రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, ఫిబ్రవరి 2023, బుధవారం

1306 : రివ్యూ!

రచన -దర్శకత్వం : అభినవ్ సుందర్ నాయక్
తారాగణం : వినీత్ శ్రీనివాసన్, ఆర్ష చాందినీ బైజు, తన్వీ రామ్, సూరజ్ వెంజర మూడు తదితరులు
సంగీతం : శిబి మాథ్యూ అలెక్స్, ఛాయాగ్రహణం :  విశ్వజిత్ ఒడుక్కతిల్
బ్యానర్ : జాయ్ మూవీ ప్రొడక్షన్స్
నిర్మాత : అజిత్ జాయ్
***

    డిస్నీ + హాట్ స్టార్ లో జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మలయాళంలో థియేట్రికల్ గానూ హిట్టయ్యింది. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. కన్నడలో సైతం భారీ యాక్షన్ పానిండియా సినిమాలు తీస్తూంటే, మలయాళం నుంచి  వాటి పంథాలో అవి నేటివిటీకి దగ్గరలో సహజత్వంతో కూడిన సినిమాలు వస్తున్నాయి. ఇదే పంథాలో కొనసాగుతూ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఎందుకని అంత పేరు తెచ్చుకుంటోందో ఒకసారి పరిశీలిద్దాం...

కథ
వాయనాడ్ లో ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్ గా స్ట్రగుల్ చేస్తూంటాడు. కేసుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. బాగా సంపన్నుడిగా స్థిరపడాలన్న కోరిక నెరవేరడం లేదు. అందుకు సంవత్సరాలుగా చాలా క్రమశిక్షణతో కూడిన నిర్మాణాత్మక జీవితం గడిపాడు. ఒక రోజు తల్లి నిచ్చెన మీంచి పడిపోవడంతో కాలు విరుగుతుంది. శస్త్రచికిత్సకి డబ్బుండదు. యాక్సిడెంట్ కేసులు చూసే అడ్వొకేట్ వేణు (సూరజ్ వెంజర మూడు) ముకుందన్ కేసుని రోడ్డు ప్రమాదం కేసుగా మార్చి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తాడు. దీంతో ముకుందన్ తల్లికి శస్త్ర చికిత్స చేయిస్తాడు. హాస్పిటల్ రిసెప్షనిస్టు మీనాక్షి (ఆర్ష చాందినీ బైజు) ని ప్రేమిస్తాడు. ఇదే సమయంలో వైద్య బీమా క్లెయిమ్‌ల ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాడు.

ఇక వేణు చేసే పని తను కూడా చేయడం మొదలుపెడతాడు. దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ఇలా కాదని వేణు ముకుందన్‌కి హాస్పిటల్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తాడు. ముకుందన్ తిరస్కరిస్తాడు. ఆ కాంట్రాక్టు వేణు చేపడతాడు. చేపట్టి హాస్పిటల్లో తనకి కాబోయే క్లయంట్స్ దగ్గరికి రాకుండా ముకుందన్ ని అడ్డుకుంటాడు. దీంతో ముకుందన్ వేణు కారులో నాగుపాము పెట్టడంతో వేణు చచ్చిపోతాడు.
    
ఇప్పుడు ముకుందన్ అనుకున్న స్థాయికి ఎలా ఎదిగాడు? ఫేక్ యాక్సిడెంట్ కేసులతో ఇంకెన్ని అక్రమాలు చేశాడు? అతడికి అడ్డొచ్చిన జడ్జి సైతం ఏమైపోయాడు? బ్లాక్ మెయిల్ చేసిన అసోసియేట్ కేం గతి పట్టింది? ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అని లా ఆఫీసు తెరిచిన ముకుందన్, యాక్సిడెంట్ కేసులు వచ్చే హాస్పిటల్ కి కూడా ఓనరై పోయి మొత్తం దందా ఎలా గుప్పెట్లోకి తెచ్చుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

నకిలీ ఇన్సూరెన్స్ క్లెయిములు దందాగా చేసుకుని కోట్లు ఆర్జించే లాయర్ కథ ఇది. ఇలాటి లాయర్లకి కొదవలేదు. గత అక్టోబర్ లోనే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ క్రింద నకిలీ క్లెయిముల స్కాములు చేసిన 30 మంది న్యాయవాదుల లైసెన్సుల్ని రద్దు చేసింది. ఈ లాయర్లు నకిలీ మోటారు యాక్సిడెంట్ క్లెయిములతో బీమా కంపెనీలకి కోట్లాది రూపాయల నష్టం కల్గించారు. మీరట్, బరేలీ, షాజహాన్‌పూర్‌ల నుంచి ఎక్కువ కేసులు నమోదు చేశారు.
    
అలాగే ఈ సినిమాలో కేరళలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే వాయనాడ్ ని కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుంది. ఇందులో లాయర్ ముకుందన్ ఉన్ని దారుణంగా, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, చదరంగపు పావులు కదిపినట్టు షాకింగ్ గా ఆపరేట్ చేస్తాడు తన ఉన్నతి కోసం. మంచితనం, మానవత్వం అనేవి లేని జీరో ఫీలింగ్స్ తో పరిస్థితుల్ని సొమ్ము చేసుకుంటాడు. మనుషులు తాము ఎదగకుండా తన ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడాలన్న- టాప్ పొజిషన్ లో తనొక్కడే వుండాలన్న, ఉపయోగ పడ్డాక నాశనమై పోవాలన్న క్రూర మనస్తత్వంతో వుండే పాత్ర కథ.
    
ఇందులో నీతి గురించీ, పరివర్తన గురించీ వుండదు. అలా ముగియదు. శిక్షకూడా వుండదు. పైకి మెత్తగా వుంటూ లోపల కుత్తుకలు కోసే ఆలోచనలతో వుండే సీరియల్ కిల్లర్ మనస్తత్వ అధ్యయనంగా ఈ కథ వుంటుంది. సీరియల్ కిల్లర్ మానసిక కారణాలతో హత్యలు చేస్తాడు. ఈ కథలో హీరో సంపన్నుడవడానికి దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. కథొక్కటే గాకుండా కథతో బాటే పాత్రా ఆందోళన పరుస్తాయి. ఈ ఒక్క పాత్రే కాదు, కథలో ఏ పాత్రా నీతితో వుండదు. స్వార్ధం కోసం పనిచేసే పాత్రలే. కథానాయకుడి పాత్ర మనసులో చీకటి కోణాల ఆవిష్కరణ ఈ కథ.  

నటనలు -సాంకేతికాలు

ముకుందన్ ఉన్ని క్యారక్టర్ స్టడీ ఈ కథయితే, ఈ క్యారక్టర్ నటించిన వినీత్ శ్రీనివాసన్ అతికినట్టు సరిపోయాడు. ముఖం మీద ఏ భావాలూ పలికించడు. ఒకరు చస్తూంటే మాత్రం చిరునవ్వుతో చూస్తాడు. లోపలి భావాల్ని స్వగతంతో వెల్లడిస్తాడు. చేసే క్రూరమైన పనులకి డార్క్ హ్యూమర్ తో, క్రూడ్ జోకులతో ఆ  భావాలుంటాయి. అతడ్ని చూస్తే నవ్వూ కోపం రెండూ వస్తాయి. తను క్రిమినల్ అనీ, కిల్లర్ అనీ ఎవరికీ అనుమానం రాకుండా కూల్ గా బిహేవ్ చేసే నటన అతడి ప్రతిభకి తార్కాణంగా చెప్పుకోవచ్చు.
    
