రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, సెప్టెంబర్ 2022, సోమవారం

1218 : రివ్యూ!

 రచన - దర్శకత్వం : సతీష్ త్రిపుర
తారాగణం : సింహా కోడూరి, ప్రీతీ అస్రానీ, సముద్రఖని,
సంగీతం: కాల భైరవ ఛాయాగ్రహణం : యశ్వంత్ సి
నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి
విడుదల సెప్టెంబర్ 23, 2022
***

        తెలుగు సినిమాల్లో ఇదివరకు సాహసించని ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రధాన స్రవంతి సినిమాలకి సమాంతరంగా ప్రయోగాత్మక సినిమాల పరంపర కొనసాగుతోంది. చర్చల్లోకే రానివ్వని జానర్స్ ని ఇప్పుడు స్వాగతిస్తున్నారు. ఇదివరకు ప్రయోగాత్మక సినిమాలకి మార్కెట్ లేదనే వెనుకడుగు కాస్తా ఇప్పుడు ఓటీటీలతో ముందడుగుగా మారుతోంది. థియేటర్లో ఆడకపోయినా ఓటీటీల్లో ఆదాయముంటుందన్న నమ్మకం ఈ ముందడుగుకి వూతమిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి ఈ సమాంతర సినిమాల్ని ముందుకు తీసికెళ్తున్నాడు. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త వంటి సినిమాలతో ఈ సెగ్మెంట్ కి హీరోగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.

        తాజాగా ఈవారం దొంగలున్నారు జాగ్రత్త ని డి సురేష్ బాబు, తాటి సునీత వంటి ప్రముఖుల నిర్మాణ సారధ్యంలో, కొత్త దర్శకుడు సతీష్ త్రిపురతో కలిసి మరో విభిన్న సినిమాగా అందించాడు. ముట్టుకోవడానికే వెనుకాడే జానర్ ని తొలిసారిగా ప్రేక్షకులకి అందించాడు. ఇదేమిటో, దీని కథా కమామిషేమిటో ఓసారి చూద్దాం...

కథ

రాజు (సింహా) మెకానిక్ గా పనిచేసుకుంటూ భార్య నీరజ (ప్రీతీ అస్రానీ) ని పోషించుకుంటూ వుంటాడు. రాత్రి పూట ఆమెకి తెలియకుండా దొంగతనాలకి పాల్పడుతూంటాడు. త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు. ఆగి వున్న కార్లలో స్టీరియోలు, ఇతర విలువైన పరికరాలు తస్కరించి అమ్ముకోవడం అతడి నేరప్రవృత్తి. ఇలా ఓ రాత్రి ఖరీదైన కారు మీద కన్నేస్తాడు. కారులోకి జొరబడి పని ముగించుకుని బయటపడబోతూంటే, కారు డోర్స్ లాక్ అయిపోతాయి.

ఆ కారు చక్రవర్తి (సముద్రకని) అనే డాక్టరుది. దాన్ని అతను దొంగల్ని ట్రాప్ చేయడానికి అనువుగా కస్టమైజ్ చేయించుకున్నాడు. రిమోట్ లో ఎక్కడో వుండి కారుని కనిపెట్ట గలడు. ఆపరేట్ చేయగలడు. ఇప్పుడు బోనులో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్న రాజు ని చూసి
, ఓ ఆట ఆడుకునేందుకు స్కెచ్ వేస్తాడు. అతను రిమోట్ లో మాట్లాడితే కారులో వాయిస్ విన్పిస్తుంది. రాజుకి కాల్ చేస్తాడు డాక్టర్ చక్రవర్తి. ఆ కాల్ తో షాక్ తింటాడు రాజు. ఏమిటా కాల్? తను ఇలా బందీ అవడం వెనుక డాక్టర్ తో బాటు పోలీస్ కమీషనర్ (శ్రీకాంత్ అయ్యంగార్), ఇంకా తన భార్య సైతం ఎందుకున్నారు? ఏమిటిదంతా? ఈ ట్రాప్ దేనికి? ఇందులోంచి ఎలా బయటపడ్డాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సర్వైవల్ డ్రామా జానర్ కథ. హాలీవుడ్ లో విరివిగా వస్తూంటాయి. దీవిలో చిక్కుకున్న వొంటరి హీరోతో కాస్ట్ ఎవే’, శవపేటికలో బందీ అయిన హీరోతో 127 అవర్స్’, అడవిలో ఆటవికులతో ప్రమాదంలో పడ్డ హీరోతో అపొకలిప్టో...ఇలా వందల్లో వుంటాయి. ప్రాణ గండంలో పడ్డ పాత్ర చేసే బ్రతుకు పోరాటాలే ఈ జానర్ కథలు. ప్రస్తుత కథని 4x4 అనే  అర్జెంటీనా- స్పానిష్ మూవీ లోంచి తీసుకుని ఫ్రీమేక్ చేశారు. అంటే కాపీకొట్టారు. ఇదింకా హాలీవుడ్ లో రీమేక్ అవుతోంది.

 ఐతే ఈ ఒరిజినల్లో వున్న విషయం గానీ, బలంగానీ ఫ్రీమేక్ లో లేకపోవడం విచారకరం. గంటన్నర సినిమాని కూడా కూర్చోబెట్టేలా తీయకపోతే ఎలా? ఒరిజినల్ దర్శకుడు టీవీలో చూసిన ఒక వార్త ఆధారంగా సినిమా తీశాడు. తీసినప్పుడు చాలా బలమైన ఫ్యామిలీ డ్రామా సృష్టించాడు. దివంగత ప్రఖ్యాత సినీ విమర్శకుడు రోజర్ ఎబర్ట్ అన్నట్టు, అర్జెంటీనా, స్పానిష్ దేశాలు భారీ బడ్జెట్ సినిమాలు తీయలేవు. అందుకని తమ మార్కెట్ ని ముంచెత్తుతున్న హాలీవుడ్ సినిమాలని ఎదుర్కోవాలంటే, తీస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలని కథా బలంతోనే తీయాలి. అలా మంచి కథా బలమున్న థ్రిల్లర్స్ తీస్తూ ప్రపంచ దృష్టి నాకర్షిస్తున్నారు.


