రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, అక్టోబర్ 2022, మంగళవారం

1230 : సందేహాలు - సమాధానాలు

Q :    మీ బ్లాగులో పొన్నియన్ సెల్వన్ రివ్యూ రాలేదు. ఎవాయిడ్ చేసినట్టున్నారు. మీ విశ్లేషణ మేం తెలుసుకో వద్దా?
—దర్శకుడు
A : దాన్ని విశ్లేషించాలంటే చాలా చిక్కులు విడదీయాలి. అది మన వల్ల కాదన్పించింది. ఒక ఇంటర్వూ లో మణిరత్నం మాట గుర్తు చేసుకోవాలి. ఆ నవల చదివి పక్కన పడేయ్, అందులోంచి లైను లాగి కథ చెయ్- అని రైటర్ కి చెప్పినట్టు ఇంటర్వ్యూలో వుంది. నవల లోంచి లైను లాగినట్టుందా? ఒక ఇంజను, అది లాగే బోగీలూ వుంటే లైను అన్పించేది. ఇంజనే (ప్రధాన పాత్ర) లేదు, అన్నీ బోగీలే (వివిధ పాత్రలు) వున్నాయి. ఒక్కో బోగీతో అక్కడిక్కడే ఒక్కో కథ. ఎపిసోడిక్ కథనం. డాక్యుమెంటరీలకి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ బాపతు ఎపిసోడ్ల వారీ కథనం. పేర్లే గుర్తుండని అధిక పాత్రలు, వాటి బంధుత్వాలూ.

లైను లాగితే సినిమా కథ లా వుండాలి. ప్రధాన పాత్ర - అది ఎదుర్కొనే సమస్య- పరిష్కారమనే ఏర్పాటు. అప్పుడు కథ స్పష్టంగా అర్ధమవుతుంది. నవల్లో సినిమాకి కావాల్సిన కథని పట్టుకోలేక పోయారు. విషయాన్ని యూనివర్సల్ అప్పీల్ కి దూరంగా తమిళ ప్రాంతీయానికి పరిమితం చేస్తున్నామని గుర్తించ లేకపోయారు. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు యూనివర్సల్ గా అర్ధమయ్యేట్టు, సింపుల్ కథతో వుంటాయి. దీని మీద హై యాక్షన్ డ్రామా క్రియేట్ చేస్తారు. బ్రహ్మాస్త్ర లో కూడా ఇది కన్పిస్తుంది. ఈ మెగా బడ్జెట్ మూవీలో ఆరే ఆరు పాత్రలతో, సూటిగా వుండే సింపుల్ కథతో, యాక్షన్ హెవీగా వుంటుంది. మణిరత్నం పానిండియా తీస్తున్నామనుకుని తీసింది తమిళ ప్రేక్షకులకి పరిమిత మయ్యే ప్రాంతీయాన్ని.

పానిండియా లేదా యూనివర్సల్ మూవీగా తీయాలనుకున్నప్పుడు  సరైన కథా పరిచయం చేయకుండా, ఇది తమిళులకి తెలిసిన చోళుల చరిత్రే కాబట్టి, తమిళ ప్రేక్షకుల కుద్దేశించినట్టుగా కథా రచన సాగింది. దీంతో ఇతరులకి ఈ కథ, పాత్రలు ఏ మాత్రం అర్ధంగాకుండా పోయాయి. ఒక మ్యాపు వేసి చూపిస్తూ, ఫలానా చోళ రాజ్యం ఫలానా ఈ కాలంలో, తమిళనాడులో ఫలానా ఈ ప్రాంతంలో వుండేదన్న అవగాహన కూడా ఏర్పర్చకుండా, చోళ వంశాన్ని వర్ణించకుండా, ఏ వివరాలూ అందించకుండా, నేరుగా కథలో కెళ్ళిపోతే ఏమర్ధమవుతుంది?

పోనీ గాథలా వుందా అంటే గాథ కూడా కాదు. గాథ పాత్ర- సమస్య- సమస్యతో సంఘర్షణ లేని కథనంగా ముగిసి పోతుంది. మరెలా వుంది? ఎపిసోడిక్ గా వుంది. ఒక పాత్రతో ఒక సమస్య పుట్టడం తగ్గిపోవడం, మళ్ళీ ఇంకో పాత్రతో ఇంకో సమస్య పుట్టడం తగ్గిపోవడం - ఇలా రిపీట్ అవుతూ వుంటుంది ఎపిసోడిక్ కథనం.

ఫస్టాఫ్ ప్రధాన కథలేదు, సెకండాఫ్ దాని కొనసాగింపూ లేదు. ఎన్నో పాత్రలు, ఎందరో నటీనటులు, భారీ హంగామా, విషయం మాత్రం శూన్యం. ఏం చెబుతున్నాడో, ఏం చూస్తున్నామో మూడు గంటలూ అర్ధం గాదు. ఈ సందర్భంగా 2010 లో ప్రకాష్ ఝా తీసిన హిందీ రాజనీతి గుర్తుకొస్తుంది. మహాభారతాన్ని నేటి రాజకీయాలకి అన్వయిస్తున్నానని చెప్పి తీసిన ఈ భారీ మల్టీ స్టారర్ లో, ఎన్నో పాత్రలూ వాటి బక్వాస్ (వాగుడు) తప్ప ఏమీ అర్ధంగాక ఫ్లాపయ్యింది.

కాల్పనిక చరిత్ర తీస్తున్నప్పుడు హిస్టారికల్ ఫిక్షన్ జానర్ లో ఇలాటి సినిమాలు ఏమేం వచ్చాయీ, వాటినెలా తీశారూ రీసెర్చి చేయనట్టుంది. చేసి వుంటే ఇన్నేసి పాత్రల కలగూరగంప నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు. చోళ వంశంలో ఒక పాత్ర తీసుకుని, అది ఏ ఘట్టం ద్వారా ప్రసిద్ధి చెందిందో అది మాత్రమే తీసుకుని, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ చేసేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే- 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథ గానే తీశాడు. అంతేగానీ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు.

ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం -అగ్నిపరీక్ష లాంటిది - 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దాని కోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే వాటిని పక్కన పడేశాడు స్పీల్ బెర్గ్. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. దాంతో కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఇది కరెక్ట్ అన్పించింది. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలనే బాక్సాఫీసు అప్పీలున్న పాయింటుతో, ప్రపంఛ వ్యాప్తంగా సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేట్టు, సింపుల్ గా తీసి పెద్ద విజయం సాధించాడు.
 
పొన్నియన్ సెల్వమ్ కి ఇంతకంటే రివ్యూ అవసరం లేదేమో. హిస్టారికల్ సినిమా ఎలా తీయకూడదో నేర్చుకోవడానికి మాత్రం ఈ సినిమా చూడాలి. ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది. నమస్తే అండి.

