రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మనసే మందిరం ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మనసే మందిరం ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

17, మార్చి 2019, ఆదివారం

798 : ‘పాలపిట్ట’ తాజా ఆర్టికల్, విస్మృత సినిమాలు - 5


      ఒకప్పుడు బెంగాలీ సినిమాలు, సాహిత్యం విరివిగా తెలుగు సినిమాలకి ఆధారమయ్యాయి. 1950 లలో తెలుగు నిర్మాతలు, దర్శకులు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు.  తెలుగు, ఆంగ్ల, బెంగాలీ భాషల నవలలు, కథలు, నాటకాలూ తెలుగు సినిమాలుగా తెరకెక్కించే కొత్త సృజనాత్మక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. దీనికి బీజం 1945 లో బిఎన్ రెడ్డి వేశారు. జీన్ ఫిలిప్ రామ్యూ రాసిన 18 వ శతాబ్దపు ‘పిగ్మాలియన్’ అనే ఆంగ్ల నాటకాన్ని భానుమతి - నాగయ్యలతో ‘స్వర్గ సీమ’ గా తీశారు. తర్వాత 1949 లో షేక్స్ పియర్ నాటకం ‘కింగ్ లియర్’  ఆధారంగా శివరావు కస్తూరి, శ్రీరంజని లతో కెవి రెడ్డి ‘గుణసుందరి కథ’ తీశారు. 1950 లలో ఇవి ఒక ఒరవడికి నాంది అయ్యాయి. ఆంగ్ల సాహిత్యంతో  పడిన అడుగు తెలుగు, బెంగాలీ సాహిత్యాలకీ బాట వేసింది. ముఖ్యంగా బెంగాలీ సాహిత్యం తెలుగు సినిమాలకి కొత్త వ్యాపార వస్తువుగా దొరికింది.  దేవదాసు, అర్ధాంగి, చరణడాసి వంటి విజయవంతమైన సినిమాలుగా తీశారు. 

         
దిలా వుండగా, బెంగాలీ సినిమాలని  రీమేక్ చేసే ఇంకో ఒరవడి కూడా ప్రారంభించారు. దేవాంతకుడు, చివరకు మిగిలేది, వివాహబంధం మొదలైనవి. ఇలా 1980 ల వరకూ అడపాదడపా  బెంగాలీ సినిమాలని రీమేక్ చేస్తూ వచ్చినా  ఏదీ విజయం సాధించలేదు – 1977 లో ఎన్టీఆర్, వాణిశ్రీలు నటించిన  ‘ఎదురీత’ తప్ప. 1964 లో తీసిన ‘వివాహబంధం’ అపజయం పాలవడానికి కారణం, తెలుగులో కొచ్చేటప్పటికి ఆ కాలానికి కథాకథనాలు పాతవై పోవడం కావొచ్చు. 

          1960 లనుంచి తెలుగు సినిమాల్లో కమర్షియల్ విలువలతో వ్యాపార యుగం ప్రారంభమయ్యింది. నటనలు, పాటలు, కథాకథనాలూ వేగం పుంజుకున్నాయి. 1964 లో ‘వివాహబంధం’ విడుదలయ్యే నాటికి  గుండమ్మ కథ, రాముడు -భీముడు, మూగమనసులు, మంచి మనసులు, ఆరాధన, దాగుడు మూతలు, మంచి మనిషి వంటి కమర్షియల్ వినోదాత్మక సాంఘికాలెన్నో ప్రేక్షకులకి కొత్త రుచులు పంచి పెట్టాయి. ఇలాంటప్పుడు చివరకు మిగిలేది, మనసే మందిరం, వివాహబంధం లాంటి విషాదగాథలు ఎందరికి నచ్చుతాయి.  

          ఇంత మాత్రాన ‘వివాహబంధం’ మంచి సినిమా కాదా అంటే మంచి సినిమానే. లేకపోతే  భానుమతి ఎందుకు నటించి, నిర్మిస్తారు. బెంగాలీలో హిట్టయిన ‘సాత్ పాకే బంధా’ కి రీమేక్. ఆశుతోష్ ముఖోపధ్యాయ్ రాసిన నవల ఆధారం. ఈయన ఇంకో నవల ఆధారంగా బెంగాలీలో తయారైన ‘దీప్ జ్వెలే జాయ్’ ని తెలుగులో ‘చివరకు మిగిలేది’ గా రీమేక్ చేశారు. తెలుగులో ‘వివాహబంధం’ గా రీమేక్ చేసిన  ‘సాత్ పాకే బంధా’,  1974 లో హిందీలో విజయానంద్, జయాబాధురీలతో ‘కోరాకాగజ్’ గా రీమేక్ చేశారు. ఇది పెద్ద హిట్టయ్యింది.  

          ‘వివాహబంధం’ ని భరణీ పిక్చర్స్ బ్యానర్ పై పిఎస్ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, భానుమతీ రామకృష్ణ, చిత్తూరు వి నాగయ్య, సూర్యకాంతం, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, వాసంతి తదితరులు నటించారు. ఎంబి శ్రీనివాసన్ సంగీతం సమకూర్చారు. ఛాయాగ్రహణం అన్నయ్య,  మాటలు అట్లూరి పిచ్చేశ్వర్రావు, పాటలు సి నారాయణ రెడ్డి. 

          పెళ్ళంటూ చేసుకున్నాక  ఏవో వెలుపలి కారణాలు చీలికలు తెస్తే చిట్లి పోయేంత బలహీనమైనదా ఆ బంధం?  మరెందుకు విడిపోతారు ? దీనికి జవాబులు  వెతుకుదాం...

          చంద్రశేఖర్ (ఎన్టీ రామారావు) ఓ మూడొందల జీతంతో లెక్చరర్. అదే కాలేజీలో అప్పారావు (చిత్తూరు వి నాగయ్య) ప్రిన్సిపాల్. చంద్రశేఖర్ కి చిన్నప్పట్నుంచీ పెంచిన పిన్ని (హేమలత) వుంటుంది. మధ్యతరగతి జీవితం. అప్పారావుకి మాణిక్యాంబ (సూర్యకాంతం) అనే భార్య, భారతి (భానుమతి), అరుణ (వాసంతి) అనే ఇద్దరు కుమార్తెలు, రఘు (ప్రభాకర రెడ్డి)  అనే కుమారుడూ వుంటారు. సోదరుడి కుమారుడు కాంతారావు (పద్మనాభం) పడి వేలాడుతూ వుంటాడు. అప్పారావుది సంపన్న కుటుంబం. కానీ డొక్కు కారు వుంటుంది.

          ఓ రోజు ఆ  కారెక్కకుండా బస్సులో వస్తూంటే చంద్రశేఖర్ పరిచయమవుతాడు భారతికి. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అప్పారావుకి తెలిసి సంతోషిస్తాడు. భార్యకి చెప్తే ఆమె ఇంతెత్తున లేస్తుంది. అతడి అంతస్తేమిటని ప్రశ్నిస్తుంది. తమ హోదాకి తగ్గ సంబంధమే చేయాలంటుంది. వినకుండా పెళ్లి చేసేస్తాడు అప్పారావు. ఇది మనసులో పెట్టుకుంటుంది మాణిక్యాంబ. 

          చంద్రశేఖర్ భార్యగా సామాన్య ఇంట్లోకి ప్రవేశిస్తుంది భారతి. పిన్నితో కూడా కలిసిపోయి సుఖంగా వుంటుంది. యాత్రలకి వెళ్ళొస్తారు. వస్తూ చాలా బహుమతులు తెస్తారు. దీంతో మండిపడుతుంది మాణిక్యాంబ. మూడొందల జీతగాడు అల్లుడు ఇవన్నీ తెచ్చి పంచడం భరించలేక పోతుంది. కించపరుస్తూనే మెత్తగా పొదుపు గురించి బోధిస్తుంది. “ఇవన్నీ ఎందుకు? చేతిలో డబ్బుంటే మంచి నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుంది. నువ్వైనా పట్టించుకోక పోతే ఎలా? ఆదాయాన్ని బట్టి ఖర్చుపెట్టుకోవాలి” అంటుంది. “ఆదాయం తక్కువైనంత మాత్రానా ఆప్యాయతలు తగ్గుతాయా?”  అంటాడు. “ఎందుకు తగ్గుతాయి, ఇల్లుమాత్రం గుల్లవుతుంది” అంటుంది. సీరియస్ అయిపోయి లేచి వెళ్ళిపోతాడు. 

           
ఇలా ఆమెకెంత ఆత్మాభిమానమో, అతడికీ అంతే ఆత్మాభిమానం. దీంతో ఆమె అంటే ఇక కూల్చలేని అడ్డుగోడ కట్టుకుని, నత్త గుల్లలా ముడుచుకు పోతాడు.

          ఆమె ఏం చేసినా పుండు మీద కారం జల్లినట్టే వుంటుంది.  ఏదో వొక వంకతో అతన్నీ, కూతుర్నీ పిలిపించుకుంటూ వుంటుంది. ఒకసారి ఢిల్లీ నుంచి బంధు వులొచ్చారని పిలిస్తే వెళ్తాడు భారతిని తీసుకుని. ఆ బంధువు - ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు రాసిన పుస్తకానికి పతకం వచ్చిందటగా? ప్రమోషన్ కూడా వచ్చిందట? – అంటూంటే చంద్రశేఖర్ కి తర్వాత అర్ధమవుతుంది, అత్తగారే ప్రతిష్ట కోసం అల్లుణ్ణి ఇలా గొప్పగా చిత్రించుకుందని. దీంతో మరింత అవమానం ఫీలయ్యి వెళ్ళిపోతాడు. ఎంత సేపూ తనది దిగువ స్థాయి అనుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న ఆమె తీరుని నిరసించడం మొదలెడతాడు.   

          ఆమె వూరుకోదు. కూతురితో ఫోన్లో మాట్లాడుకోవాలని ఇంటి ముందు టెలిఫోన్ స్థంభం పెట్టించి కనెక్షన్ ఇప్పిస్తుంది. దీంతో చంద్రశేఖర్ ఆగ్రహం పతాక స్థాయికి చేరుతుంది. భారతీనే నానా మాటలంటాడు. భారతి తల్లిని నానా మాటలంటుంది. మాణిక్యాంబ ఇంకింత రెచ్చిపోయి – “ముష్టి మూడొందల జీతానికే మురిసిపోతే అయిపోయిందా? నూతిలో కప్పలా ఎంత కాలం బతుకుతాడు? శ్రమపడాలి, పైకి రావాలి!”  అని క్లాసు పీకేస్తుంది. ఇంకోసారి అల్లుడితోనే  నేరుగా అనేస్తుంది – “ఫలానా వారి అల్లుడు అన్పించుకోవడం కాదు గొప్ప. ఫలానా వారి అత్తగారు వస్తే నేను గర్వ పడేలా వుండాలి నీ హోదా, అదీ గొప్పంటే!”  అని. 

         
ఇలా పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యా నలిగిపోతూంటుంది భారతి. అత్తాఅల్లుళ్ళ ఆత్మాభిమానాల సమస్య కాస్తా, భార్యా భర్తల మధ్య సూటిపోటి మాటల వాగ్యుద్ధంగా మారిపోయి విడిపోతారు.

ఎవరి కథ?
        నందమూరి తారక రామారావు కొత్త గెటప్ లో కనిపిస్తారు. ఈ గెటప్ తో పాత్ర వయసుకి మించిన రూపంలో కన్పిస్తారు. ధోవతీ కుర్తా వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, బరువు కూడా పెరిగి పెద్ద మనిషిలా వుంటారు. యూత్ అప్పీల్ లేని ఈ గెటప్ మనకి ఇబ్బందిగానే వుంటుంది. ఇది బెంగాలీ ఒరిజినల్ లోని బెంగాలీ బాబు గెటప్పే. పదేళ్ళ తర్వాత తీసిన హిందీ ‘కోరా కాగజ్’ లో లెక్చరర్ పాత్ర ప్రొఫెసర్ పాత్రగా మారి, ఆధునిక దుస్తుల్లో యూత్ అప్పీల్ తో వుంటాడు విజయానంద్.

