రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, జనవరి 2023, సోమవారం

1288 : రివ్యూ!


 

          నవరి వచ్చిందంటే హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ (నుమాయిష్) ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ 'మై నేషన్' పేరుతో ప్రత్యేక స్టాల్‌ ని ఏర్పాటు చేస్తుంది. ఈ స్టాల్ వినియోగదారుల్ని అమితంగా ఆకర్షిస్తూంటుంది. ఈ స్టాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ విక్రయించే ఉత్పత్తులన్నీ తెలంగాణ జైళ్ళ లోని ఖైదీలు ఉత్పత్తి చేసినవి అయివుంటాయి. ఫర్నిచర్, బెడ్‌షీట్లు, బేకరీ వస్తువులు, సబ్బులు, ఉన్నివస్త్రాలూ సహా అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరుతాయి.

         ఉత్పత్తులకి చాలా డిమాండ్‌ వుంటుందనేది తెలిసిన విషయమే. నాణ్యత విషయంలో మార్కెట్‌లో లభించే అత్యుత్తమ ఉత్పత్తులకీ తీసిపోని విధంగా ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులుంటాయి. ఇంకో ప్రత్యేకతేమిటంటే వీటి ధరలు అతి చౌకగా వుంటాయి. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులకు నిత్యం వచ్చే శాశ్వత కస్టమర్లు నిర్దిష్ట సంఖ్యలో వుండడం గమనించాల్సిన విషయం.

        నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, తెలంగాణా జైళ్ళల్లో ఖైదీలు ఉత్పత్తి చేసిన వస్తువుల విలువ రూ. 206 కోట్లు కాగా, తమిళనాడులో రూ. 72 కోట్లు, కేరళలో రూ. 34 కోట్లుగా వుంది. అంటే తెలంగాణా టాప్ అన్న మాట.

        అయితే దురదృష్టమేమిటంటే, విడుదలైన ఖైదీల పట్ల, వారి ఉత్పత్తుల పట్లా బయట చిన్న పరిశ్రమల వాళ్ళూ, వ్యాపారులూ అవేవో అంటరాని వస్తువులైనట్టు విసిరేసి, మాజీ ఖైదీల్ని తరిమికొట్టే అన్యాయమైన ప్రవర్తన కలిగి వుండడం. మాజీ ఖైదీకి -అతను సత్ప్రవర్తన కారణంగా విడుదలై వున్నా- ప్రభుత్వామిచ్చే సర్టిఫికేట్ బయట సమాజంలో ఎందుకూ కొరగాక పోవడం. ఇన్ని అవమానా లెదుర్కొన్న, సమాజంలో చోటే దొరకని మాజీ ఖైదీ అప్పుడేం చేయాలి?

        ఈ పరిస్థితే త్యాగరాజుది. ఇతను చేయని నేరానికి యావజ్జీవ శిక్షపడి జైలు పాలయ్యాడు. పదేళ్ళ తర్వాత సత్ప్రవర్తన కారణంగా జీవిత ఖైదు తగ్గించి విడుదల చేశారు. బయటికొస్తే కొడుకు ఒక్కడే ఆశగా మిగిలాడు. ఐదేళ్ళ క్రితమే భార్య చనిపోయింది. బస్సెక్కి వూరుకి పోతే, అక్కడ కొడుకు ఇల్లమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిసింది. హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో రిచ్ గా సెటిలైన కొడుకు దగ్గరికి పోతే, ఆ కొడుకు కంగారు పడి అతనెవరో తెలియనట్టే నటించాడు. త్యాగరాజుకి అర్ధమైపోయింది. ఇక వెళ్ళిపోదా మనుకుంటే కోడలు ఆప్యాయంగా భోజనం పెట్టి మరీ పంపించింది. బయట కొడుకు చెప్పాడు -మళ్ళీ రాకు, నువ్వు జైలు కెళ్ళావని చెప్తే నాకు పెళ్ళి కావడంలేదు, చచ్చిపోయావని చెప్పాను- అన్నాడు.

        కొడుకు మాటలు కత్తిలా దిగినా, గుండె రాయి చేసుకుని వెళ్ళి పోయాడు. జైల్లో పాసైన డిగ్రీ సర్టిఫికేట్ వుంది. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అన్ని చోట్లా బహిష్కారమే ఎదురైంది. ఇక లాభంలేదని ఒక ఫర్నిచర్ కార్ఖానాలో మాజీ ఖైదీనని చెప్పుకోలేదు. దాంతో రెండొందలు రోజు కూలీకి కుదిరాడు. పని నచ్చి యజమాని ఇంకో యాభై పెంచాడు. ఇంకా నచ్చి, కొత్త డిజైన్ అయిడియాలుంటే చెప్పమన్నాడు. త్యాగరాజు ఒక కేన్ తో చేసిన టీపాయ్ తెచ్చి చూపించాడు. యజమాని బాగా ఇంప్రెస్ అయి డిస్ట్రిబ్యూటర్ కి చూపించి, 300 రూపాయలు ధర చెప్పాడు.

        డిస్ట్రిబ్యూటర్ దాన్ని అనుమానంగా చూశాడు. ఇది ఎగ్జిబిషన్లో అమ్ముతున్న ఖైదీలు తయారు చేసిన ఐటెమ్ కదా? నూటయాభై వస్తువు నాకు 300 కి అంటగడతావా?-  అని యజమానిని నిలదీశాడు. దీంతో యజమాని- నువ్వెవరు? ఎక్కడ్నించి వచ్చావ్?-  అని త్యాగరాజుని గద్దించాడు. తను సత్ప్రవర్తనతో విడుదలైన ఖైదీనని నిజం చెప్పేశాడు త్యాగరాజు. యజమానికి అరికాలి మంట నెత్తికెక్కి టీపాయ్ ని అవతలకి విసిరేసి, త్యాగరాజుని చితకబాది రోడ్డు మీదికి గెంటి పారేశాడు.

