రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, డిసెంబర్ 2022, సోమవారం

1262 : రివ్యూ + స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకత్వం : గంగాధర్
తారాగణం: విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, చైతన్య రావు, రవిశంకర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సందీప్ రాజ్, సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం:  శ్రీనివాస్ బెజుగం
బ్యానర్: పాకెట్ మనీ పిక్చర్స్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా
విడుదల : డిసెంబర్ 9, 2022
***
        క్రైమ్ సినిమాలు విరివిగా వస్తున్న క్రమంలో ముఖచిత్రం ఇంకో కొత్త దర్శకుడి ప్రయత్నంగా తెరపై కొచ్చింది. ఒకప్పుడు ఇవే క్రైమ్ సినిమాలు అన్ని భాషల్లో బి గ్రేడ్ సినిమాలుగా వచ్చి వెళ్ళి పోయేవి. ఇదే పరిస్థితి హార్రర్ సినిమాలది. హార్రర్ సినిమాల్ని ఈ శతాబ్దం ఆరంభంలో బాలీవుడ్ లో స్టార్స్ తో తీస్తూ బి గ్రేడ్ నుంచి అప్గ్రేడ్ చేయడంతో ప్రేక్షకులు పెరిగి మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా రావడం మొదలెట్టాయి. క్రైమ్ సినిమాలతో ఇది జరగలేదు.

        దీంతో చిన్న హీరో హీరోయిన్లతో, కొత్త హీరో హీరోయిన్లతో ఇప్పటికీ ఇవి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం లేదు. తెలుగులో ఎప్పుడో వచ్చే అడివి శేష్ క్రైమ్ సినిమాలు తప్ప స్టార్ స్టేటస్ కి అప్ గ్రేడ్ అవుతున్న దాఖలాల్లేవు. అయితే కొన్ని చిన్న సినిమాలు క్రైమ్ తో తీస్తే దృష్టినాకర్షించే కథాంశాలతో వుంటాయి. ఇది అరుదుగా జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్ళ గలిగితే చిన్న క్రైమ్ సినిమాయే పెద్ద హిట్టయ్యే అవకాశముంటుంది. ఇలాటిదొక మెయిన్ స్ట్రీమ్ కథాంశం ముఖచిత్రం ది. మరి ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోగలిగారా? దీనికి గంగాధర్ అనే అతను కొత్త దర్శకుడు. రచన చేసింది కలర్ ఫోటో దర్శకుడు. ఈ ఇద్దరూ చేతిలో వున్న యూనివర్సల్ కథాంశాన్ని క్రైమ్ తో జోడించి ఏ మేరకు సద్వినియోగం చేసుకుని బాగు పడ్డారో చూద్దాం...  

కథ

    రాజ్  (వికాస్ వశిష్ట) కాస్మెటిక్ సర్జన్ హైదరాబాద్ లో. అతడ్ని మాయా ఫెర్నాండెజ్ (ఆయేషా ఖాన్) ప్రేమిస్తూంటుంది. ఈ చిన్నప్పటి ఫ్రెండ్ ని కాదనుకుని విజయవాడలో మహతి (ప్రియా వడ్లమాని) ని పెళ్ళి చేసుకుంటాడు. ఒక రోజు మాయా రోడ్డు ప్రమాదంలో మొహం చితికిపోయి కోమాలో కెళ్ళి పోతుంది. మరోవైపు మహతి మెట్ల మీంచి జారిపడి చనిపోతుంది. వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి స్నేహితురాళ్ళే. ఇప్పుడు మొహం చితికి పోయిన మాయ కోమాలోంచి తేరుకున్నాక ఛూస్తే, తన ముఖం మహతిలా మారిపోయి వుంటుంది. మొహం చితికిన మాయాకి చనిపోయిన భార్య మహతి చర్మం తీసి ప్లాస్టిక్ సర్జరీ చేశానని చెప్తాడు రాజ్. ఇప్పుడు మహతిలా వున్న మాయా జీవితమేమిటి? ఆమె మహతి గురించి తెలుసుకున్న నిజమేంటి? దాంతో మహతితో రాజ్ పాల్పడిన నేరాన్ని ఎలా బయటపెట్టి శిక్షించింది? ఇందులో లాయర్ విశ్వ (విశ్వక్సేన్) పోషించిన పాత్రేమిటి? ... వీటికి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్) స్టోరీ ఐడియాతో ఈ క్రైమ్ కథ చేశారు. తెలుగు సినిమాల్లో బహుశా ఇది మొదటిసారి. ఇలా యూనిక్ ఐడియాగా వున్న దీని కథా విస్తరణ గందరగోళంగా వుంది. యూనిక్ ఐడియా గల్లంతయింది. సామాజిక బాధ్యత పెద్ద మాటగా అన్పించవచ్చుగానీ, ఈ యూనిక్ ఐడియా విషయంలో ఈ కథ ఒక బాధ్యతే అవుతుంది. కానీ అల్లరి నరేష్ తో నాంది తీసినప్పుడు చట్టంలోని సెక్షన్ 211 తో దేశ భాషల్లో ఎక్కడా రాని యూనిక్ కథని ఎలా బాధ్యత లేకుండా కిల్ చేశారో, అలా ముఖ చిత్రం తో చేశారు. ఈ కథ ఏ వైవాహిక అత్యాచార బాధితులకి బాసటగా వుండాలో అది గాకుండా చేశారు.  

        వైవాహిక అత్యాచారం దానికదే ఒక నేరం (కోర్టులు ఒప్పుకోకపోయినా నైతికంగా నేరమే). ఈ మౌలిక పాయింటుని  ఇంకో నేరంతో కలిపి కథ చేస్తే మౌలిక పాయింటే గల్లంతై పోతుంది. ఏదో వొక పాయింటుతో కథ చేయాలి- వైవాహిక అత్యాచారమా? ముఖ మార్పిడి  నేరమా? ఏదో వొకటి. రెండూ కలిపి చేస్తే మొదటిది బలై పోతుంది. ఇదే జరిగింది. ఈ ముఖ మార్పిడి కూడా గజిబిజి క్రైమ్ కథే.

        వైవాహిక అత్యాచారం ఐడియా అనుకున్నాక, దీని మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషించుకోకుండా, ముఖ మార్పిడి క్రైమ్ తో క్రియేటివ్ యాస్పెక్ట్ కి పూనుకున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ తో స్పష్టత లేకుండా క్రియేటివ్ యాస్పెక్ట్ కి పాల్పడితే ఇంతే. మార్కెట్ యాస్పెక్ట్ ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ వుంటుంది. ఇది బ్లాగులో పదేపదే చెప్పుకున్న పాత విషయమే.

       వైవాహిక అత్యాచారం విస్తృత మార్కెట్ యాస్పెక్ట్ వున్న స్టోరీ పాయింటు. దేశంలో ఇంతవరకూ రాని పానిండియా మూవీగా  ఈ తెలుగు సినిమా వెళ్ళగల సామర్ధ్యమున్న పాయింటు. లొట్టపీసు లోకల్ సినిమా కాదు. ఈ పాయింటుని కాస్త రీసెర్చి ఏదో చేసుకున్నట్టు కూడా కనిపించదు. కోర్టులో తోచినట్టు వాదనలు జరిపి, వైవాహిక అత్యాచారం నిందితుడైన హీరో రాజ్ పాత్రకి పదేళ్ళు శిక్ష పడేట్టు చేసి శుభం అనేశారు.

