రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2022, సోమవారం

1206 : రివ్యూ!


దర్శకత్వం : ఆర్. అజయ్ జ్ఞానముత్తు
తారాగణం : విక్రమ్, శ్రీనిథీ శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కెఎస్ రవికుమార్, రోషన్ మాథ్యూ
రచన : ఆర్. అజయ్ జ్ఞానముత్తు, నీలన్ కె, శేఖర్ కణ్ణ శ్రీవస్తన్, అజరుద్దీన్ అల్లావుద్దీన్, ఇన్నాసి పాండియన్, భరత్ కృష్ణమాచారి
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : హరీష్ కణ్ణన్
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల :  ఆగస్టు 31, 2022
***

వితికి చియాన్ విక్రమ్ కానుకగా  కోబ్రా విడుదలైంది. కేజీఎఫ్‌ హీరోయిన్ శ్రీనిధీ శెట్టి, క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ లతో జత కట్టి వచ్చాడు విక్రమ్. శ్రీనిధికి ఇది తమిళంలో ఎంట్రీ. ఇర్ఫాన్ కి నటనలో ఎంట్రీ. ఇంకో ఇద్దరు హీరోయిన్లు వున్నారు- మీనాక్షి, మృణాళిని. విక్రమ్ 10 వివిధ గెటప్స్ తో కనిపిస్తాడని బాగా ప్రచారం జరిగింది. వీటితో బాటు భారీ బడ్జెట్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇవన్నీ కలిసి 5 భాషల్లో పానిండియా మూవీగా విడుదలైంది. ఇంతవరకూ గత జూన్ లో ఒకే ఒక్క తమిళ పానిండియా కమల్ హాసన్ తో విక్రమ్ మాత్రమే హిట్టయ్యింది. ఇప్పుడు ఇంత ఆర్భాటంతో కోబ్రా ఏ మేరకు పానిండియా అర్హతతో వుంది? ఫ్లాపయిన ఇతర తమిళ పానిండియాల్లాగే తమిళనాడులో ఇది తమిళులకే పరిమితమయ్యే అవకాశముందా? ఇది తెలుసుకుందాం...

కథ
మది (విక్రమ్) గణిత మేధావి. టీచర్ గా పని చేస్తూంటాడు. ఇతడ్ని భావన (శ్రీనిధి) ప్రేమిస్తూంటుంది. కానీ తీవ్రమానసిక సమస్యలతో వున్న మది పెళ్ళికి ఒప్పుకోడు. అతను ఏవేవో చిత్త భ్రాంతులకి లోనవుతూంటాడు. ఇంకో పక్క ఉన్నతస్థాయి రాజకీయ హత్యలు జరుగుతూంటాయి. కోయంబత్తూరులో ఒరిస్సా ముఖ్యమంత్రి హత్య, స్కాట్ లాండ్ లో పెళ్ళి చేసుకుంటున్న రాకుమారుడి హత్య, రష్యాలో బహిరంగ సభలో పాల్గొంటున్న రక్షణ మంత్రి హత్య. ఈ హత్యల్ని ఒకే హంతకుడు వివిధ గెటప్స్ తో చేస్తూంటాడు.

ఈ హత్యల్ని యుద్ధ ప్రాతిపదికన ఇంటర్ పోల్ కాప్ అస్లన్ ఇన్మజ్ (ఇర్ఫాన్ పఠాన్) దర్య్యాప్తు చేస్తూంటాడు. ఇతడి టీములో తెలివైన జుడిత్ శాంసన్ (మీనాక్షీ) వుంటుంది. ఈమె ఈ హత్యల్ని విశ్లేషించి ఇవి ఎవరో గణిత మేధావి ఘన కార్యాలని చెప్తుంది. ఈ హత్యలకి గురైన నేతలు రుషి (రోషన్ మాథ్యీవ్) అనే దుష్ట కార్పొరేట్ అధిపతికి వ్యతిరేకులని తెలుస్తుంది. ఆ హంతకుడు లెక్కల మాస్టారు మది అని తెలీదు. కానీ ఒక హ్యాకర్ తెలుసుకుని, వాడి నిజస్వరూపం బయటపెడతానంటాడు. దీంతో మది అప్రమత్తమవుతాడు.

ఎలావుంది కథ
        మది ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? ఇతడి గతమేమిటి? మానసిక సమస్యలేమిటి? తనకి ప్రమాదకరంగా వున్న హ్యాకర్ ని పట్టుకున్నాడా? హత్యలతో రిషి కేమైనా సంబంధముందా? మదికి భావనతో పెళ్ళయ్యిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కథ. కొత్తగా అన్పించే కథ (మొత్తం కాదు). గణిత మేధావి గణిత శాస్త్ర అంచనాలతో పథకాలు రచించి గొప్ప గొప్ప నేతల్ని మతిపోయే విధంగా అంతమొందించడం. అయితే వచ్చిన సమస్యేమిటంటే, విక్రమ్ పాత్రకంటే ఈ సినిమాకి పని చేసిన దర్శకుడితో బాటు ఆరుగురు రచయితలే పనిగట్టుకుని మేధావులై పోవడం. ప్రేక్షకుల మెదళ్ళపై బుసలు కొట్టడం. వీళ్ళ గణితమేమిటో, ఆల్జీబ్రా ఏమిటో, ఎక్కాలేమిటో  అస్సలు అర్ధం గాకపోవడం. ఫస్టాఫ్ ఎలాగో అర్ధమైనా, సెకండాఫ్ చూడాలంటే పాము పుట్టలో తల పెట్టడమే. అక్కడున్న కోబ్రాతో కాట్లేయించుకోవడమే.

