రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, అక్టోబర్ 2022, శుక్రవారం

1225 : రివ్యూ!


 రచన- దర్శకత్వం: ఏ మోహన్ రాజా

తారాగణం : చిరంజీవి, నయనతార, ప్రగతి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మురళీ శర్మ, సాయాజీ షిండే, సునీల్, షఫీ తదితరులు
కథ : మురళీ గోపి (మలయాళం), మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం : థమన్ ఎస్, ఛాయాగ్రహణం : నీరవ్ షా
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
విడుదల : అక్టోబర్ 5, 2022
***

చార్య పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన లూసిఫర్ రీమేక్ తో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. రెగ్యులర్ తన మార్కు కమర్షియల్ మసాలాలకి దూరంగా ఈసారి కథా బలమున్న రాజకీయ డ్రామాలో నటించారు. విడుదలకి ముందు రిలీజ్ అయిన ట్రైలర్ తో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా బుకింగ్స్ బలంగా వున్నాయి. ఇందులో ఇంకా సల్మాన్ ఖాన్ కూడా ఒక పాత్ర నటించడంతో అదనపు ఆసక్తి ఒకటి ఏర్పడింది. రెండు దశాబ్దాల క్రితం హనుమాన్ జంక్షన్ అనే మలయాళం రీమేక్ తో హిట్ దర్శకుడుగా తమిళ సినిమాల్లోకి వెళ్ళిపోయిన దర్శకుడు మోహన్ రాజా, తిరిగి ఈ మలయాళం రీమేక్ తో చిరంజీవికి హిట్ ఇచ్చేందుకు సాహసించారు. ఇది సాధ్యపడిందా? మోహన్ లాల్ నటించిన  లూసిఫర్ తెలుగు డబ్బింగ్ 2019 లోనే విడుదలయింది. యూట్యూబ్ లో కూడా వుంది. తెలుగు ప్రేక్షకులు చాలా వరకూ చూసేసే వుంటారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ ని చూస్తే లూసిఫర్ ని మరిపించేలా వుంటుందా? తెలుసుకుందాం...

కథ
జనజాగృతి పార్టీ అధ్యక్షుడు
, ముఖ్యమంత్రి పికె రామదాసు మృతితో విషాద చ్ఛాయలు అలుముకుంటాయి. ఇంకా అంత్య క్రియలకి ముందే సీఎం పదవి కోసం కుమ్ములాటలు మొదలవుతాయి. పార్టీ నాయకుడు వర్మ (మురళీ శర్మ), నాయుడు (సాయాజీ షిండే) ఎత్తుగడలు వేస్తూంటారు. రామదాసు పెద్ద కుమార్తె సత్యప్రియ (నయనతార), అల్లుడు జయదేవ్ (సత్య దేవ్) ల పేర్లు ప్రతిపాదన కొస్తాయి. జయదేవ్ పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడుపుతూంటాడు. ఆ డబ్బుతోనే పార్టీని నడిపిస్తున్నందుకు పదవికి తానే అర్హుడని పావులు కదుపుతాడు.

ఇవన్నీ గమనిస్తున్న రామదాసు ఆత్మీయుడు బ్రహ్మ (చిరంజీవి) రంగప్రవేశం చేసి జయదేవ్ ని అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్యా పోరాటం మొదలవుతుంది. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్న బ్రహ్మ అసలు ఉద్దేశమేమిటి
? ఎవర్ని సీఎం పదవిలో కూర్చోబెట్టబోతున్నాడు? అతనంటే సత్య ప్రియకి ఎందుకు ద్వేషం? అసలు బ్రహ్మ ఎవరు? అతడికి రామదాసు కుటుంబంతో సంబంధమేమిటి? ఇవి తెలియాలంటే వెండి తెరమీద చూడాల్సిందే.

ఎలావుంది కథ

రాజకీయ సినిమా కథల్లో ఇదొక భిన్నమైన కథ. ఈ క్రెడిట్ మలయాళం లూసిఫర్ కిచ్చేయాలి. దీన్ని తెలుగుకి కొన్ని మార్పు చేర్పులతో  గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసినప్పుడు, లూసిఫర్ కి దీటుగానే ఫలితం వచ్చింది. ఇంత నీటయిన, అర్ధవంతమైన, బలమైన రాజకీయ డ్రామా చాలా కాలం తర్వాత  తెలుగులో చూస్తాం. ఒరిజినల్లో వున్న క్రైస్తవం, కమ్యూనిజం నేపథ్యాల్ని పూర్తిగా తొలగించినా కథకేమీ లోటు రాలేదు. బైబిల్లో లూసిఫర్ కథని తెలుగుకి జానపద రాజు కథగా నేపథ్యమిచ్చారు.

కథ ఒకెత్తు అయితే
, పాత్ర చిత్రణలొక ఎత్తు. చిరంజీవి బ్రహ్మ పాత్రని మలయాళంలో మోహన్ లాల్ లాగా పాత్ర వయసురీత్యా  ఔచిత్యం చెడకుండా కాపాడారు. చిరంజీవి కదాని ఫ్యాన్స్ కోసం, మాస్ కోసం, హీరోయినూ రోమాన్సూ పాటలూ డాన్సులూ పంచ్ డైలాగులూ కామెడీలూ వంటివన్నీ పూర్తిగా దూరం పెట్టి, ఆనాడు హిట్లర్ లో చిరంజీవిలాగా హూందాగా చూపించి పాత్రకి పూర్తి న్యాయం చేశారు. చిరంజీవి ఇమేజి చట్రాన్ని తీసి అవతల పడేశారు. రాజకీయ కథ కొత్తగా, మెచ్యూర్డ్ గా వున్నప్పుడు చిరంజీవి కూడా మెచ్యూర్డ్ గా, కొత్తగా వుండాల్సిందే.  ఇలా ప్రతీ పాత్రా డీసెంట్ గా బలంగా వున్నాయి.   ఇలా చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మౌలిక హిట్ కథ తెరకెక్కింది. ఇది చూస్తూ లూసిఫర్ ని మర్చిపోవాల్సిందే. ఈ కథలో అసలు బ్రహ్మగా చిరంజీవి ఎవరన్న దానికి రొటీన్ మూస ఫ్లాష్ బ్యాక్ వేయకుండా, ఫస్టాఫ్ నడుస్తున్న డ్రామాతోనే బ్రహ్మ గతాన్ని డిమాండ్ చేసే సన్నివేశం వచ్చినప్పుడల్లా, తెలుపు -నలుపులో మాంటేజెస్ తో దృశ్యాలు వచ్చి పోవడం నీటైన స్క్రీన్ ప్లే రచనలా వుంది.

