రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

1300 : రివ్యూ!


 

రచన, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్
తారాగణం : సుహాస్, టీనా శిల్ప రాజ్, శ్రీ గౌరీ ప్రియ,శీష్ విద్యార్థి, రోహిణి,  గోపరాజు రమణ తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ శామూరి, సంగీతం (పాటలు) : శేఖర్ చంద్ర, నేపథ్య సంగీతం : కళ్యాణ్ నాయక్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
విడుదల : ఫిబ్రవరి 3, 2023

లర్ ఫోటో’, హిట్ 2 వంటి సినిమాల్లో నటించిన వర్ధమాన హీరో సుహాస్ రైటర్ పద్మభూషన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దీన్ని తెరకెక్కించాడు. విడుదలకి ముందు పెయిడ్ ప్రీమియర్లతో నిర్మాతలు హడావిడి చేశారు. ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ సినిమాతో ఈ హడావిడి బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఇంత హైప్ తీసుకు రావడానికి ప్రయత్నించిన సినిమాలో అసలేముందో తెలుసుకుందాం... 

కథ
        విజయవాడలో పద్మభూషన్ (సుహాస్) అసిస్టెంట్ లైబ్రేరియన్. తల్లిదండ్రులు (ఆశీష్ విద్యార్థి- రోహిణి) అతడితో ప్రేమగా వుంటారు. భూషణ్ నవలా రచయిత కావాలన్న కోరికతో ఓ నవల రాసి అచ్చేస్తాడు. ఆ నవల ఎవరూ కొనరు. దాన్ని జనాలచేత చదివించడానికి విఫల యత్నాలు చేస్తాడు. ఇంతలో కొన్ని స్ఫర్ధలతో విడిపోయిన ధనికుడైన మేనమామ (గోపరాజు రమణ) వచ్చి భూషణ్ కి కూతుర్ని ఇస్తానంటాడు. ఎంగేజిమెంటు అనుకుంటారు. మేనమామ కూతురు సారిక (టీనా శిల్పారాజ్) భూషణ్ రాసిన తాజా నవల చదివానని చూపిస్తుంది. భూషణ్ కంగారు పడతాడు. ఆ నవల తను రాయలేదు. కానీ ఆ నవలతో తను పాపులర్ అయిపోతాడు. దీంతో మేనమామ అతడ్ని ఆకాశానికెత్తేస్తాడు. భూషణ్ కి భయం పట్టుకుంటుంది. ఆ నవల తను రాయలేదని తెలిస్తే మేనమామ ఎంగేజిమెంటు క్యాన్సిల్ చేస్తాడని భయపతాడు.
        
ఇంతకీ ఆ నవల భూషణ్ పేరు మీద ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఇది తెలుసుకున్న భూషణ్ ని కలవర పెట్టిన విషయమేమిటి? దాన్ని ఎలా హేండిల్ చేసి ఎంగేజిమెంటుని కాపాడుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఓల్డ్ స్కూలు డ్రామాతో కూడిన కథ. నవలా రచయిత, నవలలు చదివే పాఠకులు, పాపులారిటీ అన్నవి 80 లనాటి మాట. నాన్ ఫిక్షన్ పుస్తకాలు అమ్ముడవుతున్న ఈ రోజుల్లో ఫిక్షన్ రచయిత అవడం కంటే, స్క్రిప్టు రాసుకుని విజువల్ మీడియా అయిన సినిమా ఫీల్డుకే వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తారు. ఇవ్వాళ విజయవాడలో పబ్లిషర్ల చుట్టూ కంటే టాలీవుడ్ లో తిరిగే రచయితలున్నారు. హిందీలో కూడా నవలలు రావడం లేదు, దళిత సాహిత్యం తప్ప. నవలా సాహిత్యమంతా ఇంగ్లీషు భాష హైజాక్ చేసింది. దీనికే పాఠకులున్నారు.

        
ఈ కథ ఈ రోజుల్లో తెలుగులో నవల రాయాలనుకున్న వాడిది గనుక, ఈ నవలా రచయితతో 1980ల కాలం నుంచి బయటికి రాని కథగా, పాత్రలుగా ఇది వుంటుంది. ఆ నాటి సినిమా చూస్తున్నట్టు సన్నివేశాలూ, డ్రామా వగైరా వుంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోకుండా వాళ్ళ కలల్ని అణిచేయడం తగదన్న చివర్లో ఇచ్చిన మెసేజ్ కూడా ఆ కాలానికే చెందుతుంది.
        
కథా వస్తువలా వుంచితే, రచయిత- అతడి రచన చుట్టే సాగే చివరి వరకూ కథనమంతా అన్నివర్గాల ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్నది చూడాలి. పరిమిత మార్కెట్ యాస్పెక్ట్ గల కథ ఇది. కథా నాయకుడు ఎంటర్ టైన్మెంట్ గా తొలి అడుగు అనే నవల రాయకుండా, ఇన్ఫో టైన్మెంట్ గా దేశం ఎటు పోతోంది అని నాన్ ఫిక్షన్ రాసి వుంటే, దేశం గురించిన చర్చతో ప్రేక్షకుల ఆసక్తి పెరిగే అవకాశముండేది. నవల్లో పాత్రల గురించి చర్చిస్తే ఎవరికాసక్తి వుంటుంది.
        
