రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, మే 2023, శుక్రవారం

1323 : రివ్యూ!

 

రచన -దర్శకత్వం : విజయ్ కనకమేడల
తారాగణం: అల్లరి నరేష్ , మిర్నా మీనన్, ఇంద్రజ, బేబీ ఊహా రెడ్డి, శత్రు, శరత్ తదితరులు  
కథ: టూమ్ వెంకట్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ జె
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల : మే 5, 2023
***

            2021 లో హీరో అల్లరి నరేష్ తో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల అందించిన నాంది విజయం సాధించింది. అది పోలీసు వ్యవస్థకి బలైన సామాన్యుడి కథ.  ఆ తర్వాత 2022 లోఅల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సామాజికంలో నటిస్తే విజయం సాధించలేదు. తిరిగి ఇప్పుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం నటించాడు. మరి కామెడీ సినిమాలు మానుకుని, సామాజిక సమస్యలతో కూడిన  వాస్తవిక సినిమాల్లో నటించడం మొదలెట్టిన అల్లరి నరేష్, ఈ మూడో ప్రయత్నంతో ఎలాటి ఫలితాన్ని సాధించాడు? ఇందులో పోషించిన పాత్రేమిటి? విషయమేమిటి?... ఇవి తెలుసుకుందాం.

కథ   

సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) కి భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు లక్కీ (బేబీ ఊహా రెడ్డి) వుంటారు. సీఐగా అతను డ్యూటీకి కట్టుబడి వుండడంతో భార్యతో సమస్యలు వస్తాయి. ఒక గర్ల్స్ హాస్టల్లో దుష్ట మూక పాల్పడుతున్న అరా చకాల్ని ఎదుర్కోవడంతో, ఆ మూక శివకుమార్ భార్యని అవమానిస్తారు. శివకుమార్ వెళ్ళి ఆ మూకని కాల్చి పారేసి హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంతలో భార్యా  కూతురూ కనపడకుండా పోతారు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఈ కిడ్నాపర్స్ ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? శివకుమార్ భార్యా కూతురూ కిడ్నాపై ఎక్కడున్నారు? ఇవీ శివ కుమార్ ముందున్న సమస్యలు. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సామాజిక కథయితే కాదు, కృత్రిమ పోలీస్ యాక్షన్ కథ. పైగా దీంతో భావోద్వేగాలు కరువైన పరిస్థితి ఏర్పడింది. భావోద్వేగాల  కెమిస్ట్రీ భార్యా కూతుళ్ళతో లేదు, వందల సంఖ్యలో మాయమవుతున్న మనుషులతోనూ లేదు. చెప్తే భార్యా కూతుళ్ళ అదృశ్య కథయినా చెప్పాల్సింది, లేదా మిగతా మనుషుల మిస్సింగ్ కేసుల కథైనా చెప్పాల్సింది. ఫస్టాఫ్ భార్యాకూతుళ్ళ అదృశ్య కథగా నడిపి, సెకండాఫ్ మిస్సింగ్ మనుషుల కథ నడిపే సరికి రెండు కథల్లాగా తయారైంది. ఇక సెకండాఫ్ లో ఎక్కడో ముగింపులో వరకూ భార్యకీ కూతురికీ స్క్రీన్ స్పేస్ దక్కకుండా పోయింది. వాళ్ళు కనిపించక పోవడంతో వెలితి ఏర్పడింది.
        
ఇంతా చేసి ఈ కిడ్నాపులు ఎందుకో చివర్లో రివీల్ చేస్తే తెలిసే విషయం రొటీన్ అరిగిపోయిన మెడికల్ మాఫియా విషయం. దీంతో మొత్తం కథ కృత్రిమంగా తయారయ్యింది. ఇటీవలే సమంతా నటించిన యశోద లో ఒక మెడికల్ మాఫియాని చూశాం, ఇంతలో ఇప్పుడు అల్లరి నరేష్ తో ఇంకో మెడికల్ మాఫియా. రెండిటి ఫలితం డిటో.

నటనలు- సాంకేతికాలు

    అల్లరి నరేష్ పోలీసు పాత్ర వరకూ నటన ఓకే. మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కొత్తగా ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా వుండడంతో కొన్ని టెక్నికల్ అంశాలు నటనని ఎలివేట్ చేశాయి. అతను చట్టాన్ని  చేతుల్లోకి తీసుకునే ఎమోషనల్ పోలీసు. దీనికి తగ్గ మానసిక సంఘర్షణ మాత్రం కథలో లేక పైపై యాక్షన్ హీరోగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు.
        
హీరోయిన్ మిర్నా మీనన్ ది భార్యగా విచిత్ర పాత్ర. ప్రేమించిన పోలీసుకోసం పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసిన తను భార్యగా సాధింపులు మొదలెట్టడానికి తగిన పరిస్థితి కనిపించదు. పోలీసు భార్యగా జీవితం ఎలా వుంటుందో తెలియకుండానే చేసుకుందా. కథ కోసం ఆమె పాత్రని నెగెటివ్ గా మార్చేశారు. అసలు మొదట ప్రేమ, పెళ్ళీ, సంసారం కూడా పొడిపొడిగా చూపించి వదిలేశారు. కిడ్నాప్ కాబోయే హీరోయిన్ని పాజిటివ్ గా చూపించినప్పుడే ఎమోషనల్ కెమిస్ట్రీతో సానుభూతి ఫీలవగల్గుతాం. కాబిల్ లో సంజయ్ గుప్తా హీరోయిన్ యామీ గుప్తాని ఎంత పాజిటివ్ గా చూపించి తర్వాత సానుభూతిని రాబడతాడు.  మిర్నా గ్లామర్ కి, నటనకీ ఫర్వాలేదు. ఇక కూతురి పాత్రలో బేబీ ఊహా రెడ్డి చైల్డ్ సెంటి మెంటు సీన్లు ఏ పాత సినిమాల్లోంచి ఎత్తుకొచ్చారో తెలీదు. ఈ కాలపు పిల్లలు మాత్రం ఇలా వుండరు.
        
డాక్టర్ గా ఇంద్రజ నటించింది. ఫర్వాలేదు. ఈ కథలో విలన్ అనేవాడు మెడికల్ మాఫియాగా చివర్లో తప్ప కనపడడు. కాబట్టి అతడి గురించి అనవసరం. పైన చెప్పుకున్నట్టు నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ కడలి కళా దర్శకత్వం, కలర్స్ వాడిన విధానం, సెట్స్, లొకేషన్స్ అన్నీ టెక్నికల్ గా ఒక హోదాని సమకూర్చి పెట్టాయి. సిద్ధార్థ్ జాదవ్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా. శ్రీచరణ్ పాకాల పాటలేం కుదరకపోయినా, నేపథ్యసంగీతం ఫర్వాలేదు.
        
దీనికి టూమ్ వెంకట్ కథ అందిస్తే, అబ్బూరి రవి రాసిన మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ వుండడంతో మాటల వాడకం తగ్గింది. ఇక విజయ్ కనకమేడల దర్శకత్వం నాంది కంటే ఉన్నతంగా వుంది. విషయం మాత్రం అంతగా లేదు.

చివరికేమిటి

ఈసారి నరేష్ తను నటిస్తున్న సామాజికం చాలనట్టు కుటుంబాన్నీ భుజానేసుకున్నాడు. ఈ రెండు పడవల ప్రయాణంలో ఎటు వైపూ ఎమోషన్లు సాధ్యంగాక చేరాల్సిన తీరానికి చేరలేదు. సెకండాఫ్ లో అదృశ్యమైన కుటుంబాన్ని పక్కనపెట్టి సామాజికాన్ని(సమాజంలో మిస్సింగ్ కేసులు) ఎత్తుకోవడంతో ఏకసూత్రత దెబ్బతిని ఎసరు వచ్చింది. స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్ లేదు, హీరోకి ఒక గోల్ లేదు, కథకి విలన్ లేడు. ఇంతకంటే ఏం కావాలి సినిమా అనారోగ్యానికి.
        
ఫస్టాఫ్ ఎత్తుకున్న కుటుంబ అదృశ్య కథని వదిలేసి, సెకండాఫ్ సామాజికాన్ని ఎత్తుకోవడంతో సినిమా సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడి గుండంలో కూడా పడింది. తను దుష్ట మూకని కాల్చి చంపడంతో నాల్గు హత్య కేసులు నమోదై, మానసికారోగ్య కారణాలతో కోర్టు హౌస్ అరెస్టులో వుంచమన్నప్పుడు- హౌస్ అరెస్టులో వుండిపోయి, కుటుంబాన్నే మర్చిపోతాడు. ఇతర మిస్సింగ్ కేసులు పట్టించుకుంటాడు. అతను ప్రశ్నించి వుంటే ఈ రెండు కథలూ ఒక కథగా అయ్యేవి.
        