నటనలు – సాంకేతికాలు
మొదటి పావుగంట తర్వాత చిరంజీవి ఎంట్రీ వుంటుంది. ఈ ఎంట్రీ హీరోయిజం కోసం ఫైట్ సీనుతో కాకుండా
, సీఎం అంత్యక్రియలకి వచ్చే సీనుతో డ్రమెటిక్ గా వుంటుంది. పావు గంట తర్వాత నుంచి కథ వేడెక్కి చిరంజీవి క్యారక్టరైజేషన్ స్థిర పడుతుంది. దెబ్బకి ఎదురు దెబ్బ తీసే డ్రామాతో ఇంటర్వెల్ వరకూ పాత్ర ఎలివేట్ అవుతూ పోతూంటుంది. ఇదంతా చిరంజీవి పెర్ఫార్మెన్స్ తో హైలైట్ అవుతూంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఫైట్ సీన్ కూడా డీసెంట్ గా వుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో థమన్ సంగీతంలోని పాటతో ఈ ఫైట్ ఒక ఈవెంట్ లా వుంటుంది.

అయితే సెకండాఫ్ కథ రొటీన్ గాడిలో పడినా
, ప్రత్యర్ధితో పోరాటంలో క్యారక్టర్ ని నిలబెట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. కానీ చివరి అరగంట క్లయిమాక్స్ ని కాపాడలేకపోయారు.

చిరంజీవికి దీటుగా ప్రత్యర్ధి పాత్రలో స్మాల్ హీరో సత్యదేవ్ ఒక సర్ప్రైజ్ అప్పీయరెన్స్. జయదేవ్ గా సత్యదేవ్ నటించిన ప్రతీ సీనూ రాణిస్తాయి. మెగాస్టార్ మూవీకి విలన్ గా నటించే ధైర్యానికి అతడ్ని మెచ్చుకోవాలి. గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వర్మగా మురళీ శర్మ కామిక్ విలనీ
, ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్న కొద్దీ చూడాలన్పించేలా వున్నాయి. ఈ ఎక్స్ ప్రెషన్స్ కోసమే దర్శకుడు క్లోజప్ షాట్స్ వేస్తూ పోయాడు. ఇక చిరంజీవి మీద కోపంతో వుండే నయనతార సీరియస్ నటన, బాల్యం నుంచీ ఆమె పాత్రకున్న గతం సన్నివేశాలకి డెప్త్ నిస్తాయి. ఇతర పాత్రల్లో సహాయ నటులూ ఏమీ తీసిపోలేదు.

ఇంటర్వెల్లో మాసూమ్ భాయ్ గా ఎంట్రీ ఇచ్చే సల్మాన్ ఖాన్ తిరిగి క్లయిమాక్స్ లోనే చిరంజీవిని కాపాడేందుకొస్తాడు. ఇద్దరూ వున్న ప్రతీ సీనూ కనువిందు ప్రేక్షకులకి. ఇద్దరి మీదా సాంగ్ కూడా కిక్ నిచ్చేదే. అయితే క్లయిమాక్స్ లో కథ మిగలక పోవడంతో సల్మాన్ చేసేదేమీ వుండదు పాత్ర పరంగా.

థమన్ కూర్చిన సంగీతం మెగాస్టార్ మూవీ లెవెల్లో వుంది. కథా బలం వల్ల తన సంగీతం బలంగా వున్నట్టు అన్పిస్తుంది. నీరవ్ షా కెమెరా వర్క్ చాలా ఉన్నతమైనది. క్రౌడ్ దృశ్యాలు
, దృశ్యాలకి వేసిన సెట్స్, ఇన్ డోర్ - ఔట్ డోర్ లొకేషన్స్, యాక్షన్ సీన్స్ ప్రతీదీ అతడి లైటింగ్ -కెమెరా వర్క్ తో దృశ్య వైభవాన్ని సంతరించుకున్నాయి. లక్ష్మీ భూపాల రాసిన డైలాగులు కూడా హైలైట్ గా, కొన్ని చోట్ల ఆలోచనాత్మకంగా వున్నాయి.

చివరి కేమిటి
రీమేకుల దర్శకుడు మోహన్ రాజా (ఎడిటర్ మోహన్ కుమారుడు) ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి ఈ రీమేక్ తో పేరు నిలబెట్టుకున్నాడు. చివరి అరగంట తప్పితే మిగతా రెండు గంటలూ పకడ్బందీ కథా కథనాలతో రాజకీయ డ్రామా నడపడం అభినందించ దగ్గ విషయమే. అయితే, చివరి అరగంటే చేజారిపోయింది. ఈ అరగంట క్లయిమాక్స్ నడపడానికి కథే లేదు. ఒక్క దెబ్బతో విలన్నీ ఫినిష్ చేయొచ్చు. చేయకుండా విలన్ తో యాక్షన్ సీన్స్ సాగిసాగి అనవసర హైరానా లాగా తేలింది. ఈ యాక్షన్ సీన్స్ కి చేసిన సీజీ కూడా నాసిరకంగా వుంది. తుపాకీ కాల్పులు, పేల్చివేతలూ అంతవరకూ నీటుగా చూపించు కొచ్చిన సినిమాని తారుమారు చేశాయి. ఈ లాజిక్ లేని మసాలా మాస్ కోసమేమో తెలీదు. మొత్తానికి చివర్లో సల్మాన్ ని తీసుకొచ్చి చిరంజీవితో ఇలా ధూం ధాం చేసి పూర్తి చేశారు.     

దసరా పండక్కి రక్తపాతం లేని తెలుగు ప్రమాణాలతో కూడిన రీమేకుని ఓ  రెండు గంటలు ఎంజాయ్ చేశాక
, చివరి అరగంట ముగింపు భరించక తప్పదు. అవ్వా కావాలి బువ్వా కావాలీ అంటే కుదరదుగా?

—సికిందర్

4, అక్టోబర్ 2022, మంగళవారం

1224 : రివ్యూ!


రచన - దర్శకత్వం: ము. మారన్
తారాగణం : అరుళ్ నిధి స్టాలిన్, మహిమా నంబియార్, అజ్మల్ అమీర్, విద్యా ప్రదీప్, సుజా వారుణి, ఛాయాసింగ్, లక్ష్మీ రామకృష్ణన్, జాన్ విజయ్, ఆనంద రాజ్, ఆడుకాలం నరేన్ తదితరులు

సంగీతం: సామ్ సిఎస్, ఛాయాగ్రహణం : అరవింద్ సింగ్
బ్యానర్ ; యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాత : ఢిల్లీ బాబు

విడుదల : సెప్టెంబర్ 30, 2022 (ఆహా)

***

       మిళం నుంచి ఓ మర్డర్ మిస్టరీ రేయికి వేయి కళ్ళు ఈ వారం ఆహా ఓటీటీ లో విడుదలయింది. ఒరిజినల్ ఇరవుక్కు ఆయిరం కన్గల్‌ టైటిల్ తో 2018 లోనే విడుదలయింది. ఇది జియో సినిమాలో ఇదివరకే వుంది. తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహాలో విడుదలైంది. దీనికి ము. మారన్ కొత్త దర్శకుడు. అరుళ్ నిధి స్టాలిన్ హీరో. చాలా చిత్ర విచిత్ర మలుపులతో ఈ మర్డర్ మిస్టరీ వుంది. ఇలాటి సినిమాలకి ఓటీటీల్లో మంచి ఆదరణ వుంటోంది. ఓ రెండు గంటలు మెదడుకి పనిబెట్టే అపరాధ పరిశోధక కథలు, మెదడే అవసరం లేని రోమాంటిక్ కామెడీలకంటే చాలా నయమే కాలక్షేపానికి. ఈ మర్డర్ మిస్టరీ ఎంత కాలక్షేపమో ఓ రౌండేసి చూద్దాం...