        వైవాహిక  అత్యాచారాన్ని నేరంగా సుప్రీం కోర్టు కూడా గుర్తించనప్పుడు, శిక్షెలా పడుతుంది? భార్య సమ్మతి లేకుండా భర్త శృంగారానికి బలవంతం చేయడం రేప్ కిందికొచ్చే నేరంగా పరిగణించడానికి గతంలో రెండు రాష్ట్రాల హైకోర్టులు కూడా ఒప్పుకోలేదు. అసలు భార్యకి భర్త తనని రేప్ చేస్తున్నాడని నిరూపించడమే కష్టమని ప్రముఖ లాయర్ ఫ్లేవియా అగ్నెస్ అంటున్నారు. ఫలానా రాత్రి తను మూడ్‌లో లేనని, తను నిద్రపోయిన తర్వాత, లేదా అనారోగ్యంతో వుంటే, బలవంతం చేశాడని ఆమె నిరూపించాలి. ఇదొక ఛాలెంజ్ అవుతుందని ఆమె అంటున్నారు.

        అంటే దీన్ని కథగా చేయాల్సి వస్తే ఆ భార్య కోర్టులో విఫలమై బాధితురాలిగానే మిగలాలి చివరికి. అప్పుడు కోర్టులకీ, పార్లమెంటుకీ వినబడేలా ఆక్రోశించాలి. ఒక గట్టి ప్రశ్నతో ముగించాలి. ముఖచిత్రం కథలో మరణించిన స్నేహితురాలు మహతికి న్యాయం కోసం మాయా కోర్టులో పోరాడుతుంది. అయితే మహతి భర్తని శిక్షించలేమని కోర్టు తీర్పుతో తెలుసుకుని- మయా తనూ ఒక నిర్ణయం తీసుకుని తిరుగుబాటు చెయ్యాలి- స్త్రీ స్వాతంత్ర్యాన్ని చట్టం గుర్తించకపోతే, వైవాహిక అత్యాచారం నుంచి రక్షణ కల్పించకపోతే- స్త్రీ ఎందుకు పెళ్ళి చేసుకుని రిస్కు చేయాలి? ఏ మగాడు ఎలాటి వాడో ఎలా తెలుస్తుంది? అందుకని నేను పెళ్ళే చేసుకోను- స్వతంత్రంగా వుండగలిగేంత జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకుని బతికేస్తాను, మీ పెళ్ళి వ్యవస్థకో గుడ్ బైరా నాయనా  - అనేసి వాకౌట్ చేస్తే ఎంతో కొంత అర్ధముండొచ్చు కథకి. సామాజిక బాధ్యతో, కథా ప్రయోజనమో, మరోటో నెరవేర్చి పుణ్యం కట్టుకున్నట్టు వుంటుంది. ఇలా యూనిక్ ఐడియాతో ఇది సినిమా వైరల్ అవడానికి అవకాశమున్న మార్కెట్ యాస్పెక్ట్ అవుతోంది.

ఇంకా వుంది...

        మార్కెట్ యాస్పెక్ట్ చెప్పుకున్నాక, క్రియేటివ్ యాస్పెక్ట్ చూద్దాం. క్రియేటివ్ యా స్పెక్ట్ చూస్తే ఇది ఎక్కువగా ముఖమార్పిడి కథగా వుంది. ఈ కథలోంచి వైవాహిక అత్యాచారమనే స్టోరీ ఐడియా బయటికి రావడానికి సెకండాఫ్ లో ఇరవై నిమిషాలూ పట్టింది! ముఖమార్పిడి కథ పొదిగితే ఆ గుడ్డుని పగులగొట్టుకుని పుట్టిందే వైవాహిక అత్యాచారం అసలు కథన్న మాట. ఏం ఖర్మ! అంటే ఇలా సెకండాఫ్ లో అసలు కథ రివీల్ అయిందంటే మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు మనో వీధుల్లో మాయా విహారం చేస్తూ రచిస్తే వచ్చేది మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అనే చెత్త. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే సినిమాకి పనికి రాదా అంటే, కమర్షియల్ సినిమాకి పనికి రాదు. డబ్బులు రాని ఆర్ట్ సినిమా చేసుకోవచ్చు. ఆర్ట్ సినిమాలు మంచివి కాదని కాదు, యూరప్ తీసికెళ్ళి మంచిగా ఆడించుకోవచ్చు.

        హాలీవుడ్ నుంచి ఎవడో ఒకడు స్క్రీన్ ప్లే సంగతులు చెబుతూనే వుంటాడు నిత్యాన్న ప్రసాదం లాగా. మనకేం పట్టదు. మనకి మనమే స్క్రీన్ ప్లే సూపర్ హీరోలం, వీరులం. ఒకడు చెప్పేదేంటి. మన మనో వీధులు, సందులు, గొందులు మనకి పట్టా చేసి పెట్టి వున్నాయి. ఇంకొకడు చెప్పేదేంటి. ఎందుకు చెబుతున్నాడో, ఎక్కడెక్కడో తొంగి చూసి, సినిమాల్లోంచి సంగతులు లాగి, లాభ నష్టాలు ఎందుకు చెబుతూంటాడో అస్సలు అర్ధం గాదు! మన పట్టా పాస్ బుక్ తప్ప ఇంకేదీ అర్ధం గాదు.

        ఈ కథ ఫస్ట్ యాక్ట్ ఇలా వుంటుంది- ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయ పరిచయం కావడం, మాయని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, మాయాకి రోడ్డు ప్రమాదంలో ముఖం చితికి పోయి కోమాలో కెళ్ళి పోవడం, మహతి మేడ మీంచి పడి చనిపోవడం, మహతి బతకాలంటే మాయా కోలుకోవాలని రాజ్ అనడం- ఇంటర్వెల్.

      సుమారు గంట సేపు ఫస్ట్ హాఫ్ వుంటుంది. పై స్టోరీ బీట్స్ చూస్తే ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. మహతి బతకాలంటే మాయా కోలుకోవాలన్న రాజ్ మాటలతో ఇంటర్వెల్ ఏమర్ధమయ్యింది? అంటే చనిపోయిన మహతి రూపంతో మాయాకి సర్జరీ చేసి ఆమెలో మహతిని చూసుకోవాలనా? ఇదేనా సెకండాఫ్ లో చూడబోయే కథ? ఇదేనా ఫస్ట్ యాక్ట్ ముగింపు? ప్లాట్ పాయింట్ వన్? ఇవన్నీ నిర్ధారణ లేని వూహాగానాలు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఏర్పడకపోతే కథ గురించి వూహాగానాలే తప్ప కథేమిటో అర్ధంగాకుండా పోతుంది. ఇదే జరిగింది ఇంటర్వెల్ తో- కాన్ఫ్లిక్ట్ లేక!

