రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

1214 : రివ్యూ!

రచన - దర్శకత్వం : ధృవ
తారాగణం :
ధృవ, ప్రీతీ సుందర్, భావనా మణికంన్, లావణ్య, బ్రహ్మాజీ, సమ్మెట గాంధీ తదితరులు

సంగీతం: అనంత నారాయణ, ఛాయాగ్రహణం : విజయ్ భాస్కర్ సద్దాల

నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృధ్వీ
విడుదల :
సెప్టెంబర్ 16, 2022 (ఆహా ఓటీటీ)

***

    టీవల ఓదెల రైల్వే స్టేషన్ అనే సీరియల్ కిల్లర్ సినిమా విడుదలైంది. తెలంగాణా గ్రామీణ నేపథ్యం. ఇలాటిదే తెలంగాణా గిరిజన ప్రాంతపు నేపథ్యంలో కిరోసిన్ సీరియల్ కిల్లర్ సినిమా ఇంకొకటి. పేర్లు తీసేస్తే రెండూ ఒకలాగే వుంటాయి. అవే పాత్రలు, ప్రాంతాలు, హత్యలు, దర్యాప్తులు, కథా కథనాలు. సీరియల్ కిల్లర్ సినిమాలు భారతీ రాజా దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఎర్ర గులాబీలు స్థాయిని అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. వీటిలో ప్రధానంగా వుండాల్సింది సీరియల్ హంతకుడి మానసిక ప్రవృత్తి. అమెరికాలో 46 మదిని చంపిన బర్డ్ జేక్, 21 మందిని చంపిన బైలీబ్రదర్స్ వంటి  సీరియల్ కిల్లర్స్ ని చూస్తే వెన్నులో  వణుకు పుడుతుంది. వాళ్ళ సైకో ఎనాలిసిస్ చేసినప్పుడు భయంకర సత్యాలు తెలుస్తాయి. సీరియల్ కిల్లర్ సినిమాలు చూసినప్పుడు మన చుట్టూ మనకి తెలియకుండా సీరియల్ కిల్లర్ వుండొచ్చన్న హెచ్చరికని చేసేలా వుంటాయి. ఇలా ఒక ప్రయోజనం లేకుండా సీరియల్ కిల్లర్  సినిమాల్ని తీసి లాభం లేదు.

        దొక తెలంగాణా గిరిజన గూడెం. అక్కడ అడవిలో గౌరీ (లావణ్య) అనే యువతి హత్య జరుగుతుంది. ఎవరో చంపి శవాన్ని దహనం చేశారు. పోలీసులు రంగంలోకి దిగుతారు. అక్కడి సర్పంచ్ నాయక్ (మధుసూదన రావు), ఎమ్మెల్యే వీరబాబు (బ్రహ్మాజీ) ఒత్తిడికి లొంగి ఒక అమాయకుడ్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు పోలీసులు. పోలీసు ఉన్నతాధికారి ఈ గూడెం చుట్టు పక్కల ఇది మూడో హత్య అనీ చెప్పి, వెంటనే ఈ హత్యల మిస్టరీ తేల్చేందుకు ఏసీపీ వైభవ్ (ధృవ) ని అక్కడికి పంపిస్తాడు.

ఏసీపీ వైభవ్ ఇంటరాగేషన్ స్పెషలిస్టు. అతను గౌరీ హత్య కేసు చేపట్టి దర్యాప్తు ప్రారంభిస్తాడు. అరెస్ట్ చేసిన అమాయకుడ్ని విడుదల చేసి ఎస్సైని సస్పెండ్ చేస్తాడు. అనుమానితుల్ని ప్రశ్నిస్తాడు. కొందర్ని పట్టుకుని కొడతాడు. ఇంతలో ఆ ప్రాంతాని కొచ్చిన సిటీ అమ్మాయి హత్య జరుగుతుంది. ఈమె శవాన్ని కూడా కిరోసిన్ పోసి కాల్చేశాడు హంతకుడు.  ఎవరీ సీరియల్ కిల్లర్? ఏసీపీ వైభవ్ ఎలా పట్టుకూన్నాడు? పట్టుకునే లోగా ఇంకిన్ని హత్యలు జరిగాయా? ఇదీ మిగతా కథ.

ఇందులో ఏసీపీ పాత్ర దర్శకుడే పోషించాడు. మిగిలిన పాత్రల్లో అందరూ కొత్త వాళ్ళే. అటవీ ప్రాంతపు లొకేషన్స్ ఎక్కువున్నాయి. గిరిజన గూడెంలో బయటి నుంచి చిన్నపాటి శిథిలమైన పోలీస్ స్టేషన్. లోపలికి వెళ్తే బయటి రూపంతో సంబంధం లేకుండా విశాలమైన అధునాతన హైటెక్ పోలీస్ స్టేషన్. బయటి లొకేషన్ వేరే, లోపలి లొకేషన్ వేరే. వీటిని కలిపి చీట్ చేసినప్పుడు సహజత్వాన్ని పట్టించుకోలేదు. అలాగే పోలీసు వాహనాలు. ఒక వాహనం వైజాగ్ నెంబర్ ప్లేట్ తో వుంటుంది. ఇంకో సీన్లో తెలంగాణా స్టేట్ పోలీస్ అని తగిలించుకుని వస్తుంది. మరింకో సీన్లో హైదరాబాద్  పోలీస్...