          ఎన్టీఆర్ పాత్ర స్వభావం నెగెటివ్ గానే వుంటుంది. ఇలాటి మనుషులుంటారు. నిజానికి ఆత్మాభిమానం నెగెటివ్ లక్షణం కాదు. కానీ పాత్ర స్వభావం పైన చూస్తే ఆత్మాభిమానం, లోన చూస్తే సంకుచితత్వం అన్నట్టుంటుంది. ఆయన సూర్యకాంతంతో రియాక్ట్ అయ్యేది ఫక్తు ఆత్మాభిమానంతోనే. కానీ జీవించేది మాత్రం ఆత్మాభిమానంతో కాదు. సంకుచితత్వంతో, మార్పు కోరని అదే నూతిలో కప్ప జీవితం. ఈ నూతిలో కప్ప జీవితపు ఛాయలు ఆయన మోహంలో ప్రకటిస్తూంటారు. ఆ మోహంలో సంతోషం వుండదు, సుఖం వుండదు. ఆశలుండవు, ఆశయాలుండవు. బెంగాలీ రచయిత భలే పాత్రని సృష్టించాడు. మాటంటే ఆత్మాభిమానం తన్నుకొస్తుంది, చూస్తే ఆ ఆత్మాభిమానంతో మానసికంగా, ఆర్ధికంగా ఎదిగేది లేదు. 

          సూర్యకాంతం గయ్యాళి అత్తేంకాదు, ఆర్ధికం నేర్చిన వ్యవహార్త. ఎదుటి వాళ్ళు కూడా పైకి రావాలనే ఆమె గొడవ. అయితే నోటి దూలవల్ల చెడగొట్టుకుంటుంది. “నా ఇల్లు బంగారం గానూ”  అనేది ఆమె ఊతపదం. చివరికి విసిగిపోయిన కూతురు, “నీ ఇల్లు బంగారం కాదు. అంతస్తుల్ని గురించి, అభిమానాల్ని గురించీ నీ అభిప్రాయాలు మారనంత వరకూ నీ ఇల్లు బంగారం కాదు!” అని అరుపులు అరిస్తేగానీ కళ్ళు తెరవదు. 

          సూర్యకాంతం ఓ విధంగా ‘విలన్’ పాత్రే అయినా విలన్ పాత్రలా అన్పించదు. ఆమెతో  ఈ పాత్రలో మంచితనమే కన్పిస్తుంది. ఈ పాత్రని ఎంజాయ్ చేయగలమే తప్ప ద్వేషించలేం. ఆమె డైలాగ్ డెలివరీ గానీ, ఆ డైలాగ్ డెలివరీలో సెలయేటి ప్రవాహంలా సాగిపోయే భాష గానీ ఇప్పటి సినిమాల్లో చూడం.

          ఇక తల్లికీ భర్తకీ మధ్య నలిగిపోయే పాత్రలో భానుమతి రానురాను పాత్ర డెప్త్ పెరుగుతున్నకొద్దీ దృష్టిని తన మీదికి తిప్పుకుంటుంది. సెంట్రల్ పాత్ర తనదే అయిపోవడం వల్ల. నిజానికి ఒరిజినల్ బెంగాలీ గానీ,  హిందీ రిమేక్ గానీ,  హీరో కథగా వుండవు. హీరోయిన్ కథగానే వుంటాయి. కథా ప్రారంభం కూడా హీరోయిన్ తోనే వుంటుంది. బెంగాలీలో సుచిత్రా సేన్ గానీ, హిందీలో జయబాధురీ గానీ గతాన్ని తలచుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అంటే భర్త నుంచి విడిపోయి దూరంగా టీచర్ గా జీవిస్తున్నప్పుడు, గతం గుర్తు కొచ్చి ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అప్పుడు మొదట్నుంచీ కథ. 

          తెలుగులో భానుమతితో ఇలా వుండదు. నేరుగా బస్సు ప్రయాణంలో ఎన్టీఅర్ పరిచయంతో వర్తమానంలో ప్రేమ కథగా మొదలవుతుంది. ఇందుకే తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర ఇటు భానుమతి కాకుండా, అటు ఎన్టీఆర్ కాకుండా అయోమయంగా  వుంటుంది కథని ఫాలో అవడానికి.  
          సినిమా కథ అనేది ప్రధాన పాత్రకి సంబంధించినదై వుండి, ఆ ప్రధాన పాత్ర దృష్టి కోణం (పాయింటాఫ్ వ్యూ) లో సాగడం ఆనవాయితీ. ఆ దృష్టికోణంలోనే  ప్రేక్షకులు కథని చూసి ఆ ప్రధాన పాత్రని పట్టుకుని ప్రయాణించగల్గుతారు. ప్రయాణించడానికి ప్రధాన పాత్ర ఆధారంగా లేనప్పుడు, ఎంత కథ చెప్పినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఆవకాశమే లేదు.

 
         బెంగాలీ వొరిజినల్ ని  హీరోయిన్ కథగానే తీశారు, హీరో కథ కాదు. దీన్ని మార్చకుండా హిందీ లోనూ హీరోయిన్ కథగానే తీశారు. హీరోయిన్ కథ కాబట్టి బెంగాలీలో అప్పటి పాపులర్ హీరోయిన్ సుచిత్రా సేన్ ని ఈ పాత్రకి ఎన్నుకున్నారు. హీరో పాత్రలో చిన్న హీరోని పెట్టుకున్నారు. హిందీలో కూడా అప్పటికి పాపులరైన జయబాధురీని హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోగా అంతగా తెలియని విజయానంద్ ని తీసుకున్నారు. ఇలా పాత్రల్ని బట్టి, కథని బట్టి, ఆర్టిస్టుల్ని బ్యాలెన్స్ చేశారు. 

          తెలుగులో ఇలా చేయలేదు. ఎన్టీఆర్, భానుమతి హేమాహేమీల కాంబినేషన్ గా  చేశారు. చేసినప్పుడు కథ ప్రకారం భానుమతిని ప్రధాన పాత్ర చేయలేక, ఎన్టీఆర్ ని ప్రధాన పాత్రగా చేయడానికి కథని మార్చలేక రెండు పాత్రల కథ అన్నట్టు చేశారు. దీంతో ఓ ప్రధాన పాత్ర, అది  ఎదుర్కొనే సమస్య, దాని దృష్టి కోణం, ఆ దృష్టి కోణంలో ఫ్లాష్ బ్యాక్ తో కథా ప్రారంభమూ  అనే అర్ధవంతమైన కథా ప్రక్రియ చెదిరిపోయింది. హిందీ, బెంగాలీల్లో ప్రధాన పాత్రగా హీరోయిన్ ని ప్రవేశ పెడుతూ చాలా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఆమె తోనే కనీసం పదిహేను నిముషాలు టీచర్ అని పరిచయం చేసి దృశ్యాలు నడిపించారు. ఈ దృశ్యాల్లో ఈమె ఎవరు? ఎందుకు వొంటరిగా వచ్చి ఈ వూళ్ళో వుంటోంది? ఏం జరిగిందీమెకి?  అన్న ప్రశ్నలెన్నో మనల్ని వేధించేట్టు చేసి, ఆసక్తిని పెంచారు.  

          ఐతే భానుమతి ఈ పాత్ర ప్రయాణంలో ఆయా ఘట్టాల్ని అర్ధవంతంగా నటించింది. భర్తకి ఎదురుతిరిగే సన్నివేశం, తర్వాత తల్లికి ఎదురు తిరిగే సన్నివేశం, చివరికి ఆత్మత్యాగం చేసుకోబోయే సన్నివేశం - కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా - ఆమె
నటనని ఆకాశానికంటించింది. 

          తండ్రి పాత్రలో నాగయ్యకి  భార్యని కాదని కూతురి పెళ్ళిచేయడం వరకే  ప్రాధాన్యం. ఆ తర్వాత ఎందులోనూ జోక్యం చేసుకోడు, కష్టాల్లో వున్న కూతురికి సానుభూతి వ్యక్తం చేస్తూ వుండడం తప్ప. కొడుకు పాత్రలో ప్రభాకర రెడ్డికి తల్లికిలాగే అహం ఎక్కువ. చెల్లెలి చేత విడాకుల పత్రాలమీద సంతకం చేయించుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నాలు చెయ్యడు. కుటుంబంలో ఆడపిల్లకి సమస్య వస్తే మగవాళ్ళయిన తండ్రీ కొడుకులు ఇలా వుండడం కాస్త ఇబ్బందిగానే వుంటుంది మనకి. ఏ వైఖరీ తీసుకోలేక కిమ్మనకుండా వుంటారు. 

          ‘మాతం - గి మణిపూర్’ అని మొట్టమొదటి మణిపురీ సినిమా వుంది. ఇందులో ఉమ్మడి కుటుంబంలో పెద్ద కొడుకు వల్ల కోడలికి విషమ సమస్య వస్తే, ఇంటిల్లి పాదీ ఆ సమస్యని పరిష్కరించడానికి ఒకటవుతారు. ఎవర్నీ దూషించరు, కనీసం సమస్యకి కారణమైన పెద్ద కొడుకు ప్రియురాలితో కూడా. ఎవరి తోనూ సంఘర్షించరు. దీనికి జాతీయ అవార్డు లభించింది. ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా 1972 లో తీశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్న మణిపురి ప్రజలు, కలహం వస్తే కలహాలతో పరిష్కరించుకోవాలనుకోరు. ‘వివాహబంధం’ లోనే కాదు, చాలా కుటుంబ సినిమాల్లో కలహం వస్తే తలా వొకరుగా విడిపోయి కలహించుకోవడం ఒక ఫార్ములాగా వుంటూ వస్తోంది. 

          ఇందులో పద్మనాభం కామెడీ కూడా ఆర్ధిక పరమైనదే. డబ్బు సంపాదించడానికి పూటకో ఆలోచన చేస్తాడు, ఏదీ అమలు చేయక పక్క పాత్రకి నరకం చూపిస్తూంటాడు. “ఈ రోజుల్లో లక్ష అంటే ఎంత? ఆఫ్టరాల్  రెండక్షరాలు” వంటి డైలాగులు పేలుస్తూంటాడు. 

భానుమతి పాత్రకే బలం, స్పష్టత 
     ఈ వివాహబంధపు కథ పూర్తిగా ఆర్ధికం మీద ఆధారపడింది. ఆర్ధిక ఎదుగుదల కోసం అల్లుణ్ణి  అత్త వేధించడమే ఈ డబ్బు చుట్టూ సంబంధాల కథ. అయితే ఒక అనుమానం రాకమానదు. అన్ని గొప్పలు పోయే సంపన్నురాలైన, ఆత్మాభిమానం గల అత్తగారు, కట్నం ఏమీ ఇవ్వలేదా? అల్లుడు తీసుకోలేదా? సంబంధం అనుకున్నాక వెంటనే పెళ్లి సీను చూపించేశారు తప్ప కట్నం, పెట్టిపోతలు వగైరా ఆ సంబంధమైన వ్యవహారమేమీ మాట్లాడుకున్నట్టు సీను వేయలేదు. బెంగాలీ, హిందీల్లో కూడా ఇలాగే వుంటుంది. ఈ స్పష్టత లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత పాత్రల ప్రవర్తన ఒక పజిల్ లా వుంటుంది. 

          సూర్యకాంతంకి కూతుర్ని సామాన్యుడి కివ్వడం అస్సలు ఇష్టం లేదు. “నేనూ ఒకప్పుడు లెక్చరర్నే కదా, ఏం తక్కువైంది?” అని నాగయ్య అంటే, “ఏం తక్కువైందో నాకు తెల్సు. ఈ సంసారాన్ని ఈది ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి నేను పడ్డ పాట్లు నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెల్సు. నా బిడ్డకి కూడా ఎందుకు కష్టాలూ?” అంటుంది సూర్యకాంతం. 

          అలాటిది కూతుర్ని వైభవంగా అత్తారింటికి పంపినట్టు కన్పించదు. పంపాక కూతురు సుఖపడాలని సౌకర్యాలు కల్పించే పనిలో పడుతుంది. హిందీలో ఫ్రిజ్ కూడా పంపిస్తుంది అత్తగారు. సూర్యకాంతం అల్లుడికి పుండు మీద కారం జల్లుతున్నట్టు వాయిదాల పద్ధతిలో ఒకటొకటీ సౌకర్యాలు కల్పిస్తుంది. “నేను ఆదర్శ వివాహం చేసుకున్నాక ఇవన్నీ ఎందుకు?”  అని అల్లుడు అనడానికి అలాటి వివాహం చేసుకున్నాడన్న స్పష్టత నివ్వలేదు కథకుడు. కథలో పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యగా పాత్రల మధ్య ఒక సమస్యని  ఏర్పాటు చేసినప్పుడు, ఆ పాత్రల మధ్య పూర్వం ఏం జరిగిందో తెలియజేయకపోతే కథని ఫాలో అవడం కష్టమవుతుంది. 

