రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మనసే మందిరం ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మనసే మందిరం ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

16, సెప్టెంబర్ 2021, గురువారం

'పాలపిట్ట' మాసపత్రిక 'విస్మృత సినిమా' ఆర్టికల్ - 724


         తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే  విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది. 


          
మిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి. 

         ఐతే 1962 లో రాసి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘మనసే మందిరం’ మాతృక ‘నెంజిల్ ఒరు ఆలయం’ మహోజ్వల చిత్రరాజం నాటికి అతడేమీ వయసుమీరిన అనుభవశాలి కాదు. అప్పటికింకా 29 ఏళ్ళే! దీనికి పాపులర్ హీరోని తీసుకోక కన్నడ, తమిళ హీరో కళ్యాణ్ కుమార్ ని తీసుకున్నాడు. దేవిక కథానాయిక. ఆర్. ముత్తు రామన్ సహాయపాత్ర. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. విలువలు గుర్తించిన మనుషులు స్వార్ధానికి పోరనీ, విలువల కోసం త్యాగాలు చేస్తారనీ, ప్రాణత్యాగానికి సైతం వెరవరనీ నీతిని ప్రకటిస్తూ ఇది సంచలన విజయం సాధించడమే గాక, ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది.

          వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై
 ఏళ్ళే!  రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో  ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి  అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం.  

          1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క   శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు.

జరిగేదంతా లోపలే 
      ‘మనసేమందిరం’ తెలుగు రీమేక్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యలతో బాటు, గుమ్మడి, నాగభూషణం, రేలంగి, చలం, శాంతా కుమారిలు నటించారు. సంభాషణలు, పాటలు ఆచార్య ఆత్రేయ రాశారు. ఒక పాట కార్తీక్ రాశారు. ఘంటసాల, పి. సుశీల, ఎల్లారీశ్వరి, పిబి శ్రీనివాస్ లు గానం చేశారు. ‘అల్లారు ముద్దు కదే అపరంజి ముద్ద కదే’ (పి. సుశీల), ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ (పిబి శ్రీనివాస్) పాటలు రెండూ ఇప్పటికీ హిట్టేనని తెలిసిందే. 

          మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత),  ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్).

రెండు వారాల కథ 
      10 వ తేదీన క్యాలెండర్లో కాగితం చినగడంతో ప్రారంభమయ్యే కథ, క్యాలెండర్లో 24 వ తేదీతో ముగుస్తుంది. ఇది టైం లాక్ కథా సంవిధానం. డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు) ఆపరేషన్ కి ప్రకటించే రెండు వారాల గడువులోపల జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ. ఈ టైంలాక్ చేయడంవల్ల, డెడ్ లైన్ సమీపిస్తున్న కొద్దీ ఏం జరగబోతోందన్న సస్పెన్స్ వెంటాడుతూంటుంది. డాక్టర్ రఘు చేతిలో ఆపరేషన్ సక్సెస్సా, ఫెయిలా? ఉత్కంఠ రేపే ఈ సస్పెన్స్ తో కూడిన కథనం ప్రతీదృశ్యాన్నీ విడువకుండా చూసేలా చేస్తుంది.   క్యాలెండర్లో లెక్కపెట్టి ఒక్కో తేదీ మారుతూంటే, ఆపరేషన్ ఫెయిలయ్యే ముందస్తు సూచనలే, పరిణామాలే (కుక్క ఏడ్పు, బాలిక మరణం లాంటివి) ఆందోళన పరుస్తూంటాయి. ఆపరేషన్ ఫెయిలయితే డాక్టర్ రఘు తీవ్ర ప్రమాదంలో పడిపోయే గండం పొంచి వుంటుంది. అప్పుడతను జీవించినా మరణించినట్టే లెక్క. ‘ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకు’ గా విశ్వసనీయత కోల్పోయి పతనమై పోతాడు. అయినా ఈ భారీ మూల్యం చెల్లించుకునే రిస్కుకే  సిద్ధపడతాడు. ఇలా కథలో ఒక పాత్రగా క్యాలెండర్ అనే ప్లాట్ డివైస్, కథనంలో సస్పెన్స్ అనే ఎలిమెంట్, క్యారెక్టర్ కి అధిక రిస్కుతో కూడిన గోల్ – ఈ మూడూ బలమైన ప్రధాన పనిముట్లుగా కుదిరి, ఈ ప్రేమకథ స్క్రీన్ ప్లేతో ఎప్పుడో అరవై ఏళ్ల నాడే, నూతన దృక్పథంతో  అత్యత్భుత కథన చాతుర్యాన్ని కనబర్చాడు యంగ్ శ్రీధర్. ఇందుకే జగ్ ముంద్రా ఇంగ్లీషులో రీమేక్ చేయాలనుకుని వుంటాడు.  

          హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి,  ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది. 

          డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు. 

          ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు.

విశిష్ట కథనం, పాత్రచిత్రణలు 
       పైన చెప్పుకున్నట్టు ఈ కథనానికి సస్పెన్స్ ప్రాణమై నిల్చింది. ఇప్పటి తెలుగు సినిమా ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అనే ఎలిమెంటే వుండడం లేదు. అదేదో మిస్టరీ, క్రైం, యాక్షన్ కథల వ్యహారమనుకునే దురవగాహనతో వుంటున్నారు. పైగా గత రెండు దశాబ్దాలుగా తెలుగులో అవే రోమాంటిక్ కామెడీలూ, లేదంటే అవే మాస్ యాక్షన్లూ మాత్రమే చూస్తూ పెరిగిన కొత్తతరం దర్శకులు ఇంకో కళాప్రక్రియని  వూహించలేక పోతున్నారు. ఎప్పుడైనా కుటుంబ కథ తీస్తే ఆ పాత్రల జీవితాల్లో థ్రిల్లే వుండదు, సస్పెన్సే వుండదు. పాసివ్ పాత్రలతో చప్పగా పాసివ్ కథనాలు చేసి చేతులు దులుపు కుంటున్నారు.

          ‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ;  సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు. 

          ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక,  రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి. 

          ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ  ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది :  కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని. 

          ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి  ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి,  డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే,  అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది. 

       ఒకసారి ఇప్పుడొస్తున్న దర్శకుల సినిమాల సరళిలో ఈ కథనాన్ని పెట్టి చూస్తే, తమాషాగా ఇలా వుంటుంది – సావిత్రి జగ్గయ్యతో వచ్చి క్యాన్సర్ అని ఏఎన్నార్ తో చెప్తుంది. ఏఎన్నార్ ఎక్స్ రే చూస్తూ సావిత్రిని వూహించుకుంటాడు. అంతే,  ఫ్లాష్ బ్యాక్ తన్నుకొచ్చేస్తుంది. కాలేజీలో వాళ్ళిద్దరి చదువులు, ప్రేమలు, వాళ్ళిద్దరి కుటుంబ పరిస్థితులు, యుగళ గీతాలు, విద్య కోసం ఏఎన్నార్ విదేశీ యానం, సావిత్రి కి తండ్రి వల్ల జగ్గయ్యతో బలవంతపు పరిణయం, ఏఎన్నార్ స్వదేశాగమనం, ఇక ప్రేమంతా మంటగలిసిందని వైద్య సేవల్లో కలిసిపోవడం. 

          ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా  ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం. 

          కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ  ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ.

రెండు విడతల సస్పెన్స్ 
       రెండో సీన్లోనే జగ్గయ్యకి ఆపరేషన్ అనీ, అది రెండు వారాల్లోననీ ఒక టైం లాక్ తో సమస్య నేర్పాటు చేశాక, నడిపే కథనంలో సస్పెన్సు రెండు విడతలుగా కన్పిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఆపరేషన్, దీని తాలూకు పరిణామాలతో కూడిన సస్పెన్సుతో ఏర్పడే సెన్సాఫ్ డేంజర్ ని ఇప్పట్నుంచే ఫీలవ్వం మనం. ఇది మొదలవడానికింకా టైముంది. దీనికంటే ముందు ఇంకో సెన్సాఫ్ డేంజర్ ప్రారంభించిన కథలోనే తోస్తోంది మనకి. అది ఏఎన్నార్ - సావిత్రిలు జగ్గయ్య ముందు దాచిపెడుతున్న పూర్వ ప్రేమాయణం. ఇది బయటపడే ప్రమాదం పొంచి వుంది. ఇలా ప్రస్తుతం ఈ సెన్సాఫ్ డేంజర్ ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడేంటి? ఎప్పుడో జరిగే ఆపరేషన్ సంగతి సరే, ఇప్పుడున్న వీళ్ళ రహస్యం మాటేమిటి? దాచి పెడుతున్నది బయట పడక తప్పదు. అప్పుడేం జరుగుతుంది? ఇది ముందు తేల్చడం ఈ కథ ముందుకు సాగడానికి అవసరం. కాబట్టి అనివార్యంగా ముందు చేపట్టాల్సిన కథనం దీనికి సంబంధించిందే అయింది. 

          ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య  పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే  ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే.