'దొంగలున్నారు జాగ్రత్త అంటూ దొంగిలించిన కథతో సినిమా తీసినప్పుడు, సగం వరకే అద్భుత చోర కళ కన్పిస్తోంది. మిగిలిన సగం చిల్లర విషయంగా మారిపోయింది. సింహా పాత్రని, జీవితాన్నీ పరిచయం చేస్తూ మందకొడిగా సినిమా సాగినా, కారులో చిక్కున్నాక ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది కథలో. డాక్టర్ కాల్ తో బ్యాగ్ గ్రౌండ్ మిస్టరీ జత కలుస్తుంది. కానీ  ఇంటర్వెల్ కొచ్చేసరికి సంబంధం లేని విషయంతో విశ్రాంతి పడుతుంది.

ఇక సెకండాఫ్ కొచ్చేసరికి ఫస్టాఫ్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ గోప్యత లేకుండా తెలిసిపోతూంటాయి. ఎప్పుడైతే తెరవెనుక పాత్రలతో వున్న మిస్టరీ తెలిసిపోయిందో ఇక సినిమా బోరు కొట్టడం మొదలెడుతుంది. ఎలా వుంటుందంటే, ఈ మిస్టరీ ఇంటర్వెల్ దగ్గరే తేల్చేసి సినిమా ముగించేయొచ్చు కదా అన్నట్టు వుంటుంది.

నటనలు- సాంకేతికాలు

సింహా నిజాయితీగా కష్టపడి పాత్రకీ, సినిమాకీ ప్రాణం పోయాలనుకున్నాడు. పాత్రకైతే ప్రాణం పోశాడుగానీ సినిమాకి కుదర్లేదు. పాత్రే కథని పుట్టిస్తుంది. ఒరిజినల్లోని పాత్రని అర్ధం జేసుకుంటే, అలాటి దొంగోడు తనకి తగ్గ శిక్ష కూడా అనుభవించాలన్న నేరము - శిక్ష కాన్సెప్టుతో వుంటుంది. కారులో చిక్కుకుని ఎంత హైన్యం అనుభవిస్తాడంటే, ఆకలికి కాగితాలు తినేస్తాడు, దప్పికకి తన మూత్రమే తాగేస్తాడు. తెలుగులో శిక్ష విషయం మర్చిపోయి, ఎలా బయటపడాలా అనేదే పాత్రగా చేసినప్పుడు, సమగ్ర పాత్ర చిత్రణ కొరవడి కథా బలం కనుమరుగైంది.      

    సముద్రకని, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రీతీ అస్రానీలు ఎంత బాగా నటించినా అవసరం లేని సెకండాఫ్ కథని ఎలా నిలబెట్టగలరు. కాలభైరవ నేపథ్య సంగీతం మాత్రం ఒక ఆకర్షణ. కారులో బందీ అయిన హీరో అనే సింగిల్ లొకేషన్ కథతో కెమెరా వర్క్ కష్టమైనదే. కారులో ఆ స్పేస్ లోపలే స్ట్రగుల్ చూపడం. దీనికి గైడ్ బుక్ లా ఒరిజినల్ మూవీ వున్నా, అలాటి టెక్నికల్ షాట్స్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఇక డైలాగులు చూస్తే అవి పైపైన వున్నాయి. ఒరిజినల్ మూవీ స్క్రిప్టు చూసి వుంటే, డైలాగులు ఏ లోతుపాతుల్లోంచి రాశారో అర్ధమయ్యేది. ఇలాటి పరిమిత బడ్జెట్ సినిమాలకి స్క్రిప్టే ప్రాణం. ఇదే అర్జెంటీనా, స్పానిష్ సినిమాల విజయరహస్యం.

    దర్శకుడు సతీష్ త్రిపుర సాహసించి ఈ ప్రయోగం చేయడం మంచిదే. అయితే దర్శకత్వం మీద ఎక్కువ కృషి చేయాల్సివుంటుంది. ఒరిజినల్ మూవీ దర్శకుడి ఇంటర్వ్యూలు కూడా చదివి వుంటే దీనికి దర్శకత్వం వహించేందుకు తగిన విషయ పరిజ్ఞానం సమకూరేది.  

చివరికేమిటి
        సహ నిర్మాత సునీత తాటి ప్రయోగాత్మక సినిమాలు తీస్తున్నారు. ఓహ్ బేబీ, శాకినీ ఢాకినీ, దొంగలున్నారు జాగ్రత్త. మూడూ ఫారిన్ రీ/ఫ్రీ మేకులే. గత వారమే శాకినీ ఢాకినీ విడులైంది. వెంటనే ఈ వారం దొంగలున్నారు జాగ్రత్త. రెండూ బోల్తా కొట్టాయి. సి గ్రేడ్ సినిమాలు ఎవరైనా తీయగలరు. తను చేయాల్సింది ఇలాటి చిన్న సినిమాల డీఎన్ఏ ని పసిగట్టి వాటిని పకడ్బందీగా తీయడమే. చిన్న సినిమాల స్క్రిప్టు అంటే ఏమిటో తెలుసుకోవడమే. లేని పక్షంలో స్క్రిప్టు అవసరం లేని పెద్ద హీరోలతో తీసుకోవచ్చు. విలక్షణ ఫారిన్ కాన్సెప్ట్స్ ని ఇలా అన్ పాపులర్ చేయకుండా.

