రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఏప్రిల్ 2015, శనివారం

రివ్యూ..



రచన –దర్శకత్వం :  త్రివిక్రమ్ 
అల్లు అర్జున్, సమంతా, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, స్నేహ, బ్రహ్మానందం, ఎమ్మెస్, అలీ తదితరులు.
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్    కెమెరా :  ప్రసాద్ మూరెళ్ళ
బ్యానర్ :  హారికా అండ్ హాసిని
క్రియేషన్స్
నిర్మాత : ఎస్. రాధాకృష్ణ
విడుదల :   ఏప్రెల్ 9, 2015   సెన్సార్ :  U/A

***
        కుటుంబ కథా చిత్రాలు కూడా పరిణామం చెందాయి. తిరగమోత కథలకి ప్రతిగా ‘మనం’, ‘దృశ్యం’ లాంటి అగ్రతారాగణ కుటుంబ కథా చిత్రాల ఘన విజయాల్ని చూశాం. కథో పాత్రో కొత్తదనంతో కూడుకుని ఉన్నప్పుడే ఇలాటి ఘన విజయాలు ఈ కాలంలో సాధ్యమయ్యాయి. రెండూ పాత తిరగమోతే అయినప్పుడు క్రేజీ కాంబినేషన్లు కూడా కాపాడే పరిస్థితి కన్పించడం లేదు. ఇలాటి భారీ సినిమాల్ని గట్టెక్కించాలంటే తప్పనిసరిగా అది కిల్లర్ స్టోరీ అయివుండాలి. బాక్సాఫీసు వసూళ్ళని ఎక్కడికక్కడ కిల్ చేసి తినేసే కథని  కిల్లర్ స్టోరీ అంటారు. కానీ ఆ కిల్లర్ స్టోరీ కూడా బకాసురుడిలా కలెక్షన్లని ఆరగించాలంటే  దాని సీక్వెన్సుల్ని స్క్రీన్ ప్లే దిగ మింగి కూర్చోకూడదు- ఇది కామన్ సెన్సే. ఒక్కొక్కప్పుడు గత సినిమా సక్సెస్ హేంగోవర్ లోంచి బయటికి రాలేనప్పుడు ఇలాటి అలసత్వం వచ్చేస్తుంది. దీని మూల్యం భారీగానే  చెల్లించుకోవాల్సి వుంటుంది. ‘అత్తారింటికి దారేది’  మీది మమకారాన్ని చంపుకోలేక ‘అబ్బాయి విలువలకి వేల్యూ ఏది’  గా తీయాలనుకున్నప్పుడు ‘షోలే- షాన్’ ల సంగతే పునరావృతమవక తప్పదేమో  అనివార్యంగా..

          అల్లు అర్జున్- త్రివిక్రమ్ ఒక క్రేజీ కాంబినేషన్ అనుకున్నారు అభిమానులు. ఆ హుషారుతో థియేటర్లకి వెళ్తే ఇలాటి సినిమాలో ఉండాల్సిన కిక్ – పెప్ – పంచ్ – యూత్ అప్పీల్ మొదలైనవాటిని అయోమయంగా వెతుక్కోవాల్సిన పరిస్థితి. అన్ని అపార వనరులు కలిగివుండే  బిగ్ షాట్సే కమర్షియల్ సినిమాని కమర్షియల్ సినిమాలాగా తీయలేక పోతే ఇంకెవరు తీయాలన్న ప్రశ్న వస్తుంది.

         బిగ్ కమర్షియల్స్ లో కథని ఆశించకూడదనే వరకైతే ఎలాగో సర్దుకుపోవచ్చు.  కానీ కమర్షియల్ విలువల్ని కూడా ఆశించకూడదు అన్నట్టుగా సినిమా తీయడం మాత్రం దారుణమే.

        హీరో అన్నాక డీ ఫాల్ట్ గా అన్ని సద్గుణాలూ, విలువలే వుంటాయి- ఇంకా తండ్రి నుంచి నేర్చుకున్న విలువలంటూ గొడవేమిటి? అసలు ఈ సినిమాకి ఏంతో అత్యవసరమున్న కమర్షియల్ విలువలకి ఓ నమస్కారం పెట్టి, తన తండ్రి విలువలంటూ పట్టుకు పాకులాడే ఈ కొడుకు కథ అసలెలా తెరకెక్కిందో ఓసారి చూద్దాం!

‘వి’ ఫర్ విలువల గురించి పాఠాలు!
          విరాజ్ ఆనంద్ ( అల్లు అర్జున్ ) ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులోని ఒక గ్రామంలో ప్రత్యర్ధి దేవరాజ్ నాయుడు ( ఉపేంద్ర ) ముఠాతో నువ్వా- నేనా అన్నట్టున్న తీవ్ర పోరాట ఘట్టంలో వున్నప్పుడు, క్షణమాగి తనగురించి ఆలోచించుకోవడం మొదలెడతాడు ( ఆ సమయంలో అదెలా కుదురుతుందని అడగవద్దు) ఆ ఆలోచనలే  అతడి మొత్తం కథ. అతడి స్వగతంలో ఫ్లాష్ బ్యాక్.  దాని ప్రకారం తను సత్యమూర్తి ( ప్రకాష్ రాజ్ ) అనే సత్యవంతుడైన వ్యాపార వేత్త కొడుకు. తనకి తల్లి ( పవిత్రా కిషోర్ ), అన్న (వెన్నెల కిషోర్ ), వదిన ( సింధు తులానీ ) వాళ్ళ కూతురూ కుటుంబ సభ్యులుగా వుంటున్నారు. మూడొందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన తండ్రి సత్యమూర్తి అడిగిన వాళ్లకి లేదనకుండా సాయం చేస్తూంటాడు. డబ్బు కంటే మానవ సంబంధాలు విలువైనవి అన్న అతడి నమ్మకాన్ని విరాజ్ పుణికి పుచ్చుకుంటాడు. తండ్రికున్న వ్యాపారం పట్టకుండా జాల్సాగా తిరిగే ఇరవై యేడేళ్ళ తనకి పల్లవి ( అదా శర్మ ) తో నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. దీన్ని పురస్కరించుకుని బ్యాచిలర్ పార్టీకి బార్సిలోనా వెళ్లి బార్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణవార్త షాకింగ్ గా తగుల్తుంది. తిరిగి వస్తే అన్నకి ఆ తండ్రి మరణంతో మతి చలించి, వ్యాపారం కుప్పకూలి ఆస్తులు అప్పులోళ్ళ పరం చేయాల్సిన పరిస్థితి. చేయకుండా ఐపీ పెట్టి ఎగ్గొట్ట వచ్చు. కానీ తండ్రి విలువలు అవికావు. దీంతో ఆస్తిపాస్తులు వదులుకుని కుటుంబ సభ్యులతో రోడ్డు మీదికొస్తాడు. ఈ పరిస్థితితో పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుంది.

