రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, అక్టోబర్ 2022, సోమవారం

1234 : రివ్యూ!


రచన - దర్శకత్వం : రిషభ్ శెట్టి
తారాగణం : రిషభ్ శెట్టి, సప్తమీ గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ఉగ్రం రవి తదితరులు
సంగీతం : అజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం  : అరవింద్ కశ్యప్
నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్‌
పంపిణీ : (తెలుగు) గీతా ఆర్ట్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్ 
విడుదల : అక్టోబర్ 15, 2022
***

        సెప్టెంబర్ 30 న విడుదలైన 'కాంతార' కన్నడ ఒరిజినల్ రికార్డు స్థాయి వసూళ్ళని  రాబడుతూ దూసుకెళ్తోంది. అక్టోబర్ 14 న విడుదలైన హిందీ వెర్షన్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 15 న తెలుగు వెర్షన్ విడుదలైంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ కన్నడ పానిండియా బాక్సాఫీసు ఇప్పటికి 200 కోట్లు దాటేసింది. పానిండియా సినిమాకి వందల కోట్ల బడ్జెట్ అవసరం లేదని తేల్చేసింది. గత ఐదేళ్ళుగా కన్నడ సినిమాల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళుతున్న శెట్టి సోదరుల (రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి) భావజాలాన్ని ఇటీవల ‘చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన’, ఇప్పుడు ‘కాంతార’ చాటుతున్నాయి. కన్నడ ప్రజల బ్రతుకు నుంచే కథలు తీసుకుని కన్నడ అస్తిత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రాంతీయాభిమానంతో కమర్షియల్ సినిమాలకిదో కొత్త నమూనా.

        టుడు, రచయిత, దర్శకుడు అయిన రిషభ్ శెట్టి ఈసారి కన్నడ సంస్కృతిని పర్యావరణ పరిరక్షణతో ముడిపెట్టి అద్భుత దృశ్య వైభవాన్ని సృష్టించాడు. కన్నడలో ఉడిపి కేంద్రంగా ఉపప్రాంతీయ సినిమారంగం అయిన తుళువుడ్ నుంచి అభయసింహా తీసిన మత్స్యకారుల జీవన చిత్రం ‘పడ్డాయి లో కన్నడ సంస్కృతిని జోడించి ఓ దృశ్య కావ్యాన్ని సృష్టించాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా. రిషభ్ శెట్టి కమర్షియల్ సినిమా తీశాడు. కేజీఎఫ్‌ రెండు భాగాలతో ప్రఖ్యాతి గాంచిన  హోంబళే ఫిల్మ్స్ సంస్థ ‘కాంతార’ తో మరో ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అసలు ‘కాంతార’ లో వున్నదేమిటి, దీన్నెందుకు తప్పకుండా చూడాలీ అనే అంశాలు పరిశీలిద్దాం...  

కథ

1846లో ఓ దక్షిణ కర్ణాటక రాజు మనశ్శాంతి లేక అడవిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన ఓ శిల ప్రశాంతతని చేకూరుస్తుంది. అది గిరిజనులు పూజించే దైవమహిమగల శిల. దాన్ని అడుగుతాడు. దాని బదులు వాళ్ళకి చాలా భూమిని దానమిస్తాడు. 1970 లలో ఆ రాజు వంశస్థుడు ఆ భూమిని క్లెయిమ్ చేస్తూ వస్తాడు. కోర్టు కెళ్తాడు. కోర్టు గుమ్మంలోనే రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఇదంతా ఆ శిలలో దాగున్న దైవం భూత కోలా మహిమ అనుకుంటారు. గిరిజనులు పూర్వం నుంచీ ప్రతీ యేటా భూత కోలా పండుగ జరుపుకుంటూ వుంటారు. దాన్ని కోలం అంటారు.

1990 లలో ప్రస్తుత కథా కాలానికొస్తే, ఆ గిరిజన గ్రామానికి భూస్వామి దేవేంద్ర (అచ్యుత్ కుమార్) అండగా వుంటాడు. ఇతను రాజు వంశస్థుడే. దొరగా గిరిజనుల సంక్షేమం చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అతడికి సహాయంగా శివ(రిషభ్ శెట్టి) వుంటాడు. ఇతను కంబళ పోటీల్లో (దున్నపోతు పందాలు) మొనగాడు. ఇతడికి కష్టపడి కుటుంబాన్ని ఈడ్చుకొచ్చే కమల (మానసీ సుధీర్) అనే తల్లి వుంటుంది. ఇతను నేస్తాలతో తిరుగుతూ, ఫారెస్ట్ గార్డు ట్రైనింగు పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడే ఉద్యోగంలో చేరిన గిరిజనురాలు లీల(సప్తమీ గౌడ) ని ప్రేమిస్తూ వుంటాడు.

ఈ ప్రాంతానికి ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళీ(కిశోర్) కొన్ని చర్యలు చేపడతాడు. గ్రామస్థులు అడవిని పాడు చేస్తున్నారనీ, గ్రామానికి కంచె వేయడం ప్రారంభిస్తాడు. దీన్ని శివ అడ్డుకుంటాడు. వందల సంవత్సరాలుగా ఇక్కడి పౌరులమైన తాము అడవి అందించే ప్రతిదాన్నీ అనుభవించడానికి అర్హులని వాదిస్తాడు. ఈ వివాదం పెరిగి పెరిగి ఘర్షణకి దారి తీసి, ఫారెస్ట్ ఆఫీసర్ మీద హత్యాయత్నం కేసులో ఇరుక్కుని తప్పించుకుంటాడు శివ.

ఇప్పుడు శివ ఈ కేసులోంచి ఎలా బయటపడ్డాడు? మొత్తం గ్రామాన్నే కాజేసే ఇంకా పెద్ద కుట్రని ఎలా ఎదుర్కొన్నాడు? దైవం భూత కోలా పాత్రేమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులుగా తేలారు? చివరికి శివ ఏమయ్యాడు? ఈ ప్రశ్నల కి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

జానపద సాహిత్యాన్ని వాడుకుని ఈ కన్నడ ప్రాంతీయ కథని చెప్పారు. భూత కోల, దైవారాధన, నాగారాధన, కంబళ వంటి స్థానిక సంస్కృతులకి ఫ్యూడలిజం, పర్యావరణ పరిరక్షణ, స్మగ్లింగ్, అటవీ భూ ఆక్రమణల అంశాల్ని మేళవిస్తూ - దక్షిణ కన్నడలోని భూత కోలా, కంబళ, కోళ్ళ పందాలు సహా ఆచారాల్ని భాగం చేశారు. సామాజికంగానూ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కుల సోపాన క్రమం కారణంగా చెప్పలేనంత అఘాయిత్యాలకి గురవుతున్న స్థానిక గిరిజనుల బాధలని ఆలోచనాత్మకంగా చిత్రించారు. 