తొలి విడత సస్పెన్స్ 
        రెండు వారాల్లో ఆపరేషన్ చేయాలనీ నిర్ణయించాక,  జగ్గయ్య హాస్పిటల్లో అడ్మిటవుతాడు. సావిత్రి కూడా అక్కడే వుండిపోతుంది, బట్టలూ అవీ తెప్పించుకుని. ఏఎన్నార్ నివాసం ఎలాగూ అక్కడే. ఒక రాత్రి పూట సావిత్రితో దిగిన పాత  ఫోటో చూసుకుంటూ పాటలోకెళ్ళి పోతాడు. ఆ పాటలో సుమంగళిగా ఆమె సుఖాన్నే కోరుకుంటాడు. పాట పూర్తయ్యాక జగ్గయ్య వచ్చేస్తాడు. కంగారుపడి ఫోటోని పత్రికలో దాచేస్తాడు ఏఎన్నార్. చదువు కోవడానికి ఏమైనా పుస్తకాలుంటే ఇమ్మని పత్రిక తీసేసుకుంటాడు జగ్గయ్య. ఏఎన్నార్ గుండె ఢామ్మంటుంది. ఏం చేసే లోగా పత్రికతో వెళ్ళిపోతాడు జగ్గయ్య. పత్రిక తిరగేస్తోంటే ఆ ఫోటో జారి కింద పడుతుంది. ఇది చూసి సావిత్రి గుండె ఢామ్మంటుంది.  ఎలాగో జగ్గయ్యని లోపలికి పంపి ఆ ఫోటో తీసెయ్యబోతే, ఏఎన్నార్ తీసుకుని వెళ్ళిపోతూంటాడు గబగబా.

          ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని.

          ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు. 

          ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?”

          సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?”  అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని.  ఆమె తట్టుకోలేక భోరుమంటుంది.

         ఇక్కడ కథాపరమైన తొలి విడత సస్పెన్స్ నిర్వహణతో బాటు, పాత్రచిత్రణల వికాసం కూడా వుంది. ఏఎన్నార్ తల్లి రాకతో జగ్గయ్యకి ఏఎన్నార్ విషయం తెలిసి అతడి పెళ్లి ఆలోచన స్ఫురించింది. ఇది మున్ముందు కథలో ఏఎన్నార్ కి పెళ్లి అనే చర్య తీసుకోవడానికి దారి తీస్తుంది. రెండోది, సావిత్రికి తన రహస్యం ఎక్కడ బయట పడుతుందోనన్న భయాందోళనలతో బాటు, పైకి చెప్పుకోలేని తన నిర్దోషిత్వం గురించిన భావోద్వేగాలు అనుభవించడం. తను మోసగత్తె కాదని ఎలా చెప్పుకోవాలి? అసలేం జరిగిందో ఎలా చెప్పుకుంటుంది? చెప్పుకోవడానికి మొహం చెల్లకే ఏఎన్నార్ తో ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు కథాపరమైన మొదటి విడత సస్పెన్సుకి తోడు అసలు గతంలో ఏం జరిగి ఏఎన్నార్ నుంచి సావిత్రి విడిపోయిందన్న అనుబంధ సస్పెన్సుని ప్రేక్షకుల మీద రుద్దాడు దర్శకుడు. ఇప్పుడు మనకి వాళ్ళ రోమాంటిక్ గతం తెలుసుకోవాలన్న డిమాండ్ పక్కకి వెళ్ళిపోయి, ఆ ట్రాజిక్ గతమేంటో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగిపోయింది. దీన్నె ప్పుడు సరఫరా చేస్తాడు దర్శకుడు? ఇది అనుబంధ సస్పెన్స్. 

          దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు.

          తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక”  అని. 


      ఏఎన్నార్ మాటిస్తాడు, అసలు తను తెలిసినట్టు కూడా ప్రవర్తించనంటాడు. అయితే ఒక్క సందేహం తీర్చి మనశ్శాంతి కల్గించమంటాడు. ఇందుకామె, “డాక్టర్, మీకు కొంచెమైనా మనశ్శాంతి కల్గించడం నాకు చేతనైతే నేను చేసిన పాపానికి అదే ప్రాయశ్చిత్తం, చెప్పండి?”  అంటుంది.  అసలెందుకు విడిపోయావని అడుగుతాడు. 

          ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా  వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని  ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది...

          ఇలా  సావిత్రి చెప్పేసరికి ఏఎన్నార్ ఆమె పరిస్థితికి కదిలిపోతాడు. అటు చాటుగా వుండి  వింటున్న జగ్గయ్య ఛాతీ పట్టుకుని ఉక్కిబిక్కిరైపోతాడు. అసలే గుండెకి ముదిరిన క్యాన్సర్. అందులో ఇలాటి అగ్నిపర్వతం బద్ధలవడం... దీంతో ఏఎన్నార్ – సావిత్రిల తాలూకు రహస్యం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బంతి జగ్గయ్య కోర్టులో పడింది. మనకీ గతం తాలూకు అనుబంధ సస్పన్స్ తీరిపోయింది.  

          సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు. 

          కథనంలోఈ తొలి  విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు.
  జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది.

మలి విడత సస్పెన్స్ 
       “డాక్టర్ మీరు నాకో సహాయం చేయాలి. ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానంటారా? నేను పిరికి వాణ్ణి కాను, మీ మనసులో వున్న నిజాన్ని ధైర్యంగా చెప్పండి. చచ్చిపోతానని నేను భయపడ్డం లేదు. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకూ నా జీవితంలో నాకెలాటి కొరతా కలగలేదు. ఐశ్వర్యం లోపుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను. ఆనందంగా జీవించాను. అందం, గుణం వున్న పిల్లనే చేసుకున్నాను. ఈ క్షణం వరకూ ఆమెకే లోటూ రానివ్వకుండా ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను. అన్నివిధాలా అందరికీ అసూయ కల్గించే జీవితాన్ని నేననుభవించాను...”
          “ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది”
          “మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...”

          ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది. 

          “డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు”

          జగ్గయ్యకి కూడా చెప్పేస్తుంది ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని. ఏఎన్నార్ ని అవమానించడం తగదంటాడు అతను. దీంతో ఉద్రిక్తత సడలుతుంది. మళ్ళీ పెట్రేగుతుంది. ఈసారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని జగ్గయ్య నేరుగా చివరి కోరిక వెల్లడించడంతో. ఇద్దర్నీ ఏడ్పిస్తాడు. ఇద్దరూ నిరసిస్తారు. అయినా చేసేది చేసుకుపోతాడు జగ్గయ్య. లాయర్ ని పిలిపించుకుని ఇద్దరికీ తన ఆస్తి వీలునామా రాసేస్తాడు. ఇక లాభం లేక సావిత్రి తన నిర్ణయం తానూ తీసుకుంటుంది. 

          సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది.

          ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట  నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు.  ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి...

          నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు.      

లోటు తీర్చే ప్రయత్నాలు 
       సంక్లిష్ట కథా కథనాలు, సంక్లిష్ట పాత్ర చిత్రణలు. 29 ఏళ్ల శ్రీధర్ విరచిత విన్యాసాలు. నటత్రయం అభినయ వైశిష్ట్యాలు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్యల గురించి చెప్పుకోవాలంటే వాక్యాలందవు. చూసి తరించాల్సిందే. ఏ వొకరి ముఖంలోనూ సంతోషం పలకని గూడు కట్టిన విషాదమే. అభిమాన తారలు ఇంత విషాదంతో వుండిపోతే ప్రేక్షకులకి ఇబ్బందే. అక్కినేని ఎక్స్ రే చూస్తూ తలచుకున్నప్పుడు సావిత్రితో ఒక సంక్షిప్త ప్రేమ సన్నివేశం తప్ప,  ఇంకే రిలీఫ్ కూడా వుండదు. ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు కూడా వాళ్ళ గతం తాలూకు రోమాంటిక్ మాంటేజీలు పడవు. దీనికి భిన్నంగా హిందీ రీమేక్ లో వుంది. రాజేంద్రకుమార్ ఎక్స్ రే చూస్తున్నప్పుడు మీనా కుమారితో పాటలోకి వెళ్ళిపోతాడు (తేరే మేరే సివా యహా కోయీ నహీ). ఇది సినిమాకి మాంచి యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తుంది. తర్వాత ఫోటో చూస్తూ పాడుకున్నప్పుడు (యాద్ న జాయే భీతే దినోకీ) విరివిగా వచ్చే వాళ్ళ పూర్వ ప్రేమ తాలూకు మాంటేజీలు మరోసారి యూత్ అప్పీల్ కి న్యాయం చేస్తాయి. ముందంతా విషాదమే చూపిస్తున్నప్పుడు ప్రారంభంలో ఈ మాత్రమైనా వినోదపర్చాలి. తమిళ మాతృక తర్వాత హిందీ రీమేక్ అయింది. దీని తర్వాత తెలుగు రీమేక్. కానీ ఎందుకనో అప్డేట్ చేసిన హిందీ రీమేక్ ని తెలుగుకి అనుసరించలేదు. తమిళ మాతృకనే ఫాలో అయ్యారు.  హిందీలో పత్రికలోంచి ఫోటో బయటపడే సీన్లో థ్రిల్, సస్పెన్సుల పోషణ  భలే వుంటుంది. బ్లాక్ అండ్ వైట్ వెలుగు నీడలతో ఛాయాగ్రహణం కూడా ఉన్నత ప్రమాణాలతో వుంటుంది. ఇక అన్నిపాటలూ ప్రజాదరణ పొందాయి. తెలుగులో రెండే (అపరంజి బొమ్మ, తలచినదే) హిట్టయ్యాయి. ఈ విషాద కథ హిందీలో మ్యూజికల్ హిట్టయితే, తెలుగులో అది కూడా కాలేదు.  మూడు సార్లు తీసిందే తీస్తూ అలసిపోయి వుంటాడు శ్రీధర్. 

          కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది. 

            దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి  ప్రధాన ఆకర్షణ. 

          ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే  కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే!

సికిందర్

1.8.2019

         

18, ఫిబ్రవరి 2021, గురువారం

1014 : స్క్రీన్ ప్లే సంగతులు


       గాథలో ప్రధాన పాత్ర పేరు డేనియల్ డే ప్లేన్ వ్యూ. సులభంగా వుంటుందని తెలుగులో డానీ అందాం. డానీ జానీ శీను టెంప్లెట్ పేర్లు అలవాటే మనం తెలుగు ప్రేక్షకులై విజయవంతంగా జీవిస్తున్నందుకు. ప్రత్యర్ధి పాత్రపేరు ఇలై సండే. ఇలై కూడా తెలుగులో అనుకూలంగానే వుంది ఇళయరాజా లాగా. ఒక్క పిల్లవాడి పేరే హెచ్ డబ్ల్యీవ్ అని తెలుగుని సవాలు చేస్తూ వుంది. దీన్ని జూనియర్ డానీ అనేద్దాం.

        జూనియర్ డానీని తీసుకుని లిటిల్ బోస్టన్ ప్రయాణమవుతాడు డానీ. అక్కడ ఎడారిలా వున్న ప్రాంతంలో ఏబెల్ కి చెందిన సండే రాంచ్ చేరుకుంటాడు. డానీకి భూముల ఆఫర్ ఇచ్చిన పాల్ సండే, ఏబెల్ కొడుకుల్లో ఒకడు. రెండో కొడుకు ఇలై సండే. వీళ్ళిద్దరూ కవలలు. ఇలై చర్చి పాస్టర్. ఏబెల్ కి ఇంకా భార్య, రూత్ అనే పన్నెండేళ్ళ కూతురు, మేరీ అనే ఇంకో పదేళ్ళ కూతురూ వుంటారు. ఇలా ఇక్కడికొచ్చిన డానీ ఈ ప్రాంతంలో వేట కోసం వచ్చాననీ, డాక్టరు కూడా కొడుకు జూనియర్ డానీకి మంచి గాలి అవసరమని చెప్పాడనీ అబద్ధం చెప్తాడు. రాంచ్ లో బస ఏర్పాటు చేస్తారు సండే కుటుంబీకులు.

        ఇక జూనియర్ ని తీసుకుని డానీ వేటకి బయల్దేరతాడు. తండ్రీ కొడుకులు వూరికే తుపాకులు పేలుస్తూ రికామీగా తిరుగుతారు, వచ్చిన పని ఇది కాదు కాబట్టి. ఇంతలో జూనియర్ డానీ బూట్లకి ఏదో అంటుకుంటుంది. అది చూసి, భూకంపంతో ఉబికి వచ్చిన చమురు అని చెప్తాడు డానీ. అంటే ఈ ప్రాంతంలో చమురు వున్న విషయం నిజమేనన్న మాట. అక్కడే తండ్రీ కొడుకులు ఆయిల్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. పదేళ్ళ కొడుకుని బిజినెస్ భాగస్వామిగా ఎప్పుడో ప్రకటించాడు డానీ. ఆయిల్ ని యూనియన్ ఆయిల్ కంపెనీకి అమ్మాలంటే పైపు లైను వేయాలంటాడు.  

        రాత్రి డిన్నర్ దగ్గర వేట కోసం భూముల్ని కొనేస్తానని ఏబెల్ తో అంటాడు డానీ. ఇలై అనుమానంగా చూస్తాడు. ఎకరానికి ఆరు డాలర్లు ఇస్తానంటాడు డానీ. పోనీ ఆరువందల ఏకరాలకి 3,700 డాలర్లు ఇస్తానంటాడు. ఇవి ఆయిల్ భూములని గుర్తు చేస్తాడు ఇలై. ఇక తన వేట నాటకం లాభం లేదనుకుని, ఆయిల్ భూములైతే మాత్రం ఆయిల్ తీయాలంటే ఎంత డ్రిల్లింగ్ చేయాలో తెలుసా - అంటాడు డానీ. వూరికే గునపం వేస్తే ఆయిల్ పడుతుందంటాడు ఇలై.  

        చివరికి 10 వేల డాలర్లకి బేరం కుదురుతుంది. ఇదికాక ఇంకో పదివేల డాలర్లు చర్చి కోసం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు ఇలై. ఇది కూడా ఒప్పుకుని ఇలైకి అయిదు వేలు అడ్వాన్సు ఇస్తాడు. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర వివరాలు తీయిస్తే, మధ్యలో విలియం బాండీ అనే అతడి భూములున్నాయని తేలుతుంది. ఇవి అమ్మడానికి బాండీ ఒప్పుకోడు.

  డానీ ఇక వర్కర్లని నియమించుకుని పనులు ప్రారంభిస్తాడు. ఇటు మేరీతో ఆడుకుంటున్న జూనియర్, మేరీ ని ఆమె తండ్రి ఏబెల్ ప్రార్థన చేయట్లేదని కొడుతున్నాడని వచ్చి చెప్తాడు డానీకి.

      డ్రిల్లింగ్ ప్లాంట్ సిద్ధమవుతుంది. అప్పుడు ఇలై వచ్చి, ప్రారంభోత్సవానికి ప్రార్ధన చేయించాలంటాడు. అతడి విన్నపం ఓపిగ్గా విని, సరేనంటాడు డానీ. పాస్టర్ ఇలై నిర్ణయించిన ముహూర్తానికి ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఇలైని లోపలికి రానివ్వకుండా అడ్డుగా నిలబడి, వర్కర్లకి లెక్చరిస్తాడు డానీ : కలిసి పని చేద్దామని, ఫలితాన్ని కలిసి పంచుకుందామనీ. ఇటు పక్క జూనియర్ ని నిలబెట్టుకుని, అటు పక్క మేరీని నిలబెట్టుకుని, మేం ఫ్యామిలీ అన్న లుక్ ఇస్తాడు. ప్రార్ధన పేరుతో మేరీని ఆమె తండ్రి బాధిస్తే, పరిణామాలు అంత బావుండవని చెప్తాడు. ఇలై డానీ పోకడ అంతా మౌనంగా గమనిస్తాడు.

        జూనియర్ చేతే ప్రారంభోత్సవం చేయిస్తాడు డానీ. ఆ రాత్రే ప్రమాదం జరిగి ఒక వర్కర్ చనిపోతాడు. ఇది ప్రార్ధన చేయించని ఫలితమని ఇలై అంటాడు. పట్టించుకోడు డానీ. మహా కార్యం తలపెట్టినప్పుడు కొన్ని బలులు తప్పవనుకుంటాడు. ఇలా ప్రారంభోత్సవ ఘట్టం ముగిశాక, డానీ ఇచ్చిన అడ్వాన్సుతో ఇలై చర్చి విస్తరించి కడతాడు. చర్చికి పొలోమని వర్కర్లంతా వెళ్తారు ప్రార్ధనలకి. డానీ కూడా వెళ్ళి చూస్తాడు. పాస్టర్ ఇలై సువార్త -స్వస్థతా ప్రార్ధనలు జరుపుతూ, ఒకావిడ సైతాను వదిలించడానికి వెళ్లిపో వెళ్లిపో అంటూ పూనకం పూని భయంకర గర్జనలు చేస్తాడు. డానీ చూస్తూ వుంటాడు.

        ఇక ఆ తర్వాత, భూమిలోంచి చమురు ఒక్క పెట్టున ఉప్పొంగి, డ్రిల్లింగ్ ప్లాంట్ ఒక్క సారిగా మంట లంటుకుని బద్ధలై, చెవిటివాడై పోతాడు జూనియర్ డానీ.

***

        2. వివరణ :  35 నిమిషాలు సాగే పై మిడిల్ 1 విభాగమంతా, విశ్రాంతి ఘట్టం వరకూ వచ్చే కథనం (120 పేజీల స్క్రిప్టులో బిగినింగ్ 20 పేజీలు, మిడిల్ 1, 40 పేజీలు). ఇది మిడిల్ విభాగపు బిజినెస్ -అంటే సంఘర్షణ.  పీపీ 1 దగ్గర ఏర్పడే కాన్ఫ్లిక్ట్ పాయింటుతో సంఘర్షణ. కానీ వెనుకటి ఆర్టికల్లో రాసిందాంట్లో పీపీ 1 దగ్గర ఈ గాథలో కాన్ఫ్లిక్టే లేదే? కేవలం పాల్ సండే వచ్చి భూముల ఆఫర్ ఇచ్చి వెళ్ళినట్టు వుంది. గాథ ఇలాగే వుంటుంది. కాన్ఫ్లిక్ట్ ఏర్పడదు, ఏదైనా మలుపు వస్తుంది. పాల్ సండే వచ్చి భూముల ఆఫర్ ఇచ్చి వెళ్ళే లాంటి మలుపు. ఈ మలుపుతో డానీ భూములు కొనడానికి లిటిల్ బోస్టన్ బయల్దేరడం - క్రితం ఆర్టికల్ లో చెప్పుకున్నట్టు, బిగినింగ్ విభాగపు నేపథ్యం లోంచి ఇంకో కొత్త నేపథ్యం లోకి స్థల మార్పు, పాత్రకి స్థాన చలనం వగైరా. పురాణాల ఆధారంగా హీరోస్ జర్నీ మోనోమిత్ స్ట్రక్చర్ చెప్పిన జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం - పై స్థానచలన మలుపుని ది కాల్ టు అడ్వెంచర్ అంటారు.   
        (The Call to Adventure : The hero begins in a situation of normality from which some information is received that acts as a call to head off into the unknown. This region is represented by a distant land, a forest, a kingdom underground, beneath the waves, or above the sky, a secret island, lofty mountain top etc) 

        రాముడు అడవుల కెళ్ళడం కూడా ఈ మలుపే. ఎందుకంటే గాథ అనేది ముగింపు వరకూ పాత్ర దాని కర్మ ఫలాలతో మలుపులు తిరిగే నిరంతర ప్రయాణం కాబట్టి. ప్రయాణపు వృత్తాంతం కాబట్టి. అందుకని గాథ అనేది స్టేట్ మెంట్ అవుతోంది. నాకిలా జరిగితే, నేనిలా చేసుకుని, ఇలా అయ్యానని, జాలి కోసమో, నీతి కోసమో పాత్ర ఇచ్చుకునే స్టేట్ మెంట్.

