రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, నవంబర్ 2021, గురువారం

1075 : రివ్యూ


 దర్శకత్వం : శివ

తారాగణం : రజనీ కాంత్, మీనా, ఖుష్బూ, నయన తార, కీర్తీ సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అభిమన్యూ సింగ్, సూరి, సత్యన్, సతీష్, వేలా రామ్మూర్తి, పాండ్యరాజన్ తదితరులు
రచన : శివ -ఆది నారాయణ
, సంగీతం : డి ఇమాన్, ఛాయాగ్రహణం: వెట్రీ
బ్యానర్
; సన్ పిక్చర్స్,
సమర్పణ : కళానిధి మారన్
నిర్మాతలు (తెలుగు డబ్బింగ్) : డి సురేష్ బాబు
, దిల్ రాజు, నారాయణ దాస్ నారంగ్
విడుదల : నవంబర్ 4
, 2021
***

      గ్లోబల్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తలైవర్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా, చెల్లెలి సెంటిమెంటు పెద్దన్న - గత సంవత్సరం దీపావళికి రావాల్సింది ఈ దీపావళికి ముస్తాబైంది కోవిడ్ సౌజన్యంతో. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3 వేల థియేటర్లలో విడుదలైన ఈ మల్టీ స్టారర్ లో ముచ్చటగా ముగ్గురు సీనియర్ హీరోయిన్లతో బాటు ఒక తాజా హీరోయిన్ కొలువుదీరింది. మీనా, ఖుష్బూ, నయనతార ప్లస్ కీర్తీ సురేష్ లతో బోలెడు సంసారపక్ష గ్లామర్ షో. మరో ముగ్గురు విలన్లతో రజనీ యాక్షన్ హంగామా. తెలుగులో శౌర్యం’, శంఖం మొదలైన సినిమాలు తీసిన యాక్షన్ - ఎమోషనల్ డ్రామాల దర్శకుడు శివకి తొలిసారిగా రజనీతో డైరెక్షన్. పెద్ద నిర్మాణ సంస్థ, తెలుగులో పెద్ద పంపిణీదార్లు - హంగూ ఆర్భాటం పండగకి తగ్గట్టు ఆకర్షణీయంగానే వుంది. థియేటర్లోకి వెళ్ళాక ఎలా వుంటుంది? చెల్లెలి సెంటిమెంటుతో, పెద్దన్న మమతాను రాగాలతో పండగని ఫీలవుతామా? రజనీ ఎప్పట్లానే పిల్లాపాపల్ని, యువ కెరటాల్ని, ముసలీ ముతకనీ తన మార్కు వినోద కాలక్షేపంతో రంజింపజేస్తాడా? ఇవీ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు...    

కథ

   రాజోలులో పెద్దన్న అనే వీరన్న (రజనీకాంత్) పంచాయితీ పెద్ద. ఇతడికి కనకం అనే కనక మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ముద్దుల గారాల చెల్లెలు. ఈమెని కంటూ తల్లి చని పొతే చెల్లె పాపగా ప్రాణంలా పెంచి పెద్ద చేశాడు. చెల్లె పాపకి కూడా పంచ కట్టుకునే అన్నంటే పంచ ప్రాణాలు. ఇలా వుండగా ఓ కేసులో తను చెప్పినట్టు చేసిందని లాయరమ్మని (నయనతార) ప్రేమిస్తాడు పెద్దన్న. ఆమె కూడా న్యాయంగా ప్రేమిస్తుంది.

        ఇంతలో ఇద్దరు పెళ్ళయిన మరదళ్ళు (మీనా, ఖుష్బూ) మమ్మల్ని నువ్వు పెళ్ళి చేసుకోకపోతే చేసుకున్న మొగుళ్ళతో మేమెలా అయ్యామో చూడమని వచ్చేసి గొడవ మొదలెడతారు. వీటన్నిటి మధ్య ఇక పెద్దన్నకి చెల్లెలి పెళ్ళి చేయాలన్పించి సంబంధాలు చూసి, ఓ పెద్దమనిషి (ప్రకాష్ రాజ్) కొడుకుతో పెళ్ళి వేడుకలు ప్రారంభిస్తాడు. తీరా పెళ్ళి  సమయానికి చెల్లెలు కనకం చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి  వెళ్ళి పోతుంది. పెద్దన్న కంగారు పడతాడు. ఎంత వెతికినా కనపడదు కనకం. పెళ్ళి ఆగిపోతుంది. అలా మాయమై పోయిన కనకం కలకత్తాలో ప్రమాదంలో వుందని తెలుస్తుంది.

        కనకం కలకత్తాలో ప్రమాదంలో ఎందుకుంది? ఎవరా ప్రమాదకారులు? ఇక పెద్దన్న కలకత్తా వెళ్ళి చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు? ఇదీ రజనీ స్టయిల్ మిగతా కథ.

ఎలావుంది కథ

    రజనీ అలసి పోలేదు, రజనీతో కథలు అలసి పోయాయి. అవే కథలు అలాగే తీసి తీసి రజనీని అపహాస్యం పాల్జేస్తున్నారు. రజనీలో సరుకు అయిపోలేదు, రజనీతో తీసే దర్శకుల్లో కొత్త సరుకు లేదు. రజనీ యాక్టింగ్ స్టయిల్ అదే హైరేంజి లో వుంటే, దాన్ని అందుకోవడంలో యువ దర్శకులుగా విఫలమై, లో- రేంజి ముసలి దర్శకత్వాలతో సరిపెడుతున్నారు. రజనీ వయసై పోయిందనే వాళ్ళు, యువ దర్శకుల వయసై పోయిందని భాష మార్చుకోవాల్సి వుంటుంది.

        రజనీ ఎప్పుడో 30, 40 ఏళ్ళ క్రితం నటించేసిన కథల్లోంచి ఓ చెల్లెలి కథ తీసుకుని ఇప్పటి ప్రేక్షకులకి ఆ కాలపు తరహాలోనే ఉన్నదున్నట్టు అంటగట్టాడు దర్శకుడు శివ. భావోద్వేగాలు ఎప్పుడూ అవే వుంటాయి. వాటిని వ్యక్తం చేసే సినిమా నాటకీయత కాలాన్ని బట్టి మారుతుంది. ఇప్పటి ఏ సినిమాల్లో అన్నాచెల్లెలు దర్శకుడు శివ చూపించినట్టు వుంటున్నారు? ఇది కూడా సరి చూసుకోకూడదా?

        పాత కథల్ని సినిమాలుగా తీయకూడదని కాదు. రీబూట్ చేసి, సమకాలీన కథలన్పించేలా తీయడానికి కూడా బద్ధకమైతే ఎలా? ప్రమాదంలో పడ్డ చెల్లెల్ని అన్న కాపాడాల్సిన అవసరం జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎక్స్ పైరీ డేట్ వుండదు. కాలాన్ని బట్టి తీరు మారుతుంది. ఈ కాలీన స్పృహ కూడా లేకపోతే సినిమాలు తీయడమెందుకు?

        ఈ కథ థీమ్ తో ఇబ్బంది లేదు. తీసిన విధానమే, పురాతన సినిమా చూస్తున్నట్టు వుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్లు, వాళ్ళ సీన్లు, మాటలు, పాటలు, ఎడబాటులో కన్నీళ్ళూ  ఏడ్పులూవీటికి తోడు రజనీ పెద్దరికపు గ్రామీణ దృశ్యాలు, కామెడీలు,  గ్రామీణ విలనీ, కలకత్తా విలనీలూ... ఏదీ నేపథ్యాలు మార్చి కొత్తగా చూపించే బదులు 1980 ల, 90 ల నాటి సినిమా చూడమన్నట్టు చూపించేశాడు ఆలిండియా ప్లస్ ఓవర్సీస్ ప్రేక్షకులకి శివ!

