రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మార్చి 2022, బుధవారం

1142 : రివ్యూ!

 

వినోదయ చిత్తం (తమిళం)
దర్శకత్వం : సముద్ర కని
తారాగణం : తంబి రామయ్య, సముద్ర కని, శ్రీరంజని, సంచితా శెట్టి, యువశ్రీ లక్ష్మి, షెరీన్, దీపక్ దినకర్, హరికృష్ణన్, జయప్రకాష్ తదితరులు
రచన : శ్రీవత్సన్, విజి, సముద్ర కని, సంగీతం : సి సత్య, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ ; అభిరామి మీడియా వర్క్స్
నిర్మాతలు: అభిరామి రామనాథన్, నల్లమ్మై రామనాథన్
విడుదల : అక్టోబర్ 13, 2021 -జీ5

***

        మిళంలో సముద్రకని దర్శకత్వం వహించిన వినోదయ చిత్తం (వింత కోరిక) తెలుగులో పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ లతో రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు. ఇది తమిళంలో ఓటీటీలో విడుదలైన గంటన్నర ప్రయోగాత్మక సినిమా. ఏమిటి ఇంత పొట్టి సినిమా ప్రత్యేకత? పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ తో రీమేక్ చేసేంత విశేషం ఇందులో ఏముంది? ఇందులో వున్న సానుకూల ప్రతికూలత లేమిటి? తమిళ మలయాళ స్మాల్ బడ్జెట్ సబ్జెక్టులు తెలుగులో స్టార్స్ కి సూటవుతాయా? ఈ సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ

        చెన్నైలోని ఓ ఎమెన్సీ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వుంటాడు పరశురామ్ (తంబి రామయ్య).  ఇక త్వరత్వరగా జనరల్ మేనేజరై పోవాలని ఆరాట పడుతూంటాడు. భార్య ఈశ్వరి (శ్రీరంజని), కుమార్తెలు వీణ (సంచితా శెట్టి), గాయత్రి (యువశ్రీ లక్ష్మి), అమెరికాలో పనిచేసే కుమారుడు అరుణ్ (దీపక్ దినకర్) వుంటారు. ఆధిపత్య భావజాలంతో హల్చల్ చేసే పరశురామ్ కంపెనీలో, ఇంట్లో ప్రతీదీ తన ఇష్ట ప్రకారమే జరిగి తీరాలని శాసిస్తాడు. తన నిర్ణయాల్ని ఇతరుల మీద రుద్దుతాడు. ప్రతీపనీ అనుకున్న టైంకి చేస్తాడు. ఇలా ఆ రోజు 25 వ పెళ్ళి రోజు వుంటుంది. సాయంత్రం వచ్చేస్తానని చెప్పి కంపెనీకి వెళ్ళిపోతాడు. అట్నుంచి కంపెనీ పని మీద కోయంబత్తూరు వెళ్ళాల్సి వచ్చి, కోయంబత్తూరు వెళ్ళి వస్తూ ప్రమాదానికి గురై చనిపోతాడు.

       చనిపోయిన వాడు లేచి కూర్చుంటాడు. భయం భయంగా చూస్తాడు. అంధకారంలో వుంటాడు. ఎవరో వ్యక్తి తన వైపు వస్తూ, తనని కాలం (సముద్రకని) గా పరిచయం చేసుకుంటాడు. పరశురామ్‌ కి భూమ్మీద కాలం తీరిందని, ఇక పరలోక ప్రయాణానికి పదమంటాడు. పరశురామ్ కంగాడి పడి, అప్పుడే పరలోకానికి పంపొద్దనీ వేడుకుంటాడు. తను చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయనీ, తను లేకపోతే పనులాగి పోతాయనీ,  కనుక పనులు పూర్తి చేయడానికి ఇంకొంత సమయం ఇమ్మనీ ప్రాధేయపడతాడు. కాలం అంగీకరిస్తాడు. పనులు పూర్తి చేసుకోవడానికి మూడు నెలల సమయమిచ్చి, తను వెంట వుండి చూస్తానని వచ్చి పరశురామ్ ఇంట్లో మకాం వేస్తాడు. ఇక పనులు పూర్తి చేసుకోమంటాడు.

      ఏమిటా పరశురామ్ పూర్తి చేయాల్సిన పనులు? కాలం నిఘా కింద వాటిని పూర్తి చేయగల్గాడా? అందులో ఎలాటి ఇబ్బందులు పడ్డాడు? ఈ క్రమంలో తన గురించి, జనన మరణాల గురించీ ఏం తెలుసుకున్నాడు? చివరికి కాలం ఇచ్చిన తీర్పేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఫిలాసఫికల్ ఫాంటసీ జానర్ కథ. కథ అనేకన్నా ఇది గాథ. గాథ అనడంలోనే సినిమాకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాథలు సినిమాలకి పనికిరావని ఎన్నో ఉదాహరణలు చూశాం. ఈ గాథ లోకంలో అన్నీ మన వల్లే జరుగుతున్నాయనీ, మనం లేకపోతే ప్రపంచమే ఆగిపోతుందనీ అహం పెంచుకుని ప్రవర్తించే మనుషులకి ప్రతీక. మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీ, ప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీ, మన కోసం కాలం ఆగదనీ, కనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ. అదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీ, జనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీ, మరణాన్ని చూసి భయపడకూడదనీ, చెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ. గాథకి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ ఫ్రెండ్లీగా బాగానే వుంది. కానీ గాథ కమర్షియల్ సినిమా ఫ్రెండ్లీ కాదు.