—సికిందర్



25, సెప్టెంబర్ 2022, ఆదివారం

1217 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : అనీష్ ఆర్.కృష్ణ
తారాగణం : నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం : మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
బ్యానర్ : ఐరా క్రియేషన్స్
నిర్మాత : ఉషా ముల్పూరి
విడుదల :  సెప్టెంబర్ 23,  2022
***
        హ్యాండ్సమ్ హీరో  నాగ శౌర్య 2017 లో ఛలో తర్వాత నటించిన 6 సినిమాలతో పరాజయాల్ని చవి చూశాక, తిరిగి తన సేఫ్ జోన్ అనుకున్న రోమాంటిక్ కామెడీ కొచ్చాడు. ఇందులో తను పోషించిన బ్రాహ్మణ హీరో పాత్రగురించి మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. సినిమా కోసం పాదయాత్ర కూడా చేశాడు. సొంత బ్యానర్ లో నిర్మించాడు. దర్శకుడు అనీస్ కృష్ణ అలా ఎలా తర్వాత లవర్’, గాలి సంపత్ అనే రెండు ఫ్లాపులిచ్చి తిరిగి ఈ రోమాంటిక్ కామెడీ ప్రయత్నించాడు. ఇందులో మూడు హిందీ సినిమాల నటి, గాయని షిర్లీ సెటియాని హీరోయిన్ గా తీసుకున్నాడు. సీనియర్ నటి రాధికని తారాగణంలో భాగం చేశాడు. మరి ఇన్ని హంగులు సమకూర్చుకుని ఈసారి ఎలాటి సినిమా ఇచ్చాడు దర్శకు డు? నాగశౌర్యకి  ఈ సారి హిట్టేనా? ఇవి తెలుసుకుందాం...

కథ

కృష్ణా చారి (నాగ శౌర్య) గోదావరి జిల్లా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి, తల్లి అమృతవల్లి (రాధికా శరత్ కుమార్) ఆదుపాజ్ఞల్లో వుంటాడు. తల్లి నియంత్రణలో ఎంత కుటుంబ సాంప్రదాయాలకి కట్టుబడి వున్నప్పటికీ, జీవితాన్ని ఇంకా పూర్తిస్థాయిలో జీవించే స్వేచ్ఛని కోరుకుంటాడు. అలా హైదరాబాద్ వచ్చి ఒక ఐటీ సంస్థలో టెక్నికల్ ట్రైనీగా చేరతాడు. అక్కడ నార్త్-ఇండియన్ బాస్ వ్రింద (బృందని హిందీలో వ్రింద అంటారు. బృందావన్ ని వ్రిందావన్ అంటారు. ముక్కలు ముక్కలుగా కృష్ణ వ్రింద విహారి అని వున్న సంకర టైటిల్ కనీసం గ్రామటికల్ గా, కృష్ణా వ్రిందా విహారీ గా వుండాలి. అర్ధవంతంగా తెలుగులో చెప్పుకోవాలంటే కృష్ణా బృందా విహారీ) ని చూసి ప్రేమలో పడిపోతాడు.

ఐతే వ్రింద (బృంద) కో సమస్య వుంటుంది. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని అతడ్ని తిరస్కరిస్తుంది. దీన్ని ఇంట్లో మేనేజ్ చేస్తానని చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇంటికెళ్ళి క్రికెట్ ఆడుతోంటే బాల్ వచ్చి తగలరాని చోట తగులుతుంది. దీంతో డాక్టర్ (వెన్నెల కిషోర్) తో నాటకమాడి తన వికెట్ డౌనైందని, పిల్లలు పుట్టరని చెప్పి తల్లికి షాకిస్తాడు. దీంతో ఎలాగైనా కొడుకు పెళ్ళయితే చాలని సాంప్రదాయ విరుద్ధంగా వున్నా, వ్రిందతో పెళ్ళి జరిపించేస్తుంది తల్లి. ఇలా పెళ్లి చేసుకున్నాక, వ్రింద సమస్యని దాచడానికి ఇంకెన్ని నాటకాలాడాడన్నది మిగతా కథ.

 ఎలా వుంది కథ

పార్టీలో గొడవలున్నా రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర తో సర్దుకు పోగలం గానీ, కథతో గొడవలున్న నాగశౌర్య కథ జోడో అన్నట్టు పాద యాత్ర జరిపితే రాహుల్ ఫలితాలే రావు. రాహుల్ అయితే నడుస్తున్న కాంగ్రెస్ సినిమా లో హీరోగా నటించకుండా తప్పించుకుంటున్నాడు. నాగశౌర్య నటించి ఇరుక్కున్నాడు. సినిమాలో ఇదే కథతో ఇటీవలే నేచురల్ స్టార్ నాని అంటే సుందరానికి నటించేశాడు, ఇదే బ్రాహ్మణ పాత్రతో. రెండిట్లోనూ హీరోయిన్ కి పిల్లలు పుట్టని సమస్యే, అబద్ధాల డ్రామాయే. అంటే ఈ ఇద్దరు దర్శకులూ ఎక్కడ్నించో కథని ఎత్తేసి వుండాలి. దీని కోసం నాగశౌర్య పాదయాత్ర చేశాడు.

ఇలా ఒకే కథ రెండుసార్లు చూసే అవకాశం ప్రేక్షకులకి దక్కుతోంది. కథతో సమస్యేమిటంటే సరైన కాన్ఫ్లిక్ట్ లేదు. దీంతో సెకండాఫ్ కథ ఎటు పోతోందో అర్ధంగాదు. అసలు ఈ నాటకమాడాల్సిన అవసరమే లేదు. ముందు కృష్ణాచారి వ్రిందని పెళ్ళి చేసుకుంటే, పిల్లలు పుట్టని సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఏడాది తర్వాతో రెండేళ్ళకో ఎదురయ్యే సమస్య కావొచ్చు. అప్పుడు కూడా ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదాలేసుకుంటూ పోవచ్చు. పెళ్ళి చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు ఇంట్లో ఎదురవుతున్న సమస్యే కాదు.