ఫస్టాఫ్ కథనం అచ్చేసిన నవలని అమ్ముకునే ప్రయత్నాలతో, అందులోని బాధతో సాగుతూ, మరదలితో సంబంధం అనుకున్నాక, తన పేరుతో ఇంకెవరో నవల రాసిన మలుపుతో అసలు కథకి ఆసక్తికర పునాది ఏర్పడుతుంది. అయితే ఈ డూప్ రచయితని కనుక్కునే ఈ ఆసక్తికర పాయింటుతో, గోల్ తో కథ నడపకుండా, మరదలితో ప్రేమాయణం, ఆ ప్రేమాయణంలో అసలు రచయిత తను కాదన్న గిల్టీ ఫీలింగూ వగైరాలతో కథనం పక్కదోవ పట్టి, ఇంటర్వెల్లో ఆ డూప్ రచయితని పట్టుకున్నాక- సెకండాఫ్ లో డూప్ రచయితతో, తన ఎంగేజి మెంటులోగా ఇంకో నవల రాయించే కథనమే మళ్ళీ బోరు కొట్టించే ప్రమాదంగా మారింది.
        
ఎంగేజిమెంటుకి కొత్త నవల ఆవిష్కరణ కూడా జరగాలన్న మేనమామ ఆశయాన్ని తీర్చకపోతే పెళ్ళి సంబంధం క్యాన్సిల్ అవుతుందన్న కాన్లిక్ట్ పాయింటే అతిగా, సినిమాకి సరిపోనంత బలహీనంగా వుంటే, దీనికి డూప్ రచయితతో ఇంకో నవల రాయించే యాక్షన్ పార్టు వున్న కాన్ఫ్లిక్ట్ ని కూడా చల్లార్చేసింది. ఈ మొత్తం కథలో ప్రత్యర్థి పాత్ర లేకపోవడం పాసివ్ కథనానికి దారి తీసింది. డూప్ రచయిత రాయనని ఎదురు తిరిగే ప్రత్యర్ధి పాత్రగా మారి  వుంటే, ఎంగేజిమెంటు గురించిన సఘర్షణతో కథ బలపడేది.
        
దర్శకుడు అసలు చెప్పాలనుకున్న విషయం ముగింపులో వుంది. దీన్ని నమ్ముకునే మొత్తం కథనం చేశాడు. ఆ కథనం ఎలా వున్నా ముగింపులో చెప్పాలనుకున్న విషయమే కాపాడుతుందని అనుకున్నట్టు వుంది. దానికైనా అకస్మాత్తుగా ముక్క తెచ్చి అతికించినట్టు గాకుండా లీడ్ వుండాలి. సెకండాఫ్ లో దీనికి పునాది వేసే లీడ్ తో కథనం చేస్తూ, డూప్ రచయితతో సంఘర్షణ సృష్టించకపోవడంతో, మళ్ళీ రచనా వ్యాసంగపు కథనమే చేయడంతో, సెకండాఫ్ మరీ కాలానికి దూరంగా, 80 ల నాటి డ్రామాగా వుండిపోయింది.

నటనలు –సాంకేతికాలు

 నవలా రచయితగా తిప్పలు పడే వాస్తవ దూర పాత్రలో సుహాస్ తన సహజ ధోరణిలో నటించేశాడు. ఇది కామెడీ పాత్ర కాబట్టి అలాటి ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. తనలో లేని రచయితతో రచయితగా పాట్లుపడే పాత్రచిత్రణతో కామెడీ పుట్టించే ప్రయత్నం బాగానే చేశాడు. అయితే పాత్రగా నిలబడ్డానికి అసలు తానేం కోరుకుంటున్నాడో స్పష్టత లేదు. డూప్ రచయితని పట్టుకుని ఎక్స్ పోజ్ చేయాలని కాసేపు, డూప్ రచయిత వల్ల వస్తున్న పాపులారిటీని ఎంజాయ్ చేయాలని కాసేపు, తను రాయకుండా డూప్ రచయితతో రాయించి మేన మామని మభ్య పెట్టి ఎంగేజి మెంటు చేసుకోవాలని  కాసేపు- ఇలా స్పష్టమైన గోల్ లేకపోవడంతో, తన పాత్ర మీదే ఆధార పడ్డ వినోదాత్మక విలువలు అంతంత మాత్రంగా వుండిపోయాయి. చివరి వరకూ అతను పాసివ్ పాత్రే. ఈ రోజుల్లో నవలా రచయితకి పాపులారిటీ రావడం, నగరమంతా పండగ చేసుకోవడం, మీడియా వాళ్ళు ఎగబడడం ఎక్కడ జరుగుతుంది. 80 లలో జరిగిందేమో. హీరోకి ఇలాటి ఫాల్స్ బిల్డప్ వర్కౌట్ కాలేదు.

హీరోయిన్ టీనా శిల్పారాజ్ ఫస్టాఫ్ లో లీడ్ తీసుకుని సెకండాఫ్ లో సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ రాకతో పని లేకుండా వుండి పోయింది- అప్పుడప్పుడు హీరోతో విభేదించడం తప్ప. అయితే నటించడం బాగానే నటించింది. కానీ ఏ టాలెంటూ, డబ్బూ లేదని తెలిసీ డబ్బున్న తను ఎందుకు హీరోని చేసుకోవాలనుకుంటోందో తెలీదు. రచయిత పాపులరవడం, ఆ రచయితకి కూతుర్నివ్వాలని తండ్రి నిర్ణయించడం ఎక్కడ జరుగుతుందో తెలీదు. తండ్రి తీసుకున్న ఇలాటి నిర్ణయాన్నే కూతురు శిరసావహిస్తే, అది ఈ సినిమా ముగింపులో ఇచ్చిన మెసేజికే విరుద్ధం.  
         
