రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, డిసెంబర్ 2022, బుధవారం

1260 : రివ్యూ!


దర్శకత్వం : అమర్ కౌషిక్
తారాగణం : వరుణ్ ధావన్, కృతీ సానన్, దీపక్ దోబ్రియాల్, పాలిన్ కబాక్, అభిషేక్ బెనర్జీ తదితరులు.
రచన : నీరేన్ భట్, సంగీతం: సచిన్ - జిగర్, ఛాయాగ్రహణం : జిష్ణూ భట్టాచార్య
నిర్మాణం : జియో స్టూడియోస్, దినేష్ విజన్ ,
పంపిణీ : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
విడుదల : నవంబర్ 25, 2022

***
            ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో యువతరంలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో హిట్లున్నాయి, ఎక్కువగా ఫ్లాప్స్ వున్నాయి. ఈ సంవత్సరమే నటించిన జుగ్ జుగ్ జియో కుటుంబ వినోదం హిట్టయ్యింది. దీని తర్వాత ఇప్పుడు రూటు మార్చి ఫాంటసీ థ్రిల్లర్ భేడియా లో నటించాడు. ఇది పానిండియా మార్కెట్ లో విడుదలైంది. తెలుగులో తోడేలు గా డబ్ చేసి విడుదల చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. స్త్రీ’, ‘బాలా అనే రెండు విభిన్న సినిమాలు తీసి హిట్లు సాధించిన అమర్ కౌషిక్ దీని దర్శకుడు. ఇప్పుడు ఈ మూడో సినిమా కూడా విభిన్నమే. ఇందులో వరుణ్ సరసన హీరోయిన్ గా కృతీ సానన్ నటించింది. ఏమిటీ తోడేలు ఫాంటసీ? హార్రర్ కామెడీగా తీసిన ఈ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పిస్తుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో వుండే భాస్కర్ అలియాస్ భాస్కీ (వరుణ్ ధావన్), బగ్గా (సౌరభ్ శుక్లా) అనే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తూంటాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో అనే అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే పని మీద భాస్కీ కజిన్ జనార్థన్ (అభిషేక్ బెనర్జీ) తో కలిసి జీరోకి చేరుకుంటాడు. స్థానికుడైన జోమిన్ (పాలిన్ కబాక్) అక్కడ కలుస్తాడు. ఈ ముగ్గురితో పాండా (దీపక్ డోబ్రియాల్) కలుస్తాడు. అయితే గిరిజనులు తమ భూమిని వదులుకోవడానికి, చెట్లని నరికి వేయడానికీ ఒప్పుకోక పోవడంతో భాస్కీ కేం చేయాలో తోచదు. ఎలాగైనా రోడ్డు వేయాలన్న పట్టుదలతో వుంటాడు. గిరిజనులతో కొట్లాటకి దిగుతాడు. ఇంతలో అడవిలో తోడేలు అతడి మీద దాడి చేసి కరుస్తుంది. జనార్దన్, జోమిన్ కలిసి అతడ్ని పశువైద్యురాలు అనికా (కృతీ సానన్) దగ్గరికి తీసికెళ్తారు. ఆమె వైద్యంతో నయం కాదు. విషమించి భాస్కీ తోడేలుగా మారిపోతాడు. రాత్రి పూట తోడేలుగా మారుతాడు, పగటి పూట మనిషిలా వుంటాడు.

        ఏమిటీ పరిస్థితి? అడవి జోలికొచ్చినందుకు తోడేలు పగబట్టి ఇలా చేసిందా? అసలు కరిచింది నిజంగా తోడేలేనా? ఇప్పుడేం చేయాలి? తిరిగి మామూలు మనిషిగా ఎలా మారాలి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

హాలీవుడ్ లో వేర్వుల్ఫ్ సినిమాలని రెగ్యులర్ గా వస్తుంటాయి. మనిషి తోడేలుగా మారే ఈ సినిమాలు హార్రర్ సబ్ జానర్ లోకి వస్తాయి. ఈ కథలు గ్రీకు పురాణాల్లోంచి వచ్చాయి. ఆ పురాణాల ప్రకారం, లైకాన్ అనే వ్యక్తి ఆకాశానికి దేవుడైన జ్యూస్‌ కి మానవ మాంసంతో చేసిన భోజనాన్ని అందించినప్పుడు జ్యూస్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దానికి శిక్షగా, కోపోద్రిక్తుడైన జ్యూస్ లైకాన్‌ ని తోడేలుగా మార్చేశాడు. అలా తోడేలు మనిషిగా లైకాన్ నరకాన్ని అనుభవించాడు. ఇలా యూరోపియన్ జానపద కథల్లో రాత్రిపూట తోడేలుగా మారి జంతువుల్ని, మనుషుల్నీ, శవాల్నీ మింగేసి, పగటిపూట మానవ రూపంలోకి తిరిగి వచ్చే మనిషికి వేర్వుల్ఫ్ అని పేరు పెట్టి కథల్ని సృష్టించారు. ఈ గ్రీకు నేపథ్యంలోంచి లోంచి వచ్చిందే తోడేలు కథ.

        ఈ హార్రర్ కథని కామెడీగా చూపించాడు దర్శకుడు. ఈ హార్రర్ కామెడీకి పర్యా వరణ సమస్య సందేశం జోడించాడు. ఈ మధ్య ఆవాస వ్యూహం అని మలయాళంలో వచ్చింది పర్యావరణ సమస్యతో. అందులో కప్ప మనిషిని చూపించారు. పర్యావరణానికి హాని చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుందనే కథ తోడేలు లో కూడా వుంది.