కథకి లాజిక్ లేకపోవడంతో కాన్ఫ్లిక్ట్ కుదర్లేదు. సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథ అర్ధం లేని అబద్ధాలతో, డ్రామాతో నడుస్తుంది. అసలు అబద్ధాలతో నడిచే డ్రామాలు ఎన్నో సినిమాలుగా వచ్చేశాయి. మళ్ళీ అదే పాత నాటకాలు వర్కౌట్ కావు. హీరోయిన్ కి పిల్లలు పుట్టని సమస్యని దాచి పెడితే నాగశౌర్యకి ఎదురయ్యే ప్రధాన సమస్య, సాంప్రదాయ పట్టింపులున్న తల్లిని ఆధునిక నార్త్ అమ్మాయితో పెళ్ళికి ఒప్పించడమే అవ్వాలి.

ఫస్టాఫ్ ప్రారంభంలో తల్లి క్యారక్టర్ ని ఇలాగే ఎస్టాబ్లిష్ చేశారు. కేర్ ఫ్రీ కొడుకుతో సాంప్రదాయాల సంఘర్షణకి దారితీసే ప్రతికూల పాత్రవుతుందన్నట్టుగా. ఇది వదిలేసి తల్లికి కొడుక్కి పిల్లలు పుట్టని డ్రామా తెచ్చి అడ్డేయడంతో, ఆమె కట్టుబాట్లు వదిలేసి, కొడుక్కి పెళ్ళయితే చాలని నార్త్ అమ్మాయి తో పెళ్ళికి రాజీపడి పోతుంది. ముందు ఎస్టాబ్లిష్ చేసిన తల్లి పాత్ర ఇలా వీగిపోవడంతో కథే తేలిపోయింది. ఇంకోటేమిటంటే, అన్ ఫిట్ కొడుక్కి పెళ్ళయితే చాలని రాజీపడిపోయి ఇంకో అమ్మాయి గొంతెలా కోస్తుంది? ఇలాటి అర్ధం లేని పాత్రచిత్రణలతో కుటుంబ ప్రేక్షకులు తరలి రావాలని ఆశలు పెట్టుకుని కుటుంబ సినిమాలు తీస్తారా?

ఫస్టాఫ్ లో తనకి పిల్లలు పుట్టరని హీరోయిన్ చెప్పేముందు- తనకి పెళ్ళీ గీళ్ళీ లాంటివి పడవని, మూడ్ వున్నంత కాలం జాబ్ చేసి, ఆ తర్వాత వరల్డ్ టూరు వేసుకుంటానని చెప్తుంది హీరోతో. ఆమెకున్న పిల్లలు పుట్టని సమస్యతో జీవితాన్ని అలా ఫిక్స్ చేసుకుంది. ఇలా ఎంతో బాక్సాఫీసు అప్పీలుతో కొత్తగా, యూత్ ఫుల్ గా వున్న ఈ పాయింటునే కథగా ముందుకి తీసికెళ్ళకుండా, తన జీవితానికి తగ్గ ప్లానింగ్ తో వున్న అమ్మాయిని తెచ్చి ఇంట్లో అత్తాకోడళ్ళ పాత మూస డ్రామాలో పడేశారు. ఇంతకంటే నాసి రకం ఫ్యామిలీ సినిమా వుంటుందా? ఇంకోటేమిటంటే, కథే ఇలా మారిపోవడంతో ఈ కథలో బ్రాహ్మణ కుటుంబం అవసరమే లేదు.

నటనలు- సాంకేతికాలు   

బ్రాహ్మణ బాడీలాంగ్వేజీ అంటూ నాగశౌర్య ఎంతో ప్రచారం చేసుకున్న విధంగా క్యారక్టర్ ఏమీ లేదు. రెగ్యులర్ హీరో పాత్ర లాగే నటించేశాడు. బ్రాహ్మణ పాత్ర ఎలా వుండాలో ఆలోచించుకుని వుంటే, తల్లి పెంపకంలో అతను పద్యాలూ శ్లోకాలూ పురాణాలూ వేదాలూ వల్లించి వేయగల పాండిత్యంతో వుండేవాడు. కేవలం మందు, సిగరెట్, మాసం ముట్టనంత మాత్రాన బ్రాహ్మణుడైపోడు. రోడ్డు మీద స్వీపర్ ని అపర దేవ కన్యలా వూహించుకుని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో రోమియో అయిపోడు. తర్వాత ఆఫీసులో హీరోయిన్ని చూసి ఇదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కామెడీలేసుకుని చీప్ అయిపోడు. తనదంటూ ఒక దృక్పథంతో వుండాల్సిన వాడు.

ఫస్టాఫ్ హీరోయిన్ని ప్రేమించి
, ప్రేమించేలా చేసుకునే కామెడీల వరకూ యాక్టివ్ పాత్రే. హీరోయిన్ తన సమస్య ముందు పెట్టాక, ఏం చేయాలో తెలీని పాసివ్ పాత్రగా మారిపోయి సెకండాఫ్ కథని దాని ఖర్మానికి వదిలేశాడు. కుటుంబ డ్రామా అనుకుంటే అందులో బలమైన సన్నివేశాల ఆలోచన కూడా చేయలేదు. కాన్ఫ్లిక్టే సరిగా లేనప్పుడు కథా బలమెక్కడుంటుంది. ఫస్టాఫ్ లో గ్రూప్ సాంగ్ ఒక్కటే సినిమాలో బాగున్న పాట. ఇక ఐటీ కంపెనీలో నాగశౌర్య కామెడీలు, ఫైట్ ఏ మాత్రం ఆకట్టుకోవు. ఫైట్ లో షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తాడు. జంధ్యం కూడా కన్పిస్తుంది. ఫైటర్ ఆగిపోతాడు. ఏం చూసి ఆగిపోయాడు- జంధ్యం చూశా, సిక్స్ ప్యాక్ చూశా? ఏదో వొక పాయింటే వుండాలి. కథకి సాంప్రదాయాల సంఘర్షణా, పిల్లలు పుట్టని సమస్యా అని ఏదో వొక పాయింటు లేనట్టు- ఇక్కడ కూడా ఇదే. ఏం దర్శకత్వమో ఇది!