        అదే కథైతే ఆర్గ్యుమెంట్ కేంద్రంగా కథనం వుంటుంది. ఆర్గ్యుమెంట్ అన్నాక కాన్ఫ్లిక్ట్ పుట్టాల్సిందే. అందుకని కథకి పీపీ 1 లో ఆర్గ్యుమెంట్ తో కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. ప్రధాన పాత్ర -ప్రత్యర్ధి పరస్పరం నేరుగా నువ్వు రైటా, నేను రైటా అనే ఆర్గ్యుమెంట్ తో కూడిన కాన్ఫ్లిక్ట్. ఈ ఆర్గ్యుమెంట్ కి చివర్లో జడ్జిమెంట్ వుంటుంది. శివ లో నాగార్జున సైకిలు చెయినుతో జేడీని వీరబాదుడు బాదేక, అది నేరుగా మాఫియా భవానికి సవాలు విసిరే కాన్ఫ్లిక్ట్ అయింది. ఎవరు రైటో తేల్చుకుందాం రా అయింది. ఆర్గ్యుమెంట్ అయింది. చివర్లో భవానీ చావుతో అతను రైట్ కాదని జడ్జిమెంట్ వచ్చింది. అందుకని కథలో ఆర్గ్యుమెంట్ దృష్ట్యా జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తారు ప్రేక్షకులు. జడ్జి మెంట్ కరెక్ట్ గా లేకపోతే శాపాలు పెట్టి పోతారు.

        ప్రస్తుత గాథ కథ అవాలంటే, బిగినింగ్ విభాగంలో డానీ సదరు భూములు కొట్టేయడానికి ఎత్తుగడలు వేస్తూ వుండాలి. అప్పుడు పీపీ 1 లో పాల్ సండే వచ్చి- మా భూముల జోలికొస్తే జాగ్రత్త - అని హెచ్చరించాలి. అప్పుడది భూముల కోసం పోరాటంగా మారి, మొత్తం గాథ కోసం ఉద్దేశించిన విషయమే మారిపోతుంది.

***

     3. మరి గాథలు సినిమాకి పనికి రావని, కథలే పనికొస్తాయనీ చాలా సార్లు చెప్పుకున్నామెందుకు? నిజానికి గాథలు ఆర్ట్ సినిమాలకి తప్ప కమర్షియల్ ఎంటర్ టైనర్లుగా పనికి రావనే చెప్పుకోవాలి. అందుకని మాస్ మీడియా అయిన కమర్షియల్ ఎంటర్ టైనర్లకి కాన్ఫ్లిక్ట్ తో కూడిన కథలే తీస్తారు. ఎప్పుడో గానీ గాథ తీయరు. తీస్తే శాస్త్ర బద్ధంగా తీస్తారు. తీసినప్పుడు చరిత్రలో నిలిచి పోవచ్చు. ఈ దేర్ విల్ బి బ్లడ్  సక్సెస్ ఫుల్ గాథ గురించి ఒక దర్శకుడికి చెప్తోంటే, మన మైండ్ దొబ్బిందా వాళ్ళ మైండ్ దొబ్బిందా అన్నాడు, మన పరిస్థితికి అద్దం పడుతూ. మన మైండ్ గాథల జోలికి పోక, వాళ్ళ మైండ్ గాథలతో బాగా పోతూ.

        తెలుగులో జరుగుతున్నదేమిటంటే, కథకీ గాథకీ తేడా తెలియక, కథ అనుకుని తీసుకుంటూ పోతే అవి గాథ లైపోతున్నాయి. పూర్తి గాథలు కూడా కాదు. గాథలు గాని గాథలు, కథలు కాని కథలు. కృష్ణవంశీ గురి చూసి బ్యాక్ టు బ్యాక్ మొగుడు’, పైసా అనే ఇలాటివి రెండు తీసి, అంతే బ్యాక్ టు బ్యాకుగా ఫ్లాపులిచ్చి అవతల పడ్డారు. ఇంకెందరో ఇలాటివి చేశారు- బ్రహ్మోత్సవం సహా. హోటలతను ఇడ్లీతో చట్నీ, సాంబారు విడివిడిగా పెడతాడే గానీ, రెండూ కలిపేసి జానర్ మర్యాదలు చెడగొట్టడు. ఒక రెస్టారెంట్ లో ఫారినర్ టీ, కాఫీ రెండూ తెప్పించుకుని, అది కొంచెం ఇది కొంచెం తాగుతూ కూర్చున్నాడు. రెండిటి జానర్ మర్యాదలు విడివిడిగా అనుభవిస్తున్నాడన్న మాట. తెలుగు సినిమాల కంటే ఇదే బెటర్ అనుకున్నాడేమో.  

***

        4. గాథ తీయాలనుకుంటే దాని కోసం మానసికంగా సిద్ధపడి గాథే తీయాలి. అదెలా తీయాలో ఈ స్క్రీన్ ప్లే సంగతుల్లో దేర్ విల్ బి బ్లడ్ ఆధారంగా చేతనైనంత వరకు చెప్పుకుంటున్నాం. రచయిత, దర్శకుడు పాల్ ఆండర్సన్ 526 పేజీల నవల్లో, 150 పేజీలే తీసుకుని ఈ గాథ చేశాడు. భారీ నవల్లోని ఎన్నో పాత్రల్ని, ఉప కథల్ని, కాన్సెప్ట్ నుంచి పక్కకెళ్ళే విషయాల్నీ పక్కన పెట్టేశాడు. తెలుగులో కూడా గాథ తీయాలంటే పురాణాల ప్రభావానికి లోనై భారీ సంఖ్యలో తారాగణంతో, వాటి రకరకాల సంబంధాలతో, ఉప కథలతో మొత్తం విషయాన్ని తడిసి మోపెడు చేయాల్సిన అవసరం లేదు.

        గౌతమీ పుత్ర శాతకర్ణి’, బాజీరావ్ మస్తానీ భారీ చారిత్రకాలే గానీ గాథలు కావు, అవి కథలే. వీటిలో మొదటి దానిలో బాలకృష్ణ, శ్రియ, హేమమాలినీ పాత్రల మధ్యే కుటుంబ కథ వుంటుంది. రెండో దానిలో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రాల మధ్యే ఇతర పాత్రల ప్రమేయంలేని సూటి ప్రేమ కథ వుంటుంది. ఫోకస్ చేసిన ఈ పాత్రల మధ్య కథలతోనే ఇవి నిలడ్డాయి.

        ఇంత భారీ ఎత్తున తీసిన గాథలో దర్శకుడు పాల్ ఆండర్సన్ - డానీ, ఇలై పాత్రల మధ్యే ఫోకస్ చేసి, సింగిల్  లైనులో సింపుల్ గాథ నడిపాడు. 21వ శతాబ్దపు గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఎపిక్ - క్లాసిక్ గా ప్రశంసలు పొందిన దీనికి తలపండిన ఏ ఐదారు పదుల వయసు దర్శకుడో మేకర్ కాదు. 2007 లో ఆండర్సన్ వయసు 37 సంవత్సరాలే. వయసు కాదు గొప్ప, వయసు ఏ గ్యారంటీ ఇవ్వదు. ఏ వయస్సులో వున్నా ఆ వయసులో వుండే మనస్సుని చూడాలి. మనసే మందిరం కాబట్టి. మిగిలినదంతా డంప్ యార్డు.

        ఆండర్సన్ కృషికి ఎనిమిది ఆస్కార్ నామినేషన్లు పొంది, రెండు ఆస్కార్లు లభించాయి యీ గాథకి.