        మనం చూసిన కాలం మనతో వుండదు. ఇంకో కాలం వచ్చేసి మనల్ని వెనక్కి నెట్టేసి ముందు కెళ్ళి పోతుంది. ఈ గాథలో ప్రధాన పాత్ర పరశురామ్ తను చూసిన కాలంతోనే వ్యక్తుల్ని లెక్కగట్టి, వాళ్ళని అక్కడే కట్టేసి, తను అనుకున్నట్టు జరగాలనే, బాసిజం వెలగబెట్టే వ్యక్తి. ఫిలాసఫికల్ గా చూస్తే అతను వ్యక్తుల్ని శాసించడం లేదు, కాలాన్నే శాసిస్తున్నాడు. అందుకని కాలం కల్పించుకుని అతడి కాలం ముగించేసింది.

     పాపులర్ మూవీ బ్రూస్ ఆల్ మైటీ లో జిమ్ కేరీ స్వలాభం కోసం చేసే కొన్ని పనులు ఎదురు తన్ని, టీవీ రిపోర్టర్ ఉద్యోగంలోంచి డిస్మిస్ అవుతాడు. అప్పుడు వొళ్ళు మండిపోయి అసలు డిస్మిస్ చెయ్యాల్సింది నిన్నేరా! అని దేవుణ్ణి తిట్టి పోస్తాడు. ఆ  దేవుడు ప్రత్యక్షమై, తన పవర్స్ అన్నీ జిమ్ కేరీ కిచ్చేసి - ఇక పనులు పూర్తి చేసుకో  పొమ్మంటాడు. ఇది గాథ కాదు, కథ.

     ఆ గాథా ఈ కథా రెండూ మనిషి సూపీరియారిటీ కాంప్లెక్స్ గురించే. అయితే జిమ్ కేరీతో వినోద విలువలతో కాన్సెప్ట్ ని హాస్యభరితంగా, కథగా చూపిస్తే; పరశురామ్ తో వినోద విలువలకి వీడ్కోలు చెప్పి విషాద భరిత గాథ చేశారు. కారణం, ఇది ఇదే పేరుతో శ్రీవత్సన్ రాసిన తమిళ నాటకం  ఆధారంగా తీశారు. ఇందుకే గంటన్నర వుంది. నాటకం గాథగా వుంటే నష్టమేం లేదు. సినిమా కోసం నాటకాన్ని మార్చలేదని  సమాచారం. ఇక్కడే తప్పులో కాలేశారు ఈ గాథని కథగా మార్చకుండా.

        జిమ్ కేరీతో కథని - అదీ వినోదాత్మకంగా తీస్తే, 81 మిలియన్ డాలర్లకి 484 మిలియన్ డాలర్ల కనకవర్షం కురిసింది. ఈ తమిళ గాథతో ఈ సినిమా ఓటీటీ కిచ్చేసి సేఫ్ అయ్యారు. ఓటీటీకి గాథా కథా, పోట్టీ పొడుగూ ఏమీ వుండవు. ఒకసారి చందాకట్టేసి ఏడాది పాటు సినిమాలు చూస్తూ వుండే ప్రేక్షకుల వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే అన్నీ ఒకటే.

     ఇది థియేటర్ మెటీరీయల్ కాదని ఓటీటీలో చూస్తూంటేనే తెలిసిపోతుంది. దేవుడు- కాలం లాంటి ఫిలాసఫికల్ ఫాంటసీ కాన్సెప్టులు నాటకానికి సీరియస్ గా, గాథగా వుంటే సరిపోవచ్చు గానీ, సినిమాకి హాలీవుడ్ ప్రకారం హీరోయిక్ ఫాంటసీ కథగా వుండాల్సిందే. ఫిలాసఫీ పనికి రాదని కాదు. ఈ ఫిలాసఫికల్ ఫాంటసీని బ్రూస్ ఆల్ మైటీ లాగా ఫన్నీగా, కామెడీగా, కథగా తీయాల్సిందే. ఏ సీరియస్ కాన్సెప్ట్ అయినా షుగర్ కోటింగ్ వేసిన తియ్యటి క్యాప్సూల్ లా వుండాల్సిందే కమర్షియల్ సినిమాకి. మార్కెట్ యాస్పెక్ట్ కి. ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటీ అని మొదటి ప్రశ్న వేసుకోకుండా తీస్తే మనుగడ ఏమంత బావుండదు.

ఇంకా విషయం చూద్దాం

    పరశురామ్ కాలమిచ్చిన మూడు నెలల గడువుతో బతికొచ్చాక, కంపెనీలో తనని క్రాస్ చేసి జ్యూనియర్ జీఎం ఐపోవడం చూస్తాడు. కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. ఇంట్లో భార్య ఈశ్వరికి పార్కిన్సన్స్ వ్యాధి బయటపడి ఆస్పత్రి పాలవుతుంది. చికిత్సకి అమెరికా తీసికెళ్ళాలంటే చాలా డబ్బు అవసరం. ఇక స్నేహితుడి కొడుక్కిచ్చి పెద్ద కుమార్తె వీణ పెళ్ళి చేద్దామంటే, ఆమె కులం కాని వాణ్ణి ప్రేమించి వెళ్ళిపోతుంది. తండ్రి పరువు కోసం అక్క కాదనుకున్న సంబంధం చేసుకోవడానికి చిన్న కూతురు గాయత్రి సిద్ధపడుతుంది. పై చదువులకి తను అమెరికా వెళ్ళే ప్రయత్నాలు మానేసి. ఇంతలో అమెరికా నుంచి కొడుకు అరుణ్ అమెరికన్ భార్య (షెరీన్) ని వెంటబెట్టు కొస్తాడు. మరింతలో ఇటు గాయత్రి భర్త ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకోవడంతో గొడవై తండ్రి దగ్గరి కొచ్చేస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి.