        ఇక సెకండాఫ్ లో కోమాలోనే వున్న మాయాకి సర్జరీ చేసి మహతిలాగా మార్చేస్తాడు. ఆమె కోమాలోంచి కోలుకున్నాక మహతి చనిపోయిన విషయం చెప్పి- మహతిలాగా తెచ్చుకుని ఇంట్లో వుంచుకుంటాడు. ఇలా ఇరవై నిమిషాలు గడిచాక ఆమెకి మహతి ఫోన్లో రికార్డింగ్స్ బయటపడతాయి- వాటి ప్రకారం రాజ్ శాడిస్టు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి రేప్ చేస్తున్నాడు. తను ప్రెగ్నెంట్ అయింది. అయినా వదలడం లేదు... ఇలా వైవాహిక అత్యాచారం విషయం ఇప్పుడు బయట పడుతుంది.

మిడిల్ కి మిగిలింది ఇంతే

    అంటే కథేమిటో ఇప్పుడు అర్ధమవుతోందన్న మాట. అంటే కాన్ఫ్లిక్ట్ ఫస్టాఫ్ ఇంటెర్వెల్ దాటుకుని సెకండాఫ్ లో ఇరవై నిమిషాల కొచ్చిందన్న మాట. అంటే సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ వుండాల్సిన స్పేస్ ని ఫాస్ట్ యాక్టే ఆక్రమించి సెకండాఫ్ ని- అంటే మిడిల్ ని మటాష్ చేసిందన్న మాట. అందుకే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట.

        ఇప్పుడు సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ఇరవై నిమిషాలు స్పేస్ ని నష్టపోయాక సెకండ్ యాక్ట్ కీ, ఆ తర్వాత థర్డ్ యాక్ట్ కీ మిగిలింది 40 నిమిషాలే. ఇందులోనే రెండూ పంచుకోవాలి. పంచుకుంటే సెకండ్ యాక్ట్ కి మిగిలింది పదీ పదిహేను నిమిషాలే. అంటే రెండు గంటల సినిమాలో 50 శాతం, అంటే గంట పాటు నడవాల్సిన సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- ఇంతలా కృశించి పోయిందన్న మాట!   

        ఇలా సినిమా ప్రారంభమయ్యాక గంటా 20 నిమిషాల పాటూ కథే ప్రారంభం కాలేదంటే అది సినిమా కాదన్న మాట. ఈ కథ వైవాహిక అత్యాచారం గురించి అని ఎప్పుడో సెకండాఫ్ లో తెలిసే వరకూ ప్రేక్షకులు కూర్చుని ఏం చేయాలి? ఇలావుందన్న మాట స్టోరీ ఐడియాతో క్రియేటివ్ యాస్పెక్ట్ సంగతి.

        చెప్పాలనుకున్న ముఖమార్పిడితో వైవాహిక అత్యాచారం కథ గనుక స్ట్రక్చర్ లో పెట్టి చెప్తే ఇలా వుంటుంది- ఫస్టాఫ్ అరగంటకల్లా మహతి చనిపోయి, ఆమె రూపంతో మాయాకి సర్జరీ జరిగి ఫస్ట్ యాక్ట్ - అంటే బిగినింగ్- ముగిసి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ యాక్ట్- అంటే మిడిల్- ప్రారంభమై మాయా వచ్చి మహతిలా గా రాజ్ తో రాజ్ ఇంట్లో వుంటూంటే, ఇంటర్వెల్లో మహతి ఫోన్ రికార్డింగ్స్ ద్వారా  వైవాహిక అత్యాచారం విషయం బయట పడి, రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇలా కథేమిటో ఇంటర్వెల్లో అర్ధమయ్యేట్టు వుంటుంది.

    అయితే ప్రపంచమంతటా వైవాహిక అత్యాచారమనే అపరిష్కృత సమస్యగా వున్న బర్నింగ్ టాపిక్ గురించి సినిమా తీయాలనుకుంటే దాన్ని ముఖ మార్పిడి కథతో చేస్తే గజిబిజి అవుతుంది. ముఖ మార్పిడి విడిగా వేరే పాయింటు - ఆస్తికోసం భార్యని చంపి ఆమె ముఖాన్ని ప్రేయసికి అతికించి ఆడే నాటకంలాగా వేరే కథవుతుంది. దీనికి వైవాహిక అత్యాచారం పాయింటు కలిపితే డామినేట్ చేసేది ముఖమార్పిడి పాయింటే!

        అందుకని శుభ్రంగా కల్తీలేని వైవాహిక అత్యాచారం కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ చేస్తే, స్ట్రక్చర్ ఇలా వస్తుంది - ఫస్ట్ యాక్ట్ లో ప్లాస్టిక్ సర్జన్ గా ప్రధాన పాత్ర హీరో రాజ్ పరిచయం, అతడి క్లాస్ మేట్ గా ప్రేమిస్తున్న మాయా పరిచయం కావడం, మాయాని కాదని రాజ్ విజయవాడలో మాయా ఫ్రెండే అయిన మహతిని పెళ్ళి చేసుకోవడం, తర్వాత మహతి మేడ మీంచి పడి చనిపోవడంతో మాయాకి అనుమానాలతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డం.

        ప్లాట్ పాయింట్ వన్ మాయాతో ఎందుకంటే, మహతికి న్యాయం కోసం పోరాడేది మాయానే. ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర రాజ్ కి, ప్రత్యర్ధి పాత్రగా మాయా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎదురెదురు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ లేకపోతే కథ సాగదు. సాగినా ఎలా సాగాలో తెలీదు.

        ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ లో ప్రధాన పాత్ర చేతిలో వున్న గోల్ ప్రత్యర్ధి పాత్ర అయిన మాయా చేతికొచ్చేస్తుంది. మహతి మరణం మీద ఈమెకి అనుమానాలున్నాయి. ఈ అనుమానాలు తీర్చుకునే గోల్ తో సెకండ్ యాక్ట్ -అంటే మిడిల్- ప్రారంభమవుతుంది. ఈ మిడిల్లో సంబంధిత కథ జరుగుతూ, మాయా రాజ్ ఇంటికొస్తే, మహతి ఫోన్ రికార్దింగ్స్ దొరికి- ఆమె రాజ్ చేతిలో వైవాహిక అత్యాచార నరకాన్ని అనుభవించిందన్న నిజం తెలిసి -రాజ్ తో కాన్ఫ్లిక్ట్ ప్రారంభమై పోతూ ఇంటర్వెల్ వస్తుంది.

        ఇక సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ కొనసాగుతూ రాజ్ తో మాయాకి మిడిల్ బిజినెస్ మొదలవుతుంది. అంటే యాక్షన్- రియాక్షన్లతో కూడిన సంఘర్షణ. ఈ సంఘర్షణలో లాయర్ సాయం తీసుకుంటుంది. ప్రతిఘటించే రాజ్ తో సంఘర్షణ వెళ్ళి వెళ్ళి మాయాకి తగిన సాక్ష్యాధారాలు చిక్కడంతో- ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి సెకండ్ యాక్ట్ - అంటే మిడిల్- పూర్తవుతుంది.

