రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఆగస్టు 2022, గురువారం

1193 : స్ట్రక్చర్


 ఎందుకంటే...

* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం  ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక 
* శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకే పోలికతో  వుంటుంది గనుక

* ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక
* కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు
మలుపు తిరగాలి
, ఎక్కడ ముగింపు  నివ్వాలి అన్నవి,
మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వున్నాయి గనుక
* శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే
పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!
స్ట్రక్చర్ అంటే...
*అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం 
* క్రియేటివిటీ అంటే..
* ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం 
* స్ట్రక్చర్  సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్)  ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు
( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
* ఈ తేడా తెలీక  స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు 
* అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు 
* ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ కథల్ని రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప,
క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివిటీ తోనే స్క్రిప్టు రాసుకోవడం వల్ల- 
* పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని  రంగరించినా...
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో
లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి

ఇందుకే స్ట్రక్చర్ అవసరం!
* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా 
* ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన
కథకి వాస్తు (స్ట్రక్చర్)
వుందా లేదా ఆలోచించక పోవడం నిజంగా అవివేకం!

***


17, ఆగస్టు 2022, బుధవారం

1192 : స్క్రీన్ ప్లే సంగతులు

 

 

      చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 కూడా హిట్. హిందీ, ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని రాష్ట్రాల నుంచి వసూళ్ళు బ్రేక్ ఈవెన్ దాటేశాయి. ఇలాటి హిట్టయిన సినిమా స్క్రీన్ ప్లే సంగతులు కూడా అద్భుతంగా వుండాలి. కానీ స్క్రీన్ ప్లే సంగతులు అద్భుతంగా లేకపోయినా ఒక్కోసారి సినిమాలు హిట్టవుతూంటాయి. సినిమా హిట్టవడానికి అర్ధవంతమైన స్క్రిప్టు వుండనక్కర్లేదనీ నిరూపి స్తూంటారు ఒక్కోసారి ప్రేక్షకులు. బజారులో ఒక వస్తువు కొనేప్పుడు దాని గురించి ఎంతో ఆలోచించి కొంటారు. కానీ సినిమాల్ని ఆలోచనాత్మకంగా చూసి ఆమోదించరు. అందులో ఏదో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అదొక్కటి పట్టుకుని ఓకే అనేస్తారు. వీళ్ళ ముందు స్క్రీన్ ప్లే సంగతులు రాసేవాడు ఓడిపోతాడు. రాయకుండా వుండడమే మంచిదనుకుంటాడు. రాయాలా వద్దా...రాయాలా వద్దా...అని ఆగి ఆగి రాస్తూంటాడు. రాస్తూంటే ఈ కింది విధంగా వచ్చింది...పాఠకులకి నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఎలాగూ వుంది.

కథ  

గ్రీస్ లోని ఒక లైబ్రరీలో  ప్రొఫెసర్ రావు ద్వాపర యుగంలో కృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసుకుంటాడు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరుతో మనుషులు ప్రకృతిని నాశనం చేస్తారని, దాని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లెదుర్కొంటారనీ, దీన్నుంచి రక్షణగా తన కాలి కడియాన్ని తీసిచ్చాడు ఉద్ధవుడనే వాడికి కృష్ణుడు ఆనాడు. ఉద్ధవుడు దాన్ని ఒక రహస్య ప్రదేశంలో భద్రంగా దాచాడు. ఈ సమాచారంతో ప్రొఫెసర్ రావు- ఇప్పుడా రహస్య ప్రదేశం అన్వేషణ ప్రారంభిస్తాడు.

డాక్టర్ కార్తీక్ (నిఖిల్) కి తల్లిదండ్రులు, చెల్లెలు వుంటారు. సదానంద (శ్రీనివాస రెడ్డి) అనే మేనమామ, రవి (సత్య ) అనే ఫ్రెండ్ వుంటారు. కార్తీక్ కి అంధ విశ్వాసాలంటే పడవు. హేతువాది. మూఢ విశ్వాసులతో తలపడుతూంటాడు. ఒక రోజు మూఢ విశ్వాసి అయిన నగర మేయర్ని హాస్పిటల్లో లాగి కొడతాడు. సస్పెండ్ అవుతాడు.

ఇంకో రోజు ఆవు వచ్చి ఇంట్లో తులసి కోటని కుమ్మి కూల్చేస్తుంది. కార్తీక్ తల్లి (తులసి) తాంత్రికుడ్ని పిలుస్తుంది. అతనొచ్చి మొక్కేదైనా తీర్చుకోలేదా అంటాడు. ఏడాది క్రితం కార్తీక్ జబ్బు పడ్డప్పుడు, ద్వారకా వెళ్ళి 108 కేజీల వెన్న కృష్ణుడికి సమర్పించుకుంటానని మొక్కుకున్నానంటుంది. అయితే వెంటనే ద్వారక వెళ్ళి ఆ మొక్కు తీర్చుకో మంటాడు.

ఇలాటివి ఇష్టం లేని కార్తీక్ ని తీసుకుని ద్వారకా వెళ్తుంది తల్లి. అక్కడ ప్రొఫెసర్  రావు హత్యలో ఇరుక్కుంటాడు కార్తీక్. కార్తీక్ ని చంపడానికి గ్యాంగ్ వెంటపడతారు. కార్తీక్ తో ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) కలుస్తుంది. ఎవరీ ముగ్ధ? ప్రొఫెసర్ రావుని చంపిందెవరు? కార్తీక్ వెంట ఎందుకు పడుతున్నారు? కృష్ణుడి కడియం గురించి కార్తీక్ కెలా తెలిసింది? ఆ కడియాన్ని కార్తీక్ చేజిక్కించుకున్నాడా? ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ  

ట్రెజర్ హంట్- ఫాంటసీ జానర్ కథ. చనిపోతూ ఒకడు ఇంకొకడి చెవిలో నిధి రహస్యం చెప్పడం, అనుచరుల్ని నేలలో మొండెం దాకా పాతి పెట్టి, హీరోని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసే లాంటి కౌబాయ్ మూవీ టెంప్లెట్ సీన్లు సహా. అయితే కృష్ణుడు పురాణ పాత్ర కాదనీ, అతను నిజంగానే వుండిన చరిత్ర అనీ, అన్ని శాస్త్ర సాంకేతిక విషయాలూ చెప్పిన ఆల్ ఇన్ వన్ సైంటిస్టు అనీ- మైథాలజీ అని నమ్మే వాళ్ళకి మైథాలజీ కాదూ హిస్టరీ అనీ చెప్పారు. ఇలాంటప్పుడు ఈ కథ హిస్టారికల్ థ్రిల్లర్ గా వుండాలి. ఇలాలేదు. ఇంతా చెప్పి మైథాలజీ లోకే తీసికెళ్ళారు.

ఇంకోటేమిటంటే, కృష్ణుడి కడియం దొరికితే అది ఏ మానవాళి సమస్యని తీరుస్తుందో  చెప్పక పోవడం. కృష్ణుడు మానవాళి సమస్యని తీర్చుకోమనే కడియం ఇచ్చాడు, తమాషాకి ఇవ్వలేదు.
కథ ఎత్తుగడలో కృష్ణుడు ఏ ఉద్దేశంతోనైతే కడియం ఉద్ధవుడికిచ్చాడో ఆ సెటప్ ని తర్వాత కథనంలో పే ఆఫ్ చేయకపోవడం. కథ ఇరవై నిమిషాలు పోయాక మంత్రికి సైంటిస్టు రిపోర్టు ఇస్తాడు మహమ్మారి (కోవిడ్) గురించి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమనీ, ఇది వ్యాపిస్తే ప్రపంచానికే ప్రమాదమనీ, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలిసేలోగా మనమే యాంటీ డోట్ తయారు చేయాలనీ, అప్పుడే ప్రపంచాన్ని ఏలుకో గలమనీ మంత్రి అంటాడు.

ఆ ప్రపంచాన్ని ఏలుకునే శక్తిగల అస్త్రమే ఈ కడియమన్న అర్ధంలో ఎక్కడా కథ నడపకపోవడం, కనీసం మంత్రి చర్చించిన ఈ పాయింటు హీరోకి కూడా తెలియకపోవడం ఈ కథ ప్రత్యేకత. మహమ్మారి అనే అంశమే ఇక వుండదు. మహమ్మారితో ముంచుకొస్తున్న ప్రమాదం, కడియం కోసం హీరో పరుగులు, కడియంతో ప్రమాద నివారణ -అనే ఏక వాక్య లాగ్ లైన్ తో కథ వుండక పోవడాన్ని గమనించాలి.

అన్నీ శాస్త్రాల్లో వున్నాయి, మనమే ప్రపంచానికి ఎత్తి చూపడం లేదు, మన గొప్ప మనమే చెప్పుకోవడం లేదు - అని ఓ పక్క అనుపమ్ ఖేర్ పాత్ర చేత ఆరోపణ చేయిస్తూనే,   కృష్ణుడి కడియంతో ప్రపంచానికేం చేస్తారో చెప్పకపోతే ఆ ఆరోపణ కర్ధం లేదు. చెప్పాలిగా? మా కృష్ణుడి కడియం చూడండి అంతర్జాతీయ ముప్పునెలా తుప్పు వదిలిస్తుందో చూపించాలిగా? సినిమాని యూనివర్సల్ అప్పీల్ చెయ్యాలిగా?

ఇదే హాలీవుడ్డోళ్ళు అయితే ప్రపంచాన్ని కాపాడే గుత్తాధిపత్యం తమదే అన్నట్టు ఇండిపెండెన్స్ డే’, ఆర్మగెడ్డాన్’, కంటేజన్ లాంటి డిజాస్టర్ మూవీస్ అడపాదడపా తీసి ప్రపంచం మీద పడేస్తారు. కంటేజన్ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడం గురించే.