ఇంటరాగేషన్ స్పెషలిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆసక్తి రేపే ఏసీపీ పాత్ర ఇంటరాగేషనే చేయడు. కనీసం ఈ ఇంటరాగేషన్ పాయింటునైనా ప్రధానంగా చేసి, పోలీస్ ఇంటరాగేషన్లో తెలియని కోణాలు వెల్లడి చేసి వుంటే కథా పరంగా ఈ సినిమా ఎంతో నిలబడేది. దీని బదులు డైలాగులతోనే కథనం నడుస్తూ వుంటుంది. ఈ డైలాగుల ద్వారా నైనా కథలో మలుపులు, టెన్షన్, సస్పెన్స్, థ్రిల్ వంటివి పుట్టవు. యాక్షన్ సీన్స్ తో పరిగెట్టాల్సిన కథని డైలాగులతోనైనా వేడి పుట్టించకుండా రెంటికీ చెడ్డ రేవడి చేశారు.  
     
ఈ హత్యలు గూడెంలో భయ వాతావరణం కూడా సృష్టించవు. ఆడవాళ్ళ హత్యలు జరుగుతూంటే డోంట్ కేర్ అన్నట్టు ఆడవాళ్ళు వుంటారు. మరిన్ని హత్యలు జరగకుండా ఏసీపీ చర్యలు కూడా తీసుకోడు. ఈ బలహీన పాత్రలు, నటనలు, కథా కథనాలు, దర్శకత్వం కిరోసిన్ కోరుకుంటున్నట్టు వుంటాయి.  ఆ కిరోసిన్ డబ్బా ప్రేక్షకుల చేతిలో.

చివరికి హంతకుడ్ని పట్టుకుని చంపేస్తాడు ఏసీపీ. చంపేసి వాడి మీద కేసు ఎలా ప్రూవ్ చేస్తాడో తెలీదు. ఇది పోలీస్ ప్రొసీజురల్ జానర్ కి చెందిన కథ. ప్రొఫెషనల్ స్కిల్స్ తో టెర్రిఫిక్ గా తీయాల్సిన రూరల్ థ్రిల్లర్ సినిమా! అనుభవరాహిత్యంతో దీని ప్రాణం తీశాడు దర్శకుడు.

—సికిందర్

 

19, సెప్టెంబర్ 2022, సోమవారం

1213 : రివ్యూ!

రచన - దర్శకత్వం : సుధీర్ వర్మ
తారాగణం : నివేదా థామస్, రెజీనా కసాండ్రా, భానుచందర్, పృథ్వీ, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
కథ : మిడ్‌నైట్ రన్నర్స్ ఆధారంగా, స్క్రీన్ ప్లే -మాటలు : అక్షయ్ పి,  సంగీతం : మైకీ మెక్‌క్లియరీ, ఛాయాగ్రహణం : రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
నిర్మాతలు : డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్
విడుదల సెప్టెంబర్ 16,  2022
***

        వారం కాస్త భిన్నంగా ఇద్దరు పాపులర్ హీరోయిన్ల సినిమా విడుదలైంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జతకట్టి యాక్షన్ కామెడీతో అలరించేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చారు. అయితే బాక్సాఫీసు బద్దలు కొట్టారా, లేక ప్రేక్షకుల తలబద్దలు కొట్టారా అన్నది పాయింటు. ఈ పాయింటుకి బలి కాకుండా దీని దర్శకుడు సుధీర్ వర్మ సగంలోనే వదిలేసి సేఫ్ అయిపోయాడు. అనామకంగా ఇంకెవరో పూర్తి చేశారు. అంటే సినిమా జాతకం ఇక్కడే తెలిసి పోతోంది. అయినా బోలెడు డబ్బులుపోసి హక్కులు కొన్న కొరియన్ మూవీ కాబట్టి, రీమేకు ఎలా రూపొందిందన్న ఆసక్తి ఒకటి వుంటుంది. ఓసారి లుక్కేద్దాం...

కథ

శాలిని (నివేదా థామస్), దామినీ (రెజీనా కసాండ్రా) పోలీస్ అకాడెమీలో ట్రైనింగ్ కి చేరతారు. అపరిచితులైన ఇద్దరూ కీచులాడుకుంటూ వుంటారు. అకాడెమీ డైరెక్టర్ (భానుచందర్) వాళ్ళ క్రమశిక్షణా రాహిత్యానికి శిక్షిస్తూ వుంటాడు. ఎలాగో ఇద్దరూ కీచులాటలు మాని ఫ్రెండ్స్ అవుతారు. నైట్ పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. తిరిగి వస్తున్నప్పుడు ఓ గ్యాంగ్ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో వెంబడిస్తారు. గ్యాంగ్ దొరక్కపోవడంతో పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. పోలీసులు స్పందించరు. దీంతో తామే రంగంలోకి దిగుతారు కిడ్నాపైన అమ్మాయిని కాపాడేందుకు...

ఎవరా అమ్మాయి? ఎందుకు కిడ్నాప్ చేశారు? గ్యాంగ్ లీడర్ (కబీర్ దుహన్ సింగ్) నడుపుతున్న ఒక స్కామ్ తో కిడ్నాప్ కేం సంబంధం? దీన్నెలా ఛేదించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

