రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మే 2022, ఆదివారం

1167 : స్క్రీన్ ప్లే సంగతులు -2


  స్టాఫ్ కథ : ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానంతో ప్రారంభం - ఓ 800 సంవత్సరాల క్రితం సిద్ధవనం అడవుల్లో గిరిజన గూడెం వుండేది. వందమంది జనాభా. జీవధార నది ప్రవహించేది. అక్కడ యోగులు, మహర్షులు ఎక్కువ సంచరించే వాళ్ళు. తపస్సులు చేసుకునే వాళ్ళు. ఆ గిరిజన గూడేనికి పెద్ద దిక్కుగా వుండే వాళ్ళు. గిరిజనులకి ధర్మం నేర్పారు. అంతేగాక సిద్ధవనం మూలికలతో వాళ్ళకి ఆయుర్వేదం నేర్పి గొప్ప నాగరికతకి బీజం వేశారు. ఎన్ని విపత్తు లొచ్చినా ఈ అడవిని విడిచి పెట్టకూడదని వాళ్ళకి సృష్టి రహస్యాన్ని బోధించారు.

      లా వుండగా ఓ రాక్షస మూక దండెత్తి వచ్చింది. యోగుల తపో బలంతో అమ్మవారు ప్రత్యక్షమై రాక్షస మూకని సంహరించింది. అలా ఘట్టమ్మ అమ్మవారు అక్కడే వుండి పోయింది. జీవధార అవతలి వైపు నిలబడి సిద్ధవనంకి కాపలాగా వుంది. గిరిజనులు అమ్మవారికి గుడి కట్టుకున్నారు. ఆ ప్రాంతానికి పాద ఘట్టం అని పేరుపెట్టారు. ఆ పాదఘట్టం నెమ్మదిగా పెరిగి ఇప్పుడు ధర్మస్థలి అయింది. ఈ ధర్మస్థలిలో ప్రస్తుతం అధర్మ కలాపాలు జరుగుతున్నాయి...

        ఇదీ కథా ప్రారంభం, పరిచయం. ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్నతో ఈ కథ చేస్తే ప్రయోగాత్మకమయ్యేది.  What if?  (ఇలా జరిగితే?) అన్న ప్రశ్నని ఆధారంగా  చేసుకుని హాలీవుడ్ లో సినిమాలు తీస్తూంటారు. ఎవరూ చూడలేని చనిపోయిన వ్యక్తుల్ని ఒక బాలుడు చూస్తూంటే?’ అన్న ప్రశ్నతో సిక్స్త్ సెన్స్’, మనం చూస్తున్న ప్రపంచం నిజానికి కంప్యూటర్ ప్రతి సృష్టి అయితే?’ అన్న ప్రశ్నతో మ్యాట్రిక్స్ మొదలైనవి.

        ఇలా ఇప్పుడు ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్న కూడా వూహా గానమే అవుతుంది. లేనిది, జరగనిది కల్పన చేసి చూపడం. నిజంగా ఆసక్తి రేపే వూహాగానమే  ఇది. ఋషులేమిటి, అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఆయుర్వేదం నేర్పడమేమిటి? అలా ఆయుర్వేదం నేర్చుకున్న గిరిజనులు అప్పటికే తమకి తెలిసి వున్న మూలికా వైద్యంతో కలిపి ఇంకేం చేసి వుంటారు? ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయ్యే  అవకాశముంది. సరదాగా వూహాగాన మాత్రంగా. అంతేగానీ, వాస్తవంలో ఇలా జరిగే అవకాశం లేదు. అసహజ కథ అవుతుంది. అయింది కూడా. అడవిలో వున్న మూలికలు, దాంతో మూలికా వైద్యం ఋషుల కంటే పూర్వమే గిరిజనులకి తెలుసు. మరి అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఋషులు ఆయుర్వేదం నేర్పడమేమిటి?

నమ్మించని నేపథ్యం

ఋషులు శూద్రులకి శాస్త్రాలు నేర్పడం, సృష్టి రహస్యాలు చెప్పడం, ధర్మాన్ని బోధించడం - ఇదంతా వాస్తవ దూరమైన సెటప్. పైగా మూల వాసులైన గిరిజనులకి ఈ శాస్త్రాలకంటే పూర్వం నుంచీ వాళ్ళ వైద్య పద్ధతులు, జీవన విధానం, విశ్వాసాలు వాళ్ళకున్నాయి. ఇంకో కల్చర్ ని తమ మీద రుద్దితే ఒప్పుకోరు. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకెవరూ ఏం నేర్పాలన్నా, మార్చాలన్నా నేర్చుకోరు, మారరు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం - ప్రభుత్వ సమగ్ర గిరిజానాభివృద్ధి సంస్థ వైఫల్యం.

        కాబట్టి ఋషులు- గిరిజనులు- సిద్ధవనం, ఆయుర్వేద వృత్తి- అమ్మవారు- పాద ఘట్టం, జీవధార, ధర్మస్థలి - ఈ నేపథ్యమంతా, పాత్రలన్నీ అసహజంగా అన్పిస్తాయి. అసలు ఇదంతా దేనికి? ఈ బిల్డప్ కథకేం ఉపయోగపడింది? అక్కడున్న గిరిజనుల భూములు మైనింగ్  మాఫియాలకి కావాలి - ఇంతేగా స్క్రిప్టుని వొలిచి చూస్తే కథ? ది ఎమరాల్డ్ ఫారెస్ట్ (1985) లో అమెజాన్ అడవుల్లో ప్రభుత్వం డామ్ కట్టే ప్రయత్నం చేస్తే దాన్నెదుర్కొనే రెడ్ ఇండియన్స్ (గిరిజనులు) కథ సూపర్ హిట్ కాలేదా? ఈ మాత్రం సూటి కథ వుంటే సరిపోదా ఆచార్య కి?

        మైనింగ్ మాఫియాకి కావాల్సింది గిరిజనుల అటవీ ప్రాంతం. చెట్లు చేమలు, నీరు, వనరులు, వ్యవసాయంతో కూడిన గిరిజనుల జీవికని లాగేసుకునే దుష్కృత్యం. గిరిజనుల జీవికని లాగేసుకోవడానికి మించిన ఎమోషనల్ అప్పీల్ కథ కింకెక్కడుంటుంది? ఆ భూముల మీద సిద్ధవనం, పాదఘట్టం, ధర్మస్థలి, ఆయుర్వేదం - ఇవన్నీ ఋషులు రుద్దిన పరాయి హంగులే. ఇవి వున్నా లేక పోయినా గిరిజన పాత్రలతో ఎమోషనల్ అప్పీల్ వుండదు. ప్రేక్షకులూ ఫీల్ కారు.

         అల్లూరి సీతారామరాజు లో - విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టాన్ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే కదా -అల్లూరి పోరాటానికి దిగింది? కేవలం జీవిక కోసం, పొట్ట కోసం అడవుల్ని నమ్ముకుని వుంటున్న ఆదివాసుల్ని నిరాశ్రయుల్ని చేయడమనే  - జీవిక లాగేసుకుని వాళ్ళ పొట్ట కొట్టడమనే - అన్యాయానికి మించిన పరాకాష్ట ఇంకోటుంటుందా?

కథా ప్రయోజనంతో వాస్తవికత

జీవికని లాగేసుకోవడాన్ని ఇంకో సెటప్ లో చూద్దామా అప్డేట్ చేసి సమకాలీనంగా మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, ఎకనమిక్స్ వగైరాలతో కలిపి? అడవుల్లో తిప్పతీగ అని వన మూలిక వుంటుంది. దీన్ని ఆయుర్వేద ఔషధ తయారీలో ఉపయోగిస్తూంటారు. మహారాష్ట్రకి చెందిన ఒక గిరిజనుడు ఈ తిప్పతీగెని పండిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. ఆయుర్వేద కంపెనీలు ఈ తిప్ప తీగె సాగుని కొనుగోలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అధికం కావడంతో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే పనిలో పడ్డారు. దీంతో తిప్ప తీగెలకి డిమాండ్ పెరిగింది. ఇంతేగాక, కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గిరిజనుడు తిప్పతీగల సాగుచేస్తూ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.

         పై స్టోరీ ఐడియా లాజికల్ అప్రోచ్ తో లేదూ? గిరిజనులు తమది కాని ఆయుర్వేద వైద్య వృత్తిని చేపట్టకుండా, ఆయుర్వేద ఔషధ ఉత్పత్తిలో తోడ్పడే వన మూలికని సాగుచేస్తూ, సోదర ఆయుర్వేద శాస్త్రానికి చేయూతనందిస్తున్న లాజికల్ అప్రోచ్? ఉత్తమ - సామాజిక ప్రయోజనం గల కథా రచన?

        ఇలాటి అటవీ భూమిని మైనింగ్ మాఫియా లాక్కుంటే ఎంత మంది పొట్టకొట్టి నట్టవుతుంది...??? దీనికెంత యూనివర్సల్ అప్పీల్ వుంటుంది? కదిలించే ఈ సూటికథ చేయకుండా- విశ్వసనీయత లేని స్టోరీ ఐడియాతో- సమస్య మీద ఫోకస్ లేక- ఫస్టాఫ్ కథాకథనాలూ ఫోకస్ చెదిరి - అత్యంత బలహీన స్క్రీన్ ప్లే చేశారు.

