రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జనవరి 2023, శుక్రవారం

 దేశ విదేశ పాఠకులందరికీ...


1282 : రివ్యూ!

రచన -దర్శకత్వం : కె. బాబీ 
తారాగణం : చిరంజీవి, రవితేజ, శృతీ హాసన్, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ బాబీ సింహా, నార్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్,ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ. విల్సన్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
విడుదల : జనవరి 13, 2023
***

        సంక్రాంతికి నేటితో ముగ్గురు హీరోలు మూడు సినిమాలతో వచ్చినా నిజానికి నల్గురు హీరోల సినిమాలుగా లెక్కించాలి. వాల్తేరు వీరయ్య తో చిరంజీవితో బాటు రవితేజ రావడం వల్ల. రేపు వారసుడు తో ఇంకో హీరో విజయ్ కూడా వస్తే, మొత్తం కలిపి నాల్గు టికెట్లతో ఐదుగురు హీరోలని చూసే అవకాశం పండగ ప్రేక్షకులకి కలుగుతోంది. ఆనందం ఎంత అనుభవించారనేది వేరే విషయం. హీరోయిన్ విషయంలో ఎక్స్ ట్రా బెనిఫిట్ లేదు. వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య రెండూ ఒకే బ్యానర్ సినిమాలు కావడంతో కాంట్రాక్టు మాట్లాడుకుని నటించినట్టు, రెండిట్లో శృతీ హాసనే కనిపించడంతో ఏ సినిమా చూస్తున్నామనే కన్ఫ్యూజన్ కూడా ఏర్పడొచ్చు.

        చిరంజీవి, రవితేజల కాంబోలో వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ అంటూ, వింటేజ్ చిరంజీవి అంటూ చాలా మాస్ మేనియా క్రియేట్ అయింది. చిరంజీవి ఆచార్య’, గాడ్ ఫాదర్ అనుభవాలతో రూటుమార్చి పాత చిరంజీవిని రీబూట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. దీని మీద ఆసక్తితో వున్న ప్రేక్షకులకి ఇదెలా వుంటుందో చూద్దాం...

కథ
వైజాగ్ పోర్టులో ఐస్ ఫ్యాక్టరీ నడిపే వీరయ్య (చిరంజీవి) సముద్రం మీద పట్టు వున్నవాడు. నేవీ సిబ్బంది ఇబ్బందిలో పడ్డా కాపాడగల ధైర్యసాహసాలు వున్నవాడు. ఒకసారి రా విభాగం అధికారులు కరుడుగట్టిన డ్రగ్ మాఫియా సాల్మన్ సీజర్ (బాబీ సింహా) ని తీసుకొస్తున్న విమానం కూలిపోతే అతడ్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో వుంచుతారు. ఆ పోలీస్ స్టేషన్ మీద సాల్మన్ గ్యాంగ్ దాడి చేసి విడిపించుకు పోవడంతో, సీఐ సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఇతను వీరయ్యని బేరమాడుకుని మలేషియా పారిపోయిన సాల్మన్ ని పట్టుకు వచ్చేందుకు వీరయ్యతో బయల్దేరతాడు.     
        
మలేషియాలో సాల్మన్ ని పట్టుకునే ప్రయత్నంలో వీరయ్యకి అతిధి (శృతీ హాసన్) పరిచయమవుతుంది. ఈమె రా కమాండోగా వుంటుంది. వీరయ్య సాల్మన్ ని పట్టుకుని చంపేయడంతో అజ్ఞాతంలో వున్న అతడి అన్న కాలా (ప్రకాష్ రాజ్) బయటికొస్తాడు. వీరయ్యకి కావాల్సింది ఇతనే. ఇతడి మీద పగదీర్చుకోవడం మొదలెడతాడు.
        
ఏమిటా పగ? గతంలో వీరయ్యకీ, ఏసీపీ విక్రమ్ (రవితేజ) కీ వున్న సంబంధమేమిటి? డాక్టర్ శాలిని (కేథరిన్ ట్రెసా) ఎవరు? విక్రమ్ ఏమయ్యాడు? గతంలో వీరయ్యతో కలిసి వ్యాపారం చేసిన కాలా చేసిన ద్రోహమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

నిజానికి ఇద్దరు స్టార్ల బాండింగ్ గురించి వున్న ఇలాటి కథ సింపుల్ గా చెప్తేనే బలంగా, హత్తుకునేలా చెప్పడానికి అవకాశముంటుంది. ఆస్కార్ విన్నర్ దేర్ విల్ బి బ్లడ్ (2007)  లో డానియేల్ డే లేవీస్ దగ్గరికి, అతడి సవతి తమ్ముడ్నని చెప్పుకుని వచ్చే కెవిన్ ఓ కానర్ ల మధ్య బ్రదర్ హుడ్ బాండింగ్ ఎంత అందంగా వుంటుంది. ఆ దృశ్యాల్ని మర్చిపోలేం. ఇది ఇద్దరు బిగ్ స్టార్స్ చిరంజీవి - రవితేజల మధ్య మిస్సయ్యింది.         

ఎంతసేపూ చుట్టూ బోలెడు క్రౌడ్ మధ్య రిలీఫ్ లేని అవే వూర మాస్ కామెడీలు, విలన్లతో పోరాటాలు, సవాళ్ళు ఎదురు సవాళ్లూ, కాల్పులూ నరికివేతలూ ఇవే సరిపోయాయి. ఓ అరగంట వాళ్ళిద్దరిని ప్రైవేటుగా, వొంటరిగా వదిలేసి- వాళ్ళ బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసే సరదాలు, సముద్రం మీద షికార్లు, హాబీలు, హత్తుకునే, కళ్ళు చెమర్చే సన్నివేశాలూ  వంటి సెంటిమెంటల్ బ్యాక్ డ్రాప్ లేకపోవడంతో - ఈ ఫ్లాష్ బ్యాక్ మీదే ఆధారపడ్డ మొత్తం కథ ఎలాటి ఫీల్, ఎమోషన్స్, పాతోస్ లేని ఉత్త హోరులా మారింది.
        
