రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఫిబ్రవరి 2023, ఆదివారం

1304 : సినిమా సైన్స్

 

        న అంతర్గత (మానసిక) పరిస్థితిని స్పృహలోకి తీసుకురానప్పుడు, ఆ అంతర్గత పరిస్థితి విధి వలె వెలుపల జరుగుతుందని, అంటే భౌతిక ప్రపంచంలో మన అనుభవంలోకి వస్తుందని- మానసిక నియమం (సైకలాజికల్ రూల్) చెబుతుంది. అంటే, వ్యక్తి అవిభక్తంగా వుండి, తన అంతర్గత వైరుధ్యాల గురించి స్పృహలోకి రానప్పుడు, ప్రపంచం ఆ మానసిక సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) ని భౌతిక ప్రపంచంలో బలవంతంగా అమలు చేస్తుందని అర్ధం. ఇది ప్రముఖ స్విస్ మానసిక విశ్లేషకుడు, సిద్ధాంతకర్త కార్ల్ జంగ్ చెప్పిన మాట. మనం కథని అనేక రూపాల్లో చూడగలం : కథాంశం పరంగా నిర్మాణాత్మకంగా, ఇతివృత్తం పరంగా ప్రతీకాత్మకంగా, దృశ్యపరంగా బొమ్మలుగా చూడగలం. అయితే మనం ఒక కథని పాత్ర కోణం నుంచి పరిశీలిస్తున్నామంటే, మనమా పాత్ర  మానసిక ప్రయాణాన్ని (సైకలాజికల్ జర్నీ) చూస్తున్నట్టే లెక్క.

        నిజానికి పై దృక్కోణం నుంచి చూసినపుడు, కథలోని అన్ని సంఘటనలు, పాత్రలూ అన్నీ కూడా, కథానాయకుడి మానసిక తపన కోసం పనిచేస్తున్నట్టే కనిపించగలవు. వ్యక్తిగతంగా చూసుకుంటే కార్ల్ జంగ్ మాట చాలా ముఖ్యమైనది. అంటే మనం మన మనస్సులోని అన్ని కార్యకలాపాల్ని, చీకటి ప్రేరణల్నీ గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే, విశ్వం బయట ఆ పరిస్థితుల్ని సృష్టించి మనల్ని బలవంతంగా సంఘర్షణలోకి దింపుతుందన్న మాట. సినిమా రచనా పరంగా పై సూత్రీకరణ అంతరార్ధం రెండు రూపాల్లో కన్పిస్తుంది : అనైక్య (ఇమ్మెచ్యూరిటీ) స్థితిలో కథని ప్రారంభించే కథానాయకుడు ఐక్యత (మెచ్యూరిటీ) వైపు వెళ్ళడానికి ఉద్దేశించిన విధిని ఎదుర్కోవడం, రెండవది- కథా సంబంధమైన కథనంలో జరిగే సంఘటనలు కథానాయకుడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) లోని మూలాంశాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి వుండడం.
        
జోసెఫ్ కాంప్‌బెల్ సూచించినట్టుగా, కథానాయకుడనే వాడు మారాలి, మారాల్సిన అవసరం గుర్తించకపోయినా మారతాడు. కాబట్టి  ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లోని పాత్ర డరోతీ కి ఇంద్రధనస్సు దాటుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలని అన్పించినప్పుడు, తన ఇల్లు అనుకున్న వుంటున్న ఇంటిని ఇల్లులా ఫీలవ్వలేని స్థితిలో వుందామె. ఈ ఆమె మానసిక ప్రయాణపు ప్రారంభంలోనే మనం ఇంటికి మించిన ప్రదేశం లేదు అని ఆమె చివరికి గ్రహించే సంఘటనలతోనే ఆమె ప్రయాణం వుంటుందని తెలుసుకుంటాం. అంటే ఆమె ఒక ఇమ్మెచ్యూర్ స్థితి నుంచి మెచ్యూర్డ్ స్థితికి మారుతుందన్నమాట- ఇది తను గుర్తించకపోయినా.
        
కనుక మనం సినిమా రచనలో పాత్ర-ఆధారిత కథని ఈ విధంగా చేపడతాం : కథలోని కథానాయకుడిని లోతుగా శోధించి, అతడి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) మూలాంశమేమిటో నిర్ణయించి, దాని ఆధారంగా అతడి ఎదుగుదలకి తోడ్పడే సంఘటనల్నీ, చర్యల్నీ మిళితం చేసే కథనాన్ని నిర్మిస్తూ, అతడి మానసిక ప్రయాణపు రూట్ మ్యాపుని చూపిస్తాం.
        
కథానాయకుడు ఏ విధమైన పరివర్తనకీ గురికాని సినిమాలున్నాయి. ఆ కథానాయకుల క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) ప్రతికూలంగా వుండవచ్చు. వాస్తవం ఏమిటంటే, ఆ కథానాయకులు చాలా కథల్లో సానుకూల రూపాంతరాన్నే అనుభవిస్తారు. అంటే మార్పుకి లోనవుతారు. కథల్లో పరివర్తన అనేది అనివార్యమని జోసెఫ్ కాంప్‌బెల్ పేర్కొన్నాడు.
        
సినిమా రచయితలు కథలోని మానసిక ప్రయాణాన్ని త్రవ్వడానికి ఉత్తమ మార్గం ఈ రెండు ప్రశ్నలు వేసుకోవడం : కథానాయకుడికి కోరిక ఏమిటి? కథానాయకుడి అవసరం ఏమిటి? కోరుకోవడం పాత్ర చేతనావస్థ లక్ష్యం. పాత్ర మనసులో లక్ష్యం, అంటే  అంతిమ ఫలితం స్పష్టంగా రూపుదిద్దుకుని వుంటుంది. ఇది ఫస్ట్ యాక్ట్ ముగింపులో అంటే ప్లాట్ పాయింట్ వన్ కల్లా ఏర్పడుతుంది. ది విజార్డ్ ఆఫ్ ఓజ్‌ లో డరొతీ కొరికేమిటి? ఇంద్రధనస్సుని దాటుకుని నివాసాన్ని పొందడం.
        