కథ

    క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్ నిధి స్టాలిన్), నర్సు సుశీల (మహిమా నంబియార్) ప్రేమించుకుంటూ వుంటారు. తండ్రికి చెప్పి పెళ్ళి చేసుకోవాలని సుశీల ఆలోచన. ఇంతలో గణేష్ (అజ్మల్ అమీర్) అనే అతను సుశీలని ఒక రోమియో బారి నుంచి కాపాడతాడు. తర్వాత రెండు సార్లు అక్కడక్కడా ఎదురవుతాడు. అతడి తీరు తేడాగా వుందని గ్రహిస్తుంది సుశీల. హద్దు మీరితే కొడుతుంది. రూపాలీ (ఛాయా సింగ్) అని సుశీల రిచ్ ఫ్రెండ్ వుంటుంది. ఆమెకి పరస్త్రీ లోలుడైన భర్త వసంత్ (జాన్ విజయ్) తో సమస్యలుంటాయి. ఆమెని గణేష్ ట్రాప్ చేశాడని సుశీల తెలుసుకుంటుంది.

గణేష్ ఒక హనీ ట్రాప్ టీంని ఆపరేట్ చేస్తూంటాడు. టీం మెంబర్లు అనిత (విద్యా ప్రదీప్), మాయ (సుజా వారుణి) లని మగవాళ్ళకి ఎరగా వేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. ఆ వచ్చే లక్షల రూపాయాల్నిఎంజాయ్ చేస్తూంటాడు.

ఒకసారి వైజయంతీ అనే క్రైమ్ నవలా రచయిత్రి (లక్ష్మీ రామకృష్ణన్) భరత్ క్యాబ్ ఎక్కినప్పుడు, రోడ్డు వారగా ఒకడు హై ఎండ్ బైక్ మీద పోతూంటే అనుమానంగా చూస్తుంది. ఇలాటిదే బైక్ మీద ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ ప్రమాద స్థలం నుంచి బైక్ మాయమైంది. ఇప్పుడు ఆ బైక్ మీద పోతున్న వాడు గణేష్ అని ఆమెకి తెలీదు.

ఇలా వుండగా, సుశీలతో బాటు రూపాలీనీ గణేష్ వేధిస్తున్నాడని తెలుసుకున్న భరత్, గణేష్ సంగతి చూడాలని వెళ్తాడు. ఈ సమయంలోనే గణేష్ తో బ్లాక్ మెయిల్ కీ, దోపిడికీ గురైన మురుగేశన్ (ఆనందరాజ్), నరేన్ (ఆడుకాలం నరేన్) లు గణేష్ ని చంపడానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. తర్వాత పక్కింటి అతను కంప్లెయిట్ చేస్తే పోలీసులు వచ్చి చూస్తారు. ఆ ఇంట్లో గణేష్ టీం మెంబర్ మాయ చచ్చిపడి వుంటుంది.

ఈ ముగ్గుర్లో మాయని చంపిందెవరు? గణేష్, అనితలు ఏమైపోయారు? వర్షపు రాత్రి ఏమిటీ మిస్టరీ? ఈ కేసులో ఇంకెన్ని లోతుపాతున్నాయి? ఇంకెందరు పాత్రధారులున్నారు? నిందితుడిగా పరారీలో వున్న భరత్ ఈ జటిల సమస్యని ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    చిన్న బడ్జెట్లతో వీరావేశంతో తీసేస్తున్న ప్రేమ సినిమాలకి థియేటర్లలో దిక్కు లేదు, ఓటీటీల్లోనూ రొక్కం లేదు. ఇవన్నీ ప్రమాదకరంగా ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ప్లాస్టిక్ లాంటి వ్యర్ధాలే. క్రైమ్ సినిమాలకి ఓటీటీల్లో డిమాండ్ వుంది. దీంతో ఇవి క్వాలిటీ ఎలా వున్నా (క్రైమ్ కి క్వాలిటీ ఏమిటి) చూసేస్తున్నారు ప్రేక్షకులు. కాస్త క్వాలిటీ వున్నవి రేయికి వేయి కళ్ళు అంటూ వస్తూంటాయి. వచ్చినప్పుడు నల్గురి నోళ్ళల్లో నానుతాయి. ఏమిటీ స్పెషాలిటీ అని చూస్తే- క్రైమ్ ఈజ్ సీరియస్ బిజినెస్ కామెడీ లాగే. కామెడీని తీయడాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలో, క్రైమ్ తీయాలన్నా అంతే సీరియస్ గా తీసుకోవాలి. బలహీన నేరాలు, వాటికి బలహీన దర్యాప్తులు, హీనమైన కథనాలు, ముగింపులూ తీస్తే వేరే కామెడీలు తీయనవసరం లేదు, ఇవే హాస్యాస్పదంగా వుంటాయి.

ఇదొకటైతే, క్రైమ్ లో సస్పెన్స్ అంటే చివరి వరకూ హంతకుడెవరో తెలియకుండా అదృశంగా వుంచడమే అనుకుని ఇంకా తీసేస్తున్నారు. ఈ ఎండ్ సస్పెన్సు కథలు ఏనాడో కాలం చెల్లిపోయాయని తెలుసుకోవడం లేదు. సినిమాకి కథ కావాలి, దాంతో యాక్షన్ కావాలి. సినిమా అంటే చలన చిత్రం, చలనంలో వుండేది. కథ కదలకుండా, యాక్షన్ లేకుండా నిశ్చలంగా వుండేది కాదు. ఇలా ప్రత్యర్ధి పాత్ర అయిన హంతకుడు అదృశ్యంగా వుంటే కథే పుట్టదు, యాక్షనే వుండదు. హంతకుడెవరా అని హీరోగారు వెతుక్కోవడంతోనే సరిపోతుంది. హంతకుడు ప్రత్యక్షంగా వుంటే ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ తో హీరోతో కథా, దాంతో యాక్షనూ సాధ్యమవుతాయి. ఇదే రేయికి వేయి కళ్ళు తో చేశాడు దర్శకుడు. ఎండ్ సస్పెన్స్ ఉచ్చులో పడకుండా సీన్ టు సీన్ సస్పెన్స్ తో కథనం చేశాడు.