2017 లో అభయ్ సింహా మత్స్యకారుల కుట్ర కథ పడ్డాయి తీసినప్పుడు షేక్స్ పియర్ నాటకం మాక్బెత్ ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో కూడా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని కథ చెప్పడానికి యక్షగానాన్ని ఉపయోగించాడు. పురాతనం అధునాతనం విలువల్ని యక్షగానంతో తేటతెల్లం చేశాడు. భూత కోలా జానపద గీత ప్రయోగం కూడా చేశాడు. అయితే ఇది ఆర్ట్ సినిమా కోవకి చెందింది. దీనికి జాతీయ అవార్డు లభించింది.

కాంతార దక్షిణ కన్నడ యాసలో వుంటుంది. మొత్తం శక్తివంతమైన నేపథ్యాన్ని యాక్షన్ జానర్ లో థ్రిల్లింగ్ గా చెప్పారు. యాక్షన్, థ్రిల్, విశ్వాసాలు, జానపద రసపోషణ - వీటి అందమైన సమ్మేళనం ఇటీవలి కాలంలో వెండితెరమీద చేసిన ఉత్తమ ప్రయత్నాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కథలనేవి స్థానిక జీవితంలోనే చాలా వున్నాయనీ, వెతికితే రత్నాలు దొరుకుతాయనీ విశేషమైన రీసెర్చి చేసినట్టు అన్పించే కళాత్మక ప్రయోగం. హిందీలో తుంబడ్ (2018) అనే హార్రర్ కూడా ఈ కోవకి చెందిన జానపద కథల సమ్మేళనంతో కళాత్మకంగా తెరకెక్కిన హిట్ సినిమానే.

నటనలు- సాంకేతికాలు

రాసి, తీసి, నటించిన రిషభ్ శెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిరిజన శివ పాత్రలో రిషభ్ శెట్టి అనే తను కన్పించనంతగా లీనమై పాత్ర పోషణ చేశాడు. ఆనాడు మృగయాలో గిరిజన పాత్ర నటించిన మిథున్ చక్రవర్తిలాగా. పాత్ర ఎక్కడా కుదురుగా వుండదు. మెరుపు వేగంతో పరిగెడుతూ వుంటుంది. ఇందులోనే నేస్తాలతో అల్లరి చేసుకోవడం, తల్లి చేతిలో దెబ్బలు తినడం, ప్రేమించిన అమ్మాయితో సరసాలాడ్డం, తాగడం, కోళ్ళు చేపలు వండుకుని తినడం, దొరకి బంటుగా నిరూపించుకోవడం, ఫారెస్ట్ ఆఫీసర్ తో సిగపట్లకి దిగడం అన్నీ జరిగి పోతూంటాయి.

ఎంత పోరాట పటిమ వున్నా వ్యవస్థ చేతిలో బలయ్యే సామాజిక వర్గమే తనది. ఈ సహజత్వం కోసం హీరోయిజాన్ని దూరం పెట్టి జైలు సీన్లు నటించాడు. గిరిజనుడే కని పిస్తాడు తప్ప తెలుగు స్టార్, తెలుగు హీరో సీజీతో జైలు గోడలు బద్దలు కొడుతూ కనిపించడు. ఇందుకేనేమో పానిండియా స్టార్ ప్రభాస్ రెండు సార్లు ఈ సినిమా చూసినట్టుంది. ఇక ఇరవై నిమిషాల క్లయిమాక్స్ అయితే అపూర్వం, అద్భుతం- ఇంకేమైనా చెప్పుకోవచ్చు. క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు వెళ్ళి వెళ్ళి పతాక స్థాయికి చేరేసరికి -తన పాత్రే పూర్తిగా మారిపోయి (metamorphosis- రూపాంతరం, రూపవిక్రియ) - ప్రేక్షకులు అవాక్కయ్యేలా క్లోజింగ్ ఇమేజితో బలమైన స్టాంపు గుద్ది వదిలాడు. పాత్ర ఇలా మారిపోతుందని ఎవ్వరూ వూహించరు! ఈ పాత్రలో రౌద్రంగా ఆకాశాన్నంటిన నటనా, నాట్యమూ రిషభ్ శెట్టిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టేశాయి! అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే లేచి చప్పట్లు కొడతారు.

హీరోయిన్ గా తెల్లటి వర్ణపు మెరిసిపోయే గ్లామర్ నటిని తీసుకోకుండా, గిరిజనురాలిలా కన్పించే స్థానిక నటి సప్తమీ గౌడని తీసుకోవడం మంచి పని. లేకపోతే బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ని తెచ్చుకుంటే 5 కోట్లు ఆమెకే పోయేవి. పైగా కొండపొలం లో రకుల్ ప్రీత్ సింగ్ లా విచిత్రంగా వుండేది. సప్తమీ గౌడ నటన చెప్పుకోదగ్గది. ఫారెస్ట్ గార్డుగా పై అధికారి చేతిలో అవమానాలు భరిస్తూ, చివరికి కోపం బద్ధలై ఆయుధానికి పనిచెప్పే దృశ్యం కథలోంచి పుడుతూ వచ్చిన సహజ భావోద్వేగమే.    దొరగా అచ్యుత్ కుమార్ మృదువైన నటన, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ కరకు ప్రవర్తన కథనానికి పాజిటివ్ నెగెటివ్ డైనమిక్స్ గా వుంటాయి. రిషభ్ తల్లిపాత్ర నటించిన మానసి సుధీర్ సంఘర్షణాత్మక పాత్ర, నటన కూడా గుర్తుండి పోతాయి. ఇక రిషభ్ నేస్తాలుగా నటించిన ఆర్టిస్టులు సహా మిగిలిన నటీనటులందరూ ఒక పకడ్బందీ గిరిజన వాతావరణ సృష్టికి తోడ్పడ్డారు.