        ఇక థర్డ్ యాక్ట్ లో - అంటే ఎండ్ లో - కోర్టు డ్రామా వస్తుంది. ఇక్కడ మహతి బలైన వైవాహిక అత్యాచార నేరాన్ని లాయర్ తో కలిసి నిరూపిద్దామంటే, వైవాహిక అత్యాచారం అసలు నేరమే  కాదని కోర్టు కొట్టేస్తుంది. పైగా మహతీది ప్రమాదవశాత్తూ మరణం కాదని కూడా నిరూపించలేక పోతుంది మాయా. మహతిని చంపడం కూడా చేసిన రాజ్ ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. మాయా న్యాయ వ్యవస్థ మీద, ఇలాటి పెళ్ళి వ్యవస్థ మీదా ఓ రెబల్ స్టేట్ మెంట్ పారేసి- సెల్ఫ్ రిలయెంట్ ఇండిపెండెంట్ వుమన్ గా వాకౌట్ చేస్తుంది. ఇలా రఫ్ గా, కల్తీలేని శుభ్రపర్చిన వైవాహిక అత్యాచారం కథ సూటిగా తగిలేట్టు వుండొచ్చు.

ఇలా వుంది క్రైమ్ జానర్ మర్యాద
        ఇక సినిమాలో ముఖమార్పిడి కథ కూడా ఎలా వుందంటే- రాజ్ మహతి శవాన్ని ఏం చేశాడో తెలియదు. ఆమె ముఖ చర్మాన్ని తెచ్చి కోమాలో వున్న మాయాకి సర్జరీ చేసి అతికించేస్తాడు! ఆమెకి తెలియకుండా, ఆమె అంగీకారం లేకుండా మహతి ముఖంగా మార్చేస్తాడు. ఇది నేరం. అతను చేసింది ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఈ సర్జరీ చేయించుకునేది ఇద్దరే- క్రిమినల్స్, కొందరు పౌరులు. క్రిమినల్స్ ఎందుకు చేయించుకుంటారో తెలిసిందే. పౌరుల విషయానికొస్తే -తమ లొకేషన్‌లు, సామాజిక కనెక్షన్‌లు, రోజువారీ కదలికలు, ప్రైవేట్ సమాచారమూ ట్రాక్ చేయకుండా ప్రభుత్వాన్ని, లేదా వివిధ సంస్థల్ని నిరోధించడానికి ఐడెంటిటీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని తిరుగుతారు. దొరికితే చారల దుస్తులేసుకుని వేరే ఐడెంటిటీ నెంబర్ బిళ్ళతో కటకటాల వెనక్కి పోతారు.

        మాయా ఇదే పరిస్థితిలో పడుతుందని పట్టించుకోలేదు కథకుడు. ఆమె మహతిలా బతకాలన్నా ఎలా బతుకుతుంది? ముఖం మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులెలా మేనిపులేట్ చేస్తుంది. సింపుల్ గా ఎక్కడో ఆధార్ అథెంటికేషన్ లో దొరికిపోతుంది. అసలు తన మీద రాజ్ చేసిన ఈ అక్రమాన్ని ఎలా సహిస్తుంది. వెంటనే కంప్లెయింట్ చేసి లోపలేయించాలి. కానీ ఇలా కూడా చేయదు. అతను మహతీలా ఇంటికి తీసుకుపోతే మహతిలా జీవిస్తూంటుంది!! తను మహతి అయితే మాయా ఏమైంది? దీనికేం చెప్తుంది? మాయా కనిపించడం లేదని ఇంటి ఓనర్ కంప్లెయింట్ చేస్తే ఏం చేస్తుంది?

        ఇక మహతికి న్యాయం కోసం కోర్టు కెక్కాక కోర్టుని దారుణంగా మోసపుచ్చుతోందని కూడా కథకుడు పట్టించుకో దల్చుకోలేదు. లాజిక్కా బొందా? సినిమా కథకి లాజిక్కేంటి, ఇదింతే అన్నట్టు దూసుకుపోయాడు. క్రైమ్ కథకి అతి ముఖ్య యోగ్యత, జానర్ మర్యాద లాజికల్ రీజనింగ్ అన్న విషయం అవసరమన్పించలేదు కథకుడికి. 

        చచ్చిపోయిన మహతి రూపంలో మహతిలా కోర్టులో కేసు పోరాడుతున్న మాయానీ, ఆమె లాయర్నీ చూస్తే- 
పాపం జడ్జి గారికి, ప్రాసిక్యూటర్ గారికీ ఈమె మహతి కాదు మాయా అని ఇంకా తెలీదు. మహతీయే అనుకుని జడ్జి గారి తీర్పు పాఠం...వైవాహిక అత్యాచార నేరం రుజువైనందున దోషి రాజ్ కి పదేళ్ళు కారాగార శిక్ష! ఇంతేనా, అతను హంతకుడు కూడా అన్న విషయం తెలియదా? వైవాహిక అత్యాచారం నేరమా? అది రుజువు చేయగల నేరమా? ఈజిట్? ఓకే, థాంక్యూ!

నటనలు-సాంకేతికాలు

        ఇందులో విశ్వక్సేన్ ది ముగింపులో కోర్టులో లాయర్ గా వాదించే అతిధి పాత్ర మాత్రమే. ఈ పాత్ర, మనసుపెట్టి నటించలేదు. కోర్టులో కామెడీ చేయాలా వద్దా అని డైలమాలో పడి ఎటూ గాకుండా నటించి సరిపెట్టాడు. మహతిగా నటించిన ప్రియా వడ్లమాని నటన ఒక్కటే చెప్పుకోదగ్గది. అయితే మహతిగా చనిపోయాక, మాయాకి తన రూపం వచ్చి, ఇంకా మహతిలాగే తను నటించడంలో లాజిక్ ఏమాత్రం లేదు. రూపం మారినంత మాత్రాన మహతి మాయ ఎలా అయిపోతుంది? మహతిగా రూపం మారిన ఆయేషా ఖానే మహతిగా నటించాలి, ప్రియా వడ్లమాని కాదు. ఈ లాజిక్ కూడా వదిలేసి ఆషామాషీగా పాత్రల్ని చుట్టేశారు.

        ఆయేషా ఖాన్ ఫస్టాఫ్ లో అరగంట కనిపించి కోమాలో కెళ్ళిపోయే పాత్ర. పాత్రకి రూట్స్ లేవు, నటనా కూడా సరిగా లేదు. హీరో రాజ్ గా, విలన్ గా వికాస్ వశిష్ట నటన కథా కథనాల ప్రమాణాలకి తగ్గట్టుంది. లాజిక్ లేని పాత్ర. ఇతడి ఫ్రెండ్ గా, మరో డాక్టర్ గా చైతన్యా రావు నటించాడు.

     ఇక సంగీతం గానీ, సాంకేతిక విలువలుగానీ లో బడ్జెట్ కి తగ్గట్టుగానే వున్నాయి. ఇలా కొత్తదర్శకుడు, ఇంకో దర్శకుడూ కలిసి- మారిటల్ రేప్ కథని గజిబిజి గందరగోళం చేసి వదిలారని చెప్పాలి. బాగుపడిందేమీ లేదు. ఇది చూశాక జీతేంద్ర- ముంతాజ్ లు నటించిన రూప్ తేరా మస్తానా గుర్తుకొస్తుంది - క్యారక్టర్ రీప్లేస్ మెంట్ థ్రిల్లర్.