హీరోలు సిక్స్ ప్యాక్ చూపించుకుని దంచడం మామూలే. అది హీరోయిజం. కానీ జంధ్యం వున్నప్పుడు సిక్స్ ప్యాక్ చూపించుకుంటే హీరోయిజం దెబ్బతింటుంది. ఫైట్ లో షర్టు చిరిగి సిక్స్ ప్యాక్ తో బాటు జంధ్యం వాటికవే బయటపడితే అప్పుడది ఫైటర్ కి డబుల్ బ్యాంగ్ అవుతుంది. ఇలా కాకుండా హీరోయే షర్టు విప్పి రెండూ చూపించుకుంటే- నాకు జంధ్యముందిరా, నన్నే కొడతావా - అని సెంటిమెంటు అడ్డమేసి తప్పించుకోవడమవుతుంది. ఇక సిక్స్ ప్యాక్ తో పనిలేదు.

దర్శకుడికి చాలా కామెడీ నేర్పు వుందని నాగశౌర్య చెప్పినట్టు ఓ రెండు మూడు చోట్ల ఫక్కున నవ్విస్తాయి డైలాగులు
, అంతే. ఇందులో కామెడీ కింగ్ వెన్నెల కిషోర్ కూడా వృధా అయ్యాడు. సత్య, రాహుల్ రామకృష్ణల కామెడీ కూడా ఫ్లాట్ గా వుంది. ఇక మదర్ పాత్రలో రాధిక ఒక కన్ఫ్యూజుడు పాత్రగా మారింది. కథలో హీరోకి ప్రతిగా వుండాల్సిన ప్రత్యర్ధి పాత్ర ఆమే. ఇది కూడా గుర్తించకుండా దర్శకుడు ఆమెని అయోమయ వ్యక్తిగా తయారు చేశాడు. ఆ వ్రిందా ఏంటిరా నా బొంద? తెలుగులో బృందా అని పిలిచి చావక?’ అని కూడా అనదు.

ఇక హీరోయిన్ షిర్లీ విషయానికి వస్తే ఈమెది కూడా దర్శకుడి చేతిలో బలైపోయిన పాత్రే. మంచి రూపం వుంది
, నటన వుంది. లేనిదల్లా సరైన డెప్త్ వున్న పాత్ర. తన  వ్యంధత్వాన్ని తనే ఫీలవ్వని, ఎమోషన్లు లేని ఫ్లాట్ పాత్ర చిత్రణ. 

మహతీ సాగర్ సంగీతం
, సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా వున్నాయి. సొంత బ్యానర్లో నిర్మాణానికి బాగానే ఖర్చు పెట్టారు గానీ, వచ్చిన సోకాల్డ్ ఫ్యామిలీ సినిమానే మళ్ళీ అరిగిపోయిన రికార్డులా తీయకుండా వుండాల్సింది. నాగశౌర్య ఇక ఈ ఫ్యామిలీలూ ప్రేమ డ్రామాల దుకాణాలు బంద్ చేసి, యూత్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవడం మంచిది.

—సికిందర్


23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

1216 : కాశ్మీర్ సినిమా!

 

     క తరానికి తరం సినిమా హాలు మొహం చూడకుండా పెరిగారు. సినిమా హాలు ఎలా వుంటుందో వాళ్ళకి తెలీదు, సినిమా హాల్లో సినిమాలు చూసి ఎరుగరు.  సినిమా హాల్లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు జమ్మూ వరకూ వెళ్ళాలి. గత 30 ఏళ్ళుగా కాశ్మీర్ లో ప్రేక్షకుల దుస్థితి ఇది. డీవీడీలు, పెన్ డ్రైవ్ లు వేసుకుని సినిమాలు చూడాల్సిన పరిస్థితి. ఆ మధ్య ప్రభుత్వం ఇంటర్నెట్ ని నిలిపివేయడంతో ఆన్ లైన్లో కూడా సినిమాలు చూడలేని దురవస్థ. ఇక దీని కంతటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం కాశ్మీర్లో రెండు మల్టీప్లెక్సులు ప్రారంభించింది. ఫుల్వామాలో ఒకటి, సోఫియాన్ లో ఒకటి. రెండూ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే. ఉగ్రవాదులకీ, భద్రతా దళాలకీ మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే రణ రంగాలే.