అవసరం పాత్ర అచేతావస్థ లక్ష్యం. పాత్రకి కొంతవరకు ఈ అంతర్గత లక్ష్యం గురించి తెలిసి వుండ వచ్చు. అయితే ఈ సహజ సిద్ధ స్వభావాన్ని తెలియకుండానే అణిచి వేసుకుంటూ వుంటుంది. నిజ జీవితంలో మన పరిస్థితే. డరోతీ అవసరమేమిటి? ఆమె వుంటున్న ఇంటి పరిసరాల్లో  నివసించే వ్యక్తులతో, తన కుటుంబంతో, పొలంతో అనుభవిస్తున్న అనుభూతుల్లాంటివి పొందడం. లాంటివి ఇంకెక్కడా వుండవు. ఇవి ఆమెకి ఇక్కడే ఇంటి దగ్గరే వున్నాయి తప్ప ఎక్కడో ఇంద్రధనస్సు కావల లేవు.
        
ఈ కోరికకీ, అవసరానికీ మధ్య ఉద్రిక్తతలే పాత్ర అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) కి మూలం. తత్ఫలితంగా,  సాధారణ దృష్టిలో దాగి ఒక ముఖ్యమైన నిజముంటుంది : పాత్ర  ఐక్యతా (మెచ్యూరిటీ) బీజాలు ఆ పాత్ర మానసిక ప్రయాణం ప్రారంభించే ముందు తానేమిటో అక్కడే వుంటాయి. ఇది పాత్ర తెలుసుకోవడమే అసలు అవసరం. ఈ తెలివిలో కొచ్చినప్పుడు, దీని ప్రకాశంలో తడిసి తళతళా మెరిసే మెచ్యూరిటీని సాధిస్తుంది పాత్ర. ఈ నిజం ది విజార్డ్ ఆఫ్ ఓజ్ ‘ చివర్లో ప్రతిబింబిస్తుంది- ఇంటికి  తిరిగి వెళ్ళే శక్తి నీకు ఎల్లప్పుడూ వుంది అని గ్లిండా డరోతీకి చెప్పినప్పుడు.
        
ఈ శక్తిని (తెలివిని) ఎల్లప్పుడూ కలిగి వుంటాం. కానీ మన కోరికలు డామినేట్ చేస్తాయి. పాత్ర రూపాంతరపు సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి మంత్రాక్షరా లేవైనా వుంటే, బహుశా పై గ్లిండా మాటలే.
        
కథానాయక పాత్రకి ఈ శక్తి ఎప్పుడూ వుంటుంది, ఈ కింది వాటితో ముడిపడి-
        
1. కథానాయకుడి నమ్మకాలతో, పోరాట నైపుణ్యాలతో, ఆత్మ రక్షణా విధానాలతో, ఫస్ట్ యాక్ట్ లో తన సాధారణ ప్రపంచంలో ప్రవర్తనా విధానాలతో;
        
2. కథానాయకుడు తన అవసరాన్ని అణచివేయడంతో, తిరస్కరించడంతో; అది తన అంతరాత్మలో భాగమైనప్పటికీ గుర్తించక.
        
వీటన్నిటికీ  శక్తి అవసరం. ఈ శక్తి కథానాయకుడి వనరుల్ని పైకి తోడుతుంది. చివరికి అనైక్యత (ఇమ్మెచ్యూరిటీ) నుంచి ఐక్యత (మెచ్యూరిటీ) కి ప్రారుద్భవించడానికి తనని తను అనుమతించుకున్నప్పుడు- ఆ శక్తి వరదలా అడ్డంకుల్ని బద్ధలు కొడుతుంది. సెకండ్ యాక్ట్ లో, థర్డ్ యాక్ట్ లో ఆటంకాలన్నిటినీ ముక్కలు చేస్తూ సాగిపోతుంది కథానాయక పాత్ర.
        
ఈ రకమైన సానుకూల రూపాంతరాన్ని మనం సినిమాల్లో పదే పదే చూస్తాం. కథానాయకుడి అనైక్యత ప్రారంభ స్థితి నుంచి పరిణామం చెందడం, వివిధ అడ్డంకుల్ని, పరీక్షల్నీ ఎదుర్కొనే ప్రయాణాన్ని సాగించడం, కొన్ని పాత్రల నుంచి సవాళ్ళు ఎదుర్కోవడం, ఇతర పాత్రల  సహాయంతో చివరికి ఒక తుది పోరాటాన్ని చేయడం, అందులో గెలుపు సాధించి మనిషిగా ఐక్యతా భావమనే విజయపతాకాన్ని ఎగరేయడం.  అందుకే మనం కథ గురించి ఆలోచించినప్పుడు, మనం దాని మానసిక ప్రయాణాన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
—స్కాట్ మేయర్స్,
(స్క్రీన్ ప్లే కోచ్)


11, ఫిబ్రవరి 2023, శనివారం

1303 : సందేహాలు- సమాధానాలు

Q :   ఐదు నెలలుగా ఒక స్క్రిప్టు పై పని చేస్తున్నాను. అయితే నేను అనుకున్న పాయింటుతో కథ రావడం లేదు. సెకెండ్ యాక్ట్ కుదరడం లేదు. సెకండ్ యాక్ట్ లో పాయింటుతో సంబంధం లేకుండా సబ్ ప్లాట్ ని క్రియేట్ చేశాను. దాని ప్లేస్‌మెంట్ కారణంగా సబ్ ప్లాటే కథ అన్పించేలా వస్తోంది. కానీ నా కథ మెయిన్ ప్లాట్ కి సబ్ ప్లాట్ కంపల్సరీ అని భావిస్తున్నాను. అసలు సెకెండ్ యాక్ట్ అనుకున్న పాయింటు ప్రకారం రాకపోవడానికి కారణం ఏమిటంటారు. దీన్నెలా సాల్వ్ చేయాలి తెలుపగలరు.
—ఎస్ ఎస్ కె, టాలీవుడ్
A :    సెకండ్ యాక్ట్ సమస్యలకి మూలం ఫస్ట్ యాక్ట్ ముగింపులో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పాటు చేసిన ప్రాబ్లం దగ్గర వుంటుంది. ఈ ప్రాబ్లం బలాబలాలు కథకి అనుకున్న ఐడియా (పాయింటు) బలాబలాల మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి ముందుగా మీ కథ ఐడియాని వర్కౌట్ చేయాలి. ఐడియాలో కథ వుందా, గాథ వుందా చెక్ చేసుకోవాలి. గాథ వుంటే కథగా మార్చుకోవాలి. కథ సారాన్ని మూడు వాక్యాల (ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్) స్ట్రక్చర్ లో కూర్చి ఐడియా నిర్మాణాత్మకంగా వుండేట్టు చూసుకోవాలి.
        