వాయిసోవర్ అయోమయం

        ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబుకి వాయిసోవర్ కోసం రాసిన స్క్రిప్ట్ సినిమా చూస్తూంటే అయోమయంగా వుంటుంది. సిద్ధవనం, పాదఘట్టం, జీవధార, ధర్మస్థలి, ఘట్టమ్మ గుడి- ఈ ప్రాంతాలేమిటి, ఏ ప్రాంతం ఏ ప్రాంతానికేమవుతుంది, ఆ ప్రాంతం ఈ ప్రాంతమైతే, ఈ ప్రాంతం ఏ ప్రాంతమవుతుంది- ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఒకటేనా, ఒకటి కాకపోతే ప్రాణాంతకమా - ఇదంతా పరాయీ కరణ చెందిన గిరిజన ప్రాంతమా- చరిత్రలో ఆదివాసుల మీద ద్రవిడ, ఆ తర్వాత ఆర్య వలస వాదమా? ఈ వలస వాదం ఓకే అయితే, ఇక నయా వలస వాదులమని మైనింగ్ మాఫియాలూ ఆ ప్రాంతం మీద హక్కుదార్లే అవుతారా?

        అన్నట్లు సందట్లో సడేమియాగా ఒక ముస్లిం క్యారక్టర్ వుంటుంది. అంటే ఆర్యుల తర్వాత ముస్లింల వలస వాదమా, ఇంకొకటి తగ్గింది- ఇంగ్లీషు క్యారక్టర్. ఇది కూడా వుండి వుంటే బ్రిటిష్ వలస వాదంతో ఆమూలాగ్ర చరిత్ర పుటలు రికార్డయ్యేవి.

        ఇలా బోల్డు కన్ఫ్యూజన్. ఇలా వుంది కథా ప్రారంభం. ఈ కథ ఓ రొటీన్ మాస్ కథయితే ఈ వలసల మీదికి దృష్టి పోదు. ఈ కథని చిరంజీవి నక్సల్ పాత్ర  డ్రైవ్ చేస్తుంది కాబట్టి - ఆ పాత్ర దృక్కోణంలో వలసల మీదికి దృష్టి పోతుంది, జానర్ మర్యాద కొద్దీ. ఈ ప్రాంతంలో గిరిజనులు కాకుండా అసలు వీళ్ళంతా ఎవరూ  - అన్న మార్క్సిస్టు కళ్ళతో చూడదా చిరంజీవి పాత్ర?

తర్వాతి కథ
        పై చారిత్రక నేపధ్యంలో ఇప్పుడు ధర్మ స్థలి మునిసిపాలిటీ టౌనుగా వుంటుంది. గిరిజనులకి సిద్ధ గురుకుల మహా విద్యాలయం కూడా వెలస్తుంది. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది. ఇక్కడ నీలాంబరి (పూజా హెగ్డే) సంగీతం నేర్పుతూంటుంది. ఘట్టమ్మ వారి ఆలయానికొక పూజారి (తనికెళ్ళ భరణి) వుంటాడు. ఇతను ప్రతీయేటా అమ్మవారి రథోత్సవం జరిపిస్తూంటాడు. మరో పక్క మందీ మార్బలంతో గిరిజనుడు వేద (అజయ్) ఆయుర్వేద కేంద్రం నడుపుతూంటాడు. ఆయుర్వేదంలో ఇతడి ప్రఖ్యాతి తెలుసుకుని ఓ యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలుస్తారు.

        ఇలా వుండగా, మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూ సూద్) అని వుంటాడు. ఇతను ధర్మస్థలిలో అక్రమాలు చేస్తూంటాడు హత్యలు సహా. సిటీలో రాథోడ్ (జీశ్శూ సేన్ గుప్తా) అని మైనింగ్ మాఫియా వుంటాడు. ఇతను బసవ ద్వారా మొత్తం ఈ గిరిజన ప్రాంతాన్ని కబళించాలని చూస్తూంటాడు. తాజాగా తనిఖీకొచ్చిన ప్రభుత్వ బృందాన్ని చంపించేస్తాడు బసవ. ఇక అమ్మవారు కాపాడదాని వేద విలపిస్తూంటే, ఖడ్గ ధారియై ఆచార్య (చిరంజీవి) వచ్చేస్తాడు.

        వచ్చి వడ్రంగి పనులు చేస్తూంటాడు నేస్తం నాగులు (వెన్నెల కిషోర్) ఇంట్లో బస చేసి. తనెవరో బయట తెలియకుండా రహస్యంగా వుంచుతాడు. ఓబులు అనే బసవ అనుచరుడు వేదని వేధించి గుండెల మీద తంతే, ఆ కాలు విరగ్గొట్టేస్తాడు ఆచార్య. కాలు విరిగిన ఓబులుకి వేద వైద్యం చేయడాన్ని గమనిస్తాడు ఆచార్య. శత్రువుకైనా వేద వైద్యం చేస్తాడని తెలుసుకుంటాడు.

        సిటీలో రాథోడ్ పార్టనర్స్ తో సమావేశమై సిద్ధవనం అడవులు కబ్జా చేసే విషయం మాట్లాడతాడు. వేరే అడవుల్లో ఆచార్య ఏం చేశాడో తెలుసుగా అని ఓ పార్టనర్ అంటాడు. అడవుల్లో రాథోడ్ అనుచరుల్ని ఆచార్య కామ్రేడ్ ఆచార్యగా చంపుతున్న దృశ్యం పడుతుంది. దీంతో ఆచార్య నక్సల్ అని మనకి అర్ధమవుతుంది. ఇది గుర్తు చేసుకుని ఆచార్య మీద మరింత  రగిలిపోతాడు రాథోడ్.

        ధర్మస్థలిలో నీలాంబరి ఒక చిన్నపిల్లకి సంగీతం నేర్పడం గురించి మాట్లాడుతూంటే, నీలాంబరిని గుర్తు పట్టినట్టు చూస్తాడు ఆచార్య. ఒక దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద జరుగుతున్న అత్యాచార యత్నాన్ని ఎదుర్కొని, దుండగుల్ని చిత్తుగా తంతాడు ఆచార్య. ఈ అత్యాచార యత్నం సిద్ధ గురుకుల మహా విద్యాలయంలో జరుగుతుంది. ఇది సిద్ధ (రామ్ చరణ్) చదువుకున్న పవిత్ర విద్యాలయమని దుండగులకి చెప్తాడు ఆచార్య. సిద్ధ ధర్మస్థలి కోసం చేసిన త్యాగం మీకు తెలీదంటాడు. సిద్ధ స్లోమోషన్ దృశ్యం పడుతుంది. దీంతో సిద్ధ గురించి కొంత మనకి తెలుస్తుంది.

        సంగీతం నేర్చుకుంటున్న చిన్నపిల్ల ఫ్లూటు కొనిమ్మంటే తన తండ్రి కొనివ్వడం లేదని ఆచార్యకి చెప్పుకుంటుంది. ఆచార్య పెట్టెలోంచి ఒక ఫ్లూటు తీసిస్తాడు. ఆ ఫ్లూటుని నీలాంబరి గుర్తుపట్టి తండ్రియైన పూజారితో వచ్చి ఆచార్యని అడుగుతుంది. ఆ ఫ్లూటు సిద్ధదని చెప్తాడు ఆచార్య. సిద్ధ మీకు తెలుసాంటే తెలుసంటాడు.

        సిద్ధ వెళ్ళిపోయినప్పట్నుంచీ బసవ ఆగడాలు పెచ్చుమీరిపోయాయనీ, రేపు అమ్మవారి రథోత్సవం వుందనీ, ఈ రథోత్సవాన్ని ప్రారంభించడానికి ఎప్పటిలాగే బసవ వస్తాడనీ, ఇది భరించలేకపోతున్నాననీ ఆచార్యకి చెప్పుకుంటాడు పూజారి.

       ఆచార్య రథోత్సవ ప్రారంభోత్సవంలో చాటుగా బసవ చేతుల్ని గాయపర్చి అడ్డుకుంటాడు. తన చేతుల్ని గాయపర్చిందెవరో అర్ధంగాక వాణ్ని పట్టుకోమని ఆదేశిస్తాడు బసవ.

        బసవ దగ్గరికి రాథోడ్ వచ్చి ప్లాన్ మాట్లాడతాడు. ఏదో వొక తప్పు చేయించి ఇక్కడి ప్రజల్ని వెళ్ళగొట్ట మంటాడు. బసవ ఆయుర్వేద మందుల్లో విషం కలిపి జనం ప్రాణాల మీదికి తెస్తాడు. దీంతో వేద దోషిగా నిలబడతాడు. బసవ అనుచరుల దాడిలో వేద చనిపోతాడు. దీంతో ధర్మస్థలి ఖాళీచేసి ప్రజలు వెళ్ళి పోతూంటారు. ఆచార్య ఆపి బసవ అనుచరుల మీద దాడి చేస్తాడు. బసవ దగ్గరి కెళ్ళిపోయి తను కామ్రేడ్ ఆచార్యనని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక సిద్ధ ఎంటరవుతున్నట్టు దృశ్యం పడుతుంది. సిద్ధ సిద్ధం అని అక్షరాలు పడి, ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ కథ ముగింపు కొస్తుంది.

నాన్ కమర్షియల్ స్క్రీన్ ప్లే

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ప్రేక్షకులు ఎంతో వూహించుకుంటారు. ఇద్దరూ కమర్షియల్ కథాకథనాలతో వూహించని వీక్షణానుభవాన్నిస్తారని ఆశిస్తారు. కానీ మొదటి పదీ పదిహేను నిమిషాల్లోనే కథ నడక చూసి అట్టర్ ఫ్లాపని చెప్పేసే స్థితిలో దీని స్క్రీన్ ప్లే వుంది. సినిమా విడుదలైన మొదటి పదిహేను నిమిషాల్లోనే అట్టర్ ఫ్లాపైన పరిస్థితి ఆచార్య ది.