సాంకేతికంగా చూస్తే ఇదొక వండరే. అటవీ ప్రాంతాన్నీ, ప్రకృతినీ, గిరిజన నివాసాల్నీ తెర మీద కళాత్మకంగా ఆవిష్కరించాడు కెమెరామాన్ అరవింద్ కశ్యప్. రాత్రి పూట దృశ్యాల లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే  -ముఖ్యంగా క్లయిమాక్స్ యాక్షన్ దృశ్యాలు - చిత్రకారుడు పెయింటింగ్ వేసినట్టున్నాయి. అజనీష్ లోకనాథ్ ట్రైబల్ బాణీలు, అడవిలో నిగూఢంగా వున్న శక్తి తాలూకు హార్రర్ బాణీలూ ఇవన్నీ నేటివిటీనిసంస్కృతినీ దాటిపోలేదు.  అడవిలో రిపీటయ్యే భూత కోలా ఆర్తనాదం కాంతార టైటిల్ ని ఎలుగెత్తి చాటుతూంటుంది. కాంతార అంటే మాయారణ్యం. 

చివరికేమిటి

ఇందులో కొన్ని బలహీనతలు లేకపోలేదు. లీలతో శివ పాత్ర సంబంధం ఫ్లాట్ గానే కాక అసహజంగా వుంది. గిరిజన కుటుంబం నుంచి చదువుకుని ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం సంపాదించుకునే స్థితికి ఎదిగిన  లీలని కాస్తయినా ఆదర్శంగా చూపాలనుకోలేదు దర్శకుడు. అల్లరిగా వుండే శివ ఆమె విషయానికొచ్చేసరికి గౌరవిస్తూ వుండుంటే, చదువుకున్న తన పట్ల అతడి అభిమానం చూసి ఆమె ప్రేమిస్తూ వుండుంటే ప్రేమ ట్రాకులో డైనమిక్స్ వుండేవి. ఇలాకాక శివ ఆమెని గిచ్చి, గిల్లీ, పక్కలోకి లాగే దృష్టితోనే వుండేసరికి పాత్ర చిత్రణ మట్టి కరిచింది. ఇలాటి బలహీనతలు మరికొన్నున్నాయి.

ఇంతా చేసి ఇది కథ కాదు, గాథ! గాథ ఇంత హిట్టయ్యిందా? గాథలతో తెలుగు సినిమాలు గోతిలో పడుతోంటే కన్నడలో హిట్టా? అదేమరి. ఇదెలా సాధ్యమైందో ఈవారం స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

—సికిందర్
 

16, అక్టోబర్ 2022, ఆదివారం

1233 : సండే స్పెషల్ రివ్యూ!


 

    1813 లో సుప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన క్లాసిక్ నవల ఫ్రైడ్ అండ్ ప్రిజుడిస్ 2005 లో బ్రిటన్ మూవీగా తెరకెక్కింది. 1938 నుంచీ ఈ నవల 17 సార్లు తెరకెక్కింది, సీక్వెల్స్ కాక. 2005 లో తీసిన లేటెస్ట్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వుంది. ఇందులో కొన్ని ముఖ్య పాత్రల్లో కైరా నైట్లీ (ఎలిజబెత్ బెన్నెట్ పాత్ర), మాథ్యూ మెక్‌ఫాడియన్ (మిస్టర్ డార్సీ పాత్ర), బ్రెండా బ్లెథిన్ (మిసెస్ బెన్నెట్ తల్లి పాత్ర) నటించారు. ఎలిజబెత్ అలియాస్ లిజ్జీగా నటించిన కైరా నైట్లీది ప్రధాన పాత్ర. 20 ఏళ్ళ వయస్సులో ఈమె నటించిన ఈ పాత్రతో ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. ఇంకా సంగీతం, కళా దర్శకత్వం, వస్త్రాలంకరణ  విభాగాల్లో కూడా ఆస్కార్స్ కి నామినేట్ అయింది ఈ క్లాసిక్ రోమాంటిక్ డ్రామా.

        దుగురు కూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఓ కుటుంబం పడే తిప్పలు హాస్యంగా, చమత్కారంగా, వినోదాత్మకంగా దృశ్యీకరణ చేశాడు కొత్త దర్శకుడు జో రైట్. ఇంగ్లాండులోని గ్రామీణ లాంగ్ బర్న్ ఎస్టేట్ లో నివాసముండే మిస్టర్ అండ్ మిసెస్ బెన్నెట్ లకి జేన్, లిజ్జీ, మేరీ, కిట్టీ, లీడా అనే ఐదుగురు కూతుళ్ళు. వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయన్న ఆందోళనతో వుంటుందెప్పుడూ మిసెస్ బెన్నెట్. ఆస్తి సమస్య కూడా వుంది. తమకి మగ సంతానం లేకపోవడంతో ఆస్తికి వారసుల్లేకుండా పోయారు. ఆస్తి వుండాలంటే  ఓ అల్లుడైనా రావాలి.

        ఆ అల్లుడు మిస్టర్ బింగ్లే రూపంలో వచ్చి వూళ్ళోనే ఒక ఎస్టేట్ లో మిత్రుడు మిస్టర్ డార్సీతో కొత్తగా దిగాడు. బాగా ధనవంతుడు. పార్టీ కూడా ఇస్తున్నాడు. అయితే పదండి పదండి రిచ్ అల్లుడు దొరికాడు, మీ అయిదుగుర్లో ఎవరు నచ్చుతారో రోమాంటిక్ గా బిహేవ్ చేయండని కూతుళ్ళని వేసుకుని  పార్టీకి చేరుకుంటుంది మిసెస్ బెన్నెట్. 