ఎలాగూ హౌస్ అరెస్టులోంచి పారిపోయినప్పుడు- నేను దుష్ట మూకని ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మర్డర్ కేసులు పెడితే- నేను నా కుటుంబం ఎక్కడుందో వెతుక్కోవడానికే పారిపోతా. మిగతా మిస్సింగ్ కేసుల గొడవ నాకెందుకు- అది మీ డిపార్ట్ మెంట్ గొడవ అని పూర్తిగా అతను కుటుంబం కోసం సంఘర్షించి వుంటే ఎమోషనల్ కెమిస్ట్రీ వుండేది. చివర్లో ఎక్కడో సామాజిక బాధ్యత కూడా గుర్తుచేసుకుని, ఇతర బాధితులకి  విముక్తి కలిగించి వుంటే, సినిమా అంతా ఒకే కుటుంబ పర భావోద్వేగాలతో, ఒకే కథలా వుండేది.

—సికిందర్


2, మే 2023, మంగళవారం

1322 : స్పెషల్ ఆర్టికల్

            

బౌండెడ్ స్క్రిప్టు లేకుండా సినిమా తీసి దెబ్బతిన్నామని 80 కోట్ల  ఏజెంట్నిర్మాత అనిల్ సుంకర చేసిన ప్రకటన వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం, కరోనా కాలంలో అవాంతరాలూ కలిసి ఫ్లాప్ సినిమా తీయడానికి కారణమయ్యాయని చెప్పారు. కరోనా కాలంలో అవాంతరాలొస్తే ఆ గ్యాప్ లో స్క్రిప్టులు శుద్ధి చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాం. మరి ఏజెంట్ కి సంబంధించి ఏం చేస్తున్నట్టు? స్క్రిప్టు రఫ్ ప్రతి కూడా రాసుకునే తీరిక దొరకలేదా? లేదా ఆన్ లైన్లో, జూమ్ లో సరిపోక ఇంకేదైనా కొత్త టెక్నాలజీ కోసం వేచి చూశారా? లేక టెక్నాలజీ అంతా ఏజెంట్ లో అత్యాధునిక ఆయుధాలకి సంబంధించి అన్వేషించడంలో లేక టెక్నాలజీ అంతా ఏజెంట్ లో అత్యాధునిక ఆయుధాలకి సంబంధించి అన్వేషించడంలో  పడిపోయారా? 

        బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం సమస్య కాదు, బౌండెడ్ స్క్రిప్టు వున్నా షూటింగులో అదే బౌండెడ్ రూపంలో వుండదు. మార్పు చేర్పులు జరుగుతూంటాయి. అసలు పూర్తి కథేమిటో పేపరు మీద లేక వివిధ కారణాల వల్ల షూటింగు మొదలెడితే ఇలా జరుగుతుంది. ఏజెంట్ చూస్తే ఫస్టాఫ్ వరకే పేపరు మీద స్క్రిప్టు సిద్ధంగా వుందని, సెకండాఫ్ ని అప్పటికప్పుడు కథ అల్లుకుంటూ పోయారని అర్ధమవుతుంది. మరి కొబ్బరి కాయ కొట్టినప్పుడు స్క్రిప్టులో ఎన్ని పేజీలు అక్కడ పెట్టి పూజ చేశారో, అదెలాటి పూజ అన్పించుకుందో వాళ్ళకే తెలియాలి. గుమ్మడి కాయ మాత్రం స్క్రిప్టు లేని సెకండాఫ్ షూటింగుకే ఖాయంగా కొట్టారని మాత్రం భావించుకోవచ్చు.
        
తీసిన ఫస్టాఫ్ కథెలా వున్నా, దానికి తగ్గ కథనం ఎంతో కొంతైనా ఆర్డర్లో వుంది. అంటే అక్కడి వరకూ స్క్రిప్టు సిద్ధంగా వుందన్న మాట. కానీ  సెకండాఫే  అసలు కథేమిటో, దాని తాలూకు కథనమేమిటో అర్ధం పర్ధం లేకుండా పోయింది. అంటే సెకండాఫ్ స్క్రిప్టు రెడీ చేసుకో లేదన్న మాట. ఇంత రిస్కు మన దేశంలో ఏ భాషా సినిమాతోనూ తీసుకోలేదు బహుశా. కానీ హాలీవుడ్ లో చాలా వున్నాయి. ఆశ్చర్యమేమిటంటే అవన్నీ హిట్టయ్యాయి. స్క్రిప్టు  కాదుకదా చేతిలో నాల్గు పేజీల ఔట్ లైన్ పెట్టుకుని ప్రారంభించిన మార్వెల్ స్టూడియోస్ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ ఐరన్ మాన్(2008) సహా. స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూడా తక్కువ తినలేదు. స్క్రిప్టు లేకుండా తను తీసిన మొదటి మూవీ సూపర్ హిట్ జాస్(1975) కూడా. సినిమా నిర్మాణంలో 90 శాతం పని ముందుగా స్క్రిప్టు పూర్తి చేసుకోవడమేనని చెప్పే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన టోపాజ్ మాత్రం? స్క్రిప్టే లేకుండా ఉత్తమ కథ, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు ఆస్కార్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్న బిల్లీ వైల్డర్ తీసిన సన్సెట్ బోలెవర్డ్(1950) మాత్రం? చెప్పుకుంటూ పోతే డజను వున్నాయి.
        
స్క్రిప్టే లేకుండా ఆస్కార్ అవార్డులే తీసుకున్నాడంటే ఎంత పని రాక్షసుడై వుండాలి. మహాద్భుత క్లాసిక్ కాసాబ్లాంకా (1942) స్క్రిప్టే లేకుండా తీసిన మైకేల్ కర్టిజ్ కూడా ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డులు తీసుకున్నవాడే. ఇక భారీ చారిత్రక క్లాసిక్ లారెన్స్ ఆఫ్ అరేబియా (1962) తీసిన డేవిడ్ లీన్ సైతం ఉత్తమ చలన చిత్రం, దర్శకత్వం ఆస్కార్ అవార్డులు తీసుకున్నాడు.
        
ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర బౌండెడ్ స్క్రిప్టు లేకుండా తీశామని చెప్పుకుని బాధపడ్డారు. కానీ స్పీల్ బెర్గ్ తో జాస్ తీసిన నిర్మాత - స్క్రిప్టే కాదు, తారాగణం కూడా లేకుండా, సినిమాలో ప్రధానంగా కనిపించే సొరచేప డిజైన్ కూడా లేకుండా గందరగోళంగా సినిమా ప్రారంభించామని చెప్పుకున్నాడు. అయితే స్క్రిప్టు లేకుండా ఎలా ప్రారంభించినా అక్కడ యుద్ధ ప్రాతిపదికన షిఫ్టుల్లో చాలా మంది ప్రొఫెషనల్ రచయితలు పనిచేస్తారు. అంత హడావిడిలో కథలో కంటిన్యూటీ ని మాత్రం బాగా కాపాడతారు.
        
కొన్నిసార్లు దర్శకులే నిర్లక్ష్యంగా వుంటారు. రెడీ స్క్రిప్ట్ లేకుండా బిల్లీవైల్డర్ సన్సెట్ బోలెవర్డ్ తీసింది గాక, తర్వాతి సినిమా సబ్రినా (1954) కూడా స్క్రిప్టే లేకుండా ప్రారంభించి, ఏ రోజు సీన్లు ఆ రోజే కథ ఆలోచించి రాస్తూంటే, అసలు తను ఏం నటిస్తున్నాడో అర్ధం గాక, స్టార్ హీరో హంప్రీ బోగార్ట్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బిల్లీ వైల్డర్ స్టార్ హీరోయిన్ ఆడ్రీ హెప్ బర్న్ ని బతిమాలుకున్నాడు- నువ్వు జబ్బున పడ్డట్టు చెప్పి కొన్నాళ్లు రాకు, ఈలోగా మేం స్క్రిప్టు పూర్తి చేసుకుంటామని. ఈ సినిమా కూడా పెద్ద హిట్టవడమేగాక, విమర్శకులు ఆకాశాని కేత్తేశారు. దీన్ని 1995 లో రెడీ స్క్రిప్టుతో సిడ్నీ పొలాక్ రీమేక్ చేస్తే ఫ్లాపయ్యింది.  
        
బౌండెడ్ స్క్రిప్టు వున్నంత మాత్రాన హిట్టవ్వాలని లేదు. తెలుగులో హిట్టయ్యేవి 8-10 శాతమే. ఉండాల్సింది ఎలాటి పరిస్థితుల్లోనైనా కంటెంట్ ని సృష్టించ గలిగే సామర్ధ్యమే. గత దశాబ్దపు దర్శకులు చాలా మంది తెరమగురై పోయారు. వాళ్ళ షెల్ఫ్ లైఫ్ పదేళ్ళకి మించి లేదు. ఆ పదేళ్ళలో అప్డేట్ అవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు ఐదేళ్ళకే అవుట్ డేటెడ్ అయ్యే పరిస్థితు లున్నాయి. ప్రేక్షకుల అభిరుచులు శరవేగంగా మారిపోవడమే కారణం. కనుక కనీసం ప్రతీ మూడో సినిమాకైనా అప్ డేట్ అయి సినిమాలు తీయకపోతే దర్శకులు  రెండేళ్ళకే కనుమరుగైనా ఆశ్చర్యం లేదు.
        