        ఆచార్య బడ్జెట్ 140 కోట్లు అనుకుంటే, స్క్రీన్ ప్లే కోసం రాసిన ప్రతి వొక్క పేజీ సుమారు 9 లక్షల రూపాయల విలువ చేయాలి. పేజీకి 9 లక్షల రూపాయల విలువైన  వ్రాత యేం రాశారబ్బా అన్పించి గుండె ఝల్లుమంటుంది. ఏ పేజీలోనూ రక్తి కట్టించే, ఆసక్తిపర్చే విషయం ఒక్కటీ లేదు- మార్కెట్ యాస్పెక్ట్ పరంగానూ, క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగానూ. 140 కోట్ల బడ్జెట్ కి బాక్సాఫీసు 70 కోట్లే వచ్చింది. అంటే రాసిన పేజీలు బడ్జెట్లో సగమే రాబట్టాయి. రాసిన ఒక్కో పేజీ 9 లక్షల బడ్జెట్ ని డిమాండ్ చేస్తే, రాబట్టింది 4.5 లక్షలే. ఇదీ క్రియేటివిటీ స్థాయికి సూచిక.

        ఫస్టాఫ్ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ అనేది కన్పించదు. ఫస్ట్ యాక్ట్ ఎలా వుండాలి, ఎంత వుండాలి స్పృహ లేదు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుండాలి, అదెలా వుండాలి లేదు. యాక్టివ్ క్యారక్టర్ పాత్రచిత్రణ లేదు. సీన్స్ డైనమిక్స్ తో, కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కదలవు. సీన్స్ కి విజువల్ రైటింగ్ లేదు. స్టోరీ మేకింగ్ లేదు, ప్రింట్ మీడియాకి పనికొచ్చేట్టు స్టోరీ రైటింగే వుంది. అదీ పాసివ్ గా వుంది. డైలాగులూ పాసివ్ గా వున్నాయి (పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఆచార్య అంటూంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో), సన్నివేశాల్లో, ఫైట్స్ లో ఎమోషనల్ అప్పీల్ ఎక్కడా కన్పించదు. నవరసాలు మొత్తం కాకపోయినా కొన్నైనా లేవు. ప్రణయ, హాస్య రసాల్లేక యూత్ అప్పీల్ లేదు, అసలేమీ లేదు. కథనంలో ఇంకో తేడా ఏమిటంటే కథకుడు ప్రేక్షకులకి కథ చెప్తున్నట్టు వుండదు, తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు, గొణుక్కుంటున్నట్టు వుంటుంది! పరికించి ఏ దృశ్యమైనా చూడండి, ఇదే అనుభవమవుతుంది. ఆత్మాశ్రయ ధోరణీయే ఈ కథా ధార, జీవధార నదీ వార.

ఫస్ట్ యాక్ట్ పరిస్థితి
        ఫస్ట్ యాక్ట్ కథనంలో ధర్మస్థలి మునిసిపాలిటీ అన్నారు గానీ అది పంచాయితీ స్థాయిలో కూడా లేదు.  సిద్ధ గురుకుల మహా విద్యాలయం వుంటుంది గానీ విద్యార్థులుండరు. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది గానీ నేర్పేది కర్ణాటక సంగీతమే, గిరిజన పాటలు, నాట్యాలూ కాదు.

        1976 లో కృష్ణంరాజు, బాపు దర్శకత్వంలో  నటించి నిర్మించిన సూపర్ హిట్ గిరిజన కథ, భక్తకన్నప్ప లో పాటలన్నీ గిరిజన సాహిత్యమే- ఒకటి తప్ప. అన్నీ ఇప్పటికీ హిట్టే. సాంప్రదాయ కళల బాపుగారు కమ్యూనిస్టు దృక్పథపు గిరిజన సినిమా భక్తకన్నప్ప తీశారు. డైలాగుల్లో కమ్యూనిజమే వుంటుంది. పాత్రల పేర్లు కూడా గిరిజనుల పేర్లే వుంటాయి. కృష్ణం రాజు పాత్ర పేరు తిన్నడు. గిరిజనుడు కాబట్టి హిందూ దేవుళ్ళని నమ్మడు, నాస్తికుడు. కానీ ఆచార్య లో ఆయుర్వేద మందులు తయారు చేసే అజయ్ నటించిన గిరిజన పాత్రకి వేద అని ఆర్యన్ నామం! గిరిజనుల సంస్కృతి అనే జానర్ మర్యాదని హైందవ ఆచారాలతో కప్పిపుచ్చేశారు.

         భక్తకన్నప్ప లో గిరిజనుల మీద కుట్రలు చేసే పాత్రలుగా కైలాస నాథ శాస్త్రి (రావు గోపాలరావు), కాశీనాథ శాస్త్రి (సారధి) అని చూపించడానికి మొహమాటపడలేదు బాపూ రమణలు.

        ఆచార్య ప్రారంభ దృశ్యాల్లో ఆయుర్వేదంలో వేద గడించిన ఖ్యాతి తెలుసుకుని యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలిసే సీను, రాధేశ్యామ్ ప్రారంభ దృశ్యాల్లో రోదసీ శాస్త్రవేత్తలు జ్యోతిష పండితుడు (కృష్ణం రాజు) ని కలిసే సీనూ ఒకటే.  

        ధర్మస్థలి చరిత్ర చెప్పి, కొన్ని పాత్రల్ని పరిచయం చేసి, మునిసిపల్ ఛైర్మన్ గా బసవ అనే విలన్ దురాగతాల్ని ఎస్టాబ్లిష్ చేసి- 15వ నిమిషంలో ఆచార్య పాత్రలో చిరంజీవిని ప్రవేశ పెడితే అది ఫస్ట్ యాక్ట్ అయిపోతుందా?

        ఫస్ట్ యాక్ట్ అవ్వాలంటే 1. కథా నేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు- ఇవీ జరగాలి. వీటిలో మొదటి రెండే జరిగాయి. మూడోదీ నాల్గోదీ  లేకుండా కథానాయక పాత్ర ఎంటరైపోయింది. ఇలా ఫస్ట్ యాక్ట్  అసంపూర్ణంగా వుంది కాబట్టే చిరంజీవి ఎంట్రీ ఇంత పేలవంగా వుంది. ఫస్ట్ యాక్ట్ ముగిసిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీన్లో, అతను మామూలు మనిషిలా నడుచుకుంటూ ధర్మస్థలికి వచ్చి, వడ్రంగిగా నాగులు ఇంట్లో  బస చేస్తాడు...

        ఓ మైగాడ్! అసలేం చేయాలనుకున్నారు మెగా స్టార్ స్క్రీన్ ప్లేతో? స్క్రీన్ ప్లేలో స్టార్ ప్లే లేకుండా? ఎన్ని టెంప్లెట్లు తెచ్చి కలిపి కిచిడీ చేయాలనుకున్నారు? పేజీకి 9 లక్షలు ఖర్చు పెట్టిస్తూ చిరంజీవిని అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ సినిమా టెంప్లెట్ లో చూపాలనుకున్నారా?

        వున్న వూళ్ళో ఏదో జరిగి అజ్ఞాతవాసంలో కెళ్ళిపోయిన హీరో, ఇంకేదో వృత్తి చేసుకుంటూ జీవించే లాంటి అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ టెంప్లెట్? ఇలా వొక గతాన్ని వుంచుకుని, ధర్మ స్థలికొచ్చి వడ్రంగి పనితో ఆచార్య అజ్ఞాత వ్రతం? ఫస్ట్ యాక్ట్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తూ బలవంతంగా, పేలవంగా కథలోకి ఎంట్రీ? ఇందుకే ఇది నాన్ కమర్షియల్ ఎంట్రీగా దెబ్బకొట్టింది. ఇక్కడే సినిమా అట్టర్ ఫ్లాప్ అన్పించుకుంది. ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదు. ఇది అలనాటి విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ హెచ్చరిక! ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే!

        ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటి? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. ఈ కథకి ఏమిటా సమస్య? మైనింగ్ మాఫియా భూములాక్రమించే కుట్ర. ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ లో ఈ ప్లానుతో బసవతో బాటు మాఫియా రాథోడ్ వున్నాడు. గతంలో వేరే అడవుల్లో ఆచార్య కామ్రేడ్ గా ఇలాటిదే రాథోడ్ ప్లానుని విఫలం చేశాడని- రాథోడ్ పార్టనర్స్ మీటింగులో - మున్ముందు కథలో వెల్లడవుతుంది కూడా.      

        ఇలాంటప్పుడు ఫస్ట్ యాక్ట్ లో బసవ పాత్ర ఎలా వుండాలి? ధర్మ స్థలిని ఖాళీ చేయించే బెదిరింపులతో, దౌర్జన్యాలతో ప్రారంభమవాలి. అంతేగానీ పూజారి వాపోతున్నట్టు మద్యం, వ్యభిచారం, హత్యలు వంటి చిల్లరపనులతో ధర్మస్థలిని అధర్మ స్థలిగా మారుస్తూ కాలక్షేపం చేయడం కాదు- వెంటనే థింక్ బిగ్ అన్నట్టు ధర్మస్థలినే కాజేసే ఎజెండానే అమలు చేయడం. అంటే ఫస్ట్ యాక్ట్ ఎత్తుగడే ధర్మ స్థలిని కాజేసే కుట్రతో డైరెక్టుగా పాయింటు కొచ్చేయడం. 