కోవిడ్ కంటే ముందు ప్రారంభించిన కార్తికేయ 2 కోవిడ్ వల్ల నిర్మాణం ఆగిపోతూ ఆగిపోతూ సాగింది. బహుశా ఈ సినిమాలో కోవిడ్ పాయింటు ఈ సమయంలో జోడించారు. అందుకని అంటీ ముట్టనట్టు వుంది. కొత్తగా వచ్చిన కోవిడ్ పాయింటుతో కథ నడపాలంటే కథ మొత్తం మార్చాల్సి వస్తుంది. అందుకని కథని ఇలా వదిలేశారు.

మిథికల్ థ్రిల్లర్స్ రాసే అశ్విన్ సంఘీ నవల ది కృష్ణ కీ కథకీ, కార్తికేయ 2 కీ పెద్ద తేడా అన్పించదు. వీకీపీడియాలో కథా సంగ్రహం ప్రకారం - చరిత్ర ప్రొఫెసర్ సైనీ, మిత్రుడు అనిల్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అనిల్ ఆర్కియాలజిస్టు. అతను సింధు నాగరికతకి చెందిన ముద్రికల సంకేత భాషని ఛేదించాడు. దీని కోసమే చంపి వుంటారని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తన మీద నింద తొలగించుకోవడానికి, అనిల్ హత్యా రహస్యం తెలుసుకునే ప్రయాణానికి సమకడతాడు.

పురాణాల చీకటి కోణాల్ని తడుముతూంటే, తారక్ అనే సీరియల్ కిల్లర్ గురించి తెలుస్తుంది. ఈ తారక్ తను విష్ణువు చివరి అవతారమైన కల్కి అని నమ్ముతాడు. ప్రొఫెసర్ సైనీ అన్వేషణ కొనసాగిస్తూ, ద్వారకా, బృందావన్ ల కెళ్తాడు. బృందావన్ని ఔరరంగ జేబు కృష్ణుడి శమంతక మణి కోసం ధ్వంసం చేసిన శిథిలాల్ని చూస్తాడు.

ప్రొఫెసర్ సైనీ ముందున్న ఇంకో సమస్య- సంకేత భాష కోసం అనిల్ మిత్రుల్ని కూడా శత్రువులు టార్గెట్ చేశారు. వాళ్ళని కూడా  కాపాడాలి. సంకేత భాష విడి విడి నాల్గు భాగాలుగా ఎక్కడెక్కడో వుంది. వాటిని కనుగొని జోడిస్తేనే శమంతక మణి రహస్యాన్ని విప్పే తాళం చెవి (కీ) అవుతుంది.

యాదవ కుల తెగలైన సైనీ, భోజ, వృషినీ, కుకూర, చేడీ ల సంతతి దగ్గర  సంకేత భాష ఒక్కో భాగముందని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తనూ పంజాబ్‌లోని సైనీ తెగకి చెందిన కృష్ణుడి వంశపారంపర్య వారసుడేనని తెలుసుకుని ... ఇలా మలుపులు తిరుగుతూ థ్రిల్లింగ్ గా సాగుతుంది కథనం. ప్రొఫెసర్ సైనీ ద్వారా మహాభారతానంతర చరిత్రని వివరంగా వర్ణిస్తాడు రచయిత. ప్రధాన కథాంశానికి సమాంతరంగా కృష్ణుడి జీవిత చరిత్రని చిత్రిస్తాడు.

కార్తికేయ 2లో కృష్ణుడు కల్పన కాదు చరిత్ర అని చెప్తూనే కడియంతో కల్పిత కథ చేశారు. ఆల్ ఇన్ వన్ అయిన సైంటిస్టు మహమ్మారికి విరుగుడేం చెప్పాడో చరిత్ర వుంటే చెప్పొచ్చు. కడియంతో చెప్పిన కథ కూడా మహమ్మారి కోసంగాక, కడియం కోసమే కడియమన్నట్టు సాగడం అర్ధవిహీనంగా మార్చింది కథనాన్ని. కృష్ణ కీ తో ఈ కథ పోలికలు మహమ్మారిని తీసేస్తే దాదాపూ ఒకటే.

పోతే, దేవుళ్ళ  మరణాల గురించి చెప్పుకోకూడదు, వినకూడదు, చదవకూడదన్న ఆంక్షని పక్కన బెట్టి కృష్ణుడి నిర్యాణాన్ని చూపించేశారు! ప్రారంభ దృశ్యం వద్దన్నా వెంటాడే బ్యాడ్ ఇంప్రెషన్.

సినిమా భక్తి ప్రవచనాల వల్ల, ఫాంటసికల్ చిత్రణల వల్ల; కడియం, నెమలి, నెమలి పింఛం, దుర్బిణీ వంటి దైవాంశ కలిగిన ప్లాట్ డివైసుల వల్ల, ప్రేక్షకుల ఆత్మిక దాహం తీర్చే సాధనంగా హిట్టయి వుండాలి. కథా కథనాలతో కాదు.

మతం క్రియాశీలంగా వున్న హిందీ రాష్ట్రాల్లో దీని డబ్బింగ్ వెర్షన్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లని కింద బోర్లా పడేసి ఇందుకే పుంజుకుంటోంది. ద్వారకా, మధుర, రాధా కుంద్, బుందేల్ ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పుణ్య ప్రదేశాల్లో సినిమాని  తిప్పడం వల్ల పాన్ ఇండియా అప్పీల్ వచ్చి వుంటుంది.

స్ట్రక్చర్ సంగతులు

హీరోకి సస్పెన్స్, ప్రేక్షకులకి ఓపెన్ కథ అన్నప్పుడు హీరోకి సస్పెన్స్ ఎంతవరకుండాలి? కథ ప్రారంభిస్తే ఇంటర్వెల్ వరకూ హీరోకి కథ (సస్పెన్సుగా వుంచిన విషయం) తెలియకుండా వుండాలా? వుంటే బోరు కొట్టదా? ప్రేక్షకులు ఓపెన్ కథలో విహరిస్తూంటే, హీరో వచ్చేసి ఎంతకీ ఆ కథలోకి రాకపోతే బోరే కొడుతుంది.

ఉదాహరణకి కథా ప్రారంభంలో హత్య జరిగిందనుకుందాం. ఆ హత్యని, హంతకుడ్నీ ప్రేక్షకులకి చూపించేశారు. హీరోకి తెలియకుండా వుంచారు. హీరో ఆ హంతకుడెవరా అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇంటర్వెల్ దాకా పోతే అది కథ అన్పించుకోదు. ఇది బోరు కొడుతుంది.

అందుకని 15, 20 నిమిషాల్లో హీరోకి ఏదో క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ప్రకారం హంతకుడెవరో తెలిసిపోయి వాడి వేట, అంటే యాక్షన్ మొదలెట్టేస్తాడు. హంతకుడితో ఎలుకా పిల్లీ చెలగాటంగా. ఇది బోరు కొట్టదు. ఎందుకంటే 15, 20 నిమిషాల్లో హంతకుడెవరో తెలిసిపోవడంతో హీరో అంతవరకూ ప్రేక్షకులకే తెలిసిన కథలోకి వచ్చేశాడు. దాంతో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. హీరోకి హంతకుడ్ని పట్టుకునే గోల్ ఏర్పడింది- దాంతో మిడిల్ ప్రారంభమై యాక్షన్లోకి దిగిపోయాడు. యాక్టివ్ గా పాత్రగా వున్నాడు.  

హీరోకి ఇంటర్వెల్ వరకూ హంతకుడెవరో తెలియకపోతే అంతవరకూ ప్రేక్షకులకి తెలిసిన విషయం - అంటే కథ - హీరోకి తెలియదు. తెలియకపోతే బిగినింగ్ ముగియదు. ముగియక పోతే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. ఏర్పడక పోతే పాసివ్ పాత్రగా హీరోకి గోల్ ఏర్పడదు. ఏర్పడకపోతే మిడిల్ ప్రారంభంకాదు. ప్రారంభం కాకపోతే కథ ప్రారంభం కాదు. బిగినింగ్ లో వుండేది కథకాదు. ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. ఇలా ఇంటర్వెల్ వరకూ ఉపోద్ఘాతమే చెప్తారా?

ఇదే జరిగింది కార్తికేయ 2 లో. ప్రారంభంలో ప్రొఫెసర్ పరిశోధన, కృష్ణుడి కడియం రహస్యం ఎపిసోడ్, ప్రొఫెసర్ అన్వేషణ, కడియం కోసం ఒక విలన్ గ్యాంగ్, ఇంకో సీక్రెట్ సొసైటీ, మంత్రికి కోవిడ్ వైరస్ రిపోర్టు, మంత్రి ప్రపంచాధిపత్యం సాధించాలనడం...వంటి వన్నీ జరుగుతూంటే హీరో నిఖిల్ కివేమీ తెలియవు!

అతను హేతువాది అన్న విషయం తెలియడానికి మూడు నాల్గు సీన్లు నడుస్తాయి. అతను హేతువాది అన్న విషయం ఆల్రెడీ కార్తికేయ 1 చూపించేశారు. మళ్ళీ చూపిస్తూ హాస్పిటల్లో పాముని పట్టుకోవడం, హాస్పిటల్లో హోమం నిర్వహిస్తున్నాడని మేయర్ని కొట్టడం, సస్పెండ్ అయి ఇంటి దగ్గర తల్లితో వాదన, ఫ్రెండ్స్ తో కామెడీ, ఆవు తులసి కోటని కుమ్మే ఎపిసోడ్, చివరికి మొక్కు తీర్చుకోవడానికి తల్లితో ద్వారకా బయల్దేరడం- ద్వారకాలో భక్తి, కామెడీ, ఇంతలో ప్రొఫెసర్ మీద హత్యా ప్రయత్నం, అందులో తను ఇరుక్కోవడం....

అయినా ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. తనని ఎవరు కేసులో ఇరికిస్తున్నారో తెలియదు. అసలు ద్వారకా వచ్చిన పని పెండింగులో వున్న మొక్కు తీర్చుకుంటే ఇలా జరిగేది కాదేమో. తులసి కోట దగ్గర్నుంచీ ఇప్పటి దాకా కృష్ణుడే తనకి వ్యతిరేకంగా  పని చేస్తున్నాడు!

