రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జులై 2022, శుక్రవారం

1180 : స్క్రీన్ ప్లే సంగతులు

Rapid trending article…

All drama is conflict; without conflict there is no character; without character there is no action; without action there is no story. And without story there is no screenplay

 —Syd Field


          సినిమా కథకి మొట్ట మొదట చూడాల్సింది అసలు అందులో విషయం ఏమైనా ఆర్గ్యుమెంట్ తో కూడి వుందాని. ఆర్గ్యుమెంట్ తో లేకపోతే పక్కన పెట్టేయాలని. లేదా విషయాన్ని ఆర్గ్యుమెంటల్ గా మార్చేయాలని. విషయంలో ఆర్గ్యుమెంట్ లేకపోతే అది కథ కాకుండా గాథ అవుతుంది. గాథలు కమర్షియల్ సినిమాలు కాలేవు, ఆర్ట్ సినిమాలవుతాయి. ఈ విషయం ఈ బ్లాగులో గాథలుగా వచ్చి ఫ్లాపయిన అనేక సినిమాల విశ్లేషణల్తో గత కొన్నేళ్ళుగా చెప్పుకుంటూనే వస్తున్నాం, హెచ్చరించుకుంటూనే వున్నాం. అయినా మళ్ళీ ఇంకో గాథ తీయనే తీశారు. ఇలా కథకీ, గాథకీ తేడా తెలుసుకోకుండా ఫ్లాప్ సినిమాలు ఇంకా తీస్తూ వుండే ఒరవడి కొనసాగుతోంది. చాలా మంచిది. కథంటూ తీస్తే అది ఎన్ని వంకర్లతో వున్నా ఎంతో కొంత ఆడుతుంది. ఎందుకంటే అందులో కాన్ఫ్లిక్ట్ అనేది ఒకటి వుంటుంది. గాథని ఎంత భావుకతని తోడి దృశ్య కావ్యం చేసినా ఒక్క రోజు కూడా నిలబడదు. ఎందుకంటే ఇందులో కాన్ఫ్లిక్ట్ వుండదు. కథంటే ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ తో కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. గాథంటే స్టేట్ మెంట్. స్టేట్ మెంట్ తో కాన్ఫ్లిక్ట్ పుట్టదు. బ్రహ్మాకలితో వుండే బాక్సాఫీసుకి కావాల్సింది యాక్టివిటీతో వుండే కాన్ఫ్లిక్టే గానీ, పాసివిటీతో వుండే స్టేట్ మెంట్ కాదు. 

        విరాటపర్వం ఒక పూర్తి నిడివి గాథ. పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. గాథలకి మార్కెట్ లేనట్టే, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకీ మార్కెట్ లేదనేది తెలిసిందే. ఎంత స్టార్ హీరోయిన్ అయినా అది యాక్షన్ సినిమా అయితే తప్ప విషాదాంత ప్రేమ సినిమాలకి మార్కెట్ లేదు. మూడోది, నక్సల్ సినిమాలకి ఇక బాక్సాఫీసు అప్పీల్ లేదనేది కూడా తెలిసిందే. ఇలా గాథ, అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ గాథ, పైగా నక్సలిజంతో కూడిన గాథ- ఈ మూడు ప్రతికూలాంశాలని సినిమాకి ఐడియా తట్టినప్పుడే మార్కెట్ యాస్పెక్ట్ పరంగా ఏరి పారేయాల్సినవి. ఒక ఐడియా అనుకున్నప్పుడు ముందుగా చూడాల్సింది అందులో కథే వుందా లేక గాథేమైనా పొంచి వుందా అనేది. ఇది తెలుసుకో గలిగితే విరాటపర్వం లాంటి ఇంకో ప్రమాదాన్ని ఆపొచ్చు. లేకపోతే రాధే శ్యామ్, బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, డియర్ కామ్రేడ్, జార్జి రెడ్డి, అంతరిక్షం, పైసా, చక్కిలిగింత, మొగుడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, జక్కన్న- ఇలా ఎన్నెన్నో గాథ సుధా లహరులు ఫ్లాపులుగా పారిస్తూ పోవచ్చు.


        తెలుగులో ఈ స్వయంకృషి చాలనట్టు, అరవం నుంచి సముద్రకని దర్శకత్వం వహించిన ‘వినోదయ చిత్తం’ (వింత కోరిక) అనే దాన్ని కూడా తెచ్చుకుని పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ లతో రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నట్టు ఆ మధ్య పిడుగుపాటు లాటి వార్తవచ్చింది. ఈ అరవ గాథ గనుక రీమేక్ చేస్తే శుభ్రంగా ఇంతే సంగతులు చిప్పగించవలెను!

1. సాయిపల్లవి ప్రేమాయణం - ప్రయాణం

    విరాటపర్వం గాథ ఏమిటో ఈపాటికి తెలిసిపోయే వుంటుంది. స్థూలంగా ఓసారి చూద్దాం...1990 లో ఒక వెన్నెల రాత్రి ఎదురుకాల్పుల మధ్య పుట్టిన సాయిపల్లవి పెరిగి పెద్దయి, అరణ్య పేరుతో కామ్రేడ్ రవన్నగా రానా రాస్తున్న విప్లవ కవిత్వంతో అతడ్ని ప్రేమించి, వెతుక్కుంటూ వెళ్ళి అతడ్ని చేరుకుంటుంది. అతను ఆమె ప్రేమని తిరస్కరిస్తాడు. అప్పుడు ఉద్యమం మీద ప్రేమ పెంచుకుని దళంలో చేరుతుంది. కోవర్ట్ పేరుతో దళంతో పోలీసులు ఆడిన నాటకంలో సాయిపల్లవే కోవర్టని అపార్ధం చేసుకున్న రానా చేతిలో- చివరికి సాయిపల్లవి చనిపోవడం ఈ విషాద గాథ ఇతివృత్తం. 

        ఇందులో 30 వ నిమిషంలో సాయిపల్లవి రానాని కలుసుకోవడానికి ఇల్లు విడిచి వెళ్ళిపోవడంతో బిగినింగ్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇక్కడ్నుంచీ రెండు గంటలా 10 వ నిమిషంలో దళానికి కోవర్ట్ గురించి ఉత్తరం రావడంతో మిడిల్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ టూ వస్తుంది. తిరిగి ఇక్కడ్నుంచీ 20 నిమిషాల పాటూ ఎండ్ విభాగముంటుంది. ఇవీ స్క్రీన్ ప్లేకి ఏర్పాటయిన మూడంకాలు. ఈ అంకాల్లో గాథ ఎలా సర్దుబాటయ్యింది చూద్దాం...

2. బిగినింగ్ లో అన్నీ మిస్

    ముందుగా ప్లాట్ పాయింట్ వన్ వరకూ చూద్దాం. సాయిపల్లవి తను ప్రేమించిన రానా కోసం ఇల్లు వదిలేసే ఈ బిగినింగ్ విభాగం కథనంలో వుండే 4 టూల్స్ ఎలా పని చేశాయి? మొదటి టూల్ నక్సల్ బ్యాక్ డ్రాప్ అంటూ గాథని పరిచయం చేశారు సరే. రెండో టూల్ పాత్రల పరిచయం. ఈ టూల్ తో సాయిపల్లవి పాత్ర పరిచయం, నడత, నడక, నిర్ణయం ఎలా వున్నాయి? రానా రాసిన కవిత్వం చదివి ప్రేమలో పడిపోయింది. మామూలు రచయిత రాసే నవలలు చదివి ఆ రచయితతో ప్రేమలో పడ్డం వేరు, ఉద్యమంలో వున్న ఒక నక్సలైట్ రాస్తున్న కవిత్వంతో వేరు. అతడ్ని ప్రేమించడమంటే కవిగా మాత్రమే అతడ్ని ప్రేమించడం కాదు, అతడిలోని నక్సలైట్ ని కూడా కలిపి మొత్తం ఒక ప్యాకేజీగా ప్రేమించడం. రానా కవి- నక్సల్ రెండిటి ప్యాకేజీగా లభిస్తాడు. సింగిల్ గా కవిగా రాడు. బై వన్ గెట్ వన్ వ్యవహారం. అందుకని అతను రాసిన నాలుగక్షరాలు చదివేసి ప్రేమని రగిలించుకోవడం పాత్రకి మోటివేషన్ అన్పించుకోదు, విషయం నుంచి వేర్పడ్డం అవుతుంది.

        ఈ మోటివేషన్ కాజాలని మోటివేషన్ కి, నైతిక సాహసం ఆమెకి కృష్ణుడి మీద ప్రేమతో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన మీరాబాయి ఇతిహాసంలో దొరికింది.

        కానీ మౌలికంగా మోటివేషన్ తన పుట్టుక లోనే వుంది. ఎదురుకాల్పుల రక్తసిక్త వాతావరణంతో కూడిన తన జన్మవృత్తాంతం తనకి తెలుసు. ఈ ప్రారంభ దృశ్యాన్ని తన వాయిసోవర్ తోనే ప్రేక్షకులకి పరిచయం కూడా చేస్తుంది. ఈ ఎదురు కాల్పుల మధ్య సాయిపల్లవి పుట్టి ప్రాణం పోసుకునే ప్రారంభ దృశ్యం ఆమె పాత్రకి గానీ, కథనానికి గానీ ఏమీ ఉపయోగపడక పోతే ప్రారంభ దృశ్యాని కర్ధమేమిటి?

        జాస్, ఫైట్ క్లబ్, మెమెంటో, స్టీవ్ జాబ్స్, ది హర్ట్ లాకర్, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ - మొదలైన హాలీవుడ్ సినిమాల్లో ప్రారంభ దృశ్యాలు (ఓపెనింగ్ ఇమేజెస్) కథలో భాగంగా కథలోకి- పాత్రలోకీ ఎలా ప్రవహిస్తాయో అదొక ఆర్టు.

        ఎదురు కాల్పుల రణరంగంలో తన తల్లి తనకి జన్మనిచ్చిన లాంటి ఉద్వేగపూరిత ఘట్టం ఆమె జీవితంలో మరొకటుండదు. అలా బలంగా ఎస్టాబ్లిష్ అయింది పాత్రకి ఓపెనింగ్ ఇమేజి. అది ఆమె psyche లో- చేతనలో ఇంకిపోయి- ఆమెని నడిపించాలి. ఇలా కానప్పుడు పాత్రకి పడ్డ బీజం వేరు, ఇజం వేరుగా - సీడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పుకోవాలంటే, పాత్ర పుంజాలు తెంపుకుని పేజీల్లోంచి పలాయనం చిత్తగించడమే  అవుతుంది. సాయిపల్లవి పాత్ర పుంజాలు తెంపుకుని సినిమాని గుంజకి కట్టేసింది ఈ బిగినింగ్ విభాగంలోనే.

        పాత్ర గత జీవితంలో ఏదైనా ప్రభావశీలమైన సంఘటన వుంటే, అది ఆ పాత్ర చిత్రణకి సర్కిల్ ఆఫ్ బీయింగ్ అవుతుంది. ఇది వెన్నాడుతూ వుంటుంది. ఇదే ఆ పాత్ర ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. కానీ సాయి పల్లవి తన జీవితంలో సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని ఫీలే కావడం లేదసలు. ప్రాణాంతక పరిస్థితుల్లో జన్మ నిచ్చిన తల్లి, అందులోనూ తనకోసం ప్రాణత్యాగం చేసిన ఇంకో తల్లి నక్సలక్క, ఆమె స్మృతిపథంలో లేనేలేరసలు  చిన్నప్పట్నుంచీ కూడా. వీళ్ళని వదిలేసి కృష్ణుడి బొమ్మని పట్టుకుంది.

        లేకపోతే ఆమె రానా కవిత్వం చదువుతున్నప్పుడే ఆమె సర్కిల్ ఆఫ్ బీయింగ్ (జన్మ వృత్తాంతం) తో కనెక్టయి కర్తవ్యం తెలుసుకునేది. ఇంత బలమైన కవిత్వం రాస్తున్న రానా ఉద్యమంలో తను కూడా భాగం కావాలని. అలా ఆమె ఉద్యమం కోసం ఇల్లు విడిచిపెట్టేయాలి- ప్రేమకోసం కాదు. తర్వాత ప్రేమలో పడొచ్చు.