        అప్పుడు ఇది కథ అన్పించుకుంటూ బలంగా వుంటుంది. ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటనుకున్నాం? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేయడం... ఏమిటా సమస్య? మొత్తం సిద్ధవనంలో భూమూలాక్రమించే కుట్రని ధర్మస్థలితో ప్రారంభించడ మనుకుందాం...

        అప్పుడు  బసవ ఒకటొకటే చేసుకొస్తూ ఫస్ట్ యాక్ట్ చివర్లో ధర్మస్థలికి బ్యాంగ్ ఇవ్వబోవచ్చు. ప్రజల హాహాకారాలు చెలరేగుతాయి- ఇంకొన్ని క్షణాల్లో ధర్మ స్థలిని లేప్పారేస్తాడు- సరీగ్గా అప్పుడు ఆచార్య ఎంట్రీ ఇచ్చి బిగ్ యాక్షన్ కి తెర తీయొచ్చు...

కమర్షియల్ ఈవెంట్

        ఇలా ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ఈ ప్లాట్ పాయింట్ వన్ లో - బసవని ఆచార్య ఎదుర్కొనే బిగ్ యాక్షన్ కి తెరతీయడం. ప్రేక్షకులు ఎవరెవరి జేబుల్లో ఎన్నెన్ని డబ్బులున్నాయో, అవన్నీ బుకింగ్స్ లో నిలువు దోపిడీ లిచ్చుకునే  అల్ట్రా బిగ్ యాక్షన్ కమర్షియల్ ఈవెంట్!

        ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో చెప్పుకున్నట్టు, చిరంజీవి పాత్రని లెజెండ్ కి తక్కువ చేసి చూపిస్తే సినిమా క్యాలిబర్ ని తగ్గించడమే. అతను గుట్టు చప్పుడు కాకుండా కూర్చునే ఫ్యాక్షన్ క్యారక్టర్ కాదు- గుండెల్లో గుబులు పుట్టించే లెజెండ్ క్యారక్టర్. ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో, ప్రాంతాన్ని కాజేసే బసవ కుట్ర అమలవడం, దాన్ని మెరుపులా వచ్చేసి లెజెండ్ ఆచార్య ముక్కలు చేయడం జరిగితే - పాయింటు ఎస్టాబ్లిష్ అయిపోయి- కథ కూడా ప్రారంభమైపోతుంది నస పెట్టకుండా!

        ఫస్ట్ యాక్ట్ కి స్ట్రక్చర్ లేకపోవడం వల్లేకదా ఇంటర్వెల్లో కూడా పాయింటు ఎస్టాబ్లిష్ కాక, కథే ప్రారంభం కాలేదు...? ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే...

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరో విలన్లు ముఖా ముఖీ అవకపోతే కథేమిటో ఎలా అర్ధమవుతుంది? విలన్ వల్ల ఏర్పడ్డ సమస్యని జయించే లక్ష్యం (గోల్) హీరో కెలా ఏర్పడుతుంది?

        లెజెండ్ మూవీస్ ఓపెన్ వార్ తో వుంటాయి. ఆచార్యలాగా చాటుగా విలన్ చేతులు గాయపర్చడం లాంటి దాగుడు మూతలతో వుండవు. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ ఒక మాటన్నాడు - నాటో దేశాలు రష్యా గుమ్మంలో కుక్కల్లా మొరగడం వల్లే యుద్ధం వచ్చిందని. ఆచార్య అలా యుద్ధం ప్రారంభించాలి- ఓపెన్ వార్. అంతేగానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రహస్యంగా యుక్రేన్ వెళ్ళి వడ్రంగిలా బసచేసి - చాటుగా వుండి యూక్రేన్ అధ్యక్షుడు జెలెంస్కీ  చేతులు కసిక్కున రక్కి రక్కి పారెయ్యాలని చూళ్ళేదు. యూక్రేన్ ని (ధర్మస్థలిని) నాటో దేశాల్లో (మైనింగ్ మాఫియాలో) కలిపేసి నాకే ఎసరు పెడతావా అని ఓపెన్ గా బాంబులు కురిపించడం మొదలెట్టాడు...

సెకెండ్ యాక్ట్ -1 పరిస్థితి
        ఆచార్య వడ్రంగిగా బస చేశాక సెకెండ్ యాక్ట్ -1 ప్రారంభమై, ఒకదాని వెంటే ఇంకోటి నాల్గు ఎపిసోడ్లతో ఇంటర్వెల్ వరకూ సెకెండ్ యాక్ట్ -1 వుంటుంది. బసవ అనుచరుడు ఓబులు వేదని తన్నాడని ఆచార్య వాడి కాలు విరగ్గొట్టడం. దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద అత్యాచార యత్నాన్ని ఎదుర్కోవడం,  రథోత్సవంలో చాటుగా ఆచార్య బసవ చేతుల మీద కత్తితో గీరడం (ఇది రాస్తున్నప్పుడల్లా నవ్వొస్తోంది), బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం.

        ఈ నాల్గు ఎపిసోడ్లూ పొడిపొడిగా వెళ్ళి పోతాయి. దేనికీ ఎమోషనల్ అప్పీల్ లేకపోవడమే గాక, ఏవీ చిరంజీవి చేయాల్సిన ఎపిసోడ్లుగా వుండవు. విలన్ తో నేరుగా యుద్ధం ప్రారంభించి ఒకదాని తర్వాతొకటి బిగ్ యాక్షన్ బొనంజాలు ప్రేక్షకులకివ్వకుండా, చిన్న చిన్న విషయాలతో సరిపెట్టాడు. వేద ని తన్నినందుకు రియాక్ట్ అవ్వాలంటే, వేదతో ఆచార్యకి బాండింగ్ వుండాలి. అప్పుడు యాక్షన్లోకి దిగితే ఎమోషనల్ అప్పీలుంటుంది. గిరిజనురాలి మీద అత్యాచారాన్ని ఎదుర్కొనేప్పుడు కూడా ఆమె ఎవరో ఆచార్యకి తెలీక పోవడం వల్ల, ప్రేక్షకులు నిర్లిప్తంగా చూడడం. అసలు ఆమె స్థానంలో వుండాల్సింది నీలాంబరి (పూజా హెగ్డే) పాత్ర! అప్పుడే ఎమోషనల్ అప్పీళ్ళూ ఈలలూ చప్పట్లూ.

        దుండగులతో ఫైట్ చేస్తూ, గిరిజనురాలిని అమ్మవారి పాట పాడమంటాడు... గిరిజనురాలి నోటి వెంట సంస్కృత శ్లోకాలు ఫైట్ ని ఎలివేట్ చేయకపోగా ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. గిరిజనుల మీద అడుగడుగునా సాంప్రదాయవాదం సవారీ చేయడం.

        ఇక... ఇక...రథోత్సవంలో ఆచార్య దాక్కుని... బసవ చేతుల్ని...LOL! LOL!! LOL!!!... మెగా స్టార్ తో ఇంత సిల్లీగానా? ఎన్ని పేజీలు రాశారో ఈ సీను, అన్ని 9 లక్షలు అంతేగా?

        ఇక బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం. ఈ ఇంటర్వెల్ సీన్లో మొదటిసారి ఇప్పటికీ ముఖాముఖీ అవడం! ఇలా ఎందుకు చేస్తున్నావని బసవ అంటే-

దివ్య వనమొక వైపు
తీర్ధ జల మొక వైపు
నడుమ పాద ఘట్టం

-అని ఆచార్య సమాధానం. బసవకి ఏదో అర్ధమవుతుంది. ఏమిటది? ఏమో! దాంతో- రామ్ చరణ్ విజువల్స్ తో సిద్ధ సిద్ధంఅని చప్పిడి భాషలో ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ కథ ఇంటర్వెల్లో ఏం ఎస్టాబ్లిష్ అయిందో తెలియకుండా పోయింది.

        సెకండ్ యాక్ట్ -1 ధర్మం ప్రకారం ఏర్పాటైన సమస్యతో హీరో విలన్ల మధ్య యాక్షన్ - రియాక్షన్ల సంఘర్షణ జరగాలి. ఇంటర్వెల్లో కూడా సమస్యే ఏర్పాటు కాకపోతే సమస్యతో హీరో విలన్ల పోరాటం ఇంకెక్కడ వుంటుంది. ఇలా ఫస్ట్ యాక్ట్ ధర్మంతో బాటు, సెకండ్ యాక్ట్ -1 ధర్మమూ లేక - ధర్మస్థలి సంగతేమో గానీ - ముందు స్క్రీన్ ప్లే అధర్మ కార్యకలాపాలతో నిండిపోయింది.

పాత్రోచితానుచితాలు

ఆచార్య సిద్ధ గురించి చెప్తున్నప్పుడు సిద్ధ మాంటేజ్ వేయడం, రాథోడ్ ఆచార్యని తల్చుకున్నప్పుడు, ఆచార్య నక్సల్ గెటప్ లో కామ్రేడ్ గా చేసే యాక్షన్ మాంటేజ్ వేయడం ఏమీ వర్కౌట్ కాలేదు.  ఆచార్య క్యారక్టర్ యాక్టివ్ క్యారక్టర్ కాకపోవడం చాలా పెద్ద లోపం. పైన చెప్పుకున్న నాల్గు ఎపిసోడ్లలో ఏం జరుగుతోందో ఇంకొకళ్ళు చెప్తే గానీ తెలీని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ గా వున్నాడు ఆచార్య. కల్తీ ఆయుర్వేదంతో నేరం మీద పడి ప్రజలు వూరు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఎదురు పడేవరకూ, జరిగిన అంత పెద్ద సంఘటన ఆచార్యకి తెలీనే తెలీదు. ఆచార్య ధర్మస్థలిలో కాక ఇంకెక్కడ వుంటున్నట్టు?

