రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2022, బుధవారం

1201 : స్పెషల్ ఆర్టికల్

 

సెప్టెంబర్ 9 న విడుదల కానున్న రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర: శివ - పార్ట్ వన్ కూడా బాయ్ కాట్ బారిన పడింది. ఈ మధ్య విడుదలవుతున్న ఏ హిందీ సినిమానీ  వదలడం లేదు కొత్తగా పుట్టుకొచ్చిన బాయ్ కాట్ బృందాలు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోందనొచ్చు. సెక్యులర్ బాలీవుడ్ ని దెబ్బ తీయాలని. ఆ మాట కొస్తే ఏ సినిమా రంగమైనా సెక్యులర్ గానే వుంటుంది. లేకపోతే ఏనాటిదో షోలేలో ముస్లిం పాత్రని ఉదారవాదిగా చూపించారని ఇప్పుడెందుకు బాయ్ కాట్ అవుతుంది. ఈ బహిష్కరణ పిలుపులకి బాలీవుడ్ నోరెత్తకుండా మౌనంగా వుంటోంది. నోరెత్తితే వాళ్ళ సినిమాలు బాయ్ కాట్ లిస్టులో చేరిపోతున్నాయి. తాప్సీ, అనురాగ్ కశ్యప్ నోరెత్తారని వాళ్ళ దొబారా సినిమా బాయ్ కాట్ అయిపోయింది. లాల్ సింగ్ చద్దా బావుందని హృతిక్ రోషన్ అనేసరికి అతడి రానున్న విక్రమ్ వేద బాయ్ కాట్ అయిపోయింది.

       బాయ్ కాట్ ట్రెండ్ కి మౌనంగా వుండరాదని అర్జున్ కపూర్ నోరెత్తాడని అతడి రాబోయే కుత్తే బాయ్ కాట్ గండంలో పడింది. తాజాగా సునీల్ శెట్టి నోరు విప్పాడు. ఈయన కూడా కాచుకోవాలి. రాబోయే షారుఖ్ కాన్ పఠాన్ కూడా బాయ్ కాట్ అయింది. కారణం ఇతడి కొడుకు డ్రగ్ స్మగ్లర్ అని. కానీ ఆ కేసులో కొడుకుని ఇరికించారని తేలిపోయినా అబద్ధాలతో బాయ్ కాట్ అయిపోతోంది. బాయ్ కాట్ కి వ్యతిరేకంగా వున్నాడని ఆఖరికి మోడీ భక్తుడు అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కి కూడా బాయ్ కాట్ వేటు పడింది. ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సంగతి సరే!

ఇప్పుడు విడుదలకి సిద్ధమైన అత్యంత ఖరీదైన బ్రహ్మాస్త్ర వంతు వచ్చింది. ఇందులో హీరోయిన్ ఆలియా భట్ నటించిన డార్లింగ్స్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా నేను నచ్చకపోతే నా సినిమా చూడకండి అనేసింది. దీంతో ఆమె నటించిన బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. ఈమెతో బాటు హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ కపూర్ పాత నేరాలు కూడా బాయ్ కాట్ కి కారణమయ్యాయి.  

ప్రతీ స్టార్ మీదా కన్నేసి, వాళ్ళ గతాన్ని తవ్వి తీసి బాయ్ కాట్ కి ఆయుధంలా వాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ 2015 లో తన భార్య ఈ దేశంలో అభద్రత ఫీలవుతోందని చెప్పిన మాట పట్టుకుని ఇప్పుడు  లాల్ సింగ్ చద్దా ని బాయ్ కాట్ చేశారు. ఆ భార్య హిందువే. అలాగే పీకే లో హిందూ దేవుళ్ళని అవమానించాడని కూడా బాయ్ కాట్ చేశారు. పీకే నిర్మాత, దర్శకుడు, రచయిత హిందువులే.

ఇప్పుడు రణబీర్ కపూర్ పాత నేరం : తను బీఫ్ తింటానని ఏనాడో ఒక మాట చెప్పడం. దీంతో బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. రణబీర్ కపూర్ గురించి ఒక బ్లాగర్ పోస్ట్ చేసిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు బ్లాగర్, రణబీర్ కపూర్ లంచ్ చేస్తూంటారు. అప్పుడు రణబీర్ కపూర్ ఐయాం ఏ బిగ్ బీఫ్ గై (నేను పెద్ద బీఫ్ గాణ్ణి) అన్నాడు.

దీన్ని పట్టుకుని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రోలింగ్ మొదలెట్టారు. రణబీర్ కపూర్ బీఫ్ ఖాతా హై. యే  బ్రహ్మాస్త్ర కా హీరో హై. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర (రణబీర్ కపూర్ బీఫ్ తింటాడు. ఇతను బ్రహ్మాస్త్ర హీరో. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర) అని ట్రెండ్ అవుతోంది.  

అయాన్ ముఖర్జీ పాత నేరం : 2019 లో ఇంస్టాగ్రాంలో ఒక పోస్ట్. డ్రాగన్ బ్రహ్మాస్త్రంగా మారింది, రణబీర్ కపూర్ పాత్ర పొడవాటి శిరోజాలతో రూమీ (సూఫీ కవి జలాలుద్దీన్ రూమీ) లాగా వుంటుంది, శివుడు కాదు అని రాశాడు!

రూమీ! మొదట అతను రూమీ. పొడవాటి జుట్టుతో రూమీ. ఈ గెటప్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టెస్ట్ నుంచి వచ్చింది. ప్రేమనేది మీకూ మీతో ప్రతిదానికీ మధ్య వారధిలాంటిదని అన్నాడు రూమీ. ఈ ఫీలింగునే ఆధారంగా చేసుకుని రణబీర్ కపూర్ పాత్రని తీర్చిదిద్దాం. కానీ ఆ తర్వాత కొత్త ప్రేరణ, కొత్త ఆలోచనలు వచ్చాయి... డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి రణబీర్ పాత్రకి అందించాం. రణబీర్ గెటప్ మార్చాం. దాంతో రూమీ శివుడు అయ్యాడు అని ఇంస్టాలో పోస్ట్ చేశాడు ముఖర్జీ. నేరకపోయి ఇరుక్కోవడమంటే ఇదే!