ఏజెంట్ ఫస్టాఫ్ చూస్తే అప్డేట్ అవని కథాకథనాలతో, కాలం చెల్లిన టెంప్లెట్ లో హీరో అఖిల్ అక్కినేనిని మాత్రం - నువ్వే నీ క్యారక్టర్ తో కష్టపడి నిలబెట్టు- మేం కష్టపడం- అన్నట్టు- అతడికి వైల్డ్ క్యారక్టర్ అంటూ క్యారక్టర్ ఒకటి క్రియేట్ చేసి, కంటెంట్ ని వదిలేస్తే అఖిల్ మాత్రమేం చేస్తాడు. సమస్య బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం కాదు, వున్నా ఇదే పరిస్థితి. దర్శకుడు సురేందర్ రెడ్డి, ఆయన రచయిత వక్కంతం వంశీ పదేళ్ళుగా అప్డేట్ అవని అదే పరిస్థితి.

‘జురాసిక్ పార్క్ 3’  (2001)పూర్తి స్క్రిప్ట్ లేకుండానే నిర్మాణంలోకి దిగారు. ప్రీ-ప్రొడక్షన్ సమయంలో ఒక డ్రాఫ్ట్ సిద్ధంగా వున్నప్పటికీ, అనేక సెట్లు, లొకేషన్లు సిద్ధం చేసినప్పటికీ, కొత్త దర్శకుడు జో జాన్ స్టన్  స్టూడియో ఇచ్చిన స్క్రిప్టు ని షూటింగ్‌ కి ఐదు వారాల ముందు తిరస్కరించాడు. బదులుగా పూర్తిగా భిన్నమైన కథని ఆలోచించాడు. ఆ కథతో ఎప్పుడూ ఫైనల్ స్క్రిప్ట్ లేకుండానే సినిమా పూర్తి చేశాడు. ఏ రోజూకారోజు రాసి  షూట్ చేస్తున్న పేజీలే ఫైనల్ స్క్రిప్టు  ఫైల్లోకి వెళ్ళాయి. దీని బడ్జెట్ 93 మిలియన్ డాలర్లు. బాక్సాఫీసు 369 మిలియన్ డాలర్లు. దీన్నిబట్టి అర్ధమయ్యేదేంటంటే, ఇంకా స్టోరీ రైటింగ్ చేస్తూ కూర్చోవడం వృధా. స్టోరీ మేకింగ్ చేసుకోవాలి.

—సికిందర్


29, ఏప్రిల్ 2023, శనివారం

1321 : మూవీ నోట్స్

                సినిమా కథైనా మూడు ప్రధాన మలుపుల మీదే (ప్లాట్ పాయింట్ వన్, టూ, త్రీ) ఆధారపడుతుందన్న విషయం తెలిసిందే. సమస్య ఏర్పాటుతో మొదటి ప్రధాన మలుపు, విశ్రాంతి ఘట్టంతో రెండో ప్రధాన మలుపు, సమస్యకి ఇచ్చే పరిష్కారంతో మూడో ప్రధాన మలుపు, ఇంతే- ఇంతకంటే సినిమా కథంటే ఇంకేమీ లేదు తలబద్దలు కొట్టుకోవడానికి. ఈ మాత్రం కూడా చేసుకోక పోతేనే వస్తుంది ఫ్లాప్. కథలో ఈ ప్రధాన మలుపులు లేకపోయినా, లేదా అవి బలహీనంగా వున్నా ఆ కథ మూలన బడుతుంది. దాదాపు అన్ని సినిమాల్లో ఈ ప్రధాన మలుపులు బలంగానే వుంటాయి. వాటి మధ్య వాటి తాలూకు వుండాల్సిన కథనమే పస లేక, లేదా ఏజెంట్ లోలాగా కథని బట్టి ప్రధాన మలుపులు నిర్దేశించే దిశా గమనం లేక (ప్రధాన మలుపుల్ని గైడ్ పోస్టులని కూడా అన్నారు మరి) సినిమాలు ఫ్లాపవుతూంటాయి. కొన్ని సినిమాల్లో మూడో ప్రధాన మలుపు బలహీనంగా వుండి దాంతో క్లయిమాక్స్ తేలిపోతూంటుంది. మూడో ప్రధాన మలుపుతో క్లయిమాక్స్ సరీగ్గా రావడం లేదంటే దాని కారణం మొదటి ప్రధాన మలుపులో వుంటుందనీ - వెళ్ళి అక్కడ చక్కగా రిపేరు చేసుకోండయ్యా - అనీ  ఏనాడో 50-60 ఏళ్ళ క్రితం హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ చరిత్రలో నిలిచిపోయే సులువు చెప్పనే చెప్పాడు. అయినా మన తెలుగుకి ఈయనెవరో హాలీవుడ్డాయన చెప్పేదేంటీ, మన విద్య మనకుందని ఒక మిధ్యని సృష్టిస్తేనే అది శాకుంతలం అయి, షాకివ్వడానికి ఎప్పుడెప్పుడాని ఉవ్వీళ్ళూరుతూంటుంది  రిలీజుకి.

        త వ్యాసంలో శకుంతల సినిమా మూడు వెర్షన్లలో (1943,1966,2023) మొదటి ప్రధాన మలుపులు ఏఏ తీరున వున్నాయో పోల్చి చూశాం. ఏ వెర్షన్లో ఎంత బలంగా వుందో తెలుసుకున్నాం. మొదటి రెండు వెర్షన్ల కంటే (1943 హిందీ,1966 తెలుగు) 2023 తెలుగు వెర్షన్ ఎంత డొల్లగా వుందో చూశాం. ఈ డొల్ల తనమే ఇప్పుడు మూడో ప్రధాన మలుపుని పట్టి పల్లార్చింది. క్షత్రియురాలిగా పుట్టిన శకుంతల తాపస కన్యగా పెరిగింది. మొదటి ప్రధాన మలుపులో తాపస కన్య స్వభావంతోనే దుర్వాసుడి శాపంతో సమస్యలో పడింది. ఆ సమస్యకి పరిష్కారం కోసం మాత్రం మూడో ప్రధాన మలుపులో తన జన్మవృత్తాంతం తెలిసీ కూడా, ఇక తాడో పేడో తేల్చుకునే క్షత్రియ స్వభావంతో తిరగబడ లేదు. మొదటి ప్రధాన మలుపులో దుర్వాసుడంతటి వాడి శాపాన్ని కథకుడే బలంగా ఫీల్ కాలేదని మనం గత వ్యాసంలో తెలుసుకున్నప్పుడు, అక్కడ్నుంచీ కథనేం బలంగా ఫీలై నడప గలుగుతాడని కథకుడు.

1943 - ఏ శాతారాం స్టోరీ

ముందుగా రెండో ప్రధాన మలుపు చూద్దాం : 1943 శాంతారాం హిందీ శకుంతల లో శకుంతలని అత్తారింటికి సాగనంపడానికి ముస్తాబు చేస్తూంటారు. ఆయనకి నువ్వు గుర్తుండకపోతే ఉంగరం చూపించడం మర్చిపోకేం అని జాగ్రత్త చెప్తారు చెలికత్తెలు. కథలో ఈ ప్లాట్ డివైస్ గా ఉపయోగ పడుతున్న ఉంగరం కథేమిటంటే, శకుంతలని పెళ్ళాడేక దుష్యంతుడు ఆమెకి తొడిగిన ఉంగరమది. తర్వాత దుర్వాసుడు శకుంతలకి శాపం పెట్టి వెళ్ళిపోతూంటే చెలికత్తెలు కాళ్ళా వేళ్ళా పడతారు. పిట్టంత కేసుకి రాహుల్ గాంధీకి చట్టసభ, గృహ శోభ రెండూ ఊడిపోయేలా తీర్పిచ్చినట్టు తను పెట్టిన శాపం మరీ ఎక్కువైపోయిందని గ్రహించిన దుర్వాసుడు- శాపాన్ని వెనక్కి తీసుకోలేననీ, ఒక మార్గం చెప్తాడు. అదేమిటంటే, దుష్యంతుడిచ్చిన ఉంగరాన్ని చూపిస్తే అతడికి జ్ఞాపకం తిరిగి వస్తుందని. ఇదే ఇప్పుడు చెలికత్తెలు శకుంతలకి గుర్తు చేస్తున్నారు. 
        
ఇలా చెప్పించడం ముందేదో అనర్ధం జరగబోతోందని కథనంలో డైనమిక్స్ లేదా చైతన్యం కోసమే. ఒక పాటతో చాలా మంది (కణ్వుడు, కణ్వుడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఇతర ఆశ్రమ వాసులూ) తోడురాగా పయనం కడుతోంటే, కణ్వుడు ప్రకృతిని పిలుస్తాడు ఆశీర్వదించమని. ఒక్కసారిగా గాలి వీస్తుంది. పక్షులన్నీ అరుచుకుంటూ వచ్చేస్తాయి.
        