ఇద్దరు అల్లుళ్ళ వైభవం

ఒకరు కాదు, ఇద్దరు అల్లుళ్ళు దొరుకుతారు. మిస్టర్ బింగ్లే పెద్ద కూతురు జేన్ తో కనెక్ట్ అయిపోతే, బింగ్లేకి పక్క వాద్యంగా వచ్చిన మిస్టర్ డార్సీ రెండో కూతురు లిజ్జీని సెట్ చేసుకుంటాడు. ఇంతలో దూరపు బంధువు మిస్టర్ కొలీన్స్ వచ్చి, అల్లుడుగా మారి ఆస్తిని స్వీకరించడానికి తనకేం అభ్యంతరం లేదని లిజ్జీకి ప్రపోజ్ చేస్తాడు. లిజ్జీ వెళ్ళిపొమ్మంటుంది. మిస్టర్ డార్సీ బంధువు లేడీ కేథరిన్ వచ్చేసి, డార్సీకి నా కూతుర్ని ఇస్తున్నాను, నువ్వు డార్సీకి దూరంగా వుండకపోతే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చి పోతుంది. ఇవన్నీ వుండగా చిట్ట చివరి కూతురు పదిహేనేళ్ళ లీడా, మిస్టర్ డార్సీ పరిచయం చేసిన  సైనికుడితో చెప్పా పెట్టకుండా లేచిపోతుంది!

        ఇలా ఇదొక చిక్కులమారి వ్యవహారంగా మారిపోతుంది. లీడా లేచిపోవడంతో ఆ అప్రదిష్ట మిగతా కూతుళ్ళ పెళ్ళిళ్ళకి అడ్డంకిగా మారుతుంది. లిజ్జీకి ఇంకో షాక్ తగుల్తుంది. తను రిజెక్ట్ చేసిన కొలీన్స్ తో ఫ్రెండ్ చార్లొట్ పెళ్ళికి సిద్ధపడుతుంది. పేదరికం వల్ల తనకి పెళ్ళయ్యే అవకాశం లేదని, వయస్సు మీద పడుతూ కుటుంబానికి భారంగా వున్నాననీ  చెప్పుకుంటుంది. కొలీన్స్ ఎలాటి వాడనేది అనవసరమని అంటుంది.

        కథ ప్రధానంగా లిజ్జీ- డార్సీల మధ్య ఒడిదుడుకుల ప్రేమ సంబంధంతో వుంటుంది. దీనికి సమాంతరంగాలిజ్జీ అక్క జేన్ - బింగ్లీ మధ్య ప్రేమ కథ వుంటుంది. డార్సీ తో లిజ్జీ సంబంధం ఎలా మారుతుందంటే, బెన్నెట్స్ చాలా ధనవంతులు కానందున, సమాజంలో తన స్థాయి లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోలేనని దూరమవుతాడు. లీడా లేచిపోయిన అప్రదిష్ట ఇలా వెన్నాడుతూంటే, తెర వెనుక డార్సీయే లండన్లో లీడాని పట్టుకుని సైనికుడితో పెళ్ళి జరిపించి ఇంటికి తీసుకొస్తాడు. అయినా పెద్దకూతుళ్ళకి పెళ్ళిళ్ళు లేకుండా చిన్న దానికి పెళ్ళేమిటని ఎత్తుపొడుపులు తప్పని పరిస్థితి వుంటుంది. మిస్టర్ అండ్ మిసెస్ బెన్నెట్ ల సమస్యలు జటిలమవుతూ పోతాయి. ఇవన్నీ ఎలా చక్కబడ్డాయో సినిమా చూడాల్సిందే.

నవల సంక్షిప్త రూపం

సాహిత్య రచనల్ని సినిమాలుగా మార్చినప్పుడు చాలా మార్పులు అనివార్యంగా జరుగుతాయి. దీనికి ప్రైడ్ అండ్  ప్రిజుడీస్ మినహాయింపు కాదు. నవలని బాగా తగ్గించి, అమ్మాయిల పెళ్ళిళ్ళు అనే ప్రధాన కథని మాత్రమే పట్టుకుని, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో కూర్చినట్టు స్క్రీన్ ప్లే రచయిత్రి డెబోరా మొగాచ్ చెప్పింది. సినిమా నిడివి రెండు గంటలా ఎనిమిది నిమిషాలు వచ్చింది. నవల్లోని చాలా పాత్రల్నీ, సన్నివేశాల్ని తొలగించి, కేవలం అమ్మాయిల పెళ్ళిళ్ళ గురించిన పాయింటు మీదే దృష్టి పెట్టి, ఏక సూత్రతతో కథ నడిపినట్టు సమాచారం. నవల్లోని కథని సినిమా కథ గా మార్చారు.

        ఐదుగురు కూతుళ్ళ పెళ్ళిసమస్య బరువైన కథే. అయితే జేన్ ఆస్టిన్ కూడా దీన్ని భారంగా, దుఖపూరితంగా ఎక్కడా రాయలేదు. దీన్ని సినిమాకి కూడా పాటించారు. లిజ్జీతో రెండు సన్నివేశాలు కాస్త విషాదంగా వుంటాయే తప్ప మిగిలినదంతా వినోదాత్మకమే. ప్రధాన పాత్ర లిజ్జీగా నటించిన కైరా నైట్లీ కోసం ఈ సినిమా ఎన్ని సార్లయినా చూడొచ్చు.

        19వ శతాబ్దపు ఇంకా విద్యుచ్ఛక్తి, మోటారు వాహనాలు లేని కాలపు జీవితం  మనకి జనరల్ నాలెడ్జిని ప్రసాదిస్తాయి. ఆనాటి పురాతన కట్టడాలు, భవనాలు, గ్రామీణ పరిసరాలు, వ్యాపారాలు, గుర్రబ్బగ్గీలు, కాలినడక ప్రయాణాలు... ప్రతీదీ ఆ కాలంలోకి తీసికెళ్ళి పోతాయి. ఆ నాటి బ్రిటిష్ సమాజం, కట్టుబాట్లు, నమ్మకాలు, వెనుక బాటు తనం...ఇవి కూడా ఒక అవగాహన కల్గిస్తాయి. సౌజన్యం జేన్ ఆస్టిన్. ఈ నవల రాసిన నాల్గేళ్ళకే 41 వ యేట ఆమె మరణించింది. ఆమెకి నివాళిగా మాత్రం సినిమాల పరంపర కొనసాగుతూనే వుంది...