—సికిందర్

10, డిసెంబర్ 2022, శనివారం

1261 : రివ్యూ!

రచన- దర్శకత్వం : హర్ష పులిపాక
తారాగణం : బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మికా రాజశేఖర్, దివ్యా శ్రీపాద, సముద్ర కని, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : రాజ్ కె నల్లీ
బ్యానర్స్ : టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
నిర్మాతలు : అఖిలేష్ వర్ధన్, సృజన్
విడుదల ; డిసెంబర్ 9, 2022
***

        హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా కాలం తర్వాత వెండి తెర మీద కనిపిస్తూ ప్రయోగాత్మక సినిమా నటించారు. హాస్య పాత్ర కాకుండా, కథలు చెప్పే ఉదాత్త పాత్ర నటిస్తూ వెరైటీ నందించారు. చాలా కాలం తర్వాత కలర్స్ స్వాతి కూడా తెరపైకొచ్చింది. కొత్త దర్శకుడు హర్ష పులిపాక విషయం లేని రొటీన్ మూస తీసి తనూ ఓ దర్శకుడయ్యాడన్పించుకోకుండా, ఏదో కొత్తగా చెప్పాలన్న తపనతో తన వంతు ప్రయత్నం చేశాడు. నాల్గయిదు చిన్న కథల ఆంథాలజీలు కొత్తగాకున్నా, ఓ నాల్గు జీవితాల్ని వాస్తవిక దృక్పథంతో చిత్రించేందుకు ముందుకొచ్చాడు. ఆంథాలజీలు బాక్సాఫీసు దగ్గర వర్కౌట్ కావని గత ఉదాహరణలున్నా, ఓటీటీ కాకుండా థియేటర్ విడుదలకే పూనుకోవడం సాహసమే అనాలి. ఈ సాహసం ఎంతవరకు వర్కౌట్ అయిందీ చూద్దాం...

కథ  


        వేదవ్యాస్ (బ్రహ్మనందం) ఆలిండియా రేడియోలో రిటైరై, కూతురు రోషిణి (కలర్స్ స్వాతి) తో వుంటాడు. ఖాళీగా వుండలేక కథలు రాయాలనుకుంటాడు. కథకుడుగా వూళ్ళో జరిగే స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొనాలనుకుంటాడు. నువ్వు కథలు రాయడమేమిటని, ఈ వయసులో యువ కథా రచయితలతో పోటీ పడలేవనీ రోషిణి నిరుత్సాహ పర్చినా, కాదని తన అరవై ఏళ్ళ జీవితానుభవాన్నీ రంగరించి కథలు చెప్పడానికి పోటీల కెళ్తాడు. అక్కడ ఏఏ కథలు చెప్పాడు, వాటికి ఎలాటి స్పందన లభించిందీ, పోటీల్లో గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    పైన చెప్పుకున్నట్టు ఇది ఆంథాలజీ జానర్ కి చెందిన కథ. నాల్గయిదు కథానికల్ని కలిపి ప్రధాన కథతో ఏకీకృతం చేసే హైపర్ లింక్ ప్రక్రియ. ప్రధాన కథ వేదవ్యాస్ ది. పోటీల్లో అతను కథలు చెప్పి విజేత అవడం గురించి. కెరీర్ ని ఇరవైలలోనే కాదు, అరవైలలో కూడా ప్రారంభించ వచ్చని చెప్పే ప్రధాన కథ. ఈ ప్రధాన కథ కింద పంచేంద్రియాల కాన్సెప్ట్ తో పంచతంత్రం టైటిల్ తో ఐదు కథానికలు చెప్తాడు. చూపుకి, రుచికి, వాసనకి, స్పర్శకి, వినికిడికీ సంబంధించిన కథానికలు.

        1. చూపు : విహారి (నరేష్ అగస్త్య) హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పని ఒత్తిడితో విశ్రాంతి లేక కోపంతో రియాక్ట్ అవుతూంటాడు. ఉద్యోగం తప్ప వేరే జీవితం లేకపోవడంతో మానసిక కుంగుబాటుతో వుంటాడు. ఒక రోజు కొలీగ్స్ బీచి గురించి మాట్లాడుకుంటే ఆసక్తితో బీచి గురించి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి తెలుసుకుని ఆనందిస్తాడు. తను కూడా బీచి చూడాలనుకుంటాడు. కొలీగ్స్ తో వైజాగ్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తాడు. తీరా వైజాగ్ వెళ్ళి చూస్తే తన వూహల్లోని బీచి కనిపించదు. కొలీగ్ ఆ రద్దీ ప్రాంతం నుంచి ఏకాంత ప్రదేశంలోకి తీసి కెళ్ళి చూపిస్తుంది. అక్కడ సముద్రం, ఇసుక, అలలూ చూసి ఆనంద భరితుడవు తాడు. బీచి చూడాలన్న కోరికంతా తీర్చుకుంటాడు.

          ఈ కథానికలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం గాదు. ఇంట్లో తిని కూర్చునే వాళ్ళకి కూడా బీచి చూడాలని వుంటుంది. కానీ ఈ కథానికలో హీరో కేటగిరీ ఇది కాదుగా? ఉద్యోగ వొత్తిడి వల్ల  ఉపశమనాన్ని కోరుకోవడంలోంచి బీచిని చూడాలన్న కోరిక పుట్టింది. ఆ కోరిక తీర్చుకుని, రెట్టించిన స్థాయిలో రిలీఫ్ పొంది, వచ్చి ఆఫీసులో ప్రొడక్టివిటీ పెంచేసి, ఆటాపాటాగా పని దంచేస్తూంటే కథానికకి అర్ధం వచ్చేది.

 2. రుచి :

        సుభాష్ (రాహుల్ విజయ్), లేఖ (శివాత్మికా రాజశేఖర్) లకి పెళ్ళి చూపులేర్పా
టవుతాయి.  
దీనికి ముందు పెళ్ళి చూపుల్లో, మీరెందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే, ఏ అమ్మాయీ సరీగ్గా చెప్పలేదు. ఒకమ్మాయి సిగ్గుతో వంకర్లు పోవడం, ఇంకో అమ్మాయి ఇంకేదో చెప్పడం చేస్తారు. ఇక విసిగిపోయి, ముందు తనేంటో తనకి తెలియాలి. వీళ్ళు అమ్మాయిలు, నాకు వుమన్ కావాలి అని తల్లితో అనేస్తాడు. ఇప్పుడు లేఖతో పెళ్ళి చూపులయ్యాక బయట కలుసుకుంటారు. తను మెంటల్ గా, ఫైనాన్షియల్ గా రెడీగా వున్నానని చెప్తుంది లేఖ. పెళ్ళంటే అభిరుచులు కలవడమని అంటుంది. ఈ ఒక్క మీటింగ్ తో అభిరుచులేం తెలుస్తాయని అంటాడు. క్రికెట్ మ్యాచ్ గెలుస్తామని తెలిసి ఆడతామా, పెళ్ళి కూడా మ్యాచే, ఆడుతూంటే తెలుస్తూంటుంది. అడ్జస్ట్ మెంట్లు వుంటాయ్ అంటుంది. మనమేంటో మనకి తెలిస్తే మనకేది కావాలో తెలుస్తుందని అంటుంది. అతను అంగీకరిస్తాడు.