        పైగా మూడు గంటల భారమైన సినిమా. కథ ఎలా నడపాలో, ఎలా ముగించాలో తెలీక అనేక మలుపులు, అనేక ఫ్లాష్ బ్యాకులు, ఏం చెప్తున్నారో అర్ధంగాని కన్ఫ్యూజన్. సింపుల్ గా చెప్తే అయిపోయే కథని అష్టవంకర్లు తిప్పారు. పైన చెప్పుకున్న ఫస్టాఫ్ కథ హత్యలతో, విక్రమ్ తెలివి తేటలతో చకచకా సాగిపోయినా, సెకండాఫ్ వచ్చేసరికి తలపోటు వచ్చేస్తుంది. లైగర్ సెకండాఫ్ ఎలా కుప్పకూలిందో ఇదీ అంతే. ఇదే సంవత్సరం వచ్చిన విక్రమ్ గత ఫ్లాప్ మూవీ మహాన్ ఎంత టార్చరో,కోబ్రా అంతకన్నా టార్చర్. దీన్ని శ్రీనిధీ, ఇర్ఫాన్ లని పరిచయం చేస్తూ పానిండియాగా విడుదల చేయడం ఓవరాక్షన్.


నిడివి 20 నిమిషాలు తగ్గించినా ప్రేక్షకుల కన్ఫ్యూజన్ పోవడం లేదు. కన్ఫ్యూజన్ కి క్షమాపణ చెప్పుకుంటూ, మరోసారి చూస్తే కన్ఫ్యూజన్ వుండదని, తప్పకుండా మరోసారి చూడమని దర్శకుడి వినమ్ర సలహా. ఇంకోసారి బెటర్ సినిమా తీస్తానని ప్రామీస్. ఐతే బెటర్ సినిమా చూస్తామని ప్రేక్షకుల టాటా. ఆరుగురు రచయితలు + దర్శకుడు = భయపడి బుట్టలో దాక్కున్న కోబ్రా! ఈ కథ కోబ్రాలకే అవమానం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దర్శకుడ్ని, ఆరుగురు రచయితల్ని శిక్షించాలి.

నటనలు- సాంకేతికాలు  

మానసిక సమస్యలతో, ఓ పది గెటప్స్ తో   కోబ్రా ఇంకో అపరిచితుడు అన్పించి వుంటుంది విక్రమ్ కి. పది గెటప్స్ తో రహస్యంగా హత్యలు చేయడం, ప్రైవేటుగా టీచరుగా పనిచేయడం, పర్సనల్ గా గతంతో బాధపడడం. ఇన్ని షేడ్స్ వున్న క్యారక్టర్ అపూర్వమే విక్రమ్ కి. వీటిలో తను ఎంత బాగా నటించినా కథకి అర్ధం పర్ధం లేక నష్టపోయాడు.

 పైగా సెకండాఫ్ లో గతం గురించి చెప్పడానికి ఎంతకీ ముగియని పరమ బోరు ఫ్లాష్ బ్యాక్. తన మానసిక సమస్య ష్కీజో ఫ్రేనియా అని తెలుస్తుంది. అది చెప్పి వూరుకోవడమే తప్ప దాని ఆద్యంతాలేమిటో వుండవు. అలాగే తన శాడ్ క్యారక్టర్ తో శ్రీనిథితో రోమాన్స్ కూడా ఎంటర్ టైన్ చేయలేదు.

        కేజీఎఫ్ శ్రీనిథి పాత్ర తక్కువే. మధ్యతరగతి అమ్మాయి,. అతడ్ని ప్రేమించి అతడ్నే పెళ్ళి చేసుకోవాలని వుండిపోవడం. ఓ పాటలో గ్లామరస్ గా వుంది. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి నటన నేర్పించి నటింప జేశారు. ఇంటర్ పోల్ కాప్ గా ఫర్వాలేదన్పించాడు.

        సాంకేతికంగా చాలా వ్యయం చేశారు. స్కాట్ లాండ్ లో యువరాజు పెళ్ళి – హత్యా దృశ్యాలు, రష్యాలో రక్షణ మంత్రి బహిరంగసభ – హత్యా దృశ్యాలూ టాప్ క్లాస్ గా వున్నాయి. హై టెక్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ దృశ్యాలు కూడా పకడ్బందీగా వున్నాయి. కాకపోతే లాజిక్ అనేది ఎక్కడా వుండదు. ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో పాటలు హిట్ కాలేదు. నేపథ్య సంగీతం హోరెక్కువ వుంది. సన్నివేశాలే కన్ఫ్యూజన్ గా వుంటే సంగీతమెలా కుదురుతుంది.