ఇంతలో తల్లీ కూడా మాయమై పోతే ఇదొక సస్పెన్సు. పరుగులు, ప్రొఫెసర్ మీద దాడి చేసిన గ్యాంగ్ ఎటాక్, ఈ గ్యాంగ్ ఎవరో కూడా నిఖిల్ కి తెలీదు, మనకి తెలుసు. ఇంకొంత వెతుకులాట తర్వాత తల్లి తిరిగొచ్చేసి కామెడీ చేస్తుంది. గుళ్ళో భజన కార్యక్రమంలో భక్తితో వూగి పోయానంటుంది. అమ్మా తల్లీ, ముందు నువ్వా మొక్కు తీర్చుకోమ్మా, 108 కేజీల వెన్న ఏదీ?- అన్పిస్తుంది మనకి.

తర్వాత హీరోయిన్ అనుపమ ఎంట్రీ. సెకండాఫ్ లో ఈమెకూడా మాయమై తిరిగొచ్చేసి ఉత్తుత్తి సస్పెన్సు  క్రియేట్ చేస్తుంది. ఇంతలో ఆభీర తెగకి చెందిన వాళ్ళ దాడి. దీనికి కథతో సంబంధముండదు. సబ్ ప్లాట్ కాదు. సెకండాఫ్ లో ఇంకో కథతో సంబంధంలేని గ్యాంగు బంధిస్తుంది.

ఇంతవరకూ నిఖిల్ ఈ దాడులు చేస్తున్నదెవరో తెలుసుకునే అన్వేషణలోనే వుంటాడే గానీ, కడియం గురించి అతడికేమీ తెలీదు. ఇంటర్వెల్లో గానీ తెలిసి, ఒక డైలాగుతో బలహీనంగా ముగిస్తాడు.

ప్రేక్షకులకి ఓపెన్ కథ, హీరోకి సస్పెన్స్ అన్న స్కీము ఇంతసేపు వర్కౌట్ కాదు. ఒకటే జరగాలి- ప్రారంభంలో ప్రొఫెసర్ తో బాటు కృష్ణుడి ఎపిసోడ్ చూపించాక, మొత్తం కడియానికి సంబంధించిన ట్రాక్ ఎత్తేయాలి. ఎత్తేసి డాక్టర్ గా తన రోజువారీ ప్రపంచంలో వున్న నిఖిల్ కి, అరగంట లోపు అడ్మిట్ అయిన ఒక కోవిడ్ రోగితో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి కలకలం రేగాలి. ప్రొఫెసర్ వచ్చేసి వైరస్ ని అంతం చేసే మహిమగల కృష్ణుడి కడియం గురించి చెప్పాలి. ఇద్దరూ దాని వేటలో బయల్దేరాలి. నిఖిల్ గోల్ ఆ కడియంతో ప్రపంచ విపత్తునాపడం. ఇక జాతీయ, అంతర్జాతీయ శక్తులూ కడియాన్ని కైవసం చేసుకునే పథకాలతో నిఖిల్ సంఘర్షణ! సింపుల్ గా ఇలా వుంటుంది బలమైన కథ.

ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథ చూస్తే ఈ మిడిల్ విభాగంలో మిడిల్ బిజినెస్ వుండదు. ప్రొఫెసర్, అనుపమ్ ఖేర్ పాత్రలతో పరిశోధనేతప్ప విలన్లతో యాక్షన్ వుండదు. విలన్లు ఎందుకున్నారో తెలీదు, కనపడరు. చివరి అరగంట నిఖిల్ విలన్లు లేని ఏకపక్ష అన్వేషణతో వివిధ ప్రదేశాలు టూరు వేసి కడియాన్ని కనుగొనడంతో అయిపోతుంది కథ. ఎందుకు కనుగొన్నాడో, దాని అవసరమేమిటో ఇప్పటికీ తెలీదు నిఖిల్ కి...

మరి ఎలా హిట్టయ్యింది ఈ కథ? కథనాపుతూ అనేక చోట్ల భక్తి ప్రవచనాలతో భక్తి రసాన్ని పంచడం వల్ల హిట్టయ్యిందని చెప్పొచ్చు.

—సికిందర్   

15, ఆగస్టు 2022, సోమవారం

1191 : రైటర్స్ కార్నర్


        అద్వైతా కాలా సూపర్ హిట్ విద్యా బాలన్ కహానీ రచయిత్రి. దీనికి ముందు రణబీర్ కపూర్- ప్రియాంకా చోప్రా నటించిన అంజానా అంజానీ రచయిత్రి. మౌలికంగా నవలా రచయిత్రి అయిన తను చిక్ లిట్ జానర్లో రాసిన ఆల్మోస్ట్ సింగిల్’, ఆల్మోస్ట్ దేర్ అనే రెండు నవలలు బాలీవుడ్ కి బాట వేశాయి. వీటిలో మొదటి నవల లక్ష కాపీలు అమ్ముడుబోయింది. తర్వాత వెబ్ సిరీస్ రాస్తూ బిజీ అయిన తను వివిధ పత్రికల్లో కాలమిస్టు కూడా. రాయడం గురించి, కొత్త రచయితలకి సలహాల గురించీ అద్వైత ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ క్రింద...

మీరు ఏ సినిమా రాయడాన్ని బాగా ఎంజాయ్ చేశారు? రాసే ప్రక్రియలో మీరు దేన్ని  బాగా ఇష్టపడ్డారు?
కహానీ రాయడం నాకు మరిచిపోలేని అనుభవం. అది నా జీవితంలో ఒక నిర్ణీత కాలంలోకి తీసికెళ్ళింది. స్వీయానుభవంలోంచి రాసే ప్రక్రియని నేనెక్కువ ఇష్టపడతాను.

కహానీ కి అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు సుజోయ్ ఘోష్ కహానీ ఐడియాతో నన్ను కలిసి రాయమన్నారు. కోల్‌కతా  నగర నేపథ్యంలో సాగే ఈ కథ నేనక్కడ 1999 లో గడిపిన రోజుల్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో కోల్‌కతా నాకు చాలా కొత్త. తెలియని నగరంలో నాది ఒంటరి జీవితం. అంత భద్రత ఫీలయ్యేదాన్ని కాదు. అక్కడి భాష  తెలీదు. బోలెడంత పేదరికం. కానీ అక్కడి మనుషులు శాంత స్వభావులు. ఈ జీవితాన్నే ఒడిసి పట్టుకుని కథలోకి తెచ్చాను. హీరోయిన్ విద్యాబాలన్ పాత్రకి కి కోల్‌కతాతో నా ఈ అనుభవసారాన్నే జోడించాను. ఈ ఉత్సాహభరి, పరుగులు దీసే, సంక్లిష్ట నగరంలో పురుష ప్రపంచానికి చేరువ కావాలనుకునే యువతి అనిశ్చిత స్థితిని పాత్రకి కల్పించాను. స్క్రీన్‌ప్లేలో ఈ సూక్ష్మ కారకాల మధ్య ఇంటర్ ప్లేని తీసుకురావడం నాకు చాలా నచ్చింది.

దీన్ని 2009 లో రాయడం మొదలెట్టాను. 2010 ఫిబ్రవరి కల్లా 185 పేజీల స్క్రిప్టు పూర్తయ్యింది. రీసెర్చికి మలై కృష్ణ ధార్ రాసిన ఓపెన్ సీక్రెట్స్ :  ఇండియన్ ఇంటెలిజెన్స్ అన్ వీల్డ్’, వీకే సింగ్ రాసిన ఇండియాస్ ఎక్స్ టర్నల్ ఇంటెలిజెన్స్ :  సీక్రెట్స్ ఆఫ్  రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ పుస్తకాలు నాకు తోడ్పడ్డాయి.  

మీ కహానీ లోని విద్యాబాలన్ పాత్రలో అద్వైతా కాలా పాలెంత?సినిమా కథా వస్తువులకి స్ఫూర్తినిచ్చే నిజ జీవిత ప్రతిధ్వని గురించి చెప్పండి.
నాటక రచయిత టెనెస్సీ విలియమ్స్ వంటి నేను మెచ్చుకునే  రచయితలు కూడా వాళ్ళ రచనల్లో వ్యక్తిగత జీవితాల్ని, పోరాటాల్నీ ప్రతిబింబిస్తారు. కహానీ కి పరాయి వ్యక్తి దృక్కోణం వుండాలన్న స్పష్టత నాకుంది - కోల్‌కతాకి కొత్తగా వచ్చిన వ్యక్తి దృష్టిలాగా విద్యాబాలన్ పాత్ర అనుభవం పొందాలని భావించాను. నేను యుఎస్‌లో చదువుకున్న తర్వాత కోల్‌కతాకి  మారాను. హోటల్ కిచెన్‌లలో పనిచేశాను. ఈ నగరంలో నా అనుభవాలకి చాలా ఆశ్చర్య చకితురాలినయ్యాను. ఇది ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఇదే హోటల్‌లో పనిచేసిన నా బాయ్ ఫ్రెండ్ అడుగుజాడల్లో ప్రయాణించడం లాగా వుండేది. అతనిక్కడ గడిపిన కాలాన్ని పునర్జీవించాను. అతను సందర్శించిన ప్రదేశాలకి వెళ్ళాను. సాధ్యమైనంత వరకు అతడి సాన్నిహిత్యాన్ని ఫీలయ్యాను. ఈ ఎమోషనల్ ప్రయాణమే విద్య కోసం చెక్కిన  పాత్రలో వ్యక్తమవుతుంది.

విశాల్ భరద్వాజ్ ఓంకార’, షేక్స్ పియర్ ఒథెల్లో లేదా సోనమ్ కపూర్ నటించిన ఐషా ఆధారం జేన్ ఆస్టెన్ ఎమ్మా వంటి నవలలు/నాటకాలు గతంలో చలనచిత్రాలుగా వెలువడ్డాయి. రచయిత్రిగా మీరు ఈ ట్రెండ్‌ని పునర్నిర్వచించారు- స్క్రిప్ట్ రైటర్ నుంచి నవలా రచయిత్రిగా రివర్స్ మార్గాన్ని అనుసరించారు. కహానీ ఇప్పుడు మిమ్మల్ని నవలగా మార్చేలా చేసింది. ఈ పద్ధతి మెరుగ్గా వుందా?
లేదు, నేను నిజంగా దేనినీ పునర్నిర్వచించాలనే ఆలోచన చేయలేదు. నేనొక నవలా రచయిత్రిని, ఇదే నాకు సౌకర్యంగా వుంటుంది. ఈ సినిమా నవల అవుతుందని నాకు చాలా ముందుగానే తెలుసు, కాబట్టి కహానీ నవలని ఇంటీరియర్ మోనోలాగ్ (స్వగతం) వంటి సాహిత్య పరికరాలని అన్వేషించే నవలగా రాశాను.