        అయితే పర్యావరణ సమస్యకి తోడేలు రియాక్ట్ అవడంతో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమవుతుంది. దీన్ని కామెడీ చేయడంతో సీరియస్ నెస్ పోయి విషయం దెబ్బతింది. తోడేలుగా మారిన హీరో మనుషుల మీద కామెడీగా దాడులు చేయడం, మనుషులూ కామెడీగా చావడం విషయాన్ని పక్కదోవ పట్టించేదిగా, కేవలం హార్రర్ కామెడీని ఎంజాయ్ చేయాలన్నట్టుగా తయారైంది. తోడేలుతో హార్రర్ కామెడీయే చేయాల్సి వుంటే మధ్యలో పర్యావరణ సమస్యని లాగాల్సిన అవసరం లేదు. గిరిజనుల సమస్య కామెడీ కాదు.

        ఫస్టాఫ్ ఏదోలే కామెడీ చేశాడని సరిపెట్టుకున్నా సెకండాఫ్ లోనూ అదే వరస. క్లయిమాక్స్ ఒకటే ఆసక్తిని పెంచుతుంది. కథలో చాలా అవసరమైన ఎమోషన్సే లేవు. ఎమోషన్స్, స్ట్రగుల్, బాధ, ఆక్రోశం వుంటే తోడేలు రూపంలోంచి బయటపడాలనుకునే హీరోతోనే వున్నాయి. ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే, తోడేలుగా మనుషుల్ని కామెడీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడుగా- ఇంకేంటి బాధ?

నటనలు- సాంకేతికాలు

వరుణ్ ధావన్ హృదయాన్ని, ఆత్మనీ విప్పి పాత్రలో పోశాడని చెప్ప వచ్చు. మనిషిగా మామూలుగా వున్నప్పుడు, పదేపదే తోడేలుగా మారుతున్నప్పుడూ. తోడేలుగా మారేక అన్నీ కామెడీలే. కానీ తోడేలుగా మారేప్పుడు శరీరంలో జరిగే మార్పులకి అనుభవించే నరకాన్ని ఉద్విగ్నంగా ప్రదర్శించాడు. ఇంతవరకు తన గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ఏవైనా ఊపిరిబిగబట్టి చూసే సన్నివేశాలుంటే ఇవే.

        పశువుల డాక్టర్ గా కృతీసానన్ ది మామూలు పాత్ర. హీరోని ప్రేమించడం, వాదన పెట్టుకోవడం మామూలే. అయితే ఈ పాత్రకో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. దీంతో అసలు తోడేలుకథకి మూలాలు 1941 వేర్వుల్ఫ్ మూవీ ది వేర్వుల్ఫ్ మాన్లో వున్నాయని తెలిసిపోతుంది. ఇలా మామూలుగా కన్పించే కృతీసానన్ పాత్రతో అనూహ్యంగా ట్విస్టు రావడం క్లయిమాక్స్ కి బలాన్నిచ్చే ఎలిమెంట్.  ఇక హీరో ఫ్రెండ్ గా అభిషేక్ బెనర్జీ మంచి కమెడియన్. ఇతర నటులు సౌరభ్ శుక్లా సహా ఫర్వాలేదనిపించుకుంటారు –ఆ పాత్రల్లో అంతే నటించగలరు.

        సచిన్-జిగర్ ల  సంగీతం యావరేజ్‌గా వుంది. జిష్ణూ ట్టాచార్జీ ఛాయాగ్రహణం మాత్రం అద్భుతంగా వుంది. మునుపెన్నడూ చూడని లొకేషన్స్ ని అరుణాచల్ అందాలతో చూపెట్టాడు. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్ గా వుంది. సౌండ్ డిజైన్ బావుంది. కాస్ట్యూమ్స్ ఆకర్షణీయంగా వున్నా వాస్తవికంగా వున్నాయి.

        ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్. హీరో తోడేలుగా మార్పు చెందేటప్పటి దృశ్యాల గ్రాఫిక్స్ బలంగా వున్నాయి. సాంకేతికంగా రాజీ పడని ధోరణి కన్పిస్తోంది గానీ, విషయపరంగానే రంజింప జేసే ధోరణి కనిపించడం లేదు.
—సికిందర్

6, డిసెంబర్ 2022, మంగళవారం

1259 : రివ్యూ!

రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు
తారాగణం : విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం : రిచర్డ్ ఎం. నాథన్
బ్యానర్స్ : ఆర్ టి టీమ్ వర్క్స్, వివి స్టూడియోస్
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్
విడుదల : డిసెంబర్ 2, 2022
***

        విష్ణు విశాల్- ఐశ్వర్య లక్ష్మీలతో  తమిళంలో గట్ట కుస్తీ’, తెలుగులో మట్టి కుస్తీగా రవితేజ సహ నిర్మాతగా వుంటూ అందించిన ఈ ఎంటర్టయినర్ కి దర్శకుడు చెల్లా అయ్యావు అనే తమిళుడు. దీనికి మునుపు విష్ణు విశాల్ తో ఒక మూవీ చేశాడు. అది హిట్టయ్యింది. ఈ రెండో మూవీని స్పోర్ట్స్ మూవీ అన్పించేట్టు తీశాడు గానీ స్పోర్ట్స్ మూవీ కాదు. మరి మట్టి కుస్తీ అని టైటిల్ ఎందుకు పెట్టాడు? దీని వెనుక వేరే అర్ధం ఏమైనా వుందా? దీంతో విజయం సాధించాడా? ఇవి తెలుసుకుందాం...