Q :    నమస్కారమండి. మలయాళం భీష్మ పర్వం తెలుగు డబ్బింగ్ హాట్ ‌స్టార్ లో ఉంది.లూసిఫర్ లాగానే చిరంజీవి గారు ఈ మూవీని కూడా రిమేక్ చేస్తున్నారని టాక్. రివ్యూ చేయగలరా?
—అశ్వత్ శర్మ, నల్లగొండ
A :   నమస్కారం. ఇలాటి అభ్యర్ధనలు వస్తూ వుంటాయి. అడిగిన వాళ్ళందరికీ సినిమాలు చూసి రివ్యూలు రాయడం సాధ్యం కాదు. ఇచ్చిన రివ్యూలు చూసుకోవడమే. రేయికి వేయి కళ్ళు కూడా మీరడిగారు. అది ఆ వారం విడుదలయ్యింది కాబట్టి మీరు అడగకపోయినా రాసేవాళ్ళం. ఈ సినిమాలు వదలండి. మేకింగ్ కి, రైటింగ్ కి పనికొచ్చే, స్పూర్తినిచ్చే, నేర్చుకోనిచ్చే హాలీవుడ్ క్లాసిక్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు ఒకటొకటిగా రాసుకుపోదామంటే కుదరడం లేదు. ఒక మేకర్ మరీమరీ అడిగిన అపొకలిప్టో చాలా కాలంగా పెండింగులో వుంది. వచ్చే వారం నుంచి దీని సంగతి చూడాలి.

Q :   మీ ఒకే ఒక జీవితం రివ్యూ బాగుంది. సైన్సు ఫిక్షన్ లో హెవీ మదర్ సెంటిమెంట్. బ్యాక్ టు ది ఫ్యూచర్ చూసుంటే మదర్ సెంటిమెంట్ ఎంతలో ఉండాలో, ఎలా ఉండాలో  తెలిసేది. అన్నట్టు, నేను ఒక సైన్సు ఫిక్షన్ (టైం లూప్) రోమాంటిక్ స్టోరీ ట్రీట్మెంట్  రాసి రిజిస్టర్ చేసి, ఇప్పుడు స్క్రీన్ ప్లే రాస్తున్నాను. పూర్తయిన తరువాత మీకు కాక ఎవరికి ఇస్తాను ఫీడ్ బాక్ కోసం.
—ఆర్సీ ఎస్, దర్శకుడు
A :   థాంక్స్. మీ యాక్టివిటీస్ బావున్నాయి. ఇలాగే ప్రొసీడవండి, ఎక్కడో తగుల్తుంది. సైన్స్ ఫిక్షన్ భాషలోనే చెప్పుకుంటే స్ట్రగుల్ అనేది లో- ఫ్రీక్వెన్సీ థాట్, యాక్టివిటీస్ అనుకుంటే అది హై ఫ్రీక్వెన్సీ థాట్. దీంతో యూనివర్స్ కి కనెక్ట్ అవుతాం. త్వరగా గమ్యం చేరతాం. ఒకే ఒక జీవితం కోసం జానర్ రీసెర్చి చేయలేదు దర్శకుడు. అసలు టైమ్ ట్రావెల్ జానర్ మర్యాదలన్నీ బ్యాక్ టు ది ఫ్యూచర్ లో సమకూర్చి పెట్టాడు దర్శకుడు రాబర్ట్ జెమెకిస్. దీని వివరణ అంతా స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ రాసిన స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్ పుస్తకంలో వుంది.

—సికిందర్ 
(మరికొన్ని ప్రశ్నలు ఆదివారం)


10, అక్టోబర్ 2022, సోమవారం

1229 : రివ్యూ!

రచన- దర్శకత్వం : లక్ష్మణ్ కృష్ణ
తారాగణం : బెల్లంకొండ గణేష్, ర్షా బొల్లమ్మ, దివ్య శ్రీపాద, ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సూర్య
బ్యానర్ : సితార ఎంటర్టయిన్మెంట్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 5, 2022
***
        సరా విడుదలల్లో స్వాతి ముత్యం ఒకటి. సితార ఎంటర్టయిన్మెంట్ నుంచి ఒక కుటుంబ కాలక్షేపం. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం. ఐదు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ నటి వర్షా బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కృష్ణ కొత్త దర్శకుడు. దసరాకి ఒకవైపు మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్’, మరోవైపు కింగ్ నాగార్జున ఘోస్ట్ పెద్ద స్టార్స్ సినిమాలు. ఈ రెండిటి మధ్య ఓ చిన్న సినిమాగా స్వాతి ముత్యం నిలబడే అవకాశముందా? నిలబడే విషయమేమైనా వుందా? అసలిందులో వున్న కొత్తదనమేమిటి? ఇవి తెలుసుకుందాం... 

కథ

పిఠాపురం లోని విద్యుత్ శాఖలో బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) క్లర్కుగా పని చేస్తూంటాడు. తల్లిదండ్రులు (రావు రమేష్, ప్రగతి), డాక్టర్ బుచ్చిబాబు (వెన్నెల కిషోర్) అనే మిత్రుడూ వుంటారు. ఉద్యోగంలో చేరాడు కాబట్టి తల్లిదండ్రులు పెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. భాగ్యలక్ష్మి (వర్షా బొల్లమ్మ) అనే స్కూలు టీచర్ తో పెళ్ళి చూపులు, పెళ్ళీ కుదురుతాయి. భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (నరేష్, సురేఖా వాణి), పెదనాన్న (గోపరాజు రమణ) జోరుగా పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళింట్లో బిడ్డనెత్తుకుని శైలజ (దివ్యా శ్రీపాద) అనే క్రైస్తవ అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. ఈ బిడ్డ నీదే అంటుంది గణేష్ తో. అవును నాదే అంటాడు గణేష్. పెళ్ళింట్లో గోలగోల అవుతుంది. పెళ్ళాగిపోతుంది. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బిడ్డని గణేష్ చేతుల్లో పడేసి శైలజ కూడా వెళ్ళిపోతుంది.

ఏమిటీ పరిస్థితి? అసలేం జరిగింది? బిడ్డని కన్న గణేష్ ఎందుకీ పెళ్ళికి సిద్ధపడ్డాడు? శైలజ ఎవరు? ఆమెతో గణేష్ కేం జరిగింది? ఇప్పుడు బిడ్డతో ఒంటరిగా మిగిలిన గణేష్ ఏం చేశాడు? భాగ్యలక్ష్మి సంగతేంటి? ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు.