    ఈ ఘోర అవమానంతో రోడ్డున పడ్డ త్యాగరాజు ఇప్పుడేం చేశాడు? ఇక తనకి సమాజంలో చోటే లేదని ఖాయమైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇలాటి త్యాగరాజులెందరో వున్నారు. కొందరు శిక్షే పడకుండా ఏళ్ళకేళ్ళు జైళ్ళల్లో మగ్గి, తీరా విచారణలో నిర్దోషులుగా విడుదలైనా బయట జీవితం వుండదు. మరి కొందరు నేరస్థులు సత్ప్రవర్తన కారణం చెప్పి విడుదలై పూజలందుకుంటారు. త్యాగరాజు తీసుకున్న నిర్ణయం మాత్రం సమాజానికి, వ్యవస్థకీ చెంప పెట్టు వంటిది. ఇది మిగతా షార్ట్ ఫిలిం లోనే చూడాలి.

        35 నిమిషాల షార్ట్ ఫిలిం జైల్డ్ మాజీ ఖైదీల జీవితాలకి దర్పణం. ఈ అయిడియా, దీనికి ముగింపూ కొత్తగా వున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ గొల్లపూడి సూటిగా, స్పష్టంగా, బలంగా విషయం చెప్పేశారు. ఆలోచింపజేసే విషయం. దీనికి బాహుబలి ఫేమ్ డాక్టర్ రాయల హరిశ్చంద్ర త్యాగరాజు పాత్ర నటన ఉద్వేగభరితంగా వుంటుంది. ఆయన అనేక నాటకాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో, సినిమాల్లో పోషించిన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందారు. సినిమాల్లో ఇప్పుడూ బిజీ సహాయ నటుడు.

        మిగిలిన తారాగణంలో లక్ష్మీకాంత్ దేవ్, అఖిల్ భనేశ్వర్, సంధ్య నటించారు. థియేటర్ ఆర్టిస్ట్ ప్రొఫెసర్ మల్లాది గోపాలకృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్ర నటించారు. రచన -దర్శకత్వం సిద్ధార్థ్ గొల్లపూడి. ఈయన 9 అవర్స్  అనే వెబ్ సిరీస్ లో, విందు భోజనం అనే సినిమాలో నటించారు. ఛాయాగ్రహణం వంశీ గదాదాసు, సంగీతం రీ, కూర్పు  శ్రీ వర్కాల, నిర్మాణం క్లాసిక్ ఓటీటీ.

        సిద్ధార్థ్ మేకింగ్ పని తీరు క్వాలిటీతో వుంది. ఈ క్వాలిటీ తో 2022 ఫిలిం ఫెస్టివల్స్ లో వివిధ విభాగాల్లో మొత్తం 16 అవార్డులు గెలుచుకున్నారు. 4 భారతీయ చలన చిత్రోత్సవాలు, 4 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు. కలకత్తా ఇంటర్నేషనల్ కల్ట్ ఫెస్టివల్లో, డ్రక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డుల్ని ఈ షార్ట్ ఫిలిం గెలుచుకుంది.

        GAW & DP ఫిలిం ఫెస్టివల్ (స్కాట్లాండ్) లో ఉత్తమ షార్ట్ ఫిలింతో బాటు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (సంగీతం) అవార్డుని గెలుచుకుంది. క్యామెల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో  ఉత్తమ తొలి షార్ట్ ఫిలిం ప్రయత్నం అవార్డుతో బాటు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌ అవార్డుల్ని గెలుచుకుంది.

        తమిళనాడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా అవార్డులు గెలుచుకుంది. సెర్బియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ మీడియం లెంగ్త్ ఫిలిం అవార్డుని గెలుచుకుంది. డా. రాయల హరిశ్చంద్ర తన నటన ద్వారా ప్రదర్శించిన అట్టడుగు జీవితాల వాస్తవికతని జ్యూరీ ఎంతో మెచ్చుకుంది. జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ షార్ట్ ఫిలింని clasc’ యాప్ ని ప్లేస్టోర్ లో డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.

—సికిందర్ 

8, జనవరి 2023, ఆదివారం

1287 : సండే స్పెషల్ రివ్యూ!


బ్రిక్ ఫేమ్ బ్రియాన్ జాన్సన్ మళ్ళీ వచ్చేశాడు. 2019 లో తీసిన హిట్ నైవ్స్ ఔట్ సీక్వెల్ తో. 2005 లో నియోనోయర్ జానర్ ని టీనేజర్స్ తో కాలేజీ మర్డర్ మిస్టరీగా ప్రయోగం చేసి విజయం సాధించిన జాన్సన్, ఆ తర్వాత నైవ్స్ ఔట్ ని ఆగథా క్రిస్టీ నవలల శైలిలో తీసి ఇంకో విజయం సాధించాడు. దీనికి సీక్వెల్ గా ఇప్పుడు గ్లాస్ ఆనియన్ : ఏ నైవ్స్ ఔట్ మిస్టరీ తీసి ఎందుకో పూర్తి స్థాయి థియేట్రికల్ విడుదల చేయలేదు.అమెరికాలో ఓ వారం థియేట్రికల్ విడుదల చేసి నెట్ ఫ్లిక్స్ కిచ్చేశాడు. నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో తిరిగి నైవ్స్ ఔట్ ఫేమ్ మాజీ జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ అదే డిటెక్టివ్ పాత్ర కొనసాగించాడు.