ఇందులో హత్యకి అనుమానితులు ముగ్గురున్నా, పరారీలో వున్న గణేషే హత్య చేశాడని మనకి తెలిసిపోతుంది. కనుక ఎండ్ సస్పెన్స్ లేదు. ఇక అతడెలా దొరుకుతాటడన్న సీన్ టు సీన్ సస్పెన్సుని పుట్టిస్తూ యాక్షనే వుంది. ఇందుకే ఈ రెండు గంటల మర్డర్ మిస్టరీ ఇంట్రెస్ట్ గా మారింది. అయినా ఇందులోనూ లోపాలున్నాయి. కథ నడపడానికి పాయింటు కళ్ళముందున్నా, అసందర్భమైన పాయింటు ని లాగి సెకండాఫ్ కథనం చేశాడు. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

నటనలు - సాంకేతికాలు

    ఈ జానర్ సినిమాల్లో హీరో అనే వాడు కనీసం నవ్వకుండా మూతి ముడుచుకుని సీరియస్ గానే వుండాలా? సస్పెన్స్ అనే ఎలిమెంటే సీరియస్సై నప్పుడు, దాన్ని ఛేదించే హీరో కూడా సీరియస్ గానే వుంటే ద్వంద్వాలు వర్కౌట్ కాక, రిలీఫ్ లేని ఒకే మూడ్ తో సినిమా సాగి ఓపికని పరీక్షిస్తుంది. ఇందులో హీరో అరుళ్ నటన ఇదే. ఒక్కోసారి సీరియస్సో, విషాదమో అర్ధం గాని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తాడు. దర్యాప్తులో ఒక కొత్త విషయం తెలిసినప్పుడు మనం ఆశ్చర్య పడితే తను సీరియస్ గానే వుంటాడు. ఇలావుంటే కథని ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ చేస్తాడు. మర్డర్ మిస్టరీని ఛేదించడంలో తెలివితేటల వరకూ ఓకే కానీ, కాస్త వినోదం కూడా అందించాలి ప్రేక్షకుల నుంచి డబ్బులు తీసుకున్నాక. ఇది ఆర్ట్ సినిమా కాదు కాబట్టి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడా లేకుండా అరుళ్ ఇన్వెస్టిగేషనే కొనసాగడానికి కారణముంది. ఇది అనుమానితుడైనందుకు అతడి అవసరమే గాబట్టి.

       విలన్ గా అజ్మల్ ఇంకా సరాదాగా వుంటాడు సీరియస్ పనుల్లో కూడా డైలాగ్ కామెడీతో. హీరో క్యారక్టర్ కంటే ఈ క్యారక్టర్ కలర్ఫుల్ గా వుంటుంది. హీరోయిన్ మహిమా నంబియార్ హోమ్లీగా వుండే నటి. మర్డర్ జరిగిన తర్వాత ఈమె పాత్ర నామ మాత్రంగా వుంటుంది. కథని మలుపులు తిప్పే కీలక పాత్ర రిచ్ మొగుడికి భార్యగా అవస్థలు పడే చాయా సింగ్ ది. పాత్ర స్వరూపం మార్పులకి గురయ్యే క్రమాన్ని బాగా నటించింది. కథ డెప్త్, ఆత్మ అన్నీ ఈమె పాత్ర తోనే వున్నాయి. ఇక రచయిత్రి పాత్రలో లక్ష్మీ రామకృష్ణన్ కూడా. ఈమెతో ముగింపులో అతి చేశాడు దర్శకుడు. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.

       అనుమానితులుగా జాన్ విజయ్, ఆనంద రాజ్, ఆడుకాలం నరేన్ లలో  ఆనంద రాజ్ ది కామెడీగా వుండే పాత్ర. మిగిలిన ఇద్దరూ అనుమానితులుగా బాగానే నటించారు గానీ, అసలీ అనుమానితులకి సంబంధించిన కథనమే అవసరం లేదు. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.

        టెక్నికల్ గా బావుంది. ఈవారం విక్రమ్- వేదా కి సంగీతమిచ్చిన సామ్ ఈ మర్డర్ మిస్టరీకి కూడా థ్రిల్లింగ్ స్కోరు ఇచ్చాడు. సస్పెన్సు ని ఎలివేట్ చేసే బాణీలతో ఒక శైలిని మెయింటైన్ చేశాడు- మ్యూజిక్ డిజైన్ గా. అరవింద్ ఛాయాగ్రహణం కూడా ప్రొఫెషనల్ గా వుంది. కొత్త వాడైన మారన్ దర్శకత్వం పకడ్బందీగానే వుంది. సీన్ ఎక్కడ ప్రారంభించాలో, సీనులో ఏఏ విషయాలు కెమెరాకి అవసరం లేదో, సెల్ఫ్ ఎడిట్ చేసుకుని స్క్రిప్టు రాసినట్టుంది.

చివరికేమిటి

    ఫస్టాఫ్ మొదటి ముప్పావు గంట కథనాన్ని వివిధ పాత్రల్ని సెటప్ చేయడానికే తీసుకున్నాడు దర్శకుడు. పాత్రలు అనేకం వున్నాయి. అయితే  మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లాగా మల్టీపుల్ పాత్రలతో కన్ఫ్యూజన్ లేదు. ముప్పావు గంట తర్వాత మర్డర్ జరిగి హీరో సహా అనుమానితులు ముగ్గురూ ఎవరికి వాళ్ళు ఉడాయించడంతో, తర్వాత హీరో అరుళ్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా పారిపోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇంతవరకూ నీటుగా, బలంగా వుంది. ఈ మొత్తం మర్డర్ సీక్వెన్సులో విలన్ అజ్మల్ ని చూపించక పోయినా అతనే హంతకుడని మనకి తెలిసిపోతుంది. కనుక హంతకుడితో ఎండ్ సస్పెన్స్ కథనం వుండే ఆస్కారం లేదు.

సెకండాఫ్ తోనే సమస్య. పాయింటేమిటంటే అజ్మలే హంతకుడని తెలిసిపోతున్నాక, అనుమానితులుగా అరుళ్, ఆనందరాజ్, ఆడుకాలం నరేన్ లని చూపించడంలో అర్ధం లేదు. వెంటనే అరుళ్ అజ్మల్ ని పట్టుకుని తన మీద నిందని తొలగించుకునే ఎజెండాతో కొనసాగాలి. ఇలా కాకుండా ఆనంద రాజ్, నరేన్ లని ఒకరి తర్వాత ఒకర్ని పట్టుకునే ట్రాక్ తో, పట్టుకుని వాళ్ళు చెప్పే ఫ్లాష్ బ్యాకుల ద్వారా వాళ్ళకి హత్యతో సంబంధం లేదని తెలుసుకుని వదిలేయడం ద్వారా- జరిగిందేమిటంటే మనకి ముందే తెలిసిన విషయమే మళ్ళీ చెప్పడం లాగా తయారయ్యింది. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఎలా నమ్ముతాడో తెలీదు. ఎలాటి ప్రశ్నలు వెయ్యడు. తర్వాత ఇంకో అనుమానితుడు కూడా తెరపై కొస్తే అతడితో కూడా ఇదే తంతు.

ఈ మొత్తం వ్యవహారంలో హతురాలితో సంబంధమున్న అజ్మల్ కనిపించడం లేదని తెలుసుపోతున్నాక అరుళ్ వెంటనే అతడి వేటలో పడితే కథనం సరైన ట్రాక్ లో వుంటుంది. అనుమానితులతో, వాళ్ళ ఫ్లాష్ బ్యాకులతో చూపించిందంతా అనవసర చిత్రీకరణ, లాజిక్ లేని కథనం.  