మాస్ పాత్రలతో చిరంజీవి స్కిల్స్ గురించి ఆల్రెడీ తెలుసు. కనీసం ఫ్లాష్ బ్యాక్ లోనైనా ఛేంజోవరిస్తూ కాస్త సింపుల్ గా, హూందాగా, సున్నిత హాస్యంతో మార్పు చూపించాలని ప్రయత్నం చేయలేదు. మూడు గంటలసేపూ ఒకే క్యారక్టరైజేషన్ తో, ఒకే టైపు వూర మాస్ యాక్టింగ్ తో చాలా ఓవరాక్షన్ చేశారు. అంత అవసరం లేదు. దీనికి అల్లు అర్జున్ చాలు.
        
కథ, స్క్రీన్ ప్లే నాటుగా లౌడ్ గా వున్నాయి. రొటీన్ మూస ఫార్ములా కథని చాలా హడావిడి చేస్తూ వయొలెన్స్ తో నింపేశారు. చిరంజీవి మలేషియా వెళ్ళడంలో వున్న అసలు ఉద్దేశం ప్రకాష్ రాజ్ ని పట్టుకోవడమైతే, ఇంటర్వెల్లో దీని ఇంపాక్ట్ లేకుండా మలేషియా ఎపిసోడ్ అంతా మాస్ కామెడీ, పట్టుకునేందుకు అదేపనిగా చేసే ప్రయత్నాలతో మొనాటానీని నింపేశారు. ఈ పట్టుకునే ప్రయత్నాల్ని కుదించి ప్రధానంగా హీరోయిన్ తో, అక్కడున్న ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కేథరిన్ తో, కథలో సస్పెన్స్ ని పెంచే ప్రయత్నం చేయలేదు. కథ కంటే వింటేజ్ చిరంజీవిని చూపించే ఏకధాటి సీన్లతో నింపేశారు. ఇంత చేసినా పూనకాలు లోడింగ్ కాలేదు. ఫ్యాన్స్ కి మాత్రమే ఈ సినిమా పూనకాలు.
        
సెకండాఫ్ లో రవితేజతో ఫ్లాష్ బ్యాక్ పైన చెప్పుకున్న కారణాలతో కృతకంగా మిగిలింది. చిన్నా చితకా సినిమాలెలాగూ అలాగే వుంటాయి- 140 కోట్లతో తీసే పెద్ద సిని మా అయినా విషయ పరంగా క్వాలిటీతో లేకపోతే ఎలా? ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక వూహించేదే జరుగుతుంది - ప్రకాష్ రాజ్ మీద చిరంజీవి పగదీర్చుకునే క్లయిమాక్స్. ఈ క్లయిమాక్స్  యాక్షన్ బీభత్సంగా కొనసాగుతూనే వుంటుంది- ముగింపు అనేది లేనట్టు.
        
మొత్తం మీద ఎలాగైనా హిట్ కొట్టాలని చిరంజీవిని రీబూట్ చేయడం కాదు, ఓవర్ లోడింగ్ చేశారు. పండగ రోజుల్లో ఓవర్ లోడింగ్ ఈజీగా క్యారీ అయిపోతుంది. 

నటనలు- సాంకేతికాలు

యంగ్ చిరంజీవి మళ్ళీ తెరపైకొస్తూ మాస్ యాక్టింగే ఎలివేటయ్యేలా చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఎన్ని కోణాల్లో ఎన్ని విధాలుగా చిరంజీవిని హైలైట్ చేయాలన్న దానిమీదే దృష్టి పెట్టి దర్శకుడు బాబీ కూడా కృషి చేశాడు. ప్రారంభంలో రాత్రిపూట సముద్రంలో పడవల మీద యాక్షన్ సీను నుంచీ, ఇంటర్వెల్లో యాక్షన్ సీను వరకూ పడ్డ కష్టం ఫలించింది. అయితే యాంగ్రీ యంగ్ మాన్ ఎమోషన్స్ మాత్రం కథని  మరుగున పడేయడం వల్ల ఉత్పన్నం కాలేదు. అలాటి క్లోజప్స్ కూడా లేవు. ఇది పెద్ద లోపం.      
        
రోమాంటిక్ యాంగిల్ కూడా బలి అయ్యింది బోలెడు వయోలెంట్ యాక్షన్, వూర కామెడీలతో.  బాస్ పార్టీ పాట, రవితేజతో పూనకాలు లోడింగ్ పాట చిరంజీవిలోని డాన్సర్ ని మరోసారి బయటపెట్టాయి. అయితే చిరంజీవి నటనతో గుర్తుండిపోయే ఒక్క సీను కనీసం వుండాల్సింది. సీను లేకపోయినా ఒక్క క్లోజప్ వుండాల్సింది. సెన్సిబిలిటీస్ ని ఆయన పట్టించుకోలేదు.
        
ఇక రవితేజ పోలీసు పాత్ర, నటన, పాత్ర ముగింపు ఆయన స్టైల్లో వున్నాయి. చిరంజీవితో బాండింగ్ లేకపోవడం వల్ల పాత్ర ఉపరితలంలోనే వుండిపోయింది. యాక్షన్ సీన్లో మేక పిల్లని కాపాడే మానవీయ హృదయం రవితేజ పాత్ర పట్ల కూడా వుండాల్సింది దర్శకుడికి. కనీసం ఆ మేకపిల్ల పాత్ర ముగింపు దగ్గరైనా రోదించాల్సింది. ఎందుకంటే రవితేజ పాత్ర గురించి దానికే తెలుసు. ఈ బాండింగ్ కూడా లేకపోతే ఎలా?
        