        మొత్తానికి లైగర్ తర్వాత ఇంకో పానిండియా కోబ్రా సౌత్ సినిమాల ప్రతిష్ట మసక బార్చాయి. విక్రమ్ కూడా అపరిచితుడు లాంటి ప్రయోగాలు గాకుండా నాన్న లాంటి అర్ధవంతమైన సినిమాలు అడిగి తీయించుకుంటే గౌరవం పెరుగుతుంది.

—సికిందర్ 

 

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

1205 : సండే ఆర్టికల్

సారైనా శర్వానంద్ ఒకే ఒక జీవితంతో హిట్ బాట పడతాడా? ఈ వారం 9 వ తేదీ  విడుదలవుతున్న ఒకే ఒక జీవితంకేసే ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. కారణం, ఆరు వరస ఫ్లాపుల తర్వాత శర్వానంద్ సైన్స్ ఫిక్షన్ తో రావడం. ఇదే మళ్ళీ ఇంకో పాత మూస అయితే అనుమానంగా చూసే వాళ్ళు ప్రేక్షకులు. 2017 నుంచీ పడిపడి లేచే మనసు, ‘రణరంగం, ‘జాను, ‘శ్రీకారం, ‘మహాసముద్రం, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు...ఇలా అరడజను అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత, ఇప్పుడు రూటు మార్చి సైన్స్ ఫిక్షన్ ప్రయత్నించడం, అదీ బ్రహ్మాస్త్రంలాంటి భారీ స్పిరిచ్యువల్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న రోజే పరీక్షకి నిలబడడం ఆసక్తి రేపే విషయమే.

కే ఒక జీవితం’, ‘బ్రహ్మాస్త్రం’ -ఒకటి సైన్స్ ఫిక్షన్ అయితే, ఇంకోటి స్పిరిచ్యువల్ థ్రిల్లర్ రెండూ ఈ వారం ప్రేక్షకులకి వెరైటీలే. వరుసగా మూడు వారాలు లైగర్, కోబ్రా, రంగరంగ వైభవం అనే ఒకదాన్ని మించిన ఒక మూస నుంచి కాస్త రిలీఫ్ నిచ్చే వెరైటీలు. అయితే ఇక్కడొకటి వుంది- ఈ రెండూ గణేష్ నిమజ్జనం రోజున విడుదలవుతున్నాయి! మండపాలు, వినాయకుడి ఊరేగింపులూ వదిలి సినిమాలకి రాగలరా ప్రేక్షకులు తొమ్మిదో తేదీన? మనకి తెలిసి నిమజ్జనం రోజున ఏ సినిమా విడుదల కాలేదు, విడుదల చెయ్యరు  చవితికి తప్ప!        

            అయితే బ్రహ్మాస్త్రంహిందీలోనే కాదు, తెలుగు వెర్షన్ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్ గా వున్నాయి. బాయ్ కాట్ ట్రెండింగులు ఏమాత్రం పనిచేయడం లేదు. మొన్న యాంటీ నేషనల్జావేద్ అఖ్తర్ కూడా క్లాసు పీకడంతో, జర్నలిస్టు అభిశార్ శర్మ కూడా బాయ్ కాట్ బ్యాచి టికెట్ డబ్బుల్లేని బేకార్ బ్యాచ్అని వాయించడంతో నోర్మూసు కున్నారు. పైగా వారం పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం టీం ప్రమోషన్లతో తెగ హడావిడి చేస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్ ల ప్రమో కార్యక్రమాల్లో రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్ లు పాల్గొంటూ తెలుగు ప్రేక్షకుల్లోకి  సినిమాని బలంగా తీసికెళ్ళి మార్కెటింగ్ చేస్తున్నారు. రణబీర్ మంచి తెలుగు కూడా మాట్లాడడంతో సంభ్రమాశ్చర్యాలతో ట్వీట్లు చేశారు నెటిజనులు.

            ఈ నేపథ్యంలో శర్వానంద్ సైన్స్ ఫిక్షన్ పరీక్షకి నిలబడింది. 4 వ తేదీ ఆదివారమింకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు.  టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటించి యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి. ఆడవాళ్ళూ మీకు జోహార్లుకి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించినా సినిమా ఫ్లాపయ్యింది.

            ‘శతమానం భవతి’, ‘మహానుభావుడుల  తర్వాత శర్వానంద్‌కి వరుస షాకులే  తగులుతున్నాయి. జాను, ‘శ్రీకారం సినిమాలకి  పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. ఆడవాళ్ళూ మీకు జోహార్లు’  పరాజయంతో శర్వానంద్ మూడు సినిమాల్లో ఆఫర్లు వదులుకున్నాడని వినబడింది.