ఎలావుంది కథ

రోమాంటిక్ డ్రామా జానర్ కి చెందిన రొటీన్ కథ. దీనికి యూత్ అప్పీల్ తక్కువ. ఇందులో హీరోయిజం వుండదు. తమ ప్రేమ సమస్యని హీరో హీరోయిన్లు తాము పరిష్కరించుకునే స్వావలంబనతో లేక, పెద్దల చేతుల్లో పరిష్కారమయ్యే రోమాంటిక్ డ్రామా జానర్ కథ. అయితే తెలుగులో దాదాపు అన్ని రోమాంటిక్ డ్రామాలు సెకండాఫ్ లో హీరో హీరోయిన్లు విడిపోవడం, విషాదంగా మారడం జరుగుతాయి. విషాదం వర్కౌట్ కాక అవన్నీ ఫ్లాపవుతున్నాయి. ప్రస్తుత రోమాంటిక్ డ్రామా ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ కామెడీతోనే నడవడంతో బ్రతికి బైట పడింది.    

ఈ కథకి కేంద్ర బిందువు సరొగసీ (అద్దె గర్భం) అంశం. దీన్ని సీరియస్ గా కాకుండా హిందీ మిమీ (2021) లో లాగా హాస్య ధోరణిలో చెప్పడం. టౌను పాత్రలతో టౌను కథగా తీయడం. కుటుంబ కాలక్షేపం. అయితే ఫస్టాఫ్ పెళ్ళి చూపులు, ప్రేమ, పెళ్ళీ ఘట్టం వరకూ 50 నిమిషాలు విషయం లేక డల్ గా సాగుతుంది. పెళ్ళిలో బిడ్డనెత్తుకుని వచ్చే శైలజ పాత్రతో కథ మొదలవుతుంది. అక్కడ్నించి సెకండాఫ్ సరొగసీ పాయింటుతో కామెడీకి కాస్త ఊపొస్తుంది. ఇంకోటేమిటంటే, ఈ కథ సాగదీస్తే నిలబడక పోవచ్చని గంటా 50 నిమిషాల్లోనే ముగించడం. అయితే రోమాంటిక్ డ్రామా - కుటుంబ కాలక్షేప సినిమాలు కురచ నిడివితో తృప్తిపరుస్తాయా అన్నది ప్రశ్న.

కృష్ణ వ్రింద విహారి లో హీరోయిన్ కి పిల్లలు పుట్టని విషయం దాచి పెట్టి ఆడే నాటకంగా కథ వుంటుంది. ఈ నాటకాలు ఔట్ డెటెడ్ కథలు. ఇది ఫ్లాపయ్యింది. ప్రస్తుత కథలో విషయం దాచిపెట్ట లేదు. పెళ్ళికి ముందు పుట్టిన బిడ్డతో బయట పడ్డ గుట్టుకి పరిష్కారం వెతికే హాస్య కథగా వుంది. అయితే ఇది చెప్పాల్సిన అసలు కథ కాదు. కథలో వున్న అసలు కథ పట్టుకోలేక పోవడం ఈ కథతో వచ్చిన సమస్య.

ఇక చెప్పిన కథకి హాస్య కథనం మరీ అద్భుతమేమీ కాదు. ఎందుకంటే సమస్య పుట్టించిన, దాంతో కథ నడపాల్సిన, ప్రధాన పాత్ర అయిన హీరో, పాసివ్ గా వుండిపోవడంతో, హాస్య ప్రహసనాలు అతను సృష్టించడం లేదు. ఇతర పాత్రలు సృష్టించుకుంటున్నాయి. అతను ఏ పరిస్థితిలో వేరే అమ్మాయి సరొగేట్ గా బిడ్డని కనాల్సి వచ్చిందో, పెళ్ళి చెడిన సమయంలో చెప్పేసి వుంటే, యాక్టివ్ హీరో పాత్రయ్యే వాడు. చెప్పక పోవడం వల్ల అతను వేరే అమ్మాయితో శారీరక సంబంధంతో బిడ్డని కన్నాడని ఇతర పాత్రలు అపార్ధం చేసుకుంటున్నాయి. ఈ అపార్ధం తొలిగేదెలా అన్నది పాయింటుగా చేసుకుని కథ నడిపారు. ఇది రాంగ్. చెప్పాల్సిన అసలు కథ ఇది కాదు.

ముందు కథకి ఐడియాని సరీగ్గా నిర్మించుకుని వుంటే, అపార్ధం అనేది నేటి బాక్సాఫీసు ఫీలయ్యే పాయింటు కాదనీ, నేటి ఆధునిక కాలపు కొత్త  సమస్య అయిన - సరొగేట్ బిడ్డతో కుటుంబం - సమాజం ఎలా రియాక్ట్ అవుతాయనేది  బాక్సాఫీసు అప్పీల్ నిచ్చే డైనమిక్ పాయింటవుతుందనీ తెలిసేది కొత్త దర్శకుడికి. ఇదీ చెప్పాల్సిన అసలు కథ. ముందు మార్కెట్ యాస్పెక్ట్ ని విశ్లేషించుకుని ఐడియాని నిర్మించుకోక పోతే, ఎంత క్రియేటివ్ యాస్పెక్ట్ ప్రదర్శించుకున్నా అది మార్కెట్ కి దూరంగానే వుంటుంది. ఇది సినిమాలకే కాదు, సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. సాహిత్యంలో సుత్తి కథలు చాలా వస్తున్నాయి.

అపార్ధం - సరొగేట్ సమస్యలు రెండుంటే, సమకాలీన చర్చనీయాంశం సరోగసీ  సమస్యే. కొత్త దర్శకుడిగా ఈ కొత్త సమస్య గురించి చెప్పాలి గానీ, ఇంకా అపార్ధం తొలగించడమనే అరిగిపోయిన రొటీన్ కాదు. ఈ అపార్థం తొలగించే కథకి పిఠాపురం లాంటి టౌను నేపథ్యం దాకా కూడా వెళ్ళనవసరం లేదు. ప్రొడక్షన్ కార్యాలయం వున్న నగరంలోనే  చెప్పొచ్చు. బడ్జెట్ ఆదా అవుతుంది.

కానీ ఇప్పుడు టౌను కథల ఉద్దేశం - మార్కెట్ యాస్పెక్ట్ వేరే వుంటోంది. హిందీ సినిమాల్లో నగరాల్లో ఆధునిక జీవన పోకడలతో ఉత్పన్నమయ్యే ఉపద్రవాల్ని నేపథ్యం మార్చి టౌను కథలుగా సినిమాలు తీస్తున్నారు. సరొగేట్, సహజీవనం, గే కథలు వంటి నగరపు ఆధునిక పోకడల్ని, వీటి గాలి సోకని నిద్రాణంగా వుండే టౌన్లలో ప్రవేశ పెట్టి కథలకి షాక్ వేల్యూ సృష్టించి సక్సెసవుతున్నారు. సిడ్ ఫీల్డ్ చెప్పినట్టు ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ వాడుతున్నారు. అంటే, నేపథ్యం ఒకటుంటే దానికి వ్యతిరేకంగా వుండే కథ, లేదా సీన్లు సృష్టించడం.