కథ

చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన వీర (విష్ణు విశాల్) కి ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంట్‌గా వున్న మేనమామ (కరుణాస్), మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువనీ, ఎప్పుడూ ఆడవాళ్ళకి లొంగకుండా వుండాలనీ వీరకి తన పైత్యం నూరిపోస్తాడు. ఎనిమిదో తరగతి చదివిన వీర తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ, చిన్న చిన్న పంచాయితీలు తీరుస్తూ, కబడ్డీ ఆడుతూ కాలం గడుపుతూంటాడు. మేన మామ నూరి పోసిన దాని ప్రకారం తనని పెళ్ళి చేసుకునే అమ్మాయి  తనకంటే ఎక్కువ చదువుకోకూడదనీ, బారెడు జడ కూడా వుండాలనీ కోరికలు చెబుతూంటాడు. ఎక్కువ చదువుకున్న అమ్మాయిలతో సంబంధాలొస్తే తిప్పి కొడతాడు.

        ఇంకో చోట ఇలాటి ఒకమ్మాయి - బీఎస్సీ చదివిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) మట్టి కుస్తీ పట్లు నేర్చుకుని, పోటీల్లో పతకాలు గెలుచుకుని, జుట్టు కత్తిరించుకుని మగరాయుడిలా తయారయ్యేసరికి సంబంధాలు రాక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూంటారు. దీంతో ఈమె బాబాయి (మునిష్కాంత్) ఈమె ఏడో తరగతే చదివిందనీ, జడ కూడా బారెడు వుందనీ వీరకి అబద్ధాలు చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇలా కీర్తిని పెళ్ళి చేసుకున్న వీరని ఒక రోజు కొందరు దుండగులు కొడుతూంటే, కీర్తి ఫైట్ చేసి కాపాడుకుంటుంది. దీంతో వీరకి ఈమె రెజ్లర్ అని తెలిసిపోతుంది. పైగా జడ కూడా లేదనీ, అది విగ్గు అనీ తెలిసిపోతుంది. దీంతో గొడవలు మొదలుతాయి. ఇవి తేల్చుకోవడానికి ఇద్దరూ కుస్తీకి దిగుతారు. కుస్తీలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయారనేది మిగతా కథ.

ఎలావుంది కథ

సందేశాత్మక కథ. ఇప్పటికీ స్త్రీలని బానిసలుగా చూసే మగవాళ్ళకి సందేశం. స్త్రీ సమానత్వం గురించి చెప్పేందుకు కుస్తీని వాడుకున్న కామెడీ కథ. అంతేగానీ మట్టి కుస్తీ ప్రధానంగా ఇది స్పోర్ట్స్ మూవీ కాదు. భార్యకి ఇష్టాయిష్టలేమిటని ఇగో పెంచుకుని బతికే వాడికి పహిల్వాన్ భార్యగా వస్తే ఎలా వుంటుందనే ఐడియాతో ఈ కామెడీ కథ. ఇందులో కీర్తికి రెజ్లర్ గా ఎదగాలని కలలుంటాయి. ఆమెని ఎదగనివ్వని మేల్ ఇగోతో వీర వుంటాడు. ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే ఈ కథ. గట్ట కుస్తీ అనేది కేరళకి చెందిన క్రీడా. కీర్తి కేరళకి చెందిన అమ్మాయిగానే వుంటుంది.

        అయితే కథాకథనాలు, దర్శకత్వం ఔట్ డెటెడ్ గా వున్నాయి. వీర- కీర్తీల మధ్య కొన్ని కామెడీ సీన్లు మాత్రం బావుంటాయి. మిగిలినదంతా తెలిసిపోయే కథే. పైగా కథలో బలమైన సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా సాగిపోతూంటుంది. వూళ్ళో వీర ఆవారాగా తిరిగే సీన్లు, మరో పక్క  ఇంకో వూళ్ళో కీర్తి కుస్తీ పట్లూ పాత ఫార్ములాల ప్రకారమే వుంటాయి. కొత్తదనం కోసం ప్రయత్నించే శ్రమ తీసుకో దల్చుకో లేదు దర్శకుడు. హీరోహీరోయిన్లుగా విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిల పాపులారిటీ సినిమాని గట్టెక్కిస్తుందని భావించినట్టుంది. క్లయిమాక్స్ లో విశాల్ అప్పటికప్పుడు కుస్తీ నేర్చుకుని కీర్తితో పోటీకి దిగే సీన్లు కూడా కృత్రిమంగా వుంటాయి.

        కొన్ని కామెడీ సీన్లు, ఇంటర్వెల్ సీను, వీర- కీర్తీల మధ్య కాన్ఫ్లిక్ట్, చివర సందేశం – కథకి ఇవి బలమైన ఆధారాలుగా వున్నా, వీటిని ఆధారంగా చేసుకుని నడిపిన కథనం ఓ మోస్తరు ఎంటర్ టైనర్ గా సినిమాని మిగిల్చింది.

నటనలు - సాంకేతికాలు

హీరో విష్ణు విశాల్ ఎంటర్ టైన్ చేస్తాడు. ఐశ్వర్యా లక్ష్మి కూడా ఎంటర్ టైన్ చేస్తుంది. పాత్రలు, కథా కథనాలూ ఎలా వున్నా, ఇద్దరి నటనలు మాత్రం సినిమా చూసేలా చేస్తాయి. లొకేషన్స్, సెట్స్, ఇతర బ్యాక్ గ్రౌండ్స్ కలర్ఫుల్ గా వుండడంతో, వీటికి ఇద్దరి గ్లామర్ తోడవడంతో - ఇవి చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. మిగిలిన అన్ని పాత్రలు నటించిన నటీనటులకి తెర మీద లభించిన స్పేస్ తక్కువ. దీనికి తగ్గట్టు కన్పించి పోతారు.

        జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో పాటలు అలా వచ్చి పోతాయి. రిచర్డ్ నాథన్ కెమెరా వర్క్ లో విజువల్ బ్యూటీ వుంది. దీనికి హీరోహీరోయిన్ల గ్లామర్ తోడయ్యింది. గ్రామీణ వాతావరణమనేది ఆహ్లాదకరంగా చూపించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు, ఇతర సాంకేతికాలూ బావున్నాయిగానీ, కొత్తదనమనేది అసలు విషయం లోనూ వుండాలి. గ్రామీణ కుటుంబ కథల్ని బలమైన డ్రామాలుగానే ఎవరైనా తీస్తారు. ఈ సినిమాని పాత సినిమాలా తీసిన దర్శకుడు, ఆ పాత సినిమాల్లో వుండే కథా బలమైనా ప్రదర్శించి వుంటే మట్టి కుస్తీ మరో లెవెల్లో వుండేది.

—సికిందర్   


4, డిసెంబర్ 2022, ఆదివారం

1258 : సండే స్పెషల్ రివ్యూ!

        చాందినీ బార్ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు), పేజ్ త్రీ (ఉన్నత వర్గాల హిపోక్రసీ  ), కార్పొరేట్ (కార్పొరేట్ రంగం చీకటి కోణాలు), ఫ్యాషన్ (ఫ్యాషన్ రంగం తళుకులు)... ఇలా ఒక్కో రంగం లోపలి సంగతుల్ని కథా వస్తువులుగా తీసుకుని, 12 రీసెర్చి సహిత సినిమాలు తీసిన దర్శడుడు మధుర్ భండార్కర్, 13వ సినిమాగా ఇండియా లాక్ డౌన్ అందించాడు. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 2020 మార్చి 24 న విధించిన 21 రోజుల దేశవ్యాప్త మొదటి లాక్ డౌన్ అందరికీ గుర్తుంటుంది. ఈ లాక్ డౌన్ కాలంలో ఎదుర్కొన్న ఇక్కట్లు తిరిగి గుర్తుచేస్తూ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశాడు. హిందీలో జీ5 ఓటీటీ ద్వారా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ రెండున్నర  గంటల డాక్యూ డ్రామా, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో వుంది.

        ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతా బసు ప్రసాద్, ఆహానా కుమ్రా, ప్రకాష్ బెలవాడి వంటి తెలిసిన నటులతో బాటు, సాయి తంహన్కర్ , తాహురా మన్సూరీ, జరీన్ షిహాబ్, ఆయీషా అయిమన్ నటించారు. అమిత్ జోషీ, ఆరాధనా సా రచన చేశారు. పలాస్ దాస్ ఛాయాగ్రహణం. దీనికి సంగీత దర్శకుడు లేడు. నిర్మాతలు జయంతీలాల్ గడా, మధుర్ భండార్కర్, ప్రణవ్ జైన్.  ఇక ఈ లాక్ డౌన్ లో ఏం జరిగిందో చూద్దాం...

నాలుగు కథల ఆంథాలజీ

ముంబాయిలో మూన్ (ఆహానా కుమ్రా) ఒక పైలట్. రిలేషన్ షిప్స్ కి సమయం లేనంత పని రాక్షసి. లాక్ డౌన్ తో విమానాలాగి పోయి ఇంటి ముఖం పడుతుంది. అదే అపార్ట్ మెంట్లోని ఒక ఫ్లాట్లో తనకంటే చిన్నవాడైన స్టూడెంట్ ఆకాష్ పరిచయమవుతాడు. అతడికి దగ్గరవడానికి ప్రయత్నిస్తూంటుంది. అతను వేరే గర్ల్ ఫ్రెండ్ ని లాక్ డౌన్ లో కలవలేక వీడియో కాల్స్ మాట్లాడుతూంటాడు.

ముంబాయిలోనే ఒక పోష్ సొసైటీలో కుక్కతో ఒంటరిగా నివసిస్తూంటాడు నాగేశ్వరరావు (ప్రకాష్ బలెవాడి) అనే రిటైర్డ్ తెలుగు వ్యక్తి. హైదరాబాద్ లో డెలివరీ దగ్గర పడ్డ కూతురు దగ్గరికి వెళ్దామనుకుంటే లాక్డౌన్ తో బందీ అయిపోయాడు. పని మనిషి ఫూల్మతి (సాయి తంహన్కర్) కి నెల జీతం అడ్వాన్సు ఇచ్చేసి, ఇంటి పట్టున జాగ్రత్తగా వుండమని చెప్పి పంపించేస్తాడు.

ఫూల్మతి భర్త మాధవ్ (ప్రతీక్ బబ్బర్) తోపుడు బండి మీద తినుబండారాలు అమ్మే అప్పుల్లో వున్న వలస కార్మికుడు. లాక్ డౌన్ తో ఆ ఉపాధి కూడా కోల్పోయి, కుటుంబాన్ని తీసుకుని కాలినడకన బీహార్లో స్వగ్రామానికి బయల్దేరతాడు.