శృతీ హాసన్ కమాండోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. డాక్టర్ గా కేథరిన్ ట్రెసాకి మూడు నాల్గు సీన్ల కంటే లేవు. ప్రకాష్ రాజ్ విలనీకి సరైన బేస్ లేదు. బాబీ సింహాది అతడి మార్కు విలనీ. అసలు చెప్పుకోవాల్సిన పాత విలన్ ప్రదీప్ రావత్ వున్నాడు. ఈయన చిరంజీవి కమెడియన్ నేస్తాలు శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ లతో ఒకడిగా వుంటూ ప్రతీ సీనులో బ్యాక్ గ్రౌండ్ లో ఇబ్బంది ఫీలవుతూ, డైలాగుల్లేకుండా బలహీనంగా నవ్వడం, చిరంజీవి వైపు చూడడం చేస్తూంటాడు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలీదు.     
        
దేవీశ్రీ ప్రసాద్ పైన చెప్పుకున్న రెండు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. విల్సన్ ఛాయాగ్రహణం బావుంది. ఎడిటర్ ఆ క్లయిమాక్స్ ని బాగా ఎడిట్ చేసి వుండాల్సింది. పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ లు యాక్షన్ కొరియోగ్రఫీతో కొత్తగా ఏమీ చూపించలేదు. ప్రారంభంలో సముద్రం మీద యాక్షన్ సీను గ్రాఫిక్స్ ఇంకా ఉన్నతంగా వుండాలి.

        
చివరిగా, దర్శకుడు బాబీ చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపించి అభిమానుల్ని అలరించాడు. అభిమానులకి ఇంతకంటే అవసరం లేదు. చిరంజీవిని ఇలా చూడడమే భాగ్యం.
——సికిందర్


12, జనవరి 2023, గురువారం

1281 : రివ్యూ!


రచన -దర్శకత్వం : గోపీచంద్ మలినేని
తారాగణం: బాలకృష్ణ, శృతీ హాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, హనీ రోజ్, మురళీ శర్మ, నవీన్ చంద్ర, దునియా విజయ్, సప్తగిరి తదితరులు 
మాటలు : సాయి మాధవ్ బుర్రా, సంగీతం :  థమన్, ఛాయాగ్రహణం : రిషీ పంజాబీ, కళ : ఏఎస్ ప్రకాష్, పోరాటాలు :  రామ్-లక్ష్మణ్, వెంకట్
బ్యానర్‌ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
విడుదల : జనవరి 12, 2023
***
        2021 లో అఖండ ఘన విజయం తర్వాత తిరిగి ద్విపాత్రాభినయం చేస్తూ బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సంక్రాంతి రెండో సినిమాగా ఈ రోజు విడుదలైంది. సంక్రాంతి హీరోగా పేరున్న బాలకృష్ణ మరో మూడు సంక్రాంతి సినిమాలతో పోటీ పడుతున్నారు. రెండు డబ్బింగ్ సినిమాలు (అజిత్ తెగింపు’, విజయ్ వారసుడు) లతో బాటు, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య’. ఇది రేపు విడుదలవుతోంది. ఈ రెండూ ఒకే బ్యానర్ మైత్రీ మూవీస్ నిర్మించినవే. ఐదేళ్ళ తర్వాత తిరిగి సంక్రాంతికి చిరంజీవితో పోటీ పడుతున్న బాలకృష్ణ రేసులో విజేత అవడం గురించి కుతూహలమేర్పడింది. కనుక ఈ రోజు బాలకృష్ణ సినిమా చూసి, రేపు చిరంజీవి సినిమా కూడా చూశాక తీర్పు ప్రకటిస్తారు ప్రేక్షకులు. ప్రస్తుతానికి బాలకృష్ణ సినిమా ఎలా వుందీ, మరో అఖండ గా అన్పించుకుందా లేదా ఓ లుక్కేసి తెలుసుకుందాం...

కథ

రాయలసీమలోని పులిచర్లలో వీరసింహా రెడ్డి (బాలకృష్ణ) ప్రజలకు దేవుడు. పగవాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడుతూంటాడు. అతడి చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) భర్త ముసలి మడుగు ప్రతాప రెడ్డి (దునియా విజయ్) ని అన్నని చంపమని ఉసిగొల్పుతూ వుంటుంది. అతను చంపే ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ వుంటాడు. అటు ఇస్తాంబుల్ లో రాయలసీమ రెస్టారెంట్ నడిపే మీనాక్షి (హనీ రోజ్) కి జయసింహా రెడ్డి (బాలకృష్ణ-2) కొడుకు. ఇతను కొన్ని సంఘటనల క్రమంలో ఈషా (శృతీ హాసన్) తో ప్రేమలో పడతాడు. వీళ్ళ పెళ్ళికి ఈషా తండ్రి (మురళీ శర్మ) అంగీకరించి జయసింహా రెడ్డి తల్లిదండ్రులతో మాట్లాడతానంటాడు. దీంతో మీనాక్షి జయసింహారెడ్డి కి తండ్రి గురించి చెప్పుకొస్తుంది. ఆతర్వాత వీరసింహారెడ్డి ఇక్కడే కొడుకు పెళ్ళి జరిపిద్దామని ఇస్తాంబుల్ వస్తాడు. ఇప్పుడు వీరసింహా రెడ్డి ఇస్తాంబుల్ లో ఒంటరిగా దొరుకుతాడని పథకం వేసి, భానుమతి భర్త ప్రతాప రెడ్డితో వస్తుంది. ఇద్దరూ కలిసి ఒంటరిగా దొరికిన వీరసింహా రెడ్డిని పొడిచి చంపేస్తారు.

