రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, మే 2023, శుక్రవారం

1330 : సాంకేతికం


 

సినిమా నిర్మాతలు లొకేషన్స్ కోసం దేశంలోగానీ, విదేశాల్లోగానీ ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండా, స్టూడియోలోనే ఆయా దృశ్యాల్ని షూట్ చేసుకునే సదుపాయం ఏమైనా వుందా అంటే, దానికి అన్నపూర్ణ స్టూడియోస్ -క్యూబ్ సినిమాస్ జాయింట్ వెంచర్ వుందనే సమాధానం చెప్తోంది. ఏఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ అనే సాంకేతిక సదుపాయం దేశంలోనే సరి కొత్త అథ్యాయానికి హైదరాబాద్ లో శ్రీకారం చుట్టింది.

        క నిర్మాతలు లొకేషన్స్ గురించి వెనుకాడకుండా, కోరుకున్న లొకేషన్స్ తో కథల్ని రూపొందించుకునే వెసులుబాటు కలుగుతోంది. ఈ సదుపాయం నిర్మాతల్ని భౌతికంగా లొకేషన్స్ కెళ్ళకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో వాస్తవ- వర్చువల్ అంశాల్ని మిళితం చేయడానికి, దృశ్యాల్ని చిత్రీకరించడానికీ  అనుమతిస్తుంది. ఏఎ న్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ గా నామకరణం చేసిన ఈ టెక్నాలజీతో  సినిమా నిర్మాణంలో లొకేషన్స్ తో రాజీపడకుండా కథల్ని రూపొందించుకునే స్వేచ్ఛని పొందగల్గు తారు. దీనికి గాను అత్యాధునిక ఐసీవీఎఫెక్స్ (ఇన్-కెమెరా విజువల్ ఎఫెక్ట్స్) సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ -క్యూబ్ సినిమా సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి.
        
గతేడాది అక్టోబర్ నుంచే ఈ టెక్నాలజీకి సంబంధించి ప్రయోగాలు ప్రారంభించారు. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలపై  ప్రయోగాలు సంతృప్తి నిచ్చాక సినిమాల కోసం మార్కెట్లో ప్రవేశపెట్టారు.
        
ఈ సదుపాయంలో అత్యాధునిక హై బ్రైట్‌నెస్-కర్వ్డ్ ఎల్ఈడీ వాల్, టాప్-ఆఫ్-ది-లైన్  ఏఓటీఓ ఎల్ఈడీ డిస్‌ప్లేలు, రెడ్ స్పై నుపయోగించి అత్యాధునిక కెమెరా ట్రాకింగ్- కస్టమ్-బిల్ట్ రెండరింగ్ సిస్టమ్‌లు వున్నాయి.
         
క్యూబ్ దైన సాంకేతిక పరిజ్ఞానానికి, స్టూడియోల్ని నడపడంలో అన్నపూర్ణ సంస్థ అనుభవం తోడై, ఈ వర్చువల్ స్టేజ్ సుసాధ్యమయింది. ఇది కంటెంట్ ప్రొడక్షన్‌లో కొత్త శకానికి నాంది. నిర్మాతలు అత్యంత సమర్థవంతంగా, ఖర్చుని ఆదా చేసే పద్ధతిలో పని చేయడానికి అనుమతించే పర్యావరణ వ్యవస్థని  రూపొందించడానికి ఈ స్టేజి కట్టుబడి వుంది.
        
అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా రెండూ భారతీయ మీడియా వ్యాపారంలో రెండు పేరు ప్రతిష్టలున్న సంస్థలు. స్టేజ్ కి గల సమగ్ర వర్క్ ఫ్లో సొల్యూషన్ నిర్మాతలకి  అపూర్వమైన సౌలభ్యాన్ని, నియంత్రణనూ అందజేస్తుంది, వారి సృజనాత్మక లక్ష్యాల్ని  ఎటువంటి పరిమితులు లేకుండా సాధించడానికి వీలు కల్పిస్తుంది.
         
నిర్మాతలు ఇప్పుడు వాస్తవ - వర్చువల్ దృశ్యాల్ని సజావుగా మిళితం చేయవచ్చు. వాతావరణాన్ని, వెలుతురుని తమ ఇష్టానుసారంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి వుంటారు. అంతేగాక ఎక్కువ సృజనాత్మక నియంత్రణ వారికి లభిస్తుంది.
        
అన్నపూర్ణ స్టూడియోస్ చలనచిత్ర పరిశ్రమకి అందించే మౌలిక సదుపాయాలకు,  సేవలకూ ప్రసిద్ధి చెందింది. సాంప్రదాయ ఫిల్మ్ స్టూడియోగా, ప్రొడక్షన్ హౌస్‌గా ప్రారంభమై, నేడు ఇది అన్ని మీడియా ఫార్మాట్‌ల కోసం ఎండ్-టు-ఎండ్ సేవలతో అంతర్జాతీయ స్థాయి స్టూడియోగా రూపాంతరం చెందింది. లెగసీ బ్రాండ్‌గా 'అన్నపూర్ణ' ఉత్పత్తి, పంపిణీ, మౌలిక సదుపాయాల విషయంలో ముందుంది. మీడియా పరిశ్రమకి కొత్త సాంకేతికాల్ని, వ్యాపార నమూనాల్నీ తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.
        
ఇక గత మూడు దశాబ్దాలుగా దేశంలోని మీడియా పరిశ్రమని మార్చడంలో క్యూబ్ సినిమా విజయం సాధించింది. ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ ఫ్లోలను బాగా మెరుగుపరచగల సాంకేతికతని గుర్తించి, అవలంబించగల సామర్థ్యానికి నిదర్శనంగా ఈ సంస్థ వుంది. కంటెంట్ ఉత్పత్తిలో తదుపరి పరిణామ దశ అయిన వర్చువల్ ప్రొడక్షన్‌తో నేటి వేగవంతమైన, డిమాండ్‌తో కూడిన వినోద వాతావరణం కోసం, ఉత్పత్తి ప్రక్రియని  మళ్ళీ రూపొందించడానికి అన్నపూర్ణ - క్యూబ్‌ల మధ్య గల ప్రత్యేకమైన సహకారం ఈ అనుభవాన్ని అందిస్తుంది.
        