ప్లాట్ పాయింట్ వన్ నుంచి సెకెండ్ యాక్ట్ లో పనిచేసేది ఈ నిర్మాణాత్మక ఐడియానే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఈ నిర్మాణాత్మక ఐడియా పాత్రకి సమస్యని ఏర్పాటు చేసి, ఆ సమస్యని సాధించే గోల్ ని పాత్రకి అందిస్తుంది. కాబట్టి ఈ గోల్ లో నాల్గు ఎలిమెంట్లు వుండేట్టు చూసుకోవాలి. 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. 
        
దీంతో సెకండ్ యాక్ట్ లోకి వెళ్ళినప్పుడు అనుకున్న ఐడియా (పాయింటు) కథని సరఫరా చేస్తూ కథని బలంగా డ్రైవ్ చేస్తూంటుంది. సెకండ్ యాక్టే సినిమా, సెకండ్ యాక్ట్ కొద్దీ కలెక్షన్స్. ఇక సబ్ ఫ్లాట్స్ ప్రధాన కథకి ఎక్కడో కనెక్ట్ అయ్యేట్టు చూసుకుంటే అవి ప్రధాన కథగా మారవు. ఐడియా నిర్మాణం గురించి, అలాగే గోల్ ఎలిమెంట్స్ గురించి పూర్తి సమాచారం కావాలంటే బ్లాగు సెర్చి బాక్సులో ఐడియా అని, గోల్ ఎలిమెంట్స్ అని తెలుగులో టైపు చేయండి. వాటికి సంబంధించిన పేజీలు బయటపడతాయి.  
—సికిందర్

8, ఫిబ్రవరి 2023, బుధవారం

1302 : రివ్యూ!


దర్శకత్వం : శౌరి చంద్రశేఖర్ టి రమేష్
తారాగణం : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు
స్క్రీన్ ప్లే- మాటలు : గణేశ్ రావూరి, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు
బ్యానర్స్ :
నిర్మాతలు : నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య
విడుదల : ఫిబ్రవరి 4, 2023
***
          కొత్త హీరోయిన్ తో, కొత్త సంవత్సరంలో, కొత్త కొత్తగా ఫ్రేమ కథ చూపిస్తూ, ప్రేక్షకుల్ని పరవశుల్ని చేయాలనుకున్నారు. దీనికి ఒరిజినల్ కంటెంట్ కాకుండా అరువు కంటెంట్ ఎంపిక చేసుకున్నారు. అరువు కంటెంట్ ఎప్పుడూ బరువే. అరువు లాగే తెలుగు కుదరాలని లేదు. పైగా అది ఓటీటీలో ప్రేక్షకులు చూసేసి వుంటే అస్సలు కుదరదు. అయినా చూద్దామని ప్రయత్నించారు. కొత్త దర్శకుడు అరువు కంటెంట్ తో వస్తున్నాడంటే ఆసక్తి ఏముంటుంది. అయినా ఆసక్తి కల్గించుకుని ఈ రీమేక్ ఎలా వుందని చూస్తే...

కథ

అరకులో దూది కొండ గ్రామానికి చెందిన సత్య (అనిఖా సురేంద్రన్) ఇంటి పట్టున కాలం గడుపుతూ వుంటుంది. టైలరింగ్ చేసే తల్లి, రైస్ మిల్లులో పనిచేసే తండ్రీ వుంటారు. ఒక చదువుకుంటున్న చెల్లెలు వుంటుంది. సత్యకి ఒక కెమెరా ఫోన్ కొనుక్కుని రీల్స్ చేసి పేరు తెచ్చుకోవాలని కోరిక వుంటుంది. ఉన్న ఫోన్ తో ఒకసారి తల్లి కోసం ఎవరికో ఫోన్ చేస్తే రాంగ్ కాల్ వెళ్ళి ఆటో డ్రైవర్ మురళి (సూర్య వశిష్ట) కి చేరుతుంది. తను కట్ చేస్తే అతను కాల్స్ చేస్తూ వెంటపడతాడు. ఆమె తగ్గి, అతడితో ఫోన్ రోమాన్స్ ప్రారంభిస్తుంది. తను చెప్పిన పొడుపు కథ విప్పాడని అతడ్ని ప్రేమిస్తుంది. ఈమె గొంతు బావుందని అతను ప్రేమిస్తాడు.

గ్రామంలోనే ఒక డబ్బున్న బట్టల కొట్టు వ్యక్తి సత్యని ప్రేమిస్తూంటాడు. అతడితో పెళ్ళి సంబంధం అనుకుంటారు సత్య తల్లిదండ్రులు. ఇది నచ్చని సత్య ఇక మురళిని కలుసుకుని పెళ్ళి చేసుకోవాలని వైజాగ్ వెళ్ళిపోతుంది. వైజాగ్ లో మురళి పోగొట్టుకున్న ఫోన్ ఆర్కే (అర్జున్ దాస్) అనే రౌడీకి దొరకడంతో, ఫోన్ చేసిన సత్య అతనే మురళి అనుకుని కలుసుకుంటుంది.
        
ఎవరీ ఆర్కే? తనతో పొరబడ్డ సత్యకి నిజం చెప్పకుండా ఏం చేశాడు? మురళి ఏమయ్యాడు? ఆర్కే ఎవరు? మురళి ఎవరు? సత్య ఎవర్ని నమ్మాలి? ఏం చేయాలి?.. వంటి ప్రశ్నలతో సాగేదే మిగతా కథ.

ఎలావుంది కథ

2020 లో మలయాళ నటుడు, దర్శకుడు మహ్మద్ ముస్తఫా తీసిన కప్పెలా’ (చిన్నచర్చి) కి బుట్టబొమ్మ రీమేక్ కథ. వాస్తవంగా జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో యూత్ సినిమాలు తీస్తున్న మలయాళ దర్శకుల కోవలో, ముస్తఫా కూడా ఒక రియలిస్టిక్ ఫిక్షన్ తీశాడు. అయితే అంతర్లీనంగా ఒక తిరోగమన భావజాలాన్ని షుగర్ కోటింగ్ వేసి తెలియకుండా రుద్దాడు. బాహ్య అందాలతో ఈ షుగర్ కోటింగ్ కి పడిపోయి తెలుగులోనూ అలాగే తీసేశారు.
        