కొరియన్ యాక్షన్ కామెడీ మిడ్ నైట్ రన్నర్స్ హక్కులు కొని రీమేక్ చేశారు. కొరియన్ మూవీ ఇద్దరు హీరోలతో వుంటే, తెలుగులో హీరోయిన్ల కథగా మార్చారు. ఈ కథకి హీరోయిన్లు సారధ్యం వహించడమే సబబు. ఎందుకంటే ఈ కథ స్త్రీ అండ అక్రమ రవాణాకి సంబంధించింది గనుక. స్త్రీ సమస్యకి స్త్రీల పోరాటంగా ఇద్దరు హీరోయిన్లతో యాక్షన్ కామెడీ మంచి ఐడియానే. తెలుగులో దీనికి తగిన నేటివిటీని జోడించి సమస్య తీవ్రత పట్ల అప్రమత్తం చేసి వుంటే దీనికో కథా ప్రయోజనమంటూ చేకూరేది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా సహాయక పునరుత్పత్తి సాంకేతికతా (నియంత్రణ) చట్టం 2021 అమల్లోకి తెచ్చింది. దీంతో బాటు అద్దె గర్భం (నియంత్రణ) చట్టం 2021 కూడా తెచ్చింది. దీని విభాగం హైదరాబాద్ లో కూడా వుంది.  సరోగసీ (అద్దె గర్భం) క్లినిక్‌ల నియంత్రణ, పర్యవేక్షణతో బాటు, దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ విభాగం లక్ష్యం.  దేశవ్యాప్తంగా సమస్య తీవ్ర స్థాయిలో వుంది. దీనిమీద ఒక హిందీ సినిమా కూడా గత సంవత్సరం విడుదలైంది.

హిందీ మూవీ మిమీ ని ‘మాలా ఆయ్ వాచ్చీ (నేను తల్లినవుతా) అనే మరాఠీకి  రీమేక్ గా తీశారు. ఇందులో సరోగసీ (అద్దె గర్భం) కథ మాతృత్వపు భావోద్వేగం చుట్టూ వుంటుంది. ఇది నిజంగా జరిగిన కేసు ఆధారంగా తీశారు. గుజరాత్ఉత్తరప్రదేశ్రాజస్థాన్‌లలో సామూహిక  సరోగేట్‌ కేంద్రాలది పెద్ద అక్రమ వ్యాపారం. ఈ సరోగసీ కేంద్రాల్లో విదేశీయులు తమ బిడ్డని కనడానికి తగిన యువతికి డబ్బు చెల్లించి అద్దె గర్భం తీసుకోవడం, పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్ళిపోవడం ఒక దందాగా సాగుతోంది. డబ్బు కోసం పెళ్ళి కాని యువతులు కూడా పాల్పడుతున్న ఈ సీరియస్ సమస్యని సినిమాలో హాస్యాన్ని జోడించి చెప్పి సక్సెస్ అయ్యారు.

కానీ శాకినీ ఢాకినీ కథలోనే చెప్పిన అండాల కోసం అమ్మాయిల్ని అపహరించే పాయింటుని  అస్సలు పట్టించుకోకుండా, కేవలం ఒక రొటీన్ కిడ్నాప్ కథగా మార్చేసి చేతులు దులుపుకున్నారు. పాత్రల్ని హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు, అమ్మాయిలుగా వాళ్ళు ఆడవాళ్ళకి ఎదురవుతున్న కొత్త ప్రమాదాన్ని ఫీలవ్వని అర్ధం లేని పాత్రలుగా చూపించారు. హీరోయిన్ పాత్రలుగా మార్చినప్పుడు కథకి ఇంకో బలం -అసలు బలం కూడా చేకూరే అవకాశం వుంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరు కిడ్నాప్ కి గురై వుంటే, అండాల స్మగ్లింగ్ కథ భావోద్వేగాలతో ఇంకో లెవెల్లో వుండేది.

కొరియన్ మూవీలో పాయింటు వుంది, ఆ పాయింటు మనకెలా అన్వయమవుతుందో ఆలోచించకుండా రీమేక్ కోసం రీమేక్ అన్నట్టు చుట్టేశారు.  అయినా ఏం ఫర్వాలేదు, వుందిగా మార్చి పైన సెప్టెంబర్ అన్నట్టు థియేటర్స్ లో జీరో అయినా, ఓటీటీలో పెద్ద మొత్తంలో చెక్కు జేబులో వేసుకోవచ్చు. ఓటీటీలు వున్నంత కాలం ఎంత అడ్డగోలుగానైనా  సినిమాలు తీసుకోవచ్చు.

నటనలు- సాంకేతికాలు

పోలీసు పాత్రల్లో నటీమణులిద్దరూ ఫైట్స్ చేయడానికి బాగా ట్రైనింగు పొందారు. ఫైట్స్ బాగా చేశారు. అయితే ఇది యాక్షన్ కామెడీ. కామెడీ మాత్రం చేయలేకపోయారు. కొరియన్ మూవీలో నామమాత్రపు కథని నిలబెట్టింది ఇద్దరు హీరోలు చేసే కామెడీనే. కడుపుబ్బ నవ్వించి నవ్వించి చంపారని ఫారిన్ రివ్యూలు చూస్తే తెలుస్తుంది. సినిమా సబ్ టైటిల్స్ తో యూట్యూబ్ లో ఫ్రీగా వుంది. 20 లలో వున్న యంగ్ హీరోలతో ఇది బడ్డీ/బ్రోమాన్స్ జానర్ మూవీ. ఈ జానర్ మర్యాదల్ని తెలుసుకోకుండా నివేదా, రెజీనాలని మూస హీరోయిన్లుగా సరిపెట్టేశారు. వీళ్ళిద్దరూ కథలో సమస్యని ఫీల్ కాకపోవడంతో భావోద్వేగాలు కూడా కుదరక గ్లామర్ ప్రదర్శన మీద ఆధారపడి నటించేశారు.