ఆమె తను నచ్చకపోతే తన  సినిమా చూడకండి అంటుంది, ఆయన బీఫ్ తింటానంటాడు, ఈయన డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి, రూమీని శివుడు చేశానంటాడు!

ఇన్ని నేరాలు చేశాక ఇక సినిమా వుంటుందా? ఒక నెటిజన్ ట్విట్టర్ లో గొడ్డు మాంసం వ్యక్తిని బహిష్కరించాలన్నాడు. మరికొందరు సినిమాని బహిష్కరించడం సబబు కాదని వాదిస్తూ మద్దతుగా ట్వీట్ చేశారు. అతనేం తింటాడో అతనిష్టం - అన్నారు. కనీసం మన చరిత్రపై సినిమా తీయడానికి ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని ఇంకో నెటిజన్  అయాన్ ముఖర్జీని ఓదార్చాడు.

ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు- బ్రిటిష్ పౌరురాలు అలియా భట్ హిందూ వ్యతిరేక, భారతదేశ వ్యతిరేక వ్యక్తుల కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మహేష్ భట్ బాహాటంగా హిందూ వ్యతిరేకి. 26/11 టెర్రర్ దాడి ఆరెస్సెస్ కుట్ర అని అతను పేర్కొన్నాడు. అతడి సోదరుడు రాహుల్ భట్ కి ఈ టెర్రర్ దాడి నిందితుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీతో సంబంధాలున్నాయి

పాత నేరాలకి క్షమాపణలు చెప్పినా వదలడం లేదు. అమీర్ ఖాన్ క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండనీ వదలడం లేదు. శుభమా అని పానిండియాలో పాదం మోపుతూ విజయ్ తనకి సంబంధం లేని బాయ్ కాట్ ట్రెండ్ లో తలదూర్చి ఎడాపెడా కామెంట్లు చేశాడు. తనూ బాయ్ కాట్ అయిపోయాడు.

దీంతో ముంబాయిలో ఒక థియేటర్ ఓనర్ విజయ్ మీద విరుచుకుపడ్డాడు. విజయ్ వల్ల లైగర్ షోలకి థియేటర్ ఖాళీగా వుంటోందని. వెంటనే విజయ్ ముంబాయి వెళ్ళి ఓనర్ కి పాదాభివందనం చేసి మరీ క్షమాపణలు చెప్పాడు. కానీ అసలతను అలాటి సినిమాలో నటించినందుకు ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాలి. లైగర్ బాయ్ కాట్ అయినా, కాక పోయినా ఫ్లాపయ్యేదే.

ఈ బాయ్ కాట్ మేనియా ఇంకెంత కాలం సాగుతుందో తెలీదు. దీన్ని ఎదుర్కొంటూ కనీసం హీరోల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ జీవులు నోరు విప్పకుండా తమ పని తాము చేసుకుపోవడమే మంచిదేమో. అలాగే ఏవో చేసి అవి పాతనేరాలుగా రికార్డు అవకుండా చూసుకోవడం మంచిది.
***

 


30, ఆగస్టు 2022, మంగళవారం

1200 : స్పెషల్ ఆర్టికల్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) ఇటీవల రీసెర్చి నివేదిక వెల్లడించింది. 2023 నాటి కల్లా దేశంలో మల్టీప్లెక్సులు మూతబడతాయని! దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు విస్తరించించి వ్యాపారాలు చేసుకుంటున్న కార్పొరేట్ కంపెనీల గుండెల్లో రాయి పడే వార్త ఇది. ఇప్పటికే కోవిడ్ సమయం నుంచి ప్రారంభమయిన నష్టాల నుంచి కోలుకోవడం లేదు. కోవిడ్ సమసిపోయినా ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. స్టార్ సినిమాలకి నెమ్మదిగా రావడం ప్రారంభించినా చిన్న, మధ్య తరహా సినిమాలకి పూర్తిగా మొహం చాటేశారు. హిందీలో స్టార్ సినిమాలనైతే ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక పానిండియా సినిమాలంటూ సౌత్ నుంచి వస్తున్న కొన్ని సినిమాలనే కరుణిస్తున్నారు. అది కూడా బావుంటేనే. రాధేశ్యామ్’, లైగర్ వంటి బాగాలేని పానిండియాల్ని ఇంటికి పంపించేశారు- అంటే ఓటీటీకి.

        ది చాలనట్టు ప్రతీ హిందీ సినిమాకీ ఏదో వంక పెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నాయి కొన్ని శక్తులు. దీని దెబ్బకి లాల్ సింగ్ చద్దా కూడా చిత్తయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 9 న విడుదలవుతున్న బ్రహ్మాస్త్ర ని కూడా బాయ్ కాట్ చేస్తూ బయల్దేరింది ట్రోల్ ఆర్మీ. వీళ్ళు ఎక్కడిదాకా పోయారంటే, ఎప్పుడో 47 ఏళ్ళనాటి షోలే ని కూడా బాయ్ కాట్ చేస్తూ నిన్నటి నుంచి ట్రోలింగ్ మొదలెట్టారు!

ఇలా సినిమాలకి కోవిడ్, ట్రోలింగ్ సమస్యలతో బాటు, రెట్టింపయిన టికెట్ల ధరలు ప్రేక్షకుల్ని వెనక్కి పంపేస్తున్నాయి.

ఇంతేకాదు, దేశవ్యాప్తంగా 22 అతి పెద్ద మాల్స్ ని మూసేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కోవిడ్ సమయం నుంచి జనం షాపింగ్ కి మాల్స్ కి వెళ్ళడం లేదు. మాల్స్ లో వుండే వివిధ వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో వున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ లోనూ వుంది. మాల్స్ లోనే మల్టీప్లెక్సులు వుంటాయి. మల్టీప్లెక్సులకి జనం రావడం లేదు. తప్పీజారి వస్తే క్షవరం తప్పడంలేదు. మొన్న తెలుగు 'లైగర్' చూసిన ఉత్తమ ప్రేక్షకుడు 800 వదిలించారని లబోదిబో మన్నాడు. టికెట్టు 400 + తినుబండారాలు 400 !

మల్టీప్లెక్సుల నిర్వహణా వ్యయం పెరిగిపోవడం వల్ల తినుబండరాల ధరలు రెట్టింపు చేయక తప్పలేదని పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూప్ ఛైర్మన్ సెలవిచ్చాడు. కాబట్టి తినుబండరాలు కూడా సమస్యల లిస్టులో చేరాయన్నమాట.