—సికిందర్

11, అక్టోబర్ 2022, మంగళవారం

1230 : సందేహాలు - సమాధానాలు

Q :    మీ బ్లాగులో పొన్నియన్ సెల్వన్ రివ్యూ రాలేదు. ఎవాయిడ్ చేసినట్టున్నారు. మీ విశ్లేషణ మేం తెలుసుకో వద్దా?
—దర్శకుడు
A : దాన్ని విశ్లేషించాలంటే చాలా చిక్కులు విడదీయాలి. అది మన వల్ల కాదన్పించింది. ఒక ఇంటర్వూ లో మణిరత్నం మాట గుర్తు చేసుకోవాలి. ఆ నవల చదివి పక్కన పడేయ్, అందులోంచి లైను లాగి కథ చెయ్- అని రైటర్ కి చెప్పినట్టు ఇంటర్వ్యూలో వుంది. నవల లోంచి లైను లాగినట్టుందా? ఒక ఇంజను, అది లాగే బోగీలూ వుంటే లైను అన్పించేది. ఇంజనే (ప్రధాన పాత్ర) లేదు, అన్నీ బోగీలే (వివిధ పాత్రలు) వున్నాయి. ఒక్కో బోగీతో అక్కడిక్కడే ఒక్కో కథ. ఎపిసోడిక్ కథనం. డాక్యుమెంటరీలకి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ బాపతు ఎపిసోడ్ల వారీ కథనం. పేర్లే గుర్తుండని అధిక పాత్రలు, వాటి బంధుత్వాలూ.

లైను లాగితే సినిమా కథ లా వుండాలి. ప్రధాన పాత్ర - అది ఎదుర్కొనే సమస్య- పరిష్కారమనే ఏర్పాటు. అప్పుడు కథ స్పష్టంగా అర్ధమవుతుంది. నవల్లో సినిమాకి కావాల్సిన కథని పట్టుకోలేక పోయారు. విషయాన్ని యూనివర్సల్ అప్పీల్ కి దూరంగా తమిళ ప్రాంతీయానికి పరిమితం చేస్తున్నామని గుర్తించ లేకపోయారు. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు యూనివర్సల్ గా అర్ధమయ్యేట్టు, సింపుల్ కథతో వుంటాయి. దీని మీద హై యాక్షన్ డ్రామా క్రియేట్ చేస్తారు. బ్రహ్మాస్త్ర లో కూడా ఇది కన్పిస్తుంది. ఈ మెగా బడ్జెట్ మూవీలో ఆరే ఆరు పాత్రలతో, సూటిగా వుండే సింపుల్ కథతో, యాక్షన్ హెవీగా వుంటుంది. మణిరత్నం పానిండియా తీస్తున్నామనుకుని తీసింది తమిళ ప్రేక్షకులకి పరిమిత మయ్యే ప్రాంతీయాన్ని.

పానిండియా లేదా యూనివర్సల్ మూవీగా తీయాలనుకున్నప్పుడు  సరైన కథా పరిచయం చేయకుండా, ఇది తమిళులకి తెలిసిన చోళుల చరిత్రే కాబట్టి, తమిళ ప్రేక్షకుల కుద్దేశించినట్టుగా కథా రచన సాగింది. దీంతో ఇతరులకి ఈ కథ, పాత్రలు ఏ మాత్రం అర్ధంగాకుండా పోయాయి. ఒక మ్యాపు వేసి చూపిస్తూ, ఫలానా చోళ రాజ్యం ఫలానా ఈ కాలంలో, తమిళనాడులో ఫలానా ఈ ప్రాంతంలో వుండేదన్న అవగాహన కూడా ఏర్పర్చకుండా, చోళ వంశాన్ని వర్ణించకుండా, ఏ వివరాలూ అందించకుండా, నేరుగా కథలో కెళ్ళిపోతే ఏమర్ధమవుతుంది?

పోనీ గాథలా వుందా అంటే గాథ కూడా కాదు. గాథ పాత్ర- సమస్య- సమస్యతో సంఘర్షణ లేని కథనంగా ముగిసి పోతుంది. మరెలా వుంది? ఎపిసోడిక్ గా వుంది. ఒక పాత్రతో ఒక సమస్య పుట్టడం తగ్గిపోవడం, మళ్ళీ ఇంకో పాత్రతో ఇంకో సమస్య పుట్టడం తగ్గిపోవడం - ఇలా రిపీట్ అవుతూ వుంటుంది ఎపిసోడిక్ కథనం.

ఫస్టాఫ్ ప్రధాన కథలేదు, సెకండాఫ్ దాని కొనసాగింపూ లేదు. ఎన్నో పాత్రలు, ఎందరో నటీనటులు, భారీ హంగామా, విషయం మాత్రం శూన్యం. ఏం చెబుతున్నాడో, ఏం చూస్తున్నామో మూడు గంటలూ అర్ధం గాదు. ఈ సందర్భంగా 2010 లో ప్రకాష్ ఝా తీసిన హిందీ రాజనీతి గుర్తుకొస్తుంది. మహాభారతాన్ని నేటి రాజకీయాలకి అన్వయిస్తున్నానని చెప్పి తీసిన ఈ భారీ మల్టీ స్టారర్ లో, ఎన్నో పాత్రలూ వాటి బక్వాస్ (వాగుడు) తప్ప ఏమీ అర్ధంగాక ఫ్లాపయ్యింది.

కాల్పనిక చరిత్ర తీస్తున్నప్పుడు హిస్టారికల్ ఫిక్షన్ జానర్ లో ఇలాటి సినిమాలు ఏమేం వచ్చాయీ, వాటినెలా తీశారూ రీసెర్చి చేయనట్టుంది. చేసి వుంటే ఇన్నేసి పాత్రల కలగూరగంప నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు. చోళ వంశంలో ఒక పాత్ర తీసుకుని, అది ఏ ఘట్టం ద్వారా ప్రసిద్ధి చెందిందో అది మాత్రమే తీసుకుని, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ చేసేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే- 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథ గానే తీశాడు. అంతేగానీ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు.

ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం -అగ్నిపరీక్ష లాంటిది - 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దాని కోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే వాటిని పక్కన పడేశాడు స్పీల్ బెర్గ్. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. దాంతో కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఇది కరెక్ట్ అన్పించింది. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలనే బాక్సాఫీసు అప్పీలున్న పాయింటుతో, ప్రపంఛ వ్యాప్తంగా సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేట్టు, సింపుల్ గా తీసి పెద్ద విజయం సాధించాడు.
 
పొన్నియన్ సెల్వమ్ కి ఇంతకంటే రివ్యూ అవసరం లేదేమో. హిస్టారికల్ సినిమా ఎలా తీయకూడదో నేర్చుకోవడానికి మాత్రం ఈ సినిమా చూడాలి. ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది. నమస్తే అండి.