నటనలు- సాంకేతికాలు

  రజనీ రహస్యమేమిటంటే ఏ సినిమాలోనూ బరువెక్కకుండా అదే స్లిమ్ బాడీతో యాక్టివ్ గా వుండడం. ఈ సినిమాలో ఎక్కడా కుదురుగా వుండడు. ఏ సీనులో చూసినా స్పీడుగా నడిచి వచ్చేస్తూ డైలాగులు చెప్పేస్తాడు. తను మూవ్ మెంట్ లో వుండని క్షణం లేదు. తన వల్లే సీన్లు మొరాయించకుండా చకచకా పరిగెడుతూంటాయి. కాలం చెల్లిన కథనీ, పాత్రనీ ఓడించేస్తూ తన సమ్మోహనాస్త్రపు ఛత్రఛాయ కిందికి ప్రేక్షకుల్ని లాక్కొచ్చేస్తాడు. విలన్లనీ, వాళ్ళ ముఠాల్నీ తంతున్నప్పుడు మన ఉద్రేకాలు పెరిగేలా చేస్తాడు. తనకి అన్ని విద్యలూ తెలుసు. మందబుద్ధి మేకర్లే అర్ధం జేసుకోరు. ప్రతీ పాటా జనరంజకం చేసి పెట్టాడు. ఈ సినిమా కథని పూర్వజన్మ కర్మ ఫలమని భరిస్తూ ఏదో కాసేపు చూడాలన్పిస్తే - అది రజనీ గురించీ, సంగీత దర్శకుడు ఇమాన్ గురించే!

        కీర్తి సురేష్ చెల్లెలి పాత్రా, నటనా కీర్తి శిఖరాలందుకునే ప్రమాదముంది. దీంతో ఇతర దర్శకులు ఆమెతో ఇలాటి ప్రయోగాలు చేసినా చేస్తారు. బారసాల నుంచి సీమంతం పాట వరకూ తనెక్కడికో వెళ్ళిపోయింది. ఇంత ప్రాచీన జీవితం ఆమెతో మనం చూడాలి. మధ్యలో పాత మోడల్ మరదళ్ళుగా మీనా, ఖుష్బూల విచిత్ర పాత్రలు, గోల కామెడీ నటనలూ సరే. నేటి సినిమా అంటే ఇలా వుండాలని ప్రేక్షకులకి నేర్పుతున్నాడు దర్శకుడు. మీనా, ఖుష్బూ లకి కూడా ఇదే కరెక్ట్ అన్పించి వుంటుంది. లాయర్ పాత్రలో నయనతార ఒక్కరే రజనీ తర్వాత కాస్త చూడదగ్గదిగా వుంటుంది. రజనీ- నయనల మధ్య ముందొక డ్యూయెట్ పెట్టేశాక, ఇంకా రోమాంటిక్ సీన్లు తలపోయలేదు ఎందుకో శివ.  

        విలన్ల గురించి- ఫస్టాఫ్ లో ప్రకాష్ రాజ్, సెకండాఫ్ లో జగపతిబాబు, అభిమన్యూ సింగ్ లు అత్యంత అర్ధం పర్ధం లేని విలన్ పాత్రలేశారు. చివరి ఇద్దరికీ కీర్తీ సురేష్ తో కుట్రకి కూడా సరైన కారణం కన్పించదు. బోలెడు హింసకి పాల్పడ్డమే విలనీ అనుకుంటే అదిక్కడ వర్కౌట్ కాలేదు, కనెక్టూ కాలేదు. 

        ఇక సంగీత దర్శకుడు ఇమాన్ గురించి. విషయపరంగా సినిమా ఎలా వున్నా, ఆరు పాటలు రజనీకి తగ్గట్టు ఇవ్వడంలో హిట్టయ్యాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కేం చేశాడు? ఇవాళ దీపావళి. టపాకాయలు హోరెత్తుతాయి. దీనికి పోటాపోటీగా అన్నట్టు సినిమా సాంతం లౌడ్ మ్యూజిక్ తో శబ్ద కాలుష్యం సృష్టించి పారిపోయేలా చేశాడు. ఈ సినిమా కెళ్తే ఇంటి కొచ్చి బాణసంచా కాల్చనవసరం లేదు. డబ్బులు ఆదా అవుతాయి.

        నిర్మాణపరంగా బడ్జెట్ కి వెనుకాడలేదు. గ్రామీణ దృశ్యాలు, కలకత్తా దృశ్యాలూ హై రేంజిలో చిత్రీకరించారు. అలాగే యాక్షన్ దృశ్యాలూ. ఓ మూడు నాల్గు సీన్లు తప్పిస్తే, ఏ సీన్లోనూ కనిష్టంగా 50, గరిష్టంగా వందల మందికి తక్కువ కాకుండా క్రౌడ్ సీన్లే వుంటాయి. రజనీని కాసేపు ఒంటరిగా చూద్దామంటే కన్పించడు! ఇది సినిమానా, ఎలక్షన్ ర్యాలీనా అన్నట్టు తీశారు బడ్జెట్టంతా ధారబోసి!

చివరికేమిటి

      ఈ రజనీ కొత్త సినిమా విడుదల ముందు అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేదు తమిళనాడులోనూ, మిగతా దేశంలోనూ. సోషల్ మీడియా స్తబ్దుగా వుండి పోయింది. యూత్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక మాస్ మసాలా సినిమాలకి దూరంగా ఆన్ లైన్లో వస్తున్న కొత్త కంటెంట్ కి అలవాటు పడుతున్నారేమో. తెలుగులో కూడా ఈ మధ్య మాస్ సినిమాలకి మాస్ ప్రేక్షకులే కరువయ్యారు. రివ్యూలు రాయడానికి మనం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల్ని చూస్తాం. అక్కడైతే అన్ని తరగతుల ప్రేక్షకుల రియాక్షన్ తెలుస్తూంటుంది. ఈ సినిమా మార్నింగ్ షోకి మాస్ తక్కువే వున్నారు. రజనీ కాబట్టి ఆ మాత్రం వచ్చి వుంటారు. వాళ్ళు ఈ పాత అతి మెలో డ్రామా సీన్లకి గట్టిగా నవ్వకుండా వుండ లేక పోయారు. నిజం కంటే న్యాయం గొప్పదని ఒక డైలాగు వుందిందులో. అరిగిపోయిన పాత చింతకాయ కథ అన్న నిజాన్ని దాచి పెడుతూ న్యాయం చేయాలని తెలుసుకోకుండా - దర్శకుడు రెండు దీపావళులు దివ్యంగా గడిపేశాడు...

—సికిందర్ 

 

దేశ విదేశాల పాఠకులందరికీ...



2, నవంబర్ 2021, మంగళవారం

1074 : రివ్యూ


 రచన- దర్శకత్వం : టీజే జ్ఞానవేల్
తారాగణం సూర్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్,, మణికంఠన్, జీషా విజయన్, లిజోమోల్ జోసీ తదితరులు.
సంగీతం: సీన్ రోల్డన్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
విడుదల :  నవంబర్ 2,  2021, అమెజాన్ ప్రైమ్

***

         సంవత్సరం లాక్ డౌన్ పరిస్థితుల్లో సూర్య సూరరై పొట్రు తో ఓటీటీ ప్లాట్ ఫామ్ కెళ్ళింతర్వాత, ఈ సంవత్సరం లాక్ డౌన్ లేకపోయినా తర్వాతి సినిమా జై భీమ్ తోనూ తిరిగి ఓటీటీకే వెళ్ళడం ఓ టాపిక్ గా వుంది తమిళనాడులో. వెంట వెంటనే ఈ రెండూ నిజవ్యక్తుల మీద తీసిన సినిమాలు కావడం ఇంకా హాట్ టాపిక్ అయింది. జై భీమ్ ని తనూ జ్యోతిక కలిసి నిర్మించడం ఇంకో టాపిక్. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ కాదు. టైటిల్ ని బట్టే సామాజిక వాస్తవిక కథా చిత్రమని అర్ధమవుతోంది. స్టార్ గా ఇలాటి సమాంతర సినిమా బాధ్యతలు మీదేసుకుని నిర్మించడం- అందులోనూ ఓటీటీ ద్వారా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో అందించడం, సూర్య తన స్టార్ డమ్ ని పునర్నిర్వచించుకుంటున్న వైనాన్ని తెలుపుతోంది.