        ప్రారంభ సీనుతో ప్రత్యేక పరిస్థితుల్లో పాత్ర పుట్టుకతో పరిచయం చేసిన తీరు చూస్తే ఇప్పుడే ప్రేమ పుట్టే అవకాశమే లేదు. ప్రేమ కంటే ఉద్యమం గొప్పది. ప్రేమ వ్యక్తిగతం, ఉద్యమం సామాజికం. వ్యక్తిగతం, సామాజికం, అంతర్జాతీయం, ఆధ్యాత్మికం అనే నాల్గు నిచ్చెన మెట్లలో పాత్రలతో కథలుంటాయి. ఒక దానికి ఉన్నతంగా మరొకటి. సాయిపల్లవి అట్టడుగు వ్యక్తిగత స్థాయిలోనే వుండిపోయింది. కానీ నక్సలిజం కథలు వ్యక్తిగత కోర్కెలు తీర్చుకునే నైతిక ఆవరణతో వుండవు. సాయిపల్లవి పాత్ర వ్యక్తిగత ప్రేమ కోసం కంటే, పై మెట్టులో సమాజం కోసం ఆలోచించినప్పుడు మాత్రమే ఉన్నతమైనది. ఆమె ఉద్యమ లక్ష్యం పెట్టుకుని వుంటే, తర్వాత ఉద్యమం లోంచి ప్రేమ పుట్టొచ్చు, ప్రేమలోంచి ఉద్యమం పుట్టరాదు. అది స్వార్ధం, అవినీతి. చివరికిలాగే తేలి ముగిసింది పాత్ర.

3. మీరాబాయి ఆదర్శం?

    ఇక మూడో టూల్ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన-  దీనికి రెండు దృశ్యాలున్నాయి : తను మీరాబాయి కథ వినడం, దాంతో పెళ్ళి సంబంధం కాదనడం. ఈ మీరాబాయి కథ అప్పటికే రానా మీద తనకేర్పడిన ఏకపక్ష ప్రేమని ఆచరణలో పెట్టేందుకు ప్రేరణగా. కానీ మీరాబాయి జీవితం సాయిపల్లవి జీవితం లాగా లేదు. మీరాబాయి సామాజిక, కుటుంబ కట్టుబాట్లని వ్యతిరేకించేది. అయిష్టంగానే రాకుమారుడు భోజ్ రాజ్ ని పెళ్ళి చేసుకుంది. యుద్ధంలో అతను చనిపోయాక అత్తామామల వేధింపులకి గురయింది. రెండు సార్లు హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకుంది. ఈ కష్టాల్లోంచి కృష్ణుడ్ని పతిగా యెంచుకుని వూరట పొందింది. కృష్ణ భక్తురాలిగా జగత్ప్రసిద్ధ భజన్లు రాసింది.

        మీరాబాయి పీడనల్లోంచి కృష్ణ భక్తురాలైంది. కానీ సాయిపల్లవిని ఎవరూ పీడించలేదు. మీరాబాయితో పోలికే లేదు. కుతూహలం కొద్దీ రానా కవిత్వం చదివి అతడి భక్తురాలైంది. ఈ టీనేజీ చాంచల్యం చాలు ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి- మీరాబాయితో క్లాసిక్ బిల్డప్ తనకిచ్చుకో నవసరం లేదు. ఇంకోటేమిటంటే, మీరాబాయితో క్లాసిక్ బిల్డప్ ఇచ్చుకుంటున్నప్పుడు, ఇప్పట్నుంచే తను కృష్ణుడి బొమ్మని పట్టుకోవాలి గానీ, చిన్నప్పట్నుంచీ కాదు.    

        ఇక ఈ మూడో టూల్ లో రెండో దృశ్యం- తనకి పెళ్ళి సంబంధం చూస్తే తల్లిదండ్రులతో దెబ్బలాడడం. ఇలా దోషాలతో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన బలహీనంగా పూర్తయ్యాక, ఆఖరిగా నాల్గో టూల్ గా- ఆమె రానా కోసం ఇల్లు విడిచి వెళ్ళిపోవడంతో సమస్య ఏర్పడి, దాన్ని సాధించే గోల్ ఏర్పాటయింది.

4. గోల్ ఎలిమెంట్స్ ఏవి?

    ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోయే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం దగ్గర పాత్ర కేర్పడ్డ గోల్ ఏమిటి? తను ప్రేమిస్తున్న రానాని చేరుకోవడం. ఈ గోల్ లో వుండాల్సిన ఎలిమెంట్స్ ఏమిటి- 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ఇవెలా వున్నాయి?

        1. కోరిక : కవిత్వం చదివి రానా మీద ప్రేమని పెంచుకున్న ఆమె మోటివేషన్ ఏవిధంగా సరిగా లేదో పైన చూశాం. కోరిక ఫ్లాట్ గా వుంది, టీనేజీ చేష్టలాగా. 2. ఆ కోరిక కోసం ఆమె దేన్ని పణంగా పెడుతోంది? దేన్నీ లేదు. ఆ విధమైన సెటప్ ఏర్పాటు చేయలేదు బిగినింగ్ విభాగంలో. శివ లో నాగార్జున మాఫియా భవానీ అనుచరుడు జేడీ చక్రవర్తిని సైకిలు చెయినుతో కొట్టే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో, తన అన్న కుటుంబాన్ని పణంగా పెట్టాడు. జేడీని కొట్టడమంటే భవానీతో పెట్టుకోవడమే. భవానీతో పెట్టుకోవడమంటే అన్న కుటుంబాన్నీ కూడా తన పోరాటంలోకి లాగడమే. ఇది నిజమవుతుంది తర్వాత.

        దీని కోసం - ఈ పేఆఫ్ కోసం ఇంటి దగ్గర అన్న కుటుంబంతో నాగార్జున సీన్లు ప్రత్యేకంగా రిజిస్టర్ చేస్తూ సెటప్ ఏర్పాటు చేశారు బిగినింగ్ విభాగంలో. అందుకని నాగార్జున జేడీని కొడుతున్నప్పుడు మనకి అన్న కుటుంబం మెదిలి కంగారుపడతాం. నాగార్జున తీసుకుంటున్న రిస్కుకి ఆందోళన చెందుతాం. ఇదీ ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసే సరైన రైటింగ్ అంటే, డ్రామా అంటే, రస పోషణ అంటే కూడా.

        సాయిపల్లవి విషయంలో ఇవేమీ కన్పించవు. ఆమె తనెలా పుట్టిందో గుర్తుంచుకుని వుంటే, ప్రేమ కోసం ఇల్లు విడిచి వెళ్ళేది కాదు, ఉద్యమం కోసం వెళ్ళేది. కృష్ణుడి బొమ్మతో ఆడుకునేది కాదు, తర్వాత ప్రేమ గుర్తుగా దాన్ని వెంట వుంచుకునేది కాదు.

        ఎదురు కాల్పుల రణరంగంలో సాయంగా వచ్చి తన తల్లికి పురుడు పోసి, తనని ఎత్తుకుని - గుండు దెబ్బ తగిలి ప్రాణాలు వదుల్తూ - లాల్ సలాం చెప్పిన నక్సలక్క ఫోటో తనతో వుంచుకునేది. ఈ సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో తనుండేది. ఈ గాథలో కృష్ణుడి బొమ్మ ప్లాట్ డివైస్ అవదు. తన కోసం చనిపోతూ లాల్ సలాం చెప్పిన నక్సలక్క ఫోటో ప్లాట్ ని డ్రైవ్ చేసే టూల్ అవుతుంది. ఈ ఫోటోకి ఇంకో లీడ్ గా, రానా కవిత్వం తోడైతే ఆమె ఉద్యమ ప్రయాణమే మొదలవుతుంది.

        కృష్ణుడి బొమ్మనే ప్లాట్ డివైస్ గా ఆమె ప్రేమ ప్రయాణాన్నే చూపించ దల్చుకుంటే, ఆమె పుట్టుక గురించిన ప్రారంభ దృశ్యం వేయకూడదు. ప్రారంభ దృశ్యం ఏం జరగాలో ఆల్రెడీ ఆమె నొసట రాసేసింది. కథకుడు ఇంకేం చేయలేడు. సాధారణంగా గాథల్లో ఏం జరుగుతుందంటే, కథకుడు పాత్రని ఆలోచించుకో నివ్వడు, పాత్ర కోసం తను ఆలోచించి పెట్టి నడిపిస్తాడు. ఇది చాలా అన్యాయం, నియంతృత్వం. దీంతో యాక్టివ్ పాత్ర కాక, ఇలా పాసివ్ పాత్ర తయారవుతుంది. గాథ అంటేనే కథకుడు నడిపించే పాసివ్ పాత్రల లో లో లో.. తైన అగాథం!

అందుకని ఉద్యమం కోసం ఆమె ఇల్లు వదిలేస్తే, గోల్ ఎలిమెంట్స్ లో రెండోదైన పణంకి చోటుంటుంది. దేన్ని పణంగా పెడుతుంది? తన కుటుంబాన్నీ, తన ప్రాణాల్నీ. ప్రేమకోసం వెళ్ళి వుంటే కుటుంబం మీద రాజ్యం వొత్తిడి వుండదు, ఉద్యమం కోసం వెళ్తే లాకప్ లో వేసి లాఠీ తీస్తుంది రాజ్యం. ఇక ఉద్యమంలో ఆమె ప్రాణాల సంగతి సరేసరి. ప్రేమ కోసం వెళ్తే ప్రేమికుడు కాపాడొచ్చు. ఇందులో రిస్కు లేదు. ఉద్యమంలో ఎవరి పోరాటం వాళ్ళే చేయాలి. ఇందులో ఆమెకి చాలా రిస్కు వుంది. ఈ రిస్కే పాత్రని మనం కేర్ చేసేలా చేస్తుంది. పాత్ర ఎదుగుదల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇదంతా - ఈ డైనమిక్స్ అన్నీ కథగా చేస్తే వచ్చే విలువలు.

        ఇక మూడవ ఎలిమెంట్ - పరిణామాల హెచ్చరిక. సాయి పల్లవి పాత్రకి దీనికి సంబంధించి కూడా సెటప్ ఏమీ లేదు. 'శివ'లో నాగార్జునకి అన్న కూతురు వుంటుంది. నాగార్జునకి ఈమెతో అనుబంధాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ వస్తారు బిగినింగ్ విభాగంలో. ఇలా చూపిస్తున్నారూ అంటే అన్న కూతురికి మూడినట్టేనని మనం అనుకోవాలి. అనుకుని, పైన చెప్పుకున్నట్టు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కింగ్ నాగ్, గడ్డం చక్రవర్తిని  సైకిలు చెయినుతో వీరబాదుడు బాడుతున్నప్పుడు, అన్న కూతురు కూడా గుర్తొచ్చి ఆందోళన చెందాలి మనం. కింగ్ నాగ్ ఇప్పుడు తెగబడుతున్న దానికి మున్ముందు పరిణామాలెలా వుండొచ్చో హెచ్చరించేదే ఈ ఎలిమెంట్.

        చివరికి భవానీ ఈ అన్న కూతుర్ని చంపనే చంపేస్తాడు. ఎందుకు చంపాలి? ప్రధాన పాత్రకి -అంటే ఇక్కడ నాగ్ కి- వ్యక్తిగత నష్టం జరక్కపోతే, కథ ఏమంత బావుండదు గనుక  (జోసెఫ్ క్యాంప్ బెల్  ప్రసిద్ధ మోనోమిథ్ స్ట్రక్చర్ 'ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్' చదువుకోవచ్చు. ప్రపంచ పురాణాల్లో చూసే ఈ థియరీ రాశాడు). ఇదంతా సమగ్ర కథనానికి పనికొచ్చే స్ట్రక్చర్. స్ట్రక్చర్ అవసరం లేదనుకుంటే కథకి నీళ్ళొదులు కోవాలి.