ఒక ఫోర్జరీ కేసులో కోర్టు విచారణ పరిస్థితి ఎదురైనప్పుడు ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు. ప్రతిష్టకి భంగం కలుగుతుందని కాదు, జైలుకి పోతే సంపన్నుడయ్యే మార్గముండదని మనం అర్ధం జేసుకోవాలి. అతడికి ప్రతి దాంట్లో సంపన్నుడయ్యే కోరికే వుంటుంది. వినీత్ శ్రీనివాసన్ జంటిల్ మాన్ లా కన్పించే ఈ నెగెటివ్- యాంటీ హీరో పాత్రని చాలా నీటుగా పోషించాడు.
    
అతడి భార్య పాత్రలో ఆర్ష చాందినీ, అడ్వొకేట్ వేణుగా సూరజ్ వెంజరమూడు, అసోషియేట్ గా సుధీ కొప్పా, ఇంకా ఇతర పాత్రల్లో ప్రతి వొక్కరూ ఈ రియలిస్టిక్ జానర్ కి సహజ నటనతో మూడ్ ని క్రియేట్ చేశారు.
    
విశ్వజిత్ ఛాయాగ్రహణం ఒక హైలైట్. తక్కువ లైటింగ్ తో, కూల్ కలర్స్ తో రియలిస్టిక్ దృశ్యాల సృష్టి చేశాడు. నిజానికి మలయాళం సినిమాలిలాగే వుంటాయి. కేరళ నేటివిటీకి ఈ కలర్- లైటింగ్ స్కీమ్ ని సెట్ చేసుకున్నారు. సిబి మాథ్యూ సంగీతం న్యూవేవ్ ధోరణులతో వుంది. కొత్త దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్  విషయపరంగా, మేకింగ్ పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రయత్నం చేశాడు.

చివరికేమిటి
    దీన్ని తెలుగులో రీమేక్ చేస్తారేమో, చేతులు కాలుతాయి. బుట్టబొమ్మ తో కాల్చుకున్నారు. మలయాళం సినిమాల జోలికి పోకుండా తెలుగులో అవే రొటీన్ మూస తీసుకోవడం మంచిది. ఈ మధ్య ఒక స్క్రిప్టు పరిశీలన కొచ్చింది. వొరిజినల్ కథతో చాలా సింపుల్ గా బలంగా కొత్తగా వుంది. మన దగ్గర టాలెంటున్న మేకర్లు లేరని కాదు- టాలెంటున్న నిర్మాతలే లేరు. చేతులు కాల్చుకునే పాత మూస నిర్మాతలే ఇంకా రాజ్యమేలుతున్నారు. ఆ మూసలో మలయాళం సినిమాల్ని తెలుగులోకి తెచ్చుకుని భస్మీ పటలం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు మూసలకే పటం కట్టుకుని వేలాడదీసుకుంటే సరిపోతుంది.
—సికిందర్

 

13, ఫిబ్రవరి 2023, సోమవారం

1305 : సందేహాలు- సమాధానాలు

Q : నేనొక స్క్రిప్టు రాస్తున్నాను సర్. అది ముగ్గురు హీరోలతో కథ. ఒకరితో ఒకరు వైరం పెట్టుకున్న ముగ్గురు హీరోల ముఠాల చుట్టూ కథ తిరుగుతుంది. తరువాత వారి విభేదాలను అంగీకరించి ఉమ్మడి శత్రువుతో పోరాడతారు.

మూడు పాత్రలను సమానంగా ఎలా డెవలప్ చేయాలో నాకు ఖచ్చితంగా తెలియదు.  ఒక పాత్ర ఆధిపత్యంగా కథ చేస్తే మిగిలిన రెండు కేవలం సైడ్‌కిక్‌లుగా ఉండే కథ కాకూడదనుకుంటున్నాను.

కాబట్టి, స్క్రిప్ట్ లో ఈ క్యారెక్టర్‌లను ఎలా సరిగ్గా డెవలప్ చేయాలి, మూడు క్యారెక్టర్‌లతో స్క్రీన్‌ప్లే నిర్మాణాన్ని ఎలా రూపొందించాలి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వారం విడుదలైన అమిగోస్ చూసిన వెంటనే నాకు సందేహాలు పెరిగాయి. అందుకే మీకు రాస్తున్నాను. అమిగోస్ హీరో త్రిపాత్రాభినయంతో చేసిన కథ నాకు పెద్దగా నచ్చ లేదు. ఇంకేదైనా మార్గముంటే చెప్పండి.
—పీవీఆర్, టాలీవుడ్ 
A : హాలీవుడ్ రచయిత్రి లిండా ఆర్సన్ బ్లాగులో, సాంప్రదాయ ఒన్ హీరో / ఒన్ జర్నీ మోడల్ స్క్రిప్టులతో మల్టీ స్టారర్ సినిమాలకి భారీ నష్టాలు జరిగాయని రాసింది. అంటే సింగిల్ హీరోతో త్రీయాక్ట్ స్ట్రక్చర్లో ఏవైతే సినిమాలొస్తూంటాయో, ఆ సింగిల్ హీరో జర్నీతోనే ఇద్దరు ముగ్గురు హీరోలున్న మల్టీ స్టారర్సూ తీయడమన్న మాట. దీంతో మీరన్నట్టు ఒక హీరో ఆధిపత్యంగా, మిగిలిన హీరోలు సైడ్ కిక్ లుగా కథలు వస్తాయి.

మల్టీ స్టారర్స్ లో ప్రతీ హీరో పాత్ర దాని కథనాన్ని అది వెతుక్కోవాలని చూస్తుందని, అలా ఏ హీరో పాత్రకా కథనం రచయిత అందించగల్గినప్పుడు సింగిల్ హీరో త్రీ యాక్ట్ జర్నీకి భిన్నమైన స్క్రిప్టు వస్తుందని లిండా రాసింది. ఈ స్క్రిప్టులు ఎలా రాసుకోవాలో తెలుపుతూ  ది ట్వెంటీ ఫస్ట్ సెంచురీ స్క్రీన్ ప్లే అన్న పుస్తకం రాసింది. ఇది మనం చదవలేదు.

అయితే ఆమె చెప్పిన పాయింటు -సాంప్రదాయ ఒన్ హీరో / ఒన్ జర్నీ మోడల్ స్క్రిప్టులతో మల్టీ స్టారర్ సినిమాలకి భారీ నష్టాలు జరిగాయన్న దాన్ని సీరియస్ గా తీసుకోవాలన్పిస్తోంది. త్రీయాక్ట్ స్ట్రక్చరనేది స్క్రీన్ ప్లేలకి శాశ్వత నమూనా, ఇందులో ఎలాటి సందేహమూ లేదు. సర్వ సాధారణంగా ఉపయోగంలో వుండే ఒక హీరో కథకి అనుసరిస్తూ వస్తున్న యూనివర్సల్ నమూనా. జోసెఫ్ క్యాంప్ బెల్ హీరోస్ జర్నీ అనే మోనోమిథ్ మోడల్ హీరో కథాప్రయాణపు వివిధ దశల వర్ణనే. ఇదీ త్రీయాక్ట్ స్ట్రక్చరే. 