        స్టార్లు సామాజిక బాధ్యత ఫీలైనప్పుడే జై భీమ్ లాంటి రియలిస్టిక్ ప్రయత్నాలు సవినయంగా చేస్తారు- కాసేపు ఫ్యాన్స్ కోరికల్ని పక్కన బెట్టి. ఈ దీపావళికే రేపు 4వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా అన్నాతే (పెద్దన్న) తో థియేటర్ల మీద దండెత్తుతూంటే, తనేమో సూర్య ఇంటి పట్టునే ముందు జై భీమ్ చూసుకుని వెళ్ళమన్నట్టు ఓటీటీ లోంచి పిలుపు నిస్తున్నాడు. కానీ ఇది పండగ మూడ్ కి వ్యతిరేకమైన చాలా సీరియస్ సినిమా. దీన్ని చూడాలంటే మనసు రాయి చేసుకోవాలి. పండగంటే మన ఆనందాలే కాదు, ఇతరుల ఆక్రందనలు కూడా. రెండూ అనుభవించాలి. ఏమిటా ఆక్రందనలు? ఎవరివా ఆక్రందనలు? ఓసారి చూసి వద్దాం... 

కథ

     ఓ గిరిజన ప్రాంతంలో రాజన్న (మణికందన్) పాములు పట్టే వాడుగా వుంటాడు. ఒక రోజు వూళ్ళో రాజకీయనాయకుడి ఇంట్లో పాము జొరబడితే వెళ్ళి పట్టుకుంటాడు. రాజన్న భార్య చిన్నతల్లి (లీజోమోల్ జోసీ) తో, ఓ కూతురితో ఆనందంగా గడుపుతూంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడి ఇంట్లో నగలు పోయాయని కంప్లెయింట్ వస్తే, ఆ రోజు పాము పట్టడానికి వచ్చిన రాజన్నే ఈ పనిచేసి వుంటాడని పట్టుకెళ్ళి కొడతారు పోలీసులు. తనకి తెలియదన్నా విపరీతంగా కొట్టి గాయపరుస్తారు. రాజన్న కోసం భార్య వస్తే తప్పించుకుని పారిపోయాడని చెప్తారు. ఇక దిక్కు తోచని చిన్నతల్లి నాల్గు చోట్ల చెప్పుకుని, ఎక్కడా లాభం లేక లాయర్ చంద్రు (సూర్య) దగ్గరి కెళ్తుంది. కేసు సానుభూతితో విన్న చంద్రు, హైకోర్టులో రాజన్న ఆచూకీ గురించి హేబియస్ కార్పస్ కేసు వేస్తాడు.

        ఇప్పుడీ కేసు సీరియస్ గా చేపట్టిన చంద్రుకి రాజకీయంగా ఎలాటి సవాళ్ళు ఎదురయ్యాయి? కేసు వాపసు తీసుకోవాలని చిన్న తల్లి మీద పోలీసులు ఎలాటి కుట్రలు చేశారు? అసలు రాజన్న ఏమయ్యాడు? ఈ కేసులో చంద్రు న్యాయం సాధించగల్గాడా? ఏ ఏ వృత్తి నైపుణ్యాలు ప్రయోగించి గెలిచాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

      తమిళనాడు కడలూర్ జిల్లాలో బుట్టలు అల్లే కురుంబర్ గిరిజన తెగకి చెందిన 4 కుటుంబాలు ఇరవై ఏళ్ళకి పైగా అక్కడ నివాసముండేవి. ఆ కుటుంబాల్లో రాజకన్ను  కుటుంబం ఒకటి. వీరు పంట కోతల సమయంలో చుట్టు పక్కల పొలాల్లో కూలీకి వెళ్ళే వాళ్ళు. ఇలా వుండగా, 1993 లో ఓ రోజు గోపాల పురం అనే వూరికి కూలీ కెళ్ళారు. అక్కడ కూలీ పూర్తి చేసుకుని డబ్బులూ ధాన్యాలతో తిరిగొచ్చేశారు. ఇంతలో ఆ వూళ్ళో ఒకింట్లో నగలు దొంగతనం జరిగాయని పోలీసులకి ఫిర్యాదు అందింది. పోలీసులు రాజకన్నుని పట్టుకెళ్ళి దొంగతనం మోపి చిత్రహింసలు పెట్టారు. రాజకన్ను భార్య పోలీస్ స్టేషన్ కెళ్ళి అడిగితే, తప్పించుకుని పారిపోయాడని చెప్పారు.

        దీన్ని నమ్మని ఆమె పై పోలీసు అధికారుల్నీ, కలెక్టర్నీ కూడా కలిసింది. ఫలితం లేకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ నాశ్రయించింది. రాజకన్నుని పోలీసులే కొట్టి చంపేశారని కమ్యూనిస్టు పార్టీ ఆందోళన చేపట్టింది. ఇది కూడా నిష్ఫలమవడంతో లాయర్ చంద్రు సాయం చేస్తాడని చెప్పారు పార్టీ నేతలు. రాజకన్ను భార్య లాయర్ చంద్రుని కలిసి చెప్పుకుంది. అతను హైకోర్టు లాయర్. మానవ హక్కుల కేసుల్ని ఫీజులు తీసుకోకుండా వాదిస్తాడు.

        చంద్రు హేబియస్ కార్పస్ కేసు వేయడంతో విచారణ చేపట్టిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బాధితురాలి కుటుంబానికి 3 సెంట్ల భూమి, 2.65 లక్షల నగదు తాత్కాలిక సాయంగా అందించాలని.  తర్వాత హైకోర్టు ఆదేశాలందుకుని దర్యాప్తుకి దిగిన పోలీసులు ఒక పడవలో దొరికిన మృతదేహం రాజకన్నుతో సరిపోలడాన్ని రిపోర్టు చేశారు. దీంతో రాజకన్ను అదృశ్య కేసు హత్య కేసు గా నమోదై తాజాగా విచారణ కొనసాగింది. చిట్టచివరికి 13 ఏళ్ళ తర్వాత 2006 లో, కడలూర్ కోర్టులోనూ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనూ విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. కేసులో మొత్తం 12 మందిని దోషులుగా నిర్ధారించారు. అందులో డిఎస్పీ, ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్, ఒక డాక్టర్ కూడా వున్నారు. వీళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి. రాజకీయ పార్టీల నుంచి అనేక బెదిరింపులూ వేధింపులూ ఎదుర్కొంటూనే కేసు పోరాడి విజయం సాధించాడు లాయర్ చంద్రు. అతను ప్రస్తుతం రిటైర్డ్ హైకోర్టు జడ్జి. 75 ఏళ్ళ రాజకన్ను  భార్య జీవించే వుంది.

        ఈ ఉదంతమంతా కొన్ని మార్పులతో  జైభీమ్ కథగా తెరకెక్కింది. ఇది 2016 లో వెట్రిమారన్ టెర్రిఫిక్ తీసిన విశారనై ని గుర్తు చేస్తుంది. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కేసు ఆధారంగానే తీశారు. 1983 లో గుంటూరులో నల్గురు తమిళనాడు వలస కూలీల్ని దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు చిత్ర హింసలు పెడుతూంటే, దీని వెనుకున్న కొన్ని రాజకీయ రహస్యాలు బయట పడకూడదని, చెన్నై పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళి లాకప్ డెత్తులూ, ఎన్కౌంటర్లూ చేసి చేతులు దులుపు కున్నారు.

        ఈ నిజ కథా చిత్రం కూడా మానవ హక్కుల దుస్థితిని దృశ్యీకరిస్తుంది. విశారనై’, జై భీమ్ రెండిట్లోనూ బాధితులు ఏ దిక్కూ లేని బడుగు జనాలే. న్యాయం కోసం వాళ్ళు చేసే ఆక్రందనలే. వీళ్ళతో ముందూ వెనుకా చూడకుండా పోలీసులు పాల్పడే అకృత్యాలే. ఏ దోలా డ్యూటీ పూర్తవడానికి ఈజీ టార్గెట్లు గా కన్పించే వీళ్ళని నిలువునా బలి చేయడాలే. ఇలా పోలీసులు పాల్పడే  మానవ హక్కుల ఉల్లంఘనల మీద అనేక సినిమాలు వివిధ భాషల్లో వచ్చి వుంటాయి. కానీ విశారనై అంత పచ్చిగా ఇంకోటి రావడం ఇప్పుడు  జై భీమ్ రూపంలోనే. చాలా పచ్చిగా, గగుర్పాటు కల్గించేదిగా. పోలీసు రెండో ముఖాన్నినిర్మొహమాటంగా విప్పి చూపించే వాస్తవిక సినిమాలివి. దేశంలో ఇంకెవరూ  ప్రయత్నించని స్థాయిలో ఈ రెండు పచ్చి వాస్తవికాలు తమిళంలోనే ప్రయోజనాత్మకంగా వచ్చాయి.