అజ్మల్ ని పట్టుకోవాలంటే, బాధిత భార్య ఛాయా సింగ్ తో వున్న పాయింటు మీద దృష్టి కేంద్రీకరిస్తే సులభమమై పోయేది. ఇలాటి లాజిక్కులు వదిలేసి ముక్కు ఎక్కడుందంటే తల చుట్టూ తిప్పి చూపినట్టుంది కథనం. ఇక అనుమానితుడు ఆనందరాజ్ చంపడానికి పిస్తోలుతో వెళ్ళినప్పుడు, మాయ చచ్చిపడి వుంటుంది. ఆమె పక్కన పిస్తోలు వుంటుంది. ఆ పిస్తోలుతో కన్ఫ్యూజై, తన పిస్తోలు అక్కడ పడేసి, అక్కడున్న ఆ పిస్తోలుతో వచ్చేస్తాడు. పోలీసులకి హత్యా స్థలంలో పిస్తోలు దొరికినప్పుడు అదెవరిదో తెలుసుకుని ఆనందరాజ్ ని పట్టుకోవచ్చు. ఆ పని చెయ్యరు. అలాగే, రచయిత్రి భర్త యాక్సిడెంట్లో మరణించి బైక్ మిస్సయితే, ఆ బైక్ నిపట్టుకునే ఆలోచన కూడా చెయ్యరు పోలీసులూ క్రైమ్ రచయిత్రి. ఆ బైక్ అజ్మల్ కొట్టేసి తిరుగుతూంటాడు. రచయిత్రి భర్తని అతనే యాక్సిడెంట్ చేసి చంపి, బైక్ కొట్టేశాడా? ఆ భర్త కూడా హనీ ట్రాప్ బాధితుడేనా? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

చివరికి అంతా సుఖాంతమయ్యాక, క్రైమ్ నవలా రచయిత్రి వైజయంతీ 50 వ కోసం ఒక గొప్ప అయిడియా కనిపెడుతుంది. ఈ అయిడియా అరుళ్ కే చెప్తుంది. దాని ప్రకారం కేసులో జరిగినట్టు మాయని అజ్మల్ చంపడు. అరుళ్ ప్రేమిస్తున్న హీరోయినే మాయని చంపుతుంది. కేసులో అజ్మల్ ఇరుక్కుంటాడు. పాపం అరుళ్ ప్రేమిస్తున్న హీరోయిన్ ని సీక్రెట్ హంతకురాలిగా చేస్తే ఆమెతో అతడెలా  బ్రతుకుతాడనుకుందో రచయిత్రి? యాక్సిడెంట్ లో పోయిన తన భర్త బైక్ వేసుకుని అజ్మల్  తిరుగుతున్న విషయం మర్చిపోయిందేమో? భర్తని కూడా అతనే చంపి వుంటాడన్న మన అనుమానం కూడా తీర్చకుండా.    

       ఇలా సెకండాఫ్ లో వుండాల్సిన కథ వొకటైతే చూపించింది ఇంకొకటిగా తయారైంది.
—సికిందర్


2, అక్టోబర్ 2022, ఆదివారం

1223 : రివ్యూ!


రచన- దర్శకత్వం పుష్కర్-గాయత్రి

తారాగణం : హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్ తదితరులు  
హిందీ చిత్రానువాదం
: బెనజీర్ అలీ ఫిదా, మాటలు : బెనజీర్ అలీ ఫిదా, గాయత్రి, మనోజ్ ముంతషీర్; సంగీతం :
సామ్ సి.ఎస్, ఛాయాగ్రహణం : పిఎస్ వినోద్
బ్యానర్స్ : వైనాట్ స్టూడియోస్
, రిలయెన్స్ ఎంటర్ టైంమెంట్, టీ సిరీస్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్, థీమ్ స్టూడియోస్
నిర్మాతలు :
ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, భూషణ్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 30, 2022
***

        ణిరత్నం పొన్నియిన్ సెల్వన్ కి పోటీగా హిందీ విక్రమ్ - వేదా విడుదలైంది. ఇందులో సైఫలీ ఖాన్ - షారుక్ ఖాన్ లు మొదట నటించాల్సింది తర్వాత సైఫలీ ఖాన్ -అమీర్ ఖాన్ ల పేర్లు వినబడి, అమీర్ ఖాన్ కూడా తిరస్కరించడంతో ఆఖరికి సైఫలీఖాన్- హృతిక్ రోషన్ ల కాంబినేషన్లో తెరకెక్కింది. తమిళ దర్శకులు పుష్కర్- గాయత్రి లు తమిళ పానిండియాయే అయిన మణిరత్నం సినిమాతో పోటీ పడుతూ విక్రమ్ -వేదా కమర్షియల్ మాస్ తో ముందుకొచ్చారు. హిందీ ప్రేక్షకులకి కావాల్సింది మాస్ సినిమాలే. ఒకవేళ ఇది పోటీ పడకపోయినా మణిరత్నం సినిమా జాతకం వేరేగా వుండేది కాదు. మణిరత్నం సినిమా తమిళ ప్రేక్షకులకే పరిమితమైన శ్రమ ఫలితమని తేలిపోయింది. కనుక ఇప్పుడు విక్రమ్- వేదా ఫలితమేమిటి? పోటీలేని వాతావరణంలో హిట్టయ్యే విషయం ఏమైనా ఇందులో వుందా? ఐదు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి దీనిపై వ్యయం చేసిన 175 కోట్లు సురక్షితమేనా? ఇవి తెలుసుకుందాం...


కథ
లక్నోలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎసెస్పీ విక్రమ్ (సైఫలీ ఖాన్) క్రూరుడైన  కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వేదా బేతాళ్ (హృతిక్ రోషన్) అనుచరుల్నిఎన్ కౌంటర్ చేసి చంపేస్తాడు. ఇక వేదా కోసం వేట మొదలెడతాడు. వేదా 16 మందిని చంపి లక్నోని గడగడ లాడిస్తున్నాడు. ఐతే విక్రమ్ ఇంకో ఎన్ కౌంటర్ కి ప్లాన్ చేస్తూంటే, స్వయంగా వచ్చి వేదా లొంగిపోవడం ఆశ్చర్య పరుస్తుంది. ఇంటరాగేషన్లో వేదా ఒక కథ చెప్తానని చెప్పుకొస్తాడు. కథ చెప్పి, ఈ కథలో న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తాడు. ఆ న్యాయమే తను చేశానంటాడు వేదా. విక్రమ్ ఇరుకునపడతాడు. తను చెప్పిన న్యాయమే వేదా చేసి వుంటే ఇక అన్యాయం ఎక్కడుంది? న్యాయాన్యాయాల పట్ల అతను అభిప్రాయం మార్చుకోవాల్సిన పరిస్థితి...