          ఇలా ఎన్టీఆర్, సూర్యకాంతం పాత్రల విషయంలో ఒక స్పష్టత లేని విషయం అలా వుంచితే, భానుమతి పాత్ర ఎదురయిన సమస్యతో ఒక స్పష్టతతో, బలంగా  వుంటుంది. ముందు ఆమె తల్లితో సమస్యలు వస్తున్నాయని అస్సలు అనుకోదు. తల్లిది సానుకూల దృక్పథమే అనుకుంటుంది. అందుకని, ఒక బంధువు ముందు భర్త గురించి తల్లి లేనిపోని గొప్పలు చెప్పి భర్త మనోభావాలు దెబ్బ తీసినప్పుడు -  “మీ అమ్మగారు నిన్ను నాలాంటి సామాన్యుడి కిచ్చి పెళ్లి చేశారా అని ఆలోచిస్తున్నాను” అని అతనంటే - “మీకన్నీ రావాలనీ, మీరలా వుండాలనీ ఆవిడ ఉద్దేశం” అని నచ్చజెప్తుంది. 

          “నా లాంటి వాడు అల్లుడు కావడం ఆవిడ గారికి నామర్దాగా వుంది, నువ్వు నన్ను చేసుకోవడం ఆవిడకిష్టం లేదు” అని మళ్ళీ అంటే – “మీరొట్టి శాడిస్టు మనిషి!” అని నవ్వేస్తుంది . కానీ టెలిఫోన్ పెట్టిస్తున్నప్పుడు తల్లి ఇంటికొచ్చి గోడకి తగిలించిన సామాగ్రిని చూసి, “ఈ తట్ట బుట్ట పెట్టే చోటు ఇదా? తీసి అవతల పడెయ్యి!” అని భర్త ముందు కసురుకున్నప్పుడు నిర్ఘాంత పోతుంది. “తీయడానికి వీల్లేదు!” అని భర్త అరిచినప్పుడు ప్రత్యక్ష సమరం మొదలైపోతుంది. 

          అలాఅలా తన సంసారం మీద తల్లిగారి పెత్తనం బాగా పెరిగిపోతూంటే, ఇద్దరికీ నచ్చ చెప్పలేక నలిగిపోతున్న ఆమె, ఒకానొక దశలో సహనం కోల్పోయి భర్తతో అనేస్తుంది –“మగవారు మీరుండగా ఇవన్నీ ఆవిడ ఎందుకు చేయించాలని మీకు బాధగా వుంది కదూ? పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టింటిని పూర్తిగా మర్చిపోవాలనుందా  ఏమిటీ? ఇక నా మంచీ చెడూ అమ్మా నాన్నా ఏం చూడనే కూడదా?” అని. 

          ఇలా భర్తకీ తల్లికీ మధ్య వ్యక్తిత్వాల గొడవలు తనకీ భర్తకీ మధ్య వ్యక్తిత్వాల గొడవగా మారిపోతుంది. ఇక ఆమె అన్నకి ఫోన్ చేసి, చెల్లెల్ని తీసికెళ్ళి పొమ్మంటాడు. ఏమనాలో అర్ధంగాక పుట్టింటికి చేరుతుంది భారతి. 

          మనసుని మళ్ళించుకోవడానికి ఎమ్మే చదవడం మొదలెడుతుంది. చదువుకుని ఉద్యోగం చేస్తానంటుంది. అన్న మందలిస్తాడు. “స్త్రీ జీవితానికి అర్ధం, లక్ష్యం ఉద్యోగం చేయడం కాదు. వివాహం చేసుకోవడం” అంటాడు. అప్పటికే విడాకుల కాగితాల మీద సంతకం తీసుకున్న అతను, చెల్లెలి పెళ్లి ప్రస్తావన తెచ్చి, అక్క వుండగా చెల్లెలి పెళ్లి కష్టమని, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. తల్లి కూడా సమర్ధిస్తుంది. దీంతో విరుచుకు పడుతుంది భారతి, “ మీరింత వరకూ నా మంచి కోసం చేసింది చాలు...నువ్వు మంచి అనుకున్నదే లోకం మంచి అనుకోవాలని ఎక్కడుందమ్మా? కాలం మారుతోంది. అంతస్తులు మారుతున్నాయి. అనుభావాలు మారుతున్నాయి. కానీ నీలాటి అమ్మలు మాత్రం మారడం లేదు!” అనేసి వెళ్ళిపోతుంది. 

          కాలం మారుతోంది అనే మాట అప్పటి ఈ సినిమాలో ఇంకో రెండు సార్లు వస్తుంది. బస్సులో మగవాళ్ళ సీట్లో ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు, “కాలం మారిపోతోంది. ఆడవాళ్ళ  సీట్లో ఆడవాళ్లే, మగవాళ్ళ ఆడవాళ్లే” అని ఒకసారి, చివర్లో ఎన్టీఆర్ పశ్చాత్తాప పడినప్పుడు మరోసారి. కాలం మారిందనే మాట ఇప్పటికీ వాడుతూనే వుంటారు. కానీ అరవై ఏళ్ల  క్రితమే కాలం మారిందని గమనించి సినిమాల్లో వాడేశారు. ఏ కాలంలో వాళ్ళు ఆ కాలం మారిందనే అనుకుంటారు. అయితే ఇప్పుడు చూస్తేనే, అప్పటి కాలం మారలేదనీ, ఇప్పటి కాలమే బ్రహ్మాండంగా మారిందనీ గొప్పలు పోతారు. ఇప్పటి ఈ కాలం ఇంత మారడానికి వెనకటి కాలాలే మారుతూ మెట్లు వేశాయని గుర్తించరు. 

          భారతి ఎమ్మే పాసయి, టీచరుగా ఉద్యోగమొస్తే వేరే వూరు వెళ్ళిపోతుంది. అక్కడ గతాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తుంది. ఆమెని చూసి ఒక టీచర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తాడు. నాల్గు దులుపుతుంది. చెల్లెలి పెళ్లి పిలుపు రావడంతో ఇక వెళ్ళక తప్పదు. వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వధూవరులు ఏడడుగులు వేస్తున్నప్పుడు తట్టుకోలేక పరిగెడుతుంది. పరుగెత్తీ పరుగెత్తీ భర్త ఇల్లు చేరుకుంటుంది. తలుపు కొట్టీ కొట్టీ  అలసి పోతుంది. ఒకావిడ తలుపు తీసి “ఎవరు కావాలి?”  అంటుంది. భారతికి అర్ధమైపోతుంది. “మీ వారున్నారా, పిలవండి” అంటుంది నిస్సహాయంగా. అప్పుడే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని జీర్ణించుకోలేక. అప్పుడు అతనొస్తాడు. అతడి పేరుకూడా చంద్రశేఖరే. లాయర్. భర్త ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడనీ, తాము ఈ ఇంట్లోకి వచ్చామనీ అతనన్నప్పుడు తేలిక పడుతుంది భారతి. ఈ సస్పెన్స్ డ్రామా గొప్పగా వుంటుంది. 

          అయితే ఇతను ఆమెని నిందిస్తాడు. భర్త పిచ్చి పట్టిన వాడిలా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదనీ, పిన్ని కూడా ఇవన్నీ చూడలేక చనిపోయిందనీ, దీని కంతటికీ బాధ్యత భారతీదేననీ దూషిస్తాడు. భారతికిక  చచ్చిపోవాలన్పిస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక భర్త చంద్రశేఖర్ లాయర్ దగ్గరికొస్తాడు. లాయర్ జరిగింది చెప్తాడు. చంద్రశేఖర్ చలించిపోతాడు.

          “కాలం మారుతోంది. మనసుకు నచ్చినా నచ్చక పోయినా కట్టుకున్న భర్తే ప్రత్యక్ష దైవమని పూజించే రోజులు పోయాయి. పురుషులతో బాటు స్త్రీలు కూడా వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్నారు. విభిన్న వ్యక్తిత్వాలున్నభార్యాభర్తల మనసులు అతకడం కష్టం” అని బాధపడతాడు. 

          “తనలో ఎంత మార్పు వస్తే ఇక్కడి కొచ్చింది...మొదట్లో నేనూ నీలాగే అనుకున్నాను. ఆడవాళ్ళు మగవాళ్ళని నీడలా అనుసరిస్తే చాలనుకున్నాను. మనకిష్టమైన రూపంలో కన్పించడానికి వాళ్ళు మట్టి బొమ్మలూ, లక్క బొమ్మలూ కాదు. మనలాంటి మనుషులే...” అంటూ భారతిని వెతకడానికి పరిగెడతాడు.   సుఖాంతమవుతుంది. ఈ మొత్తం కుటుంబ డ్రామాలో నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రూపంలో సమస్య వచ్చినప్పుడు, ఆ భార్యాభర్తలు ఒకటై తమ వైవాహిక బంధం కోసం ఆ మూడో వ్యక్తి ప్రమేయాన్నే తిప్పికొట్టాలనీ.  ఈ కథలో చంద్రశేఖర్ అత్త ప్రభావానికి లొంగిపోయి భార్య  భారతిని బాధపెట్టడం, భారతి చంద్రశేఖర్ ని బాధ పెట్టడం, ఇద్దరూ కలిసి సంసారాన్ని ముక్కలు చేసుకోవడం. అత్తగారు మాత్రం సలక్షణంగా వుండడం. ఈ దృశ్యాన్ని ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ (టీఏ) ప్రకారం చూస్తే, అత్తగారు పేరెంట్ మెంటాలిటీతో వుంటే, భార్యాభర్తలు చైల్డ్ మెంటాలిటీతో వుండిపోయారు. ఈ రెండు మెంటాలిటీలూ లాభం లేదనీ, మనుషులు అడల్ట్ మెంటాలిటీకి ఎదిగితే సమస్యలు రావనీ టీఏ చెప్తుంది. ఇదీ విషయం. 

          పిఎస్ రామకృష్ణ దర్శకత్వం బెంగాలీ మాతృకలాగా మరీ కళాత్మకంగా లేకపోయినా,  సీదా సాదాగా బాగానే వుంటుంది. సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పక్క ఆర్టిస్టుల క్లోజప్స్ వేసే చమత్కారం ఎక్కువ కన్పిస్తుంది. గ్లామరస్ గా భానుమతికి చాలా సార్లు వేశారు. మాటలు రాసిన అట్లూరి పిచ్చేశ్వరరావు “చివరకు మిగిలేది” కి రాసిన రచయితే. ఆయన దురదృష్టమేమిటంటే ఈ రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. పాటలు రెండు సూపర్ హిట్టయ్యాయి- “నీటిలోన నింగిలోన”, “విన్నావా విన్నావా” అనే పాటలు.

సికిందర్
‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక
మార్చి, 2019 సంచిక





18, మార్చి 2019, సోమవారం

799 : సందేహాలు - సమాధానాలు



Q : 118’ సస్పెన్స్ థ్రిల్లర్  స్ర్కీన్ ప్లే సంగతులు  రాస్తారా? ఈ మధ్య మీరు తెలుగు సినిమాలకు స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటిని అసలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాల పరిస్థితి బాగా లేదు కదా? అవి తీస్తున్న కొత్తవాళ్ళ కోసమైనా చిన్న సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు రాయవచ్చు కదా?
పేర్లు వెల్లడించ వద్దన్న దర్శకుడు, రచయితతో బాటు, సంజీవ్ అసిస్టెంట్ డైరెక్టర్
A : 118, బద్లా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని థియేటర్లో చూసి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం సాధ్యం కాదు. ఇవి డైలాగ్ కనెక్షన్స్ తో, ఎన్నో క్లూస్ కనెక్షన్స్ తో, వాటి లాజికల్ డ్రైవ్ తో సాగిపోయే ఇన్వెస్టిగేషన్ కథలు. వీటిని చాలా సార్లు ఆపి చూస్తూ రాయాలి. అందుకని ‘118’ అమెజాన్ లో విడుదలయ్యాక రాద్దాం. ఇక తెలుగు సినిమాలకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదనే విషయం. రాయడానికి వీటిలో కొత్త విషయాలుండడం లేదు. అవే టెంప్లెట్ సినిమాలు, అవే కథలు. ఇంకా పాత సినిమాలు బెటర్. నేర్చుకోవాల్సిందంతా వీటిలోనే వుందన్పిస్తోంది. దొంగ రాముడు, మనసే మందిరం, వివాహ బంధం...నాటి దర్శకులు, రచయితలూ నేర్చుకోవడానికి భావితరాల కిచ్చినట్టు, నేటి కథ - మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం అన్నీ తామే అయి కూడా మేకర్లు ఏమిస్తున్నారు. వాళ్ళే ఒకర్నొకరు అనుకరిస్తూ టెంప్లెట్ సినిమాలే తీస్తున్నారు. వీళ్ళని ఫాలో అయ్యే అసిస్టెంట్లు వీళ్ళనుంచి కొత్తగా ఏం నేర్చుకుంటారు. 