ఏఎన్నార్  వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ప్రారంభాన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమకి  గేమ్-ఛేంజర్ గా, ప్రపంచ వినోద పరిశ్రమలో భారతదేశ వినోద రంగం గణనీయమైన ముందడుగు వేస్తున్న పరిణామంగా భావించ వచ్చు. వర్చువల్ ప్రొడక్షన్ స్టేజి భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ-స్థాయి శాశ్వత ICVFX సౌకర్యం. ఇది లాజిస్టిక్స్ లో, ప్రొడక్షన్‌లో గణనీయమైన ఖర్చుని ఆదా చేస్తుంది.
        
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ అత్యాధునిక టీపీఎన్ -సర్టిఫైడ్ డాల్బీ ఆమోదించిన పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలతో పాటు, సినిమా- మీడియా పరిశ్రమ కోసం 11 షూటింగ్ అంతస్తులతో, లొకేషన్ సౌకర్యాలతో  అత్యుత్తమ మౌలిక సదుపాయాల్ని  అందిస్తోంది. డేటా స్టోరేజ్, వీడియో ఎడిటింగ్, ఆడియో డబ్బింగ్, 4K కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్, మాస్టరింగ్ వంటి బహుళ సేవల్ని అందిస్తోంది.
        
అన్నపూర్ణాలో ప్రారంభమయిన వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ని ఆన్-సెట్ వర్చువల్ ప్రొడక్షన్ ( OSVP ), వర్చువల్ ప్రొడక్షన్ ( VP ), లేదా ఇన్-కెమెరా విజువల్ ఎఫెక్ట్స్ ( ICVFX ) అని కూడా పిలుస్తారు. ఇది టెలివిజన్ లేదా మూవీ ప్రొడక్షన్ కోసం ఎల్ ఈడీ ప్యానెల్స్ నుపయోగించే వినోద సాంకేతికం. ఇందులో సెట్స్ కి బ్యాక్ డ్రాప్ కోసం వీడియో లేదా సీజీ చిత్రాల్ని రియల్ టైమ్ లో ప్రదర్శించవచ్చు. ‘స్టార్ వార్స్ నిర్మాత జార్జి లూకాస్ కి చెందిన ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ (ఐ ఎల్ ఎం) స్టూడియో అభివృద్ధి చేసిన ఈ స్టేజి క్రాఫ్ట్ ని 2019 లో మాండలోరియన్ సినిమాలో ఉపయోగించిన తర్వాత, ఈ టెక్నాలజీ విస్తృతంగా వాడకం లోకి వచ్చింది.
            
2019లో ఐ ఎల్ ఎం ఆవిష్కరణ తర్వాత నుంచి  అక్టోబర్ 2022 నాటికి దాదాపు 300 సంస్థలు స్టేజిలని అందిస్తున్నాయి. కోవిడ్ లాక్ డౌన్ ల సమయాల్లో ఔట్ డోర్ షూటింగులకి అవకాశం లేని నేపధ్యంలో స్టూడియోల్లో ఈ వర్చువల్ స్టేజిలు వెలిశాయి. మన దేశంలో ఆలస్యంగా ఇప్పుడు అన్నపూర్ణాలో వెలసింది. మార్చి 2023 లోనే , ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలోని డాక్ ల్యాండ్ స్టూడియోస్ లో, ప్రపంచంలోనే అతి పెద్దడైన వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ప్రారంభమైంది.
        
ఈ టెక్నాలజీ ప్రారంభమయిన 2019 నుంచి 17 టీవీ సిరీస్, 22 హాలీవుడ్ సినిమాలు నిర్మాణం జరుపుకున్నాయి. బ్లాక్ ఆడమ్, బుల్లెట్  ట్రైన్, టాప్ గన్- మెవరిక్, రెడ్ నోటీస్, ది బ్యాట్ మాన్, స్టార్ వార్స్- ది రైజ్ ఆఫ్ స్కై వాకర్ మొదలైన సినిమాల్లోని ఔట్ డోర్ దృశ్యాల్ని ఈ టెక్నాలజీ పరంగా చూడొచ్చు


18, మే 2023, గురువారం

1329 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : నందినీ రెడ్డి
తారాగణం: సంతోష్ శోభన్, మాళవికా నాయర్, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు
స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం: మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
విడుదల : మే 18, 2023
***

        యువ హీరో సంతోష్ శోభన్ 2011 లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచీ నటించిన 9 సినిమాలూ సక్సెస్ కి దూరంగా వుండిపోయి స్ట్రగుల్ చేస్తున్న సందర్భంలో, 10 వ అవకాశంగా అన్నీ మంచి శకునములే విడుదలైంది. ఒక్క గత సంవత్సరమే నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, కళ్యాణం కమనీయం’, శ్రీదేవీ శోభన్ బాబు మూడూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఇప్పుడు పేరున్న దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2019లో కొరియన్ రీమేక్ ఓహ్ బేబీ హిట్ తర్వాత నాల్గే ళ్ళకి నందినీ రెడ్డి  కొత్త సినిమా వెండితెర నలంకరించింది. మహానటి, సీతా రామం వంటి హిట్స్ అందించిన స్వప్న సినిమా సంస్థ నుంచి తాజాగా వస్తున్న కుటుంబ ప్రేక్షకుల సినిమా అన్పి స్తున్న  అన్నీ మంచి శకునములే ఎలా వుంది? మళ్ళీ కుటుంబ ప్రేక్షకులకి అదే పాత కాలక్షేపమా, లేక కొత్త ఉత్సాహమేమైనా వుందా పరిశీలిద్దాం...