        నేపథ్యంలో గత మంగళవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రెండు చోట్లలో రెండు ఐనాక్స్ మల్టీప్లెక్సులు ప్రారంభించారు. లాల్ సింగ్ చద్దా ప్రారంభోత్సవ చలన చిత్రంగా ప్రదర్శించారు. లాల్ సింగ్ చద్దా అనగానే ఇటీవల బాయ్ కాట్ గ్యాంగులు గుర్తుకొస్తారు. ఈ గ్యాంగులు లాల్ సింగ్ చద్దా ఆడకుండా చావుదెబ్బ కొట్టి వదిలారు. థియేటర్ల ముందు ఈ సినిమాకి రావద్దని మైకులు పట్టుకుని మరీ హెచ్చరించారు. అలాటిది కాశ్మీర్ లో సైలెంట్ గా వున్నారు. అక్కడ తమ ప్రభుత్వమే ఈ సినిమాని ప్రదర్శిస్తోంది కదా? ప్రభుత్వానికి కూడా కాశ్మీర్లో ప్రధానంగా వుండే ముస్లిం ప్రేక్షకుల్ని మల్టీప్లెక్సులకి ఆకర్షించాల్సిన అవసరముంది కదా? అలాంటప్పుడు అమీర్ ఖాన్ ని ఆలింగనం చేసుకుని లాల్ సింగ్ చద్దా కాకుండా, కాశ్మీర్ ఫైల్స్ ని ప్రదర్శిస్తుందా?

మరి ప్రేక్షకులు వచ్చారా? వస్తున్నారా? కరోనా మహమ్మారి తగ్గినా దేశంలో థియేటర్లకి రావడానికి ప్రేక్షకులు గుండెలరజేత బట్టుకుని సందుమొగలోంచి వెళ్ళాలా వద్దా అని ఎలా పొంచి పొంచి చూసే వాళ్ళో, అదే కాశ్మీర్ ప్రేక్షకుల పరిస్థితి. అక్కడిప్పుడు కరోనా లేదు, టెర్రరిస్టులున్నారు. ఈ టెర్రరిస్టులే 30 ఏళ్ళ క్రితం సినిమా హాళ్ళు మూయించేశారు. ఎప్పుడు తెరవడానికి ప్రయత్నించినా దాడులు చేశారు.

మూసివేతల చరిత్ర

        1989 ఆగస్ట్ లో, ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ నేతృత్వంలో అంతగా తెలియని మిలిటెంట్ గ్రూపు అల్లా టైగర్స్ కాశ్మీర్లో థియేటర్లు, బార్ లు మూసివేయాలని హెచ్చరికని జారీ చేసింది. లా షరకేయా వాలా గరాబేయా, ఇస్లామియా, ఇస్లామియా (ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు ఇస్లాం ఈజ్ ది బెస్ట్) అనే 1979 నాటి ఇరాన్ విప్లవ నినాదాన్ని మార్మోగించింది. సినిమాలు ఇస్లాం వ్యతిరేకమని హెచ్చరించింది. స్థానికులు ఖాతరు చేయకపోవడంతో కొన్ని సినిమా హాళ్ళు తగులబెట్టారు. దాంతో డిసెంబర్ కల్లా మిగిలిన సినిమా హాళ్ళు మూసేశారు. మొత్తం లోయలో రీగల్, ఫిర్దౌస్, షీరాజ్, నీలం, బ్రాడ్‌వే, ఖైబర్, సమద్, రెజీనా, షాకర్ మొదలైన 12 సినిమా హాళ్ళు వుండేవి. బాలీవుడ్ సినిమాలు జోరుగా ఆడేవి.

దశాబ్దం తర్వాత 1999లో, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం- రీగల్, నీలం, బ్రాడ్‌వే థియేటర్లు మూడూ తిరిగి ప్రారంభిస్తే, రీగల్ థియేటర్లో బాంబు దాడికి పాల్పడ్డారు టెర్రరిస్టులు. ఒక ప్రేక్షకుడు మరణించి, 12 మంది గాయపడ్డారు. దీంతో మళ్ళీ మూత బడ్డాయి. ఆ తర్వాత చాలా సినిమా హాళ్ళు షాపింగ్ కాంప్లెక్సులుగా, నర్సింగ్‌హోమ్‌లుగా, పారామిలటరీ బలగాల శిబిరాలుగా మారిపోయాయి.

ఇక సైన్యమే పూనుకుని నాలుగు థియేటర్లని ప్రారంభిస్తూ, వాటికి మాజీ సైనికాధికారుల పేర్లు పెట్టింది. టెర్రరిస్టుల నుంచి తీవ్ర బెదిరింపుల కారణంగా వాటిని మూసేసి కాన్ఫరెన్సు హాళ్ళుగా ఉపయోగించుకో సాగారు. ఇలా స్వయంగా భద్రతా దళాలే అభయమిచ్చినా ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. అలాంటిది ఫుల్వామా, సోఫియాన్ లాంటి హై రిస్కు ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు ప్రారంభిస్తే ప్రేక్షకుల ప్రతిస్పందన అంతంత మాత్రంగానే వుంది. ఇక కుటుంబాలు కదిలివచ్చి సినిమాలు చూసే ప్రసక్తే లేదు.

కాశ్మీర్‌లో అధిక భద్రతా ఏర్పాట్లు వున్నప్పటికీ లక్ష్యిత దాడులు జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్సులు టెర్రరిస్టులకి  సంభావ్య లక్ష్యంగా మారవచ్చని భద్రతా అధికారులలోని ఒక వర్గం భయపడుతోంది. అయినప్పటికీ, అక్కడి సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఇది మంచి మార్పు అని కొనియాడుతున్నారు. సౌదీ అరేబియాలోనే 2017 లో తిరిగి థియేటర్లు తెరిస్తే కాశ్మీర్లో ఎందుకు మతమౌఢ్యమని ఉగ్రవాదుల్ని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదం క్షీణిస్తోందనీ,  రాబోయే నెలల్లో కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఎవరూ వుండరనీ అంటున్నారు.

రాజకీయ పక్షాలు సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక వైఖరితో వుంటాయి. వాళ్ళదో వెర్షన్. దురదృష్టవశాత్తూ అందరూ ఇక్కడ నటులుగా మారుతున్నారు, అంతా బావున్నట్టు నటిస్తున్నారు. పుల్వామా, సోపియాన్‌లలో ప్రారంభించినవి మల్టీ ప్లెక్సులా? అవి రెండు ఆడిటోరియాలలో  ప్రొజెక్టర్‌లు అమర్చిన సమావేశ గదులు. ఇవి ఒక జోకు! అని పిడిపి ప్రతినిధి కొట్టి పారేశాడు.