సెకెండ్ హీరోయిన్ శ్రీ గౌరీప్రియ చివర్లో మలుపు తిప్పే పాత్రగా  వుంటుంది. అంతవరకూ ఆమెతో కథనం సెకండాఫ్ కి భారం. హీరో తల్లిదండ్రులుగా ఆశీష్ విద్యార్థి, రోహిణీలు, హీరోయిన్ తండ్రిగా గోపరాజు రమణ ఫ్యామిలీ డ్రామాకి, సెంటి మెంట్లకి, మెలోడ్రామాకీ, మెసేజికీ పనికొచ్చిన పాత్రలు. ముగింపులో బరువైన ఎమోషనల్ సన్నివేశం వీళ్ళదే.
        
పూర్తిగా విజయవాడ లొకేషన్స్ లో చిత్రీకరణ బావుంది.  లెనిన్ రోడ్లో పుస్తకాల షాపులు చూపించారు. అలంకార్ సెంటర్లో, ఏలూరు రోడ్డులో ఇప్పుడు లేవు కాబట్టి చూపించ లేదు. అయితే విశాలాంధ్రలో హీరో పుస్తకాలు అమ్మకానికి పెట్టినట్టు చూపి వుంటే విజువల్ అప్పీల్ వుండేది. వెంకట్  శాఖమూరి ఛాయాగ్రహణం బావుంది. శేఖర్ చంద్ర సంగీతంలో పాటలు సన్నివేశపరంగా బావున్నాయి. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం కూడా బావుంది. ప్రొడక్షన్ విలువలు పరిమిత బడ్జెట్ ప్రకారం వున్నాయి. మొత్తం మీద కొత్త దర్శకుడు తెలుగు సినిమాకి తెలుగుదనం తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మెచ్చదగిందే గానీ, కమర్షియల్ సినిమాలో తెలుగు సాహిత్యం వాడకమే మరీ నేలవిడిచి సాము చేసింది.
—సికిందర్

2, ఫిబ్రవరి 2023, గురువారం

1299 : స్పెషల్ ఆర్టికల్

ఠాన్ వైరల్ విజయం నేపథ్యంలో ప్రధాన స్రవంతి భారతీయ సినిమాలు హాలీవుడ్‌కి చౌకబారు నకళ్ళుగా మారడం ప్రారంభించాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుంచి కామెంట్ వచ్చింది. ప్రధాన స్రవంతి భారతీయ సినిమాలు ఒరిజినాలిటీని కోల్పోయి  హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి చౌకబారు నకళ్ళుగా మారిపోయాయనీ, ఒకప్పుడు భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యాయనీ చెబుతూ ఆవారా’, ‘డిస్కో డాన్సర్ వంటి సినిమాల్ని ప్రస్తావించాడు. డిస్కోడాన్సర్ లోని  జిమ్మీ జిమ్మీ సాంగ్ రష్యాలో సంచలనం సృష్టించిందనీ పేర్కొన్నాడు.

ఫ్రికాకి వెళ్ళినా, అరబ్ దేశాలకెళ్ళినా భారతీయత (నేటివిటీ) కారణంగా భారతీయ ప్రధాన స్రవంతి సినిమాలు భారీ ప్రభావం చూపేవనీ, ఇప్పుడు మనం ఆ ఒరిజినాలిటీని కోల్పోయామనీ చెప్పాడు. అదే దక్షిణ సినిమాలు ఇప్పటికీ తమ మూలాల్ని మర్చిపోలేదనీ, అవి ఇప్పటికీ భారతీయ సినిమాల వలె కనిపిస్తాయనీ, కానీ చాలా హిందీ ప్రధాన స్రవంతి సినిమాలలా కన్పించవనీ, పైగా వీటిని స్వదేశంలో కూడా చిత్రీకరించడం లేదనీ, వాటిలో ఏదీ భారతీయతకి సంబంధించి వుండడం లేదనీ స్పష్టం చేశాడు.

జర్నలిస్టు అభిశార్ శర్మ కూడా ఇదే చెప్పాడు. పఠాన్ లో భారతీయత లోపించిందనీ, అదే ఒకప్పటి షోలే’, గదర్ వంటి యాక్షన్ సినిమాలకి భారతీయతే జీవం పోసిందనీ, అందుకనే వాటిని ప్రేక్షకులు పదేపదే చూసేవాళ్ళనీ, పఠాన్ ని రెండోసారి చూసే ప్రేక్షకులు వుండరనీ సమీక్షించాడు.

ఇద్దరి వ్యాఖ్యలు కరెక్టే. పఠాన్ పూర్తిగా పాశ్చాత్యీకరించిన భారతీయ ప్రధాన స్రవంతి సినిమా. మార్వెల్ సినిమాలు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, మిషన్ ఇంపాసిబుల్ వంటి హాలీవుడ్ సినిమాల్నే మళ్ళీ చూపించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. పూర్తిగా విదేశాల్లోనే జరిగే స్పై కథ. విదేశాల్లో జరిగే స్పై కథ కాబట్టి భారతీయతకి అవకాశం లేదనలేం. విదేశాల్లో యాక్షన్ కి పాల్పడుతున్న గూఢచారి హీరో (షారుఖ్), అంతర్జాతీయ విలన్ (జాన్ అబ్రహాం) కూడా భారతీయ పాత్రలే. హీరోయిన్ (దీపికా పడుకొనే) పాకిస్థానీ పాత్ర. కథా పరంగా హాలీవుడ్ సినిమాలకి అనుకరణ అంటూ విమర్శలకి గురైనా, ఆ కథలో వున్న భారతీయ పాత్రలతో భారతీయతని సమకూర్చవచ్చు. హీరోని పక్కా హిందీ మాస్ లక్షణాలున్న హీరోగా, విలన్నీ పక్కా హిందీ సినిమాల విలన్ గా చూపించి సినిమాలో భారతీయత ఫీల్ ని నింపెయ్యొచ్చు.
        