Q :    నమస్కారమండి. మలయాళం భీష్మ పర్వం తెలుగు డబ్బింగ్ హాట్ ‌స్టార్ లో ఉంది.లూసిఫర్ లాగానే చిరంజీవి గారు ఈ మూవీని కూడా రిమేక్ చేస్తున్నారని టాక్. రివ్యూ చేయగలరా?
—అశ్వత్ శర్మ, నల్లగొండ
A :   నమస్కారం. ఇలాటి అభ్యర్ధనలు వస్తూ వుంటాయి. అడిగిన వాళ్ళందరికీ సినిమాలు చూసి రివ్యూలు రాయడం సాధ్యం కాదు. ఇచ్చిన రివ్యూలు చూసుకోవడమే. రేయికి వేయి కళ్ళు కూడా మీరడిగారు. అది ఆ వారం విడుదలయ్యింది కాబట్టి మీరు అడగకపోయినా రాసేవాళ్ళం. ఈ సినిమాలు వదలండి. మేకింగ్ కి, రైటింగ్ కి పనికొచ్చే, స్పూర్తినిచ్చే, నేర్చుకోనిచ్చే హాలీవుడ్ క్లాసిక్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు ఒకటొకటిగా రాసుకుపోదామంటే కుదరడం లేదు. ఒక మేకర్ మరీమరీ అడిగిన అపొకలిప్టో చాలా కాలంగా పెండింగులో వుంది. వచ్చే వారం నుంచి దీని సంగతి చూడాలి.

Q :   మీ ఒకే ఒక జీవితం రివ్యూ బాగుంది. సైన్సు ఫిక్షన్ లో హెవీ మదర్ సెంటిమెంట్. బ్యాక్ టు ది ఫ్యూచర్ చూసుంటే మదర్ సెంటిమెంట్ ఎంతలో ఉండాలో, ఎలా ఉండాలో  తెలిసేది. అన్నట్టు, నేను ఒక సైన్సు ఫిక్షన్ (టైం లూప్) రోమాంటిక్ స్టోరీ ట్రీట్మెంట్  రాసి రిజిస్టర్ చేసి, ఇప్పుడు స్క్రీన్ ప్లే రాస్తున్నాను. పూర్తయిన తరువాత మీకు కాక ఎవరికి ఇస్తాను ఫీడ్ బాక్ కోసం.
—ఆర్సీ ఎస్, దర్శకుడు
A :   థాంక్స్. మీ యాక్టివిటీస్ బావున్నాయి. ఇలాగే ప్రొసీడవండి, ఎక్కడో తగుల్తుంది. సైన్స్ ఫిక్షన్ భాషలోనే చెప్పుకుంటే స్ట్రగుల్ అనేది లో- ఫ్రీక్వెన్సీ థాట్, యాక్టివిటీస్ అనుకుంటే అది హై ఫ్రీక్వెన్సీ థాట్. దీంతో యూనివర్స్ కి కనెక్ట్ అవుతాం. త్వరగా గమ్యం చేరతాం. ఒకే ఒక జీవితం కోసం జానర్ రీసెర్చి చేయలేదు దర్శకుడు. అసలు టైమ్ ట్రావెల్ జానర్ మర్యాదలన్నీ బ్యాక్ టు ది ఫ్యూచర్ లో సమకూర్చి పెట్టాడు దర్శకుడు రాబర్ట్ జెమెకిస్. దీని వివరణ అంతా స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ రాసిన స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్ పుస్తకంలో వుంది.

—సికిందర్ 
(మరికొన్ని ప్రశ్నలు ఆదివారం)


10, అక్టోబర్ 2022, సోమవారం

1229 : రివ్యూ!

రచన- దర్శకత్వం : లక్ష్మణ్ కృష్ణ
తారాగణం : బెల్లంకొండ గణేష్, ర్షా బొల్లమ్మ, దివ్య శ్రీపాద, ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సూర్య
బ్యానర్ : సితార ఎంటర్టయిన్మెంట్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 5, 2022
***
        సరా విడుదలల్లో స్వాతి ముత్యం ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు. దసరాకి ఒకవైపు మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్’, మరోవైపు కింగ్ నాగార్జున ఘోస్ట్ పెద్ద స్టార్స్ సినిమాలు. ఈ రెండిటి మధ్య ఓ చిన్న సినిమాగా స్వాతి ముత్యం నిలబడే అవకాశముందా? నిలబడే విషయమేమైనా వుందా? అసలిందులో వున్న కొత్తదనమేమిటి? ఇవి తెలుసుకుందాం... 

కథ

పిఠాపురం లోని విద్యుత్ శాఖలో బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) క్లర్కుగా పని చేస్తూంటాడు. తల్లిదండ్రులు (రావు రమేష్, ప్రగతి), డాక్టర్ బుచ్చిబాబు (వెన్నెల కిషోర్) అనే మిత్రుడూ వుంటారు. ఉద్యోగంలో చేరాడు కాబట్టి తల్లిదండ్రులు పెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. భాగ్యలక్ష్మి (వర్షా బొల్లమ్మ) అనే స్కూలు టీచర్ తో పెళ్ళి చూపులు, పెళ్ళీ కుదురుతాయి. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (నరేష్, సురేఖా వాణి), పెదనాన్న (గోపరాజు రమణ) జోరుగా పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళింట్లో బిడ్డనెత్తుకుని శైలజ (దివ్యా శ్రీపాద) అనే క్రైస్తవ అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఈ బిడ్డ నీదే అంటుంది గణేష్ తో. అవును నాదే అంటాడు గణేష్. పెళ్ళింట్లో గోలగోల అవుతుంది. పెళ్ళాగిపోతుంది. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బిడ్డని గణేష్ చేతుల్లో పడేసి శైలజ కూడా వెళ్ళిపోతుంది.

ఏమిటీ పరిస్థితి? అసలేం జరిగింది? బిడ్డని కన్న గణేష్ ఎందుకీ పెళ్ళికి సిద్ధపడ్డాడు? శైలజ ఎవరు? ఆమెతో గణేష్ కేం జరిగింది? ఇప్పుడు బిడ్డతో ఒంటరిగా మిగిలిన గణేష్ ఏం చేశాడు? భాగ్యలక్ష్మి సంగతేంటి? ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు.