***

       5. దీని బ్యాక్ డ్రాప్ భారీ తనంతోనే వుంటుంది- 1920 ల నాటి కథాకాలపు పీరియెడ్ బిజినెస్ జానర్ మూవీగా. కానీ విషయం సింపుల్ గా వుంటుంది. భారీ బ్యాక్ డ్రాప్ కి భారీ కథ కూడా పెడితే కథని ఫీలవ లేరు ప్రేక్షకులు. కథని భారీ బ్యాక్ డ్రాపే మింగేస్తూంటుంది. ఇక టెక్నికల్ హంగామా కూడా రుద్దితే చెప్పనవసరం లేదు. హాలీవుడ్ మంత్రం ఏమిటంటే, బిగ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి కథ సింపుల్ గా వుండాలి; దీనికి రివర్స్ లో బిగ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాని వాటికి కథ బరువుగా వుండాలి. ఇలా బ్యాక్ డ్రాప్ తో, కథనంతో విజువల్ కాంట్రాస్ట్ పాటిస్తారు. మార్కెట్ లో సరైన క్రియేటివ్ యాస్పెక్ట్ తో సినిమాని ప్రవేశ పెడుతున్నామా లేదానేది మొదటి ప్రశ్నవుతుంది. అన్నిటికీ స్టడీస్ వున్నాయక్కడ.

        ఇంకోటేమిటంటే, ఈ బిగ్ బ్యాక్ డ్రాప్ పీరియెడ్ మూవీలో డైలాగులు కూడా భారీగా వుండవు. అరుచుకోవడా లుండవు. భారీ బ్యాక్ డ్రాప్ కి కాంట్రాస్టుగా, డానీ - ఇలై రెండు పాత్రల మధ్య సింపుల్ గా అర్ధమయ్యే కథనంతో డ్రామా రక్తి కడుతూంటుంది. మరొకటేమిటంటే, క్యాస్టింగ్ వ్యూహం. డానీ, ఇలై పాత్ర ధారులుగా సమానులైన నటుల్ని తీసుకో లేదు. డానీ - ఇలైల వయసు తారతమ్యం కూడా ఎక్కువే. డానీ ముందు లేత పిండంలా వుంటాడు యువకుడుగా ఇలై. మెచ్యూర్డ్ ప్రధాన పాత్రకి, ప్రత్యర్ధి పాత్ర ఇంత యంగ్ యాక్టర్ ఏమిటా అన్పిస్తుంది. డానీ పెట్టుబడికి ప్రతినిధి, ఇలై మతానికి ప్రతినిధి. మొదట్నుంచీ తానే రారాజు అన్నట్టు డానీ డామినేషన్ తో సాగుతున్నఈ గాథలో, ప్రత్యర్ధిగా ఇలై ఎదురయ్యేసరికి, అందునా అతను మతానికి ప్రతినిధి కూడా అయ్యేసరికి - పెట్టిబడి ముందు మతం సైతం సున్నా అన్న అహంతో ఇలైని గనుక చూస్తే, డానీకి కుందేలు పిల్లలానే కన్పిస్తూండాలి. అందుకని డానీ పాయింటాఫ్ వ్యూలో ప్రత్యర్ధి పాత్ర పోషకుడితో ఈ క్యాస్టింగ్ వ్యూహం కావచ్చని మన వూహ.

        మరి ఈ మిడిల్ 1 యాక్షన్ - రియాక్షన్లతో కూడిన సంఘర్షణా విభాగంలో ప్రత్యర్ధి ఇలై ఇలా పాసివ్ గా వుండి పోతే, ఇద్దరి మధ్య అంతర్విరోధ మెలా? పాసివ్ గా ఏమీ వుండి పోడు బిక్కుబిక్కు మంటూ. చర్చి ప్రారంభోత్సవంలో అతను ఒకావిడ సైతానుని వదిలిస్తూ, వెళ్లిపో వెళ్లిపో అని గర్జిస్తున్నప్పుడు, అది డానీ కి ఎక్కుపెట్టి చూపిస్తున్న విశ్వరూపమే. ప్లాంట్ ప్రారంభోత్సవానికి తన మాట పక్కన బెట్టి, డానీ చేసిన అవమానానికి, ఇలా రియాక్షన్ తో బదులు తీర్చుకుంటున్నాడు.

        చాలా విచారకరమిది. మత బోధకుడికి మాత్సర్య ముండకూడదు. పగబట్ట కూడదు. ఇలై ఇలా మారిపోయి, డానీని ఎదుర్కొంటూ యాక్టివ్ అయిపోయాడు. ఒక మతబోధకుడిగా ఈ స్థితికి ఇలై వచ్చాడంటే, తన పతనాన్ని తను రాసుకుంటున్నట్టే. పెట్టుబడిదారుగా డానీ కూడా మతాన్ని అవమానిస్తూ తన పతనాన్ని తను రాసుకుంటున్నాడు. పెట్టుబడికి, మతానికీ తంపులు పెట్టుకుని రెంటినీ మంట గలిపే దిశగా గాథని నడిపిస్తున్నారు. వీళ్ళ కర్మలే కాజ్ అండ్ ఎఫెక్ట్ హోల్ సేల్ దుకాణాన్ని బట్టబయలుగా బార్లా తెరుస్తున్నాయి.

***

        6. ఈ గాథ సంఘర్షణలో ముఖ్యంగా గమనించాల్సిం దింకొకటేమిటంటే, భౌతిక దాడులతో ఘర్షణ జరగడం లేదు. ప్లాంట్ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన రెండు ప్రమాదాలూ ప్రత్యర్ధి ఇలై జరిపినవి కావు. ప్రమాదంలో జూనియర్ డానీ చెవిటి వాడయ్యాడంటే ఇలై కారకుడు కాదు. ఇలై కేవలం ప్రారంభోత్సవానికి ప్రార్ధన జరిపించాలన్నాడు. డానీ విన్పించుకోని ఫలితంగా ప్రమాదాలు జరిగాయని అర్ధం.

        ఈ గాథ దైవం వర్సెస్ డబ్బు పాయింటుతో నడుస్తోంది. దీన్ని బట్టి ఈ ప్రమాదాల్ని అర్ధం జేసుకోవాలి. విధి అని కూడా అనుకోవచ్చు. విధి ఎక్కడ్నుంచి వస్తుంది. చేతల్లోంచే వస్తుంది. డానీ ఇలై మాట వినలేదు, అనుభవించాడు. సృష్టి సమస్తం దాని సమతూకం కోసం యాక్షన్ - రియాక్షన్ల బ్రహ్మాండమైన ఫ్యాక్టరీయే. పై నుంచి విధి పేరు పెట్టుకుని ఎవడో అదృష్ట దురదృష్టాల్ని రుద్దడం లేదు. అంతా భూమ్మీదే ప్రకృతి సూత్రాలనుసారమే జరుగుతుంది. ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతి చర్య వుంటుందని న్యూటన్ అననే అన్నాడు. లా ఆఫ్ కంపెన్సేషన్ అంటూ ఎమర్సన్ ఏమన్నాడో చూస్తే- ప్రకృతి దాని సమతూకం కోసం హెచ్చు తగ్గుల్నిసరి చేస్తూంటుంది. ఒక అన్యాయం జరిగిందంటే, ఏదో రూపంలో తగిన న్యాయం జరిగి తీరాల్సిందే. జరిగేలా ప్రకృతి చూసుకుంటుంది. ఇలై ప్రార్ధన జరిపించమని తన మాటతో ఇచ్చిన పాజిటివ్ వైబ్రేషన్ కి, డానీ కాదని నెగెటివ్ వైబ్రేషన్ ఇచ్చాడు. దీంతో ప్రకృతి డానీకి నష్టం చేసి, ఇలై పాజిటివ్ వైబ్రేషన్ కి కంపెన్సేషన్ ఇప్పించింది. ఇలై మాట పాజిటివ్ వైబ్రేషన్ కాకపోతే, కంపెన్సేషన్ (నష్టపరిహారం) ఇప్పించేది కాదు ప్రకృతి. ఏది పాజిటివో, ఏది నెగెటివో ప్రకృతి గుర్తిస్తుంది. ఇలా దైవం, విధి, ప్రకృతి - ఏదనుకున్నా ఫలితమొక్కటే. సింపుల్ గా కర్మ ఫలం.

        ఇదేదో బావుందనుకుని ఎమోషనల్ రైటర్ గారు హాయిగా కథలో వాడుకుంటే నవ్విపోతారు ప్రేక్షకులు. కథ అనేది ప్రత్యర్ధుల ఆర్గ్యుమెంట్ తో కూడిన భౌతిక కాన్ఫ్లిక్ట్. ప్రమాదాల్ని విలన్ జరపకుండా విధి వశాత్తూ జరిగిందంటే, వీధినపడి తెగ నవ్వుతారు ప్రేక్షకులు. విలన్ జరపడం కూడా పైన చెప్పుకున్న ఫిలాసఫీయే. కానీ కథకి ఫిలాసఫీ చెప్పకుండా, పాత్రల విజిబుల్ యాక్షన్ గా షుగర్ కోటింగ్ వేసి చూపించాలి. ఇవన్నీ జానర్ మర్యాదల సంగతులు.