            'పడి పడి లేచె మనసు', 'రణరంగం', 'జాను', ‘శ్రీకారం’, 'మహా సముద్రం' మూడేళ్ళ లోపు ఐదు ఫ్లాపులు! శర్వానంద్  ప్రతిభావంతుడే కానీ స్క్రిప్టులు అతడ్ని విఫలం చేస్తున్నాయి. లేకపోతే 'జాతి రత్నాలుముందు శ్రీకారంఎందుకు ఫ్లాపవుతుంది. ఇంకో పేలవమైన కంటెంట్ కారణంగా 'మహాసముద్రం' ఫ్లాపయ్యింది. టాప్ హీరోయిన్ రశ్మికా మందన్నతో నటించినా అరిగిపోయిన మూస ఆడవాళ్ళూ మీకు జోహార్లుహిట్ కాలేదు.      అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. శర్వానంద్ ఇకనైనా కథల విషయంలో రూటు మార్చుకుని వినూత్న సినిమాలు చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఒకే ఒక జీవితం’.  

            ఇది టైమ్ మెషీన్ లో కాలంలోకి ప్రయాణించే కథ. గతంలోకి ప్రయాణించి ఆ గతాన్ని సవరిస్తే భవిష్యత్తు ఉజ్వలమయ్యే కథ. అమల నటించిన మదర్ పాత్ర కేంద్రబిందువుగా. దీన్ని చూస్తే హాలీవుడ్  మూవీ గుర్తుకొస్తుంది. బ్యాక్ టు ది ఫ్యూచర్అనే ఆస్కార్ అవార్డు మూవీలో, చిన్న కుర్రాడు టైమ్ మెషీన్ లో గతం లోకి ప్రయాణించి, ఆ కాలంలో టీనేజర్లుగా వున్న తన తల్లి దండ్రుల్ని చూస్తాడు.

            తల్లిదండ్రులు వర్తమానంలో ఎప్పుడూ కీచులాటలతో శాంతి  లేకుండా వుంటారు. దీని కారణం  వాళ్ళ టీనేజిలో వుందని తెలుసుకుని, టీనేజర్స్ గా వాళ్ళ జీవితాల్ని సరి చేసి వర్తమానంలో కొస్తే, కీచులాటలు మాని తల్లి దండ్రులు సంతోషంగా వుంటారు. నిజానికిది సైన్స్ ఫిక్షన్ రూపంలో చెప్పిన సైకో థెరఫీ కథ. ఒకే ఒక జీవితంకూడా ఈ కోవలోనే వుండొచ్చు.

            కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ నుంచి శర్వానంద్ ఒకే ఒక జీవితంవస్తోంది. ఇందులో శర్వానంద్ సరసన రీతూవర్మ, అమల, వెన్నెల కిషోర్, అలీ, ప్రియదర్శి నటించారు. సంగీతం జెక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం సుజీత్ సారంగ్, బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు. ఇక 9  తేదీ రిజల్ట్ కోసం చూద్దాం.

***

 

3, సెప్టెంబర్ 2022, శనివారం

1204 : రివ్యూ!


రచన- దర్శకత్వం: గిరీశాయ
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, తులసి, ప్రగతి, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, సుబ్బరాజు, ఆలీ, ఫిష్ వెంకట్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, పాటలు : శ్రీమణి, ఛాయాగ్రహణం : శామ్ ద‌త్
బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 1, 2022
***
        ప్పెన బ్లాక్‌బస్టర్ విజయంతో తెలుగు తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత కొండపొలం తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ రెండూ వైవిధ్యమున్న సినిమాలే. ఇక మూడో ప్రయత్నంగా రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పండగ సందర్భంగా. హీరోయిన్  కేతికా శర్మతో రోమాన్స్ చేశాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశాయ అర్జున్ రెడ్డి ని తమిళంలో రీమేక్ చేసి దర్శకుడిగా పరిచయమయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలూ హిట్టయ్యాయి. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలందించిన బివిఎస్ఎన్ ప్రసాద్ దీనికి నిర్మాత. ఇలా ప్రొఫైల్ చూస్తే ఇంత ఆకర్షణీయంగా వుంది. మరి సినిమా ఎంత వైభవంగా వుంది? ఇది తెలుసుకుందాం...

కథ
వైజాగ్ లో పక్క పక్క ఇళ్ళల్లో వుండే రిషి (వైష్ణవ్ తేజ), రాధ (కేతికా శర్మ) ఒకే హాస్పిటల్లో, ఒకే సమయంలో (1.43 గం. అంటే ఐలవ్యూ) చాదస్తంగా పుడతారు. అన్నప్రాసన రోజున పాక్కుంటూ చేయి చేయీ పట్టుకుంటారు. స్కూల్లో చెట్టపట్టాలేసుకుంటారు. స్కూల్లో జరిగిన ఒక గొడవలో ఇద్దరూ చెటా పటా లెంపకాయలు  కొట్టుకుని విడిపోతారు. పదేళ్ళ తర్వాత మెడిసిన్ చదువుతూంటారు. అయినా ఇప్పటికీ మాట్లాడుకోరు.