 లాజిక్, కామన్ సెన్స్ అన్నవి కూడా లేకుండా ఎలాపడితే అలా సినిమా చుట్టేశారు.  నివేదా, రెజీనా ఓ అమ్మాయి కిడ్నాప్ గురించి అర్ధరాత్రి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు పట్టించుకోకపోవడాన్ని కొరియన్ మూవీలో అర్ధాన్ని తెలుసుకోకుండా యధాతధంగా దింపేశారు. కొరియన్ మూవీలో కిడ్నాప్ జరిగేది చైనీయులు ఎక్కువుండే పేటలో. ఆ పేటలో అడుగు పెట్టాలంటే పోలీసుల ధైర్యం చాలదు. ఇదీ కొరియన్ మూవీలో కేసు తిరస్కరించడానికి కారణం. దీని మీద చైనాలో పెద్ద యెత్తున నిరసనలు చెలరేగి మూవీ బ్యాన్ చేసే దాకా పోయింది. దక్షిణ కొరియాలో చైనీయుల్ని అలా చూపించినందుకు. విలన్ కూడా చైనీస్ పాత్రే.

హైదరాబాద్ లో పోలీసులు కంప్లెయింట్ తీసుకోక పోవడానికి తగిన కారణం చూపకుండా, కొరియన్ మూవీ సీన్ని అర్ధం జేసుకోకుండా దింపేశారు. ఇంకోటేమిటంటే పోలీస్ అకాడెమీ డైరెక్టర్ కూడా విన్పించుకోడు!

ఇక సాంకేతికాలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాణ  విలువలు దేని మీదా తగిన శ్రద్ధ పెట్టలేదు. కరోనా కాలంలో అంతరాయాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చినందుకు కావొచ్చు మేకింగ్ క్వాలిటీ కూడా బలైంది.

—సికిందర్ 

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

1212 : రివ్యూ!


నేను మీకు బాగా కావాల్సిన వాడిని రివ్యూ!

కథ - దర్శకత్వం : శ్రీధర్ గాదె

తారాగణం : కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్, ఎస్వీ కృష్ణా రెడ్డి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు

స్క్రీన్ ప్లే - మాటలు : కిరణ్ అబ్బవరం, సంగీతం :  మణిశర్మ, ఛాయాగ్రహణం : రాజ్ నల్లి
బ్యానర్ : కోడి దివ్య ఎంటర్టయిన్మెంట్స్
నిర్మాత : కోడి దివ్య దీప్తి
విడుదల : సెప్టెంబత్ 16, 2022
***

        కొత్తగా వస్తూ ఇంకా అభిమానులంటూ ఎవరినీ ఏర్పర్చుకోలేక పోతున్న హీరో కిరణ్ అబ్బవరం, మూడేళ్ళలో నటించేసిన నాలుగు సినిమాల్లో రెండు  ఇదివరకే అట్టర్ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు ఇది ఐదో సినిమా. ప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మాత. శ్రీధర్ గాదె కొత్త దర్శకుడు. స్క్రీన్ ప్లే - మాటలు కిరణ్ అబ్బవరమే రాశాడు. మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా వుంటుందని, పూర్తి కుటుంబ కథగా తెరకెక్కిన దీన్లో అంతర్లీనంగా ఒక ముఖ్యమైన అంశాన్నిచర్చించామనీ, ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనీ, మొదటిసారిగా ఇందులో తను రెండు షేడ్స్  వున్న పాత్ర నటించాననీ, ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాననీ చెప్పుకొచ్చాడు. సినిమాలో ఇవన్నీ వున్నాయా? చూద్దాం...

కథ

వివేక్ (కిరణ్ అబ్బ‌వ‌రం) క్యాబ్ డ్రైవర్ గా వుంటాడు. రోజూ తాగి వచ్చే సాఫ్ట్ వేర్ తేజు (సంజనా ఆనంద్) ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూంటాడు. ఒక రోజు ఎందుకిలా తాగుతున్నావని అడిగి, ఆమె గతం తెలుసుకుంటాడు. వైజాగ్ లో ఆమెది ధనిక కుటుంబం. తల్లిదండ్రులు, బాబాయ్ కుటుంబం ఒకే భవనంలో సంతోషంగా వుంటారు. తండ్రి (దేవీ ప్రసాద్) ఆమెకి సంబంధం చూస్తాడు. కానీ ఆమె సిద్ధార్థ్ (సిద్ధార్థ్  మీనన్) ని ప్రేమిస్తూంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి బాధ పెట్టలేక పెళ్ళి రోజు సిద్ధార్థ్ కోసం వెళ్ళిపోతుంది. అతను మోసగాడని తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్ళే మొహంలేక, ఒంటరిగా వుంటూ తాగుడు మరిగిందన్న మాట.  

ఈమె ప్రేమ కథ తెలుసుకున్న వివేక్, తన ప్రేమ కథ చెప్తాడు. అతను దుర్గ (సోనూ ఠాకూర్) అనే లాయర్ని ప్రేమించాడు. ఆమె వేరొకర్ని పెళ్ళి చేసుకుని వెళ్ళి పోవడంతో దెబ్బ తిని, క్యాబ్ డ్రైవర్ గా బ్రతుకుతున్నాడు. ఇలా పరస్పరం తమ ప్రేమ కథలు చెప్పుకున్న వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. 

ఎలావుంది కథ

చాలా పాత కాలపు సినిమా కథ. బహుశా 1980 లలో వచ్చిన సినిమా కథ. దీన్ని కొన్ని కోట్లు త్యాగం చేసి ఈ కాలం ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకున్నారు. కోడి రామకృష్ణకి  ఇలా నివాళులర్పించా లనుకున్నారు. దీని కోసం ప్రేక్షకుల్ని ఎంతైనా టార్చర్ చేయడానికి ఖర్చుకి వెనుకాడకుండా తీవ్ర కృషి చేశారు. కొత్త దర్శకుడు, యంగ్ హీరో ఇద్దరూ పాత చింతకాయలోనే తమ విజయ రహస్యముందని నమ్మి తీశారు.