సారి బెడ్జెట్ పెరిగింది, కథ కాన్వాస్ పెరిగింది, లొకేషన్ అందమైన ఐలాండ్ కి మారింది, మూడు సార్లు ఆస్కార్స్ కి నామినేట్ అయిన ఎడ్వర్డ్ నార్టన్ బిలియనీర్ పాత్రలో విచ్చేశాడు, ఒకసారి ఆస్కార్స్ కి నామినేట్ అయిన కేట్ హడ్సన్ ఫ్యాషన్ డిజైనర్ గా నటింఛింది. ఇంకా అనేక కలర్ఫుల్ ఆకర్షణలున్నాయి. మ్యాటర్ ఎలా వుంది? ఇది చూద్దాం...

ఆనియన్ మేడలో ఆగని మర్డర్లు 

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా వున్న 2020 మే నెలలో, టెక్నాలజీ కంపెనీ ఆల్ఫా వ్యవస్థాపకుడు, బిలియనీర్ మైల్స్ బ్రాన్ - గ్రీస్ లో తన ప్రైవేట్ ద్వీపంలోని గ్లాస్ ఆనియన్‌ విడిదిలో, వారాంతపు రోజుల్ని ఎంజాయ్ చేయడానికి నలుగురు స్నేహితుల్ని ఆహ్వానిస్తాడు. ఆల్ఫా హెడ్ సైంటిస్ట్ లైనల్, కనెక్టికట్ గవర్నర్ డిబెల్లా, ఫ్యాషన్ డిజైనర్ బర్డీ, ఈమె అసిస్టెంట్ పెగ్, పురుష హక్కుల కార్యకర్త డ్యూక్, ఇతడి గర్ల్ ఫ్రెండ్ విస్కీ తోబాటు - ఇద్దరు అనుకోని అతిధులు- మైల్స్ మాజీ భాగస్వామిని ఆండీ, సుప్రసిద్ధ డిటెక్టివ్ బెనాయిట్ బ్లాంక్ (డేనియల్ క్రేగ్) వచ్చేస్తారు.
       
మైల్స్ ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో వుంటాడు. ఈ ఇంధనానికి క్లియర్ అని పేరు పెట్టాడు. ఇంకో వారంలో విడుదల చేయనున్న క్లియర్ తో  కంపెనీ ప్రపంచాధిపత్యాన్ని వహిస్తుందని ప్రకటిస్తాడు. సముద్ర జలాల నుంచి హైడ్రోజన్ ని తీసి దాంతో విద్యుత్ ఉత్పాదన. ఇంకా పూర్తి పరీక్షలు జరపకుండా క్లియర్ ని ప్రవేశ పెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తాడు సైంటిస్ట్ లైనల్. ఈ విడిది భవనం గ్లాస్ ఆనియన్ కి క్లియర్ తోనే విద్యుత్ ఏర్పాటు వుందని మైల్స్ చెప్పేసరికి భయపడిపోతారు అతిధులు.         

అతిధులు 16 వ శతాబ్దపు మోనాలిసా చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి అప్పు కావాల్సివస్తే మోనాలిసాని తాకట్టు పెట్టించుకుని ఇచ్చానని అంటాడు మైల్స్. ఆహ్వానం లేకుండా వచ్చిన మాజీ పార్టనర్ ఆండీ మీద ఓ కన్నేసి వుంచుతాడు. ఈమె మైల్స్ మీద కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అలాగే, ఆహ్వానం లేకుండా వచ్చిన డిటెక్టివ్ బ్లాంక్ ని ప్రశ్నిస్తాడు. తనకి ఆహ్వానం అందిందని చూపిస్తాడు బ్లాంక్. అది చూసి, తను ఆహ్వానం పంపిన వాళ్ళల్లో ఎవరో దీన్ని మీకు పంపి ప్రాక్టికల్ జోక్ ఆడారని అంటాడు  మైల్స్.

ఇలా అందరూ సమావేశమయ్యాక, మర్డర్ మిస్టరీ గేమ్ ఆడదామని ప్రతిపాదిస్తాడు మైల్స్. ఈ గేమ్ లో తను మర్డర్ అవుతాడు, హంతకుడెవరో అతిధులే కనుగొనాలని చెప్తాడు. అయితే ఇంకా గేమ్ ప్రారంభం కాకముందే పురుష హక్కుల కార్యకర్త డ్యూక్, మైల్స్ గ్లాసులో విస్కీ తాగి కుప్పకూలి చనిపోతాడు. భయాందోళనలకి గురైన అతిధులు అండీని అనుమానిస్తారు. చనిపోయిన డ్యూక్ పిస్టల్ మాయమవుతుంది. ఆ పిస్టల్ తో ఆండీ మీద ఎవరో కాల్పులు జరుపుతారు. డిటెక్టివ్ బ్లాంక్ వేగంగా చర్యలు తీసుకుని, ఆండీని చంపిందెవరో చెప్తానని అంటాడు...

ఏమిటీ గేమ్? కాలక్షేపంగా ఆడదామనుకున్న గేమ్ నిజ హత్యలకి దారితీయడమేమిటి? ఎవరు ఎవరితో గేమ్ ఆడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు? అసలు డిటెక్టివ్ బ్లాంక్ ఫేక్ ఆహ్వానమందుకుని రావడం నిజమేనా? అసలు ఆండీ ఎందుకొచ్చింది? దీని కంతటికీ మైల్స్ మార్కెటింగ్ చేయబోతున్న ఇంధనంతో సంబంధముందా? ఈ పజిల్ ని డిటెక్టివ్ బ్లాంక్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ...