        ఈ పరిణామాల ముందస్తు హెచ్చరిక కోసం, వ్యక్తిగత నష్టానికి మనిషి లేకపోతే యంత్రమైనా వుండాలి. స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన 'డ్యూయెల్' స్క్రీన్ ప్లే సంగతులు (1172, 73, 78) లో దీన్ని గమనించాం. బిగినింగ్ విభాగంలో హీరో కారు రేడియేటర్ పైపు మార్చాలంటే తర్వాత మారుద్దాంలే అని వెళ్ళిపోతాడు హీరో. ఈ రేడియేటర్ పైపు ఇతడికేదో ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందన్న సస్పెన్సు పుడుతుంది. క్లయిమాక్స్ లో ఈ రేడియేటర్ పైపు పగిలి కారు పనికి రాకుండా పోయి- వెనుక ఆయిల్ ట్యాంకరుతో గుద్ది చంపడానికి దూసు కొచ్చేస్తున్న సైకో డ్రైవర్ తో ప్రాణగండంలో పడిపోతాడు హీరో! యంత్ర నష్టం ఎంత కష్టం?

        నాల్గవ ఎలిమెంట్  ఎమోషన్... సాయిపల్లవి తన సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని భగభగ మండే కంఠాభరణంలా ధరించి గనుక ఉద్యమ గోల్ కోసం వెళ్తే వుండే ఎమోషన్, ప్రేమ కోసం వెళ్తే వుంటుందా? ఆ గాథకి ఆధారమని అంటున్న తూము సరళ ఉద్యమం కోసమే వెళ్ళింది, ప్రేమ కోసం కాదు. ఇలా సరైన దృక్పథం లేని పాసివ్ పాత్రగా- ప్రధాన పాత్రగా- సాయిపల్లవి మిడిల్ విభాగపు గాథని ఇంకెలా నడిపించిందో ఇక చూద్దాం...

5. మిడిల్ ఓ మిధ్య  

    అలా పై బిగినింగ్ విభాగంలో మొదటి టూల్ తప్ప మిగిలిన మూడు టూల్స్ పాలన జరగలేదు. అలాగే గోల్ ఎలిమెంట్స్ జాడలేవు. ప్లాట్ పాయింట్ వన్ లో ఆమెకి ప్రత్యర్ధి పాత్ర (రానా) కూడా ఏర్పాటు కాలేదు. ఆమె రానాని కలుసుకోవడానికి ప్రయాణానికి ఒడిగట్టింది కాబట్టి, ప్లాట్ పాయింట్ వన్ లో ప్రత్యర్ధి పాత్ర (ప్రేమలో) తో సంఘర్షణ ప్రారంభం కాలేదు. నిజానికి కథల్లో ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ విభాగం ముగిశాక, మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. అంటే కథ ప్రారంభమవుతుంది. బిగినింగ్ విభాగంలో వుండేదంతా కథ కాదు, కథకి ఏర్పాట్లు మాత్రమే. మిడిల్లో వుండేదే కథ.

        మిడిల్ విభాగంలో కథా ప్రారంభమంటే గోల్ కోసం ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణే. మిడిల్ విభాగపు బిజినెస్ ప్రత్యర్ధితో సంఘర్షణ అయినప్పుడు, ఈ సంఘర్షణ కొరవడితే అది కథ కాదు, గాథ అవుతుంది. స్పీల్బెర్గ్ డ్యూయెల్ లో ఇలాటి పరిస్థితిని దాటవేయడం  వుంటుంది. బిగినింగ్ విభాగంలోనే హీరో కారుని ఆయిల్ ట్యాంకర్ తో వెంటాడుతూ ప్రత్యర్ధి పాత్ర సైకో డ్రైవర్ వుంటాడు గానీ,  ఈ సంగతి మనకే తెలుస్తుంది, హీరోకి తెలీదు.        

    సాయిపల్లవి రానాని కలుసుకోవడానికి వెళ్తున్నట్టే, అతనొక బిజినెస్ మీటింగ్ కి వెళ్తూంటాడు. ప్లాట్ పాయింట్ వన్ తర్వాత కూడా అదే బిజినెస్ మీటింగ్ కెళ్ళే గోల్ తో వెళ్తూ వుంటాడు - తనని వెంటాడుతున్న సైకో డ్రైవర్ ని గమనించకుండా. అయితే, ఇలా మిడిల్ ప్రారంభమయిన కొన్ని నిమిషాల్లోనే సైకో డ్రైవర్ ని పసిగట్టి, తను ప్రమాదంలో వున్నాడని గ్రహించేస్తాడు. ఇక - ఇలా సకాలంలో మొదలైపోతుంది ప్రత్యర్ధి సైకో డ్రైవర్ తో మిడిల్ సంఘర్షణ! కానీ సాయిపల్లవి మాత్రం మిడిల్ ప్రారంభమయ్యాక సకాలంలో కాదుకదా అసలెక్కడా సంఘర్షణే ప్రారంభించదు. ఎందుకంటే గాథల్లో సంఘర్షణ వుండదు, పాత్ర ప్రయాణం మాత్రమే వుంటుందని గమనించాలి. గాథ = కేవలం పాత్ర ప్రయాణపు డాక్యుమెంటేషన్.

6. మరేం చేసింది?

    ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తను పాసివ్ పాత్రగా తేలిపోవడం వొక గాథా లక్షణమైతే, ఆ వెంటనే మిడిల్ సంఘర్షణ ప్రారంభించకపోవడంతో - మిడిల్ ని కూడా పొడిగించిన బిగినింగ్ విభాగం లాగే మార్చేసింది. గాథలు ఎలా వుంటాయంటే, ఒకటే పొడిగించిన బిగినింగ్ విభాగం లాగే వుంటాయి చివరివరకూ. స్టీవెన్ స్పీల్ బెర్గ్ అంటాడు- ఈ రోజుల్లో కథ ఎలా చెప్పాలో మర్చే పోయారు. కథల్లో మిడిల్ వుండడం లేదు, ఎండ్ వుండడం లేదు- ఒకటే బిగినింగ్ వుంటోంది- ఎంతకీ, ఇంకెంతకీ ముగియని బారెడు బిగినింగ్- అంటాడు! సాయిపల్లవి గాథ స్పీల్బెర్గ్ ని నిజం చేస్తోంది.

        నక్సల్ రానాని వెతుక్కుంటూ వెతుక్కుంటూ కాలహరణం చేసి అరగంట తర్వాత కలుసుకుంటుంది. ఇక కథ ప్రారంభమైందని సంతోషిస్తాం. ప్రారంభమైనట్టే ప్రారంభమై మాయమైపోతుంది. ఇదెలాగో కింద చూద్దాం...

7. ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది
            తనని కలుసుకున్న సాయిపల్లవి ప్రేమని నక్సల్ రానా తిరస్కరిస్తూ, ఈ రోజుల్లో సమాజంలో స్త్రీలకు చదువులేదు, స్వేచ్చలేదు, గౌరవం లేదు. ఉన్నదల్లా దుఖం. ఆ దుఖం కోసం మీరు పని చేయాలి. నీ తెలివినీ, నీ ఆలోచననీ, నీ ప్రేమనీ ఆడవాళ్ళకోసం ఉపయోగించాలి అంటాడు.

        అప్పుడామె అంటుంది, ఈ కళ్ళల్లో నిజాయితీ కనిపించడం లేదా? ప్రేమ కనిపిస్త లేదా?’

        అతనంటాడు, దేనికి పనికొస్తదీ ప్రేమ? ఈ బూర్జువా వ్యవస్థలో మనిషిని మనిషి నమ్మించి మోసం చేసుకోవడానికి మాత్రమే పనికొస్తదీ ప్రేమ. ప్రేమనేది నా దృష్టిలో బలహీనుల సామాజిక రుగ్మత
        ఆమె అంటుంది, అంటే ప్రేమ రోగమా? అట్లంటే కృష్ణుడ్ని ప్రేమించిన మీరాబాయి సంగతేంది?’ (మీరాబాయిని వదిలేలా లేదు).
        అతనంటాడు, కృష్ణుడ్ని ప్రేమించిన మీరాబాయి ఒక్కతే కాదు, శివుడ్ని ప్రేమించిన సిద్ధేశ్వరి, అక్క మహాదేవి, కవయిత్రి భళ్ళా వీళ్ళందరిదీ రుగ్మతే
        ఆమె అంటుంది, కార్ల్ మార్క్స్ ప్రేమించిన జెన్నీ వాన్ వెస్ట్ఫాలెన్? లెనిన్ ప్రేమించిన నాదెడ్జా క్రుప్స్కాయా? మావో ప్రేమించిన లువో యిక్సియూ? వీళ్లది కూడా రుగ్మతేనా?’

        దీనికి సమాధానం చెప్పలేక పోతాడు వామపక్ష కవియై వుండీ. ఏం చెప్పాలో తెలియనట్టు చూసి ఆర్గ్యుమెంట్ వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ సన్నివేశంలో సాయిపల్లవిది పై చేయిగా వుండాలని, ఆర్గ్యుమెంట్ గెలవాలని కథకుడి ఉద్దేశం. కానీ సాయిపల్లవిది పైచేయి కాదు, ఎందుకంటే ఆమె ఆర్గ్యుమెంట్ కి అర్ధం లేదు. 

రానా సీను ప్రారంభంలో మొదట ప్రేమ గురించి కవిగా అతడి అభిప్రాయమెలా వుందో, సీను చివర అతడి పరాజయం అలాగే వుంది. మోసం చేయడం బూర్జువా వ్యవస్థకే చెందిన లక్షణమా?వ్యవస్థల కతీతంగా అది మనిషి సహజాతం కావచ్చేమో? ప్రేమనేది బలహీనుల సామాజిక రుగ్మతంటూ - ఆ రుగ్మతని మీరాబాయి, సిద్ధేశ్వరి, అక్కమహాదేవి, కవయిత్రి భళ్ళా లకి ఆపాదించేస్తాడు.

        యుద్ధంలో భర్త చనిపోయిన మీరాబాయిని అత్తామామలు పీడిస్తూంటే ఆ పీడనల్లోంచి ఆమె కృష్ణ భక్తురాలైంది. అక్కమహాదేవి రాజుతో పెళ్ళి కిష్టపడక, ఇష్టపడక పోతే తన కుటుంబాన్ని బతకనీయడని, కొన్ని షరతులతో పెళ్ళి చేసుకుంది. ఆ షరతుల్లో ఒకదాన్ని అతను ఉల్లంఘిస్తే, వెళ్ళిపోయి శివుడ్ని పతిగా భావించి శివ భక్తురాలైంది.    

ఇలాగే మిగిలిన ఇద్దరూ. వీళ్ళు ఫ్యూడల్ వ్యవస్థ పీడితురాళ్ళు. వర్గ శత్రువుని ఏరేసే ఒక నక్సలైట్ గా తను వీళ్ళ పక్షం వహించకుండా, వీళ్ళ ప్రేమల్ని రుగ్మతంటూ చులకన చేస్తాడు. కానీ స్త్రీల దుఖం కోసం మీరు పని చేయాలని మొదట అన్నాడు.

        సాయిపల్లవి కూడా మార్క్స్, లెనిన్, మావోలని ప్రస్తావించి వాళ్ళ ప్రేమలు కూడా రుగ్మతలేనా అనడం సందర్భోచితంగా అన్పించదు. మార్క్స్, లెనిన్, మావోలు వాళ్ళ భావజాలాలతో సిద్ధాంత కర్తలు కాక మునుపే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. మార్క్స్ చిన్ననాటి స్నేహితురాలు జెన్నీని 25 వ యేట చేసుకున్నాడు. లెనిన్ విప్లవ కార్యకలాపాలు చేస్తున్నాడని సైబీరియాకి బహిష్కరించిన తర్వాత, అతడ్ని కలుసుకోవాలంటే అతడ్ని పెళ్ళి చేసుకోవాలని షరతు విధించి, స్నేహితురాలైన క్రుప్స్కాయాని పంపించారు. అలా లెనిన్ ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ఇక మావోకి పదమూడేళ్ళకే నాల్గేళ్ళు పెద్దదైన లువోతో పెళ్ళిచేసి పడేశారు ఇంట్లో.