        విశారనై తో లాగే జై భీమ్ తో కూడా పోలీసులేం నీతి తెలుసుకుంటారో గానీ- ఎవరో రాజకీయ నాయకుల కోసం ఇలాటి దుశ్చర్యలకి పాల్పడితే - ఆ రాజకీయనాయకులే దృశ్యంలోకే రాకుండా, కేసుతో సంబంధం లేకుండా ఎక్కడో వుంటారు- పోలీసులు కటకటాల వెనక్కి వెళ్ళి ఏడ్వడమే.

         విశారనై కి  మూడు జాతీయ అవార్డులు లభించడంతో బాటు, ఆస్కార్ అవార్డులకి ఎంపిక కూడా అయి సంచలనం సృష్టించింది. అయితే హద్దుల్లేని హింస చూపించిన కారణంగా ఆస్కార్ నామినేషన్ కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. దేశంలో ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసుల అకృత్యాల్ని చూపించాడు వెట్రిమారన్. వాస్తవంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతోందో నిజాన్ని ప్రజలకి తెలియజేయకపోతే ఈ కథల్లో సదరు బాధితులకి న్యాయం చేసినట్టవదు. ఈ కథల్లో  జరిగినట్టు ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చన్న హెచ్చరిక వీటిలో  ప్రధానంగా వుంది.

        ఆల్రెడీ ఇలాటి కథగా విశారనై వచ్చేశాక, తను చూపించిన తేడా ఏమిటనేది జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ ముందుండే ప్రశ్న. దీనికి - అడవి మృగాల కంటే పట్టణ మనిషే గిరిజన జీవితాలకి అత్యంత ప్రమాదకరమని దీటైన సమాధానమిచ్చేలా విషయం చెప్పాడు. అయితే ఈ కథ కోర్టు రూమ్ డ్రామా జానర్ కావడంతో, సహజంగానే అలాటి టెంప్లెట్ రొటీన్ దృశ్యాల పరంపరకి లోనవక తప్పలేదు.

నటనలు- సాంకేతికాలు

   ‘సూరరై పొట్రు లో ఏర్ డెక్కన్ వ్యవస్థాపకుడు  కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్ నటించిన సూర్య, ఈసారి నాటి లాయర్, నేటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రుగా నటించాడు. తన రెగ్యులర్ కమర్షియల్ హంగూ ఆర్భాటాలూ అన్నీ తీసి పక్కన పెట్టాడు. కెప్టెన్ గోపీనాథ్ గా నటించినప్పుడు మాత్రం అన్ని మసాలాలూ కలిపి రెగ్యులర్ సూర్య లాగే నటించాడు. లాయర్ చంద్రుగా నటనలో వ్యాపార ధోరణిని పక్కన పెట్టేసి, తనకో హీరోయిన్ వుండాలన్న ఆలోచనే చేయకుండా, మానవ హక్కుల కార్యకర్త పాత్ర అత్యంత సహజ ధోరణిలో పోషించాడు. బాధిత పాత్ర చిన్నతల్లి తో అతడి ఔదార్యం చూసినా, ఒక సమయంలో ఆగ్రహం చూసినా, అలాగే కోర్టు దృశ్యాల్లో వృత్తితత్వంతో కూడిన వాద ప్రతివాదాల ధోరణి చూసినా- నటుడిగా తనని తాను పరీక్షించుకునే అవకాశంగానే దీన్ని తీసుకున్నాడు. ఈ పరీక్ష సునాయాసంగా నెగ్గేశాడు.

        రెండో ముఖ్య పాత్ర చిన్నతల్లిగా లిజోమోల్ జోసీ ఒక వండర్. గిరిజనురాలి పాత్రలో రంగూ హంగూ అచ్చం సరిపోయి, ఆమె నటి అని చెప్తే తప్ప తేడా గుర్తించలేనంత ప్రాంతీయత కలగలిసిపోయి కనిపిస్తుంది. పాత్ర నిడివీ ఎక్కువే. సంఘర్షణా చూసినా సూర్య పాత్రతో సమానమే. ఆమె పాత్ర తీరుకి, న్యాయ పోరాటానికీ ముక్తాయింపుగా మట్టిలో తేమ వుంది, రేయికో వెన్నెలుంది అని అర్ధవంతమైన పాట రాశాడు కవి.

        ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ పాత్రలు  రెండూ రెండు ధృవాలు. ప్రకాష్ రాజ్ సూర్యకి సహకరించే, హూందాగా మాట్లాడే  ఉన్నత పోలీసు అధికారైతే, రావు రమేష్ సూర్యని వ్యతిరేకించే, వ్యంగ్యంగా మాట్లాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇద్దరూ ఈ వాస్తవిక సినిమాకి ఓ నిండుదనాన్ని తెచ్చారు.

        రాజన్నగా నటించిన మణికందన్ తప్పకుండా ఉత్తమ నటుడవుతాడు. తొలి సన్నివేశాలు వదిలేసి తర్వాత చూస్తే, ఎప్పుడు చూసినా పోలీస్ టార్చర్ తో గావు కేకలే. గావు కేకలేయడం కూడా నటనేనా అంటే, ఒక కేక ఇంకో కేకలా అన్పించకుండా వేయడం కష్టమైన నటనే. సూర్య లాయర్ పాత్ర అసిస్టెంట్ గా జీషా విజయన్ నటించింది. ఇంకా 205 మంది సహాయ నటీనటులున్నారు.

        సాంకేతికంగా 1990 లనాటి వాతావరణ సృష్టి ప్రదర్శిస్తున్నట్టుగాక, సన్నివేశాల్లో సంలీనమైపోయి వుంటుంది. కళాదర్శకత్వం కే కదీర్. టార్చర్, యాక్షన్ దృశ్యాల కొరియోగ్రాఫర్ అన్బీరవ్. ఛాయాగ్రహణం ఎస్ఆర్ కదీర్, సంగీతం సీన్ రోల్డన్ (కర్ణాటక సంగీత కారుడు రాఘవేంద్ర రాజా రావు), కూర్పు ఫీలోమిన్ రాజ్...వీళ్ళందరూ గిరిజన తత్వాన్ని యావత్తూ రంగరించేశారు. సూర్య స్టార్ హవా కోసం ఎక్కడా ప్రయత్నించ లేదు. కాకపోతే నిడివి రెండు గంటల 44 నిమిషాలు చాలా ఎక్కువ.

చివరికేమిటి


     మధ్య మధ్యలో బాధితుల ఫ్లాష్ బ్యాక్స్ తో, సాక్షుల మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ నడిపారు. త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో కాల నియమాలు పాటిస్తూ వేగవంతమైన కథనం చేశారు. కాకపోతే మొత్తం కలిపి నిడివి ఎక్కువై పోయింది. మొదటి పాతిక నిమిషాలు సూర్య లేకున్నా, మణికందన్ పాత్రతో కాలమే తెలియనంత వేగంగా అడవిలో గిరిజన జీవన నేపథ్యాన్ని ఏర్పాటు చేసేసి, అతను అరెస్టయి, భార్య న్యాయ సహాయం కోసం సూర్య దగ్గరి కొచ్చే మొదటి మలుపు వరకూ లీనియర్ కథనమే నడుస్తుంది.

       ఏం జరిగిందో చెప్పు, ఎక్కువ చెప్పకు అని సూర్య ఆమెతో అనడంతో, ఆమె ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్పుకొస్తుంది. ఎక్కువ చెప్పకు అని డైలాగు రాసి, ఎక్కువ కంటే ఎక్కువన్నర ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు కథకుడు. ఎక్కువ చెప్పకు అని సూర్య కథకుడికి చెప్పి వుండాల్సింది. ఈ ఎక్కువ చెప్పడం వల్లే రెండు గంటల 44 నిమిషాలు పట్టింది. ఇది రియలిస్టిక్ సినిమా ధర్మం కాదు.