క్రేజీ క్రేగ్ తో మరోసారి

మాజీ జేమ్స్ బాండ్ డేనియల్ క్రేగ్ డిటెక్టివ్ పాత్రతో మరోసారి మాస్టర్ ఇన్వెస్టిగేటర్ గా ఉర్రూతలూగిస్తాడు. నైవ్స్ ఔట్ మొదటి భాగంలోని షెర్లాక్ హోమ్స్- పైరట్ ల హైబ్రిడ్ క్యారక్టర్ని అదే మైక్రోలెవెల్లో నటిస్తాడు. అదే కామిక్ సెన్స్ ని ప్రదర్శిస్తాడు. ఇంటరాగేషన్స్ తో సినిమాని బోరుగా మార్చకుండా యాక్టివ్ క్యారక్టర్ గా వుంటాడు. ఉత్త మేధతో పజిల్స్ ని, గేమ్స్ నీ పరిష్కరించడం పరమ బోరే. మేధకి యాక్షన్ తోడయితేనే మిస్టరీకి ఊపు.  అందుకే నాకు పజిల్సూ వద్దు, గేమ్సూవద్దు. నాక్కావాల్సిందల్లా వెకేషన్. వెకేషన్లో డేంజర్, హంట్, ఛాలెంజ్, ఆఖరికి ఓ గ్రేట్ కేస్ అంటాడు. అన్నట్టు ప్రవర్తిస్తాడు. అంటే తను షెర్లాక్ హోమ్స్ + హెర్క్యూల్ పైరట్ + జేమ్స్ బాండ్ అన్నమాట.

దర్శకుడు బ్రియాన్ జాన్సన్ మాత్రం మొదటి భాగంలో క్రియేట్ చేసిన ఆగథా క్రిస్టీ మిస్టరీ జానర్ మర్యాదల్నే పోషిస్తూ క్రేగ్ ముక్కోణ పాత్రని నడిపాడు. అయితే క్లయిమాక్స్ లో క్రేగ్ లేకపోవడం కొత్త ప్రయోగం. క్లయిమాక్స్ లో హీరో లేకపోవడమేమిటి, ఇదేం సినిమా? ఇలాటి సినిమా వుంది. దొంగరాముడు (1955) లో హీరో అక్కినేని నాగేశ్వరరావు బదులు హీరోయిన్ సావిత్రితో క్లయిమక్సూ దాని ముగింపూ లేదూ, ఇదీ అలాగే.     తను వచ్చిన పని కేసు పరిష్కరించి, మిగతాది తనపని కాదని వెళ్ళిపోతాడు క్రేగ్. ఇక విలన్ని ఏం చేయాలో అది చేస్తుంది కేసులో అతడి సాయం కోరిన పాత్ర. క్రేగ్ లేకపోయినా ఈ క్లయిమాక్స్ మాత్రం అత్యంత టెర్రిఫిక్ గా వుంటుంది. పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాంగ్.

ఏమీ లేని ఫస్టాఫ్ లో చాలా వుంది

అయితే కథ ప్రారంభించడానికి తెలుగు సినిమాల్లో లాగే గంట సమయం తీసుకున్నాడు దర్శకుడు. రాత్రి ఎనిమిది గంటలకి మర్డర్ మిస్టరీ గేమ్ ప్రతిపాదనతో కథ ప్రారంభమయ్యే వరకూ ఒకరొకరుగా వచ్చే పాత్రల పరిచయాలు, క్లియర్ విద్యుత్ నేపథ్యం, రోజంతా పాత్రల సరదాలూ ప్రవర్తనలతో సరిపోతుంది. ఈ గంటసేపు కథ అందుకోక, ఏమీ జరగక ఓపికని పరీక్షిస్తుంది. గంట సేపటికి గేమ్ కొచ్చాకే కథ ప్రారంభమై ఇక ఆగదు.

సెకండాఫ్ పూర్తిగా ఫస్టాఫ్ ని తలకిందులు చేస్తుంది. కథ లేనట్టు చూపించిన ఫస్టాఫ్ లో రొటీన్ దృశ్యాల్లోని అంతరార్ధాలు ఒకటొకటే బయటపడుతూ ఉల్లిపొరలు వొలిచినట్టు ఫస్టాఫ్ లో దాచిపెట్టిన కథంతా వెల్లడి అవుతుంది. గ్లాస్ ఆనియన్ అని విడిదికి మాత్రమే పేరు పెట్టలేదు, ఆ విడిదిలో నడిచే కథ కూడా ఆనియన్ లాంటిదే. ఇది గ్రేట్ మిస్టరీ రైటింగ్ అండ్ మేకింగ్ అనాలి. ఈ ఉల్లి పొరల్ని యాక్షన్ తో విప్పుకుంటూ పోతాడు క్రేగ్.

సెకండాఫ్ లో ఆండీ పాత్ర ఫ్లాష్ బ్యాక్ మొదట వస్తుంది. ఇందులో ఆండీ పాత్ర అసలెవరో బయట పడి థ్రిల్ చేస్తుంది. ఆ తర్వాత ఫస్టాఫ్ లో విడిదిలో చూపించిన రొటీన్ దృశ్యాల వెనుక అర్ధాలు వెల్లడించే మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులొస్తాయి. దీని తర్వాత విడిదిలో డ్యూక్ మరణం వెనుక కారణాలతో మినీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. దీని తర్వాత ఆండీ మీద కాల్పులు జరగడం వెనుక విడిదిలోనే జరిగిన కథ తాలూకు మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులొస్తాయి. ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ పూర్తయి క్లయిమాక్స్ కొస్తుంది కథ.