రిషికి తల్లి (ప్రగతి), తండ్రి (నరేష్), ఓ అన్నా వుంటారు. రాధకి తల్లి (తులసి), తండ్రి (ప్రభు), అక్కా, ఓ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) వుంటారు. ఇద్దరి తండ్రులు చంటి, రాముడులు ప్రాణస్నేహితులు. ఇద్దరి కుటుంబాలు అనుబంధాలకి, ఆత్మీయతలకీ పెట్టని కోట. ఒక సంఘటనలో మాటలు కలుపుకుని ప్రేమించుకోవడం మొదలెడతారు రిషీ రాధా.      

రాధ అన్న అర్జున్ రాజకీయాల్లో వుంటాడు. ఓ పెద్ద నాయకుడి కొడుకుతో పెద్ద చెల్లెలికి సంబంధం తెస్తాడు. ఆ పెళ్ళి చూపులప్పుడు పెద్ద చెల్లెలు, రిషి అన్నా తానూ ప్రేమించుకుంటున్నామంటుంది. దీంతో అర్జున్ వెళ్ళి రిషి అన్నని ఫటాఫటా కొడతాడు. రిషి వచ్చి అర్జున్ ని ఎడాపెడా కొడతాడు. రెండు కుటుంబాలు గోలగోలగా అరుచుకుంటాయి, తిట్టుకుంటాయి. ఇక జన్మలో కలిసేది లేదు పొమ్మని విడిపోతాయి. రాధ కూడా రిషికి గుడ్ బై కొట్టేస్తుంది.

ఇప్పుడేమిటి? రాధ అక్క, రిషి అన్న ల ప్రేమ ఎలా ఫలించింది? రాధా రిషీలు కూడా తిరిగి ఎలా ఏకమయ్యారు. ఏకమై విడిపోయిన రెండు కుటుంబాలని ఎలా కలిపారు? ఇదీ మిగతా కథ.         

ఎలావుంది కథ

గోల్కొండ కోట అంత పురాతన కథ. మన తాతలు చూశారు, తండ్రులు చూశారు, మనం చూశాం, మన పిల్లలూ చూశారు. వాళ్ళ పిల్లల కోసం అడ్వాన్సుగా  తీసినట్టుంది. గోల్కొండ కోట భరోసాగా ఎప్పుడూ వుంటుంది. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు ఈ సినిమా. అర్జున్ రెడ్డి లాంటి రెబెల్ లవ్ స్టోరీ తీసిన దర్శకుడేనా అన్పిస్తుంది. ఇది చిన్నప్పుడు కొట్టుకుని విడిపోయిన ప్రేమికుల కథ అనుకుంటే, కుటుంబాలనే వీడదీసి ఆ కుటుంబాలని కలిపే యూత్ అప్పీల్ లేని కథగా మారిపోయింది. నవీన్ చంద్ర క్యాలెండర్ పేజీ చించేసి  ఓ మాట అంటాడు- డేట్ మారింది, మీరు కూడా అప్డేట్ అవండి - అని. అసలు అప్డేట్ అవ్వాల్సింది ఈ కథే!

కొత్తగా లేదేంటి... అని లవ్ డ్యూయెట్ వుంది. నిజమే అనిపిస్తుంది. కొత్తగా ఏముందని?  చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా -భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా అని ఇంకో పాటలో వుంటుంది. ఇది ప్రేమ కథని ఎస్టాబ్లిష్ చేసే థీమ్ సాంగ్. కథే మారిపోయి సాంగ్ లో థీమ్ కూడా మర్చిపోతాం.

ప్రారంభం నుంచీ ఏ మాత్రం కొత్తగా లేని అవే పాత  సన్నివేశాలు, ప్రేమలు, నటనలు ఫస్టాఫ్ వరకూ సాగినా, సెకండావ్ ఈ పాత విషయమే బలంగా వుంటుందేమో, టైటిల్ కి తగ్గట్టు వైభవంగా వుంటుందేమో  అనుకుంటే- లైగర్ సెకండాఫ్, కోబ్రా సెకండాఫ్ లాగే ఇదీ సహన పరీక్ష, టార్చర్. వరుసగా మూడు సినిమాలిలా పగబట్టి వచ్చినట్టుంది. 

నటనలు- సాంకేతికాలు

వైష్ణవ్ తేజ్ సినిమాలో విషయముంటే నిలబెట్టగలడు. ఆ మాటకొస్తే ఏ సినిమాలోనూ ఏ నటీనటులూ నటనలో తీసిపోరు. తగిన పాత్రచిత్రణ లుండాలి. ఇదే వైష్ణవ్ తేజ్ కి మైనస్. కొండపొలం లో లాగే ఏమీ చెయ్యని పాసివ్ పాత్ర. మెడిసిన్ చదువు తున్నా మెచ్యూరిటీ లేని చైల్డిష్ పాత్ర. చిన్నపట్నుంచీ మాట్లాడని హీరోయిన్ ని మచ్చిక చేసుకునే ప్రయత్నమే చేయడు. బయటి కారణాల వల్లే ఆమె దగ్గరవ్వాలి. ఇంటర్వెల్లో మళ్ళీ ఆమె విడిపోయాక, తిరిగి బయటి కారణాల వల్లే దగ్గరవ్వాలి.