కథ  

ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్), సుధాకర్ (నరేష్) కుటుంబాల మధ్య వాళ్ళ ముత్తాతలు సంపాదించిన కాఫీ ఎస్టేట్ గురించి తగాదాలుంటాయి. ఈ తగాదాలుండగా, సుధాకర్ కొడుకుగా రిషి (సంతోష్ శోభన్), ప్రసాద్ కూతురుగా ఆర్య (మాళవికా నాయర్) పుడతారు. ఒకే సమయంలో పుట్టిన వీళ్ళిద్దరూ హాస్పిటల్లో చేతులు మారిపోతారు. దీంతో ప్రసాద్ కొడుకుగా రిషి, సుధాకర్ కూతురుగా ఆర్య పెరిగి ప్రేమలో పడతారు. ఆర్య కాఫీని విదేశాలకి ఎగుమతి చేయాలనే బిజినెస్ మైండ్ తో వుంటుంది.రిషి ఈ క్షణం ఎంజాయ్ చేయాలన్న లేజీ మైండ్ తో వుంటాడు. మరి భావాలు కలవని వీళ్ళిద్దరి ప్రేమ ఏమైంది? తాము పుట్టుకతో చేతులు మారిపోయామని ఎప్పుడు తెలుసుకున్నారు? వీళ్ళు తారుమారైన సంగతి కుటుంబాలకెప్పుడు తెలిసింది? కాఫీ ఎస్టేట్ తగాదా ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఒక ప్రేక్షకుడు దీన్ని 1952 నాటి కథగా ట్వీట్ చేశాడు. నిజమే, యూట్యూబ్ లో ప్రేక్షకులు బోలెడు పాత కుటుంబ సినిమాల్ని తనివిదీరా ఎంజాయ్ చేస్తూండగా, అదే మళ్ళీ నందినీ రెడ్డి తీయడమెందుకు? ఈ కాలపు కొత్త కుటుంబ కథ చెప్పొచ్చుగా? ఒక హాస్పిటల్, ఇక్కడ ఇద్దరు పిల్లలు పుట్టడం, ఇద్దరు నర్సులు పొరబడి ఆ పిల్లల్ని తారుమారు చేయడం- వంటి కథలతో ఎన్ని తెలుగు, హిందీ, తమిళ సినిమాలు రాలేదు. బ్రిటన్ లో డినైజ్ రాబిన్స్ కూడా 50 ఏళ్ళ  క్రితం ఈ ఫార్ములాతోనే నవలలు రాసింది.
       
ఇక రెండు కుటుంబాల మధ్య తగాదాలనే ఇంకో పాత ఫార్ములా కలిపి చేసేస్తే ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా అవుతుందని దర్శకురాలు భావించింది. కానీ తెరమీద వేరేగా వచ్చింది. అక్కడక్కడా కొన్ని నవ్వించే సీన్లు మాత్రం వర్కౌట్ అయ్యాయి తప్పితే
, మొత్తం కథగా దీన్ని కొత్తగా చెప్పలేని అవే పాత సన్నివేశాల్ని చూపించే ట్రాప్ లో పడిపోవడంతో, రెండు గంటలా 34 నిమిషాల సుదీర్ఘ సహన పరీక్ష అయిందీ సినిమా. దర్శకురాలు ప్రేక్షకులతో కలిసి చూస్తే వాళ్ళు పడే బాధ తెలుస్తుంది. బోరుకైనా పరిమితి వుంటుంది.
       
తెలుగులో ఇక కుటుంబ సినిమాలు తీయకపోవడం ఉత్తమం. పాత కథలే తీసినా
, కనీసం యూట్యూబ్ పాత సినిమాల్లోని భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, నాటకీయతా కాపీ చేసైనా తీయలేనప్పుడు తీయడం వృధా!

నటనలు- సాంకేతికాలు

సంతోష్ శోభన్ టాలెంట్ వున్న నటుడు. ప్రతీసారీ టాలెంట్ ని నిరూపించుకుంటూనే వున్నాడు కానీ, సినిమాలే సహకరించడం లేదు. అతడి టాలెంట్ కి కలిసొచ్చే అంశం ఈజ్. ఎలాటి పాత్రనైనా ఈజ్ తో సహజంగా నటించేస్తాడు. ఇది మూడో సినిమా తనూ నేను తోనే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సారికూడా పాత్ర కుదర్లేదు. కారణం కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. ముగింపులో మాత్రం భావోద్వేగాలతో కట్టి పడెసే నటన కనబర్చాడు. ఇక కుటుంబ దృశ్యాల్లో చాలా సార్లు సీనియర్ నటుల డామినేషన్ తో డ్యామేజీ అయ్యాడు. దీన్ని బ్యాలెన్స్ చేయలేదు దర్శకురాలు. మాళవికా నాయర్ తో రొమాన్స్ కూడా విషయం లేక ఫ్లాట్ గా సాగడంతో రాణించడం కష్టమై పోయింది శోభన్ కి. రెండు పాటలైనా ఆదుకుని వుంటే సినిమాలో వున్న బోరు కొంత తగ్గేది.
       
మాళవికా నాయర్ పాత్రకి వ్యాపార దృక్పథముంది గానీ దీని తాలూకు పాత్రచిత్రణ కొరవడింది. ఆదర్శాలు మాటల వరకే
, ఆలోచనలు విషయం లేని ప్రేమ గురించే అన్నట్టుగా వుంది. ఇక సహాయ పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, రావురమేష్, నరేష్, గౌతమి ఇంకా చాలా మంది నటీనటులు, వాళ్ళ కోపాలు, ఆనందాలు, పాటలూ ఏవీ ప్రేక్షకులకి తాకకుండా, తామరాకుపై నీటి బొట్టు టైపులో వుండిపోతారు.
       
