రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, డిసెంబర్ 2022, శుక్రవారం

1266 : రివ్యూ!

 

దర్శకత్వం : జేమ్స్ కామెరూన్
స్క్రీన్ ప్లే : జేమ్స్ కామెరూన్, రిక్ జాఫా, అమండా సిల్వర్
తారాగణం : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్, ఛాయాగ్రహణం : రస్సెల్ కార్పెంటర్
బ్యానర్స్ : లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, టీఎస్జీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ
విడుదల : డిసెంబర్ 16, 2022 
బడ్జెట్ : 350-400 మిలియన్ డాలర్లు

***

    వతార్: ది వే ఆఫ్ వాటర్ (2022) అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చలనచిత్రం 2009 లో సంచలన అవతార్ కి సీక్వెల్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తారాగణం సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్, జోయెల్ డేవిడ్ మూర్, గియోవన్నీ రిబిసి, దిలీప్ రావ్ లు అవతార్ లోని తమ పాత్రల్ని రిపీట్ చేస్తూ నటించారు. కొత్త తారాగణంలో జేమ్స్ కామెరూన్ టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ఓ కీలక పాత్ర పోషించింది.  అప్పట్లో అవతార్హిట్టయితే సీక్వెల్  నిర్మించాలనుకుంటున్నట్టు ప్రకటించిన కామెరూన్, అక్షరాలా పదమూడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత, వాగ్దానం చేసిన సీక్వెల్ కోసం కళ్ళు కాయలు చేసుకున్న ప్రపంచ ప్రేక్షకుల్ని కనికరించాడు. మరో మూడు సీక్వెల్స్ జోడింపు కూడా వుంటుందని చెప్పాడు. ఇవి వచ్చేనాటికి ప్రేక్షకులు ముసలి వాళ్ళయి పోతారేమో. అండర్ వాటర్ కెమెరా వర్క్ కోసం కొత్త సాంకేతికాల్ని అభివృద్ధి చేయవలసిన అవసరం వల్ల ఈ జాప్యం తప్పలేదన్నాడు. సినిమా చరిత్రలోనే లేనంత 350400 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సీక్వెల్ ఇంతకీ ఎలా వుంది? నిరీక్షణకి తగ్గ ఫలం అందించిందా? ఇది తెలుసుకుందాం...
 
కథ
    అవతార్ లో చూపించిన సంఘటనలు జరిగి దశాబ్ద కాలానికి పైగా గడిచిపోయాక ఇప్పుడు - జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్ ), నేత్రి(జో సల్దానాతోటి నావీలతో కలిసి సంతోషంగా నివసిస్తూంటారు. వీరికి పెద్ద కుమారుడు నెటేయం, చిన్న కుమారుడు లోయాక్, కుమార్తె టుక్దత్తపుత్రిక కిరీ, స్పైడర్ అనే మానవ బాలుడూ కుటుంబంగా వుంటారు. ఇలా కుటుంబమంతా అనుబంధాలూ ఆత్మీయతలతో ఆనందంగా గడుపుతున్న వేళ, ఒక రోజు ముప్పు ముంచుకొస్తుంది. ఈ పండోరా గ్రహాన్ని మరోసారి వలసరాజ్యం చేసుకోవడానికి భూమ్మీద నుంచి అవతార్ లో ఓడిపోయిన మానవ బృందం తాలూకు స్కై పీపుల్ మళ్ళీ దిగుతుంది భీకర యంత్ర, ఆయుధ సంపత్తితో.