కణ్వుడంటాడు, ఆశ్రమపు మొక్కా మానూ అందరికీ... ఏ నీరు మీరివ్వకుండా చుక్క కూడా నోట్లో వేసుకునేది కాదో, ఏ పళ్ళూ పూలూ మీరివ్వకుండా పూజ గదిని అలంకరించేది కాదో-  ఆ మీ ముద్దుల శకుంతల ఈ రోజు పతి దగ్గరికి వెళ్తోంది. మీరంతా వీడ్కోలు పలకండి, ఆశీర్వదించండీ...’ అని. ఇది విని జింకలు కూడా వచ్చేస్తాయి.
        
మొక్కలతో, చెలికత్తెలతో శకుంతల ఆత్మీయ సంభాషణ తర్వాత కదులుతూంటే, కొంగు పట్టుకుని జింక లాగుతుంది. శకుంతల దాన్ని ఓదారుస్తుంది. ఇక అందర్నీ ఆలింగనం చేసుకుంటూ, ఎవరూ దుఖపడొద్దని ధైర్యం చెప్తుంది శకుంతల. ఆమె కంట్లో కూడా నీళ్ళు తిరుగుతాయి. ఈ కన్నీళ్లతో క్లోజప్ నీటి అలలతో డిజాల్వ్ అవుతుంది. ఏమిటా అని చూస్తే, నది నీరుతో సీను మారుతుంది (ట్రాన్సిషన్).
        
నదిలో పడవెక్కి ప్రయాణం కడుతుంది పెంపుడు తల్లితో, ఇద్దరు శిష్యులతో. పడవలో బక్క మొగుడు -బండ పెళ్ళాం కామెడీ చూసి బాధంతా మర్చిపోతుంది శకుంతల. పడవ సాగుతూంటే చేయి జారవిడిచి కూర్చున్న శకుంతల వేలి ఉంగరం జారి నీట్లో పడిపోతుంది. ఇది చూసుకోదు. ఆ ఉంగరాన్ని చేప మింగేస్తుంది. బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి పగలబడి నవ్వేస్తున్న శకుంతల క్లోజప్ హోమంతో డిజాల్వ్ అవుతుంది తర్వాతి సీనుకి (రెండో ట్రాన్సిషన్).
        
ఈ మొత్తం శకుంతలని సాగనంపే సీను రెండు పాటలతో కరుణ రసంతో నిండి వుండి ఒక మూడ్ లోకి తీసికెళ్తుంది. రెండు విషయాలు బలంగా హత్తుకుంటాయి : పక్షులు అరుచుకుంటూ రావడం, జింక కొంగు లాగడం రెండూ కరుణ రసానికి పరాకాష్టగా వుంటాయి. అల్టిమేట్ క్రియేషన్. డైనమిక్స్ (ద్వంద్వాల పోషణ) విషయానికొస్తే ఆనందంగా బయల్దేరుతున్న వేళ చెలికత్తెలు ఉంగరం గురించి చెప్పి విషాదాన్ని కల్పించడం, భారంగా బయల్దేరిన శకుంతలకి బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీతో ఆనందం కల్గడం వంటివి వున్నాయి.
        
ఇక ప్లాట్ డివైస్ అయిన ఉంగరం పోగొట్టుకునే సన్నివేశం... బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి నవ్వుతున్న శకుంతల చేయి పక్కకి జారవిడిస్తే వేలి ఉంగరం నదిలో పడిపోతుంది క్లోజప్ షాట్ లో రిజిస్టరవుతూ. ఉంగరం వదులుగా వుండి జారిపడి పోయినట్టు స్పష్టంగా చూపించాడు. అంత వదులుగా వుంటే ఇంకెప్పుడో ఇంకెక్కడో పడిపోయే వుండాలి. కాబట్టి కావాలని పడేసినట్టున్న ఈ షాట్ క్రియేషన్ దెబ్బతింది థ్రిల్ లేకుండా. ఇదే 1966 తెలుగు శకుంతల లో అద్భుతంగా వుంది. ఇప్పుడలా జారిపోయిన ఉంగరాన్ని నదిలో చేప మింగేస్తుంది.
        
అంటే ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు శకుంతల కేం జరుగుతుందన్న సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఇక్కడ క్రియేటవక పోతే సీనుకి అర్ధం లేదు. సీన్లు వుండేవే పాత్ర గురించి కొత్త విషయం తెలియడానికి లేదా, కథని ముందుకు నడిపించడానికి. ఇక్కడ ఉంగరం పడిపోవడంతో ఈ సీను కథని ముందుకి నడిపిస్తోంది. సంఘటన లేకుండా సీనుంటే అది చీకేసిన మామిడి టెంకతో సరి సమానంగా వుంటుంది. 2023 వెర్షన్ లో ఇదే చూస్తాం.
        
ఇక ట్రాన్సిషన్స్- అంటే ఎడిటింగ్ ని కూడా సీనుని ఆసక్తికరంగా మార్చడానికి ఉపయోగించడం. ఇది కూడా కథనంలో భాగమే. ఇలా కూడా కథనం చేయాలి. మొదటి ట్రాన్సిషన్ ఆమె కన్నీటిని నీటి అలలు కమ్మేయడం- ఇదేమిటా అని చూస్తే ఆ డిజాల్వ్ తో నీటి అలలు నదిగా ఓపెనై సీను మారడంగా చూస్తాం. అంటే ప్రేక్షకులు లేజీగా సినిమా చూసేలా చేయకూడదు మంచి మేకరనేవాడు- అకస్మాత్తుగా ఇదేంట్రా అని లేచి కూర్చుని పరికించేట్టు చేసేదే నిజమైన మేకింగ్. ఇక చివర్లో ఆమె పగలబడి నవ్వుతున్న క్లోజప్ హోమం తో డిజాల్వ్ అయ్యే రెండో ట్రాన్సిషన్ సైతం తర్వాతి సీనుకి ప్రారంభం. ఆమె ఎంతనవ్వుతోందో అంత దుఖం ఎదర పొంచి వున్నట్టు సంకేతం.
    
ఇలా 1943 హిందీ వెర్షన్ శకుంతల లో రెండో ప్రధానమలుపు శకుంతలని చిక్కుల్లో పడేసే ఆందోళనకర సంఘటనతో, బోలెడు నాటకీయతతో బలంగా వుంది.
        
అన్ని వెర్షన్లలో గర్భవతైన శకుంతల అత్తారింటికి వెళ్ళే కథే వుంది. శకుంతల నాటకాన్ని ఒక జాతక కథ నుంచి తీసుకుని రాశాడు కాళిదాసు. బౌద్ధమతంలోని జాతక కథల్లోని  కట్టహరి అనే కథలో, వారణాసి రాజు వన కన్యని మోహించిన వెంటనే గర్భవతవుతుంది. అప్పుడామెకి ఉంగరమిచ్చి, కూతురుపుడితే ఇది పెట్టి పోషించుకో, కొడుకు పుడితే ఈ ఉంగరంతో వాణ్ని తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు (ఆడపిల్ల పట్ల ఫ్యూడలిజం మర్యాద). కొడుకే పుడతాడు. వాణ్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళకుండా తనే పోషిస్తూంటుంది (ఆమె ఆత్మాభిమానం). కానీ ఆ కొడుకు బోధిసత్వుడు తండ్రి ఎవరని అడిగేసరికి తీసికెళ్ళక తప్పలేదు. అప్పుడా ఉంగరాన్నీ, కొడుకునీ చూసిన రాజు కాదనలేక పోతాడు. కానీ ఈ వ్యవహారం తన ప్రతిష్ట పోగొట్టేలా వుందని నువ్వెవరో నాకు తెలీదు పొమ్మంటాడు.
        
అప్పుడామె, నిజం నిరూపించడానికి నా దగ్గర ఇంకో సాక్ష్యం లేదు. కొడుకుని పైకి విసురుతాను. వాడు గాలిలో ఆగిపోతే నీ కొడుకు, కిందపడి చచ్చిపోతే నీ కొడుకు కాదు అని కాళ్ళు పట్టుకుని పైకి విసురుతుంది. బోధిసత్వుడు గాలిలో బాసింపట్టు వేసుక్కూర్చుని, నేనే నీ కొడుకుని  అంటాడు. ఇక రాజు వాడ్ని స్వీకరించి తన వారసుడిగా, ఆమెని రాణిగా ప్రకటిస్తాడు. నిజం నేలమీద నోళ్ళ మధ్య బతకదని, దాని స్థానం పైనెక్కడో అతీతంగా వుంటుందనీ నీతి. అందుకే నేలమీద కుంటిదైన నిజం కాళ్ళు పట్టుకుని పైకి విసిరింది. ఆ నిజం గాలిలో రాజసంగా బాసింపట్టు వేసుక్కూర్చుని అబద్ధాల నోళ్ళు మూయించి పారేసిందన్న మాట.
        
దీన్ని కాళిదాసు హిందూ పురాణ కథగా మార్చేసరికి మహిమలు చోటు చేసుకున్నాయి. కాళిదాసుకి ఇంకో వెర్షన్ కూడా వుందని సమాచారముంది. అందులో శకుంతల పుట్టిన కొడుకుతోనే దుష్యంతుడి దగ్గరికి వెళ్తుంది- పై జాతక కథలో లాగా.