.ఇది ఈ కాలంలో మన అందరి ఇంట్లో జరిగే కథే అంటే నమ్మాలి, ఫీలవ్వాలి. ఇందులో అంతర్లీనంగా చర్చించిన  ముఖ్యమైన అంశం ఏమిటో క్విజ్ పోటీలు వేసుకుని చెప్పాలి. ఇందులో తండ్రీ కూతుళ్ళ అనుబంధానికి కనెక్ట్ అవడానికి అనుబంధాలే మున్నాయో వెతుక్కోవాలి. దొరక్కపోతే మళ్ళీ సినిమా చూడాలి. ఇందులో అబ్బవరం వున్న  రెండు షేడ్స్ లో ఒకటి ప్రేక్షకుల్ని ఫూల్స్ చేసినా ఆనందించాలి. కిరణ్ అబ్బవరం సెకండాఫ్ లో చెప్పే తన ప్రేమ కథంతా నిజం కాదనీ, స్వాతి పత్రికలో వచ్చిన కథ చెప్పి హీరోయిన్నీ ప్రేక్షకుల్నీ ఫూల్స్ చేశాడనీ తెలుసుకుని-  అతడి స్క్రీన్ ప్లే టాలెంట్ ని మెచ్చుకోవాలి. అతను రాసిన హద్దులు మీరిన డబుల్ మీనింగ్ డైలాగుల్ని ఈ కుటుంబ కథా చిత్రంలో ఆనందించాలి. ఈ సినిమా ద్వారా తను అందరికీ మరింత దగ్గరవుతాడన్న అతడి ప్రగాఢ విశ్వాసాన్ని కూడా గౌరవించాలి. అతను 1.5 రేటింగ్ ని సగౌరవంగా స్వీకరిస్తాడనేది నిర్వివాదాంశం.

నటనలు- సాంకేతికాలు

కిరణ్ అబ్బవరం మాస్ కమర్షియల్ స్టార్ అవ్వాలనే కోరికతో ఈ సినిమా నటించాడు. ఆవారా మాస్, తాగుబోతు మాస్, ఐటెమ్ సాంగ్ మాస్, ఇక ఫైట్స్ అయితే చెప్పనవసరం లేదు. తన హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు స్లోమో షాట్స్. ఇవన్నీ ఔట్ డేటెడ్ అయిపోయాయన్న విషయం పట్టించుకోలేదు. ఇక తన ప్రేమ కథలో రవితేజ మార్కు ఇమిటేషన్. ఇది హద్దులు మీరి వెకిలి తనంగా మారింది. ఇంతా చేస్తే తన ప్రేమ కథ నిజం కాదు, కల్పిత పాత్రలతో హీరోయిన్ కి కట్టుకథ చెప్పాడు. కనీసం టైటిల్ కోసమైనా హృదయాల్ని హత్తుకునే ఒక్క సీనూ నటించ లేదు. అబ్బవరం సినిమాలన్ని ట్లో ఇది అబ్బా అని గుచ్చుకునే నటన, సినిమా.

ఇక హీరోయిన్ సంజనా ఆనంద్ సాంతం శాడ్ గా వుండే పాత్ర, నటన. రోమాన్స్ లేదు, యూత్ అప్పీల్ లేదు. ఫస్టాఫ్ సగం వరకూ తాగిన మత్తులోనే వుంటుంది. ఇక అబ్బవరం కట్టుకథలో హీరోయిన్ సోనూ ఠాకూర్ లాయర్ పాత్ర ఎక్స్ ఫోజ్ చేస్తూ, రోమాంటిక్ గా వుంటుంది. అబ్బవరం కోసం ఓ మాస్ పాట వేసుకుంటుంది. ఇక కుటుంబ సినిమా అని ప్రచారం చేసిన ఈ సినిమాలో కుటుంబ పరివారం సీన్లు అంతంత మాత్రమే. ఒక్కరికీ సరైన పాత్రల్లేవు, రిజిస్టర్ కారు. 

ఇక మణిశర్మ సంగీతంలో పాటలు, నేపథ్య సంగీతం మొక్కుబడిగా అందించినట్టు వున్నాయి. పాట అయిపోయాక కనీసం ఆ పాట ట్యూన్ కూడా గుర్తుకు రాదు. సరైన సాహిత్యం రాయించుకోవడానికీ, పాడించుకోవడానికీ సినిమాలో  విషయం ఇన్స్ ఫైర్ చేయాలిగా? సాంకేతిక విలువలూ డిటో.

చివరికేమిటి

కొత్త దర్శకుడు తీసుకు వచ్చిన అరిగిపోయిన విషయం నిర్మాతకి నచ్చితే ఎవరేం చేస్తారు. అసలే అరిగిపోయిన విషయమైతే, అబ్బవరం స్క్రీన్ ప్లే, డైలాగులు రాయడం ఒకటీ. స్క్రీన్ ప్లే రాస్తూ చివరి పదిహేను నిమిషాల వరకూ సినిమాలో కథే లేకుండా చేశాడు. కథలోకి వచ్చేటప్పటికి చివరి పదిహేను నిమిషాలే మిగిలాయి. అంతవరకూ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, కట్టుకథతో తన ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాకులు కూడా కథే అనుకున్నట్టుంది. కథంటే ఏమిటో తెలుసుకోకుండా స్క్రీన్ ప్లే రాసేస్తే ఇలాగే వుంటుంది.

