రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జనవరి 2022, శుక్రవారం

1117 : రివ్యూ


కథ  - దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
తారాగణం  : నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి, రావు రమేష్, నాగబాబు, వెన్నెల కిశోర్, ఝాన్సీ, బ్రహ్మాజీ తదితరులు
స్క్రీన్ ప్లే : సత్యానంద్, సంగీతం : అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం : యువరాజ్
విడుదల : జనవరి 14, 2022
***

        2016 సంక్రాంతికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సంక్రాంతికి దీని సీక్వెల్ గా బంగార్రాజు విడుదల చేశారు. ఈ సారి నాగార్జునతో బాటు నాగ చైతన్య నటిస్తూ చిన బంగార్రాజు పాత్ర పోషించాడు. ఈ సీక్వెల్ తండ్రీ కొడుకుల వల్ల ఇంకెంత ప్రీమియం వినోదంగా మారిందో చప్పున చూసేద్దాం...

కథ
          సోగ్గాడే చిన్ని నాయనా లోని బంగార్రాజు (నాగార్జున) కొడుకు డాక్టర్ రామ్మోహన్ (నాగార్జున) ఇప్పుడు కొడుకుని కని, భార్య చనిపోయి, కొడుకుని తల్లి సత్యమ్మ (రమ్యకృష్ణ) కప్పగించి తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. మనవడికి భర్త పేరే వచ్చేలా చిన బంగార్రాజు అని పేరు పెట్టుకున్న సత్యమ్మ అల్లారు ముద్దుగా పెంచుతూ చనిపోయి, స్వర్గంలో వున్న భర్త బంగార్రాజుని చేరుకుంటుంది. వూళ్ళో సర్పంచ్ (రావురమేష్) కూతురు నాగలక్ష్మి (కీర్తీ శెట్టి) తో క్షణం పడని మనవడు చిన బంగార్రాజుని స్వర్గం నుంచి చూసి, మనవణ్ణీ నాగలక్ష్మినీ ఎలాగైనా కలిపి పెళ్ళి చేసి రమ్మని బంగార్రాజుకి చెప్పి పంపిస్తుంది సత్యమ్మ. భూమ్మీద మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య) శరీరంలోకి ప్రవేశించిన బంగార్రాజు ఆత్మ, ఇప్పుడా ఇద్దరి ప్రేమని ఎలా చక్కబర్చి పెళ్ళి చేసిందనేది, మనవణ్ణి చంపాలని జరుగుతున్న కుట్రని ఎలా ఎదుర్కొందన్నదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

         నాటి సంక్రాంతి విలేజి వినోదం సోగ్గాడే చిన్ని నాయనా లోలాగే సోషియో ఫాంటసీ కమర్షియల్ కథ. దర్శకుడు కళ్యాణ్  కృష్ణ మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయనా కి తనది కాని కథని (మూల కథ పి రామ్మోహన్, స్క్రీన్ ప్లే సత్యానంద్) ఓన్ చేసుకుని, ఒక విజయవంతమైన వినోదాన్ని అందించగల్గిన వాడు, 2017 లో రెండో సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ని సొంత కథతో తీసి ఫ్లాప్ చేశాడు. ఎలాగైతే ఈ రెండో సినిమాకి ప్రాణంలేని కథ చేశాడో, ఇప్పుడు మూడో సినిమా బంగార్రాజు కీ ప్రాణం లేని సొంత కథే చేశాడు.  ప్రాణమే లేకపోతే బంగార్రాజు ఆత్మ ఎక్కడుంటుంది. మనవడు చిన బంగార్రాజు శరీరంలోకి తాత బంగార్రాజు దూరినంత మాత్రాన ఏం జరుగుతుంది కథకి శరీరం లేక పోయాక.

        రెండో సినిమా కథలో కొత్తదనం లేనట్టే మూడో సినిమాలోనూ లేదు. రెండో సినిమా లాగే మూడో సినిమా పాత కథని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు పాత్ర చిత్రణలు సహా. రెండో సినిమాలో ఫస్టాఫ్ లో విషయం లేనట్టే, మూడో సినిమాలోనూ లేదు. రెండో సినిమాలో సెకండాఫ్ ముప్పావు గంట సేపూ కథని  పక్కకి తప్పించి, వెన్నెల కిషోర్ పెళ్ళి తంతే సాగించినట్టు, మూడో  సినిమాలో నాగ చైతన్య- కీర్తీ శెట్టిల విషయం లేని ప్రేమని సాగదీశాడు.

        స్వర్గం నుంచి వచ్చిన బంగార్రాజు ఆత్మ తన మహిమతో ప్రేమకి ఒక క్రేజీ ఫార్ములా ప్రయెగించి సంచలనం రేపకుండా- ప్రేమికుల్ని ముప్పుతిప్పలు పెట్టకుండా- తను ఆత్మ అనే విషయాన్నే మర్చిపోతే ఇంకేం కథ. ఫాంటసీ జానర్ అన్నాక మానవాతీత శక్తుల వినియోగంలేని వినోద కాలక్షేప మెలా సాధ్యం.

     సోగ్గాడే చిన్ని నాయనా లో బంగార్రాజు కొడుకు పాత్ర, భార్యతో వూళ్ళోకి రావడంతో వుంటుంది. ఈ ప్రారంభమే ఇద్దరూ విడాకులు నిర్ణయించుకుని వచ్చారన్న ఎమోషనల్ హుక్ తో వుంటుంది. ఈ ఎమోషనల్ హుక్ మొత్తం కథనంతా బలంగా నడిపిస్తూంటుంది. విడాకుల నిర్ణయానికి కారణం కొడుకు తన పనే తప్ప, ఇంకో పని పట్టకుండా భార్యని నిర్లక్ష్యం చేయడం. ఇతనిలా తయారవడానికి తల్లి సత్యమ్మే కారణం. చనిపోయిన భర్త బంగార్రాజు మన్మధ వేషాలేస్తూ తలనొప్పిగా తయారయ్యాడని, కొడుకు కూడా అలా తయారవకూడదని, ఆడగాలి సోకకుండా కట్టుదిట్టంగా పెంచింది కొడుకుని. దీంతో కొడుకు మన్మధ బాణం లేని మొండి మొగుడుగా తయారయ్యాడు. ఇలా ఇక్కడున్న వొక ఎమోషనల్ సెటప్ ఈ సీక్వెల్ కి కొరవడింది. చైతూ- కీర్తీల మధ్య కీచులాటలొక సమస్యా? అది తీర్చే కథ వో కథా? కథే కాక పోయినా వున్న దాన్నిబంగార్రాజు స్పెషల్ పవర్స్ తో ఫన్నీ రోమాంటిక్ ఫాంటసీ చేయొచ్చు. ఇదీ లేకపోవడంతో సంక్రాంతికి వినోదం సోసోగా తయారైంది.