ఈ క్లయిమాక్సులో ఉన్న ఒక్క సాక్ష్యాధారాన్నీ విలన్ నాశనం చేయడంతో- నిజమేంటో నీకు తెలియజేశాను. పోలీసులకీ కోర్టుకీ ఎవిడెన్స్ కావాలి, అది నాదగ్గర లేదు  అని బాధిత పాత్రకి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక విలన్ని శిక్షించే పని ఇంకో విధంగా చేపడుతుంది బాధిత పాత్ర. మొత్తం కలిపి ఒక సంతృప్తి కరమైన మిస్టరీ విందు.

సంక్లిష్టతని ఆశించాను. మేధని ఆశించాను. ఒక పజిల్ ని, గేమ్ నీ వూహించాను. కానీ ఇందులో ఏదీ కాదు. విషయం సంక్లిష్టత వెనుక దాగి లేదు, మైండ్ ని మెలిపెడుతూ కళ్ళముందున్న స్పష్టతలోనే దాగుంది. నిజమేంటంటే, మ్యాటర్ దేని వెనుకా దాగిలేదు అంటాడు బ్లాంక్. ఇంత సింపుల్ గా అర్ధమైపోతుంది సాలెగూడులా అల్లిన కథ.

బ్రియాన్ జాన్సన్ క్రియేటివిటీ తో తీసి మరో కమర్షియల్ విజయం సాధించాడు. అయితే థియేటర్ కి నామమాత్రం చేసి ఓటీటీలో విడుదల చేయడమే డేనియల్ క్రెగ్ అభిమానుల్ని నిరాశపరుస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో హిందీలో అందుబాటులో వుంది.

—సికిందర్

(ఈ మూవీ స్క్రీన్ ప్లే సంగతులు డిమాండ్
చేస్తోంది. రేపు కలుద్దాం)
 

6, జనవరి 2023, శుక్రవారం

1286 : రివ్యూ!


దర్శకత్వం రీతేష్  దేశ్‌ముఖ్
తారాగణం : రీతేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, జియా శంకర్, అశోక్ సరాఫ్ తదితరులు 
కథ : శివ నిర్వాణ, స్క్రీన్ ప్లే : రుషికేష్ తురై, సందీప్ పాటిల్, రీతేష్ దేశ్‌ముఖ్; సంగీతం : సౌరభ్ భలేరావ్, పాటలు : అజయ్- అతుల్;  ఛాయాగ్రహణం : భూషణ్‌ కుమార్ జైన్
బ్యానర్ : ముంబై ఫిల్మ్ కంపెనీ
నిర్మాత : జెనీలియా డిసౌజా
విడుదల : డిసెంబర్ 30,  2022
***(ఈ మూడు చుక్కలు రేటింగ్ కాదు)

        బాలీవుడ్ హీరో రీతేష్ దేశ్ ముఖ్ దర్శకుడుగా మారుతూ, భార్య- మాజీ హీరోయిన్ జెనీలియా డిసౌజా నిర్మాతగా మారుతూ, ఇద్దరూ కలిసి నటించిన మరాఠీ వేడ్ మహారాష్ట్రలో ప్రస్తుతం అతి పెద్ద హిట్. దీన్ని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు. ఇదివరకే రీతేష్ దేశ్‌ముఖ్ మరాఠీ చలన చిత్ర పరిశ్రమలో, కమర్షియల్ మాస్ సినిమాల తీరుతెన్నుల్ని రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ లో నటించి ఛేదించాడు. ఇప్పుడు దర్శకుడుగా పరిచయమవుతూ తీసిన ఈ మూడోది కూడా బ్లాక్ బస్టర్ దిశగా పయనించడం హాట్ టాపిక్ గా మారింది. పెద్దగా తారాగణ బలం కూడా లేని ఇందులో ఏఏ కమర్షియల్ ప్రయోగాలు చేశాడు? హిందీ సినిమాలతో నిండిన మరాఠీ మార్కెట్ లో మూడు రోజుల్లో 10 కోట్లు బాక్సాఫీసు అంటే సంచలనమే. ఈ ఘన విజయం గురించి వివరాల్లోకి వెళ్దాం...   

కథ

సత్య (రీతేష్ దేశ్ ముఖ్) క్రికెట్లో పేరు ప్రతిష్టలు పొందాలని కాంక్షిస్తాడు. మొదట్లో స్థానిక రైల్వేస్ క్రికెట్ జట్టుకి ఎంపిక కావాలని కోరుకుంటాడు . ఇందుకు అవసరమైన  డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నప్పుడు నిషా (జియా శంకర్) పరిచయమవుతుంది. ఈ పరిచయంలో కొన్ని అపార్థాల తర్వాత  ప్రేమలో పడతారు. ఈ ప్రేమ నచ్చని నిషా తల్లిదండ్రులు ఇద్దర్నీ విడదీస్తారు. సత్యకి తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయిన నిషా తిరిగి రాదు. సత్య విచారంలో మునిగిపోయి, తాగుడు మరిగి క్రికెట్ కి దూరమవుతాడు.
        
శ్రావణి (జెనీలియా దిసౌజా) సత్య పొరుగున వుంటుంది. ఈమె సత్య ప్రేమవ్యవహారం తెలియక సత్యతో ప్రేమలో పడుతుంది. తెలిశాక దూరమవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొంత కాలం తర్వాత సత్య తండ్రి ప్రోద్బలంతో సత్యని పెళ్ళి చేసుకుంటుంది. అయినా సత్య నిషా జ్ఞాపకాలతోనే జీవిస్తూ, ఏ పనీ చేయక, రైల్వేస్ లో పని చేసే శ్రావణి జీతం మీద ఆధారపడి బ్రతుకుతూంటాడు. ఒకసారి యువ టీం కోసం క్రికెట్ ప్లేయర్స్ ని ఎంపిక చేయడంలో సహాయం చేయడానికి సత్యా ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఖుషీ (ఖుషీ హజారే) పరిచయమవుతుంది. ఈమె నిషా కుమార్తె. నిషా ప్రమాదంలో చనిపోయిందని తెలుస్తుంది.