మీ కోసం మీరు రాసుకుంటారా, లేక ప్రేక్షకుల కోసం రాస్తారా?
రాయడం నాకు చాలా పర్సనల్. అందుకే రాసే ప్రతిసారీ నేను ఏదీ చదవకుండా, ప్రివ్యూలు చూడకుండా, లేదా ప్రీమియర్స్ కెళ్ళకుండా గదిలో ఒంటరిగా వుంటాను. వొంటరిగా నేను రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రేక్షకుల గురించి ఆలోచించను. అలా చేస్తే రాయలేను.

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరుగుదల రచయితలకి కొత్త పని అవకాశాలను సృష్టిస్తోందా? ఇది వారి కెరీర్‌ని ఎలా ప్రభావితం చేస్తోంది?
చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఇప్పుడు కంటెంట్‌ పై కొంత శ్రద్ధ పెడుతున్నారు. ఓటీటీ విస్ఫోటనం కారణంగా స్టారే కంటెంట్ అన్న ట్రెండ్ నుంచి కంటెంటే స్టార్ ధోరణకి మారుతున్నాం. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ వారు పచ్చ జండా వూపే కంటెంట్, వారు చెప్పాలనుకుంటున్న కథల నాణ్యత, స్టోరీ డెవలప్‌మెంట్‌పై వారు పెట్టే శ్రద్ధ తక్కువేం కావు. ఒక ఉదాహరణతో పరిస్థితిని వివరిస్తాను. ఇల్లీగల్ సీజన్ 2 కోసం స్క్రీన్‌ప్లే రాయడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఈ ప్రక్రియలో వూట్ ఓటీటీ  టీమ్‌తో కలిసి పని చేశాను. మొత్తం ఆ టీమంతా కలిసి రాయడం పట్ల చూపిన ఆ స్థాయి నిబద్ధత నేనెప్పుడూ చూడలేదు.

ఇప్పుడు రైటర్స్ వాయిస్ వినిపిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల పరంగా సృజనాత్మక వ్యక్తులకు ఇది గొప్ప సమయం కాబట్టి యువ రచయితలు ఇటు వైపు రావడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం పని విధానమే  మారిపోయింది. పేరు పొందిన రచయితలతో ప్రాజెక్టులపై పని చేయడానికి, క్రెడిట్స్ పొందడానికీ జూనియర్ రచయితలకి ఇప్పుడు మంచి అవకాశం.

యువ రచయితలు కెరీర్ ప్రారంభంలో ఎలా కొనసాగాలంటారు?
సాంకేతిక అభివృద్ది  భౌతిక అడ్డంకుల్ని తొలగించి పని పరిధిని విస్తృతం చేసింది. నేను ఇప్పుడు ఆన్‌లైన్‌లో వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాను. మేము జూమ్ లో ఇంటరాక్ట్ అవుతాం, కంటెంట్ డెవలప్మెంట్ కి వాట్సాప్ లో చాట్ చేస్తున్నాం. యువ రచయితలు ముందుగా తమ స్క్రిప్ట్స్ ని రిజిస్టర్ చేసుకోమని నేను సలహా ఇస్తాను. ఐడియాలని రిజిస్టర్ చేసుకోవడం సాధ్యం కాదు, స్క్రిప్ట్స్ నే రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరికైనా కంటెంట్ చెప్పే సందర్భంలో, ఆ వ్యక్తి చేత న్యాయవాది తయారు చేసిన నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవాలి.
అన్ని పెద్ద నిర్మాణ సంస్థలు మెటీరియల్‌ని సమీక్షించడానికి కంటెంట్ టీమ్స్ ని ఏర్పాటు చేసుకున్నాయి. అయినప్పటికీ, స్క్రీన్ రైటింగ్ ఇప్పటికీ ఒడిదుడుకుల వృత్తిగానే  వున్నందున, యువ రచయితలు జాగ్రత్త వహించాలని నేను కోరుతున్నాను. కొన్నిసార్లు పని విపరీతంగా వుంటుంది, కొన్నిసార్లు పనికోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే నేనెప్పుడూ అనుబంధంగా వేరే జాబ్ చూసుకోవాలని చెబుతూంటాను - కహానీ రాసిన  తర్వాత కూడా నేను హోటల్ ఆపరేషన్స్ లో పని చేశాను కాబట్టి నేనూ మినహాయింపు కాదు.

వర్ధమాన  రచయితలు వారి స్క్రిప్ట్స్ ని, కంటెంట్ నీ ప్రకటించుకునే మార్గాలేమిటి?
యువ రచయితలకి  ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా వున్న ఏజెంట్లు వున్నారు. నేను నా కోసం చాలా పిచింగ్ చేసే ఏజెంట్ ద్వారానే పని చేస్తున్నాను. ఇది సత్ఫలితాల్నిచ్చింది. ఈ రోజుల్లో నిర్మాణ సంస్థలు నవలల్ని కూడా తీసుకుంటున్నాయి కాబట్టి రచయితలు నవలలు కూడా వ్రాయవచ్చు. అది  మంచి నవలైతే, సిరీస్‌గా మార్చడానికి నాలాంటి వారిని సంప్రదిస్తారు. ఔత్సాహిక రచయితలకి నెట్వర్కింగ్ చాలా అవసరం. ఏ నిర్మాణ సంస్థ ఏ కంటెంట్ ని తీసుకుంటోందో, ఏ షో ప్రారంభిస్తోందో తెలుసుకుంటూ వుండడం కూడా అవసరం. చాలా ఓటీటీల్లో వరదలా వస్తున్న షోలు ఈ నిర్మాణ సంస్థలే చేపడుతూంటాయి. ఇదంతా చేసే ముందు కంటెంట్ ని రిజిస్టర్ చేసుకోమంటాను. ఎవరికైనా స్క్రిప్టు పంపిస్తే, ఈ మెయిల్ చేస్తే అది రికార్డుగా వుంటుంది.

స్క్రిప్ట్ రైటింగ్ లో సామాన్య  ప్రక్రియేమిటో చెప్తారా? నిర్మాణ సంస్థలకి స్క్రిప్టుని పిచ్ చేయడానికున్న ప్రాథమిక దశలు ఏమిటి?
ముందు లాగ్ లైన్ ని పిచింగ్ చేయాలి. దీని పైనే నిర్ణయాలు జరుగుతూంటాయి. సామాన్యంగా జరిగే రచనా ప్రక్రియ కొస్తే, ముందుగా లాగ్ లైన్ ప్లాన్ చేసుకోవాలి. లాగ్ లైన్ అంటే ఏక వాక్యంలో కథా సారాంశం. దీని ఆధారంగా సినాప్సిస్ వస్తుంది. ఇది పేజీనుంచి 10 పజీలుండొచ్చు. దీంట్లోంచి ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్ర, ఇతర ముఖ్య పాత్రలు ఆలోచించాలి. వీటితో కథా ప్రపంచం, లొకేషన్స్, సీన్స్ మొదలైనవన్నీ వస్తాయి. దీన్ని పిచింగ్ చేసే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు నిర్మాణ సంస్థకి పరిచయం చేసుకుంటూ ఈమెయిల్ పంపాలి. కంటెంట్, జానర్, టైటిల్ తెలియజేయాలి. నిర్మాణ సంస్థ కోరితే తప్ప ఇంకే మెటీరీయల్ పంపకూడదు.

ఔత్సాహిక స్క్రిప్టు రచయితకి  ఏదైనా నిర్దిష్ట విద్యార్హత అవసరమంటారా?
స్క్రిప్టు  రచయితకుండే వెసులుబాటు ఏమిటంటే ఏ నిర్దిష్ట డిగ్రీ అవసరం లేదు. రచయితలే కథకులుగా పుడతారు. నిజానికి మనమందరం కథకులమే. దాన్ని వ్యక్తపరిచే నేర్పు వుండకపోవచ్చు. ఈ నైపుణ్యాలని  మెరుగు పరుచుకోవడానికి సృజనాత్మక రచనా కోర్సులు చేయవచ్చు. కానీ నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం వాస్తవానికి క్రాఫ్టుని సాధన చేయడమే. ఇతర రచయితలతో కలిసి పనిచేయడం ఇంకో మార్గం. నేను స్వయంగా నేర్చుకున్నాను. రచయితలు సినిమాలు చూడడమే గాక, పుస్తకాలు, స్క్రీన్‌ప్లేలు చదవాలి.
—ఏజెన్సీస్


11, ఆగస్టు 2022, గురువారం

1190 : రివ్యూ!