పిఠాపురం లాంటి నిద్రాణంగా వుండే టౌన్లో షాకింగ్ గా సరొగేట్ కథనెత్తుకుంటే ఎగైనిస్ట్ ది గ్రెయిన్ టెక్నిక్ అవుతుంది. అపార్ధం తొలగించే కథ కాదు. ఈ షాకుతో టౌను పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటాయనేది హాస్యాయుతంగా చెపితే ఇది కథకి తగ్గ కామెడీ అవుతుంది తప్ప, అపార్ధం సృష్టించి దాంతో కామెడీ చేయడం కాదు.

బిడ్డనెలా కన్నాడో హీరో ముందే చెప్పేస్తే ఆ అసలు సమస్యతో పాత్ర, కథ రెండూ బలంగా వుండేవి. అలా కన్న బిడ్డని ఎలా అంగీకరించాలా అన్నది, అంగీకరిస్తే హీరో పెళ్ళెలా అవుతుందన్నది పరిష్కరించాల్సిన సమస్యలుగా వుండేవి. కానీ హీరో క్లయిమాక్స్ వరకూ హీరోయిన్ కీ, ముగింపు వరకూ పెద్దలకీ సరొగేట్ విషయమే చెప్పకుండా, అర్ధం లేకుండా సతమవుతూ వుంటాడు బిడ్డతో. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని చివర్లో హీరోయిన్ అడుగుతుంది. ఈ ప్రశ్నే పెళ్ళి గొడవలో (ఇంటర్వెల్లో) మనకి తడుతుంది. ప్రశ్న ఇదే, ఇంటర్వెల్లో స్థాపించాల్సిన సమస్యా ఇదే.

మరొకటేమిటంటే సమస్యగా వున్న ఆ బిడ్డకి పాత్రే లేదు. ఎత్తుకుని తిరగడం తప్ప. హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8 యాక్షన్ మూవీలో నెలల బిడ్డతో ఎంత కామెడీ వుంటుంది. ఎంత ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. పాత్రల్ని అయ్యో పాపమని దర్శకుడు జాలిపడితే కామెడీ రాదు.  

నటనలు – సాంకేతికాలు

బెల్లంకొండ గణేష్ పాత్ర స్వాతి ముత్యం అన్పించుకోవాలీ కాబట్టి సాత్వికంగా వుండాలేమో. ఇది కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రాముడు మంచి బాలుడుగా నటించడానికేమీ లేకుండా పోయింది. కామెడీ సినిమా అన్నప్పుడు క్యారక్టర్ ఫన్నీగా వుంటూ హిలేరియస్ కామెడీలు పుట్టిస్తూ వుంటే, కొత్త హీరోగా నటన ప్రదర్శించుకునే అవకాశం వుండేది. పైగా 50 నిమిషాలు డల్ గా సాగే ఫస్టాఫ్ హుషారుగా మారేది. ఇక ఎలాగూ రోమాంటిక్ డ్రామా అన్నాక హీరో చేయాల్సింది చేసుకోక పెద్దలే చక్కబెడతారు గనుక, సెకెండాఫ్ గణేష్ కి పెద్దగా బాధ్యత లేకుండా పోయింది. పెద్దల్ని సమస్యల్లో పడేసిన వాడు సమస్యల్ని పెద్దలకే ఎలా వదిలేస్తాడో రోమాంటిక్ డ్రామాల లాజిక్ వుండని తతంగం. రెండో సినిమాతోనైనా గణేష్ యాక్టివ్ క్యారక్టర్ నటిస్తే నటుడుగా తనేమిటో తెలుస్తుంది.

టీచర్ పాత్రలో వర్షా బొల్లమ్మ కూడా అసహాయురాలే. పెళ్ళి చెడిపోయాక ఇంటికి పరిమితమై కన్పించదు. ఏం చేయాలో ఆలోచించుకోకుండా దిగులుతో వుండిపోతుంది. టీచర్ గా తన సమస్యకి తనే కుంగిపోతే విద్యార్థులకి ఏం బోధిస్తుందో అర్ధంగాదు. ఈమె పెళ్ళికి తోటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని రప్పించడం ప్రొడక్షన్ మేనేజర్ మర్చిపోయి నట్టుంది. లేక హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు రాలేక పోయారేమో. హర్ష గ్లామరస్ గా మాత్రం బావుంది. హావభావాలు పలికిస్తుంది.

వెన్నెల కిషోర్ డాక్టర్ పాత్ర కృష్ణ వ్రింద విహారి దుష్ట సమాసం టైటిల్ సినిమాలో డాక్టర్ పాత్ర లాంటిదే. రెండిట్లోనూ హీరోల్ని ఇరికించి వదిలే అయోమయపు కామెడీ డాక్టర్ పాత్ర. పరిమితంగా నవ్విస్తాడు. సహాయ పాత్రల్లో ప్రగతి, సురేఖా వాణి, రావు రమేష్, నరేష్, గోపరాజు రమణ, సుబ్బరాజు ...చాలా మంది వున్నారు గానీ, అందర్నీ డామినేట్ చేస్తూ ఫన్నీ పాత్ర పోషించిన గోపరాజు రమణ ఎక్కువ దృష్టి నాకర్షిస్తాడు. ఈయనతో బాటు రావు రమేష్ టౌను మనుషుల్లా వుంటారు.

మహతీ స్వర సాగర్ సంగీతం కృ.వ్రి. వి వికృత టైటిల్ సినిమాలో లాగే వర్కౌట్ కాలేదు. పాటలు సాహిత్యం, సంగీతం అసలేమీ బాగాలేవు. సితార వారి ప్రొడక్షన్ విలువలు మాత్రం బలంగా వున్నాయి. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ నేటివ్ రచన, దర్శకత్వం, ముఖ్యంగా కామెడీ డైలాగులు బావున్నాయనుకుని ఓసారి మాత్రం చూడొచ్చు.

—సికిందర్

 

9, అక్టోబర్ 2022, ఆదివారం

1228 : స్పెషల్ రివ్యూ!