          ఒక ఫ్రెండ్ నడుపుతున్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఆ ఫ్రెండ్ ప్రోద్బలంతో చేరతాడు. అలా ఓ పెళ్లి పనుల నిర్వహణకి ఒక చోటికి వెళ్లేసరికి  ఆ పెళ్లి కూతురు పల్లవే అని తెలుస్తుంది. ఇది కూడా ఓర్చుకుంటాడు. అక్కడ ఇదే పెళ్ళికి వచ్చిన పల్లవి ఫ్రెండ్ షుగర్ వ్యాధి సమీరా ( సామంత) తో ప్రేమలో పడతాడు. ఈమె ఎవరో కాదు- తండ్రికి బద్ధ శత్రువైన సాంబశివరావు ( రాజేంద్రప్రసాద్) కూతురే. మొదట ఈ ప్రేమకి ససేమిరా అన్న ఇతను ఒక ఐడియా తట్టి షరతు పెడతాడు. దాని ప్రకారం  సత్యమూర్తి తనకో లిటిగేషన్ ల్యాండ్ అంట గట్టాడు. సగం ల్యాండ్ కబ్జా చేసిన దేవరాజ్ నాయుడు దగ్గర ఆ సగం ల్యాండ్ తాలూకు పత్రాలున్నాయి. అవి తీసుకొస్తే సమీరా నిచ్చి పెళ్లి చేస్తానంటాడు సాంబశివరావు. దేవరాజ్ నాయుడు ఫ్యాక్షనిస్టు. అతి క్రూరుడు. అయినా సరే ఇతడి దగ్గర్నుంచి ఆ కాగితాల్ని ఫలానా ఈ గడువులోగా తీసుకొస్తానని సవాలు విసిరి వెళ్ళిపోతాడు విరాజ్.

           ఇదీ విషయం. ఇక్కడ్నించీ ఇతను నేస్తం పరంధామయ్య ( అలీ) తో కలిసి ఆ దేవరాజ్ నాయుడింట్లో ఎలా పాగావేశాడు, అక్కడ ఒక దాడిలో దేవరాజ్ ని కాపాడి ఎలా ఆ పత్రాలకి మార్గం సుగమం చేసుకున్నాడు, దీనికి దేవరాజ్ తన చెల్లెలు వల్లి ( నిత్యా మీనన్) ని పెళ్లి చేసుకోవాలని పెట్టిన షరతుతో ఎలా ఇరుకున పడ్డాడు- ఇవన్నీ ఎలా తన విలువల ఆధారిత వ్యూహ ప్రతివ్యూహాలతో పరిష్కరించుకున్నాడూ, తండ్రి పరువు ప్రతిష్టల్ని ఎలా నిలబెట్టాడూ  అన్నది ఈ సెకండాఫ్ కథ.

‘ఈ’ ఫర్ ఎకనమికల్ అర్జున్!
          సినిమా ప్రారంభించింది మొదలు  పెను విషాదాన్ని మోస్తున్న హీరో పాత్ర అవడం చేత అల్లు అర్జున్ మార్కు విలక్షణ నటనకి ఆస్కారమే లేకుండా పోయింది. ఏమంటే బుద్ధిపూర్వకంగా పాత్ర స్థాయికి దిగి వచ్చి పోషించినట్టు స్టేట్ మెంట్లు. ఇలాటి నేలకి దిగిన పాత్రలు పోషించాలంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయనవసరం లేదు- భారీ సినిమా భారీ విన్యాసాల్నే  కోరుకుంటుంది. అమీర్ ఖాన్ ఒకప్పుడు నటించిన ‘రాఖ్’ ( బూడిద) లాంటి ఆఫ్ బీట్ సినిమా తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్ లో. వెంకటేష్ డౌన్ ప్లే చేసిన పాత్రతో ‘దృశ్యం’ కూడా ఇలాటి కోవకి చెందినదే బడ్జెట్ పరంగానూ. ఇది ప్రయోగాలు చేసినప్పటి సంగతి. కానప్పుడు బయ్యర్లందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని రిస్క్ తీసుకునే ఇలాటి బిగ్ కమర్షియల్స్ లో ఇమేజి మేకోవర్లు అంటూ ప్రయోగాలు చెయ్యనే కూడదు.

          పాత్రని బట్టే నటన కాబట్టి, ఈ పాత్రకి కుటుంబ విషాదం, బరువు బాధ్యతలే గాకుండా, అదనంగా అస్తమానం ఆ చనిపోయిన తండ్రి నామస్మరణతో, ఆయనగారి విలువల జపమే అవడంతో, కుదేలైపోయింది పాత్ర. కాబట్టి దీనికి తగ్గట్టే పొదుపుగానే  తన మార్కు విన్యాసాల్ని వాడుకోవాల్సి వచ్చింది. కామెడీకి, అల్లరికి, చిలిపి తనాలకీ అన్నిటికీ ఎకానమీ పాటించాల్సి వచ్చింది. ప్రేక్షకులు తననుంచి ఏదైతే ఆశిస్తారో అది ఇవ్వలేని గాంభీర్యాన్ని పాత్రపరంగా పులుముకోవాల్సి వచ్చింది.

          అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు తండ్రులు చనిపోతూనే వుంటారు. అంతమాత్రాన తండ్రుల  అబ్సెషన్ తో బతికేయడమేనా? ఇంకో ధ్యాస ఉండదా? హీరో అన్నకి ఆ తండ్రితో వున్న అంత బలీయమైన బంధమేమిటో చూపలేదు గానీ, తండ్రి మరణంతో అతణ్ణి మతిస్థిమితం కోల్పోయిన వాడిలా చూపించు కొచ్చారు. హీరో కూడా ఇతడికేమీ తీసిపోనట్టు నిత్యం తండ్రి నామస్మరణ తో,  విలువల జపంతో మానసికంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ కి లోనైనట్టే ప్రవర్తిస్తున్నాడు. తండ్రి చనిపోయాక, ఆయన విలువలెంటో చెప్పేసి అక్కడితో ఆ ఫిలాసఫీని హీరో ఇన్నర్ వరల్డ్ కి పరిమితం చేసివుంటే, హీరో ఔటర్ వరల్డ్ లో స్వేచ్ఛాజీవి అయిపోయేవాడు. ఈ character arc చైతన్యవంతమైన కమర్షియల్ సినిమా కథనాని కెంతో అవసరం. పాత్ర చిత్రణ దెబ్బ తినే సమస్యే లేదు. తత్ఫలితంగా రకరకాల విన్యాసాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వాడు.

          ఒక సూఫీ కథలో ఒకడు తనకి ఈ సంచీలో చిరిగిన బట్టలు తప్ప జీవితంలో ఏమీ మిగల్లేదని, ఆనందమే లేకుండా పోయిందనీ  ఏడుస్తూ వుంటే, ఇది గమనించిన ఇంకొకడు  ఆ సంచీ లాక్కుని పారిపోతాడు. వీడు ఇంకింత ఘోరంగా ఏడుస్తూ వెంటపడితే దూరంగా పొదల్లో ఆ సంచీ కన్పిస్తుంది. దాన్ని ప్రాణంలో ప్రాణంలా పొదివి పట్టుకుని- నా సంచీ నాకు దొరికింది, నా సంచి నాకు దొరికిందోచ్ - అని ఆనందభరితుడై అరుస్తాడు. ఇది గమనిస్తున్న సంచీ లాక్కున్న వాడు- వెధవకి ఇప్పుడు తెలిసివచ్చింది ఆనందమంటే ఏంటో!- అనుకుంటాడు. ఎంత చిన్న చర్యతో ఎంత పెద్ద జీవిత సత్యం? అల్లుఅర్జున్ పాత్ర కూడా తన ఇన్నర్ ఫిలాసఫీని ఔటర్ వరల్డ్ లో, ఇంత పంచ్ వున్న హాస్య ధోరణిలో వినోదాన్ని పండిస్తూ అక్కడక్కడా చెప్పి ఉండొచ్చు.