మిక్కీ జె మేయర్ సంగీతం ఎవరేజ్ గా వుంది. కూనూరు
, ఇటలీ లొకేషన్స్ లో సన్నీ, రిచర్డ్స్ ల కెమెరా వర్క్ టైటిల్ కి తగ్గ మూడ్ తో వుంది. లక్ష్మీ భూపాల రాసిన మాటలు వుండాల్సిన చోట బలంగా, లేని చోట్ల తేలికగా వున్నా, మొత్తం కథని డ్రైవ్ చేసే ఫ్లో తో లేవు. ఎందుకంటే కథకే ఒక ఫ్లో లేదు. కారణం షేక్ దావూద్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే కాకుండా స్క్రీన్ ఫ్లూ అయి వ్యాపించడం. మళ్ళీ దీనికి కారణం కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఎంత స్లోగా సాగాలో అంత స్లోగా సినిమా సాగి తీరుతుంది.

చివరికేమిటి?

కథలో కాన్ఫ్లిక్ట్ మర్చిపోయి ఎవరైనా సినిమా తీస్తారా? తీస్తే ఏం కథ చూస్తున్నామో అర్ధమవుతుందా? కథంటేనే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ). రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల కాన్ఫ్లిక్ట్ వుంది- ఇది వెనక్కి వెళ్ళిపోయి, నానా తిప్పలుపడి ఎలాగో హీరోహీరోయిన్ల మధ్య ఇంటర్వెల్లో ఇగోలకి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. దీంతో సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుకుని చూస్తే, హీరోహీరోయిన్లు ఇగోల తగాదాలే మర్చిపోతారు. దీంతో ఏ కాన్ఫ్లిక్ట్ లేని కథ - సంబంధం లేని సీన్లతో, కామెడీలతో చివరి వరకూ సహనాన్ని పరీక్షిస్తూ తీసికెళ్ళి - ఆనాడు పుట్టుకతో హీరోహీరోయిన్లు తారుమారైన విషయం బయటపడి సుఖాంత మవుతుంది.
       
కథలో ఒక చోట ఒక పాయింటు ఉత్పన్న మవుతుంది- పుట్టి తారుమారురైన హీరో ఆ పెంపుడు తల్లి స్వభావంతో పెరుగుతాడు. హీరోయిన్ ఆ పెంపుడు తండ్రి స్వభావంతో పెరుగుతుంది. అప్పుడు తాము తారుమారైన విషయం తెలిస్తే ఆ పెంపుడు తల్లి
, ఆ పెంపుడు తండ్రి స్వభావాల్ని పుణికి పుచ్చుకుని పెరిగిన తాము, వాటిని కలుషితం చేసుకోలేక-  నిజం బయటపడకుండా చేసే ప్రయత్నాలతో కాన్ఫ్లిక్ట్ పుట్టి వుంటే- ఇది యూత్ అప్పీలున్న హీరోహీరోయిన్ల కథగా కాస్త నయమన్పించుకునేది.

—సికిందర్

 

16, మే 2023, మంగళవారం

1328 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : నెల్సన్ వెంకటేశన్
తారాగణం : ఐశ్వర్యా రాజేష్, జితన్ రమేష్, సెల్వరాఘవన్, అనుమోల్ తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం :  గోకుల్ బెనోయ్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
విడుదల : మే 12, 2023
***

        హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ సినిమాలు ఫిబ్రవరి -మే మధ్య 4 నెలల్లో 4 విడుదలయ్యాయి. ఇంకో 8 నిర్మాణంలో వున్నాయి. ఈమె హీరోల పక్క ఆడిపాడే రెగ్యులర్ హీరోయిన్ గా గాక, హీరోయిన్ ప్రధాన సినిమాలు నటిస్తూ ప్రత్యేక స్థానం పొందింది. అభిమానులు ఆమెని సూపర్ స్టార్ అనేశారు. సినిమాలు కూడా అలాగే హిట్ట వుతున్నాయి. ఈ నాలుగు నెలల్లో  ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, రన్ బేబీ రన్’, సొప్పన సుందరి’, ఫర్హానా. తెలుగులో 2019 లో కౌసల్యా కృష్ణ మూర్తి తో ప్రారంభించి, మిస్ మ్యాచ్’, వరల్డ్ ఫేమస్ లవర్’, టక్ జగదీష్’, రిపబ్లిక్ లలో నటించింది. 7 కోట్ల బడ్జెట్ తో తీసిన ఫర్హానా తమిళ తెలుగు హిందీ భాషల్లో విడుదలైంది.
        
థ్రిల్లర్ని ముస్లిం సినిమాగా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న ప్రశ్నకి- మలయాళంలో, హిందీలో ఎన్నో ముస్లిం సినిమాలు తీస్తున్నప్పుడు, తమిళంలో తనెందుకు తీయకూడదని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ సమాధానమిచ్చాడు. ఇటీవల తెలుగులో హిట్టయిన మసూద అనే చేతబడి సినిమాని ముస్లిం సినిమాగా తీసినప్పుడు పాతబడిపోయిన చేతబడి కథలకి కొత్త ప్రాణం పోసినట్టయింది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలనే నేపథ్యాలు మారిస్తే కొత్తవైపోతాయి. ఈ మార్కెట్ యాస్పెక్ట్ తోనే వచ్చిన ఫర్హానా అనే థ్రిల్లర్ ఎలా వుందో చూద్దాం...