1966 తెలుగు- వెలుగు

ఇప్పుడు ఎన్టీఆర్- బి. సరోజాదేవిల శకుంతల రెండో ప్రధాన మలుపు చూస్తే- అద్భుతంగా ముస్తాబై శకుంతల బయల్దేరుతుంది. కణ్వ మహర్షి, అతడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఆశ్రమ వాసులూ వెంట వస్తూంటే, ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా, అత్తవారింటికి పోయిరావమ్మా పాట నేపథ్యంలో సన్నివేశాలుంటాయి. కొంగు లాగిన జింకతో, కణ్వుడితో, చెలికత్తెలతో. ఇది ముగిసి కణ్వుడి శిష్యులతో, పెంపుడు తల్లితో పడవెక్కిన తర్వాత- తెడ్డు వేస్తూ పడవ వాడు - శెంగాయి కట్టిన సిన్నదీ చారడేసి కళ్ళు ఉన్నదీ అని శకుంతల నుద్దేశించి పాడ్డం మొదలెడతాడు. (శకుంతల నుద్దేశించిన ఈ పాటలో- ఆపలేని బల్ తాపముతోటీ అంగలారుస్తూ వున్నదీ అని రసికత్వమేంటో?).  
        
పాటని ఆనందిస్తూ శకుంతల నదిలో చేయిపెట్టి తానూ తెడ్డు వేస్తున్నట్టు మైమరపులో వుంటుంది. పాట సాంతం నీట్లో చేయి ఆడిస్తూనే పారవశ్యంతో వుంటుంది. నీట్లో చేపలు వచ్చిపోతూంటాయి. పాట ముగింపులో వేలి కున్న ఉంగరం జారిపోతుంది. నీట్లో మునుగుతున్న ఉంగరాన్ని ఒక చేప నోటితో అందుకుంటుంది. చేయి నీట్లో అలాగే వుంచి పారవశ్యంతో  కళ్ళు మూసుకునే వుంటుంది శకుంతల.
        
ఈ రెండో ప్రధాన మలుపులో నాటకీయత నది మీదే వుంది. అంతకి ముందు సాగనంపుతున్నప్పుడు వుండదు. ముఖ్యంగా ఆమె వీడ్కోలులో ప్రకృతిని భాగం చేయలేదు. చేసి వుంటే కరుణరస పూరిత మనోహర దృశ్యాలుండేవి. మూడు సార్లు కణ్వుడితోనే బాధ పంచుకోవడం వుంటుంది. జింక కొంగు లాగే దృశ్యం పాట మధ్యలో వేయడం వల్ల పాటే డామినేట్ చేసింది. పైగా పాటలో కణ్వుడు జింక పుట్టుపూర్వోత్తరాలు చెప్పడం వల్ల కూడా నాటకీయతకి నష్టం జరిగింది. ఇవన్నీ జరిగి, ఇక శకుంతల జింకతో సంభాషించేటప్పటికి ఆ దృశ్యం ప్రాధాన్యమే తగ్గిపోయింది. పైగా గుండెల్లోంచి పలికే పలుకులతో, వాటి తాలూకు భావోద్వేగాలతో కాకుండా, పాట వేసి దృశ్యాలు చూపించడం వల్ల కరుణ రసమే కాదు, అసలు ఏ రసానికీ స్థానం లేకుండా పోయింది.
        
నాటకీయత అంతా సంఘటన జరిగే పడవ ప్రయాణంతోనే వుంది. ఇదంతా లాజికల్ గా వుంది. పడవ వాడి పాటకి నీట్లో చేయిపెట్టి ఆడిస్తుంది (ఇక్కడొక పొరపాటు- ఆమె నీట్లో కుడి చేయి ఆడిస్తుంది. కానీ ఉంగరం వున్నది ఎడమ చేతికి. ఆ ఉంగరం కుడి చేతి నుంచే జారిపోయినట్టు చూపించారు. షూటింగ్ సౌలభ్యం కోసం తప్పలేదేమో. కెమెరాని అవతలి ఒడ్డు వైపు పెట్టి ప్రయాణాన్ని చూపించలేరుగా. బయల్దేరిన ఇవతలి ఒడ్డు పాయింటాఫ్ వ్యూతోనే వుండాలి).
        
ఇప్పుడామెకి ఇందాకటి బాధంతా తొలగిపోయింది- ఇప్పుడు తను పుట్టింటిది కాదు- మెట్టినింటిది. ఇప్పుడు పుట్టింటి ఎమోషనల్ బ్యాగేజీనంతా మోసుకుంటూ వెళ్ళడం సరికాదు. కాబట్టి మ్లానమైన మనసంతా నదినీటి ప్రవాహంలో కడిగేసుకుంది. ఇదొకటి, దీన్తర్వాత- సంఘటన సీక్వెన్స్- పాట మొదట్నుంచీ నీట్లో చేయి ఆడించడం వల్ల ముందు జరగబోయేది మొదటి సారి సినిమా చూసే వాళ్ళ వూహకి అందదు. There is no terror in the bang, only in the anticipation of it... అని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అన్నాడని చాలా సార్లు చెప్పుకున్నాం (అన్నట్టు ఇవ్వాళ  ఏప్రెల్ 29 ఆయన వర్ధంతి). శాంతారాం శకుంతల లో చేయినీ, సడెన్ గా ఉంగరం పడిపోవడాన్నీ ఒకేసారి చూపించడం వల్ల బ్యాంగ్ లేకుండా పోయింది. హిచ్ కాక్ చెప్పేది బ్యాంగ్ కి ముందు దాని తాలూకు కథనం చేసుకురావాలనే.
          
కాబట్టి ఇప్పుడు తెలుగు శకుంతల పాట చివర్లో బ్యాంగ్ కి సంబంధించిన కథనంగా నీట్లో చేయి ఆడిస్తూ వుంది. మధ్య మధ్యలో నీట్లో చేపలు కూడా కన్పిస్తున్నాయి. నీట్లో చేయి, చేపలు- ఈ సీక్వెన్సులో విజువల్ కథనం సాగుతూ- సహజంగానే నీట్లో చేయి అంత సేపూ తడవడం వల్ల ఉంగరం వదులై జారిపోయింది ( మనకి కూడా చిన్నప్పుడు ఇదే జరిగింది. వర్షంలో బాగా తడుస్తూ ఇంటి కొచ్చేటప్పటికి వేలికున్న తులం తూగే ఉంగరం మాయం!). ఆ ఉంగరాన్ని చేపమింగేయడంతో ఎపిసోడ్ పరిసమాప్తం.
        
ఇక్కడ కూడా ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేటయ్యింది. ఇక్కడ కూడా సంఘటన కథని ముందుకి నడిపిస్తోంది జటిలం చేస్తూ. . సంఘటనే జరక్కపోతే? అదెలా వుంటుందో శాకుంతలం లో చూద్దాం...
-సికిందర్       


21, ఏప్రిల్ 2023, శుక్రవారం

1320 : మూవీ నోట్స్


 

    'శాకుంతలం లాంటి ఒక సినిమా తీయడానికి గత వందేళ్ళల్లో 20 రిఫరెన్సులు వుండగా కూడా, శాకుంతలం ని ఇంత నిరంకుశంగా సమర్పించారంటే కాళిదాసుని, కాళిదాసుని విశదపర్చిన పూర్వ కళాకారుల్నీ కేర్ చేయకపోవడమే. కనీసం రెండు రిఫరెన్సులు తీసుకున్నా శాకుంతలం ఇంత రస విహీనమయ్యేది కాదు. 1943 లో హిందీ శకుంతల’, 1966 లో తెలుగు శకుంతల ఈ రెండూ సరిపోతాయి. శకుంతల గాథని 1920 లోనే రెండు సార్లు మూకీల కాలంలోనే సినిమాగా తీశారు. ఇందులో మొదటిది బ్రిటిష్ నటి డరోతీ కింగ్ డమ్ నటించింది. 1929 లో దేశంలో తొలి దర్శకురాలు ఫాతిమా బేగం దర్శకత్వం వహించింది. ఇప్పటికి మూకీల నుంచి టాకీలకి అప్ గ్రేడయ్యాయి సినిమాలు. మళ్ళీ 1931 లో ఖుర్షీద్ బేగం నటించింది. 1931 లోనే జేజే మదన్ దర్శకత్వంలో ఇంకోటి. 1932 లో సురభి కమలాబాయి నటన. 1940 లో ఎంఎస్ సుబ్బు లక్ష్మి నటన. 1941 లో జ్యోత్స్నా గుప్తా నటన. 1943 లో వి. శాంతారాం దర్శకత్వంలో జయశ్రీ -చంద్రమోహన్ లు నటించిన హిందీ వెర్షన్ ఎన్నదగింది. ఇది అమెరికాలో విడుదలైన మొదటి భారతీయ సినిమాగా నమోదైంది. దీంతో బాటు 1966 లో తెలుగులో కమలాకర కామేశ్వరరావు  దర్శకత్వంలో ఎన్టీఆర్- బి. సరోజాదేవిలు నటించింది మరో మంచి రిఫరెన్సు. ఇలా 2022 వరకూ 20 సార్లు తీశారు శకుంతల గాథ. కానీ ఇప్పుడు 21 వ సారి శాకుంతలం ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది అయింది.