అన్న మీద చెల్లెలు అంత పగబట్టడానికి కారణమేమిటి
? అసలు వీరసింహా రెడ్డి కుటుంబ కథ ఏమిటి? అతడ్ని ప్రేమించిన మరదలు మీనాక్షి పెళ్ళి లేకుండా కొడుకుని కని ఇస్తాంబుల్ లో ఎందుకు వుంటోంది? ఇప్పుడు తండ్రిని చంపిన మేనత్త భానుమతిని, మేన మామ ప్రతాప రెడ్డినీ జయసింహా రెడ్డి ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

     బాలకృష్ణ చాలాసార్లు నటించినలాంటి కథే. రాయలసీమ ఫ్యాక్షన్ తో బాటు కుటుంబ కక్షల కథ. అఖండ కథ బాలకృష్ణ సీనియర్ పాత్ర స్పిరిచ్యువల్ కోణంతో నెక్స్ట్ లెవెల్లో అద్భుతాలు చేసింది. అలాటి అపూర్వపాత్ర ఈసారి బాలకృష్ణ సెలెక్టు చేసుకోలేదు. రేంజి తగ్గించుకుని రెండు రొటీన్ పాత్రల కథ చేశారు. ఫ్యాక్షన్ కథలు అవే పగలతో వుంటాయని సరిపెట్టుకున్నా, కుటుంబ కథతో సినిమా విజయం ఎంతవరకుంటుందనేది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వుంటుంది.  కుటుంబ కథే ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కుటుంబ కథలో చెల్లెలి పాత్ర పగతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి వుంటుంది.

ఫస్టాఫ్ కథలో చెల్లెలు ఎందుకు పగబట్టిందనేది రివీల్ కాదు. ఆమె సవతి చెల్లెలు అని కూడా ఫస్టాఫ్ లో రివీల్ కాదు. సొంత చెల్లెలే అనుకుంటాం. దీంతో సొంత చెల్లెలు అన్నని పొడిచి చంపే ఇంటర్వెల్ సీను మాత్రం ఏ విధంగా చూసినా జస్టిఫై కాదు. బాక్సాఫీసు సెంటిమెంట్స్ కి వ్యతిరేకంగా వుంటుందిది. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో సవతి చెల్లెలని తెలుస్తుంది. సవతి చెల్లెలైనా అన్న మీద పగతో వుండొచ్చు
, చంపడమేమిటి? చివరికి తన కథ అలా ముగించుకోవడమేమిటి? దీన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేదాన్ని బట్టి వుంటుంది.

అన్న పాత్ర కూడా అలాగే వుంది. చెల్లెలితో నిశ్చితార్ధం జరిగిన వాణ్ణి తప్పు చేశాడని చెల్లెలి ముందే తన్ని అవమానిస్తే అతను ఉరేసుకున్నాడు. అంతగా అయితే అతణ్ణి గ్రామం నుంచి బహిష్కరించ వచ్చు. అతను ఉరేసుకోవడంతో అన్నని చంపెయ్యాలని కక్షగట్టి అన్న ప్రత్యర్ధిని పెళ్ళి చేసుకుంది. తన పెద్దరికం కాదు, ఇక్కడ చూడాల్సింది చెల్లెలి నిర్ణయాన్ని. అతను ఆమె కాబోయే భర్త. తప్పు చేసిన అతడితో ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని ఆమెకే వదిలేయడం న్యాయం, పెద్దరికం. అన్నాచెల్లెళ్ళ కథ కన్విన్సింగ్ గా లేకపోవడంతో  సెకండాఫ్ మరీ దెబ్బతింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఒకసారి
పెదరాయుడు చూసి వుంటే ఉచితానుచితాలు తెలిసేవి. ఫ్యాక్షన్ కథలు రాక్షసంగా వుండొచ్చు, కుటుంబ కథలు కాదు. మాఫియా సినిమాల్లో మాఫియాలు కుటుంబాల్ని ప్రేమిస్తారు>

పోతే కథలో భావోద్వేగాల్లేవు. ఫస్టాఫ్ లో వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలను
కుంటున్నారో చెప్పక పోవడంతో, కథ తెలియక పోవడంతో  వీర సింహారెడ్డి చేసే పోరాటాల్లో భావోద్వేగాలుండవు. సెకండాఫ్ లో చెల్లెలి కథ తెలిశాక దాంతో కూడా భావోద్వేగాలు పుట్టించలేక పోయారు. ఆమె ఎంత పగతో రగిలిపోయినా ఆ భావోద్వేగాలు కనెక్ట్ కావు. ఇక కొడుకు పాత్రతో భావోద్వేగాల సమస్యే లేదు. ఎందుకంటే తండ్రి చనిపోయిన నేపథ్యంలో సమస్యని ఎలా పరిష్కరించాలో గోల్ అతడికి లేదు. లేకపోతే మేనత్త తన కథ అలా ముగించుకోదు. మొత్తంగా ఏ ఎమోషనూ పలకని పొడిపొడి సినిమాలాగా సాగిపోతుంది.

నటనలు - సాంకేతికాలు

      బాలకృష్ణ సీనియర్ పాత్ర చాలాసార్లు చేసి వున్నదే. కాకపోతే కొత్త ఎనర్జీ నింపుకుని చేయడంతో సన్నివేశాలు పేలాయి. కొన్ని డైలాగులు కూడా పేల్చారు- సవాలు చేయకు, శ వాలు విసురుతా; మగతనం గురించి నువ్వు చెప్పకు, మొలతాళ్ళు నవ్వుతాయ్; ప్రజలు ఎంచుకున్న వెధవలు వాళ్ళు, గౌరవించాలి- వంటి డైలాగులు. కొన్ని రాజకీయ డైలాగులు కూడా ఎడాపెడా విసిరారు. యాక్షన్ సీన్స్ విజృంభించి చేశారుగానీ, అవేమీ ఆయన ఎలివేషన్స్ ని పెంచలేదు అఖండ లో లాగా. రామ్ లక్ష్మణ్, విజయ్ సమకూర్చిన పోరాటాలు రొటీన్ గానే వున్నాయి. అన్నీ ఒకలాగే అనిపిస్తాయి కూడా. అయితే ఎన్ని ఫైట్లు చేసినా కథలోంచి ఎమోషన్స్ పుట్టక పోవడంతో బాలకృష్ణ పడ్డ శ్రమ గిట్టుబాటు కాలేదు. సాంగ్స్ లో మాత్రం ఫుల్ మాస్ మసాలా దట్టించారు. ఫైట్స్ లో కంటే సాంగ్స్ లో చేసిన విన్యాసాలు ఫ్యాన్స్ ని శివాలెత్తిస్తాయి. ఎంతైనా బాలయ్య మాస్ హీరో. టైటిల్ కింద ట్యాగ్ లైన్ -గాడ్ ఆఫ్ మాసెస్ - కి నిలువెత్తు నిదర్శనం.  