కథ

చెన్నై ట్రిప్లికేన్ గల్లీల్లో దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫర్హానా (ఐశ్వర్యా రాజేష్) పిల్లలతో, భర్త కరీం (జితన్ రమేష్) తో, తండ్రి అజీజ్ భాయ్ తో నివసిస్తూ వుంటుంది. తండ్రి సాంప్రదాయవాది, కఠినంగా వుంటాడు. భర్త సౌమ్యుడు. తండ్రి నడిపే చెప్పుల షాపులో పనిచేస్తూంటాడు. ఆన్లయిన్ వ్యాపారాలు పెరగడంతో చెప్పుల షాపుకి కస్టమర్లు రావడం తగ్గిపోతారు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు చూసి ఫర్హానా ఉద్యోగం చేస్తానంటుంది. తండ్రి వ్యతిరేకిస్తాడు. భర్త ఒప్పుకుంటాడు. ఫర్హానాకి కాల్ సెంటర్ లో పనిచేసే నిత్య (అనుమోల్) అనే ఫ్రెండ్ వుంటుంది. ఆమె కాల్ సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తుంది. ఇంట్లో మగ్గిన జీవితంలోంచి బయటి ప్రపంచంలోకి, బయటి ప్రపంచంలో ఆర్ధిక స్వావలంబన లోకీ ఆమె జీవితం థ్రిల్లింగ్ గా మారిపోతుంది.
        
ఇంతలో కొడుకు అనారోగ్యానికి ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో కాల్ సెంటర్ లో ఎక్కువ జీతం వచ్చే సెక్షన్ కి మార్పించమని నిత్యని కోరుతుంది. ఆ సెక్షన్ లో పని చేస్తున్న నిత్య, అదే సెక్షన్ కి ఫర్హానాని మార్పిస్తుంది. ఇక్కడ పనిచేయడం మొదలెట్టిన ఫర్హానాకి షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇది సెక్స్ చాట్ సెక్షన్. కాలర్స్ తో సెక్సీగా మాట్లాడి సంతృప్తి పర్చాలి.
        
ఏం చేయాలో అర్ధంగాక, మానెయ్యలేక, అలాగే పనిచేస్తున్న ఫర్హానాకి ఒక కాలర్ కాల్స్ చేయడం మొదలెడతాడు. ఇతను మర్యాదస్తుడిలా వుంటాడు. కవిత్వం మాట్లాడతాడు. బాధల్లో వున్నట్టు అనిపిస్తాడు. సానుభూతితో దగ్గరవుతుంది. దగ్గరయ్యాక కలవాలంటాడు. ఇలా అన్నాక మొదలవుతుంది ఆమెకి అతడితో అసలు కథ. ఏమా కథ? అతడ్ని ఎలా కలుసుకుంది? కలుసుకుంటే ఏం జరిగింది? అసలతను ఎవరు? ఏ ఉద్దేశంతో ఆమెని ట్రాప్ చేశాడు? చివరికి ఆమె జీవితం ఏమైంది?... ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా సినిమాలో తెలుస్తాయి.

ఎలా వుంది కథ

ఆప్యాయంగా మాట్లాడినంత మాత్రాన అపరిచితులకి ఫిదా అయిపోకూడదని చెప్పే కథ. ఈ కథలో కాల్ సెంటర్ లో దాదాపు ఉద్యోగినందరూ ప్రొఫెషనల్ గానే వుంటారు. కాలర్స్ తో ఎఫైర్స్ కి దూరంగా వుంటారు. ఒక ఉద్యోగిని ఫోన్ సెక్స్ తో రియల్ సెక్స్ ట్రాప్ లోకి లాగిన వాడికి పడిపోయి హత్యకి గురవుతుంది. ఫర్హానా కాలర్ మాటల్ని పర్సనల్ గా తీసుకుని ఫ్రెండ్ అవుదామనుకుంటుంది. దీనికి కారణం చివర్లో భర్తకి చెప్తుంది- మన కష్టాలు తప్ప మనం ఏమీ మాట్లాడుకోలేదు, సడెన్ గా వాడు బాగా మాట్లాడేసరికి దగ్గరయ్యానని. ఇంట్లో ఈతిబాధలు తప్ప ఇంకేం ముచ్చట్లాడుకోక పోతే బయటి వ్యక్తులకి ఇలాగే పడిపోతారని చెప్పడం.
          
లిప్ స్టిక్ అండర్ మై బురఖా (2016) లో రోజీ అనే ఆమ్మాయి ఒక యువకుడితో ఫోన్ సెక్స్ చేస్తూంటుంది. చివరి కతను పెళ్ళికి కూడా సిద్ధమైపోతాడు. తీరా చూస్తే ఆమె 55 ఏళ్ళ విడో ఉషా అనీ, తను బకరా అయ్యాననీ తెలుసుకుని ఆమె సామానంతా  విసిరేసి, ఆమెని వీధిలోకి నెట్టేస్తాడు. వీధిలో ఆమె పరువంతా పోతుంది. ఆన్లయిన్ పరిచయాలతో ఇలాటివి కూడా జరుగుతూంటాయి.
        
ఇది ఫర్హానా పాత్ర దృష్టి కోణంలో సాగే కథ. దాదాపు ప్రతీ సీనులో తనుంటుంది. అయితే తను బకరా అవదు. త్వరలోనే కాలర్ ఉద్దేశం పసిగట్టి దూరం పెట్టడం మొదలెడుతుంది. అతను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆమె భయాల్నీ కష్టాల్నీ పెంచేస్తాడు. ఇల్లు కనుక్కుని అక్కడిదాకా వచ్చేస్తాడు. అయితే ఎవరి కంటా పడకుండా గేమ్ ఆడుతూంటాడు. అతనెలా వుంటాడో ఆమెకి తెలియదు. ప్రేక్షకులకి కూడా కనపడడు. గొంతు మాత్రమే విన్పిస్తూంటుంది. ఈ సస్పెన్స్ ఫ్యాక్టరే ఈ థ్రిల్లర్ ని నిలబెట్టింది. అయితే ఫస్టాఫ్ లో, అలాగే సెకండాఫ్ లో కొన్ని చోట్ల డ్రాప్ అయిపోతుంది వేగం. దీనికి కారణం ఫర్హానా పాత్ర నిదానంగా వుండడం.  
        