        ఈ కథానికలో అభిప్రాయాలు బాగానే వున్నాయి గానీ, మాటలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. వాటిని ప్రేక్షకులు నమ్మరుగాక నమ్మరు. విజువల్ ఎగ్జాంపుల్ కావాలి. ఏదైనా సంఘటన జరిగి ఆ సంఘటనలో పరస్పరం వ్యక్తిత్వాలేంటో బయటపడితే ఆ సాక్ష్యం కన్విన్సింగ్ గా వుంటుంది. సంఘటన లేకుండా కథ వుండదు. కథంటే సంఘటనే. పాత్రల వ్యక్తిత్వాలు బయట పడే సంఘటన. ఇక ఈ కథానిక రుచి గురించి అయినప్పుడు, ఐస్ క్రీములు రుచి చూడడం గాక, బాదం పాలు తాగి మైమరిచి పోవడం గాక, వ్యక్తిత్వాల్ని ఆస్వాదించే అంశాలతో కథనం వుంటే కరెక్టుగా వుంటుంది.

        3. వాసన :  రామనాథం (సముద్ర కని) రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. భార్య వుంటుంది. భర్త దగ్గర కూతురు డెలివరీ కుంటుంది. ఉన్నట్టుండి రామనాధానికి ఏదో దుర్వాసన వేస్తూ వుంటుంది. ఎలుక చచ్చిన వాసన. ఇల్లంతా గాలిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. వేలు తెగి రక్తం కారుతూంటే అప్పుడు వాసన రక్తంలోంచి వస్తోందని గ్రహిస్తాడు. భార్యకి ఆ రక్తంలో కూడా ఏ వాసనా వేయదు. అల్లుడు వచ్చి, సైకియాట్రిస్టుకి చూపిస్తాడు. సైకియాట్రిస్టు రామనాధం నుంచి విషయాలు రాబడతాడు. ఈ సమస్యకి మూలం రామనాథం పుట్టుకలోనే వుందని గ్రహిస్తాడు. ఏమిటా మూలం? దానికీ ఇప్పుడు కూతురి డెలివరికీ వున్న సంబంధమేమిటి? సమస్యకి పరిష్కారం కూతురి డెలివరీ మీద ఆదారపడి వుండడమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథానిక చూడాలి.

        ఈ కథానిక విషయబలంతో కూర్చోబెడుతుంది. ప్రతీ క్షణం వాసన గురించిన సస్పెన్స్ వుండడంతో ఈ సస్పెన్సే చివరంటా తీసికెళ్తుంది. మొదటి రెండు కథానికలకంటే ఇది డెప్త్, డ్రామా, జీవం వున్న కథానిక. దీని రచన, నిర్వహణ ఉత్తమ తరగతికి చెందుతాయని చెప్పొచ్చు.

4. స్పర్శ :
   శీను (వికాస్), లక్ష్మి (దివ్యా శ్రీపాద) లది కింది మధ్యతరగతికి చెందిన కుటుంబం. నెలలు నిండిన లక్ష్మికి రక్తస్రావం జరగడంతో తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. అక్కడ చాలా ట్రాజడీ బయటపడుతుంది (గుర్తుందా శీతాకాలం లో తమన్నా పాత్రకి లాగా)లక్ష్మికి ప్రాణ గండం పొంచి వుంటుంది. లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులకి కావాలి. శీనుకి దిక్కు తోచదు. ఇంతలో తల్లిదండ్రులొచ్చి సూటిపోటి మాటలంటారు. లక్ష్మి తల్లి వచ్చి ఎదురు తిరుగుతుంది. ఇక ఇచ్చుకున్న కట్నాల గురించీ, పుచ్చుకున్న కానుకల గురించీ అరుచుకుని, ఆస్పత్రి ఖర్చుల గురించి కీచులాడుకునీ వెళ్ళిపోతారు. శీను లక్ష్మిని తీసుకుని యింటి కొచ్చేస్తాడు. ఇక ఇద్దరికీ ఒకటే మిగులుతుంది - కడుపులో బిడ్డ కదిలితే ఆ స్పర్శకి ఆనందించడం, స్పర్శ లేకపోతే భయపడడం. ఈ క్షణ క్షణ గండంతో బాటు లక్ష్మి ప్రాణగండం ఎలా తీరాయి, తీరాయా లేదా అనేది మిగతా కథానిక.

ఇది కూడా సస్పెన్సుతో కూర్చోబెడుతుంది. ఈ సస్పెన్సుతో ఇద్దరికీ తమ వాళ్ళ స్వార్ధాలతో సంఘర్షణ తోడవుతుంది. డబ్బే ప్రధానమైన బంధుత్వాలు  నిస్సిగ్గుగా వీధిన పడతాయి. పైగా వాళ్ళిద్దర్నీ విడదీయాలని కూడా ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు తెంచుకోవడం కాదు, పంచుకోవాలని చెప్పే ఈ కథానిక కూడా వాస్తవిక జీవితాలతో ఉత్తమమైనదే. ఇందులో ఒక చోట శీను మిత్రుడికి చెప్పుకుంటూంటే మిత్రుడు శీను జేబులో డబ్బులు పెట్టే లాంగ్ షాట్ లో మాంటేజ్ కదిలించేలా వుంటుంది.

        5. వినికిడి : ఇందులో లియా(కలర్స్ స్వాతి) ఒక పాడ్ కాస్టర్. పాడ్ కాస్టింగ్ తో ఆమె ప్రసారం చేసే కథలు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రోగ్రాం అభిమాని రూపా అని బాలిక వుంటుంది. ఈమె బర్త్ డేకి ప్రోగ్రాంలో గ్రీటింగ్స్ చెప్పించాలని తండ్రి కిషన్ (ఉత్తేజ్) వూర్నుంచి బయల్దేరి హైదరాబాద్ వస్తాడు. అయితే కథల ప్రసారం ఆపి, వేరే ప్రోగ్రాం ప్రారంభించే పని మీద వుంటుంది లియా. కిషన్ వచ్చి విషయం చెప్పడంతో, లియాకి రూపా పట్ల ఆసక్తి పెరుగుతుంది. రూపాని కలిసేందుకు బయల్దేరి వెళ్తుంది. ఇప్పుడు తన బర్త్ డేకి వచ్చిన లియాని చూసి రూపా ఎలా ఫీలయ్యిందీ, రూపాని చూసి లియా ఎందుకు షాకయ్యిందీ తెలుసుకోవాలంటే మిగతా ఈ కదిలించే కథానిక చూడాలి.

ఈ కథానిక కూడా బలమైనదే. చివరికి పెల్లుబికే భావోద్వేగాలతో బలమైనది. మనుషుల్ని కలిపేది. తెలియకుండా సస్పెన్స్ వుంటూ, చివర్లో వెల్లడై షాకిచ్చేది.