ఎలావుంది కథ

రోమాంటిక్ డ్రామా జానర్ కి చెందిన రొటీన్ కథ. దీనికి యూత్ అప్పీల్ తక్కువ. ఇందులో హీరోయిజం వుండదు. తమ ప్రేమ సమస్యని హీరో హీరోయిన్లు తాము పరిష్కరించుకునే స్వావలంబనతో లేక, పెద్దల చేతుల్లో పరిష్కారమయ్యే రోమాంటిక్ డ్రామా జానర్ కథ. అయితే తెలుగులో దాదాపు అన్ని రోమాంటిక్ డ్రామాలు సెకండాఫ్ లో హీరో హీరోయిన్లు విడిపోవడం, విషాదంగా మారడం జరుగుతాయి. విషాదం వర్కౌట్ కాక అవన్నీ ఫ్లాపవుతున్నాయి. ప్రస్తుత రోమాంటిక్ డ్రామా ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ కామెడీతోనే నడవడంతో బ్రతికి బైట పడింది.    

ఈ కథకి కేంద్ర బిందువు సరొగసీ (అద్దె గర్భం) అంశం. దీన్ని సీరియస్ గా కాకుండా హిందీ మిమీ (2021) లో లాగా హాస్య ధోరణిలో చెప్పడం. టౌను పాత్రలతో టౌను కథగా తీయడం. కుటుంబ కాలక్షేపం. అయితే ఫస్టాఫ్ పెళ్ళి చూపులు, ప్రేమ, పెళ్ళీ ఘట్టం వరకూ 50 నిమిషాలు విషయం లేక డల్ గా సాగుతుంది. పెళ్ళిలో బిడ్డనెత్తుకుని వచ్చే శైలజ పాత్రతో కథ మొదలవుతుంది. అక్కడ్నించి సెకండాఫ్ సరొగసీ పాయింటుతో కామెడీకి కాస్త ఊపొస్తుంది. ఇంకోటేమిటంటే, ఈ కథ సాగదీస్తే నిలబడక పోవచ్చని గంటా 50 నిమిషాల్లోనే ముగించడం. అయితే రోమాంటిక్ డ్రామా - కుటుంబ కాలక్షేప సినిమాలు కురచ నిడివితో తృప్తిపరుస్తాయా అన్నది ప్రశ్న.

కృష్ణ వ్రింద విహారి లో హీరోయిన్ కి పిల్లలు పుట్టని విషయం దాచి పెట్టి ఆడే నాటకంగా కథ వుంటుంది. ఈ నాటకాలు ఔట్ డెటెడ్ కథలు. ఇది ఫ్లాపయ్యింది. ప్రస్తుత కథలో విషయం దాచిపెట్ట లేదు. పెళ్ళికి ముందు పుట్టిన బిడ్డతో బయట పడ్డ గుట్టుకి పరిష్కారం వెతికే హాస్య కథగా వుంది. అయితే ఇది చెప్పాల్సిన అసలు కథ కాదు. కథలో వున్న అసలు కథ పట్టుకోలేక పోవడం ఈ కథతో వచ్చిన సమస్య.

ఇక చెప్పిన కథకి హాస్య కథనం మరీ అద్భుతమేమీ కాదు. ఎందుకంటే సమస్య పుట్టించిన, దాంతో కథ నడపాల్సిన, ప్రధాన పాత్ర అయిన హీరో, పాసివ్ గా వుండిపోవడంతో, హాస్య ప్రహసనాలు అతను సృష్టించడం లేదు. ఇతర పాత్రలు సృష్టించుకుంటున్నాయి. అతను ఏ పరిస్థితిలో వేరే అమ్మాయి సరొగేట్ గా బిడ్డని కనాల్సి వచ్చిందో, పెళ్ళి చెడిన సమయంలో చెప్పేసి వుంటే, యాక్టివ్ హీరో పాత్రయ్యే వాడు. చెప్పక పోవడం వల్ల అతను వేరే అమ్మాయితో శారీరక సంబంధంతో బిడ్డని కన్నాడని ఇతర పాత్రలు అపార్ధం చేసుకుంటున్నాయి. ఈ అపార్ధం తొలిగేదెలా అన్నది పాయింటుగా చేసుకుని కథ నడిపారు. ఇది రాంగ్. చెప్పాల్సిన అసలు కథ ఇది కాదు.

ముందు కథకి ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే, అపార్ధం అనేది నేటి బాక్సాఫీసు ఫీలయ్యే పాయింటు కాదనీ, నేటి ఆధునిక కాలపు కొత్త  సమస్య అయిన - సరొగేట్ బిడ్డతో కుటుంబం - సమాజం ఎలా రియాక్ట్ అవుతాయనేది  బాక్సాఫీసు అప్పీల్ నిచ్చే డైనమిక్ పాయింటవుతుందనీ తెలిసేది కొత్త దర్శకుడికి. ఇదీ చెప్పాల్సిన అసలు కథ. ముందు మార్కెట్ యాస్పెక్ట్ ని విశ్లేషించుకుని ఐడియాని నిర్మించుకోక పోతే, ఎంత క్రియేటివ్ యాస్పెక్ట్ ప్రదర్శించుకున్నా అది మార్కెట్ కి దూరంగానే వుంటుంది. ఇది సినిమాలకే కాదు, సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. సాహిత్యంలో సుత్తి కథలు చాలా వస్తున్నాయి.

అపార్ధం - సరొగేట్ సమస్యలు రెండుంటే, సమకాలీన చర్చనీయాంశం సరోగసీ  సమస్యే. కొత్త దర్శకుడిగా ఈ కొత్త సమస్య గురించి చెప్పాలి గానీ, ఇంకా అపార్ధం తొలగించడమనే అరిగిపోయిన రొటీన్ కాదు. ఈ అపార్థం తొలగించే కథకి పిఠాపురం లాంటి టౌను నేపథ్యం దాకా కూడా వెళ్ళనవసరం లేదు. ప్రొడక్షన్ కార్యాలయం వున్న నగరంలోనే  చెప్పొచ్చు. బడ్జెట్ ఆదా అవుతుంది.