          గత Q&A లో సీన్ ఎలా రాయాలో ‘జస్టిస్ చౌదరి’ ఉదాహరణగా విశ్లేషిస్తే విశేష స్పందన వచ్చింది. ఎన్నడూ లేనన్ని రికార్డు స్థాయి హిట్స్ వచ్చాయి. వందల్లో వుండే హిట్స్, ఆ రోజు వేలల్లో వచ్చాయి. ఎందరో సీన్ ఎలా రాయాలో ఇప్పుడు తమకు కొత్తగా తెలిసిందని ఎక్సైట్ అయ్యారు. నిజానికి సీన్ స్ట్రక్చర్ కి ఉదాహరణ కోసం ఇప్పటి సినిమాలేమున్నాయని చూస్తే కన్పించలేదు. పాత సినిమాల్లోకి వెళ్లి చూస్తే,  చూసిన మొట్ట మొదటి ‘జస్టిస్ చౌదరి’ లోనే కన్పించింది. కానీ పాత సినిమా ఉదాహరణ ఇస్తే కొత్త జనరేషన్ కేం నచ్చుతుందని కూడా అన్పించింది. అయినా తప్పక రాయాల్సి వచ్చింది. దీనికే కొత్త జనరేషన్ ఎక్సైటయి పోయారు. తీసుసుకోవాల్సింది పాత సినిమాల్లో వుంటే తీసు కోవడానికి అభ్యంతరం లేదన్న మాట!  

          కొత్తగా విడుదలయ్యే తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే సవాలక్ష లోపాలుంటున్నాయి. తీస్తున్న సినిమాలు 90 శాతం అట్టర్ ఫ్లాపులు. ఎందుకు ఫ్లాపయ్యాయో వీటి లోపాలు రాయడమే పనిగా మారింది. దీనికంటే అర్ధవంతమైన సినిమాలకి -  అవి పాతవైనా - రాయడం బెటరన్పిస్తోంది. ఓ సినిమా ఫ్లాపయితే ఎందుకు ఫ్లాపయ్యిందో మేం తెలుసుకోవాలి కదా, ఇది తెలుసుకోవడానికి బ్లాగుని విజిట్ చేస్తున్నాం కదా అనే వాళ్ళూ వున్నారు. తప్పదంటే అప్పుడప్పుడు ఈ పని కూడా చేద్దాం. అసలే ఫ్లాపయిన సినిమాలని వదిలెయ్యక, ఇంకా తప్పులు రాసి పీడించడం ఎందుకనే పాయింటు కూడా ఒకటుంది. 

          ఇక వారంవారం విడుదలై వెళ్లి పోతున్న చిన్న చిన్న సినిమాల సంగతి. వీటిలో కొన్నిటికి రివ్యూలు రాస్తూనే వున్నాం. స్క్రీన్ ప్లే సంగతులంటే వాటి స్థాయికి ఎక్కువ. మీరడిగారు కాబట్టి ఒకటి రెండు రాసి చూద్దాం. అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందా? ఏమీ రాదు. ఈ చిన్న నిర్మాతలు, దర్శకులు ఇకంతే! 

Q : ‘కథ ఎలా చెప్పాలన్న దానికి మీరిచ్చిన వ్యాసం అద్భుతంగా వుంది. మా లాంటి వాళ్ళెందరికో ఉపయోగపడుతుంది. అయితే మల్టీ స్టారర్ కథ ఎలా చెప్పాలో వివరించలేదు.
శ్రీను ఆర్, అసిస్టెంట్ డైరెక్టర్ 
A :   మల్టీ స్టారర్ తీసే స్థాయికి వెళ్ళేటప్పటికి కథలు చెప్పడం ఎలాగూ వచ్చేస్తుంది. ఇప్పట్నుంచే ఎందుకు. ఇప్పుడేం తీసే అవకాశాలొస్తాయో అంతవరకూ తెలుసుకుంటే చాలు. ఐతే చిన్న హీరోలు ఇద్దరు ముగ్గుర్ని కలిపి తీసే ‘మినీ స్టారర్స్’ అవకాశముండొచ్చు. వీటికి కథలో ప్రధానపాత్రని దృష్టిలో పెట్టుకునే చెప్పాలి. ‘హేపీడేస్’ లో నల్గురు హీరోలున్నా అది వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రగా నడిచే కథే. కనుక ముందు ఆ మెయిన్ హీరోకి చెప్పాలి. చెప్పేటప్పుడు అతనే ప్రధాన పాత్రగా త్రీ పిల్లర్స్ ఆధారంగా చెప్పాలి, మిగిలిన హీరోల పాత్రల్ని కూడా కలిపి. మిగిలిన హీరోలకి చెప్పినప్పుడు ఫలానా అతను మెయిన్ హీరో, మీమీ క్యారెక్టర్స్ ఇవీ అని చెప్పొచ్చు. కథ గురించి అయిడియా ఇస్తే సరిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ అయితే ఎవరికీ కథ కూడా చెప్పరు. నీ క్యారెక్టర్ ఇదీ, నీ క్యారెక్టర్ ఇదీ...వచ్చి చేసుకోండని చెప్పేస్తారు. 

Q :  నేనొక స్క్రిప్టు రాశాను. ఎవర్ని అడిగినా తీసుకోవడం లేదు. ఇంకా రాయాల్సిన అయిడియాలున్నాయి. కానీ చూస్తే ఎవరూ తీసుకోని పరిస్థితి వుంది. నేను రైటర్ గా ఎలా ముందు కెళ్ళాలి?
జే ఎం ఆర్ రచయిత
A :   అది కిందటి శతాబ్దం సంగతి. ఈ శతాబ్దంలో స్క్రిప్టు రాసుకుంటే దర్శకుడు అయిపోవడమే. ఇతరుల స్క్రిప్టుతో దర్శకత్వం వహించాడనికెవరూ సిద్ధంగా లేరు. ఎవరి స్క్రిప్టు వాళ్ళదే. కాబట్టి రాసుకుంటే తీసుకోవడమే. లేదంటే దర్శకుల దగ్గర రైటర్ గా చేరడమే. ఇండిపెండెంట్ రైటర్ కాన్సెప్ట్ ఇక లేదు. ఐతే గియితే పెద్ద సినిమాలకి డైలాగు రచయితలవుతారేమో. డైలాగ్ రైటర్ గా కృషి చేసుకుంటే ఆ స్థాయికి వెళ్ళొచ్చు. 
సికిందర్



22, మే 2016, ఆదివారం

స్క్రీన్ ప్లే సంగతులు

     మనుషులు- మమతలు, ఆస్తులు- అంతస్తులు, ఉమ్మడి కుటుంబం- ఒకే కుటుంబం,  నా ఇల్లు నా వాళ్ళు- మంచి కుటుంబం, మన సంసారం- వింత  సంసారం, కలసి వుంటే కలదు సుఖం- మనసే మందిరం,  సాంప్రదాయం- శ్రావణ మాసం, పసుపు కుంకుమలు- బంగారు గాజులు, తోడికోడళ్ళు – భలే కోడళ్ళు, ఇల్లరికం- ఇంటి దొంగలు, తండ్రీ కొడుకులు-పెత్తందార్లు, గొప్పవారి గోత్రాలు-  పంతాలు పట్టింపులు, సీతా కల్యాణం- రుక్మిణీ కల్యాణం, కల్యాణ మంటపం- ఊరంతా సంక్రాంతి, లోకం చుట్టిన వీరుడు- చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, ఊరికి ఉపకారి- మనిషి రోడ్డునపడ్డాడు...
          ఈ సినిమా టైటిల్సే ‘బ్రహ్మోత్సవం’ కథ!  ఇంకా  హమ్ ఆప్ కే హై కౌన్ – హమ్ సాథ్ సాథ్ హై,  మై ప్రేమ్ కీ దీవానీ హూ- వివాహ్ లాంటి సూరజ్ బర్జాత్యా ఆడవాళ్ళ విందులూ వంటకాల –పాటల పోటీల సినిమాల టైటిల్స్  కూడా కలుపుకోవచ్చు. 


          కొత్త సినిమాలో పాత  సినిమాల వాతావరణం వుండకూడదని కాదు. మారుతీ కారు వుంది, ఇంకా అది పాత మారుతీ కారులా లేదు. అప్పుడూ ఇప్పుడూ పోలీసు వున్నాడు గానీ, ఇంకా పాత నిక్కర్లేసుకు లేడు. ఇప్పుడు పాత సినిమాల వాతావరణం ఉండొచ్చు గానీ, ఇంకా పాత  వాసనలు  వేస్తేనే సమస్య. పాయింటు సమకాలీనమై వుంటే వాతావరణం పాత సినిమాల వాతావరణంలా వున్నా, కొత్త వాసనతో సర్దుకు పోవచ్చు. పాయింటూ ఆనాటిదే, వాతావరణమూ వాసనా ఆనాటివే  అయినప్పుడు, ఇంకా ఈ కాలపు దర్శకులెందుకు?  పాత సినిమాలే చూసుకుంటారు ప్రేక్షకులు. ప్రతీ రెండేళ్ళ  కోసారి కొత్త యువతీ యువకులు సినిమాలు చూసే  ప్రేక్షకుల వుతూంటే, వాళ్ళ కాలం కాని కాలపు సినిమాలు వాళ్ళ కెలా  కనెక్ట్ అవుతాయి? వాళ్ళకున్న కాలీన స్పృహ సినిమాలు తీసే వాళ్ళకి అస్సలు వుండక పోవడమేమిటి?  

     యూత్ సినిమాలు  ఫ్యామిలీల కోసం తీయకపోవచ్చు గానీ, ఫ్యామిలీ సినిమాలు తప్పక యూత్ కోసం కూడా తీయాలి- ఆ స్టార్ కి వాళ్ళూ  ఫ్యాన్స్ అయి వుంటారు గనుక. ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీస్ కీ  యూత్ కీ  కనెక్ట్ అయ్యేట్టు మధ్యే మార్గంగా తీయాల్సి వుంటుంది. కానీ యూత్ ని  విస్మరించి, ఫ్యామిలీ సినిమా అంటూ ప్రిన్స్ మహేష్ బాబుతో  ‘బ్రహ్మోత్సవం’ అనే  చాదస్తం తీశారు. పోనీ ఈ చాదస్తం ఫ్యామిలీస్ కైనా కనెక్ట్ అయ్యే పాయింటుతో  ఉందా అంటే అదీ లేదు. ఫ్యామిలీ ప్రేక్షకులంటే  ఎవరు? అత్యధికంగా 45 లోపు వయస్కులే. వీళ్ళల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పరిచయమున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, కోరుకుంటున్న వాళ్ళూ ఎందరుంటారు. దాదాపు వీళ్ళ తల్లి దండ్రులే ఆ వ్యవస్థలో వుండి వుండరు. అప్పటికి జమీందారీ ఫ్యూడల్ వ్యవస్థ పోయింది. దాంతో బాటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థా అంతరించిపోతూ వచ్చింది. ఇప్పటి 45 లోపు వయస్కుల తల్లిదండ్రులకి  ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో తెగిపోతూ వచ్చింది. వీళ్ళ నుంచి వేర్పడి వీళ్ళ పిల్లలు కొత్త చదువులు చదువుకుని ప్రపంచీకరణలో భాగమవుతున్నారు- దూర తీరాలకి తరలిపోతున్నారు. తప్పనిసరై న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా ఏర్పడుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీల ట్రెండ్ రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో వృద్ధులై పోయిన తల్లిదండ్రులు సర్దుకు పోయారు - అది కూడా ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని అనుభవిస్తూనే- కాకపోతే ఇది వర్చువల్ రియాలిటీ. కావలసినంత టెక్నాలజీ తో ప్రపంచమే ఒక కుగ్రామమై పోయాక ఇంకా అందరూ కలిసే వుండాలని ఎవరు దబాయిస్తారు- బడాయిగా కొందరు దర్శకులు తప్ప?  న్యూక్లియర్ ఫ్యామిలీస్ మళ్ళీ ఉమ్మడి కుటుంబాలుగా మారిపోతాయనా? అప్పట్లో టైము కాగానే దూరదర్శన్ చిత్ర లహరి పాటల కోసం టీవీల ముందు కొలువు దీరినట్టు- ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ట్రెండ్ లో కూడా రాత్రి  కాగానే కంప్యూటర్ ఆన్ చేసుకుని స్కైప్ లో ఎక్కడెక్కడో వున్న తమ వాళ్ళని చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, కాలసినంత సమయం ఆనందలహరిలా గడిపేసి-  దీని తస్సాదియ్యా, ఇంతకంటే ఏం కావాల్రా మనిషి జన్మకీ? -  అని జాడించి  ముసుగు తన్ని పడుకుంటున్నారు!  