అయితే త్రీయాక్ట్ స్ట్రక్చరనేది కథ చెదిరిపోకుండా కాపాడే చట్రమే తప్ప, అందులోని యాక్ట్స్ తో, ప్లాట్ పాయింట్స్ తో శిలాశాసనమేమీ కాదు. ఈ చట్రానికి లోబడి యాక్ట్స్ తో, ప్లాట్ పాయింట్స్ తో సొంత క్రియేటివిటీకి పాల్పడొచ్చు. అంటే త్రీయాక్ట్స్ ని కస్టమైజ్ చేయొచ్చన్న మాట. త్రీయాక్ట్స్ లోనే ఒక హీరో జర్నీని ఇద్దరు ముగ్గురు హీరోల జర్నీగా మార్చవచ్చు. కాకపోతే ఆ క్రియేటివిటీ ఏమిటనేది కథని బట్టి వుంటుంది. మీ కథకి స్ట్రక్చర్లో క్రియేటివిటీ ఏమిటని ఆలోచించగా...చించగా...ఈ కింది విధంగా వస్తోంది. పనికొస్తే ఉపయోగించుకోండి.

త్రీయాక్ట్స్ లో ప్రతీ యాక్ట్ ఒక గోల్ తో వుంటుంది. యాక్ట్ వన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒక గోల్ తో, యాక్ట్ టూ ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఇంకో గోల్ తో, యాక్ట్ త్రీ ముగింపు దగ్గర మరింకో గోల్ తో వుంటాయి. యాక్ట్ టూ కి ఇంటర్వెల్ దగ్గర సబ్ గోల్ అనేదొకటుంటుంది. యాక్ట్ వన్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి సమస్య నేర్పాటు చేసే గోల్ తో వుంటే, యాక్ట్ టూ ఆ సమస్యకి పరిష్కారాన్ని అందించే గోల్ తో వుంటుంది. యాక్ట్ త్రీ ముగింపులో ఆ సమస్యని బలపర్చే (గెలుపు), లేదా తిరస్కరించే (ఓటమి) గోల్ తో వుంటుంది. సెకండ్ యాక్ట్ ఇంటర్వెల్ దగ్గర సమస్యని తీవ్రతరం చేసే సబ్ గోల్ తో వుంటుంది.

ఇప్పుడు మీ కథ మూడు ముఠాల ముగ్గురు హీరోలతో వుంది. ఇప్పుడు హీరోలంటేనే ముఠాకోర్లు. ఈ ముగ్గురూ తర్వాత తమ విభేదాల్ని పరిష్కరించుకుని ఉమ్మడి శత్రువుతో పోరాడతారని మీ కథ.

దీనికి యాక్ట్ వన్ గోల్- ఎవరికి వారు పోటుగాళ్ళు కావడంతో గెలవలేమని సైలెంట్ అయిపోతారు. యాక్ట్ టూ సబ్ గోల్ (ఇంటర్వెల్) ముగ్గురూ సంధి చేసుకోవడానికి కలుస్తారు. కానీ అంతర్లీనంగా పాత పగలు అలాగే వుంటాయి. దీంతో సంధి కుదరక ఒకరిద్దరు వెళ్ళిపోతారు.

యాక్ట్ టూ గోల్ -ఉమ్మడి శత్రువుతో ప్రమాదాలు పెరగడంతో, ఏదో ట్రాజడీ జరగడంతో, లేదా ఈడీ- సీబీఐ దాడులు జరగడంతో, ఇక పాత పగలు పక్కనబెట్టి, ముగ్గురూ నేషనల్ ఫ్రంట్ కింద ఒకటవుతారు.

యాక్ట్ త్రీ గోల్- ఇప్పుడు ముగ్గురూ ఉమ్మడిగా ఉమ్మడి శత్రువుని మాస్టర్ ప్లానేసి అంతమొందిస్తారు.

ప్రతీ యాక్ట్ గోల్ నీ స్పష్టంగా చూపించాలి. ముగ్గురి మధ్య కామన్ ఆపరేటింగ్ పాయింటు- అంటే తాము ముగ్గురూ ఒకటవాలని వున్న కోరిక- ముగ్గురి మోటివేషన్స్ గా పనిచేయాలి. ముగ్గురికీ ఒకరి పూర్వ కథకి మించి ఒకరి పూర్వ కథ వుండే డైనమిక్స్ కథనానికి మంట పుట్టిస్తూ వుంటాయి. అయితే ముగ్గురికీ  ఒకే ఒమ్మడి గోల్- ఉమ్మడి శత్రువు అంతు. కానీ  యాక్ట్స్ మారితే ముగ్గురికీ వేరే సొంత గోల్స్ పుట్టుకొస్తూంటాయి. ఎందుకంటే ఎవరి కథ వాళ్ళకుంది. ఒకళ్ళకి మించొకరు యాక్టివ్ క్యారక్టర్లు కాబట్టి.   

ఫస్ట్ యాక్ట్ లో ముగ్గురూ పోటుగాళ్ళే. బద్ధ శత్రువులు. సంధి అసాధ్యంగా అన్పిస్తుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా ముగ్గురూ తలపడి ఎవరూ నెగ్గలేమని తగ్గుతారు. ఇలా ముగ్గురూ సైలెంట్ అయిపోవడం చూసి ప్లాట్ పాయింట్ వన్ లో ఉమ్మడి శత్రువు వంతు లేసుకుని ముందు ఒకడి మీద దాడి చేస్తాడు.

యాక్ట్ టూ లో దాడికి గురైన హీరో మిగతా ఇద్దరితో సంధికి ప్రయత్నిస్తాడు. ఆ ఇద్దరి మీద కూడా దాడులు జరగడంతో సంధికి వస్తారు. కానీ అంతర్లీనంగా పాత పగలు అలాగే వుంటాయి. దీంతో సంధి కుదరక వాళ్ళ గోల్స్ తో ఒకరిద్దరు వెళ్ళిపోతారు. దీంతో సబ్ గోల్ (ఇంటర్వెల్) ముగుస్తుంది.

సబ్ గోల్ తర్వాత యాక్ట్ టూ కొనసాగింపులో -ఉమ్మడి శత్రువుతో ప్రమాదాలు భారీగా పెరగడంతో, ఇక పాత పగలు పూర్తిగా పక్కనబెట్టి, ముగ్గురూ ఒకటవుతారు. ఇది ప్లాట్ పాయింట్ టూ గోల్. ప్లాట్ పాయింట్ టూ గోల్ ఎప్పుడూ ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ గోల్ కి నిలువుటద్దంలా వుంటుంది. ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ వన్ గోల్ లో ముగ్గురిలో ఎవరిదీ పై చేయి కాక సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ సంధి తిరస్కారానికి గురైంది. దాంతో ఉమ్మడి శత్రువు ఒకరి మీద దాడి చేశాడు. ప్లాట్ పాయింట్ తో గోల్ లో అదే ఉమ్మడి శత్రువువల్ల ముగ్గురికీ ఉమ్మడిగా తీవ్ర నష్టం జరగడంతో ఫైనల్ గా సంధి చేసుకుంటారు. ఇప్పుడు ముగ్గురి గోల్ ఒకటే అవుతుంది.