        ఇంతలో విక్రమ్ భార్య లాయర్ ప్రియ (రాధికా ఆప్టే) వచ్చి వేదాని బెయిల్ మీద విడిపించేస్తుంది. ఆగ్రహంతో విక్రమ్ మళ్ళీ వేదాని పట్టుకుంటే ఈసారి అతనింకో కథ చెప్పి న్యాయం చెప్పమంటాడు. విక్రమ్ న్యాయం చెప్తే ఆ న్యాయమే చేశానంటాడు వేదా...ఇలా న్యాయాన్యాయాల ప్రశ్న విక్రమ్ నైతిక బలాన్నే దెబ్బతీస్తూంటుంది. ఈ సమస్యని అతనెలా పరిష్కరించాడు
? వేదా ఇంకో కథ కూడా చెప్తాడు. ఇక విసిగిన  వేదాకి విక్రమ్ ఏం న్యాయం చేశాడు? ఈ మొత్తం వ్యవహారంలో భార్య ప్రియా పాత్రేంటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
గ్యాంగ్ స్టర్ జానర్ కథ. దర్శకులు పుష్కర్ - గాయత్రిలు చెప్పినట్టు బేతాళ కథల ఆధారంగా చెప్పిన కథ. విక్రమ్ ని ఇరుకునబెట్టే వేదా చెప్పే కథలు విక్రమార్క బేతాళ కథల్లాంటి తన జీవితానుభవాలే.

విక్రమ్ - వేదా తమిళంలో 2017 లో మాధవన్- విజయ్ సేతుపతిలతో హిట్టయిన విక్రమ్- వేదా కి రీమేక్. అప్పట్లో దీని బడ్జెట్ 11 కోట్లకి 66 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ రీమేక్ కి 175 కోట్ల బడ్జెట్. మొదటి రోజు 12 కోట్లే వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని 20 కోట్లు. ఇది హిందీ పొన్నియిన్ సెల్వన్ కి 10 రెట్లు ఎక్కువే అయినా, ఈ అంకె నిరాశాజనకంగా వుంది. మూడేళ్ళ తర్వాత హృతిక్ రోషన్ తెర మీదికొచ్చి, సినిమాకి మీడియా రెస్పాన్స్ బాగుండి, రెండో రోజు 25 శాతం కలెక్షన్లు పెరిగాయి. అనుకున్న క్రేజ్ రాకపోవడానికి కారణం సినిమాలో విషయంతో వుందా అంటే అదేమీ కాదు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలు పీడిస్తున్న నార్త్ ప్రేక్షకులకి మత భక్తి ఫాంటసీల్లో ఊరట లభిస్తుందేమో. మత భక్తే ఈ పరిస్థితి తెచ్చినా. బాలీవుడ్ కి చాలా గడ్డు రోజులు.

ఈ గ్యాంగ్ స్టర్ కథని ఏది న్యాయం?  ఏది అన్యాయం - అన్న నైతిక ఆవరణలో డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు చేసి చెప్పిన విధానమే  జీవం పోసిందని చెప్పాలి. చాలా పూర్వం, అంటే 1971 లో గుమ్మడి హీరోగా నటించిన బ్లాక్ అండ్ వైట్ నేనూ మనిషినే ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇందులో జడ్జి పాత్రలో గుమ్మడియే హత్య చేస్తాడు. ఆ సమయంలో అతను జడ్జి కాదు, మనిషి. అయినా నేరం గిట్టుబాటు కాదని తెలిసీ మనిషి కుండే ప్రతీకారేచ్ఛతో తనలోని రెండో మనిషి వైపే మొగ్గి హత్య చేసేస్తాడు. ఇప్పుడు తమ్ముడి పాత్రలో పోలీసు అధికారిగా హీరో కృష్ణ ముందు నైతిక ప్రశ్న. ఇప్పుడు తను పోలీసు అధికారిగా డ్యూటీ చేయాలా, లేక తనూ ఓ మనిషిగా రక్త సంబంధాలకి లొంగిపోవాలా? బలమైన భావోద్వేగాలతో కూడిన క్రైమ్ డ్రామా ఇది. ఇందులో ఆ రోజుల్లోనే బుల్లెట్స్ తో బాలస్టిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ చూపించారు.

        గ్యాంగ్ స్టర్ వేదా విసిరే నైతిక ప్రశ్నలతో పోలీసు అధికారి విక్రమ్ డైలమా ఇలాంటిదే. గమనిస్తే పోలీసులకంటే నేరస్థులకి ఎక్కువ ఫిలాసఫీ వుంటుందేమో. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణని ఇదే డ్రైవ్ చేస్తూంటుంది. చివరికి అంతిమ న్యాయం డిమాండ్ చేసినప్పుడు ఇద్దరి మధ్య మెక్సికన్ స్టాండాఫ్ సీను. తమిళ కథని ఎక్కడా మార్చకుండా రీమేక్ చేశారు. కథలో మలుపులు ఉత్కంఠని పెంచుతూ కదలకుండా కూర్చోబెడతాయి.

నటనలు -సాంకేతికాలు
స్టార్స్ ఇద్దరివీ సమాన స్థాయి పాత్రలుడిఫరెంట్ నటనలు. సైఫ్ పోలీసు- హృతిక్ క్రిమినల్ యాంటీ పాత్రల మధ్య విడదీయలేని బంధంతో (బేతాళ కథల వల్ల) శతృత్వం, మిత్రుత్వం రెండూ వుంటాయిచివరికి మిత్రులైపోతారా అన్న సస్పెన్సుని పెంచుతూ. ఈ మాస్ యాక్షన్ పాత్రల్లో ఇద్దరూ ఆకట్టుకునే పరిస్థితి. లాయర్ పాత్రలో రాధికా ఆప్టే కూడా అంతే ప్లస్ అయింది. ఇతర పోలీసు పాత్రల్లో నటులూ ఫర్వాలేదు.

        ఓ రెండు పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ
, సామ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఈ స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ మూవీకి స్టయిలిష్ గానే కుదిరింది. హృతిక్ కి రాజ్ కపూర్ పాటల పిచ్చి వుంటుంది. ఒక ఫైట్ లో రేడియోలో కిసీకీ ముస్కురాహటో పే హో నిసార్ సాంగ్ వస్తూంటే, తన్మయం చెందుతూ చేసే ఫైట్ ఫన్నీగా వుంటుంది. ఫైట్ సీన్స్ కూడా స్టయిలిష్ గా కంపోజ్ చేశారు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఒక హైలైట్ లక్నో నగర దృశ్యాలతో.

        చివరిగా
, దర్శకులు పుష్కర్- గాయత్రీలు రీమేక్ కి న్యాయమే చేశారు. రొటీన్ మూస ఫార్ములా ధోరణులకి పోకుండా నియో నోయర్ పోకడలతో - నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్- శైలిలో గ్యాంగ్ స్టర్ మూవీని రాసి తీశారు. బాగా రాస్తే బాగా తీయొచ్చు, బాగా రాయక పోతే ఎంత బాగా తీసినా పొన్నియిన్ సెల్వనే!
—సికిందర్


, 

30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

1222 : కోలీవుడ్ కాలింగ్

ది లాక్ డౌన్ సమయం. చెన్నైలో దర్శకుడు  శంకర్ తోటి దర్శకులతో అనేక జూమ్ కాల్ సెషన్స్ ని ప్రారంభించాడు. ఆ దర్శకుల్లో మణిరత్నం, లింగుసామి, కార్తీక్ సుబ్బరాజ్  కూడా వున్నారు. ఆ మాటామంతీ జరుగుతున్నప్పుడు శంకర్ ఒకటి అడిగాడు : తను దర్శకత్వం వహించడానికి తగ్గ కథ ఎవరి దగ్గరైనా వుందాని. వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ స్పందించాడు. తను చాలా సంవత్సరాల క్రితం ఒక  రాజకీయ కథ రాసుకున్నాడు. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చాలా కాలం క్రితం భావించాడు. ఆ కథ శంకర్ కి చెప్పడంతో వెంటనే ఓకే చేశాడు శంకర్. ఆ కథే రాంచరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కుతోంది.