నిర్మాత ఆదిత్యా చోప్రా వై ఆర్ ఎఫ్ (యశ్ రాజ్ ఫిలిమ్స్) స్పై యూనివర్స్ సిరీస్ లో నాల్గోదిగా పఠాన్ తీశాడు. నాల్గూ పెద్ద హిట్టయ్యాయి. 2012 లో ఏక్ థా టైగర్’, 2017 లో టైగర్ జిందా హై’, 2019 లో వార్ తీశాక, 2023 లో పఠాన్ తీశాడు. ఏక్ థా టైగర్ సల్మాన్ ఖాన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ తీశాడు. టైగర్ జిందా హై సల్మాన్ ఖాన్ తో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తీశాడు. రెండూ విదేశాల్లో జరిగే కథలే అయినా సల్మాన్ క్యారక్టర్ తో భారతీయత పుష్కలంగా వుంది. అతను మాస్ స్టార్ కాబట్టి, భాయ్ కూడా కాబట్టి, అలాగే కన్పించి నేటివిటీని కాపాడాడు.
        
వార్ ని హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లతో వేరే స్కూలు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీశాడు. ఇది కూడా విదేశాల్లో జరిగే కథ. ఇందులో హాలీవుడ్ సినిమాలే తప్ప ఇండియన్ సినిమా కనిపించదు. ఇద్దరు హీరోల్లో భారతీయత కనిపించదు. వేరే స్కూలుకి చెందిన ఈ దర్శకుడే తీసిన పఠాన్ తోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మైత్రీ మూవీస్ తెలుగు నిర్మాత ఈ దర్శకుడితోనే ప్రభాస్ సినిమా తీయడానికి లైనులో పెడుతున్నారు.
        
2015 లో సల్మాన్ ఖాన్ తో దర్శకుడు కబీర్ ఖాన్ తీసిన భజరంగీ భాయిజాన్ ఇండో -పాక్ యాక్షన్ థ్రిల్లర్ లో భారతీయత గురించి తెలిసిందే. ఇది చైనాలో లిటిల్ లోలిటాస్ మంకీ గాడ్ అంకుల్ గా విడుదలై అక్కడా 8000 థియేటర్లలో అతి పెద్ద హిట్టయ్యింది. 2016 లో అమీర్ ఖాన్ తో దర్శకుడు నీతేష్ తివారీ తీసిన దంగల్ కూడా భారతీయతతో చైనాలో సైతం పెద్ద హిట్. స్పై క్యారక్టర్ జేమ్స్ బాండ్ బ్రిటిషీయుడు. హాలీవుడ్ తీసే జేమ్స్ బాండ్ సినిమాల్లో అతను అమెరికన్ కల్చర్ తో వుండడు.
         
ఆవారా (1951) వంటి రాజ్ కపూర్ సినిమాలు ఇండియన్ కల్చర్ తోనే రష్యాలో విపరీతంగా ఆకర్షించేవి. మేరా జూతా హై జపానీ, యే పటలూన్ ఇంగ్లీష్ స్థానీ, సర్ పే లాల్ టోపీ రుసీ, ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ (నా కాలి జోళ్ళు జపానీ, ఈ లాగు ఇంగ్లీష్ స్థానీ, తలకి ఎర్ర టోపీ రష్యన్, అయినా నా హృదయం హిందూస్థానీ) - అన్న రాజ్ కపూర్ పాట రష్యన్లకి పిచ్చెత్తించింది. ఇలాటి క్యారక్టర్లు కావాలి భారతీయతకి. భారతీయతకి ఏ భారత ప్రభుత్వమూ ప్రాతినిధ్యం వహించలేదు.   విదేశాల్లో ఇండియా అంటే హిందీ సినిమాలుగానే ఇప్పటికీ గుర్తింపు.
        
బి. సుభాష్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డాన్సర్ (1982) లో, జిమ్మీ జిమ్మీ జిమ్మీ...ఆజా అజా అనే హృదయం పగిలిన ప్రియురాలి పాట లాంటిది ఇప్పటికీ లేదు. ఇది డిస్కోమాస్టర్ బప్పీలహరీ అద్భుత సృష్టి. ఈ రికార్డులు చైనా, రష్యాల్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి- సినిమా సూపర్ హిట్టవడంతో బాటు.
        
గతంలో ఎప్పుడో పాశ్చాత్య సినిమాలని హిందీలో తీయలేదని కాదు. మేగ్నిఫిషెంట్ సెవెన్ (హాలీవుడ్) సెవెన్ సమురాయ్ (జపాన్) వంటి సినిమాల ఆధారంగానే షోలే (1975) తీశారు. అయినా ఇది విదేశీ సినిమాలా వుండదు. పక్కా ఇండియన్ మాస్ సినిమా. ఇది ఎంతగా ప్రేక్షకుల నరనరాన ఇంకిందో గబ్బర్ సింగ్ డైలాగులే చెప్తాయి. ఈ సినిమా మీద అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాలే జరిగాయి.
        
అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీడియోల్- అమీషా పటేల్ లు నటించిన  గదర్ (2001) ఇండో- పాక్ సీమాంతర ప్రేమ కథ. అడుగడుగునా భారతీయతతో పూర్తి స్థాయి యాక్షన్ మూవీ. షోలే నీ, గదర్ నీ పదే పదే ప్రేక్షకులు చూసేవాళ్ళు. ఇప్పుడు రెండో సారే చూడ్డం లేదు ప్రేక్షకులు. 1000 థియేటర్లలో 200 కోట్లు కలెక్షన్లు లాగేసే టార్గెట్ తోనే వుంటున్నారు. నిర్మాతలు. అదే 1000 థియేటర్లలో ప్రేక్షకులు రెండోసారి, మూడోసారి చూసేలా సినిమాలు తీస్తే 400 కోట్లు, 600 కోట్లు వస్తాయని ఆలోచించడమే లేదు. రిపీట్ ఆడియెన్స్ అన్న మాటే మర్చిపోయారు. రిపీట్ ఆడియెన్స్= భారతీయత.
—సికిందర్
        

 

31, జనవరి 2023, మంగళవారం

1298 : రివ్యూ!