ఇందులో హీరోయిన్ కి ఇంటా బయటా భావస్వాతంత్ర్యం వుండదు. గ్రామంలో డబ్బున్న ఒకడు ఏక పక్షంగా ఆమెని ప్రేమించుకుని పెళ్ళి చూపులు పెట్టుకుంటాడు. కూతురికి ఇష్టమా కాదా అడక్కుండా పేరెంట్స్ సంబంధం ఒప్పేసుకుంటారు. హీరోయిన్ తండ్రి కూతుళ్ళ పట్ల ఎంత కఠినంగా వుంటాడో చిన్న కూతుర్ని చావబాదుతున్నప్పుడు చూస్తే చాలు. వాళ్ళ మీద నిఘా వేసి వుంటాడు. తండ్రిగా కూతుళ్ళని సంరక్షించుకోవడం వేరు, సంరక్షణ పేరుతో పురుషాధిక్యం ప్రదర్శించడం వేరు. పెళ్ళి విషయంలో తండ్రికి తల్లి మీద కూడా పురుషాధిక్యమే.
        
ఇక హీరోయిన్ ఫోన్ ప్రేమాయణంతో కలిసిన ఆటో డ్రైవర్ ది ఆమెని  వల్లో వేసుకుని అమ్మేసే దుర్మార్గం. హీరోయిన్ ని కాపాడే రౌడీ మంచి మగాడే గానీ, తను ప్రేమిస్తున్న టీచర్ అమ్మాయితో అతడిదీ మగ అహంకారమే. ఈ టీచర్ నా ఆస్తి అన్న ఇగోయే తప్ప, నా సమస్తం అన్న ప్రేమే వుండదు. పాఠాలు చెప్పే ఆ టీచరమ్మ పాపం అణిగిమణిగి వుంటుంది.
        
ఇంట్లోంచి వెళ్ళిపోయి చివరికి ఎవరేమిటో తెలుసుకుని ఇంటి ముఖం పట్టిన హీరోయిన్, పేరెంట్స్ చూసిన సంబంధమే చేసుకుంటుంది. అంటే పెద్దలు చూసిన సంబంధమే తప్ప నీకంటూ నీ ఇష్టాలతో పనిలేదన్న పురుషాధిక్య భావజాలం ఉట్టి పడే సీన్లతో ఈ కథ ముగుస్తుంది. చివరికి ఆమె ఫ్రెండ్ కూడా ఆమెకి  భావ స్వాతంత్ర్యమివ్వని మోరల్ పోలిసింగ్ తోనే  మాట్లాడుతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నువ్వెందుకు ఇరుక్కుంటావ్, ఇంటికెళ్ళి పొమ్మంటుంది. 
        
ఇది అమాయక అమ్మాయిల్ని మోటివేట్ చేసే సినిమాయే అయితే, అమ్మాయిల స్మగ్లర్ల గురించి తనే పోలీసులకి సమాచారమిచ్చి సాటి అమ్మాయిల్ని కాపాడాలి ఒక కథానాయిక పాత్రగా. ఇది చెయ్యక, ప్రేమించిన వాడితో మోసపోయి, ఇంకేం చేయాలన్పించక ఇంటి ముఖం పట్టి, అదే డబ్బున్న వాడు కన్పించి నవ్వితే, పెళ్ళికి తలూపడం తిరోగమనమే తప్ప అభ్యుదయంలా వుండదు. దీన్ని ఉన్నదున్నట్టు తెలుగులోకి దింపేశారు!! బుట్టబొమ్మని ఆటబొమ్మ చేశారు.
        
అయితే మలయాళంలో ఫాలోయింగ్ వున్న సాఫ్ట్ గా కన్పించే రోషన్ మాథ్యీవ్ నెగెటివ్ పాత్రగా రివీల్ అవడం, రఫ్ గా కన్పించే శ్రీనాథ్ భాసి పాజిటివ్ పాత్రగా రివీల్ అవడమనే డైనమిక్స్ సినిమాని నిలబెట్టుకోవడానికి  బాగా వర్కౌట్ అయ్యాయి. తెలుగులో ఈ కాస్టింగ్ వ్యూహమైనా ఆలోచించలేదు. కళ్ళు మూసుకుని రీమేక్ చేసేశారు.      

రీమేక్ ఒరిజినల్లో వున్న ఫీల్ తో ఎప్పుడూ వుండదు. రీమేక్ ని ఒరిజినల్ తో పోల్చి రేటింగ్ తగ్గించకూడదు. అయితే ఒరిజినల్లో వున్న ఒప్పించని కంటెంట్ తో రీమేక్ వుండకూడదు. ఒరిజినల్ ని ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు చాలామంది చూసేశారు. చూడని వాళ్ళకి బాహ్య అందాలతో షుగర్ కోటింగ్ వల్ల నచ్చ వచ్చు.

నటనలు - సాంకేతికాలు

హీరోయిన్ అనిఖా పాత్ర ప్రకారం నటించుకు పోయింది. మలయాళంలో హీరోయిన్ అన్నాబెన్ కీ, అనిఖా సురేంద్రన్ కీ నటనా పరమైన తేడా ఏమిటంటే చిత్రీకరణ. మలయాళం కెమెరా వర్క్ వెలుగు నీడల డెప్త్ తో, కూల్ కలర్స్ తో, తక్కువ లైటింగ్ తో కేరళ నేటివిటీలోకి పాత్రల్ని తీసికెళ్తుంది. దీంతో అన్నా బెన్ హావభావాలు డెప్త్ తో కూడిన మూడ్ ని క్రియేట్ చేస్తాయి. తెలుగులో ప్లాట్ లైటింగ్ తో, రంగులమయం చేసిన దృశ్యాలతో అనిఖా నటనని ఫీలయ్యేందుకు పెద్దగా వుండదు.
        
ఆర్కే గా నటించిన అర్జున్ దాస్ వాయిస్ వల్ల ప్రభావం చూపిస్తాడు. ఆటోడ్రైవర్ గా సూర్య వశిష్ట ఫర్వాలేదన్పిస్తాడు. మిగిలిన అన్ని పాత్రలకీ అందరూ తెలియని కొత్తవాళ్ళే కావడంతో ఇది తెలుగు సినిమాయేనా అనుకునేలా తయారైంది. మలయాళంనే డబ్బింగ్ చేస్తే సరిపోయేదేమో. రెగ్యులర్ తెలుగు సినిమాల్లోని పాత్రలే అరకులో తిరుగుతున్నట్టు వుంటాయే తప్ప, అరకు జీవితం కనపడదు. ఈ సినిమా హైదరాబాద్ పక్కన తీసినా సరిపోతుంది. రెండు పాటలు అదనంగా పెట్టినా బలహీన సంగీతంతో బడ్జెట్ వృధాగా మారాయి.
        