బృంద నాయకుడు క్వారిచ్  ప్రధాన ఆపరేటింగ్ స్థావరాన్ని  నిర్మించేస్తాడు. ఇది తెలుసుకుని జేక్ గెరిల్లా ఆపరేషన్ కి పూనుకుని స్థావరాన్ని ధ్వంసం చేసేస్తాడు. రైల్వే మార్గాన్ని పేల్చేస్తాడు. పైప్ లైన్లు బద్దలు చేస్తాడు. దీంతో జేక్ ని చంపేయమని దళాన్ని ఎగదోస్తాడు క్వారిచ్. జేక్ పిల్లలు దళానికి చిక్కుతారు. దీంతో జేక్, అతడి భార్య నేత్రీ వచ్చి దాడి జరిపి పిల్లల్ని విడిపించుకుని వెళ్లిపోతారు- స్పైడర్ ని తప్ప. మానవ బాలుడు స్పైడర్‌ తన కుమారుడే అని గుర్తించిన క్వారిచ్, అతనితో ఎక్కువ సమయం గడిపి జేక్ కుటుంబ సమాచారం లాగాలనుకుంటాడు. స్పైడర్ క్వారిచ్‌కి నావీ సంస్కృతి గురించి నేర్పుతూంటాడు.

అటు స్పైడర్‌ వల్ల తమ ఆచూకీ తెలిసిపోతుందని అనుమానించిన జేక్, కుటుంబాన్ని తీసుకుని పండోరా తూర్పు సముద్రంలో వేరే తెగకి చెందిన ద్వీపానికి చేరుకుంటాడు. ఈ తెగ సముద్రాన్ని పూజిస్తారు. వీరి శరీరాలు జలచరాల్లాగా నీటి అడుగున జీవించడానికి అనుకూలంగా వుంటాయి. ఇప్పుడు మనుగడ కోసం ఈ అననుకూల జీవన విధానానికి జేక్ కుటుంబం ఎలా తమని మల్చుకుని, దండెత్తిన శత్రువుల్ని ఎదుర్కొన్నారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

22 వ శతాబ్దంలో అంటే- 2154 లో భూమి మీద సహజ వనరులు అంతరించి పోవడంతో, వనరుల అభివృద్ది విభాగం (ఆర్డీయే), ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలానికి చంద్రుడైన పండోరా గ్రహంపై విలువైన ఖనిజం యునోబ్టానియంని మైనింగ్ చేస్తుంది. పండోరా విష వాయువులతో కూడిన గ్రహం. ఇక్కడ నావి అనే మానవరూప జాతి నివసిస్తూంటుంది. ఈ పండోరా గ్రహం మీదికి మైనింగ్ బృందాల్నినావితో సంకరం చేసిన హ్యూమన్ హైబ్రిడ్‌లుగా పంపుతారు శాస్త్రవేత్తలు. వీటికి అవతార్ లని పేరు పెడతారు. అలాటి ఒక అవతార్ జేక్ సల్లీ ఇక్కడికి వచ్చి, నావీలలో కలిసిపోయి పండోరా ఆక్రమణని ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో ప్రత్యర్ధి క్వారిచ్ చనిపోతాడు. ఇదీ మొదటి అవతార్ కథ. అప్పట్లో 237 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 2,923 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు వచ్చింది!

పై మొదటి
అవతార్ కథకి కొనసాగింపుగా రెండో అవతార్. ఇందులో మొదటి అవతార్ లో చచ్చిపోయిన విలనే మెమరీని ఇంప్లాంట్ చేసుకుని అవతార్ గా తిరిగి వస్తాడు. ఈ కథని కేవలం దండెత్తి వచ్చిన మానవ జాతి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే సాధారణ హీరో కథగానే చూపించారు. మిగతా సహజ వనరుల  ధ్వంసం, ప్రకృతీ, పర్యావరణాల నాశనం వంటి అంశాల జోలికి ఉద్దేశపూర్వకంగానే పోలేదని సినిమా చూస్తే తెలుస్తోంది.