      ఎవరన్నారు అందరూ కలిసి వుండడం లేదని? ప్రపంచమే ఒక కుగ్రామమై పోయింది. ఆ కుగ్రామమే ఉమ్మడి కుటుంబం, వసుధైక కుటుంబం. పోగొట్టుకున్నది తిరిగి  ప్రకృతే మరో రూపంలో ఇస్తుంది, ఏమీ దిగులుపడ నవసరం లేదు. ఒకవేళ ఇంకా దిగులు పెట్టుకుంటే ఆ దిగులు తీర్చే సినిమాలుండాలి గానీ, సమస్యతో సంబంధంలేని పాత సంగతులు  చెబితే ఆ సినిమాలది వేరే దారి అయిపోతుంది. అనుబంధాలెప్పుడూ అర్జెంటు సమస్యే కాదు, డబ్బే అర్జెంటు సమస్య. డబ్బులేక పస్తులు పడుకుంటున్నాయి కుటుంబాలు. సంపాదన వుంటేనే అబ్బాయికి పెళ్లి సంబంధం కుదురుతోంది, ఇంటి నిండా  బంధువులుంటే కాదు. మిగతావన్నీ- అనుబంధాలూ ఆత్మీయతలూ చుట్టరికాలూ సెంటిమెంట్లూ ఫీలింగులూ - ఇవన్నీ సెకండరీ.  
***
        ‘బ్రహ్మోత్సవం’ సమస్య ఐడియాతో బాటు స్ట్రక్చర్ సమస్య కూడా. డబుల్ ట్రబుల్ అన్నమాట. స్ట్రక్చర్ లేకపోయినా కొన్ని సార్లు స్టార్ సినిమాలు ఆడేస్తాయి- ఐడియా లేకపోతే మాత్రం మొరాయిస్తాయి. సామాజిక సమస్య అయినా, రాజకీయ సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా  వర్తమాన కాలపు సమస్యల్ని ప్రతిబింబిస్తేనే అమ్ముడుపోయే ఐడియా అవుతుంది. ఇప్పటి తరానికి  తెలీని ఏనాటివో ఉమ్మడి కుటుంబాల కథలూ సమస్యలూ తీసినప్పుడు, వరకట్న కథలు, బాల్య వివాహాల కథలూ, వితంతు వివాహాల కథలు, సతీ సహగమనాల కథలూ, బాంచెన్ దొరా కథలు కూడా తీయాలి కదా? అవేం పాపం చేసుకున్నాయి? ఉమ్మడి కుటుంబాల కథలే రూపం మార్చుకుని కాలానికి తగ్గట్టు ఫ్యాక్షన్ కుటుంబాల కథలుగా మారిపోయాయి. అవి కూడా అరిగిపోయాయి. అసలు ఏ ఇజాలూ, నీతులూ లేని ‘మనం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత హాయిగా వుందని?
\
        ‘బ్రహ్మోత్సవం’లో  ఇంటి పెద్ద సత్యరాజ్ ది తన వాళ్ళందరూ తన చుట్టూ వుండాలన్న మనస్తత్వం. జీవితాన్ని పదిమందితో కలిసి సంబరంగా గడుపుకోవాలని కోరిక. ఏ చిన్న అవకాశం  దొరికినా పండగలకీ పబ్బాలకీ బంధువులందర్నీ పిలిపించుకుని భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటాడు. అలా నల్గురు బావమరుదుల్ని ఏనాడో వాళ్ళ కుటుంబాలు సహా ఇంద్రలోకాన్ని తలపించే భవనంలో తెచ్చి పెట్టుకున్నాడు. ఆనాడెప్పుడో మామ దగ్గర నాలుగు వందలు తీసుకుని ఈనాడు నాల్గు వందల కోట్ల విలువజేసే  పెయింట్స్ తయారుచేసే ఫ్యాక్టరీకి యజమానిగా ఎదిగాడు.  బావమరుదులందరికీ ఫ్యాక్టరీలో వాటాలిచ్చాడు. కానీ వాళ్ళకే పెత్తనమూ వుండదు. ప్రతీదానికీ  ముందు నేను మాట్లాడాలీ అంటాడు. తనే మాట్లాడతాడు. తన ప్రకారమే అన్నీ జరుగుతాయి ఇంటా బయటా. ముగ్గురు బావ మరుదులు ఇదేదో తిని ఎంజాయ్ చేయడానికి బావుందన్నట్టు ఆ ఇల్లరికాన్ని అనుభవిస్తున్నా, పెద్ద బావమరిది రావురమేష్  మాత్రం ఆత్మాభిమానం కలవాడు. ఈ వాతావరణంలో ఇమడలేకపోతాడు. అతడిది అస్తిత్వ సమస్య. బానిసలా బతకలేకపోతాడు. మనిషికూడా మొహాన ఏ నవ్వూ లేకుండా పిచ్చాడిలా ఉంటాడు- ‘అహ నా పెళ్ళంటా’ లో కోట శ్రీనివాసరావు లాగా, ‘హేరాఫేరీ’ పరేష్ రావల్ లాగా. 

        భార్య జయసుధ అతడికి సర్ది చెబుతూ వుంటుంది- హనుమంతుడి స్థానం రాముడి పాదాల చెంతే అయినా అతణ్ణి మనం పూజించడం లేదా? – అని. రావురమేష్ కి హనుమంతుణ్ణి  అవ్వాలని వుండదు. తన కూతురు ప్రణీతని మేనల్లుడు మహేష్ బాబు కిచ్చి చేస్తే ఈ ఇంట్లో తనకో గుర్తింపు వస్తుందన్నఆశతో ఉంటాడు. కానీ  ఈ విషయం బావగారు సత్యరాజ్ తో చెప్పలేక పోతాడు. 

        ఇలా వుండగా ఫారిన్నుంచి సత్యరాజ్ స్నేహితుడి కూతురు కాజల్ అగర్వాల్ వస్తుంది. మహేష్ బాబు ఈమెతో ప్రేమలో పడతాడు. ఇతడికి ఇంట్లో వున్న మరదలు ప్రణీత నచ్చదు. ఇక రావు రమేష్ మనసులో మాట ఎవరో చెప్తే సత్యరాజ్ కి తెలుస్తుంది. దీనికి తన నిర్ణయం ఏమిటో చెప్పడు. అంతా కలిసి టూరుకి వెళ్తారు. అక్కడ కాజల్ చెప్పేస్తుంది మహేష్ బాబుకి- తను ఇంత పెద్ద కుటుంబంలో ఇమడలేనని. అంటే పెళ్లి చేసుకుని తనని బయటికి రమ్మంటోందని అర్ధమైపోయిన మహేష్ బాబు, ఆమెకో కిస్ పెట్టి బై చెప్పేస్తాడు.  దేని గురించీ అతను ఎక్కువ ఆలోచించడు. ఏదైనా అనేశాక లేక చేసేశాక, ఎక్కువ ఆలోచించ లేదనేస్తాడు.  ఈ ముద్దు సీను రావు రమేష్ చూసి అపార్ధం జేసుకుంటాడు. ఇక తన కూతురు ఈ ఇంటి కోడలు కాదన్న బాధకి, తను బానిసగా పడివుంటున్నాడన్న ఆక్రోశం కూడా తోడై, సత్యరాజ్ ని నానా మాటలంటాడు. ఈ మాటలకి సత్యరాజ్  తీవ్రంగా హర్ట్ అవుతాడు. మహేష్ బాబుతో కూర్చుని వేదాంతంలోకి వెళ్లి పోతాడు. తన ఏడుతరాల బంధువుల్ని ఒక దగ్గర చూడాలన్న కోరిక చెప్పి చనిపోతాడు. 

        లండన్ నుంచి మహేష్ బాబు చెల్లెలి ఫ్రెండ్ నని చెప్పుకుని సమంత వస్తుంది. ఈమెతో కలిసి మహేష్ బాబు ఏడుతరాల వేటలో పడతాడు. హరిద్వార్, వారణాసిలకి  వెళ్లి అక్కడ పూర్వీకుల వివరాలతో పూణే,  సోలాపూర్, కర్ణాటకలో ఇంకేదో వూరు, ఇంకో చోటు,  ఇంకో నగరం ఇలా తిరిగేస్తూ బంధువుల్ని కలుసుకుని ఒకచోట ఉందాం రమ్మంటాడు. పనిలో పనిగా సమంతా తో ప్రేమలో పడతాడు. ఆఖర్న ఒక చోట రావు రమేష్ ఎదురవుతాడు. 

        ఇక ఉమ్మడి కుటుంబం లోంచి వెళ్ళిపోయిన రావురమేష్ కూతురు ప్రణీతకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తూంటాడు. ఈ పెళ్ళికి మహేష్ బాబునీ, అతడి తల్లినీ పిలవడు. పిలవకపోయినా తండ్రి చెప్పులేసుకుని, తల్లిని తీసుకుని వెళ్తాడు మహేష్ బాబు. అక్కడ రావురమేష్ తన తప్పు తెలుసుకుని కలిసి పోయేట్టు చేస్తాడు. 

        ఇదీ కథ. ఈ కథలో రెండు ఐడియాలు కన్పిస్తూనే వున్నాయి : ఉమ్మడి కుటుంబంలో అపార్ధాలు తొలగించడం, ఏడు తరాల వారసుల్ని వెతకడం. ఈ రెండూ  పొసగని ఐడియాలని కూడా తెలుసు. సత్యరాజ్ మరణం వరకూ ఒక ఐడియా, మరణం తర్వాత ఇంకో ఐడియా. సత్యరాజ్ మరణం వరకూ రావు రామేష్ తో సమస్య, మరణం తర్వాత సత్యరాజ్ కోరిక తీర్చే సమస్య. సత్యరాజ్ మరణం ఫస్టాఫ్ వరకూ రావురమేష్ ఆత్మాభిమానం, అమ్మాయి పెళ్లి సమస్య; సత్యరాజ్ మరణం తర్వాత సెకండాఫ్ లో సత్యరాజ్ కోరిక ప్రకారం మహేష్ బాబు ఏడుతరాల  బంధువుల్ని వెతికే సమస్య. 

        రాముడు పుచ్చకాయ కోసం ఇంట్లో గొడవ పడుతూంటే రంగడు  వంకాయల కోసం ఎలా వెళ్తాడు? గొడవ ఇంకా పెంచే ఉద్దేశముంటే వెళ్ళొచ్చు. నువ్వెంత నీ పుచ్చ కాయెంత? (నువ్వెంత నీ ఆత్మాభిమానం, నీ కూతురి పెళ్ళీ ఎంత?), నువ్వు పోతే మాకు
వంకాయల్లేవా? (ఏడుతరాల బంధువులు లేరా?)
అని చూపించి అవమాన పర్చడానికైతే తప్పకుండా వెళ్లి రావొచ్చు. అలాజరిగిందా?

           
కాబట్టి ఈ కథని  ఐడియా దశలోనే చిన్న పిల్లలకి కూడా చెప్పి నమ్మించలేమని తేలుతోంది. చిన్న పిల్లలు కూడా- రావు రమేష్ మామయ్య పుచ్చకాయ అడిగితే పుచ్చకాయ ఏదీ?- అని చంపి వదిలి పెడ్తారు.   

        ఐడియాలో కూడా స్ట్రక్చర్ వుండాలి. స్ట్రక్చర్ తో బాటు కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ వుండాలి.  ఆర్గ్యుమెంట్ ఉంటేనే అది కథవుతుందనీ, కమర్షియల్ సినిమాలకి ఇదే పని కొస్తుందనీ;  కానీ ఆర్గ్యుమెంట్ కాకుండా  స్టేట్ మెంట్ మాత్రంగా వుంటే అది కథగా కాక,  గాథ అవుతుందనీ,  గాథలు కమర్షియల్ సినిమాలకి పనికి రావనీ గతంలో కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఇక ఐడియాలో స్ట్రక్చర్ లేకపోతే కథగా విస్తరించడానికి పనికి రాదనేది చాలా జనరల్ నాలెడ్జి. ఒక అయిడియా అనుకుంటే అందులో బిగినింగ్ (సమస్య)  మిడిల్ (సంఘర్షణ), ఎండ్ (పరిష్కారం)  ఉంటేనే ఆ ఐడియాని పనికొస్తుంది.  

       
ఓ పెళ్ళయిన జంట నాగ చైతన్య- సమంత రోడ్డు ప్రమాదంలో మరణిస్తారు ( బిగినింగ్- సమస్య), వాళ్ళ కొడుకు నాగార్జున పెద్దయి పునర్జన్మ ఎత్తిన తన తండ్రి నాగ చైతన్యని చూసి, అతణ్ణి తల్లి సమంత తో కలపాలని అన్వేషణ ప్రారంభిస్తాడు (మిడిల్- సంఘర్షణ), ఆ అన్వేషణలో పూర్వ జన్మలో తన భార్య శ్రియని, తామిద్దరి కుమారుడే అయిన అక్కినేని నా గేశ్వరరావునీ చూసి, మొత్తం అందర్నీ ఒకటి చేస్తాడు ( ఎండ్- పరిష్కారం). 