నటనలు – సాంకేతికాలు

    బంగార్రాజు సీనియర్ గా నాగార్జున ఆరేళ్ళ క్రితం సోగ్గాడులాగే అందం తగ్గకుండా గ్లామరస్ గా వున్నాడు. స్వర్గంలో రంభా ఊర్వశీ మేనకలతో రోమాంటిక్ సాంగ్ రోస్ట్ చేశాడు. కథలోకి వస్తే బంగార్రాజు జూనియర్లోకి దూరి చేసిన కామెడీ మాత్రం పాతగానే వుంది పేలకుండా. జూనియర్లోకి దూరి ఫైట్లు చేసే రెగ్యులర్ టెంప్లెట్ సీన్లూ వున్నాయి. మార్వెల్ స్టూడియోస్ సూపర్ మాన్ సినిమాలు కొత్తకొత్తగా వూపేస్తున్న కాలంలో, నాగ్ ఆత్మ పాత్ర ఇన్నోవేటివ్ గా కొత్త విన్యాసాలతో నెక్స్ట్ లెవెల్ కెళ్ళాల్సింది. ఉన్న స్థాయిలోనే వుండిపోయింది. స్వర్గ దృశ్యాలకి, టెంపుల్ సీన్సుకీ వెచ్చించిన సీజీ వర్క్ అసలు నాగ్ క్యారక్టర్ విషయంలో విస్మరించారు.

        చిన బంగార్రాజుగా నాగచైతన్య ఎప్పటిలాగే హుషారుగా నటించాడు. పాత్రగా సాగడానికి ఎమోషనల్ గోల్ లేకపోవడంతో, కథలో కూడా ఎమోషనల్ త్రెడ్డే లేకపోవడంతో, కీర్తీ శెట్టితో పైపైన సాగే రోమాన్స్ కి పరిమితమైపోయాడు. హిట్స్ సాంగ్స్ తో మాత్రం అలరించగల్గాడు. నాగ్ - చైతూలు కలిసి కన్పించే సీన్లు వెండితెరని వెలిగించేసినా కథలో విషయం లేకపోవడం వల్ల కేవలం మోడలింగ్ చేస్తున్నట్టే, లేదా క్యాట్ వాకింగ్ చేస్తున్నట్టే వున్నారు. క్లయిమాక్స్ మాత్రం కొంత విషయం కనపడి ఇద్దరూ కాస్త ఫర్వాలేదన్పించుకున్నారు.

        లేటెస్ట్ గ్లామరామృతం హీరోయిన్ కీర్తీ శెట్టి సర్పంచ్ గా మారే పాత్ర చిత్రణకి, ఆ కామెడీకి రెండు మూడు చోట్ల మాత్రమే నవ్వొస్తుంది. ఆమె పాత్రని సరిగా డెవలప్ చేయకుండా టెంప్లెట్ హీరోయిన్ స్థాయిలో వదిలేశారు. రమ్యకృష్ణ ఎక్కువ గ్లామరస్ గా వుంది వెండి తెరకి. ఆత్మగా ఆమె కూడా వచ్చి కొన్ని పనులు చేస్తుంది. ఇక హీరోయిన్ తండ్రిగా రావురమేష్ సైడ్ క్యారక్టర్ గానే మిగిలిపోయారు. సహాయ పాత్రల్లో ఇతరులందరూ హంగామా చేస్తారు కథ లేకపోయినా.

        యువరాజ్ ఛాయాగ్రహణంలో అతిగా డీఐ చేసిన గ్రామీణ విజువల్స్ కన్పిస్తాయి. పాటల దృశ్యాల్ని అత్యంత రంగులమయం చేసి, పాటల కోసమే సినిమా చూడాలన్నట్టుగా చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ పాటల చిత్రీకరణ గుర్తొచ్చేలా. అనూప్ రూబెన్స్ ఆరుకి ఆరు పాటలూ హిట్ చేశాడు. ఇతర సాంకేతిక విలువలన్నీ బావున్నాయి.

చివరికేమిటి

    సోగ్గాడే చిన్ని నాయనా ఇప్పుడు తీసి బంగార్రాజు గతంలోనే తీసి వుంటే ఆరోహణ క్రమం కనపడేది.  సీక్వెల్ అన్నాక ప్రీక్వెల్ ని మించిన స్థాయిలో వుండాలి. అప్పుడు బంగార్రాజు తీసి ఇప్పుడు సోగ్గాడే తీస్తే కథల్నేమీ మార్చాల్సిన అవసరం రాదు. అప్పట్లో అంచనాలుండేవి కాదు కాబట్టి బంగార్రాజూ హిట్టయ్యేది, ఇప్పుడు అంచనాలుంటాయి కాబట్టి వాటిని అందుకుంటూ సోగ్గాడూ హిట్టయ్యేది.

        బంగార్రాజు సెకండాఫ్ కెళ్ళడానికి ఫస్టాఫ్ లో కారణం లేదు. ప్రేమకథలో విషయం లేదు, ఇంటర్వెల్లో హీరోయిన్ విడిపోయే సన్నివేశమూ సరిగా లేదు. ఫస్టాఫ్ ముప్పావు గంట వరకూ చాలా విషయాలుంటాయి గానీ దేంతోనూ భావోద్వేగాలు పుట్టవు. చిన బంగార్రాజు పుట్టుక, గుడిని విలన్లు దోచే ప్రయత్నం, చిన బంగార్రాజు పెంపకం, స్కూల్లో చిన్న హీరోయిన్ తో తగువులాటలు, స్వర్గంలో పెద్ద బంగార్రాజు సరసాలు, చిన బంగార్రాజు పెద్దవాడై హీరోయిన్ వెంట పడ్డం, మధ్యలో గుడి కింద వజ్రాల గనులతో విలన్ కుట్ర ఇలా యాభై నిమిషాలు గడిచిపోయాక- స్వర్గం నుంచి బంగార్రాజు ఆత్మ వచ్చి చిన బంగార్రాజులోకి దూరడంతో కథ ప్రారంభమవుతుంది.