ముగ్గురు హీరోలతో ప్రొఫెషనల్స్ గా వాళ్ళ క్యారక్టరైజేషన్స్ మాత్రమే వుంటే కథనం సింపుల్ గా, యాక్షన్ ఎపిసోడ్లతో బలంగా వుంటుంది. వాళ్ళ పర్సనల్ (ఇంటర్నల్) క్యారక్టరైజేషన్స్ జోలికి పోకపోవడం ఉత్తమం. అయితే ప్రతీ క్యారక్టర్ కీ ఒక సెటప్, ఒక ట్విస్టు, ఒక పే ఆఫ్ వుండాలి.

'అమిగోస్' లో హీరో త్రిపాత్రాభినయపు పాత్రలు వాటి కథలు అవి నడుపుకోక, కథే పాత్రల్ని నడపడం వల్ల యాక్షన్ కథ మొదటికే మోసం వచ్చింది. రైటర్ కథ నడప కూడదన్న బేసిక్స్ ని మరిచారు. మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
—సికిందర్

 

12, ఫిబ్రవరి 2023, ఆదివారం

1304 : సినిమా సైన్స్

 

        న అంతర్గత (మానసిక) పరిస్థితిని స్పృహలోకి తీసుకురానప్పుడు, ఆ అంతర్గత పరిస్థితి విధి వలె వెలుపల జరుగుతుందని, అంటే భౌతిక ప్రపంచంలో మన అనుభవంలోకి వస్తుందని- మానసిక నియమం (సైకలాజికల్ రూల్) చెబుతుంది. అంటే, వ్యక్తి అవిభక్తంగా వుండి, తన అంతర్గత వైరుధ్యాల గురించి స్పృహలోకి రానప్పుడు, ప్రపంచం ఆ మానసిక సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) ని భౌతిక ప్రపంచంలో బలవంతంగా అమలు చేస్తుందని అర్ధం. ఇది ప్రముఖ స్విస్ మానసిక విశ్లేషకుడు, సిద్ధాంతకర్త కార్ల్ జంగ్ చెప్పిన మాట. మనం కథని అనేక రూపాల్లో చూడగలం : కథాంశం పరంగా నిర్మాణాత్మకంగా, ఇతివృత్తం పరంగా ప్రతీకాత్మకంగా, దృశ్యపరంగా బొమ్మలుగా చూడగలం. అయితే మనం ఒక కథని పాత్ర కోణం నుంచి పరిశీలిస్తున్నామంటే, మనమా పాత్ర  మానసిక ప్రయాణాన్ని (సైకలాజికల్ జర్నీ) చూస్తున్నట్టే లెక్క.

        నిజానికి పై దృక్కోణం నుంచి చూసినపుడు, కథలోని అన్ని సంఘటనలు, పాత్రలూ అన్నీ కూడా, కథానాయకుడి మానసిక తపన కోసం పనిచేస్తున్నట్టే కనిపించగలవు. వ్యక్తిగతంగా చూసుకుంటే కార్ల్ జంగ్ మాట చాలా ముఖ్యమైనది. అంటే మనం మన మనస్సులోని అన్ని కార్యకలాపాల్ని, చీకటి ప్రేరణల్నీ గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే, విశ్వం బయట ఆ పరిస్థితుల్ని సృష్టించి మనల్ని బలవంతంగా సంఘర్షణలోకి దింపుతుందన్న మాట. సినిమా రచనా పరంగా పై సూత్రీకరణ అంతరార్ధం రెండు రూపాల్లో కన్పిస్తుంది : అనైక్య (ఇమ్మెచ్యూరిటీ) స్థితిలో కథని ప్రారంభించే కథానాయకుడు ఐక్యత (మెచ్యూరిటీ) వైపు వెళ్ళడానికి ఉద్దేశించిన విధిని ఎదుర్కోవడం, రెండవది- కథా సంబంధమైన కథనంలో జరిగే సంఘటనలు కథానాయకుడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) లోని మూలాంశాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి వుండడం.
        
జోసెఫ్ కాంప్‌బెల్ సూచించినట్టుగా, కథానాయకుడనే వాడు మారాలి, మారాల్సిన అవసరం గుర్తించకపోయినా మారతాడు. కాబట్టి  ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లోని పాత్ర డరోతీ కి ఇంద్రధనస్సు దాటుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలని అన్పించినప్పుడు, తన ఇల్లు అనుకున్న వుంటున్న ఇంటిని ఇల్లులా ఫీలవ్వలేని స్థితిలో వుందామె. ఈ ఆమె మానసిక ప్రయాణపు ప్రారంభంలోనే మనం ఇంటికి మించిన ప్రదేశం లేదు అని ఆమె చివరికి గ్రహించే సంఘటనలతోనే ఆమె ప్రయాణం వుంటుందని తెలుసుకుంటాం. అంటే ఆమె ఒక ఇమ్మెచ్యూర్ స్థితి నుంచి మెచ్యూర్డ్ స్థితికి మారుతుందన్నమాట- ఇది తను గుర్తించకపోయినా.
        
కనుక మనం సినిమా రచనలో పాత్ర-ఆధారిత కథని ఈ విధంగా చేపడతాం : కథలోని కథానాయకుడిని లోతుగా శోధించి, అతడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) మూలాంశమేమిటో నిర్ణయించి, దాని ఆధారంగా అతడి ఎదుగుదలకి తోడ్పడే సంఘటనల్నీ, చర్యల్నీ మిళితం చేసే కథనాన్ని నిర్మిస్తూ, అతడి మానసిక ప్రయాణపు రూట్ మ్యాపుని చూపిస్తాం.
        
కథానాయకుడు ఏ విధమైన పరివర్తనకీ గురికాని సినిమాలున్నాయి. ఆ కథానాయకుల క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ప్రతికూలంగా వుండవచ్చు. వాస్తవం ఏమిటంటే, ఆ కథానాయకులు చాలా కథల్లో సానుకూల రూపాంతరాన్నే అనుభవిస్తారు. అంటే మార్పుకి లోనవుతారు. కథల్లో పరివర్తన అనేది అనివార్యమని జోసెఫ్ కాంప్‌బెల్ పేర్కొన్నాడు.
        
సినిమా రచయితలు కథలోని మానసిక ప్రయాణాన్ని త్రవ్వడానికి ఉత్తమ మార్గం ఈ రెండు ప్రశ్నలు వేసుకోవడం : కథానాయకుడికి కోరిక ఏమిటి? కథానాయకుడి అవసరం ఏమిటి? కోరుకోవడం పాత్ర చేతనావస్థ లక్ష్యం. పాత్ర మనసులో లక్ష్యం, అంటే  అంతిమ ఫలితం స్పష్టంగా రూపుదిద్దుకుని వుంటుంది. ఇది ఫస్ట్ యాక్ట్ ముగింపులో అంటే ప్లాట్ పాయింట్ వన్ కల్లా ఏర్పడుతుంది. ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లో డరొతీ కొరికేమిటి? ఇంద్రధనస్సుని దాటుకుని నివాసాన్ని పొందడం.
        
అవసరం పాత్ర అచేతావస్థ లక్ష్యం. పాత్రకి కొంతవరకు ఈ అంతర్గత లక్ష్యం గురించి తెలిసి వుండ వచ్చు. అయితే ఈ సహజ సిద్ధ స్వభావాన్ని తెలియకుండానే అణిచి వేసుకుంటూ వుంటుంది. నిజ జీవితంలో మన పరిస్థితే. డరోతీ అవసరమేమిటి? ఆమె వుంటున్న ఇంటి పరిసరాల్లో  నివసించే వ్యక్తులతో, తన కుటుంబంతో, పొలంతో అనుభవిస్తున్న అనుభూతుల్లాంటివి పొందడం. లాంటివి ఇంకెక్కడా వుండవు. ఇవి ఆమెకి ఇక్కడే ఇంటి దగ్గరే వున్నాయి తప్ప ఎక్కడో ఇంద్రధనస్సు కావల లేవు.
        
