రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఆగస్టు 2022, శనివారం

1197 : ఓటీటీ రివ్యూ!

 

దర్శకత్వం : అశోక్ తేజ
తారాగణం : హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ, వశిష్ట ఎన్ సింహా తదితరులు
రచనా : సంపత్ నంది, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సౌందర రాజన్
నిర్మాత : కేకే రాధామోహన్
విడుదల : ఆగస్టు 26, 2022 (ఆహా ఓటీటీ)
***
        ర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. గంటన్నర నిడివి వుండడం వల్ల, విషయం బలహీనంగా వుండడం వల్ల థియేటర్ కి దూరమైందని సులభంగా చెప్పొచ్చు. దీనికి నిజంగా జరిగిన కథ అని ట్యాగ్ ఇచ్చారు, కానీ ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ జరిగిన ఒక ఉదంతం మనకి గుర్తొస్తుంది. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇందులో హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించింది. కేజీఎఫ్ సినిమాల నటుడు వశిష్ట సింహాతో బాటు పూజితా పొన్నాడ, సాయి రోనక్ లు ఇతర పాత్రల్లో నటించారు.

        లా తారాగణం ఆకర్షణీయంగా వుంది. రచన సంపత్ నందితో బాటు, సంగీతం అనూప్ రూబెన్స్, కెమెరా సౌందర రాజన్ కూడా పెద్ద పేర్లే. మరి ఇంత మంది హేమాహేమీలు కలిసి ఎలాటి సరుకు అందించారు? ఇలాటి సినిమా తీయడానికి హేమాహేమీలు అవసరం లేదా? కొత్తవాళ్ళు సరిపోతారా? ఈ విషయం తెలుసుకుందాం...  

కథ

అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ ట్రైనీగా ఓదెల (కరీంనగర్ - పెద్దపల్లి జిల్లా) పోలీస్ స్టేషన్ కొస్తాడు. హైదరాబాద్ లో ఇతడికో గర్ల్ ఫ్రెండ్ (పూజితా పొన్నాడ) వుంటుంది. ఓదెలలో రాధ (హెబ్బా పటేల్) అనే యువతి భర్త తిరుపతి (వశిష్ట సింహా) తో ఇస్త్రీ షాపు నడుపుతూంటుంది. పెళ్ళయి తొమ్మిదేళ్ళయినా వీళ్ళకి పిల్లలు పుట్టరు. భర్తకున్న లైంగిక సమస్యతో డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇలా వుండగా గ్రామంలో ఆకస్మాత్తుగా హత్యలు మొదలవుతాయి. శోభనం జరిగిన మర్నాడే ఒక పెళ్ళి కూతురు హత్యకి గురవుతుంది. ఇంకోరోజు ఇంకో పెళ్ళి కూతురూ ఇలాగే హత్యకి గురవుతుంది. వెంటనే ఐపీఎస్ అనుదీప్ ఈ కేసులు చేపడతాడు. శోభనం తర్వాత అత్యాచారం చేసి చంపుతున్నాడంటే వీడెవడో సైకో కిల్లర్ అనుకుని దర్యాప్తు మొదలెడతాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఇలాటి పరిస్థితుల్లో అనుదీప్ వద్దన్నా సర్పంచ్ కూతురి పెళ్ళిచేయడంతో, ఆ పెళ్ళి కూతుర్ని ఓదెల రైల్వే స్టేషన్ నుంచి అపహరించి చంపుతాడు హంతకుడు.

ఎవరీ సీరియల్ కిల్లర్? ఎందుకు చంపుతున్నాడు? ఇంకా ఎంతమందిని చంపాడు? వీడ్ని పట్టుకోవడానికి అనుదీప్ ఏ వ్యూహం పన్నాడు? పోలీస్ స్టేషన్ కి మొండెం లేని తల పట్టుకుని వచ్చిందెవరు? అనుదీప్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలా ప్రమాదంలో పడింది? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

2019 లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్​ లో పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు ఈ కథకి మూలమని చెప్పొచ్చు. మెకానిక్ శ్రీనివాసరెడ్డి వరసగా ముగ్గురమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ కేసులో అతడికి ఉరిశిక్ష పడింది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని శోభనం పెళ్ళి కూతుర్ల కథ అల్లాడు కథకుడు. ఇందులో కూడా పాడుబడ్డ బావే హత్యాస్థలం. అయితే కథా కథనాలు కుదర్లేదు. మొత్తం గంటన్నర కూడా సిల్లీగా వుంటుంది కథనం. సీరియల్ కిల్లర్ కథకి ఆ జానర్ మర్యాదలే వుండవు. థ్రిల్, సస్పెన్స్, టెన్షన్ మొదలైన వాటికి స్థానమే వుండదు. మొదటి పది నిమిషాల్లోనే సీరియల్ కిల్లరెవరో క్లూ ఇచ్చేస్తున్నట్టు కూడా గ్రహించకుండా, హెబ్బాపటేల్ నపుంసక భర్తతో డాక్టర్ దగ్గరి కెళ్ళే సీను వేసేశారంటే ఏమనాలి.

ఇక దీనికో కథా ప్రయోజనం కల్పించారు. చివర్లో తేల్చిందేమిటంటే- ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ అనే అంగస్తంభన వైఫల్య రుగ్మతొకటి వుందనీ, తల్లిదండ్రుల వల్ల, తోబుట్టువుల వల్ల, సమాజం వల్లా ఇది వస్తుందనీ, ఏటా 12 వేలమంది దీని బారిన పడుతున్నారనీ...ఇలా జరగకుండా వుండాలంటే మనమే బాధ్యత తీసుకోవాలనీ ఏమేమో అర్ధంగాకుండా చెప్పారు. మనమేం బాధ్యత తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి ఇలా అర్ధం పర్ధం లేకుండా తీస్తే? ముందు తను బాధ్యత తీసుకుని కథ సరీగ్గా తీయాలి. ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ ఏమిటో గూగుల్లో ఎంత కొట్టినా దొరికి చావడం లేదు. ఇలాటి  కథకి సీక్వెల్ కూడా రాబోతున్నట్టు చివర్లో హెచ్చరిక ఒకటి!

కథలో ఇన్వెస్టిగేషన్లో డీఎన్ఏ ద్వారా వయసు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు అందుబాటులో కొచ్చిన ఆధునిక డీఎన్ఏ ఏజ్ టెస్టింగ్ ద్వారా ఇది సాధ్యమే. ఇలాటి శాస్త్రీయ సమాచారమివ్వడం బావుంది.