        ఈ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ టార్చర్ చూపిన విధం రెగ్యులర్ మాస్ సినిమాల్లోలాగా లేదు. రెగ్యులర్ మాస్ సినిమాల్లో టార్చర్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక్కడ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎవరైనా పోలీసులు ఈ టార్చర్ ఐడియాలు ఇచ్చారా అన్నట్టు షాకింగ్ గా వుంటాయి. దీని తర్వాత సూర్య హైకోర్టులో కేసు వేయడంతో మొదలవుతుంది కోర్టు రూమ్ డ్రామా. దీని ఆధారంగానే మిగతా సెకండాఫ్ కథ.

        కోర్టు రూమ్ డ్రామా టెంప్లెట్ తెలిసిందే. ఒక కోర్టు సీను, తర్వాత బయట ఒక రిలీఫ్ సీను, మళ్ళీ కోర్టు సీను, బయట ప్రత్యర్ధులతో ఒక యాక్షన్ సీను, మళ్ళీ కోర్టు సీను...ఇలా లోపలా బయటా సీన్లు నడుస్తూంటాయి. చూసి చూసి వున్న ఈ టెంప్లెట్ ని దర్శస్కుడు బ్రేక్ చేసి వుండాల్సింది.

        ఒక రిలీఫ్ సీన్లో చిన్నతల్లి భర్తతో తల్చుకునే రోమాంటిక్ సీను వేసి పాట కూడా పెట్టారు. ఈ కోర్టు రూమ్ డ్రామా మొదటి దశలో రాజన్న అదృశ్యం గురించే వాదోప వాదాలుంటాయి. సూర్య ఇన్వెస్టిగేషన్లో రాజన్న గురించి అసలు నిజం తెలియడం రెండో దశ. ఈ దశ కోర్టు రూమ్ డ్రామాలో మెడికల్ సాక్ష్యాల పరిశీలన వుంటుంది. తర్వాత పోలీసుల వాదనతో మూడో దశ వుంటుంది. ఈ దశలో సాక్షులుగా పోలీసులతో నడుస్తుంది. ఈ మొత్తం వాదోపవాదాల్లో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రాజన్న అరెస్టు దగ్గర్నుంచీ చివరి వరకూ ఏమేం జరిగాయో దృశ్యాలు వస్తూంటాయి.

        మొత్తంగా చూస్తే ఇదొక  మిస్టరీ  కథ. మిస్టరీని తేల్చే లాజిక్స్, ఇల్లాజిక్స్ ల సంఘర్షణ. ఏకాగ్రతతో ఫాలో అయి చూస్తే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అంతర్లీనంగా న్యాయంకోసం ఆక్రందన ఈ ఇన్వెస్టిగేషన్ కథనానికి జీవం పోస్తుంది. అయితే చివర కోర్టు తీర్పూ, అందులో చేసిన వ్యాఖ్యలూ బలహీనంగా లేకుండా చూసుకోవాల్సింది. దర్శకుడు జ్ఞానవేల్ కి రచించి చిత్రీకరించడంలో రియలిస్టిక్ జానర్ మీద మంచి పట్టు వుందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. కొత్త దర్శకులు చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో ఇలా తీస్తారో లేదో అనేది దేవుడెరుగు.

       

—సికిందర్   

 

30, అక్టోబర్ 2021, శనివారం

1073 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
తారాగణం : నాగశౌర్య
, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
, ఛాయాగ్రహణం : పి. వంశీ, విష్ణు శర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 29
, 2021

***

        కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో నాగశౌర్య ప్రేమ కథతో దీపావళి ప్రేక్షకుల హృదయాల్లో కాకర పువ్వొత్తులు వెలిగించడానికి వచ్చాడు. పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ గ్లామర్ తోడయ్యింది. దీనికి పేరున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తోడ్పాటునందించింది. ఇన్ని హంగులతో ఏమిటి కొత్త దర్శకురాలు అందిస్తున్న ప్రేమ కథ? ఇది చూద్దాం...

కథ

    ఫారిన్ నుంచి ఆకాష్ (నాగశౌర్య) హైదారాబాద్ వస్తాడు. అతను ఆర్కిటెక్ట్. హైదారాబాద్ లో భూమి (రీతూ వర్మ) ఒక స్టార్ట్ అప్ కంపెనీ నడుపుతూ వుంటుంది. ఆమె చాలా కఠినంగా వుంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. ఆమె కంపెనీకి ఆకాష్ డిజైన్ చేసి ఇస్తాడు. ఈ క్రమంలో ఆమెని ఆకర్షించాలని ప్రయత్నిస్తాడు. ప్రేమించాలనీ చూస్తాడు.  ఆమె ఇవేవీ ఒప్పుకోదు. ఆమె తల్లి (నదియా)మాత్రం సంబంధాలు చూస్తూంటుంది. భూమికి పెళ్ళి ఇష్టముండదు. కారణం చెప్పదు. ఇంతలో భూమి, ఆకాష్ లు విడిపోయే సంఘటన జరుగుతుంది. ఏమిటా సంఘటన? ఎందుకు విడిపోయారు? ఎలా కలుసుకున్నారు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

    ప్రేమికులు విడిపోయి కలుసుకునే రోటీన్ తెలుగు ప్రేమ సినిమా కథ. ఒక మాటతో తేలిపోయే సమస్యకి సాగదీస్తూ పోయే కథ. అసలు చెప్పాలనుకున్న పాయింటేమిటంటే, తల్లిదండ్రులు కొడుకులకి పెళ్ళి చేసుకోవడానికి చాలినంత సమయమిస్తారు, అదే కూతుళ్ళ విషయంలో తొందర పెడతారెందుకు, మానసికంగా సిద్ధంగా వున్నారో లేదో తెలుసుకోరెందుకు - ఇదీ చెప్పాలనుకున్న పాయింటు, కథ.

        హీరోయిన్ తండ్రి (మురళీ శర్మ) ఈ పాయింటు రైజ్ చేయడానికి సెకండాఫ్ లో సగం వరకూ సమయం పట్టింది. అంటే సకాలంలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు కాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఇలా ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ లో సగం వరకూ ఈ పాయింటు వచ్చే దాకా ఏమీ జరగదు, అంటే కథే మొదలు కాదు. ఈ పాయింటుతో కథ మొదలయ్యాక కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఫ్లాష్ బ్యాక్, కామెడీ ట్రాక్, పాటలూ వంటి వాటిని భర్తీ చేశారు. కథ కాని, కథే లేని కథతో సినిమా తీసిన  దర్శకురాలి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కథా మూలాల గురించి నెట్లో రెండు టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున మన్మథుడు’, జగపతి బాబు ప్రవరాఖ్యుడు రెండూ కలిపితే వరుడు కావలెను కాలం చెల్లిన కథ అని.

నటనలు – సాంకేతికాలు
      పాత్ర నటించడం కంటే (నటించడానికి పాత్రలో ఏముందని) ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నట్టు స్టయిలిష్ కాస్ట్యూమ్స్ తో నాగశౌర్య చేసిన ప్రదర్శన దీపావళికి హోమ్లీగా, కనువిందుగా వుంది.  రీతూ వర్మ పాత్రకే కథ వుంది, దాంతో పాత్రకి కొంత బలమూ వుంది. మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో పూజా హెగ్డే పాత్రకి లాగా. ఈ నేపథ్య బలంతో స్ట్రిక్టు ఆఫీసు బాస్ గా చక్కగా నటించింది. తల్లిగా నటించిన నదియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండాఫ్ కామెడీ ట్రాకు నడిపించిన సప్తగిరి కథలేని సినిమాకి కాస్త దిక్కు. కానీ వెన్నెల కిషోర్ కామెడీ మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో లాగే మరోసారి విఫలమైంది.

        ఈ సినిమాలో రెండు పాటలు క్యాచీగా వుంటూ హిట్టయ్యాయి. మిగిలిన పాటలు- దిగు దిగు నాథ తో పాటు ఏవరేజి. ఇక విజువల్స్, నిర్మాణ విలువలూ ఫ్రెష్ గా రోమాంటిక్ ఫీల్ ని సరఫరా చేసేలా వున్నాయి-  ఈ ఫీల్ కథా కథనాలతో లేకపోయినా. 