        పిల్ల అడిగిందని పిల్లన గ్రోవి ఇచ్చేస్తాడు. అది సిద్ధ జ్ఞాపకంగా తను వుంచుకున్న పిల్లన గ్రోవి. ఎలా ఇచ్చేస్తాడు? కథా సౌలభ్యం కోసం అలా ఇప్పించేశాడు కథకుడు. అప్పుడా పిల్ల దగ్గర పిల్లన గ్రోవిని నీలాంబరి చూడాలి, ఆమె వచ్చి సిద్ధ మీకు తెలుసాని ఆచార్యని అడగాలి. అప్పుడు సిద్ధ- నీలాంబరిలు ప్రేమికులని మనకి తెలియాలి - ఇందుకోసం ఈ రాంగ్ సీను. నీలాంబరి కూడా ఆ పిల్లన గ్రోవిని పిల్లకిచ్చేస్తే ఏమీ ఫీల్ కాదు. పట్టనట్టే వుంటుంది. అలావుంది సిద్ధ మీద ఆమె ప్రేమ.  

        సిద్ధ ఆచార్యకి అంత కావాల్సిన వాడైతే, ఏ రాత్రైనా కనీసం ఒక్కసారి ఆచార్య పిల్లనగ్రోవి వూదాలి. అది విని నీలాంబరి రావాలి- ఇక్కడ మనస్సుని హత్తుకునే సీను పడాలి. ఆ పిల్లన గ్రోవి ఆమె సొంతమవాలి. హత్తుకునే సీన్లు, కదిలించే సీన్లు ఈ సినిమాలో ఆశించకూడదు.

        ఇక విలన్ల వ్యవహారం. మెగాస్టార్ కి ప్రత్యర్ధిగా ఆఫ్టరాల్ ఓ మునిసిపల్ ఛైర్మన్ ఏమిటి? ఏనాటి సినిమా ఇది. వెనుక పెద్ద మాఫియా వున్నాడు కదా అనొచ్చు. ఆపరేటివ్ విలన్ మునిసిపల్ ఛైర్మన్ బసవేగా? ఇక ఆచార్య నక్సల్ పాత్ర నక్సల్ భావజాలంతో వుండదు. సీక్రెట్ గా వుంటున్న ఫ్యాక్షన్ హీరోలాగా ఫీలవుతూంటాడు...

—సికిందర్
   

3, మే 2022, మంగళవారం

1166 : స్క్రీన్ ప్లే సంగతులు

    థ అందామా, స్క్రిప్టు అందామా, స్క్రీన్ ప్లే  అందామా? ఏది అంటే అందులో జోక్యాల శాతం తగ్గొచ్చు? కథ అనగానే దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలాచాలా మంది వచ్చి చేరిపోతారు. అలా కాదు, ఇలా వుంటే బావుంటుంది...ఇలా కాదు వుంటే బలంగా వుంటుందని తోచింది చెప్పేస్తూంటారు. స్క్రిప్టు అనగానే ఓ మోస్తరు స్పెషలిస్టులు వచ్చి చేరతారు. చూసిన సినిమాల ఉదాహరణలు చెప్తూ స్క్రిప్టు ని అటూ ఇటూ లాగుతారు. స్క్రీన్ ప్లే అనగానే ఈ మొదటి రెండు వర్గాలు ఫిల్టరై పోయి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళే వర్కులో మిగులుతారు. కథ అలా కాదు ఇలా వుండాలని అన్నప్పుడు, ఏఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని అంటున్నట్టు? యాక్టివ్ క్యారక్టర్? గాథ కాకుండా కథ? క్యారక్టర్ ఆర్క్? టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్? గోల్ ఎలిమెంట్స్? సీన్ టూ సీన్ సస్పెన్స్? డైనమిక్స్? మార్కెట్ యాస్పెక్ట్? ఎమోషనల్ అప్పీల్? యూత్ అప్పీల్? ... ఇంకా చాలా టూల్స్ వుంటాయి- వీటిలో ఏది లేదా ఏవేవీ దృష్టిలో పెట్టుకుని అంటారు? ఇవేవీ లేకుండా ఏదో తోచింది అనెయ్యడమే? వంద కోట్ల సినిమాకి కూడా? ఆచార్యకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కేటగిరీ గాకుండా, కథ కేటగిరీ, స్క్రిప్టు కేటగిరీల జోక్యమే అట్టర్ ఫ్లాపు కింద మార్చేసింది. అది ఈ సినిమాలో నటించిన స్టార్లు కావచ్చు- ఇంకెవరైనా కావొచ్చు... 

(ఇంకా వుంది) 

ముందుగా కొంత ఉపోద్ఘాతం
         ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు రాసే ఆలోచన లేదు. రాయడం అవసరమని విజ్ఞప్తు లొచ్చాయి. ఆచార్య లాంటి మేజర్ మూవీ స్క్రీన్ ప్లే మంచి చెడ్డలు తెలుసుకుంటామని. ఈ మధ్య తెలుగు సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు. అదే మూసలో సినిమాలకి, అదే మూసలో స్క్రీన్ ప్లే సంగతులు రాయడం, అదే మూసని రీడర్స్ చదువుకోవడం... ఇలా రాసిందే రాయరా/చదివిందే చదవరా దారిలేని దాసరీ అన్నట్టు తయారయ్యింది. అసలు ఒక సినిమాకి రాసిన స్క్రీన్ ప్లే సంగతులు తర్వాత పది సినిమాలకి అదే పోస్టు చేస్తూ పోయినా తేడా ఏమీ రాదు.

        అసలు ఓ పది సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు చదువుకుంటే, ఆ పరిజ్ఞానంతో ఇతర సినిమాల్ని విశ్లేషించుకోవడం వచ్చేయాలి. ఇలా జరగడం లేదు. ఎన్ని స్క్రీన్ ప్లే సంగతులు చదివినా మళ్ళీ కొత్త సినిమా వస్తే దాని స్క్రీన్ ప్లే సంగతులు చదివితే గానీ దాని లోటు పాట్లు తెలుసుకోలేని పరిస్థితి ఎక్కువుంది. కాబోయే మేకర్లే కాదు, రంగంలో వున్న వాళ్ళు కూడా చాలా మందికి కొత్తగా విడుదలైన / చూసిన సినిమాల్లో  కనీసం సెకండ్ యాక్ట్ ఎక్కడ మొదలైందంటే చెప్పలేని పరిస్థితి. మళ్ళీ దాని  స్క్రీన్ ప్లే సంగతులు చదివితే గానీ తెలుసుకోలేని పరిస్థితి. ఇలావుంది నాలెడ్జి పరిస్థితి. ఓ పదేళ్ళ క్రితం బ్రిటన్ నుంచి ఒక తెలుగావిడ ఈ మెయిల్ చేసింది- మీ రివ్యూలు చదివిన పరిజ్ఞానంతో సినిమాలు చూస్తూంటే యాక్ట్స్ ని గుర్తు పట్టడం, లోపాలు తెలిసిపోవడం సులభమైపోయిందని. అప్పటికి ఈ బ్లాగు లేదు, స్క్రీన్ ప్లే సంగతులు కూడా లేవు. పత్రికల్లో రాసే రివ్యూలే!

        రివ్యూలైనా, స్క్రీన్ ప్లే సంగతులైనా ప్రేక్షకులకి / ఆసక్తిగల మేకర్స్ కి సినిమాల పట్ల అవగాహన కల్పించడానికే వున్నాయి. మన డ్యూటీ యేదో మనకి చాతనైంది చేస్తున్నాం- దీన్ని చదువరులు ఉపయోగించుకోక పోతే  ఆచార్య లాంటి మేజర్ సినిమాలు ఇంకా తీస్తూనే వుంటారు- తీస్తున్నది బ్రహ్మాండమనే భ్రమల్లో పడిపోయి. లేకి సినిమా ఎప్పుడూ లేకికి ముద్దే.

        ఒకప్పుడు వివిధ శాఖల సాంకేతిక నిపుణులు 45 మందిని ఇంటర్వ్యూలు చేసి ఆయా శాఖల పనితీరులు ఆంధ్రజ్యోతి ద్వారా మొట్టమొదటిసారిగా వెల్లడించాం. అలాగే మేకర్స్ ని కూడా ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళ కొత్త సినిమా తెరవెనుక జరిగిన స్క్రీన్ ప్లే కసరత్తులు లోకానికి తెలియజేద్దామంటే ముందుకు రాని పరిస్థితి. నల్గురైదుగుర్ని అడిగి చూసి ఆ ప్రయత్నం మానుకున్నాం. హాలీవుడ్ లో, బాలీవుడ్ లో మేకర్లు, రైటర్లు వాళ్ళ సినిమాల స్క్రీన్ రైటింగ్ గురించి ఇంటర్వ్యూ లిస్తూంటారు. తెలుగులో లోపాలు బయటపడతాయని ముందుకు రాకపోతే లోపాలతోనే ఫ్లాప్ సినిమాలు తీయడం ఖాయం.