        (డియర్ రీడర్స్ - క్షమించాలి, ఆగస్టు 5 నుంచి రివ్యూలు ఆలస్యమవుతున్నాయి. ఈ మధ్య థియేటర్లకి ప్రేక్షకులు కరువవుతున్న పరిస్థితుల్లో, విడుదల రోజే రివ్యూలిస్తే, పరిస్థితిని ఇంకింత దిగజార్చి నట్టవుతుందేమోనని ఈ జాప్యం. ఈ రోజు విడుదలైన రెండు స్టార్ హిందీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే వుంది. ఈ బ్లాగులో రివ్యూలు ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే- సాంకేతికాల విశ్లేషణలకి సంబంధించి వుంటాయి కాబట్టి, వీటిని తెలుసుకోవడం కొంత ఆలస్యమైనా ఫర్వాలేదని కూడా భావిస్తున్నాం, అందుకని సహకరించగలరు)

దర్శకత్వం : హను రాఘవపూడి
తారాగణం : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్న, భూమిక, సుమంత్, సచిన్ ఖెడేకర్, జీశ్శూ సేన్ గుప్తా, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, సునీల్, ప్రియదర్శి తదితరులు
రచన : హను రాఘవపూడి, రాజ్ కుమార్ కందమూడి; మాటలు : హను రాఘవపూడి, జే కృష్ణ, రాజ్ కుమార్ కందమూడి; సంగీతం ; విశాల్ చంద్ర శేఖర్, ఛాయాగ్రహణం : పి ఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ
బ్యానర్స్ ; వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా నిర్మాత : చలసాని అశ్వనీ దత్
విడుదల : ఆగస్టు 5, 2022
***
        హానటి’, జాతిరత్నాలు విజయాల తర్వాత వైజయంతీ మూవీస్ నుంచి సీతారామం వెలువడింది. ఈ కుటుంబ సినిమా ఇటీవల సినిమాల పట్ల తెలుగు కుటుంబ ప్రేక్షకులు పెంపొందించుకున్న నిరోధక శక్తికి పరీక్ష పెట్టింది- ఇప్పటికైనా థియేటర్ల కెళ్ళి చూస్తారా లేదా అన్నట్టు. దురదృష్టవశాత్తూ ఈ సినిమాని గల్ఫ్ దేశాలు నిషేధించాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కి మలయాళ సినిమాల ద్వారా గల్ఫ్ లో మంచి మార్కెట్ వుంది. ఈ సినిమాలో మతభావాల్ని దెబ్బతీసేలా కొన్ని దృశ్యాలున్నాయనీ, వాటిని తొలగించి తిరిగి సెన్సార్ కి దరఖాస్తు చేసుకోమనీ నిర్మాతని కోరాయి గల్ఫ్ దేశాలు. అక్కడి అసంఖ్యాక దుల్కర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

        ప్రేమ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి ఈ సారి పీరియెడ్ ప్రేమతో వచ్చాడు. దీనికి మిలిటరీ నేపథ్యం. సైనికుడి ప్రేమ సంఘర్షణ. దుల్కర్ సల్మాన్ తో బాటు  మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్న, ఇంకా అనేకాయితర నటీనటులతో ఆకర్షణీయమైన తారాతోరణం. ఖర్చుతో కూడుకున్న సాంకేతికాలు. దేశవిదేశ లొకేషన్లు. తేలికపాటి పాటలు. సరిహద్దులో సైనిక చర్యలు. ఇంత హడావిడి మధ్య అసలు ఈ ప్రేమ కథ ఎలా సాగింది? ఇది తెలుసుకుందాం...

కథ

    1985 లో ఇండియా అంటే గిట్టని లండన్లో పాకిస్తానీ స్టూడెంట్ అఫ్రీన్ (రశ్మిక) అక్కడ ఓ ఇండియన్ కి చెందిన కారుని ధ్వంసం చేసిన ఘటనలో నష్టపరిహారం కట్టాల్సి వచ్చి, తాతగార్ని అడుగుదామని పాకిస్తాన్ వెళ్తే, అక్కడ తాతగారు బ్రిగేడియర్ తారీఖ్ (సచిన్ ఖెడేకర్) చనిపోయాడని తెలుస్తుంది. ఆయన వీలునామా రాస్తూ, ఆస్తి అఫ్రీన్ కి దక్కాలంటే, సీతా మహాలక్ష్మి (మృణాల్) కి 1965 లో లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్) రాసిన  ఉత్తరాన్ని ఆమె చిరునామాకి చేరేయాలని షరతు పెడతాడు.

        చేసేది లేక సీనియర్ స్టూడెంట్ బాలాజీ (తరుణ్ భాస్కర్) ని తీసుకుని అడ్రసు ప్రకారం హైదరాబాద్ లో నూర్జహా ప్యాలెస్ కి వెళ్తుంది. అక్కడ 1965 లో సీత అని ఎవరూ లేరని తెలుసుకుని, సీత ఆచూకీ దొరక్క రామ్ కోసం ప్రయత్నిస్తుంది. మిలీటరీలో దొరికిన సమాచారం ఆధారంగా రామ్ స్నేహితుడు దుర్జయ్ శర్మ (వెన్నెల కిషోర్) ని కలుసుకుంటుంది. దుర్జయ్ శర్మ రామ్ గురించి చెప్పుకొస్తాడు. కాశ్మీర్లో లెఫ్టినెంట్ రామ్ ఒక ఆపరేషన్ నిర్వహించి పేరు తెచ్చుకోవడంతో, అతడికి నీ భార్య నంటూ సీత ఉత్తరాలు రాయడం మొదలెడుతుంది. ఎవరీ సీత? భార్యనంటూ ఎందుకు ఉత్తరాలు రాసింది? అప్పుడు ఆమెని రామ్ ఎలా కలుసుకున్నాడు? వాళ్ళ ప్రేమ ఎలాసాగింది? ఇదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

    రోమాంటిక్ డ్రామా జానర్లో రోమాంటిక్ సస్పెన్స్ సబ్ జానర్ కి చెందిన కథ. వీర్ జారా (2004) కంచె (2015) సీమాంతర/సైనిక ప్రేమ కథల్లాంటి కథ. వీర్ జారా’, సీతారామం ల కాన్సెప్ట్ ఒకటే. సైనికుడైన హీరో పాక్ బలగాలకి చిక్కి ఖైదు కావడం. యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన వీర్ జారా లో 22 ఏళ్ళుగా పాక్ లో ఖైదీగా వున్న షారూఖ్ ఖాన్ ని విడిపించడానికి పాక్ లాయర్ గా రాణీ ముఖర్జీ ప్రయత్నిస్తుంది. సీతారామం లో 20 ఏళ్ళ క్రితం పాక్ దళాలకి చిక్కిన దుల్కర్ ని ఉత్తరంతో కలవడానికి పాక్ స్టూడెంట్ గా రశ్మికా మందన్న ప్రయత్నిస్తుంది.

        వీర్ జారా కథ సుఖాంతమైతే, సీతారామం దుఖాంతం. వీర్ జారా లో పాకిస్తాన్ వాసి అయిన హీరోయిన్ ప్రీతీజింటా శక్తివంతుడైన రాజకీయ నాయకుడి కూతురైనట్టే, సీతారామంలో హైదరాబాద్ లో వుండే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ధనిక నవాబు చెల్లెలు. వీర్ జారా లో షారూఖ్ ఖాన్ తో  ప్రీతీజింటా ప్రేమకి, ఇంకో రాజకీయ కుటుంబంతో పెళ్ళి సంబంధం సమస్య సృష్టిస్తే, సీతారామం లో దుల్కర్ తో ప్రేమలో వున్న మృణాల్ కి, ఒమన్ రాజకీయ కుటుంబంతో పెళ్ళి సంబంధమే సమస్య సృష్టిస్తుంది. వీర్ జారాలో ప్రీతీజింటా పెళ్ళికి అడ్డున్నాడని ఆమె అన్న షారుక్ ని ఇండియన్ ఏజెంటుగా ప్రభుత్వానికి పట్టిస్తాడు. సీతారామం లో మృణాల్ అన్న ఇలాటి విలనీ ప్రదర్శించకుండా వుంటాడు.  వీర్ జారా కథ లీనియర్ నేరేషన్ అయితే, సీతారామం - కంచె లో  లాగే నాన్ లీనియర్ కథనం- మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో.   

        కంచె లో 1936, 1939 రెండు కాలాల్లో కథ వుంటుంది. ’36 లో ప్రేమ కథ, ’39 లో రెండో ప్రపంచ యుద్ధ కథ. యుద్ధ కథ ప్రత్యక్ష కథగా వుంటే, ప్రేమ కథ పూర్వ కథగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా మళ్ళీ హీరోయిన్ ప్రగ్యా పై రెండు సినిమాల్లో హీరోయిన్ల లాగా ధనికురాలే. జమీందారు కూతురు. ప్రగ్యాని ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ కి కులసమస్య అడ్డొస్తుంది. దీంతో ఆమె తండ్రి వేరే సంబంధం చూస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల ప్లాట్ పాయింట్స్ ఒకే సమస్య చుట్టూ వుంటాయి. సీతారామం లో దుల్కర్- మృణాల్  లని కలవడానికి రశ్మిక ప్రయత్నించే ప్రత్యక్ష కథకి, దుల్కర్ - మృణాల్ ల ప్రేమకథ పూర్వ కథగా వస్తూంటుంది విడతలు విడతలుగా.

    అయితే కంచె లో ప్రత్యక్ష కథని ఆపినప్పుడల్లా దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని సృష్టించి ట్విస్టు ఇస్తూ పోకుండా, అలాగే పూర్వ  కథని ఆపినప్పుడల్లా దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ని సృష్టించి ఇంకో ట్విస్టు ఇస్తూ పోకుండా, కథనాన్ని బలహీనపర్చిన పొరపాటే సీతారామం లో కూడా చేశారు. సీతారామం రోమాంటిక్ సస్పెన్స్ సబ్ జానర్ కూడా అయినప్పుడు, క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ కథనంతో వుంటే అది మరింత థ్రిల్ నీ, యూత్ అప్పీల్ నీ కల్పించి, సినిమా స్పీడుగా సాగేందుకు తోడ్పడేది. సినిమా మందకొడిగా సాగడానికి కారణమిదే.

        ఇదలా వుంచితే, చరిత్రని ఇష్టానుసారం కల్పన చేసి ప్రేక్షకుల్లోకి తప్పుడు చరిత్ర వెళ్ళేలా చేశారు. ఈ సినిమా ప్రారంభంలో చూపించిన ఆపరేషన్ జిబ్రాల్టర్ నిజానికి 1965 ఇండో- పాక్ యుద్ధానికే దారి తీసిన కీలక పరిణామం. ఇంత ప్రధానంగా జరిగిన యుద్ధాన్నే కథలో చూపించలేదు!