        ఓ అరగంట ఇంటర్వెల్ వరకూ బంగార్రాజు ఆత్మతో కామెడీలయ్యాక, చిన బంగార్రాజుతో హీరోయిన్ విడిపోవడం, గుడి కింద గనులు దోచాలంటే అడ్డున్న చిన బంగార్రాజుని విలన్ చంపాలనుకోవడంతో ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ సరిగా లేక, విలన్ తో ఉప కథ రొటీన్ గా వున్నాక, సెకండాఫ్ ఫస్టాఫ్ లాగే ఇంకా కథని వెతుక్కుంటూ వుండి పోయింది. దీన్ని మరిపించడానికన్నట్టు  చాలా మాస్ కామెడీలు చేశారు. చివరి కెలాగో క్లయిమాక్స్ కొచ్చి, సగటు ప్రేక్షకులకి సరిపోయే ఎమోషనల్ ముగింపుని మాత్రం ఇచ్చారు.  

—సికిందర్


 

13, జనవరి 2022, గురువారం

1116 : స్క్రీన్ ప్లే సంగతులు

థలో తగినంత సంఘర్షణ లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు పాత్రకి మరిన్ని బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల్ని జోడించడం చేస్తే, పాత్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కువ సంఘర్షించేలా చేస్తుంది. తగినంత సంఘర్షణ లేకపోతే పాత్ర వెంటనే దాని లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఇది కథని బలహీనం చేస్తుంది. కథలో పాత్ర లక్ష్యం కోసమే సంఘర్షిస్తుంది. అంటే సంఘర్షణ అనేది లక్ష్యాన్ని కథగా మారుస్తుందని అర్ధం జేసుకోగలం.          

యితే మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్న కథ అలాంటిది కాకపోతే? మన కథకి సంఘర్షణని జోడించడం మనస్కరిచక పోతే ఏం చేస్తాం? ఇక్కడ కథల గురించి మనకుండే అవగాహనని విస్తరించుకుని చూడాలి. విభిన్న కథా కథనాల నిర్మాణాలేమిటో తెలుసుకోవాలి. మనం పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినట్లయితే, కథల్లో సమస్యని పరిష్కరించడాన్నేకథ లంటారన్న అభిప్రాయంతో పెరిగి వుంటాం. సమస్యని పరిష్కరించడమే కథ ఐనట్లయితే, ఆ సమస్య పాత్రకి లక్ష్యాన్ని, లాభ నష్టాల్ని, సంఘర్షణనీ కల్పిస్తుంది. ఇలా సమస్యని పరిష్కరించడమే పాత్ర కర్తవ్యమవుతుంది.
        
అయితే మన కలవాటైన ఈ నాటకీయ ఉత్థన పతనాల (డ్రమెటిక్ ఆర్క్) కథన శైలి అన్ని కథలకీ, ముఖ్యంగా పాశ్చాత్యేతర సంస్కృతులకి వర్తించదు. మరీ ముఖ్యంగా, మనం అలవాటు పడినట్టు, విభిన్న కథా నిర్మాణాలతో కూడిన కథలు సంఘర్షణపై ఆధారపడవు. అలాగని సంఘర్షణ లేదు కాబట్టి వీటిని కథలుగా పరిగణించ వీల్లేదని కాదు. సంఘర్షణ లేకపోవడమే వీటిని వైవిధ్య కథలుగా మార్చేస్తుంది. దీన్నుంచి మనం నేర్చుకోవాలి. 

సంఘర్షణ రహిత లేదా స్వల్ప సంఘర్షణల కథా నిర్మాణాలు :
        సంఘర్షణని విస్మరించే, లేదా స్వల్ప సంఘర్షణకి భిన్నమార్గాల్నవలంబించే కథా నిర్మాణాలు చూద్దాం : 1) కిషోటెన్‌కేట్సు:  ఈ నాలుగు అంకాల కథా నిర్మాణం (ఫోర్ యాక్ట్స్ స్ట్రక్చర్) చైనీస్, కొరియన్, జపనీస్ కథల్లో కన్పిస్తుంది. శతాబ్దాల నాటి కథనాల నుంచి ఆధునిక మాంగా, నింటెండో వీడియో గేమ్‌ల వరకూ దీన్ని చూడొచ్చు, 2) రోబ్లెటో: సాంప్రదాయ నికరాగ్వాన్ కథా శైలి. ఇందులో పాత్ర ప్రయాణ మార్గాలు అనేకం వుండి, పునరావృత మవుతూ వుంటాయి, 3) డైసీ-చైన్ ప్లాట్ : ఒక కేంద్రీయ పాత్రంటూ లేకుండా, ఒక కథా వస్తువుని లేదా ఆలోచనని అనుసరించే నిర్మాణం, 4) ఫ్యాన్ ఫిక్షన్ ఫ్లఫ్”:  పాత్ర  ఇంటరాక్షన్స్ (పరస్పర చర్యల) పై దృష్టి పెట్టే సంఘర్షణా రహిత నిర్మాణం, 5) ఓరల్ స్టోరీ టెల్లింగ్ : సంఘర్షణని కాకుండా నైతిక సందేశాన్ని నొక్కి చెప్పే నిర్మాణం, 6) రషోమన్-స్టైల్ ప్లాట్ : విభిన్న దృక్కోణాల నుంచి  పునరావృతమయ్యే సంఘటనలతో కూడిన నిర్మాణం.

విభిన్న నిర్వచనం :
        మనం పాశ్చాత్య-సంస్కృతి దృక్కోణంలో కథ చెప్పడంలో కూరుకుపోయి వుంటే, సంఘర్షణ లేని కథల్ని బోరుగానే ఫీలవుతాం. వాటినసలు కథలుగానే పరిగణించం. సరే, అయితే అసలు కథని కథగా మారుస్తున్న దేమిటో అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్దాం. నేను నా బ్లాగులో తరచుగా వివరిస్తున్నట్టుగా, అన్ని రకాల కథలూ  'మార్పు' ఆధారంగానే నిర్మాణాలు జరిగాయి. చాలా పాశ్చాత్య-శైలి కథా కథనాలు సంఘర్షణ ప్రభావిత 'మార్పు' పై ఆధారపడి వుంటాయి. 'మార్పు' అంటే పాత్ర మారడం, పరివర్తన చెందడం. ఇందులో కథానాయకుడు బాహ్య లేదా అంతర్గత సంఘర్షణల్ని అధిగమించడం లేదా, వాటి నుంచి నేర్చుకోవడం (లేదా అధిగమించడంలో లేదా నేర్చుకోవడంలో విఫలమవడం) వుంటుంది.