        ఇలా ప్రతీ సమస్యకీ ఠారెత్తి పోతాడు, ఏడుస్తాడు. ఏం చెయ్యాలో తోచదు. తనతో సంబంధం లేకుండా, తను నిర్ణయించకుండా అన్నీ జరిగిపోతున్నాయి. సమస్యలతో రాజీ పడిపోతాడు. ఈ లోకానికి తనతో పనే లేదు. లోకం కంటే ఉన్నతుడని భావించుకున్న తనకి కనువిప్పయ్యింది. లోకంతో కలిసి, దాని అభీష్టాల్ని కూడా మన్నిస్తూ బ్రతకాలని తెలుసుకుంటాడు. మారిన మనిషవుతాడు.

        అయినా కాలం ఇంకో రెండు పాపాలు చేశావని గుర్తు చేస్తాడు. ఇప్పుడు కంపెనీలో ఈ స్థాయికి ఎదిగావంటే ఆనాడు చేసిన పాపమే కారణమని గుర్తు చేస్తాడు. పాతికేళ్ళ క్రితం మరొకరు చేరాల్సిన ఉద్యోగంలో మాయ చేసి తను చేరిపోయాడు పరశురామ్. అలాగే భార్య ఈశ్వరి తెచ్చే లక్ష కట్నం, ఓ స్కూటరు కోసం ప్రేమించిన ఇంకో అమ్మాయిని వదిలించుకున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికీ నిష్కృతి చేసుకుంటాడు.

        ఇప్పుడు కంపెనీ జీఎం కన్నా ఉన్నతమైన ఎండీ పోస్టులో కూర్చోబెడుతుంది. కుటుంబం అందరితో కలిసి హాయిగా గడుపుతాడు. మూడు నెలల గడువు తీరి కాలం ముందు నించుంటాడు. ఆయువు తీరిన అతడ్ని కాలం స్వర్గానికి తీసుకెళ్ళి పోతాడు.

ఫాంటసీ గాథా రహస్యం  
    ఇది గాథ కాబట్టి పరశురామ్ పాసివ్ పాత్రగా వున్నాడు. ఏ సమస్యతోనూ సంఘర్షించడు, పై చేయి సాధించడు. ఏడ్చి రాజీ పడతాడు. ఇవన్నీ కాలం సమక్షంలో జరుగుతున్నా కాలాన్ని ప్రశ్నించడు, ఎదురు తిరగడు. కాలాన్ని తన ప్రత్యర్ధిగా, శత్రువుగా భావించి - కాలానికి అతీతుడన్న తన సహజసిద్ధ భావంతో పోరాటం చెయ్యడు. గాథ అన్నాక అందులో కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? ప్రత్యర్ధి పాత్రే ముంటుంది? పాత్రకి అనుభవాలే వుంటాయి. సమస్యలతో అనుభవించీ అనుభవించీ ఓటమి చెందడమే వుంటుంది. ఇదే పరశురామ్ పని. ఇందుకే ఇలాటి సినిమాలు ఫ్లాపవుతాయి.

        ఓ పాత్ర- దానికి ఒకే ప్రధాన సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే స్ట్రక్చర్ గల కథగా గాక- స్ట్రక్చర్ వుండని గాథ కాబట్టి- ఒక సమస్య రావడం, అది ముగియడం, ఇంకో సమస్య రావడం, అది కూడా ముగియడం, మళ్ళీ ఇంకో సమస్య ... ఒక్కో సమస్య ముగియగానే కాలం దానికి నీతి చెప్పడం... ఇలా వివిధ సమస్యల ఎపిసోడిక్ - డాక్యుమెంటరీ కథనం ఇక్కడ ప్రత్యక్షమైంది. కమర్షియల్ సినిమా అంటే ఎపిసోడ్లు కాదుగా? డాక్యుమెంటరీ కూడా కాదు. ఒకే సమస్యతో సంఘర్షించే ఒకే కథ!

     ‘బ్రూస్ ఆల్ మైటీ లో ఉద్యోగం పోగొట్టుకున్న జిమ్ కేరీకి వొళ్ళు మండింది కాబట్టే యాక్టివ్ పాత్రగా దేవుణ్ణి తిట్టాడు. అలా ఓ కథ పుట్టింది. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య వాద ప్రతివాదాలు పుట్టకపోతే కథ పుట్టదు. చనిపోయిన పరశురామ్ పాసివ్ పాత్రగా కాలాన్ని బతిమాలుకున్నాడు కాబట్టి  కాలం దయదల్చి గడువిస్తే చాలనుకున్నాడు. అలాగే కాలం ఒప్పుకున్నాడు. దీంతో ఇక్కడ సంవాదం పుట్టలేదు, దాంతో ప్రత్యర్థి పుట్టలేదుఇలా ఎంతో అహం భావియైన తను ప్రాణాలు పోగానే - అసలు నా ప్రాణాలెందుకు తీశావని మౌలిక పాయింటు లేవదీసి కాలాన్ని తిట్టి ఎదురు తిరగకపోవడం ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో కథగా నడవడానికి ఏర్పడిన పెద్ద లోపం.