ఇదంతా కాదు, అసలు సమస్య వేరే వుంది. ఇందుకే గుండెల్లో రాళ్ళు పడుతున్నాయి మల్టీప్లెక్స్ కంపెనీలకి. ఎస్బీఐ రిపోర్టు ఏమంటోందంటే, ఒకప్పుడు మల్టీప్లెక్సులు వచ్చేసి వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ ఎలా మూతబడిందో, అలా ఇప్పుడు ఓటీటీ వచ్చేసి మల్టీప్లెక్సుల రంగాన్ని మూత పెట్టేస్తుందని. అదీ 2023 కల్లా! ఓవర్-ది-టాప్ లేదా ఓటీటీ  మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకి  చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది 2018 లో రూ. 2,590 కోట్లు మాత్రమే వుంది.

1980లలో విజృంభించిన వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ 2000 కల్లా కాలగర్భంలో కలిసిపోయింది. 2000 ప్రారంభం నుంచి మెట్రో నగరాల్లో/పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు విపరీతంగా పెరిగాయిఓటీటీ రంగం ఇప్పటికే వినోద పరిశ్రమ నుంచి 7-9 శాతం రెవెన్యూని లాగేసుకుంది. ఇది వృద్ధి చెందుతూ పోతోంది. ఓటీటీ రంగంలో అన్ని  భాషల్లో 40 ఓటీటీ కంపెనీలు కంటెంట్ ని అందిస్తూ వుండడంతో ప్రేక్షకులు ఇటు మొగ్గు  చూపుతున్నారు.

ప్రస్తుతం ఓటీటీ కంపెనీలకి 45 కోట్ల మంది చందా దారులున్నారు. ఈ బలమైన వృద్ధికి సరసమైన హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడండిజిటల్ చెల్లింపులని స్వీకరించడం వల్ల, ఇది 2023 చివరి కల్లా 50 కోట్లకి పెరిగే అవకాశముంది. మన దేశంలో గ్లోబల్ కంపెనీల చందాదారుల సంఖ్య చూస్తే డిస్నీ హాట్ స్టార్ 14 కోట్లు, అమెజాన్ ప్రైమ్ వీడియో 6 కోట్లు, నెట్ ఫ్లిక్స్ 4 కోట్లు, జీ 5 3.7 కోట్లు, సోనీలివ్ 2.5 కోట్లు వుంది. ఈ కంపెనీలు అమెరికాలో కంటే 70-90 శాతం చౌకగా  ప్లాన్స్ ని అందిస్తున్నాయి.

50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు నెలకి 5 గంటల కంటే ఎక్కువ సమయం ఓటీటీ ని ఉపయోగిస్తున్నందున, ఓటీటీ పెరుగుదల థియేటర్ల ఆదాయాలని తినేస్తోంది. ఇంకా చెప్పాలంటేసినిమాల కంటే స్ట్రీమింగ్ సిరీస్‌లు రూపొందించుకోవడం లాభదాయకమని ప్రధాన స్టూడియోలు గ్రహిస్తున్నాయి. దీనికి తమ సొంత  స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాయి.  స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి టెక్నాలజీలు థియేటర్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాలం ముందుకు వెళుతున్నప్పుడు విద్యఆరోగ్యంఫిట్నెస్ రంగాల్లో ఓటీటీ వేదికలు విస్తరణనీ, భవిష్యత్తునీ మరింత సుస్థిరం చేసుకుంటాయని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా ఓటీటీని వినోద మాధ్యమంగా మాత్రమే చూడడం లేదు. ఇన్ఫోటైన్మెంట్ (సమాచారం + వినోదం) మాధ్యమంగానూ చూస్తున్నారు.

దెబ్బకి దెబ్బ!

ఇదంతా అలా వుంచితే, రెండు పెద్ద మల్టీప్లెక్స్ గ్రూపులు పీవీఆర్, ఇనాక్స్ లు సినిమా వ్యాపారాన్ని పునర్నిర్వచించడానికి విలీనమవుతున్నాయి. ఓటీటీని బీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది చిన్న స్క్రీన్‌కి వ్యతిరేకంగా పెద్ద స్క్రీన్ బలమైన పోరాటమని అభివర్ణించుకుంటున్నాయి. ఓటీటీ కంపెనీలు నిజంగా పెద్దవనీ, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద చెక్కు బుక్కులు వున్నాయనీ, కోట్లకి కోట్లు గుమ్మరించి సినిమాలు కొంటున్నారనీ, దీన్ని తట్టుకునేందుకు మల్టీప్లెక్స్ రంగాన్ని మరింత ఆధునీకరించి- ప్రేక్షకులు సినిమా చూసే అనుభవాన్ని ద్విగుణీకృతం చేయాలని వ్యూహాలు పన్నుతున్నాయి.

తమ రెండు గ్రూపులు కలిసి రావడం ద్వారాతమ  మార్కెట్‌ కి ఇంటి వెలుపల వినోదానికి  అత్యంత ముఖ్యమైన రూపమైన ఎగ్జిబిషన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా, తాము  మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది నిర్మాతలు తమ సినిమాల  విడుదలల్ని ప్లాన్ చేసే విధానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నమ్ముతున్నాయి. తమది బ్లాక్ బస్టర్ విలీనమని బల్లగుద్ది చెప్తున్నాయి.

ఈ రెండు గ్రూపులు ఏకమైతే దేశంలో దాదాపు 60 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్లు వీటి చేతిలో వుంటాయి. దేశంలో దాదాపు 3000 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు వున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనాలు సూచిస్తున్నాయి. పీవీఆర్ ప్రస్తుతం 73 నగరాల్లో 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. ఐనాక్స్ 72 నగరాల్లోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్స్ ని  నిర్వహిస్తోందివిలీనం తర్వాత ఈ సంయుక్త సంస్థ 109 నగరాల్లోని 341 ప్రాపర్టీలలో 1,546 స్క్రీన్స్ ని  నిర్వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద మూవీ ఎగ్జిబిషన్ కంపెనీగా అవతరిస్తుంది.