    నెట్ ఫ్లిక్స్ నిర్మించిన అథెనా ఫ్రెంచి మూవీ (సెప్టెంబర్ 2022 విడుదల) ఓటీటీలో వైరల్ అయింది. అంతర్జాతీయ దృష్టినాకర్షిస్తూ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచి దర్శకుడు రోమైన్ గ్రావాస్ ఆశ్చర్యపర్చే సినిమా నిర్మాణం గావించాడు. మొదటి క్షణం నుంచీ ముగింపు వరకూ దృష్టి తిప్పుకోలేని భావోద్వేగాలతో పరుగులు తీసే రెబెల్- యాక్షన్ సామాజిక థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుంచాడు. ఫ్రాన్సులో జాత్యాహంకారం, అసమానతలు, పోలీసు హింస, ప్రజల తిరుగుబాటు మొదలైన అంశాలు జోడించి -ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగే, జరుగుతున్న చరిత్రగా తెరకెక్కించాడు.

        రెండేళ్ళ క్రితం అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి గొంతు మీద తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి బహిరంగంగా ప్రాణాలు తీసిన పోలీసు ఉదంతం ఎలాటి ప్రజాగ్రహానికి దారితీసిందో తెలిసిందే. అలాటి జాత్యాహంకార హత్యని, దాని పరిణామాల్నీ ఘాటుగా చిత్రించాడు దర్శకుడు రోమైన్.

అది ప్యారిస్ శివారు అథెనా అనే ఏరియాలో నివసించే అల్జీరియన్ ప్రవాసుల కుటుంబం. తల్లి, నల్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆర్మీలో పనిచేసే అబ్దుల్ చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తి. రెండో కొడుకు కరీం నిరుద్యోగి. వ్యవస్థని పడగొట్టి సమూలంగా రాడికల్ గా పునర్నిర్మిస్తే తప్ప అందరికీ న్యాయం జరగదని నమ్మే తీవ్రవాద భావాలున్న యువకుడు. మూడో కొడుకు ముక్తార్ అవకాశవాది, డ్రగ్ స్మగ్లర్. నాల్గో కొడుకు పదమూడేళ్ళ ఇదిర్.

ఇదిర్ ని ఇద్దరు పోలీసులు బలిగొంటారు. ఆ వీడియో వైరల్ అయి ప్రజలు తిరగబడతారు.  పోలీసు అధికారులు న్యాయం చేస్తారని శాంతపర్చే ప్రయత్నం చేస్తాడు అబ్దుల్. తమ్ముడి మరణానికి అసలే ఉడికిపోతున్న కరీం అన్న మాటలు నమ్మకుండా రెచ్చిపోయి బాంబు పేలుస్తాడు. అంతే, ఇక విధ్వంసం మొదలైపోతుంది. కరీంతో కలిసి ప్రజలు వూరు మీద పడి భారీ యెత్తున దాడులకి పాల్పడతారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కరీం నాయకత్వంలో పోలీసుల మీద యుద్ధంగా మారిపోతుంది. అదే సమయంలో అబ్దుల్- కరీంలు ఒకరికొకరు బద్ధ శత్రువులైపోతారు. కరీం నాపడానికి అబ్దుల్ చావుకి కూడా సిద్ధపడతాడు. డ్రగ్ స్మగ్లర్ ముక్తార్ ఇదే అవకాశామని ప్రజల్ని పోలీసుల మీద హింసకి రెచ్చగొడతాడు.

కాల్పులు, పేలుళ్ళు, అరుపులు, చావుకేకలు...అగ్నిగోళంలా మారిపోతుంది అథెనా. పోలీసుల వల్ల కాదు. ఇక సైన్యం దిగేసరికి పతాకస్థాయికి చేరుకుంటుంది పోరాటం. తమ్ముడ్ని చంపిన ఇద్దరు పోలీసుల్ని కిడ్నాప్ చేయాలన్నదే కరీం ప్లాన్. అయితే ఒక పోలీసు అధికారి దొరికిపోతాడు...

ఫ్రాన్సులో వలసదారులు, అట్టడుగు వర్గాలు తమ కోసం పనిచేయని అధికార వ్యవస్థల్ని ఎలా చూస్తారో కరకుగా, హెచ్చరికలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రోజంతా జరిగే సంఘటనలతో, రోడ్ల మీదే పరుగులు దీస్తూంటుంది కథ. విధ్వంసాలతో అట్టుడుకుతూంటాయి దృశ్యాలు. ఆద్యంతం యాక్షనే ఈ కథ. ఈ కథకి ఫస్ట్ యాక్ట్ వుండదు. కథ, పాత్రల పరిచయం, వాటి జీవితం, సమస్యకి దారి తీసే పరిస్థితులు, సమస్య ఏర్పాటు- అనే ఫస్ట్ యాక్ట్ కథాంగాలు వుండవు. నేరుగా సెకెండ్ యాక్ట్ తో ప్రారంభమైపోతుంది కథ.

అంటే సమస్యతో పోరాటంతో ప్రారంభమై పోతుంది కథ. తమ్ముడి మరణానికి పోలీసు అధికారులు  తప్పక న్యాయం చేస్తారని ప్రజలకి అబ్దుల్ చెప్తూ వుండే దృశ్యంతో సెకెండ్ యాక్టే కథా ప్రారంభంగా వుంటుంది. ఇది ప్రయోగాత్మకమే అనుకోవాలి. రొటీన్, రెగ్యులర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి భిన్నంగా, రాడికల్ గా. తమ్ముడెవరు, ఎలా చనిపోయాడు వివరాలు ఈ దృశ్యంలోనే సంభాషణల్లోనే వెల్లడవుతాయి తప్ప, ఇది తెలియజేయాడానికి పనిగట్టుకుని ఫస్ట్ యాక్ట్ కథనం చేయలేదు.

అలాగే అన్నదమ్ముల పాత్రల పరిచయాలు పరుగులు దీస్తున్న సెకెండ్ యాక్ట్ యాక్షన్ తో పాటే జరిగిపోతాయి. సెకెండ్ యాక్ట్ తో ప్రారంభమైపోయే కథలో ఎక్కడా ఫ్లాష్ బ్యాక్స్ కూడా వుండవు. ఒకచోట తమ్ముడ్ని అబ్దుల్ ఖననం చేసే దృశ్యంతో మాంటేజ్ తప్ప. కథ వెనక్కి వెళ్ళదు. కదనం రంగం నుంచి పక్కకి కూడా వెళ్ళదు. వేరే కార్యాలయాల్లో పోలీసు అధికారుల చర్చలు, ఆదేశాలు, నియంత్రణ వంటి కార్యకలాపాల  సీన్లు కూడా వుండవు. పోలీసులూ ఆందోళనకారులూ రోడ్లమీదే వుంటారు పోరాడుతూ. రణరంగంలోనే పోరాట వ్యూహాలు.