       
ఇదీ మనంస్టోరీ ఐడియా.
        ఈ ఐడియాలో బిగినింగ్-మిడిల్- ఎండ్ లతో ఒక స్ట్రక్చర్ కన్పిస్తోంది.

        ‘బ్రహ్మోత్సవం’ స్టోరీ ఐడియా ఇలా వుంటుంది  – ఉమ్మడి  కుటుంబంలో తన స్థానం కోసం, కూతురి పెళ్లి కోసం  రావు రమేష్ తపిస్తూంటాడు (బిగినింగ్- సమస్య),   మహేష్ బాబు కాజల్ ని ముద్దాడడం చూసి తన సంగతి తేల్చుకోవడానికి రావురమేష్ సత్యరాజ్ తో గొడవ పడతాడు (మిడిల్ –సంఘర్షణ), మహేష్ బాబు ఏడుతరాల వారసుల్ని వెతకమన్న తండ్రి కోరికతో వారసుల అన్వేషణ ప్రారంభిస్తాడు ( ఎండ్- పరిష్కారం).

 
       ఈ ఐడియాలోనే స్ట్రక్చర్ లేదు. మొదలైన సంఘర్షణ  ఒకటైతే  పరిష్కార మార్గం వెతకడం ఇంకొకటిలా వుంది.  

       
కాబట్టి ఈ రెండూ విడివిడి ఐడియాలు. వీటిని ఒకే కథగా చేయాలంటే ఒకదాన్ని  ప్రధాన కథ చేసి, రెండో దాన్ని ఉపకథగా మార్చాలి. కానీ రెండూ భిన్న కథా వస్తువులు, కుదరదు.  అప్పుడు ఇంటర్వెల్ల్ దగ్గర ఆగిపోయిన ఉమ్మడి కుటుంబం కథని సెకండాఫ్ లో పూర్తిగా కొనసాగించి ముగించాలి, లేదా ఇంటర్వెల్ నుంచీ ప్రారంభమైన ఏడుతరాల కథని సినిమా ప్రారంభంనుంచీ మొదలెట్టాలి. అంటే ఏదో ఒక ఐడియాతోనే ఈ సినిమాకి కథ అనేది సాధ్యమవుతుందన్న మాట. 

         మొదటి ఐడియా ఉమ్మడి కుటుంబం కథనే కొనసాగించాలంటే ( రావురమేష్ తో సమస్య పరిష్కారం) అది మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్ కి సరిపోదు. చిన్న హీరోతో చిన్న కుటుంబ కథా  చిత్రంగా తీసుకోవాలి సమకాలీనం చేసి. 

        మహేష్ బాబుతో ఏడుతరాల కథనే చేయాలంటే – ఇది కూడా  పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఎంత వెతికినా అసలు ఒక హీరో తన వంశ మూలాల్ని వెతుక్కునే కథతో సినిమాలే కనిపించడంలేదు. వుంటే డాక్యుమెంటరీలున్నాయి, లేకపోతే టీవీ సీరియల్స్ వున్నాయి అమెరికాలో. ఇలాటి ఐడియాతో సినిమా చేస్తే డాక్యుమెంటరీ ఫీల్ వస్తుందనేమో- ‘బ్రహ్మోత్సవం’ ఇలాగే  తయారయ్యింది కదా డాక్యుమెంటరీ చూస్తున్నట్టు.  అందుకే మూలాల్ని వెతుక్కునే సినిమా కథలు పునర్జన్మ కథలుగా ఉంటున్నాయోమో. పునర్జన్మ సినిమాలకి వర్కౌట్ అయ్యే కమర్షియల్ ఫార్ములా. మూలాల్ని వెతుక్కునే కథతో ‘మనం’ కూడా పునర్జన్మల కథే గా? 

        కాబట్టి ఈ రెండు ఐడియాలూ - ఒకటి కాలదోషం పట్టి, ఇంకోటి ప్రాప్త కాలజ్ఞత లోపించి భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. నిజంగా ఒక ఐడియా జీవితాల్నే మార్చేస్తుంది!
***
స్ట్రక్చర్  సంగతులు
    సినిమా ప్రారంభం మొదలుకుని అరగంట సేపూ పెళ్లి వేడుకలూ ఇంకేవో సంబరాలే. సత్యరాజ్ కూతురి పెళ్ళితో ప్రారంభం.  ఇది పావుగంట సేపు సాగుతూనే వుంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ ఉమ్మడి కుటుంబంలో ఆనందాలన్నీ, విందూ వినోదాలన్నీ, కోలాటాల్నీ కూడా  చూపించారు. తెలుగుదనం @ 112 డిగ్రీలు. పెళ్ళవగానే ఇంకేవో వేడుకలు. మొత్తం 50, 60 మంది చిన్న పెద్దా ఆడవాళ్ళే ఎప్పుడు చూసినా గుంపులు కట్టి కనపడతారు. ఖరీదైన వస్త్రాలూ ఆభరణాలూ ధరించి కారాలు దంచడం, పచ్చళ్లేసుకోవడం లాంటి తెలుగుదనపు పనులు చేస్తూంటారు. ఇన్ని కుటుంబాల్లో మగపిల్లలే పుట్టలేదా మహేష్ బాబు తప్ప అన్నట్టు వుంటుంది మొత్తం ఆడ జనాభాని చూస్తూంటే. లేక పుడుతూంటే చంపేశారా ఆడ శిశువుల హత్యలకి నిరసనగా? బేటీ బచావో బ్రిగేడా వీళ్ళంతా? మహేష్ బాబు ఒక్కడే ఎలాగో తప్పించుకున్నాడా? ఇదేదో విచారణకి ఆదేశించాల్సిన పెద్ద గూడుపుఠాణీ. 

        పోతే మహేష్ బాబుకి ఫ్రెండ్స్ కూడా ఉండరా? డ్రీమ్ సాంగ్స్ అప్పుడు మాత్రం సడెన్ గా మగ డాన్సర్లు దూకి  ఆడేస్తూంటారు. అంత మంది ఆడవాళ్ళతో  మహేష్ బాబు ఒక్కడే ఆటాపాటా. ఇలా చూపించి  దర్శకుడు ఆడవాళ్ళందరూ గోపికలన్నట్టూ, మహేష్ బాబు గోపికల మధ్య కృష్ణుడన్నట్టూ తప్పుడు అర్ధం వచ్చేలా చేశాడు. 

        అంత మంది కుటుంబ సభ్యులయిన ఆడవాళ్ళలో గానీ, వేడుకలకి వచ్చిన అమ్మలక్కల్లో గానీ,  ఒక్కరూ నవ్వించే కోవై సరళ, ఝాన్సీ, హేమ లాంటి కమెడియన్సే లేకపోవడం పెద్ద లోపం. ఇక మగ కమెడియన్స్ అయితే పత్తా లేరు, సెకండాఫ్ లో ఎప్పుడో వెన్నెల కిషోర్ వచ్చికాస్సేపు ఏదో కామెడీ చేయడం తప్ప. 

        ఈ అరగంటలో నాలుగు పాటలు పెట్టేశారు (విడుదలైన రోజు సాయంత్రానికి సినిమా మీద 12 నిమిషాల కత్తెరేసినప్పుడు  ఈ పాటల్లోంచి ఒకటి పోయింది). ఇంత సేపూ ప్రధాన పాత్ర మహేష్ బాబు అప్పుడప్పుడు మాత్రమే కన్పిస్తూ, నల్గురు అత్తలతో, తల్లితో అంటీ ముట్టనట్టు సెంటిమెంట్లు ఒలికిస్తాడు. చెల్లెలి పెళ్లిలో ఓ చెయ్యేస్తున్న అన్నలా పెద్దరికం వహిస్తూ తిరగడు (సినిమా సాంతం ఓ ఫ్యాషన్ పరేడ్ లా, క్యాట్ వాక్ లా తన ఇమేజిని ప్రదర్శించుకోవడం తప్ప, పాత్రలో విషయం లేదు. అర్జెంటుగా పవర్ఫుల్ పాత్రలతో పక్కా  కమర్షియల్స్  చేస్తే తప్ప ఈసారి ఆయన అభిమాన సంఘాలు కూడా వూరుకునేట్టు లేవు).

       
అరగంట తర్వాత కాజల్ అగర్వాల్ వచ్చాకే ఇంతసేపూ ఆటాపాటలతో సాగిన మొనాటనీ పోతుంది. ఇక కాజల్ తో ప్రేమకథ గా స్వరం మార్చుకుంటుంది సినిమా. కౌంటర్ గా రావు రమేష్ ఆశయం వుంటుంది. ఈ ప్రేమ ట్రాకులోనే రెండు కీలక సన్నివేశాల్లో  ‘సీనస్ ఇంటరప్టస్’ అనే దృశ్యభంగ అనౌచిత్యాలకి పాల్పడ్డారు. ఇవి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తాయి. 

        1. కాజల్ తన తండ్రితో తన ప్రేమ విషయం  చెబుతూ పూర్తిగా చెప్పకుండా ఆపేస్తుంది, మళ్ళీ దీని కొనసాగింపు వుండదు. వాళ్ళిద్దరి మధ్య దాని ఊసే వుండదు. 

        2. కూతురి పెళ్లి గురించి రావురమేష్ అనుకుంటున్నాడని  సత్యరాజ్ తెలుసుకుని మహేష్ బాబుతో మాట్లాడాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యా కామెడీగా దాగుడు మూతలు పెట్టారు – ఏంటీ ఏదో చెప్పాలనుకుంటున్నారూ?- అని డైలాగేదో మహేష్ పలికేసరికి చెప్పలేక పోతాడు  సత్యరాజ్.  ఈ సీన్ కూడా అక్కడ అలాగే కట్ అయిపోతుంది.

        కథ పట్ల, పాత్రలపట్ల పూర్తి  అవగాహన లేనప్పుడే దాటవేస్తూ ఇలాటి ‘సీనస్ ఇంటరప్టస్’ కి పాల్పడతారు. ఒక కీలక మలుపుకి దారితీసే విషయమేదో మనం తెలుసుకోబోతున్నామని ఉత్సుకతకి లోనవుతూంటే, దాని మీద నీళ్ళు గుమ్మరించడం ప్రమాదకరమైన ఆట, మొత్తానికి మొత్తం సినిమాకి సినిమాయే మునిగిపోవచ్చు.  స్ట్రక్చర్ లో సమస్యల వల్ల, క్యారక్టరైజేషన్స్ లో సమస్యల వల్ల ఈ పరిస్థితి  ఏర్పడుతుంది. వెనక్కి వెళ్లి వాటిని సరిదిద్దాలి. లేదూ, సరిదిద్దితే అనుకున్న ప్రకారం ఇంటర్వెల్ రాదంటే దీని ఫలితం కూడా అనుభవించక తప్పదు.

       1. కాజల్ తండ్రితో ఏం చెప్పాలనుకుంది అసలు? ప్రేమ ఇష్టమనా? ఇష్టం లేదనా? ఇష్టమైతే మహేష్ తండ్రి సత్యరాజ్ తో మాట్లాడమని చెప్పాలనుకుందా? అయ్యుండదు, ఆమెకి ఇంకో స్పష్టత రావాల్సి వుంది మహేష్ నుంచి- ఇది తర్వాత వచ్చే సీన్లో ఆమె బయట పెడుతుంది- ఉమ్మడి కుటుంబంలో ఉండలేనని. మరి అలాంటప్పుడు తండ్రితో ప్రేమ ఇష్టం లేదని కూడా ఇప్పుడు చెప్పాలనుకుని వుండదు. మరెందుకు ఈ సీను పెట్టినట్టు? దీని ప్రయోజనమేమిటి? దీన్ని ఎత్తేస్తే వచ్చే నష్టమేమిటి? ఈ సీను వుండాల్సిందేనని అంటే,  ఇది ఈమాత్రం ప్రేమ ట్రాకులో కన్ఫ్యూజన్ గా లేదా?  పైగా ‘సీనస్ ఇంటరప్టస్’ తో ఆశాభంగం కలిగించడం లేదా?