చివరికేమిటి

     పాతబడిన రొటీన్ కథ, అందులోనూ సెకండాఫ్ సగం వరకూ కథేమిటో  తెలియని కథ కాని కథ. ఫస్టాఫ్ ముప్పావుగంటా హీరోహీరోయిన్ల కలుసుకోవడాలు, ముచ్చట్లాడు కోవడాలూ తప్ప ఏమీ జరగని విసుగు. ఆ తర్వాత హీరోహీరోయిన్లు విడిపోవడమనే ఒక మలుపుతో రిలీఫ్ పొందినా, సెకండాఫ్ లో షరా మామూలే. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఒక పెద్ద విఫలమైన సృజనాత్మకత. పైన చెప్పుకున్న అసలు పాయింటు వచ్చి మళ్ళీ మనకి హుషారు వచ్చినా, ఆ పాయింటు కూడా ఎటూ కదలక మొరాయించడం. సప్తగిరి వచ్చి కామెడీ ట్రాకుతో లేపడం. ఇంకెలాగో కథని ముగించడం. హుషారు తెప్పించేలా వుండాల్సిన ప్రేమ సినిమాలు ఇలా ఓల్డేజీ హోమ్ లో వున్నట్టు ఎందుకుంటున్నాయో ప్రశ్నించుకుంటే బావుంటుంది. దీనికి సినిమా సమీక్షకుడు గణేశ్ రావూరి మాటలు రాశాడు. కానీ ఫ్రెష్ గా వున్న మాటలు విషయం లేని  ఇంత పురాతన కథని ఏం ఆదుకుంటాయి.

—సికిందర్


29, అక్టోబర్ 2021, శుక్రవారం

1072 : రివ్యూ


దర్శకత్వం : అనిల్ పాదూరి
తారాగణం: ఆకాష్ పూరీ
, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్  దేశ్ పాండే, ఉత్తేజ్, సునైనా
రచన : పూరీ జగన్నాథ్
, సంగీతం : సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : నరేష్
బ్యానర్స్ : జగన్నాథ్ టూరింగ్ టాకీస్
, పూరీ కనెక్ట్స్
నిర్మాతలు : పూరీ జగన్నాథ్
, ఛార్మీ
విడుదల : అక్టోబర్ 29
, 2021
***

        పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీని మళ్ళీ పూరీ లాంచ్ చేశారు. మూడేళ్ళ క్రితం మహెబూబా తో లాంచ్ చేస్తే వచ్చిన ఫలితం సరిపోక పోగా, ఇప్పుడు రోమాంటిక్ తో తిరిగి ఇంకో లవర్ బాయ్ గా కొడుకుని చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. ఆకాష్ పూరీలో నటుడున్నాడు. కానీ పూరీ మార్కు హీరో కాదు. తనేమిటో అతను సపరేట్ గా చూపించుకుంటే కనీసం మూడో లాంచింగ్ అయినా ఆకాశయానం చేస్తుంది. మరి ఈ రెండో లాంచింగ్ ఆకాశ మార్గం పట్టలేదా? ఎలా? చూద్దాం...

కథ

   గోవాలో వాస్కోడిగామా అలియాస్ వాస్కో (ఆకాష్ పూరీ) చిన్నప్పుడు పోలీస్ ఇన్స్ పెక్టరైన తండ్రి తో బాటు తల్లి గ్యాంగ్ వార్ లో చనిపోతే, నానమ్మ మేరీ (రమాప్రభ) పెంపకంలో పెరిగి రౌడీ అవుతాడు. ఇతడ్ని రోడ్రిగ్స్ అనే డ్రగ్ మాఫియా గ్యాంగ్ లో చేర్చుకుని ప్రత్యర్ధి శాంసన్ మీద దాడులకి ఉపయోగించుకుంటూ వుంటాడు. మరో వైపు వాస్కో ఇన్స్ పెక్టర్ జాన్ (ఉత్తేజ్) చెల్లెలు మోనికా (కేతికా శర్మా) ని పిచ్చిగా ప్రేమిస్తూ ఆమె వెంట పడతాడు.

        ఇలా వుండగా, రోడ్రిగ్స్ ని చంపేసి తనే మాఫియా లీడరవుతాడు వాస్కో. శాంసన్ డ్రగ్స్ కొట్టేసి రెచ్చగొడతాడు. ఒక ఇన్స్ పెక్టర్ని కాల్చి చంపేస్తాడు. దీంతో వాస్కోని పట్టుకోవడానికి ఏసీపీ రమ్యా గోవాల్కర్ (రమ్యకృష్ణ) వేట మొదలుపెడుతుంది. ఈమెనుంచి తప్పించుకుంటూ, మోనికా ప్రేమ కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు పగబట్టిన శాంసన్ ని ఎదుర్కొంటూ  పోరాటం మొదలెట్టిన వాస్కో, చివరి కేమయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    కొడుకు ఆకాష్ ని ఇతర మాస్ యాక్షన్ హీరోలకి దీటుగా నిలబెట్టాలన్న వ్యూహంతో, బిగ్ హీరోలు చేయాల్సిన కథని ఆకాష్ లేత భుజాల మీద ప్రయోగాత్మకంగా మోపి చూశారు. ఇందులో నూటికి నూరు శాతం చతికిలబడ్డారు. ఈ ప్రయత్నంలో ఏదైనా ఫ్రెష్ యాక్షన్ కథైనా చూసుకోకుండా, ఇతర హీరోలతో తను ఎన్నోసార్లు వాడేసిన అదే ఔట్ డేటెడ్ మాఫియాల కథని రీసైక్లింగ్ చేసి, ఫ్రెష్ ఆకాష్ లేత రెక్కల మీదేసి ఆకాశంలోకి ఎగరేయాలని చూశారు. దీంతో రోమాంటిక్ టైటిల్ తాలూకు రోమాన్స్ కూడా జాడ లేకుండా పోయింది. అవసరానికి మించిన సాంగ్స్ లో మాత్రమే సెక్సీగా రోమాన్స్ మిగిలింది.

        ఈ గందరగోళంలో ప్రేమ గొప్పదా, మోహం గొప్పదా కూడా చర్చించాలనుకున్న పాయింటు కూడా చితికిపోయింది. మోహమే గొప్పదని చెప్పడం పూరీ ఉద్దేశం. కానీ మోహమే గొప్పదని హీరో ప్రూవ్ చేయాలనుకుంటే, ప్రేమకి ప్రత్యర్ధిగా వున్న ఏసీపీ రమ్యదే గెలుపుగా చూపించడ మెందుకు? ప్రేమ బలానికి ప్రత్యర్ధులు తలొంచుతారేమో గానీ, ఉత్త మోహమే వుంటే అంతు చూస్తారనా? పాయింటు తిరగ బడినట్టుంది. కొన్ని శాశ్వత విలువలుంటాయి. అవి ఏ కాలంలోనూ మారవు. వాటిని విరిచి ఇంకేదో చెప్పాలని చూస్తే కుదరదేమో? ప్రేమే బలమైనదన్న శాశ్వత విలువ గురించే చెప్పాలేమో ఒకవేళ? మోహం గురించే చెప్పాలనుకున్నప్పుడు, టైటిల్ రోమాంటిక్ అని గాకుండా లస్ట్ అని వుంటే సరిపోవచ్చు. ఆకాష్ మొహంలో నటించగల నేర్పు వుంది, కానీ ఇలాటి పాత్రల్లో కాదు.

నటనలు - సాంకేతికాలు

     ఆకాష్ గురించి చెప్పాలంటే అతడి వాయిస్ ఎసెట్. వయసుకు మించి వాయిస్ లో గాంభీర్యం వుందన్పించేలా. అయితే వాయిస్ ఇంత బలంగా వుందని భారీ మాఫియా పాత్ర మీద వేస్తే లేత వయసు విలవిల్లాడి పోయింది. ఈ మాఫియా హీరోయిజం అతి అయిపోయింది. పదుల సంఖ్యలో గ్యాంగ్స్ ని చితక్కొట్టడం ఓవరాక్షనై పోయింది. ఇలా అతడ్ని మాఫియా మాస్ యాక్షన్ హీరోగా ఎస్టాభ్లిష్ చేస్తూ, పంచ్ డైలాగులతో, మందు పాటతో, హీరోయిన్ తో పది నిమిషాలకో అడల్ట్ సాంగ్స్ తో, పూర్తి ఆల్ రౌండర్ గా చూపించాలన్న ప్రయత్నం తొందరపాటు తనమే అయింది.