ఈ సెకెండ్ యాక్ట్ కరీం మరణంతో ముగుస్తుంది. పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన కరీం, అబ్దుల్ అభ్యర్ధనలకి విసిగిపోయి, రాజీపడలేక నిప్పంటించుకుని ఆత్మ హత్య చేసుకుంటాడు. దీంతో వ్యవస్థ పట్ల కనువిప్పయిన అబ్దుల్, కరీం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కిడ్నాప్ చేసిన పోలీసు అధికారితో క్లయిమాక్స్ (థర్డ్ యాక్ట్) మొదలెడతాడు. అయితే అతను దాక్కున్న ఫ్లాట్ ని పేల్చేసి చంపేస్తారు పోలీసు అధికారులు.

నేరం చేసినా సరే, తమ సిబ్బందిని కాపాడుకునే మనస్తత్వంతోనే వుండే పోలీసు అధికారులు, అవతలివాడు సైనికుడైనా సరే, అంతం చేసి న్యాయం అందకుండా చేయగలరని  చెప్తున్న దర్శకుడు - ఆ సైనికుడు ముస్లిం కాకపోతే? -అన్న పరోక్ష ప్రశ్న కూడా వదులుతాడు.

ఒకే రోజు ముగ్గురు సోదరులు బలైపోయి, నాల్గవ వాడు డ్రగ్ స్మగ్లర్ ముక్తార్ మిగలడం కూడా సింబాలిజమే. నెట్ ఫ్లిక్స్ లో ఇది తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది.  

—సికిందర్ 

 

8, అక్టోబర్ 2022, శనివారం

1227 : రివ్యూ!


 రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

తారాగణం : నాగార్జున, సోనల్ చౌహాన్, గుల్ పనాగ్, అనైకా, రవివర్మ తదితరులు
సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్స్ :  శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
విడుదల :  అక్టోబర్ 5, 2022
***
        చాలా కాలం నిర్మాణంలో వున్న నాగార్జున అక్కినేని నటించిన ది ఘోస్ట్ దసరాకి విడుదలైంది. రాజశేఖర్ తో గరుడ వేగ అనే హిట్ తీసిన ప్రవీణ్ సత్తారు నుంచి మరో యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ కోసం నాగార్జున క్రవ్ మగా, కటానా అనే కత్తి పోరాటాలు నేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. హీరోయిన్లు మారిపోతూ చివరికి సోనల్ చౌహాన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఆకర్షణీయమైన అంశాలున్నాయి. అయితే సినిమా అంటే కేవలం ఆకర్షణీయమైన అంశాలేనా, ఇంకేమైనా వుండాలా? ఏముండాలి? ఇది తెలుసుకుందాం.

కథ

విక్రమ్ (నాగార్జున) ప్రేమిస్తున్న ప్రియ (సోనల్ చౌహాన్) తో కలిసి దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తూంటాడు. క్రిమినల్స్ మీద చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఒక చిన్న పిల్లాడు చనిపోవడంతో విచారంలో మునిగిపోతాడు. మానసికంగా దెబ్బ తిన్న అతడ్ని చూసి ప్రియ దూరమవుతుంది. ఇంతలో ఇరవై ఏళ్ళక్రితం దూరమైన చెల్లెలు అనుపమ (గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి కాల్ వస్తుంది. తననీ తన కూతురు అదితి (అనైక) నీ కాపాడమని వేడుకుంటుంది. దాంతో విక్రమ్ ఊటీకి బయల్దేరతాడు. ఇక చెల్లెల్ని, ఆమె కూతుర్నీ కాపాడడంలో అతడికి ఎదురైన ప్రమాదాలేమిటి, చెల్లెలికి ఎవరు ఎందుకు హాని తలపెడుతున్నారు, అసలు అన్నా చెల్లెళ్ళ కథేమిటన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

యాక్షన్ జానర్ కథ. అయితే కథ లేదు. ఆకర్షణీయమైన అంశాలు చాలా వున్నాయి గానీ, కథ కూడా వుండాలని మనస్ఫూర్తిగా నమ్మ లేదు. అందుకని కథ లేని యాక్షన్ సీన్సే వున్నాయి. అసలే చెల్లెల్ని కాపాడే సిస్టర్ సెంటిమెంటు అరిగిపోయిన పురాతన పాయింటు అయితే, ఈ అరిగిపోయిన పురాతన పాయింటుతో కథెందుకు అనుకున్నట్టు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ వదిలేసి యాక్షన్ సీన్లు జోడించుకుంటూ పోయాడు. బాక్సాఫీసులో బుకింగ్ క్లర్కు నోట్లు జోడించక పోయినా డోంట్ కేర్ అనుకున్నట్టుంది. చెల్లెలి కుటుంబాన్ని కాపాడే మెయిన్ స్టోరీని, ప్రేమించిన ప్రియకి దూరమైన సబ్ ప్లాట్ నీ ఫ్లాప్ కి తాకట్టు పెట్టేసి, శత్రువులు వర్సెస్ నాగార్జున అన్నట్టుగా వాళ్ళు ఎడతెరిపి లేకుండా కొట్టుకునే ...కొట్టుకునే...నరుక్కునే...నరుక్కునే అద్భుత దృశ్యాలతో రూపకల్పన చేశాడు. కొట్టుకుంటే కోటి ఇస్తామన్నట్టుంది నిర్మాతలు. ఎన్ని సార్లు కొట్టుకుంటే అన్నీ కోట్లు! సినిమా ఇలా కూడా వుంటుందని కొత్త విధానం చెప్పే ఆభినందనీయ ప్రయత్నం ఆహ్లాదకరంగా చేశాడు.

చిన్నప్పుడు చెల్లెలితో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ కూడా  భావోద్వేగాలుంటే అది మనుషుల లక్షణం కాదనుకుని, మట్టి బొమ్మలుగా చేసి ప్రదర్శించాడు. యాక్షన్ సీన్స్ లో ఎమోషన్స్ వుండడానికి వీల్లేదని తీర్మానించాడు. గుంటూరు టాకీస్ వంటి రియలిస్టిక్ ఎమోషనల్ హిట్ తీసిన ప్రవీణ్ సత్తారులో ప్రావీణ్యం ఇలా జీరో ఐందేమిటని ఆశ్చర్యపోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. 2017 లో గరుడ వేగ అనే టెర్రరిజం సినిమా తీసినప్పుడు ప్రావీణ్యం ట్రాకులోనే వుందికదా అని పోల్చడం తెలివి తక్కువ తనమని ఆగ్రహించాడు.