        చరిత్ర ఇలా వుంటే, ఈ ముగ్గురూ రోమియో లైనట్టు, వీళ్ళదీ రుగ్మతేనా అని ప్రశ్నించడం, చరిత్ర తెలియనట్టు దీనికి రానా సమాధానం చెప్పలేకపోవడం,ఇంటలెక్చువల్ సంభావిత  సన్నివేశాన్ని అభాసు చేసింది.

8. కథంటే ఆర్గ్యుమెంట్   
పై ఆర్గ్యుమెంట్ తో హమ్మయ్యా ఈ గాథ ఇకనైనా కథగా ఫిరాయించి, కథా లక్షణమైన ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోందని ఆనందపడే లోపే ఆర్గ్యుమెంట్ ని త్రెంచేసుకుంది. గాథ నడక ఎలా వుంటుందంటే, గోల్ కోసం సంఘర్షణ ప్రారంభమైనట్టే ప్రారంభమై ఆగిపోతూంటుంది. ఇలా వేర్వేరు పాయింట్లతో రిపీటవుతూ వుంటుంది. దీన్ని డాక్యుమెంటరీలకి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారు. ఫ్లాపయిన టైగర్ హరిశ్చంద్ర, ఆటోనగర్ సూర్యలలో దీన్ని గమనించ వచ్చు ( ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్ చదివి సినిమాలు తీస్తున్న దేవకట్ట ఆటోనగర్ సూర్య లో ఇలాగెందుకు చేశారో మరి. తీసే టైమ్ వస్తే చదివి తెలుసుకున్నదంతా పక్కన పెట్టేస్తారేమో చాలా మంది. దీని మూల్యం కూడా భారీగానే చెల్లించుకుంటారు).

        సరే, కథకి ఒకే పాయింటు వుంటుంది. దాంతో సంఘర్షణ, పరిష్కారం వుంటాయి, అంతే. చాలా సింపుల్ ఈ సరళ రేఖలో కథ చెప్పడం. సరళ రేఖ మీద వుండని గాథ చాలా గందరగోళం. కథంటే ఆర్గ్యుమెంట్. ఒకరు నాది రైట్ అంటారు, ఇంకొకరు నీది రాంగ్ అంటారు. ఈ ఆర్గ్యుమెంట్ కి జడ్జ్ మెంట్ చెప్పేదే కథ. ఈ ఆర్గ్యుమెంట్ తో సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) పుడుతుంది. ఈ సంఘర్షణ సాగిసాగి ఒకరి విజయంతో ఎవరు రైటో, ఎవరు రాంగో జడ్జ్ మెంట్ తో ముగుస్తుంది. ఇదే కథకుండే చట్రం.

        నాగార్జున నువ్వు చేస్తున్నది రాంగ్ అంటాడు మాఫియా భవానీతో, మాఫియా భవానీ నేను చేస్తున్నదే రైట్ అంటాడు. ఈ ఆర్గ్యుమెంట్ తో సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) పుడుతుంది. ఈ సంఘర్షణలో యువసామ్రాట్ నాగార్జున భవానీని చావగొట్టి- బ్యాడ్ ఎప్పుడూ రాంగేరా వెధవా అని తీర్పిస్తాడు. ఇంతకి మించి సూపర్ హిట్ శివ లో ఏ గందరగోళం లేదు.

       గాథ అంటే స్టేట్ మెంట్. పాత్రకి పరిష్కరించాల్సిన సమస్య వుంటుంది, కానీ పరిష్కరించకుండా పలాయనం చిత్తగిస్తూ వుంటుంది పాత్ర. పలాయనం చిత్తగించేదే గాథ ల్లో కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతిపెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే తలరాత అన్నట్టుగా పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలు లభిస్తూంటాయి.

        దైవిక పరిష్కారాలు- ఫాటలిజం- డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా హంగు కాదు. డబ్బులు రాని, కొందరు అతి తెలివి మేధావులు మెచ్చుకునే, (బుకింగ్ క్లర్కు నొచ్చుకునే) గాథలతో వుండే ఆర్టు సినిమాల హంగు మాత్రమే. పాత్ర తనకొచ్చిన  సమస్యకి పరిష్కారం కోసం ప్రయత్నించకుండా, ట్రాజడీ వైపు అడుగులేసి ముగించుకుంటూ- నాకో  సమస్య వచ్చిపడి, నాకిలా జరిగితే, నేనిలా అయిపోయానూ - అని వాపోతూ ఓ స్టేట్ మెంట్ పడేసేదే గాథ!  స్టేట్ మెంట్ కీ, ఆర్గ్యుమెంట్ కీ ఇంత తేడా వుంటుంది.

        కథ కర్మ చేయమంటుంది, గాథ ఖర్మ అనుకుంటుంది. పై సాయిపల్లవీ రానాల మధ్య ఆర్గ్యుమెంట్ స్టేట్ మెంట్ గా, కర్మ నుంచి ఖర్మగా మారిపోయింది. దీంతో డాక్యుమెంటరీ కథనం, సెకండాఫ్ సిండ్రోమ్, మిడిల్ మాటాష్, ఎండ్ సస్పెన్స్ మొదలైన రుగ్మతలన్నీ దాడి చేసి రిస్కులో పడిపోయింది సినిమా.

        ఎండ్ సస్పెన్స్ - తను ప్రేమిస్తున్నట్టు రానా చివరి సీనుదాకా చెప్పకపోవడం. మిడిల్ మాటాష్- ప్రారంభమయిన కాన్ఫ్లిక్ట్ వీగిపోవడంతో మిడిల్ తిరిగి బిగినింగ్ గా మారి, కాన్ఫ్లిక్ట్ కోసం దేవులాడుకోవడం. సెకెండాఫ్ సిండ్రోమ్ - స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అయి, ఎత్తుకున్న ప్రేమ సమస్య  అర్ధాంతరంగా ముగిసి, సెకెండాఫ్ లో ఇంకో కథని- గాథని వెతుక్కోవడం. ఆ కొత్త సమస్య లేదా కాన్ఫ్లిక్ట్ కోవర్ట్ ఆపరేషన్. డాక్యుమెంటరీ కథనం- కథకుండే స్ట్రక్చర్ లేకుండా సీన్లు పేర్చుకుంటూ పోవడం.

        సాయిపల్లవి తనకున్న నాలెడ్జితో వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక- తన గురువు గార్లయిన మార్క్స్, లెనిన్, మావోలని అరణ్య రోదనకి వదిలేసి వెళ్ళిపోవడం అంత విప్లవ కవిత్వం రాసే ఇంటలెక్చువల్ రానాకి సబబేనా? మేం రోమియోలం కాదూ సంసారులమని చెప్పవయ్యా అని వాళ్ళ రోదన. మీరా నుంచీ మావో దాకా ఏం ఉపయోగపడ్డారో గాథకి కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది. ఇలా ఇక్కడితో సాయిపల్లవి ప్రేమ ప్రయాణం ముగిసి పోతుంది. గాథ ఇంకో  సమస్య అన్వేషణలో పడుతుంది. కథంటే ఒకే సమస్య, దానికో పరిష్కారం.

        ఇక నక్సల్ గా రానాకి కూడా ఏ గోల్ వుండదు. పదేపదే పోలీసులు ఎటాక్ చేయడం, తను ఎదురు ఎటాక్ ఇచ్చి తప్పించుకోవడం, ఇదే జరుగుతూంటుంది. అంటే సరైన గోల్ లేని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ అన్నమాట. తను బోలెడు యాక్షన్లోనే వున్నట్టు కన్పిస్తాడు పోలీసులతో- ఆ యాక్షన్ పోలీసులు ఎటాక్ చేస్తూంటే తప్పించుకోవడానికే. అంతేగానీ, ఒక యాక్టివ్ క్యారక్టర్ గా పరిస్థితిని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని, పోలీసుల్ని ఓ ఆట ఆడించి పైచేయి సాధించే యాక్షన్ ప్లాన్ తో కూడిన డ్రామా వుండదు. ఇక నక్సల్ గా ఎజెండా కార్యకలాపాలేవీ వుండవు, వూరికే వుంటాడు అడవిలో.

9. సాయిపల్లవి కొత్త పుంతలు
ఇప్పటికి సాయిపల్లవి రెండుసార్లు పోలీసులకి పట్టుబడడం, తప్పించుకోవడం పునరుక్తిగా వుంటుంది. మొదటిసారి సోదర పోలీసు తప్పించుకోనిస్తాడు, రెండోసారి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి రానా విడిపించుకుంటాడు. ఇలా ఎవరో కాపాడితే తప్ప బయటపడలేని పరిస్థితి పాసివ్ పాత్రగా. అంతేగానీ ఒక ప్రధాన పాత్రగా తనే యాక్షన్ తీసుకుని, పోలీసుల్ని పప్పు సుద్దల్ని చేసి తప్పింఛుకోవడం లేదు ప్రేక్షకుల ఈలలూ చప్పట్లూ కొట్టించుకుంటూ. కథనానికి బలాన్నిచ్చే క్యారక్టర్ ఆర్క్ ని పోషించుకునే మాటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కి తన పాత్ర ఎక్కడా తావే ఇవ్వడం లేదు. తన ప్రేమలో నిజాయితీ వుంటే ఆ ప్రేమ కోసం భూమ్యాకాశాల్ని ఏకం చేసేది. మణిరత్నం రోజా లో మధుబాలా ఏం చేసింది? బొంబాయి లో అరవింద్ స్వామీ - మనీషా కోయిరాలా ఏం చేశారు? మహేష్ భట్ రాజ్ లో బిపాసా బసు ఏం చేసింది?

        ఇక రానా పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి నందితాదాస్ కి అప్పగించి వెళ్ళిపోయాక- నందితా దాస్ చెప్పే మాటలకి ఇప్పుడు తానేం  చేయాలో తెలుసుకుంటుంది. ఇది కూడా  రాంగ్ సీను. ప్రధాన పాత్ర- ఇక్కడ కథానాయికగా సాయిపల్లవి - తన సొంత ఆలోచనలతో,  నిర్ణయాలతో, తన కథ తనే నడుపుకోవాలే గానీ, పక్క పాత్రలు చెప్తే విని నడుచుకునే  పాసివ్ పాత్రగా కాదు. కథానాయిక/నాయకుడు ఎడ్యుకేట్ చేసేలా వుండాలిగానీ స్టూడెంట్ గా కాదు.

        ఇక నందితాదాస్ మాటలకి- ప్రేమొక్కటే కాదు, విప్లవం కూడా గొప్పదే అని అడవి బాట పడుతుంది. ప్రారంభించిన ప్రేమ కథని త్రుంచేస్తూ (సెకండాఫ్ సిండ్రోమ్). మీరాబాయి ఇక పనికి రాలేదు. ప్రేమని మరువకు. ఈ అనంత విశ్వమంతా నువ్వు రెక్కల్ని  విప్పార్చుకోవడానికి  చిచ్చురేపే ఉన్మాదమది (హిందీ నుంచి లూజ్ ట్రాన్స్ లేషన్) - అన్న సంత్ మీరాబాయిని చదువుకోలేదు. అతను మార్క్స్, లెనిన్, మావోలని చదువుకోలేదు. పోలీసులు చూస్తే మళ్ళీ పట్టుకునేలా బ్లాక్ డ్రెస్ లో పయనమవుతుంది.

        అంటే, అలా కాకపోతే రానా ప్రేమ కోసం ఇలా నరుక్కొస్తాను అన్నట్టుంది ఆమె ధోరణి విశ్వసనీయతని దెబ్బతీసేలా. ప్రేమ కోసమే విప్లవ వేషం తప్ప, విప్లవం కోసం కాదనిపించేలా వుంది. సెకండాఫ్ సిండ్రోమ్ లో ఒక పాయింటు తీసేసి ఇంకో పాయింటు అతికించడం కష్టం.