ఫస్టాఫ్ రాత్రి పూట ఐటెమ్ సాంగ్ తో ప్రారంభమయ్యే సినిమా, తాగి వున్న హీరోయిన్ని క్యాబ్ లో పికప్ చేసుకున్నాక, అరగంట సేపూ తాగి వున్న ఆమెతో సీన్లే వస్తూంటాయి. అరగంట గడిచాక, ఆమె తన ప్రేమ ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకూ చెప్తుంది. ఇంతసేపూ హీరో అబ్బవరం కనపడడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ ముగించడంతో ఇంటర్వెల్. ఇలా ఇంటర్వెల్ కి కూడా కథ ప్రారంభం కాదు, ఏం కథ చెప్పాలనుకుంటున్నాడో అర్ధం గాదు.

ఇక సెకండాఫ్ ముప్పావు గంట తన ప్రేమ కథ చెప్తాడు. ఇది స్వాతి పత్రికలో కథ చెప్పాడని తర్వాత తెలుస్తుంది. ఇలా ఇద్దరి ఫ్లాష్ బ్యాక్స్ పూర్తయి కథ లోకొస్తే పావుగంట మిగిలి వుంటుంది. ఆంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. ఇలా ఇప్పుడు  ప్రారంభమయిన కథలో మాంటేజెస్ వేస్తూ ఈ పావుగంటలో కొన్ని సస్పెన్సులు విప్పుతాడు. ఇలా తేలేదేమిటంటే ఎండ్ సస్పెన్స్ కథనం చేశాడని. ఎండ్ సస్పెన్స్ కథనం దృశ్య మాధ్యమం అయిన సినిమాని నిలబెట్టదు. ఇదింకో ఘోరమైన తప్పు. 

ఇద్దరూ ఒకటవడమే ముగింపని తెలిసిపోయే విషయమే. ఇద్దరూ హగ్ చేసుకుంటే ఎండ్ పడుతుందని కూడా వూహిస్తాం. కానీ హగ్ చేసుకోగానే మాస్ డ్యూయెట్ మొదలవుతుంది. ఇంకేం కథ మిగిలి వుందాని జుట్టు పీక్కోవడం మొదలెడితే, పాట అయిపోగానే ఎండ్ పడుతుంది! పిచ్చి చూపులు  చూడడం ప్రేక్షకుల వంతవుతుంది!

—సికిందర్ 

17, సెప్టెంబర్ 2022, శనివారం

1211 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం : సుధీర్ బాబు, కృతీ శెట్టి, అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణీ నటరాజన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్ , ఛాయాగ్రహణం : పీజీ విందా
బ్యానర్స్ : బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల :   సెప్టెంబర్ 16, 2022
***

        సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో సమ్మోహనం తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్. ఈ రోమాంటిక్ డ్రామా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వైరల్ అయ్యాయి. మరి సినిమా వైరల్ అయ్యిందా? తెలుసుకుందాం...

కథ
నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్. మొదటి మగాడు, కసక్, గుడ్ బాయ్- బ్యాడ్ బాయ్ వంటి ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఏడో సినిమా ప్లాన్ చేస్తాడు. నిర్మాత ఏ కథ ఏ హీరో హీరోయిన్లతో తీసినా అభ్యంతరం లేదని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. కొత్త హీరోయిన్ గురించి ఆలోచనలో నవీన్ కి చెత్త కుప్పలో ఒక సినిమా రీలు దొరుకుతుంది. ఆ రీలు వేసి చూసి షాక్ అవుతాడు. అందులో ఎవరో అద్భుతంగా వున్నకొత్త హీరోయిన్ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవడానికి కో డైరెక్టర్ బోస్ (వెన్నెల కిషోర్), రైటర్ రమణ (రాహుల్ రామకృష్ణ) లతో కలిసి వేట మొదలెడతాడు

ఆమె కంటి డాక్టర్ అలేఖ్య (కృతీశెట్టి) అని తెలుస్తుంది. కానీ అలేఖ్యకి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ద్వేషం. ఆమె తల్లిదండ్రులు (శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్) కూడా ద్వేషిస్తారు. అయినా ఎలాగైనా అలేఖ్యని హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించే ప్రయత్నంలో, సినిమాలంటే ఆమెకెందుకు ద్వేషమో తెలుసుకుని షాక్ అవుతాడు.

ఏమిటామె చెప్పిన విషయం? దీంతో డిస్టర్బ్ అయిన నవీన్ తిరిగి ఎలా తన ప్రయత్నాలు కొనసాగించాడు? ఈ క్రమంలో ఇంకేమేం జరిగాయి? అలేఖ్య, ఆమె తల్లిదండ్రుల ద్వేషాన్ని ఎలా ప్రేమగా మార్చి దర్శకుడిగా తను ఇంకో మెట్టు పైకెదిగే సినిమా తీశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
కేవలం రోమాంటిక్ డ్రామా కాదు, ఇంకా చాలా. ఒక దర్శకుడు స్త్రీ స్వశక్తీ కరణ గురించి, విముక్తి గురించీ ఎన్నో సినిమాలు తీయొచ్చు. నిజ జీవితంలో అలాటి స్త్రీ ఒక్కరినైనా  ఉద్ధరించి సినిమాలు తీసే వాడుంటాడా? వాడు కదా గొప్ప దర్శకుడు? కూతుర్ని సంరక్షణ పేరుతో ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులు, కూతురు గర్వకారణంగా వుండాలని ఎందుకు కోరుకోరు? ఆ స్వేచ్ఛ ఎందుకివ్వరు? తోబుట్టువులకి అర్ధమేమిటి? ఒకరి కలని ఇంకొకరు నిజం చేయడం కాదా? కట్టుబాట్లని ధిక్కరించడంలో శాంతి వుంటే ఆ శాంతిని ఎందుకు పొందకూడదు? ఇలా ఈనాటికీ ఈ అభ్యుదయ భావాల గురించి మాట్లాడడం, సంఘర్షించడం మానవ జాతికి నగుబాటు కాదా?