నటనలు- సాంకేతికాలు


ఈ కథ ప్రధాన పాత్ర ఎవరో అర్ధం గాకుండా వుంటుంది. దర్యాప్తు అధికారిగా ట్రైనీ ఐపీఎస్ ప్రధాన పాత్ర అనుకుంటాం. లేకపోతే ట్రైనీ ఐపీఎస్ లెవెల్ అధికారి అవసరం లేదు, ఎస్సై వుంటే సరిపోతుంది. కానీ హత్యల్ని పరిశోధించే ట్రైనీ ఐపీఎస్ అనుదీప్ గా సాయి రోనక్ చాలా వీక్, పాసివ్ క్యారెక్టర్. ఏం చేస్తాడో అతడికే తెలీదు. ఆరువేల జనాభావున్న గ్రామంలో సీరియల్ కిల్లర్ ని పట్టుకోలేక పోవడం అతడి అసమర్ధతని తెలుపుతుంది.  

సాయి రోనక్ ఒక పోలీసుగానే వుండడు, మొహంలో ఎక్స్ ప్రెషన్సే వుండవు. చివరికి కిల్లర్ ని పట్టుకునే ప్లాన్ గర్ల్ ఫ్రెండ్ పూజితా పొన్నాడే ఇస్తుంది. పెళ్ళి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుందాం, అప్పుడు తెల్లారి వచ్చే కిల్లర్ ని ట్రాప్ చేసి పట్టుకుందామంటుంది. అలాగే పెళ్ళి చేసుకుని ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి కాఫీ తాగుతూంటాడు. సీరియల్ కిల్లర్ వచ్చేసి భార్యని ఎత్తుకు పోతాడు! సీరియల్ కిల్లర్ కాదు ఇంపోటెంట్, పెద్ద ఇంపోటెంట్ ఈ ఐపీఎస్ ట్రైనీయే!!

ఐపీఎస్ ట్రైనీ భార్యని ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వేరే పనులు చేసుకుంటూ వుంటారు. ఐపీఎస్ ట్రైనీ కారెక్కి తీరుబడిగా ఎటో పోతాడు. కిల్లర్ గురించి హెబ్బా పటేల్ ఫోన్లు చేస్తూంటే వచ్చేస్తున్నానంటాడు. ఇక లాభం లేదన్నట్టు- ఈ ఐపీఎస్ ట్రైనీ శుద్ధ వేస్ట్ ఫెలో అన్నట్టు, హెబ్బా పటేలే హీరో గా బయల్దేరి సీరియల్ కిల్లర్ ని చంపి, ట్రైనీ ఐపీఎస్ భార్యని కాపాడి తెచ్చి ముందు పడేస్తుంది!

కొత్త భార్యతో ఎక్కడికో పోతున్న ట్రైనీ ఐపీఎస్ ని గ్రామ ప్రజలు మెచ్చుకుని, మళ్ళీ ఎప్పుడొస్తారని అంటారు. గట్టిగా కాచుకోండి, ఎస్పీగా వస్తాను అంటాడు! ఏం పీకాడనో ఇంకా ఎస్పీగా ఓదెల రైల్వే స్టేషన్ 2 తో వస్తాడట! ఇలాటి కథలు రాయకపోతే సంపత్ నంది కొంపలు మునిగిపోతాయా?
       
అంటే ఇక హెబ్బా పటేలే ప్రధాన పాత్రనుకోవాలి. ఇంకో ముఖ్య పాత్ర ప్లాన్ ఇచ్చిన పూజితా పొన్నాడ. పోలీస్ స్టేషన్లో అందర్నీ వెళ్ళగొట్టి వీళ్ళిద్దరికీ అప్పజెప్పాలి.

ఇక సాంకేతికంగా చూస్తే అనూప్ రూబెన్స్ సంగీతం, సౌందర రాజన్ కెమెరా ఇలాటి సినిమాని చూడండి, చూడండి - అని ఉత్తేజపరుస్తూంటాయి. ఓదెల రైల్వే స్టేషన్ టైటిల్ తో పెద్దగా సంబంధమే వుండదు. శోభనం రాత్రి హంతకుడు సరైన టైటిల్. ఇదీ హేమాహేమీల ఉమ్మడి శ్రమ దాన ఎపిసోడ్!

—సికిందర్
(రేపు లైగర్ రివ్యూ)


26, ఆగస్టు 2022, శుక్రవారం

1196 : లైగర్

    లైగర్ సృష్టించిన హంగామా విడుదల కాగానే అయ్యో రామా అయిపోయింది... ముంబాయి నేపథ్యంతో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో తీసిన ఆంధ్రావాలా (2004) కూడా ఇలాగే మార్నింగ్ షోకల్లా కుప్పకూలింది. ఇప్పుడు ముంబాయి బ్యాక్ డ్రాప్ తోనే విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ కూడా మార్నింగ్ షోకే కుప్పకూలింది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ షో ఇంటర్వెల్ కే కుప్ప కూలింది. నత్తి వల్ల లైగర్ లోకల్ గానే లేచి గాండ్రించ లేకపోయాడు, ఇక గ్లోకల్ గా తన వాణి ఏం వినిపిస్తాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ పానిండియా కలలు బాక్సాఫీసుతో తలపడలేక చతికిలబడ్డాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో మైక్ టైసన్నే క్లయిమాక్స్ లో కొట్టగల్గిన రౌడీ స్టార్, బాక్సాఫీసు కొట్టిన రౌండ్ హౌస్ కిక్ కి తట్టుకో లేక టేక్ డౌన్ అయిపోయాడు. అయినా ఏం ఫర్వాలేదు. ఇప్పుడు సినిమా బిజినెస్ ప్రాఫిట్టే!

        లైగర్ ని 110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 90 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ రావాలంటే 180 కోట్లు వసూలు చేయాలంటున్నారు. ఇది జరగని పని. అయితే బాక్సాఫీసులో జరగని పని ఓటీటీలో జరిగి పోతుంది. ఇంకా లాభాలే వస్తాయి. ఓటీటీ ఎక్కువగా ఇలాటి అట్టర్ ఫ్లాప్ సినిమాల అడ్డాగా పురోభివృద్ధి చెందుతోంది. ఫ్లాప్ మరకలంటిన సినిమాల్ని ఓటీటీ వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే, తెల్లగా వెండితెర లాగా నిగనిగ లాడతాయి. కనుక ఓటీటీ వుండగా పూరీ జగన్నాథ్ అవే ప్రాచీన నిల్వ కథలతో, అవే సినిమాలు అలాగే నిర్భయంగా, సాలా క్రాస్ బ్రీడ్ అనుకుంటూ తీస్తూ పోవచ్చు.