ఇది హీరోయిన్ పాత్ర దృక్కోణంలో హీరోయిన్ ప్రధాన కథయినప్పుడు, ముగింపులో ఆమె గెలుపు కుటుంబం చేతుల్లోకి, ఇంకొందరి చేతుల్లోకీ వెళ్ళి పోకుండా తన చేతిలోనే వుండుంటే- ఇది ఉమన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్న కథగా బలంగా వుండేది. కాలర్ ఎంత సీక్రెట్ గా ఆపరేట్ చేస్తున్నాడో, అంత సీక్రెట్ గా ఆమె ఈ లేకి వ్యవహారం బయటగానీ, ఇంట్లోగానీ తెలిసిపోకుండా మేనేజ్ చేసి కాలర్ ని దెబ్బకొట్టి వుంటే - క్యారక్టర్ ప్రేక్షకాభిమానం బాగా పొంది వుండేది. ఐశ్వర్యా రాజేష్ రియల్ సూపర్ స్టార్ అయ్యేది.

నటనలు - సాంకేతికాలు

పాత్రని తడుముకోకుండా నటించేసింది ఐశ్వర్యా రాజేష్. కమర్షియల్ సినిమా హీరోయిన్ గా కాదు, సెమీ రియలిస్టిక్ హీరోయిన్ గా సహజ భావోద్వేగ ప్రకటనతో. ఈ సినిమాలో దర్శకుడు ప్రేక్షకుల్ని కథాప్రపంచంలో మాత్రమే ఇన్వాల్వ్ చేయడు, క్యారక్టర్ వరల్డ్ లోకి కూడా తీసికెళ్తాడు. ఈ క్యారక్టర్ వరల్డ్ లో ఐశ్వర్యా రాజేష్ పాత్రకి ఇల్లే లోకంగా ఇంటి పని, వంటపని; తండ్రితో, భర్తతో, పిల్లలతో సంబంధాలు; కుటుంబ ఆర్ధిక సమస్యలు, బాధ్యతలు;  బయట కాల్ సెంటర్ లో పూర్తిగా వేరైన కార్పొరేట్ ప్రపంచంతో వ్యవహరించడం, ఈ ఆనందంలో కాలర్ తో చేదు అనుభవాలూ-  ఇవన్నీ తడుముకోకుండా నటించేసింది.
        
పాత్రకి ఇంకో తత్వం కూడా వుంది-  మతం పట్ల విశ్వాసం, ఐదు పూటలా నమాజు, రంజాన్ ఉపవాసాలు, జకాత్, రంజాన్ విందు వినోదాలూ కథాక్రమంలో కథలో కలిసిపోయేలా చేసుకు పోతూంటుంది. ఇక హజ్ కి వెళ్ళడమే మిగిలింది. అయితే రంజాన్ కి ఫ్రెండ్ నిత్యని పిలవడం మర్చిపోయినట్టున్నాడు దర్శకుడు. కొడుకు బర్త్ డేకి మాత్రం కాల్ సెంటర్లో స్వీట్లు  పంచమన్నాడు.
        
సౌమ్యుడైన భర్తగా, కళ్ళు దించుకుని మాట్లాడే పాత్రలో జింతన్ రమేష్ ఇంకో రియలిస్టిక్ క్యారక్టర్ కి న్యాయం చేశాడు. అలాగే నిత్య పాత్రలో అనుమోల్. ఇక గొంతు విన్పిస్తూ చివరి దృశ్యాల్లో మాత్రమే తెరపై కొచ్చే విలన్ దయాకర్ గా, దర్శకుడు సెల్వ రాఘవన్ సాఫ్ట్ సైకోతనం మంచి ఫినిషింగ్ టచ్ సినిమాకి.
        
మూడు పాటలున్నాయి. షాపింగ్ మాల్ లో సెల్వరాఘవన్ రివీలయ్యే సందర్భంలో వచ్చే సాంగ్ బావుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా జస్టిన్ ప్రభాకరన్ బాగానే ఇచ్చాడు. గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం థ్రిల్లర్ ఫీల్ ని ఎలివేట్ చేసుకుంటూ పోయింది, ఇతర సాంకేతిక విలువలు, ప్రొడక్షన్ విలువలూ ఖైదీ నిర్మాతల స్థాయిలో వున్నాయి.

చివరికేమిటి

సినిమాలో చూపించిన కాల్ సెంటర్ వ్యవహారాన్నీ, కాల్స్ చేసే వాళ్ళ కల్చర్ నీ దేన్నీ విమర్శించకుండా, వాటి పై మెసేజి లివ్వకుండా, అమ్మాయిలు అపరిచితుల కాల్స్ కి పడిపోరాదని చెప్పడానికి మాత్రమే కాల్ సెంటర్ ని నేపథ్యంగా వాడుకున్నాడు దర్శకుడు. కథ ముగిశాక, అదే కాల్ సెంటర్ కి మొదట చేరిన బ్యాంకింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునే సెక్షన్ కే జాబ్ కి వెళ్తూంటుంది హీరోయిన్. ఎక్కువ శాలరీకి ఆశపడినందుకే ఇదంతా జరిగింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంది.
       
ఫస్టాఫ్ కుటుంబ జీవితం
, జాబ్ లో చేరడం, కాలర్ తగలడం, అతడి మాటలకి పడిపోయి ఫోన్లోనే ఫ్రెండ్ షిప్ చేయడం జరుగుతూ, ఇంకో ఉద్యోగిని హత్యకి గురవడం వంటివి వుంటాయి. సెకండాఫ్ లో కాలర్ కలవాలని ప్రయత్నించడం, బ్లాక్ మెయిల్ చేయడం, స్టాకింగ్ చేయడం జరుగుతూ వచ్చి, ఇతనెవరో తెలుసుకోవడానికి ఆమె పూనుకోవడంతో క్లయిమాక్స్ దిశగా వెళ్తుంది కథ.
       