గణేష్ రావూరి స్క్రీన్ ప్లే, మాటలు. స్క్రీన్ ప్లే దాదాపూ మలయాళం స్క్రీన్ ప్లేనే.  ఎలావున్న స్క్రీన్ ప్లే అలా తీస్తూ ఎందుకో మొదటి సీను మీద చేయి చేసుకున్నారు. మలయాళంలో మొదటి సీనులో హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ని వర్షంలో బస్సెక్కించి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎక్కడికి వెళ్తోందో మనకి తెలీదు. రెండో సీన్లో హీరోయిన్, ఆమె ఫ్రెండ్ గ్రామంలో జీపు దిగి నడుచుకుంటూ పోతారు. బస్సెక్కి వెళ్ళడం, జీపు దిగి గ్రామంలోకి రావడమనే ఈ పరస్పర విరుద్ధ డైనమిక్స్ ఆలోచనలు రేకెత్తిస్తాయి. బస్సెక్కి ఎక్కడికి  వెళ్ళింది? తిరిగి గ్రామంలోకి వచ్చింది. ఇంటికి వెళ్ళింది... ఇలా కథని ఫాలో అవుతూంటే, పెళ్ళి సంబంధం తప్పించుకుని ఆటో డ్రైవర్ ని కలుసుకునేందుకు టౌన్ కి వెళ్ళిపోయే సీను వస్తుంది. ఇక్కడ వర్షంలో బస్సెక్కుతుంది. దీంతో లూప్ లో ఈ శీను వెళ్ళి మొదటి సీనుకి కనెక్ట్ అవుతుంది. ఈ సింపుల్ క్రియేటివిటీ ఆర్గానిక్ గా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అర్ధవంతంగా కూడా వుంది.
        
దీన్ని అర్ధం జేసుకోకుండా తెలుగులో ప్రతాపం చూపించారు. ఫస్ట్ సీనులో హీరోయిన్ వైజాగ్ లో బస్సు దిగుతుంది. అక్కడ బస్టాపు ఎపిసోడ్ చూపించేశారు. ఆ ఎపిసోడ్ లో రౌడీ క్యారక్టర్ తో ఆమెని కంగారు పెట్టించే సీను సాగి సాగి, ఆమె తప్పించుకుని - టాయిలెట్ లోకెళ్ళి పోయి ఫోను తీసినప్పుడు, ఆమె క్లోజప్ మీద కట్ అవుతుంది. ఇక రొటీన్ గా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది ఉస్సూరన్పిస్తూ. ప్రారంభంలోనే బోరు కొట్టించేశారు. ఇప్పుడు మలయాళంలోని  గ్రామంలో జీపు దిగే సీనుతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది.
        
మలయాళంలో ఫ్లాష్ బ్యాక్ అన్నట్టే వుండదు. బస్సెక్కి ఎక్కడికో వెళ్ళింది, జీపు దిగి తిరిగి వూళ్ళోకి వచ్చిందనే కంటిన్యూటీతో వుంటుంది. తెలుగులో ఏకంగా వైజాగ్ ఎపిసోడ్ ఓపెన్ చేసేసి హీరోయిన్ తో ఏదో సస్పెన్స్ క్రియేటయ్యే ప్రారంభం వుండాలనుకున్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుందని తెలిసిపోయే, అరిగిపోయిన టెంప్లెట్ ప్రారంభం. తర్వాత కథ మధ్యలో ఇంట్లోంచి వెళ్ళిపోతూ బస్సెకితే ఎక్కడికి వెళ్తోందో మనకి తెలిసిపోతుంది -ప్రారంభ సీను చూసేశాం గనుక-  వైజాగ్ ఎపిసోడ్ సీను. ఇంకెక్కడి సస్పెన్స్. మలయాళంలో సస్పెన్స్ ఆర్గానిక్ గా వుంటే, తెలుగులో కావాలని సృష్టించినట్టు కృత్రిమత్వంతో వుండి స్క్రీన్ ప్లేని చెడగొట్టింది.
——సికిందర్   

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

1301 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : దర్శకుడు : రంజిత్ జయకొడి

తారాగణం : సందీప్ కిషన్విజయ్ సేతుపతిదివ్యాంశవరుణ్ సందేశ్గౌతం మీనన్అయ్యప్ప శర్మఅనసూయవరలక్ష్మీ శరత్‌ కుమార్ 
సంగీతం
 : సామ్ సిఎస్ఛాయాగ్రహణం : కిరణ్ కౌషిక్ 
నిర్మాతలు:
 భరత్ చౌదరిరామ మోహన రావు

విడుదల : ఫిబ్రవరి 3, 2023
***

        హిట్లు అనేవి లేకుండా నటిస్తూ వున్న సందీప్ కిషన్ తమిళంలో కూడా హీరోగా 5 సినిమాలు నటించాడు. మరో రెండు నటిస్తున్నాడు. ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ లో కూడా ముఖ్యపాత్ర నటించాడు. తాజాగా తెలుగు- తమిళం ద్విభాషా చలన చిత్రంలో నటించాడు. ఇది హిందీ, మలయాళం, కన్నడలో పానిండియాగా విడుదలైంది. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటించడం ఆసక్తి రేకెత్తించింది. కొత్త తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దీన్ని పీరియెడ్ మూవీగా రూపొందించాడు. ఇదైనా సందీప్ కిషన్ కి కలిసి వచ్చిందా లేక, మళ్ళీ మొదటికొచ్చిందా తెలుసుకుందాం...

కథ

1990 లలో చిన్నప్పుడు మైఖేల్ (సందీప్ కిషన్) కత్తి పట్టుకుని తండ్రిని చంపేందుకు ముంబాయి వచ్చి గ్యాంగ్ స్టర్ గురునాథ్ (గౌతమ్ మీనన్) దృష్టిలో పడతాడు. మైఖేల్ ని చేరదీసి అనుచరుడు స్వామి (అయ్యప్ప శర్మ) పర్యవేక్షణలో వుంచుతాడు. యువకుడుగా ఎదిగిన మైఖేల్ శత్రువుల దాడి నుంచి గురునాథ్ ని కాపాడడంతో గురునాథ్ కి మరింత దగ్గరవుతాడు. ఇది చూసి గురునాథ్ కొడుకు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్) అసూయ పెంచుకుంటాడు. తన మీద దాడి జరిపించిన రతన్ (అనీష్ కురువిల్లా) నీ, అతడి కూతురు తీర (దివ్యాంశ) నీ చంపమని మైఖేల్ ని ఢిల్లీకి పంపుతాడు గురునాథ్. ఢిల్లీ వెళ్ళిన మైఖేల్ తీర ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అమర్ నాథ్ రతన్ ని చంపేసి, మైకేల్ మీద కాల్పులు జరిపి లోయలోకి తోసేస్తాడు.