అందుకని పెట్టుబడి దారీ వ్యవస్థకి వ్యతిరేకమైన ఎలాటి చిత్రణా చేయలేదు. గ్రహాల్ని కూడా వలస రాజ్యాలుగా చేసుకుని దోచుకుంటాం, అక్కడున్న వారు ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోవలసిందే అన్న అంతరార్ధం ఈ సినిమాలో గోచరిస్తోంది. జేమ్స్ కామెరూన్ గత మూవీ అలీటా లో కూడా ఇదే భావజాలం కన్పిస్తుంది. ఆస్కార్ అవార్డు వచ్చేది కూడా ఇలా వుంటేనే. 2019లో కొరియన్ మూవీ పారసైట్ ని కూడా శ్రామిక వర్గ వ్యతిరేక కథగా వుంటేనే ఆస్కార్ తో సత్కరించారు.

దీంతో అవతార్ హీరో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగత కారణాలకి పరిమితమై
,  మొత్తం పండోరా గ్రహం శ్రేయస్సు కోసం పోరాడాలన్న విశాల దృక్పథాన్ని పక్కన బెట్టేశాడు. ఫలితంగా కథ డొల్లగా మారింది. కథ లేనందువల్లే కథ జోలికి పోలేదు. ఉద్దేశించిన భావజాలం నుంచి దృష్టిని మళ్ళించేందుకే కాబోలు- ఫాదర్ అనే వాడు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడన్న డైలాగు ప్రారంభంలో వేశారు, మళ్ళీ ముగింపులో వేశారు. ఇలా కథకి సంబంధించి ఫాదర్ మీదికే దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఫాదర్ తిరుగుతూంటే డైలాగుతో ఈ మెసేజ్ బాగానే వుంటుంది. మొదటి నుంచీ ఫాదర్ (హీరో) ని కుటుంబంతో అన్యోన్యంగా చూపిస్తూనే ఈ డైలాగు ఏమిటి? మనం ఎక్కడున్నా మన కుటుంబం కోటలాంటిది అని భార్యతో అంటాడు. పండోరా గ్రహమే లేకపోతే పండంటి కోట ఎక్కడుంటుంది. ఇలా పర్యావరణం గురించి కాక కుటుంబం గురించి డైలాగు వచ్చిన ప్రతి సారీ భావజాలాన్ని దాచే కామెరూన్ తాపత్రయం బయటపడు
తూంటుంది. కుటుంబం గురించి కాదు- తీయాల్సిన సినిమా వనరుల దోపిడీ గురించి! సముద్ర జీవుల్ని, తిమింగలాల్నీ కూడా విచ్చలవిడిగా చంపేస్తూ చూపించారు.

ఇక కథనం విషయానికొస్తే, హీరో విలన్ మీద ఎదురుదాడి చేసి కుటుంబంతో వేరే ద్వీపానికి చేరుకునే సరికి గంట సినిమా గడుస్తుంది. అక్కడ కొత్తగా సముద్రగర్భంలో విహారం, జీవనం, ఓ తిమింగలంతో స్నేహం- ఈ మూడు అంశాలే సుమారు గంటన్నర సేపు కథ లేకుండా సాగుతాయి. చివరి 45 నిమిషాల్లో విలన్ బృందం దిగడంతో క్లయిమాక్స్ యాక్షన్ మొదలవుతుంది. ఇలా ప్రారంభంలో కథ ప్రారంభించి వదిలేశాక, క్లయిమాక్స్ లోనే ప్రారంభించిన కథ వచ్చి కలుస్తుంది. మధ్యలో గంటన్నర పాటు కథలేని సముద్ర విహారాలే వుంటాయి.

ఇంకోటేమిటంటే, హీరో విలన్ కి ఏదో నష్టం చేసి కుటుంబాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు. మళ్ళీ విలన్నీ ఎదుర్కొనే ఆలోచనే లేదు. అస్త్రసన్యాసం చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు విలన్ పగబట్టి చంపాలని ఎందుకు వెతకాలి. ఇలా హీరో పాత్ర చిత్రణ, విలన్ పాత్ర చిత్రణ రెండూ కన్విన్సింగ్ గా లేవు. హీరో గ్రహాన్ని కాపాడుకోవడం కోసం నిలబడితే కథనంలో, పాత్ర చిత్రణల్లో తప్పులు తొలగిపోతాయి.