      ఈ అయిదు కథానికల్లో సస్పెన్సుతో వున్న చివరి మూడు కథానికలే కట్టి పడేస్తాయి. కథానికలకి సంఘటనలు, సస్పెన్సు ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. మొదటి రెండు కథానికలు సంఘటనలూ సస్పెన్సూ  లేక విఫలమయ్యాయి.

ఇక ప్రధాన కథ చూస్తే, పోటీల్లో కథలు చెప్పిన వేదవ్యాస్ విజేతే అవుతాడు. అయితే కూతురు రోషిణి తో అతడికున్న సంబంధమే సరిగా లేదు. వ్యతిరేకించే పాత్ర వుంటే ప్రధాన పాత్ర గొప్ప తెలుస్తుందని రోషిణి క్యారక్టర్ వుండడం మంచిదే. అయితే ఆమె వ్యతిరేకించే కారణం వేరే వుండాలి. ఆలిండియా రేడియోలో అన్నేళ్ళు ఉద్యోగం చేసిన తండ్రికి సాహిత్యంతో  సంబంధం వుండదా? కథలు రాయలేడా? తండ్రియేదో సగటు మనిషి అయినట్టు- నువ్వు రైటర్ అవడమేమిటని చిన్నబుచ్చుతూ వుండాల్సిన అవసరం లేదు.

నటనలు –సాంకేతికాలు

ఇందులో నటీనటులందరూ పాత్రలకి తగ్గ అభినయాలు చేశారు. బ్రహ్మానందం పాత్ర అంతంత మాత్రమే. ఆడిటోరియంలో ఒక్కో కథ ప్రారంభిస్తూ చెప్పే రెండు మాటల వరకే ఆయన కనిపించేది. ఇలా కామెడీ చేయకుండా హూందాతనంతో నటించడం బావుంది. నిజానికి ఓ కథానిక తనతో వుంటే బావుండేది. బ్రహ్మానందం చెప్పే చివరి కథానికలో లియా పాత్రలో తననే వూహించుకుంటుంది కలర్స్ స్వాతి రోషిణి పాత్ర. లియా పాత్రని క్లాస్ గా నటించింది.

        తర్వాత సముద్ర కని వాసన సైకాలజికల్ పాత్ర నటన పాత్రలోకి లీనమైపోయి వుంటుంది. పాత్రలో అంతగా లీనమై కనిపించేది శివాత్మిక కూడా. ఎక్స్ ప్రెషన్స్ ని బాగా ప్లే చేసింది. దివ్యా శ్రీపాద, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్ అందరూ పాత్రల్లా కన్పించే ప్రయత్నం చేశారు. దర్శకత్వం, దర్శకుడు రాసిన మాటలు నస పెట్టకుండా వున్నాయి. ఇలాటి కథానికలు కోరుకునే కళాత్మకత కి గుర్తుండే షాట్స్ కూడా తోడైతే  బావుంటుంది. ఇమేజెస్ అన్నవి విజువల్ మీడియాని ఉన్నతీకరిస్తాయి. ఇక ప్రశాంత్ విహారి సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలున్నాయి. రాజ్ కె నల్లీ కెమెరా వర్క్ బడ్జెట్ కి తగ్గట్టు రిచ్ గానే వుంది.

చివరికేమిటి
          ఆంథాలజీలు వెండి తెర మీద సక్సెస్ కావడం ఎప్పుడూ జరగలేదు- ఒకటీ రెండు తప్ప.  చందమామ కథలు, మనమంతా, ఆవ్, గమనం వర్కౌట్ కాలేదు. వేదం, కేరాఫ్ కంచర పాలెం మాత్రం సంచలనం సృష్టించ గలిగాయి. పిట్ట కథలు ఓటీటీలోనే విడుదలైంది. పంచతంత్రం కూడా ఓటీటీ మూవీయే గానీ థియేటర్ సినిమా కాదు.  ఇందులో సగటు ప్రేక్షకులు కోరుకునే అంశాలేవీ లేవు. యూత్ కి అసలే పడదు. మొదటి రెండు కథలు యూత్ కథలే అయినా వాటిని అంత ట్రెండీగా తీయలేదు. మిగిలిన మూడు కథలు బరువైనవి. అయితే కొత్త దర్శకుడు ఇవన్నీ పక్కన బెట్టి కళాపోషణ చేస్తూ తాననుకున్నది తీయడమే గొప్పనుకోవాలి.

—సికిందర్

7, డిసెంబర్ 2022, బుధవారం

1260 : రివ్యూ!


దర్శకత్వం : అమర్ కౌషిక్
తారాగణం : వరుణ్ ధావన్, కృతీ సానన్, దీపక్ దోబ్రియాల్, పాలిన్ కబాక్, అభిషేక్ బెనర్జీ తదితరులు.
రచన : నీరేన్ భట్, సంగీతం: సచిన్ - జిగర్, ఛాయాగ్రహణం : జిష్ణూ భట్టాచార్య
నిర్మాణం : జియో స్టూడియోస్, దినేష్ విజన్ ,
పంపిణీ : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
విడుదల : నవంబర్ 25, 2022

***
            ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో యువతరంలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో హిట్లున్నాయి, ఎక్కువగా ఫ్లాప్స్ వున్నాయి. ఈ సంవత్సరమే నటించిన జుగ్ జుగ్ జియో కుటుంబ వినోదం హిట్టయ్యింది. దీని తర్వాత ఇప్పుడు రూటు మార్చి ఫాంటసీ థ్రిల్లర్ భేడియా లో నటించాడు. ఇది పానిండియా మార్కెట్ లో విడుదలైంది. తెలుగులో తోడేలు గా డబ్ చేసి విడుదల చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. స్త్రీ’, ‘బాలా అనే రెండు విభిన్న సినిమాలు తీసి హిట్లు సాధించిన అమర్ కౌషిక్ దీని దర్శకుడు. ఇప్పుడు ఈ మూడో సినిమా కూడా విభిన్నమే. ఇందులో వరుణ్ సరసన హీరోయిన్ గా కృతీ సానన్ నటించింది. ఏమిటీ తోడేలు ఫాంటసీ? హార్రర్ కామెడీగా తీసిన ఈ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పిస్తుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో వుండే భాస్కర్ అలియాస్ భాస్కీ (వరుణ్ ధావన్), బగ్గా (సౌరభ్ శుక్లా) అనే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తూంటాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో అనే అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే పని మీద భాస్కీ కజిన్ జనార్థన్ (అభిషేక్ బెనర్జీ) తో కలిసి జీరోకి చేరుకుంటాడు. స్థానికుడైన జోమిన్ (పాలిన్ కబాక్) అక్కడ కలుస్తాడు. ఈ ముగ్గురితో పాండా (దీపక్ డోబ్రియాల్) కలుస్తాడు. అయితే గిరిజనులు తమ భూమిని వదులుకోవడానికి, చెట్లని నరికి వేయడానికీ ఒప్పుకోక పోవడంతో భాస్కీ కేం చేయాలో తోచదు. ఎలాగైనా రోడ్డు వేయాలన్న పట్టుదలతో వుంటాడు. గిరిజనులతో కొట్లాటకి దిగుతాడు. ఇంతలో అడవిలో తోడేలు అతడి మీద దాడి చేసి కరుస్తుంది. జనార్దన్, జోమిన్ కలిసి అతడ్ని పశువైద్యురాలు అనికా (కృతీ సానన్) దగ్గరికి తీసికెళ్తారు. ఆమె వైద్యంతో నయం కాదు. విషమించి భాస్కీ తోడేలుగా మారిపోతాడు. రాత్రి పూట తోడేలుగా మారుతాడు, పగటి పూట మనిషిలా వుంటాడు.