        ఇప్పటికే రెండుసార్లు పట్టుకున్న పోలీసులు, ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ కి ప్లాన్ చేసి మూడో సారి పట్టుకోవాలనుకుంటారు. దీంతో సాయిపల్లవిని పట్టుకునే వదులుకునే వ్యవహారంతో కామెడీగా తయారైన పోలీసుల మాటలు - ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ అనడంలో ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఎత్తుగడలో ఇంపాక్ట్ లేదో, ఆ తర్వాత దీని కథనమూ సెకండాఫ్ కి శోభనివ్వలేదు.

        సాయిపల్లవి దళంలో చేరాకా, ఆమె కోవర్ట్ అన్పించేలా దళానికి పోలీసులు ఉత్తరాన్ని ప్లాంట్ చేయడంతో, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి, ఈ స్ట్రక్చర్ లేని మిడిల్ విభాగం ముగింపుకొస్తుంది.

        ప్లాట్ పాయింట్ టూ అనేదెప్పుప్పుడూ ప్లాట్ పాయింట్ వన్ లో ఏ సమస్యైతే పుట్టిందో, దానికి పరిష్కార మార్గం అందించే మజిలీగా వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ లో సాయిపల్లవి ప్రేమించిన రానాని చేరుకునే సమస్య తో బయల్దేరింది. అలాంటప్పుడు ప్లాట్ పాయింట్ టూ ఆ ప్రేమ సమస్యకి పరిష్కార మార్గ మందించే ఘట్టంగా వుండాలి. కానీ ఆమె మిడిల్ మధ్యలో (గాథ మధ్యలో) ప్రేమ పాయింటు వదిలేసి విప్లవం పాయింటు ఎత్తుకోవడంతో, గాథ సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి, ప్లాట్ పాయింట్ టూ కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభంగా మారిపోయింది. ఇలా మిడిల్ స్ట్రక్చర్ ని కోల్పోయింది.

        ఏ సినిమాకైనా ఏకబిగిన సాగే మిడిల్ అనేది (సినిమా నిడివిలో 50 శాతం) సినిమాకి వెన్నెముకలాంటిది. కథ మొత్తం ఇందులోనే సర్దుకుని వుంటుంది. ఇది మధ్యకి  ఫ్రాక్చరైతే  ఇంకేముంటుంది? ఇక ఎండ్ విభాగంలో కోవర్ట్ ఆపరేషన్ చూద్దాం...

10. ఫోర్ షాడోయింగ్ మిస్
1981 నాటి హిందీ ధువా (పొగమంచు) లో, ఎండ్ విభాగంలో వెంట్రుకలు నిక్కబొడుచుకునే టెర్రిఫిక్ సీను వుంటుంది- సీబీఐ ఆఫీసర్ అంజాద్ ఖాన్, రాజమాత రాఖీ గుల్జార్ ని హంతకురాలిగా నిరూపించే సీను. అతను కోటు జేబులోంచి ఒక్కో సాక్ష్యాధారం తీసి చూపిస్తూంటే, రాజమాత హంతకురాలని అప్పటివరకూ తెలియని ప్రేక్షకులకి షాకు మీద షాక్. అంతేకాదు, రాజభవనంలో ఒకరొకరుగా ఉద్యోగాల్లో చేరిన మిథున్ చక్రవర్తి, రంజితా, అరుణా ఇరానీ తదితరులంతా సీబీఐ సిబ్బందేనని ఇప్పుడు రివీలై జన్మకి సరిపడా థ్రిల్!

        2002 నాటి రాంగోపాల్ వర్మ కంపెనీ లో రెండు మాఫియా గ్రూపుల మధ్య కేవలం అనుమానం పెనుభూతమై చంపుకోవడాలకి దారి తీస్తుంది. కేవలం అనుమానం చుట్టే ఈ టెర్రిఫిక్ కథ. చివరికి అజయ్ దేవగణ్ విజేతగా నిలిస్తే, కథలో మనం ఎప్పుడో మర్చిపోయిన విజయ్ రాజ్ సడెన్ గా వచ్చేసి- కారు వెనకాల్నుంచీ అజయ్ ని అనూహ్యంగా షూట్ చేసి చంపి, హై జోష్ లో ఫినిషింగ్ టచ్ ఇస్తాడు సినిమాకి!

      సినిమా ఈజ్ వండర్. సినిమాల్లోనే ఉత్కృష్ట సన్నివేశాల్ని సృష్టించగలం. కానీ దురదృష్టవశాత్తూ సినిమాలు వండర్ విరుపులు వదులుకుని బ్లండర్ గా మారిపోతున్నాయి.

         సాయిపల్లవికి కావాల్సినన్ని ఫోర్ షాడోయింగ్ సీన్లు ప్లాంట్ చేసి వుండొచ్చు క్లయిమాక్స్ లో పే ఆఫ్ అయ్యేలా. ఆడియెన్స్ కి గుబులెత్తించేలా. అప్పుడు ఫస్టాఫ్ లో అరగంట నిస్తేజంగా సాగిన ఆమె ప్రయాణపు సీన్లు- వీటికేదో అర్ధముందన్న భావంతో బలం పుంజుకుని వెన్నాడేవి. సీన్లనేవి పరస్పరాధారభూతాలు. ఒకదాని అర్ధం ఇంకో దాంట్లో నిక్షిప్తం. అసలు కథనమంటేనే ప్రశ్నలు జవాబులు. ఒక సీన్లో ప్రశ్న ఇంకో సీన్లో జవాబు.

        సాయిపల్లవి మీద కోవర్ట్ అనుమానం వచ్చేలా పోలీసులు ప్లాంట్ చేసిన ఉత్తరం దళానికి అందడంతో, కామ్రేడ్ రానాకీ, దళ సభ్యుడికీ వాదం జరుగుతుంది. ఈ విచారణలో ఇంకో సభ్యురాలు ప్రియమణి పాల్గొంటుంది. ఇంకా ఇతర సాక్షులు వుంటారు. వాళ్ళు రానా కి చూపించే సాక్ష్యాధారాలు-

        వెన్నెల (సాయిపల్లవి) మీ అమ్మని కలిపించడం వెనకాల ఆమె హ్యూమానిటీ కాదు
        ఆమె ఎప్పట్నుంచీ దళంలో చేరిందీ అప్పట్నుంచీ ప్రమాదాల్ని ఎదుర్కొంటూనే వున్నాం

        మన దళం కాంటాక్టు కోసం వూరూరా తిరిగింది. మన కామ్రేడ్ ని కూడా కలిసింది.ఒక్కొక్కరికి ఒక్కో కారణం చెప్పిందట

        వెన్నెల అక్కడికొచ్చి నీ అడ్రసు అడిగింది. ఎందుకు అడిగింది? నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది
        పెద్దపల్లిలో బస్సు తగులబెడుతున్నప్పుడు ఈ అమ్మాయి కన్పించింది

        ఏదో కులం పంచాయితీ వుందన్నదన్నా


    వీటిని సాక్ష్యాలుగా చూపిస్తున్నప్పుడు సాయిపల్లవి వున్న ఆయా దృశ్యాల తాలూకు మాంటేజెస్ పడుతూంటాయి. కానీ ఈ మాంటేజెస్ ఇంపాక్ట్ లేకుండా పేలవంగా సైన్ ఔట్ అవుతూంటాయి. ఫస్టాఫ్ లో కొన్ని, సెకండాఫ్ లో కొన్నీ సాయిపల్లవితో వున్న ఈ దృశ్యాల్ని మున్ముందు ఆమెకే వ్యతిరేకంగా పనిచేసే పవర్ఫుల్ సెన్స్ తో చిత్రిస్తే, ఇవి చూస్తున్నప్పుడు ఏరికోరి ఈమె ఏదో ప్రమాదంలో పడబోతోందన్న ఆందోళనని రేకెత్తిస్తాయి ప్రేక్షకులకి. ఇందుకే ఇవి ఫోర్ షాడోయింగ్ సీన్లు. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఇవి రీ ప్లే అవుతూంటే, పైన చెప్పుకున్న ధువా’ లాంటి సిట్యుయేషన్ తో థ్రిల్లింగ్ గా, హారిఫిక్ గా సాయి పల్లవిని బలంగా ఇరికించేసి పే - ఆఫ్ అవుతాయి.

        మొత్తానికి సాయిపల్లని కోవర్ట్ అని రానా నమ్మేశాక- అప్పుడు చెప్తాడు- నాకు నీమీద ప్రేముంది. కానీ నువ్వేం చేశావ్? ద్రోహం చేశావ్. నీకప్పుడే చెప్పాను. ఈ బూర్జువా వ్యవస్థలో మనిషిని మనిషి నమ్మించి మోసం చేసుకోవడానికే ప్రేమ పనికొస్తదని. నువ్వేం చేశావ్? తల్లిలాంటి నా ఉద్యమాన్ని నాశనం చేయడాని కొచ్చిన శత్రువునా నేను ప్రేమించింది?అని కాల్చి చంపేస్తాడు. తర్వాత నిజం తెలుసుకుని ఏడుస్తాడు.

        జస్ట్ ఆస్కింగ్ - ఈ రోజుల్లో సమాజంలో స్త్రీలకు చదువులేదు, స్వేచ్చలేదు, గౌరవం లేదు. ఉన్నదల్లా దుఖం. ఆ దుఖం కోసం మీరు పని చేయాలి. నీ తెలివినీ, నీ ఆలోచననీ, నీ ప్రేమనీ ఆడవాళ్ళకోసం ఉపయోగించాలి అని చెప్పిన కవి ఆడదాన్ని చంపేస్తాడా? వై నాట్ ఇంప్లిమెంట్  కంపెనీఫార్ములా?

—సికిందర్  

     A TALE exists with no greater sense of its self, no greater purpose beyond a simple rehashing of events...127 Hours isn’t the only one—Taken, Coraline, Battle: LA, True Grit, Inglorious Basterds, 2012, Where the Wild Things Are, The Informant, Public Enemies—all tales with little to say.  All works of fiction that are easily forgotten.


           
A STORY  gives audience members an experience they can’t have on their own. This experience is why audience members return to a film over and over again. Star Wars, The Shawshank Redemption, The Lives of Others, The Godfather, The Apartment, The Sound of Music, Toy Story, Toy Story 2 (pretty much anything Pixar), The King’s Speech, The Dark Knight, Good Will Hunting, Chinatown—all stories with much to say. All works of fiction that are not so easy to forget.


― Narrative First 


1, జులై 2022, శుక్రవారం

1179 : షార్ట్ నోట్స్

     మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ ఈ వారం విడుదల. రాశీఖన్నా హీరోయిన్. రావు రమేష్, సత్య రాజ్, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. గోపీచంద్ ది లాయర్ పాత్ర. జడ్జి అయిన అతడి తండ్రి సత్యరాజ్ చెప్పిన ఒక తీర్పువల్ల, బాధితురాలు ఆత్మహత్య చేసుకోవడంతో బాధపడి జడ్జి పదవికి రాజీనామా చేసేస్తాడు. గోపీచంద్ తండ్రి విలువలకి పూర్తిగా వ్యతిరేకం. డబ్బే ప్రధానంగా వుంటాడు. అతడి దగ్గర ఒక సీరియల్ నటి రాశీ ఖన్నా అసిస్టెంట్ గా చేరుతుంది. సీరియల్ లో లాయర్ పాత్ర నటించాలి గనుక లాయర్ల గురించి తెలుసుకోవాలని గోపేచంద్ దగ్గర చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో ఒక కేసు చేపడతాడు గోపీచంద్. ఈ కేసుని వాదించి నెగ్గడమే మిగతా కథ.