          లోన విషాదాన్ని దాచుకుని పైకి హుషారుగా తిరిగినప్పుడే అది డైమెన్షన్స్ తో కూడిన ఇంటరెస్టింగ్ క్యారక్టర్ అవుతుంది. లేకపోతే  సింగిల్ షెడ్ లో ఫ్లాట్ క్యారక్టర్ లా ఉండిపోతుంది. ఇక్కడేం జరిగి వుండాల్సిందంటే, చివరా ఖర్లో మాత్రమే క్లయిమాక్స్ లో- తనతో ఆటలాడుకున్న వాళ్ళకీ , తండ్రిని పరిహసించిన వాళ్ళకీ, క్లాసు పీకుతూ ఒకేసారి తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న తన ఫిలాసఫీని తేటతెల్లం జేసివుంటే సరిపోయేది. ఒక యాక్టివ్ పాత్రగా తను పాల్పడిన రకరకాల చర్యలకి చివర్లో మాత్రమే  వివరణ నిస్తూ, తన ఇన్నర్ ఫిలాసఫీని వెల్లడించి కథని sum-up చేసి వుంటే..

                   1. ప్రతిదానికీ రామాయణ మహాభారతాల ఉటంకింపులు తప్పేవి. ఈ దర్శకుడి అభిమాన దర్శకుడు, రచయితలైన బాపు- రమణలు కూడా ఎంత రామ భక్తులై       రామాయణాన్నే మార్చి మార్చి సినిమాలు తీసినా ఎక్కడా రామాయణం లోంచి కొటేషన్లే    చెప్పలేదు. అది ప్రేక్షకులు ఫీలయ్యేట్టు సన్నివేశ కల్పన చేశారు. ప్రేక్షకులు తెలివితక్కువ           వాళ్ళనుకుని రాముడే మన్నాడో, సీత ఏమన్నదో ఇంకా పాఠాలు చెప్పలేదు. అది       ప్రేక్షకులు ఫీలయ్యే సబ్ టెక్స్ట్ అనే సృజనాత్మక అంగం వున్న క్లాస్ క్రియేషన్, ఇది సబ్ టెక్స్ట్ మిగల్చని, ప్రేక్షకుల్ని విసిగించే నీతిసూత్రాలతో మెట్టు దిగిన ‘బి’ గ్రేడ్ మూవీ చేష్ట మాత్రమే.

                   2. అల్లు అర్జున్ పాత్ర తన కుటుంబ సభ్యులతో అలా విషాదభరిత వాతావరణంతో        కాకుండా సరదా సరదా సీన్లు లాక్కోచ్చేది. విషాదం తనలోనూ వుంది. అయితే వాళ్ల విషాదాన్ని మరిపించడానికి నవ్వులు పండిస్తే పాత్రేమీ దెబ్బ తినిపోదుగా? హృషికేశ్   ముఖర్జీ  ‘మిలి’ లో జయబాధురీ,  హృషికేశ్ ముఖర్జీదే ‘ఆనంద్’ లో రాజేష్ ఖన్నా, కె. రాఘవేంద్రరావు  ‘జ్యోతి’ లో జయసుధ, దాసరి నారాయణరావు ‘తిరుపతి’ లో రాజబాబు  పాత్రలు ఇలాటివేగా?

                   3. ఊతపదం ‘చాలా బాగోదు’ బాగున్నప్పటికీ, అలా పాత్ర పరివ్యాప్తం చేస్తున్న ప్రధాన రసం విషాదరసం పాలబడి పేలని బాంబు అయ్యేది కాదు. అగ్రహీరోల కమర్షియల్ సినిమాలు తప్పనిసరిగా అద్భుత రస ప్రధానంగా ఉంటాయన్నదే నిజమైతే, అదిక్కడ తారుమారైంది. ‘ముత్యాలముగ్గు’ విషాద కథే అయినప్పటికీ ఆ విషాదాన్ని అంతర్లీనంగా ఉంచుతూ, అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసుకుని, వినోదాత్మక విలువలు పండించి  నందుకే కదా అంత పెద్ద విజయాన్ని సాధించింది? 

          ఇకపోతే, ఈ సినిమాకి ఒక పెద్ద డ్యామేజింగ్ అంశం ఇందాకట్నించీ వెయిటింగ్ లో వుంది- అల్లు అర్జున్ పాత్రకి కథలో దాగి వున్న ఒక అతి ముఖ్య రహస్యం తెలియక పోవడం గురించి! తెలియక, తెలుసుకోవాలనీ ప్రయిత్నించకా, క్లయిమాక్స్ లో మాత్రమే, అదీ వేరే పాత్రలు ఆ రహస్యం వెల్లడించినప్పుడు తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి! తన తండ్రి అసలెలా మరణించాడో హీరో పాత్రకి తెలియక పోవడం కంటే విచారకరమైన కథనం ఉంటుందా?

          వివరాల్లోకి వెళ్లి తెలుసుకుంటే, ఈ సినిమా తీసే అవసరమే కనపడని భయానక సత్యం బయట పడుతుంది! తండ్రి సత్యమూర్తి రోడ్డు ప్రమాదంలో ఎలా ఎప్పుడు ఎక్కడ మరణించాడో హీరోకి తెలీదు. తెలుసుకోవాలనీ ప్రయత్నించడు. ( తెలుసుకోకుండా ఏ కొడుకూ బతకలేడు అవునా?). బార్సిలోనాలో హీరో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి సత్య మూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు ( ఆ స్పాట్ ఆంధ్రా - తమిళనాడు సరిహద్దులో, అంటే విలన్ దేవరాజ్ నాయుడు ఇలాకాలో) .. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా ఒక లారీ వచ్చి గుద్దడం వల్ల జరిగింది( అసలుకి అది దేవరాజ్ నాయుణ్ణి చంపే అతడి ప్రత్యర్ధి కుట్ర) .. ముందుగా సత్యమూర్తి కారుకి ఇంకో కారు ఎదురొచ్చింది, ఆ ప్రమాదాన్ని నివారించి సత్యమూర్తి ఎదుటి కారు దగ్గరికి వెళ్లి విచారిస్తున్నప్పుడు లారీ వచ్చి గుద్దింది. ( ఎదుటి కారులోంచి దిగిన వాళ్ళు సాక్షాత్తూ దేవరాజ్ నాయుడు, అతడి కుమార్తె  వల్లి [నిత్యామీనన్] ) ..వీళ్ళని కాపాడే ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడన్నమాట  సత్యమూర్తి- ఇదీ విషయం! ఇంత విషయం హీరోకి తెలీదు!

          తండ్రి అక్కడి కెందుకు వెళ్ళాడు, ప్రమాదం గురించి మీడియా ఏమని రాసింది, పోలీసులేమన్నారు, ఆ వేరే కారు, ఆ లారీ ఎవరివి...అన్న ప్రశ్నలు హీరోకి పట్టక పోతే, మృత దేహం తెచ్చుకోవడానికైనా హీరో ఆ ఇలాకా ఆస్పత్రికి వెళ్ళాలి కదా? వెళ్ళ లేదా? మరేం చేశాడు అన్ని విలువలున్న నాన్న కొడుకు? తండ్రి దుర్మరణం కారకుల్ని పట్టుకుని శిక్షించకుండా, ఆయన నీతులు చెప్పుకుని బతికితే ఆయన ఆత్మకి శాంతా?

          ఈ ప్రశ్నలు వేసుకుంటే అసలు కథే లేదు, కథే లేకపోయాక ఈ సినిమా తీయాల్సిన అగత్యం కూడా కనపడదు!

          తండ్రి మరణ ఘట్టాన్ని ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా చూపకపోవడం, విడతల వారీగా చూపిస్తూ, ముడులు విప్పడం గొప్ప కథనమే కదా అనుకుంటే పొరపాటే.  హీరో నుంచి విషయం దాచిపెట్టాక ఏదీ గొప్ప కథనం అవజాలదు. మొత్తం కథా ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతున్నాయో, ఒకప్పుడు కాకపోయినా ఇంకోప్పుడయినా హీరో కి తెలుస్తూ వుండడమే మంచి కథనం. అందుకే అతణ్ణి కథానాయకుడన్నారు.