        ఇదంతా చూపించే ప్రయత్నంలో రోమాంటిక్ హీరోగా కాస్త ఫీల్ తో చూపించడం మర్చేపోయారు. అలాగే కామెడీ కూడా చేయగలడని నిరూపించేందుకు కామెడీ సీన్లు ఎందుకనో వేయలేదు. రోమాంటిక్ హీరోగా మొదలైన వాడు లస్ట్ పెంచుకుని బీస్ట్ గా మారినా, చెప్పాలకున్న మోహం పాయింటుకి తగ్గట్టు వుండేదేమో పాత్ర. మాఫియాల్ని ఎత్తేసి, లస్ట్ తో బీస్ట్ గా మారిన ఆకాష్, రమ్యకృష్ణకి సవాలుగా మారినట్టు సింపుల్ కథగా చూపించి వుంటే,రోమాంటిక్ బతికి బయటపడే అవకాశాలు ఆకాశమంత వుండేవేమో.

        హీరోయిన్ కేతికా చాలా చాలా మైనస్ గ్లామపరంగానూ. కేవలం ఎక్స్ పోజింగ్ వరకే ఆమె రేంజి. ఇంతే ఆమె గురించి చెప్పుకోగల్గేది.

        టెక్నికల్ గా చూస్తే, దర్శకత్వం పూరీ ఘోస్ట్ డైరెక్షన్ చేసినట్టుగా వుంది. పేరుకి కొత్త దర్శకుడి సినిమా గానీ, చూస్తే పూరీ తీసిన సినిమాలాగే వుంది యాక్షన్ సీన్స్ సహా. ఇందులో ప్రేమో మోహమో ఏదీ సరిగా లేనప్పుడు అరడజను పాటలు పెట్టేశారు. అయితే డైలాగ్ వెర్షన్ చాలా లౌడ్ గా వుంది. ప్రేమ కథ- లస్ట్ కథ ముగింపు కూడా కాస్త చల్లబడకుండా, అరుపులతో బీభత్సంగా వుంటే - లస్టో బీస్టో అనికూడా అన్పించకుండా ఈ సెకండ్ లాంచింగ్ కూడా వేస్టయి పోయింది.

చివరికేమిటి

    రమ్య కృష్ణ పాత్ర వాయిసోవర్ తో ప్రారంభమవుతుంది. ఆమె ఆకాష్ వాస్కోడిగామా జీవితం గురించి చెప్తూంటే ఫ్లాష్ బ్యాక్ లో కథ వస్తూంటుంది. పూరీ మార్కు అదే టెంప్లెట్ కథ. లవ్ ట్రాక్ కాసేపు, మాఫియా ట్రాక్ కాసేపు మారుతూ వస్తూంటాయి. ఇవేవీ ఆసక్తికరంగా వుండవు. పూరీ సినిమా లంటే అవే మాఫియాలు, అవే లవ్ ట్రాకులు. సుమారు గంటకి ఆకాష్ ఇన్స్ పెక్టర్ ని చంపేశాక, ఫ్లాష్ బ్యాక్ పూర్తయి, రమ్యకృష్ణ ఇన్స్ పెక్టర్ని చంపిన  ఆకాష్ ని పట్టుకునే వేట ప్రారంభిస్తుంది.

        సెకండాఫ్ లో ఈ వేటతో బాటు, బతికున్న మాఫియాకి ఆకాష్ మీద వున్న పగతో కూడిన యాక్షన్ మొదలైపోయి- రోమాంటిక్ -లస్ట్ - బీస్ట్- ఫీస్ట్ అన్నీ సఫా అయిపోతాయి. ప్రేమ జంట మీద ఎక్కడా సానుభూతి కురిపించే సీన్లు ఫస్టాఫ్ లో కూడా వుండవు. ఆ తాలూకు భావోద్వేగాలూ వుండవు. ఎంత మోహమైనా ఆ మోహం తాలూకు కదిలించే సంభాషణాలూ వుండవు. నిడివి రెండు గంటలుండడ మొక్కటే ఊరట!

—సికిందర్
 

26, అక్టోబర్ 2021, మంగళవారం

      ప్రపంచంలో మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాన్ని సినిమా రచయితలు రాయలేదు. దర్శకులు రాయలేదు. ఎడిటర్లూ సినిమాటోగ్రాఫర్లూ రాయలేదు. నిర్మాతలు కూడా రాయలేదు. వీళ్ళెవరూ తర్వాతెప్పుడూ రాయలేదు. మొదటి స్క్రీన్ ప్లే పుస్తకాలని సినిమాల్ని అధ్యయనం చేసే పండితులు రాశారు. సినిమా పుస్తకాలకి సంబంధించి దీనికి మార్కెట్ వుంటుందని కనిపెట్టి స్క్రీన్ ప్లే పుస్తకాలు రాయడం ప్రారంభించారు. అప్పుడు కనిపెట్టిందే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని. నాటక రచన పుస్తకాల్లోంచి, అరిస్టాటిల్ పోయెటిక్స్ నుంచీ విషయాన్ని తెలుసుకుని, సినిమా కథా రచనకి అంటే స్క్రీన్ ప్లేకి, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అనే దాన్ని అలా ఏర్పర్చారు. అలా వాడుకలోకి వచ్చిందే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అంటే స్క్రీన్ ప్లే ని నాటక రచయితల్లాగా రాయాలన్న భావాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారన్న మాట. ఇక్కడే సమస్య వచ్చి పడింది.  

        ర్వాత ఆధునిక స్క్రీన్ ప్లే పండితులు ఎవరొచ్చినా స్క్రీన్ ప్లేలని త్రీ యాక్ట్స్  స్ట్రక్చర్ అనే చట్రంలో పెట్టేసి, అందులోనే కథ చెప్పాలని చెబుతూ వస్తున్నారు. రచయిత రాసే స్క్రీన్ ప్లే రచన వరకూ ఇది ఓకే. స్క్రీన్ ప్లేలు రాసి నిర్మాతలకి పంపేది కొత్తా పాతా రచయితలే కాబట్టి, రచయితలుగా స్క్రీన్ ప్లేలని అలాగే రాయగలరు. నాటక రచయితల్లానూ రాయొచ్చు. కాబట్టి రచయితలకి అలాగే భోదిస్తూ వస్తున్నారు. తర్వాత ఆ స్క్రీన్ ప్లేలకి దర్శకులు నియమితులయ్యాక, వాళ్ళు చిత్రీకరించడానికి ఎలా వుండాలో అలా మార్చుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా సమస్య లేదు. సమస్య ఎక్కడొచ్చిందంటే, తెలుగులో దర్శకులవ్వా లనుకుంటున్న వాళ్ళూ, దర్శకులై పోయిన వాళ్ళూ ఎవరి స్క్రిప్టులు వాళ్ళే రాసుకుంటున్నప్పుడు - వచ్చిపడింది సమస్య!

        రాసేవాడు తీయలేడు, తీసేవాడు రాయలేడని ఒకప్పుడుండేది. ఈ తీసేవాడు రాయలేడనే దాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నారేమో. కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వాలు చూస్తూంటే ఇది స్పష్టమవుతోంది. చదవడం కోసం రాస్తున్నామనుకుని రాసేసి తీస్తున్నారు. కానీ సినిమా స్క్రిప్టు అచ్చేసి చదువుకోవడానికి కాదు, సినిమా తీసి చూసుకోవడానికి. అంటే సినిమా స్క్రిప్టు రైటింగ్ గురించి కాదు. రైటింగ్ గురించి అయితే కేవలం రచయిత చూసుకోగలడు. రాసి దాన్ని సినిమాగా తీసుకునే దర్శకుడికి సినిమా స్క్రిప్టు మేకింగ్ గురించి వుంటుంది. కథ మాటలు స్క్రీన్ ప్లే అని వేసుకోవచ్చుగాక, రచయితగా ఫీలవకుండా మేకర్ గా ఫీలై రాయాల్సి వుంటుంది. మేకర్ గా ఫీలైనప్పుడు సీన్లు తీసే విధంగా రాస్తారు. ప్రేక్షకులు చూసే విధంగా మేకింగ్ చేస్తారు.