ఇలా ది ఘోస్ట్ ప్రేక్షకుల పాలిట భూతమైపోయింది. యాక్షన్ సీన్స్ కి కూడా అయిడియాలు కొరవడినట్టు కేజీఎఫ్ నుంచి, కమల్ హాసన్ విక్రమ్ నుంచీ కాపీ కొట్టినట్టు వుండడం ఇంకా అన్యాయం. చెల్లెలి కుటుంబాన్ని కాపాడడమనే ఏదో ఒక లైను పెట్టుకుని, దానికైనా కథ లేకుండా స్టయిలిష్ యాక్షన్ సీన్స్ సిరీస్ గా సినిమా తీసేస్తే ప్రేక్షకులు భరించగలరను కోవడం పొరపాటు. సుదీర్ఘ కాలం సినిమా నిర్మాణంలో వుందంటేనే విషయంతో  ఏదో ప్రాబ్లం వున్నట్టు అర్ధం జేసుకోవాలి.

నటనలు – సాంకేతికాలు

నాగార్జున స్టయిలిష్ లుక్ తో డీసెంట్ గా వున్నాడు. యాక్షన్ సినిమాలు తనకి కొత్త కాదు. అరవై దాటిన వయసులో ఈ యాక్షన్ తో సత్తా చాటాడు. మరీ చేయలేని విన్యాసాలు చేయకుండా వయసు అనుమతించిన మేరకు ఓకే అనిపించాడు. అయితే పోరాటాలతో బాటు కాస్త పాత్ర, దాంతో కథ, పోరాటాలకి దిగడానికి బలమైన నేపథ్యం, ఆ నేపథ్యంలోంచి భావోద్వాగాలూ లేకపోవడంతో తన స్టార్ స్టేటస్ సినిమాని కాపాడలేకపోయింది. గత యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ లాగే ఇది కూడా తనకి ఐరన్ లెగ్ సినిమా. తల్వార్లు, తుపాకులు, బాంబులు వీటితోనే తను నటిస్తే, వీటిని పరీక్షిస్తున్నట్టు అన్పిస్తే, అది డెమో అవుతుందేమో గానీ మూవీ కాదు.

హీరోయిన్ సోనల్ చౌహాన్ గ్లామర్ ప్రదర్శన, ఓ యాక్షన్ సీనులో విజృంభణ వరకే పరిమితం. గుల్ పనాగ్ సిస్టర్ సెంటిమెంటుతో వుంటే, ఆమె ఎదిగిన కూతురుగా, దుర్వ్యసనాల బారిని పడ్డ ధనిక అమ్మాయిగా అనైకా నటించింది. చాలా మైనస్ ఎవరంటే విలన్. ఇన్నేసి యాక్షన్ సీన్స్ కి తెరతీస్తున్న దుష్టుడు దుష్టుడులాగా లేకుండా దిష్టి బొమ్మలాగా వుండడం ప్రవీణ్ సత్తారు ప్రావీణ్యానికి ఇంకో మచ్చు తునక.

ప్రొడక్షన్ విలువలు మాత్రం బ్రహ్మాండంగా వున్నాయి. ముఖేష్ కెమెరా, మార్క్ రాబిన్ సంగీతం, లవ్ సాంగ్ తో బాటు పార్టీ సాంగ్ చిత్రీకరణా ఆసక్తికరంగా వున్నాయి. ఇలా ఎంతో ఆసక్తిరేపుతూ వార్తల్లో వుంటూ వచ్చిన నాగ్ -సత్తారు కాంబినేషన్లో ది ఘోస్ట్ ఇంత వేస్టయిపోవడం సమస్యేం కాదు- ఓటీటీ వుందిగా!  

—సికిందర్

1226 : స్పెషల్ ఆర్టికల్


    సెప్టెంబర్ లో నిర్వహించిన జాతీయ సినిమా దినోత్సవానికి లభించిన ప్రతిస్పందనని  చూసి మరో మూడు రోజులు పండుగని పొడిగించాయి మల్టీప్లెక్స్ కంపెనీలు. కొత్త సినిమాల విడుదలల సాకు చూపించి తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్వహించలేదు. ఇతర రాష్ట్రాల్లో 75 రూపాయల టికెట్ కి 90 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్సులు కళకళ లాడడం చూసి కళ్ళు తెరిచారు. ఇటీవల ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి కారణం భారీగా పెంచిన టికెట్ రేట్లు అని గ్రహించారు. చౌక వినోద సాధనమైన సినిమాని ఖరీదైన విలాస వస్తువుగా మార్చడంతో ప్రేక్షకులు తగ్గిపోయారని తెలుసుకున్నారు. టికెట్ ధరలతో బాటు తినుబండారాల ఖర్చు ఫైఫ్ స్టార్ లెవెల్లో వుండడంతో సామాన్యులు సినిమాలకి దూరమైపోయారు.

హైదరాబాద్ లో ఉప్పల్ఎల్బీ నగర్మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ టికెట్ ధర మూడేళ్ళ క్రితం 100 రూపాయలుండేది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళే సగటు ప్రేక్షకులు మల్టీప్లెక్సుల వైపు మరలారు. ఇంతలో ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతోపార్కింగ్ ఫీజుల నష్టాల్ని పూడ్చుకోవడానికా అన్నట్టు టికెట్ ధరలు 150 కి పెంచేశారు. పార్కింగ్ ఫీజులున్నప్పుడు బైక్ కి 20కారుకి 30 రూపాయలుండేది. పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతో టికెట్ ధర 150 చేశారు. దీంతో 2030 రూపాయలు నష్టం  ప్రేక్షలకే తప్పమల్టీప్లెక్సులకి టికెట్టు మీద 2030 రూపాయలు అదనపు లాభమే. పార్కింగ్ ఫీజులు ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మల్టీప్లెక్సులకే అదనపు ఆదాయంగా మారింది! అయినా సగటు ప్రేక్షకులు భరించారు.

 

        ఇక కోవిడ్ తర్వాత టికెట్ ధర 200 కి పెంచేశారు. ఆన్ లైన్ బుక్కింగ్ చేసుకుంటే 30 రూపాయలు అదనం. కోవిడ్ దెబ్బతో కోట్లాది కుటుంబాలు ఆర్ధికంగా  ఛిన్నాభిన్నమవగాకోట్లమంది మధ్యతరగతి జీవులు దారిద్ర్య రేఖకి దిగువకు జారిపోగాసినిమా టికెట్ల రేట్లు పెంచడం తెలివి తక్కువ నిర్ణయమే. పైగా పెద్ద సినిమాలు విడుదలైతే 300400 రూపాయలు వసూలు చేయడం దోపిడీయే. తినుబండారాలు కూడా 30గ్రా పాప్ కార్న్ 100 రూపాయలు70 గ్రా పాప్ కార్న్ 200 రూపాయలు! టీ కాఫీలు 40 రూపాయలు! ఇదంతా కోవిడ్ కాలంలో మల్టీప్లెక్సులు మూతబడి భారీ నష్టాలు చవి చూసినందుకని కారణం చెప్పారు. మరి కోవిడ్ కాలంలో చితికిపోయిన ప్రజల నష్టాలు  ఎవరు తీరుస్తారు. తమ నష్టాల్ని ప్రజలు తామే భరించినట్టుమల్టీప్లెక్సులు వాటి నష్టాల్ని అవే భరించాలి. ఎవరి నష్టాల్ని వారే జీర్ణం చేసుకోవాలి తప్ప ఇంకొకరి ద్వారా పూడ్చుకోవాలని చూస్తే అసలుకే ఎసరురే వస్తుంది.