        గోపీచంద్, రాశీ ఖన్నాల స్టయిలిష్ అప్పీయరెన్స్ బావుంది. సాంకేతికంగా దృశ్యాలూ బావున్నాయి. ఈ రెండు తప్ప మిగిలినవి షరామామూలే. పక్కాగా కథ లేదు, అది కమర్షియల్ గానూ లేదు. అసలే ఇప్పుడు పనికిరాని పాత కాలం నాటి కథ. దీనికి  అర్ధరహిత కథనం. కాన్ఫ్లిక్ట్ అనుకున్నది కాన్ఫ్లిక్ట్ కి సరిపోని విషయం. ఫస్టాఫ్ గోపీ చంద్- రాశీ ఖన్నాల  రోమాంటిక్ కామెడీ. ఇందులో రోమాన్సు, కామెడీ చీప్ గా వున్నాయి. కామెడీ నవ్వే పుట్టించదు. ఇంటర్వెల్ నుంచి కథ మొదలైతే సెకండాఫ్ లో కాన్ఫ్లిక్ట్ సరిగా లేని కారణంగా కథ అనే పదార్ధం కనపడకుండా పోయింది. ముగింపు కాస్త నిలబడినా ఈ ముగింపు కోసం సినిమా అంతా భరించే ఓపిక వుండాలి. ఈ సినిమాతో మారుతీ ప్రతిభ ప్రశ్నార్ధకంగా మారింది.

     యాక్టర్ ఇన్లా (2016) అనే పాకిస్తానీ కామెడీ వుంది. ఇందులో నాటకాలేసే హీరో తండ్రి ఓంపురి లాయర్. నాటకంలోంచి  హీరోని వెళ్ళగొడితే, ఓంపురి వూళ్ళో లేని సమయంలో లాయర్ గా నటిస్తూ ఓ కేసు చేపట్టి నానా హంగామా చేస్తాడు హీరో. మరిన్ని కేసులు చేపట్టి మరింత హంగామా చేస్తాడు. సామాజిక సమస్యల్ని పరిష్కరించి పారేస్తూంటాడు నకిలీ లాయర్ గా. ఇది పూర్తిగా సోషియో కామెడీ. పెద్ద హిట్టయ్యింది. కోటి రూపాయల బడ్జెట్ కి 30 కోట్ల బాక్సాఫీసు. సినిమా కథకి మార్కెట్ ఐడియాని పట్టుకోవడం దగ్గరే వుంటుంది అంతా.

    ఇంకా ఈవారం మరో 7 విడుదలయ్యాయి. గత వారం 8 విడుదలయ్యాయి. ఏ భాషలోనూ ఇన్నేసి సినిమాలు విడుదలకావడం లేదు తెలుగులో తప్ప. ఈ 7 లో మాధవన్ నటించిన రాకెట్రీ బయోపిక్ ప్రధానమైనది. ఇది తమిళ డబ్బింగ్. ఇంకో తమిళ డబ్బింగ్ అరుణ్ విజయ్ నటించిన ఏనుగు యాక్షన్ మూవీ. ఇక షికారు, బాల్రాజు, టెన్త్ క్లాస్ డైరీస్, ఏమైపోతానో, ఈవిల్ లైఫ్... ఇవి టాలీవుడ్ లో వివిధ 32 క్రాఫ్ట్స్ కి- కార్మికులకి ఆదాయాన్ని సమకూర్చడం తప్ప ఇంకేమీ ఆశించని రెగ్యులర్  తెలుగు చిన్నారి సినిమాలు.

—సికిందర్

 

 

28, జూన్ 2022, మంగళవారం

1178 : స్క్రీన్ ప్లే సంగతులు -3

    క్రిందటి వ్యాసం (1173) లో చూసిన డ్యూయెల్ మూవీ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంలో కొట్టొచ్చినట్టుండే ఇంకో బ్యూటీ ఏమిటంటే, ఈ బిగినింగ్ విభాగమంతా 15 నిమిషాల సేపూ బీజీఎం వుండదు. ఇది గమనించాలి. గమనించడమే కాదు, అనుభూతించాలి. ఆ రెండు వాహనాల శబ్దం తప్ప బిగినింగ్ విభాగంలో సంగీత దర్శకుడికి పనిలేదు. బీజీఎం ఈ కథ ఫస్ట్ యాక్ట్ బిజినెస్ ఆస్వాదనకి అవాంతరం. నిశ్శబ్దం ఈ  సాంప్రదాయేతర సినిమా కథలోకి మనల్ని తీసికెళ్ళి పరిచయం చేసే పరికరం. మన దృష్టిని మళ్ళించే  ఏ విధమైన సినిమాటిక్ వ్యాపకాలు ప్రదర్శించకుండా, కేవలం ఆ రెండు వాహనాల వ్యవహార సరళి మనకి జీర్ణమయ్యేలా చేసే సృజనాత్మక ప్రక్రియ. పాతికేళ్ళకే స్పీల్బెర్గ్ కిన్ని తెలివితేటలేంటో అర్ధంగాదు. పాతికేళ్ళకి మనకి సినిమాలు చూడ్డమే సరిగా రాదు. శబ్దం కంటే బొమ్మ (ఇమేజి) మనసులో బలంగా నాటుకుంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు మారుతున్న ధోరణిలో తెలుగు ప్రేక్షకులకి ఈ అనుభవాన్ని- ఉత్తమాభిరుచినీ అలవాటు చేయాల్సిన అవసరముందేమో ఆలోచించాలి.

     స్క్రీన్ ప్లే మిడిల్ కూడా ప్రారంభమయిన 10 నిమిషాలకి గానీ బీజీఎం ప్రారంభం కాదు. అంటే మొత్తం కలిపి 25 నిమిషాల సేపూ సంగీత దర్శకుడు బిల్లీ గోల్డెన్ బెర్గ్ జోక్యం చేసుకోడన్న మాట. ఆ తర్వాత నుంచి పెట్రేగిపోయే టెర్రర్ హార్రర్ థ్రిల్లర్ లతో కూడిన మిడిల్ విభాగపు సంఘర్షణాత్మక బిజినెస్ ని బీజీఎంతో  పైకెత్తుతాడు. మిడిల్ విభాగపు బిజినెస్ = సమస్యతో సంఘర్షణ. ఇక్కడ సమస్య వచ్చేసి అదృశ్య ప్రత్యర్ధి అయిన ట్యాంకర్ డ్రైవర్ అయినపుడు, వాడి మీద గెలుపు కోసం ప్రధాన పాత్ర డేవిడ్ మన్ సంఘర్షణ.

   అలాగే గత వ్యాసంలో బిగినింగ్ విభాగం ముగిసే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ సమస్యని సాధించడం ప్రధాన పాత్ర గోల్ అయినపుడు, ఈ గోల్ కోసం పాల్పడే సంఘర్షణ బలిష్టంగా వుండడానికి వుండాల్సిన గోల్ ఎలిమెంట్స్ నాల్గు :  కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. 

    ప్రస్తుతం ఏర్పడ్డ సమస్యలో డేవిడ్ మన్ కోరిక వచ్చేసి ఎలాగైనా బిజినెస్ మీటింగ్ కి చేరుకోవడం. ఈ కోరికకి పణంగా పెడుతున్నది తన ప్రాణాలని, కుటుంబ భవిష్యత్తుని. ఈ పణానికి పరిణామాల హెచ్చరికగా వున్నది బలహీన పడుతున్న రేడియేటర్ పైప్. ఈ మూడిటి కలయికతో ఏర్పడుతున్నది బలమైన ఎమోషన్.

   మిడిల్ విభాగంలో బిగువైన కథనం సాగడానికి ఈ నాల్గు గోల్ ఎలిమెంట్స్ కి బీజాలు బిగినింగ్ విభాగంలోనే పడ్డాయి- బిజినెస్ మీటింగ్ కి బయల్దేరడం, పెట్రోల్ బంకులో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు భార్యా ఇద్దరు పిల్లలు పరిచయవడం, బంకు వర్కర్ రేడియేటర్ పైపు మార్చాలనడం, ఈ మూడిటి ఉత్పాదనగా ఎమోషన్.

   ఇప్పుడు మిడిల్ కథనం చూద్దాం. మిడిల్ కథనమంటే పై నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని అందిపుచ్చుకుని, ప్రధాన పాత్రకీ, ప్రత్యర్ధి పాత్రకీ మధ్య యాక్షన్ - రియాక్షన్ల పరంపరతో కూడిన సంఘర్షణ. దీన్ని స్ట్రక్చర్ అంటారు.

    ఇప్పుడు అసలు విషయమేమిటంటే, ఈ మూవీ స్క్రీన్ ప్లేని 6 యాక్ట్స్ లో రాశారు. నాటకాలకి వుండే విధంగా. నాటకాల్ని 8 యాక్ట్స్ లో కూడా రాస్తారు. ఏమీ కన్ఫ్యూజ్ అవాల్సిన అవసరం లేదు. సినిమాలకి 3 యాక్ట్స్ లోనే సింపుల్ గా స్క్రీన్ ప్లే వుంటుంది. నాటకాల్లో వుండే 6, 8 యాక్ట్స్ నే  సౌలభ్యం కోసం సినిమాలకి 3 యాక్ట్స్ కింద సర్దేశారు.   

    నాటకాలకైనా సినిమాలకైనా చిన్న కథకైనా వుండేవి మూడే విభాగాలు : ఒక ప్రారంభం (బిగినింగ్), ఒక మధ్యమం (మిడిల్), ఒక ముగింపు (ఎండ్). నాటకాల్లో వీటిని 6, 8 విభాగాలు చేస్తారు. 6 విభాగాలైతే దీన్ని బిగినింగ్ 2, మిడిల్ 2, ఎండ్ 2 భాగాలుగా విడదీస్తారు. 8 విభాగాలైతే బిగినింగ్ 2, మిడిల్ 4, ఎండ్ 2 భాగాలుగా విడదీస్తారు. అప్పుడివి 6, లేదా 8 యాక్ట్స్ అవుతాయి. ఇలా చేయడానికి కారణం నాటకాల్లో దృశ్యం మారినప్పుడల్లా తెర దించి, కొత్త దృశ్యం సెట్ అమర్చుకోవాలి కాబట్టి.

   సినిమాలకి ఈ అవసరం లేదు గనుక, ఎత్తిన తెర సినిమా ముగిసేదాకా దిగదు గనుక, అసలీ రోజుల్లో వెండి తెరని కప్పే ముచ్చటగొలిపే రంగుల రంగుల బల్బులు వెలిగే తెరలే లేవు గనుక, స్క్రీన్ ప్లేకి 3 యాక్ట్స్ సరిపోతాయి. కానీ డ్యూయెల్ ని 6 యాక్ట్స్ చేశారు. ఉన్న బిగినింగ్ ని 2 యాక్ట్స్, మిడిల్ 2 యాక్ట్స్, ఎండ్ 2 యాక్ట్స్ కింద విడగొట్టారు. ఇది రెండు వాహనాల నాన్ స్టాప్ యాక్షన్ ప్లే. బోలెడు మూవ్ మెంట్స్ వుంటాయి కథనంగా. అందుకని షూటింగ్ సౌలభ్యం కోసం చిన్న చిన్న సిక్స్ యాక్ట్స్ గా చేసి వుంటారు.   

ఇక మిడిల్  కథనం

  పెట్రోల్ బంకు నుంచి బయల్దేరిన డేవిడ్ మన్ నిదానంగా 40 మీద కారు డ్రైవ్ చేసుకు పోతూంటాడు. ఇంతలో అకస్మాత్తుగా వెనుకనుంచి ఖడ్గ మృగంలా ట్యాంకర్ ని దౌడు తీయిస్తూ వచ్చేస్తాడు సైకో ట్యాంకర్ డ్రైవర్. డేవిడ్ కి ఇప్పటికీ అర్ధంగాదు ట్యాంకర్ డ్రైవర్ తనని చావుబ్రతుకులాటలోకి లాగుతున్నాడని. క్యాజువల్ గా చెయ్యూపి సైడిస్తాడు. ట్యాంకర్ ముందు కెళ్ళి పోతుంది. ముందుకెళ్ళిపోయి అదే స్పీడుతో వెళ్ళకుండా డెడ్ స్లో చేసి, రోడ్డుని బ్లాక్ చేస్తూ డేవిడ్ ని ఇబ్బంది పెడుతూంటాడు పగబట్టిన సైకో ట్యాంకర్ డ్రైవర్.