విషయానికొద్దాం
         ఆచార్య తెరవెనుక కథా కసరత్తుల గురించి ఇక్కడ అవసరం లేదు. తెర వెనుక ఎవరెవరున్నా జయాపజయాల్ని మేకరే మోయాలి. ఎంతో శ్రమచేసి తీసిన సినిమా మార్నింగ్ షో కే కుప్పకూలడమంత వెంటాడే విషాదం మరొకటుండదు. అయిందేదో ఐంది. ఇక విశ్లేషణతో కొత్త విజన్ ని చూస్తూ ముందుకు పోవడమే దారి. తెర వెనుక ఏం జరిగినా, ఫైనల్ గా తెర మీద ప్రేక్షకులకి ఏం మిగిలిందో దాని సంగతులే చూద్దాం. ఫైనల్ గా తేలిందేమిటంటే, ఓ హై కాన్సెప్ట్ కథని  రెగ్యులర్ లో- కాన్సెప్ట్ సినిమాలాగా అతి సాధారణంగా తీసేయడం. నక్సలిజానికి దైవ భక్తిని కలిపి ఎలా తీయాలన్నది సమస్యగా మారడం దర్శకుడి మాటల్లో. బేసిగ్గా చిరంజీవి పాత్రని లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసే క్యారక్టరైజేషన్ని కథ డిమాండ్ చేస్తున్న ధోరణిని గమనించకపోవడం.

సేమ్ సైరా
‘లయన్ ఆఫ్ డెసర్ట్’
    చిరంజీవి సైరా లో కూడా పాత్ర ప్రాబ్లమే. చారిత్రికంగా ఒక అస్పష్ట ఇమేజి వున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కాని కథని తెరకెక్కించేప్పుడు, అతన్నొక స్మృతి పథంలో నిల్చి పోయే సుస్పష్ట లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం. లారెన్స్ ఆఫ్ అరేబియా’ లో పీటర్ ఓ టూల్ నటించిన లారెన్స్ చారిత్రక పాత్రనీ, ‘లయన్ ఆఫ్ డెసర్ట్’ లో ఆంథోనీ క్విన్ నటించిన ఒమర్ ముఖ్తార్ ఇంకో పాత్రనీ, కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు’ మరొక చారిత్రక పాత్రనీ స్మృతిపథంలో నిలచిపోయే లెజెండ్స్ గా సుస్పష్టంగా మనముందుంచారు వాటి దర్శకులు. అవి ఎక్కుపెట్టిన బాణాలయ్యాయి ప్రేక్షక హృదయాలకి. సైరా’ లో లాగా, ఆచార్య లో ఈ  ప్రధాన సృష్టే  జరగలేదు బాక్సాఫీసు అప్పీల్ కి.  ఇంత మల్టీ మిలియన్ బడ్జెట్ సినిమాలైన ఈ రెండిట్లో చిరంజీవి నటించిన పాత్రలతో వెండి తెరకి ఓ ఆత్మనీ, గుండె కాయనీ ఇవ్వాలని ఆలోచించలేదు.  

        ఉయ్యాలవాడని మరపురాని లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు గానీ, మధ్యలో నరసింహావతారమని మిథికల్ టచ్ ఇచ్చే విఫలయత్నం చేశారు. ఇదైనా మనస్ఫూర్తిగా చేసివుంటే  మిథికల్ క్యారక్టర్ గా దైవత్వ  ఛాయాలతో మన్ననలందుకునేది. 1974 నాటి  విప్లవకారుడి కథ  ‘అల్లూరి సీతారామ రాజు’ లో దీన్నే విజయవంతగా నిర్వహించారు పాత్రకి దైవత్వాన్ని ఆపాదించి - ‘స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా’ అంటూ కీర్తి గానాలతో. విప్లవాన్నీ, ఆధ్యాత్మికతనీ  విజయవంతంగా మిళితం చేసి అల్లూరి పాత్రని అజరామరం చేశారు. కానీ ఆచార్య లో నక్సలిజాన్ని దైవభక్తితో ఎలా కలపాలో తెలియలేదు దర్శకుడి మాటల్లో. తెలియకపోతే గూగుల్లో ఓ క్లిక్ చేసేంత దూరంలోనే వుంది సమస్త సమాచారం.

అల్లూరిలో లెజెండ్ సృష్టి

లారెన్స్ ఆఫ్ అరేబియా’
    అల్లూరి సీతారామరాజు చరిత్రని సినిమా తీస్తే ఫక్తు డ్రై సబ్జెక్టు అవుతుందని అనుకుంటూ, సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి కేవలం 34 ఏళ్ళున్న హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా ధైర్యంగా భక్తిరస పారవశ్యాలతో కల్పన చేసి సస్యశ్యామలం చేసేశారు!

        అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి సినిమా కోసం దైవత్వాన్ని కూడా కల్పించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి. విప్లవకారుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, అది కలుపుకుని పోతుంది. విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో ప్రజల్ని సంఘటితం చేసే మత దృష్టి లోపిస్తే, విఫలురవుతారేమోననే అభిప్రాయం కూడా కల్గిస్తుంది ఈ సినిమా.

        విప్లవ కవిత్వంలో భావ కవిత్వానికి చోటుండదు. అయినా  ఈ సినిమాలో  ఈ రూలునే బ్రేక్ చేశారు. ఇది రచయిత త్రిపురనేని మహారథి నైపుణ్యం అనొచ్చు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ మర్యాద దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించారు. విప్లవ పాత్రకి పౌరాణిక సుగంధాల న్నమాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకోవడమనే మార్కెట్ యాస్పెక్ట్ ఏదైతే వుందో, దాంతో చేసిన ప్రయోగమే ఆచార్య లో లోపించింది.

లెజెండ్ లెక్కలు
        హైకాన్సెప్ట్ తరగతికి చెందిన మూవీని డిమాండ్ చేసే ఆచార్య లాంటి కథ చిరంజీవిని ఆ స్కేల్ లో లెజెండరీ క్యారక్టర్ ని కోరుతుంది. అలా వూహించే కథ చేసి వుంటారు. అది కుదర్లేదు. లెజెండ్ టైపు కథా కథనాలు బోలెడు యాక్షన్ తో, సస్పెన్స్ తో, హై కాన్ఫ్లిక్ట్ పాయింట్ తో వుంటాయి. పాత్రకి ఎన్నో కష్టాలు ఆటంకాలూ ఎదురవుతాయి. ప్రకృతి, దేవుడు, మానవ ప్రవృత్తిలకి సంబంధించి తనదైన భావజాలాన్ని ప్రకటిస్తుంది పాత్ర. ముక్కుసూటిగా నైతిక విలువల్ని, లేదా జీవిత పాఠాల్ని వెల్లడిస్తుంది. ప్రజలకి దైవంలా, అవతార పురుషుడులా ఉదాత్తంగా వుంటుంది. ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా వుంటుంది. లెజెండ్ క్యారక్టర్ యూనివర్సల్ అప్పీల్ తో వుంటుంది.

       
పక్క పటం చూస్తే, జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ లో, ఆరోహణ - అవరోహణా క్రమపు రంగుల రాట్నంలో, పాత్రల వివిధ ఉత్థాన పతన స్థాయుల్ని గమనించ వచ్చు. కుడి వైపు కింది నుంచి పైకి వెళితే మొదటిది - తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పాటుపడే ఫెయిరీ టేల్ పాత్ర, రెండవది - దీని పై స్థాయిలో పరిధి పెరిగి సమాజం కోసం పాటుపడే క్లాసిక్ పాత్ర, మూడవది - ఈ రెండిటి పై స్థాయిలో విస్తృత పరిధిలో ప్రపంచం కోసం పాటు పడే లెజెండ్ పాత్ర. ఇక నాల్గవది -  ఈ మూడిటికీ పై స్థాయిలో దేవుడికీ భక్తుడికీ అనుసంధానంగా వుండే సమున్నత మిథికల్ పాత్ర.

        చట్రం ఆరోహణా క్రమంలో ఈ నాల్గూ పాజిటివ్ పాత్రలే.  ఇక చట్రం ఎడం వైపు పై నుంచి కిందికీ దిగుతూ పోతే,  ఒక్కో మెట్టూ దిగజారుతూ నెగెటివ్ - యాంటీ హీరో పాత్రలుంటాయి. సినిమాలకి మొత్తం ఈ ఎనిమిది రకాల పాత్రలు. హాలీవుడ్ కైనా, టాలీవుడ్ కైనా, ఉండ్రాజ పల్లిలో కథలు చెప్పుకోవడానికైనా ఇంతే. సాహిత్యంలో కూడా ఇంతే.

        ఈ పాత్రల రంగుల రాట్నంలో ఆచార్య లెజెండ్ కథ మూడో మెట్టుని అధిష్టించి వుండాలి. మొదటి మెట్టులో ఫెయిరీ టెయిల్ చిత్రణ, రెండో మెట్టులో క్లాసిక్ చిత్రణా పనికి రావు. ఆచార్య కథ మతానికీ రాజ్యానికీ మధ్య సంఘర్షణతో కూడిన కథ. దేర్ విల్ బి బ్లడ్ మతానికీ పెట్టుబడికీ సంఘర్షణ. ఇందులో కథానాయకుడు డేనియల్ డే లెవీస్ పాత్ర పై స్టోరీవీల్ లో అవరోహణా క్రమంలో అట్టడుగు యాంటీ హీరో స్ఠాయికి పతనమై వుంటుంది. పెట్టుబడి దారుగా మతాన్ని మంటగలపాలని చూసి వినాశం తెచ్చుకునే పాత్ర. అటు మతాధిపతి కూడా ధనాశతో సైతానుగా మారి పతనమయ్యే పాత్ర. ఈ హై కాన్సెప్ట్ కథలో హీరో విలన్ ఇద్దరూ నాశనమవుతారు. ఇందులోంచి పాఠాలు ప్రపంచ పెట్టుబడిదారులు, మతాధిపతులు నేర్చుకోవాలి.