***

        7. క్రితం ఆర్టికల్ బిగినింగ్ విభాగంలో చెప్పుకున్నట్టు, పాజిటివ్ పాత్రగా కన్పించిన డానీ, ఇప్పుడు ఈ మిడిల్ 1 కొచ్చేసరికి నెగెటివ్ క్యారక్టర్ గా మారాడని అడుగడుగునా తెలిసిపోతోంది. ఇలా డానీ పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) చప్పగా పడుండక, డైనమిక్స్ తో ఒక రేంజికి పైకెళ్లి, ఫ్ర్రెష్ ఆసక్తిని కల్గిస్తోంది. కథనం రీఫ్రెష్ అవుతోంది మొదట చూపించిందే కథకుడు లేజీగా ఇంకా లాగుతూ పోకుండా.
        మతబోధకుల భూములు కొనాలను కోవడం తప్పు కాదు. వెంటనే విషయం చెప్పి వాళ్ళ అంగీకారంతో కొనొచ్చు. కానీ వేట అంటూ వేటగాడి వేషంలో వచ్చి వేట కోసం కొనాలనడంలో వ్యాపార బుద్ధిని దుర్బుద్ధితో ప్రదర్శించాడు. ఈ పాత తరం కాలాన్ని చూపిస్తున్న గాథలో డానీ ఇలా తయారయ్యాడు. ఆ కాలపు రాక్ ఫెల్లర్, హెన్రీ ఫోర్డ్, ఆండ్రూ కార్నెగీ వంటి ప్రసిద్ధ పారిశ్రామిక వేత్తలు ఇలా కాకుండా పారదర్శకంగా వ్యాపారాలు చేశారు. ఇదీ వీళ్ళకి కాంట్రాస్ట్ గా డానీని నిలబెడుతూ, మన అటెన్షన్ డ్రా చేస్తున్న ఇంట్రెస్టింగ్ క్యారక్టర్ ఆర్క్. ఇక దీని ఫలితం తర్వాత అనుభవిస్తాడు. నెగెటివ్ పాత్రకి ఈ ధోరణి అవసరం.

        ఇలా వేట బహానాతో మిడిల్ 1 సంఘర్షణకి వెంటనే బీజాలు వేయడం స్క్రిప్టులో అవసరం. ప్రత్యర్ధి ఇలై పాత్రని ప్రవేశ పెడుతూ ఈ బీజాలెలా వేశారో, పైన ఇచ్చిన మిడిల్ 1 కథనం ఆధారంగా చివరగా చూసి ముగిద్దాం...
        ఈ క్రింది విశ్లేషణలో పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల సిరీస్ ని గమనించాలి. ఈ సీరీస్ లో పై చేయి కోసం జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గమనించాలి. ఒక ప్రయత్నంతో ఒక పాత్ర పైనుంటే (ఉత్థానం), రెండో పాత్ర కిందికి జారడం(పతనం)... మళ్ళీ కిందికి జారిన పాత్ర దాని ప్రయత్నంతో పైకొస్తే (ఉత్థానం), పైనున్న పాత్ర కిందికి దిగజారడం (పతనం)...ఇలా రిపీట్ అవుతూ పోవడం సంఘర్షణలో జరిగే యాక్షన్ రియాక్షన్ల సిరీస్. మిడిల్ 1 ముగిసే సరికి ఉత్థాన పతనాలు కొలిక్కొచ్చి, ఏదో వొక పాత్ర అతి పెద్ద గండంలో పడి ఫస్టాఫ్ ముగియడం...

        రాగానే వేట కోసం వచ్చినట్టు ఏబెల్ తో అబద్ధం చెప్పిన డానీ, ఇక్కడ కొద్ది రోజుల క్రితం భూకంపం వచ్చినట్టుందే అంటాడు. అవునంటాడు ఇలై తండ్రి ఏబెల్. ఈ మిడిల్ 1 ప్రారంభానికి ఈ డైలాగు ఒక సైరన్ లా మనల్ని అప్రమత్తం జేస్తోంది. ఈ డైలాగు ఎందుకొచ్చిందో కాచుకోండి - అన్నట్టు. కథ కోసం కాకపోతే వూరికే వుండవు డైలాగులు గొప్ప సినిమాల్లో. చప్పిడి సినిమాల్లో ఎలాగైనా రాసుకోవచ్చు చట్నీ రుబ్బుతూ. పీపీ 1 అయిపోయాక, కథనం తర్వాతి సెగ్మెంట్ అయిన ఈ మిడిల్ 1 లోకి వెళ్తూ, ఇలా మిడిల్ 1 కి హుక్ వేయడం మంచి కళే కదా? డానీ నోట భూకంపం ప్రస్తావన వూరికే  రాలేదు, కుబుద్ధితో కూపీ లాగడానికే వచ్చింది. భూకంపమొస్తే వీళ్ళకి తమ భూముల్లో ఆయిలుందని తెలియ వచ్చని. తెలిసి వుంటే ఒకలా, తెలియకపోతే ఇంకోలా డీల్ చేయ వచ్చని. కానీ భూకంపం వచ్చిందన్న ఏబెల్ ఎలాటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వకపోవడంతో, తేలిక పడతాడు డానీ.

        అయితే నెగెటివ్ పాత్ర డానీ నోట వచ్చిన ఈ మాట వూరికే పోదు. భూకంపం లాగే  వస్తుంది. ఏమిటది? భూమిని పగల దీసుకుంటూ అగ్ని గోళాలైన ఆయిల్ ప్లాంటుని బూడిద చేసే విస్ఫోటం -బ్యాంగ్ - బుద్ధొచ్చేలా ఇంటర్వెల్ బ్యాంగ్ బ్యాంగ్!
        డానీ నోట సైరన్ లా ఈ డైలాగు మిసైల్ లా వెళ్ళి తన ప్లాంటునే ఢమాల్మన్పించే డ్రమెటిక్ కంక్లూజన్. మిడిల్ 1 ప్రారంభంలో వేసిన హుక్, మిడిల్ 1 అంతంలో - అంటే ఇంటర్వెల్లో ఇలా పేఆఫ్ అవడం. ఎవ్విరీ థింగ్ ఈజ్ కనెక్టెడ్. విశ్వంలో ప్రతీదీ, జీవులు సహా, కంటికి కన్పించని దారాలతో కనెక్ట్ అయి వున్నాయని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. డానీ నోట డైలాగు ఎక్కడో కనెక్ట్ అయ్యే వుండక తప్పదు. కనెక్షన్ లేనిది ఏదీలేదు యూనివర్స్ లో. ఇదన్నమాట స్టోరీ రైటింగ్ అంటే. తమ కథ లోతుపాతులు తమకే తెలియని మేకర్లుంటే, కథంటే పైపైన సున్నాలేయడమే అనుకుంటే, సినిమాలు నిజంగా సున్నాలేగా అవుతాయి.

***

        8. కొడుకుని తీసుకుని వేట కెళ్ళినప్పుడు, అక్కడ కొడుకు బూటుకి ఆయిల్ తగిలితే, అది చూసి భూకంపం వల్ల ఉబికిన చమురు అనీ, అయితే ఇక్కడ చమురు నిల్వలున్నాయన్న మాట నిజమేనని రుజువయ్యిందనీ, కొడుకుతో అంటాడు డానీ (డానీ ఉత్థానం). ఇందులో అదృష్టమే కన్పించిందతడికి- అంతే గానీ, ఇక్కడ ఈ పగులు, పగులులోంచి చమురూ, రేపు బద్ధలవబోయే తన ప్లాంటుకి ముందస్తు హెచ్చరిక అని గమనించలేకపోయాడు. అలా వచ్చే ఇంటర్వెల్లో  ప్లాంట్ బద్ధలై అపార నష్టం జరుగుతోందని ఆందోళన పడే అసిస్టెంట్ కి - మన కాళ్ళ కింద చమురు సముద్రాలున్నాయని ఇలా తెలిసినందుకు సంతోషించవయ్యా మగడా, ఎందుకేడుస్తావ్ - అని మందలిస్తాడు డానీ. దురదృష్టంలో అదృష్టాన్ని చూసే ఆప్టిమిస్టు. మంచి వ్యాపార లక్షణమే, కానీ మానవత్వం లేదు.

***

      9. తిరిగి రాత్రి డిన్నర్ దగ్గర, దేవుణ్ణి నమ్ముతావా అంటాడు ఏబెల్. నమ్ముతాననని అబద్ధం చెప్తాడు డానీ. ఏ చర్చి కెళ్తావంటే ఏదో పేరు చెప్తాడు. అదెక్కడుందో చెప్పలేక దొరికి పోతాడు (ఏబెల్ ఉత్థానం). భూకంపాల గురించి నీ అభిప్రాయమేమిటని అడుగుతాడు ఏబెల్. అది దేవుడు ప్రదర్శించే శక్తి అంటాడు. కాదు - తాగుబోతులూ, అబద్ధాలకోర్లూ పెరిగి పోయినప్పుడు పరిశుద్ధాత్మ కన్నెర్ర జేసే పద్ధతి భూకంపం అంటాడు ఏబెల్ (ఏబెల్ ఉత్థానం). ఇలా డానీ అబద్ధాలకే ఇంటర్వెల్ బ్యాంగులో పరిశుద్ధాత్మ కన్నెర్ర జేసి ప్లాంటుని బద్దలు చేసిందన్న మాట.