ఇదే ముంబాయి కామాటీ పురాలో మెహరున్నీసా (శ్వేతా బసు ప్రసాద్) సెక్స్ వర్కర్. లాక్ డౌన్ తో ఉపాధికోల్పోయి, తోటి సెక్స్ వర్కర్స్ తో కొత్త ఆదాయ మార్గాన్ని కనిపెడుతుంది. కస్టమర్లతో ఫోన్ సెక్స్ ద్వారా ఆన్ లైన్ లో  డబ్బులు సంపాదించడం మొదలెడుతుంది.

ఇలా నాల్గు భిన్న వర్గాలకి చెందిన వ్యక్తుల అనుభవాలే ఈ నాల్గు కథలు. నిర్బంధ పరిస్థితుల్లో కూడా మనుషుల స్వభావం మారదనడానికి ఆర్ధికంగా స్థిరపడ్డ పాత్రల్ని చూపించాడు. ఆర్ధికంగా స్థిరపడ్డ వర్గాలకి లాక్ డౌన్ నిర్బంధంలో అప్రమత్తత కాదు, ఆరోగ్యమూ కాదు. సరదాలు కోరికలూ ఎలా తీర్చుకోవాలనే తాపత్రయం. మూన్, ఆకాష్, అతడి గర్ల్ ఫ్రెండ్ పాత్రలు దీనికి చెందుతారు.

అదే ఉపాధి కోల్పోయిన వర్గాలకి బ్రతుకు పోరాటమే తప్ప సరదాలు కోరికలూ కాదు. సెక్స్ వర్కర్ మెహరున్నీసా, ఆమె తోటి వర్కర్లు; పనిమనిషి ఫూల్మతి, ఆమె భర్త మాధవ్ ఈ వర్గానికి చెందుతారు. ఇక రిటైర్డ్ వ్యక్తులకి బంధువర్గం గురించి ఆందోళన. నిజమే, 70, 80 దాటిన వాళ్ళు కూడా ఎక్కడో బంధువుల ఫంక్షన్ కి వెళ్ళక పోతే వుండలేని అసహనాన్నిచూశాం. ఈ కథలో కూతురి డెలివరీకి రిస్కు చేసి వెళ్ళాలనుకునే నాగేశ్వరరావు ఇలాటి పాత్ర. వెళ్ళక పోతే కొంపలేమీ అంటుకోవు. కూతురే రావద్దని చెప్తున్నా, ముంబాయి నుంచి హైదరాబాద్ కి కారు డ్రైవ్ చేస్తూ బయల్దేరతాడు!

నాలుగు కథల కథ కాదు

అయితే ఈ నాల్గు కథలూ చివర్లో ఒక బిందువు దగ్గర కలిసే రొటీన్ ఇందులో వుండదు. అంటే నాల్గు కథలూ ఒక కథగా కలిసిపోవు. కేవలం నాగేశ్వరరావు, ఫూల్మతి కుటుంబం మార్గంలో ఎదురుపడతారు. ఇక్కడే ఇద్దరి కథలు కొలిక్కి వస్తాయి. అయితే నాగేశ్వరరావు ముంబాయి నుంచి వెళ్తున్నది హైదరాబాద్ కి. ముంబాయి నుంచి ఎక్కడో అటు ఉత్తరాన బీహార్ కాలినడకన వెళ్తున్న ఫూల్మతి కుటుంబం ఇటు దక్షిణాని కెలా వస్తుంది? సినిమాకోసం లాజిక్ ని లాక్ డౌన్ చేశాడేమో రియలిస్టిక్ సినిమాల రీసెర్చి స్పెషలిస్టు భండార్కర్.

నాగేశ్వరరావనే తెలుగు పాత్రతో కథకి ప్రయోజనం కూడా ఏమీ లేదు. నాందేవ్ సిన్హాగా పేరు మార్చి అటు బీహార్ పంపి వుంటే ఆ రూట్లో ఫూల్మతి కలిసేది. నాగేశ్వరరావుతో  నేటివిటీ కోసం ఓ రెండు చోట్ల తెలుగు కూడా మాట్లాడించారు. అప్పా రాత్రి భోజనం చేసరా?’ (చేశారా కాదు) అని కూతురు అడుగుతుంది. అప్పా అని ఏ తెలుగామె పిలుస్తుందో! సౌత్ అంటే మద్రాసీలే అనే హిందీవాళ్ళ జనరల్ నాలెడ్జి కి తమిళ అప్పానే తెలుసు. రాత్రి ఫోన్ చేసి రాత్రి భోజనం చేశారా అనడమేమిటో!

ఇక నాగేశ్వరరావంటాడు, ఇంటి పని ఏమి అని ఈ లాక్ డౌన్ సమయంలో నేను కట్బడ్డాను’… అంటే ఏమిటో! దారినిపోయే ఏ తెలుగు వాడినో కిడ్నాప్ చేసి  డైలాగు తిన్నగా రాయించుకోవచ్చుగా?

వలసల చరిత్రకి మచ్చ?

    కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులు ఓ ఇరవై మంది వుంటారు. కానీ విజువల్స్ అప్పట్లో మనం టీవీల్లో, యూట్యూబ్ లో చూసినట్టుగా హృదయవిదారకంగా వుండవు. నడక వేగం కూడా వుండదు. ఇరవై మంది కలిసి సైట్ సీయింగ్ కి వెళ్తున్నట్టు నిదానంగా నడుస్తూంటారు. బాధ, ఆయాసం, అనారోగ్యం ఏవీ వుండవు. ఫూల్మతి కుటుంబానికి మాత్రమే నడవలేని బాధ, ఆకలిదప్పులు వుంటాయి. అయితే మధ్యలో ఒక అభ్యంతరకర సీను వస్తుంది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న అతను, ఫూల్మతి మీద కన్నేయడం, రాత్రికి పిలవడం అసభ్యంగా వుంటుంది.