విషయం ఇది కాదు, పానిండియా అంటూ సౌత్ సినిమాలు చేస్తున్న దండయాత్రకి బాలీవుడ్ గజగజ వణుకుతోంది. అలాంటప్పుడు ఇలా బాలీవుడ్ ముంగిట తెలుగు సినిమాలు గజగజ వణుకుతూ నిలబడితే బావుండదు. ఇలాటివి ఇంకో రెండు వస్తే లైట్ తీసుకుంటుంది బాలీవుడ్. సౌత్ నుంచి వచ్చే పానిండియా సినిమాల్లో తెలుగుకే ఎక్కువ గుర్తింపు వుంది బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో. తాజాగా నిఖిల్ నటించిన  కార్తికేయ 2 కూడా దీనికి ఉదాహరణ. నిఖిల్ లాంటి చిన్న హీరో సినిమా పానిండియా మార్కెట్ లో 100 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ వూహించలేదు.

బాహుబలి రెండు భాగాలతో మొదలైన తెలుగు పానిండియా టూర్ ఆర్ ఆర్ ఆర్’, పుష్ప లతో తారాస్థాయికి చేరుకుని కార్తికేయ2 తో నిలదొక్కుకుంది. ఇదే తమిళం నుంచి వచ్చిన విక్రమ్ మినహా వాలిమై’, బీస్ట్’, ఈటీ వంటి పానిండియాలు ఫ్లాపయ్యాయి, తమిళనాడులో హిట్టయ్యాయి. కారణం ఇవి మరీ పాత మూసగా వుండడం లైగర్ లాగే. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ రెండు సినిమాలూ పానిండియాకి కల్ట్ మూవీస్ అయి, బాలీవుడ్ కి కుదుపునిచ్చాయి. సంఖ్యాపరంగా చూస్తే తెలుగు పానిండియాలే ఇవ్వాళ బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా వున్నాయి.

హిందీ రాష్ట్రాల్లో ప్రేక్షకులు హిందీ సినిమాలతో విసిగిపోయారు. బి సి సెంటర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి హిందీ మాస్ సినిమాలు రావడం లేదు. తెలుగు మాస్ సినిమాలు అక్కడి నగరాల్లో మల్టీ ప్లెక్సుల్లోనే గాక, వూళ్ళల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఈ లోటుని తీరుస్తున్నాయి. దీంతో తెలుగు సినిమాలు, తెలుగు స్టార్లూ హిందీ ప్రేక్షకులకి దగ్గరై, హిందీ స్టార్స్ ని కన్నెత్తి చూడ్డం లేదు ప్రేక్షకులు. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, పృథ్వీరాజ్, షంషేరా, షేర్ దిల్, ఎటాక్, బచ్చన్ పాండే వంటి స్టార్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. వీటిలో మూడు అక్షయ్ కుమార్ వే వున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రేపు సెప్టెంబర్ 9 న విడుదలయ్యే మల్టీ స్టారర్  బ్రహ్మాస్త్రం మీదే పంచప్రాణాలు పెట్టుకుని వున్నారు.

సీఐఐ సౌత్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నివేదిక ప్రకారం, 2021లో సినిమాల అఖిల భారత బాక్సాఫీసు కలెక్షన్లలో 62 శాతం సౌత్ సినిమాల నుంచే వచ్చాయి. ఈ ధోరణి మరింత బలపడుతోందని నివేదిక చెప్తోంది. నిజమే, గత కొన్ని సంవత్సరాలుగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులని ఆకర్షిస్తున్న బాలీవుడ్, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని వదిలేసింది. దేశంలో ఎక్కువ మంది సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులే వున్నారు- దీంతో సింగిల్ స్క్రీన్ మసాలాలతో వస్తున్న సౌత్ సినిమాల్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్రేక్షకులు.

పై నివేదిక ఇంకో విషయం కూడా చెప్తోంది : మహమ్మారి తర్వాత వినోద ప్రాథమ్యా లు మారి పోతున్నందున, సినిమా ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సౌత్ నిర్మాతలు సూపర్ స్మార్ట్ మార్కెటింగ్ నిపుణుల్ని నియమించుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచుల ప్రీ-ప్రొడక్షన్ సర్వేలని  కూడా నిర్వహిస్తున్నారు.

 

ఫిక్కీ కూడా ఒక నివేదిక విడుదల చేసింది : సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకి తగ్గ హిందీ సినిమాల్లేక వాటి ఆదాయాలు క్షీణించడం, అవి మూతబడడం జరిగిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్టు ధరలు 50 నుంచి  70 రూపాయల మధ్యే వుండడంతో, మూడు రెట్లు ధరలు ఎక్కువ వుండే మల్టీ ప్లెక్సుల్లో ఆడే హిందీ సినిమాలే తీస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ ని కలుపుకుని మల్టీ ప్లెక్సుల్లో కూడా సౌత్ పానిండియా లు దండయాత్ర మొదలెట్టడంతో బాలీవుడ్ కి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు  కూడా చేజారిపోతున్నారు. ఢిల్లీ, యూపీ, తూర్పు పంజాబ్ సర్క్యూట్‌ల పంపిణీదారులైతే హిందీ సినిమాలకి జనాలతో వున్న అనుబంధం తెగి పోయిందనీ, మల్టీప్లెక్సులు   ఎక్కువ డబ్బుని  తెచ్చిపెడుతున్నందున నిర్మాతలు మెట్రో-సెంట్రిక్ లేదా ఓవర్సీస్ మార్కెట్లకి సరిపోయే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారనీ,  ఇక సింగిల్ స్క్రీన్స్ తో మేం వ్యాపారాలు మూసుకోవాల్సిందేననీ వాపోతున్నారు.