కాబట్టి కథ పట్టించుకోకుండా, కథ లేకపోయినా విసుక్కోకుండా కనువిందు చేసే విజువల్ వండర్ గా దీన్ని ఆనందించవచ్చు. ఎమోషన్స్ లేని విజువల్ వండర్ గా గుర్తుంచుకోవచ్చు. కామెరూన్ కంటెంట్ విషయంలో అలిటా తో పట్టు కోల్పోవడంతోనే అవతార్ 2 పై అనుమానం కలిగింది. ఇది నిజమైంది.

సాంకేతిక ప్రతిభ

కామెరూన్ తన శ్రమనంతా మునుపెన్నడూ లేని అద్భుత సాంకేతిక మాయాజాల సృష్టి మీద పెట్టాడు. ప్రామాణిక 24fpsకి, హై-ఫ్రేమ్-రేట్ 48fps కూడా జతచేసిన కెమెరా వర్క్ తో మరిచిపోలేని విజువల్స్ సృష్టించాడు. ఛాయాగ్రాహకుడు రస్సెల్ కార్పెంటర్ దీని వెనుక హస్తం. ఒక అందమైన దృశ్యకావ్య ఫీల్ ఈ సైన్స్ ఫిక్షన్ తో అందించాడు కామెరూన్. అతనెప్పుడూ విజువల్స్ కి మాస్టరే. ఏది సీజీ, ఏది నిజం తెలియనంతగా పాత్రలు, ప్రదేశాలు కలిసిపోయాయి. అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ సహా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో దివ్యంగా దృశ్యమానమయ్యాయి. జస్ట్ ఇది మాటలకందని విజువల్ మ్యాజిక్ అంతే, సంగీతాన్ని కలుపుకుని.

—సికిందర్


15, డిసెంబర్ 2022, గురువారం

1265 : న్యూస్


  లండన్లో వరల్డ్ ప్రీమియర్ సందడి. గుంపుగా తరలి వచ్చిన విమర్శకులు. ముక్త కంఠంతో ప్రశంసల వర్షం. చరిత్ర సృష్టించిన 2009 నాటి అవతార్ సీక్వెల్  అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా సంతృప్తికరంగానూ, సంతోషకరం గానూ వుందని ఫస్ట్ రియాక్షన్ తో విమర్శకులు ఉప్పొంగిపోయారు. 3 గంటల కంటే ఎక్కువ నిడివితో, ఎడతెరిపి లేని విజువల్ ఫీస్ట్ తో, ఫ్రేమ్ రేట్‌తో అతి సృజనాత్మకంగా వున్నట్టు బైట్స్ ఇచ్చారు. బలమైన భావోద్వేగంతో కూడిన అవతార్ మొదటి కథ కంటే మెరుగైన, సంక్లిష్టమైన కథ అనీ, కానీ పాత్రలు కొంచెం ఎక్కువగా వున్నాయనీ, అయినా త్రీడీలో అత్యుత్తమ, అద్భుత విజువల్స్ తో, టెక్నిక్స్ తో దృశ్యవైభవంగా మంత్రముగ్ధుల్ని చేసి తీరుతుందనీ  ఉద్ఘాటించారు.

        యితే ఇది 1990 నాటి సూపర్ హిట్ డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కి కార్బన్ కాపీ అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టారు విమర్శకులు. ఇది 2009 నాటి  అవతార్ విషయంలో జరిగింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా అప్పట్లో కాపీ చేశానని అంగీకరించాడు. అయితే ఆస్కార్-విజేత డ్యాన్సెస్ విత్ వోల్వ్స్ కథ భూమి మీద జరిగితే, అవతార్ కథ అంతరిక్షంలో జరుగుతుందని వివరించాడు.