        ఇలా పాత్ర సంబంధిత మార్పుతో కూడిన కథలకి మనం అలవాటు పడ్డాం. దీనికి వ్యతిరేకంగా పైన చెప్పుకున్న ఆరు పాశ్చాత్యేతర నిర్మాణాలున్నాయి. ఇవి పాత్ర మార్పు పై కాకుండా పఠితలో మార్పుపై దృష్టి పెడతాయి.  ఉదాహరణకి, రషోమన్-శైలి కథలు ఒకే సంఘటనకి వివిధ పాత్రలు చెప్పే భిన్న భాష్యాల్ని ప్రేక్షకుల ముందు పెడతాయి. వాటిలో ఏది యదార్థమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. ఫ్యాన్‌ఫిక్ "ఫ్లఫ్" కథల్లో, పాఠకులు తమ అభిమాన పాత్రలు చెప్పే, చేసే, ఆలోచించే, ప్రవర్తించే లేదా విభిన్న పరిస్థితులలో ప్రతిస్పందించే తీరుని తీసుకుని, వాటికి విస్తరించిన తమ వూహా కల్పనని జోడిస్తారు.

        ఇక కిషోటెన్‌కేట్సులో, కథలోని మూడో అంకంలో వూహించని ట్విస్టు వస్తుంది. ఈ ట్విస్టు ప్రేక్షకులు కథని చూసే దృక్కోణాన్ని మార్చేస్తుంది. సాధారణ ప్లాట్ ట్విస్ట్ కంటే పాఠకుల దృక్పథాన్ని మార్చడం గురించి ట్విస్ట్ ఎక్కువగా వుంటుంది. అందుకని మొదటి రెండంకాలతో సంబంధం లేకుండా ఈ ట్విస్ట్  వుంటుంది.

        ఈ ఉదాహరణ చూడండి... మై నైబర్ టోటోరో అనే జపనీస్ యానిమేషన్ లో సంఘర్షణ లేదు, ప్రత్యర్థి లేడు. ఇద్దరమ్మాయిల తల్లి అనారోగ్యంతో వుంటుంది. ఈ అనారోగ్యం కథలో సాధించాల్సిన సమస్య కాదు. కేవలం ఒక పరిస్థితి. ఆమె ఆరోగ్యం మెరుగుపడడం అనేది అమ్మాయిల చర్యలతో సంబంధం లేనిది. అమ్మాయిల పని మ్యాజికల్ పవర్స్ తో వున్న పొరుగు వ్యక్తి గురించి తెలుసుకోవడం గురించే. అతడ్ని స్నేహితుడిగా చేసుకోవడం గురించే. ఆ స్నేహితుడితో కలిసి ప్రపంచాన్ని రక్షించడమో, లేదా దురుసు మనుషుల నుంచి ఈ ప్రత్యేక స్నేహితుడిని రక్షించడమో కాదు. అలాంటిదేమీ లేదు. కేవలం స్నేహం చేయడమే.

—జామీ గోల్డ్

 

 

 

 

 

11, జనవరి 2022, మంగళవారం

1115 : స్క్రీన్ ప్లే సంగతులు


            తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కోవిడ్ వల్ల కన్పిస్తున్న మార్పేమిటంటే, రెగ్యులర్ ఫార్ములా కథలకి తోడు భిన్న కథా శైలుల్ని ఆదరించే ఆధునికత్వాన్నికూడా అలవర్చుకోవడం. కోవిడ్ ఓటీటీని వెంట బెట్టుకొచ్చి ఇంటింటా అంటించింది. దాంతో ప్రపంచంలో ఎక్కడి ఏ భాషా సినిమాల్నైనా చూసే అవకాశంతో సినిమా చూసే దృక్పథాన్నే మార్చేసుకున్నారు. అన్ని సినిమాలూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలే అనే లౌకికతత్వాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. ఓటీటీకి పూర్వం వరల్డ్ సినిమాలున్నాయి. కానీ వాటికి అలవాటు పడలేదు, వాటిని మన టేస్టుకి సరిపడని పరాయి సినిమాలన్నట్టుగానే చూశారు. ఇప్పుడలా కాదు, తెలుగు సినిమాల్ని సైతం ఎలాటి కథా శైలులతో నైనా  చూసేందుకు ముందుకొస్తున్నారు.


        సింప్లీకరించి చెప్పుకోవాలంటే త్రీ యాక్ట్ స్ట్రక్చరే ఇక సినిమాల కుండనవసరం లేదు. ప్రేక్షకులిస్తున్న అనుమతితో కథ ఎలా చెప్పుకుంటూ పోవాలన్నా పోవచ్చు. ప్రేక్షకులు అనుమతి నివ్వని కాలంలో ఇలా తీసిన సినిమాలే ఎక్కువున్నాయి. అవి ఫ్లాపవడం చూసి స్ట్రక్చర్ లేక ఫ్లాపవుతున్నాయని అనేసుకున్నాం. స్ట్రక్చర్ లేకుండా చేసి, మేకర్లు మరి తామనుకుంటున్న క్రియేటివిటీ ఏమిటో చెప్పడం లేదు, దానికైనా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆ క్రియేటివిటీ ఏమిటో తెలిస్తే గ్యారంటీ నివ్వగలరు. తెలియక పోవడం వల్లే గల్లా పెట్టెలు గల్లంతవుతున్నాయి.

        ఈ వ్యాసం రాస్తున్నప్పుడే ఒక కథ డెవలప్ అవుతోంది. మేకర్ తెచ్చిన కథ కొత్తగా వుంది. అందులో కాన్ఫ్లిక్ట్ వుంది కానీ ప్రత్యర్ధి పాత్ర చివరి వరకూ అదృశ్యంగా వుండడంతో, కథనం బోలుగా వుంది. కాసేపు రెగ్యులర్ స్ట్రక్చర్ ని పక్కన పెట్టి, పాత్రకి సబ్ ప్లాట్ గా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ని కల్పిస్తూ ప్రత్యర్థి లేని లోటుని పూడ్చాలనుకుంటే, అది మేకర్ కిష్టం లేదు. ఎందుకంటే ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కోసం సృష్టించే  సమస్య పాత్ర మర్యాదని దెబ్బతీస్తుందని మేకర్ అభ్యంతరం. సమస్య లేకుండా సంఘర్షణ లేదు. ఏ సమస్య తీసుకున్నా అది పాత్ర మర్యాదనే దెబ్బతీస్తోంది. మర్యాద దెబ్బతినకుండా సమస్య ఎలా? సమస్య లేకుండా సంఘర్షణ ఎలా? ఎక్కడుంది దీనికి కిటుకు? కథ పెండింగులో పడింది.    