ఇంతేగాక, ప్రేమ సన్నివేశాలు, మాటలు, అల్లరీ టీనేజీ పిల్లల లెవెల్లో సిల్లీగా వున్నాయి. టీనేజీ లవ్ స్టోరీని మెడికోలకి చుట్టబెట్టినట్టుంది. మెడికో అనడానికి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరగడం తప్ప ఏమీ వుండదు. సాంగ్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు.

కేతికా శర్మ కూడా డిటో వైష్ణవ్ తేజ్. టీనేజీ లెవెలే. ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు- పాతికేళ్ళ వయస్సుకి చైల్డిష్ క్యారక్టర్ ఏంటని. పైగా ఇండోర్ లో ఒక గ్లామర్ తో, ఔట్ డోర్ లో ఇంకో గ్లామర్ తో కన్పిస్తుంది. ఆమె స్లిమ్ గా కన్పించేట్టు తీయాలని విశ్వప్రయత్నం చేశాడు కెమెరామాన్.

ఇక మిగిలిన నటీనటులు, వాళ్ళ పాత్రలు రొటీనే. కొత్తగా అలరించరు, కొత్తగా ఏడ్పించరు. తమిళ నటుడు ప్రభు వృధా అయ్యాడు. లేకపోతే ఆయనకి సరైన పాత్ర చిత్రణ చేస్తే వూపేసే వాడు, ఏడ్పించి రిపీట్ ఆడియెన్స్ ని పోగుజేసే వాడు. కుటుంబ సమేతంగా చూసే సినిమా తీయాలని చేసిన ప్రయత్నం కృత్రిమంగా తయారైంది. అలీ, సత్యాల కామెడీకీ ప్రేక్షకులు నవ్వలేదు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలు బావున్నాయి. పాటలకి బీట్స్ హుషారెక్కిస్తాయి. సింగర్స్ బావున్నారు. శ్రీమణి సాహిత్యమూ బావుంది- ముచ్చపు హారంలో రాయే రత్నంలా ఎందరిలో వున్నా అస్సలు కలవరుగా/ పగలు రాతిరిలా పక్కనే వుంటున్నా వీళ్ళు కలిసుండే రోజే రాదంటా- అంటూ శంకర్ మహదేవన్  గళంలో పాట సూపర్. శ్రీమణి  పాటల్లో ఇంత పాత్ర చిత్రణలు, కథా బలం నింపితే మిగతా సినిమాలో వీటి వూసే లేదు. ఈ పాట వింటూ పాట ప్రకారం వుండాల్సిన సినిమాని మనం కళ్ళు మూసుకుని వూహించుకుంటూ ఆనందించాల్సి వుంటుంది. ఈ సినిమాకి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ పాటలు  రాసిన శ్రీమణి! సినిమాలు ఇలా కూడా తీస్తారన్న మాట?

        శామ్ దత్ ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. నంజుకోవడానికి రుచికరంగా లేనిది స్క్రిప్టే!

చివరికేమిటి

కాలం చెల్లిపోయిన పాత మూస కథే కావచ్చు. కథనం కూడా చప్పబడింది. కథ నడపాల్సిన హీరోగా వైష్ణ తేజ్ లేకపోవడంతో, పాత్రకి గోల్ కూడా లేకపోవడంతో, పాసివ్ పాత్రతో కథనంలో చైతన్యమే లేకుండా పోయింది. పుట్టుక దగ్గర్నుంచీ చెప్పుకొచ్చిన కథ, పెద్దయ్యాక కూడా గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ఒక సంఘటనతో మాటలు కలుపుకోవడం, ప్రేమించుకోవడం జరిగి, నవీన్ చంద్ర క్యారక్టర్ పెద్ద చెల్లెలి పెళ్ళి విషయంలో సృష్టించే గలాభాతో కుటుంబాలూ, ప్రేమికులూ విడిపోవడం ఫస్టాఫ్ లో కన్పించే విషయం.
        
సెకండాఫ్ విషాదంగా భారంగా సాగుతుంది. హీరో హీరోయిన్లు అరకులో మెడికల్ క్యాంపు కేళ్ళే సుదీర్ఘ కామెడీ ఎపిసోడ్ సాగడం, ఇంకో సంఘటనతో ఇద్దరూ మళ్ళీ ఒకటవడం, ఇక కుటుంబాల్ని కలపాలనుకోవడం చేస్తారు. ఈ కలిపే కామెడీ ట్రిక్కులు సిల్లీగా వున్నాయి. సెకండాఫ్ కథేమిటో ఇంటర్వెల్లో తెలిసిపోయాక ఇక చూసేదేమీ వుండదు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ పెద్ద సహన పరీక్ష. ఇదే మొత్తం వ్రతాన్నీ చెడగొట్టింది.