'అవతార్: ది వే ఆఫ్ వాటర్ అత్యంత అందమైన అనుభవం. పెద్ద స్క్రీన్‌పై త్రీడీ లో చూడాల్సిన అనుభవం. నేను దీన్ని పూర్తిగా ఇష్టపడ్డాను. మళ్ళీ చూడాలనుకుంటున్నాను. సాంకేతిక మాయాజాలం పరంగా ఇది ఒక అద్భుతమైన, మనసుని కదిలించే చలన చిత్ర రాజం అంటూ పెర్రీ నెమిరోఫ్ (కొలైడర్ పత్రిక) పేర్కొన్నాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ చాలా ఇన్క్రెడిబుల్. జేమ్స్ కామెరూన్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక మెట్టు పైనే వుంటాడన్న నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. విజువల్స్ మనసుకు హత్తుకునేలా వున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఫ్రేములే! కథ విషయానికొస్తే, కొన్ని వివరాల కోసం మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఇది ఒడిదుడుకుల సామూహిక జీవనం, కుటుంబం ఈ రెండిటి శక్తివంతమైన ప్రయాణం. అవతార్ తారాగణం తిరిగి తెరపై కనిపించడం బావుంది. అయితే కొందరు కొత్త నటులు కూడా బాగా చేశారు  అని వివరించాడు.

ఇలాంటి మధురానుభూతి ఎప్పుడూ పొందలేదు. మొదటి అవతార్ కంటే మెరుగ్గా వుంది అని నిక్కీ నోవాక్ (ఫాండాంగో) వ్యాఖ్యానించింది. విజువల్ మాస్టర్‌పీస్. మొదటి దానికంటే ఈ రెండోది చాలా ఉన్నతం. త్రీడీలో వాటర్ వరల్డ్, అక్కడి జీవులు చాలా అధివాస్తవికతతో కూడి  కనిపిస్తాయి. ఇది కామెరూనే తీసిన మాస్టర్ పీస్ టైటానిక్ కి నివాళి అన్నట్టుగా  వుంది అంటూ ఇయాన్ శాండ్‌వెల్ (డిజిటల్‌ స్పై మూవీస్ ఎడిటర్) అభిప్రాయం వెలిబుచ్చాడు.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఉత్కంఠభరి విహంగ వీక్షణంతో కూడిన మాస్టర్‌పీస్. చాలా పలుచని కథ అయినప్పటికీ, పాత్రల అస్తిత్వ పోరాట కథని జేమ్స్ కామెరూన్ భావోద్వేగంతో నిండిన అసాధారణ ప్రతిభతో థ్రిల్లింగ్ యాక్షన్ గా కళ్ళ ముందుంచాడు. చివరి గంట వూపిరి సలపనీయదు! అని సీన్ ఓ కానెల్ (సినిమాబ్లెండ్) ప్రస్తుతించాడు.

జేమ్స్ కామెరూన్‌ కి వ్యతిరేకంగా ఎప్పుడూ పందెం కాయకండి. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ప్రతి క్షణం పందెం ఓడించేస్తుంది. అద్భుతమైన విజువల్స్, పాత్రలు, కథ పరస్పర భావోద్వేగ సంబంధాన్ని కలిగి వుంటాయి. చివరి గంటలో కామెరూన్ విజృంభించాడు. బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ కిది పాఠ్యగ్రంథం అని ప్రశంసించాడు ఓ కానెల్.  

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఎపిక్ బ్లాక్‌బస్టర్ - అని జోష్ హోరోవిట్జ్ (ఎంటీవీ న్యూస్) రియాక్ట్ అయ్యాడు. సినిమా మాస్టర్ పీస్! అనేది అమండా సలాస్ (ఫాక్స్ న్యూస్) కామెంట్ - ఇది సినిమాటిక్ మాస్టర్ పీస్! అవతార్ కంటే దీన్ని ఎక్కువగా ఆనందించాను. జీవితంలో ఏవి ముఖ్యమో గుర్తించేలా చేస్తుంది. కుటుంబం, ఇల్లు, ప్రకృతి, మనుగడ - నా టాప్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్! అని మెచ్చుకుంది.