ఇలా హిందీ రాష్ట్రాల్లో సినిమాల పరంగా శూన్యమేర్పడితే ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ సొమ్ముచేసుకునే పానిండియా సినిమా ఫార్ములా యేదో తెలుగు సినిమాల్లో కనిపెట్టాలే తప్ప, ఇంకా తెలుగు ధోరణిలో అరిగిపోయిన మూస దగ్గరే ఆగిపోతే లైగర్ లాంటి అనుభవాలే ఎదురవుతాయి.
***

 

24, ఆగస్టు 2022, బుధవారం

1195 : లైగర్

 

    రేపే పానిండియా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ థియేటర్స్ ని షేక్ చేస్తూ విడుదలవుతోంది. ఈలోగా దీని స్టోరీ లీక్ అయిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ లీక్ అవక పోయినా దీని స్టోరీ ఎలా వుంటుందో చెప్పొచ్చు. బాక్సర్ సినిమా కథలు కూడా మూసే కాబట్టి. గతంలో రవితేజతో పూరీజగన్నాథ్ తీసిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లో రవితేజ బాక్సరే. జయసుధ అతడి మదర్. మదర్ సెంటిమెంటుతో ఈ బాక్సర్ కథ. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గని అనే మరో బాక్సర్ మూవీ వచ్చింది. ఇందులోకూడా మదర్ సెంటిమెంటే. బాక్సింగ్ అంటే ఇష్టం లేని మదర్ నదియాతో వరుణ్ తేజ్ స్ట్రగుల్. ఇప్పుడు లైగర్ కథ లీక్ అయిందని విన్పిస్తున్న వెర్షన్లు కూడా ఇదే కోవలో వున్నాయి- రౌడీ స్టార్ కి మదర్ రమ్యకృష్ణతో సెంటిమెంటల్ డ్రామా.

        నాడెప్పుడో అమితాబ్ బచ్చన్ తో త్రిశూల్ అని వచ్చింది. ఇందులో అక్రమ సంతానమైన అమితాబ్ బచ్చన్, తల్లి వహిదా రెహమాన్ కి న్యాయం చేయడం కోసం, బిల్డర్ అయిన తండ్రి సంజీవ్ కుమార్ తో తలపడతాడు.

ఇదే యాంగిల్ లీకైన ఒక వెర్షన్లో కన్పిస్తుంది... ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ లైగర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, రౌడీ స్టార్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ వుంటుంది. లైగర్ సినిమా కథ నటి నీనా గుప్తా వ్యక్తిగత జీవితం నుంచి తీసుకున్నట్టు ఈ వెర్షన్. ఈమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్ ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోకుండానే కుమార్తె మసాబాకి జన్మనిచ్చింది. లైగర్ కూడా ఇదే స్టోరీ లైన్‌లో వుండబోతోందని వూహాగానాలు. ఇందులో రౌడీ స్టార్ తను అక్రమ సంతానమనే ఉక్రోషంతో సొంత తండ్రి మైక్ టైసన్‌తో తలపడతాడు- త్రిశూల్ లో అమితాబ్ లాగా అన్నమాట.

వైరల్ అవుతున్న ఇంకో వెర్షన్ ఏమిటంటే, ఇది మైక్ టైసన్ నిజ జీవిత కథ అని ఇన్‌సైడ్ టాక్. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా మైక్ టైసన్ బాల్యం చితికిపోయిన సంగతి తెలిసిందే. టైసన్‌ ని  అతని తల్లి పెంచింది. భర్తతో గొడవల కారణంగా  ఆమె డిప్రెషన్‌లో వుండేది. ఇంట్లో పరిస్థితులతో విసుగు చెంది కోపంతో వున్న మైక్ టైసన్ అనవసరమైన గొడవలకి దిగి స్కూల్లో తోటి స్టూడెంట్స్ ని కొట్టేవాడు. తల్లికి ఫిర్యాదులు రావడంతో, ఆమె చితగ్గొట్టేది. టైసన్ 13 ఏళ్లు దాటకముందే 38 సార్లు జైలుకు వెళ్లాడు. అతడి వార్తలు మీడియాలో కనిపించేవి. ఇది చూసి  న్యూయార్క్ కి చెందిన బాక్సింగ్ శిక్షకుడు టైసన్ కోపాన్ని బాక్సింగ్ వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మలుపు ప్రపంచానికి మైక్ టైసన్ రూపంలో బాక్సింగ్ లెజెండ్‌ ని  అందించింది. లైగర్ లో రౌడీ స్టార్- రమ్య కృష్ణ ల మధ్య ఈ కథే వుండబోతోందని వార్తలు.

ఈ వెర్షన్ ప్రకారం కరీంనగర్‌కి చెందిన రమ్యకృష్ణ  కొన్ని కారణాల వల్ల ముంబైకి వెళుతుంది. అక్కడ ఆమె ఒక మురికివాడలో టీ దుకాణం నడుపుతూ నివసిస్తుంది. ఆ మహానగరంలో ఒంటరి స్త్రీగా సమస్యల్ని ఎదుర్కొంటూ రౌడీ స్టార్ కి ధైర్యవంతురాలైన తల్లిగా మారుతుంది. అయితే రౌడీ స్టార్ ఆమెకి తెలియకుండా ఫైటర్ గా మారతాడు. కొడుకు ఫైటర్ కావడం రమ్యకృష్ణకి అస్సలు ఇష్టముండదు. కానీ రౌడీ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గొప్ప ఫైటర్‌గా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అవుతాడు.

లీకులు తెలుగు సినిమాలకి కొత్త కాదు. ఆచార్య కథని మెగా స్టార్ చిరంజీవి కూడా ఈవెంట్స్ లో వాయిదాల పద్ధతిన లీక్ చేస్తూ పోయారు. అల్లు అర్జున్ పుష్ప’, మహేష్ బాబు సర్కారువారి పాట’, నాగార్జున-నాగ ఛైతన్య ల బంగార్రాజు’, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, ప్రభాస్ రాధేశ్యామ్ కథలు కూడా లీకయ్యాయి.

ఇంకా నిర్మాణం ప్రారంభం కానీ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కథ కూడా లీక్... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న బాలాయ మూవీ కథ గురించి జోరుగా చెప్పుకుంటున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం. ఒకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యపు కథ. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన  కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అనంతపూర్ కి ఓ భారీ పరిశ్రమ రావాల్సి వుంది. అది వేరే రాష్ట్రానికి తరలిపోయింది.. ఇలా వుంటుంది ఈ కథ అని లీకులిస్తున్నారు.

ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అయితే ఏకంగా సినిమాలోని దృశ్యాలే సోషల్ మీడియాలో దర్శన మిచ్చాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట  ట్రైలర్ తో బాటు, అల్లు అర్జున్ పుష్ప లోని దాక్కో దాక్కో పాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.