ఈ కోరికకీ, అవసరానికీ మధ్య ఉద్రిక్తతలే పాత్ర అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) కి మూలం. తత్ఫలితంగా,  సాధారణ దృష్టిలో దాగి ఒక ముఖ్యమైన నిజముంటుంది : పాత్ర  ఐక్యతా (మెచ్యూరిటీ) బీజాలు ఆ పాత్ర మానసిక ప్రయాణం ప్రారంభించే ముందు తానేమిటో అక్కడే వుంటాయి. ఇది పాత్ర తెలుసుకోవడమే అసలు అవసరం. ఈ తెలివిలో కొచ్చినప్పుడు, దీని ప్రకాశంలో తడిసి తళతళా మెరిసే మెచ్యూరిటీని సాధిస్తుంది పాత్ర. ఈ నిజం ది విజార్డ్ ఆఫ్ ఓజ్ ‘ చివర్లో ప్రతిబింబిస్తుంది- ఇంటికి  తిరిగి వెళ్ళే శక్తి నీకు ఎల్లప్పుడూ వుంది అని గ్లిండా డరోతీకి చెప్పినప్పుడు.
        
ఈ శక్తిని (తెలివిని) ఎల్లప్పుడూ కలిగి వుంటాం. కానీ మన కోరికలు డామినేట్ చేస్తాయి. పాత్ర రూపాంతరపు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి మంత్రాక్షరా లేవైనా వుంటే, బహుశా పై గ్లిండా మాటలే.
        
కథానాయక పాత్రకి ఈ శక్తి ఎప్పుడూ వుంటుంది, ఈ కింది వాటితో ముడిపడి-
        
1. కథానాయకుడి నమ్మకాలతో, పోరాట నైపుణ్యాలతో, ఆత్మ రక్షణా విధానాలతో, ఫస్ట్ యాక్ట్ లో తన సాధారణ ప్రపంచంలో ప్రవర్తనా విధానాలతో;
        
2. కథానాయకుడు తన అవసరాన్ని అణచివేయడంతో, తిరస్కరించడంతో; అది తన అంతరాత్మలో భాగమైనప్పటికీ గుర్తించక.
        
వీటన్నిటికీ  శక్తి అవసరం. ఈ శక్తి కథానాయకుడి వనరుల్ని పైకి తోడుతుంది. చివరికి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) నుంచి ఐక్యత (మెచ్యూరిటీ) కి ప్రారుద్భవించడానికి తనని తను అనుమతించుకున్నప్పుడు- ఆ శక్తి వరదలా అడ్డంకుల్ని బద్ధలు కొడుతుంది. సెకండ్ యాక్ట్ లో, థర్డ్ యాక్ట్ లో ఆటంకాలన్నిటినీ ముక్కలు చేస్తూ సాగిపోతుంది కథానాయక పాత్ర.
        
ఈ రకమైన సానుకూల రూపాంతరాన్ని మనం సినిమాల్లో పదే పదే చూస్తాం. కథానాయకుడి అనైక్యత ప్రారంభ స్థితి నుంచి పరిణామం చెందడం, వివిధ అడ్డంకుల్ని, పరీక్షల్నీ ఎదుర్కొనే ప్రయాణాన్ని సాగించడం, కొన్ని పాత్రల నుంచి సవాళ్ళు ఎదుర్కోవడం, ఇతర పాత్రల  సహాయంతో చివరికి ఒక తుది పోరాటాన్ని చేయడం, అందులో గెలుపు సాధించి మనిషిగా ఐక్యతా భావమనే విజయపతాకాన్ని ఎగరేయడం.  అందుకే మనం కథ గురించి ఆలోచించినప్పుడు, మనం దాని మానసిక ప్రయాణాన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
—స్కాట్ మేయర్స్,
(స్క్రీన్ ప్లే కోచ్)


11, ఫిబ్రవరి 2023, శనివారం

1303 : సందేహాలు- సమాధానాలు

Q :   ఐదు నెలలుగా ఒక స్క్రిప్టు పై పని చేస్తున్నాను. అయితే నేను అనుకున్న పాయింటుతో కథ రావడం లేదు. సెకెండ్ యాక్ట్ కుదరడం లేదు. సెకండ్ యాక్ట్ లో పాయింటుతో సంబంధం లేకుండా సబ్ ప్లాట్ ని క్రియేట్ చేశాను. దాని ప్లేస్‌మెంట్ కారణంగా సబ్ ప్లాటే కథ అన్పించేలా వస్తోంది. కానీ నా కథ మెయిన్ ప్లాట్ కి సబ్ ప్లాట్ కంపల్సరీ అని భావిస్తున్నాను. అసలు సెకెండ్ యాక్ట్ అనుకున్న పాయింటు ప్రకారం రాకపోవడానికి కారణం ఏమిటంటారు. దీన్నెలా సాల్వ్ చేయాలి తెలుపగలరు.
—ఎస్ ఎస్ కె, టాలీవుడ్
A :    సెకండ్ యాక్ట్ సమస్యలకి మూలం ఫస్ట్ యాక్ట్ ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటు చేసిన ప్రాబ్లం దగ్గర వుంటుంది. ఈ ప్రాబ్లం బలాబలాలు కథకి అనుకున్న ఐడియా (పాయింటు) బలాబలాల మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి ముందుగా మీ కథ ఐడియాని వర్కౌట్ చేయాలి. ఐడియాలో కథ వుందా, గాథ వుందా చెక్ చేసుకోవాలి. గాథ వుంటే కథగా మార్చుకోవాలి. కథ సారాన్ని మూడు వాక్యాల (ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్) స్ట్రక్చర్ లో కూర్చి ఐడియా నిర్మాణాత్మకంగా వుండేట్టు చూసుకోవాలి.
        
ప్లాట్ పాయింట్ వన్ నుంచి సెకెండ్ యాక్ట్ లో పనిచేసేది ఈ నిర్మాణాత్మక ఐడియానే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఈ నిర్మాణాత్మక ఐడియా పాత్రకి సమస్యని ఏర్పాటు చేసి, ఆ సమస్యని సాధించే గోల్ ని పాత్రకి అందిస్తుంది. కాబట్టి ఈ గోల్ లో నాల్గు ఎలిమెంట్లు వుండేట్టు చూసుకోవాలి. 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. 
        
దీంతో సెకండ్ యాక్ట్ లోకి వెళ్ళినప్పుడు అనుకున్న ఐడియా (పాయింటు) కథని సరఫరా చేస్తూ కథని బలంగా డ్రైవ్ చేస్తూంటుంది. సెకండ్ యాక్టే సినిమా, సెకండ్ యాక్ట్ కొద్దీ కలెక్షన్స్. ఇక సబ్ ఫ్లాట్స్ ప్రధాన కథకి ఎక్కడో కనెక్ట్ అయ్యేట్టు చూసుకుంటే అవి ప్రధాన కథగా మారవు. ఐడియా నిర్మాణం గురించి, అలాగే గోల్ ఎలిమెంట్స్ గురించి పూర్తి సమాచారం కావాలంటే బ్లాగు సెర్చి బాక్సులో ఐడియా అని, గోల్ ఎలిమెంట్స్ అని తెలుగులో టైపు చేయండి. వాటికి సంబంధించిన పేజీలు బయటపడతాయి.  
—సికిందర్

8, ఫిబ్రవరి 2023, బుధవారం

1302 : రివ్యూ!


దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ టి రమేష్
తారాగణం : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు
స్క్రీన్ ప్లే- మాటలు : గణేశ్ రావూరి, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
బ్యానర్స్ :
నిర్మాతలు : నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
విడుదల : ఫిబ్రవరి 4, 2023
***
          కొత్త హీరోయిన్ తో, కొత్త సంవత్సరంలో, కొత్త కొత్తగా ఫ్రేమ కథ చూపిస్తూ, ప్రేక్షకుల్ని పరవశుల్ని చేయాలనుకున్నారు. దీనికి ఒరిజినల్ కంటెంట్ కాకుండా అరువు కంటెంట్ ఎంపిక చేసుకున్నారు. అరువు కంటెంట్ ఎప్పుడూ బరువే. అరువు లాగే తెలుగు కుదరాలని లేదు. పైగా అది ఓటీటీలో ప్రేక్షకులు చూసేసి వుంటే అస్సలు కుదరదు. అయినా చూద్దామని ప్రయత్నించారు. కొత్త దర్శకుడు అరువు కంటెంట్ తో వస్తున్నాడంటే ఆసక్తి ఏముంటుంది. అయినా ఆసక్తి కల్గించుకుని ఈ రీమేక్ ఎలా వుందని చూస్తే...

కథ

అరకులో దూది కొండ గ్రామానికి చెందిన సత్య (అనిఖా సురేంద్రన్) ఇంటి పట్టున కాలం గడుపుతూ వుంటుంది. టైలరింగ్ చేసే తల్లి, రైస్ మిల్లులో పనిచేసే తండ్రీ వుంటారు. ఒక చదువుకుంటున్న చెల్లెలు వుంటుంది. సత్యకి ఒక కెమెరా ఫోన్ కొనుక్కుని రీల్స్ చేసి పేరు తెచ్చుకోవాలని కోరిక వుంటుంది. ఉన్న ఫోన్ తో ఒకసారి తల్లి కోసం ఎవరికో ఫోన్ చేస్తే రాంగ్ కాల్ వెళ్ళి ఆటో డ్రైవర్ మురళి (సూర్య వశిష్ట) కి చేరుతుంది. తను కట్ చేస్తే అతను కాల్స్ చేస్తూ వెంటపడతాడు. ఆమె తగ్గి, అతడితో ఫోన్ రోమాన్స్ ప్రారంభిస్తుంది. తను చెప్పిన పొడుపు కథ విప్పాడని అతడ్ని ప్రేమిస్తుంది. ఈమె గొంతు బావుందని అతను ప్రేమిస్తాడు.

గ్రామంలోనే ఒక డబ్బున్న బట్టల కొట్టు వ్యక్తి సత్యని ప్రేమిస్తూంటాడు. అతడితో పెళ్ళి సంబంధం అనుకుంటారు సత్య తల్లిదండ్రులు. ఇది నచ్చని సత్య ఇక మురళిని కలుసుకుని పెళ్ళి చేసుకోవాలని వైజాగ్ వెళ్ళిపోతుంది. వైజాగ్ లో మురళి పోగొట్టుకున్న ఫోన్ ఆర్కే (అర్జున్ దాస్) అనే రౌడీకి దొరకడంతో, ఫోన్ చేసిన సత్య అతనే మురళి అనుకుని కలుసుకుంటుంది.
        
ఎవరీ ఆర్కే? తనతో పొరబడ్డ సత్యకి నిజం చెప్పకుండా ఏం చేశాడు? మురళి ఏమయ్యాడు? ఆర్కే ఎవరు? మురళి ఎవరు? సత్య ఎవర్ని నమ్మాలి? ఏం చేయాలి?.. వంటి ప్రశ్నలతో సాగేదే మిగతా కథ.

ఎలావుంది కథ

2020 లో మలయాళ నటుడు, దర్శకుడు మహ్మద్ ముస్తఫా తీసిన కప్పెలా’ (చిన్నచర్చి) కి బుట్టబొమ్మ రీమేక్ కథ. వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా రుద్దాడు. బాహ్య అందాలతో ఈ షుగర్ కోటింగ్ కి పడిపోయి తెలుగులోనూ అలాగే తీసేశారు.
        
ఇందులో హీరోయిన్ కి ఇంటా బయటా భావస్వాతంత్ర్యం వుండదు. గ్రామంలో డబ్బున్న ఒకడు ఏక పక్షంగా ఆమెని ప్రేమించుకుని పెళ్ళి చూపులు పెట్టుకుంటాడు. కూతురికి ఇష్టమా కాదా అడక్కుండా పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. హీరోయిన్ తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా వేసి వుంటాడు. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్ళి విషయంలో తండ్రికి తల్లి మీద కూడా పురుషాధిక్యమే.
        
ఇక హీరోయిన్ ఫోన్ ప్రేమాయణంతో కలిసిన ఆటో డ్రైవర్ ది ఆమెని  వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. హీరోయిన్ ని కాపాడే రౌడీ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో అతడిదీ మగ అహంకారమే. ఈ టీచర్ నా ఆస్తి అన్న ఇగోయే తప్ప, నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది.
        
ఇంట్లోంచి వెళ్ళిపోయి చివరికి ఎవరేమిటో తెలుసుకుని ఇంటి ముఖం పట్టిన హీరోయిన్, పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుంటుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ఈ కథ ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి  భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తోనే  మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది. 
        
ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే డబ్బున్న వాడు కన్పించి నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయంలా వుండదు. దీన్ని ఉన్నదున్నట్టు తెలుగులోకి దింపేశారు!! బుట్టబొమ్మని ఆటబొమ్మ చేశారు.
        
అయితే మలయాళంలో ఫాలోయింగ్ వున్న సాఫ్ట్ గా కన్పించే రోషన్ మాథ్యీవ్ నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ సినిమాని నిలబెట్టుకోవడానికి  బాగా వర్కౌట్ అయ్యాయి. తెలుగులో ఈ కాస్టింగ్ వ్యూహమైనా ఆలోచించలేదు. కళ్ళు మూసుకుని రీమేక్ చేసేశారు.      

రీమేక్ ఒరిజినల్లో వున్న ఫీల్ తో ఎప్పుడూ వుండదు. రీమేక్ ని ఒరిజినల్ తో పోల్చి రేటింగ్ తగ్గించకూడదు. అయితే ఒరిజినల్లో వున్న ఒప్పించని కంటెంట్ తో రీమేక్ వుండకూడదు. ఒరిజినల్ ని ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు చాలామంది చూసేశారు. చూడని వాళ్ళకి బాహ్య అందాలతో షుగర్ కోటింగ్ వల్ల నచ్చ వచ్చు.