 

        ఇదే జరిగింది. మల్టీప్లెక్సుల నష్టాల్ని పూడ్చడానికి ప్రేక్షకులు ససేమిరా అని సినిమాలకి డుమ్మా కొట్టడం ప్రారంభించారు. మల్టీప్లెక్సుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక గ్రూపు కంపెనీ ఇంకో గ్రూపుకి మల్టీప్లెక్సులు అమ్మేసి చేతులు దులుపుకుంది. సినిమాలు ఫ్లాపవడానికి రకరకాల కారణాలు వూహించారు. వాటిలో ఓటీటీలు ఒకటి. ఓటీటీలతో నిర్మాతలు లాభపడుతున్నారుమల్టీప్లెక్సులకి నష్టాలే. అమెరికాలో కోవిడ్ కాలంలో దూరమైన ప్రేక్షకుల్ని తిరిగి రప్పించడానికి 3 డాలర్ల టికెట్టుతో జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించారు. ఇది బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇది చూసి ఇండియాలో నిర్వహించారు. ఇక్కడ కూడా విజయవంతమైంది. దీన్ని మూడు రోజులు పొడిగించి చూశారు. ప్రేక్షకులు తగ్గలేదు.

 

        దీంతో వ్యాపారం అర్ధమైంది. ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి ఓటీటీలు పూర్తి కారణం కాదనీపెంచేసిన టికెట్ల ధరలేననీ జ్ఞానోదయమైంది. సినిమా పండగ రోజు హిందీలో ‘చుప్ - రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ నిర్మాతలు వెనుకాడకుండా 75 రూపాయల టికెట్ ధరకే సినిమా విడుదల చేశారు. 90 శాతం ఆక్యుపెన్సీ తో ఆటలు కళకళ లాడాయి. దీన్ని మూడు రోజులు పొడిగించారు. ఇంకా బాగా ప్రేక్షకులొచ్చారు. అంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు దూరమయ్యారనే అభిప్రాయం కూడా తప్పని రుజువయ్యింది.  ఇదే ‘చుప్’ కి 200300 రెగ్యులర్ టికెట్ రేట్లు వసూలు చేస్తే అన్ని చిన్న సినిమాలకి లాగే ఇదీ మల్టీప్లెక్సుల రెంట్లు కట్టుకుని వెనక్కి వచ్చేది.

 

           సినిమా పండుగ జరిగే సెప్టెంబర్ 23 వ తేదీన తెలుగులో అల్లూరికృష్ణ వ్రింద విహారి (ఇదొక వికృత టైటిల్)దొంగలున్నారు జాగ్రత్త అని మీడియంచిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందుకని తెలుగు రాష్ట్రాల్లో 75 రూపాయల సినిమా పండుగని రద్దు చేశారు. రద్దు చేసి లాభపడిందేమీ లేదు.  75 రూపాయల టికెట్ కే ఈ మూడు సినిమాలు చూపించి వుంటే మీడియంచిన్న సినిమాలకి 200 రూపాయల టికెట్ కారణంగా  దూరమైన ప్రేక్షకుల స్పందన వేరేగా వుండేదేమో- ‘చుప్’ కి లాగా!

 

        ఇక కనీసం తెలుగులో చిన్నమధ్య తరహా  సినిమాల  నిర్మాతలు పునరాలోచించు కోవాలేమో. ప్రేక్షకులకి సినిమా అంటే 100 రూపాయల వస్తువే. సగటు ప్రేక్షకులకి సైతం. మల్టీప్లెక్స్ కంపెనీలు ఈ కోవలోనే ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. దీనికో ఎజెండా రూపొందిస్తున్నారు. చిన్నమధ్య తరహా బడ్జెట్ సినిమాలకి వేరియబుల్ ధర వుంటుంది. ఈవినింగ్నైట్ షోలుఅలాగే వారాంతాల్లో ఉద్యోగాలు చేసే యువ ప్రేక్షకులు ఎక్కువగా వుంటున్నారు. వీరిని వీలైనన్ని ఎక్కువ సార్లు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా విడుదలయ్యే చిన్నమధ్య తరహా సినిమాల టికెట్ల ధర్ల 100 రూపాయలు నిర్ణయించితినుబండారాల ధరలూ బాగా తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఈ చర్యలు  రాబోయే నెలల్లో విడుదలయ్యే మధ్య స్థాయి హిందీ సినిమాలని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు.


‘బ్రహ్మాస్త్రా
’,  ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ లకి ప్రయోగాత్మకంగా గత వారం 100 రూపాయల టిక్కెట్‌లని  విక్రయించారు. స్పందన బావుంది. నవంబర్‌లో షెడ్యూల్ చేసిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ కి 50 శాతం తగ్గింపుని ఆఫర్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్‌బై’  ప్రారంభ రోజున ₹150 లకే టికెట్స్ ని అందించారు. మరి కొంత సమయం తీసుకునిటిక్కెట్ ధరలు తగ్గిస్తే థియేటర్లకి  వచ్చే ప్రేక్షకుల ఫ్రీక్వెన్సీ నిజంగా పెరుగుతుందో లేదో విశ్లేషిస్తారు. టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా వుంటే పెట్టుబడిని తిరిగి పొందలేని భారీ-బడ్జెట్ చిత్రాలకి సాధ్యం కాదు. అయితే అక్టోబర్‌లో విడుదలయ్యే చిన్న తరహా సినిమాలకి నిర్మాతలు ప్రయోజనమే పొందుతారు.

 

        ఒకే ప్రాపర్టీ ఒకే సమయంలో ప్రీమియంతో బాటు  తక్కువ ధర టికెట్లని  అమలు చేయగల డ్యూయల్ టికెటింగ్ వ్యూహంకూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చౌకగా వున్నందున యువకులుశ్రామిక తరగతి ఫ్రేక్షకులు పెరుగుతారని ఆశిస్తున్నారు. ఈ సంస్కరణలకి తెలుగు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి.

***