          ఇలా ఆలోచిస్తే సినిమాలు తీయలేమని, ప్రేక్షకులు ఇలాగే చూస్తున్నారనీ  అంటే చెప్పేదేమీ లేదు. మొత్తం కథనే  null and void చేసే లాజిక్ ని కూడా ప్రశ్నించడం నాన్సెన్స్ అనుకుంటే ఇంకేమీ చెప్పలేం. అన్ని వనరులూ మౌలిక సదుపాయాలూ వున్న వాళ్ళే యాభయ్యేసి కోట్లు ఖర్చు పెట్టి ఇలా సినిమాలు తీస్తే, క్వాలిటీ సినిమాలు ఇంకెవరు తీయాలన్న ప్రశ్న మరోసారి వస్తుంది. ఖచ్చితంగా బయ్యర్ల కోసం క్వాలిటీ సినిమాలు తీయాల్సిన బాధ్యత టాప్ ఫిగర్స్ దే!

‘ఎస్’ ఫర్ సీక్వెన్సులు లేని స్క్రీన్ ప్లే!
          ఏ సినిమా కథకైనా- అదెంత ‘సి’ గ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి!

          కానీ ప్రస్తుత సినిమా మొత్తానికి రెండే రెండు సీక్వెన్సు లున్నాయి! ఫస్టాఫ్ లో ఒకటి- సెకండాఫ్ లో ఒకటి మాత్రమే! సాధారణంగా స్క్రీన్ ప్లేలలో బిగినింగ్-మిడిల్- ఎండ్ అనే మూడు విభాగాలూ, వాటిలో ఎనిమిది సీక్వెన్సులూ వుంటాయి. కథనానికుపయోగ పడేవి ఈ ఎనిమిది సీక్వెన్సులే. ఇవి బిగినింగ్ లో రెండు, మిడిల్ లో నాల్గు, ఎండ్ లో రెండు చొప్పున 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి ( కింది పటం చూడండి)



          కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వె న్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే! మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన సినిమా ‘వాస్తవ్’ లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ ఉంటాయి.

          స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షనాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ! ఇదీ మామూలుగా జరగాల్సిన తంతు!

          ప్రస్తుత సినిమాలో  ఇది పట్టించుకోలేదు. అంటే స్ట్రక్చర్ అవసరం లేదనుకున్నారు. దీంతో పూర్వ కథ చెబుతూ ఎత్తుగడ నుంచీ ఇంటర్వెల్ వరకూ ఒకే  సీక్వెన్సుగా- పల్లవి పాత్ర పెళ్లి తంతు పెట్టి నడిపించారు. హీరో ఆ తంతులోంచి బయట పడేటప్పటికి ఇంటర్వెల్ వచ్చేసింది. అలాగే సెకండాఫ్ ప్రారంభం కాగానే దేవరాజ్ నాయుడు ఇల్లు చేరే సీక్వెన్స్ ప్రారంభమై, ఆ ఇంట్లో చేరాకా అక్కడే సెకండాఫ్ ముగించేంత సుదీర్ఘమైన సీక్వెన్స్! ‘షోలే’ లోకూడా తోడుదొంగలు అమితాబ్-ధర్మేంద్రలు సంజీవ్ కుమార్ పనిమీద అతడి వూళ్ళో అతడి ఇంటికే వెళతారు. కానీ ఇంట్లోనే కథ లాగించేయ్యకుండా బయట రకరకాల సీక్వెన్సులు నడిపిస్తూ బిజీగా వుంటారు.

          సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే చెక్ లిస్టులో స్క్రిప్టు దోషాల్లో ఒకటి- కథ సాంతం బయటి కెళ్ళకుండా, ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే  సాగడం! ప్రస్తుత సినిమా ఫస్టాపంతా పెళ్లి తంతుతో ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే సాగుతుంది. మళ్ళీ సెకండాఫ్ లో దేవరాజ్ నాయుడు ఇంట్లోనూ ఇంటీరియర్-టు- ఇంటీరియర్-టు- ఇంటీరియర్ గానే మరో పెళ్లి తంతుని కలుపుకుని సాగుతుంది! కంటికీ మెదడుకీ రిలీఫ్ లేని ఒకటే మొనాటనీ! డ్రీం సాంగ్స్ అప్పుడు మాత్రం ఫారిన్ లోకేషన్స్ లో కాస్సేపు అవుట్ డోర్లోకి! ఫస్టాఫ్ లో ఆ పెళ్లి తంతు లోంచి, సెకండాఫ్ లో ఈ దేవరాజ్ ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతామా అన్నంత  బోరు కొట్టేయ్యడానికే పనికొచ్చాయీ సీక్వెన్సులు! రెండే సీక్వెన్సుల వల్ల  కథ ఎక్కడేసిన గొంగళి లా ఉండిపోవడం ఒకటీ. చరిత్రలో రెండు సీక్వెన్సులు పెట్టి సినిమా ఎవ్వరూ తీయలేదు- వాళ్లకి తెలుసు తీస్తే ఏ  మౌతుందో!

          ఇక ఇంటర్వెల్ పాయింటు బలం గా లేకుండా, పాత సినిమాల్లోలా  పస లేని పాత ఛాలెంజితో ముగియడానికీ, క్లయిమాక్స్ కూడా తేలిపోవడానికీ,  హీరోకి తన నాన్న ఎలా మరణించాడో సమాచారం లేకపోవడమే ప్రధాన కారణం.  ఇదలా ఉంచితే, అన్ని నైతిక విలువల గురించి చెప్పే వాడు ఇంటర్వెల్లో అంత అనైతికంగా ఆ ఛాలెంజి ఎలా చేస్తాడు! ఇది ఇంటర్వెల్ ఘట్టాన్ని బలహీన పర్చలేదా?

          ఇండియన్ స్క్రీన్ ప్లే మీద పుస్తకం రాసిన జిల్ నోమ్స్ ప్రసిద్ధ హిందీ రచయిత సాగర్ సర్హదీ ని అడిగాడు- మీరు స్క్రీన్ ప్లేలని త్రీ యాక్ట్స్ లో రాస్తారా అని. లేదన్నాడు సర్హదీ. ఇంటర్వెల్, క్లయిమాక్సు ఈ రెండూ బలంగా వచ్చేట్టు పాత్రని  డ్రైవ్ చేస్తానన్నాడు!

          ప్రస్తుత సినిమాలో దర్శకుడు కథని హీరో డ్రైవ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే హీరో డ్రైవ్ చేస్తే అతను తండ్రి మరణ రహస్యాన్ని ఎక్కడ ఏకి పీకుతాడో నని! పైగా తన నీతితో ఇంటర్వెల్ సీన్ని ఎక్కడ తారుమారు చేస్తాడో నని! అందుకని దర్శకుడు రూల్స్ కి విరుద్ధంగా, కథే హీరోని నడిపించుకు పోయేలా చిత్రణ చేశాడు. అంటే దర్శకుడు తన కథా సౌలభ్యం కోసం కథని హీరో పాత్ర నడపనియ్యకుండా, కథే హీరో పాత్రని నడిపించేలా రివర్స్ లో రావడంతో, ఆ పాత్ర కాస్తా పాసివ్ సుడిగుండం లో పడి మరీ ఆర్ట్ సినిమా పాత్రలా నిస్తేజంగా  తయారయ్యింది!