నటనలు - సాంకేతికాలు

హీరోయిన్ అనిఖా పాత్ర ప్రకారం నటించుకు పోయింది. మలయాళంలో హీరోయిన్ అన్నాబెన్ కీ, అనిఖా సురేంద్రన్ కీ నటనా పరమైన తేడా ఏమిటంటే చిత్రీకరణ. మలయాళం కెమెరా వర్క్ వెలుగు నీడల డెప్త్ తో, కూల్ కలర్స్ తో, తక్కువ లైటింగ్ తో కేరళ నేటివిటీలోకి పాత్రల్ని తీసికెళ్తుంది. దీంతో అన్నా బెన్ హావభావాలు డెప్త్ తో కూడిన మూడ్ ని క్రియేట్ చేస్తాయి. తెలుగులో ప్లాట్ లైటింగ్ తో, రంగులమయం చేసిన దృశ్యాలతో అనిఖా నటనని ఫీలయ్యేందుకు పెద్దగా వుండదు.
        
ఆర్కే గా నటించిన అర్జున్ దాస్ వాయిస్ వల్ల ప్రభావం చూపిస్తాడు. ఆటోడ్రైవర్ గా సూర్య వశిష్ట ఫర్వాలేదన్పిస్తాడు. మిగిలిన అన్ని పాత్రలకీ అందరూ తెలియని కొత్తవాళ్ళే కావడంతో ఇది తెలుగు సినిమాయేనా అనుకునేలా తయారైంది. మలయాళంనే డబ్బింగ్ చేస్తే సరిపోయేదేమో. రెగ్యులర్ తెలుగు సినిమాల్లోని పాత్రలే అరకులో తిరుగుతున్నట్టు వుంటాయే తప్ప, అరకు జీవితం కనపడదు. ఈ సినిమా హైదరాబాద్ పక్కన తీసినా సరిపోతుంది. రెండు పాటలు అదనంగా పెట్టినా బలహీన సంగీతంతో బడ్జెట్ వృధాగా మారాయి.
        
గణేష్ రావూరి స్క్రీన్ ప్లే, మాటలు. స్క్రీన్ ప్లే దాదాపూ మలయాళం స్క్రీన్ ప్లేనే.  ఎలావున్న స్క్రీన్ ప్లే అలా తీస్తూ ఎందుకో మొదటి సీను మీద చేయి చేసుకున్నారు. మలయాళంలో మొదటి సీనులో హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ని వర్షంలో బస్సెక్కించి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎక్కడికి వెళ్తోందో మనకి తెలీదు. రెండో సీన్లో హీరోయిన్, ఆమె ఫ్రెండ్ గ్రామంలో జీపు దిగి నడుచుకుంటూ పోతారు. బస్సెక్కి వెళ్ళడం, జీపు దిగి గ్రామంలోకి రావడమనే ఈ పరస్పర విరుద్ధ డైనమిక్స్ ఆలోచనలు రేకెత్తిస్తాయి. బస్సెక్కి ఎక్కడికి  వెళ్ళింది? తిరిగి గ్రామంలోకి వచ్చింది. ఇంటికి వెళ్ళింది... ఇలా కథని ఫాలో అవుతూంటే, పెళ్ళి సంబంధం తప్పించుకుని ఆటో డ్రైవర్ ని కలుసుకునేందుకు టౌన్ కి వెళ్ళిపోయే సీను వస్తుంది. ఇక్కడ వర్షంలో బస్సెక్కుతుంది. దీంతో లూప్ లో ఈ శీను వెళ్ళి మొదటి సీనుకి కనెక్ట్ అవుతుంది. ఈ సింపుల్ క్రియేటివిటీ ఆర్గానిక్ గా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అర్ధవంతంగా కూడా వుంది.
        
దీన్ని అర్ధం జేసుకోకుండా తెలుగులో ప్రతాపం చూపించారు. ఫస్ట్ సీనులో హీరోయిన్ వైజాగ్ లో బస్సు దిగుతుంది. అక్కడ బస్టాపు ఎపిసోడ్ చూపించేశారు. ఆ ఎపిసోడ్ లో రౌడీ క్యారక్టర్ తో ఆమెని కంగారు పెట్టించే సీను సాగి సాగి, ఆమె తప్పించుకుని - టాయిలెట్ లోకెళ్ళి పోయి ఫోను తీసినప్పుడు, ఆమె క్లోజప్ మీద కట్ అవుతుంది. ఇక రొటీన్ గా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది ఉస్సూరన్పిస్తూ. ప్రారంభంలోనే బోరు కొట్టించేశారు. ఇప్పుడు మలయాళంలోని  గ్రామంలో జీపు దిగే సీనుతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది.
        
మలయాళంలో ఫ్లాష్ బ్యాక్ అన్నట్టే వుండదు. బస్సెక్కి ఎక్కడికో వెళ్ళింది, జీపు దిగి తిరిగి వూళ్ళోకి వచ్చిందనే కంటిన్యూటీతో వుంటుంది. తెలుగులో ఏకంగా వైజాగ్ ఎపిసోడ్ ఓపెన్ చేసేసి హీరోయిన్ తో ఏదో సస్పెన్స్ క్రియేటయ్యే ప్రారంభం వుండాలనుకున్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుందని తెలిసిపోయే, అరిగిపోయిన టెంప్లెట్ ప్రారంభం. తర్వాత కథ మధ్యలో ఇంట్లోంచి వెళ్ళిపోతూ బస్సెకితే ఎక్కడికి వెళ్తోందో మనకి తెలిసిపోతుంది -ప్రారంభ సీను చూసేశాం గనుక-  వైజాగ్ ఎపిసోడ్ సీను. ఇంకెక్కడి సస్పెన్స్. మలయాళంలో సస్పెన్స్ ఆర్గానిక్ గా వుంటే, తెలుగులో కావాలని సృష్టించినట్టు కృత్రిమత్వంతో వుండి స్క్రీన్ ప్లేని చెడగొట్టింది.
——సికిందర్   

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

1301 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : దర్శకుడు : రంజిత్ జయకొడి

తారాగణం : సందీప్ కిషన్విజయ్ సేతుపతిదివ్యాంశవరుణ్ సందేశ్గౌతం మీనన్అయ్యప్ప శర్మఅనసూయవరలక్ష్మీ శరత్‌ కుమార్ 
సంగీతం
 : సామ్ సిఎస్ఛాయాగ్రహణం : కిరణ్ కౌషిక్ 
నిర్మాతలు:
 భరత్ చౌదరిరామ మోహన రావు

విడుదల : ఫిబ్రవరి 3, 2023
***

        హిట్లు అనేవి లేకుండా నటిస్తూ వున్న సందీప్ కిషన్ తమిళంలో కూడా హీరోగా 5 సినిమాలు నటించాడు. మరో రెండు నటిస్తున్నాడు. ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ లో కూడా ముఖ్యపాత్ర నటించాడు. తాజాగా తెలుగు- తమిళం ద్విభాషా చలన చిత్రంలో నటించాడు. ఇది హిందీ, మలయాళం, కన్నడలో పానిండియాగా విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటించడం ఆసక్తి రేకెత్తించింది. కొత్త తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దీన్ని పీరియెడ్ మూవీగా రూపొందించాడు. ఇదైనా సందీప్ కిషన్ కి కలిసి వచ్చిందా లేక, మళ్ళీ మొదటికొచ్చిందా తెలుసుకుందాం...