ఇంకా గమ్మత్తేమిటంటే, కథా రచయితే కథని లీక్ చెయ్యడం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్- కథేమిటో చెప్పేశారు. రాజ‌మౌళికి జంతువులంటే చాలా ఇష్టం కాబ‌ట్టి ఆఫ్రికా అడ‌వుల నేపథ్యంలో కథ వుంటుందని చెప్పేశారు. ప్రసిద్ధ అమెరికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఒక హిస్టారికల్ థ్రిల్లర్ ని కథ కోసం తీసుకున్నట్టు కూడా చెప్పేశారు...ఉండుండి ఆ మధ్య పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కథ కూడా లీకైందని వార్తలొచ్చాయి.

ఈ విధంగా టాలీవుడ్ లో లీకుల పరిశ్రమ వెలసి దాని పని అది చేసుకు పోతోంది. సంతోషించాల్సిందేమిటంటే, లీకులు పాజిటివ్ గానే వుంటున్నాయి. సినిమాలు డ్యామేజ్ అయ్యేలా కథల్ని చెత్తగా మార్చి విష ప్రచారాలు చేయడం లేదు.
***


23, ఆగస్టు 2022, మంగళవారం

1194 : మలయాళం రివ్యూ!


 

ఆవాస వ్యూహం (మలయాళం – తెలుగు వెర్షన్)
దర్శకత్వం : కృషంద్
తారాగణం : రాహుల్ రాజగోపాలన్, నిలీన్ సంద్ర, గీతీ సంగీత, శ్రీనాథ్ బాబు, శ్రీజిత్ బాబు, ఝింజ్ షాన్
రచన : కృషంద్, రినాయ్ స్కేరియా జోస్; సంగీతం : అజ్మల్ హస్బుల్లా, ఛాయాగ్రహణం : విష్ణు ప్రభాకర్
నిర్మాత :  కృషంద్
విడుదల : ఆగస్టు 4, 2022, సోనీ లైవ్
***

      సినిమా ఆలోచనలో పడేసిందంటే రెండుంటాయి- ఎందుకు తీశాడా అని, ఎలా తీశాడా అని. అర్ధంపర్ధం లేకుండా తీస్తే ఈ చెత్త ఎందుకు తీశాడని తలపట్టు కోవడం, అర్ధానికే అర్ధాలు చెప్పేలా తీస్తే ఎలా సాధ్యమైందని కుస్తీ పట్టడం... సినిమాకో అర్ధముంటుంది : ఓ జానర్, ఆ జానర్ మర్యాదలకి సంబంధించిన వివిధ మసాలా దినుసులూ, ఇంతే. ఇంత మాత్రం అర్ధంతో వచ్చిన సినిమాలే వస్తూంటాయి. ఇలా కాకుండా వివిధ మసాలా దినుసుల బదులు ఏకంగా వివిధ జానర్లతోనే ఇంకెంతో అర్ధాన్నే చెప్తే? వూహించడానికే వంద సంవత్సరాల దూరానికి నెట్టేసి, వివిధ సజాతి, విజాతి జానర్లన్నీ మసాలా దినుసులుగా వాడేసి, సినిమా అనే అర్ధానికే ఇంకా తెలియని అర్ధాలు చెప్తే? వస్తువు కంటికి  కన్పించే అర్దంతోనే వుండదు. వస్తువుని పోస్ట్ మార్టం చేసి మరిన్ని అర్ధాలు కన్పించేలా చేయొచ్చు. మెదడు ఉన్నదున్నట్టు సమాచారాన్ని తీసుకోదు, దాన్ని మార్చేస్తుంది, మెలి దిప్పుతుంది, ఆ పైన నిల్వజేసుకుంటుంది. వెండి తెరమీద పాత్ర - అబ్బ! ఏం వేడి వేడి సమోసా!- అని డైలాగు పలికితే, మెదడు ఆ మాటల్ని మాత్రమే రికార్డు చేయదు. ఆ వేడి వేడి సమోసా రుచీ వాసనా ఎలా వుంటాయో నోరూరించే ఆ అనుభవాన్నీ కలగలిపి జ్ఞాపకాల్లో దాచేస్తుంది. ఇదే సినిమా నిర్మాణానికీ వర్తిస్తుంది. సినిమా అనే రొటీన్ అర్ధానికి వెనకాల ఇంకా అనుభవించగల ఎలిమెంట్లున్నాయి - వాటిని మెదడు రికార్డు చేసే వుంటుంది. వాటి జోలికి పోవడానికి మనస్కరించదు. ఉన్న ఆ వొక అర్ధాన్నే పట్టుకుని పుష్కరాలకి పుష్కరాలు గోదారి ఈదడం... గోవిందా అనుకుంటూ గోదాములో చేరిపోవడం.

        బాంబే ఐఐటీ పూర్వ అధ్యాపకుడైన దర్శకుడు కృషంద్ ఆవాస వ్యూహం తో దీనికి సమాధానం చెప్పాడు. తను చేసిన ఈ అనితరసాధ్య ప్రయోగమెలాటి దంటే, మేధావుల మెప్పుకే కాదు, ఏ జీవితాల గురించి ఇందులో చూపించాడో ఆ సగటు ప్రేక్షకులు చూసి వినోదించడానిక్కూడా అందించాడు (సగటు జీవుల కోసం రాసే కవితలు సగటు జీవులే చదవరు కదా- తమ గురించి కవిత్వం రాస్తున్నారనే విషయమే వాళ్ళకి తెలీదు- కవిత్వం చేయలేని పని సినిమా చేస్తుంది).

ఈ దర్శకుడు జానర్ల మిశ్రమంతో కథ చెప్పే దృశ్య భాషనే మార్చేసినా, సగటు ప్రేక్షకుల నాలెడ్జికి అందేలా సూపర్ హీరో క్యారక్టర్ని- మీరే ఈ క్యారక్టర్ అన్నట్టుగా, మీరూ చెడుని ఎదుర్కోవచ్చన్న కర్తవ్య బోధ చేశాడు. వ్యవస్థతో పోరాటమంటే అధికార కేంద్రంతో తలపడ్డం సినిమా సూపర్ హీరోలు చేసే పెద్ద పని. సామాన్యుడేం చేయగలడు- రోజువారీ తన కెదురయ్యే కప్పారావు కుప్పారావుల పనిపట్టగలడు. వ్యవస్థలో రేపటి భాగస్థులు కావాలని ఉవ్వీళ్ళూరే కప్పారావు కుప్పారావుల పనిబడితే వ్యవస్థ పనిబట్టినట్టే. పోరాటం పక్కనున్నోడితోనే ప్రారంభం కావాలి. ఈ పోరాటమేమిటో, సామాన్యుల సూపర్ మాన్ ఎలా పోరాడేడో ఇప్పుడు చూద్దాం...