    మనకి తెలియకుండా మన వెనుక మన మీద పగ బట్టేస్తూంటారు కొందరు. వాళ్ళకేం హాని చేసి వుండం. కానీ ఇంకెక్కడో తెలిసో తెలియకో ఏదో కీడు చేసి దాని తాలూకు నెగెటివ్ వైబ్రేషన్ (కర్మఫలం) ని మోస్తూంటాం. ఆ నెగెటివ్ వైబ్రేషన్ ని తొలగించుకోవాలని పాజిటివ్ వైబ్రేషన్ (అంతరాత్మ) మనకి తెలియకుండానే రంగంలోకి దిగుతుంది. ఏం జరిగినా మంచికే జరుగుతుందనేది ఇందుకే.

    అదిలా ఎవరో ముక్కూ మొహం తెలీని ట్యాంకర్ డ్రైవర్ రూపంలో కళ్ళముందు ఇలా తారట్లాడినా గుర్తించం. కారణం లేకుండా ఏదీ జరగదు. ఈ ట్యాంకర్ డ్రైవర్ డేవిడ్ లో పొగుబడిన నెగెటివ్ వైబ్రేషన్ ని తొలగించడానికి ప్రత్యర్ధి రూపంలో విచ్చేసిన పాజిటివ్ వైబ్రేషన్ (అంతరాత్మ) అన్నమాట. అంతరాత్మ- సబ్ కాన్షస్ అనేది విశ్వమంతా పరచుకుని వుంది.

    స్క్రీన్ ప్లే అంటేనే మనిషి మానసిక లోకాన్ని ప్రదర్శించేదని మరోసారి గుర్తు చేసుకుందాం. మనిషి మనసులో నిత్యం జరిగే సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ సంఘర్షణ. సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ) స్క్రీన్ ప్లేలో సమస్య లేదా ప్రత్యర్ధి పాత్ర రూపంలో వుంటుంది. కాన్షస్ మైండ్ ని పాలించే ఇగో రూపంలో వుండే ప్రధాన పాత్ర దీంతో సంఘర్షిస్తూ/మధిస్తూ వుంటుంది. ఇక్కడ డేవిడ్ మన్ కాన్షస్ ఇగో అయితే, ట్యాంకర్ డ్రైవర్ సబ్ కాన్షస్ మైండ్ అన్నమాట. ఈ సంఘర్షణలో చివరికి నిజానిజాలు తెలుసుకున్న ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారడమే మంచి కథా లక్షణం. ఇలా వచ్చిన సినిమా ఎక్కువ కాలం మన్నుతుంది.

   ఇలా మొదలైంది ఇద్దరి మధ్య ఆట. ఒకచోట సైడ్ ఇచ్చాడని డేవిడ్ ఓవర్ టేక్ చేస్తూంటే ఎదురుగా కారు వచ్చేస్తుంది. కొద్దిలో ఆ ప్రమాదాన్ని తప్పిస్తాడు డేవిడ్. కావాలని ఈ ప్రమాదాన్ని సైకో ట్యాంకర్ డ్రైవర్ కల్పించినట్టు. తిరిగి ట్యాంకర్ వెనకే నత్తనడకన పోనిస్తాడు డేవిడ్. ఇహ ఇలా కాదని, కారుని రోడ్డు దింపేసి మట్టి రోడ్డులో శరవేగంగా ముందుకు దూకించి - లూప్ లైన్లో లాగా ట్యాంకర్ ని దాటేసి హైవే మీది కొచ్చేస్తాడు. బాగైంది రాస్కెల్ కి అన్నట్టు పట్టరాని ఆనందాన్ని అనుభవిస్తాడు. వెనుక ట్యాంకర్ స్పీడు తగ్గుతుంది.

    ఇప్పుడు 60 మీద పోనిస్తూంటాడు డేవిడ్. కార్లో రేడియో ఆన్ చేస్తాడు. ఏదో ప్రోగ్రాం వస్తూంటుంది. సైకో ట్యాంకర్ డ్రైవర్ డేవిడ్ కారుని ఫాలో అవుతూంటాడు. అకస్మాత్తుగా స్పీడు పెంచేసి కారుకి దగ్గరగా భూతంలా వచ్చేసి గుండెలదిరేలా హారన్ కొడతాడు. ఈ ట్యాంకర్ హారన్ కూడా రైలు కూతలా చెవులు పగులగొట్టేస్తుంది. ఏడ్చాడెదవని డేవిడ్ సైడ్ ఇవ్వకుండా 70 మీద లాగిస్తాడు. సైకో ఫాలోవర్ సైడ్ ఇవ్వని డేవిడ్ కారుని వెనుక నుంచి డాష్ ఇవ్వడం మొదలెడతాడు. ఉండుండి రెండు సార్లు డాష్ ఇచ్చేసరికి, ఇక్కడ్నుంచీ ఇప్పుడు బీజీఎం మొదలవుతుంది...

   బిజీఎం ఇక్కడ్నుంచే మొదలవడానికి కారణం? ఇక్కడే డేవిడ్ కి జ్ఞానోదయమైంది. ఈ ట్యాంకర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నాడని ఇప్పుడర్ధమైంది. వీడితో తను ప్రమాదంలో వున్నాడని ఇప్పుడు తెలిసింది. ఇక స్పీడు 100 కి పెంచేస్తాడు. ఇక ఇప్పటివరకూ ఏకపక్షంగా వున్న ఆట ద్వైపాక్షికంగా మారుతుంది. తెలివిలోకొచ్చిన డేవిడ్ తో సైకో డ్రైవర్ కి రియాక్షన్ మొదలు. సైకో డ్రైవర్ వదలకుండా ఛేజ్ చేయడం మొదలెడతాడు. డేవిడ్ కారు ఒక చోట కంట్రోలు తప్పి రోడ్డు దిగి గ్రౌండ్ లోకి దూసుకుపోతుంది.

   ఆ గ్రౌండ్ లో కార్లు నిలిపి వుంటాయి. వాటిని తప్పిస్తూ ఎలాగో కంట్రోల్ చేసుకుని మూలకి పోనిచ్చి బ్రేకేస్తాడు. ఇది రెస్టారెంట్ వున్న గ్రౌండ్ (1971 లో ఈ సినిమా తీసినప్పుడున్న ఈ రెస్టారెంట్ చక్స్ కేఫ్ ఇప్పటికీ వుందని సమాచారం. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారిటాలోని సియెరా హైవే మీద. వెళ్ళి చూసివస్తే చూసి రావచ్చు. అక్కడే ఇది రాసుకుంటూ కూర్చోవచ్చు కూడా బీరు మగ్గుతో. సైకో డ్రైవర్ తిరిగొస్తే తిరిగొస్తామో లేదో చెప్పలేని సంగతి. వాడు కాగితాలు లాక్కుని చంపినా చంపుతాడు).

క్రిస్టఫర్ నోలన్ నోట్స్

ట్యాంకర్ డ్రైవర్ గా స్టంట్ డైరెక్టర్
విలియం కేరీ లాఫ్టిన్

    ఇప్పుడు మూవీ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. 25 నిమిషాల ఎడతెగని రోడ్ యాక్షన్ తర్వాత ప్రశాంతత. కారు దిగిన డేవిడ్ మన్ నడుం పట్టేసి, మెడ పట్టేసి దిగాలుగా నడుచుకుంటూ రెస్టారెంట్ వాష్ రూమ్ లో కెళ్ళి ఫ్రెష్ అవుతాడు. రెస్టారెంట్లో ఈ సీను పూర్తిగా 15 నిమిషాలుంటుంది. వాష్ రూమ్ నుంచి డైనింగ్ హాల్లో కొస్తాడు. జ్యూక్ బాక్స్ లో సన్నగా మ్యూజిక్ వస్తూంటుంది. లోగొంతుకతో కస్టమర్స్ మాటలు విన్పిస్తూ వుంటాయి. కౌంటర్ ముందు స్టూళ్ళ మీద కౌబాయ్స్ లా హేట్లు పెట్టుకున్న ఐదారుగురు కూర్చుని బీర్లు, ఫుడ్ తీసుకుంటూ వుంటారు.

   దూరంగా వాళ్ళ వెనుక బూత్ లో కూర్చుంటాడు డేవిడ్. కూర్చునే ముందు కిటికీ అద్దంలోంచి గ్రౌండ్ లోకి చూసి షాకు తింటాడు. వేట కోసం పొంచి వున్న పులిలా అప్పుడే వచ్చి నిలబడి వుంటుంది గ్రౌండ్ లో ట్యాంకర్.

   బెదిరిపోయి ఇటు చూస్తాడు. కౌంటర్ దగ్గర అటు తిరిగి కూర్చున్న ఐదుగురిలో వున్నాడన్న మాట సైకో డ్రైవర్. సీటులో కూలబడి తలపట్టుకుంటాడు డేవిడ్. ఆ కూర్చున్న వాళ్ళల్లో ఒకడు ఇటు తిరిగి డేవిడ్ నే చూస్తాడు. తల తిప్పుకుంటాడు. ఇంకోడు కూడా డేవిడ్ నే చూసి తల తిప్పుకుంటాడు. వీళ్ళిద్దర్లో ఎవరు సైకో డ్రైవరో తెలీడం లేదు డేవిడ్ కి.

    ధడాలున ఏదో పడేసరికి అదిరిపడి ఇటు చూస్తాడు. అప్పుడే వచ్చిన వెయిట్రెస్ చేతికేదో తగిలి టేబుల్ మీద పడిందన్నమాట. ఆమెకి ఫుడ్డు, బీరు ఆర్డరిస్తాడు. అవి సేవిస్తూ వాళ్ళ వైపే చూస్తూంటే ఒకడి జీన్స్ వేసుకున్న బూటు కాళ్ళు కనపడతాయి. పెట్రోలు బంకుదగ్గర ఇదే చూశాడు. ఐతే వీడే సైకో డ్రైవరన్నమాట.

   తాగిన మత్తులో  లేచి వెళ్ళి వాడితో ఏదేదో మాట్లాడతాడు డేవిడ్. మనం మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామా? లేకపోతే పోలీసుల్ని పిలవనా?’ అని ఏదేదో అనేసరికి అతను లేచి డేవిడ్ పటా పటా కొట్టడం మొదలెడతాడు. ఓనర్ అడ్డుకుని కాపాడతాడు. కిందపడి మూల్గుతూంటాడు డేవిడ్. అతను బయటి కెళ్ళిపోతాడు. డేవిడ్ అటే చూస్తూంటే ట్యాంకర్ అటు పక్కనుంచి పికప్ ట్రక్కు ఇటొచ్చి వెళ్ళి పోతూంటుంది. డేవిడ్ ని కొట్టినతను అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తను పొరబడ్డాడని ఇప్పుడర్ధమవుతుంది డేవిడ్ కి.

   ఇంకో బూటు కాళ్ళతన్ని చూస్తాడు డేవిడ్. ఇంతలో బయట ట్యాంకర్ స్టార్ట్ అయి వెళ్ళి పోతూంటుంది. అదిరిపడి ఆ ట్యాంకర్ వెనకాల శక్తి కొద్దీ వురుకుతాడు డేవిడ్. సైకో డ్రైవర్ అందడు. వురకలేక ఆయాసంతో ఆగిపోతాడు డేవిడ్.  

   ఈ సీనులో క్రిస్టఫర్ నోలన్ చెప్పే విజువల్ సస్పెన్స్ వుంది, హీరో తపన వుంది, ప్రేక్షకులు ఒకటనుకుంటే ఇంకోటి జరగడం వుంది, కౌబాయ్ టైపు క్యారక్టర్ లుక్స్ తో జానర్ జెర్క్ -మిక్స్ వుంది, ఎమోషనల్ అప్పీల్ కూడా వుంది, సాధారణ ప్రపంచంలో అసాధారణ పాత్ర (సైకో డ్రైవర్) వుంది... 15 నిమిషాల ఒకే సీనైనా ఉత్కంఠ భరితంగా వుంది. ఇది ఛాలెంజి. కిల్ బిల్ లో క్వెంటిన్ టరాంటినో 10 నిమిషాలసేపు సాగే సీన్లు పెట్టాడు సీన్ల చివర్లో బ్యాంగ్స్ తో. ఇలాటి ప్రయోగాలు తెలుగులో కూడా చూడడానికి తెలుగు ప్రేక్షకులు అప్డేట్ అవాల్సిన అవసరముంది.