ఇప్పుడు సత్య ఏం చేశాడు? నిషా ఇక లేదని తెలుసుకుని శ్రావణిని బాధించడం మానుకుని దగ్గరయ్యాడా? మానసికంగా గాయపడ్డ శ్రావణి ఇప్పుడతణ్ణి స్వీకరించిందా? ఈ వికటించిన రిలేషన్ షిప్ లో నిషా కూతురు పోషించిన పాత్ర ఏమిటి?...ఇవీ మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలావుంది కథ

2019 లో శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య- సమంతా నటించిన తెలుగు మజిలీ కిది రీమేక్. ఇప్పటికే ఒక మిలియన్ సార్లు చూసిన కథ. ప్రేయసిని మర్చిపోలేక  వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని అలమటించే వాడి కథలతో చాలా సినిమాలొచ్చాయి. దీన్ని రివర్స్ చేస్తూ, ప్రియుడిని మర్చిపోలేక వేరే పెళ్ళి చేసుకుని బావురుమనే ఆమెతో కూడా అన్నే సినిమాలొచ్చాయి. ఈ రెండోది శివ నిర్వాణ తీసిన నిన్నుకోరి అయితే,పై మొదటిది మజిలీ’.
        
ఈ కథలో వినోదం కంటే విషాదం పాలెక్కువ. పైగా తెలిసిన రొటీన్ కథే కావడంతో ఇంటర్వెల్ ముందు వరకూ, తర్వాత సెకండాఫ్ లో క్లయిమాక్స్ ముందు వరకూ డల్ అయిపోతుంది సినిమా కథాపరంగా తెలుగులో లాగానే. అయితే దర్శకుడిగా రీతేష్ కి తొలి ప్రయత్నమే అయినా, హీరోగా దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఏ కమర్షియల్ సామగ్రితో ఎలా ప్యాకేజీ చేయాలో తెలుసు. ఒక పాటలో ఏకంగా సల్మాన్ ఖాన్ ని తీసుకువచ్చాడు, అత్యంత పాపులర్ సంగీత దర్శకులతో స్వరాల శోభ సమకూర్చాడు, మరాఠీ నేటివిటీకి మార్చడానికి స్క్రిప్టు మీద తీవ్ర కసరత్తు చేశాడు, బాలనటి టాలెంట్ ని గుర్తించి గరిష్ట స్థాయిలో వినియోగించుకున్నాడు, ఆఖరికి జెనీలియా భావప్రకటనా సామర్ధ్యంతో ప్రతీ దృశ్యం ప్రకాశించేలా చేసుకున్నాడు, ఇక భగ్న ప్రేమికుడుగా తను సరే, యాక్షన్ సీన్స్ కూడా పవర్ఫుల్ గా తీర్చిదిద్దుకున్నాడు, ఛాయాగ్రహణాన్ని టాప్ విజువల్స్ తో కళ్ళప్పగించి చూసేలా చేశాడు. ఇన్ని చేశాక సక్సెస్ ఖాయమనుకున్నాడు, అయ్యింది కూడా.

నటనలు –సాంకేతికాలు

రీతేష్ దేశ్‌ముఖ్  కబీర్ సింగ్/అర్జున్ రెడ్డి పాత్రకి ఇంకో వెర్షన్ నటించినట్టు కన్పిస్తాడు. అయితే ఇది కుదరలేదు. ముఖంలో ఆ వెర్రి (వేడ్) లేదు. పైగా తను నటిస్తూ వచ్చిన హిందీ సినిమాలు నవ్విస్తూ వుండే ఎంటర్ టైనర్లే కాబట్టి -కబీర్ సింగ్ కి, అర్జున్ రెడ్డి కి తను మారాలనుకోవడమన్నది సాధ్యమయ్యే పని కాదు. సినిమాల చరిత్రలో భగ్నప్రేమికులందరూ కబీర్ సింగ్/ అర్జున్ రెడ్డి కారు. దేవదాసులున్నారు, ప్రేమ నగర్ కళ్యాణ్  లున్నారు. తన వేడ్ (వెర్రి) పాత్ర ఈ కోవకి చెందింది. అందుకే నాగచైతన్యకి చెల్లింది. అయితే తను మహారాష్ట్ర వారసత్వానికి చెందినవాడే కావడంతో మరాఠీతనం మాత్రం పాత్రకి ఒనగూడింది.

ఇక తెలుగు సినిమాల్లో చిలిపి పాత్రల హీరోయిన్ గా తెలిసిన జెనీలియా డిసౌజా ఈ సీరియస్ పాత్రలో కట్టి పడేస్తుంది. ముఖ్యంగా మాటలు లేని మౌన దృశ్యాల్లో హావభావ ప్రకటన ఆమెలో దాగి వున్న క్యాలిబర్‌ ని అపూర్వంగా ఆవిష్కరిస్తుంది. తను సినిమా నటించినట్టు వుండదు, జీవితం జీవిస్తున్నట్టు వుంటుంది.
        
రెండో హీరోయిన్ గా జియా శంకర్ గ్లామర్ పోషణకి పనికొచ్చింది. చాలా హిందీ సినిమాల్లో నటించిన మరాఠీ సహాయ నటుడు అశోక్ సరాఫ్ చాలా కాలానికి తెరపై కొచ్చాడు. ఇక బాలనటి ఖుషీ గురించి పైనే చెప్పుకున్నాం. 
          