కథ

అతను జాయ్ (రాహుల్ రాజగోపాలన్) అనే ఆధార్ కార్డులేని, రేషన్ కార్డు లేని అనామకుడు. ఎక్కడ్నించి వచ్చాడో, తన వాళ్ళెవరో తెలీదు. నేపాల్ నుంచి వచ్చాడని, శ్రీలంక నుంచి వచ్చాడని, కాదు బంగ్లా దేశ్ నుంచీ వచ్చాడనీ చెప్పుకుంటారు. అతను మత్స్యకారుడు. అతను నోటితో చేసే శబ్దాలకి చుట్టూ వచ్చి చేరిపోతాయి చేపలూ కప్పలూ. ఇతడికేవో మానవాతీత శక్తులున్నాయనుకుంటారు జనం. కానీ మత్స్యాహారం తినడు. వాటిని వలేసి పట్టడం కూడా ఇష్టముండదు. కేరళ పశ్చిమ కనుమల్లో కోచ్చి సమీపంలో సముద్ర తీరాన పుథువైపిన్ అనే వూళ్ళో వచ్చి చేరాడు.

ఇదే వూళ్ళో లిజ్జీ (నిలీన్ సంద్ర) అని లిటిల్ రాఘవన్ కూతురుంటుంది రొయ్యల డిపోలో పని చేస్తూ. ఈమెకొక సంబంధం వస్తుంది. అతను పడవల యజమాని సజీవన్. వీడు పెళ్ళాన్ని చంపినోడని వద్దని అనేస్తుంది. ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని సజీవన్ తమ్ముడు అనూజన్ మురళి (శ్రీనాథ్ బాబు) తో కలిసి పథకమేస్తాడు. జాయ్ అడ్డుకుంటే, అనూజన్ మురళి ప్లాంక్ (నిఖిల్ ప్రభాకరన్) అనే క్రాక్ రౌడీని తీసుకుని జాయ్ మీద దాడి కెళ్ళి, నెత్తి పగుల గొట్టించుకుంటాడు. ఇంకోసారి స్వయంగా సజీవనే దాడికొస్తే, జాయ్ రెండు పీకుళ్ళు పీకి సజీవన్ ని నిర్జీవన్ చేసేసి పారిపోతాడు. ఎక్కడికి పారిపోయాడో తెలీదు. అతడ్ని ప్రేమిస్తున్న లిజ్జీ బెంగ పెట్టుకుని వుంటుంది.

జాయ్ ఎక్కడి కెళ్ళాడు? వెళ్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఎవరు తీసికొచ్చారు? వచ్చి ఏం చేశాడు? పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఈసారి ఇంకే రూపంలో వచ్చాడు? వచ్చి సరాసరి పారిస్ జువాలజీ మ్యూజియంలో అస్థిపంజరంగా ఎలా తేలాడు? ఈ చిక్కు ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథ పర్యావరణ పరిరక్షణ గురించి. జీవవైవిధ్యం ఎంత విస్తారంగా వుంటే అంత పర్యావరణానికి ప్రయోజనకరమని చెప్పడం గురించి. పురోగతి అంటే స్వచ్ఛమైన గాలి, నీరు దొరకడమని చెప్పడం గురించి. ఈ కథలో చూపించిన పుథువైపిన్ లో 2017 నుంచీ ప్రజా పోరాటం జరుగుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అక్కడ ఎల్ పి జి ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ నిరవధిక 144 సెక్షన్ విధించింది. పర్యావరణానికీ ప్రజా జీవితానికీ ఈ ప్లాంట్ హానికారకమని ప్రజల అభ్యంతరం.

దీన్ని తీసుకుని ఈ ప్రాంతం చుట్టూ పర్యావరణం కథ అల్లాడు దర్శకుడు. మనిషి వల్ల జీవులు జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. చివరికి అంతరించి పోయే దశలోనూ  ఉనికిని చాటుకుంటూ సంకరం చెంది కొత్త జీవులుగా ఉద్భవించినా, ఇది ప్రకృతి వైపరీత్యమని మనిషి దాన్నీ అంతం చేస్తున్నాడు... ఈ కథలో ప్రకృతికి ప్రతీకగా వున్న పాత్ర జాయ్, కప్ప మనిషిగా మారినా మన్నించలేదు మనుషులు- అంతరించిపోయిన జీవుల మ్యూజియంలో పారిస్ లో కంకాళంగా మిగలాల్సిన పరిస్థితి.

మనిషి సృష్టించిన ప్రభుత్వ, న్యాయ, మత, రాజకీయ, పత్రికా వ్యవస్థలతో స్వార్ధపరుడిగా మారిపోతే జీవులు మ్యూజియాలలో నమూనాలుగా మిగలాల్సిందేనని ఒక హెచ్చరిక ఈ కథ.  

ప్రపంచీకరణ వచ్చేసి ప్రపంచాన్ని చదును చేసేసిందని ప్రసిద్ధ పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ ఏనాడో ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అన్న పుస్తకమే రాశాడు. ఆ చదును చేయడంలో విలువలు, ఆత్మలు, ప్రాణాలు సమస్తం నలిగిపోయాయన్నాడు. దీన్నే చెబుతూ 2018 లో అభయ సింహా తుళు భాషలో పడ్డాయి (పడమర) తీశాడు. ఇదొక అద్భుత ప్రయోగం. షేక్స్ పియర్ పాపులర్ మాక్బెత్ నాటకాన్ని ఇక్కడి పర్యావరణ కథగా మార్చేశాడు.

సామాజికంగా ఆర్ధికంగా ఆధునిక యుగంలో ప్రవేశించిన దేశాకాల పరిస్థితుల్ని మాక్బెత్ ఆధారంగా చూపించాడు. ఇక్కడి జాలర్లు వేటకి సముద్రంలో పడమర వైపు వెళ్తారు. తాము తూర్పుకి చెందిన వాళ్ళు. తూర్పుకి చెందిన తాము ట్రాలర్ల సాక్షిగా పడమర - అంటే పాశ్చాత్య విలువలకి మారాలన్న తహతహతో పాల్పడే చర్యల పరిణామాల్ని గొప్పగా చిత్రించాడు. వర్షాకాలం చేపలు గుడ్లు పెట్టే కాలమని వేటని నిషేధించిది ప్రభుత్వం. నిషేధాన్ని ఉల్లంఘించి కంపెనీల వాళ్ళు ట్రాలర్లతో ఫిషింగ్ చేస్తూ గుడ్లని నాశనం చేస్తున్నారు. ఇంకా పర్యావరణానికి హాని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కూడా కథలో చిత్రించాడు.