        మిడిల్ 1 అంటే ప్రత్యర్ధితో సంఘర్షణ కాబట్టి, యాక్షన్ రియాక్షన్ల సిరీస్ కాబట్టి, అదిలా ఎదుర్కొంటున్నాడు మాటలతో డానీ. మిడిల్ 1 లో ఏది చూసినా మిడిల్ 1 బిజినెస్ గురించే జరుగుతోందని గమనించాలి. ఇక వేట కోసం భూములు కొంటానంటే, ఇప్పుడు కౌంటర్ ఇస్తాడు ప్రత్యర్ధి ఇలై. ఇవి చమురు భూములని చెప్పి (ఇలై ఉత్థానం). ఇలా ఇక్కడా దొరికి పోయి దారికొచ్చేస్తాడు డానీ (డానీ పతనం). వీళ్ళేదో హలెలూయా అని పాడుకుంటూ గడిపే అమాయక బృందమనుకున్నాడు. తీరా తన సమ ఉజ్జీలని తేలింది.
        భూముల ఆఫర్ తో వచ్చినప్పుడు పాల్ సండే, చమురు గురించి కుటుంబంలో ఎవరికీ తెలిసి వుండదని  చెప్పడంతో, ఈ ఎత్తుగడలు వేయాల్సి వచ్చింది డానీకి. కానీ ఇప్పుడు మతం ముందు పెట్టుబడి ఆటలు సాగడం లేదు. వాళ్ళు భూములకి డబ్బు కూడా ఎక్కువ గుంజారు (ఏబెల్ ఉత్థానం). చర్చి కోసం ఇలై ఇంకో పదివేలు చందా కూడా అదనంగా లాగాడు (ఇలై ఉత్థానం). చమురుచమురు అయింది డానీ పరిస్థితి ఆర్ధికంగా (డానీ పతనం).

***

        10. ఇక రియల్ ఎస్టేట్ డీలర్ దగ్గరికి పోతే, కొన్న భూముల మధ్య విలియం బాండీ అనే మొండి ఘటం భూములున్నాయని బయట పడింది. ఇప్పుడు పైపు లైను ఎలా వేస్తాడు. ఎలాటి బుద్ధికి అలాటి శుద్ధి (డానీ పతనం). ఇక ప్లాంటు ప్రారంభోత్సవంతో ఇలై మీద కక్ష తీర్చుకునే క్రమం ప్రారంభిస్తాడు. ప్రార్ధనకి ఇలైని లోపలికి రానివ్వకుండా అడ్డుగా నిలబడి, చెరో పక్క కొడుకునీ మేరీనీ నిలబెట్టుకుని, ప్లాంటుకి మేరీ అని పేరు ప్రకటిస్తూ ఝలక్కిస్తాడు (డానీ ఉత్థానం). మేరీ తన ఫ్యామిలీ అన్న లుక్కిస్తూ, ప్రార్ధన చేయట్లేదని మేరీని కొడితే వూరుకోనంటాడు (డానీ ఉత్థానం). మత వ్యతిరేకిననని పూర్తిగా బయట పడిపోతాడు. వీళ్లతో వియ్యమొందితే మతం గితం అనకుండా నోర్మూసుకు పడుంటారని మేరీని కలుపుకున్నాడు (డానీ ఉత్థానం).
         ప్రార్ధన లేకుండా చర్చి ప్రారంభోత్సవం కొడుకు చేత జరిపించేశాడు (డానీ ఉత్థానం). దీంతో ఇలై డానీ మీద పగబట్టిన్నట్టు పోరాటానికి దిగజారుతూ మత బోధకుడి ఔన్నత్యం వదిలేశాడు (పాజిటివ్ పాత్రగా ఇలై పతనం). చర్చి ప్రారంభోత్సవంలో ఒకావిడ సైతానుని వదిలిస్తూ, వెళ్లిపో వెళ్లిపో అంటూ పరోక్షంగా డానీని శపించాడు (నెగెటివ్ పాత్రగా ఇలై ఉత్థానం). మతబోధకుడైన తానే సైతానుగా మారుతూ తానూ నెగెటివ్ క్యారక్టరై పోయాడు. ఈ మిడిల్ 1 లో రెండు క్యారక్టర్లూ నెగెటివ్ గా మారే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ఇదంతా మిడిల్ 1 లో ప్రచ్ఛన్న యుద్దం. ఇక మిడిల్ 2 కి, ఇంటర్వెల్ తర్వాత ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఇలా ఫస్టాఫ్ ప్రచ్ఛన్న యుద్ధం, సెకండాఫ్ ప్రత్యక్ష యుద్ధం వేర్వేరు చేసి చూపడం వల్ల, సెకండాఫ్ నెక్స్ట్ లెవెల్ కెళ్ళినట్టు రసోత్పత్తి కల్గించినట్టయ్యింది.

***

     11. చర్చి సీను తర్వాత, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ప్లాంట్ లో రెండు ప్రమాదాలు జరుగుతాయి. వెంట వెంటనే రెండు ప్రమాదాలూ పునరుక్తి (రిపిటీషన్) అన్పించకుండా యుక్తిగా మేనేజ్ చేశాడు దర్శకుడు. ఒక ప్రమాదం తర్వాత ఇంకో ప్రమాదం వరసగా చూపిస్తే రిపిటీషన్  ఫీల్ కలిగే అవకాశముంది. అంతేగాక ఇంటర్వెల్లో కీలకమైన రెండో ప్రమాదం హై పాయింట్ అన్పించకుండా తేలిపోయే ప్రమాదముంది. దీన్ని దాటవేడానికి మొదటి ప్రమాదాన్ని మైనర్ ప్రమాదంగా చేసి, లైవ్ యాక్షన్ చూపించకుండా, డౌన్ ప్లే చేస్తూ, దాని గురించి కేవలం చెప్పిస్తూ, వెర్బల్ సీను వేశాడు.

        అంటే అర్ధరాత్రి అసిస్టెంట్ వచ్చి, డానీని లేపి, ప్రమాదం జరిగిందంటాడు. చమురు బావిలో వర్కర్ దుర్మరణం. ఇలా చెప్పించాక,  ప్రమాదం తాలూకు కొన్ని విజువల్స్ వేశాడు. ఇలా మొదటి ప్రమాదం లైవ్ యాక్షన్ గా లేకపోవడంతో, ఇంటర్వెల్లో మేజర్ ప్రమాదమైన రెండో ప్రమాదం, లైవ్ యాక్షన్లో రిపిటీషన్ బారిన పడకుండా తప్పించుకుని, హై పాయింట్ అవగల్గింది.

***

        12. ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగిన రాత్రే ప్రమాదం ప్రార్ధన చేయని ఫలితమని చెప్తాడు ఇలై (ఇలై ఉత్థానం). డానీ పట్టించుకోడు. పట్టించుకుని శాంతి జరిపించడం మత వ్యతిరేకిగా ఇష్టం లేదు. రెండో ప్రమాదం అసలు ప్లాంటే ధ్వంసమవుతూ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో ఎవరి ప్రాణాలూ పోవు, ఒక్క జూనియర్ డానీ బధిరుడవుతాడు.

        ఫ్యాక్టరీలు కడుతున్నప్పుడు ఎవర్నో ఒకర్ని కావాలని నిర్మాణంలో తోసేసి బలి ఇవ్వడమనే దురాచారం ప్రపంచవ్యాప్తంగా వుంది. డానీ ఇదే నమ్మాడు. పూర్వం డ్రిల్లింగ్ ప్లాంటు ప్రమాదంలో జూనియర్ డానీ తండ్రి దుర్మరణం... తర్వాత ఇంతకి ముందు ప్రమాదంలో చమురు బావిలో వర్కర్ దుర్మరణం. ఇతరుల ప్రాణాలు కాబట్టే ఇలా నమ్మాడు. దేవుణ్ణి నమ్మని డానీ బలుల్ని నమ్మడమేమిటి? వ్యాపారం కోసమే. దీన్ని తుడిచివేస్తూ, అసలు బలితో బాధ ఎలా వుంటుందో స్వయంగా అనుభవించమని, ఈ ఇంటర్వెల్ ప్రమాదంలో కొడుకునే చెవిటి వాడ్ని చేసి వదిలింది ప్రమాదం! (డానీ మహా పతనం).      

        అయినా డానీ డానీయే. కొడుకూ లేడు, బొంగూ లేదు. వాణ్ణి వ్యాపారానికి కుటుంబ హంగు కోసం పెంచుకున్నాడు. పాలల్లో సారా కలిపి తాగించిన సెంటిమెంటు. అందుకని ఇప్పుడీ సర్వం భస్మీపటలమైన ప్రమాదంలో కూడా పెద్ద వ్యాపారాన్నేచూశాడు- బాధపడుతున్న అసిస్టెంట్ తో -మన కాళ్ళ కింద చమురు సముద్రలున్నాయని ఇలా తెలిసి నందుకు సంతోషించి చావమని!

        ప్రకృతి చాలా చతురంగా చదరంగపు ఆట ఆడుతుంది. ఒక దెబ్బ కొడుతూనే ఇంకో దారి చూపిస్తుంది...దెబ్బ తప్పు తెలుసుకోవాలని, దారి ఇక మారి నడుచుకోవాలని. మారుతాడా డానీ? చూద్దాం సెకండాఫ్ లో.
        ఈ గాథ బాక్సాఫీసు పవర్ దీని ఫిలాసఫికల్ టచ్ లో వుంది. హాలీవుడ్డోళ్ళు ఫిలాసఫీ తీసినా డబ్బులు జల జలా రాల్చేట్టు ఎలా తీయాలో అలా కళ కళా తీస్తారు. అయితే విషయపరంగా చూస్తే ఈ గాథ ఇంటర్వెల్లో ముగిసినట్టే. ఏమీ మిగలకుండా డానీ మహా పతనంతో మత విజయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకేమిటి? సెకండాఫ్ లో ఇంకేం చూపిస్తాడు? గాథ ఇక్కడితో నూటికి నూరుపాళ్ళూ ముగిసిపోయినట్టే. మరెలా?