ఈ కథ ఫస్టాఫ్ ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటుంది. రీతేష్ దేశ్‌ముఖ్‌కి ​​మాంటేజ్‌లు రూపొందించే కళ బాగానే వున్నట్టు అర్ధమవుతుంది. బేసురీ, వేడ్ తుజే రెండు పాటల చిత్రీకరణల్లో మాంటేజెస్,  స్లో-మో షాట్స్, అలాగే పదునైన ఎడిటింగ్ టెక్నిక్స్ తో ఫ్లాష్‌బ్యాక్స్ ని చూపించిన విధానం కట్టి పడేస్తాయి. ఇక వున్న కథని, నేపథ్య సంగీతాన్నీ మిళితం చేసిన తీరు కూడా బావుంది. పాటలు క్యాచీగా వున్నాయి.
        
అయితే ప్రత్యేకాకర్షణగా తీసుకొచ్చిన సల్మాన్ ఖాన్ ని చివర్లో చూపించడం మార్కెటింగ్ వ్యూహమే కావచ్చు. ఎండ్ టైటిల్స్ లోనే పాటలో కన్పిస్తాడు సల్మాన్. ఎండ్ టైటిల్స్ ఎవరు చూస్తారు లేచి వెళ్ళి పోతారనుకోవచ్చు- అయితే ఈ కథతో సినిమాని బోరుగా ఫీలయ్యే ప్రమాదముంది గనుక- సల్మాన్ ని చివర్లో చూపిస్తే, సల్మాన్ కోసమైనా బోరు భరిస్తూ చూస్తారని భావించి వుండొచ్చు. ఇన్ని గిమ్మిక్కులు చేస్తే ఓ బలహీన కథ బ్లాక్ బస్టర్ అయింది.

—సికిందర్

5, జనవరి 2023, గురువారం

1285 : స్పెషల్ న్యూస్!


థియేటర్ యాజమాన్యాలు సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించ కూడదనే సుప్రీం కోర్టు తీర్పు మల్టీప్లెక్స్ కంపెనీలకి పెద్ద ఉపశమనమే. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో సమస్య చుట్టూ వున్న అస్పష్టత తొలగిందని మల్టీప్లెక్స్ గ్రూపులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కాశ్మీర్ లో ప్రారంభమయిన ఈ తినుబండారాల రగడ ఢిల్లీలో కొలిక్కి వచ్చింది. మల్టీప్లెక్సులు తినుబండారాలనబడే ఫుడ్ అండ్ బెవరేజీ (ఎఫ్ బి) విక్రయాల ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్నాయి. టికెట్ రేట్ల కంటే ఎఫ్ బి ధరలు రెట్టింపు వున్నా భరిస్తున్నారు ప్రేక్షకులు.

        సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని, జనవరి 3 తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రేక్షకులకిది తప్పనిసరేం కాదనీ, ఇష్టం లేకపోతే వాటిని కొనుగోలు చేయనవ
సరం లేదనీ స్పష్టం చేసింది.
        
బంగారం అమ్మినట్టు 30 గ్రాములు (మూడు తులాలు) పాప్ కార్న్ 100 రూపాయలకి అమ్మే మల్టీప్లెక్సుల ధరాపాతంపై వినియోగదారులు కోర్టు కెక్కలేదు. మల్టీప్లెక్స్ కంపెనీల మొత్తం రాబడిలో 25 నుంచి 35 శాతం వాటా ఎఫ్ బీదే. లాభాల్లో 45 శాతం వాటా ఎఫ్ బీదే. వినియోగదారులు ధరలపై కాక, బయటి ఆహారాన్ని అనుమతించాలని  వివిధ రాష్ట్రాల్లో చాలా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ కూడా క్లబ్ చేసి విచారించింది సుప్రీం కోర్టు.
        
అయితే థియేటర్లలో ఎక్కువ ధరలకి పాప్ కార్న్ అమ్మడం అనేది థియేటర్ యజమానులకీ, సినిమా ప్రేక్షకులకీ మధ్య నలుగుతున్న వివాదమే. చాలా మంది ఇప్పటికీ సినిమాహాళ్ళలో, ముఖ్యంగా టాప్ మల్టీప్లెక్సుల్లో ఖరీదైన ఆహారానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వున్నారు. ప్రస్తుతం టాప్ మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ టబ్ ధర 350 నుంచి 450 రూపాయలుంది. దీనికి 150 నుంచి 350 మధ్య వుండే కూల్ డ్రింక్ ని కలిపితే, ఇద్దరు వ్యక్తులకు పన్నులతో కలిపి రూ. 1,000 కి తక్కువ కాకుండా నడ్డివిరిచే వడ్డన!
        
టాప్ మల్టీప్లెక్సులు పీవీఆర్, ఐనాక్స్ కంపెనీలు తమ మొత్తం  రాబడిలో 25 నుంచి 35 శాతంగా వుంటున్న ఎఫ్ బి వాటాని ఇంకో మూడు శాతం పెంచే దిశగా యోచిస్తున్నాయి. 2020 ఆర్దిక సంవత్సరంలో పీవీఆర్ ఎఫ్ బి అమ్మకాల ద్వారా రూ. 960 కోట్లు ఆర్జించింది. ఇది మునుపటి సంవత్సరం రూ. 858 కోట్లుగా వుంది. ఐనాక్స్ 2019 లో రూ. 436 కోట్లు, 2020లో రూ. 497 కోట్లు ఆర్జించింది. ఇలావుండగా గత సంవత్సరం ద్రవ్యోల్బణ వొత్తిడి కారణంగా 10-20 శాతం వరకూ ధరల్ని పెంచాయి కూడా.