ఇంతే కాదు, విస్తరణ ప్రణాళికలు కూడా వున్నాయి. పీవీఆర్ - ఐనాక్స్ విలీన సంస్థ రెండవ, మూడవ శ్రేణి నగరాల్లో విస్తరణపై బలమైన దృష్టితో, సంవత్సరానికి 200 స్క్రీన్స్ ని  జోడించడాన్ని పరిశీలిస్తోంది. ప్రకటిత లక్ష్యం రాబోయే ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది. దీనికి కనీసం రూ. ₹4000 కోట్ల పెట్టుబడి అవసరం. ఇలా ఓటీటీతో బిగ్ ఫైట్ కి కండలు పొంగిస్తోంది గ్రూపు. ఒకవైపు 2023 కల్లా మల్టీప్లెక్సులు ఖల్లాస్ అని రిపోర్టు, మరో వైపు బిగ్ ఫైట్ కి కసరత్తు. చూడాలి ఎమౌతుందో. ఈ ఫైట్ లో ప్రేక్షకులు ఎటువైపు వుండాలని తేల్చుకుంటారో జవాబు దొరకని ప్రశ్న!

***

 

          

29, ఆగస్టు 2022, సోమవారం

1199 : బాలీవుడ్ ఆర్టికల్

ప్పుడు బాలీవుడ్ లో అందరి కళ్ళూ బ్రహ్మాస్త్ర : పార్ట్ వన్- శివ మీదే వున్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడంతో వరస ఫ్లాపులెదుర్కొన్న బాలీవుడ్ ఇప్పుడైనా ప్రేక్షకుల దర్శన భాగ్యం కలగక పోతుందా అన్న ఆశతో వుంది. పైగా సౌత్ సినిమాల తాకిడికి విలవిల లాడుతున్న బాలీవుడ్ కి తగిన సమాధానం చెప్పగల అస్త్రంగా  బ్రహ్మాస్త్ర కన్పిస్తోంది. నాల్గేళ్ళుగా నిర్మాణంలో వుండి సెప్టెంబర్ 9 న విడుదలకి సిద్ధమవుతోంది. హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ ప్రోమో కార్యక్రమాలు చేపట్టి వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన మెగా మూవీ ఇది. స్పిరిచ్యువల్ ఫాంటసీ -అడ్వెంచర్ థ్రిల్లర్ గా వున్న ఈ క్లాస్- మాస్ కమర్షియల్  ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల బాట పట్టిస్తుందని నమ్ముతున్నారు.

        హిందీ నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లని నిర్లక్ష్యం చేసి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంతో, సింగిల్ స్క్రీన్ మార్కెట్ ని కూడా సౌత్ సినిమాలు వశపర్చుకున్నాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సింగిల్ స్క్రీన్ సినిమా లక్షణాలతో కూడా వుంది గనుక ఈ సెగ్మెంట్ లో కూడా వ్యాపారం చేసుకుంటుందని లెక్కలు కడుతున్నారు.

షోమాన్ రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ నటించిన గత 8 సినిమాల్లో రెండే హిట్టయ్యాయి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర లో హీరోయిన్ అలియా భట్ తో జత కట్టి వస్తున్నాడు. ఇంకా భారీ తారాగణముంది- అమితాబ్ బచ్చన్, నాగార్జున, అతిధి పాత్రలో షారూఖ్ ఖాన్ మొదలైన స్టార్లు.

బ్రహ్మాస్త్ర కథని లీకు వీరుల కోసమేం దాచిపెట్టలేదు. నిర్మాతలే కథని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక స్టార్ల పేరు చెప్పుకుని ప్రమోషన్లు నిర్వహిస్తే  ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. స్టార్ సినిమా కదాని పోతే గత వారం లైగర్ కూడా జాడించి తన్నింది ప్రేక్షకుల్ని. అందుకని విషయం (కథ) చెప్పేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. విషయం చెప్పాలంటే విషయంలో విషయం వుండాలి. విషయం లేకపోతే విషయం చెప్పే ధైర్యం చేయలేరు. అందుకని ప్రేక్షకులకిదో భరోసా నిస్తుంది. ఈ పద్ధతే బెటర్.

బ్రహ్మాస్త్ర కథలో రణబీర్ కపూర్ కి పంచభూతాల్లో ఒకటైన అగ్నితో వింత సంబంధముంటుంది. దాంతో బ్రహ్మాస్త్రాన్ని మేల్కొల్ప గల శక్తిని కలిగి వుంటాడు. ఈ అతీత శక్తి, విశ్వాన్ని నాశనం నాశనం చేయగలదని, సృష్టిని నాశనం చేయగలదని, జీవులని అంతమొందించ గలదనీ తెలుసు కుంటాడు. మరోవైపు,  దుష్ట శక్తుల రాణి జునూన్ కూడా బ్రహ్మాస్త్రాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వుంటుంది. బ్రహ్మాస్త్రం కోసం వీళ్ళిద్దరి పోరాటమే ఈ మూవీ. ఇది పురాణ, దైవిక ఘటనల ఆథ్యాత్మిక థ్రిల్లర్ గా వుంటుంది. ప్రస్తుతం నార్త్ లో వున్న మతాభిమానపు భక్తి వాతావరణంలో కార్తికేయ 2 లాగే ఇది కూడా హిట్టవుతుందని నమ్ముతున్నారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్ళ కల ఈ ప్రతిష్టాత్మక మూవీ. దీని తెర వెనుక కథనాన్ని వివరించే వీడియోని  అలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ  సిమ్లాలో రైటింగ్ వర్క్ చేపట్టిన 2011 నుంచీ దాంతో సాగిన పదేళ్ళ ప్రయాణం గురించి చెప్పుకొస్తాడు. అతడి మొదటి సినిమా  వేక్ అప్ సిద్ (2009) అప్పుడప్పుడే విడుదలై, రెండవ మూవీ యే జవానీ హై దీవానీ (2013) కోసం పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. ఎల్లప్పుడూ సిమ్లా  పర్వతాల్లో చాలా శక్తిని, బలమైన ఆధ్యాత్మికతనీ పొందుతాననీ చెప్పాడు. హిమాలయాల శక్తి నుంచే తనకి బ్రహ్మాస్త్రం కథకి ఐడియా పుట్టిందని నమ్ముతున్నట్టు వీడియోలో చెప్పాడు.

