో హరప్పా - మొహంజొదారో అయిపోయింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే రచనా విధానం  పాఠకులకి విపరీతంగా నచ్చేసి,  ఆ రకపు సాహిత్యం వైపు మళ్ళడంతో,  ఉన్న ఆ ఒక్క డిటెక్టివ్ మాస పత్రికా మూతబడిపోయింది. దాంతో ఆ రచయితల్లో అనేకులు కనుమరుగయ్యారు, మిగిలిన వాళ్ళు ఇతర ప్రక్రియల మీద దృష్టి పెట్టారు. సాహితీ వేత్తలు ఒప్పుకోరేమో గానీ, ఇక్కడ చెప్పుకోదగ్గ విశేష మేమిటంటే, ఏ కథల్ని గతంలో శవ సాహిత్యమని ఈసడించుకునే వారో,  ఆ  డిటెక్టివ్ కథల్లో భాష బతికేది. శుభ్రమైన తెలుగుతో వర్ణనలు సింపుల్ గా వుండేవి. వార పత్రికల్లో పాపులర్ సీరియల్స్ ట్రెండ్ మొదలయ్యాక,  తెలుగెలా తయారయ్యిందో, వర్ణనలు, సన్నివేశాలూ ఎలా వుండేవో  చూసిందే. కనుగుడ్లు పీకేసే హార్రర్, ఐసు  దిమ్మెల్లో చిత్ర హింసలు పెట్టే  థ్రిల్స్ , నడిచే రైల్లో గుడ్డ లిప్పుకునే సెక్స్, కరిచే చలిలో నరికి వేతల ఉన్మాదం... కలగలిసిన కాక్ టెయిల్ పానీయాల మత్తులో పాఠక లోకం మైమరచి పోవడంతో- ఇక కుశాగ్రబుద్ధి బలం గల డిటెక్టివ్ చచ్చి వూరుకోక తప్పలేదు. 

          ‘రాజూ, అతన్ని  వెంటాడు... కానీ జాగ్రత్త, అతడి దగ్గర పిస్తోలుంటుందేమో' అని హెచ్చరించే మృదుభాషి అయిన కొమ్మూరి డిటెక్టివ్ యుగంధర్ గొంతు మూగబోయింది. 

          ‘ఈ నేరం చేసి నువ్వు తప్పించుకోలేవ్ రాజారావ్!’  అని ఎంతటి వారినైనా నింపాదిగా పైప్ పీలుస్తూ, ఏక వచనంలో సంబోధించే టెంపో రావ్ డిటెక్టివ్ వాలి తూలిపోయాడు.

          ‘రేయ్ బద్మాష్! ఇది దేశ ద్రోహంరా!’ అని శత్రువుని చెండాడే గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివ్ నర్సనూ మాయమైపోయాడు. 

          ఇలా మూడున్నర దశాబ్దాల పాటు మూడు తరాలకి చెందిన రచయితలు కాపాడిన తెలుగు డిటెక్టివ్ తనువు చాలించాడు. మొదటి తరం ఆరుద్ర, కొవ్వలి వంటి  వారిదైతే, రెండో తరం కొమ్మూరి, టెంపో రావ్ లది. మూడోతరం ‘అపన’ రచయితలది.

          తెలుగు డిటెక్టివ్ సాహిత్యపు పరిసమాప్తికి స్థూలంగా పైన పేర్కొన్న కారణాలు కన్పించినా, లోతట్టులో చూస్తే, మరో కోణం కన్పిస్తుంది. ఇదే ఆంగ్లంతో సహా అన్ని భాషల్లోని డిటెక్టివ్ పాత్రలూ అంతర్ధానమవడానికి   కారణంగా అన్పిస్తుంది. ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యానికి స్వర్ణయుగం   1930ల నాటి కాలం. అప్పటికే కొన్నేళ్లుగా సర్ ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్  హోమ్స్ పాత్ర వుండగా, 1930 లలోనే మరిన్ని సుప్రసిద్ధ డిటెక్టివ్ పాత్రలూ పుట్టాయి. అగథా క్రిష్టీ – హెర్క్యూల్ పైరట్, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ – పెర్రీ మేసన్ ( క్రిమినల్ లాయర్), రేమండ్ చాండ్లర్ -  ఫిలిప్ మార్లో మొదలైనవి. ఇదే కాలంలో డరోతీ సేయర్స్, జూలియన్ సైమన్స్, మార్గరెట్ కోల్ వంటి రచయిత్రులూ రాజ్యమేలారు. మార్గరెట్ కోల్ అయితే నాజీ నియంత హిట్లర్ అభిమాన రచయిత్రి. ఈ కాలంలోనే ఆంగ్ల డిటెక్టివ్ సాహిత్యపు వైభవానికి ముగ్ధుడై – నంబర్ వన్ హాస్య నవలా రచయిత పిజి ఓడ్ హౌస్ త
ను రాసిన ‘ములినర్స్ నైట్స్’  నవల్లో – ఈ ఆధునిక జీవితంలో ప్రజానీకాన్ని మిస్టరీ నవల కట్టిపడేస్తున్నంతగా మరేదీ కన్పించదు- అని ఒక పాత్ర చేత చెప్పించాడు....

(మిగతా రేపు)



-సికిందర్