జ్యూనియర్ పాత్రలో బాలకృష్ణ ఇస్తాంబుల్ దృశ్యాలు ఎంటర్ టైన్ చేస్తాయి సిల్లీ పాత్ర వేసిన శృతీ హాసన్ తో. శృతీ హాసన్ ఫస్టాఫ్ లో కొన్ని సీన్ల వరకే. సెకండాఫ్ లో దాదాపు గంటపాటు ఫ్లాష్ బ్యాకే వుండడంతో
, దాంతర్వాత క్లయిమాక్స్ సాంగ్ లో కన్పిస్తుంది- సిల్లీ డైలాగు కొట్టి.

మలయాళ నటి హనీరోజ్ బాలకృష్ణ తల్లి పాత్రలో
,ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ మరదలి పాత్రలో ఆకర్షిస్తుంది. సున్నితంగా నటిస్తుంది. కన్నడ విలన్ దునియా విజయ్ భీకర రూపంతో బాలకృష్ణకి తగ్గ బిల్డప్ ఇస్తాడు. అయితే చివరికి జోకర్ లా మారిపోతుందీ విలన్ పాత్ర. 

చెల్లెలి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక హైలైట్. ఆమె క్రూడ్ విలనిజాన్ని నిలబెట్టడానికి చేసిన కృషి
, నటన గుర్తుండి పోతాయి. అయితే ఆ చెల్లెలి పాత్ర భావోద్వేగాలకే జస్టిఫికేషన్ లేదు.

తమన్ పాటలు ఇదివరకే హిట్టయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బలంగా ఇచ్చాడు. మ్యూజికల్ గా సినిమాకి లోతు లేకుండా చూసుకున్నాడు. అలాగే రిషీ పంజాబీ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది. ఫ్యాక్షన్ సీన్స్ కూడా లోకీ- డార్క్ సీన్లు తీయకుండా కలర్ఫుల్ గా తీశాడు. ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. చాలావరకూ సాయి మాధవ్  బుర్రా డైలాగులు బావున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వేగం వుంది. సెకండాఫ్ గంట పాటు ఫ్లాష్ బ్యాక్ మాత్రం 1980 ల నాటి సినిమాలని గుర్తుకు తెస్తుంది.
—సికిందర్

 

11, జనవరి 2023, బుధవారం

1290 : రివ్యూ!

రచన- దర్శకత్వం : హెచ్. వినోద్
తారాగణం : అజిత్ కుమార్, మంజూ వారియర్, సముద్రకని, పావనీ రెడ్డి, అజయ్, జాన్ కొక్కేన్ తదితరులు
సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : నీరవ్ షా
బ్యానర్స్ :  బేవ్యూ ప్రాజెక్ట్స్ LLP, జీ స్టూడియోస్
నిర్మాత : బోనీ కపూర్
విడుదల : జనవరి 11, 2023
***

మిళ స్టార్ అజిత్ కుమార్- దర్శకుడు హెచ్. వినోద్- బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడో సినిమా ఇది. 2019 లో నేర్కొండ పర్వై (హిందీ పింక్ రీమేక్), 2022 లో వాలిమై (తెలుగులో వాలిమై’) తర్వాత వెంటనే సంక్రాంతి కానుకగా ఇప్పుడు తునీవు (తెలుగులో తెగింపు) విడుదలైంది. మొదటిది అమితాబ్ బచ్చన్ తో హిట్టయిన హిందీ రీమేక్ కాబట్టి ఫర్వాలేదన్పించుకుంది. రెండోది దర్శకుడు వినోద్ టాలెంట్ కి పరీక్ష పెట్టింది. ఈ హై రేంజి యాక్షన్ పరీక్షలో నెగ్గి 80 కోట్లు లాభాలార్జించి పెట్టాడు. 

దే ఊపులో ఈ ముగ్గురి కాంబినేషన్లో తెగింపు  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో ఏకైక స్టార్ గా వయసు దాచుకోకుండా ఫ్యాన్స్ కి అంతే జోష్ పెంచుతున్న అజిత్, మునుపటి హిట్స్ రేంజిలోనే తెగింపు నిచ్చాడా, ట్రైలర్స్ లో తెలిసిపోయిన పాత్రకి, కథకి మించి సినిమాలో ఇంకేమైనా ఎలివేషన్స్ ఛూపించాడా తెలుసుకుందాం...

కథ  

డార్క్ డెవిల్ అలియాస్ చీఫ్ అలియాస్ మైకేల్ జాక్సన్ (అజిత్) ఒక కాంట్రాక్టు దొంగ. అతడి టీములో రమణి (మంజు వారియర్) తో బాటు మరో ముగ్గురు సభ్యులు (అమీర్, పావనీ రెడ్డి, సిబి) వుంటారు. వీళ్ళు అత్యుత్తమ టెక్నాలజీనీ, ఆయుధాలనీ ఉపయోగించి హైటెక్ దోపిడీలు చేస్తారని పేరుంటుంది. ఇలా వుండగా, వేరే దొంగలు పట్టపగలు యువర్ బ్యాంక్ మీద దాడి చేసి దోచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అక్కడే వున్న డేర్ డెవిల్ ని చూసి షాక్ అవుతారు. ఈ కౌంటర్ దోపిడీలో డేర్ డెవిల్ ఆ గ్యాంగ్ ని చంపేసి, 500 కోట్లు దక్కించుకుని పారిపోవడానికి పోలీసులకి కొన్ని డిమాండ్లు  లు పెడతాడు. కమీషనర్ దయా (సముద్ర కని), ఏసీపీ రామచంద్ర (అజయ్) రంగంలోకి దిగి డేర్ డెవిల్ ఆపరేషన్ ని విఫలం చేయడానికి పూనుకుంటారు. బ్యాంక్ ఛైర్మన్ క్రిష్ (జాన్ కొక్కేన్) కూడా వచ్చేస్తాడు.