అసలు ప్రేక్షకుల సినిమా వీక్షణానుభవాన్ని మధురానుభూతిగా మల్చడానికి అయ్యే ఖర్చులో థియేటర్ నిర్మించడానికి భారీ మొత్తంలో మూలధనం, విద్యుత్ ఖర్చులతో పాటు, అద్దె ఖర్చులు, సిబ్బంది ఖర్చులూ వుంటున్నాయి. థియేటర్ నడపడానికి నిర్ణీత వ్యయం భారీగా వుంటుంది. వ్యాపారంలో సాధారణ అస్థిరత కారణంగా, ఏ సినిమాలు ఆడతాయో, ఏ సినిమాలు ఆడవో అన్నదానిపై ఆధారపడి ఆదాయ సముపార్జన వుంటుంది. పైగా ఎఫ్ బి అమ్మకాలకి సినిమాలకొచ్చే వ్యక్తులు మాత్రమే వినియోగదారులు.

థియేటర్‌ని నడపడం అనేది ప్రత్యేకంగా లాభదాయకమైన వ్యాపారం కాదనేది ఈ కంపెనీల అభిప్రాయం. అందువల్ల ఎఫ్ బి అందించే వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. కంపెనీలకి భారీగా వ్యయమయ్యేది సినిమాలపైనే. బాక్సాఫీసు వసూళ్ళలో 42-45 శాతం వరకూ నిర్మాతలకి లేదా పంపిణీ దారులకి చెల్లించాల్సి వుంటుంది. అందువల్ల సినిమా ప్రదర్శనా రంగం ఆహార పానీయాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై చాలా ఆధారపడి వుందని, టిక్కెట్ అమ్మకాలు మాత్రమే నిర్వహణ ఖర్చుల్ని కవర్ చేయవనీ అంటున్నారు.

సినిమా హాళ్ళు పది సంవత్సరాల క్రితంతో పోల్చినప్పుడు ఎఫ్ బి సెగ్మెంట్ లో విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్నాయనీ, సినిమా హాళ్ళలో బయటి ఆహారాన్ని అనుమతించినట్లయితే ఈ పెట్టుబడి అంతటికీ అర్ధం వుండదనీ విశ్లేషిస్తున్నారు.

నిజమే, హోటల్ కెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్డే తింటున్నప్పుడు, సినిమాకెళ్తే అక్కడి స్నాక్స్ తినడానికి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఫీలవడమెందుకు? కోర్టుల కెక్కడమెందుకు? మహేష్ బాబు కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్లో 120 రూపాయలకి రెండు ఇడ్లీలు తినడానికి అభ్యంతరం చెప్పడం లేదుగా?

ఇదంతా కాశ్మీర్లో మొదలైంది

2018 లో థియేటర్లలోకి సినిమా ప్రేక్షకులు సొంతంగా ఆహారం, నీరు తీసుకెళ్ళ డాన్ని నిషేధించరాదని జమ్మూ కాశ్మీర్  హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు జులై 18న ఆదేశాలు ఈ జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాఋ. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తి  పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం,  జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని  తోసిపుచ్చింది. జమ్మూకాశ్మీర్‌ హైకోర్టు తీర్పుని సమర్థిస్తే, ఇక ప్రేక్షకులు థియేటర్ లో నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగుతారని, జిలేబీ తిని వేళ్ళని సీటుకి తుడుస్తారనీ, తందూరీ చికెన్ ఆరగించి ఎముకలు సీట్లో వేస్తారనీ... ఇదంతా ఎవరు క్లీన్ చేయాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చురకలేశారు.
        
సినిమా హాలు అనేది హాలు యజమాని ప్రైవేటు ఆస్తి కాబట్టి, ఆహార విక్రయానికి సంబంధించిన నిబంధనల్ని నిర్దేశించే హక్కు యజమానికి వున్నందున, వారి సొంత ఆహార పానీయాలని విక్రయించే హక్కు వారికి వుందని పేర్కొంటూ ధర్మాసనం ఈ వివాదానికి తెరదించింది.
        
దాదాపూ 1970 ల వరకూ సినిమా హాళ్ళల్లో పొగత్రాగుట నిషేధం కాదు. లేడీస్ కి అస్సలు అభ్యంతరం కాదు. అదొక సమస్యే కాదు. థియేటర్ నిండా ఆ పొగ మేఘాల్లోనే సినిమాలు చూసి ఆనందించేవారు. సినిమాల్లో కూడా యదేచ్ఛగా పొగత్రాగే దృశ్యాల చిత్రీకరణ వుండేది. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ లో సర్కస్ కొచ్చిన ఆఫీసర్లు పక్కన భార్యల్ని కూర్చోబెట్టుకుని జల్సాగా పొగత్రాగుతూ సర్కస్ ని తిలకించే దృశ్యం వుంటుంది. ప్రోగ్రాముల్లో కూడా ఇదే తంతు. నాటి బాలీవుడ్ గీత రచయిత ఆనంద్ బక్షీ అయితే ఇంకో అడుగు ముందుకేశారు. విదేశంలో ఇచ్చిన ఒక మ్యూజికల్ ప్రోగ్రాంలో ప్రేక్షకుల ముందు రాయల్ గా విస్కీ సేవిస్తూ పాట పాడిన వీడియో యూట్యూబ్ లో వుంది. 
        
ఆ స్వేచ్ఛ ఇప్పుడు తినుబండారాల విషయంలో కూడా లేదు. అసలు సినిమాకెళ్తే ఎందుకు తినాలన్నది ప్రశ్న. తినకుండా సినిమాలు చూడలేరా?
—సికిందర్