ఆర్ధికంగా స్థిరపడ్డ వాళ్ళ కోరికలు, ఊపాధి కోల్పోయిన వాళ్ళ క్షుద్బాధా అని స్పష్టంగా వర్గీకరణ చేసిన తర్వాత, వలస కార్మికుల ఈ విపత్కర పరిస్థితుల్లో కామ కోరికలేమిటి? ఇలా ఎప్పుడైనా జరిగిందా? లాక్ డౌన్ వలసల్లో అత్యాచారాలు జరిగినట్టు కూడా వినలేదు. ఇలా చూపించి ఆ వలసల చారిత్రక ఇమేజికి చేటు చేసినట్టే దర్శకుడు.

దీంతో గొడవ జరిగి ఫూల్మతి కుటుంబం విడిపోతారు. అంటే తర్వాత నాగేశ్వరరావుతో విడిగా కలపడానికే బృందంనుంచి ఫూల్మతిని విడగొట్టే మార్గాన్ని ఇలా కల్పన చేశాడన్నమాట దర్శకుడు!

ఇక ఈ నాల్గు కథలూ ఎలా ముగిశాయన్నది మూవీ చూడాల్సిందే. ఇందులో ఫూల్మతిగా నటించిన సాయి తంహన్కర్, సెక్స్ వర్కర్ గా నటించిన శ్వేతా బసు ప్రసాద్ లవి ఎక్కువ ప్రభావం చూపే పాత్రలు, నటనలు. సాయిది విషాదమైతే, శ్వేతాది మగాళ్ళని రెచ్చగొట్టే సెక్సీతనం. దేన్నీ కేర్ చేయని,, జీవితాన్ని ఎంజాయ్ చేసే (సెక్స్) వర్కింగ్  వుమన్. సినిమాలో సంగీతం లేదు. ఆ లోపం కన్పించదు. టెక్నికల్ గా భండార్కర్ స్థాయిలో వుంది.

—సికిందర్
 

3, డిసెంబర్ 2022, శనివారం

1257 : రివ్యూ!


         2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం చెల్లో షో(చివరి షో) అక్టోబర్ 14 న గుజరాత్ లో విడుదలైంది. దీనికి పూర్వం 2021 లో వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో హల్చల్ చేసింది. ఆస్కార్స్ కి ఎంట్రీ పొందడంతో  ఈ సినిమా చూడాలన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆన్ లైన్ లో అందుబాటులో లేకపోవడంతో నిరుత్సాహానికి గురైన ప్రేక్షకుల్ని నెట్ ఫ్లిక్స్ ఆదుకుంది. నవంబర్ 25 నుంచి దీన్ని స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అయితే ఇతర భాషల్లో డబ్ చేయకుండా ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో విడుదల చేయడంతో ఇంగ్లీషు రాని ప్రేక్షకులకి దూరంగానే వుండిపోతోంది. పేద పిల్లల జ్ఞాన తృష్ణ గురించి తీసిన ఈ కళాఖండం ఆ వర్గాల ప్రేక్షకుల్లోకి స్ఫూర్తిగా వెళ్ళాలంటే వివిధ భాషల్లో డబ్ చేయాల్సిందే. మనమే తీసిన ఒక అంతర్జాతీయ సినిమా దేశీయ భాషల్లో ప్రదర్శనలకి నోచుకోకపోతే ఏం లాభం.

        గుజరాతీ సమాంతర సినిమా దర్శకుడు పాన్ నళిన్ వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో 23 సార్లు ఉత్తమ చలన చిత్ర్రాల అవార్డులందుకుని మేటి దర్శకుడుగా పేరుపొందాడు. చెల్లో షో కి మూడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులతో బాటు, మరో ఏడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో నామినేషన్లు పొందాడు.

అలాగే జపాన్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇజ్రాయెల్ దేశాలు థియేట్రికల్ రిలీజ్ కి కొనుగోలు చేశాయి. చెల్లో షో ఫిల్మ్స్-ఫుడ్-ఫ్రెండ్స్-ఫ్యామిలీ సెలబ్రేషన్ గా రూపకల్పన చేశానని చెప్తున్న నళిన్, సినిమా కళకి నివాళిగా ఇటలీ తీసిన సినిమా పారడిసో (1988) తర్వాత - చెల్లో షో ని అంతరించిపోయిన సినిమా రీళ్ళ కి బాధాతప్త వీడ్కోలుగా అందించాడు. నిజంగా ఈ కళాఖండం చూస్తే కదిలిపోని, కళ్ళు చెమర్చని సినిమా అభిమానులుండరు.

పిల్లల సృజనాత్మక విజయం
సమయ్ తొమ్మిదేళ్ళ పేద బ్రాహ్మణ విద్యార్థి. గుజరాత్ లోని సౌరాష్ట్రలో చలాలా అనే కుగ్రామం రైల్వే స్టేషన్ పక్కన టీలమ్మే తండ్రికి సాయపడుతూ, స్కూలుకెళ్ళి  చదువుకుంటూ వుంటాడు. కొందరు నేస్తాలుంటారు. అతడి దృష్టి ఒక్కటే- కాంతిని పట్టుకోవాలని. కాంతి నుంచి కథలు, కథలనుంచి సినిమాలూ పుడతాయని భావిస్తూంటాడు. స్కూలు ఎగ్గొట్టి సినిమాలకి పోతూంటే తండ్రి బాపూజీ కొట్టి- సినిమాలనేవి కుళ్ళు. మన సాంప్రదాయం కాదు. బ్రాహ్మణులు ఇలాటి పనులు చేయడం చూశావా?’ అని కొడతాడు. బ్రాహ్మణ బ్రాహ్మణ అంటూ నువ్వెక్కడున్నావో చూడు- రోజంతా చాయ్ లమ్ముకుంటూ కప్పులు కడుగుతున్నావ్. చాయ్ చాయ్ అని అరుస్తు
న్నావ్ అనేస్తాడు కొడుకు.