        ఇంకా ఇక్కడ విదేశీ వెర్షన్లు కూడా చెప్పుకుంటే, 1820 లో జర్మన్ సంగీత కారుడు ఫ్రాంజ్ షూబర్ట్ ఒపేరా కోసం ప్రారంభించిన స్వర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. శతాబ్దం తర్వాత 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో స్వరపర్చిన  లా లెజెండా డీ శకుంతల అనే ఒపేరా సిద్ధమైంది. దీని రెండో వెర్షన్ 1952 లో ప్రదర్శించారు. 1838 లోనే ఎర్నెస్ట్ రేయెర్ స్వరపర్చిన సాకౌంటల అనే బ్యాలే వుంది. ఇంకా 1962 లో సోవియెట్ రష్యా  సంగీతకారుడు సెర్గీ బలసనియన్ స్వరపర్చిన ఇంకో బ్యాలే శకుంతల వుంది. ఇలా వుండగా 2006 ఏప్రెల్ 23 న ఫ్రాంకో అల్ఫాన్సో ఒపేరాని రోమ్ లో తిరిగి ప్రదర్శించారు (చిత్రపటం చూడండి).

అంటే, ప్రపంచ కళాకారుల్ని శతాబ్దాలుగా ఇంతగా ఆకర్షిస్తున్న కాళిదాసు శకుంతల క్లాసిక్ ని చాలా గ్రాఫిక్స్ పెంచి కాదు, కుంచెని  ముంచి భావాత్మకంగా పెయింటింగ్ చేయాలన్న మాట! 

        శకుంతల యాక్టివ్ క్యారక్టర్ కాదు. ఆమె భర్త దుష్యంతుడు కూడా యాక్టివ్ క్యారక్టర్ కాదు. అందుకని ఇది కథ కాదు, గాథ. అంటే పాత్రలు దేనికవి సంఘర్షణ అనుభవిస్తాయి తప్ప పరిష్కారం కోసం పరస్పరం సంఘర్షించుకోవు. చివర్లో మూడో పాత్ర వచ్చి పరిష్కరిస్తుంది. కాబట్టి పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని ఇలాటి పురాణ గాథల్ని పరవశింపజేసే నాటకీయత ఒక్కటే కాపాడుతుంది. ఈ నాటకీయత గాథలో మూడు మలుపులు వచ్చే చోట్ల బలంగా, విజువల్ గా (అంటే సంఘటన ఆధారంగా) వుంటే, మలుపుల మధ్య కథనం కూడా అంతే రసోత్పత్తితో సమ్మోహనకరంగా వుంటుంది. దృశ్యాలు దృశ్యకావ్య హోదాని సంతరించుకుంటాయి. ఇదే చూస్తాం 1943, 1966 వెర్షన్లలో. ఈ క్రియేటివ్ ఎత్తుగడలు  గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడుకి తెలియదని చెప్పడం కాదు. శాకుంతలం పుణ్యమాని మనకి తెలియని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం మాత్రమే- రిఫరెన్సుల ఆధారంగా.

ఆరు ఘట్టాల గాథ

శకుంతల గాథ శకుంతల జననం, పెంపకం, పరిణయం, శాపం, తిరస్కారం, శాప విమోచనం అనే ఆరు ఘట్టాలుగా వుంది. ఈ ఆరు ఘట్టాల్లో స్టోరీలైన్ శకుంతల జీవిత చిత్రణే. ఆమె స్వశక్తు రాలు కాదు, పుట్టగానే అనాధ అయింది, అప్పట్నుంచీ పరాధీన గానే వుంది. పుట్టగానే శకుంత పక్షులు పెంచాయి. తర్వాత కణ్వ మహర్షి చెంతన దత్త పుత్రికగా  పెరిగింది. పోనీ దుష్యంతుడ్ని పెళ్ళి చేసుకుని స్థిరపడదామనుకుంటే, అతను మళ్ళీ వచ్చి తీసుకుపోతానని వెళ్ళి పోయాడు. యాగానికి వెళ్ళిపోయిన కణ్వుడి గైర్హాజరీలో తీసికెళ్ళ డం మర్యాద కాదని. ఇది చాలనట్టు దుర్వాసుడు వచ్చి ఆమెని శపించాడు, తర్వాత శాపవిమోచనం చెప్పినా, ఆ ఉంగరం పోగొట్టుకుని భర్త దగ్గర పరాభవాన్ని ఎదుర్కొంది. అడవుల్లో ఏకాకిగా మిగిలి బిడ్డని కంది. చివరికి భర్త తప్పు తెలుసుకుని వస్తే బాధల్లోంచి విముక్తి పొందింది. ఆడదానికే అన్ని పరీక్షలూ, ఆడదే అన్నీ భరించాలీ అనే ఇందులో నీతి. ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో. అప్పట్లో ఆడదానికి చదువు వుండేది కాదు కాబట్టి.

        ఈ స్టోరీలైన్లో శకుంతల బాధల్ని భరించడమనే పాయింటు ప్రధానంగా వుంది. ఇది శోక రసం. పాయింటు ఇది కాబట్టి ఈ శోక రసాన్ని ప్రధాన రసంగా తీసుకుని కథనం చేస్తూ, దీనికి వీర, శృంగార, అద్భుత, బీభత్స - తత్సంబంధ రసాల్ని అనుబంధ రసాలుగా చేసుకుని ఆయా దృశ్యాల్ని అలంకరించ వలసి వుంటుంది. ఇంతలో శోకం, మరింతలో శృంగారం; ఇంతలో శోకం, మరింతలో అద్భుతం- ఇలా సుఖదుఖాల ద్వంద్వాలతో ఎత్తుపల్లాల ప్రయాణ మన్నట్టుగా ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ చేస్తూ పోవాలి శకుంతల జీవిత కథని. సీన్లు ఇలా టూ డైమెన్షనల్ గా సాగాలి. అప్పుడు గాథ ఫ్లాట్ గా మారే ప్రమాదం తప్పుతుంది.

         శాకుంతలం లో వున్నది సాంతం డైమెన్షన్లు లేని ఫ్లాట్ గా సాగే సీన్లే. ఏ సీనూ రసాలూరదు. మామిడి పండు చీకి రసాలు జుర్రుకుంటున్నట్టు వుండదు. పాత్రగా శకుంతల కంటే పెద్ద ట్రాజడీ, టార్చర్ ఈ రస విహీన రచనే.                

        ముత్యాల ముగ్గు లో సెంట్రల్ క్యారక్టర్ సంగీతది ఆమెకి జరిగే ట్రాజడీలోంచి పెల్లు బికేది శోక రసమే అయినా, సినిమా శోకరస ప్రధానం కాదు. శోక రసాన్ని ప్రధాన రసంగా చేసి కథ నడపలేదు. నడిపితే ఫ్లాపయ్యేది. ఆమె శోకాన్ని తీర్చేందుకు ఆమె పిల్లలతో అద్భుత రసాన్ని ప్రధాన రసంగా చేసి వినోదాత్మకంగా కథ నడిపారు. ఇది కాల్పనిక కథ కాబట్టి సక్సెస్ కోసం ఎలాగైనా స్వేచ్ఛ తీసుకోవచ్చు. శకుంతల లాంటి పురాణంతో స్వేచ్ఛ తీసుకోలేరు. శోక రసాన్నే ప్రధాన రసంగా చేసి గాథ నడపాల్సిందే. సంగీతంలో బాణీల్ని కూర్చినప్పుడు ఏ వాద్యపరికరం ఎక్కడ ఎప్పుడు ఎలా శృతి కలుపుతూ పలుకుతుందో - అలా గాథలో ప్రధాన రసానికి అనుబంధ రసాలు పలికినప్పుడు దృశ్యాలు కట్టి పడేస్తాయి.

        పైన చెప్పుకున్నట్టు 1921 లో ఇటాలియన్ సంగీతకారుడు ఫ్రాంకో అల్ఫానో లా లెజెండా డీ శకుంతల అని సిద్ధం చేసిన ఒపేరా నోట్సు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం బాంబు దాడిలో ధ్వంసమయ్యాయి. అయినా పట్టువదలని అల్ఫానో 1952 కల్లా తిరిగి కొత్త నోట్సు పూర్తి చేసి ఒపేరాని ప్రదర్శించాడు. సంగీత రూపకంగా సాగే ఈ ఒపేరా చాలు- శకుంతల గాథలో పలికే వివిధ రసాల తీరుతెన్నులు తెలియడానికి. శాకుంతలం లో మణిశర్మ నేపథ్య సంగీతం ఏం పలికిందో, ఎందుకు పలికిందో వేరే స్టడీ చేయాలి సంగీతం తెలిసిన వాళ్ళు.