రచన- దర్శకత్వం : శంతను బాగ్చీ
తారాగణం : సిద్ధార్థ్ మల్హోత్రా, రశ్మికా మందన్న, అవంతికా అకర్కర్, పర్మీత్ సేథీ, అవిజిత్ దత్, రజిత్ కపూర్, అశ్వథ్ భట్, జాకీర్ హుస్సేన్, మీర్ సర్వర్, కుముద్ మిశ్రా తదితరులు
సంగీతం : కేతన్ సోధా, ఛాయాగ్రహణం : బిజితేష్ డే
బ్యానర్ : ఆర్ ఎస్ విపి మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా ఎల్ ఎల్ పి
నిర్మాతలు : రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాలా, గరీమా మెహతా 
విడుదల : జనవరి 20, 2023 (నెట్ ఫ్లిక్స్)
***
            మిషన్ మజ్నూ కొత్త దర్శకుడు శంతను బాగ్చి నుంచి స్పై థ్రిల్లర్ గా వచ్చి విడుదలకి విఫలయత్నాలు చేసింది. గత సంవత్సరం రెండు సార్లు విడుదల తేదీలు వృధా అయ్యాక, ఇక లాభం లేదని ఓటీటీలో విడుదలైంది. జనవరి 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా రశ్మికా మందన్న వంటి పాపులర్ హీరో హీరోయిన్లే నటించారు. రోనీ స్క్రూవాలా అనే పెద్ద నిర్మాతే నిర్మించాడు. అయినా వెండి తెరని చవిచూడలేకపోయింది. ఇది పాకిస్తాన్లో ఒక భారతీయ గూఢచారి కథ. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది. పాటలు హిందీలోనే వున్నాయి. ముందుగా కథేమిటో చూద్దాం...  

కథ

జపాన్ మీద అమెరికా  అణుబాంబు వేసి రెండో ప్రపంచ యుద్దాన్ని పరిసమాప్తం చేశాక, ప్రపంచంలో అణ్వస్త్రాల పోటీ పెరిగింది. మనదేశం 1974 లో ఫోఖ్రాన్ లో అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించడంతో  ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. దీంతో పాకిస్థాన్ ప్రధాని జుల్ఫికరలీ భుట్టో (నిజ జీవిత పాత్ర నటించింది రజిత్ కపూర్) తీవ్ర నిర్ణయం తీసుకుంటాడు. ఐఎస్సై చీఫ్ మక్సూద్ ఆలం (నిజ జీవిత పాత్ర నటించింది శిశిర్ శర్మ) ని పిలిచి అణుపరీక్షకి రెడీ అవమంటాడు. మక్సూద్ ఆలం నెదర్లాండ్స్ లో వుంటున్న అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ (నిజ జీవిత పాత్ర నటించింది మీర్ సర్వర్) ని రప్పించి బాధ్యత అప్పగిస్తాడు. అణుపరీక్షకి అవసరమైన విడిభాగాల్ని బ్లాక్ మార్కెట్ నుంచి సమకూర్చుకుంటారు.
        
ఇలా వుండగా మన దేశంలో రా చీఫ్ ఆర్ ఎన్  కావో (నిజ జీవిత పాత్ర నటించింది పర్మీత్ సేథీ) దీన్ని పసిగడతాడు. ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ (అవంతికా అకర్కర్) ఆమోదంతో పాకిస్తాన్లో ఆపరేషన్ మొదలెడతాడు. ఆల్రెడీ పాకిస్తాన్లో వుంటున్న ముగ్గురు రా ఏజెంట్లకి అణు కర్మాగారం ఎక్కడ నెలకొల్పుతున్నారో ఆరా తీయాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారం ఇజ్రాయెల్ కి అందిస్తే ఇజ్రాయెల్ పాకిస్తాన్లో ఆ స్థావరం మీద వైమానిక దాడి జరిపి ధ్వంసం చేస్తుందని ప్లాను.
        
పాకిస్తాన్లో రహస్య ఏజెంట్లుగా వుంటున్న ముగ్గుర్లో ఒకడైన తారిక్ పేరుతో చెలామణీ అవుతున్న అమన్‌ దీప్ సింగ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) టైలర్‌గా పని చేస్తూంటాడు. అతను నస్రీన్‌ (రశ్మికా మందన్న) అనే అంధురాలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఢిల్లీలో తారిక్ హ్యాండ్లర్ శర్మ (జాకీర్ హుస్సేన్) నేతృత్వంలో మిషన్ మజ్నూ పేరుతో ఆపరేషన్ మొదలవుతుంది.
        
ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎంతకాలం కొనసాగింది, ఇరు దేశాల్లో అధికార మార్పిడితో ఏఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ అత్యవసర పరిస్థితులేర్పడ్డాయి, వీటన్నిటినీ  తట్టుకుని తారిక్ ఈ ఆపరేషన్ని విజయవంతం చేశాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

చారిత్రక అంశాలతో స్పై థ్రిల్లర్ జానర్ కథ చెప్పాలనుకోవడం మంచిదే. కానీ చెప్పడం కూడా రావాలి. ముందుగా స్పై స్పైలాగా వుండాలి, థ్రిల్లర్ థ్రిల్లర్ లాగా వుండాలి. ఈ రెండూ లేకపోయాక చారిత్రక అంశాలతో  కేవలం డాక్యుమెంటరీ లాగా మిగిలిపోతుంది. డాక్యుమెంటరీలో విషయాలే బావున్నాయి. 1971 లో పాకిస్తాన్ మూడో సారి యుద్ధం ఓడిపోయాక, గూఢచార సంస్థ రా వ్యవస్థాపక చీఫ్ ఆర్ ఎన్ కావ్ ఈ కథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది సినిమా. కానీ రా చీఫ్ అంతటి వాడు స్పై ఆపరేషన్ కథ ఇంత పేలవంగా చెప్తాడా అన్నట్టు వుంటుంది దర్శకుడి పనితనం. 
        
కథకి పనికొచ్చే చారిత్రక ఘటనలు బావున్నంతగా కథ లేదు. కథ క్రోనాలజీ కూడా సవ్యంగా లేదు. తారిక్ భార్య నస్రీన్ 1977 లో ఐక్యరాజ్య సమితి భారత్ జరిపిన అణుపరీక్షని నిలుపుదల చేసినప్పుడు గర్భవతైతే, 1979 లో పాక్ మీద ఇజ్రాయెల్ దాడికి సమాయత్తమవుతున్నప్పుడు కూడా గర్భాన్ని మోస్తూనే వుంటుంది. కథ ముగింపులో కూడా గర్భాన్ని మోస్తూనే వుంటుంది. అదేం గర్భమో ఏమిటో అర్ధం గాదు. మదర్ సెంటి మెంటు సీన్ల కోసం ఆమె డెలివరీని సాగదీస్తూ, టైమ్ టేబుల్ ని మర్చిపోయాడు దర్శకుడు.         

1974 లో ఇండియా అణుపరీక్ష జరిపినప్పుడు పోటీగా పాక్ ప్రధాని జుల్ఫికరలీ భుట్టో రెండు చర్యలకి పాల్పడతాడు- ఒకటి, అణుపరీక్షకి ఆదేశించడంతో బాటు, అందుకు అవసరమైన నిధుల్ని లిబియా పాలకుడు కల్నల్ గడాఫీ నుంచి సేకరించడం, రెండు- ఐక్యరాజ్య సమితిలో ఇండియా అణు కార్యక్రమాల్ని నిలుపుదల చేయించడం.
        
దీంతో ప్రధాని ఇందిరా గాంధీ అసలు వాళ్ళ అణు స్థావరం ఎక్కడ నెలకొల్పుతున్నారో తెలుసుకుని పేల్చేయమని రా చీఫ్ ని ఆదేశిస్తుంది. ఆ తర్వాత 1975 లో ఎమర్జెన్సీ విధిస్తుంది. 1977 ఎన్నికల్లో ఆమె అధికారం కోల్పోయి మొరార్జీ దేశాయ్ ప్రధాని అవుతాడు. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని ఆపరేషన్ని ఆపేయమంటాడు రా చీఫ్ తో. దీనికి సమ్మతించని రా చీఫ్ రాజీనామా చేస్తాడు. ఆపరేషన్ మాత్రం అనధికారికంగా కొనసాగుతూనే వుంటుంది.
        
1977 లోనే పాక్ ప్రధాని భుట్టోని జైల్లో వేసి జనరల్ జియావుల్ హక్ నియంత అవుతాడు. మొరార్జీ దేశాయ్ కి ఫోన్లు చేసి మాట్లాడుతూంటాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. 1979 లో ఇజ్రాయెల్ పాక్ నిర్మిస్తున్న అణుస్థావరం మీద దాడికి సిద్ధమవుతున్న సమాచారమందడంతో, మొరార్జీదేశాయ్ జియావుల్ హక్ కి ఫోన్ చేసి- కహుటాలో ఏం చేస్తున్నారు మీరు. మా దగ్గర ఎవిడెన్స్ వుంది, మూసి పారెయ్యండి -  అని ఫైర్ అవుతాడు. ఈ రహస్యం ఎలా పొక్కిందని జియా అధికారులమీద చిందులేసి, అణు కార్యక్రమాలు ఆపేస్తాడు. ఆ విధంగా ఇజ్రాయెల్ దాడి కూడా తప్పుతుంది.
        
ఇలాటి చారిత్రక మలుపులతో నడిపిన కథ స్పై కథ జానర్  మర్యాదలతో వుండదు. లవ్, ఫ్యామిలీ, ప్రెగ్నెన్సీ, మదర్ సెంటిమెంటూ లాంటివి పెట్టి చెడగొట్టాడు. స్పైకి పెళ్ళాం ఏమిటి? జేమ్స్ బాండ్ కి పెళ్ళాం వుంటుందా? స్పై అనేవాడికి తన సుఖం కాదు, ప్రపంచ బాధ. చివర్లో తప్ప యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ అడ్వెంచర్లు వుండవు. మధ్యమధ్యలో భార్య గర్భం సీన్లు కథకి అడ్డుతగులుతూ వుంటాయి. చివరి ఆస్పత్రి సీన్లో కూడా డాక్టర్ పరీక్షించి, ఇంకా డెలివరీ కావడం లేదేమిటని అనుమానించకుండా, ఫర్వా లేదు బాగానే వుందని అంటుంది. రెండేళ్ళు కాదు, ఇంకో నాల్గేళ్ళు బాగానే వుంటుంది. సీక్వెల్ తీసి  డెలివరీ చేస్తాడేమో.
        