ఇప్పుడు మారు పేర్లతో వున్న అజిత్ ఎవరు? బ్యాంకు దోపిడీకి ఎందుకు పాల్పడ్డాడు? అతడికీ బ్యాంకు ఛైర్మన్ కీ వున్న సంబంధమేమిటి? దోచుకోవాలనుకున్నది 500 కోట్లేనా, ఇంకా ఎక్కువా? అసలు ఈ ఉదంతం ఏ ఉన్నతాశయం కోసం జరిగింది? ఇవి తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాలి.

ఎలా వుంది కథ

హాస్టేజ్ డ్రామా జానర్ కి చెందిన కథ. ఇదే జానర్ లో గత సంవత్సరం విజయ్ (14 న వారసుడు గా రాబోతున్నాడు) నటించిన బీస్ట్ విడుదలైంది. కాకపోతే ఇది టెర్రరిజం కథ. అయితే తెగింపు’, బీస్ట్ రెండూ పూర్తిగా ఒకే భవనంలో జరిగే హాస్టేజ్ డ్రామాలు. పూర్తిగా ఇండోర్స్ లోనే జరిగే కథ వల్ల ఈ స్టార్స్ ఇద్దరూ ఒకే కాస్ట్యూమ్ లో కట్టేసినట్టయి, రీలీఫ్ లేని ఇండోర్ యాక్షన్లు చేశారు. బీస్ట్ ఫ్లాపయ్యింది. ఇప్పుడు తెగింపు దీ ఇదే పరిస్థితి.
        
బ్యాంకులు చేసే మోసాల గురించి చెప్పాలనుకున్నారు. అయితే ఇది మూసలో పాత కథే అయింది. ఫైనాన్స్, చిట్ ఫండ్స్, ప్రైవేట్ బ్యాంకులు సామాన్య ప్రజల డిపాజిట్లతో చేసే మోసాల గురించి, సామాన్యుల దీనాలాపాల గురించీ ఎన్నో సినిమాలొచ్చాయి. ఇదే అరిగిపోయిన పాత కథ తెగింపు లో చూపించారు తప్పితే, కాస్త తెగించి సమకాలీన కథ చెప్పలేకపోయారు.
        
వ్యాపారాల కోసం, పరిశ్రమల కోసం, వందలు, వేల కోట్లలో తీసుకుంటున్న రుణాలని కట్టలేమని చేతులెత్తేస్తే బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి. ఎగవేతదార్లు భవనాలు కట్టుకుని, ఖరీదైన కార్లలో దర్జాగా తిరుగుతున్నారు. ఈ విధంగా గత ఆరేళ్ళల్లో 11 లక్షల కోట్లు రైటాఫ్ చేశాయి బ్యాంకులు. ఇది ప్రజల సొమ్మే. దీన్ని ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇది అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్రే. ఈ బిగ్గెస్ట్ ఫ్రాడ్ వదిలేసి ఏ నాటిదో పాత కురచ కథ అజిత్ లాంటి బిగ్ స్టార్ ని అంటగట్టి, భారీ బడ్జెట్లు వెచ్చించి, పిట్ట కొంచెం కూత ఘనం చేశారు. దీనికి తెగింపు అవసరం లేదు.
        
ఫస్టాఫ్ బ్యాంకు లోపలే దోపిడీ, కాల్పులు, రెండు ముఠాల పోరాటాలూ ఇవే జరుగుతాయి. ఇంటర్వెల్లో ఇంకో విలన్ వచ్చి అజిత్ ని లొంగదీసుకుంటాడు. ఫస్టాఫ్ మొత్తం బ్యాంకులో కోట్ల రూపాయల ఖర్చుతో, నిమిషం వదలకుండా కాల్పులూ పేలుళ్ళతో కూడిన యాక్షన్ సీన్స్ రిలీఫ్ లేకుండా సాగుతాయి. సెట్స్ ని పేల్చి దగ్ధం చేయడానికి కోట్లాది రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేశారు.
        
సెకండాఫ్ లో అజిత్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇది ఏ మాత్రం అర్ధం గాదు, కాల్పులు మాత్రం మోత మోగుతాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అజిత్ ఎవరనేది కూడా చెప్పలేదు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత బ్యాంక్ ఛైర్మన్ ని అదుపులోకి తీసుకుని అసలు డ్రామా నడుపుతాడు. ఇక్కడే కారణం తెలుస్తుంది. అయితే సామాన్యులకి న్యాయం చేయడం కోసం తీసుకున్న నిర్ణయానికి కూడా ఎలాటి ఎమోషనల్ కనెక్ట్ వుండదు. పాత్రలో జీవం లేక కథలో జీవం లేదు. దీనికి ఉన్నతాశయమనే ఇంకో నిర్జీవ అలంకారం. అజిత్ లాంటి హైపర్ యాక్షన్ హీరోకి చాలని కాలగర్భంలో కలిసిన కథతో తీసిన అట్టహాసపు సినిమా ఇది.

నటనలు –సాంకేతికాలు

పేరు లేని, బ్యాక్ గ్రౌండ్ లేని పాత్రలో అజిత్ నటన- ప్రారంభం నుంచీ ముగింపు వరకూ ఒకే బ్యాంకు సెట్ లో- బోనులో వున్న పులి చందాన వుంటుంది. బోనులోంచి బయటపడి ఔట్ డోర్స్ లో హాయిగా హీరోయిన్ తో కాస్త సరసం, ఫారిన్ లొకేషన్స్ లో పాటలు, నేస్తాలతో నవ్విస్తూ అల్లరి కామెడీలూ, రిచ్ కాస్ట్యూమ్స్, కార్లు, బంగళాలూ, ఫైఫ్ స్టార్ పార్టీలూ చేసుకుని, విలన్స్ తో కనీసం వాలిమై లోలాగా హై ఒల్టేజీ ఔట్ డోర్ అడ్వెంచర్స్ చూసి కరువుదీరా ఎంజాయ్ చేయాలకునే ఫ్యాన్స్ పరిస్థితి వర్ణనాతీతంగా వుంటుంది. పొంగల్ నాడు దంగల్ లేని సినిమా దేనికని జుట్లు పీక్కుంటారు.
        