జెమీ గోల్డ్ 
ఒక రోజు కథల్లో సమస్యల గురించి సెర్చి చేస్తూంటే, 'కాసాబ్లాంకా', 'ఇండియానా జోన్స్', 'పల్ప్ ఫిక్షన్', 'మ్యాట్రిక్స్' లలో ప్రయోగించిన ప్లాట్ డివైసులున్నాయి. దీన్ని మెక్ గఫిన్ ప్లాట్ డివైస్ అంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కనిపెట్టాడు. ఒక సమస్య చుట్టూ సంఘర్షిస్తూంటాయి పాత్రలు. ఆ సమస్య పాత్రలకే తెలుసు, ప్రేక్షకులకి చెప్పరు. చెప్తే తేలిపోతుంది. 'కాసాబ్లాంకా' లో లెటర్స్ అనే ప్లాట్ డివైస్ వుంటుంది. ఆ లెటర్స్ లో ఏముందో చెప్పరు. 'పల్ప్ ఫిక్షన్'లో బ్రీఫ్ కేసు ప్లాట్ డివైసుగా వుంటుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు.

        ఈ మెక్ గఫిన్ ప్లాట్ డివైసుని మన మేకర్ కథలోకి తెచ్చేస్తే సమస్య తీరిపోయింది. సమస్య దేని గురించో చెప్పకుండా, పాత్ర మర్యాద దెబ్బ తీయకుండా, సబ్ ప్లాట్ ప్రత్యర్ధితో ప్రత్యక్ష సంఘర్షణతో కథ నీటుగా వచ్చేసింది. పనిలో పనిగా అసలు అదృశ్య ప్రత్యర్ధితో ప్రచ్ఛన్న పోరాటం (కోల్డ్ వార్) కూడా తళుక్కున మెరిసి సమగ్ర కథ వచ్చేసింది...

        ఇదే సమయంలో ఇంకో కథ. ఇది రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్ కథ. మనం చంద్రుడి ఒక వైపే చూస్తాం, అవతలి వైపు ఏముందో తెలియదు. టెంప్లెట్ సినిమాలు కూడా ఒకవైపే చూపిస్తూ బోరు కొట్టేస్తున్నాయి. రెండో వైపు ఎందుకు చూపించరు. ఈ కథకి ఇదే చేసి ఇంటర్వెల్లో అట్టు తిరగేసినట్టు తిరగేస్తే రెండోవైపు కొత్త కథ కన్పించింది... ఇంకో మేకర్ టెంప్లెట్ కథనే పెద్ద కంపెనీల్లో చెప్తూ సెకండాఫ్ రిజెక్ట్ అవుతున్నాడు. ఇంటర్వెల్లో రివర్స్ చెయ్, సెకండాఫ్ కొత్తగా వస్తుందన్నాం. రివర్స్ చేయడానికి ఒక ప్లాట్ డివైస్ ఇచ్చేశాం. మేకర్ స్టామినా పెరిగింది...

        మన దగ్గరే సినినాప్సిస్ లో ఒక పెద్ద కథ వుంది. సెకండాఫ్ లో కెళ్లినా 'కమర్షియల్ హీరోయిజం' కనిపించడం లేదని మేకర్ ఫిర్యాదు. దీని ఇంటర్వెల్ విజువల్ బ్యాంగ్ తో వుంది. అది కూడా హీరోయిజమే. దీనికో డైలాగు వేసి వర్బల్ బ్యాంగ్ ఇవ్వడంతో సెకండాఫ్ కూడా కొత్త కథగా మారిపోయింది ఆ డైలాగు పట్టుకుని.

        ఇదంతా ఏమిటంటే స్ట్రక్చర్ కి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు. కథల్లో సమస్యా, దాంతో సంఘర్షణా వుంటాయి. వీటిని స్ట్రక్చర్ లో సరైన తీరులో వాడకపోవడం వల్ల మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు వచ్చి ఫ్లాపవుతున్నాయి. అసలు సంఘర్షణే లేని గాథలు కూడా తయారై ఫ్లాపవుతున్నాయి. ఇంకేవో లైటర్ వీన్ సినిమా లనుకుంటూ కూడా వచ్చి ఫ్లాపవుతున్నాయి. ఇవన్నీ సమస్య- సంఘర్షణ పరికరాల వాడకంలో బోల్తాపడుతున్నవే. ఇప్పుడు సినిమాల తీరు మారింది. వివిధ కథాకథనాల శైలులు సమస్య- సంఘర్షణ పరికరాల్ని భిన్నంగా నిర్వచిస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ శైలులేమిటో తెలుసుకుంటే స్ట్రక్చరేతర క్రియేటివ్ స్కూలు మేకర్స్ తీసే 'ఇండిపెండెంట్' కమర్షియల్ సినిమాలైనా నాణ్యత పెంచుకుంటాయి. ఈ శైలుల గురించి వివరిస్తూ రచయిత్రి జెమీ గోల్డ్ రాసిన వ్యాసం రేపు మీకందుతుంది. చదివి అర్ధం జేసుకుని పాటించగలరు.

—సికిందర్        

8, జనవరి 2022, శనివారం

1114 : రివ్యూ!


 

స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకుల మీద పోరాట సినిమాల లిస్టులో 1945 కూడా చేరింది గానీ, ఈ సినిమా అంటే మొదట్నుంచీ హీరో రానా దగ్గుబాటికి ఇష్టం లేదు కాబట్టి, నిర్మాతతో పడక అయిదేళ్ళూ అస్తవ్యస్తంగా నిర్మాణం చేసి హడావిడిగా విడుదల చేశారు కాబట్టీ, దీన్నొక సినిమాగా పరిగణించక లిస్టులోంచి కొట్టేయవచ్చు. రానా కనీసం డబ్బింగ్ కూడా చెయ్యక మూగనోము పడితే సినిమాకే గతి పడుతుందో వూహించవచ్చు. క్లయిమాక్స్ ని కూడా బహిష్కరిస్తే ఇదేం సినిమా అని ముక్కు మీద వేలేసుకోవచ్చు. సినిమాకి ముగింపు లేదు. అంటే రెండో భాగం తీస్తారని కాదు. తీసిన భాగమే పూర్తి చేయలేక! ఇంత కంటే జోకు ఈ జనవరి మాసంలో 2022 పూర్తయ్యే వరకూ లేదు. ఈ యేటి మేటి జోకు ఇది.