    తిట్టించి, కాలానికీ పరశురామ్ కీ మధ్య కాన్ఫ్లిక్ట్ పుట్టించడానికి ఎందుకు సందేహించాడు కథకుడు? సెంటి మెంట్ కాదనా? భక్త
తుకారాం లో అక్కినేని నాగేశ్వరరావు పాటలో, చేసిన మేలును మరిచే వాడా నువ్వా దేవుడివి... నువ్వొక వ్యర్థుడివి, నీకొక పేరూ లేదు, రూపం లేదు, నీతీ లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు.. అని చెడామడా దేవుణ్ణి తిట్టలేదా? (మనలో వున్న సబ్ కాన్షస్ ని మైండ్ ని తెలుసుకోకుండా బయటెక్కడో దేవుడున్నాడనుకుని దేవుడ్ని తిట్టడం జనాలకి నచ్చుతుంది. బాక్సాఫీసు ఫార్ములా).


        మరి ఈ గాథలో కాలం ఏం చేస్తూంటాడు? ఏమీ లేదు, బ్యాక్ గ్రౌండ్ లో వుంటూ పరశురామ్ తినే ఒక్కో ఎదురు దెబ్బకి ఒక్కో నీతి చెప్పడమే. ఇతను కూడా పాసివే. పాసివ్ పాసివ్ రాసుకుంటే పైసలేం రాలతాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిదైనా రాలుతుంది గాని. దాదాపు సగం సినిమా కాలం ఒకే డ్రెస్సులో అలాగే వుంటాడు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ గుర్తొచ్చినట్టు గబగబా డ్రెస్సులు మార్చేస్తూ వుంటాడు. కంటిన్యూటీ ప్రాబ్లమో, కాస్ట్యూమర్ పారిపోయాడో.

        నిజానికి పరశురామ్ పనులు పూర్తి చేయాలని గడువు తీసుకుని చేసిందేమీ లేదు. ఇది చెప్పాలనుకున్న పాయింటుకి లోబడిన పాత్ర చిత్రణే. తన వల్లే అన్నీ జరుగుతాయని నమ్మే వాడికి తన వెనుక చాలా జరిగిపోతాయని చెప్పడమే పాయింటు. ఇద్దరు కూతుళ్ళతో అలాగే జరిగింది, కొడుకుతో అలాగే జరిగింది. అయితే పెద్ద కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళి పోవడానికీ, కొడుకు అమెరికన్ భార్యతో రావడానికీ తనకి తెలియకుండా భార్య ప్రోత్సాహముందని చివర్లో తెలుసుకుంటాడు. బావుంది. మరి ఆ భార్యని పార్కిన్సన్స్ వ్యాధితో ఎందుకు శిక్షించింది కాలం? ఆమె చేసింది తప్పనా?

       అలాగే తండ్రి పరువు కోసం అతను చూసిన సంబంధం ఆపద్ధర్మంగా చేసుకున్న చిన్న కూతుర్నీ ఎందుకు శిక్షింది కాలం? వ్యాధితో వున్న భార్యని చికిత్సకి అమెరికాకి తీసికెళ్ళాల్సిన పనిని  ఎలా మర్చిపోయి అనుకున్న గడువుకి తనువు చాలించి వెళ్ళిపోయాడు పరశురామ్? అమెరికన్ కోడలు అమెరికాలో చికిత్స ఏర్పాటు చేసింది గనుకనా?

    ఈశ్వరిని చేసుకోవడానికి నమ్మిన ఇంకో యువతిని వదిలేసిన తను, అనారోగ్యంతో వున్న ఈశ్వరిని కూడా ఇలా వదిలేసి వెళ్ళి పోతాడా? అసలు ఈశ్వరితోనైనా తనదెలాటి ప్రేమ? 25వ పెళ్ళి రోజున తను యాక్సిడెంట్ లో చనిపోతే- కాలాన్ని అడగడానికి  పెళ్ళి రోజు గుర్తుకు రాలేదా? నా భార్య ఎదురు చూస్తోంది- నా పెళ్ళి రోజు చంపావేంటని అసలు ప్రశ్న వేయకుండా - ఇంకేవో పనులు పూర్తి చేయాలంటాడా? ఈశ్వరికి భర్త పోవడమే ఎక్కువ, అలాటిది పెళ్ళి రోజు ముస్తాబై ఎదురు చూస్తూంటే అదే సమయం చూసుకుని కాలం మహాశయుడు భర్త ప్రాణం తీశాడంటే అతడెలాంటి శాడిస్టు? (మళ్ళీ ఆమెకి పార్కిన్సన్స్ తో ఇంకో శాడిజం). ముందు కాలాన్ని నిలదీయాలి పరశురామ్ - ఈ కోలెటరల్ డ్యామేజ్ కి. ఇలా కాలంతో సంఘర్షించడానికి పుష్కలంగా రంగం సిద్ధమైవున్నా పాసివ్ గా వుండిపోయాడు పరశురామ్. రసోత్పత్తిలేని జీవచ్ఛవ సినిమా ఇచ్చాడు.

        సినిమా కథంటే రెండు పాత్రల మధ్య యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే అనేది కామన్ సెన్సు. ఇక్కడ కర్తృత్వపు కాంపిటీషన్. అన్నీ జరిపించే కాలం తను కర్త అనుకోవడం, లేదు తన వల్లే అన్నీ జరుగుతున్నాయనుకునే పరశురామ్ తనే కర్త అనుకోవడం-  ఇద్దరూ అమీతుమీ తేల్చుకోవడానికి సిగపట్లకి దిగడం. ఇలా ఒక ప్రధాన సమస్య ఏర్పాటై, ఇతర సమస్యలు సబ్ ఫ్లాట్స్ గా ఏర్పడి- మొత్తం కలిపి ఒక కథగా రూపం తొడగాల్సిన కాన్సెప్ట్. మొదటి ప్రశ్న మార్కెట్ యాస్పెక్ట్ చూసుకున్నాక, చూసుకోవాల్సిన క్రియేటివ్ యాస్పెక్ట్.