ఒక రోజు టికెట్ లేకుండా దూరాడని సినిమా హాల్లోంచి బయటికి విసిరేస్తారు. ప్రొజెక్టర్ ఆపరేటర్ ఫజల్ చేరదీసి, చపాతీలు తింటూ- మా ఇంటిదానికి చపాతీలు చేయడం రాదంటాడు. మా అమ్మ బాగా చేస్తుందంటాడు సమయ్. అప్పట్నుంచి తల్లి స్కూలుకి కట్టిచ్చే భోజనాన్ని తెచ్చి ఫజల్ కిచ్చి, ప్రొజెక్షన్ రూంలో కూర్చుని రోజూ జోధా అక్బర్ఫ్రీగా చూస్తూంటాడు. కాంతి ఎలా ప్రసరిస్తోంది, ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తోందీ నిశితంగా గమనిస్తాడు.

సినిమాలు ఎలా తీస్తారని అడిగితే, ‘సినిమాలు కథల గురించి తీస్తారు. కథలతో సినిమాలకి పాత సంబంధముంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కథలు చెప్పడం లాగా, వ్యాపారులు సరుకులు అమ్ముకోవడానికి కథలు చెప్పడం లాగా, డబ్బున్న వాళ్ళు డబ్బులు దాచెయ్యడానికి కథలు చెప్పడం లాగా...భవిష్యత్తు కథలు చెప్పే వాళ్ళదే! అని జ్ఞాన భోద చేస్తాడు ఫజల్.

ఇక నేస్తాలతో కలిసి సైకిలు చక్రాలు, పెడల్, కుట్టు మిషను, ఫ్యాను రెక్కలు, అద్దాలు, బల్బులు మొదలైనవి పోగేసి, దూరంగా ఒక పాడుబడ్డ ఇంట్లో ప్రొజెక్టర్ తయారు చేసేస్తాడు. రైల్వే స్టేషన్ కొచ్చే సినిమా రీళ్ళని ఎత్తుకొచ్చి, తాన్ తయారు చేసిన చేత్తో తిప్పే ప్రొజెక్టర్లో ఆడించి, తెర మీద బొమ్మవేసి కేరింతలు కొడతాడు.

ఇలా సినిమాలు ప్రదర్శించుకుని, శబ్దాలు సృష్టించుకుని ఆనందిస్తూండగా, ఒక రోజు ఫజల్ నుంచి దుర్వార్త  వస్తుంది. సమయ్ పరుగెత్తుకుని వెళ్ళి చూస్తే, సినిమా హాల్లో ప్రొజెక్టర్, రీళ్ళూ తీసి బయట పారేస్తూంటారు. ఫజల్ ఉద్యోగం పోతుంది. కొత్త టెక్నాలజీతో ఆధునికంగా డిజిటల్ ప్రొజెక్టర్ బిగిస్తూంటారు... ఈ మార్పుని సమయ్ తట్టుకోలేకపోతాడు.   

సినిమా అంటే ఫిలిమ్ రీళ్ళు అనే శతాబ్దకాలపు చరిత్ర ఇక పరిసమాప్తమవుతున్న పరిణామాలు చూసి సమయ్ కలలన్నీ చెదిరిపోతాయి. ఈ మార్పుని ఎలా స్వీకరించాలి? ఇప్పుడేం చేయాలి? ఇక్కడ్నుంచి అతడి ఆలోచనలు ఏ దిశగా పయనించాయి? ఇంకే  ముగింపుకి స్వాగతం పలికాడు?... ఇవన్నీ ఎంతో హృద్యంగా తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు.

సినిమాయే సెలబ్రేషన్

దర్శకుడు డిజిటల్ సినిమాల చరిత్రకి అంకురార్పణ మాత్రమే చేసి వూరుకోలేదు. పాత ప్రొజెక్టర్లు, రీళ్ళూ ఏమయ్యాయీ ఇవీ చూపించాడు. వివిధ పరిశ్రమల్లో తుక్కుకింద ముద్దయి చెంచాలుగా, ప్లాసిక్ పైపులుగా, చేతి గాజులుగా ఉత్పత్తి అవడాన్ని సమయ్ సాక్షిగా చూపించాడు. అసలు సమయ్ తయారు చేసిన ప్రొజెక్టరు కూడా ఏదో సినిమాటిక్ గా చూపించలేదు. దానికి వాడిన వస్తువుల ఉపయోగాన్ని సాంకేతికంగా సాధ్యమే అన్నట్టు ఇంజనీరింగ్ చేసి చూపించాడు. ప్రపంచంలో తొట్ట తొలి ప్రొజెక్టర్ తయారు చేసినప్పుడు ఏం చేసి వుంటారో, ఏ రూపంలో వుండేదో అదొక చారిత్రక ఘట్టం. సమయ్ సినిమా హాల్లో ప్రొజెక్టర్ని పరిశీలించి, పారేసిన వస్తువులతో ఒక చేత్తో తిప్పే ప్రొజెక్టర్నే తయారు చేయడం పిల్లల్లో దాగివుండే అద్భుత శాస్త్రీయ దృష్టికి తార్కాణమన్నట్టుగా చూపించాడు!