        అసలు మైఖేల్ తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? అతను జైల్లో ఎందుకు పుట్టాడు? గురునాథ్ - చారులత (అనసూయా భరద్వాజ్) లతో మైఖేల్ కున్న సంబంధమేమిటి? కన్నమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎవరు? ఇంకో గ్యాంగ్ స్టర్ (విజయ్ సేతుపతి) ఎవరు? ఇంతకీ మైఖేల్ తండ్రిని చంపాడా లేదా? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

1990 ల కాలంలో సెట్ చేసిన పీరియెడ్ కథ. ఫార్ములా రివెంజీ డ్రామా. ఈ కథలో మైఖేల్ కి అన్యాయం జరిగిన చిన్నప్పటి కథ తప్ప మిగిలినదంతా ఫ్లాట్ గా సాగిపోయే రక్తపాతాల యాక్షన్ కథ. చివరి 15 నిమిషాలు పేలుళ్ళ మోతే.  కేజీఎఫ్ ప్రభావం కూడా చాలా వుంది. గ్యాంగ్ స్టర్- మాఫియా సినిమాలు కమలహాసన్  నాయకుడు నుంచీ జేడీ చక్రవర్తి సత్య వరకూ అనేకం వచ్చాయి. ఆ కాలంలో జరిగిన కథల్ని అదే ఫార్ములాతో, టెంప్లెట్స్ తో అలాగే తీయడం వల్ల ఈ తరం ప్రేక్షకులకి గిట్టుబాటు అయ్యేదేమీ వుండదు. బోరు కొట్టి కూర్చుంటాయి. కాకపోతే నాయకుడు నుంచి సత్య నుంచీ పాత్రల్ని తీసుకుని, నేటి కాలానికి హీరోతో కొత్త కథ సృష్టిస్తే అదొక చెప్పుకోదగ్గ ప్రయత్నం.

        ఇందులో వినోదించడానికి, ఆనందించడానికి అలాటి కథ, పాత్రలు లేవు. యమ సీరియస్ కథకి యమ సీరియస్ పాత్రలు. పాత్రలన్నీ ఒకేలా వుంటాయి - సీరియస్ మొహాలు పెట్టుకుని దేశం కోసం సీరియస్ గా పోరాటం చేస్తున్నట్టు.  ఫస్టాఫ్ కథని సెటప్ చేస్తున్నాడు గనుక ఓపికతో చూస్తాం. ఇంటర్వెల్లో మైఖేల్ని షూట్ చేసి లోయలో పడేశాక- ఈ సెటప్ చేసిన కథతో సెకండాఫ్ గజిబిగా తయారై, రివెంజి కథ మన మీద పగ దీర్చుకుంటున్నట్టు వుంటుంది. మైఖేల్ పాత్ర సందీప్ కిషన్ తండ్రి పాత్ర మీద పగ దీర్చుకోవడానికి వచ్చాడా, లేక తనకి హిట్స్ ఇవ్వడం లేదని ప్రేక్షకుల మీదా? రెండోదే నిజం చేశాడు. 

        ప్రియురాలి ప్రేమ, తల్లితో మదర్ సెంటిమెంటు అనే బంధాల మధ్య మైఖేల్ ని భావోద్వేగభరితంగా బంధించాలన్న ప్రయత్నానికి ప్రియురాలితో ప్రేమలో పసలేదు, మదర్ తో ఫీల్ లేదు, ఫ్యామిలీ డ్రామా అసలే లేదు- కేవలం తండ్రిని చంపాలన్న కసి తప్ప. పైగా సెకండాఫ్ లో అనవసర పాత్రల హడావిడి ఒకటి. ఆలస్యంగా వచ్చే విజయ్ సేతుపతి పాత్ర కూడా కథా బలానికి తోడ్పడలేదు. సెకండాఫ్ శిరోభారం తప్ప ఏమీ లేదు. ఇలాటి కథ చేసుకుని, దీన్ని స్టయిల్ తో, టెక్నిక్ తో, అద్భుతంగా చిత్రీకరించిన శ్రమంతా వృధా అయింది.

నటనలు- సాంకేతికాలు

నటవర్గం మాత్రం మల్టీ స్టారర్ కి తక్కువ కాకుండా వున్నారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దర్శకుడు గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయా భరద్వాజ్ ...పానిండియా ఆర్భాటం. ఒక్కరూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు. గురునాథ్ గా గ్యాంగ్ స్టర్ పాత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ కెందుకో అర్ధం గాదు. ఈ పాత్ర విజయ్ సేతుపతి వేసి వుంటే యూత్ కి ఈ యమ సీరియస్ సినిమాతో హుషారొ చ్చేదేమో.

        తెర మరుగైన హీరో వరుణ్ సందేశ్ విలనీ అయినా సరదాగా చేయకుండా సైకోలా బిహేవ్ చేస్తాడు. అనసూయ కూడా సీరియస్సే. అందరూ సీరియస్సే హార్రర్ సినిమాలాగా. సందీప్ కిషన్ గెటప్ మార్చుకున్నాడు గానీ, సీరియస్ లుక్ తో నటించడానికి తగినన్ని భావోద్వేగాల్లేవు కథలో. బాగా చేసింది ఫైట్లు ఒక్కటే. ప్రేక్షకులతో తను కనెక్ట్ అవ్వాలంటే చిన్నప్పటి  ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే బలంగా వుంటే చాలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తను లేడు, చైల్డ్ ఆర్టిస్టు వున్నాడు. ప్రస్తుత కథలో తనున్నప్పుడు, ఫ్లాష్ బ్యాక్ లోని భావోద్వేగాలు ప్రస్తుత కథలోకి వచ్చేలా అంతకంటే బలమైన కథనముండాలి.  

        కథా కథనాలు, పాత్రలు ఇలా వుంటే,, వీటిని తెరకెక్కించిన విధానం మాత్రం మహోజ్వల చిత్రరాజం అన్పించేలా వుంటుంది. కెమెరాకి  తీసుకున్న షాట్స్, లైటింగ్, కలర్ స్కీమ్ అన్నీ పీరియడ్ మూవీ జానర్ విలువలతో వున్నాయి. వీటితో బ్యాక్ గ్రౌండ్ స్కోరు పోటీ పడింది. సందీప్ కిషన్ కి టెక్నికల్ గా గర్వించే మూవీ దక్కింది, విషయపరంగా మాత్రం హిట్ కి సుదూరంగా వుండిపోయింది.
—సికిందర్

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

1300 : రివ్యూ!