పూర్వవైభవం తిరిగొస్తుందా?

          కాశ్మీర్‌లో సినిమా చరిత్ర స్వాతంత్ర్య పూర్వమే ప్రారంభమైంది. 1932 లో కాశ్మీర్ టాకీస్ పేరుతో మొట్టమొదటి సినిమా హాలుని భాయ్ అనంత్ సింగ్ గౌరీ శ్రీనగర్లో స్థాపించారు. తర్వాత పల్లాడియం సినిమా గా పాశ్చాత్యీ కరణ చేశారు పేరుని. ఇది ఇప్పుడు శిథిలావస్థలో వుంది. ఒక వైపు సినిమా హాళ్ళు పెరుగుతూ, మరోవైపు సినిమా షూటింగులు జరుగుతూ కళావైభవంతో వుండేది కాశ్మీర్. కాశ్మీర్ లో షూటింగ్ చేయని, కనీసం ఒక పాట చిత్రీకరించని హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లేవు. ఈ వైభవం పునరుద్ధరణ కోసం తిరిగి కృషి కూడా ప్రారంభమైంది. ప్రదర్శనా రంగాన్నే కాకుండా నిర్మాణ రంగాన్ని కూడా తిరిగి గాడిలో పెట్టాలని.

కాశ్మీర్ - బాలీవుడ్‌ల మధ్య కొత్త అనుబంధాన్ని ఏర్పరిస్తే స్థానిక కళాకారులకి, ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున సహాయకారి అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పాటల షూటింగ్ కోసం దాదాపు 500 ప్రతిపాదనలు ఆమోదం కోసం వేచి వున్నాయి. వీటిలో 120 కి పైగా ప్రతిపాదనలని ఆమోదించారు. నిర్మాతలు ఒక నిర్దిష్ట శాతం స్థానిక కళాకారులని నియమించడం తప్పనిసరని ఒక షరతు పెడుతున్నారు. ఇదివరకు జరుగుతూ వుండిన చలనచిత్రోత్సవాలని కూడా పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం అనంత్‌నాగ్, శ్రీనగర్, బండిపోరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలోనూ సినిమా హాళ్ళు త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే సాధారణ పరిస్థితులు నెలకొనాలి. దీనికి ప్రభుత్వం మీద చాలా భారం వుంది. కాశ్మీర్ ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడం మామూలు విషయం కాదు. మార్చే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరిగితే కాశ్మీర్ కే కాదు, బాలీవుడ్ కే కాదు, దక్షిణ పానిండియా సినిమాలకీ రెవెన్యూ పరంగా కొత్త మార్గాలు తెరచుకుంటాయి. పోరు ఉగ్రవాదంతో ఆర్ధిక వాదంగా మారాలి.

—సికిందర్

21, సెప్టెంబర్ 2022, బుధవారం

1215 : చివరి షో!


 

    2023 -95ఆస్కార్ అవార్డుల ఎంట్రీకి ఎవరికీ తెలియని, ఇంకా విడుదల కాని  గుజరాతీ చలన చిత్రం  చెల్లో షో (చివరి షో) ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సంవత్సరం విడుదలై విజయవంతమైన అనేక భారీ, చిన్న, మధ్య తరహా సినిమాలతో పోటీ పడి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ఆశ్చర్యమే. రణబీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర’, ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్’, మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’, అమితాబ్ బచ్చన్ నటించిన ఝుండ్’, రాజ్‌కుమార్ రావ్-భూమీ పెడ్నేకర్ నటించిన బధాయి దో’, ఆయుష్మాన్ ఖురానా నటించిన అనేక్ లతో బాటు వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన కాశ్మీర్ ఫైల్స్’, తమిళ థ్రిల్లర్ ఇరవిన్ నిల్’, (నాన్-లీనియర్ మలయాళ డ్రామా అరియిప్పు’, బెంగాలీ బయోగ్రాఫికల్ అపరాజితో’’- మొదలైన 10 సినిమాలనూ వెనక్కి నెట్టేసి నెగ్గింది.

        సినిమా పరిశ్రమకి  చెందిన 17 మంది విభిన్న స్వరాలతో కూడిన జ్యూరీ ఈ ఏకగ్రీవ ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా నిర్మాత టిఎస్ నాగభరణ (అధ్యక్షుడు), నిర్మాత సంగీత్ శివన్, సంగీత దర్శకుడు జతిన్ పండిత్, కాస్ట్యూమ్ డిజైనర్లు నిఖత్ -నీరూషా, నిర్మాత అంజన్ బోస్, సౌండ్ రికార్డిస్ట్ మందర్ కమలాపుర్కర్, ఎడిటర్ ప్రతీక్ గుప్తా తదితరులు వున్నారు.

చెల్లో షో ని ఎంపిక చేయడానికి కారణం, ఇది దేశంలో
వందలాది సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళు కనుమరుగై పోతున్న సంక్షుభిత పరిస్థితిని కళ్లెదుట వుంచడమేనని జ్యూరీ భావించడం. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ గుజరాతీ ప్రాంతీయ సినిమాలో భవిన్ రాబరి, వికాస్ బాటా, రిచా మీనా, భవేష్ శ్రీమాలి, డిపెన్ రావల్, రాహుల్ కోలీ నటించారు.