స్క్రీన్ ప్లేలో ఆ మూడు మలుపులు

శకుంతల గాథలోని  ఆరు ఘట్టాలు మూడు మలుపులతో వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ టూ. అంటే త్రీయాక్ట్స్ స్ట్రక్చరే. ప్రధాన పాత్రల మధ్య పరిష్కారం కోసం పరస్పర సంఘర్షణ వుండని త్రీ యాక్ట్స్. ప్లాట్ పాయింట్ వన్- దుర్వాసుడి శాప ఘట్టం. మిడ్ పాయింట్ -శకుంతల భర్త దుష్యంతుడి దగ్గరికి బయల్దేరే ఘట్టం. ప్లాట్ పాయింట్ టూ -దుష్యంతుడి సభలో శకుంతల పరాభవం. స్క్రీన్ ప్లేకి మూలస్తంభాలైన ఈ మూడు మలుపులూ శాకుంతలం లో తప్పుల తడకగా వున్నాయి. ఇందుకే వీటి మధ్య కథనం ఎక్కడికక్కడ కొడిగట్టిన దీపమైంది.

        1943 హిందీ శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ చూద్దాం :  తోటలో భర్త దుష్యంతుడి రాకకై నిరీక్షిస్తున్న శకుంతల (జయశ్రీ), నేస్తం లాంటి  జింక తన దగ్గరికి రావడంతో ప్రేమగా నిమురుతూ, ఎక్కడున్నావు ఇన్నాళ్ళూ, నన్ను మర్చిపోయావా?... నువ్వెందుకు మర్చిపోతావులే, నేనే మర్చిపోయా అని ఉలిక్కిపడి తేరుకుని, ఆఁ ? ... ఏమన్నాను నేనూ? మర్చిపోయానా? ఆఁ ?... అంటే... ఆయన కూడా ఇలాగే నన్ను మర్చిపోయాడా?’ అని బలహీన స్వరంతో అని, జింకని వదిలేసి ఆందోళనగా ఇంట్లోకి పరుగెత్తి, వేలికున్న ఉంగరం చూసుకుంటూ, మర్చిపోయావా నన్ను ప్రియా? నా గుండె తట్టుకోవడం లేదు... మర్చిపోయావా నన్ను ప్రియా?’ అని మరింత బలహీన స్వరంతో దుఖితురాలవుతున్నప్పుడు- గుమ్మంలోకి దుర్వాసుడు వచ్చేసి పిలుస్తాడు. ఒకసారి పిలుస్తాడు, రెండు సార్లు పిలుస్తాడు. పలకదు. తన దుఖంలో తానుంటుంది. ఇది గమనించని అతను, పిలుస్తున్నా పలక్కపోవడం అవమానంగా తీసుకుని శపిస్తాడు- నువ్వు ఎవర్నైతే తల్చుకుంటూ నన్నవమానించావో వాడు నిన్ను మర్చిపోవుగాక!  అని శాపం పెట్టి వెళ్ళిపోతాడు.

        అటు హస్తినాపురం రాజభవనంలో నిద్రిస్తున్న దుష్యంతుడు అదిరిపడి మేల్కొని సేవకుల్ని పిలుస్తాడు. సేవకులొచ్చి అడిగితే  ఏమీ చెప్పలేకపోతాడు.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దృశ్యంలో నాటకీయత శకుంతల జింకని పలకరించడంతో మొదలైంది. దుర్వాసుడు రాకముందు జింకని లీడ్ గా తీసుకుని మరపు గురించి, దాంతో ఆమెకి దుష్యంతుడి పట్ల కలిగిన సందేహాల గురించీ ఆందోళనకరంగా, శోక రసంతో సీను రన్ అవుతోంది. దుర్వాసుడొచ్చి అందుకు తగ్గట్టుగానే శాపం పెట్టడంతో (బీభత్స రసం) అవతల దుష్యంతుడు అన్నంత పనీ చేశాడు- శకుంతలని మర్చేపోయాడు. జింకతో మాట్లాడుతూ శకుంతల రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టింది (అద్భుత రసం). అందుకే అలా ఫీలయ్యింది. ప్రపంచంలో రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టేది ఇద్దరే - ఆడవాళ్ళు, జంతువులు. మగవాడు నెత్తి మీద ఢామ్మని పిడుగు వచ్చి పడే దాకా సోమరిగా టైమ్ పాస్ చేస్తూనే వుంటాడు.

        ఈ సీనులో ఇంకో అర్ధం కూడా చూడొచ్చు. ఆడదానివైనా నీ సిక్స్త్ సెన్స్ తో నువ్వు అనుమానిస్తే వెంటనే చర్య తీసుకో. అనుమానిస్తూ కూర్చోకు. అనుమానించిందే జరుగుతుంది. దటీజ్ హౌ మైండ్ వర్క్స్. శకుంతల అనుమాన నివృత్తికి పూనుకోకుండా వర్రీ అవుతూ కూర్చోవడం వల్లే ప్రకృతి ఆమె అనుమానాన్ని నిజం చేసేందుకు నెగెటివ్ ఫీలింగ్ రూపంలో దుర్వాసుడ్ని పంపింది.

        ఇలా ఈ ప్లాట్ పాయింట్ వన్ సీనుకి  డెప్త్ ఏర్పడింది. ఇందులో శాపంతో అవతల దుష్యంతుడి రియాక్షన్ కూడా చూపించి సర్కిల్ ని కంప్లీట్ చేశారు. ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా సరే. అయితే శకుంతలకి సంబంధించి రస పుష్టితో ఈ నాటకీయత కేవలం డైలాగులతో గాకుండా సంఘటనా పూర్వకంగా చూపించి వుంటే మరింత ప్రభావ వంతంగా వుండేది. ఎన్ని డైలాగులు చెప్పినా సంఘటన ఆధారంగా విజువల్ గా చెప్పినప్పుడే బలంగా రిజిస్టర్ అవుతుంది. 1943 లో వి శాంతారాం తలపోసిన నాటకీయత అప్పటి  విధానం కావొచ్చు. 1966 వచ్చేసరికి తెలుగులో కమలాకర కామేశ్వర రావు క్రియేషన్ విజువల్ నేరేషన్ కి ప్రాణం పోసింది. ఇదెలా వుందో చూద్దాం...

డెప్త్ లేని విజువల్ కాన్ఫ్లిక్ట్

1966 తెలుగు శకుంతల లో ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు మరపు గురించి ఫోర్ షాడోయింగ్ (పరిణామాల ముందస్తు హెచ్చరిక) సీను వుంటుంది. దుష్యంతుడు (ఎన్టీఆర్) శకుంతల (బి సరోజా దేవి) ని గాంధర్వ వివాహ మాడేక, గుర్తుగా ఉంగరమిచ్చి, మళ్ళీ వచ్చి తీసికెళ్తానని సెలవు తీసుకుంటున్నప్పుడు, శకుంతల బేలగా చూసి, నన్ను మర్చిపోతారేమో?’ అంటుంది. అందుకు దుష్యంతుడు, నేను మర్చిపోతానా? ఎంత మాట. నా ధర్మాన్ని మర్చిపోను, నన్ను నేను మర్చిపోను అని అనునయించి సెలవు తీసుకుంటాడు.

        దీని తర్వాత, ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీనులో- తోటలో శకుంతల ఆనందంగా విహరిస్తున్నప్పుడు చెలి కత్తెలు (శారద, గీతాంజలి) వచ్చి ఆటలు పట్టిస్తారు. శకుంతల, నా స్వామి నా కోసం కబురు పంపుతాడా?’ అంటుంది. ఆయన ఇప్పుడేం చేస్తూంటాడు అని కూడా అంటే, నీకంటే ఎక్కువ నీకోసం ఎదురు చూస్తూంటాడు అంటుంది చెలికత్తె. ఎలా?’ అంటే, ఏముందీ నీ బొమ్మని చూసుకుంటూ అంటుంది చెలికత్తె.

        అవతల హస్తినాపురంలో ఏవో మధుర వూహల్లో తేలిపోతున్న దుష్యంతుడ్ని చూసి భటుడు (పద్మనాభం), ఏంటో నీలో నువ్వు ముసిముసిగా  నవ్వుకుంటున్నావ్?’ అంటాడు. దుష్యంతుడు తేరుకుని బొమ్మ వేయడానికి సిద్ధమవుతాడు. అది చూసి భటుడు, కొంపదీసి అనాఘ్రాత పుష్పం ఆ అడవి పిల్లది కాదు కదా?’ అంటాడు.

        ఇటు తోటలో శకుంతల దుష్యంతుణ్ణి తల్చుకుంటూ మైమరపులో వుంటుంది. అక్కడికి దుర్వాసుడొచ్చి పిలిస్తే పలకదు. మళ్ళీ పిలిచినా తన లోకంలోంచి ఇవతలకి రాదు. దీంతో కోపంతో శపిస్తాడు. అతడి శాపం సృష్టించే కల్లోల వాతావరణానికి అవతల దుష్యంతుడు వేస్తున్న శకుంతల బొమ్మ ఎగిరిపోతుంది. ఈ గాలి దుమారమేమిటో అర్ధంగాక ఉక్కిరి బిక్కిరవుతాడు. ఆ బీభత్సానికి అతడి స్మృతి పథంలోంచి శకుంతల వైదొలగి పోతుంది.