పడ్డాయి - ఆవాస వ్యూహం రెండూ మత్స్యకారుల జీవితాలాధారంగా పర్యావరణ సమస్యని ఎత్తి చూపిస్తున్నవే. రెండూ క్రైమ్ థ్రిల్లర్లే. పడ్డాయిలో మత్స్యకారులైన భార్యాభర్తలు దురాశకి పోయి చేపల కాంట్రాక్టర్ ని హత్యచేసి, అతడి వ్యాపారాన్ని హస్తగతం చేసుకునే కుట్ర అయితే, ఆవాస వ్యూహం లో పెళ్ళి కోసం అమ్మాయిని వేధిస్తున్న చేపల కాంట్రాక్టర్ ని చంపే నేరం.

అయితే దీన్ని హాస్యరస ప్రధానంగా చెప్పాడు దర్శకుడు కృషంద్. సమస్య తీవ్రమైనదే, కానీ ఏ పాత్రా సీరియస్ గా మాట్లాడదు. వేళాకోళమే. చెట్లు పెంచితే మావోయిస్టు నయ్యానంటే నేను మావోయియిస్టుగానే వుంటాన్లే’... ‘వాడు క్రిమినల్, కిల్లర్, టెర్రరిస్ట్, యాంటీ నేషనలిస్ట్ ... విరక్తి అంటే ఏంటి?’ - అది బాధరా- రాజ్యాంగం అంటే ఏమిటి?’ - అదొక బుక్కురా ...ఆకలేస్తోందిగ్లూకోసు ఎక్కించారు కదా, అది కూడా చాల్లేదా నీకూ?’ ...ఇలా వుంటుంది ధోరణి.

2015 లో కన్నడ దర్శకుడు రాంరెడ్డి తిధి అనే ఆర్ట్ సినిమాని ఇంతే వినోద భరితంగా తీశాడు. చనిపోయిన 101 ఏళ్ళ తాత మరణం చుట్టూ వివిధ ఆచారాలూ, ప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలు విసిరిన అపూర్వ ప్రయోగమిది- 20 జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో. ఒక మరణం, దాంతో పేదరికంలో పుట్టే స్వార్ధం, దాంతో మోసం, కుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్ విషయాలని నవ్వొచ్చేట్టు చూపించాడు. ఇలా ఆర్ట్ సినిమాల్ని ఎంటర్టయినర్లుగా మార్చి, నేటి తరం ప్రేక్షకులకి సామాజిక అవగాహన కల్పించే దిశగా ప్రయాణిస్తున్నారు ఇలాటి దర్శకులు.
అయితే ఆవాస వ్యూహం దర్శకుడు హాస్యమాధారంగా కథ చెప్పడానికి వాడిన పరికరాలు, జీవ వైవిధ్యపు కథకి వైవిధ్య కళా ప్రక్రియల సంకలనంగా వుండడమే ఇతర ఆర్ట్ సినిమాల నుంచి దీన్ని వేర్పరుస్తోంది. బ్లాక్ కామెడీతో కథనం హాస్యంగా వుండడమే గాక, థ్రిల్లర్, ఎలక్ట్రానిక్ మీడియా, డాక్యుమెంటరీ, రషోమన్ ఎఫెక్ట్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ జానర్లని అతుకులేసినట్టు కన్పించకుండా సంకలనం చేసిన కళే విస్మయ పరుస్తుంది.

నటనలు సాంకేతికాలు

'సూపర్ హీరో జాయ్ గా రాహుల్ రాజగోపాలన్ ది సినిమా హీరోయిజాన్ని ప్రదర్శించే పాత్ర కాదు. అతను ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో కలిసిపోయి వుంటాడు. జలచరాలు అతడి పిలుపు వింటే వచ్చేస్తాయి. ఇలాటి ఇతను మనిషి చేతిలో ప్రకృతి లాగా స్ట్రగుల్ చేస్తూంటాడు. తిరగబడాల్సిన చోట తిరగబడతాడు. ప్రకృతితో మనిషి, మతం, సైన్స్, ప్రభుత్వం, రాజకీయం, మీడియా వీటన్నిటి స్వార్ధ వైఖరులు ఇతడి దృష్టి కోణంలో తేటతెల్ల మవుతూంటాయి. వీటికి వ్యంగ్య భాషణం చేస్తూంటాడు. అతడి ముఖంలో అమాయకత్వమే వుంటుంది. బానిసగా నటన కూడా సింపుల్ గా వుంది.

ఇతడ్ని ప్రేమించే లిజ్జీగా నిలీన్ సంద్రది చివరంటా అతడ్ని వెతుక్కునే పాత్ర. మధుస్మితగా గీతీ సంగీత తో క్లయిమాక్స్ లో వచ్చి కథని మలుపు తిప్పుతుంది. జాయ్ ని వాడుకుని చేపల వ్యాపారం చేసుకునే సుశీలన్ పాత్రలో ఝింజ్ షాన్ ది కూడా కీలకపాత్రే. జాయ్ ని చంపాలని చూసే, హాస్యంగా సాగే జంట పాత్రలు పోషించిన శ్రీనాథ్ బాబు, నిఖిల్ ప్రభాకరన్ లు చివరికి కథని తామే ముగిస్తారు. ఈ నటులెవరూ కూడా కమర్షియల్ నటనల జోలికి పోకుండా, మన చుట్టూ వుండే మనుషుల్లాగే మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.     

సాంకేతికంగా పైన చెప్పుకున్నట్టు వివిధ జానర్ల మిశ్రమానికి సి. రాకేష్ ఎడిటింగ్ కష్టమైన పనే. జానర్లతో మారిపోతూ వుండే శైలీ శిల్పాలతో కూడిన విజువల్స్ ని, సమ్మిళితం చేసిన తీరు మెచ్చదగిందే. దర్శకుడు తలపోసిన కళాఖండపు గౌరవానికి తగ్గకుండా ప్రొడక్ట్ ని చెక్కి అందించాడు ఎడిటర్. అలాగే నేటివిటీకి తగిన స్వరాలు కూర్చిన సంగీత దర్శకుడు అజ్మల్ హస్బుల్లా. ఛాయాగ్రహణంతో అద్భుత విజువల్స్ సృష్టించిన విష్ణు ప్రభాకర్. సముద్రం, నదీ తీరాలూ, అటవీ లోతట్టు ప్రాంతాలూ, క్రిమికీటకాల నుంచీ వివిధ జీవుల కలాపాలూ ఈ పర్యావరణపు కథా చిత్రానికి వన్నె తెచ్చాయి. 