హీరోహీరోయిన్లు మెడికోలన్నాక వాళ్ళని కుటుంబాలు కాబోయే డాక్టర్లుగా గౌరవంగా చూసి, వాళ్ళ కోసం ఏమైనా చేసే దృక్పథంతో వుంటే ప్రేక్షకుల దృష్టిలో హీరోహీరోయిన్లు హైలైట్ అవుతారు. ఆ కలర్ఫుల్ క్యారక్టర్స్ కి కనెక్ట్ అయి చూస్తారు. దర్శకుడు తన ప్రధాన పాత్రల్ని తానే గౌరవించకపోతే ప్రేక్షకులెందుకు కేర్ చేస్తారు...ఇంకోటేమిటంటే, స్క్రీన్ ప్లే అన్నాక కథకో స్ట్రక్చర్, బలమైన కాన్ఫ్లిక్ట్, గోల్ వుండాలిగా? ఏదో కథ ఎలాగో చుట్టేస్తే సినిమా అయిపోతుందా?

—సికిందర్
 

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

1203 : బర్త్ డే స్పెషల్


        నేటితో 54 ఏళ్ళు పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు. సినిమాల్లో హిట్ ఫ్లాపుల్లాగే రాజకీయాల్లో జయాప జయాలెదుర్కొన్నారు. స్థాపించిన జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయినా రాజకీయాల నుంచి తప్పుకోలేదు. సినిమాలు ఫ్లాపయినా సినిమాల నుంచి తప్పుకోలేదు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1996 లో 28 ఏళ్ళ లేత కుర్రాడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో ప్రారంభించిన సినిమా జీవితం, నేటికి 26 ఏళ్ళు పూర్తి చేసుకోగా, 2008 లో 40 ఏళ్ళ వయసులో ప్రారంభించిన రాజకీయ జీవితం, 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 14 ఏళ్ళుగా ఎవరేమనుకున్నా అక్కడ సినిమాలు - ఇక్కడ రాజకీయాలు అన్నట్టు రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తున్నారు.

        ఇంతా చేసి పవన్ కళ్యాణ్ నటించింది 27 సినిమాలే. గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వాటిలో ప్రధానమైనవి. ఇప్పుడు తాజా అప్డేట్ ఏమిటంటే పవన్ నటించిన ఈ బ్లాక్ బస్టర్స్ ని ఇప్పుడు రీరిలీజ్ చేసినా థియేటర్లు పగిలిపోతాయి. దీనికుదాహరణ సెప్టెంబర్ 2 న పుట్టిన రోజుని పురస్కరించుకుని నిర్మాతలు ఆగస్టు 31 న తమ్ముడు ని రీరిలీజ్ చేశారు. ఈ ప్రకటన చేసిన కాస్సేపటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులకి,  సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివచ్చారు. వెంటనే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శన మిచ్చాయి. థియేటర్లు క్రిక్కిరిసిపోయి, బొమ్మపడేసరికి తెరమీద ఆనాటి యువ పవన్ ని చూసి ఒకటే కేరింతలు, పూనకాలు, డాన్సులు.   

తర్వాత సెప్టెంబర్ 1 న  నిర్మాతలు జల్సా ని రీరిలీజ్ చేస్తే, దీన్నీ విరగదీశారు. జల్సా ని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 501 షోలు వేశారు. అన్నీ హౌస్ ఫుల్స్. దీనికీ కేరింతలు, పూనకాలు, డాన్సులు. ప్రేక్షకులనుంచి ఇంత స్పందన రావడం చూసి సినిమా, రాజకీయ విశ్లేషకులే తెల్లబోయారు. పవర్ స్టార్ కి దీటుగా ఆడియన్స్ కూడా పవర్ చూపించారు. మరి ఎన్నికల్లో ఈ పవర్ ఏమైపోతుందో తెలీదు. ఓట్లు అనేసరికి ఎక్కడుంటారో జనం తెలీదు. మొన్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ర్యాలీలకి ఎక్కడికెళ్ళినా వీధులు పట్టనంత జనం బ్రహ్మరథం  పట్టారు. అమ్మలక్కలు హారతులు పట్టారు. తీరా ఎన్నికల్లో వేసింది 2 శాతం ఓట్లే!  

పవన్ నటుడు మాత్రమే కాదు. రైటర్, సింగర్, స్టంట్ కో ఆర్డినేటర్, ప్రొడ్యూసర్ కూడా. వీటన్నిటితో బాటు పొలిటీషియన్ కూడా. 2008 లో అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపిస్తే, పవన్ పార్టీ యువ విభాగం యువరాజ్యం ఏర్పాటు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీ సభ్యుడిగా వున్నప్పుడు ఎలాంటి పదవులు చేపట్టలేదు, ఎన్నికల్లో పోటీ చేయనూ లేదు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎన్నికల్లో విఫలమైన దరిమిలా  2011లో చిరంజీవి పార్టీని  కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో పైకి చెప్పుకోలేని అసంతృప్తితో వుండిపోయారు పవన్.

ఇక 2014లో తనే జనసేన పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రచురించిన పుస్తకం ఇజమ్  కూడా జనసేన పార్టీ ఐడియాలజీయే. రెండు తెలుగు రాష్ట్రాల్నిప్రభావితం చేస్తున్న సమస్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశమై మద్దతుని  ప్రకటించారు. 2014 లో ఎన్నికల్లో పోటీకి పార్టీని దింపకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగుదేశం - బిజెపి కూటమికి  ఉత్సాహంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో నినాదాలిచ్చారు. 2017 లో సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనేది తన ఉద్దేశమని ప్రకటించారు.