        1964 తో కథ ప్రారంభించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని చూపిస్తూ, టెర్రరిస్టు క్యాంపు అని లొకేషన్ చూపించారు. టెర్రరిస్టు నాయకుడ్ని చూపించారు. కానీ 1964 లో టెర్రరిస్టులే లేరు, క్యాంపులే లేవు. టెర్రరిజం కాదుగానీ, మిలిటెన్సీ మొదలైంది 1989 లోనే కాశ్మీర్లో. తర్వాత్తర్వాత టెర్రరిజంగా పిలవడం మొదలెట్టారు. ఇక 1964 లోనే టెర్రరిస్టు నాయకుడు  ఆపరేషన్ జిబ్రాల్టర్ కి పథకమేసినట్టు చూపించారు. ఈ పథకం ప్రకారం కొందరు పాక్ యూత్ ని కాశ్మీరీల్లా కాశ్మీర్లో ప్రవేశపెట్టి, కాశ్మీర్ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతని రెచ్చగొట్టడం ఉద్దేశంగా చూపించారు.

        అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత రెచ్చగొట్టిన మాట వాస్తవమే గానీ, అది ఆ రోజుల్లో లేని టెర్రరిస్టులతో కాదు, సైనికులతో. ఆపరేషన్ జిబ్రాల్టర్ పాక్ సైన్యపు పథకం. దీని ప్రకారం సినిమాలో చూపించినట్టు 10 -12 మంది టెర్రరిస్టుల్ని కాదు గానీ, ఏకంగా 26 నుంచి 33 వేల మంది సైనికుల్ని కాశ్మీర్లో చొరబెట్టారు! ఈ పథకం చూస్తే చాలా నవ్వులపాలయింది, చాలా కామెడీ వుంది. ఇంతవరకూ హిందీ సినిమాల్లో కూడా చూపించలేదు.

    ఇప్పుడు తెలుగులో ఎంటర్ టైన్ చేసే అవకాశమున్న ఈ చారిత్రక కామెడీని జారవిడుచుకున్నారు. పాక్ సైనికుల్ని కాకుండా టెర్రరిస్టుల్ని చూపించడం మార్కెట్ యాస్పెక్ట్ కాదు. పాక్ సైనికులతో మరుగున పడ్డ- నవ్వులపాలైన చరిత్రని చూపడమే సినిమాని మరింత ఎలివేట్ చేసే నిజమైన మార్కెట్ యాస్పెక్ట్. ఇలాటివి ఎందుకు వదులుకోవాలి? సినిమాలో కామెడీలేని లోటు కొంతైనా తీరేది.

        మారు వేషాల్లో కాశ్మీర్లో చొరబడ్డ ఈ పాక్ సైనికుల్ని కాశ్మీరీలే కామెడీ కామెడీగా సైన్యానికి పట్టించి పాక్ సైనికులెంత వెర్రి వాళ్ళో నిరూపించారు. ఈ ఆపరేషన్ జిబ్రాల్టర్ ని 1964 లో కాకుండా, ఆగస్టు 5, 1965 న ప్రారంభించారు. 15 రోజుల్లో ఇది రట్టయి, వెంటనే సెప్టెంబర్ 1 నుంచి పెద్ద యుద్ధమే ప్రారంభమై పోయింది. పాక్ చేసిన పోకిరీ పని ఫలితమే ఈ యుద్ధం. మంకీ బిజినెస్ అంటే ఇదే.

        అంటే ఈ సినిమాలో చూపించినట్టు హీరో హీరోయిన్ల ప్రేమ కథకే అవకాశం లేదన్నమాట - ఆపరేషన్ జిబ్రాల్టర్ వెంటే వచ్చిన యుద్ధం వల్ల. సినిమా కోసం చరిత్రని మార్చేస్తే అది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అవుతుందేమో గానీ, బాధ్యతగల సినిమా అవుతుందేమో తెలీదు.

నటనలు - సాంకేతికాలు

    రామ్ పాత్రలో దుల్కర్ ని మాత్రమే వూహించగలం. అందమైన ప్రేమికుడు. యశ్ చోప్రా సినిమాల్లోలాంటి చాక్లెట్ బాయ్- పీచు మిఠాయి తియ్యదనాల రోమాంటిక్ హీరో. సినిమాకి గ్లామర్ కోషెంట్ ని పెంచే లుక్ తో, పీరియెడ్ రోమాంటిక్ హీరోని తనదైన దరహాసపు ముద్రతో తెర మీద నిలబెట్టాడు. దర్శకుడు తెలుగులో కథ చెప్పడం, తనకి తెలుగు రాకపోవడం జరిగి, తెరమీద కొచ్చేటప్పటికి తెలుగుదనాన్ని మేనేజ్ చేస్తూ రామ్ ని రసవత్తరం చేశాడు ప్రేమికుడుగా. సైనికుడుగా చివర్లో ట్విస్టువల్ల ఒనగూడిన సన్నివేశ బలం వల్ల రాణించాడు. అయితే ఈ సన్నివేశం, కథ ముగింపూ పైన చెప్పుకున్న చారిత్రక నేపథ్య కారణాల వల్ల లాజిక్ లేనివి. ప్రేమ కథ కూడా వూహించడానికే అసాధ్యమైనది. చారిత్రక నేపథ్యాన్ని, లాజిక్ ని కాదనుకుని చూసే వాళ్ళకి ఓకే.

        సైనికుడుగా కొన్ని సాహసకృత్యాలున్నా అవి కూడా ప్రేమ కథలాగే సాఫ్ట్ గా తేలాయి. ఇక సునీల్ తో, వెన్నెల కిషోర్ తో దుల్కర్ కామెడీ సీన్లు గీతాంజలి లో సిల్క్ స్మితతో సుత్తివేలు కామెడీలాగా ఏమిటోగా వున్నాయి. కానీ సినిమాల్లో 1964 లో రేలంగి, రమణా రెడ్డిలున్నారు. రేలంగి, రమణా రెడ్డిల కాలంలో సునీల్, వెన్నెల కిషోర్ లు ఇంత చోద్యంగా వుండడం చోద్యమే. సునీల్, వెన్నెల కిషోర్ లు పూర్వమే పుట్టి వుండి, 1964 లో ఇలా కామెడీ నటించి వుంటే రేలంగి, రమణా రెడ్డిలు నవ్వి నవ్వి చచ్చే వాళ్ళు.

    ఇది రోమాంటిక్ డ్రామా కాబట్టి దుల్కర్ ది పాసివ్ పాత్ర. ఓటమి పొందే పాసివ్ పాత్ర. ఇటు ప్రేమ, అటు డ్యూటీ మధ్య నలిగే మానసిక- భౌతిక సంఘర్షణలతో కూడిన రౌండెడ్ పాత్ర. సాధారణంగా రోమాంటిక్ డ్రామాలు  ఒక్క ప్రేమ గురించే  మానసిక సంఘర్షణతో వుంటూ తేలిపోతూంటాయి. దుల్కర్ పాత్రకి మానసిక, భౌతిక సంఘర్షణలు రెండూ తోడయ్యాయి. అయితే ప్రేమికుడుగా మానసిక సంఘర్షణ ప్రేమలోంచి పుట్టలేదు. చివర్లో బందీ అయ్యాక తన అస్తిత్వం లోంచి పుట్టింది. దీనిక్కారణం హీరోయిన్ పాత్రచిత్రణలో లోపం. హీరోయిన్ పాత్ర కరెక్ట్ గా వుంటే, ఆ పాత్ర అనుభవిస్తున్న బాధలోంచి దుల్కర్ ప్రేమ సంఘర్షణ పుట్టేది.

        ఇక చివరికి సైనికుడుగా డ్యూటీకి ఓటెయ్యాలా, ప్రేమికుడిగా ప్రేమకే లొంగిపోవాలా అన్నప్పుడు డ్యూటీకే కట్టుబడే సార్వజనామోద విలువ పాటించాడు. ఐతే ఇందులో కూడా ఒక మెలిక వుంది, ఇది చివర్లో చూద్దాం. ఇలా బిగ్ కాన్వాస్ మీద ఈ తెలుగు సినిమా దుల్కర్ పాపులారిటీని పదింతలు పెంచిందనుకోవాలి.       

        ఈ రోమాంటిక్ సస్పెన్స్ ఎలాంటిదంటే పాత్ర గురించి చెప్తే సస్పెన్స్ పోతుంది. పాత్ర గురించి చెప్పకుండా మృణాల్ ఠాకూర్ గురించి చెప్పుకోవడానికేమీ వుండదు. అయితే ఈ పాటికి సినిమా అత్యధిక ప్రేక్షకులు చూసేసే వుంటారు కాబట్టి, కథ మొత్తం విడమర్చి చెప్పుకుంటే ఇప్పుడొచ్చే నష్టమేమీ వుండదనుకుని ముందడుగేద్దాం (రివ్యూ ఆలస్యంగా ఇస్తే ఇలా విపులంగా సినిమాని అర్ధం జేసుకోవడం కలిసొస్తుందన్నమాట).

    హీరోయిన్ మృణాల్ సీతగా హీరోకి కన్పిస్తుంది, ప్రిన్సెస్ నూర్జహా గా ప్రేక్షకులకి తెలుస్తుంది తగినంత సస్పెన్సు పోషించాక. ఓల్డ్ సిటీ ప్యాలెస్ లో వుండే నూర్జహాకి అంత మంచి తెలుగు, అంతందమైన అక్షరాలతో రాసే నేర్పూ వుండడం ఆశ్చర్యమే. సినిమా కదా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే ఆమె చేతివ్రాత (తెర వెనుక ఎవరు రాసిచ్చారో అద్భుతంగా వుంది, ఉర్దూ స్ట్రోక్స్ కూడా లేకుండా ముస్లిం గాళ్ తెలుగక్షరాలు) చూస్తే ఆమె బలహీన మనస్కురాలన్పించదు. స్వతంత్రురాలన్పిస్తుంది. ఇంకా రామ్ కి పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసర ముంటుందేమోగానీ, ఈవిడ తన జీవితానికి తనే కమాండర్ అన్పిస్తుంది. కానీ ఈ గ్రాఫాలజీ చెప్పే వ్యక్తిత్వంతో ఆమె పాత్ర వుండదు. సీతగా, నూర్జహాగా వేర్వేరు షేడ్స్ లేవు. ఇలాటి సూక్ష్మాంశాల్ని విస్మరిస్తే అద్భుత విజువల్స్ తో కళ్ళు చెదిరేలా వుండచ్చేమోగానీ సినిమా, హృదయాల్ని దోచుకోదు. ఏదో ఫేక్ ఫీలింగులు మనం ఫీలై ఆనందించడమే.