సినిమాల గురించి ఒక కామెంట్ వాడుతూంటారు- పెట్టిన ప్రతీ రూపాయీ తెరమీద కన్పించిందని. ఎలా కన్పిస్తుందో? దేనికెంత పెట్టారో ఆడిటింగ్ చేశారా? ఎంత చెప్పి ఎంత పెట్టారో గుట్టులాగి చెప్తున్నట్టు. పెట్టిన ప్రతీ రూపాయీ తెరమీద కన్పించడం కాదు గానీ, పరిగణనలోకొచ్చేది రాసిన ప్రతీ పేజీ తెరమీదికెలా వచ్చిందనేది. ఇలాటి స్క్రిప్టు రాయడమే ఛాలెంజ్, దాన్ని తెర కెక్కించడం రొంబ ఛాలెంజ్. దర్శకుడు ముందు ఎంత కష్టపడి రాశాడో తెరమీద ప్రతీ పేజీ చెప్తోంది...ఇదీ మనక్కావాలి సినిమా నాలెడ్జికి!

చివరికేమిటి
స్క్రీన్ ప్లే పరంగా ఈ కథ రెండు కౌంటర్ ట్రాకుల్లో నడుస్తుంది. ఒక ట్రాక్ రీసెర్చర్ల బృందం పుథువైపిన్ అడవుల్లో అరుదైన ఉభయచరాన్ని కనుగొనే అన్వేషణతో, ఇంకో ట్రాకు వివిధ వ్యక్తులు జాయ్ గురించి తెలుసుకునే ప్రయత్నంతో. రీసెర్చర్ల బృందం అన్వేషణ వర్తమానంలో జరుగుతుంది. జాయ్ గురించి తెలుసుకునేందుకు వివిధ వ్యక్తులు చేసే ప్రయత్నం గతంలో జాయ్ గురించి తెలుపుతూంటుంది. విషయమేమిటంటే, ఈ వ్యక్తులు ఏ జాయ్ గతం గురించి చెప్తున్నారో, ఆ జాయ్ వర్తమానంలో పారిస్ మ్యూజియంలో అస్థిపంజరమై వుంటాడు. అతను కప్ప మనిషిగా మరణించాడు. ఈ కప్పమనిషి అనే ఉభయచరాలు ఇక్కడి అడవుల్లో ఇంకేమైనా వున్నాయా తెలుసుకోవడానికే రీసెర్చి బృందం అన్వేషణ అన్నమాట! అంటే కథ ముగింపే ప్రారంభం అన్నమాట. ఆద్యంతాలు లేని వర్తులం విశ్వం లాగా.

కథ మళ్ళీ నాల్గు చాప్టర్లుగా వుంటుంది. కథా కాలం 2015-2023 నడుమ వుంటుంది. మొదటి చాప్టర్ జాయ్ తో లిజ్జీ కథ, రెండో చాప్టర్ జాయ్ తో చేపల వ్యాపారి సుశీలన్ కథ, మూడో చాప్టర్ జాయ్ తో మధుస్మిత కథ. మధ్యమధ్యలో ఇతరపాత్రల సబ్ చాప్టర్లు వస్తూంటాయి.

ఈ పాత్రలు టీవీ కెమెరాకి చెప్తున్నట్టు చాప్టర్లు చెప్తూంటాయి. అంటే అకిరా కురసావా మాస్టర్ పీస్ రషోమన్ లో ఒక నేరం గురించి సాక్షులు తమతమ దృక్కోణాల్లో వ్యాఖ్యానాలు చేసే రషోమన్ టెక్నిక్ కథనమన్న మాట.

ఈ కథనంలో థ్రిల్లర్ కథ ప్లే అవుతూంటుంది. రీసెర్చర్ల బృందం ట్రాకుకి సైంటిస్టు కామెడీగా కామెంట్లు చేస్తూంటాడు. జాయ్ కథలో వచ్చే డాక్టర్, నర్సు, పోలీసులు వంటి పాత్రలు కూడా టీవీ కెమెరాకి చెప్తున్నట్టు సమాచారాన్ని అందిస్తూంటారు. వివిధ పాత్రలతో ఈ కథ మొత్తాన్నీ టీవీ న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు డాక్యుమెంటరీ అన్నట్టు వస్తూంటుంది.

ఇందులోనే బ్లాక్ కామెడీ, థ్రిల్లర్, రషోమన్ ఎఫెక్ట్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మొదలైన విభిన్న జానర్లు నీటుగా కలిసిపోయి సగటు ప్రేక్షకుల వినోదానికి మిఠాయిలా అందుతూంటాయి.

ఇన్ని పొరలతో కథ చెడకుండా స్క్రీన్ ప్లే సమకూర్చడం మామూలు విషయం కాదు. కళల మీద దర్శకుడికి ప్రకృతంత విశాల నేత్రముంటేనే సాధ్యం. ఈ గొప్ప సినిమా అందించిన దర్శకుడు కృషంద్ కి కేరళ రాష్ట్రపు ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి. ఈ కళాఖండం తెలుగులో అందుబాటులో వుంది సోనీ లైవ్ లో.

—సికిందర్

 

18, ఆగస్టు 2022, గురువారం

1193 : స్ట్రక్చర్


 ఎందుకంటే...

* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం  ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక 
* శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకే పోలికతో  వుంటుంది గనుక

* ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక
* కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు
మలుపు తిరగాలి
, ఎక్కడ ముగింపు  నివ్వాలి అన్నవి,
మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వున్నాయి గనుక
* శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే
పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!
స్ట్రక్చర్ అంటే...
*అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం 
* క్రియేటివిటీ అంటే..
* ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం 
* స్ట్రక్చర్  సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్)  ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు
( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
* ఈ తేడా తెలీక  స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు 
* అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు 
* ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ కథల్ని రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప,
క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివిటీ తోనే స్క్రిప్టు రాసుకోవడం వల్ల- 
* పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని  రంగరించినా...
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో
లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి

ఇందుకే స్ట్రక్చర్ అవసరం!
* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా 
* ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన
కథకి వాస్తు (స్ట్రక్చర్)
వుందా లేదా ఆలోచించక పోవడం నిజంగా అవివేకం!

***