కానీ ఇప్పుడు టౌను కథల ఉద్దేశం - మార్కెట్ యాస్పెక్ట్ వేరే వుంటోంది. హిందీ సినిమాల్లో నగరాల్లో ఆధునిక జీవన పోకడలతో ఉత్పన్నమయ్యే ఉపద్రవాల్ని నేపథ్యం మార్చి టౌను కథలుగా సినిమాలు తీస్తున్నారు. సరొగేట్, సహజీవనం, గే కథలు వంటి నగరపు ఆధునిక పోకడల్ని, వీటి గాలి సోకని నిద్రాణంగా వుండే టౌన్లలో ప్రవేశ పెట్టి కథలకి షాక్ వేల్యూ సృష్టించి సక్సెసవుతున్నారు. సిడ్ ఫీల్డ్ చెప్పినట్టు ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ వాడుతున్నారు. అంటే, నేపథ్యం ఒకటుంటే దానికి వ్యతిరేకంగా వుండే కథ, లేదా సీన్లు సృష్టించడం.

పిఠాపురం లాంటి నిద్రాణంగా వుండే టౌన్లో షాకింగ్ గా సరొగేట్ కథనెత్తుకుంటే ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ అవుతుంది. అపార్ధం తొలగించే కథ కాదు. ఈ షాకుతో టౌను పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటాయనేది హాస్యాయుతంగా చెపితే ఇది కథకి తగ్గ కామెడీ అవుతుంది తప్ప, అపార్ధం సృష్టించి దాంతో కామెడీ చేయడం కాదు.

బిడ్డనెలా కన్నాడో హీరో ముందే చెప్పేస్తే ఆ అసలు సమస్యతో పాత్ర, కథ రెండూ బలంగా వుండేవి. అలా కన్న బిడ్డని ఎలా అంగీకరించాలా అన్నది, అంగీకరిస్తే హీరో పెళ్ళెలా అవుతుందన్నది పరిష్కరించాల్సిన సమస్యలుగా వుండేవి. కానీ హీరో క్లయిమాక్స్ వరకూ హీరోయిన్ కీ, ముగింపు వరకూ పెద్దలకీ సరొగేట్ విషయమే చెప్పకుండా, అర్ధం లేకుండా సతమవుతూ వుంటాడు బిడ్డతో. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని చివర్లో హీరోయిన్ అడుగుతుంది. ఈ ప్రశ్నే పెళ్ళి గొడవలో (ఇంటర్వెల్లో) మనకి తడుతుంది. ప్రశ్న ఇదే, ఇంటర్వెల్లో స్థాపించాల్సిన సమస్యా ఇదే.

మరొకటేమిటంటే సమస్యగా వున్న ఆ బిడ్డకి పాత్రే లేదు. ఎత్తుకుని తిరగడం తప్ప. హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8 యాక్షన్ మూవీలో నెలల బిడ్డతో ఎంత కామెడీ వుంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. పాత్రల్ని అయ్యో పాపమని దర్శకుడు జాలిపడితే కామెడీ రాదు.  

నటనలు – సాంకేతికాలు

బెల్లంకొండ గణేష్ పాత్ర స్వాతి ముత్యం అన్పించుకోవాలీ కాబట్టి సాత్వికంగా వుండాలేమో. ఇది కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రాముడు మంచి బాలుడుగా నటించడానికేమీ లేకుండా పోయింది. కామెడీ సినిమా అన్నప్పుడు క్యారక్టర్ ఫన్నీగా వుంటూ హిలేరియస్ కామెడీలు పుట్టిస్తూ వుంటే, కొత్త హీరోగా నటన ప్రదర్శించుకునే అవకాశం వుండేది. పైగా 50 నిమిషాలు డల్ గా సాగే ఫస్టాఫ్ హుషారుగా మారేది. ఇక ఎలాగూ రోమాంటిక్ డ్రామా అన్నాక హీరో చేయాల్సింది చేసుకోక పెద్దలే చక్కబెడతారు గనుక, సెకెండాఫ్ గణేష్ కి పెద్దగా బాధ్యత లేకుండా పోయింది. పెద్దల్ని సమస్యల్లో పడేసిన వాడు సమస్యల్ని పెద్దలకే ఎలా వదిలేస్తాడో రోమాంటిక్ డ్రామాల లాజిక్ వుండని తతంగం. రెండో సినిమాతోనైనా గణేష్ యాక్టివ్ క్యారక్టర్ నటిస్తే నటుడుగా తనేమిటో తెలుస్తుంది.

టీచర్ పాత్రలో వర్షా బొల్లమ్మ కూడా అసహాయురాలే. పెళ్ళి చెడిపోయాక ఇంటికి పరిమితమై కన్పించదు. ఏం చేయాలో ఆలోచించుకోకుండా దిగులుతో వుండిపోతుంది. టీచర్ గా తన సమస్యకి తనే కుంగిపోతే విద్యార్థులకి ఏం బోధిస్తుందో అర్ధంగాదు. ఈమె పెళ్ళికి తోటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని రప్పించడం ప్రొడక్షన్ మేనేజర్ మర్చిపోయి నట్టుంది. లేక హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు రాలేక పోయారేమో. హర్ష గ్లామరస్ గా మాత్రం బావుంది. హావభావాలు పలికిస్తుంది.

వెన్నెల కిషోర్ డాక్టర్ పాత్ర కృష్ణ వ్రింద విహారి దుష్ట సమాసం టైటిల్ సినిమాలో డాక్టర్ పాత్ర లాంటిదే. రెండిట్లోనూ హీరోల్ని ఇరికించి వదిలే అయోమయపు కామెడీ డాక్టర్ పాత్ర. పరిమితంగా నవ్విస్తాడు. సహాయ పాత్రల్లో ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు ...చాలా మంది వున్నారు గానీ, అందర్నీ డామినేట్ చేస్తూ ఫన్నీ పాత్ర పోషించిన గోపరాజు రమణ ఎక్కువ దృష్టి నాకర్షిస్తాడు. ఈయనతో బాటు రావు రమేష్ టౌను మనుషుల్లా వుంటారు.

మహతీ స్వర సాగర్ సంగీతం కృ.వ్రి. వి వికృత టైటిల్ సినిమాలో లాగే వర్కౌట్ కాలేదు. పాటలు సాహిత్యం, సంగీతం అసలేమీ బాగాలేవు. సితార వారి ప్రొడక్షన్ విలువలు మాత్రం బలంగా వున్నాయి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ నేటివ్ రచన, దర్శకత్వం, ముఖ్యంగా కామెడీ డైలాగులు బావున్నాయనుకుని ఓసారి మాత్రం చూడొచ్చు.

—సికిందర్