        ఈ కథకి హీరోకి తెలియని మృణాల్ ద్విపాత్రాభినయమే కేంద్ర బిందువు. ఈమె హీరో మధించి తెలుసుకోవాల్సిన నిగూఢ రహస్యం. అంటే హీరో కాన్షస్ ఇగో అయితే, ఈమె సబ్ కాన్షస్ వరల్డ్. అందుకని హీరోకి ఈమె ఒక మిస్టరీ. ఈ మిస్టరీలో ఆమెకి రెండు షేడ్స్ - సీత/నూర్జహా. సీత ప్రపంచానికి తను చూపెట్టుకుంటున్న తెచ్చి పెట్టుకున్న స్వతంత్ర వ్యక్తిత్వమైతే, దీని వెనుక నూర్జహా మాత్రం పంజరంలో చిలుక! ఈ షేడ్స్ లేకపోతే రసవత్తర పాత్ర చిత్రణ అన్పించుకోదు. ఇంటర్వెల్లో సీతే నూర్జహా అని ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తే అది అసంపూర్ణ కథనమే. తర్వాత సీతా నూర్జహాల వెలుగునీడల జీవితం చూపించినప్పుడే పూర్ణత్వంతో రౌండెడ్ క్యారక్టర్.   

        నూర్జహా రామ్ నెందుకు ప్రేమించిందో తెలీదు. అతను సైనికుడు కాబట్టి, సైనికుడికి మత భేదం వుండదనుకుని, పైగా అతను అనాధ కాబట్టి అభ్యంతరం చెప్పేవాళ్ళూ వుండరనుకుని, ప్రేమించి వుండాలి. అగర్తలో అతను మత ఘర్షణలు అడ్డుకున్నప్పుడు తను అక్కడే వుండి చూసింది కాబట్టి అది ప్రేమకి బలాన్నిచ్చి వుంటుంది. విరాటపర్వం లో వూళ్ళో పోలీసుల్ని ఎదుర్కొన్న రానా వీరత్వాన్ని చూసి ప్రేమని ఖాయం చేసుకున్న సాయి పల్లవి లాగా. ఏమిటో సినిమా అనగానే హీరోయిన్ల పాత్రలు తళతళ మెరిసే తోమి పెట్టిన వంట పాత్రల్లా వుంటాయి. లోపలేమీ వుండదు.

    ప్యాలెస్ లో సీతగా బొట్టు పెట్టుకుని నాట్యం చేస్తూంటుంది. ఒకసారి బొట్టు లేకుండా నూర్జహాగా వున్నప్పుడు వచ్చేస్తాడు రామ్. ఆమె సీతే అనుకుని, బొట్టులేకుండా  ఎంతందంగా వున్నావంటాడు. డైలాగుతో సీను చెప్తే ఏమందంగా వుంటుంది? విజువల్ రైటింగ్ చేస్తే అలరిస్తుంది. ఆమె నూర్జహాగా దొరికిపోగల అవకాశం డ్రమెటిక్ గా వుండాలంటే- ఉదాహరణకి, రామ్ వస్తున్నప్పుడు ఆమె నూర్జహాగా - పాకీజా లోని మీనా కుమారి క్లాసిక్ ముజ్రా -చల్తే చల్తే యుహీ కోయీ మిల్ గయా థా కి నాట్యం చేస్తూ దొరికిపోతే, సీను థియేటర్ పైకప్పు చీల్చుకుంటూ ఎలివేట్ అయ్యే పొటెన్షియల్ తో వుండొచ్చు. ప్రేక్షకులు బయటికి పరుగులుదీసి సీను ఎక్కడికెళ్ళిందబ్బా అని ఆకాశంలోకి చూసే పరిస్థితి.

        తను ముస్లిం అన్న విషయం ఎందుకు దాస్తోందో కూడా తెలీదు. ఒకసారి నిజం చెప్పేస్తానంటుంది చెలికత్తెతో. ఆ విషయం మర్చిపోతుంది. ఇది పైపైన రాసేసి పైపైన తీసేసిన ప్రేమ కథ గనుక ఈ ప్రేమ కథలో బాధ అనుభవం కాదు. రోమాంటిక్ డ్రామా అంటే బాధే. ఈ బాధ లేకపోవడంతో కథని డ్రైవ్ చేసే అంశం లేకుండా పోయింది. నూర్జహాగా ఆమె పంజరం లోంచి బయటపడాలని తపిస్తున్న చిలుకైతే ఈ బాధ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశముండేది. ఈ బాధ నుంచి నూర్జహాకి విముక్తి కల్గించడానికి సీత శక్తి చాలడం లేదు. బయటి హస్తం కావాలి. ఆ హస్తం రామ్. కానీ అతడికి తను ముస్లిం అన్న విషయం తెలిసిపోతే? ఎలా రియాక్ట్ అవుతాడు? ముస్లిం దేశంతో యుద్ధ పరిస్థితిలో? ఈ బాధతో, ఈ స్ట్రగుల్ తో, డ్రమెటిక్ క్వశ్చన్ కరువవడం ఈ ప్రేమ కథలో ప్రధాన లోపం.

    దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాముడు లాంటి యోధుడు రావణుణ్ణి కొట్టి సీతని తీసుకురావడం పెద్ద యుద్ధం కాదు, అది ఎండ్ రిజల్ట్. అసలు యుద్ధం ఎక్కడుందంటే, సీతని ఎవరు తీసికెళ్ళారు, ఎందుకు తీసికెళ్ళారు రాముడికి తెలియదు. ఆ సంఘర్షణే అసలు యుద్ధం అని వివరించాడు. ఈ యుద్ధమే (మానసిక సంఘర్షణ) కథలో సీత వైపు నుంచీ, రామ్ వైపు నుంచీ కొరవడింది డ్రమెటిక్ క్వశ్చన్ ని స్థాపించక పోవడంతో.

        కథ ఇలా వుంటే, ఈ రెండు పాత్రలు మేకప్ తేడా తప్ప, తేడా గల మెంటల్  మేకప్స్ తో ఎలా నటించగలదు మృణాల్ ఠాకూర్. ఆఖరికి ఇరవై ఏళ్ళు గడిచిపోయాక, కాశ్మీర్లో నాట్య పాఠశాల నడుపుకుంటున్నప్పుడు కూడా వయసు మీదబడలేదు. ఎలాటి మనిషి ఎలా అయిపోయిందన్న సానుభూతి కల్గించలేదు. శ్యామ్ సింగరాయ్ లో చివరికి నాట్య పాఠశాలే నడుపుకుంటున్న నడివయసు సాయి పల్లవి, నిగనిగలాడే నల్లటి ఒత్తైన శిరోజ సంపదతో, ఫ్యాన్స్ దృష్టిలో పడిపోకుండా యూత్ఫుల్ గ్లామర్ ని ప్రదర్శించినట్టే వుంది మృణాల్ కూడా. Is this called movie making? -  అని  అనుమానం దొలవడం.  

        ఇక పాకిస్థానీ గర్ల్ రశ్మికా మందన్న. ఈమె ముస్లిం అని తెలియడానికి కొట్టొచ్చేలా ముస్లిం డ్రెస్ చుట్టుకుని ఎంట్రీ ఇస్తుంది లండన్లో. తర్వాత మర్చిపోతుంది. ఇంకెప్పుడో సడెన్ గా మళ్ళీ ముస్లిం డ్రెస్ తో వచ్చేస్తుంది. పాకిస్థానీ స్త్రీలు ఈ హిజాబ్ గిజాబ్ బురఖా గిరఖా వేసుకోరు. ఒకసారి పాకిస్తాన్ నుంచి సైంటిస్టు హైదరాబాద్ వచ్చాడు. ఆ కాలేజీలో ప్రసంగించబోతూ, హాలునిండా బురఖాలేసుకుని వున్న విద్యార్థినుల్ని చూసి విస్తుపోయాడు. బురఖాలు మా దగ్గర గిరిజనులు వేసుకుంటారు అన్నాడు చురక అంటిస్తూ.

        గడ్డాలూ టోపీలతో, బురఖాలూ హిజాబ్ లతో మతాన్ని ధరించి విజిబుల్ ముస్లిములుగా కన్పించాలని ఇండియన్ ముస్లిమ్స్ ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు. అదో ఆనందం. ఇందులోకి పాక్ గర్ల్ ని దింపేశాడు దర్శకుడు. పాక్ మత దేశమైనా స్త్రీల వస్త్రధారణపై ఆంక్షల్లేవు. సరే, అఫ్రీన్ పాత్రలో రశ్మిక లండన్లో స్టూడెంట్. పాక్ జెండా తగులబెట్టారని ఇండియన్ కారు ధ్వంసం చేస్తుంది. ఇండో-పాక్ సరిహద్దులో పోరాటాన్ని లండన్ కి కూడా తీసికెళ్ళే ప్రబుద్ధులుంటారు. అఫ్రీన్ కి ఇండియా అంటే ద్వేషం. ఆమె కారు ధ్వంసం చేసిన వ్యవహారం కాలేజీకొస్తుంది. మేనేజిమెంట్ క్షమాపణ చెప్పమంటే చెప్పదు. ఆమె ఇండియన్స్ కి క్షమాపణ చెప్పదు. అప్పుడు ఇండియన్ కారు ఓనర్ నష్టపరిహారం కట్టాలి, లేదా జైలు కెళ్ళాలి- అంటాడు. 