            2012 లో శంకర్ హిందీ త్రీ ఇడియెట్స్ని రీమేక్ చేశాడు స్నేహితుడుగా. ఇది ఫ్లాపయ్యింది. ఆ తర్వాత తీశాడు. డిఫరెంట్‌గా ట్రై చేసినా ఇది కూడా  డిజాస్టర్‌గా మారింది. ఆ భారీ పరాజయం తర్వాత శంకర్ సీక్వెల్స్ ఆలోచనలో పడ్డాడు. వెంటనే 2018 లో రోబోకి సీక్వెల్‌గా ‘2.0’ తీశాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆర్థిక వైఫల్యంగా మిగిలిపోయింది. ఇక 2019 లో కమల్ హాసన్‌తో కలిసి భారతీయుడుసీక్వెల్  ఇండియన్ 2’ ప్రారంభించాడు. ఇది అనేక సమస్యలతో, వివాదాలతో ఇంకా పూర్తి కాలేదు.

            ఇలా వుండగా, ‘అపరిచితుడుని రణవీర్ సింగ్ తో హీందీలో రీమేక్ చేద్దామని ప్రయత్నించాడు. దాని ఒరిజినల్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తో కాపీరైట్ వివాదంతో కోర్టులో పడింది. పైగా ఆస్కార్ రవిచంద్రన్ అపరిచితుడుని శంకర్ కంటే భారీ యెత్తున హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీయబోతున్నట్టు ప్రకటించాడు.

            ఇక రాంచరణ్ తో తీస్తున్న ఆర్సీ 15’ గతంలో తానే తీసిన ఒకే ఒక్కడుతరహా కథ. ముఖ్యమంత్రిపై పోరాడే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ కనిపిస్తాడు. ఈ కథ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ లు తన కథ నుంచి కాపీ కొట్టేశారని  చిన్నస్వామి అనే నిర్మాత కంప్లెయింట్ చేశాడు.

            పైనుంచీ కిందివరకూ, ఇదంతా చూస్తూంటే శంకర్ పరిస్థితి గందరగోళమని అన్పిస్తోంది కదూ? మామూలు గందరగోళం కాదు. తీసిన సినిమాలకే రీమేకులు, తీసిన సినిమాలకే సీక్వెల్సులు దగ్గర్నుంచీ, ‘నేను దర్శకత్వం వహించడానికి తగిన కథ వుందాఅని అడిగేవరకూ, ఇంకా కథల కాపీ వివాదాలు చుట్టుముట్టడం వరకూ అంతా గందరగోళమే. ఇది చాలనట్టు ఆర్సీ 15’ లో రాంచరణ్ ని ఇంకెలా గ్రాండ్ గా చూపించాలన్న సమస్య ఒకటి. ఎంత గ్రాండ్ గా చూపించాలో అంత గ్రాండ్ గానూ ఆర్ ఆర్ ఆర్లో ఎస్ ఎస్ రాజమౌళి చూపించేశాక, తనకి ఇంకేం మిగిలినట్టు?

            దేశంలో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ గా వెలిగిపోతున్న శంకర్ కి ఒకేసారి ఇన్ని సమస్యలు, సవాళ్ళు దేనికి? 2012 కి పూర్వం లేవే? అప్పుడంతా పట్టిందల్లా బంగారమే. రోబో, శివాజీ, అపరిచితుడు, బాయ్స్, ఒకే ఒక్కడు, జీన్స్, భారతీయుడు, ప్రేమికుడు, జంటిల్ మన్...అన్నీ అలా అలా బ్రహ్మాండమైన హిట్సే. కథల కొరతలేదు, సమస్యల్లేవు, వివాదాల్లేవు. ఏ కథ పట్టినా హిట్ కొట్టడమే. అలాటిది 2012 నుంచి ఈ దశాబ్దమంతా ఎందుకు కథల సమస్యలో పడ్డాడు?

            తన విజయవంతమైన సినిమాల రహస్యమేమిటి? దీని వెనుక హస్తం ఎవరిది? ఆ హస్తం రచయిత సుజాత లేకపోయేసరికి ఈ పరిస్థితా? 1993 లో  జంటిల్ మన్నుంచీ  రచయిత సుజాతా రంగరాజనే శంకర్ సినిమాలకి క్రియేటివ్ అండ. జంటిల్ మన్ నుంచీ రోబో వరకూ రచయిత సుజాతతో కలిసి జైత్ర యాత్ర. సుజాత రచన శంకర్ సినిమాలకి బలం, బాక్సాఫీసు విజయం. అతను రాసే  డైలాగులు సరళమైనవే  అయినప్పటికీ ప్రభావవంతమైనవి.

            సుజాత తన జీవితకాలంలో పొందిన ప్రజాదరణ తమిళంలో ఆధునిక రచయితలు కొందరే పొందారు. ఇంజనీర్‌గా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు తను. నవలా రచయితగా ప్రారంభంలో తన ప్రధాన ఇతివృత్తం స్త్రీ-పురుష సంబంధమే. తర్వాత తమిళంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత తానే అయ్యాడు.

            రజనీకాంత్ నటించిన గాయత్రి’, ‘ప్రియ` వంటి సినిమాలు డెబ్బైల నాటికే సుజాత నవలల ఆధారంగా వచ్చాయి. తర్వాత ఎనభైల మధ్యలో, కమల్ హాసన్ తో సూపర్‌కాప్ థ్రిల్లర్ విక్రమ్‌కథ సుజాతదే. దీనికి సీక్వెల్ గా కమల్ విక్రమ్నిర్మించి ఇటీవల ఆలిండియా హిట్ సాధించారు. సుజాత  ఆ తర్వాత మణి రత్నంతో రోజా`, ‘దొంగా దొంగా’ ‘అమృతసినిమాలకి చాలా ఫలవంతమైన కథా సహకారాన్ని అందించాడు.

            దర్శకుడు శంకర్‌కి వెన్నెముకగా నిలిచిన సుజాత 2010 లో కన్నుమూశాడు. రోబోతను రాసిన చివరి మూవీ. ఆ తర్వాత నుంచి శంకర్ అనాధ అయిపోయాడు. శంకర్ స్వయంగా కథల్ని సృష్టించలేడు. ఐడియాలు మాత్రం చెప్పి సుజాతతో రాయించుకు నేవాడు. సుజాత లేకపోయాక, తన ఐడియాలు కూడా నిండుకున్నట్టున్నాయి- తీసిన తన సినిమాలకి సీక్వెల్సే తీయడం మొదలెట్టాడు. లేదా రీమేక్ చేయడం మొదలెట్టాడు.  సుజాత వంటి రచయిత స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేనప్పటికీ, శంకర్‌తో పాటు ఇతర ప్రతిభావంతులైన రచయితలు సుజాత వదిలిపెట్టిన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఫలితాలు మాత్రం అనుకూలంగా రావడం లేదు.