మరింత మిడిల్

ఇక్కడ్నుంచి మిగిలిన మిడిల్లో యాక్షన్ తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ్నుంచి క్లయిమాక్స్ అనే శిఖరానికి కథనాన్ని దౌడు తీయిస్తే తప్ప పైకి ఆ శిఖర మెక్కదు. దీనికి ముందు మనం చూసిన మిడిల్లో యాక్షన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆధారంగా అంచెలంచెలుగా వేడెక్కింది. అంతేగానీ ఒకేసారి 100 స్పీడుతో దూసుకెళ్ళలేదు. కథన వేగానికి కారు స్పీడో మీటర్ ని సూచికగా పెట్టుకున్నారు. సమస్య పెరిగే కొద్దీ డేవిడ్ కారు వేగాన్ని 40, 60, 70, 100... ఇలా పెంచుతూ టెన్షన్ ని పెంచుకుంటూ పోయారు.

   ఇప్పుడు మిగిలిన ఈ మిడిల్లో 4 సంఘటనలు జరుగుతాయి. దారిలో ఆగిపోయిన స్కూల్ బస్సుని డేవిడ్ కారుతో పుష్ చేస్తూంటే వెనుకనుంచి ట్యాంకరేసుకుని సైకో డ్రైవర్ వచ్చేస్తాడు. డేవిడ్ కారేసుకుని పారిపోతాడు. సైకో డ్రైవర్ ట్యాంకరు పెట్టి బస్సుని పుష్ చేస్తాడు.

   చాలా దూరం వెళ్ళిపోయి గేటు పడిన రైల్వే ట్రాకు దగ్గర డేవిడ్ ఆగి వుంటే వెనుక నుంచి వచ్చి, వెళ్తున్న రైలు కిందికి కారుని పుష్ చేస్తూంటాడు సైకో డ్రైవర్. ఎలాగో ఆ ప్రమాదాన్ని తప్పించుకుని పారిపోతాడు డేవిడ్. చాలా దూరం వెళ్ళి పోయి ఫోన్ బూత్ కన్పిస్తే ఫోన్ చేయడానికి ఆగుతాడు డేవిడ్. ఫోన్ చేస్తూంటే సైకో డ్రైవర్ వచ్చేసి ఫోన్ బూత్ మీద ఎటాక్ చేస్తాడు. కొద్దిలో తప్పించుకుని పారిపోతాడు డేవిడ్.

చాలా దూరం ప్రయాణించి నిద్ర వస్తూంటే డొంకలోకి కారుని దింపి  కళ్ళు మూసుకుంటాడు డేవిడ్. తిరిగి హైవే మీది కొస్తే దూరంగా రోడ్డు కడ్డం ఆపుకుని వుంటాడు సైకో డ్రైవర్. ఇక వీడి సంగతి తేల్చుకోవాలని డేవిడ్ కారు దిగి యమ కోపంగా వెళ్తూంటే ట్యాంకర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు సైకో డ్రైవర్.

   వెళ్ళి పోయాడనుకుని డేవిడ్ నిదానంగా కారు డ్రైవ్ చేసుకు వెళ్తూంటే, కొంత దూరంలో ఆపుకుని వున్న సైకో డ్రైవర్ డేవిడ్ ని వెళ్ళనిచ్చి వెంటపడతాడు. ఈ ఛేజింగ్ లో డేవిడ్ కారు రేడియేటర్ పైపు పగిలిపోతుంది. దీంతో మిడిల్ విభాగం ముగిసి ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతుంది.

   బిగినింగ్ లో పెట్రోలు పంపు దగ్గర సెటప్ చేసిన రేడియేటర్ పైప్ ప్రాబ్లం ఇక్కడ ఇలా పే ఆఫ్ అయిందన్న మాట. ఇలా ఈ మిడిల్ విభాగం ఈ రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేతో  రసకందాయంలో పడి కొలిక్కి వచ్చింది. ఇప్పుడేమిటి? రేడియేటర్ పైపు పగిలి పొగలు కక్కుతున్న, స్పీడు అంతకంతకూ పడిపోతున్న కారుతో డేవిడ్ యాక్షన్ ప్లానేమిటి? ఇదీ క్లయిమాక్స్  పాయింటు.

ఎండ్ చూద్దాం

కారు పొగ మేఘాలు సృష్టిస్తూ స్పీడు 20 లోపు పడిపోతున్న ప్రాణాపాయ స్థితిలో తరుముకొస్తున్న ట్యాంకర్ ని తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూంటాడు డేవిడ్. ఈ క్రమంలో రెండు చోట్ల హైవే మీద బ్యారికేడ్స్ వల్ల డైవర్షన్ తీసుకుంటాడు. విలేజి సింగిల్ రోడ్డు మీద ఛేజింగ్ మొదలవుతుంది. ఇక తప్పించుకోలేనని ఒక నిర్ణయం తీసుకుంటాడు డేవిడ్ - కారుని రోడ్డు దింపేసి లోయ ప్రాంతానికి తీసికెళ్ళి పోతాడు. సైకో డ్రైవర్ భీకరంగా ట్యాంకరుతో మీది కొచ్చేస్తూంటే, బ్రీఫ్ కేసుతో ఏక్సిలేటర్ ని లాక్ చేసి, లోయ కేసి స్టీరింగ్ ని తిప్పుతూ కారు లోంచి బైటికి దూకేస్తాడు డేవిడ్. ట్యాంకర్ పెట్టి కారుని గుద్ది తోసుకుంటూ వెళ్ళి, ఎదర లోయ కనబడక కారుసహా ట్యాంకరుతో లోతైన లోయలోకి పడిపోయి ఆట ముగించుకుంటాడు సైకో డ్రైవర్.

   ఈ దృశ్యం చూసి గంతులేస్తాడు డేవిడ్. ఆపుకోలేని దుఖమూ ఆనందమూ రెండూ వచ్చేస్తూంటాయి. లోయ అంచున కూలబడి వైరాగ్యంతో  రాళ్ళు విసురుతూంటాడు. నెమ్మదిగా సూర్యాస్తమయ మవుతూంటుంది...

   ట్యాంకర్ ని పేల్చేయమన్నాడు నిర్మాత. అదెప్పుడూ చేసేదే. పేల్తుందనుకున్న ఆయిల్ ట్యాంకర్ పేలకుండా శకలాలుగా లోయలో పతనమవడం డైనమిక్స్. లోయలో ముక్కలై పడ్డ ట్యాంకర్ విడి భాగాల్ని - ఒక విలన్ వినాశనాన్ని చూపిస్తున్నట్టు చూపించాడు స్పీల్బెర్గ్. ఇదొక క్లాసిక్ సీను. సినిమాటోగ్రాఫర్  జాక్ మార్టా, ఎడిటర్ ఫ్రాంక్ మోరిస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ వెనుక సాంకేతిక యోధులు.

    దీంతో స్క్రీన్ ప్లే సంగతులు పూర్తయింది. ఇందులో కొత్త విషయాలకి ఇన్స్పైర్ అవచ్చు. కళాత్మక సినిమాలు చూడరని ఏమీ లేదు. కళా ప్రదర్శన పైకి కనపడకుండా సాంకేతికాలతో సంలీనం చేస్తే తెలియకుండానే ఆత్మికంగా కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. పాతికేళ్ళ వయసులో స్టీవెన్ స్పీల్బెర్గ్ ఏం సాధించాడో, ఎందుకు సాధించాడో తెలుసుకుంటే - సినిమా తీయడం అల్లాటప్పా 90% అట్టర్ ఫ్లాప్స్ వ్యవహారం కాదని తెలుస్తుంది. డ్యూయెల్ కిప్పుడు 51 ఏళ్ళు. ఇంకో 51 ఏళ్ళ దాకా లోబడ్జెట్ మేకర్లకి ఇది స్పీల్బెర్గ్ నామా అని రాసి పెట్టుకోవచ్చు.

—సికిందర్    

 

25, జూన్ 2022, శనివారం

1177 : కొత్త విడుదలలు



    ఈ వారం 8 సినిమాలు విడుదలయ్యాయి. చిన్న హీరోలు, కొత్త హీరోలూ నటించిన ఈ ఎనిమిదీ వివిధ జానర్స్ తో ప్రేక్షకుల ముందు కొచ్చాయి. వీటికి 8 మంది దర్శకుల్లో ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు కొత్తవాళ్ళు. కొండ కి రాంగోపాల్ వర్మ, 7 డేస్ 6 నైట్స్ కి ఎంఎస్ రాజు, చోర్ బజార్ కి జీవన్ రెడ్డి (జార్జిరెడ్డి దర్శకుడు) ముగ్గురూ ఈసారి కూడా విషయం లేని సినిమాలు తీశారు. మాజీమంత్రి కొండా మురళి జీవితం ఆధారంగా ఏం తీశారో వర్మకే తెలీదు. వజ్రం దొంగతనం కథతో  చోర్ బజార్' ఏం తీశాడో దర్శకుడికే తెలీదు. ఇందులో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరో. వరసగా ఆకాష్ పూరీ సినిమాలు ప్లాపవుతున్నాయి. ఇక  7 డేస్ 6 నైట్స్ గోవాలో బ్యాచిలర్ పార్టీ కథతో ఎం ఎస్ రాజు మరో అడల్ట్ సినిమా ఏం తీశారో ఆయనకే తెలీదు. ఇదొక కొత్త ట్రెండ్ ప్రారంభమైందేమో. ఏం తీస్తున్నారో వాళ్ళకే తెలియకుండా సినిమాలు తీసే ట్రెండ్. ఈసారి కూడా ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ కి ఫ్లాప్. ఈ ట్రెండ్ ని అమాయకులైన కొత్తదర్శకులు ఫాలో అయినా ఆశ్చర్యం లేదు.

        'మ్మతమే' కిరణ్ అబ్బవరం నటించిన రోమాంటిక్ కామెడీ. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి పాత ప్రేమ కథతో వచ్చాడు. ఇంటి పనులు చూసుకోవడానికి తగిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకునే హీరో కథ. ఇది వర్కౌట్ కాలేదు. కిరణ్ అబ్బవరంకి మరో ఫ్లాప్. ఇషాన్ ఆర్య అనే కొత్త దర్శకుడు హీరో లక్ష్ తో తీసిన పాత మాస్ కథ 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' కూడా బాక్సాఫీసుకి బరువైపోయింది. కొత్త దర్శకురాలు అపర్ణా మల్లాది ప్రిన్స్ తో, కొత్త వాళ్ళతో తీసిన 'పెళ్ళికూతురు పార్టీ' ప్రేమలూ పెళ్ళిళ్ళ చుట్టూ బ్యాచిలరెట్ పార్టీ సినిమానే. దీనికీ తగిన దమ్ము లేకుండా పోయింది. కొత్త వాళ్ళతో కొత్త దర్శకుడు ఉమాశంకర్ తీసిన 'సాఫ్ట్ వేర్ బ్లూస్' అనే రోమాంటిక్ కామెడీ కూడా డిటో.

        కొత్త వాళ్ళతో కొత్తదర్శకుడు మోహన్ శ్రీవత్స తీసిన 'కరణ్ అర్జున్' రోమాంటిక్ యాక్షన్ ఒక్కటే విడుదలైన వాటిలో బెటర్ సినిమా. దీనికి హాలీవుడ్ 'వెడ్డింగ్ గెస్ట్' తో పోలికలున్నా ఈ ట్రయాంగులర్ లవ్ సినిమా, థార్ ఎడారిలో రోడ్ యాక్షన్ మూవీగా తగిన సస్పెన్స్ తో వుంటూ నిలబడే అవకాశముంది.

***