 

రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్
తారాగణం : సుహాస్, టీనా శిల్ప రాజ్, శ్రీ గౌరీ ప్రియ,శీష్ విద్యార్థి, రోహిణి,  గోపరాజు రమణ తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ శామూరి, సంగీతం (పాటలు) : శేఖర్ చంద్ర, నేపథ్య సంగీతం : కళ్యాణ్ నాయక్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
విడుదల : ఫిబ్రవరి 3, 2023

లర్ ఫోటో’, హిట్ 2 వంటి సినిమాల్లో నటించిన వర్ధమాన హీరో సుహాస్ రైటర్ పద్మభూషన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దీన్ని తెరకెక్కించాడు. విడుదలకి ముందు పెయిడ్ ప్రీమియర్లతో నిర్మాతలు హడావిడి చేశారు. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ సినిమాతో ఈ హడావిడి బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఇంత హైప్ తీసుకు రావడానికి ప్రయత్నించిన సినిమాలో అసలేముందో తెలుసుకుందాం... 

కథ
        విజయవాడలో పద్మభూషన్ (సుహాస్) అసిస్టెంట్ లైబ్రేరియన్. తల్లిదండ్రులు (ఆశీష్ విద్యార్థి- రోహిణి) అతడితో ప్రేమగా వుంటారు. భూషణ్ నవలా రచయిత కావాలన్న కోరికతో ఓ నవల రాసి అచ్చేస్తాడు. ఆ నవల ఎవరూ కొనరు. దాన్ని జనాలచేత చదివించడానికి విఫల యత్నాలు చేస్తాడు. ఇంతలో కొన్ని స్ఫర్ధలతో విడిపోయిన ధనికుడైన మేనమామ (గోపరాజు రమణ) వచ్చి భూషణ్ కి కూతుర్ని ఇస్తానంటాడు. ఎంగేజిమెంటు అనుకుంటారు. మేనమామ కూతురు సారిక (టీనా శిల్పారాజ్) భూషణ్ రాసిన తాజా నవల చదివానని చూపిస్తుంది. భూషణ్ కంగారు పడతాడు. ఆ నవల తను రాయలేదు. కానీ ఆ నవలతో తను పాపులర్ అయిపోతాడు. దీంతో మేనమామ అతడ్ని ఆకాశానికెత్తేస్తాడు. భూషణ్ కి భయం పట్టుకుంటుంది. ఆ నవల తను రాయలేదని తెలిస్తే మేనమామ ఎంగేజిమెంటు క్యాన్సిల్ చేస్తాడని భయపతాడు.
        
ఇంతకీ ఆ నవల భూషణ్ పేరు మీద ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఇది తెలుసుకున్న భూషణ్ ని కలవర పెట్టిన విషయమేమిటి? దాన్ని ఎలా హేండిల్ చేసి ఎంగేజిమెంటుని కాపాడుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఓల్డ్ స్కూలు డ్రామాతో కూడిన కథ. నవలా రచయిత, నవలలు చదివే పాఠకులు, పాపులారిటీ అన్నవి 80 లనాటి మాట. నాన్ ఫిక్షన్ పుస్తకాలు అమ్ముడవుతున్న ఈ రోజుల్లో ఫిక్షన్ రచయిత అవడం కంటే, స్క్రిప్టు రాసుకుని విజువల్ మీడియా అయిన సినిమా ఫీల్డుకే వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తారు. ఇవ్వాళ విజయవాడలో పబ్లిషర్ల చుట్టూ కంటే టాలీవుడ్ లో తిరిగే రచయితలున్నారు. హిందీలో కూడా నవలలు రావడం లేదు, దళిత సాహిత్యం తప్ప. నవలా సాహిత్యమంతా ఇంగ్లీషు భాష హైజాక్ చేసింది. దీనికే పాఠకులున్నారు.

        
ఈ కథ ఈ రోజుల్లో తెలుగులో నవల రాయాలనుకున్న వాడిది గనుక, ఈ నవలా రచయితతో 1980ల కాలం నుంచి బయటికి రాని కథగా, పాత్రలుగా ఇది వుంటుంది. ఆ నాటి సినిమా చూస్తున్నట్టు సన్నివేశాలూ, డ్రామా వగైరా వుంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోకుండా వాళ్ళ కలల్ని అణిచేయడం తగదన్న చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడా ఆ కాలానికే చెందుతుంది.
        
కథా వస్తువలా వుంచితే, రచయిత- అతడి రచన చుట్టే సాగే చివరి వరకూ కథనమంతా అన్నివర్గాల ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్నది చూడాలి. పరిమిత మార్కెట్ యాస్పెక్ట్ గల కథ ఇది. కథా నాయకుడు ఎంటర్ టైన్మెంట్ గా తొలి అడుగు అనే నవల రాయకుండా, ఇన్ఫో టైన్మెంట్ గా దేశం ఎటు పోతోంది అని నాన్ ఫిక్షన్ రాసి వుంటే, దేశం గురించిన చర్చతో ప్రేక్షకుల ఆసక్తి పెరిగే అవకాశముండేది. నవల్లో పాత్రల గురించి చర్చిస్తే ఎవరికాసక్తి వుంటుంది.
        
ఫస్టాఫ్ కథనం అచ్చేసిన నవలని అమ్ముకునే ప్రయత్నాలతో, అందులోని బాధతో సాగుతూ, మరదలితో సంబంధం అనుకున్నాక, తన పేరుతో ఇంకెవరో నవల రాసిన మలుపుతో అసలు కథకి ఆసక్తికర పునాది ఏర్పడుతుంది. అయితే ఈ డూప్ రచయితని కనుక్కునే ఈ ఆసక్తికర పాయింటుతో, గోల్ తో కథ నడపకుండా, మరదలితో ప్రేమాయణం, ఆ ప్రేమాయణంలో అసలు రచయిత తను కాదన్న గిల్టీ ఫీలింగూ వగైరాలతో కథనం పక్కదోవ పట్టి, ఇంటర్వెల్లో ఆ డూప్ రచయితని పట్టుకున్నాక- సెకండాఫ్ లో డూప్ రచయితతో, తన ఎంగేజి మెంటులోగా ఇంకో నవల రాయించే కథనమే మళ్ళీ బోరు కొట్టించే ప్రమాదంగా మారింది.
        