ఇంకో విచిత్రమేమిటంటే, ఎప్పుడో 1974 లో ప్రారంభించిన ఆపరేషన్ 1979 వరకూ అణుస్థావరం కనుక్కోవడానికి కుంటి నడకన సాగుతూనే వుంటుంది. బయాలజీ, క్రోనాలజీ రెండూ కన్ఫ్యూజ్ చేస్తాయి.

నటనలు- సాంకేతికాలు

హీరో సిద్దార్థ్ మల్హోత్రా గూఢచారిలా కాక, టైలరింగ్ ని ఎంజాయ్ చేస్తున్న టైలర్ లా వుంటాడు. ఏదైనా కూపీ లాగుతున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు వుంటాయి సీన్లు. చాలా పాత సినిమా హీరోలా చాదస్తంగా కనిపిస్తాడు. కథలో పాకిస్తాన్లో టైలర్ కావచ్చు, ప్రేక్షకులకి స్ప్పైలాగా వుండాల్సిన షేడ్, డైనమిక్స్ లేక- ఎంత సోది మనిషిలా వుంటాడో, కథా నాయకుడిగా నడిపే కథ కూడా అంత సోది చెప్తున్నట్టు నడిపిస్తాడు.
        
ఇక రశ్మిక పాత్రకి అంధత్వం కథకేం పనికొచ్చిందో అర్ధం గాదు. సినిమా సాంతం గర్భాన్ని మోస్తూ వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్ లా వుంటుంది. ఏం చూసి ఈ డబుల్ ట్రబుల్ (అంధత్వం + గర్భం) పాత్ర నటించిందో ఆమెకే తెలియాలి. ఈ స్పై కథలో ఏ శత్రువు నుంచీ  ఏ ప్రమాదమూ లేకుండా ఇంటి పట్టున గ్లామర్ పోషణ చేసుకుంటూ వుంటుంది.
        
ఇక చారిత్రక పాత్రలు పోషించిన నటీనటులదే ఈ సినిమా. వాళ్ళ సీన్లు అంత వేడిని పుట్టిస్తాయి. వాళ్ళతో  డాక్యుమెంటరీ సీన్లు తీసేస్తే సినిమాలో చెప్పుకోవడానికేం లేదు. సంగీతం, ఛాయాగ్రహణం కూడా బలహీనమే. ఒక మంచి కాన్సెప్టుని వృధా చేశాడు కొత్త దర్శకుడు.
—సికిందర్

 

30, జనవరి 2023, సోమవారం

1297 : రివ్యూ!


 రచన -దర్శకత్వం : శరవణన్

తారాగణం : త్రిష, అనస్వర రాజన్, అబ్దుమాలికోవ్ తదితరులు
కథ :  ఏకే మురుగదాస్, సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : కెఎ శక్తివేల్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : అల్లిరాజా సుభాస్కరన్
విడుదల : జనవరి 28, 2023 (నెట్ ఫ్లిక్స్)
        స్టార్ హీరోయిన్ త్రిష సినిమాల్లో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కొంత కాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. యాక్షన్, సస్పెన్స్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ లో కీలక పాత్ర కూడా పోషించింది. తాజాగా ఆమె నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ రాంగి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు ఆడియోతో కూడా వున్న రాంగి తెలుగులో 'రిపోర్టర్' పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కథ అందించాడు. శరవణన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది టెర్రరిజం అంశంతో ఒక సున్నిత ప్రేమ కథ. నాణ్యత కోరుకునే ప్రేక్షకుల కోసం ఈ సినిమా ఎలా వుంటుందో చూద్దాం...

కథ

రుద్ర శివంగి (త్రిష) వెబ్ పత్రికలో పని చేసే రిపోర్టర్. అన్నావదినెలకి ఆమె సింహస్వప్నం. బయట కూడా అలాగే వుంటుంది. అన్న కూడా జర్నలిస్టే. అయితే జర్నలిజం తన తండ్రితోబాటే చచ్చిపోయిందని నమ్ముతుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలే తప్ప ప్రజా సమస్యల్ని రిపోర్టు చేసే వాళ్ళు లేరని కోపంతో వుంటుంది. ఒక రోజు ఆమె 16 ఏళ్ళ మేనకోడలు సుస్మిత (అనస్వర రాజన్) పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఖాతా ట్యునీషియాలోని ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్న ఆలీమ్ (అబ్దుమాలికోవ్) అనే కుర్రవాడితో కొనసాగుతోందని తెలుసుకుంటుంది. తనతో చాటింగ్ చేస్తోంది సుస్మితే అని నమ్మిన 17 ఏళ్ళ ఆలీమ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు కూడా.
        
ఈ ఖాతాతో శివంగి తను చాటింగ్ చేస్తూ లొకేషన్ అడిగితే, అవతల ట్యూనీషియాలో మారణాయుధంతో కాపేసి వున్న ఆలీమ్, తానున్న లొకేషన్ పిక్ తీసి పోస్ట్ చేస్తాడు. పది నిమిషాల తర్వాత అటుగా వస్తున్న రెండు కార్లని పేల్చేస్తాడు. ఆ కార్లలో వున్నది ఇద్దరు అమెరికన్ నిపుణులు. వాళ్ళు లిబియాలో చమురు బావుల త్రవ్వకాల కోసం వచ్చారు. ఈ దాడితో ఎఫ్బీఐ అధికారులు రంగంలోకి దిగి శివంగిని ట్రేస్ చేసి వచ్చేసి పట్టుకుంటారు.
        