బ్రహ్మాస్త్ర  మూడు భాగాల కథగా ప్లాన్ చేశారు. అంటే మూడు సినిమాలు. ప్రస్తుతం మొదటి భాగం విడుదలవుతోంది. మొదటి భాగం ప్రధానంగా శివగా రణబీర్ కథతో వుంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం బ్రహ్మాస్త్ర తో ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇంతవరకూ రాని కంప్యూటర్ మాయా జగత్తుని సృష్టించడం అయాన్ చేపట్టిన బాధ్యత. అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో పురాతన భారతీయ మూలాలు - సంస్కృతి, ఆధ్యాత్మికతలని లోతుగా చూపించే విజువల్ వండర్ గా హామీ ఇస్తున్నాడు.

తన జీవితంలో 10 సంవత్సరాలు ఈ మూవీ  కోసం వెచ్చించానని, ప్రారంభంలో బ్రహ్మాస్త్ర అనేది ఒక హాస్యాస్పదమైన ఆలోచనగా వుండేదనీ, క్రమంగా దీని మీద ఆత్మ విశ్వాసం బలపడిందనీ, చెప్పుకొచ్చాడు. చేయాలనుకున్నది ఎలా చేయాలో రోడ్‌మ్యాప్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ వ్యయాన్ని నియంత్రించే ప్రణాళికల్లేవు, ఈ సవాళ్ళని ఎలాగైనా అధిగమించగలిగితే, సినిమా అనుకున్నట్టు సరిగ్గా వస్తే, నిజంగా ఇది మార్గదర్శక సంచలనాత్మక చలన చిత్రమవుతుందనీ, దేశం గర్వించదగ్గ కానుక అవుతుందనీ చెప్పుకొచ్చాడు.

దీన్ని  కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ కలిసి నిర్మించారు. ఇదీ విషయం. ఇప్పుడు దీనికి ప్రేక్షకులే మాత్రం తరలి వస్తారన్నది ప్రశ్న. ఈ ప్రశ్న వుండగా బాలీవుడ్ సినిమాల కడుపు కొట్టే ట్రెండ్ ఒకటి ఇటీవల నడుస్తోంది. ప్రతీ పెద్ద హిందీ సినిమానీ  ఏదో వంకపెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నారు. దీని కారణంగా కూడా ప్రేక్షకులు రావడానికి వెనుకాడ వచ్చు. ఈ బాయ్ కాట్ పోకిరీల ఆటకట్టించే చర్యలు తీసుకుంటేగానీ సినిమాల పరిస్థితి మెరుగు పడదు. హీరో యిన్ ఆలియా భట్ ఏదో అన్నదని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అని కొత్త రాగ మెత్తుకున్నారు మానసిక రోగులు.

***

 

28, ఆగస్టు 2022, ఆదివారం

1198 : రివ్యూ!

రచన - దర్శకత్వం : పూరీ జగన్నాధ్
తారాగణం : విజయ్ దేవరకొండ,  అనన్యా పాండేరమ్య కృష్ణఅలీరోణీత్ రాయ్విషు రెడ్డిమార్కండ్ దేశ్ పాండేమైక్ టైసన్
సంగీతం : సునీల్ కశ్యప్తనీష్ బాగ్చీఛాయాగ్రహణం : విష్ణు శర్మ
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్,  పూరీ కనెక్ట్స్ఏఏ ఫిల్మ్స్
నిర్మాతలు :  కరణ్ జోహార్పూరీ జగన్నాధ్ఛార్మీ కౌర్అపూర్వా మెహతా
విడుదల :  25 ఆగస్టు, 2022
***

            రెండేళ్లుగా ప్రేక్షకులెంతగానో ఎదురు చూసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్’ మొత్తానికి విడుదలైంది. అర్జున్ రెడ్డి’ తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు. పానిండియా జోన్. ప్రమోషన్స్ లోనే నార్త్ లో అసంఖ్యాక ఫ్యాన్స్ ని సంపాదించుకుని బాలీవుడ్ నే ఆశ్చర్య పర్చాడు. ఇలాటి విజయ్ పూర్తిగా గల్లీ మాస్ క్యారక్టర్ తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బిగ్ బ్యాంగ్ ఇచ్చేందుకు కిక్ బాక్సర్ గా విచ్చేశాడు హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి. ప్రేక్షకులకి బోనస్ గా వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని కూడా తారాగణంలో భాగంగా చేర్చారు. తెలుగులో తొలి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా నమోదు చేశారు. అయితే ఇంతా చేసి ఇది ఫ్లాప్ అయితే ఏమిటి పరిస్థితి అని కూడా పూరీ సహా నిర్మాతలే అనుకోవడం కొసమెరుపు. ఈ అనుమానం ఎందుకొచ్చినట్టుమూవీని అంత తేడాగా తీశారాతీస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పానిండియా కలలేమవుతాయిభవిష్యత్తు ఏమవుతుందిముందుగా కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

సింహానికీపులికీ పుట్టిన క్రాస్ బ్రీడ్ గా చెప్పుకునే కరీంనగర్ కి చెందిన లైగర్ (విజయ్ దేవరకొండ) ముంబాయిలో చాయ్ అమ్మి జీవనం సాగించే తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో వుంటాడు. తనకి నత్తి వుండడం వల్ల అవమానాలు పడుతూంటాడు. బాలామణి భర్త ఫైటర్ గా ఛాంపియన్ కావాలన్న కలలు నెరవేరక ముందే చనిపోయాడు. అందుకని కొడుకుని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) వరల్డ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని తీసుకుని ముంబాయి వచ్చింది. ఇక్కడొక ట్రైనర్ (రోణిత్ రాయ్) దగ్గర ట్రైనింగ్ కి చేర్పించింది. అయితే లక్ష్యం నెరవేరే వరకూ అమ్మాయిల జోలికి పోవద్దని షరతు పెట్టింది. కానీ తాన్యా (అనన్యా పాండే) అనే డబ్బుగల అమ్మాయి లైగర్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి వెంటపడి ప్రేమిస్తుంది. తనూ ప్రేమిస్తాడు. ఒకానొక ఘట్టంలో అతడికి నత్తి వుందని వదిలేస్తుంది. దీంతో ప్రేమలో దెబ్బతిన్న లైగర్ లక్ష్యం కూడా చిక్కుల్లో పడుతుంది.