అయితే ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో హీరోయిన్ గా  ఒంటి చేత్తో కాలర్ అంతు చూడకుండా
, ఇంట్లో చెప్పేయడంతో యాక్టివ్ గా వున్న పాత్ర కాస్తా బేలగా, పాసివ్ గా మారిపోయింది. ఆడవాళ్ళు రక్షణ కోసం చివరికి మగవాళ్ళ దగ్గరికి రావాల్సిందే అన్నట్టు తిరోగమన పంథాకి పోవడం తెలిసో తెలియకో దర్శకుడు చేసిన పొరపాటు. అయినా ఈ సినిమాని మత ప్రచార ప్రధాని ప్రమోట్ చేయట్లేదు కాబట్టి తమిళనాడులో కొందరు ముస్లిములే బ్యాన్ చేసుకుంటున్నారు. నేను ముస్లిముల మధ్యే పుట్టి పెరిగానురా అని దర్శకుడు మతసామరస్యం చెప్పుకుంటున్నాడు.
—సికిందర్

 

14, మే 2023, ఆదివారం

1327 : రివ్యూ!


రచన-దర్శకత్వం : యలమంద చరణ్
తారాగణం: సునీల్శ్రీనివాస రెడ్డివెన్నెల కిషోర్సోనియా చౌదరిస్నేహల్ కామత్పృథ్వీరాజ్, గోపరాజు రమణ,  ధనరాజ్వైవా హర్ష తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : సాయి
బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్మిర్త్ మీడియా
నిర్మాతలు: ఉదయ్ కిరణ్శ్రీకాంత్
విడుదల : మే 12, 2023 
***

        చిన్న సినిమాలు అరుదుగా కొత్త ఐడియాలతో వస్తాయి. వచ్చినప్పుడు అవి మంచి టాక్ తో థియేటర్లలో నిలబడేలోగా అదృశ్యమైపోతూంటాయి. మంచి టాక్ తో నిలబడే దాకా చిన్న సినిమాని థియేటర్లలో వుంచే కాలం కాదిది. చిన్న సినిమా మార్నింగ్ షోకే హిట్ టాక్ తో వైరల్ అవకపోతే ఇక అవకాశం వుండదు. అలాటి వైరల్ అయ్యే అవకాశమున్న భువన విజయమ్ ఈ వారం విడుదలైంది. ఓ పది మంది కమెడియన్ పాత్రల కథతో సినిమా అంటే ఎంత కామెడీ ప్రధానంగా వుంటుందో తెలిసిందే. ఒక కొత్త అయిడియా గల సినిమాని ఇంతమంది కమెడియన్లు కలిసి వైరల్ చేయాల్సిందే. మరి కొత్త దర్శకుడు తన తొలి ప్రయత్నంతో ఏం చేశాడు? ఇది తెలుసుకుందాం...
కథ


ఆటో డ్రైవర్ యాదగిరి (ధనరాజ్) అనేవాడికి భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. ఇద్దరు యమభటు లొచ్చి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే అవతల ఇంకొకడికి కూడా చావుతో అపాయింట్ మెంటుంది. వాణ్ణి కూడా పట్రమ్మని చిత్ర గుప్తుడు ఆజ్ఞాపించడంతో, యమ భటులు యాదగిరి ఆత్మని వెంటబెట్టుకుని, రెండో వాడి ఆత్మకోసం వెళ్తారు. అదొక జాతకాల పిచ్చిగల సినిమా నిర్మాత చలపతి (గోపరాజు రమణ) ఆఫీసు. ఈయన నిర్మించిన సినిమాలతో ప్రియతమ్ కుమార్ (సునీల్) అనే వాడు టాప్ స్టార్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈయనతో మరో సినిమా తీయాలి. అందుకని కథలు వినే కార్యక్రమం పెట్టుకుంటాడు. ఏడుగురు రచయితలు వచ్చి కథలు విన్పిస్తారు. ఈ రచయితల్లో ఒకడు చలపతి కారు డ్రైవర్, ఇంకొకడు రైటర్ గా మారిన దొంగ. ఈ ఏడుగురూ అద్భుతమైన కథలు చెప్పడంతో ఏ కథ తీసుకోవాలో తేల్చుకోలేక పోతాడు చలపతి. నాకెవరి కథ ఇస్తారో మీరే తేల్చుకోండి, ఆ కథకి పది లక్షలిస్తానంటాడు చలపతి. ఈ ఏడుగురు రచయితల్లోనే ఒకడికి చావుతో అపాయింట్ మెంటుంది. వాడి ఆత్మకోసమే వెయింటింగులో వున్నారు యమభటులు.
        
పైన యమలోకం, కింద ఆఫీసులో భువన విజయమ్ అనే మందిరం. ఈ మందిరంలోకి మంతనాలాడుకోవడానికి ప్రవేశిస్తారు రచయితలు. నిర్మాత డ్రైవర్ బతిమాలుకుంటాడు- తన కూతురు ఆస్పత్రిలో వుందని, బ్రతికించుకోవాలంటే 8 లక్షలు కావాలనీ, కనుక తన కథని ఆమోదించమని ఏడ్చేస్తాడు.
        