    నష్టపరిహారం కడతానంటుంది. ఇండియన్స్ కి క్షమాపణ చెప్పకూడదనుకున్న మనిషి నష్టపరిహార మెలా కడుతుంది? కేసు పెట్టుకోమనొచ్చు. మీరు మా జండా తగుల బెట్టారు కాబట్టి నేను మీ కారు డ్యామేజ్ చేశానన్న వాదనతో. కానీ నష్టపరిహారం కడతాననే పాకిస్తాన్ బయల్దేరుతుంది తాతగార్ని డబ్బు అడగడానికి. అక్కడ తాతగారు ఎప్పుడో చనిపోయాడని తెలుస్తుంది. 

        విషయమేమిటంటే, కథ కోసం రామ్ సీతకి రాసిన ఉత్తరం ఆమె చేతికి రావాలి. రావాలంటే నష్టపరిహారం డబ్బుల కోసం తాత దగ్గరి కెళ్ళాలి. వెళ్తే తాత వీలునామాలో సీతకి ఉత్తర మందిస్తేనే ఆస్తి దక్కుతుందన్న షరతు తెలియాలి. దాంతో ఆమె నష్టపరిహారం డబ్బుల కోసం ఉత్తరం బాధ్యత తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పాడాలి. ఇలా కథ కోసం లండన్ సంఘటన దగ్గర్నుంచీ పాత్ర తత్వాన్ని కిల్ చేస్తూ పోవడం ఏమైనా బాగుందా?

        అయితే రశ్మిక పాత్రకి ముగింపులో ఇచ్చిన ట్విస్టు బావుంది. ఇరవై ఏళ్ళ క్రితం టెర్రరిస్టు క్యాంపు మీద రామ్ ఎటాక్ చేసినప్పుడు కాపాడిన బాలిక వహీదాయే తను అని తెలియడం. చాలా బలమైన కదిలించే సన్నివేశం. మొదట్నుంచీ పొగరు ప్రదర్శించడంలో రాణించిన రశ్మిక, ఇప్పుడు మెత్తబడే దగ్గర మార్పుని ప్రదర్శించడం కూడా బాగానే చేసింది. ఇలాటి కదిలించే సన్నివేశం ప్రేమ కథలో ఎక్కడా పైన చెప్పుకున్న కారణాలతో ఒక్కటీ లేకపోవడం విచారకరం.

        సీత కోసం, తర్వాత రామ్ కోసం అన్వేషణలో ప్రదేశాలు తిరిగే పాత్రగా రశ్మిక కథలో  సస్పెన్స్ ఏమీ పుట్టించదు - పైన చెప్పుకున్నట్టు క్లిఫ్ హేంగర్ మూమెంట్స్ లోపించడంతో. ఇరవై ఏళ్ళుగా ఎన్నో చేతులు మారివున్న ఆ ఉత్తరం కూడా సినిమా చివరి వరకూ నలగకుండా, మాయకుండా ఫ్రెష్ గా వుంటుంది. పోస్టల్ శాఖవాళ్ళు ఎప్పటి కప్పుడు కొత్త కవర్లు అచ్చేసి సప్లై చేస్తున్నట్టు. వాళ్ళకి సీతారాముల ప్రేమ మీద ఎంత భక్తో!

        అన్వేషణలో రశ్మిక వెంట వుండే పాత్రగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫన్నీ క్యారక్టర్ గా వుంటే సినిమాలో ఫన్ లేని లోటుని తనైనా తీర్చగలిగే వాడు. బ్రిగేడియర్ గా సుమంత్ ది కీలక పాత్ర. చివర్లో రామ్ రాసిన ఉత్తరంలో తను చేసిన ద్రోహం ఎలాటిదో బయటపడ్డాక తను తీసుకునే నిర్ణయం ఒక షాకింగ్ ట్విస్టు. అయితే దీనికో అభ్యంతరముంది. రామ్ పాత్రని దెబ్బతీసే విషయం. చివర్లో చూద్దాం.

        ఇక సుమంత్ భార్యగా భూమికది స్వల్ప పాత్ర. తాతగా పాక్ బ్రిగేడియర్ పాత్రలో సచిన్ ఖెడేకర్ కన్పిస్తాడు. జర్నలిస్టుగా ప్రియదర్శి ఒక సీన్లో వచ్చిపోతాడు. మురళీ శర్మ సుబ్రహ్మణ్యంగా నూర్జహా ప్యాలెస్ లో వుంటాడు. ఇక సునీల్, వెన్నెల కిషోర్ కమెడియన్లు ఎలా వున్నారో పైన తెలుసుకుని జ్ఞాన సముపార్జన చేశాం.  

        పాటలు కాలానికి తగ్గట్టు వున్నాయి. గందరగోళం లేదు. కెమెరా వర్క్ కూడా విరివిగా విజువల్స్ వాడకంతో కళ్ళప్పగించి చూసేలా వుంది. రెండు కాలాల పీరియెడ్ ప్రొడక్షన్ విలువలూ భారీతనంతో పురాతన ఛాయలు ప్రదర్శిస్తూ వున్నాయి- ఒక్క ఉత్తరం విషయంలో తప్ప. అప్పటి ఇంకు కూడా ఎంత గట్టిదో, రెండు దశాబ్దాలైనా ఉత్తరం మీద రాసిన చిరునామా ఏమాత్రం చెక్కు చెదర లేదు. ఈ సినిమా ఓటీటీలో వచ్చినా ఉత్తరం పదిలం, పరమ పదిలం.

చివరికేమిటి?

    వైజయంతీ మూవీసే తీసిన మహానటి (2018) కథన శైలినే తిరిగి దీనికీ వాడారు. మహానటి లో హాలీవుడ్ సిటిజెన్ కేన్ (1941) కథన శైలిని తెచ్చుకుని వాడారు. ఇద్దరు జర్నలిస్టులు (సమంతా, విజయ్ దేవరకొండ) సావిత్రి జీవితం గురించి తెలుసుకునే పరిశోధన ప్రారంభించడంతో, మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా సావిత్రి జీవితం తెలుస్తూ వుంటుంది. సీతారామం లో ఇద్దరు స్టూడెంట్లు (రశ్మిక, తరుణ్ భాస్కర్) సీతారాముల్ని అన్వేషించే క్రమంలో, వాళ్ళ ప్రేమ కథ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటుంది.

        ఈ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో ప్రేమ కథ ఖండ ఖండాలుగా వస్తూంటే, వాటిని జోడించుకుని చూపే విషయంపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో, ఎమోషనల్ కంటిన్యూటీకి అవరోధ మేర్పడింది. ప్రత్యక్ష కథలో రశ్మిక, తరుణ్ భాస్కర్ ల ట్రాక్ బాగా తగ్గించి వుంటే, పూర్వ కథగా వున్న ప్రేమ కథ, తక్కువ ఫ్లాష్ బ్యాకులతో, నిడివి పెరిగిన భాగాలతో ఎమోషనల్ త్రెడ్ నిర్వహణకి అనుకూలంగా వుండేది. 

అసలు పూర్వ కథలో చివర్లో తప్ప సరైన ఎమోషనే వర్కౌట్ కాలేదని పైన చెప్పుకున్నాం. రశ్మిక ట్రాక్ తీసేసి, ఫ్లాష్ బ్యాక్ ఖండికలన్నీ ఒక చోట పేర్చి చూస్తే, ప్రేమ కథలో విషయ మెంతున్నదనేది తెలుస్తుంది. 

కాన్సెప్ట్ గొప్పదే, ఇందులో సందేహం లేదు. నిర్వహణ అంత పకడ్బందీగానూ వుండాలి. ముగింపులో బాధ పెట్టే విషయమైనా లోపభూయిష్టంగా వుండకుండా చూసుకోవాలి. చివర్లో సీత విప్పి చూసిన ఉత్తరంలో రామ్ ఏమని రాశాడు? తను, బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్ పాత్ర) పాక్ ఖైదీలుగా వున్నప్పుడు, అధికారులు ఒకర్ని విడిచి పెడతామంటారు. ఎవరు ఇండియన్ ఆర్మీ బేస్ వివరాలు చెప్తే వారిని విడిచి పెడతామంటారు. రామ్ చెప్తే రామ్ వెళ్ళిపోయి సీతని కలుసుకోవచ్చు. కానీ అతను దేశ ద్రోహం చేయలేడు. విష్ణుశర్మ చెప్పేసి విడుదలై వెళ్ళిపోతాడు. రామ్ ఉరికంబమెక్కుతాడు. నిజానికి విష్ణుశర్మ కూడా ఆర్మీ బేస్ రహస్యాలు చెప్పేసి ఎక్కడికీ వెళ్ళలేడు. అక్కడే కాల్చి చంపే అవకాశముంటుంది.

         క్లయిమాక్స్ లో ఈ సెటప్ అంతా, డ్రామా అంతా  పైన ఆల్రెడీ చెప్పుకున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వుండడానికి వీల్లేదు. రామ్ తను ప్రాణత్యాగం చేసి వెళ్ళిపోతే గొప్ప మనసున్న వాడవుతాడు. కానీ వెళ్తూ ఉత్తరంలో విష్ణు శర్మ గురించి రాయడమెందుకు? అప్పుడు తను చేసింది ప్రాణ త్యాగమవుతుందా, పగదీర్చుకోవడ మవుతుందా? తను గొప్పవాడవుతాడా, విష్ణు శర్మని చట్టానికి పట్టించాలన్న బుద్ధితో అల్పుడవుతాడా?

        ఉత్తరంలో నూర్జహా గురించి పేపర్ కటింగ్ పెట్టి నువ్వెవరో నాకు తెలుసని టీజ్ చేస్తాడు. తెలిసినప్పుడు ఉత్తరం మీద నూర్జహా అని రాయకుండా సీతామహాలక్ష్మి అని రాస్తే ఆ ఉత్తరం నూర్జహాకి ఎలా చేరేను? నూర్జహా అని అడ్రసు రాస్తే ఈ కథే వుండదనా?ఇలా రామ్ ఆడియెన్స్ ని కూడా చీట్ చేసి సినిమా హిట్ చేసుకున్నాడా? ఇలా అన్పించకూడదు. రైటింగ్ కి బోలెడు బడ్జెట్ వున్నప్పుడు క్వాలిటీ రైటింగ్ అవసరం. 

—సికిందర్