పాత్రల పంపకం - పెంపకం

    పరశురామ్ పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్న నడి వయస్కుడు. ఈ పాత్రకి వందకి పైగా సినిమాలు నటించిన సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు తంబి రామయ్య సరిపోయాడు. అహం, రోషం, భోళాతనం, అమాయకత్వం అన్నీ కలగలిసిన అతడి నటనే సాంతం ఈ సినిమా. కాలం పాత్రలో సముద్రకని సరిపోయినా పెద్దగా పని లేదు. తంబిరామయ్య వెంట వుంటూ మోరల్ లెసన్స్ ఇవ్వడమే. ఈ రెండు పాత్రల్లో తమిళ స్టార్స్ ఎవరినీ తీసుకోకపోవడం గమనించాలి. స్టార్ స్టేటస్ వున్న పాత్రలు కాకపోవడం చేత. గంటన్నర సినిమా కావడం చేత. నాటకం కావడం చేత కూడా కావొచ్చు. తమిళ నాటకాలనీ, సినిమాల్నీ ప్రమోట్ చేస్తూ తెలుగు రీమేకులు చేయడం జాతీయ సమైక్యతకి మంచిదే, మన సమైక్యత ఎలా వున్నా.  

వాటిలోకి పవన్ కళ్యాణులూ, సాయి ధరమ్ తేజులూ వంటి స్టార్లు వచ్చినప్పుడు పాత్రల పంపకం, పెంపకం కోళ్ళ ఫామ్ కాకూడదు. సముద్రకని గెటప్ బావుందని పవన్ సముద్రకని అయినా, ధరమ్ మనకింతే అనుకుని పెళ్ళీడు పిల్లలున్న మిడిలేజి తంబి రామయ్య అయినా - లేదూ, పాత్రలో నటించే అవకాశముందని పవన్ తంబి రామయ్య అయి, మనకి ఇది కూడా చాలనుకుని ధరమ్ సముద్రకని అయినా - మేకర్స్ ఇష్టం. బుద్ధిమంతుడు లో అక్కినేని భక్తుడై శోభన్ బాబు దేవుడయ్యాడు; అన్నమయ్య లో నాగార్జున భక్తుడై సుమన్ దేవుడయ్యాడు. చిన్నవాళ్ళే దేవుళ్ళయ్యారు. ఇలా తమిళ ఒరిజినల్ తో వున్న ఎన్నో సమస్యల్ని మేకర్స్ ఎలా పరిష్కరిస్తారో, పరిష్కరించి చివరికి తాము కథవుతారో గాథవుతారో చూడడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమానే.

సికిందర్

5, మార్చి 2022, శనివారం

1141 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి
తారాగణం : కిరణ్అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్అయ్యంగార్, సూర్య, రోహిణీ తదితరులు
సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం : రాజ్కె. నల్లి
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు
విడుదల : మార్చి 4, 2022
***

        కిరణ్ అబ్బవరం కొత్తగా వస్తున్న యువ హీరో. రాజుగారు- రాణివారు’, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లతో పరిచయమయ్యాడు. చేతినిండా సినిమాలతో బిజీగా వున్నాడు. కథలు బాగా వింటాడని, నిర్ణయాలు బాగా తీసుకుంటాడని, మేకింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడని పేరుంది. ఈ నేపథ్యంతో ఇప్పుడు సెబాస్టియన్ పీసీ 524 అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఐతే విడుదలకి ముందే ట్రైలర్ కథ మొత్తం తెలిసిపోయేలా కట్ చేశారు. ఇందులో తను ఇన్వాల్వ్ కాలేదేమో. అయితే సినిమా చూస్తే ట్రైలర్ ఎలా కట్ చేసినా ఒకటే నన్పిస్తుంది. ఈ సారి కొత్త దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డితో కిరణ్ అబ్బవరం ఆశయం నెరవేరిందా లేదా చూద్దాం...

కథ

సెబాస్టియన్ (కిరణ్ అబ్బరం )  అనే అతడికి బాల్యం నుంచీ రేచీకటి సమస్య వుంటుంది.  ఈ విషయం ఎవరికీ చెప్పనని చిన్నప్పుడే తల్లి మేరీ  (రోహిణి) కి మాటిస్తాడు. అతను కానిస్టేబుల్ అవాలని మేరీ పట్టుదల. దీంతో కంటి సమస్యని దాస్తూ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలో తన సమస్య గురించి ప్రేమిస్తున్న హేలీ (నువేక్ష) కి, ఓ ఫ్రెండ్ కి, ఓ డాక్టర్ కి మాత్రమే చెప్తాడు. ఈ సమస్యతో సరిగా ఉద్యోగం చేయలేక తరచూ బదిలీ అవుతూంటాడు. అలా ఫైనల్ గా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేరి ఎస్సై (శ్రీకాంత్ అయ్యంగార్) కి  భజన చేస్తూ నైట్ డ్యూటీలు పడకుండా చూసుకుంటాడు. ఓరోజు మాత్రం నైట్ డ్యూటీ చేయాల్సి స్తుంది. అప్పుడు నీలిమ (కోమలీ ప్రసాద్) అనే  వివాహిత త్య రుగుతుంది. రేచీకటి కారణంగా ఆమెని కాపాడలేక పోతాడు. అంతేగాక హత్యాస్థలంలో హంతకులు సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నా చూడలేకపోతాడు. దీంతో సస్పెండ్ అవుతాడు. ఇలా వుండగా హత్యతో తను ప్రేమిస్తున్న హేలీ కి సంబంధమున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సస్పెండ్ అయిన సెబాస్టియన్ కేసులో ఎందుకు, ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇన్వాల్వ్ అయి తెలుసుకున్న నిజాలేమిటి? హంతకులెవరు? ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలా వుంది కథ