ఆమోదించడానికి మిగతా రచయితలు సిద్ధపడ్డారా? రచయితల్లో చావబోయే రచయిత ఎవరు? ఎవరి కథ ఇవ్వాలన్న దాని గురించి కథ కోసం ఇంత మేధోమధనం జరుగుతూంటే, అవతల స్టార్ హీరో ప్రీతమ్ కుమార్ గతం మర్చిపోవడంతో ఇప్పుడేం చేశాడు నిర్మాత చలపతి? కథ తీసుకున్నాడా? చలపతి డ్రైవర్ సమస్య తీరిందా? చావబోయే రచయిత చచ్చాడా?...వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

శ్రీకృష్ణ దేవరాయలి ఆస్థానం భువనవిజయం లో అష్ట దిగ్గజ కవులు కొలువుదీరే వారన్న ఆలోచనని తీసుకుని ఈ కథ చేశాడు కొత్త దర్శకుడు చరణ్. ట్రైలర్ లో ఇదే చెప్పాడు. అయితే ఎనిమిది మంది కవుల స్థానంలో 7 గురు రచయితల్ని సృష్టించి కథ నడిపాడు. ఇంకో రచయిత వున్నా మతిస్థిమితం లేని అతను రచయిత కాలేడు. ఇక ఈ కథ ఎలా నడపాలన్న దాని విషయంలో మాత్రం తప్పటడుగు వేశాడు. కమెడియన్లే రచయితలైనప్పుడు కథని  పూర్తి స్థాయి పగలబడి నవ్వించే కామెడీతో నడపకుండా, అక్కడక్కడ మాత్రమే నవ్విస్తూ, విషయ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకో లేకపోయాడు. ఇదే ఈ సినిమాని వైరల్ కాకుండా ఆపింది. చిన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే హిట్ టాక్ రాకపోతే, ఇంకా తర్వాత దాని పరిస్థితి దైవా ధీనమే. దీనికంటే చిన్న చిన్న హార్రర్ కామెడీలు బాగా ఆడాయి. ఎందుకంటే అవి కామెడీ మీద దృష్టి పెట్టాయి కాబట్టి.
        
ఈ కథలో ఇంకో సమస్య ప్రధాన పాత్ర లేకపోవడం. స్టార్ హీరోగా వేసిన సునీల్ ప్రధాన పాత్ర కాలేడు. రచయితలు సునీల్ కి కథ ఇవ్వడమే ఈ సినిమా కథ అయినప్పుడు, రచయితల్లోనే  ఒకరు ప్రధాన పాత్రగా వుండాలి. కానీ నిర్మాత డ్రైవరుగా వున్న రచయితకి, కూతురి వైద్య చికిత్స కారణం చెప్పి భావోద్వేగ భరిత కథతో అతడ్ని ప్రధానం చేశారు. ఇతనే ప్రధాన పాత్ర అనుకున్నా లాజిక్ అడ్డొస్తుంది. నిర్మాత డ్రైవర్ అయిన తను నిర్మాతకి సమస్య చెప్పుకుంటే కూతురి వైద్యం చేయించేయవచ్చు. తన యజమానికి కథే అమ్మి డబ్బు సంపాదించే రిస్కు తీసుకోనవసరం లేదు.
        
ఇలా ప్రధాన పాత్ర లేకపోవడం, కమెడియన్లతో ప్రేక్షకులాశించే కామెడీని బలహీనం చేసి గంభీరంగా కథ చెప్పబోవడం, ఆ కథ కూడా అంతంత మాత్రంగా వుండడం కొత్త దర్శకుడి టాలెంట్ ని బయట పెట్టాయి. భువనవిజయంలో తెనాలి రామకృష్ణుడ్ని కూడా మర్చిపోయాడు కొత్త దర్శకుడు.

నటనలు- సాంకేతికాలు

సునీల్ ఒక్కడే కాస్త నవ్విస్తాడు. గతాన్ని మర్చిపోయిన స్టార్ గా గజినీ టైపు క్యారక్టర్ తో కామెడీ ఫర్వాలేదు. అయితే సినిమా షూటింగులో తగిలిన దెబ్బతో  జ్ఞాపక శక్తిని కోల్పోయిన తనని, కర్రతో కొడితే జ్ఞాపక శక్తి రావడమనే పాత చింతకాయ చిట్కా ఇబ్బంది పెట్టేదే. ఎనిమిదో రచయితగా మూగవాడి పాత్రలో వెన్నెల కిషోరే ఈ సినిమాకి ఆకర్షణ. పెద్ద రచయితగా పృథ్వీరాజ్అతడి అసిస్టెంట్ గా పనిచేసి అతడికే పోటీ రచయితగా మారిన పాత్రలో శ్రీనివాస్ రెడ్డిదొంగోడైన  రైటర్ గా వైవా హర్ష నటించారు.  నిర్మాతగా గోపరాజు రమణరొమాంటిక్ పాత్రల్లో సోనియా చౌదరిస్నేహల్ కామత్ కని పిస్తారు.
        
ఈ సినిమాలో పాటల్లేవు. నిడివి కూడా రెండు గంటలలోపే. ఫస్టాఫ్ నత్తనడక నడిచినా సెకండాఫ్ కథ ఎంపిక గురించి చేసే కామెడీలు కొన్ని నవ్విస్తాయి. ఒకే ఇంట్లో సింగిల్ లొకేషన్లో ఈ కథంతా జరుగుతుంది. అయితే సింగిల్ లొకేషన్ సినిమాలు బోరు కొట్టకుండా, సీను సీనుకీ మారిపోయే పరిస్థితి తో వేగంగా సాగే కథనం ఎలా చేయాలో ఇలాటి హాలీవుడ్ సినిమాల్లో తెలుస్తుంది. కొత్త దర్శకుడు ఈ రీసెర్చి చేసుకోనట్టుంది. ఊహించని మలుపులు కూడా లేకుండా సినిమా చప్పగా  సాగుతుంది. క్లయిమాక్స్ ఏం జరుగుతుందో ముందే తెలిసి పోతుంది.
        
ఇంతమంది కమెడియన్లతో కామెడీ తీయడానికి కొత్త దర్శకుడి అనుభవం సరిపోలేదు. అనుభవమున్న రచయితల తోడ్పాటు తీసుకుంటే తప్ప భువన విజయమ్ కి సరైన విజయం అంత సులభం కాదు.
—సికిందర్