          ఇక పోతే కురుక్షేత్రం లో అర్జునుడున్నట్టు ఫ్యాక్షన్ పోరులో ఇరుక్కున్న హీరో స్వగతం ( వాయిసోవర్) తో ప్రారంభమయ్యే సినిమా,  దాదాపు ఇరవై నిమిషాలూ ఎడతెగని ఆ స్వగతమూ, దాని తాలూకు మాంటేజెస్ తో ఉపోద్ఘాతంగా సాగడం కూడా చరిత్రలో ఎరుగని దుర్విన్యాసమే. సినిమా క్రాఫ్ట్ న్యూస్ రీల్ క్రాఫ్ట్ లా ఉంటుందా?         

          ఈ ఉపోద్ఘాతపు మాంటేజెస్ లో కూడా ఒకే సీను ను తర్వాత తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ ని చంపేసి, ఆ పాత్ర ఉన్నత విలువలగురించి డైలాగుల్లో చెప్పుకు రావడం, ప్రేక్షకులకి ప్రత్యక్షానుభవాన్నివ్వని అసమగ్ర చిత్రణ కింద తేలిపోయింది. మనిషిని సరిగ్గా చూపించకుండా అతడి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా అది స్వోత్కర్షగానే మిగిలిపోతుంది తప్ప ఫీల్ వుండదు.

          ఒక అసంబద్ధ కామెడీని నడపాలంటే ఆ కామెడీ పుట్టడానికి కారణమైన పాయింటు అర్ధవంతంగా వుండాలని అరిస్టాటిల్ చెప్తాడు. అంటే పాయింటు అర్ధవంతంగా వున్నప్పుడు దాన్నాధారం చేసుకుని ఎంత అసంబద్ధ (అబ్సర్డ్) హాస్యా న్నైనా సృష్టించ వచ్చన్నమాట. పాయింటే అర్ధవంతంగా లేనప్పుడు ఏ హాస్యాన్నీ సృష్టించ లేమన్నమాట. అలాగే సినిమా కథకి అయిడియా- లేదా కాన్సెప్ట్ అన్ని విధాలా ఫూల్ ప్రూఫ్ గా, బులెట్ ప్రూఫ్ గా ఉంటేనే తర్వాత కథనంలో కొన్ని లోపాలైనా క్షమార్హ మౌతాయి. తండ్రి చనిపోతే బజార్న పడ్డ కుటుంబం ఈ కాన్సెప్టు అంత పకడ్బందీగా ఉందా?

          ఏ అప్పులోళ్ళూ ఆస్తులు లాక్కోరు. కంపెనీల్ని మూత పెట్టరు. ఆ అధిపతి కుటుంబాన్నే కాదు, కంపెనీల్లో వందలాది ఉద్యోగుల్నీ వీధిన పడెయ్య లేరు. చట్టాలు అలాలేవు. ఆ కొడుకు తండ్రి పాటించిన విలువల్నేకాదు, తండ్రి చేసిన వ్యాపారాన్నీ నిలబెట్టడం కూడా తన బాధ్యతగా గుర్తించాల్సి వుంటుంది. ఈ తన హక్కుని ఎవ్వరూ కాదనలేరు. వ్యాపారాలని తన అదుపులోకి తెచ్చుకుని నెమ్మదిగా అప్పులు తీర్చవచ్చు. ఏవో విలువలంటూ గొప్పకి పోయి తన మీద ఆధారపడ్డ అమాయక కుటుంబ సభ్యుల్ని తనతో బాటు వీధి పాల్జేసే హక్కుమాత్రం ఎప్పటికీ లేదు గాక లేదు, అది నైతిక విలువ కాదు!

          అలాటి విలువల సంరక్షకుడైతే, నకిలీ పత్రాలు తీసుకుని దేవరాజ్ ఇంట్లోంచి అసలీ పత్రాలు కొట్టుకు వచ్చే నీతి మాలిన పని చేయడానికే బయల్దేరి వెళ్ళడు సెకండాఫ్ లో. ఆ వివాదమేంటో చట్ట ప్రకారమే తేల్చుకుంటాడు.

          ఈ సినిమాలో ఇప్పుడెవరికీ పట్టని ఆ విలువల ఘోషేమిటో గానీ, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మాత్రం వాస్తవ దృష్టితో ఒక్కటే చెప్తాడు- -  నీ సంస్కృతీ, నీ సాంప్రదాయం, కట్టుబాట్లు, సెంటిమెంట్లు, నీతీనిజాయితీలూ, తొక్కా తోలూ అన్నీ తీసి నీ ఇంట్లో పెట్టుకో! బయటి కెళ్తే మాత్రం సమాజం ఇలా వుంటుంది ఎలా? యాంబిషన్, సెల్ఫిష్ నెస్, జెలసీ, పవర్ నాల్గు! నాల్గు చక్రాలు సమాజాన్ని నడిపిస్తూంటాయ్! వీటిని ఎదుర్కోవడానికి నీ ఆట నువ్వాడుకో..

సికిందర్
          

24, మార్చి 2015, మంగళవారం

ఆనాటి సినిమా!

హాస్యభూషణం హాజర్ హై!!

విలన్ :  హీరోని ఏడ్పించేవాడు
కామిక్ విలన్ : ప్రేక్షకుల్ని నవ్వించేవాడు
హీరోయిక్ విలన్ : సాంతం పబ్లిక్ ని ప్రేమించేవాడు
ఒకసారి పబ్లిక్ తో ప్రేమలో పడ్డాక, ఇక వాంటెడ్ డెడ్ ఆర్ ఆలైవ్ పోస్టర్ని పరపరా చింపేసుకుని, పబ్లిక్ కి సరెండరై పోయినట్టే విలన్ అనేవాడు!!


    త్రికా రచనకి నిజాలు ముఖ్యం. సినిమాకి నిజాలుగా భ్రమింపజేయడం అతి ముఖ్యం. భ్రమింపజేయడమే నటుల మెయిన్ బిజినెస్. భ్రమా బేరం లేక భుక్తి లేదు.
కడారు నాగభూషణం (1921 – 1995) అనే  భ్రమల బేహారి వాస్తవికతని రక్తికట్టించే విలనిజం నుంచీ సహజ కథానాయకుడిగా కూడా సమాజానికి దొరికిపోయేముందు, నాటక సమాజానికి గొప్ప సెటైరిస్టుగా, అధిక్షేపణ  లాక్షిణికుడుగా చిక్కాడు. చిక్కాక సినిమా నిర్మాతలకి చిక్కడు-దొరకడు  అయిపోయాడు – ‘నెలలో మొదటి వారం నో షూటింగ్స్ ప్లీజ్...నేనెక్కడికో వెళ్ళిపోయి నా ‘రక్తకన్నీరు’ నాటకం వేసుకుంటా...పది లక్షలి సిస్తామన్నా కెమెరా ముందుకు రానంటే రానంతే, దట్సాల్!’ 