            ఈ సంక్షోభం శంకర్ కి గొడ్డలి పెట్టు వంటింది. సౌత్ నుంచి పానిండియా సినిమాలు వెళ్ళి నార్త్ లో దండయాత్ర చేస్తూంటే, తను ఈ పదేళ్ళలో మూడు వరస ఫ్లాపులు తీసి, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుని వెనుకబడిపోవడం విచారకరం. ఇప్పుడు ఆర్సీ 15’ లో రాంచరణ్ ఎమోషన్స్ సరిగా ప్రకటించడం లేదని, రాంచరణ్ తో తను ఈ సినిమా తీస్తూ తప్పు చేస్తున్నానా అన్న సందిగ్ధంలో పడడం చూస్తే- శంకర్ పరిస్థితి ఏమిటా అన్పించకమానదు.

        పరిస్థితి ఇలా వుండగా ఇంకో సీను తెరపై కొచ్చింది. ఇక ఇప్పుడు శంకర్ నవలని సినిమాగా తీయాలనుకుంటున్నట్టు డిఫరెంట్ దృశ్యం. సొంత  ఐడియాలు, సీక్వెల్సు, రీమేకులూ ఇక పనికి రావనుకున్నాక నవలా సాహిత్యం మీద కన్నేయడం. అదీ చారిత్రక కథ కావడం. ఒక వైపు మణిరత్నం చారిత్రక నవలతో పొన్నియిన్ సెల్వన్’’ తీస్తూంటే, తను కూడా ఆయన మార్గంలో మసకబారిన తన కెరీర్ కి కొత్త దారి కనుక్కుంటున్నట్టు.

        చరిత్రని సినిమాగా తీస్తే గౌరవం పెరుగుతుంది, తమిళ చరిత్రని తెరకెక్కిస్తే తమిళుల గత వైభవం ప్రపంచానికి తెలుస్తుంది. తమిళ ఆత్మాభిమానాన్ని సంతృప్తి పరుస్తుంది. పైగా గత చరిత్ర తెలుసుకోవడానికి అనేక సమాజాలకి చారిత్రక సినిమా అనేది వొక పాపులర్ జ్ఞాన కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇందువల్ల ఈ సెకెండ్ ఇన్నింగ్స్ ని సద్వినియోగం చేసుకుంటే శంకర్ కి మరికొంత కాలం ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది.

   ఇంతకీ ఏమిటా శంకర్ తీసే చారిత్రక సినిమా అంటే, అదొక కళ్ళు తిరిగే వెయ్యికోట్ల మెగా ప్రాజెక్టు. వెయ్యి కోట్లతో సినిమా తీసే అవసరముందా అంటే ప్రకటనలదేముంది ఎంతైనా చెప్పుకోవచ్చని గుసగుసలు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్బడ్జెట్ 500 కోట్లు అవుతున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ళ  క్రితం అమీర్ ఖాన్ లగాన్తీసినప్పుడు, ఆ డబ్బుతో పది వూళ్ళకి తాగు నీటి సౌకర్యం కల్పించవచ్చని విమర్శలు వచ్చాయి. అప్పట్లో సినిమా నిర్మాణానికి 20 కోట్లు అంటేనే వింత. అందుకని అలాటి విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వ్యయం చేస్తే  అంత గొప్పగా చూస్తున్నారు. దానికి రెట్టింపు టికెట్ ధర పెట్టినా రొట్టెకి డబ్బుల్లేని వాడు కూడా తెగ ఆనందం అనుభవిస్తున్నాడు.

        వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూర్య కథానాయకుడుగా శంకర్ వేల్పారీఅనే చారిత్రాత్మకం  తీస్తున్నట్టు ప్రకటన. వీలైనన్ని ఎక్కువ భాషల్లో దీన్ని విడుదల చేయాలని ప్లాను. క్రీపూ 600-300 నాటి చరిత్ర ఇది. అప్పటి చిన్న రాజ్యమైన పరంబుని ఎంతో గొప్పవాడుగా పేరు తెచ్చుకున్న రాజు పారీపరిపాలించేవాడు. రాజ్యం చుట్టూ వున్న సుమారు 300 గ్రామాల ప్రజలు అతడ్ని ప్రశంసించే వారని చెబుతారు. అతను కళల్ని, సాహిత్యాన్నీ ప్రోత్సహించేవాడు. ఆ కాలాన్ని సంగం శకం అంటారు. సంగం శకం చివరి రాజులలో ఒకడైన పారీ దాతృత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఇలాటి రాజు మీదికి చెర, చోళ, పాండ్యన్ రాజులు యుద్ధాని కెళ్ళారు. ఈ యుద్ధానికి కారకుడు కూడా పారీయేనని చెప్పుకుంటారు.

        ఈ చరిత్రని నవలగా రాసింది ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, తమిళనాడు అభ్యుదయ రచయితల, కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకటేశన్. దీనికి ముందు రాసిన కావల్ కొట్టంఅనే చారిత్రక నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వేల్పారీనవల రాయడానికి ఆరేళ్ళు పట్టింది. దీనికోసం పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. తమిళ రాజు పారీ పాలించే చిన్న రాజ్యమైన పరంబు  మీదికి ఏకంగా చేర, చోళ, పాండ్యన్ త్రయం యుద్ధం చేయడానికి కారణమేమిటో ఈ నవలలో చెప్పాడు వెంకటేశన్. శంకర్ కోసం దీన్ని చిత్రానువాదం చేసే పనిని ఇప్పటికే ప్రారంభించాడు వెంకటేశన్.

        ఇప్పుడు శంకర్ దీన్ని సూర్యతో ఎంత గొప్పగా తీస్తాడనేది చూడాల్సి వుంది. తనకి ఎవరితోనూ పోలిక వుండేది కాదు. మణిరత్నంతో కూడా. మణిరత్నం తీసే సినిమాలు వేరు, తన సినిమాలు వేరేగా వుండేవి. అలాంటిది ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్’  చారిత్రాత్మకంతో మణిరత్నం సవాలు విసురుతున్నట్టే. ఇప్పటికే దీని మెగా క్వాలిటీని ట్రైలర్ చూసి అంతర్జాతీయ మీడియా ఆకాశాని కెత్తేస్తోంది. దానిదేముంది, ఇది సెప్టెంబర్ 30 న విడుదలవుతోంది...శంకర్ సినిమా పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది...అప్పటికి మణిరత్నం మూవీ పోటీకి వుండదనుకుంటే, అప్పటికి రెండో భాగం వచ్చి ఎదుట నిలబడ వచ్చు.

        ముందుగా శంకర్ ఇప్పుడు నిర్మాణంలో వున్న రెండు సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. కమల్ హాసన్ తో ఇండియన్2’, రాంచరణ్ తో ఆర్సీ15’. ఇవి పూర్తయ్యాకే వేల్పారీప్రారంభమవుతుంది. దీంతో శంకర్ ఉజ్వల భవిష్యత్తు పొంది తీరాలి తప్పదు.

—సికిందర్

*