        1942- ఏ లవ్ స్టోరీ.. కాదు కాదు, 1942- ఏ లవ్ స్టోరీ – హిందీలో తీసిన బ్రిటిష్ తో పోరాట పీరియెడ్ మూవీలోని ప్రేమ కథని దోచుకుని, 1945 - ఏ లవ్ స్టోరీ గా దోపిడీ దార్లయిన తెల్లదొరల మీద పోరాటానికి సిద్ధం చేశారు. దోచుకున్న కథతో  దోపిడీ దార్లమీద పోరాటం.  పాత సినిమాల్లో జమీందారుతో పోరాటం టైపు లాంటి పాత సీన్లతో దేశభక్తి కథ. ఈ కథ 1945లో బర్మా (నేటి మయన్మార్) లో జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ తో పోరాడటానికి ఇండియన్ నేషనల్ ఆర్మీని  ప్రారంభించే సమయంలో ఆది (రానా దగ్గుబాటి) తన కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి బర్మాకి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత బ్రిటిష్ తాసిల్దారు కుమార్తె (రెజీనా) ని ప్రేమించి  నిశ్చితార్థం చేసుకుంటాడు. ఇక పెరుగుతున్న తెల్లదొరల దురాగతాలు చూసి స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఇక ఈ పోరాటంలో ఎలా గెలుపు సాధించాడన్నది మిగతా కథ.

        ఇందులో ప్రేమ కథ సరిగా లేదు, పోరాట కథా సరిగా లేదు. ఏ కథకీ సరైన  భావోద్వేగాల్లేవు. కొన్ని చోట్ల అసలు అర్ధమే వుండదు. రానా సంఘర్షించడానికి కారణమూ  హాస్యాస్పదమే. ఇక దేశభక్తి ఎక్కడా ఉప్పొంగే సమస్యే లేదు. సినిమా ముగింపు మాత్రమే కాదు, కొన్ని సీన్లు కూడా ముగియకుండానే కట్ అయిపోతూంటాయి. అరాచకంగా వుంటుంది సినిమా ప్రదర్శన. రానా, సప్తగిరిల కామెడీ కూడా బ్రిటిష్ వాళ్ళకంటే అరాచకంగా వుంటుంది. రానా- రెజీనాల ప్రేమ బందరు కాల్వలా వుంటుంది. దేశ ద్రోహుల  పన్నాగాలు, పోలీసుల దౌర్జన్యాలు, వడ్డీ వసూళ్ళు, నడ్డి విరిచే పన్నుల వసూళ్ళూ - వీటి మీద తిరుగుబాటూ- ఏ స్వాతంత్ర్య పోరాట సినిమా చూసినా ఇవే కథలు. బ్రిటీషర్లు ట్రిగ్గర్-హ్యాపీ విలన్లు. మాస్ మసాలా సినిమాల్లో లో - గ్రేడ్ విలన్ల లాగా నవ్వడాలు, మాట్లాడితే కాల్చి చంపడాలు, ఇంతే.

        1945 నాటి వాతావరణ సృష్టి వరకూ కళా దర్శకత్వం బావుంది. ఇది మినహా మరేదీ బావున్న దాఖలాల్లేవు. రీరికార్డింగ్, గ్రాఫిక్స్ కూడా అశ్రద్ధకి లోనయ్యాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఇప్పుడు ఔట్ డేటెడ్ అయింది. సత్య పొన్మార్ ఛాయాగ్రహణం కొంత వరకూ ఫర్వాలేదు.

తెలుగు, తమిళ భాషల్లో తీసిన తమిళ దర్శకుడు సత్యశివ ఎందుకు ఈ టెంప్లెట్ స్వాతంత్ర్య కథని తలపెట్టాడో అర్ధంగాదు. కొత్తగా ఏం చెప్పాడు? అసలు స్వాతంత్ర్య పోరాటమన్నా, పోరాట యోధులన్నా, వాళ్ళు లాఠీ దెబ్బలు తిని జైళ్ళల్లో మగ్గిన, తుపాకీ కాల్పులకి గురైన, ఉరి కంబాలెక్కిన చరిత్ర అన్నా, దేశభక్తి అన్నా ఏమీ తెలియకుండా, ఆ త్యాగాల్ని ఫీలవకుండా కాలం గడిపేస్తున్న, ఉచితంగా స్వాతంత్ర్యం అనుభవించేస్తున్న యువతరం అధిక శాతం వుంది. కంగనా రణవత్ ల వంటి కుహనా దేశభక్తుల మాటలు వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాటం వాళ్ళకి సుదూర చరిత్ర. దాన్ని వాళ్ళ సమీపంలోకి తేవాలంటే యూత్ అప్పీల్ తో నూనూగు మీసాల యువపాత్రలతో, స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధుల కథల్ని తెరపైకి తేవాలే తప్ప, ఇంకా ముసలి వాళ్ళతో అరిగిపోయిన ముసలి పన్ను వసూళ్ళ కథలు కాదు. ఇవి కనెక్ట్ కావు. ఇంకా చూసేవాళ్ళూ లేరు.


—సికిందర్

 

 

7, జనవరి 2022, శుక్రవారం

1113 : రివ్యూ!

రచన - దర్శకత్వం: పొలిమేర నాగేశ్వ‌ర్‌ 
తారాగణం : ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు 
క‌థ‌: వేణుగోపాల్ రెడ్డి, సంగీతం: శేఖ‌ర్ చంద్, ఛాయాగ్రహణం : అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల
, అశోక్ రెడ్డి మిర్యాల 
విడుదల :
జనవరి 7, 2022
***

        పదేళ్ళ క్రితం ప్రేమ కావాలి’, లవ్లీ ల తర్వాత ఆది సాయి కుమార్ కి 12 ఫ్లాపులే తప్ప హిట్ ప్రాప్తం కాలేదు. ఇప్పుడు అతిధి దేవోభవ తో ఇలాటి కొత్త తరహా సినిమాలే చేస్తానన్నాడు. ఇందులోని పాత్రతో తనలో కొత్త అది ని చూస్తారని అన్నాడు. కొత్త దర్శకుడు కూడా రెండు దశాబ్దాల ప్రయత్నం తర్వాత ఇప్పుడు దర్శకుణ్ణి అయ్యాననీ, ఈ మూవీ మలుపు తిప్పే మూవీ అవుతుందనీ, ఇందులో సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా వుంటుందనీ వర్ణించాడు, ఇద్దరి మాటలూ ఎంతవరకూ నిజం? నిజమనుకుని ఎలా భ్రమల్లో వున్నారు? 12 ఫ్లాపుల తర్వాత ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత దర్శకుడూ సినిమా అంటే ఏమిటో ఎలాటి అవగాహనతో వున్నారో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అభయ్ రామ్ (ఆది సాయికుమార్) తల్లి (రోహిణి) తోడు లేకపోతే వుండలేక పోతాడు. చిన్న తనం నుంచే అతను మోనోఫోబియా అనే మనోవ్యాధితో వుంటాడు. ఒంటరిగా వుండాలంటే భయం. ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాలి. ఎప్పుడూ తోడు తెచ్చుకుంటున్న ఇతణ్ణి చూసి గర్ల్ ఫ్రెండ్ బై చెప్పేస్తుంది. మరోపైపు ఉద్యోగంలో పై స్థాయికి ఎదగాలనుకుంటున్న అభయ్ కి ఈ ఫోబియా సమస్యై పోతుంది. ఇలా వుండగా వైష్ణవి (నువేక్ష) అనే ఇంకో అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ పెళ్ళికి దారి తీసేసరికి సంకటంలో పడతాడు. తన సమస్య ఈమెకి చెప్పాలా వద్దా? చెప్తే ఏమవుతుంది? చెప్పక పోతే ఏమవుతుంది? ఈ ప్రశ్నలే మిగతా కథ.  