ఇప్పుడేం చేశాడు లైగర్తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడావిఫల ప్రేమలోంచి కోలుకుని వరల్డ్ ఛాంపియన్ అయ్యాడాతాన్యా ప్రేమని గెల్చుకున్నాడాఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ

సినిమా ప్రారంభంలో లైగర్ తన కథ చెప్పుకోవడం మొదలెడుతూ, ‘నాకు కథ చెప్పడం రాదుట్రై చేస్తాను’ అంటాడు. తీరా షో పడ్డాక కథ చెప్పడం ట్రై చేస్తే ప్రేక్షకులు వూరుకుంటారా? సినిమా తీయక ముందే నేరేషన్ ఇచ్చుకోవడం ట్రై చేయాలి గాని. అన్నట్టే అతడికి కథ చెప్పడం రాలేదు. ఏం కథ చెప్పాడో అర్ధం గాదు. ఈ కథ అసలెందుకు బాగాలేదో కథ చెప్పడం రాని లైగర్ మీదికి తోసేసి పూరీ ఇలా తప్పించుకుంటున్నట్టు వుంది.

తన పేరే (టైటిల్) సరిగా పలకలేని నత్తిగల వాడు కథ ఎలా చెప్తాడు నిజానికివిచిత్రం కదూనత్తి పాత్రతో కథ చెప్పించడంఅడుగడుగునా ఇలాగే వుంటుంది పూరీ తప్పించుకునే ప్లాన్. సినిమా ఫ్లాపవడానికి నత్తినత్తిగా కథ చెప్పిన లైగరే కారణం, తను కాదన్న మాట!

సరే, ఇది పూరీ ఎప్పుడూ తీసే సినిమాల్లోలాగే అదే అరిగిపోయిన పురాతన కథ. ఆయన కథల్ని మార్చడుస్టార్స్ ని మారుస్తాడు. వాళ్ళతో అవే టెంప్లెట్ కథలుఅవే టెంప్లెట్ పాత్రలు, అదే టెంప్లెట్ మేకింగ్, మొత్తంగా అదే టెంప్లెట్ సినిమా. క్రియేటివిటీకి, కొత్తదనానికీ చోటే వుండదు. అందుకే 15 రోజుల్లో ఏ స్క్రిపు అయినా రెడీ. ఇంకా పూరీ సినిమాలకి రివ్యూలు రాయడం కూడా ఇలాంటిదేహెడ్డింగ్ మార్చేస్తే ఏ సినిమాకైనా అదే రివ్యూ మ్యాచ్ అవుతుంది.

ఇక స్పోర్ట్స్ జానర్ సినిమా అంటే కూడా టెంప్లెట్ కథే. ఎవరు స్పోర్ట్స్ సినిమా తీసినా ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్2. ఒక పీడితుడు, 3. ట్రైనింగ్, 4. సమస్యలు5. పీడితుడికి ఒక ప్రత్యర్థి6. ఆటలో ప్రత్యర్ధితో ఓటమి7. తీవ్రమైన ట్రైనింగ్, 8. ఆటలో ప్రత్యర్ధి మీద గెలుపు, 9. పీడితుడు విజేతగా మెడల్, ఇంతే!

ఈ 9 స్టోరీ బీట్స్ కి తగ్గ సీన్స్ ని చకచకా టెంప్లెట్లో (మూకుట్లో) వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ వంట వేడివేడిగా తయార్! బడ్జెట్ ని బట్టి ఇనప మూకుట్లో, సత్తు గిన్నెలో, రాచిప్పలో, మట్టి పిడతలో పడతాయి బీట్స్ దినుసులు. లైగర్ ది ఇనప మూకుడు. ఏ స్పోర్ట్స్ మూవీ చూసినా ఇంతే కథ. దీంతో స్పోర్ట్స్ మూవీస్ లో కొత్తగా చూడడాని కేమీ వుండడం లేదు.

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీ సిరీస్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

క్రీడల్ని పక్కనబెట్టి మన విషయమే చూద్దాం. మనకి గోల్స్ వుంటాయి బాగా డబ్బు సంపాదించాలని లేదా పేరు పొందాలని లేదా ఇంకేదో. ఇవి సాధించాక సుఖంగా సెటిలై పోతామా? డబ్బు సంపాదించడమే గోల్ గా పెట్టుకుని డబ్బులే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళంతా సుఖంగా వుంటున్నారా? ఆ అశాంతి దేనికి? దుష్ప్రవర్తన దేనికి? ఆత్మహత్యలు దేనికి?

వాళ్ళు భౌతికంగా స్థిరపడ్డమే గోల్ అనుకున్నారు కాబట్టి- ఆత్మిక సుఖాన్ని గుర్తించలేదు కాబట్టి. ఆత్మ కోరుకునేది వేరు. సంపాదనలో పడకముందు చిన్నప్పట్నుంచో, ఆ తర్వాతో కొన్ని స్వచ్ఛమైన కోరికలు పుడతాయి- ఇవి యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయి వుంటాయి. పుస్తకాలు బాగా చదవాలని, పాటలు వినాలని, టూర్లు వెళ్ళాలని, పేదల్ని ఆదుకోవాలని, ఇంకేదో సేవ చేయాలని, తిరిగి ప్రపంచానికేదో ఇవ్వాలనీ.. ఇలా ఇవి ఆత్మిక సుఖాన్నిస్తాయి. పాటు పడాల్సింది ఈ ఆత్మిక సుఖం కోసమే. దీనికి భౌతిక సుఖం ఒక మెట్టు మాత్రమే. పరీక్ష  పాసవడం, ఉద్యోగం పొందడం, బిజినెస్ చేయడం, డబ్బు సంపాదించడం, విదేశాలకెళ్ళి సెటిలవడం - ఇవి గోల్స్ కానేకావు. ఇవి సంపాదించాక ఆత్మిక సుఖం కోసం ఏం చేస్తామన్నదే గోల్. గోల్ అంటే ఇదే. ఈ గోల్ కి రీచ్ అవ్వాలనే చేసే పనులు చేయాలి. ఇది జరిగిన నాడు మనశ్శాంతి గొప్పగా వుంటుంది.