        2. రావు రమేష్  చెప్పలేక పోతున్న కూతురి పెళ్లి విషయం తెలుసుకున్న సత్యరాజ్ కి,  కొడుకుతో మాట్లాడడానికి అంత మొహమాట మెందుకు? అసలు కొడుకుతో మాట్లాడ్డ మేమిటి, అన్నీ తన నిర్ణయాల ప్రకారమే జరుగుతున్నాయిగా? అసలు బావమరిది రావు రమేష్ తో ఈ దూరాలేమిటి? ఇదేనా తను ప్రవచించే కలివిడితనం? పిలిచి కూర్చో బెట్టుకుని సంగతేంటో తేల్చెయ్యొచ్చుగా-అంత పెద్దరికం అనుకున్నప్పుడు? కొడుకుతో కూడా  ఆ దాగుడు మూతలేంటి? సత్యరాజ్ ఎస్ అంటే, ఇక్కడే మహేష్ తను కాజల్ని ప్రేమిస్తున్న సంగతి చెప్పేస్తే,  ఇంటర్వెల్లో ముందు నిర్ణయించుకున్న ప్రకారం సత్యరాజ్ చావు సీను రాదనా? సత్యరాజ్ నో అంటే, ఇక్కడే రావురమేష్ తగుల్కుని ఇంటర్వెల్లో రావాల్సిన సత్యరాజ్ చావుసీను ఇంటర్వెల్ లోపు జరిపేస్తాడనా? సత్యరాజ్ మహేష్ తో మాట్లాడినా, రావురమేష్ తో మాట్లాడినా,  కాజల్ కూడా ఇక్కడే ఈ సీనులోకే రావాల్సిన అగత్యమేర్పడి- ఉమ్మడి కుటుంబంలో నేనుండను, వస్తే నాతోరా!- అనేసి  ఇక్కడే మహేష్ బాబుతో చెప్పేసి వెళ్ళిపోతుందనా? అప్పుడు  రావు రమేష్ శాంతించి, సత్యరాజ్ కి చావులేక, ఇంటర్వెల్లే లేకుండా పోతుందనా?  సత్యరాజ్ ని చంపడానికి ఇన్ని దాటవేతలా? 

 
           సత్యరాజ్ కి రావురమేష్ మనో కామన తెలియడం వల్లే ఈ చిక్కులన్నీ . తెలియకపోతే? పై తండ్రీ కొడుకుల స్పష్టత లేని  ఇన్ని ప్రశ్నలు లేవనెత్తే ఈ  దాగుడు మూతల సీనే వుండదు, సీనస్ ఇంటరప్టస్ తో అసంతృప్తే వుండదు. ఇంటెర్వల్ దగ్గర రావురమేష్ నోటినుంచే అన్ని విషయాలూ అప్పుడే విని చనిపోతే చనిపోతాడు సత్యరాజ్. ఈ చావుకి కూడా అర్ధం ఉండదనేది వేరేసంగతి. 

        3. ఇంకో సీనస్ ఇంటరప్టస్ కూడా వుంది. వెనకటి ఒక సీన్లో  ఫ్యాక్టరీ అమ్మవద్దని నిర్ణయించుకున్నప్పుడు, ఆ మాటలు వింటూ ఉంటాడు మహేష్. సత్యరాజ్ అతడి అభిప్రాయమడిగితే ఏదో చెప్పబోతున్నట్టు లేచి, వెనక్కి తాతల ఫోటోల వైపు వెళ్లి చూస్తూ ఉంటాడు. ఏమీ చెప్పకుండా ఒకరకమైన కొంటెతనంతో ఇటు చూసి మ్యాటర్ కట్ చేస్తాడు. వీడు  తెలిసి చెప్పడం లేదా, తెలియక చెప్పడం లేదా అని ప్రేక్షకులకి మెదిలే ప్రశ్నే వేస్తాడు సత్యరాజ్. చెల్లెలి పెళ్ళిలో ఇన్వాల్వ్ మెంట్ కోరుకోలేదు పోనీ, వ్యాపార విషయం లోనైనా తన దృక్పథం ఏమిటో చెప్తాడని ఇప్పుడు ఎదురు చూసే వాళ్లకి తీవ్ర ఆశాభంగం తప్పదు. ఇదీ కథానాయకుడి తీరు! ఈ పాత్ర అర్ధమవడానికి దీని దృక్పథం ఏమిటో ఎక్కడా తెలీదు మనకి. ఎలా వున్న పాత్ర అలా  స్క్రీన్ ప్లే ని ఉత్తేజితం చేయడానికి తోడ్పడే క్యారక్టర్ ఆర్క్ లేకుండా, నేలబారుగానే కింద పడుంటుంది. 

      ఇక పెద్ద ట్రూపుగా అందరూ కలిసి టూర్ కి వెళ్ళడమూ, అక్కడ కాజల్ తన మనసులో మాట మహేష్ కి చెప్పడమూ. ఈ కాలపు అమ్మాయిగా ఆమె కరెక్టుగానే చెప్పింది. అంత మంది మనుషుల మధ్య ఉండలేనని. ఆమె ఉండలేదు, అతను బయటికి రాలేడు. కిస్ పెట్టి ఆమెని వదిలేస్తాడు. ఆమె ఎంత బాధ పడివుంటుందో. ఈ సీను తర్వాత ఇక కాజల్ కన్పించదు. ఈ సీన్లో చాలామంది మహేష్ ముద్దు పెట్టాడంటే ఆమెని చేసుకుని బయట కాపురం పెడతాడనే అనుకున్నారు. ఒకరిద్దరు రివ్యూ రైటర్లు కూడా ఆ తర్వాత కాజల్ ఏమైందో జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదని రాశారు. దాన్ని  గుడ్ బై కిస్ గా తీసుకోవాలని దర్శకుడి కవి హృదయమని నిజానికి ఈ వ్యాసకర్తకి కూడా ముందు తట్ట లేదు! ఇలా వుంటే ఇక మూవీ డైనమిక్ గా ఎందుకుంటుంది? మోనాలిసా నవ్వుకి అర్ధం తెలీనట్టే ఈ ముద్దుకి అర్ధంకూడా రకరకాలుగా తీయ్యొచ్చు- అందులో ఒకటి,  చాటుగా రావురమేష్ చూస్తున్నాడని కావాలనే  కిస్ పెట్టాడని! లాంగ్ కిస్ బిగ్ ఫైట్! 

        బిగ్ ఫైట్ కి సిద్ధమవుతాడు రావురమేష్. తన నికృష్టపు జీవితం గురించి ఎన్ని చెప్పాలో అన్నీ  చెప్పేసి, ఇక ఈ ఇంట్లో వుండనంటాడు. కూతురి పెళ్లి ఆశలు కూడా వమ్ము చేసినందుకు తూలనాడతాడు. సత్యరాజ్ సహా కుటుంబ సభ్యులు షాకవుతూంటే, మహేష్ మందలిస్తూంటాడు. అతడికి అర్ధమై పోయే వుండాలి పరిస్థితి- అప్పుడు  రావురమేష్ ని పక్కకి తీసికెళ్ళి, అతను చూసింది నిజమే గానీ, కాజల్ ని తను వదులుకున్నానని అపార్ధం తొలగించాలి. ఇది జరగదు. రావురమేష్ కూతురి పెళ్లి కోరిక తెలిసీ నంగనాచిలా వున్న సత్య రాజ్ ఇప్పటికైనా నోరు విప్పాలి. ఇది కూడా జరగదు. తోడుదొంగల్లా తండ్రీ కొడుకులు  రావురమేష్ ని ఇంట్లోంచి వెళ్లి పోనిచ్చి నట్టే వుంటుంది సీను!

        తర్వాతి సీన్ ఇంటర్వెల్ సీన్. ఇది ప్లాట్ పాయింట్ వన్ అనుకుందాం. కానీ ప్లాట్ పాయింట్ వన్ కి కథని చేరవేసిన విధానం ఎలా వుంది? ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచే అసలు కథ ప్రారంభమవుతున్నప్పుడు, ఇక్కడ ఏమేం సెట్ చేయబోతున్నారు? 

        రావురమేష్ మాటలకి ఒకటేబాధ పడిపోతూ ఉంటాడు సత్యరాజ్. అన్నేళ్ళల్లో ఒక్క రోజైనా - ఏమిటి నువ్వలా ఎందుకుంటావ్, మనమంతా కలిసిమెలిసి హేపీగా వుండాలి,  నీకేం కావాలో చెప్పూ - అని అతడి మనోభావాల్ని కనుక్కున్నాడా? అతడి కూతుర్ని తన కొడుక్కి చేసుకునే విషయంలో ఏనాడైనా ఒక స్పష్టత ఇచ్చాడా? అసలు విడిపోయి గౌరవంగా బతకాలన్న రావురమేష్ మనోభావాల్ని గౌరవించాడా? బలవంతంగా కలిసి వుండమనడ మేమిటి? కలిసి వుండాలనడం ఒక విలువ, విడిపోవాలనుకోవడం హక్కు. హక్కుల్ని గౌరవించాల్సిందే, పరిష్కరించాల్సిందే. నానబెడితే ఇలాగే తిరుగుబాట్లతో పెద్దరికాన్ని మంట గలుపుతాయి.  

        ఇక్కడ తండ్రీ కొడుకుల మధ్య మాటల్లో ప్రణీత గురించి కూడా ప్రస్తావనే వుండదు. ఇప్పుడైనా సత్యరాజ్ ప్రణీత గురించి ఏమనుకుంటున్నాడో బయట పడడు. వెనకటి సీన్లో మహేష్ తో దాగుడు మూతలాడి నప్పుడు ప్రణీత విషయం అడగాలనే ప్రయత్నించాడు సత్య రాజ్.  అంటే తనకిష్టమే నన్నమాట. మరి ఈ రొచ్చు అంతా ఎందుకు? ఇప్పుడైనా మహేష్ ని ఎందుకు అడగడు? మహేష్ కూడా అసలు తనవల్ల ఏం జరిగితే రియాక్ట్ అయి రావురమేష్ అలా ప్రవర్తించాడో తండ్రికి చెప్పేసి ఇప్పటికైనా హీరోగా ఎందుకు అభిశంసనకి నిలబడడు? ఇంత ఆదర్శ కుటుంబమని చెప్పుకునే వాళ్ళకి ఈ దొంగాటకాలేమిటి?

        ఇవన్నీ పక్కకి  పెట్టేసి వేదాంత ధోరణిలో బంధుత్వాల గురించి ఏదో చెప్పి, ఏడుతరాల బంధువుల్ని ఒక చోట చేర్చే కోరికేదో చెప్పి, గుండెపోటుతో చనిపోతాడు సత్యరాజ్. అతడి మరణం అతడి స్వయంకృతమే తప్ప రావురమేష్ దోషమేం లేదని కథనమే, పాత్రచిత్రణలే చెప్తున్నాయి. 

           
ఈ ప్లాట్ పాయింట్ వన్ లో సెట్ చేయాల్సిన అంశాలు : 1.  హీరోకి గోల్, 2. ఆ గోల్ లో ఎమోషన్, 3. గోల్ సాధించడానికి రిస్క్ చేస్తున్న అంశం, 4. గోల్ కి పూనుకుంటే తలెత్తే పరిణామాల హెచ్చరిక. 

        ఈ కథలో సెట్ చేసింది : 1. గోల్ వచ్చేసి ఏడు తరాల్ని గాలించడం. తలెత్తిన సమస్య అది కాదు కాబట్టి, ఆ సమస్యని పరిష్కరించడానికి ఇదో మార్గం కూడా కాదు కాబట్టి,  ఇది గోల్ కాకుండా పోయింది, పైగా ఇది గోలే అనుకున్నా దీనికి యూత్ అప్పీల్ లేదు; 2. ఈ  గోల్ లో ఎమోషన్ ఉండేందుకు తండ్రి కోరికని ఆశ్రయించి వున్నమరణాన్ని మహేష్ బాబు ఫీలవుతున్నాడేమోగానీ, మనకి ఏ ఫీలూ కలగడం లేదు, ఆ మరణం అతడి స్వయంకృతం కాబట్టి, మన ఫీల్ రావురమేష్ మీద కేంద్రీకృతమైంది కాబట్టి;   3. గోల్ ని సాధించడానికి మహేష్ బాబు చేస్తున్న రిస్కు ఏదీ లేదు, తనకి ప్రత్యర్ధి కూడా ఎవరూ లేరు, రావురమేష్ ప్రత్యర్ధి అనుకుంటే అతను  కథలోంచి వెళ్లి పోయాడు; 4. ప్రత్యర్ధి  లేకపోవడంతో పరిణామాల హెచ్చరిక కూడా ఏమీ లేదు.
        కనుక గోల్ నిల్.
        ప్లాట్ పాయింట్ వన్ అనేది లేదు. 