గ్రామీణ పిల్లలంతా కలిసి సాధించిన ఈ విజయాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే, చెప్పుకుంటే సినిమా రీళ్ళ దొంగతనం బయటపడుతుంది. ప్రతీ సన్నివేశం చాలా ఫన్నీగా, హాస్యంగా, వినోదపరుస్తూ వుంటుంది. ఈ వినోదం కూడా కళ్ళు చెమర్చేలా వుంటుంది. సమాంతర సినిమా అయినా ఆర్ట్ సినిమాలాగా సీరియస్ గా, నెమ్మదిగా సాగకుండా, సరదాగా వేగంగా పరిగెడుతూంటుంది. ఫిల్ముతో పిల్లల సెలబ్రేషన్, ఫ్రెండ్ షిప్ తో పిల్లల సెలెబ్రేషన్, తల్లి తయారు చేసే వంటకాలతో ఫుడ్ సెలబ్రేషన్, సమయ్ కుటుంబంతో ఫ్యామిలీ సెలెబ్రేషన్ ... ఇలా ఈ సినిమాయే ఒక సెలెబ్రేషన్.

స్కూలుకి తల్లి కట్టిచ్చే భోజనాన్ని సమయ్ ఫజల్ కి తినబెట్టడంతో వాళ్ళిద్దరి ఫ్రెండ్ షిప్ ఇంకో సెలెబ్రేషన్. తల్లి కింద పొయ్యి మీద ఎలా వండుతుందో వివరంగా చూపిస్తాడు దర్శకుడు. గుత్తి వంకాయ కూర, బెండకాయ మసాలా, మిర్చీ మసాలా, కొత్తిమీర చింతపండు చట్నీ...ఇలా మనకే నోరూరేలా రోజుకో వంట వండుతుంది. ఈమెకి తెలియకుండా తీసికెళ్ళి ఫజల్ కి తినిపిస్తూంటాడు. ఫజల్ సెలబ్రేట్ చేసుకుంటాడు.

ప్రతీ దృశ్యం విలువైనదే, విషయం చెప్పేదే. సినిమా హాల్లో చాలా రోజులు జోధా అక్బరే ఆడుతుంది. తర్వాత దాన్ని తీసేసి అమితాబ్బచ్చన్ ఖుదా గవా ఆడిస్తారు. ఆ తర్వాత ఇంకో సినిమా అడిస్తూంటే మధ్యలో ఆగిపోయి గొడవ గొడవ అవుతుంది. ఆ రీలు సమయ్ ఎత్తుకుపోవడంతో ఈ గొడవ.

రీళ్ళతో చరిత్ర పరిసమాప్తమయ్యాక, తిరిగి సమయ్ రైళ్ళాగినప్పుడు చాయ్ లమ్మే పరిస్థితికే వచ్చాక, తండ్రితో కదిలించే దృశ్యాలుంటాయి. మొదట్లో అగ్గిపెట్టెలు సేకరించి, వాటిమీద వుండే వివిధ బొమ్మల్ని వరుస క్రమంలో పేర్చి, బొమ్మల కథలు చెప్పే నేర్పుతో ప్రారంభమయిన కొడుకు సృజనాత్మకతని ఇక తండ్రి గుర్తించి- తీసుకునే నిర్ణయం విజయం వైపుగా వుంటుంది. వీడ్కోలు భావోద్వేగ పూరితంగా, ఒక జ్ఞాపకంగా వుండిపోతుంది.  

ఒన్ బాయ్ షో

పేద పిల్లవాడి పాత్రలో భవిన్ రబరీ ఒక అద్భుత చైల్డ్ ఆర్టిస్టు. సినిమా చూశాక కలకాలం గుర్తుండి పోతాడు. భవిన్ వన్ బాయ్ షో అనొచ్చు దీన్ని. మిగతా పాత్రల్లో బాలనటులు కూడా అంతే సహజత్వంతో నటిస్తారు. తండ్రిగా దీపెన్ రావల్, తల్లిగా రిచా మీనా, బక్క ప్రాణి ఫజల్ గా భవేష్ శ్రీమాలీ.... ఇలా ప్రతీ వొక్కరూ నిజజీవితంలో చూస్తున్నట్టే వుంటారు. తక్కువ మాటలతో ఎక్కువ భావాల్ని ప్రదర్శిస్తారు. సినిమా నడక ఒక లయగా వుంటుంది. సినిమా సాగిపోతున్నట్టు అస్సలు గుర్తించలేనంతగా ప్రతీదృశ్యంలో గాఢంగా సంలీనం చేస్తుంది. ఒక సెకను కూడా కళ్ళు తిప్పుకోలేం. ఆపి ఆపి వాయిదాలుగా చూడకుండా- ఏకబిగిన చూసేసేంత సృజనాత్మక, సాంకేతిక ఔన్నత్యాలతో వుంటుంది గంటా 50 నిమిషాల సేపూ.

స్వప్నిల్ సోనావనే ఛాయాగ్రహణం, మైకేల్ బారీ  శబ్దగ్రహణం, పంకజ్ పాండ్యా కళా దర్శకత్వం, సిరిల్ మోరిన్ సంగీత దర్శకత్వం, శ్రేయాస్ కూర్పు... ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నవే.

అసలు పరీక్ష ఏమిటంటే, పాలిన్ నళిన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లు నిర్మాతలుగా వ్యవహరించిన చేల్లో షోఆస్కార్స్ లో 95 దేశాలతో పోటీపడాల్సి రావడం.

—సికిందర్