హీరోయిన్ మంజు వారియర్ డ్రై పాత్రకూడా అంతంత మాత్రం. ఇక సముద్రకని, అజయ్ లు రొటీనే. జాన్ కొక్కేన్ అజిత్ తగ్గ విలన్ గా ఫర్వాలేదు. జీబ్రాన్ సంగీతం చాలా లౌడ్ గా వుంటుంది. ఒక బ్యాక్ గ్రౌండ్ పాట, అజిత్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక మాస్ పాటా వున్నాయి. కెమెరా వర్క్, ఇతర ప్రొడక్షన్ విలువలు టాప్ రేంజిలో వున్నాయి. ఇది ప్రధానంగా యాక్షన్ డైరెక్టర్ల సినిమా. వాళ్ళకి పది సినిమాల పని ఒకే సినిమాలో లభించింది.
        
అసలు విషయమేమిటంటే, దర్శకుడు వినోద్ లోబడ్జెట్ సినిమా కోసం తయారు చేసుకున్న కథ అజిత్ కి ఒక సీను చెప్పాడు. అజిత్ కి ఆ సీను నచ్చి ఓకే చెప్పాడు. దాంతో ఆ కథని అజిత్ రేంజికి పెంచాడు. ఇది దర్శకుడు వినోద్ స్వయంగా చెప్పిన విషయం. అయితే ఏం పెంచాడు? యాక్షన్ తో హంగామా చేస్తే లో బడ్జెట్ కథ హై బడ్జెట్ కథ అయిపోతుందా? అడుగు బొడుగు జీవుల్ని మోసం చేసే బ్యాంకు కథ కాబట్టే లోబడ్జెట్ కి తయారు చేసుకున్నాడు. ఇంతవరకైతే ఇది న్యాయమే,  మిగతా చేసుకున్నదంతా బరితెగింపు.  

—సికిందర్   
 

9, జనవరి 2023, సోమవారం

1288 : రివ్యూ!


 

          నవరి వచ్చిందంటే హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్) ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ 'మై నేషన్' పేరుతో ప్రత్యేక స్టాల్‌ ని ఏర్పాటు చేస్తుంది. ఈ స్టాల్ వినియోగదారుల్ని అమితంగా ఆకర్షిస్తూంటుంది. ఈ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ విక్రయించే ఉత్పత్తులన్నీ తెలంగాణ జైళ్ళ లోని ఖైదీలు ఉత్పత్తి చేసినవి అయివుంటాయి. ఫర్నిచర్, బెడ్‌షీట్లు, బేకరీ వస్తువులు, సబ్బులు, ఉన్నివస్త్రాలూ సహా అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరుతాయి.

         ఉత్పత్తులకి చాలా డిమాండ్‌ వుంటుందనేది తెలిసిన విషయమే. నాణ్యత విషయంలో మార్కెట్‌లో లభించే అత్యుత్తమ ఉత్పత్తులకీ తీసిపోని విధంగా ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులుంటాయి. ఇంకో ప్రత్యేకతేమిటంటే వీటి ధరలు అతి చౌకగా వుంటాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులకు నిత్యం వచ్చే శాశ్వత కస్టమర్లు నిర్దిష్ట సంఖ్యలో వుండడం గమనించాల్సిన విషయం.

        నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, తెలంగాణా జైళ్ళల్లో ఖైదీలు ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ రూ. 206 కోట్లు కాగా, తమిళనాడులో రూ. 72 కోట్లు, కేరళలో రూ. 34 కోట్లుగా వుంది. అంటే తెలంగాణా టాప్ అన్న మాట.

        అయితే దురదృష్టమేమిటంటే, విడుదలైన ఖైదీల పట్ల, వారి ఉత్పత్తుల పట్లా బయట చిన్న పరిశ్రమల వాళ్ళూ, వ్యాపారులూ అవేవో అంటరాని వస్తువులైనట్టు విసిరేసి, మాజీ ఖైదీల్ని తరిమికొట్టే అన్యాయమైన ప్రవర్తన కలిగి వుండడం. మాజీ ఖైదీకి -అతను సత్ప్రవర్తన కారణంగా విడుదలై వున్నా- ప్రభుత్వామిచ్చే సర్టిఫికేట్ బయట సమాజంలో ఎందుకూ కొరగాక పోవడం. ఇన్ని అవమానా లెదుర్కొన్న, సమాజంలో చోటే దొరకని మాజీ ఖైదీ అప్పుడేం చేయాలి?

        ఈ పరిస్థితే త్యాగరాజుది. ఇతను చేయని నేరానికి యావజ్జీవ శిక్షపడి జైలు పాలయ్యాడు. పదేళ్ళ తర్వాత సత్ప్రవర్తన కారణంగా జీవిత ఖైదు తగ్గించి విడుదల చేశారు. బయటికొస్తే కొడుకు ఒక్కడే ఆశగా మిగిలాడు. ఐదేళ్ళ క్రితమే భార్య చనిపోయింది. బస్సెక్కి వూరుకి పోతే, అక్కడ కొడుకు ఇల్లమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది. హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రిచ్ గా సెటిలైన కొడుకు దగ్గరికి పోతే, ఆ కొడుకు కంగారు పడి అతనెవరో తెలియనట్టే నటించాడు. త్యాగరాజుకి అర్ధమైపోయింది. ఇక వెళ్ళిపోదా మనుకుంటే కోడలు ఆప్యాయంగా భోజనం పెట్టి మరీ పంపించింది. బయట కొడుకు చెప్పాడు -మళ్ళీ రాకు, నువ్వు జైలు కెళ్ళావని చెప్తే నాకు పెళ్ళి కావడంలేదు, చచ్చిపోయావని చెప్పాను- అన్నాడు.