అలాగే క్రీడల్లో కూడా మెడల్ కొట్టడమే గోల్ కాదు. కెన్ మియమోటో అన్నట్టు దేనికోసం మెడల్ కొడుతున్నారనేది ముఖ్యం. సల్మాన్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ మూవీ సుల్తాన్ (2016) లో- రెజ్లింగ్ లో సుల్తాన్ (సల్మాన్) నేషనల్ ఛాంపియన్ వరకూ ఎదిగి పెళ్ళి చేసుకుంటాడు. భార్య గర్భవతవుతుంది. ఆమెకి నెలలు నిండిన సమయంలో వరల్డ్ ఛాంపియన్ కెళ్తాడు. అక్కడ  గెలుస్తున్న సమయంలో ఇక్కడ కొడుకు పుట్టి చనిపోతాడు. అరుదైన ఓ-పాజిటివ్’ బ్లడ్ గ్రూపుతో పుట్టిన కొడుకు రక్తం దొరక్క రక్త హీనతతో చనిపోతాడు. సుల్తాన్ ది ఆ బ్లడ్ గ్రూపే. దీంతో తను దగ్గరుండి కొడుకుని రక్షించుకోలేక పోయాననే తీవ్ర క్షోభకి లోనవుతాడు. కొడుకుని బతికించుకో లేకపోయిన తను కూడా  మొహం చూపించలేనని దూరమవుతుంది భార్య (మియామోటో చెప్పే ఆటంకమిదే). ఇక సుల్తాన్ తన కొడుకు లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని వాడి పేర బ్లడ్ బ్యాంకు స్థాపించే లక్ష్యం తోక్రీడా రంగాన్ని వదిలేసిఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూంటే-

ఈ గతం తెలుసుకున్న స్పోర్ట్స్ ఏజెంట్, బ్లడ్ బ్యాంకు పెట్టాలంటే సుల్తాన్ మళ్ళీ రెజ్లింగ్ కి సిద్ధం కావాలనిచాలా డబ్బొస్తుందనీ  ఒప్పించి తీసుకుపోతాడు. ఆ వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఈవెంట్ కోసం తిరిగి శిక్షణ పొందిఅంతర్జాతీయ ఫైటర్స్ ని చిత్తు చిత్తుగా ఓడించి- వచ్చిన బోల్డు డబ్బుతో బ్లడ్ బ్యాంకు స్థాపిస్తాడు సుల్తాన్. నల్గురికి తోడ్పడే బ్లడ్ బ్యాంకు భౌతిక సుఖం కాదు, ఆత్మిక సుఖం. దీని కోసమే పాటుపడ్డాడు. భౌతిక లక్ష్యం  ఆత్మిక లక్ష్యానికి వాహకం మాత్రమే. అదే గమ్యం కాదు.

లైగర్ లో ఈ యాంగిల్ లేదని కాదు. అది వ్యక్తిగత స్థాయిలో వుండి పోయింది. భర్త ఛాంపియన్ అవ్వాలన్న కల తీరకుండా చనిపోతే ఆ కల కొడుకు ద్వారా తీర్చాలని తల్లి ప్రయత్నించే కథ. తల్లి మాట మీద తండ్రి కల నెరవేర్చాలని లైగర్ పాత్ర. జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ ప్రకారం ఇది తన స్వార్ధం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వుండే అట్టడుగు స్థాయి పాత్ర, దీని పై స్థాయిలో సమాజం కోసం పాటు పడే పాత్ర వుంటుంది. దీని పై స్థాయిలో ప్రపంచం కోసం పాటుపడే పాత్ర వుంటుంది. ఇంకా దీని పై స్థాయిలో ఆథ్యాత్మికంగా పాటుపడే పాత్ర వుంటుంది.

ఈ కథాచట్రం (స్టోరీ వీల్) లో లైగర్ ఏ ర్యాంకులో వున్నాడు? ఇతనెలా ఆడియెన్స్ కి అంత బాగా కనెక్ట్ అవుతాడు? తండ్రి కల వుంటే నెరవేర్చకూడదని కాదు. ఇంకో ఉన్నతాశయాన్ని కలిపి తను ఛాంపియన్ అయినప్పుడు తండ్రి ఇంకా సంతోషిస్తాడు. ఇలా కాకుండా ప్రియురాలు తనకి నత్తి వుందని ఛీ కొట్టి వెళ్ళి పోయిందని, ఆమెకి ప్రూవ్ చేయడం కోసం ఛాంపియన్  అవ్వాలనుకోవడం కథకి ఎమోషనల్ రేషన్ కార్డు నివ్వదు. ఇది కూడా వ్యక్తిగత స్థాయే. పైగా ఒకరికేదో ప్రూవ్ చేయడం కోసం పనిని చేపట్టడమంటే అది ఆ పనిని కండోములా వాడి పారేయడం లాంటిది. గోలూ కాదు ఏమీ కాదు, రివెంజీ మెంటాలిటీ.

నటనలు - సాంకేతికాలు 

ఈ సినిమాలో లైగర్ గా విజయ్ ని  తప్ప ఇంకొకర్ని వూహించలేమనేది నిజమేగానీ, విజయ్ లైగర్ పాత్ర ఫైట్లు చేసి మాంచి యాక్షన్ పాత్రలా కన్పించినంత మాత్రాన అది యాక్టివ్ పాత్ర కాదు, పూర్తిగా పాసివ్ పాత్ర. పాత్ర డైనమిక్స్ కి నత్తి పెద్ద అడ్డంకి. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని హుషారుగా ఎంటర్ టైన్ చేయాల్సిన తను- నత్తి వల్ల డైలాగులు కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి పవర్ఫుల్ మాస్ డైలాగులుపంచ్ డైలాగులూ సాధ్యం కాలేదు. ఇది పెద్ద ట్రాజడీ. కొత్తగా ఎంటరవుతూ, నత్తి మాట్లాడి పానిండియా ప్రేక్షకులకి ఎలా దగ్గరవాలనుకుంటాడు? నత్తి మార్కెట్ యాస్పెక్ట్ ని చంపేసింది.