       
కామన్ సెన్స్ తో చూస్తే ఇలాటి కథ వుండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రేచీకటి (నిక్టలోపియా) ని నయం చేసే చికిత్స వుంది. ఇప్పుడు కాదు, పూర్వమెప్పట్నుంచో వుంది- ప్రాచీన కాలంలో మూలికలతో మొదలై. ఓ నాల్గు కారణాలతో రేచీకటి కంటి చూపు సమస్య వస్తుంది. ఈ నాల్గూ చికిత్స తీసుకుంటే హాంఫట్ అయిపోతాయి. ఇలా చికిత్స వుండి, రేచీకటి (చీకట్లో చూడలేని) సమస్యని తొలగించుకునే అవకాశమున్నాక, హీరోకి ఈ సమస్యని ఆపాదిస్తూ కథ చేస్తే హాస్యాస్పదంగా వుంటుంది.  హీరో గారికి ఇది కూడా తెలియదురో- కామన్ సెన్సు లేదనుకుంటారు ప్రేక్షకులు.

        ఒకవేళ ఇలాగే కథ చేయదల్చుకుంటే
, హీరోని ఇలాగే చూపించి- చివరికి బల్బు వెలిగిన ఎస్సై శ్రీకాంత్ అయ్యంగార్ చేత- రేయ్ ఫూల్
, ఇంత అజ్ఞానమేంట్రా నీకూ...నీ రేచీకటితో ఇన్ని తిప్పలు పడుతూ  కేసు సాల్వ్ చేస్తావా? రేచీకటికి చికిత్స వుందటరా - వెళ్ళి బాగు చేయించుకో ఫో - అని ఒక్కటి పీకి వుంటే, ‘ఔనా? చికిత్స వుందా?’ అని హీరో షాక్ తింటే - కామిక్ రిలీఫ్ తో బాటు, కథ ఇలా చేయడం జస్టిఫై అయి వుండేది. అయితే ఇలా చేయడానికి అసలంటూ రేచీకటి గురించి సమాచారం సేకరించి వుండాలి కథకుడు.

        ఈ పాయింటుతో హాలీవుడ్ సినిమాలు ఎందుకు రాలేదో వూహించ వచ్చు. ఇది పాయింటే కాదు గనుక. తమిళంలో రెండు వచ్చాయి - శివాజీ గణేశన్ - కెఆర్ విజయ లతో
తవపుదువలన్ (1972) అనే డ్రామా; సిక్సర్  అనే రోమాంటిక్ కామెడీ (2019). కన్నడలో ఒకటి వచ్చింది-  అంధగార అనే థ్రిల్లర్ (2018).

        ఇక ఈ క్రైమ్ జానర్ కథకి ఏ జానర్ మర్యాదా లేదు. క్రైమ్ జానర్లో ఈ కథ పోలీస్ ప్రొసీజురల్ సబ్ జానర్ కిందికొస్తుంది. కానిస్టేబులైన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు కాబట్టి. హీరో కామిక్ పాత్రతో కథ ప్రకారం చూస్తే
, కంటి చూపు లోపంతో ఇతడి ఇన్వెస్టిగేషన్ అవకతవకగా నవ్విస్తూ-  మరో వైపు తన లోపాన్ని అధిగమించే తపనతో యాక్సిడెంటల్ గా కిల్లర్స్ దొరికిపోవడమనే హిలేరియస్ ఎంటర్ టైనర్ గా, యూత్ అప్పీల్ ని పిండుకోవాలి, అలా బాక్సాఫీసుని దండుకునే ప్రయత్నం చేయాలి. కానీ జరిగిన నేరాన్ని చూపించాక దాన్నెలా సాల్వ్ చేయాలో తెలియలేదు కథకుడికి/దర్శకుడికి. అసలే కామన్ సెన్సు లేని కథ అనుకుంటే, దానికి నాన్ సెన్సికల్ కథనం తోడయ్యింది. సెకండాఫ్ అంధకారంగా మారింది. 

నటనలు - సాంకేతికాలు
కిరణ్ అబ్బవరం కానిస్టేబుల్ పాత్రకి సరిపోతూ రేచీకటి సమస్యతో ఫస్టాఫ్ వరకూ వినోదాన్ని పోషించగల్గాడు. సెకండాఫ్ లో కానిస్టేబుల్ పాత్రనీ, రేచీకటినీ, వీటితో వినోదాన్నీ మర్చిపోయాడు. సెకండాఫ్ కథేమిటో తెలియకుండా పోతే ఏం నటించ గలడు. చాలా కృత్రిమంగా వుంది. పైగా ఫస్టాఫ్ లో తను అనుమానించిన హీరోయిన్నే కిస్సులు కూడా పెడుతోంటే ఏం క్యారక్టర్ అనుకోవాలి, ఏం కథనుకోవాలి. ఇంకా చనిపోయిన తల్లి గారి ఆత్మే మాటిమాటికి కనబడుతూ హిత బోధ చేస్తూంటే - ఈమెకి ఈ కథతో సంబంధమేంటనుకోవాలి. సెకండాఫ్ ప్రేక్షకులకి ఎంత సహన పరీక్ష పెట్టాడో  తెలుసుకుని, ఇలాటిది జరక్కుండా చూసుకోవాలి అబ్బవరం.