        కొడుకు మాటలు కత్తిలా దిగినా, గుండె రాయి చేసుకుని వెళ్ళి పోయాడు. జైల్లో పాసైన డిగ్రీ సర్టిఫికేట్ వుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అన్ని చోట్లా బహిష్కారమే ఎదురైంది. ఇక లాభంలేదని ఒక ఫర్నిచర్ కార్ఖానాలో మాజీ ఖైదీనని చెప్పుకోలేదు. దాంతో రెండొందలు రోజు కూలీకి కుదిరాడు. పని నచ్చి యజమాని ఇంకో యాభై పెంచాడు. ఇంకా నచ్చి, కొత్త డిజైన్ అయిడియాలుంటే చెప్పమన్నాడు. త్యాగరాజు ఒక కేన్ తో చేసిన టీపాయ్ తెచ్చి చూపించాడు. యజమాని బాగా ఇంప్రెస్ అయి డిస్ట్రిబ్యూటర్ కి చూపించి, 300 రూపాయలు ధర చెప్పాడు.

        డిస్ట్రిబ్యూటర్ దాన్ని అనుమానంగా చూశాడు. ఇది ఎగ్జిబిషన్లో అమ్ముతున్న ఖైదీలు తయారు చేసిన ఐటెమ్ కదా? నూటయాభై వస్తువు నాకు 300 కి అంటగడతావా?-  అని యజమానిని నిలదీశాడు. దీంతో యజమాని- నువ్వెవరు? ఎక్కడ్నించి వచ్చావ్?-  అని త్యాగరాజుని గద్దించాడు. తను సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీనని నిజం చెప్పేశాడు త్యాగరాజు. యజమానికి అరికాలి మంట నెత్తికెక్కి టీపాయ్ ని అవతలకి విసిరేసి, త్యాగరాజుని చితకబాది రోడ్డు మీదికి గెంటి పారేశాడు.

    ఈ ఘోర అవమానంతో రోడ్డున పడ్డ త్యాగరాజు ఇప్పుడేం చేశాడు? ఇక తనకి సమాజంలో చోటే లేదని ఖాయమైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇలాటి త్యాగరాజులెందరో వున్నారు. కొందరు శిక్షే పడకుండా ఏళ్ళకేళ్ళు జైళ్ళల్లో మగ్గి, తీరా విచారణలో నిర్దోషులుగా విడుదలైనా బయట జీవితం వుండదు. మరి కొందరు నేరస్థులు సత్ప్రవర్తన కారణం చెప్పి విడుదలై పూజలందుకుంటారు. త్యాగరాజు తీసుకున్న నిర్ణయం మాత్రం సమాజానికి, వ్యవస్థకీ చెంప పెట్టు వంటిది. ఇది మిగతా షార్ట్ ఫిలిం లోనే చూడాలి.

        35 నిమిషాల షార్ట్ ఫిలిం జైల్డ్ మాజీ ఖైదీల జీవితాలకి దర్పణం. ఈ అయిడియా, దీనికి ముగింపూ కొత్తగా వున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ గొల్లపూడి సూటిగా, స్పష్టంగా, బలంగా విషయం చెప్పేశారు. ఆలోచింపజేసే విషయం. దీనికి బాహుబలి ఫేమ్ డాక్టర్ రాయల హరిశ్చంద్ర త్యాగరాజు పాత్ర నటన ఉద్వేగభరితంగా వుంటుంది. ఆయన అనేక నాటకాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో, సినిమాల్లో పోషించిన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందారు. సినిమాల్లో ఇప్పుడూ బిజీ సహాయ నటుడు.

        మిగిలిన తారాగణంలో లక్ష్మీకాంత్ దేవ్, అఖిల్ భనేశ్వర్, సంధ్య నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ ప్రొఫెసర్ మల్లాది గోపాలకృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్ర నటించారు. రచన -దర్శకత్వం సిద్ధార్థ్ గొల్లపూడి. ఈయన 9 అవర్స్  అనే వెబ్ సిరీస్ లో, విందు భోజనం అనే సినిమాలో నటించారు. ఛాయాగ్రహణం వంశీ గదాదాసు, సంగీతం రీ, కూర్పు  శ్రీ వర్కాల, నిర్మాణం క్లాసిక్ ఓటీటీ.

        సిద్ధార్థ్ మేకింగ్ పని తీరు క్వాలిటీతో వుంది. ఈ క్వాలిటీ తో 2022 ఫిలిం ఫెస్టివల్స్ లో వివిధ విభాగాల్లో మొత్తం 16 అవార్డులు గెలుచుకున్నారు. 4 భారతీయ చలన చిత్రోత్సవాలు, 4 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫెస్టివల్లో, డ్రక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డుల్ని ఈ షార్ట్ ఫిలిం గెలుచుకుంది.

        GAW & DP ఫిలిం ఫెస్టివల్ (స్కాట్లాండ్) లో ఉత్తమ షార్ట్ ఫిలింతో బాటు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (సంగీతం) అవార్డుని గెలుచుకుంది. క్యామెల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో  ఉత్తమ తొలి షార్ట్ ఫిలిం ప్రయత్నం అవార్డుతో బాటు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌ అవార్డుల్ని గెలుచుకుంది.

        తమిళనాడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది. సెర్బియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ మీడియం లెంగ్త్ ఫిలిం అవార్డుని గెలుచుకుంది. డా. రాయల హరిశ్చంద్ర తన నటన ద్వారా ప్రదర్శించిన అట్టడుగు జీవితాల వాస్తవికతని జ్యూరీ ఎంతో మెచ్చుకుంది. జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ షార్ట్ ఫిలింని clasc’ యాప్ ని ప్లేస్టోర్ లో డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.

—సికిందర్