***

        13. నిన్న ఒక దర్శకుడు చెప్పిన కథతో ఇంటెర్వెల్లో ఇలాటి పరిస్థితే ఎదురయ్యింది. దీనికేంటో చెప్పమంటే ఏం చెప్పాలి. ప్లాట్ పాయింట్ 1 లో పాత్ర వదిలేసిన ఒక మోటివేషన్ వుంది. దాంతో కథనం మార్చి చూసినా ఇంటర్వెల్ కి కథ అయిపోతోంది. పాత్ర కోసం కథ పొడిగించి నడపకూడదు. అది బయటి నుంచి అతికింపు అవుతుంది. పాత్ర దాని కథ అదే నడుపుకోవాలి. ఆ నడుపుకునే మోటివేషన్ ఇంటర్వెల్ కే లక్ష్యం సాధిస్తోంది. పై గాథలో డానీ లాగా మహా పతనం కాక, విజయంతోనే. మరి ఇంటర్వెల్లో అయిపోయిన డానీ గాథని ఎలా పొడిగించాడు ఆ దర్శకుడు?

     ఇది అర్ధం గాలేదు. కానీ ప్రస్తుత దర్శకుడి కథకి ఎందుకో ఫీనిక్స్ పక్షి గుర్తుకొచ్చింది. ఐపోయిన కథ ఫీనిక్స్ లా బతికొస్తున్నట్టు ఒక విజువల్ ఫ్లాష్. ఫీనిక్స్ పక్షి కాలి భస్మమైనా, పూర్వీకుల బూడిద వాడుకుని తిరిగి బతికొస్తుందని గ్రీకు పురాణంలో కథ. ఐతే ఇంటర్వెల్లో అయిపోయిన కథలోంచి పాత్ర కూడా ఫీనిక్స్ పక్షిలా లేవచ్చా? ఏ పాయింటుతో లేవచ్చు? ఆ పాయింటు వస్తే, సమస్య తీరినట్టే.

        14. ఈ కొత్త సమస్యతో ఎట్లా అని గాథ ఇంటర్వెల్ సీను రాత్రి మళ్ళీ మళ్ళీ చూస్తూంటే, దర్శకుడి మాయ అప్పుడర్ధమైంది. మనమొక మూసలో సినిమాలు చూడ్డం అలవాటయ్యాక ఇలా మాయ చేస్తే ఏం చేస్తాం. ఇంటర్వెల్ సీన్లో హీరోకో, విలన్ కో జుట్టు చేతికంది - రారా ఇక చూసుకుందాం రా - లాంటి పంచ్ డైలాగేదో పేల్చిన షాటు మీద బ్రే...క్ అని వంకరటింకర లెటర్స్ వేస్తారు. ఇలా గాకపోయినా ఇంకెలాగైనా కథని బట్టి ముగింపు షాట్ మీదే ఏం చెప్తున్నారో, లేదా చూపించబోతున్నారో దాంతోనే ఇంటర్వెల్ వేస్తారు. దీనికి అలవాటుపడిన మనలాంటి బడుగు జీవులం, ఇంటర్వెల్ ముగింపు షాటు మీదే దృష్టి పెట్టి ఈ గాథని కూడా చూస్తూంటే- ఇంటర్వెల్ ప్రమాద ఎపిసోడ్ లో కొడుకు చెవులుపోయాయని డానీ తెలుసుకున్న బాధతో ఇది వుంటుంది.

        ఇది ఇంకా గాథ వుందని పంచ్ కాదు, బ్యాంగ్ కూడా కాదు. ఇది కూడా గాథకి ముగింపే. గాథని పొడిగించడానికి ఇక విషయం లేదు. కొడుకుని చెవిటి వాణ్ణి చేసిన ప్రమాదానికి ఇలై కారకుడు కాదు, డానీ అతడి మీద పగబట్టినట్టు చెప్పి గాథని పొడిగించడానికి. మరేం చేశాడు దర్శకుడు?

        వెనకే చేసి పెట్టేశాడు ఇదే ప్రమాద ఎపిసోడ్ లో. ప్లాంట్ సర్వం భస్మీపటలమైన ప్రమాదానికి బాధపడుతున్న అసిస్టెంట్ తో - మన కాళ్ళ కింద చమురు సముద్రలున్నాయని ఇలా తెలిసినందుకు సంతోషించమని డానీ అంటున్నప్పుడు - ఫీనిక్స్ పక్షిలా లేచిన డానీతో బాటే గాథ కూడా లేచొచ్చేసింది!!

        ఈ డైలాగుతో ఆ కాలిన బూడిదలోంచి బూడిదనే వాడుకుని ఫీనిక్స్ పక్షిలా మోటివేషన్ కొనసాగిస్తూ బతికొచ్చిన డానీతో, ఇంటర్వెల్ కి గాథ అయిపోకుండా సెకండాఫ్ కి ద్వారాలు తెరిచేసింది... అతను కాళ్ళ కింద ఇంకా చమురు సముద్రాల గురించి మాట్లాడుతూ, మత విజయాన్ని ఒప్పుకోవట్లేదు. ఇంకేంటి?

***

        15. ఈ మిడిల్ 1 ప్రారంభంలో ప్రారంభ డైలాగు అద్భుతమైన భావంతో  రాశాడు. వేటగాళ్ళుగా తండ్రీ కొడుకులు ఏబెల్ సండే రాంచ్ కి నడుచుకుంటూ వస్తున్నప్పుడు (మొదటి ఫోటో చూడండి), కొడుకుతో అంటాడు డానీ - రిమెంబర్ యువర్ సైలెన్స్ అని. నా వెనుక కాదు, పక్కన నడవమని. ఏమిటి దీని భావం? రిమెంబర్ యువర్ సైలెన్స్ అంటే? కొడుకుకి చెప్పి వుంటాడు...మనం ఆయిల్ కోసం భూములు కొనడానికి వచ్చినట్టు నువ్వు అనెయ్యకూడదు. నువ్వు సైలెంట్ గా వుండాలి. మనం వేట కోసమని భూములు కొనడానికి వచ్చినట్టే వాళ్ళకి తెలియాలి... ఇలా నేర్పి వుంటాడు. ఇది మళ్ళీ గుర్తు చేసేందుకే - రిమెంబర్ యువర్ సైలెన్స్ అన్నాడు. ఇదంతా ఈ  వేటగాళ్ళుగా రావడంలోని మర్మం తర్వాతి సీన్లలో తెలిసినప్పుడు మనకి అర్ధమవుతుంది.

        మరి - నా వెనుక కాదు, పక్కన నడవాలనడం? కొడుకుని బిజినెస్ పార్టనర్ గా చెప్పుకుంటున్నాడు కాబట్టి, పక్కన నడవకపోతే చూసిన వాళ్ళు కన్విన్స్ కారని.

        డైలాగులు కథ గురించే వుంటాయి. పాత్రలనుభవిస్తున్న కథ లోంచే డైలాగులు వస్తాయి. ఏ డైలాగు చెప్పినా అది కథే అవాలి. ఏంట్రా ఆ నడకా, రా! అంటే, టైరై పోయా నాన్నా! ఇవి డైలాగులా?

        దీనితర్వాత ఏబెల్ ఎదురవడంతో పలకరిపులయ్యాక, భూకంపం గురించి అడు గుతాడు డానీ. ఈ భూకంపం గురించిన ఒక డైలాగు, డైలాగులు డైలాగులుగా ఎలా మలుపులు తిరుగుతూ వెళ్ళివెళ్ళి - ఇంటర్వెల్లో భూకంపం లాంటి బ్లాస్ట్ తో ఎలా ఢామ్మని కనెక్ట్ అయ్యిందో పైనే చెప్పుకున్నాం. మిడిల్ 1 ఓపెనింగ్ డైలాగు మిడిల్ 1 ముగింపుకి ఫినిషింగ్ టచ్. ఎవ్విరీ థింగ్ ఈజ్ కనెక్టెడ్.

        మరి అసలు మిడిల్ 1 మొదటి డైలాగు రిమెంబర్ యువర్ సైలెన్స్ కి పైన చెప్పుకున్న భావమొకటేనా, ఇంకేదైనా కనెక్షన్ వుందా? ఇంటర్వెల్ ప్రమాదంలో కొడుకు సైలెన్స్...సైలెన్స్, సైలెన్స్... ఇక ఏమీ వినిపించని సైలెంట్ ప్రపంచమే అయ్యిందిగా చెవిటి వాడైపోయి!!

        డానీ నోటి మాట ఇలా వుంటుంది. అన్నాడంటే దరిద్రమే. ఎప్పుడైతే బుద్ధి బావుండదో, శాస్తి జరగడానికి ఇలాటి మాటలే వస్తాయి. ఏమిటిందులో నీతి? దేనికోసమో పన్నే మీ వ్యూహాల్లో అమాయక పిల్లల్ని భాగస్వాములు చేయకండి, ఆ పాపం వాళ్ళకే కొడుతుంది...ఇప్పుడు వెనుక కాదు, పక్కనా కాదు, ఇంకెక్కడా వుండలేని బధిర భాగస్వామి అయ్యాడు పసి డానీ!

సికిందర్

(కొందరి కథలు చూడాల్సి రావడం వల్ల
 ఆర్టికల్ కి ఈ ఆలస్యం)