ఎలావుంది కథ

2019 లో నిహారికా కొణిదెల నటించిన సూర్యకాంతం లో ఆమె పాత్రకి పెళ్ళంటే భయమనే కమిట్ మెంట్ ఫోబియా లేదా గామోఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియాతో ఆధునిక సినిమాలా వుండాల్సింది కాస్తా ఎలా మూస ఫార్ములా ప్రేమ డ్రామాలాగా వుందో, అలా అతిధి దేవోభవ లో ఒంటరిగా వుండాలంటే భయమనే మోనో ఫోబియాతో వుంది.

        2015 లో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య లో ఎండ తగిలితే ప్రాణాలకి ప్రమాదమయ్యే జిరోడెర్మా  పెగ్మెంటోసమ్ అనే అనువంశిక శారీరక రుగ్మతతో - ఎలా ఆ ఎత్తుకున్న పాయింటు వదిలేసి, అరిగిపోయిన రొటీన్ ముక్కోణ ప్రేమ చట్రంలో బిగించారో, అలా అతిధి దేవోభవ లో పాత్ర ప్రాబ్లం ఒకటైతే, నడిపిన కథ ఇంకోటిగా తయారయ్యింది. 

        ఏదో ఫోబియా నావెల్టీగా వుందని ఎత్తుకోవడం, దాన్ని బాక్సాఫీసు ఫ్రెండ్లీగా ఎలా మార్చాలో తెలీక రొటీన్ మూస ఫ్రేమల్లోకి తిప్పేయడం మనకలవాటే. ఈ అలవాటు కూడా ఒక ఫోబియాతోనే... ఏమిటీ, గోలీమార్ మన్మర్జియమ్ సొల్లమ్ ఫోబియా  అని కొత్తగా చదివావా? అది మనకర్ధం కాదు గానీ, అలా అని పబ్లిసిటీ చేసి నువ్వే కావాలి లవ్ స్టోరీ తీయ్, చూడక చస్తారా  - అని ఆత్మారాముడు అనడం, దానికి ఆత్మ సమర్పణ చేసుకోవడం. ఇంతకంటే అతిధి దేవోభవ అనే 1.5 రేటింగ్ సినిమాని విశ్లేషించుకుంటే రేటింగ్ కే అవమానమవుతుంది.

నటనలు- సాంకేతికాలు

  ఆది నటించిన పాత్రకి అర్ధం పర్ధం వుంటేగా అద్భుతంగా ఫీలవడానికి. ఒంటరిగా వుండాలంటే భయమనే ఫోబియాతో రకరకాల సైకో సీన్లు నటించడమే ఆదికి అద్భుతంగా అన్పించి, ప్రేక్షకులకి రికమెండ్ చేస్తే సరిపోతుందా? అసలీ పాత్రతో కామెడీ చేయాలో, థ్రిల్లర్ చేయాలో తేల్చుకోకపోతే తేలేది కన్ఫ్యూజనే. పాత్ర చిత్రణ వదిలేసి నటుడుగా చెప్పుకుంటే నటించగలడు. కాకపోతే ఇలాటి ఫ్లాప్ పాత్రలు నటించడమే ఇప్పటికి పదమూడో సారి సమస్య.

        హీరోయిన్ నువేక్ష అందంగా కన్పించడానికే తప్ప నటించడానికి కాదేమో. పాత్ర వుంటేగా నటించడానికి. సినిమా మొత్తంలో వర్క్ చేయకుండా రెమ్యూనరేషన్ తీసుకున్నది తనే అయుంటుంది. సప్తగిరి కామెడీకి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగాని మానసిక స్థితి. యూట్యూబ్, ఫేస్బుక్ కొత్తకొత్త తెలుగు కామెడీ షార్ట్ వీడియోల ముందు సప్తగిరి కామెడీ ఔట్ డేటెడ్ అయిపోయింది. షార్ట్ వీడియోలని బీట్ చేసే కామెడీ చేయకపోతే సప్తగిరికి సమస్యే.

        ఇక ఇతర నటీనటుల గురించి టెంప్లెట్ గా చెప్పుకుంటే, పాత్రల పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయి నటించారు. అక్కడక్కడ నవ్వులు పూయించి మెప్పించారు. ఒరిగిపోయి మనమీద నిద్రించలేదు. ఇక సాంకేతిక విలువలు, సంగీతం, దర్శకత్వం అన్నీ ఎలావుండ కూడదో అలా వున్నాయి. 

        దర్శకత్వం, దృశ్యాల్ని మల్చిన తీరు, కథ నడపడం అన్నిటా వైఫల్యమే కన్పిస్తుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ వరకూ ఈ ఫోబియా కథలోకి వెళ్ళాలంటే ఫోబియా వల్ల కామెడీలతో గడపడం, సెకండాఫ్ లోనూ హీరోకున్న ఫోబియాతో ఎంతసేపూ సైకో సీన్ల తో కాలక్షేపం చేయడంతప్ప, ఫోబియాకి విరుగుడు దిశగా ప్రయాణించాలంటే ఫోబియా వల్ల, నసతోనే లాగించడమనే స్కీముని దిగ్విజయంగా అవలంబించాడీ కొత్త దర్శకుడు. ప్రేమిస్తున్నట్టు చివరిదాకా చెప్పలేక నస పెట్టే ప్రేమ సినిమాలున్నాయి. అదే ఇదీ. కాకపోతే ప్రేమ బదులు ఫోబియా. ప్రేమ సీసాలో ఫోబియా సారా పోస్తే కొత్త సినిమా.       