పై ప్రశ్నల సమాహారమే ఈ కథ. రోమాంటిక్ డ్రామాకి పూర్తిగా మార్చేసిన దృక్కోణం, భాష్యం. ఇందులో రోమాన్స్ కంటే జీవితం గురించి ఎక్కువ. అవే పస లేని, ఆదరణ కోల్పోయిన రొటీన్ రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాల పేరుతో వస్తున్న ప్రేమ సినిమాల మధ్య కాస్త ఆలోచన, అభిరుచీ గల ప్రేక్షకుల కోసం రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి మెచ్యూర్డ్ ప్రయత్నం.

తెర మీద దర్శకుడి పాత్ర ఎంత ఉన్నతంగా కన్పిస్తుందో, తెరవెనుక ఇంద్రగంటి కూడా అంత గౌరవం పెంచుకుని కన్పిస్తారు. ఇంద్రగంటి సినిమాలన్నీట్లో ఇది టాప్. ఎంత టాప్ అంటే, దీనికి ప్రేక్షకులు తక్కువ. తెలుగులో క్వాలిటీ సినిమాలకి ఇంకా ఎదగాలి కదా ప్రేక్షకులు. సీరియస్ సినిమా, కాస్త బాధపెట్టే సినిమా వస్తే టీవీ సీరియల్ అని కొట్టి పారేసే వర్గం బయల్దేరింది. టీవీ సీరియల్ కీ, సినిమాకీ తేడా తెలియకుండానే దర్శకులు సినిమాలు తీస్తారా? టీవీ సీరియల్స్ సినిమాల్లోంచే వచ్చాయి. కానీ బలహీన, సోకాల్డ్ కుటుంబ కథలు సీరియల్స్ గా చూపించి ఈ జానర్ నే దెబ్బతీశాయి. ఇదే సినిమాలకీ ఆపాదించి కొట్టి పారేయడం, అదే ఇలాటి సీరియస్- ఆలోచనాత్మక సినిమాలు వేరే భాషల్లో వస్తే ఆకాశానికేత్తేయడం ఫ్యాషనైపోయింది- ఒక పక్క హెవీ మదర్ సెంటిమెంట్ల ఒకేఒక జీవితం లాంటివి హిట్ చేస్తూ!

నటనలు- సాంకేతికాలు

సుధీర్ బాబు ఏంటో ఈ సినిమాతో తెలుసుకోవచ్చు. జంటిల్ మాన్ దర్శకుడి పాత్రని అతను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా తెరమీద ప్రొజెక్ట్ చేశాడు. ప్రతీ సీనులో తన పాత్ర ప్రేక్షకులకి  ఆత్మీయంగా అన్పించేలా, ప్రేమించేలా నటించాడు. కుటుంబ సంక్షోభాన్నీ, ఆ కుటుంబంలో కూతురి క్షోభనీ చాలా నీటుగా పరిష్కరించే పాత్రచిత్రణ అతడి నటనకి బలం. ఇది అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

హీరోయిన్ కృతీ శెట్టిది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే. సినిమాల్లో హీరోయిన్ పేరుకి పెద్ద హోదాలో వుంటుంది గానీ, వేసేది వెకిలి వేషాలు. లాయరమ్మ మాస్ పాటేసుకుంటుంది. కలెక్టరమ్మ కల్లు తాగి చిందులేస్తుంది. కృతీ శెట్టి డాక్టర్ పాత్ర హోదాకి తగ్గ, హూందాతనంతో కూడిన నటనని చూసి తలవంచుకోవాలి రంగరంగ వైభవం లోని హీరో హీరోయిన్ల టీనేజీ బిహేవియర్ లేకి డాక్టర్ పాత్రల్లాంటివి కూడా.

ఇక వెన్నెల కిషోర్. ఇతను ఎంత నటించినా కామెడీ ఇంకా మిగిలే వుంటుంది. సినిమా తర్వాత సినిమా కొసరి కొసరి వడ్డిస్తూంటాడు. ఒకేఒక జీవితం లో బ్రోకర్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఇక్కడ కో డైరెక్టర్ పాత్రలో అలా ఒదిగి కామిక్ రిలీఫ్ కి తోడ్పడ్డాడు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ రైటర్ పాత్రలో నవ్వించడానికి రాలేదు- హీరోకి పెద్ద మనిషి తరహా సపోర్టు నిచ్చే జగ్గయ్యలా అన్పిస్తాడు. వీళ్ళిద్దరు కూడా అవార్డు తీసుకోవచ్చని అనడం లేదుగానీ, తీసుకునే కెపాసిటీ వుంది.