హీరోయిన్లిద్దరూ వేసిన పాత్రలు, నటనలు కూడా చెప్పుకోదగ్గవి కావు. ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగార్ ఓ మాదిరి. ఇక సంగీత సాహిత్య సాంకేతికాల గురించి చెప్పుకోవడాని కేమీ లేదు.


చివరికేమిటి

ఫస్టాఫ్ హీరో పాత్ర పరిచయం ప్రేమలు, రేచీకటితో పాట్లు, ఇవి సాగుతూ హత్య, దీంతో డ్యూటీ సరిగ్గా చేయలేదని సస్పెన్షన్, హత్యతో ప్రేమిస్తున్న హీరోయిన్ కి సంబంధముందని తెలియడం, ఇంటర్వెల్. ఇక సెకండాఫ్ రెండేళ్ళూ గ్యాప్. ఎందుకంటే, హత్య కేసులో సరైన సాక్ష్యాధారాల్లేవని కేసు కొట్టేసింది కోర్టు. కథలో ఈ రెండేళ్ళ గ్యాప్ ని భర్తీ చేయడానికి కథనంతో విఫలయత్నాలు. అప్పుడు హీరో మేల్కొంటాడు. కేసు కోర్టు కొట్టేసినప్పుడే ఎందుకు మేల్కొని రంగంలోకి దూకలేదు? ఇలాటి జవాబు లేని ప్రశ్నలతో హీరో లాజిక్ కి అందని సిల్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతాడు. హత్యకి కారణం కూడా బలంగా వుండదు.
        సస్పెన్స్, థ్రిల్ అనే వాటికి ఇక్కడ ఆస్కారం లేదు. రోమాంటిక్ కామెడీలు ఎలాపడితే అలా తీసేసినట్టు, క్రైమ్ -సస్పెన్సులు కూడా తీసెయ్యొచ్చన్న అవగాహనతో వస్తే ఈ జానర్ అంత మంచి ఛాన్సు నివ్వదు. రోమాంటిక్ కామెడీలే తీసుకోవడం మంచిది.

—సికిందర్

4, మార్చి 2022, శుక్రవారం

1140 : రివ్యూ!


 రచన- దర్శకత్వం: తిరుమల కిషోర్ 
తారాగణం : శర్వానంద్, రశ్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ , ఛాయాగ్రహణం : సుజిత్ సారంగ్
నిర్మాత: సుధాకర్ చెరుకూర
విడుదల : మార్చి 4, 202
***

        2017 లో మహానుభావుడు తర్వాత నుంచి హిట్లు లేక 5 వరస పరాజయాలు పూర్తి చేసుకున్న శర్వానంద్, ఇక రిపీట్ టైటిల్ తో ఆడవాళ్ళూ మీకు జోహార్లు అంటూ వచ్చేశాడు. ఒకే రకమైన సినిమాలు తీసే దర్శకుడు తిరుమల కిషోర్ తో ఇక పక్కా హిట్ అన్న నమ్మకంతో రంగంలోకి దిగాడు. 1981 లో కె బాలచందర్ తీసిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సామాజిక కథ. కృష్ణం రాజు, జయసుధ, సరిత, భానుచందర్, చిరంజీవి (అతిధిపాత్ర) నటీనటులు. అది హిట్టయ్యింది. మరి అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ శర్వానంద్ అందిస్తున్న ఈ తాజా కనుక ఎలావుంది? ఈసారైనా హిట్ దక్కిందా? తెలుసుకుందాం.

కథ  

చిరంజీవి (శర్వానంద్) కళ్యాణమండపం నడుపుతూ వుండే 36 ఏళ్ల బ్రహ్మచారి. అతడికి తల్లి  (రాధికా శరత్ కుమార్) తో పాటు ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు వుంటారు. వీళ్ళ కారణంగా పెళ్ళి కాదు. ఏ సంబంధం వచ్చినా వాళ్ళకి అమ్మాయి నచ్చదు. కాలం గడిచిపోతూంటుంది. ఓ రోజు ఆద్య (రశ్మికా మందన్న) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అయితే తన తల్లి కారణంగా పెళ్ళి చేసుకోలేనంటుంది. ఆమె తల్లి వకుళ (ఖుష్బూ) కి పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? ఏమిటామె కథ? చిరంజీవి ఆమెని ఎలా ఒప్పించి ఆద్యని పెళ్ళి చేసుకున్నాడు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

ఇంటినిండా లేడీస్, అందులో ఓ పెళ్ళి కథ అనే హమ్ ఆప్కే హై కౌన్ లాంటి కథ. రకరకాల హమ్ ఆప్కే హై కౌన్ లు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేశారు. ఇదే దర్శకుడు తీసిన నేనూ శైలజ చూశారు. ఇందులో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు సమస్య చక్కదిద్దడానికి. ప్రస్తుత సినిమాలో కూడా ఇదే పని మీద హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు. తేడా ఏమిటంటే, నేనూ శైలజ లో హీరోయిన్ కి పెళ్ళి నిర్ణయమై వుంటుంది. ఆమె తండ్రికోసం హీరోని కాదనుకుంటుంది. ప్రస్తుత సినిమాలో హీరోయిన్ పెళ్ళయే పరిస్థితి వుండదు. ఈమె తల్లి కోసం  హీరోని కాదనుకుంటుంది. ఒక టెంప్లెట్ సక్సెస్ అయిందని దాన్నే మార్చి చూపించడం, అది నటించడానికి హీరో ఒప్పుకోవడం, ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతూంటుంది.