ఇప్పుడు శివంగి, సుస్మితల ద్వారా ఆలీమ్ ని పట్టుకోవాలనుకుంటున్న ఎఫ్బీఐ పథకంతో శివంగి రిస్కు తీసుకుని, సుస్మితని కూడా ఇందులోకి లాగి సహకరించిందా లేదా, ఆలీమ్ కి వ్యతిరేకంగా తను ఇలా చేయడానికి మనస్కరించిందా, వాళ్ళ దేశంలో ఆలీమ్ చేస్తున్న అగ్రరాజ్య వ్యతిరేక పోరాటానికి తను ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయిందీ- చివరికేం చేసిందీ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మురుగ దాస్ ఒక అద్భుతమైన కథ ఇచ్చాడని చెప్పొచ్చు. లిబియా రాజకీయ పరిస్థితిని, అగ్రరాజ్యం చేతిలో ప్రజా సమస్యల్నీ నేపథ్యంగా చేసుకుని ఉత్తమ కథ అందించాడు. లిబియాలో కొత్త సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించిన కల్నల్ గడాఫీ తమ దేశంలో చమురు అగ్రరాజ్యానికి అమ్మేది లేదన్నాడు. దీంతో కాలక్రమంలో అగ్రరాజ్యం ప్రజలతో తిరుగుబాటు జరిపించి, ప్రజల చేతే గడాఫీని చంపించింది. సాయుధ దళాలు ఎందరో ప్రజల్ని చంపి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఆ పిల్లలు టెర్రరిస్టులయ్యారు. ఆ టెర్రరిస్టుల్లో ఒకడు ఆలీమ్. అతను అగ్రరాజ్యం మీద కత్తి గట్టాడు. మా దేశంలో చమురు లేకపోతే మా నాయకుడికి, మాకూ మరణం వుండేది కాదు కదా- అన్న ఆక్రోశంతో పని చేస్తూంటాడు. ఫేస్ బుక్ తో సుస్మితతో  ప్రేమలో పడడంతో అతను అమెరికా ఉచ్చులో పడ్డం ఈ కథ.
        
ఈ కథలో రిపోర్టర్ శివంగి మోరల్ డైలమా తీవ్ర అపరాధ భావానికి లోనుజేస్తుంది. ఆలీమ్ తో తను చాటింగ్ చేసి వుండకపోతే అతను బతికి వుండేవాడు కదా అన్న ఆవేదనతో ఆమె చివరి ఏడ్పు వెండి తెరని పట్టి వూపేస్తుంది. కథ చాలా సింపుల్ గా వుంటూనే చాలా బలంగా వుంటుంది. చాటింగ్ తో సాగే ప్రేమ కథ కూడా క్లాస్ గా వుంటుంది. ఒక టెర్రరిజపు ప్రేమకథని సున్నితంగా చెప్పిన విధానమే ఈ సినిమా యూఎస్పీ.

నటనలు- సాంకేతికాలు

త్రిష టాప్ యాక్షన్. సమయస్ఫూర్తి గల రిపోర్టర్ పాత్రని సింపుల్ గా పోషించింది. ఆమె లేని సీను దాదాపు వుండదు. చివరి సీను మాత్రం ఆమెకి సిగ్నేచర్ సీను. పైకి ఎంత ఆవేశముంటుందో అంత నింపాదిగా, నిదానంగా కరెక్టు పని చేస్తుంది. టెర్రరిస్టుని పట్టివ్వాల్సిన విషమ పరిస్థితి నెదుర్కోవడం ఆమె పాత్రకి రియల్ సంఘర్షణ. మేనకోడల్ని తీసుకుని అమెరికా అధికారుల వెంట లిబియా వెళ్ళాల్సి రావడం ఆమె సంఘర్షణకి పరాకాష్ట. అన్నిటా ప్రభావశీలంగా నటించింది.
        
మేనకోడలి పాత్రలో అనస్వర రాజన్ ది విచిత్ర పరిస్థితి. తన పేర ఫేక్ ఎఫ్బీ ఖాతా వున్నట్టూ, దాంతో కనెక్టయి టెర్రరిస్టు తనతో ప్రేమలో పడ్డట్టూ ఆమెకి తెలియదు. జరుగుతున్నదంతా ఏంటో, ఎందుకు తను లిబియా పోతోందో అస్సలు తెలియదు. ఈ అయోమయ అమాయకత్వాన్ని బాగా అర్ధం జేసుకుని పోషించింది.
        
ఇక ఆలీమ్ గా రష్యన్ నటుడు అబ్దుమాలికోవ్ టెర్రరిస్టు-కమ్- టీనేజి లవర్ పాత్రని, తన విషాదకర గతాన్నీ, ఆల్రెడీ ప్రతిభగల నటుడు కాబట్టి వాటితో కథని నిలబెట్టాడు. తన సీమాంతర ప్రేమ కోసం తల్లడిల్లడం, ప్రేమిస్తున్న అమ్మాయిని చివరి క్షణాల్లో చూడడం వంటి ఉద్విగ్నభరిత సన్నివేశాలు అతడ్ని గుర్తుంచుకునేలా చేస్తాయి.
        
లైకా ప్రొడక్షన్స్ మేకింగ్ ఉన్నత స్థాయిలో వుంది. అయితే సినిమా సైలెంట్ గా సాగుతూంటుంది. ఎక్కడోగానీ నేపథ్య సంగీతం రాదు. ఇది చాలా హాయిగొల్పే క్రియేటివిటీ. పొదుపైన సంగీతంతో సత్య సినిమాకి జీవం పోశాడనే అనాలి. అలాగే శక్తివేల్ కెమెరా విజువల్స్ ఉన్నతంగా వున్నాయి. యాక్షన్ సీన్స్, టెర్రరిస్టు కార్యకలాపాలు ఉన్నత ప్రమాణాలతో వున్నాయి. ఒక్క మాటలో ఇది శరవణన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్  బ్రాండ్ మూవీ అనాలి.
—సికిందర్