        ఈ ప్లాట్ పాయింట్ వన్ దుష్యంతుడు వేస్తున్న బొమ్మ, గాలి దుమారం, బీభత్సం అనే సంఘటన ఆధారంగా విజువల్ యాక్షన్ తో వుంది. ఇది వి శాంతారాం సృష్టి కున్న డెప్త్ తో లేదు. అందులో మర్చిపోవడం అనే పాయింటుతో శకుంతల మానవ సహజ భయాలతో లాజికల్ గా వుంటే, తెలుగులో టీనేజి అమ్మాయి కలల విహారంతో డైమెన్షన్ లేకుండా సాదాగా వుంది ప్లాట్ పాయింట్ వన్ సీను ప్రారంభం- మర్చిపోవడమనే పాయింటు దీనికి ముందు సీనులో విడిగా వుండడం వల్ల - ప్లాట్ పాయింట్ వన్ సీను లో డెప్త్ లోపించింది.

        అదే శాంతారాం సృష్టిలో మర్చిపోవడమనే పాయింటుతోనే ప్లాట్ వన్ సీను రన్ అవడంతో డెప్త్, అర్ధం, పరమార్ధం కలిసొచ్చాయి. తెలుగులో తర్వాత దుర్వాసుడి శాపంతో విజువల్ యాక్షన్ని ప్రదర్శించింది సీను. దీంతో భౌతికంగా బలం చేకూరింది, మానసికంగా కాదు. అయినా ఈ హిందీ తెలుగు ప్లాట్ పాయింట్ వన్ సీన్లు ప్రేక్షకుల మెదళ్ళలో రిజిస్టర్ అయ్యేవే. తాజా శాకుంతలం లో కనీసం శాపం కూడా రిజిస్టర్ కాదు.

పాపం శాపం


        ప్లాట్ పాయింట్ వన్ సీనుకి ముందు ఫ్లాష్ బ్యాకుగా వేసిన సీన్లో, శకుంతలని పెళ్ళాడిన దుష్యంతుడు (దేవ్ మోహన్), శకుంతల (సమంత) తో అంటాడు- ‘...తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజ లాంఛనాలతో తీసుకెళ్తాను, దిగులు పడకు దేవీ అని. దీనికి శకుంతల అంటుంది, పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అని. దీనికి దుష్యంతుడు అంటాడు, భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. ఇక వెళ్ళనా?’ అంటాడు. బాధతోనే తలూపుతుంది. వెళ్ళిపోతాడు.

                ఈ సీను చాలా అసహజంగా, పేలవంగా వుంది. డైలాగులు అర్ధరహితంగా వున్నాయి. పై రెండు హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టుగా మర్చిపోవడం గురించి లీడ్ సీను, లేదా మెయిన్ సీను కాకుండా, ప్రేమ గురించి ఈ సీను వుంది. నన్ను మర్చిపోతారేమో?’ అనకుండా, మీ ప్రేమకి కూడా దూరమైతే?’ అంటుంది. కానీ తర్వాత దుర్వాసుడొచ్చి, దుష్యంతుడి ప్రేమకు దూరమవు గాక! అని శపించ బోవడం లేదు, దుష్యంతుడు నిన్ను మర్చిపోవుగాక! అని శపించడానికి రాబోతున్నాడు. కానీ సీను చూస్తే టార్గెట్ పాయింటు మరపు గురించి గాక, ప్రేమ గురించి వుంది! ఇలా వుంటే ఏం రక్తి కడుతుంది ఇంత పెద్ద సినిమా సీను?
                
            పైగా మీ ప్రేమకు కూడా దూరమైతే?’ అన్నప్పుడు దుష్యంతుడిచ్చిన అర్ధం లేని సమాధానం భవబంధాలకు దూరమైన కణ్వ మహర్షినే నీ ప్రేమతో కట్టి పడేశావు. చెట్లు పుట్టలు, జంతువుల ప్రేమను కూడా నీ సొంతం చేసుకున్నావు అని. అంటే, నా ప్రేమకు దూరమైనా నీకు చెట్టు పుట్టల ప్రేమ వుందిగా, జంతువుల ప్రేమ వుందిగా, మీ ఫాదర్ కణ్వ మహర్షి లవ్  కూడా వుంది, ఇంకేం అడ్జస్ట్ అయిపో అనా? ఏమిటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది? వీళ్ళు ప్రబంధ నాయికానాయకులా? వెనుక ఒక సీన్లో, నీకు జంతుజాలం ప్రేమ కాదు, మగని ప్రేమ కావాలని చెలికత్తెలు అన్నారే? వెనుక ఏం రాశారో చూసుకోరా?

                ఇక ఉంగరం సంగతి. ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగి, ఇదిగో మన ప్రేమ చిహ్నం అంటాడు. అది ప్రేమ చిహ్నమా, క్యాలండరా? ఆ ఉంగరం మీద ఎన్ని అక్షరాలున్నాయో అన్ని వారాల్లో తిరిగి వస్తాననని వాగ్దానం చేస్తూ, ఆమె లెక్కించుకోవడానికి ఇచ్చిన క్యాలండర్! పై హిందీ తెలుగు వెర్షన్లలో ఉంగరమివ్వడంలో ఇదీ అర్ధం. అంతేగానీ, మన ప్రేమకి చిహ్నంగా ఇదుంచుకో, వస్తా, నీకూ నాకూ ఇక బైబై! అని కాదు! ఇంత మైండ్ బ్లోయింగ్ గా రచన చేస్తే సినిమా గ్లోబల్ హిట్టే అవ్వాలి! 

                ఇక వెళ్ళనా అని వెళ్ళిపోతాడు. ఈ సీనంతా శకుంతల చెప్పలేని బాధతో, కన్నీళ్ళ తో వుంటుంది. దుష్యంతుడు వెళ్ళిపోవడం ఆమె కంత శిక్ష అన్నట్టు వుంటుంది.  అతను వెళ్ళిపోయాక ఆనందంగా పాట పాడుకుంటుంది. మానసిక స్థితిలో ఈ మార్పెందుకో తెలీదు. పాట పూర్తయ్యాక సకల రాజ లాంఛనాలతో దుష్యంతుడు వస్తూంటాడు. ఇదామె వూహ. వూహల్లో తరలి వస్తున్న దుష్యంతుణ్ణి చూసుకుంటూ మైమరపులో వుండగా, అట్నుంచి దుర్వాసుడు వస్తూంటాడు. దుర్వాసుడ్ని చూసి చెలికత్తెలు బెదిరిపోతారు. దుర్వాసుడి కోపం గురించి ఒక చెలికత్తె ఒక కథ చెప్తుంది. ఇలా దుర్వాసుడు దారిలో చెలికత్తె లతో పరిచయం ముగించుకుని శకుంతల దగ్గరి కొస్తాడు. ఆమె ఇంకా ఆ వూహా లోకంలోనే వుంటుంది. పిలిస్తే పలకదు. ఎంత పిలిచినా తిరిగి చూడదు. దీంతో తనని ఖాతరు చేయని శకుంతలని దుర్వాసుడు శపించి వెళ్ళిపోతాడు.

                ఇంటర్ కట్ లో ఈ శాపంతో అటు హస్తినాపురంలో దుష్యంతుడి రియాక్షన్ సీను హిందీ తెలుగు వెర్షన్లలో వున్నట్టు ఇక్కడ వుండదు. ఫ్లాట్ గా శకుంతల మీద సీనుతో పేలవంగా ముగిసిపోతుంది. దుర్వాసుడు వస్తూంటే సీన్లు వేసి అంత బిల్డప్ ఇచ్చారే గానీ, ఆ బిల్డప్ తో ఒరిగిందేమిటో చూపించలేకపోయారు. ఈ సీనులో మెయిన్ ఈవెంట్ అయిన దుర్వాసుడి శాపానికున్న శక్తి ఎలాంటిదో చూపించలేకపోయారు. అతడి శాపానికి హస్తినాపురం చేరే ఫ్రీక్వెన్సీ గానీ, వైబ్రేషన్ గానీ లేవు. మరి దుష్యంతుడు శకుంతలని  మర్చి పోయినట్టా, మర్చి పోనట్టా, ఏమైనట్టు? దారిలో సిగ్నల్ టవర్స్ లేకనా? జియో అంబానీకి చెప్పి ఏర్పాటు చేసుకోవాల్సుంటుందా? 

ఏ ఫ్రీక్వెన్సీ లేని, వైబ్రేషన్ లేని దుర్వాసుడి కూనిరాగం శాపంతో  సినిమా హిట్టవ్వాలని ఎలా ఆశిస్తారు. కథ పుట్టే ప్లాట్ పాయింట్ వన్ హిట్టవ్వకపోతే సినిమా ఎలా హిట్టవుతుంది. అసలు ఇది ప్లాట్ పాయింట్ వన్ సీను అని తెలుసుకుని రచన చేశారాని పెద్ద అనుమానం!

(మిగతా రేపుదయం)
—సికిందర్