ఆయన రాజకీయ జీవితం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రధానంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి ఉదంతాన్ని లేవనెత్తి వార్తల్లో కొచ్చారు. 2019 ఎన్నికలకి సిద్ధమవుతూ ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్ళి సమస్యలు విన్నారు, ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఆందోళనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ వాటిలో ఒకటి. 2019 ఎన్నికల్లో ఆవిష్కరించిన మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్నీ  మెరుగుపరిచేందుకు అనేక పథకాలు ప్రకటించారు. ఇలా విజయ పంథాలో పార్టీని తీసికెళ్తూ, లభిస్తున్న అశేష ప్రజాదరణతో ఎన్నికల్లో 140 స్థానాల్లో అభ్యర్ధుల్ని పోటీకి దింపితే, తనూ రెండు స్థానాల్లో పోటీ చేస్తే, తనతో బాటూ అందరూ ఓడిపోయారు ఒకే ఒక్క రాజోలు అభ్యర్ధి తప్ప. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీని కూడా చిత్తుగా ఓడించి అధికారంలో కొచ్చేసింది.

అయినా పార్టీ ఎత్తేసి వెళ్ళిపోలేదు పవన్. అంత ఘోర పరాభవాన్ని చవి చూసినా, ఎవరేమనుకుంటారన్న పట్టింపు కూడా లేకుండా పార్టీని నడుపుతూనే వున్నారు. ప్రజాందోళనలు చేపడుతూనే వున్నారు. ఇంతటి పట్టుదల అటు తమిళనాడులో రాజనీకాంత్ కీ లేదు, కమలహాసన్ కీ లేదు. విజయ్ కాంత్ కి అసలే లేదు. దేశంలో రాజకీయ పార్టీ నడుపుతున్న ఏకైక సినిమా స్టార్ గా పవన్ కళ్యాణే వున్నారు.

పవర్ స్టార్ అని పిలవకండి, పవర్ లేదని చెప్తూ ఇక వచ్చే 2024 ఎన్నికలకీ పొత్తుల్లేకుండా పోటీ చేసేందుకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ ని అభిమానులకి గిఫ్ట్ గా విడుదల చేస్తున్నారు. 17 వ శతాబ్దపు మొఘల్ -కుతుబ్ షాహీల కాలం నాటి బందిపోటు అయిన వీర మల్లు, మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని తస్కరించే కథతో ఇది తెరకెక్కుతోంది. క్రిష్ దీని దర్శకుడు. ఏఎం రత్నం నిర్మాత. నిధీ అగర్వాల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర తారాగణం. ఇది 2023 మార్చిలో విడుదలవుతుంది.

ఇది సరే, పీరియడ్ సినిమాలు రాజకీయాలకి పని చెయ్యవు, ఇప్పటి కళ్ళ ముందున్న పీడనల మాటేమిటి? 2024 ఎన్నికలకి ఆయన సినిమా ఆయుధమేమిటి? ఎన్టీఆర్ లాగా ప్రజా సమస్యలతో ఓ బొబ్బిలి పులి లాంటి సంచలన సినిమాని దింపుతారా? 1983 లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి గతంలో నటించిన పౌరాణికాలతో బాటు, 1982 లో నటించిన బొబ్బిలిపులి కీలక పాత్ర పోషించాయి. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమాని ప్రారంభించినప్పుడు, ఆయన వాస్తవికతని, మాయాజాలాన్నీ తన భావజాలానికి అనుకూలంగా మార్చుకున్నాడు. వాస్తవికతని  పేదరికంతో, బ్రిటీష్ వలస వాదాన్ని పురాణాలతో భర్తీ చేశాడు. అది దేశానికొక ఎజెండాని నిర్దేశించింది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్ని చిత్రీకరించడంలో ఇంకో ముందడుగేశారు. ఒక పౌరాణికం తీయడం వెనుక రాజకీయ ఉద్దేశం వుండేది. ఎన్టీఆర్ రాజకీయాలకి అతీతంగా పౌరాణిక సినిమాల్ని తీసి వుంటే అవి ఫక్తు ఆధ్యాత్మిక సినిమాలుగానే మిగిలిపోయేవి.

పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా ఓట్ల కోసమే సినిమాలన్నట్టు సినిమాలు తీయకపోతే 2024 కోసం కష్టపడుతున్న ఈ అయిదేళ్ళూ కూడా  వృధా అవుతాయి. మీడియా చేతిలో లేని తనకి సినిమాలే ప్రచారాస్త్రాలు. మూస రాజకీయాల మత్తులో వున్న ఓటర్లని కొత్త రాజకీయ చైతన్యం వైపు నడిపించినప్పుడే పవర్ స్టార్ అని పిలవకండి, పవర్ లేదని మళ్ళీ చెప్పుకునే అగత్యం తప్పుతుంది.

***