దేర్ విల్ బి బ్లడ్
    ఇందులో హీరోది ఆయిల్ ని కనిపెట్టి లెజెండ్ గా ఎదిగే పాత్రే. తర్వాత దురాశతో యాంటీ లెజెండ్ గా మారిపోయే పాత్ర. పాత్ర నటించిన డానియెల్ డే లెవీస్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డు పొందాడు. దీని స్క్రీన్ ప్లే సంగతులు బ్లాగులో పోస్టయి భద్రంగా వున్నాయి.

        ఆచార్య లో గిరిజనుల పుణ్య క్షేత్రాన్ని కబళించాలని చూసే రాజ్యపు దుర్మార్గం, దీన్నెదుర్కొనే నక్సల్ హీరో పాత్ర. ఈ స్టోరీలైన్ లోనే తేడా వుంది. దీంతో హై కాన్సెప్ట్ లెజెండ్ కి కాకుండా, లో కాన్సెప్ట్ లోకల్ హీరోకి తగ్గ కథగా తెరకెక్కింది. దీన్ని స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం....

—సికిందర్ 

 

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

1165 : రివ్యూ!


రచన - దర్శకత్వం : విఘ్నేష్ శివన్
తారాగణం : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, రెడిన్ కింగ్స్ లే, కాలా మాస్టర్ తదితరులు.
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్, విజయ్ కార్తీక్ కణ్ణన్
బ్యానర్ : రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
నిర్మాతలు : విఘ్నేష్ శివన్, ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల : ఏప్రెల్ 28, 2022
***
        మిళంలో కాతువాకుల రెండు కాదల్ (పిల్ల గాలిలో రెండు ప్రేమలు) తెలుగులో కె ఆర్ కె (కన్మణి, రాంబో, ఖతీజా) గా విడుదలైంది. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఆకర్షించే తారాగణం. సమంత పుట్టిన రోజు ఏప్రెల్ 28 న విడుదల. ఈ శుభ సందర్భంగా ఈ ముగ్గురితో ముక్కోణపు ప్రేమ కథ ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్నాక పోషించే బాధ్యత 4 సినిమాల దర్శకుడు విఘ్నేష్ శివన్ తీసుకున్నాడు.

        పాపులర్ తారాగణానికి విఘ్నేష్ పేరు తోడై మూవీకి ఓ క్రేజ్ ఏర్పడింది. కారణం అజిత్ తో ఏకే 62 యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ తో తానే నిర్మాతగా ఇంకో నిర్మాతతో భాగస్వామ్యంలో ఈ ముక్కోణ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మించాడు. అయితే నిర్మించడానికి ఏమైనా విషయముందా, లేక ముగ్గురు పాపులర్ తారల్ని వెండి తెర మీద అటూ ఇటూ తిప్పి కేవలం గ్లామర్ షోగా మార్చేశాడా? ఇది తెలుసుకుందాం... 

కథ

పుట్టగానే రాంబో (విజయ్ సేతుపతి) తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయింది గాక తను తల్లితో వుంటే ఆమె ఆరోగ్యం చెడుతూ వుంటుంది. దీంతో దురదృష్ట జాతకుడుగా పేరు పడి మళ్ళీ తిరిగి రాకుండా ఎటో వెళ్ళిపోతాడు. పగలు క్యాబ్ నడుపుతాడు, రాత్రిళ్ళు బార్ లో బౌన్సర్ గా పని చేస్తాడు. పబ్ లో కన్మణి (నయనతార) పరిచయమై రాత్రి ప్రేమాయణం  ప్రారంభిస్తుంది. ఈ ప్రేమాయణాన్ని ఎంజాయ్ చేస్తూ వుండగా ఖతీజా (సమంత) పరిచయమై పగటి  ప్రేమాయణాన్ని ప్రారంభిస్తుంది.

        ఈ ప్రేమాయణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వుండగా పెళ్ళి మాట వస్తుంది. పెళ్ళి మాట రాగానే డిస్ససోటివ్ డిజార్డర్ అనే మానసిక రోగాన్ని నటించడం మొదలెడతాడు. ఎవర్ని పెళ్ళి చేసుకోవాలో తేల్చుకోలేక మానసిక రోగాన్ని నటిస్తున్న రాంబోతో పెళ్ళి కథ ఏమయిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

రెండు గంటల 40 నిమిషాల ఎడ తెరిపిలేని టార్చర్ ఈ ట్రాయాంగులర్ లవ్. పిల్లగాలిలో రెండు ప్రేమలు కాదు, వడగాలిలో రెండు వడదెబ్బలు. ముక్కోణ ప్రేమ సినిమాలు ముల్లోకాలు నిండిపోయేంత వచ్చాయి. ఇద్దర్ని ప్రేమించిన, లేదా ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తున్న హీరో ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడన్న సిల్లీ కథల సినిమాలతో తలపండిపోయారు ప్రేక్షకులు. ఇంకా మభ్యపెట్టబోతే శృంగభంగం తప్పదు.

        ఈ ట్రాయాంగులర్ రోమాంటిక్ కామెడీ పేరుకే. ప్రేమించడం రాకపోయినా, నవ్వించడమూ చేతగాలేదు. అసలు విజయ్ సేతుపతిలో ఏం చూసి నయనతార, సమంతలు ప్రేమిస్తారో అర్ధం గాదు. అతను మానసిక రోగాన్ని నటిస్తున్నాడని తెలుసుకోక అతడికోసం సిగపట్లకి దిగే చిల్లర వ్యవహారం కూడా అర్ధం గాదు. కేవలం ఈ ముగ్గురు స్టార్ల ని గ్లామర్ షోకి వాడుకోవడం తప్పితే మరేమీ లేదు. ఏ గ్రేడ్ స్టార్స్ కి సి గ్రేడ్ కథ అంటగట్టి సినిమా అయిందన్పించాడు దర్శకుడు. ఈ సినిమాని ఈ ముగ్గురు స్టార్లు ఎలా ఒప్పుకున్నారో ఇంకో అర్ధంగాని విషయం.

నటనలు- సాంకేతికాలు

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే. ట్రయాంగులర్ రోమాంటిక్ కామెడీ అంటేనే బోలెడు ఫన్. ఈ ఫన్ లేని లోటు అతనెందుకు తెలుసుకో లేదో తెలీదు. కామెడీ పేరుతో సిల్లీ డైలాగులతో  మనం తెల్లబోయేట్టు చేశాడు. మానసిక వ్యాధి నటించే ఎపిసోడ్స్ తో నవ్వించక పోగా నిద్ర పుచ్చాడు. సమంతని వేధిస్తున్న వాణ్ణి కొట్టే సీనులో బీస్ట్ గా మారి పోయి ఓవరాక్షన్ చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, విషయం లేక ఆచార్య ఎంత డొల్లగా వుందో, విజయ్ సేతుపతితో కె ఆర్ కె అంత బోలుగా వుంది.

        హీరోయిన్లు నయనతార, సమంతలు గ్లామర్ షో కోసమే నిండు అందచందాలతో వున్నారు. పాత్రలేమిటో చూసుకోలేదు, నటనలు పట్టించుకోలేదు. నాయన తార  ఓ చిన్న సేల్స్ గర్ల్, సమంత నిరుద్యోగి. అయినా అంత ఖరీదైన కాస్ట్యూమ్స్ తో -  ప్రేక్షకులు నవ్విపోతే మాకేటి సిగ్గనట్టు ప్రవర్తించారు. అసలు విజయ్ సేతుపతి కోసం జుట్లు పట్టుకుని కొట్టుకునే పాత్రలకి మాన మర్యాదలేమిటన్నట్టు కూడా దర్శకుడి కంటే రెండాకులు ఎక్కువే చదివి తలంటు పోశారు ప్రేక్షకులకి.

       అనిరుధ్ రవిచందర్ ఏం పాటలిచ్చాడో అలా ఇవ్వడానికి కారణముంది. రొడ్డ కొట్టుడు సినిమాకి ఇంతకంటే తగ్గట్టు పాటలెలా ఇవ్వగలడు. పాటలిలా వున్నాయేమిటని సదరు ముగ్గురు స్టార్ల మనోభావాలు కూడా దెబ్బతిననట్టున్నాయి. కెమెరా మాన్ బాగా చూపించినందుకు మాత్రం సంతోషించి వుంటారు.

        దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా పాత మోడల్ సినిమా తీస్తూ తెలుగు తమిళ భాషల్లో నవ్వుల పాలయ్యాడు ఈ నవ్వించని సినిమాతో. వరుసగా తమిళ దర్శకులిస్తున్న అట్టర్ ఫ్లాపు సినిమాలు చూస్తూంటే ఇక తమిళ టాలెంట్ ఒకప్పటి మాటే అనుకుని సరిపెట్టుకోవాలి.

సికిందర్

1164 : రివ్యూ!