               న్నెన్ని ‘రక్త కన్నీళ్లు’ అని! ఆలిండియా లెవెల్లో అక్షరాలా ఐదు వేల నాలుగు వందల ముప్ఫై రెండు ప్రదర్శనలు! మన హైదరాబాదీ ‘అద్రక్ కె పంజే’ ( అల్లం కొమ్ములు) ఫేమ్ బాబ్బన్ ఖాన్ పదివేల ప్రదర్శనలతో గిన్నీస్ బుక్ రికార్డు కెక్కిన తర్వాత, తనే ఆ స్థాయిలో కాకపోయినా తెలుగులో ప్రదర్శనల రికార్డు నెలకొల్పిన రంగ స్థల కళాకారుడు. పాతికేళ్ళ పాటూ వందలాది రంగస్థల కళాకారులకి ఉపాధీ, రెండు దశాబ్దాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్ష బాధ్యతలూ, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఉపాధ్యక్ష పదవిలో కొన్నాళ్ళూ, రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడెమీ సలహాదారుగా సేవలూ, వామపక్ష భావజాలం కారణంగా ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయాలపై,  సామాజిక పరిణామాలపై, కొత్త కొత్తగా వ్యంగ్య బాణాల సంధింపూలూ! అసలు  ‘రక్తకన్నీరు’ నాటకమేంటో  మనం నిక్కర్లేసుకున్న ఆ రోజుల్లో బుద్ధికి పట్టు బడలేదు గానీ, ఓ సన్నివేశం జన్మకి గుర్తుండి పోతుంది- కుష్టు రోగంతో బాధపడుతున్న ప్రధాన పాత్రధారి నాగభూషణం చుట్టూ ముసిరే ఈగల ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మాయాజం అప్పుడే ఎంత థ్రిల్!

    ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.

  ‘నాటకాల రాయుడు’ విషయాని కొస్తే,  ఐది నాగభూషణం కామెడీతనానికి పరాకాష్ఠ! రవి ఆర్ట్ థియేటర్స్ అని సినిమా నిర్మాణ సంస్థ స్థాపించి ‘ఒకే కుటుంబం’, ‘ప్రజానాయకుడు’ అనే రెండు సినిమాల్ని నిర్మించినా, దిడ్డి శ్రీనివాసరావు అనే మరో నిర్మాతకి చెందిన హరిహరా ఫిలిమ్స్ బ్యానర్లో ‘నాటకాల రాయుడు’తో సోలో హీరోగా వచ్చాడు. ఏ. సంజీవి దీని దర్శకుడు. నాటకాల మీద చచ్చే మోజు పెంచుకుని ఇంట్లోంచి ఉడాయించే ఓ ఔత్సాహిక నటోత్తముడి అనుభవాలే ఈ సినిమా ఇతివృత్తం.



          బుచ్చి బాబు ( నాగభూషణం) కి నాగయ్య- హేమలత లాంటి తల్లి దండ్రులు, అనిత లాంటి చెల్లెలు, సత్యనారాయణ, సీత లాంటి అన్న వదినెలతో అన్యోన్య కుటుంబం. ఎక్కడో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం చేస్తాడు కానీ నాటకాలే ఊపిరి. మహానటుడు అయిపోవాలన్నదే ఏకైక లక్ష్యం. దీంతో తండ్రితో  చివాట్లు. నాటకాలంటూ ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రిళ్లు గోడ దూకి వచ్చి, చెల్లెలు అన్నం పెడితే తినేసి, ఆమె పాడితే హాయిగా కళ్ళు మూసుకుని గుర్రు పెట్టడం హాబీ. 

        చెల్లెలి పెళ్ళికి కట్నం తెస్తానంటాడు పెద్ద హీరోలా. తీరా ఆఫీసులో తన నాటకాల దురద ఆపుకోలేక, ‘మయసభ’ సీను విరగదీసి నటించి పారేసి, ఆ న్యూసెన్సు కి ఉన్న ఆ పాటి ఉద్యోగమూ ఊడబీకించుకుని -ఉత్త చేతుల్తో జీరోలా ఇంటికి రావడం! 

          తండ్రితో వాగ్యుద్ధం జరిగి, నాటకాలే తనకు నాగరికమని నగరం బాట పట్టేస్తాడు. అక్కడ ఓ నాటకాల కంపెనీ పద్మనాభం సైధవుడిలా అడ్డు తగిలేసరికీ, అసలిక్కడ ఎంట్రీ సంపాదించాలంటే ఇంకెక్కడో ప్రముఖ రంగస్థల నటీమణి గీతాదేవి ( కాంచన) ని మచ్చిక చేసుకోవాలని, వెళ్ళేసి ఆమె ఇంట్లో పని వాడుగా చేరిపోతాడు. తనని బాగా ఎంటర్ టెయిన్ చేస్తున్న ఈ గమ్మత్తయిన శాల్తీలో  ఏకంగా ఆమె ఒక అజ్ఞాత కళాకారుణ్ణే చూసి, బాగా ఎంకరేజి చేస్తుంది. అయితే అప్పటికే ఆ కంపెనీలో పాపులర్ స్టేజి నటుడు ప్రేమ్ కుమార్ ( ప్రభాకర రెడ్డి) అనే అతను హీరోగా  ప్రొసీడ్ అవుతున్నాడు. గీతాదేవికి లైనేస్తూ కూడా ప్రోసీడవుతున్నాడు. ఇప్పుడు వీడెవడో బుచ్చి బాబు గాడు తనకి పొటెన్షియల్ డేంజర్ గా అన్పించేసరికి ఏకడం మొదలెడతాడు.

          దీంతో చాలా తిప్ప లొచ్చేస్తాయి బుచ్చిబాబుకి. ప్రేమ్ కుమార్ చేతిలో సఫా అయ్యే దుస్థితి కూడా దాపురిస్తుంది. ఇంకో వైపు గీతాదేవి తనకి క్లోజ్ గా మూవ్ అవడమేమిటో , ఆ కవ్వింపు లేమిటో ఎటూ అర్ధం కాని స్థితి. ఒకమ్మాయి వుందంటే, ఆమెతో ప్రేమ కలాపాలకి ట్రయల్ వేసుకోవచ్చని కూడా తెలీని అమాయక ప్రాణి అతను. ఇలా ఈ ప్రమాద ప్రమోదాల సయ్యాటలో చిక్కుకుని గిలగిల్లాడు తూంటాడు. పెట్టుకున్నలక్ష్యం కాస్తా గల్లంతై పోతుంది.

                   ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గా, చలాకీగా రక్తి కట్టించే ఈ నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుంది. నాగభూషణం – అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమ- విలోమ సంబంధం, రేఖా గణితం ఈ సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయి. ఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటే, అటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుంది. తను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి, ఆ కుటుంబంలో ఓ మరణం సంభవించి, ఇంకో జననం తో ముక్కలై, భిక్షాటన చేసే దౌర్భాగ్యం. ఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది...

      తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. ఆ తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! ఆ కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానే, అంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. ఆ పరస్పర దూషణలు, దెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి ఈ దృశ్యాన్ని నాగయ్య, హేమలత, సత్యనారాయణ, అనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

          ఈ సినిమాలో వినోద విషాద ఘట్టాలన్నిటిలో గొల్లపూడి మారుతీ రావు కలం బలం కట్టి పడేస్తుంది మరి నోరెత్త నీయకుండా.  నాటకాల అనుభవముంటే ఆ సినిమా రచనే వేరు. ఇక సినిమా ప్రారంభమే ప్రభాకర రెడ్డి, కాంచనల మీద అతి సుదీర్ఘంగా  ఐదు నిమిషాలా నలభై సెకన్ల పాటూ సాగే పద్య గానముంటుంది. పద్యాలు వడ్డాది రాస్తే, పాటలు ఆత్రేయ రాశారు. జికే వెంకటేష్ సంగీతంలో ‘నీలాల కన్నుల్లో మెల్ల మెల్లగా’ అనే సిస్టర్ సాంగ్, ‘వేళ చూడ వెన్నెలాయె’ అనే కాంచన మీద సూపర్ హిట్ బ్యూటీఫుల్ సాంగ్ రెండూ అలరిస్తాయి. కమల్ ఘోష్ తెలుపు- నలుపు కెమెరా పనితనం ఈ సినిమాలో ఓ కవితా గానమే.