సెంటిమెంట్ల పేరుతో రొడ్డ కొట్టుడు నాటు తల్లితండ్రుల పాత్రలకి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇక్కడ శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్ లు ఓ కుదుపు నిస్తారు. వీళ్ళిద్దరు కూతురు కృతీ పాత్రతో పతాక స్థాయికి తీసికెళ్ళారు సంక్లిష్ట హ్యూమన్ డ్రామాని. పిల్లలు ఏడ్పిస్తే పేరెంట్స్  ఏడ్పు ఎలా వుంటుందనడానికి శ్రీకాంత అయ్యంగార్ నటించిన చివరి భావోద్వేగ సన్నివేశం నిజ జీవితం ఇలాగే వుంటుందనడానికి తార్కాణం. ఇది ఎక్కడో గుచ్చుకుని గిల్టీ ఫీలింగ్ తో లేచి వెళ్ళి పోయే ప్రేక్షకులూ వుంటారు. ఇది దర్శకుడి విజయమే. శ్రీకాంత్, కళ్యాణీ లది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

ఇంకే మైనర్, సహాయ పాత్రలు నటించిన వాళ్ళూ కూడా కథ శిల్పం, మూడ్, ఫీల్ ని చెడగొట్టకుండా అందులో భాగమై కనిపిస్తారు. సాంకేతిక ప్రమాణాల్లో పీజీ విందా కెమెరా వర్క్ బ్యూటీఫుల్ విజువల్స్ ని సృష్టించింది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కళా దర్శకత్వం, సెట్స్, లొకేషన్స్ పైస్థాయిలో వున్నాయి. వివేక్ సాగర్ సంగీతం లో అల్లరల్లరి టైటిల్ సాంగ్, ఇంకో ఐటెమ్ సాంగ్ తో బాటు, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి కవులు. వివేక్ సాగర్ సన్నివేశాలకి కూర్చిన నేపథ్య సంగీతం భారీ ఆర్కెస్ట్రెయిజేషన్ తో హాలీవుడ్ స్టయిల్లో రిచ్ నెస్ ని తీసుకు వచ్చింది. ఇక ఇంద్రగంటి రచన, దర్శకత్వం ఆయన సినిమాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో తెలియజేస్తాయి. ఈ ప్రమాణాల్ని మున్ముందు కూడా ఇలాగే అందిస్తాడని ఆశించాలి.

చివరికేమిటి
ఇంటర్వెల్ దాకా సమయం వృధా చేయకుండా వెంటనే పది నిమిషాల్లో సినిమా రీలు దొరకడంతో కథ ప్రారంభమై పోతుంది. ఆ రీల్లో వున్న హీరోయిన్ కృతీ శెట్టి కోసం అన్వేషణ. కానీ దర్శకుడైన సుధీర్ బాబు రీల్లో వున్న హీరోయినెవరో వెంటనే తెలుసుకోవచ్చు. ఎవరు తీస్తున్నసినిమా  ఆపేశారో లాబ్స్ లో ఆ రీలుని బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ లాజిక్ ని పక్కన బెట్టారు. ఆమె కోసం సినిమాటిక్ అన్వేషణ, కామెడీలు.

చివరికి కృతి డాక్టర్ అని తెలిశాక, సినిమా వాళ్ళంటే ద్వేషంతో ఆమె ట్రాక్. సుధీర్ రొట్ట మాస్ సినిమాల డైరెక్టర్ అని కూడా ఆమెకి అసహ్యం. దీన్ని పోగొట్టడానికి ఒక సెమినార్ లో రెండు కోట్లు విరాళం ప్రకటిస్తాడు. దీనికి కూడా లొంగదు. అప్పుడు అదే సెమినార్ లో చెత్త సినిమాలు తీసే వాడుకూడా ఏదో మేలు చేసే ఒక డైలాగు రాస్తాడని, దాంతో కనీసం ఒకడైనా చిరస్మరణీయు డవుతాడన్న సన్నివేశం సోదాహరణగా ప్రూవ్ అయి అతను ఉన్నతుడై పోతాడు.

హీరోయిన్ మనసుని మార్చే ఈ సీను క్రియేషన్ చాలా టాప్ క్లాస్. కథ లోతుపాతుల్లోకి వెళ్ళి తవ్వి తీసిన క్రియేటివిటీ. మళ్ళీ సెకండాఫ్ లో ఆమెని నటించడానికి ఒప్పించేందుకు సుధీర్ చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలాటిదే టాప్ క్లాస్.

ఇంటర్వెల్లో ఆ సినిమా రీలులో తనని చూసుకుని కృతి చెప్పే విషయంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో ఆమె ఫ్లాష్ బ్యాక్ తో ద్వేష  కారణం పూర్తిగా అర్ధమవుతుంది.

ఇప్పుడు సుధీర్ కథ మార్చేసి ఆమె పేరెంట్స్ కి తెలియకుండా ఆమె హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇది చాలా విపరిణామాలకి దారి తీస్తుంది పేరెంట్స్ తో  క్లయి మాక్స్ కొచ్చేసరికి- అన్ని సమస్యలకీ పరిష్కారంగా అదే రీలుతో కలిపి తీసిన సినిమా వేసి, సృష్టించే వూహించని పతాక స్థాయి డ్రామా మాస్టర్ స్ట్రోక్ గా వుంటుంది. సున్నిత పాత్రల బలమైన మానసిక సంఘర్షణల క్వాలిటీ చిత్రణ ఇది. ఐతే పైన చెప్పుకున్నట్టు, ఈ క్లాస్ మూవీకి ప్రేక్షకుల సపోర్టు తక్కువే వుంటుంది.

—సికిందర్
(ఈ సినిమా రెండు సార్లు చూశాం. ఇందులో
నేర్చుకోవాల్సినవి చాలా వున్నాయి.
ఇది పర్సనల్ గా రాసుకున్న రివ్యూ.
ఇది ఎక్కువమందికి నచ్చని సినిమా.
ఎక్కువ మందికి లపాకీ సినిమాలు కావాలి)