చూస్తే రేపు విడుదలవుతున్న ఈ మెగా వండర్ రివ్యూలు చూడక్కర్లేదన్పిస్తోంది. పైన రివ్యూ లిచ్చేశారు క్రిటిక్స్. ఇక ఆలోచించకుండా థియేటర్ల వైపు ప్రయాణమే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు- ఏది కావాలంటే అది. టూడీ, త్రీడీ, ఫోర్ డీ ఎక్స్ ఇలా మూడు ఫార్మాట్స్ లో కావలసిన దాన్ని ఎంచుకోవచ్చు. ఫోర్ డీ ఎక్స్ సౌకర్యం అతి తక్కువ థియేటర్లలో వుంది. బుకింగ్స్ కూడా గత నెలలోనే పూర్తయ్యాయి. వారం తర్వాత కొత్త బ్యాచికి ఓపెన్ అవుతాయి. అవతార్2 సైలెంట్ సునామీ అంటున్నారు. దీని ముందు రేపు శుక్రవారం మూడు చిన్న చిన్న తెలుగు సినిమాలు విడుదల కావడం తొందరపాటు అని ట్రేడ్ వర్గాల మాట.
—సికిందర్

 

14, డిసెంబర్ 2022, బుధవారం

1264 : న్యూస్


  సూపర్ స్టార్ రజనీకాంత్  72వ పుట్టిన రోజు సందర్భంగా రెండు సంబరాలు జరిగాయి. డిసెంబర్ 10 న బాబా రీ రిలీజ్, డిసెంబర్ 12 న జైలర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్. రెండూ ఫ్యాన్స్ ని నిరాశపర్చాయి. తలైవా కేమైంది, ఇలా చప్పగా రెండు సంబరాలు కా నిచ్చేశారని కుమిలిపోతున్నారు. బాబా ఇదివరకే ఫ్లాప్ అయినా, దీని రీరిలీజ్ కల్లా ఎదిగివచ్చిన కొత్త తరం ప్రేక్షకులు హిట్ చేస్తారులే అనుకుంటే అది జరగలేదు. 2002 లో విడుదలైన బాబా విశేషమేమిటంటే ఇది టీవీల్లో సీడీల్లో ఓటీటీల్లో ఎక్కడా విడుదల కాలేదు. కాబట్టి 2002 తర్వాత ఎవ్వరూ చూసే అవకాశం లేదు. అయినా  ఇన్నాళ్ళకి తిరిగి థియేటర్లకే వస్తే ఏ మాత్రం క్రేజ్ లేదు. ఈ పుండు మీద కారం జల్లినట్టు జైలర్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా తుస్సుమనడంతో బెంబేలెత్తి పోయారు.

        రీ తుస్సుమనలేదుగానీ, మిశ్రమ స్పందన వస్తోందని సర్ది చెప్పుకుని డిప్రెషన్ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ గా జైలర్ లో నటిస్తున్న రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తొలిసారి ఈ పరిస్థితి ఎదురైంది. రజనీ గెటప్ బావుంది, కాదనలేం, కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీని  ప్రెజెంట్ చేసిన విధానం ఏమాత్రం బాగా లేదు.
        
యాక్షన్ లేదు, పైగా రజనీ స్లో మూమెంట్స్, కత్తిని తీసినప్పుడు కూడా చప్పట్లు పడే హీరోయిజం లేదు, ముగింపు కూడా చప్పగానే వుంది, బిజీఎం అయితే పూర్తిగా ఫ్లాపయ్యింది. సినిమా విడుదలకి ఇంకా చాలా సమయముంది గాబట్టి, ఇతర ప్రోమోలు, ట్రైలర్స్ ఈ మైనస్ పాయింట్స్ ని కవర్ చేస్తాయేమో చూడాలని ఫ్యాన్స్ ఆశ. గత సినిమాల్ని  పరిశీలిస్తే, రజనీ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ నీ ఎప్పుడూ మంత్రముగ్దుల్నే చేశాయి.
        