        12 ఫ్లాపుల తర్వాత హీరో ఆది, 20 ఏళ్ళ స్ట్రగుల్ తో కొత్త దర్శకుడూ చేసిన ఉమ్మడి కృషి - ఫ్లాపవుతుందని తెలియక ఇష్టపడి కష్టపడి తీసిన ఫ్లాప్. ఇలా అసలు బేసికల్ గా సినిమా అంటే ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని ఫ్లాపులు తీయాల్సిందేనేమో.
—సికిందర్

 

5, జనవరి 2022, బుధవారం

1112 : ఆర్టికల్

    2020, 2021 లలో ఒక మాయదారి మహమ్మారి మిగిల్చిన బాధాకర అనుభవాల్ని మర్చిపోయి కొత్త ఆశలు చిగురింప జేసుకుని సినిమా రంగం 2022 లోకి అడుగు పెడుతూంటే, ఇప్పుడూ వదలడం లేదు మరింకో రూపంలో విరుచుకు పడుతున్న పేచీకోరు మహమ్మారి. ఒమిక్రాన్ గా కోరలు చాచి పరిహాస మాడుతూంటే భారీ బడ్జెట్లతో తీసిన బాలీవుడ్ నిర్మాతలు సైతం వణికి పోతున్నారు. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగి పోతూండడంతో, రాష్ట్రం తర్వాత రాష్ట్రం థియేటర్ల మూత, లేదా సీటింగ్ సామర్ధ్యంలో కోత అంటూ నిర్ణయాలు తీసుకోవడం సినిమాల విడుదలలకి గండంగా మారింది. హిందీ సినిమాలు, లేదా సౌత్ నుంచి వెళ్ళే పానిండియా సినిమాలూ విడుదల చేయాలంటే దేశవ్యాప్తంగా, కొన్ని బయటి దేశాల్లో, థియేటర్లు బార్లా తెరిచి వుండాలి. కానీ దేశం లోపలా, బయట ఓవర్సీస్ లోపలా కొత్త కోవిడ్ వేరియెంట్ ఒమిక్రాన్ నేను ముందు! అంటూ పోటీపడి ఎక్కడపడితే అక్కడ విడుదలవుతూంటే, సినిమాలెలా విడుదలవుతాయి? ఒకప్పుడు షోలే’, దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఐదేళ్ళు పైబడి ఆడాయి. కోవిడ్ కూడా అన్నేళ్లు ఆడాలని చూస్తోందేమో రూపాలు మార్చుకుని...

        డిసెంబర్ నుంచే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.  తీవ్రఅనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే కేసులు, మరణాల సంఖ్యా చాలా తక్కువగా వున్నా, కేసుల ఆకస్మిక పెరుగుదలతో ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ మరోసారి అతలాకుతలమవుతుందన్న భయాందోళనలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ముందే థియేటర్లని మూయించేసింది. బాలీవుడ్ కి గుండె కాయైన ముంబాయిలో రాత్రి కర్ఫ్యూ విధించేశారు. బెంగళూరు, చెన్నైలలో థియేటర్లలో యాభై శాతం మేరకే సీటింగ్ సామర్ధ్యాన్ని అనుమతిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేకపోయినా, పానిండియాలు కాబట్టి ప్రేక్షకుల గుమ్మం దాకా వచ్చిన  ఆర్ ఆర్ ఆర్’, రాధే శ్యామ్ విడుదలలు ఆగిపోయాయి.

        ఈ రెండు సినిమాల్ని కూడా కలుపుకుని బాలీవుడ్ లో ఇంకో రెండు హిందీ సినిమాలని లెక్కేస్తున్నారు : పృథ్వీరాజ్’, జెర్సీ’. షాహీద్ కపూర్ - మృణాళ్ ఠాకూర్ లు నటించిన జెర్సీ డిసెంబర్ 31 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది.  అక్షయ్ కుమార్- మానుషీ  చిల్లర్ నటించిన పృథ్వీరాజ్ జనవరి 21 న విడుదల కావాల్సింది. నిరవధికంగా వాయిదా పడింది. మధ్య యుగాల యోధుడు, సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ చారిత్రాత్మకం సూర్యవంశీ వెతల్ని గుర్తుకు తెస్తోంది. ఇది కూడా అక్షయ్ కుమార్ నటించిన బిగ్ బడ్జెట్టే. 2020 మార్చిలో కోవిడ్ మొదటి రౌండు నుంచీ, 2021 రెండో రౌండునీ దాటుకుని, నాల్గు సార్లు వాయిదా పడి - ఏడాదిన్నర తర్వాత ఖర్మ అనుకుంటూ గత నవంబర్లో విడుదలైంది. అయినా ప్రేక్షకులు ఆసక్తి కోల్పోలేదు. పెద్ద హిట్ చేశారు. ఇదే ఎన్నిసార్లు విడుదలలు వాయిదాలు పడ్డా పృథ్వీరాజ్’, జెర్సీ’, ఆర్ ఆర్ ఆర్’, రాధేశ్యామ్ లకూ వర్తిస్తుంది.

        ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని  మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ప్రభుత్వాని కొక అర్జీ పెట్టుకుంది. గత రెండు కోవిడ్ ల తర్వాత మళ్ళీ థియేటర్లు తెరవడానికి అనుమతించాక, మెరుగైన వెంటిలేషన్ సిస్టమ్‌లు, మెరుగైన పరిశుభ్రత, ఇతర భద్రతా ప్రోటోకాల్‌ల అమలు ద్వారా ప్రేక్షకులకి, థియేటర్లలోని సిబ్బందికీ సురక్షిత వాతావరణాన్ని థియేటర్ల యాజమాన్యాలు కల్పించాయి. ఎక్కడా ఒక్క సినిమా థియేటర్ నుంచి కూడా ప్రేక్షకులకి కోవిడ్ సంక్రమించిన ఉదంతాలు లేవు. అందుకని సినిమా హాళ్ళని మూసేసే బదులు, మహారాష్ట్ర సహా కొన్ని ఇతర రాష్ట్రాల్లో, సినిమా థియేటర్లలోకి ప్రవేశం కల్పించడానికి డబుల్ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని కోరింది... ఈ సూచన సబబుగా వుంది. వేల కోట్ల రూపాయలు ధారబోసి డబుల్ టీకాలు వేసి ప్రజల ప్రాణ రక్షణతో సరిపెడితే కాదుగా? ఆర్ధిక రంగ పరిభ్రమణానికి కూడా టీకాలు తోడ్పడకపోతే వేలకోట్ల రూపాయలు అనుత్పాదక వ్యయమే అవుతుంది- రేపొక వేళ వేస్తే బూస్టర్ డోసు సహా.

—సికిందర్