       లేకపోగా స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా మధ్యకి ఫ్రాక్చర్ అయ్యింది- రభస, జ్యోతిలక్ష్మి, చక్కిలిగింత, అశోక్, ఊసరవెల్లి  తదితర ఎన్నో ఫ్లాపయిన సినిమాల్లాగే ఇంటర్వెల్ ముందొక కథ,  తర్వాతొక కథగా ‘బ్రహ్మోత్సవం’ కూడా  దర్శన మిచ్చింది. దీని కథ కూడా  ఈ ఫ్రాక్చర్ తో, సెకండాఫ్ సిండ్రోమ్ తో, ఆ  ఫ్లాపయిన సినిమాల దృష్ట్యా,  అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఐడియా దశలోనే తెలిసిపోతుంది. కానీ తెలుసుకోలేదు.
        ఈ సమస్య రెండు ఐడియాల కథవల్ల వచ్చింది. ఉమ్మడి కుటుంబం- ఏడుతరాలు. ఫస్టాఫ్ ఉమ్మడి కుటుంబం, సెకండాఫ్ ఏడుతరాలు. రెండిటికీ కలిపి ఓ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి  ఇంత పెద్ద ఫ్లాప్ సినిమా తీశారు. 

        సరే, ఇదలా వుంచితే, ఈ కథ తాను ప్రవచిస్తున్న  ఉన్నత  ఆదర్శాల గురించి, సంస్కృతీ సాంప్రదాయాల గురించీ, కుటుంబ విలువల గురించీ, ఐకమత్యం గురించీ, ఇంకా చాలా ఉదాత్త భావాల గురించీ  ప్రతిపాదించే ఐడియాలజీకి ఈ కథే తూట్లు పొడుచుకుంటుంది. నీ కుటుంబంలో నేను ఇమడలేనని కాజల్ వెళ్ళిపోతుంది, నీ పెద్దరికానీకో నమస్కారమని రావు రమేష్ వెళ్లిపోతాడు, కూతురు పెళ్లి చేసి ఇంట్లోనే అందరితో పాటూ ఉంచుకోకుండా ఆదర్శాల సత్యరాజ్ లండన్ పంపించేస్తాడు. ఆ కూతురూ అల్లుడూ అతను చనిపోయినా రానే రారు. మసాలా యాక్షన్ సినిమాలకి లాజిక్ లేకపోయినా జనం చూసేయ గలరు. ఎందుకంటే ఆ జీవితాలతో వాళ్ళకి అనుభవముండదు కాబట్టి. కానీ కుటుంబ కథలు అందరూ నిత్య జీవితంలో అనుభవించేవే. తండ్రి చనిపోతే కూతురూ అల్లుడూ రారా అని ఎవరికైనా లాజిక్ తోస్తుంది. 

        కూతురు బదులు కూతురి ఫ్రెండ్ నని చెప్పుకుని హీనంగా  సమంతా వస్తుంది. వస్తూ అది విషాదం సంభవించిన ఇల్లని కూడా చూడకుండా, బెజవాడ కనకదుర్గమ్మ యాత్ర్రీకులని చెప్పి బస్సు నిండా జనాన్ని వెంటబెట్టు కొచ్చి ఆ  ఇంట్లో బస చెయ్య మంటుంది! ఇది కామెడీ అట! దీని అవసరం ఇప్పుడట! పాపం భర్త పోయిన ఆ మహాతల్లి రేవతి వాళ్ళందరికీ వండి పెడుతుంది. మహేష్ బాబేమో సమంత చేసిన ఈ చిలిపి పనికి (!) అడ్మైరింగ్ గా చూస్తూంటాడు ఆమెని. ఎందుకంటే ఇక లవ్ ట్రాక్ మొదలెట్టుకోవాలిగా? ఇంట్లో కూర్చుని ఇంటికొచ్చిన ఆడపిల్లల్నే  ప్రేమిస్తాడు తప్ప, బయట తిరిగి ప్రపంచాన్ని చూసి అసలు ఇప్పుడు ప్రేమలంటే ఏమిటో తెలుసుకోడు. ప్రేమంటే ఇదీ అని కాజల్ లాంటి అమ్మాయిలు  వచ్చి చెప్పాలి. ఇదీ హీరో  పాత్రచిత్రణ! పూర్తిస్థాయి పాసివ్ పాత్ర... ఈ పాసివ్ పాత్రకి ఇప్పుడైనా ప్రణీత గుర్తుకు రాదు. కలిసివుందామనే ఐడియాలజీ తో ఆమెని బాధపెట్టింది గాక, కాజల్ వెంట పడి దెబ్బ తిని, మళ్ళీ సమంత వెంట పడ్డం! ఈ కథ  ఆదర్శాల ఐడియాలజీ లో ప్రణీతని కూడా కోన్ కిస్కా చేయడం! 

         ఈ కథ చెప్పే ఆదర్శాల గురించి ఇంకా చెప్పాలంటే, సత్యరాజ్ చనిపోయాక ఇంట్లో ఒక్కరూ పత్తా వుండరు- ఇప్పుడు మహేష్ బాబు, రేవతి ఇద్దరే వుంటారు. ఉమ్మడి కుటుంబంలో మిగతా వాళ్ళందరూ పరార్. రావు రమేష్ వెళ్లి పోయాడంటే దానికో సబబైన కారణముంది. మిగతా వాళ్ళకీ? మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ ఆదర్శాల కథకి ఇబ్బంది కాబట్టి వెళ్ళిపోయారా? 

        ఇంతేనా? తెలుగువారి సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఇంకా వుంది. మనిషి ఇలా పోయాడో  లేదో అలా సంబరాలు మొదలై పోతాయి. ఇంకోసారి అటు అమ్మాయి తరపు వాళ్ళు, ఇటు అబ్బాయి తరపు వాళ్ళ మధ్యా  మాటకు మాట జుగల్బందీ. ఇదో అంత్యాక్షరి లాంటి వేడుక. పోతేపోయాడు ఆదర్శాల మూలపురుషుడు, సత్యరాజ్ శని వదిలింది అన్నట్టుంది.  

        ఇక మహేష్- సమంతా ఏడుతరాల వేటకి వెళ్ళినప్పుడు హరిద్వార్ లో, అక్కడ కాదని వారణాసిలో చావుల చిట్టాలు తిరగేస్తారు పూర్వీకుల సమాచారం కోసం. కానీ మహేష్ బాబు అక్కడికి వెళ్తూ తండ్రి చితాభస్మంతో వెళ్ళడు! ఇది కూడా తెలుగు సంస్కృతే నేమో.
        ఈ వారసుల్ని వెతికే ట్రాక్ అంతా రకరకాల ఊళ్లలో వారసుల్ని కనుగొని పలకరించే, వాళ్ళని కలిసుందాం రమ్మని ఆహ్వానించే సీన్లతో వుంటుంది. డాక్యుమెంటరీ ధోరణికి డ్రైగా మరిపోయిన ఈ సుదీర్ఘ ట్రాకులో ఎక్కడైనా ఈ అన్వేషణలో ఒక అద్భుతం జరుగుతుందని ఆశించడానికి లేదు. ఏడు తరాలంటే 175 సంవత్సరాలు. ఏ మహాత్మా గాంధీ పక్కన పోరాటం చేసిన వాళ్ళ వారసులో, లేదా అల్లూరి సీతారామరాజు తో కలిసి పోరాడిన వాళ్ళ వారసులో, ఇంకా లేదా ఎపిజే అబ్దుల్ కలాంతో  కలిసే వారసత్వమున్న వాళ్ళో తేలి,  ఒక ట్విస్ట్ ఇచ్చి, కథని  కొత్త మలుపు తిప్పుతారని ఎదురు చూడ్డానికీ లేదు [వెనకటి తరాల్ని శోధిస్తూ పోతే,  చాలా మంది వాళ్ళ వారసులు ఇప్పుడు ముస్లింలుగా, క్రైస్తవులుగా, సిక్కులుగా కన్పిస్తారని , హరిద్వార్ లో జీనియాలజీ (వంశావళి) రిజిస్టర్లు నిర్వహించే పండితులే చెప్తున్నారు].

       
ఏదీ తేలనప్పుడు కథనమంతా అనవసరమే కదా? ఇక్కడ సెకండాఫ్ ప్రారంభం నుంచీ మిడిల్ విభాగం వుండాలి. దేని మిడిల్ విభాగం? ప్రారంభించిన ఉమ్మడి కుటుంబం కథ బిగినింగ్ ముగిసి ఇంటర్వెల్ కే ఉరికంబం ఎక్కింది. దానికి మిడిల్ కి నోచుకునే అదృష్టం లేదు. ఇక సెకండాఫ్ లో ప్రారంభమైన ఏడుతరాల రెండో కథతో మళ్ళీ బిగినింగే. ఇది ఎక్కడా మిడిల్లో పడదు. మిడిల్ అంటే గోల్ కోసం సంఘర్షణ. గోల్ కోసం మహేష్ ఎక్కడా సంఘర్షించడు.  కాబట్టి ఈ రెండో కథ బిగినింగ్ గానే సాగుతుంది తప్ప మిడిల్ ని ఏర్పాటు చేయదు. ఎండ్ మాత్రమే వుంటుంది  అన్వేషణలో రావు రమేష్ కన్పించడంతో. ఎక్కడ బయల్దేరామో అక్కడికే వచ్చామనుకుంటాడు మహేష్. కనుక సినిమా ప్రారంభం నుంచీ ప్రేక్షకులు మొదటి కథకీ బిగినింగ్ నే, రెండో కథకి కూడా  బిగినింగ్ నే చూస్తూంటారన్న మాట. ఎక్కడా మిడిల్ తాలూకు సంఘర్షని చూడరు. ఏ సినిమాకైనా కథంతా వుండేది మిడిల్లోనే.  అందుకే ఈ సినిమాలో ఏ కథా ఓ కథ కాకుండా పోయింది!

        రెండు ఐడియాలు : రెండిటికీ బిగినింగ్ లు + ఎండ్ లు - నో మిడిల్ = టోటల్ గా  నో స్టోరీ. 

        ఇక క్లైమాక్స్ : రావు రమేష్ తన మానాన తను  కూతురు  ప్రణీత పెళ్లి చేసుకుంటూంటాడు. మహేష్ నీ, రేవతినీ పిలవడు. అయినా తండ్రి చెప్పులేసుకుని కొత్త జమీందారులా కొత్త శాసనాలు చేయడానికా అన్నట్టు మహేష్ రేవతిని తీసుకుని వెళ్తాడు. అక్కడ డైరీలో తండ్రి రాసిన ఒక పేజీ చూపిస్తాడు. అది చూసి రావు రమేష్ కరిగిపోయి కన్నీళ్ళు కార్చేసి, తనదే తప్పు క్షమించమంటాడు.  అసలు జరిగిన గొడవే మహేష్ అపా ర్ధాన్ని తొలగించక పోవడం వల్ల. సత్యరాజ్ పలాయన వాదం వల్ల. జరిగింది ఇప్పటికైనా చెప్పేసి క్షమించమని అడగాల్సింది మహేష్.  రివర్స్ లో పాపం భోళా మనిషి రావురమేష్ మళ్ళీ సత్యరాజ్ వంశ కోరల్లో మళ్ళీ తలకాయ పెడతాడు క్షమాపణలు చెప్పుకుని. సత్యరాజ్ తనకి ఆస్తి రాసినంత మాత్రానా అన్ని మానసిక గాయాలూ మాసిపోతాయా? అదేనా తన ఆత్మాభిమానం?

        డైరీలో పేజీ రాసుకోవడం, తానే మనుకుంటన్నాడో పైకి చెప్పకపోవడం, అపార్ధాలతో గొడవలు మీదికి తెచ్చుకుని చచ్చిపోవడం-  ఇదీ కలిసి జీవితాల్ని ఉత్సవంగా బ్రహ్మోత్సవంగా గడుపుకోవాలని చెప్పే సత్యరాజ్ కథ కాని కథ!

        ఇక చివరిగా ఆర్గ్యుమెంట్ సంగతి. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కూడా కన్పించాలన్నాం. అప్పుడే అది కథ అన్పించుకుటుంది. ఒక పాయింటుని ఏర్పాటు చేసి, దాని గురించి ఇరువర్గాలు చేసుకునే తప్పొప్పుల పోరాటంలో ఎవరి వాదన గెలిచిందీ చూపడం. ఇది కథకి వుండే ప్రాథమిక లక్షణం. ఇలాటి ఆర్గ్యుమెంట్ సహిత కథలే కమర్షియల్ సినిమాలకి పనికొస్తాయి. ఇలా కాకుండా- నేనిలా చేస్తే మా నాన్నకి ఇలా జరిగింది...నాన్న కోసం నేనిలా చేస్తే... పెద్ద మామయ్యతో నాకిలా జరిగిందీ- అని పాసివ్ గా,  స్టేట్ మాత్రంగా ఇచ్చుకుని ముగిసేవి గాథలు. సినిమాకి పనికిరావు. కృష్ణవంశీ  ఫ్లాపయిన ‘మొగుడు’  కూడా చూడండి, చక్కగా  ఓ కథగా ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించి, సెకండాఫ్ లో స్టేట్ మెంట్ తో గాథగా ఫిరాయిస్తుంది...


-సికిందర్


       
.