        ఏమిటీ పరిస్థితి? అడవి జోలికొచ్చినందుకు తోడేలు పగబట్టి ఇలా చేసిందా? అసలు కరిచింది నిజంగా తోడేలేనా? ఇప్పుడేం చేయాలి? తిరిగి మామూలు మనిషిగా ఎలా మారాలి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

హాలీవుడ్ లో వేర్వుల్ఫ్ సినిమాలని రెగ్యులర్ గా వస్తుంటాయి. మనిషి తోడేలుగా మారే ఈ సినిమాలు హార్రర్ సబ్ జానర్ లోకి వస్తాయి. ఈ కథలు గ్రీకు పురాణాల్లోంచి వచ్చాయి. ఆ పురాణాల ప్రకారం, లైకాన్ అనే వ్యక్తి ఆకాశానికి దేవుడైన జ్యూస్‌ కి మానవ మాంసంతో చేసిన భోజనాన్ని అందించినప్పుడు జ్యూస్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దానికి శిక్షగా, కోపోద్రిక్తుడైన జ్యూస్ లైకాన్‌ ని తోడేలుగా మార్చేశాడు. అలా తోడేలు మనిషిగా లైకాన్ నరకాన్ని అనుభవించాడు. ఇలా యూరోపియన్ జానపద కథల్లో రాత్రిపూట తోడేలుగా మారి జంతువుల్ని, మనుషుల్నీ, శవాల్నీ మింగేసి, పగటిపూట మానవ రూపంలోకి తిరిగి వచ్చే మనిషికి వేర్వుల్ఫ్ అని పేరు పెట్టి కథల్ని సృష్టించారు. ఈ గ్రీకు నేపథ్యంలోంచి లోంచి వచ్చిందే తోడేలు కథ.

        ఈ హార్రర్ కథని కామెడీగా చూపించాడు దర్శకుడు. ఈ హార్రర్ కామెడీకి పర్యా వరణ సమస్య సందేశం జోడించాడు. ఈ మధ్య ఆవాస వ్యూహం అని మలయాళంలో వచ్చింది పర్యావరణ సమస్యతో. అందులో కప్ప మనిషిని చూపించారు. పర్యావరణానికి హాని చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుందనే కథ తోడేలు లో కూడా వుంది.

        అయితే పర్యావరణ సమస్యకి తోడేలు రియాక్ట్ అవడంతో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమవుతుంది. దీన్ని కామెడీ చేయడంతో సీరియస్ నెస్ పోయి విషయం దెబ్బతింది. తోడేలుగా మారిన హీరో మనుషుల మీద కామెడీగా దాడులు చేయడం, మనుషులూ కామెడీగా చావడం విషయాన్ని పక్కదోవ పట్టించేదిగా, కేవలం హార్రర్ కామెడీని ఎంజాయ్ చేయాలన్నట్టుగా తయారైంది. తోడేలుతో హార్రర్ కామెడీయే చేయాల్సి వుంటే మధ్యలో పర్యావరణ సమస్యని లాగాల్సిన అవసరం లేదు. గిరిజనుల సమస్య కామెడీ కాదు.

        ఫస్టాఫ్ ఏదోలే కామెడీ చేశాడని సరిపెట్టుకున్నా సెకండాఫ్ లోనూ అదే వరస. క్లయిమాక్స్ ఒకటే ఆసక్తిని పెంచుతుంది. కథలో చాలా అవసరమైన ఎమోషన్సే లేవు. ఎమోషన్స్, స్ట్రగుల్, బాధ, ఆక్రోశం వుంటే తోడేలు రూపంలోంచి బయటపడాలనుకునే హీరోతోనే వున్నాయి. ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే, తోడేలుగా మనుషుల్ని కామెడీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడుగా- ఇంకేంటి బాధ?

నటనలు- సాంకేతికాలు

వరుణ్ ధావన్ హృదయాన్ని, ఆత్మనీ విప్పి పాత్రలో పోశాడని చెప్ప వచ్చు. మనిషిగా మామూలుగా వున్నప్పుడు, పదేపదే తోడేలుగా మారుతున్నప్పుడూ. తోడేలుగా మారేక అన్నీ కామెడీలే. కానీ తోడేలుగా మారేప్పుడు శరీరంలో జరిగే మార్పులకి అనుభవించే నరకాన్ని ఉద్విగ్నంగా ప్రదర్శించాడు. ఇంతవరకు తన గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ఏవైనా ఊపిరిబిగబట్టి చూసే సన్నివేశాలుంటే ఇవే.

        పశువుల డాక్టర్ గా కృతీసానన్ ది మామూలు పాత్ర. హీరోని ప్రేమించడం, వాదన పెట్టుకోవడం మామూలే. అయితే ఈ పాత్రకో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. దీంతో అసలు తోడేలుకథకి మూలాలు 1941 వేర్వుల్ఫ్ మూవీ ది వేర్వుల్ఫ్ మాన్లో వున్నాయని తెలిసిపోతుంది. ఇలా మామూలుగా కన్పించే కృతీసానన్ పాత్రతో అనూహ్యంగా ట్విస్టు రావడం క్లయిమాక్స్ కి బలాన్నిచ్చే ఎలిమెంట్.  ఇక హీరో ఫ్రెండ్ గా అభిషేక్ బెనర్జీ మంచి కమెడియన్. ఇతర నటులు సౌరభ్ శుక్లా సహా ఫర్వాలేదనిపించుకుంటారు –ఆ పాత్రల్లో అంతే నటించగలరు.

        సచిన్-జిగర్ ల  సంగీతం యావరేజ్‌గా వుంది. జిష్ణూ ట్టాచార్జీ ఛాయాగ్రహణం మాత్రం అద్భుతంగా వుంది. మునుపెన్నడూ చూడని లొకేషన్స్ ని అరుణాచల్ అందాలతో చూపెట్టాడు. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్ గా వుంది. సౌండ్ డిజైన్ బావుంది. కాస్ట్యూమ్స్ ఆకర్షణీయంగా వున్నా వాస్తవికంగా వున్నాయి.

        ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్. హీరో తోడేలుగా మార్పు చెందేటప్పటి దృశ్యాల గ్రాఫిక్స్ బలంగా వున్నాయి. సాంకేతికంగా రాజీ పడని ధోరణి కన్పిస్తోంది గానీ, విషయపరంగానే రంజింప జేసే ధోరణి కనిపించడం లేదు.
—సికిందర్