        కానీ ఏ కథయినా, అదే ఎన్నిసార్లు తీసినా, కథలా వుంటే పర్వాలేదు. వర్కౌట్ అయిన టెంప్లెంట్ నే వాడేసి, కథ లేకుండా చేస్తే- కేవలం ఆడవాళ్ళ బృందంతో గ్లామర్ షో గా మార్చేస్తే- కథ మర్చిపోయి ప్రేక్షకులు కళ్ళప్పగించి చూస్తారనుకోవడం వర్కౌట్ కాదు. ఈ మూవీలో కథని, దానికి సంబంధించిన సంఘర్షణని, భావోద్వేగాలని, మెలోడ్రామాని, సముచిత పరిష్కారాన్నీ ఆశించకుండా, కేవలం నవ్వుకోవడాలతో గ్లామర్ షో కోసం చూడాలనుకుంటే చూడొచ్చు.

నటనలు సాంకేతికాలు

శర్వానంద్ బరువెక్కి బొద్దుగా మారడం ఇంటినిండా ఆడవాళ్ళు పెట్టిన తిండి వల్లే కావచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. శర్వానంద్ ముందుగా ఫిజిక్ పట్ల జాగ్రత్త వహించకపోతే ఫ్లాపుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పాత్రగా చూస్తే శర్వానంద్ చేయడానికేమీ లేదు. పాత్ర ఎదుర్కోవడానికి సరైన సమస్యే లేనప్పుడు, సంఘర్షణే లేనప్పుడు, పాత్ర ఏముంటుంది? ఇంట్లో ఆడవాళ్ళతో కామెడీ, రశ్మికతో రోమాన్స్, ఖుష్బూతో వుండీ లేని ఎమోషన్స్. సాంగ్స్ తో ఎంటర్టైన్మెంట్. అయితే ఇంత లైటర్ వీన్ పాత్రేసినప్పుడు, ముగింపులో కూడా ఓ హేపీ మూడ్ తో ప్రేక్షకుల్ని ఇంటికి పంపాల్సింది. ఇది జరగలేదు. కథంటూ వుంటే అందులోంచి ఏమైనా లాగి ముగింపుతో రంజింప జేయవచ్చు.

        రశ్మిక గ్లామర్, కాస్ట్యూమ్స్, స్టయిలింగ్ లతో మైమరపించే ప్రయత్నం చేసింది. హీరోయిన్ పాత్రకి ఐక్యూ తప్ప ఏమున్నా చూసేసేందుకు అలవాటు పడ్డారు కాబట్టి, రశ్మిక సక్సెస్ ఫుల్ గా కథా కథనాలనే బరువు బాధ్యతల నుంచి తప్పించుకోగల్గింది.  

        ఇక ఇతర నటీనటులు, ఆడవాళ్ళ బృందం షరా మామూలే. ఖరీదైన పట్టుచీరెలూ నగలతో మనం షాపింగ్ మాల్ కి టూర్ వెళ్ళినట్టు అన్పింపజేస్తారు. ఎవరికెవ రేమవుతారో బంధుత్వాలు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమైపోతుంది. ప్రదీప్ రావత్ కామెడీ చేయబోయాడు గానీ, అది కామెడీలా లేదు.

        దేవిశ్రీప్రసాద్ కూడా మనసు పెట్టి సంగీతం చేయలేదు. మొదటి రెండు పాటలు  కాస్త  ఫర్వాలే దన్పిస్తాయి. మాస్ పాటల్ని దంచి కొడుతూ క్లాస్ పాటలతో టచ్ కోల్పోతున్నాడేమో తెలీదు. సుజిత్ సారంగ్ కెమెరా, ప్రొడక్షన్ విలువలు రశ్మిక గ్లామర్ తో పోటీపడుతూ వున్నాయి. సినిమాల్లో ప్రొడక్షన్ విలువలున్నంత రిచ్ గా విషయం వుండదు.

        ఫస్టాఫ్ శర్వానంద్ కి పెళ్ళి కుదరని కామెడీలూ, రశ్మిక తో రోమాన్స్. ఆమె తల్లి కారణంగా పెళ్ళి చేసుకో ననడంతో పూర్తవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ ప్రారంభమైతే, కాన్ఫ్లిక్ట్ కాని ఈ కాన్ఫ్లిక్ట్ తో కూడా సంబంధం లేని ఫ్యామిలీ ప్రదర్శన వుంటుంది. కథే లేదు, వున్న కథ లోకీ వెళ్ళరు ఇంత మంది ఆడవాళ్ళూ కలిసి. శర్వానంద్ రశ్మిక తల్లి ఖుష్బూ కంపెనీలో చేరడం, పెళ్ళిళ్ళతో ఆమెకున్న  అభ్యంతరం గురించి ఒక్క మాటలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ రావడం, సినిమా కొలిక్కి రావడం...

        ఈ సినిమాలో ఆడవాళ్ళని  చూస్తే జెలసీ పుడుతుంది. వీళ్ళకేనా జోహార్లు, వీళ్ళు చెప్పాలనుకున్న కథకి కాదా?

—సికిందర్