కానీ ఎలా రాస్తున్నారో చూద్దాం- తండ్రీ కొడుకుల సంభాషణ :   
        కొడుకు : నాన్నా, మళ్ళీ నన్ను కొట్టి లంచ్ బాక్స్ లాక్కున్నారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాన్లేరా.
        కొడుకు : ఒకసారి మాట్లాడావ్ ఏం జరిగింది? ఏం జరగలేదు. నన్ను మళ్ళీ కొట్టి లంచ్       బాక్స్ లాక్కున్నారు పోరగాళ్ళు!
        తండ్రి : ప్రిన్సిపాల్ వాళ్ళని పనిష్ చేస్తానన్నాడుగా, చూద్దాంలే.
        కొడుకు :  మేం కొట్టలేదంటే ప్రిన్సిపాల్ నమ్మాడు నాన్నా!

        వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధమవుతూనే వుంది. అయితే అవసరానికి మించి మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకు అవసరానికి మించి మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగిందో ప్రేక్షకులకి తెలియాలని. ఇది అసహజంగా లేదూ? పాత్రలు ఒకరి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇంకొకరికి తెలిసి వున్నట్టయితే అంత పూస గుచ్చినట్టు, మరొకరికి తెలియాలనుకున్నట్టు  మాట్లాడుకోరు. ఇక్కడ స్కూల్లో దెబ్బలు తింటున్న కొడుకు బ్యాక్ గ్రౌండ్ గురించి తండ్రికి ఆల్రెడీ తెలుసు. అలాగే ప్రిన్సిపాల్ తో మాట్లాడానంటున్న తండ్రి బ్యాక్ గ్రౌండ్ గురించి కొడుక్కీ తెలుసు.  

ఈ నేపథ్యంలో ఎలా మాట్లాడు కుంటారు?
        కొడుకు : మళ్ళీ కొట్టేశారు నాన్నా!
        తండ్రి : ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలేరా!
        కొడుకు : మొన్న మాట్లాడేవుగా ఏమైంది? ఇదా!  

        ఇప్పుడు అసలేం జరిగిందో పాత్రలకి తెలుసు, మనకి తెలీదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో మనకి తెలీదు. మరి తెలిసేలా ఎలా చేయాలి? స్కూలు నుంచి వచ్చిన కొడుకు బట్టలు చిరిగి, ముక్కు రక్తం కారుతూ వుంటే, చేతిలో సొట్టలు పడ్డ ఖాళీ లంచ్ బాక్స్ కూడా వుంటే, చూడగానే అర్ధమైపోతుంది ఏం జరిగిందో, దేని గురించి మాట్లాడుకుంటున్నారో.

        ఇది స్టోరీ రేటింగ్ కాదు, సినిమాకి కావాల్సిన స్టోరీ మేకింగ్. అంటే విజువల్ రైటింగ్. కారుతున్న రక్తం, చిరిగిన బట్టలు, సొట్టలు పడ్డ లంచ్ బాక్స్ చూపిస్తూ, పరస్పరం వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ తెలిసిన నేపథ్యంలోంచి మాట్లాడిస్తూ విజువల్ గా రాస్తే, అది స్టోరీ మేకింగ్ అవుతుంది. సినిమా స్క్రిప్టుకి కావాల్సింది స్టోరీ మేకింగే. స్టోరీ మేకింగ్ విజువల్ రైటింగ్ కళ మీద ఆధారపడి వుంటుంది.

స్టోరీ మేకింగ్ చేస్తే త్రీయాక్ట్ స్ట్రక్చర్ ఎలా వుంటుందో చూద్దాం...
        (బిగినింగ్) : ఆనందంగా గడుపుతున్న కుటుంబాలు, బిజీగా వున్న వ్యాపార కేంద్రాలు, ఆడుకుంటున్న పిల్లలూ, పని చేసుకుంటున్న ఉద్యోగులూ.  
        (ప్లాట్ పాయింట్ వన్, మిడిల్) :  వరద ముంచుకొచ్చి అల్లకల్లోలం, కుటుంబాలు కొట్టుపోవడం, వ్యాపారాలు మునిగిపోవడం...
        (ప్లాట్ పాయింట్ టూ, ఎండ్) : హృదయ విదారక దృశ్యాలు, నిరాశ్రయులైన కుటుంబాలు, ఏడుస్తున్న పిల్లలూ, ఆకలీ...
        ఉపసంహారం : ప్రభుత్వ సహాయం, బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం, నస్జ్టపరిహారాలు ప్రకటించడం...    

        స్టోరీ మేకింగ్ అంటే సంఘటనలతో కథ చెప్పడం. సంఘటనలకి తగ్గ విజువల్స్ తో రైటింగ్ చేయడం. పాత్రల మాటలతో కథ చెప్పడం కాదు. ఇలా రచయిత చెప్తాడు, మేకర్ కాదు. మేకర్ మంచి మేకర్ అవాలంటే తాను రచయితనని మర్చి పోవాలి. యాడ్ ఫిలిమ్ మేకింగ్ లో రచయితలుగా ఫీలవరు. మేకర్ గా ఫీలవుతూ విజువల్స్ తో మేకింగ్ చేస్తారు. విజువల్ మీడియా ఈజ్ నాట్ ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియాని తక్కువ చేయడం కాదు. ఈ వ్యాసం రాయడం ప్రింట్ మీడియానే. ఇది తక్కువ రకం పని అనుకుంటే రాయకుండా పడుకోవడమే.

        నాటకాలు రాయడం, నవలలు రాయడం, కథలు రాయడం పూర్తిగా వేరు. కానీ సినిమా కథ రాయడమంటే ఇదేననుకుని స్క్రిప్టులు రాసేస్తున్నారు. సాహిత్యంలా స్క్రిప్టులు రాసేస్తున్నారు. కొందరి స్క్రిప్టులు వ్యాసాల్లా వుంటున్నాయి. ఇందుకే స్క్రిప్టుల క్వాలిటీ అడుగంటి, బడ్జెట్ వృధా అవుతోంది. డైలాగులతో సాహిత్యంలాగా సీన్లు రాస్తే, ఆ నిడివికి బడ్జెట్ పెరుగుతుంది. అదే విజువల్స్ తో స్టోరీమేకింగ్ చేస్తే సీను నిడివి తగ్గి బడ్జెట్ తగ్గుతుంది. పది డైలాగులు చేసే పనిని ఒక్క విజువల్ షాట్ చేస్తుంది.

        అందుకని మేకర్ రచయితగా అస్సలు ఫీలై రాయకూడదు. మేకర్ మెకానిక్ లాంటి వాడు. రచయితగా ఫీలైతే రాయడంలో పడిపోయి ఇతర క్రాఫ్ట్ ని మర్చిపోతాడు. మేకర్ గా ఫీలైతే రాస్తున్న దాంట్లో ఇతర క్రాఫ్ట్స్ ని కూడా వూహిస్తూ, మెకానిక్ లా వాటిని కథలో బిగించుకు పోతూ, ఎక్కడికక్కడ బడ్జెట్ ని కుదిస్తూ స్టోరీ మేకింగ్ చేస్తాడు. కొండపొలం లో హీరో ఏమవుతాడో ముందే చెప్పేశాక, అలా ఫారెస్ట్ ఆఫీసర్ అవడమే చివర్లో చూపిస్తే, ఈ చివరి సీను బడ్జెట్ వృధాతప్ప కథగా కల్గించిన రసోత్పత్తి ఏమీ లేదు.

        విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయని, కెమెరా వర్క్ అద్భుతమనీ అంటూంటారు. ఇది సినిమా భాష కాదు. అది విజువల్ రైటింగ్ తో కూడిన కెమెరా వర్క్ కాదు, స్టోరీ మేకింగ్ కాదు. కెమెరా షాట్స్ తో కథ చెప్తేనే మంచి కెమెరా వర్క్ అవుతుంది. కేవలం అద్భుత దృశ్యాలు కెమెరా వర్క్-  సినిమాటోగ్రఫీ కాదు. అదొట్టి ఫోటోగ్రఫీ. స్క్రీన్ ప్లే పండితులు రచయితలకి/మేకర్లకి కెమెరాతో కథెలా చెప్పాలో నేర్పకుండా, పెయింటింగ్ ఎలా వేయాలో కష్టపడి నేర్పుతున్నారు. అదే నమ్మి నట్టేట మునుగుతున్నారు మేకర్లు. మేకర్లోంచి మేకల్లాంటి రచయితల్ని బలి ఇస్తే తప్ప మెరికల్లాంటి మూవీ మేకర్స్ అవలేరు.

—సికిందర్