        నాటక దృశ్యాల్లో నాటకం చూసే ప్రేక్షకులు ఊహించలేని లొకేషన్ మార్పులు, సీక్వెన్సులూ పంటి కింద రాళ్ళలా తగుల్తాయి. స్టేజి  మీద నాటక ప్రదర్శనలో ఇవి అసాధ్యం. సినిమాయే  కదా- దీనికి వుండే సినిమాటిక్ లిబర్టీ అనే లైసెన్సుతో నాటక కళదుంప తెంచి నట్టుంది. నాటక రంగ నిపుణుడైన నాగభూషణం వీటిని అనుమతించడం ఆశ్చర్యమే. ఏమైనా భావి తరాలకి నాగభూషణం అందించిన ఓ మంచి వినోద కాలక్షేప మనొచ్చు ఈ సినిమాని!


***

డైలాగ్ డిష్ 

నాగభూషణం
*  దేశంలో పూలన్నీ మహా నాయకులకూ మహా నటులకూ దండల కిందే  సరిపోతున్నాయి, ఇక ముత్తయిదువులకెందుకుంటాయ్.
*  ఒరే కంచుకీ, పరమ దుర్మార్గుడును , సకల ఉద్యోగి దండునకు శత్రువూ అయిన ఆ మేనేజారథముడెక్కడ?
*  ఈ రోజుల్లో నటీమణుల రికమెండేషను లేకపోతే నాటక కంపెనీల్లో మేనేజర్లు వేషాలివ్వరు, అందుకని అంతఃపురం లోంచి నరుక్కు పోదామని ఇటోచ్చా.
*  మహా నటుడు అంతః పురంలో ఉండగలడు, అవసరమైతే అంట్లూ తోమగలడు.
*  మీ అమ్మగారి తద్దినమంటే నటించా సార్, లేకపోతే నటించే వాణ్ణి కాను సార్!
కాంచన
*  జీవితంలో తిండీ నిద్రా తప్ప ఇంకేమీ లేవా బుచ్చిబాబూ!
*  నాటకంలో ప్రేమని నటించే ఆడది కూడా ప్రేమని మనసులో పవిత్రంగా దాచుకుంటుంది.
*  ఇవ్వాళ్ళ కార్లలో తిరిగే చాలా మంది నటుల్ని చాలా మంది ఈర్ష్యగా చూస్తారు గానీ, అప్పటివాళ్ళ దీక్షా తపస్సుల వెనుక ఎన్ని బాధ లున్నాయో, ఎన్ని గాథలున్నాయో అర్ధం చేసుకుంటే ఆ చూపుని వాళ్ళు మళ్ళించు కుంటారు.

కొన్ని ఫన్నీ సీన్స్

          * నాగభూషణం ఆఫీసు మేనేజరిచ్చిన పెద్ద కవరు పోస్ట్ చేయడాని కెళ్తే అది పోస్ట్ బాక్సులో పట్టదు. దాంతో ఆ కవర్ని రెండు ముక్కలు చేసి, పోస్ట్ బాక్సులో కుక్కుతాడు- మొదటి భాగం, రెండో భాగం అంటూ!
          *నాగభూషణం టాలెంట్ కి టెస్టు పెడుతుంది నాటక కంపెనీ. నాగభూషణం రాకెన్ రోల్ డాన్స్ తో విరగ్గొట్టేస్తాడు. తోటి కళాకారులతన్ని బంతాట ఆడేసుకుంటారు. కింద పడిపోతాడు నాగభూషణం. ప్రభాకర రెడ్డి, పద్మనాభం ఇద్దరూ సంతోషిస్తారు, కాంచన చిన్న బుచ్చుకుంటుంది.
          * నాగభూషణం అలా నడుచుకుంటూ వస్తూంటే, ఓ వ్యక్తి ఎదురవుతాడు. నాగభూషణం ఆగిపోయి ‘ఆఁ-!’  అంటాడు. ఆ వ్యక్తి కూడా నోరు తెర్చు కుని ఆఁ-!’ అంటాడు. వెంటనే నాగభూషణం అతడి నాలుక మీద పోస్టల్ స్టాంపు పెట్టి తీస్తాడు. ఆ తడితో కవరు మీద అతికించుకుని వెళ్ళిపోతాడు.  
          * టైటిల్స్ లో కర్రసాము, కత్తి యుద్ధాలు ‘రాఘవులు అండ్ పార్టీ’ అని వేయడం నవ్వు తెప్పిస్తుంది!



—సికిందర్ 

(జనవరి 2010 –‘సాక్షి’) 




9, మార్చి 2015, సోమవారం

సాంకేతికం ...



మాన్యువల్  ఎఫెక్ట్స్ ఉండవా?
సాదిరెడ్డి రామారావు - యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ 

జీవా నటించిన సూపర్ హిట్ ‘రంగం’ సినిమా క్లైమాక్స్ లో గన్ ఫైర్ దృశ్యాలు ఎంత బీభత్స భయానంగా వున్నాయో తెలిసిందే. రెప్పపాటు కాలంలో కొన్ని వందల బుల్లెట్స్ గోడల్లోకి చొచ్చుకు పోతూంటాయి. క్రిమినల్స్ గల్లంతై పోతారు. ఇదంతా యాక్షన్ కొరియోగ్రాఫర్ సుప్రసిద్ధ పీటర్ హెయిన్స్ ప్రతిభాపాటవంగా నమోదవుతుంది బ్రహ్మాండంగా. ఇక్కడే వుంది తిరకాసు. ఈ సీను జాగ్రత్తగా చూస్తే, ఆ బుల్లెట్ రంధ్రాల్లోంచి సహజంగా రావాల్సిన పొగ రావడం కన్పించదు.  నిప్పులేనిదే పొగ ఎలా వస్తుంది? ఈ పొగ వెలువడి సీను సహజంగా కన్పించడం కోసం యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్ క్రాకర్స్ (మేకుల్లాంటి టపాసులు) ఆ రంధ్రాల్లో అమర్చి పేల్చాలి నిజానికి. కానీ దీనికి బదులు కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (సిజిఐ) లో ఈ సీను సృష్టించడం వల్ల ఈ అసహజత్వం వచ్చేసింది...మాన్యువల్ ఎఫెక్ట్స్ ని కాదని సిజిఐ కి పాల్పడ్డం తో ఈ కృత్రిమత్వమంతా అన్నమాట!

     ఇది ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారని అంటున్నారు సాదిరెడ్డి రామారావు అలియాస్ రాము. గ్రాఫిక్స్ చేశార్రోయ్ అని అరిచేస్తున్నారు ప్రేక్షక షెర్లాక్ హోములు! రాము వంటి సీనియర్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆపరేటర్లకి సైతం ఈ సిజిఐ మాయ వచ్చేసి పని తగ్గించేస్తోంది. ఓ జీపుని నిజంగా పేల్చేయడానికి ఇరవై లీటర్ల పెట్రోలు అవసరమైతే, అర లీటరుతో కొద్దిగా పెల్చేద్దురూ,  మిగతాది గ్రాఫిక్స్ లో చూసుకుంటామని అనేస్తున్నారు నిర్మాతలు సైతం. నిజానికి మాన్యువల్ ఖర్చు కంటే గ్రాఫిక్ కయ్యే ఖర్చే ఎక్కువని రాము స్పష్తం చేస్తున్నారు.