కథ

1990 లలో చిన్నప్పుడు మైఖేల్ (సందీప్ కిషన్) కత్తి పట్టుకుని తండ్రిని చంపేందుకు ముంబాయి వచ్చి గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతమ్ మీనన్) దృష్టిలో పడతాడు. మైఖేల్ ని చేరదీసి అనుచరుడు స్వామి (అయ్యప్ప శర్మ) పర్యవేక్షణలో వుంచుతాడు. యువకుడుగా ఎదిగిన మైఖేల్ శత్రువుల దాడి నుంచి గురునాథ్ ని కాపాడడంతో గురునాథ్ కి మరింత దగ్గరవుతాడు. ఇది చూసి గురునాథ్ కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) అసూయ పెంచుకుంటాడు. తన మీద దాడి జరిపించిన రతన్ (అనీష్ కురువిల్లా) నీ, అతడి కూతురు తీర (దివ్యాంశ) నీ చంపమని మైఖేల్ ని ఢిల్లీకి పంపుతాడు గురునాథ్. ఢిల్లీ వెళ్ళిన మైఖేల్ తీర ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అమర్ నాథ్ రతన్ ని చంపేసి, మైకేల్ మీద కాల్పులు జరిపి లోయలోకి తోసేస్తాడు.

        అసలు మైఖేల్ తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? అతను జైల్లో ఎందుకు పుట్టాడు? గురునాథ్ - చారులత (అనసూయా భరద్వాజ్) లతో మైఖేల్ కున్న సంబంధమేమిటి? కన్నమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎవరు? ఇంకో గ్యాంగ్ స్టర్ (విజయ్ సేతుపతి) ఎవరు? ఇంతకీ మైఖేల్ తండ్రిని చంపాడా లేదా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

1990 ల కాలంలో సెట్ చేసిన పీరియెడ్ కథ. ఫార్ములా రివెంజీ డ్రామా. ఈ కథలో మైఖేల్ కి అన్యాయం జరిగిన చిన్నప్పటి కథ తప్ప మిగిలినదంతా ఫ్లాట్ గా సాగిపోయే రక్తపాతాల యాక్షన్ కథ. చివరి 15 నిమిషాలు పేలుళ్ళ మోతే.  కేజీఎఫ్ ప్రభావం కూడా చాలా వుంది. గ్యాంగ్ స్టర్- మాఫియా సినిమాలు కమలహాసన్  నాయకుడు నుంచీ జేడీ చక్రవర్తి సత్య వరకూ అనేకం వచ్చాయి. ఆ కాలంలో జరిగిన కథల్ని అదే ఫార్ములాతో, టెంప్లెట్స్ తో అలాగే తీయడం వల్ల ఈ తరం ప్రేక్షకులకి గిట్టుబాటు అయ్యేదేమీ వుండదు. బోరు కొట్టి కూర్చుంటాయి. కాకపోతే నాయకుడు నుంచి సత్య నుంచీ పాత్రల్ని తీసుకుని, నేటి కాలానికి హీరోతో కొత్త కథ సృష్టిస్తే అదొక చెప్పుకోదగ్గ ప్రయత్నం.

        ఇందులో వినోదించడానికి, ఆనందించడానికి అలాటి కథ, పాత్రలు లేవు. యమ సీరియస్ కథకి యమ సీరియస్ పాత్రలు. పాత్రలన్నీ ఒకేలా వుంటాయి - సీరియస్ మొహాలు పెట్టుకుని దేశం కోసం సీరియస్ గా పోరాటం చేస్తున్నట్టు.  ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తున్నాడు గనుక ఓపికతో చూస్తాం. ఇంటర్వెల్లో మైఖేల్ని షూట్ చేసి లోయలో పడేశాక- ఈ సెటప్ చేసిన కథతో సెకండాఫ్ గజిబిగా తయారై, రివెంజి కథ మన మీద పగ దీర్చుకుంటున్నట్టు వుంటుంది. మైఖేల్ పాత్ర సందీప్ కిషన్ తండ్రి పాత్ర మీద పగ దీర్చుకోవడానికి వచ్చాడా, లేక తనకి హిట్స్ ఇవ్వడం లేదని ప్రేక్షకుల మీదా? రెండోదే నిజం చేశాడు. 

        ప్రియురాలి ప్రేమ, తల్లితో మదర్ సెంటిమెంటు అనే బంధాల మధ్య మైఖేల్ ని భావోద్వేగభరితంగా బంధించాలన్న ప్రయత్నానికి ప్రియురాలితో ప్రేమలో పసలేదు, మదర్ తో ఫీల్ లేదు, ఫ్యామిలీ డ్రామా అసలే లేదు- కేవలం తండ్రిని చంపాలన్న కసి తప్ప. పైగా సెకండాఫ్ లో అనవసర పాత్రల హడావిడి ఒకటి. ఆలస్యంగా వచ్చే విజయ్ సేతుపతి పాత్ర కూడా కథా బలానికి తోడ్పడలేదు. సెకండాఫ్ శిరోభారం తప్ప ఏమీ లేదు. ఇలాటి కథ చేసుకుని, దీన్ని స్టయిల్ తో, టెక్నిక్ తో, అద్భుతంగా చిత్రీకరించిన శ్రమంతా వృధా అయింది.

నటనలు- సాంకేతికాలు

నటవర్గం మాత్రం మల్టీ స్టారర్ కి తక్కువ కాకుండా వున్నారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దర్శకుడు గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయా భరద్వాజ్ ...పానిండియా ఆర్భాటం. ఒక్కరూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు. గురునాథ్ గా గ్యాంగ్ స్టర్ పాత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ కెందుకో అర్ధం గాదు. ఈ పాత్ర విజయ్ సేతుపతి వేసి వుంటే యూత్ కి ఈ యమ సీరియస్ సినిమాతో హుషారొ చ్చేదేమో.

        తెర మరుగైన హీరో వరుణ్ సందేశ్ విలనీ అయినా సరదాగా చేయకుండా సైకోలా బిహేవ్ చేస్తాడు. అనసూయ కూడా సీరియస్సే. అందరూ సీరియస్సే హార్రర్ సినిమాలాగా. సందీప్ కిషన్ గెటప్ మార్చుకున్నాడు గానీ, సీరియస్ లుక్ తో నటించడానికి తగినన్ని భావోద్వేగాల్లేవు కథలో. బాగా చేసింది ఫైట్లు ఒక్కటే. ప్రేక్షకులతో తను కనెక్ట్ అవ్వాలంటే చిన్నప్పటి  ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే బలంగా వుంటే చాలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తను లేడు, చైల్డ్ ఆర్టిస్టు వున్నాడు. ప్రస్తుత కథలో తనున్నప్పుడు, ఫ్లాష్ బ్యాక్ లోని భావోద్వేగాలు ప్రస్తుత కథలోకి వచ్చేలా అంతకంటే బలమైన కథనముండాలి.  

        కథా కథనాలు, పాత్రలు ఇలా వుంటే,, వీటిని తెరకెక్కించిన విధానం మాత్రం మహోజ్వల చిత్రరాజం అన్పించేలా వుంటుంది. కెమెరాకి  తీసుకున్న షాట్స్, లైటింగ్, కలర్ స్కీమ్ అన్నీ పీరియడ్ మూవీ జానర్ విలువలతో వున్నాయి. వీటితో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పోటీ పడింది. సందీప్ కిషన్ కి టెక్నికల్ గా గర్వించే మూవీ దక్కింది, విషయపరంగా మాత్రం హిట్ కి సుదూరంగా వుండిపోయింది.
—సికిందర్