ఫైటర్ గా మాత్రం పూర్తి మేకోవర్ తో- సిక్స్ ప్యాక్ తో నిజంగా పులే. ఎంఎంఏ రింగ్ లో ప్రత్యర్థుల్ని విరగ్గొట్టే సీన్లు టాప్. సినిమా కోసం తన ఎనర్జీ ఎంత పెట్టి చేయాలో అంతా చేశాడు. దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ కి కూడా అంతే కష్టపడ్డాడు. కానీ ఇందులో పదో వంతు కూడా కథ విషయంలోపాత్ర విషయంలో పూరీ కష్ట పడలేదు. దీ సమస్య.

అతడి గోల్ అతడి గోల్ కాదు, అది తల్లి గోల్. అతను తల్లి చెప్పు చేతల్లో వుండే పాసివ్ క్యారక్టర్. వృత్తి విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ. ప్రేమ లవర్స్ నడుపుకునే రోమాంటిక్ కామెడీగా లేక, ఇటు తన తల్లి చేతిలో, అటు హీరోయిన్ తండ్రి చేతిలో పెద్దలు నడిపే రోమాంటిక్ డ్రామా కావడం యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ గండి కొట్టింది.      

హీరోయిన్ అనన్యది పాత మూస ఫార్ములా పాత్రఈమె ప్రేమకూడా నలిగిపోయిన టెంప్లెట్టే. హీరోకి దూరమై, తర్వాత నీ గోల్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే అలా దూరమయ్యాననని నీతి వాక్యాలు చెప్పే చాలా పాత మూస ఫార్ములా చాలా సినిమాల్లో చూసేశాం. ఇన్నేళ్ళ అనుభవంతో కాపీ పేస్టే తప్ప, పూరీ కొత్తగా ఆవిష్కరించిం దేమీ లేదు. అయితే అనన్య  హావభావాలు బాగా ఒలికించగలదు. ఈ సినిమాతోనైనా తను గాడిలో పడుతుందేమో చూడాలి.

ఇక తల్లిగా రమ్యకృష్ణ మాస్ పాత్ర ఓవర్ డ్రామా అవుట్ డేటెడ్ అయిపోయింది. మెలోడ్రామాల కాలం నాటి పాత మోడల్ పాత్ర. అరుపులతో, మాట విరుపుతో లైగర్ కంటే రమ్యకృష్ణ నటనే టైగర్ లా వుంది.

ఎంతో ప్రచారం చేసిన వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్ర... ముగింపులో వచ్చి కథనే ఆకస్మికంగా ముగించేస్తాడు. టైసన్ తో విజయ్ ఫైట్ సీను టైసన్ అభిమానులకి బాధ కల్గిస్తుందేమో తెలియదు. చాలా ప్రయత్నం చేసిన మీదట టైసన్ నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఒప్పుకుని ముగింపులో వచ్చి బాక్సాఫీసుకే పనికి రాకుండా విరిచేశాడు సినిమాని.

పాటల గురించి చెప్పుకోవడానికి లేదు. పాటలు హిట్ కాలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కెమెరాఎడిటింగ్కోరియోగ్రఫీయాక్షన్ కొరియోగ్రఫీలొకేషన్స్ అన్నీ హైక్లాస్ గా వున్నాయి - ఒక్క పూరీ చేతిలో స్క్రిప్టు తప్ప!

చివరికేమిటి  

ఫస్టాఫ్ విజయ్ ట్రైనింగుహీరోయిన్ తో ప్రేమమదర్ తో ఫ్యామిలీ సీన్లూ ఇవే వుంటాయి ఓ మూడు పాటలతో. మధ్య మధ్య వీధి పోరాటాలతో. ఇంటర్వెల్లో విజయ్ కి నత్తి అని తెలిసి హీరోయిన్ దూరమవుతుంది. ప్రేమ కథే బలహీనమంటేఈ ఇంటర్వెల్ మలుపు మరీ వీక్. ఇక్కడే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక సెకండాఫ్ మరీ దారుణం. నేషనల్ ఛాంపియన్ గెలవడంఆపైన వరల్డ్ ఛాంపియన్ కెళ్ళడం తగిన విషయంస్ట్రగుల్ఎమోషన్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతాయి. ఇక పూరీ సినిమాల్లో అలవాటుగా వుండే హీరోయిన్ కిడ్నాప్ ఒకటి. పోనూ పోనూ దిగజారి పోతూ వుంటుంది ఈ పానిండియా ప్రయత్నం. ఇంకేం చెప్పలేక మైక్ టైసన్ రాకతో, నాల్గు పిడి గుద్దులతో సడెన్ గా శుభం పడి పోతుంది.

స్టేడియంలో వస్తాదులు ఎదురు చూస్తూంటే, ఇంకెక్కడో అవుట్ డోర్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ కిడ్నాప్ గురించి మైక్ టైసన్ ని మట్టి కరిపిస్తే, ఆ క్లిప్పింగ్స్ ప్రసారమై విజయ్ దేవరకొండ వరల్డ్ ఛాంపియన్ అయిపోవడ మేమిటో అడక్కూడదు.   

కనీసం కథకి కావాల్సిన ఒక విలన్ఒక కాన్ఫ్లిక్ట్ లేకపోతే సినిమా నిలబడుతుందా? నత్తీ కథకేమీ ఉపయోగ పడలేదు. తన నత్తే తనకి విలన్ అయ్యుంటే ఆ స్ట్రగుల్ సానుభూతిని రాబట్టుకునేది. కాన్ఫ్లిక్ట్ నత్తి వల్ల ప్రేమలో పుట్టడంతో దాన్ని కాన్ఫ్లిక్ట్ గానే ఫీలవలేదు ప్రేక్షకులు. వారియర్ హాలీవుడ్ హిందీ రీమేక్ బ్రదర్స్ (2015) లో ఎఎంఏ ఛాంపియన్ షిప్ కి అన్నదమ్ములే ఒకరికొకరు విలన్లు. రింగ్ లో కొట్టుకుని కొట్టుకుని రక్తసిక్తమైన వాతావరణంలో, తమ్ముడ్ని ఇంకా కొట్టి ఓడించలేక ఏడుస్తాడు అక్షయ్ కుమార్. బంపర్ హిట్టయ్యింది.

పూరీ చూడని కథా లోకాలు ఇంకా చాలావున్నాయి. తిప్పి తిప్పి అవే సారం లేని కథలు ఇంకెంత కాలం...

—సికిందర్