రచన – దర్శకత్వం : కొరటాల శివ
తారాగణం : చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్, జిశ్శూ సేన్ గుప్తా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ
, ఛాయాగ్రహణం :
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
విడుదల : ఏప్రెల్ 29
, 2022

***

        దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ వల్ల ఆచార్య నిర్మాణం, విడుదల ఆలస్యమై అభిమానులు అల్లాడిపోయారు. అభిమానుల్ని ఊరడించడానికి పాటలు, ట్రైలర్స్ విడుదల చేస్తూ అభయమిచ్చారు. పాటలు ఊరడించినా, చివరి ట్రైలర్ ఉస్సూరనిపించింది. ట్రైలర్ కమర్షియల్ గా లేకపోవడం అలా వుంచితే, విషయం కూడా లేక చప్పగా వుంది. అయితే ట్రైలర్ లో విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ దర్శకుడు కొరటాల శివ విచిత్ర వివరణ. ట్రైలర్ లో విషయం లేకపోతే బుకింగ్స్ సవ్యంగా వుంటాయా అన్నది ప్రశ్న.

        నిస్సందేహంగా బుకింగ్స్ డల్ గా వున్నాయి. ట్రైలర్ చూసి విషయం లేదని పసిగట్టేశారా ప్రేక్షకులు? మెగా స్టార్ చిరంజీవి, మెగా రాక్ స్టార్ రామ్ చరణ్ తండ్రీ కొడుకులు కలిసి తొలిసారిగా వెండితెరని పావనం చేస్తూంటే ఎందుకీ పరిస్థితి? దారుణంగా 1.5, అంటూ 2 అంటూ రేటింగ్స్ ఎందుకు పడుతున్నాయి? ఇంత మెగా దురదృష్టం ఎందుకు ప్రాప్తించింది? తెలుసుకుందాం...

కథ

    మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూసూద్) ప్రసిద్ధ ఆలయమున్న ధర్మస్థలి అనే గ్రామాన్ని రాథోడ్ (జిశ్శూ సేన్ గుప్తా) కి ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ గ్రామాన్ని పాదఘట్టం అనే ఇంకో గ్రామపు గిరిజనులు కాపాడుతూంటారు. ధర్మస్థలిని ఆక్రమించేందుకు బసవ దుర్మార్గాలు  పెరిగిపోవడంతో నక్సల్ ఆచార్య (చిరంజీవి) రంగప్రవేశం చేస్తాడు. ఆచార్యతో సిద్ధ (రామ్ చరణ్) కలుస్తాడు. ఎవరీ సిద్ధ?  ఆచార్యతో అతడికున్న సంబంధమేమిటి? వీళ్ళిద్దరూ కలిసి ధర్మస్థలిని  ఎలా కాపాడారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పూర్వం రావు గోపాలరావు విలన్ గా గ్రామ కక్షల సినిమాలు ఆనాటి అందరు హీరోలతో వచ్చాయి. వాటినే రీసైక్లింగ్ చేసి ఒక సమకాలీన మార్కెట్ యాస్పెక్ట్ లేని, వర్తమాన బాక్సాఫీసు ఫ్రెండ్లీ కాని, యూత్ అప్పీల్ కూడా లేని, అరిగిపోయిన పాత మూస ఫార్ములా ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇది తక్షణం బెడిసికొట్టింది.

        దేవాలయాలకి సంబంధించిన కథ మెగాస్టార్ తో వూహిస్తే హైకాన్సెప్ట్ మహోజ్వల గాథవ్వాలి నిజానికి. అంతకి తగ్గించి ఓ గ్రామం, అక్కడో గుడి, దాంతో ఓ మునిసిపల్ ఛైర్మన్ అక్రమాలనే చిన్న హీరోల స్థాయికి కథని కుదిస్తే, మెగా స్టార్ కి అన్యాయమే అవుతుంది.

        కేవలం వ్యక్తి అక్రమాలు మెగాస్టార్ కి చాలవు, పై స్థాయిలో ప్రభుత్వ/వ్యవస్థ  అక్రమాలై వుంటే సమవుజ్జీగా, లెవెల్ గేమ్ ప్లేయింగ్ గా వుంటాయి. దీనికి బదులు కథ చిన్నది కావడంతో, అదీ బలహీనంగా చెప్పడంతో,  మెగా స్టార్ కి నిజమైన బాక్సాఫీసు పని లేకుండా పోయింది...

నటనలు - సాంకేతికాలు

    ముందుగా, చిరంజీవి ఆచార్య నక్సల్ పాత్ర చాలా పేలవంగా వుందని చెప్పక తప్పదు. ఎమోషనల్ అప్పీల్ అనేదే  లేదు. పాత్ర తీరు యాంత్రికంగా, కృత్రిమంగా వుంది. కథలో విషయం లేనప్పుడు పాత్రకి బలం ఎలా వస్తుంది. పోనీ విషయం లేనప్పుడు కామెడీ, రోమాన్సులతో ఎంటర్టయిన్ చేయొచ్చు. ఇది కూడా లేదు. చిరంజీవికి హీరోయిన్ లేదు. ఒక గ్రూప్ సాంగ్, రామ్ చరణ్ తో ఇంకో సాంగ్ తప్ప ఫ్యాన్స్ కి హుషారు తెప్పించే సందర్భాలు లేవు. పేలవమైన కథా కథనాల వల్ల ఫైట్స్ కి సందర్భ బలం కూడా లేదు. రామ్ చరణ్ తో కలిసి క్లయిమాక్స్ ఫైట్ అయితే, సాగదీసి సాగదీసి సాగుతూనే వుంటుంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయేలా.

        చిరంజీవి ఫిజిక్, లుక్ ఇవి బావున్నాయి. తను ఇంత బావున్నప్పుడు తానేం డిమాండ్ చేసి తీసుకున్నాడు దర్శకుడి నుంచి? ఏమీ లేదు. కథే చిరంజీవిని డిమాండ్ చేయడం లేదు. ఎంతంటే, రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ సహన పరీక్ష పెట్టేంతగా. ఫస్టాఫ్ చిరంజీవితో ఇంత బోరు కొడుతుందని వూహించం. తను నటించిన ఏ సినిమాలోనూ ఇలా జరగలేదు. కాకపోతే బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి థియేటర్లో ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ కూర్చోగలం. మంచి డైలాగులు, ఫన్నీ డైలాగులు, బలమైన డైలాగులు, మాస్ పంచ్ డైలాగులు  కూడా లేవు. ఇది ట్రైలర్స్ లోనే బయటపడింది.

        ఇక రామ్ చరణ్ ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ నైనా కాపాడతాడనుకుంటే అదీ లేదు. పూజా హెగ్డే తో రోమాన్స్ కూడా పాతబడిన వ్యవహారమే. పూజా హెగ్డే కి ప్రాధాన్యమేమీ లేదు, పాటలు, రోమాన్స్ తప్పితే. వరసగా తనకి రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఫ్లాప్సే.

        సోనూ సూద్, జిశ్శూ సేన్ గుప్తాల విలనీ, నటనలు అవే మూస టెంప్లెట్లు. ఇతర సహాయ నటుల గురించి చెప్పుకోవడాన్నికేమీ లేదు.

        భారీగా ఖర్చు పెట్టిన ప్రొడక్షన్ విలువలు తప్పితే, మణిశర్మ సంగీతంలో పాటలు (ఓ రెండు తప్ప) కూడా వూపు తీసుకురాలేదు. రామ్ లక్ష్మణ్ ల పోరాటాలైతే సందర్భం తక్కువ సందడి ఎక్కువన్నట్టున్నాయి. కొరటాల శివ దర్శకత్వం దారుణం. కోవిడ్ కాలంలో తీశారు కాబట్టి మేకింగ్ డిస్టర్బ్ అయిందా అనుకోవడానికి లేదు. కోవిడ్ విరామాల్లో స్క్రిప్టు లోపాల మీద దృష్టి పెట్టినట్టు లేదు- రామ్ చరణ్ కొరటాల శివ సహ రచయిత!

చివరికేమిటి

    ట్రైలర్ లో విషయం లేకపోవడానికి సంబంధించి కొరటాల ఇచ్చిన వివరణ - ఉద్దేశపూర్వకంగా ట్రైలర్ లో విషయం దాచామనీ, అది సినిమాలో రివీల్ అవుతుందనీ చెప్పడం సరైంది కాదు. సినిమాలో విషయమనేదే  లేదు. ఫస్టాఫ్ కబ్జాదార్లు, సెకండాఫ్ నక్సల్ ఫ్లాష్ బ్యాకు - అని  పెట్టుకున్న స్కీములో విషయమే లేదు.

        వీటికి చూపించిన దృశ్యాలన్నీ  ఒరిజినాలిటీ లేని ఇదివరకు ఎన్నో సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే. ఓ పది పాత సినిమాలు ఒకే చోట చూస్తున్నట్టు వుంటుంది. ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్, ఫీల్ తో కూడిన సీన్లే లేవంటే - ఈ  బిగ్ బడ్జెట్ మూవీని ఏ ధైర్యంతో తీసి వుంటారో.

        చిరంజీవి- రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నప్పుడు ఇద్దర్నీ కలిపి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోరిక కూడా తీరే విధంగా లేదు. ఇద్దరూ కలిసి వున్న సీన్లు కూడా పేలవంగా వున్నాయి- ఇద్దరూ కలిసి స్టెప్పు లేసిన ఓ పాటతప్ప- మినిమమ్ మల్టీ స్టారర్ కమర్షియల్ హంగులూ హంగామా లేని అనవసర హైరానా అయింది ఆచార్య.

—సికిందర్