2021 జూన్లో న్యూయార్క్ లో నిర్వహించిన 20 వ
రాబర్ట్ డెనిరో ట్రిబెకా చలన చిత్రోత్సవంలో దీన్ని ప్రదర్శించారు. అక్టోబర్ 2021లో స్పెయిన్ లో జరిగిన 66వ వల్లాడోలిడ్ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఇది దేశంలో ఇంకా విడుదల కాలేదు. ఓటీటీల్లో కూడా లేదు. అక్టోబర్ 14న ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో థియేటర్లలో విడుదలవుతుంది.

ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా ఆస్కార్‌
అవార్డు గెలుచుకోలేదు. ఈ రెండు దశాబ్దాల్లో ఉత్తమ అంతర్జాతీయ మూవీ కేటగిరీలో ప్రవేశం సంపాదించిన  భారతీయ సినిమా 2001లో ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో  అమీర్ ఖాన్-నటించిన లగాన్ ఒక్కటే. దీనికి ముందు మదర్ ఇండియా (1958), ‘సలామ్ బాంబే (1989) ఎంట్రీ సంపాదించుకున్నాయి.

ఇంతకీ
చెల్లో షో లో కథ ఏమిటి? కథ ఏదైనా, ఇది 1988 లో విడుదలైన సుప్రసిద్ధ క్లాసిక్, ఆస్కార్ తో బాటు ఇంకా అనేక అవార్డులు సాధించుకున్న ఇటలీ మూవీ సినిమా పారడిసో కి అనుసరణలా వుంది. ఈ ఇటాలియన్ మూవీలో  సినిమాలంటే పడిచచ్చే చిన్న కుర్రాడు ఇంట్లో కొట్టినా తిట్టినా బడి ఎగ్గొట్టి, సినిమా హాల్లో దూరుతూంటాడు. ఫ్రీగా సినిమాలు చూసేందుకు ప్రొజెక్షన్ అతనితో స్నేహం చేసి, ప్రొజెక్షన్ రూమ్ లొంచే సినిమాలు చూస్తాడు. కాల క్రమంలో పెద్ద సినిమా దర్శకుడై, చిన్నప్పటి తన అభిమాన థియేటర్ ని చూసుకోవడానికి వస్తే, ఆ థియేటర్ ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం కూల్చేస్తూంటారు.

ఈ సినిమా భవిష్య వాణి చెప్పింది. చూపించినట్టుగానే తర్వాతి కాలంలో టీవీ విప్లవం వల్ల థియేటర్లు కూల్చివేసి
, లాభసాటి ఆదాయ వనరులుగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టుకోవడం మొదలైంది. మన దగ్గర కూడా 2000 తర్వాత టీవీ దెబ్బకి చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్సులుగా, కళ్యాణ మండపాలుగా మారిపోయిన దృశ్యాలు చూశాం. ఇదొక దశ.

దీని తర్వాత ఇప్పుడు మల్టీప్లెక్సుల దెబ్బకి మిగిలిన సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా మూతబడ్డం మొదలెట్టాయి. ఈ దశనే
చెల్లో షో చిత్రిస్తోంది...ఇందులో
సమయ్ (భవిన్ రాబారి) అనే తొమ్మిదేళ్ళ కుర్రాడు సినిమాల పిచ్చితో చదువుకోకుండా థియేటర్ని పట్టుకు వేలాడుతూంటాడు. రోజూ సినిమా చూసేందుకు డబ్బుల్లేక ప్రొజెక్షనిస్ట్ ఫజల్ (భావేష్ శ్రీమాలి) తో ​​స్నేహం చేస్తాడు. స్కూలుకని తల్లి (రిచా మీనా) కట్టిచ్చే టిఫిను తెచ్చి ఫజల్ కిచ్చి మస్కా కొడుతూంటాడు. గుజరాతీ వంటకాలు తినమరిగిన ఫజల్, సమయ్ ని  ప్రొజెక్షన్ బూత్ లో కూర్చోబెట్టుకుని సినిమాలు చూపిస్తూంటాడు.

ఇలా సమయ్ సినిమా ప్రదర్శనలో సాంకేతికాలు తెలుసుకుని సొంతంగా థియేటర్ ప్రారంభించుకోవాలని నేస్తాలని కూడగడతాడు. ఎవరికీ తెలియని చోట శివారు పాడుబడ్డ భవనంలో పని ప్రారంభిస్తారు. పారేసిన పరికరాలూ అవీ సేకరించి ప్రొజెక్టరు సృష్టిస్తారు. అందులో రీళ్ళు వేసి నడిపించడానికి రైల్వే స్టేషన్ మీద పడతారు. రైల్వే స్టేషన్లో పంపిణీ దారులకి వచ్చే సినిమా రీళ్ళు దొంగిలించి షోలు వేసుకుని ఎంజాయ్ చేస్తూంటారు.

ఇలా ఆనందిస్తూ ఆనందిస్తూ వుండగా రీళ్ళు రావడం మానేస్తాయి. ఫిలిమ్ రీళ్ళు మాయమై డిజిటల్ సినిమాలు వచ్చేస్తున్నాయన్న మాట!
  ఈ పరిణామం సమయ్ తో బాటు ఫజల్ జీవితాన్నీ ప్రశ్నార్ధకం చేస్తుంది. గుండెలు పగిలి విలపిస్తారు. మన ఉన్నత కులస్థులకి సినిమాలు అప్రదిష్టరా అని తండ్రి మందలించినా సమయ్ గుండె తట్టుకోదు...

అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళ పట్ల ప్రజలకుండే అనుబంధాల్నీ
, జ్ఞాపకాలనీ, తీపి గుర్తుల్నీ హృద్యంగా కళ్ళ ముందుంచుతుందీ సినిమా! ఇలాటి సినిమాలు తెలుగులో ఎప్పుడొస్తాయో ఆస్కార్స్ కి వెళ్ళి తెలుగు ప్రతిభని ప్రపంచానికి చాటాడానికి...

—సికిందర్