కథ చూస్తే బిగ్ బడ్జెట్ యాక్షన్ హంగామా, టీజర్ చూస్తే లో గ్రేడ్ సరంజామా. టీజర్ లో మందుగుండు పేలితేనే కదా జైలర్ కి జోష్ వచ్చేది? ఒక కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి తప్పించుకోవడానికి పన్నిన పన్నాగాన్ని రజనీ తిప్పికొట్టే జైలర్ గా బోలెడు యాక్షన్ కి స్కోపున్న కథ. ఈ ఎనర్జిటిక్ పాత్రలో రజనీని చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిద్రపుచ్చే విధంగా టీజర్ రావడంతో లబోదిబో మంటున్నారు. కొరియా, జపాన్ వంటి దేశాల్లో కూడా రజనీ ఫ్యాన్స్ వున్నారు. వారి పరిస్థితేంటో తెలీదు.
        
మొత్తానికి బాబా రీరిలీజ్ తో, జైలర్టీజర్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు వన్నె తగ్గాయి. రజనీ గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో జైలర్ ఏమవుతుందోనని ఆందోళన ఓ పక్క. శివకార్తికేయన్ తో డాక్టర్, విజయ్ తో బీస్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న జైలర్  పై భారీ అంచనాలే వున్నాయి.

ఇందులో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2023 ఏప్రెల్ లో విడుదల కావచ్చు. రజనీ, నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు  అనిరుధ్ రవిచందర్‌ల కాంబినేషన్ ఇది మొదటిది. రజనీకాంత్ చివరిసారిగా 2021లో  అన్నాత్తే’, దీనికి ముందు  2020 లో దర్బార్‌ లో కనిపించారు. ఈ రెండూ బాక్సాఫీస్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
        
ఇప్పుడు ఏ స్టార్ అయినా పాన్ ఇండియా ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ రజనీకాంత్ ఆ ఇమేజ్‌ని అందుకోలేదు. బాలీవుడ్ స్టార్స్ కూడా రజనీకాంత్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఆయన రేంజ్ ఏ స్థాయిలో వుందో తెలుస్తోంది. అయితే పానిండియా లెవెల్ ని ఆయన అందుకోవాలి. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్ అనేది పానిండియా లెవెల్లో శంకర్ తీసిన రోబో’, రోబో2 లతోనే వర్కౌట్ అయింది.
        
పాన్ ఇండియా మార్కెట్‌తో పాటు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఈ రెండు బ్లాక్ బస్టర్స్ సత్తా చాటాయి. అలాంటిది  ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ సినిమాలు రాకపోవడంతో తలైవా అభిమానులు నిరాశకి గురవుతున్నారు.
        
ఇకపోతే, బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, జైలర్ కామెడీ థ్రిల్లర్‌గా వుండొచ్చట. దర్శకుడు నెల్సన్ డాక్టర్ ని కామెడీ థ్రిల్లర్ గానే తీశాడు. జైలర్ కూడా ఇదే టైపులో వుంటుందని తెలుస్తోంది. రజనీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగిన ప్రేక్షకులకి ఆయన అద్భుతమైన కామిక్ టైమింగ్ గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ ఆయన గత సినిమాల్లోని క్వాలిటీ ఇటీవలి  సినిమాల్లో కానరావడం లేదు. రజనీతో సినిమాలు తీస్తున్న కొత్త తరం దర్శకులతో వచ్చిన మార్పు ఇది.

పోతే, జైలర్ ఒక్కడే కాదు, ఇంకో ఇద్దరు జైలర్లు వున్నారని బైట పడింది. జైలర్ అనే ఒక మలయాళ సినిమా, జైలర్ అనే విదేశీ సినిమా ఒకేసారి రెడీ అవుతున్నాయి. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

—సికిందర్