     మూడు దశాబ్దాల సుదీర్ఘానుభావంతో రాము గన్ ఫైరింగ్, బాంబ్  బ్లాస్టింగ్, క్యానన్ బ్లాస్టింగ్, కౌంటర్ బ్లాస్టింగ్, మినియేచర్ బ్లాస్టింగ్, వాటర్ బ్లాస్టింగ్, పేపర్ బ్లాస్టింగ్, గ్లాస్ బ్రేకింగ్, కత్తి పోరాటాల్లో మెరుపులు, గదలు కొట్టుకున్నప్పుడు రవ్వలు వంటి అనేక ధ్వంస రచనల్లో ఆరితేరారు. వీటి ఆపరేటింగ్ లో చాలా ఏకాగ్రత అవసరం. టైమింగ్ తప్పితే ప్రమాదాలే జరిగిపోవచ్చు. అయితే ఇంతవరకూ ఏ చిన్న ప్రమాదమూ జరగనివ్వని క్లీన్ చిట్ తో, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లే కాకుండా, ఇంకా వందలాది నటులు రాము చేతుల్లో సురక్షితంగా వున్నారు.

    ‘సినిమాటెక్’ శీర్షికకు ఈ ఇంటర్వ్యూల కోసం ఈ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని వెపన్స్, బ్లాస్టింగ్స్, క్యానన్ బ్లాస్టింగ్ అని మూడు తరగతులుగా విభజించుకుని, మొదటగా వెపన్స్ గురించి రాముని కలుసుకుంటే, ఆయన సొంత నివాస భవనంలోని ‘ఆయుధాగారం’ చూపించారు. అక్కడ డబుల్ బ్యారెల్, ట్రిపుల్ బ్యారెల్, 302 రైఫిల్స్, ఎస్ ఎల్ ఆర్, ఏకే- 47, ఎం.పి- 5, పంప్ యాక్షన్ హెవీ గన్స్  మొదలైనవి అనేకం వున్నాయి. మరి రివాల్వర్స్, పిస్టల్స్, 9 ఎం.ఎం. గన్స్ సంగతి? వాటిని ఓల్డ్ సిటీ నుంచి మహ్మద్ మారూఫ్ అనే అతను సరఫరా చేస్తాడన్నారు. గత పాతికేళ్ళుగా ఈయనే వాటికి అధీకృత సప్లయర్.

     ఇక్కడున్న ఆయుధాలు మాత్రం స్వయంగా రాము తయారు చేసుకున్నవే. వీటిలో రెండు రకాలు : పేల్చకుండా పట్టుకు తిరిగేవి, పేల్చేవి. పేల్చడానికి ఉపయోగించే వాటిలో లోపలి ఎలక్ట్రిక్ సర్క్యూట్ రూపకల్పన కూడా  ఈయనదే. గన్ బట్ కుండే స్లయిడ్ ని పక్కకు జరిపితే, లోపల సర్క్యూట్, దానికి అనుసంధానించిన పది పెన్ టార్చి బ్యాటరీలు, 10 ఫ్యూజులూ కన్పిస్తాయి. ఈ ఫ్యూజులకే  క్రాకర్స్ ని అమరుస్తారు. దాంతో ట్రిగర్ లాగగానే పెద్ద చప్పుడుతో క్రాకర్స్ పేలి, బ్యారెల్లోంచి నిప్పు రవ్వలు చిమ్ముతాయి. నిజ తుపాకుల్లోంచి వెలువడే తూటా ఎలాగూ దాని పలాయన వేగంతో కంటికి కనపడదు కాబట్టి, ఈ తుపాకుల్లో బుల్లెట్స్ ని లోడ్ చేసే అవసరం రాదు.

      తూటా వెళ్లి ఓ వ్యక్తికి తాకడాన్ని ఇలా వివరించారు రాము : ఆ దేహ భాగానికి ప్యాడింగ్ చేసి, ఓ కండోమ్ లో రక్తం ( అంటే గ్లిజరిన్ + రంగు) నింపి, క్రాకర్స్ తో ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తారు. ఆ తీగెల్ని దూరంగా స్విచ్ బోర్డుకి బిగించుకుని ఆపరేటర్ కూర్చుంటాడు. షాట్ తీసేటప్పుడు  టైమింగ్ తో ఈ స్విచ్ ని నొక్కితే, క్రాకర్స్ పేలి, కాలిన బట్టల్లోంచి పోగరావడం, అదే క్షణంలో కండోమ్ కూడా పగిలి,  బ్లడ్ ని  విరజిమ్మడమూ జరిగిపోతాయి. వెండి తెర మీద ఈ ప్రక్రియ సహజత్వానికి అత్యంత దగ్గరగా వుంటుందన్నారు రాము.

పాత రోజుల్లో తుపాకీ పేలిన సౌండ్ ఎఫెక్ట్  మీద, క్షతగాత్రుడు గుండె పట్టుకుని అక్కడున్న రక్తపు తిత్తిని నొక్కుకుంటే, బొటబొటా రక్తం కారేది కానీ, గాయం కన్పించేది కాదన్నారు రాము.

     1982 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమాకి ఏకనాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన రాము, 1987 లో కమల్ హాసన్ ‘విక్రమ్’ కి ఆపరేటర్ అయ్యారు. నాటి నుంచీ నేటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు కలిపి వందలాది చేశారు. జేపీ దత్తా  తీసిన మెగా హిట్ ‘ బోర్డర్’ అనే యుద్ధ చిత్రానికి బికనీర్ వెళ్లి 40 రోజులు పని చేసి వచ్చారు. బాలకృష్ణ నటించిన బంపర్ హిట్ ‘సమరసింహా రెడ్డి’  లో మొట్ట మొదటిసారిగా తెలుగు సినిమా కంటూ టాటా సుమోల్ని పేల్చేసి గాల్లోకి ఎగేరేసిన క్యానన్ బ్లాస్టర్స్  మోహన్- కృష్ణ లకి  పెట్రో బ్లాస్టింగ్ లో సహకరించారు రాము. ఈయన స్వస్థలం కాకినాడ.


    రజనీ కాంత్ జంబోజెట్  ‘రోబో’ కోసం రాము అత్యంత  కష్టపడి ఒక భారీ యాక్షన్ సెట్ నే సిద్ధం చేశారు. గన్ షాట్స్ తో క్షణాల్లో గోడ జల్లెడయ్యే సీన్ అది. 60 మంది టీం తో 20 రోజులూ  శ్రమించి,  గోడలో 10 వేల రంధ్రాలతో క్రాకర్స్ ని ఫిక్స్ చేసి, సర్క్యూట్ ని కంప్లీట్ చేశారు. టెస్ట్ షూట్ చేసి కూడా చూపించారు. అప్పుడా రంధ్రాల్లోంచి పొగ చిమ్మడం కూడా చూశాడు ఆ సినిమా యాక్షన్ డైరెక్టర్. ఐనా ఇలా పొగ వచ్చే బుల్లెట్ రంధ్రాలు తనకవసరం లేదని, వెళ్ళిపోయి గ్రాఫిక్స్ చేయించుకున్నాడు. రాము పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

    ‘రంగం’ అయినా , ‘రోబో’ అయినా ఇస్తున్న సంకేతం ఒకటే...ప్రపంచీకరణ వల్ల కుల వృత్తులు / చేతివృత్తులు  మటు మాయమై పోతున్నాయంటూ ‘కుబుసం’ లో శ్రీహరి పాడే పాట ఒకటి వుంది... ‘పల్లె కన్నీరు పెడుతుందో తెలియని కుట్రల’ అని గోరటి వెంకన్న రాసిన పాట. యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ అనే చేతి వృత్తి గతి కూడా ఇంతే నేమోనని ఆ సంకేతం! 


సికిందర్
( మే 2011, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)