ఎంగేజిమెంటుకి కొత్త నవల ఆవిష్కరణ కూడా జరగాలన్న మేనమామ ఆశయాన్ని తీర్చకపోతే పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అవుతుందన్న కాన్లిక్ట్ పాయింటే అతిగా, సినిమాకి సరిపోనంత బలహీనంగా వుంటే, దీనికి డూప్ రచయితతో ఇంకో నవల రాయించే యాక్షన్ పార్టు వున్న కాన్ఫ్లిక్ట్ ని కూడా చల్లార్చేసింది. ఈ మొత్తం కథలో ప్రత్యర్థి పాత్ర లేకపోవడం పాసివ్ కథనానికి దారి తీసింది. డూప్ రచయిత రాయనని ఎదురు తిరిగే ప్రత్యర్ధి పాత్రగా మారి  వుంటే, ఎంగేజిమెంటు గురించిన సఘర్షణతో కథ బలపడేది.
        
దర్శకుడు అసలు చెప్పాలనుకున్న విషయం ముగింపులో వుంది. దీన్ని నమ్ముకునే మొత్తం కథనం చేశాడు. ఆ కథనం ఎలా వున్నా ముగింపులో చెప్పాలనుకున్న విషయమే కాపాడుతుందని అనుకున్నట్టు వుంది. దానికైనా అకస్మాత్తుగా ముక్క తెచ్చి అతికించినట్టు గాకుండా లీడ్ వుండాలి. సెకండాఫ్ లో దీనికి పునాది వేసే లీడ్ తో కథనం చేస్తూ, డూప్ రచయితతో సంఘర్షణ సృష్టించకపోవడంతో, మళ్ళీ రచనా వ్యాసంగపు కథనమే చేయడంతో, సెకండాఫ్ మరీ కాలానికి దూరంగా, 80 ల నాటి డ్రామాగా వుండిపోయింది.

నటనలు –సాంకేతికాలు

 నవలా రచయితగా తిప్పలు పడే వాస్తవ దూర పాత్రలో సుహాస్ తన సహజ ధోరణిలో నటించేశాడు. ఇది కామెడీ పాత్ర కాబట్టి అలాటి ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. తనలో లేని రచయితతో రచయితగా పాట్లుపడే పాత్రచిత్రణతో కామెడీ పుట్టించే ప్రయత్నం బాగానే చేశాడు. అయితే పాత్రగా నిలబడ్డానికి అసలు తానేం కోరుకుంటున్నాడో స్పష్టత లేదు. డూప్ రచయితని పట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలని కాసేపు, డూప్ రచయిత వల్ల వస్తున్న పాపులారిటీని ఎంజాయ్ చేయాలని కాసేపు, తను రాయకుండా డూప్ రచయితతో రాయించి మేన మామని మభ్య పెట్టి ఎంగేజి మెంటు చేసుకోవాలని  కాసేపు- ఇలా స్పష్టమైన గోల్ లేకపోవడంతో, తన పాత్ర మీదే ఆధార పడ్డ వినోదాత్మక విలువలు అంతంత మాత్రంగా వుండిపోయాయి. చివరి వరకూ అతను పాసివ్ పాత్రే. ఈ రోజుల్లో నవలా రచయితకి పాపులారిటీ రావడం, నగరమంతా పండగ చేసుకోవడం, మీడియా వాళ్ళు ఎగబడడం ఎక్కడ జరుగుతుంది. 80 లలో జరిగిందేమో. హీరోకి ఇలాటి ఫాల్స్ బిల్డప్ వర్కౌట్ కాలేదు.

హీరోయిన్ టీనా శిల్పారాజ్ ఫస్టాఫ్ లో లీడ్ తీసుకుని సెకండాఫ్ లో సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ రాకతో పని లేకుండా వుండి పోయింది- అప్పుడప్పుడు హీరోతో విభేదించడం తప్ప. అయితే నటించడం బాగానే నటించింది. కానీ ఏ టాలెంటూ, డబ్బూ లేదని తెలిసీ డబ్బున్న తను ఎందుకు హీరోని చేసుకోవాలనుకుంటోందో తెలీదు. రచయిత పాపులరవడం, ఆ రచయితకి కూతుర్నివ్వాలని తండ్రి నిర్ణయించడం ఎక్కడ జరుగుతుందో తెలీదు. తండ్రి తీసుకున్న ఇలాటి నిర్ణయాన్నే కూతురు శిరసావహిస్తే, అది ఈ సినిమా ముగింపులో ఇచ్చిన మెసేజికే విరుద్ధం.  
         
సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ చివర్లో మలుపు తిప్పే పాత్రగా  వుంటుంది. అంతవరకూ ఆమెతో కథనం సెకండాఫ్ కి భారం. హీరో తల్లిదండ్రులుగా ఆశీష్ విద్యార్థి, రోహిణీలు, హీరోయిన్ తండ్రిగా గోపరాజు రమణ ఫ్యామిలీ డ్రామాకి, సెంటి మెంట్లకి, మెలోడ్రామాకీ, మెసేజికీ పనికొచ్చిన పాత్రలు. ముగింపులో బరువైన ఎమోషనల్ సన్నివేశం వీళ్ళదే.
        
పూర్తిగా విజయవాడ లొకేషన్స్ లో చిత్రీకరణ బావుంది.  లెనిన్ రోడ్లో పుస్తకాల షాపులు చూపించారు. అలంకార్ సెంటర్లో, ఏలూరు రోడ్డులో ఇప్పుడు లేవు కాబట్టి చూపించ లేదు. అయితే విశాలాంధ్రలో హీరో పుస్తకాలు అమ్మకానికి పెట్టినట్టు చూపి వుంటే విజువల్ అప్పీల్ వుండేది. వెంకట్  శాఖమూరి ఛాయాగ్రహణం బావుంది. శేఖర్ చంద్ర సంగీతంలో పాటలు సన్నివేశపరంగా బావున్నాయి. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం కూడా బావుంది. ప్రొడక్షన్ విలువలు పరిమిత బడ్జెట్ ప్రకారం వున్నాయి. మొత్తం మీద కొత్త దర్శకుడు తెలుగు సినిమాకి తెలుగుదనం తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మెచ్చదగిందే గానీ, కమర్షియల్ సినిమాలో తెలుగు సాహిత్యం వాడకమే మరీ నేలవిడిచి సాము చేసింది.
—సికిందర్